తౌహీదును రక్షించుటకు, షిర్క్‌ వరకు చేర్చించే ప్రతి దారిని మూసి వేయుటకు ప్రవక్త చేసిన కృషి

బిస్మిల్లాహ్

22 వ అధ్యాయం
తౌహీదును రక్షించుటకు, షిర్క్‌ వరకు చేర్చించే ప్రతి దారిని మూసి వేయుటకు ప్రవక్త చేసిన కృషి.
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


అల్లాహ్ ఆదేశం చూడండి:

لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِالْمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيمٌ

“నిశ్చయంగా మీ వద్దకు ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన స్వయంగా మీలోనివాడే. మీరు నష్టానికి గురికావటం అనేది ఆయనకు బాధ కలిగిస్తుంది.” (తౌబా 9:128).

అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారు:

“మీరు మీ ఇళ్ళను సమాధులుగా మార్చకండి. నా సమాధిని పండుగ కేంద్రం (ఉర్సు, జాతరగా) చేయకండి. నా కోసం దరూద్‌ చదవండి. మీరు ఎక్కడా ఉన్నా మీ దరూద్‌ నా వరకు చేరుతుంది”. (అబూ దావూద్).

అలీ బిన్‌ హుసైన్‌ కథనం: ఒక వ్యక్తి గోడలో ఉన్న ఒక రంద్రం నుండి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి వద్దకు వచ్చి అక్కడ దుఆ చేస్తుండగా, చూసి అతనిని  నివారించారు. ఇంకా ఇలా చెప్పారు. నేను నీకు ఒక హదీసు వినిపిస్తాను, అది నేను నా తండ్రి (హుసైన్‌ రది అల్లాహు అన్హు)తో, అతను తన తండ్రి (అలీ రది అల్లాహు అన్హు)తో, అతను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో విన్నాడు. ప్రవక్త చెప్పారు:

“నా సమాధిని పండుగ కేంద్రంగా (ఉర్సు, జాతర) చేయకండి. మీరు మీ ఇళ్ళను సమాధులుగా మార్చకండి (నఫిల్‌ నమాజులు చదవకుండా). మీరు ఎక్కడ ఉండి నాపై సలాం పంపినా అది నా వరకు చేరుతుంది”. (రవాహు ఫిల్‌ ముఖ్ తార్ ).

ముఖ్యాంశాలు:

1. సూరయే  తౌబా ఆయతు యొక్క భావం.

2. షిర్క్‌ దరిదాపులకు కూడా చేరకుండా దూరముండాలని ప్రవక్త యొక్క తాకీదు.

3. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనపై చాలా కనికరం, కారుణ్యం గలవారు. మన రుజుమార్గాన్ని అధికంగా కోరుకునేవారు.

4. ఆయన సమాధి దర్శనకు వెళ్ళుట ప్రత్యేకంగా నివారించారు. ఆయన సమాధి దర్శనం (అక్కడ ఉన్నవారికి ధర్మం పరిదిలో ఉండి చేయుట) చాలా పుణ్య కార్యం.

5. (అక్కడ నివసించే వారైనప్పటికీ) మాటికి మాటికి దర్శించుటను నివారించారు.

6. నఫిల్‌ నమాజులు ఇంట్లో చదవాలని ప్రోత్సహించారు.

7. స్మశానంలో నమాజ్‌ చదవకూడదన్పది సహాబాల (సహచరుల) వద్ద స్పష్టమయిన విషయం.

8. దరూద్, సలాం దూరంగా ఉండి పంపినా, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వరకు చేరుతుంది. అలాంటపుడు ప్రత్యేకంగా ఈ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళే అవసరం లేదు.

9. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి జీవితం (బర్‌ జఖ్‌)లో ఉన్నారు. ఆయన వరకు తన అనుచర సంఘం కర్మల నుండి కేవలం దరూద్‌, సలాం మాత్రమే చేర్చించ బడుతాయి.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) 

ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన వాక్యాలపై శ్రద్ధ చూపినవారు ఇందులో తౌహీద్‌ను బలపరిచే విషయాలపై ఆచరించాలని పోత్సహించబడింది. అల్లాహ్  వైపునకే మరలాలని, భయమూ మరియు ఆశతో అల్లాహ్ పై మాత్రమే నమ్మకం ఉంచాలని, ఆయన దయను కాంక్షించి, దాన్ని పొందే ప్రయత్నం చేయాలని, సృష్టి బానిసత్వ శృంఖలాలను తెంచేసి, ముక్తి పొందాలని, సృష్టిలో ఎవరి గురించి కూడా గులువ్వు (అతిశయోక్తి) చేయకూడదని, సర్వ బాహ్యాంతర కార్యాలు సంపూర్ణంగా నిర్వహించి, ప్రత్యేకంగా ఇబాదత్‌ కు ప్రాణమయినటువంటి చిత్తశద్ధి (ఇఖ్లాసు) ప్రతికార్యంలో ఉంచే ప్రయత్నం చేయాలని ప్రోత్సహించబడింది.

సృష్టరాసుల విషయంలో గులువ్వు (అతిశయోక్తి) అయ్యే ముష్రికులను పోలిన మాటలు, చేష్టలు చేయుట నివారించబడింది. ఇది వారిలో కలిసిపోవుటకు కూడా కారణం కావచ్చు. తౌహీద్‌ భద్రతకై షిర్క్‌ లోయలో పడవేసే మాటలు, చేష్టల నుండి కూడా నివారించబడింది. విశ్వాసులు ఏ ఉద్దేశంతో పుట్టించబడ్డారో దానిపై వారు స్థిరంగా ఉండుటకు ఇది వారిపై ఓ కరుణ, దయ. వారి సాఫల్యం కూడా అందులొనే ఉంది.


ఇది ఏకత్వపు బాటకు సత్యమైన మాట – ఇమామ్ అస్-సాదీ అనే పుస్తకం నుండి తీసుకోబడింది. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్). ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) సిగ్గు, బిడియం [ఆడియో & టెక్స్ట్]

హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) సిగ్గు, బిడియం
https://youtu.be/dZZa0Z0Oh8Y (3 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) వారి యొక్క అత్యుత్తమ గుణమైన సిగ్గు, బిడియం (హయా) గురించి వివరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) వద్ద దేవదూతలు కూడా సిగ్గుపడతారని తెలిపిన ఒక సంఘటనను పేర్కొన్నారు. అబూబక్ర్ (రజియల్లాహు అన్హు), ఉమర్ (రజియల్లాహు అన్హు) వచ్చినప్పుడు సాధారణ స్థితిలో ఉన్న ప్రవక్త, ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) రాకతో తమ వస్త్రాలను సరిచేసుకుని కూర్చోవడం ఆయన పట్ల గల గౌరవాన్ని, ఆయన సిగ్గు యొక్క స్థాయిని తెలియజేస్తుంది. అంతేకాకుండా, ఇస్లాం స్వీకరించిన నాటి నుండి తన కుడి చేతిని మర్మాంగాలకు తాకించలేదని ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) స్వయంగా చెప్పిన విషయం ఆయన పవిత్రతకు నిదర్శనం. ఆయన అధికంగా ఖుర్ఆన్ పారాయణం చేసేవారని, చివరికి హంతకుల చేతిలో హత్యకు గురయ్యే సమయంలో కూడా ఖుర్ఆన్ పారాయణంలోనే నిమగ్నమై ఉన్నారని వివరించబడింది.

సోదర సోదరీమణులారా! ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క ఉత్తమ గుణం, బిడియం, సిగ్గు, లజ్జ దీని గురించి మనం తెలుసుకుంటున్నాము. అందరికంటే ఎక్కువ హయా ఉస్మాన్ రజియల్లాహు అన్హు గలవారని స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాక్ష్యం పలికారు.

ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇంట్లో కూర్చుని ఉన్నారు. ఒక మెత్తకు ఇలా ఆనుకొని, తన ఈ మోకాళ్ళను ఇలా నిలబెట్టి ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ లుంగీ లేదా వస్త్రం అయితే ధరించి ఉన్నారో అది ఇంచుమించు మోకాళ్ళకు దగ్గరగా వచ్చి పిక్క కనబడుతూ ఉన్నది. ఈ స్థితిలో కూర్చుండి ఉన్నారు. కొంతసేపట్లో హజరత్ అబూబకర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు వచ్చారు. లోపలికి రావడానికి అనుమతి కోరారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే స్థితిలో కూర్చుండి ఉన్నారు, అబూబకర్ రావడానికి అనుమతి ఇచ్చారు. అబూబకర్ వచ్చి ఒక పక్కన కూర్చున్నారు.

మరికొంత సేపటికి హజరత్ ఉమర్ వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే స్థితిలో కూర్చుని ఉన్నారు, హజరత్ ఉమర్ అనుమతి కోరారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి ఇచ్చారు. హజరత్ ఉమర్ లోపలికి వచ్చి ఓ పక్కన కూర్చున్నారు, ప్రవక్త అలాగే ఉన్నారు. మరికొంత సమయం గడిచిన తర్వాత హజరత్ ఉస్మాన్ వచ్చారు. లోపలికి రావడానికి అనుమతి కోరారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ వస్త్రాన్ని మరింత కిందికి దించుతూ, ఒక సరియైన రీతిలో కూర్చుండి, ఉస్మాన్ కు రావడానికి అనుమతి ఇచ్చారు.వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు.

ఆ తర్వాత ఇంట్లో ఈ విషయాన్ని గమనించిన భార్య, అబూబకర్ వచ్చినప్పుడు మీరు అలాగే కూర్చుండి ఉన్నారు, ఉమర్ వచ్చినప్పుడు మీరు అలాగే కూర్చుండి ఉన్నారు, కానీ ఉస్మాన్ ఎప్పుడైతే వచ్చి అనుమతి కోరాడో మీరు మీ వస్త్రాన్ని సరిచేసుకుంటూ, మరి కిందికి దించుకుంటూ, మీ కూర్చుండే స్థితిని మార్చి, మరి మీరు అనుమతించారు, ఎందుకు ఇలా అని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “ఏ ఉస్మాన్ తోనైతే దేవదూతలు సిగ్గు పడుతున్నారో ఆ ఉస్మాన్ తో నేను సిగ్గుపడనా?

అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఉస్మాన్ రజియల్లాహు అన్హు సహాబాలలో అందరికంటే ఎక్కువగా సిగ్గు, బిడియం గలవారు. మరియు స్వయంగా ఆయన ఒక సందర్భంలో తెలిపారు, “ఎప్పటి నుండి అయితే నేను నా ఈ కుడి చేతితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతిలో చెయ్యి వేసి శపథం చేశానో, ఇస్లాం స్వీకరించానో, బయఅత్ చేశానో, అప్పటినుండి నేను ఈ కుడి చెయ్యిని నా మర్మాంగానికి తాకనివ్వలేదు”

హజరత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారిలో ఎన్నో రకాల ఉత్తమ గుణాలు ఉండినవి. ఆయన ఖుర్ఆన్ యొక్క పారాయణం చాలా అధికంగా చేసేవారు. చాలా అధికంగా చేసేవారు. మరియు చివరి సమయంలో, ఏ సమయంలోనైతే దుండగులు ఆయన్ని హతమార్చడానికి ప్రయత్నం చేశారో, ఆ సమయంలో కూడా ఆయన ఖుర్ఆన్ పారాయణం చేస్తూ ఉన్నారు, అదే స్థితిలో ఆ దుష్టులు, దుర్మార్గులు వచ్చి ఆయన్ని హతమార్చారు.


ఇతరములు:

మహా ప్రవక్త జీవిత చరిత్ర పాఠాలు [వీడియోలు]

బిస్మిల్లాహ్

పైన వీడియో ప్లే లిస్ట్ క్లిక్ చేస్తే మొత్తం వీడియోలు ప్లే అవుతాయి. విడి విడిగా టాపిక్ ప్రకారం కావాలనుకుంటే క్రింద ఇచ్చిన లింకుల మీద క్లిక్ చెయ్యండి.

మొత్తం వీడియోల వ్యవధి: దాదాపు 80 నిముషాలు 

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

పై వీడియోలు తో పాటు  క్రింది పుస్తకం చదవండి 

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం]
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్

ఫిత్నా (ఉపద్రవం,సంక్షోభం) నుండి రక్షణ కొరకు దుఆ [వీడియో]

బిస్మిల్లాహ్

వీడియో వ్యవధి: 4:30 నిముషాలు 

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

اللَّهُمَّ إنِّي أَسألُكَ فِعْلَ الْخَيْرَاتِ، وَتَرْكَ الْمُنْكَرَاتِ، وَحُبَّ الْمَسَاكِينِ، وَأَنْ تَغْفِرَ لِي، وَتَرْحَمَنِي، وَإِذَا أَرَدْتَ فِتْنَةَ قَوْمٍ فَتَوَفَّنِي غَيْرَ مَفْتُونٍ، وَأَسْأَلُكَ حُبَّكَ، وَحُبَّ مَنْ يُحِبُّكَ، وَحُبَّ عَمَلٍ يُقَرِّبُنِي إِلَى حُبِّكَ

అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక ఫి’అలల్ ఖైరాతి  , వ తర్కల్ మున్కరాతి , వ హుబ్బల్ మసాకీని, వ అన్ తగ్ ఫిరలీ, వ తర్ హమనీ, వ ఇజా అరత్త   ఫిత్నత ఖౌమిన్ ఫతవఫ్ఫనీ గైర మఫ్ తూన్, వ అస్అలుక హుబ్బక, వ హుబ్బ మన్ యుహిబ్బుక, వ హుబ్బ అమలిన్ యుకర్రిబునీ ఇలా హుబ్బిక్ 

ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీతో అర్థిస్తున్నాను –  అన్ని రకాల మంచి పనులు చెయ్యాలని, అన్ని రకాల చెడులను వదులుకోవాలని, నిరుపేదల పట్ల ప్రేమగా మసులుకోవాలని. మరియు నా పాపాలను మన్నించు మరియు నన్ను కరుణించు. ఏ సమాజంలో నైనా ఏదైనా ప్రజలకు నీవు వారిని ఫిత్నా (ఉపద్రవంలో సంక్షోభంలో) పడవేయాలని కోరినపుడు, నేను సంక్షోభం లో పడకముందే నాకు చావు ప్రసాదించు. నీతోనే అర్థిస్తున్నాను – నీ ప్రేమ నాకు లభించాలని, నిన్ను ప్రేమించేవారి ప్రేమకూడా నాకు ప్రాప్తించాలని, మరియు ఏ కార్యాలు ఏ మాటలైతే నీ ప్రేమకు మరింత దగ్గరగా,చేరువగా  చేస్తాయో, అలాంటి సత్కార్యాల, మంచి మాటల ప్రేమ కూడా నాకు కలుగజేయుము.

Ahmad 5/243, Al-Haakim 1/521 and At-Tirmidhi 5/369 (with similar wording); declared hasan by At-Tirmidhi who said, “I asked Muhammad bin Isma’il (Al-Bukhari) and he said, “This hadith is hasan sahih.” Additionally, at the end of the hadith, the Prophet  صَلَّى اللّٰهُ عَلَيْهِ وَسَلَّم said, “Verily it is true so learn it and teach it.”“

Source: From the Book “Supplications & Treatment with Ruqyah” ,
Dr. Sa’eed bin Ali Al-Qahtani, Dar-us-Salam Publication

స్వలింగ సంపర్కం (లవాతత్)! దాని పర్యవసానం! [వీడియో]

బిస్మిల్లాహ్

(HomoSexuality and its Evil effects)

[41 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


స్వలింగ సంపర్కము అనగా ఇద్దరు పురుషుల మధ్య లేదా ఇద్దరు స్త్రీల మధ్య ఉండే లైంగిక సంబంధము. ఒకే లింగ జాతికి చెందిన వ్యక్తుల మధ్య రతి సంబంధాన్ని స్వలింగ సంపర్కం (హోమో సెక్సువల్స్) అంటారు. అనగాఒక స్త్రీ మరొక స్త్రీతో అలాగే ఒక పురుషుడు మరొక పురుషునితో సంభోగించటం.

దైవ ప్రవక్త లూత్ అలైహిస్సలాం జాతివారు ప్రపంచంలోనే అందరికన్న ముందుగా స్వలింగ సంపర్కమనే అత్యంత నీచమైన చేష్టకు పాల్పడ్డారు. ఆ ముదనపు జాతి పేరు మీదగానే స్వలింగ సంపర్కాన్ని ‘లవాతత్‘ అని పేర్కొనటం జరుగుతుంది.

[క్రింది భాగం అహ్సనుల్ బయాన్ నుండి తీసుకోబడింది]

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించాడు:

وَلُوطًا إِذْ قَالَ لِقَوْمِهِۦٓ أَتَأْتُونَ ٱلْفَٰحِشَةَ مَا سَبَقَكُم بِهَا مِنْ أَحَدٍۢ مِّنَ ٱلْعَٰلَمِينَ إِنَّكُمْ لَتَأْتُونَ الرِّجَالَ شَهْوَةً مِّن دُونِ النِّسَاءِ ۚ بَلْ أَنتُمْ قَوْمٌ مُّسْرِفُونَ وَمَا كَانَ جَوَابَ قَوْمِهِ إِلَّا أَن قَالُوا أَخْرِجُوهُم مِّن قَرْيَتِكُمْ ۖ إِنَّهُمْ أُنَاسٌ يَتَطَهَّرُونَ

మేము లూతు (అలైహిస్సలామ్‌)ను పంపాము. అతను తన జాతివారిని ఉద్దేశించి, ”మీరు ఇంత సిగ్గుమాలిన చేష్టకు పాల్పడుతున్నారేమిటి? మీకు పూర్వం లోకంలో ఎవరూ ఇలాంటి పాడు పని చెయ్యలేదే!”అయ్యో! మీరు స్త్రీలను వదలి [96], పురుషులతో కామవాంఛ తీర్చుకుంటున్నారా?! [97] అసలు మీరు మరీ బరితెగించి వ్యవహరిస్తున్నారు” [98] అని అన్నారు. దానికి అతని జాతి వారు ఇచ్చిన జవాబు ఇదే: ”వీళ్లను మీ బస్తీ నుంచి వెళ్లగొట్టండి. మహా పవిత్రులట వీళ్ళు. [99](Quran – 7 : 80-82)

[96] అంటే మీరు స్త్రీలను వదిలి లైంగిక కోర్కేల్ని తీర్చుకోవటానికి ప్రకృతి ధర్మానికి విరుద్దంగా సిగ్గులేకుండా మగవాళ్ళు దగ్గరికి పోతారా?! మీరు ఒడిగడుతున్న ఈ చేష్ట అత్యంత హేయమైనది, విరుద్దమైనది. జంతువుల్లో సయితం లేని ఈ పాడు బుద్ది మీకెలా పుట్టిందీ?

[97] మగవారి లైంగిక వాంఛల పరిపూర్తికై, వారి తృప్తికై, సౌఖ్యానికై దేవుడు ఆడవారిని పట్టించాడు. కాని ఈ దుర్మార్గుల స్వభావమే చెడిపోయింది. మీరు స్త్రీలను వదిలి పురుషుల మల విసర్జనా మార్గాన్ని వాడుకోసాగారు.

[98] ప్రకృతి విరుద్ధమైన ఈ పని బరితెగించిన చేష్టగా, దైవాదేశాల అతిక్రమణగా పేర్కొనబడింది. అయితే నాగరికతా ధ్వజవాహకులమని చెప్పుకునే పాశ్చత్య దేశాల వారు నేడు ఈ సిగ్గుమాలిన పనిని చట్టబద్దంగా చేసుకుంటున్నారు. పైగా ఈ లతుకోరు పనిని ‘ప్రాధమిక హక్కు’ (fundamental right) గా ఖరారు చేసుకుంటున్నారు. అంటే పాశ్చాత్య దేశాల వారి దృష్టిలో ఇప్పుడది నేరమూ కాదు. చెడు పని కూడా కాదు. ఎందుకంటే వారి నాగరికత బాగా ‘ముదిరి’పోయింది.

[99] నీతిబాహ్యత, దుర్మార్గం, సామాజిక రుగ్మతలు వ్రేళ్లూనుకుపోయిన సమాజంలో సజ్జనుల హితబోధలు ఒక్కోసారి వింతగా తోస్తాయి. దైవప్రవక్త హజ్రత్ లూత్ అలైహిస్సలాం మరియు ఆయన వెంటనున్న కొద్దిమంది సౌశీల్యవంతులు ఆ దుర్మార్గుల కంటికి వింత మనుషుల్లా కనిపించారు. తమ సొసైటిలో ఈ పవిత్రులకు చోటు లేదు అని తెగేసి చెప్పే దుస్సాహసానికి పాల్పడ్డారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన వానికి సిగ్గూ ఉండదు, భయమూ ఉండదు అన్న దానికి ఇదొక నిదర్శనం.మంచి వైపుకు, సౌశీల్యం పారిశుద్ద్యాల వైపుకు ఆహ్వానించే వారు వారి దృష్టికి అధములుగా కనిపిస్తారు. మంచివారినే వారు చులకన చేస్తారు.

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించాడు:

وَلَمَّا جَاءَتْ رُسُلُنَا لُوطًا سِيءَ بِهِمْ وَضَاقَ بِهِمْ ذَرْعًا وَقَالَ هَٰذَا يَوْمٌ عَصِيبٌ وَجَاءَهُ قَوْمُهُ يُهْرَعُونَ إِلَيْهِ وَمِن قَبْلُ كَانُوا يَعْمَلُونَ السَّيِّئَاتِ ۚ قَالَ يَا قَوْمِ هَٰؤُلَاءِ بَنَاتِي هُنَّ أَطْهَرُ لَكُمْ ۖ فَاتَّقُوا اللَّهَ وَلَا تُخْزُونِ فِي ضَيْفِي ۖ أَلَيْسَ مِنكُمْ رَجُلٌ رَّشِيدٌ قَالُوا لَقَدْ عَلِمْتَ مَا لَنَا فِي بَنَاتِكَ مِنْ حَقٍّ وَإِنَّكَ لَتَعْلَمُ مَا نُرِيدُ قَالَ لَوْ أَنَّ لِي بِكُمْ قُوَّةً أَوْ آوِي إِلَىٰ رُكْنٍ شَدِيدٍ

మేము పంపిన దూతలు లూత్‌ వద్దకు చేరుకున్నప్పుడు వారి రాకపై అతను దుఃఖవదనుడయ్యాడు. లోలోపలే కుంచించుకు పోతూ, ”ఇది చాలా గడ్డురోజు” [125] అని అన్నాడు. (మరో వైపునుంచి) అతని జాతి వారు పరుగులు తీస్తూ అతని వద్దకు వచ్చారు. వారు మొదటినుంచే ఇటువంటి నీచపు పనులు చేస్తుండేవారు.[126] ”నా జాతి ప్రజలారా! ఇదిగో, నా కూతుళ్ళు [127] ఉన్నారు. మీ కొరకు వీరు పరిశుద్ధులు. మీరు అల్లాహ్‌కు భయపడండి. నా అతిథుల విషయంలో నన్ను నవ్వులపాలు చెయ్యకండి. ఏమిటీ, మీలో ఒక్కడైనా మంచివాడు లేడా?’‘ [128] అని లూతు నచ్చజెప్పాడు. ”నీ కూతుళ్ళపై మాకెలాంటి హక్కు లేదన్న సంగతి నీకు బాగా తెలుసు. మాకిష్టమైనది ఏదో కూడా నీకు తెలుసు కదా!” [129] అని వారు సమాధానమిచ్చారు.”(అయ్యో!)మిమ్మల్ని ప్రతిఘటించే బలం నాకుంటే ఎంత బావుండేది! లేదా నేను ఆశ్రయం పొందటానికి ఏదైనా దృఢమైన ఆధారం ఉంటే ఎంత బావుండేది!” [130] అని లూత్‌ అన్నాడు. అప్పుడు దైవదూతలు “ఓ లూత్‌! మేము నీ ప్రభువు తరఫున పంపబడిన వారము. వారు నీ దాకా రాలేరు. కాబట్టి నువ్వు నీ ఇంటివారిని తీసుకుని కొంత రాత్రి ఉండగానే బయలుదేరు. మీలో ఎవరూ వెనుతిరిగి చూడకూడదు. అయితే నీ భార్య; వారందరికీ పట్టే గతే ఆవిడకూ పట్టనున్నది. వారికోసం ఉదయ సమయం నిశ్చయించబడింది. ఏమిటీ, ఉదయ సమయం దగ్గరలో లేదా?” [131] అని పలికారు. మరి మా ఉత్తర్వు(ను అమలుపరచే సమయం) రాగానే ఆ బస్తీని తల క్రిందు లుగా చేసేసి, వారిపై నిరాఘాటంగా గులకరాళ్ళను కురిపించాము. అవి నీ ప్రభువు తరపున గుర్తు వేయ బడినవి. అవి ఈ దుర్మార్గులకు ఎంతో దూరాన లేవు. [132](సూరా హూద్  11 :77 – 83)

[125] హజ్రత్‌ లూత్‌ (అలైహిస్సలాం) అంతగా మనస్తాపం చెందడానికి కారణం ఏమిటంటే దైవదూతలు మీసాలు కూడా మొలవని నవయువకుల రూపంలో వచ్చారు. తన జాతి పురుషుల సిగ్గుమాలిన చేష్టల గురించి ఆయనకు తెలుసు కాబట్టి  పొంచివున్న ప్రమాదాన్ని పసిగట్టి ఆయన వ్యాకులతకు లోనయ్యారు. వచ్చిన ఆ అందమైన నవయువకులు అతిథులు కానేకారనీ, వారు దైవశాసనాన్ని అమలు పరచడానికి వచ్చిన దైవదూతలని ఆయనకు తెలీదు.

[126] లూత్‌ ఇంటికి అందమైన కొందరు యువకులు వచ్చి ఉన్నారని తెలియగానే ఆ స్వలింగ సంపర్క రోగగ్రస్తులు ఉండబట్టలేక పరుగెత్తుకుని వచ్చారు. ఆ యువకులను తమ తమ ఇళ్లకు తీసుకుపోయి వాళ్ళను ఆ పాడుపని కోసం ఉపయోగించు కోవాలనుకున్నారు.

[127] అంటే – లైంగిక కోర్కెల్ని తీర్చుకోవాలన్నదే మీ ఉద్దేశ్యమైతే అందుకోసం ‘నా కూతుళ్లు ఉన్నారు. వారిని వివాహమాడండి. మీ కోర్కెల్ని ధర్మబద్ధంగానూ, సహజపద్ధతిలోనూ తీర్చుకోండి. ఇదే మీ కొరకు అన్ని విధాలా శ్రేయస్కరం అని లూత్‌ చెప్పదలిచారు. ఇక్కడ ‘కూతుళ్లు’ అంటే ఎవరు? తన జాతికి చెందిన మహిళలను ఆయన కూతుళ్లుగా చెప్పుకున్నారని చాలామంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే దైవప్రవక్త తన జాతివారి కొరకు పితామహుడు వంటివాడు. అలా చెప్పటంలోని ఆయన ఆంతర్యం ఏమిటంటే సమాజంలో ఇంతమంది ఆడపిల్లలు ఉండగా మీకేం పోయే రోగం వచ్చింది? మీరు ఆ అమ్మాయిలను పెళ్లి చేసుకుని మీ సహజ కోరికల్ని తీర్చుకోవచ్చుకదా! (ఇబ్నె కసీర్‌).

[128] ఏమిటీ? నా ఇంటికి వచ్చిన అతిథులతో దుర్వవహారం చేసి నన్ను అవమానాలపాలు చేస్తారా? మీలో ఆ మాత్రం అర్ధం చేసుకునే వారు లేరా? అతిథి మర్యాదకు కళంకం తెస్తారా? మీ దుష్ట బుద్ధిని అడ్డుకునే సజ్జనుడు మీలో ఒక్కడూ లేడా? దైవప్రవక్త లూత్‌ ఇంతగా కలత చెందడానికి కారణం అప్పటివరకూ ఆయన ఆ అతిథులను మానవ మాత్రులుగా తలపోయటమే. ఆ వచ్చిన వారు మనుషులు కారనీ, దుర్మార్గుల భరతం పట్టడానికి దివి నుంచి భువికి దిగివచ్చిన దైవదూతలని ఆయనకు తెలీదు. వారు దైవదూతలన్న సంగతి ఆయనకు ముందు నుంచే తెలిసి ఉంటే కలవరం చెందేవారు కారు. దైవప్రవక్తలకు రహస్య విషయాల జ్ఞానం ఉండదని చెప్పడానికి ఇది కూడా ఒక ప్రబల తార్మాణమే.

[129] అంటే ఆ దుర్మార్గులు సహజమైన, ధర్మసమ్మతమైన ఒక వద్ధతిని ్రోసివుచ్చి అసహజమైన, అహేతుకమైన, అధర్మమైన చేష్టను అవలంబించారు. పరమ జుగుప్సాకరమైన ఈ పనిలో లూత్‌ జాతివారు ఎంత ముందుకు వెళ్ళిపోయారో, వారి కళ్లు ఎలా మూసుకుపోయాయో దీన్నిబట్టి బోధపడుతోంది.

[130] “బలం” అంటే బాహుబలం, ఒనరులు, సంతానబలం అని భావం. “దృథఢమైన ఆధారం” అంటే తనను సమర్థించే తెగగానీ, వంశంగానీ ఉంటే వారిని ఆశ్రయించే వాడినే! అన్నది ఆయన ఆవేదన. ఎంతటి నిస్సహాయస్థితిలో ఆయన ఈ మాటలన్నారో అర్థమవుతోంది. నన్ను ఆదుకునేవారు, నా తరఫున మాట్లాడేవారు ఈ రోజు ఉండి ఉంటే అతిథుల విషయంలో నేను అవమానం పాలు కాకుండా ఉండేవాడినే! అని ఆందోళన చెందారు. దైవప్రవక్త హజత్‌ లూత్‌ (అలైహిస్సలాం) గారి ఈ ఆకాంక్ష దైవంపై భారం మోపే విషయానికి విరుద్ధం కాజాలదు. ప్రాపంచికంగా మనిషి తన రక్షణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకుని ఆ పైన దైవంపై భారం వేయాలి. ఇదే సరైనది. అంతేగాని చేతులు ముడుచుకు కూర్చుని, అన్నింటికీ దేవుడే ఉన్నాడు అంటే అసలుకే నష్టం వాటిల్లుతుంది. కాబట్టి హజ్రత్‌ లూత్‌ (అలైహిస్సలాం) పలుకుల్లో విపరీతమైన అంశం ఏమీ లేదు. ఈ సంఘటన ద్వారా విదితమయ్యే మరో ముఖ్య విషయం ఏమిటంటే దైవప్రవక్తలకు అగోచర జ్ఞానం ఉండదు. అలాగే వారు సర్వాధికారాలు కలిగి ఉండరు. దైవప్రవక్తలకు సర్వాధికారాలు ఉండి ఉంటే ఈ సందర్భంగా హజ్రత్‌ లూత్‌ అత్యంత దీనంగా ఇలా చెప్పుకుని ఉండేవారు కారు. ఈ రోజుల్లో కొందరు దైవప్రవక్త (స)కు సర్వాధికారాలుండేవని నమ్ముతున్నారు. ఈ నమ్మకం సరైనది కాదు. పై ఆయతు వారి ఈ నమ్మకాన్ని ఖండిస్తున్నది.

[131] ఒకవైపు లూత్‌ గారి దీనావస్థను, మరోవైపు ఆ జాతిజనుల విశ్చంఖలత్వాన్ని గమ నించిన దైవదూతలు జోక్యం చేసుకోవలసిన తరుణం వచ్చేసింది. “ఓ లూత్‌! మీరు ఆందోళన చెందనవసరం లేదు. వాళ్లు మా దాకా కాదుకదా, కనీసం మీ దాకా కూడా రాలేరు. రాత్రి పొద్దుపోయాక మీ మనుషులను వెంటబెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తెల్లవారగానే ఈ పట్టణవాసులు నాశనం చేయబడతారు” అని వారు ధైర్యం చెప్పారు.

[132]“అవి” అంటే ఏవి? ఆయా ఊళ్లను ధ్వంసం చేయటానికి వాటిపై విసరబడిన “రాళ్ళు’ అని కొంతమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడగా, ఈ ఆయతులో “అవి” అనే సర్వనామం నాశనమైన ఆ ‘ఊళ్ళ’నే సూచిస్తున్నదని మరికొంతమంది అభిప్రాయ పడ్డారు. ఆ ఊళ్లు సిరియా-మదీనాల మధ్య ఉండేవి. “దుర్మార్గులు” అంటే మక్కాకు చెందిన సత్యతిరస్కారులు. వెనుకటి జాతులకు పట్టిన దుర్గతే మీకూ పడుతుంది జాగ్రత్త! అని హెచ్చరించటం ఈ వాక్యాల ప్రధాన ఉద్దేశం.

ప్రవక్త లూత్ అలైహిస్సలాం జాతివారు స్వలింగ సంపర్కంమనే అత్యంత నీచమైన చేష్టకు పాల్పడటంతో వారిపై దేవుడి శిక్షలు దాపురించాయి!.

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించాడు:

وَلَمَّآ أَن جَآءَتْ رُسُلُنَا لُوطًۭا سِىٓءَ بِهِمْ وَضَاقَ بِهِمْ ذَرْعًۭا وَقَالُوا۟ لَا تَخَفْ وَلَا تَحْزَنْ ۖ إِنَّا مُنَجُّوكَ وَأَهْلَكَ إِلَّا ٱمْرَأَتَكَ كَانَتْ مِنَ ٱلْغَٰبِرِينَ

మరి మా దూతలు లూత్‌ (అలైహిస్సలాం) వద్దకు చేరుకున్నప్పుడు, అతను వారిని చూసి ఆందోళన చెందాడు. లోలోపలే కుమిలిపోయాడు [49]. అప్పుడు వారిలా అన్నారు: “నువ్వు భయపడకు. కలత చెందకు. మేము నీ భార్యను తప్ప [50] – నిన్నూ, నీ పరివారాన్నీ కాపాడుతాము. ఎందుకంటే ఆమె (శిక్షను అనుభవించటానికి) వెనుక ఉండిపోయే వారితో చేరుతుంది.” “మేము ఈ పట్టణవాసులపై, వారి తిరుగుబాటు ధోరణి కారణంగా ఆకాశం నుంచి శిక్షను అవతరింపజేయనున్నాము.[51] (ఆ విధంగా) మేము ఆ పట్టణాన్ని బుద్ధి జీవుల కోసం స్పష్టమైన గుణపాఠ సూచనగా [53] చేసాము(సూరా అంకబూత్ 29 : 33 – 35)

[50] హజ్రత్ లూత్ అలైహిస్సలాం పరిస్దితిని అర్ధం చేసుకున్న దైవదూతలు భీతి చెందరాదని, దుఃఖించరాదని ఆయన్ని ఓదార్చారు. తాము దుష్టులను శిక్షించటానికి పంపబడిన దైవదూతలం అని తెలిపారు. అయితే దగాకోరుగా వ్యవహరించిన ఆయన భార్యకు సయితం శిక్షపడటం ఖాయమని ఆ సందర్భంగా దైవదూతలు స్పష్టం చేశారు.

[51] ఆకాశం నుంచి అవతరించిన ఆ శిక్ష ఎటువంటిదంటే దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం వారి నివాస స్ధలాలను భూమినుంచి పెళ్ళగించి, ఆకాశం దాకా ఎత్తుకెళ్ళి అమాంతం క్రింద పడేశారు. ఆ తరువాత వారిపై కంకర రాళ్ళ వర్షం కురిపించబడింది. ఆ స్ధలాన్ని దుర్వాసన వచ్చే జలసంధి (మృత సముద్రం)గా మార్చివేయటం జరిగింది. (ఇబ్నె కసీర్)

[53] ఒకవైపు నుంచి రాళ్ళ వర్షం, మరో వైపు నుంచి ఇళ్ళు తలక్రిందులవటం, ఆ తరువాత ఆ ప్రదేశం అంతా దుర్వాసనతో కంపుకొట్టడం ఇదంతా ఒక గుణపాఠ సూచనే. ఆ ప్రదేశం మృత సముద్రంగా వ్యవహరించబడుతోంది. కాని విజ్ఞులు మాత్రమే ఇలాంటి ఘటనల నుండి గుణపాఠం గ్రహిస్తారు.

فَأَخَذَتْهُمُ ٱلصَّيْحَةُ مُشْرِقِينَ فَجَعَلْنَا عَالِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهِمْ حِجَارَةً مِّن سِجِّيلٍ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّلْمُتَوَسِّمِينَ

సూర్యోదయం అవుతున్న సమయంలో ఒక భయంకరమైన ప్రేలుడు వారిని ముట్టడించింది [46].చివరికి మేము ఆ నగరాన్ని తలక్రిందులుగా చేసివేశాము [47]. వారిపై కంకర రాళ్ల వర్షం కురిపించాము [48]. నిస్సందేహంగా యోచన చేసేవారి కొరకు [49] ఇందులో ఎన్నో సూచనలున్నాయి. ఈ పట్టణం (జనులు) వచ్చిపోయే రహదారిపైనే ఉంది  [50] (సూరా అల్ హిజ్ర్ – 15 :73 – 75)

[46] సూర్యుని లేలేత కిరణాలు పడుతున్న సమయంలో ఒకే ఒక్క శబ్దం వచ్చింది. అత్యంత భయంకరమైన ఈ కేక హజ్రత్‌ జిబ్రీల్‌ (అలైహిస్సలాం)దని కొంతమంది అభిప్రాయపడ్డారు.

[47] వారి నివాస స్థలాలు భూమి నుంచి ఆకాశానికి ఎత్తి, వాటిని తలక్రిందులుగా చేసి విసిరివేయటం జరిగిందని అనబడుతోంది. ఆ విధంగా వారు తమ ఇల్లూ వాకిలి సమేతంగా తలక్రిందులుగా చేసివేయబడ్డారు. అయితే కేవలం పై కప్పులతో సహా ఇళ్లు కూలిపోవటం మాత్రమే దీని భావమని మరికొందరంటారు.

[48] ఆ తర్వాత వారిపై ఒక ప్రత్యేక రకమైన కంకర రాళ్లు కూడా కురిపించబడ్డాయి. ఈ విధంగా వారు మూడు రకాల శిక్షలకు గురిచేయబడ్డారు. భావితరాల కొరకు ఇదొక గుణపాఠం అయ్యేలా చేయబడింది.

[49] ఆయతులో ‘ముతవస్సిమీన్‌” అని వుంది. నిశిత దృష్టితో విషయాన్ని పరికించే వారిని, యోచన చేసేవారిని ‘ముతవస్సిమీన్‌’ అంటారు. అలాంటి వారి కోసం ఇందులో గుణపాఠం ఉంది.

[50] అంటే ప్రధాన రహదారి అని భావం. మదీనా నుంచి సిరియాకు వెళ్ళే మార్గంలో శిథిలావస్థలో ఉన్న లూత్‌ (అలైహిస్సలాం) జాతి ప్రజల పట్టణాలు కానవస్తాయి. అటువైపు వచ్చేపోయే వారంతా ఆ దారి గుండా సాగవలసిందే. అవి మొత్తం అయిదు పేటలు. 1. సద్దూమ్‌ (ముఖ్యపట్టణం) 2. సాబ 3. సావహ్‌ 4. అస్‌ర 5. దూమా. వీటిని నాశనం చేసిన తీరు గురించి ఒక కథనం ఈ విధంగా ఉంది : హజత్‌ జిబ్రీల్‌ (అలైహిస్సలాం) తన రెక్కలపై ఈ పేటలను ఎత్తుకుని నింగికేసి సాగిపోయారు. ఆకాశాన ఉన్నవారు కూడా వారి కుక్కలు మొరగటాన్ని, కోళ్లు కూతవేయటాన్ని విన్నారు. ఆ తరువాత వారిని నేలకేసి గిరాటు కొట్టారని అనబడుతోంది (ఇబ్నె కసీర్‌). అయితే ఈ కథనానికి ప్రామాణికమైన అధారాలు లేవు.

శుచీశుభ్రత: నాల్గవ పాఠం: హైజ్ (బహిష్టు), నిఫాస్ (పురిటి రక్తం) [వీడియో]

బిస్మిల్లాహ్హైజ్ (బహిష్టు), నిఫాస్ (పురిటి రక్తం) الحيض والنفس

[11 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


హైజ్ అంటే ప్రసవం జరగకుండా, ఏ రోగంతో కాకుండా ఆరోగ్య స్థితిలో నిర్ణీత రోజుల్లో గర్భాశయం నుండి వెలువడే రక్తం. నలుపు రంగు, దుర్వాసన ఉంటుంది.

నిఫాస్ అంటే ప్రసవించినందుకు గర్భాశయం నుండి వెలువడే రక్తం.

స్త్రీలు తమ ఋతుస్రావము మరియు బాలంత గడువులో ఉన్నప్పుడు నమాజు, ఉపవాసాలు పాటించకూడదు. హజ్రత్ ఆయిష రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

إِذَا أَقْبَلَتِ الْحَيْضَةُ فَدَعِي الصَّلَاةَ وَإِذَا أَدْبَرَتْ فَاغْسِلِي عَنْكِ الدَّمَ وَصَلِّي {صحيح البخاري 331، صحيح مسلم 333}.

“నీవు ఋతువు రోజుల్లో ఉన్నప్పుడు నమాజు చేయడం మానేయి. ఋతు స్రావం ముగిసాక రక్తాన్ని కడిగి, తలంటు స్నానం చేసి నమాజు చేస్తూ ఉండు”. (బుఖారి 331, ముస్లిం 333).

ఈ రోజుల్లో చేయని నమాజులు తిరిగి చేయకూడదు.కాని ఈ రోజుల్లో తప్పిపోయిన ఉపవాసాలు మాత్రం పూర్తి చేయాలి.అలాగే వీరు కాబా ప్రదక్షిణం (తవాఫ్) కూడా చేయకూడదు. ఈ రోజుల్లో భర్త తన భార్యతో సంభోగించడం కూడా నిషిధ్ధం. అయితే రమించడం తప్ప పరస్పరం ఏ రకమైన ఆనందం పొందినా తప్పు లేదు. ఈ స్థితిలో స్త్రీ ఖుర్ఆనును ముట్టుకోవద్దు.

నమాజు సమయం ప్రవేశించిన తరువాత, ఆ నమాజు చేయక ముందే ఏ స్త్రీకైనా ఋతు స్రావం మొదలవుతే, లేదా ప్రసవిస్తే ఆమె పరిశుద్ధురాలయిన తరువాత ఆ నమాజును తిరిగి చేయాలి. (ఉదాహరణకు: జొహ్ర్ నమాజు వేళ ఆరంభమయింది పగలు పన్నెండు గంటల నలబై నిమిషాలకు, ఒక స్త్రీ ఒకటింటి వరకు కూడా జొహ్ర్ నమాజు చేసుకోలేక పోయింది. ఒకటింటికి ఋతు స్రావం మొదలయింది, లేదా ప్రసవించింది. అలాంటప్పుడు ఆ స్త్రీ పరిశుద్ధురాలయిన తరువాత జొహ్ర్ నమాజు చేయాలి).

ఒక రకాతు మాత్రమే చేయునంత సమయం ఉన్నప్పుడు పరిశుద్ధుమైన స్త్రీ గుస్ల్ చేసిన తరువాత ఆ నమాజు చేసుకోవాలి. ఉదాహరణకు: ఇషా నమాజు సమయం రాత్రి 11 గం.లకు సమాప్తమవుతుందనుకుందాము, ఒక స్త్రీ 11 గం.కంటే కొంచెం ముందు పరిశుద్ధురాలైతే ఆమె స్నానం చేసిన తర్వాత ఇషా నమాజు చేసుకోవాలి.

ఉపవాస స్థితిలో సూర్యాస్తమయానికి (ఇఫ్తార్ కి) కొన్ని క్షణాల మందైనా ఎవరికైనా ఋతుస్రావం లేదా ప్రసవం జరిగితే ఆ ఉపవాసం లెక్కలోకి రాదు, ఒకవేళ అది రమజాను ఉపవాసం లాంటి విధి ఉపవాసమయితే పరిశుద్ధురాలయిన తర్వాత దానికి బదులుగా మరో ఉపవాసం ఉండడం విధిగా ఉంది.

ఫజ్ర్ సమయం ప్రవేశించే వరకు స్త్రీ బహిష్టులో ఉంటే ఆ రోజు ఉపవాసం ఉండడం ధర్మం కాదు, ఒక వేళ ఆమె ఫజ్ర్ ప్రవేశించిన కొన్ని క్షణాల ముందు పరిశుద్ధురాలయినా సరే. అదే ఫజ్ర్ ప్రవేశించిన కొద్ది క్షణాల ముందు పరిశుద్ధరాలయితే ఉపవాసం ఉండాలి. స్నానం ఉషోదయం తరువాత చేసినా అభ్యంతరం లేదు.

అలాగే జునుబీ (అంటే సంభోగం లేదా స్వప్నస్ఖలనం వల్ల అశుద్ధ స్థితిలో ఉన్న వ్యక్తి) ఫజ్ర్ కు కొంచెం ముందు ఉపవాసం నియ్యత్ చేసుకొని ఫజ్ర్ తర్వాత స్నానం చేసినా అతని ఉపవాసం సరియగును.

బహిష్టు, బాలంత స్త్రీలు జిక్ర్, తక్బీర్, తస్బీహ్ చేయుట, అల్ హందులిల్లాహ్ పలుకుట, దుఆ చేయుట మరియు తినుత్రాగినప్పుడు బిస్మిల్లాహ్ అనుట యోగ్యమే. అలాగే హదీస్, ఫిఖ్హ్ చదువుట, ఖుర్ఆన్ పారాయణం వినుట లాంటివేవీ నిషిద్ధం కావు. అలాగే ఖుర్ఆనును ముట్టుకోకుండా తనకు కంఠస్తమున్నదానిలో నుండి పారాయణం చేయవచ్చును.

రక్త స్రావం ఆగిన తరవాత స్నానం చేయడం విధిగా ఉంది(*). స్నానం తర్వాత వారి ఈ గడువులో నిశిద్ధంగా ఉన్నవన్నీ ధర్మ సమ్మతమవుతాయి. ఉదా: నమాజు, ఉపవాసాలు, ఖుర్ఆన్ ను ముట్టుకోవడం లాంటివి.

(*) కొందరు బాలంతలు 15, లేదా 20, 25 రోజుల్లో రక్త స్రావం నిలిచిపోయినా 40 రోజుల తరువాతే గుస్ల్ చేస్తారు. ఆ తరువాతే నమాజు ఆరంభిస్తారు. వారు ఇలా చేసేది చాలా ఘోరమైన తప్పు. ఎప్పుడు రక్త స్రావం నిలిచినదో అప్పుడే గుస్ల్ చేయాలి. నమాజు మొదలెట్టాలి. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు


ఇతరములుతహారా

సూరతుల్ ఫాతిహా వ్యాఖ్యానం – అహ్సనుల్ బయాన్

సూరతుల్ ఫాతిహా వ్యాఖ్యానం  (تفسير سُورةُ الفاتحة)

అహ్సనుల్ బయాన్

సూరహ్ అల్ ఫాతిహా (ప్రారంభం)

మూలం: అహసనుల్ బయాన్, First Edition February 2009, శాంతి మార్గం పబ్లికేషన్స్ ట్రస్ట్, హైదరాబాద్:

పరిచయం:

సంకలనం రీత్యా దివ్యఖుర్ఆన్ లో ఇది మొట్టమొదటి సూరా. ఈ సూరాలో తౌహీద్ (అంటే ఏకదైవారాధన) ప్రధానంగా కనబడుతుంది. దేవుని పట్ల విశ్వాసం, దైవారాధన, దేవుణ్ణి సహాయం కోసం వేడుకోవడం, దేవుని ప్రార్థించడం గురించి ఇందులో ముఖ్యంగా నొక్కి చెప్పడం జరిగింది. ఈ సూరాలో ఏడు ఆయతులున్నాయి. అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు, స్తోత్రాలకు, అభ్యర్థనలకు  యోగ్యుడనీ, అల్లాహ్ మాత్రమే పరిపూర్ణుడనీ, ఇహలోకానికి, పరలోకానికి అల్లాహ్ మాత్రమే ప్రభువనీ, ఆయనే సృష్టికర్త అనీ ఈ ఏడు ఆయతులలో నిర్దిష్టంగా చెప్పడం జరిగింది.

ఈ సూరాకు ‘అల్ ఫాతిహా’ (ప్రారంభం) అని పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే, ఇది దివ్యఖుర్ఆన్ కు ప్రారంభ అధ్యాయం. ఈ సూరా దివ్య ఖుర్ఆన్ కు తల్లివంటిదనీ, దివ్య ఖుర్ఆన్ సారం ఇందులో ఉందని కూడా చెప్పడం జరిగింది.

ముస్లిములు చేసే నమాజుల్లో తప్పనిసరిగా చదువవలసిన సూరా ఇది. రోజూ చేసే అయిదు పూటల నమాజు కాని, లేక స్వచ్ఛందంగా చేసే ఐచ్ఛికమైన నమాజుల్లో కాని ప్రతి నమాజులో ఈ సూరాను పఠించటం తప్పనిసరి. ప్రారంభ సూరా చదువకపోతే ముస్లిములు చేసే ఏ నమాజూ స్వీకరించ బడదని ముస్లిం ధర్మవేత్తలు ఖచ్చితంగా చెప్పారు.

ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రారంభ సూరా (అల్ ఫాతిహా), పూర్తి ఖుర్ఆన్ కు సారాంశం వంటిది. ఈ సూరా పూర్తి ఖుర్ఆన్ కు సారాంశం అని ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఇస్లాంకు సంబంధించిన ప్రధానమైన భావనలను, నియమాలను అన్నింటినీ ఈ సూరా క్లుప్తంగా తెలియజేస్తుంది. మౌలికమైన ఇస్లామీయ భావనలు, ప్రధానమైన ఇస్లామీయ విశ్వాసాలు, అంటే దేవుని ఏకత్వం (దేవుడు ఒక్కడే అని విశ్వసించడం, దేవునికి భాగస్వాములు ఎవరూ లేరని విశ్వసించడం, దేవునికి సాటి ఎవరూ లేరని విశ్వసించడం), దేవుని గుణగణాలను గురించి ఈ సూరా సరళంగా, సూటిగా, సంక్షిప్తంగా మనిషికి తెలియజేస్తుంది. ముస్లిములు అల్లాహ్ ను, అంటే ఒకే ఒక్క ఆరాధ్యుడిని తప్ప మరెవ్వరినీ అర్థించరాదనీ, ఎవరి ముందూ చేతులు చాపరాదనీ, మనిషి సాటి మనిషికి దాస్యం చేయరాదనీ, కేవలం దేవునికి మాత్రమే తన ఆరాధనను అంకితం చేసుకొని, ఆయన ముందు మాత్రమే తలవంచాలని బోధిస్తుంది. దేవునికి మానవ గుణగణాలు ఆపాదించడాన్ని ఖండిస్తుంది. అల్లాహ్ కు ఎవరూ సమానులు కారు. అల్లాహ్ వంటి వారు మరెవ్వరూ లేరు. మనిషి ఆయన్ను విశ్వసించాలి. విశ్వాసంతో ఆయన్నే ఆరాధించాలి.

ఈ సూరా రెండు సమాన భాగాలుగా ఉన్నట్లు కనబడుతుంది. మొదటి భాగంలో అల్లాహ్, ఆయన గుణగణాల గురించి ఉంది. రెండవ భాగంలో మనిషి గురించి, మనిషికి దేవునితో ఉన్న అవసరం గురించి ఉంది.

అల్ ఫాతిహా సూరా వ్యాఖ్యానం:

అల్ ఫాతిహా సూరా దివ్య ఖుర్ఆన్ లోని మొట్ట మొదటి సూరా. హదీసుల ద్వారా కూడా దీని మహత్తు తెలుపబడింది. ఫాతిహ అంటే ఆరంభించటం, మొదలు పెట్టడం అని అర్థం. అందుకే దీనిని ఫాతిహతుల్ కితాబ్ అంటే పుస్తకారంభం అని పిలవటం జరిగింది. ఈ సూరాకు మరిన్ని పేర్లు కూడా ఉన్నట్లు హదీసుల ద్వారా రూఢీ అవుతోంది. ఉదాహరణకు:

  • (1) ఉమ్ముల్ ఖుర్ఆన్, (ఖురాన్ కు తల్లి వంటిది)
  • (2) అస్సబ్ వుల్ మసానీ, (7 చాలా పునరావృత అయతులు)
  • (3) అల్ ఖుర్ఆనుల్ అజీమ్,
  • (4) అష్షిఫా,
  • (5) అర్రుఖ్యతు (ఊదటం),

ఇంకా అనేక పేర్లు ఈ సూరాకు ఉన్నాయి.

ఈ సూరాకు గల ఇంకొక పేరు అస్సలాత్. హదీసె ఖుద్ సీ లో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చారు: ఖసమ్ తు స్సలాత బైనీ వ బైన అబ్దీ (సహీహ్ ముస్లిం : కితాబుస్సలాత్) – అంటే “నేను సలాత్ (నమాజు)ను నాకు – నా దాసునికి మధ్య విభజించాను” అని భావం. అంటే ఫాతిహా సూరా నన్నమాట! ఈ సూరాలోని సగభాగంలో దైవ స్తోత్రం చేయబడింది. ఆయన దయాదాక్షిణ్యాలు, పోషణ, న్యాయశీలం, విశ్వ సామ్రాజ్యాధికారం అభివర్ణించబడ్డాయి. మిగిలిన సగభాగంలో దైవసన్నిధిలో దాసుడు చేసుకునే విన్నపాలు, అభ్యర్థనలు వివరించబడ్డాయి.

ఈ హదీసులో ఫాతిహా సూరాను నమాజు గా అభివర్ణించడం జరిగింది. దీన్ని బట్టి నమాజులో ఈ సూరాను పఠించటం చాలా అవసరమని స్పష్టమవుతోంది. మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రవచనాల ద్వారా ఈ విషయం పదే పదే స్పష్టపరచటం జరిగింది: ఉదాహరణకు: – లా సలాత లిమన్ ల్లమ్ యఖ్ రఅ బి ఫాతిహతిల్ కితాబ్ (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం). అర్థం: ఫాతిహా సూరా పఠించని వ్యక్తి నమాజు నెరవేరదు. ఈ హదీసులోని అరబీ మూలంలో వచ్చిన ‘మన్’ అనే పదం సర్వసాధారణమైనది. నమాజు చేసే ప్రతి వ్యక్తికీ ఇది వర్తిస్తుంది. వ్యక్తిగత స్థాయిలో నమాజు చేసినా, సామూహికంగా నమాజు చేసినా, నమాజు చేయించే ఇమాము అయినా, ఇమామును అనుసరించే వారయినా – అందరూ ఈ సూరాను చదవవలసిందే. నెమ్మదిగా చేసే (సిర్రీ) నమాజులోనయినా, బిగ్గరగా చేసే (జహ్రీ) నమాజులోనయినా, విధిగా చేయవలసిన (ఫర్జ్) నమాజులోనయినా, స్వచ్ఛందంగా చేసుకునే (నఫిల్) నమాజులోనయినా – నమాజు చేసే ప్రతి ఒక్కరూ ఈ సూరాను చదవటం తప్పనిసరి. క్రింద పేర్కొనబడిన హదీసు ద్వారా కూడా ఈ విషయానికి సమర్థన లభిస్తోంది:

ఒకసారి ఫజ్ర్ (ఉదయం) నమాజులో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో పాటు ఆయన సహచరులు (రదియల్లాహు అన్హుమ్) కూడా ఖుర్ఆన్ పారాయణం చేయసాగారు. తత్కారణంగా నమాజులో ఖుర్ఆన్ పఠించడానికి ఆయన (సల్లల్లాహ్ అలైహి వసల్లం) ఇబ్బందిని ఎదుర్కోవలసి వచ్చింది. నమాజును ముగించిన తరువాత ఆయన (సల్లల్లాహ్ అలైహి వసల్లం) తన సహచరుల నుద్దేశ్యించి, “ఏమిటీ? మీరు కూడా (నా వెనకాల) ఖుర్ఆన్ పఠించారా?” అని అడిగారు. దానికి సహచరులు “అవున”ని చెప్పారు. అప్పుడు ఆయన (సల్లల్లాహ్ అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు: “మీరిలా చేయకండి – నాతో పాటు పఠించకండి – అయితే ఫాతిహా సూరా ను మాత్రం తప్పక పఠించాలి. ఎందుకంటే దాన్ని పఠించనిదే నమాజు నెరవేరదు” (అబూ దాఊద్, తిర్మిథీ, నసాయి).

అలాగే మరో హదీసు – హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహ్ అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: మన్ సల్లా సలాతన్ లమ్ యఖ్రఅ ఫీహా బి ఉమ్మిల్ ఖుర్ఆని ఫహియ ఖిదాజున్ సలాతున్ ఘైరు తమామ్: (ఎవరయితే ఫాతిహా సూరా లేకుండానే నమాజు చేశాడో అతని నమాజు లోపభూయిష్టమైనదవుతుంది – అది పరిపూర్ణమైన నమాజు కాబోదు). దైవప్రవక్త (సల్లల్లాహ్ అలైహి వసల్లం) మూడుసార్లు ఈ మాటన్నారు. “మేము ఇమాము వెనుక కూడా నమాజు చేస్తాము కదా! మరప్పుడేం చేయాలి?” అని కొంతమంది హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ను ప్రశ్నించగా, “ఇమాము వెనుక ఉన్నప్పుడు (అంటే సామూహిక నమాజు చేస్తున్నప్పుడు) మీరు మనసులోనే – లోలోపలే – ఫాతిహా సూరా పఠించండి” అని ఆయన (రదియల్లాహు అన్హు) సమాధానమిచ్చారు. (సహీహ్ ముస్లిం)

పై రెండు హదీసుల ద్వారా స్పష్టమయ్యేదేమిటంటే, దివ్య ఖుర్ఆన్ లో సెలవీయబడినట్లు, “దివ్య ఖుర్ఆన్ మీ ముందు పఠించబడుతూ ఉన్నప్పుడు దాన్ని శ్రద్ధగా వినండి, మౌనంగా ఉండండి” (అల్ అరాఫ్ – 204). అలాగే హదీథులో చెప్పబడినట్లు – “సామూహిక నమాజుకు సారధ్యం వహించే వ్యక్తి (ఇమాము), గ్రంథ పారాయణం చేస్తున్నప్పుడు మౌనంగా ఉండండి.” దీని భావం ఏమిటంటే బిగ్గరగా చేయించే నమాజులలో వెనుక నిలబడివున్న నమాజీలు (ముక్తదీలు) ఫాతిహా సూరా తరువాత మిగిలిన పారాయణమంతటినీ మౌనంగా వినాలి. ఇమాముతో పాటే ఖుర్ఆన్ పారాయణం చేయకూడదు. లేదంటే, ఇమాము, తన వెనుకనున్న అనుయాయులు కూడా సహీహ్ హదీథుల కనుగుణంగా ఫాతిహా సూరాను పఠించడానికి వీలుగా ఫాతిహా సూరా ఆయతులను బాగా ఆగి ఆగి పారాయణం చేయాలి. లేదా ఫాతిహా సూరా ముగించిన తరువాత తన అనుయాయుల (ముక్తదీల) సౌకర్యార్థం ఇమాము చాలినంత వ్యవధిని ఇవ్వాలి. అలా చేస్తే ముఖ్తదీలు ఫాతిహా సూరా వాక్యాలను లోలోపలే చదవుకుంటారు. ఇలా చేయటం ఖుర్ఆన్ హదీథుల దృష్ట్యా ఆక్షేపణీయం కూడా కాదు. పైగా ఖుర్ఆన్, హదీథు – రెండింటి ఆదేశాలను పాటించినట్లవుతుంది. దీనికి భిన్నంగా ఫాతిహా సూరా పఠనాన్ని వారించటం వల్ల అనవసరంగా కొన్ని లేనిపోని సంశయాలకు తావిచ్చినట్లవుతుంది. ఉదా:- దివ్యఖుర్ఆన్ మరియు ప్రామాణిక హదీథులు పరస్పరం సమన్వయం చెందటం లేదనీ, వాటి మధ్య వైరుద్ధ్యం ఉందనీ, ఆ రెంటిలో ఏదో ఒకటి మాత్రమే ఆచరణయోగ్యమైనదనీ, ఏక కాలంలో రెండింటినీ అనుసరించటం దుస్సాధ్యమనీ (దైవం మన్నించుగాక) కుంటిసాకులు వెతికే వారిని వెన్నుతట్టి ప్రోత్సహించినట్లవుతుంది. మరిన్ని వివరాలకై అల్ అరాఫ్ 204వ ఆయతుకు ఇవ్వబడిన వివరణను కూడా చూడండి. (ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే మౌలానా అబ్దుర్రహ్మాన్ ముబారక్ పూరి గారి ‘తహ్ కీకుల్ కలామ్’ పుస్తకం, ఇంకా మౌలానా ఇర్షాదుల్ హఖ్ అథ్రీ గారి పుస్తకాలు చదవండి). ఇక్కడ మరో విషయం కూడా గమనార్హం. ముక్తదీ గనక ఇమామ్ చేసే ఖుర్ఆన్ పారాయణం వింటున్నట్లయితే ఫాతిహా సూరా పఠించరాదనీ, ఒకవేళ వినని సందర్భంలో మాత్రం తప్పకుండా ఫాతిహా సూరా పఠించాల్సిందేనని ‘సలఫ్’లో (ఈ పదం వివరణ కోసం దయచేసి గ్రంథం చివరిలో ఇవ్వబడిన పద విశ్లేషణ చదవండి) అత్యధికమంది తెలిపినట్లు ఇమామ్ ఇబ్నె తైమియా అభిప్రాయపడ్డారు. (మజ్మూయె ఫతావా ఇబ్నె తైమియా 23/265).

ఇది మక్కీ సూరా. అంటే ఈ సూరా మక్కాలో అవతరించిందన్నమాట! మక్కా లేక మదీనాలో అవతరించిందంటే భావం: మహాప్రవక్త (సల్లల్లాహ్ అలైహి వసల్లం) హిజ్రత్ చేయక మునుపు (మదీనాకు వలస పోక పూర్వం) అవతరించిన సూరాలన్నీ మక్కీ సూరాలనబడతాయి. మరి ఆ సూరాలన్నీ పవిత్ర మక్కా నగరంలోనే అవతరించి ఉండనవసరం లేదు. సమయం సందర్భాలను బట్టి మక్కా చుట్టుప్రక్కల ప్రాంతాలలో అవతరించి ఉన్నప్పటికీ అవి మక్కీ సూరాలుగానే పరిగణించబడతాయి. అలాగే హిజ్రత్ (దైవదౌత్య అందిన 13 ఏండ్ల తరువాత జరిగిన మదీనా వలస ప్రయాణం) అనంతరం అవతరించిన సూరాలు – అవి మదీనాలో అవతరించినా లేక మదీనా పొలిమేరల్లో అవతరించినా లేక మదీనా నగరానికి బహుదూరాన అవతరించినా – అవన్నీ మదనీ సూరాలుగానే వ్యవహరించబడతాయి. ఆఖరికి అవి మక్కాలో లేక మక్కా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అవతరించి ఉన్నాసరే!

“బిస్మిల్లాహ్” విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఇది ప్రతి సూరాకు మొదట్లో వచ్చే ప్రత్యేకమైన వచనమా? లేక ప్రతి సూరాలో అంతర్భాగమా? లేక ఫాతిహా సూరాలోని ఒక ఆయతా? లేక ఏ సూరాలోనూ అంతర్భాగం కాని అదనపు వచనమా? అంటే కేవలం ఒక సూరాను మరొక సూరా నుంచి విడదీయడానికి సూచనగా ప్రయోగించబడిన వాక్యమా? – అన్న విషయంపై మీమాంస ఉంది. దీన్ని ఫాతిహా సూరా సమేతంగా అన్ని సూరాలలో అంతర్భాగంగా మక్కా మరియు కూఫా ఖుర్ఆన్ పఠితలు (ఖుర్రాలు) ఖరారు చేశారు. కాగా; ఇది ఒక ఆయతుగా ఏ సూరాలోనూ అంతర్భాగం కాదని మదీనా, బస్రా, సిరియా పారాయణకర్తలు అన్నారు. కాకపోతే నమల్ సూరాలోని 30వ వచనంలో వచ్చిన ‘బిస్మిల్లాహ్’ ను మాత్రం అందరూ ఏకాభిప్రాయంతో ఆయతుగా శిరసావహించారు. అలాగే బిగ్గరగా పఠించే నమాజులలో ‘బిస్మిల్లాహ్’ ను బిగ్గరగా చదివే అంశంపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. బిగ్గరగా చదవాలని కొందరు భావిస్తుండగా, నెమ్మదిగా పఠించాలని మరికొంతమంది తలపోస్తున్నారు (ఫతహుల్ ఖదీర్). అధిక సంఖ్యాక విద్వాంసులు మాత్రం నెమ్మదిగా పఠించాలన్న విషయానికే ప్రాధాన్యతనిచ్చారు. అంతమాత్రం చేత బిగ్గరగా పఠించటం విపరీతం కాదు – బిగ్గరగా పఠించటం కూడా ధర్మసమ్మతమే.

బిస్మిల్లాహ్ అంటే ‘అల్లాహ్ పేరుతో’ అని మాత్రమే అర్థం వస్తుంది. కనుక దానికి ముందు అఖ్రవు (నేను చదువుతున్నాను), అబ్ దవు (నేను ప్రారంభిస్తున్నాను), అత్ లూ (నేను పారాయణం చేస్తున్నాను) – లాంటిది ఏదో ఒక పదం ఉన్నట్లు భావించవలసి ఉంటుంది. అంటే అల్లాహ్ పేరుతో మొదలెడుతున్నాను, అల్లాహ్ పేరుతో అధ్యయనానికి ఉపక్రమిస్తున్నాను అని భావం. ప్రతి పనికి ముందు బిస్మిల్లాహ్ పలకమని గట్టిగా తాకీదు చేయబడింది. భోజనం చేసేటప్పుడు, జంతువును జిబహ్ చేసేటప్పుడు, ఉదూ చేయ సంకల్పించినప్పుడు, ఆఖరికి సంభోగానికి ముందు కూడా బిస్మిల్లాహ్ పఠించాలని ఆదేశించబడింది. ఖుర్ఆన్ పారాయణం మొదలెడుతున్నప్పుడు బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ ను పఠించటం అనివార్యమైనప్పటికీ, దానికి ముందు అవూదు బిల్లాహి మినష్షయితానిర్రజీమ్ ను పఠించడం కూడా ఎంతో అవసరమే. ఎందుకంటే ఫయిదా ఖరతుల్ ఖుర్ఆన ఫస్తయిజ్ బిల్లాహి మినష్షయితా నిర్రజీమ్ (మీరు ఖుర్ఆన్ పఠనానికి ఉపక్రమించినప్పుడు శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేడుకోండి – సూరా అన్నహ్ల్:98) అన్న ఆదేశం విస్మరించరానిది.


అల్ ఫాతిహా సూరా
అవతరణ: మక్కా  – ఆయతులు : 7

  1. బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం
    అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.
  2. అల్ హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్
    ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి [1]. ఆయన సమస్త లోకాలకు పోషకుడు [2].
  3. అర్రహ్మా నిర్రహీం
    అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు [3].
  4. మాలికి యౌమిద్దీన్
    ప్రతిఫల దినానికి (అంటే ప్రళయదినానికి) యజమాని [4].
  5. ఇయ్యాక నఅఁబుదు వ ఇయ్యాక నస్తఈఁన్
    మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము [5].
  6. ఇహ్దినశ్శిరాతల్ ముస్తఖీం
    మాకు ఋజుమార్గం (సన్మార్గం) చూపించు [6].
  7. శిరాతల్లదీన అన్ అమ్ త అలైహిమ్, గైరిల్ మగ్దూబి అలైహిమ్ వలద్దాల్లీన్
    నీవు అనుగ్రహించిన వారి మార్గం [7], నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోనుకాని వారి మార్గం (చూపు) [8].

[1]. అల్ హమ్దు: ఇందులో అల్ అనే పదం ప్రత్యేకతను, సమీకృతాన్ని సూచిస్తోంది. సమస్త స్తోత్రములు అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయనీ, అవి ఆయనకే ప్రత్యేకమనీ భావం. ఎందుకంటే ప్రశంసలకు అసలు అర్హుడు అల్లాహ్ యే. ఎవరిలోనయినా ఏదైనా ప్రత్యేకత, సద్గుణం, నేర్పు ఉంటే అది కూడా అల్లాహ్ సృజించినదే. అందుచేత స్తోత్రానికి అర్హుడు కూడా ఆయనే. అల్లాహ్: ఇది అల్లాహ్ నామం. వేరొకరి కోసం ఈ నామాన్ని ఉపయోగించటం సమ్మతం కాదు. అల్ హమ్దులిల్లాహ్ : ఇది కృతజ్ఞతా పూర్వకమయిన పలుకు. హదీథుల ద్వారా ఈ వచనం అత్యంత మహత్ పూర్వకమైనదని వెల్లడవుతోంది. లా ఇలాహ ఇల్లల్లాహ్ : శ్రేష్ఠమయిన వేడుకోలు అని ఒక హదీథులో ఉంది (సుననె తిర్మిథీ). అల్ హమ్దులిల్లాహ్ తమ్ లవుల్ మీజాన్ –  ‘అల్ హమ్దులిల్లాహ్ త్రాసును నింపేస్తుంది’ అని మరొక హదీథులో అనబడింది. (సహీహ్ ముస్లిం).  అందుకే దాసుడు తినే, త్రాగే ప్రతిసారీ అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవటాన్ని అల్లాహ్ అమితంగా ఇష్టపడతాడని వేరొక హదీథులో చెప్పబడింది (సహీహ్ ముస్లిం).

[2]. రబ్బ్ : అల్లాహ్ యొక్క ఉత్తమ నామాలలో ఇదొకటి. రబ్బ్ అంటే ప్రతి వస్తువును సృష్టించటంతో పాటు దాని అవసరాలు, అక్కరలను తీర్చి, దానికి పరిపూర్తి నొసగేవాడు అని అర్థం. ఈ పదాన్ని ఈ భావంలో వేరొకరికై ఉపయోగించటం సమ్మతం కాదు. ఒకవేళ ఇతరులను ఈ పేరుతో సంబోధించదలిస్తే దానికి ముందుగాని వెనుకగాని మరో పదం వాడాలి. ఉదా: అబ్దుర్రబ్ (ప్రభువు యొక్క దాసుడు). అంతేగాని కేవలం ‘రబ్’ అని ఇతరులెవరినీ పిలువకూడదు. ఆలమీన్ అనే పదం ఆలమ్ అనే పదానికి బహువచనం. ఆ మాటకొస్తే సమస్త సృష్టిరాసుల సముదాయాన్ని ఆలమ్ గా వ్యవహరిస్తారు. అందుకే సాధారణంగా ఈ పదాన్ని బహువచనంలోకి తీసుకోరు. అయితే దేవుని పరిపూర్ణ పోషకత్వాన్ని, సమగ్ర ప్రభుతను వెల్లడించే ఉద్దేశ్యంతో  ఆలమీన్ అనే బహువచనాన్ని తీసుకురావటం విశేషం. సృష్టిరాసుల్లోని వేర్వేరు రకాలను, కోవలను గురించి ఇక్కడ తెలియజెప్పటం ముఖ్యోద్ధేశ్యం అన్నమాట! ఉదాహరణకు: జిన్నుల జగతి, మానవ జగతి, దైవదూతల లోకం, పశుపక్షాదుల ప్రపంచం ఇత్యాదివి. ఈ సృష్టితాలన్నింటి అవసరాలు వేరు. తీరుతెన్నులు వేరు. అయితే రబ్బిల్ ఆలమీన్ (సమస్త లోకాలను పోషించేవాడు) మాత్రం వాటి స్వరూప స్వభావాలను, అవసరాలను, స్థితిగతులను దృష్టియందుంచుకుని వాటికి కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు.

[3]. రహ్మాన్: రహ్మాన్, రహీమ్ – ఇవి రెండూ అధిక అర్థాలనిచ్చే పదాలే. ఈ రెండింటిలోనూ అధికమైన, అనంతమైన, అపారమైన అనే భావం తొణకిసలాడుతోంది. అంటే అల్లాహ్ అపారంగా కనికరించేవాడు. ఆయనలోని ఈ గుణం ఇతర గుణగణాల మాదిరిగా శాశ్వతమైనది, స్థిరమైనది. కొంతమంది పండితులు ఈ సందర్భంగా ఏమంటారంటే; రహీమ్ కన్నా రహ్మాన్ అనే పదంలో విస్తృత భావం ఉంది. అందుకే రహ్మానద్దునియా వల్ ఆఖిరతి అని అనబడుతుంది. అంటే ఇహపర లోకాల్లోనూ కరుణించేవాడని అర్థం. ప్రపంచంలో ఆయన దయాదాక్షిణ్యాలు సర్వ సాధారణం. విశ్వాసులు – అవిశ్వాసులన్న విచక్షణ లేకుండా అందరూ ఈ ప్రపంచంలో ఆయన దయాదాక్షిణ్యాలకు నోచుకుంటున్నారు. కాని పరలోకంలో ఆయన కేవలం రహీమ్ గా మాత్రమే ఉంటాడు. అంటే అక్కడ ఆయన దయానుగ్రహాలు కేవలం విశ్వాసులకు మాత్రే పరిమితం అయి ఉంటాయి. “నేను ఆ కారుణ్యాన్ని నాకు భయపడేవారి కొరకూ, జకాత్ ఇచ్చే వారి కొరకూ, మా ఆయతులను విశ్వసించే వారి కొరకు తప్పకుండా వ్రాస్తాను” (అల్ అరాఫ్ – 156). అల్లాహుమ్మజ్ అల్నా మిన్ హుమ్. (అల్లాహ్! మమ్మల్ని కూడా ఆ భాగ్యవంతులలో చేర్చుగాక).

[4]. మనిషి ప్రపంచంలోనూ తాను చేసిన కర్మలకు ప్రతిఫలం కొంతవరకు అనుభవించినప్పటికీ పరలోకంలోనే అసలు సిసలు ఫలితం బయటపడుతుంది. సంపూర్ణమైన ప్రతిఫలం అక్కడే ఉనికిలోనికి వస్తుంది. ప్రతి వ్యక్తికీ అతను చేసిన మంచి లేక చెడు పనులను బట్టి అల్లాహ్ అతనికి బహుమానం ఇవ్వటమో, శిక్ష విధించటమో జరిగి తీరుతుంది. ఇదే విధంగా ప్రపంచంలో కూడా తాత్కాలికంగా అనేకమందికి కొన్ని అధికారాలుంటాయి. కాని పరలోకంలో మాత్రం అధికారాలన్నీ అల్లాహ్ హస్తగతం అవుతాయి. తీర్పుదినాన ఆయన తిరుగులేని సార్వభౌమాధికారిగా ఉంటాడు. రోజు విశ్వసామ్రాజ్యాధికారం ఎవరిదో చెప్పండి?” అంటూ ఆనాడాయన ప్రశ్నిస్తాడు. తిరుగులేని వాడు, ఏకైకుడైన అల్లాహ్ దే అంటూ ఆయనే సమాధానం కూడా ఇస్తాడు (అల్ మోమిన్ – 16) “ఆనాడు, ఏ మనిషీ ఎవరికొరకైనా ఏదన్నా చెయ్యగలగటమన్నది అసంభవం, ఆ రోజు అధికారమంతా అల్లాహ్ చేతుల్లోనే ఉంటుంది.” (ఇన్ ఫితార్ – 19) – అదీ తీర్పుదినమంటే!

[5]. ఇబాదత్ అంటే ఒకరి ప్రసన్నతను చూరగొనెందుకు అత్యంత అణుకువను, అశక్తతను, వినయ వినమ్రతలను అభివ్యక్తం చేయటం అని భావం. ఇబ్నె కథీర్ మాటల్లోనే చెప్పాలంటే, “షరిఅత్ లో సంపూర్ణమైన ప్రేమ, అభిమానం, భయము, భక్తీ – వీటన్నింటి సమ్మేళనమే ఇబాదత్.” అంటే ఎవరిపట్లనయితే ప్రేమాభిమానాలు కలిగి ఉంటామో, ఆయన శక్తియుక్తుల ముందు తమ నిస్సహాయ స్థితినీ, దైన్యస్థితినీ వ్యక్త పరచాలి. ఆ శక్తిమంతుడు తమను నిలదీసి అడుగుతాడన్న భీతి కూడా ఆ దాస్యంలో తొణకిసలాడుతూ ఉండాలి. విషయాన్ని సాదాసీదా చెప్పవలసి ఉంటే నా బుదుక, నస్తయీనుక (మేము నిన్ను ఆరాధిస్తాము, సహాయం కొరకు నిన్ను అర్థిస్తాము) అని అనబడేది. కాని, అల్లాహ్ ఇక్కడ ఇయ్యాక నాబుదు ఇయ్యాక నస్తయీన్ అని నొక్కి వక్కాణించి ఈ వాక్యానికి ప్రత్యేకతను, వైశిష్ఠ్యాన్ని కల్పించాడు – అంటే దీని అర్థం: “ఓ అల్లాహ్! మేము నిన్నే ఆరాధిస్తున్నాము. సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము” అని.

దీని ప్రకారం అల్లాహ్ ను గాక వేరొకరిని పూజించటం గానీ, సహాయం కొరకు వేరేతరులను మొరపెట్టుకోవటం గానీ ధర్మసమ్మతం కాదు. ఈ పదాల ద్వారా షిర్క్ (అల్లాహ్ కు భాగస్వాముల్ని నిర్ణయించటం) నిర్ద్వంద్వంగా ఖండించబడింది. కాని హృదయాలలో షిర్క్ రోగం తిష్ఠవేసి ఉన్నవారు ఈ మూలాంశాన్ని విస్మరించి, అపోహలో పడిపోయి, భ్రమలకు లోనై పిడివాదానికి దిగుతారు. మనం జబ్బుపడినప్పుడు డాక్టరు సహాయం పొందటం లేదా? ఇల్లాలి సేవల్ని పొందటం లేదా? ఇరుగు పొరుగువారి తోడ్పాటును, డ్రైవరు సాయాన్ని పొందటం లేదా? అని దబాయిస్తారు. ఈ విధంగా వాళ్లు, అల్లాహ్ గాక వేరితరుల సహాయాన్ని అర్థించటం కూడా సమ్మతమేనని మీరు ఒప్పుకునేలా చేయటానికి ప్రయత్నిస్తారు. నిజానికి కారకాలకు లోబడి ఒండొకరి సహాయాన్ని కోరటం, సహాయపడటం షిర్క్ కానే కాదు. ఇదైతే దేవుడు సమ్మతించి ఆమోదించిన వ్యవస్థ. ఆ వ్యవస్థలోని పనులన్నీ బాహ్యకారకాలకు అనుగుణంగానే జరుగుతాయి. కడకు దైవప్రవక్తలు సయితం మనుషుల సహాయసహకారాలను పొందుతూ ఉంటారు. దైవప్రవక్త హజ్రత్ ఈసా అలైహిస్సలాం తన జాతి జనులనుద్దేశించి, ‘అల్లాహ్ (ధర్మం) కొరకు నాకు సహాయపడేవారు మీలో ఎవరున్నారు?’ అని అడిగారు (అస్సఫ్ – 14). అల్లాహ్ స్వయంగా విశ్వాసుల నుద్దేశించి, “సత్కార్యం, దైవభక్కికి సంబంధించిన విషయాలలో ఒకరికొరకు సహకరించండి” అని సెలవిచ్చాడు. (అల్ మాయిదా: 2)

మరి ఇటువంటి సహాయసహకారాలు నిషేధించబడటంగానీ, షిర్క్ గా అభివర్ణించబడటం గానీ జరగలేదు. పైగా ఇలాంటి పనులు జరగాలని ప్రోత్సహించటమైంది. ఇలాంటి సత్కార్యాలు ప్రశంసనీయంగా పేర్కొనబడ్డాయి. వాస్తవమైన షిర్క్ తో దీనికి ఎటువంటి సంబంధమూ లేదు. బాహ్యపరమైన కారకాల రీత్యా సహాయం చేయటం ఏమాత్రం చేతకాని వానిని, సహాయం చేయజాలని వానిని “సహాయం చెయ్యి” అని అర్థించటమే అసలు షిర్క్. ఉదాహరణకు: చనిపోయిన ఒకానొక వ్యక్తిని సహాయం కోసం మొరపెట్టుకోవటం, అతడు కష్టాల నుండి గట్టెక్కిస్తాడనీ, అక్కరలు తీరుస్తాడని తలపోయటం, లాభనష్టాలు అతని అధీనంలో ఉన్నాయని ఊహించటం, దగ్గరున్నవారు పిలిచినా, దూరమున్నవారు మొరపెట్టుకున్నా, ప్రతి ఒక్కరి మొరలను ఆలకించే ‘శక్తి’ అతనిలో ఉందని నమ్మటం – ఇదంతా దైవానికి వేరొకరిని సహవర్తులుగా నిలబెట్టడంగా, భాగస్వామ్యం కల్పించటంగా, దేవుని లక్షణాలను వేరొకరికి  ఆపాదించటంగా పరిగణించబడుతుంది. ఇదే షిర్క్! దురదృష్టవశాత్తూ ముస్లిం దేశాలలో సయితం ఇటువంటి షిర్క్ వర్థిల్లుతోంది. మహనీయుల (ఔలియాల) పట్ల ప్రేమ కలిగి ఉండటం అవసరం మరి! అంటూ ముస్లింలు ఈ ప్రేమాభిమానంలో అతిశయిల్లి రాగానపడి షిర్కుకు ఒడిగడుతున్నారు. ఇటువంటి పోకడలబారి నుంచి అల్లాహ్ మనల్ని కాపాడుగాక!

తౌహీద్ (ఏకదైవోపాసన) మూడు రకాలు. ఈ సందర్భంగా ఏకదైవోపాసనకు సంబంధించిన ఈ మూడు రకాలను, క్లుప్తంగా నయినా సరే వివరించటం సమంజసం అనిపిస్తోంది. అవేమంటే – 1. తౌహీదె రుబూబియత్ 2. తౌహీదె ఉలూహియత్ 3. తౌహీదె అస్మా వ సిఫ్పాత్.

1.తౌహీదె రుబూబియత్ అంటే భావం: ఈ మొత్తం విశ్వానికి సృష్టికర్త, యజమాని, పోషకుడు, కనిపెట్టుకుని ఉన్నవాడు, వ్యూహ రచయిత కేవలం అల్లాహ్ మాత్రమే. నాస్తికులు మినహా మిగిలిన వారంతా ఈ తౌహీద్ ను అంగీకరిస్తారు. ఆఖరికి బహుదైవోపాసకులు సయితం ఈ దృక్పథాన్ని ఒప్పుకున్నారు. ఒప్పుకుంటున్నారు. మక్కాకు చెందిన బహుదైవారాధకుల (ముష్రిక్కుల) ఒప్పుకోలును గురించి ఖుర్ఆన్ ఇలా అభివర్ణించింది:

“ఓ ప్రవక్తా! వారిని అడగండి: ఆకాశం నుంచీ, భూమి నుంచీ మీకు ఉపాధినొసగే వాడు ఎవడు? (మీ) వినేశక్తీ, చూసే శక్తీ ఎవరి అధీనంలో ఉన్నాయి? నిర్జీవమైన దాన్నుంచి జీవమున్న దాన్ని, జీవమున్న దాన్నుంచి జీవము లేని దాన్ని తీసే వాడెవడు? అసలీ విశ్వవ్యవస్థను నడుపుతున్న వాడెవడు?  ‘అల్లాహ్’ అని వారు ఠకీమని అంటారు” (యూసుఫ్ – 31)

మరొకచోట ఇలా అనబడింది:

“భూమ్యాకాశాలను సృష్టించిన వాడెవడు? అని వారినడిగితే, ‘అల్లాహ్’ అని వాళ్లు చెబుతారు”(అజ్జుమర్-38)

వేరొకచోట సెలవీయబడింది:

“ఈ భూమి, భూమిలో ఉన్నదంతా ఎవరిదో మీకు తెలిస్తే చెప్పండి?” అని వారిని అడుగు. ‘అల్లాహ్ దే’ అని వారు చెబుతారు. మరలాంటప్పుడు మీరు ఎందుకు గ్రహించటం లేదు? అని వారితో అను. ఇంకా సప్తాకాశాలకూ, మహోన్నతమైన సింహాసనానికి అధిపతి ఎవరని కూడా వారిని ప్రశ్నించు. ‘అల్లాహ్’ అని వారు తడబడకుండా సమాధానమిస్తారు. మరి అటువంటప్పుడు మీరు ఆయనకు ఎందుకు భయపడటం లేదు? అని వారిని నిలదియ్యి” (అల్ మోమినూన్ : 84 – 89)

2.తౌహీదె ఉలూహియత్: అంటే భావం అన్ని రకాల ఆరాధన (ఇబాదల్) లకు, దాస్యాలకు, వేడుకోళ్ళకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. ఎవరైనా ఒక ప్రత్యేక వ్యక్తి మెప్పుకోసం లేక అతని అప్రసన్నతకు గురవుతామేమెనన్న భయం కొద్దీ చేసే ప్రతి పనీ ఆరాధన (ఇబాదత్) గానే భావించబడుతుంది. అందుచేతనే నమాజ్, ఉపవాసం, హజ్, జకాత్ వంటి క్రియలు మాత్రమే ఆరాధనలు కావు – ఒకానొక ప్రత్యేక అస్తిత్వం ఎదుట అభ్యర్థించుకోవటం, అతని పేర మొక్కకోవటం, మొక్కుబడులు తీర్చుకోవటం, అతని ఎదుట బుద్ధిగా చేతులు కట్టుకుని నిలబడటం, అతని చుట్టూ ప్రదక్షిణ చేయటం, అతని సమక్షంలో భయభక్తులను ప్రదర్శించటం, అతను తమకేదైనా అనుగ్రహిస్తాడేమోనని ఆశగా నిరీక్షించటం – ఇత్యాదులన్నీ ఆరాధన (ఇబాదత్) గానే పరిగణించబడతాయి. మరి ఇటువంటి పనులన్నీ ఒక్కడైన అల్లాహ్ కోసమే చేయాలి. ఇదే తౌహీదె ఉలూహియత్ (అయితే బాహ్య కారకాల కనుగుణంగా బ్రతికి ఉన్న మనుషుల వద్దకు వెళ్ళి, వారి నుండి ఏదైనా ఆశించటం, వారి యెడల వినయ వినమ్రతలను కలిగి ఉండటం మాత్రం ‘తౌహీద్’ కు విరుద్ధం కాదు). సమాధి పూజ వ్యాధికి లోనయిన సామాన్యులు, ప్రముఖులు ఈ తౌహీదె ఉలూహియత్ లో షిర్క్ కు ఒడిగడు తుంటారు. ఇటువంటి ఆరాధనలను వారు సమాధులలో ఖననం చేయబడినవారి నుద్దేశించి చేస్తుంటారు. ఇది ముమ్మాటికీ షిర్కే!

3.తౌహీదె అస్మా సిఫ్పాత్ : అంటే భావం ఖుర్ఆన్ మరియు హదీథులలో అల్లాహ్ గురించి చెప్పబడిన గుణగణాలను, లక్షణాలను ఏమాత్రం వక్రీకరించకుండా, వాటిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా – యథాతథంగా అంగీకరించటం. అంటే ఆ గుణగణాలు వేరొకరిలో కూడా ఉన్నాయన్న భావనకు సుతరామూ తావీయకూడదు.

ఉదాహరణకు: అగోచర జ్ఞానం అల్లాహ్ గుణం, లేదా దూరాన ఉన్నవారు మొరపెట్టుకున్నా, చేరువలో ఉన్నవారు ఫిర్యాదు చేసినా – అందరి గోడునూ ఆయన వింటాడు అనేది ఇంకొక గుణం. విశ్వమండలంలో ఏదైనా సరే చేయగల అధికారం ఆయనకు ఉంది అనేది ఇంకొకటి. ఇలాంటివే అనేకానేక గుణగణాలు ఆయన సొంతం. మరి అటువంటి గుణగణాలలో ప్రవక్తనో, వలీనో, సజ్జనులనో చేర్చరాదు. ఒకవేళ వారిని కూడా సహవర్తులుగా చేర్చి, ఆ మహనీయులకు కూడా అటువంటి గుణాలే ఉన్నాయని భావిస్తే అది ముమ్మాటికీ ‘షిర్కే’ అవుతుంది.

[6]. హిదాయత్: అంటే మార్గదర్శకత్వం వహించటం, తిన్నని త్రోవలో నడపటం, గమ్యస్థానానికి చేర్చటం అని భావం. ఇదే అరబీలో సద్భుద్ధి, సత్ప్రేరణ, నిదర్శనంగా కూడా అభివర్ణించబడింది. అంటే మాకు ఋజుమార్గం వైపు దర్శకత్వం వహించు! ఆ మార్గంపై నడిచే సద్భుద్ధి నొసగు!! ఆ మార్గంపై కు సహన స్థయిర్యాలను ప్రసాదించు !! తద్వారానే మేము నీ ప్రసన్నతను చూరగొనగలము అన్నది దీని మతలబు. మరి ఈ ఋజుమార్గం కేవలం మనిషి బుద్ధీజ్ఞానాల వల్ల, అతని తెలివితేటల వల్ల ప్రాప్తించదు. దానికి దైవకటాక్షం ఎంతో అవసరం. ఈ ఋజుమార్గమే ఇస్లాం. ఆ మార్గాన్నే అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) లోకానికి విడమర్చి చెప్పారు. ఆ మార్గాన్ని పొందటమెలాగో ఖుర్ఆన్ మరియు హదీథులు పూసగుచ్చినట్లుగా మనకు వివరిస్తున్నాయి.

[7]. దైవకటాక్షం పొందినవారు: ఈ కోవకు చెందిన వారెవరో ఖుర్ఆన్ ఖుద్దుగా వివరించింది. అన్నిసా సూరాలో పేర్కొనబడినట్లుగా – “ఎవరయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారో వారు (ప్రళయదినాన) దైవకటాక్షం పొందిన వారితో ఉంటారు. అంటే దైవప్రవక్తలు, సత్యసంధులు, అమరగతులు, సద్వర్తనులు. అటువంటి వారి సహచర్యం ఎంతో మంచిది కదా!” (అన్నిసా : 69)

దైవానుగ్రహానికి పాత్రులైన వారి ఈ మార్గం దైవవిధేయత మరియు ప్రవక్త విధేయతల మార్గమే తప్ప వేరొక మార్గం కాదన్న సంగతి కూడా ఈ ఆయతులో స్పష్టంగా చెప్పబడింది.

[8]. ఆగ్రహానికి గురైన వారు, అపమార్గానికి లోనైనవారు: ఆగ్రహానికి గురైనవారంటే యూదులు, అపమార్గానికి లోనైన వారంటే క్రైస్తవులని భావం. ఈ విషయంలో ఖుర్ఆన్ వ్యాఖ్యాతల మధ్య ఎలాంటి అభిప్రాయభేదం లేదని ఇబ్నె అబీ హాతిమ్ అంటున్నారు. (ఫతహుల్ ఖదీర్). అందుకే ఋజుమార్గాన నడవాలని కోరుకునేవారు యూదులు, క్రైస్తవుల మార్గవిహీనతకు దూరంగా మసలు కోవటం ఎంతో అవసరం. యూదుల మార్గభ్రష్టతకు తార్కాణం ఏమిటంటే, వాళ్ల తెలిసి కూడా – ఉద్దేశ్యపూర్వకంగా – సన్మార్గాన నడిచేవారు కారు. దైవవాక్కులలో ప్రక్షిప్తాలు చేసేవారు. ప్రతి దానికీ వంకలు పెట్టేవారు. ఉజైర్ ను వారు దేవుని కుమారునిగా నిలబెట్టారు.       ఏదేని విషయాన్ని ధర్మం  (హలాల్) గానో, అధర్మం (హరాం) గానో ఖరారు చేసే అధికారాన్ని వారు తమ ఆచార్యులకు, మతాధికార్లకు కట్టబెట్టారు. ఇక క్రైస్తవులు చేసిన ఘోరమైన తప్పిదం ఏమిటంటే, వాళ్ళు దైవప్రవక్త హజ్రత్ ఈసా అలైహిస్సలాం ప్రేమలో అతిశయిల్లారు. ఆయన్ని దేవుని కుమారునిగా ఖరారు చేశారు. ‘త్రిత్వం’ (మూడు దైవాల భావన) ను సృష్టించి గందరగోళ స్థితికి కారకులయ్యారు. అత్యంత శోచనీయమైన విషయం ఏమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజంలో సయితం ఇటువంటి అయోమయావస్థ నెలకొంటున్నది. ప్రవక్త పట్ల ప్రేమాతిశయంతో కొందరు మహానుభావులు తమదైన శైలిలో తొక్కే పుంతలు మార్గభ్రష్టతకు దారి తీసేలా పరిణమిస్తున్నాయి. ఈ కారణంగానే వారు ఇహలోకంలోనే పరాభవానికి గురవుతున్నారు. అల్లాహ్ వారిని ఈ మార్గభ్రష్టతల లోయల్లోనుంటి బయట పడవేయుగాక!

ఫాతిహా సూరా చివర్లో ఆమీన్ పలకటం అత్యంత మహత్పూర్వకమని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పదే పదే తాకీదు చేయటం గమనార్హం. అందుకే (నమాజులో) ఇమామ్, ముఖ్తదీలు ప్రతి ఒక్కరూ ‘ఆమీన్’ పలకాలి. “బిగ్గరగా చేసే నమాజులలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చు స్వరంతో ‘ఆమీన్’ పలికేవారు. ప్రియ సహచరులు కూడా బిగ్గరగా ఆమీన్ పలికే సరికి మస్జిద్ ఆమీన్ శబ్ధంతో ప్రతిధ్వనించేది”. (ఇబ్నె మాజా, ఇబ్నె కథీర్). ఆమీన్ బిగ్గరగా పలకటం సున్నత్ (దైవప్రవక్త సంప్రదాయం). ఇది ప్రవక్త ప్రియసహచరుల ఆచరణ కూడా. ఆమీన్ కు పలు అర్ధాలు ఇవ్వబడ్డాయి. ‘ఆమీన్’ అంటే తథాస్తు అనీ, ‘ఓ అల్లాహ్! మా ప్రార్థనను స్వీకరించు’ అనీ, ‘మా ఆశను అడియాశ చేయకు’ అనీ భావం.

కొత్తపదాలు – వాటి అర్థాలు

ఔలియా ‘వలీ’ అన్న పదానికి బహువచనం; సన్నిహితులు, ప్రియతములు అని అర్థం; ఔలియాను దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఈ విధంగా నిర్వచించాడు: “వారు విశ్వాసులై ఉంటారు. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉంటారు” (యూసుఫ్ : 63); సాధారణంగా జనం వలీలంటే “బాబాలు” అని అనుకుంటారు. కాని నిజానికి వలీలంటే బాబాలనబడేవారు కాదు. మంచివారైన విశ్వాసులందరూ, ప్రవక్తల అనుచరులందరూ అల్లాహ్ వలీలుగానే భావించబడతారు. ఈ పదానికి వేరితర అర్థాలు కూడా ఉన్నాయి. ఉదా: సంరక్షకుడు, సహాయకుడు.
ఖుర్రా ‘ఖారి’ అనే పదానికి బహువచనం; ఖుర్ఆన్ పారాయణ విద్యలో పండితులు అని అర్థం.
జహ్రీ నమాజులు ఖుర్ఆన్ పారాయణం బిగ్గరగా జరిగే నమాజులు(ఫజ్ర్, మగ్రిబ్, ఇషా)
జిన్నులు/జిన్నాతులు అగ్నితో సృష్టించబడిన, మనుషుల కంటికి కనిపించని మరో జాతి ప్రాణులు.
ముక్తదీలు ఇమాము వెనుక, అతనిని అనుసరిస్తూ నమాజు చేసేవారిని “ముక్తదీలు” అంటారు. నమాజుకు సారధ్యం వహించే వ్యక్తి ‘ఇమాము’ అని పిలువబడతాడు;
లాఇలాహ ఇల్లల్లాహ్ “అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు.”
షిర్క్ అల్లాహ్ ఆరాధన (ఉలూహియత్)లో గాని, ఆయన సార్వభౌమత్వం (రుబూబియత్) లో గాని, ఆయన దివ్య నామ, గుణగణాల (అస్మా వసిఫ్ఫాత్)లో గాని వేరొకరికి భాగస్వామ్యం కల్పించటం. ఇది ఘోరమైన పాపం. ఈ పాపానికి పాల్పడేవారిని ‘ముష్రికులు’ అంటారు అంటే అల్లాహ్ తో పాటు వేరొకరికి భాగస్వామ్యం కల్పించే వారన్నమాట.
సలఫ్ పూర్వీకులు; ఇస్లాంలో తొలి మూడు తరాలకు చెందిన నికార్సయిన ముస్లింలు.
సిర్రీ నమాజులు ఖుర్ఆన్ పారాయణం నిశ్శబ్దంగా జరిగే నమాజులు (జుహర్, అస్ర్)
బిద్అతీలు ఖుర్ఆన్ మరియు హదీథులకు, వాటి  స్ఫూర్తికి విరుద్ధమైన కొత్త అర్ధాలు చెప్పేవారు; ధర్మంలో కొత్తపుంతలు తొక్కేవారు; ఈ తరహా పోకడలు ఘోరపాపాలుగా భావింపబడతాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వీటిని తీవ్రంగా ఖండించారు.
హదీథె ఖుద్ సీ అల్లాహ్ మాటలను ప్రవక్త తన నోటితో అల్లాహ్ ఇలా ఆదేశించాడని చెప్పటం; మామూలు హదీథుకు – హదీథె ఖుద్సీకు మధ్య భేదాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా అల్లాహ్ ప్రేరణతో దైవప్రక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేవన్నీ మామూలు హదీథులు అవుతాయి. అయితే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదయినా హదీథులో నేరుగా అల్లాహ్ ఇలా అంటున్నాడని గాని, ఇలా ఆదేశించాడని గాని చెప్పినట్లయితే అటువంటి హదీథులు ‘హదీథె ఖుద్స్’ గా భావించబడతాయి.
ప్రక్షిప్తాలు లేనివి కల్పించబడటం.

ఇతరములు:

త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – ఉసూల్ అత్ తలాత [ఆడియో & పుస్తకం]

బిస్మిల్లాహ్
త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – ఉసూల్ అత్ తలాత- యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3zNRaaEnL1ZQB34vY0u2MD

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


క్రింది పుస్తకం హదీసు పబ్లికేషన్స్ వారు ప్రచురించిన   ఇస్లాం మూల సూత్రాలు (ఉసూల్ అత్ తలాత & ఖవాఇద్ అల్ ఆర్బా) అనే పుస్తకం నుండి తీసుకోబడింది. కొన్ని పదాలలో చిన్న చిన్న మార్పులు చేసాము.

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్‌
(అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్‌ పేరుతో)

వ బిహీ నస్తయీను వస్సలాతు వస్సలాము అలా నబియ్యినా ముహమ్మదిన్ వ్వ అలా ఆలిహీ వ సహ్‌బిహీ అజ్‌ మయిీన్‌.

ప్రశ్న : ప్రతి మనిషీ విధిగా తెలుసుకోవలసిన నాలుగు అంశాలు ఏవి?

జవాబు :

  1. మొదటిది – ఇల్మ్‌ (జ్ఞానం), అంటే దైవాన్ని, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను, ఇస్లాం ధర్మాన్ని గురించి క్షుణ్ణంగా, ప్రామాణికమైన ఆధారాల ద్వారా తెలుసుకోవటం.
  2. రెండవది. : ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం.
  3. మూడవది : దీనిని ఇతరులకు తెలియపరచటం.
  4. నాల్గవది : ఈ మార్గంలో ఎదురయ్యే కష్టనష్టాలను ఓపికతో సహించి నిలకడను కనబరచటం.

ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటీ?

జవాబు : దీనికి ఆధారం ఇది :

وَالْعَصْرِ  إِنَّ الْإِنسَانَ لَفِي خُسْرٍ إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ

(కాలం సాక్షిగా! నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి లోనై ఉన్నాడు.అయితే విశ్వసించి మంచి పనులు చేసిన వారు, పరస్పరం సత్యాన్ని ప్రబోధిస్తూ ఉండేవారు, సహనస్థయిర్యాలను గురించి ఒండొకరికి ఉపదేశిస్తూ ఉండేవారు మాత్రం నష్టంలో లేరు.) (అల్‌ అస్ర్ సూరా)

ప్రశ్న: ఈ సూరా గురించి ఇమామ్‌ షాఫయి (రహిమహుల్లాహ్) ఏమన్నారో తెలుసా?

జవాబు : అవును. అల్లాహ్‌ తన సృష్టితాల కోసం ఈ చిన్న సూరా నొక్కదానిని అవతరింపజేసినా వారి మార్గదర్శకత్వం కొరకు ఇది సరిపోయేదని ఇమామ్‌ షాఫయి (రహిమహుల్లాహ్) అభిప్రాయపడ్డారు.

ప్రశ్న: ముందు జ్ఞానమా లేక ఆచరణా?

జవాబు : జ్ఞానం తరువాతనే మాటలయినా,చేతలయినా. దీనికి ఆధారం ఏమిటంటే-

فَاعْلَمْ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَاسْتَغْفِرْ لِذَنبِكَ وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ

కనుక ఓ ప్రవక్తా! బాగా తెలుసుకో! అల్లాహ్‌ తప్ప ఆరాధనకు అర్హుడైనవాడు ఎవడూ లేడని. నీవల్ల జరిగిన పొరపాట్లకు క్షమాభిక్ష వేడుకో. విశ్వాసులైన స్త్రీ  పురుషుల పొరపాట్లకు కూడా.” (ముహమ్మద్‌  47:19)

ప్రశ్న : ప్రతి ఒక్కరూ తెలుసుకుని తప్పనిసరిగా ఆచరించవలసిన ఆ మూడు ముఖ్యాంశాలు ఏవి?

జవాబు:: మొదటిదేమంటే; మనల్ని అల్లాహ్‌యే పుట్టించాడు. ఆయనే మన జీవికకోసం ఉపాధిని ప్రసాదించాడు. ఆయన మనల్ని ఇట్టే వదలిపెట్టలేదు. మనకు సన్మార్గం చూపడానికని ప్రవక్తల్ని పంపించాడు. ఎవరయితే వారు చెప్పినట్టు వింటాడో అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు. మరెవరయితే ధిక్కరిస్తాడో అతను నరకానికి ఆహుతి అవుతాడు.

ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటీ?

జవాబు : దీనికి ఆధారం ఇది : అల్లాహ్‌ తన గ్రంథంలో ఏమని సెలవిచ్చాడంటే-

إِنَّا أَرْسَلْنَا إِلَيْكُمْ رَسُولًا شَاهِدًا عَلَيْكُمْ كَمَا أَرْسَلْنَا إِلَىٰ فِرْعَوْنَ رَسُولًا فَعَصَىٰ فِرْعَوْنُ الرَّسُولَ فَأَخَذْنَاهُ أَخْذًا وَبِيلًا

మేము ఫిర్‌ఔను వద్దకు ఒక ప్రవక్తను పంపిన విధంగా ఒక ప్రవక్తను మీపై సాక్షిగా నియమించి మీ వద్దకు పంపాము. (చూడండి) ఫిరౌను ఆ ప్రవక్త మాటను వినకపోవటం వల్ల మేము అతన్ని చాలా తీవ్రంగా పట్టుకున్నాము.” (అల్ ముజ్జమ్మిల్ 73: 15,16)

రెండవదేమిటంటే; ఆరాధన మరియు దాస్యం విషయంలో తనతోపాటు మరెవరికయినా భాగస్వామ్యం కల్పిస్తే, దీనిని అల్లాహ్‌ సుతరామూ సహించడు. ఇది షిర్క్‌ అవుతుంది. షిర్క్‌ చేసేవారు తనకెంత సన్నిహితులయినా, ఆఖరికి దైవదూతలు, దైవప్రవక్తలు ఈ పని చేసినా సరే దేవుడు క్షమించడు.

ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటీ?

జవాబు : దీనికి ఆధారంగా దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వచనాన్ని చూడండి –

وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا

మస్జిద్లు అల్లాహ్‌కు మాత్రమే ప్రత్యేకం. కనుక వాటిలో అల్లాహ్‌తో పాటు మరొకరిని పిలవకండి.” (జిన్‌ 72:18)

మూడవదేమిటంటే; దేవుని ఏకత్వాన్ని అంగీకరించి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కి విధేయుడై ఉంటానని ఒప్పుకున్న మీదట దైవం మరియు దైవప్రవక్తల విరోధులతో స్నేహం చేయరాదు. మరి ఆ దైవవిరోధులు తమకు ఆప్తులు, మిత్రులయినాసరే వారితో తెగతెంపులు చేసుకోవలసిందే.

ప్రశ్న : ఆ మేరకు ఏదైనా నిదర్శనం ఉందా?

జవాబు : ఉంది. దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఈ విధంగా సెలవిస్తున్నాడు –

لَّا تَجِدُ قَوْمًا يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ يُوَادُّونَ مَنْ حَادَّ اللَّهَ وَرَسُولَهُ وَلَوْ كَانُوا آبَاءَهُمْ أَوْ أَبْنَاءَهُمْ أَوْ إِخْوَانَهُمْ أَوْ عَشِيرَتَهُمْ ۚ أُولَٰئِكَ كَتَبَ فِي قُلُوبِهِمُ الْإِيمَانَ وَأَيَّدَهُم بِرُوحٍ مِّنْهُ

అల్లాహ్‌ను, పరలోకాన్ని విశ్వసించేవారు, అల్లాహ్‌ను ఆయన ప్రవక్తనూ వ్యతిరేకించే వారిని ప్రేమించటాన్ని నీవు ఎన్నడూ చూడలేవు. ఆ వ్యతిరేకించేవారు వారి తల్లిదండ్రు లైనా, వారి సోదరులైనా సరే లేదా వారి కుటుంబీకులయినా సరే. వారి హృదయాలలో అల్లాహ్‌ విశ్వాసాన్ని స్థిరంగా నాటాడు. తన తరపు నుండి ఒక ఆత్మను ప్రసాదించి వారికి బలాన్ని ఇచ్చాడు.” (ముజాదల 58:22)

ప్రశ్న : ‘హనీఫియత్‌’ – లేదా ‘మిల్లతె  ఇబ్రాహీం’ అంటే ఏమిటి?

జవాబు: మిల్లతె ఇబ్రాహీం అంటే చిత్తశుద్ధితో, ఏకాగ్ర చిత్తంతో ఒక్కడైన అల్లాహ్‌ను ఆరాధించటం. అల్లాహ్‌ అందరికీ దీని గురించే ఆజ్ఞాపించాడు. ఇందు నిమిత్తమే అందరినీ పుట్టించాడు.

ప్రశ్న : అలా అని ఎక్కడుందీ?

జవాబు : దివ్య గ్రంథమైన ఖుర్‌ఆన్‌లో ఉంది :

నేను జిన్నుల్ని, మానవుల్ని నా దాస్యం చేయడానికి మాత్రమే పుట్టించాను”.

ప్రశ్న : ‘యాబుదూని’ (నా దాస్యమే చేయాలి) అనే మాటలోని ఆంతర్యం ఏమిటీ?

జవాబు : దీని ఆంతర్యం ఏమిటంటే ప్రాణులన్నీ ఆయన ఏకత్వాన్ని అంగీకరించి ఆయన ముందరే తలవంచాలి. ఆయన చేయమన్న దానిని చేయాలి. వద్దన్న దానికి దూరంగా ఉండాలి.

ప్రశ్న : అల్లాహ్‌ ఆజ్ఞాపించిన వాటిలోకెల్లా పెద్ద ఆజ్ఞ ఏది?

జవాబు : తౌహీద్‌ ! అదే ఏకదైవారాధన.

ప్రశ్న : ‘తౌహీద్‌’ అంటే ఏమిటీ?

జవాబు : తౌహీద్‌ అంటే కేవలం ఒక్క అల్లాహ్‌నే పూజించాలి. ఆయన దైవత్వంలో, ఆయన గుణగణాలలో, ఆయన అధికారాలలో వేరొకరికి సహవర్తుల్ని కల్పించ కూడదు. ఆయన అద్వితీయుడనీ, దోషరహితుడనీ, రాగద్వేషాలకు అతీతుడనీ, సృష్టితాలలో ఆయనకు ఏమాత్రం పోలికలేదనీ అంగీకరించాలి. ఇదే స్వచ్భమైన తౌహీద్‌.

ప్రశ్న : అల్లాహ్‌ మనల్ని వారించిన వాటిలోకెల్లా పెద్ద వస్తువు ఏది?

జవాబు : షిర్క్‌.

ప్రశ్న : షిర్క్‌ అంటే?

జవాబు : షిర్క్‌ అంటే అల్లాహ్‌తో పాటు వేరొక దైవేతరుణ్ణి మొర పెట్టుకోవటం, దైవారాధనలో ఇంకొకరికి సాటి కల్పించటం.

ప్రశ్న: దీనికి ఉపమానం గానీ, ఆధారం గానీ ఉందా?

జవాబు : ఉంది. ఉదాహరణకు దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ క్రింది ఆయత్‌ని గమనించండి:

وَاعْبُدُوا اللَّهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا

1. “మీరంతా అల్లాహ్‌కు దాస్యం చెయ్యండి. ఎవరినీ ఆయనకు భాగస్వాములుగా చేయ వద్దు.” (అన్‌ నిసా 4:36)

فَلَا تَجْعَلُوا لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ

2. “ఇది మీకు తెలిసినప్పుడు ఇతరులను అల్లాహ్‌కు సమానులుగా నిలబెట్టకండి.” (అల్‌ బఖర 2:22)

ప్రశ్న : ప్రతి ఒక్కరూ అవశ్యంగా తెలుసుకోవలసిన మూడు ముఖ్య సూత్రా లేమిటి?

జవాబు :

  • 1. తమ పోషకుని (రబ్‌) తెలుసుకోవటం,
  • 2. తన నిజధర్మమైన ఇస్లాంను తెలుసుకోవటం,
  • 3. తన  ప్రవక్తయగు హజ్రత్‌ ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను తెలుసుకోవటం.

ప్రశ్న : నీ ప్రభువు (పోషకుడు) ఎవరు?

జవాబు : నా ప్రభువు అల్లాహ్‌. ఆయనే నన్నూ మరియు సమస్తలోక వాసులను తన అనుగ్రహంతో పోషిస్తున్నాడు. ఆయనే నా ఆరాధ్య దైవం. ఆయన తప్ప నాకు మరో ఆరాధ్యుడు లేడు.

ప్రశ్న : దీనికి నిదర్శనం ఏమిటి?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని తొలి వాక్యమే దీనికి నిదర్శనం –

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ

“ప్రశంసలు, పొగడ్త లన్నీసర్వలోకాలపాలకుడు, పోషకుడు అయిన అల్లాహ్‌కే శోభిస్తాయి.” (సూరా ఫాతిహా 1:1)

అల్లాహ్‌ తప్ప మిగిలినదంతా లోకంగా పరిగణించడుతుంది. నేను కూడా ఈ లోకంలో ఒక వ్యక్తిని.

ప్రశ్న : నీవు నీ ప్రభువును ఎలా తెలుసుకోగలిగావు?

జవాబు : నేను నా ప్రభువును ఆయన నిదర్శనాల ద్వారా తెలుసుకోగలిగాను. ఆయన సృష్టితాల ద్వారా, రేయింబవళ్ల ద్వారా, సూర్యచంద్రుల ద్వారా, భూమ్యా కాశాల ద్వారా, అందలి ప్రాణుల ద్వారా భూమ్యాకాశాలలో సంచరించే జీవుల ద్వారా తెలుసుకోగలిగాను.

ప్రశ్న : దీనికి నిదర్శనం ఏమిటీ?

وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ

“ఈ రేయింబవళ్లూ, ఈ సూర్య చంద్రులు అల్లాహ్‌ సూచనలలోనివే. సూర్యచంద్రులకు సాష్టాంగ పడకండి. వాటిని సృజించిన అల్లాహ్ కు సాష్టాంగ పడండి – నిజంగానే మీరు ఆయనను ఆరాధించేవారే అయితే.” (హామీమ్‌ అస్‌ సజ్‌దా  31:37)

إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ

“వాస్తవంగా మీ ప్రభువు అల్లాహ్ యే. ఆయన ఆకాశాలనూ, భూమినీ ఆరు దినాలలో సృష్టించాడు. తరువాత తన రాజ్యపీఠాన్ని అలంకరించాడు. రాత్రిని పగటిపై కప్పి వేస్తాడు. ఆ తరువాత పగలు రాత్రి వెంట పరుగులు తీస్తూ ఉంటుంది. ఇంకా ఆయన సూర్యుణ్జి, చంద్రుణ్ణి, నక్షత్రాలను పుట్టించాడు. అన్నీ ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. తెలుసుకోండి! సృష్టి ఆయనదే. దానిపై ఆధిపత్యమూ ఆయనదే. అల్లాహ్‌ అనంతమయిన  శుభాలు కలవాడు. సకల లోకాలకు ప్రభువు. (అల్‌ అరాఫ్ 7:54)

ప్రశ్న : ‘రబ్‌’ అని ఎవరిని అంటారు?

జవాబు : యజమాని, స్వామి మరియు శూన్యంలో నుంచి అస్థిత్వాన్ని తీసుకువచ్చే వానిని ‘రబ్’ అని అంటారు.అటువంటి శక్తిమంతుడే యదార్దానికి పూజనీయుడు.

ప్రశ్న : ఈ మేరకు ఏదన్నా నిదర్శనం ఉందా?

జవాబు : ఉంది. దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వాక్యాన్ని పరిశీలించండి –

“మానవులారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. దీనిద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. మీ కొరకు భూమిని పాన్పు గాను, ఆకాశాన్ని కప్పు గానూ సృష్టించినవాడూ, పైనుండి వర్షాన్ని కురిపించి తద్వారా అన్ని రకాల పంటలు పండే ఏర్పాటు చేసినవాడూ ఆయనే. ఇది మీకు తెలిసినప్పుడు ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాములుగా నిలబెట్టకండి.” (అల్‌ బఖర 2:21-22)

అందుచేతఈవస్తువులను ఎవరు సృష్టించాడో అతడే ఆరాధనలు,దాస్యానికి అర్హుడు.

ప్రశ్న : ‘“ఇబాదత్‌’ అని దేనినంటారు?

జవాబు : ఆరాధ్యుని సమక్షంలో అశక్తతతో, అణకువతో, వినమ్రతతో, ప్రేమాతి శయంతో మెలగటాన్ని “ఇబాదత్‌’ అని అంటారు. వేరే మాటల్లో చెప్పాలంటే దాసుడు దేవుని ప్రసన్నతను చూరగొనడానికి, ఆయన్ని సంతృప్తిపరచడానికి చేసే ఇబాదత్‌ లేక ఆరాధన.

ప్రశ్న : అల్లాహ్‌ ఎన్ని రకాల ఆరాధనలు చేయమని ఆజ్ఞాపించాడు?

జవాబు : ఎన్నో రకాల ఆరాధనలు చేయమన్నాడు. వాటిలో ఇస్లాం, ఈమాన్‌, ఇహ్సాన్‌, దుఆ, భయము, దైవాన్ని కలుసుకోవాలన్న కుతూహలం, కఠోర పరిశ్రమ, అభ్యాసం, ఆశ, అణకువ, దైవంపై భారం మోపటం, ఖుర్బానీ, ఉపవాసం, మొక్కుబడి లాంటివే గాకుండా ఇంకా అనేక ఆరాధనలున్నాయి. వాటిని చేయ మని అల్లాహ్‌ ఆదేశించాడు. మరి ఇవన్నీ అల్లాహ్‌కే ప్రత్యేకం అన్న సంగతిని మరువరాదు.

ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటీ?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వచనం గమనించండి.

“మస్జిద్లు అల్లాహ్‌కు మాత్రమే ప్రత్యేకం. కనుక వాటిలో అల్లాహ్‌తో పాటు మరొకరిని వేడుకొనరాదు.” (సూరె జిన్‌-18)

ఇంకా ఇలా అనబడింది :

“నీ ప్రభువు నిర్ణయం చేసేశాడు – మీరు కేవలం ఆయనను తప్ప మరెవరినీ ఆరా ధించకండి.” (బనీ ఇస్రాయీల్‌ – 23)

ప్రశ్న : ఎవరయినా వీటిలో దేనిననయినా దైవేతరుల కోసం ప్రత్యేకించినట్టయితే ఏమవుతుంది?

జవాబు : ఎవరయినా వీటిలో దేనినయినా దైవేతరుల కొరకు ప్రత్యేకిస్తే వారు ముష్రిక్‌లు (బహు దైవోపాసకులు) అయిపోతారు.

ప్రశ్న : ఏమిటీ దీనికీ ఆధారం?

జవాబు : దీనికి ఆధారంగా అల్లాహ్‌ ఈవిధంగా సెలవిచ్చాడు –

“ఎవడయినా అల్లాహ్‌తోపాటు మరొక ఆరాధ్యుణ్జి కూడా వేడుకుంటే, దానికి అతని వద్ద ఏ ప్రమాణమూ లేదు.అతని లెక్క అతని ప్రభువు వద్దఉన్నది. అటువంటి అవిశ్వాసులు ఎన్నటికీ సాఫల్యం పొంద లేరు.” (అల్‌ మూమినూన్‌ – 117)

ప్రశ్న : దుఆ (వేడుకోలు)కూడా ఆరాధనే (దాస్యమే) నన్నదానికి ఏమిటీ నిదర్శనం?

జవాబు : అల్లాహ్‌ దివ్య ఖుర్‌ఆన్‌లో ఈవిధంగా సెలవిచ్చి ఉన్నాడు –

“మీ ప్రభువు స్పష్టంగా చెప్పేశాడు : మీరు నన్ను పిలవండి. నేను మీ మొరను వింటాను మరియు ఆమోదిస్తాను. ఎవరయితే నా ఆరాధన యెడల తలబిరుసుతనం ప్రదర్శిస్తారో వారు త్వరలోనే పరాభవంపాలై నరకంలో ప్రవేశిస్తారు.” (….) ఇదిలా వుండగా “అద్దుఆవు ముఖ్ఖల్‌ ఇబాద” (ఈ హదీస్‌ జయీఫ్‌ ఉన్నది.) (దుఆ ఆరాధన యొక్క సారం) అని మహనీయ ముహమ్మదు (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ప్రబోధించారు. వేరొక సహీ హదీసులో “అద్దుఆవు హువల్‌ ఇబాద‘ (దుఆయే అసలు ఆరాధన) అని ఉంది

ప్రశ్న : ఖౌఫ్‌ (భయము, భీతి) కూడా ఆరాధనే నన్నదానికి నిదర్శనం ఏమిటీ?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వచనమే దీనికి నిదర్శనం –

“కనుక మీరు నిజమయిన విశ్వాసులే అయితే ఇక ముందు మానవులకు భయ పడకండి. నాకు భయపడండి.” (ఆలి ఇమ్రాన్‌ – 175)

ప్రశ్న : ‘రజా’ (దైవాన్ని కలుసుకునే కుతూహలం) కూడా ఆరాధనే అన్న దానికి నిదర్శనం ఏమిటీ?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని క్రింది వచనమే దీనికి నిదర్శనం –

“కనుక తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. ఆరాధనలో తన ప్రభువుతోపాటు మరెవ్వరినీ చేర్చకూడదు.” (అల్‌ కహఫ్‌ – 110)

ప్రశ్న : ‘తవక్కుల్‌ (దైవంపై గల నమ్మకం, దైవంపై భారం వేయటం) కూడా ఆరాధనేనన్న దానికి రుజువు ఏమిటీ?

జవాబు : దీనికి రుజువు ఇది-

1. “మీరు నిజంగానే విశ్వాసులయితే అల్లాహ్‌పై భారం వెయ్యండి.” (అల్ మాయిద – 23)
2. “ఎవరయితే అల్లాహ్‌ పై భారం వేస్తాడో అతని కొరకు ఆయన చాలు.” (తలాక్‌- 5)

ప్రశ్న : కఠోర పరిశ్రమ, అభ్యాసం, ఆశ, అణకువ వంటివి కూడా ఆరాధనే నన్న దానికి ఆధారం ఏమిటీ?

జవాబు : దీనికి ఆధారం ఇదే –

“వారు సత్కార్యాల కోసం ఎంతగానో ప్రయాస పడతారు. ఆశతోనూ, శ్రద్ధాభక్తుల తోనూ మమ్మల్ని ప్రార్థిస్తారు. మా సమ క్షంలో అణగిమణగి ఉంటారు.”(అంబియా – 90)

ప్రశ్న : “ఖషియత్‌’ (భయము, భక్తి) కూడా ఆరాధనే అనే దానికి ఆధారంఏమిటీ?

జవాబు : దీనికి ఆధారం దివ్య గ్రంథంలోని ఈ క్రింది వచనం. ఇందులో అల్లాహ్‌ తన దాసులను ఉద్దేశ్యించి ఏమంటున్నాడో చూడండి –

“కనుక మీరు వారికి భయపడకండి. నాకు భయపడండి.” (అల్‌ మాయిద – 3)

ప్రశ్న : ‘ఇనాబత్’ (మరలటం,రుజువు కావటం) కూడా ఆరాధనే అన్న దానికి నిదర్శనం ఏమిటీ?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ క్రింది వచనం దీనికి నిదర్శనం –

“మీ మీదకు శిక్ష రాకముందే, మీకు ఎవరినుండీ సహాయం లభించని పరిస్థితి ఏర్పడక ముందే మీరు మీ ప్రభువు వైపునకు మరలి, ఆయనకు విధేయత చూపండి.” (అజ్‌ జుమర్‌ – 54)

ప్రశ్న : ‘ఇస్తెఆనత్‌’ (సహాయం అర్థించటం) కూడా ఆరాధనే అనడానికి ఆధారం ఏమిటీ?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ ప్రార్థనే దీనికి నిదర్శనం :

“(దేవా!) మేము నిన్నే ఆరాధిస్తున్నాము. సహాయం కొరకు నిన్నే అర్థిస్తున్నాము.” (అల్‌ ఫాతిహా – 4)

ఇంకా – హదీసులో ఇలా ఉంది :
“నువ్వు ఏదైనా అర్థించటమే జరిగితే అల్లాహ్‌ను అర్ధించు.”

ప్రశ్న : ‘“ఇస్తెఆజ’ (శరణు కోరటం) కూడా ఆరాధనే ననడానికి ఆధారం ఏమిటీ?

జవాబు : ‘ఇస్తెఆజ’ కూడా ఆరాధనే అనడానికి ఆధారం ఇది :

ఇలా అను,”నేను మానవుల ప్రభువు, మానవుల చక్రవర్తి, మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్‌) శరణు కోరుతున్నాను.

ప్రశ్న : ‘ఇస్తెగాస’ (ఫిర్యాదు లేక విన్నపం చేసుకోవటం) కూడా ఆరాధనే అనడానికి ఏమిటీ నిదర్శనం?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ క్రింది వచనమే దీనికి నిదర్శనం –

“ఇంకా మీరు మీ ప్రభువును నహాయం కొరకు విన్నవించుకున్న సందర్భాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి. సమాధానంగా అప్పుడు ఆయన ఇలా సెలవిచ్చాడు : “నేను మీ సహాయం కొరకు వెయ్యిమంది దైవదూతలను ఒకరి తరువాత ఒకరిని ఎడతెగకుండా పంపుతున్నాను.” (అన్‌ ఫాల్‌ – 9)

ప్రశ్న : ఒకరి పేరుమీద జిబహ్‌ చేయటం (బలి ఇవ్వటం) కూడా ఆరాధనే అన్న దానికి ఏమిటి ఆధారం?

జవాబు : దేవుని ఈ ఉపదేశమే దీనికి ఆధారం :

“(ఓ ప్రవక్తా!) ఇలా ప్రకటించు : నా నమాజ్‌, నా సకల ఉపాసనా రీతులు, నా జీవనం, నా మరణం-సమస్తమూ సకల లోకాలకూ ప్రభువైన అల్లాహ్‌ కొరకే. ఆయన కు ఏ భాగ స్వామీ లేడు. ఈ ఆజ్ఞయే నాకు ఇవ్వ బడింది. అందరికంటే ముందు విధేయ తతో తలవంచే వాణ్జి నేనే.” (అల్‌ అన్‌ ఆమ్‌ – 162)

ప్రశ్న : మొక్కుకోవటం కూడా ఆరాధనేనన్నదానికి ఆధారమేమిటి?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ ఉపదేశమే దీనికి ఆధారం-

“వారు ఎలాంటి వారంటే (ప్రపంచంలో) మొక్కుబడి చెల్లించేవారు,నలువైవుల నుంచీ ఆపదలు కమ్ముకుని వచ్చే దినానికి భయపడేవారు.” (అల్ ఇన్సాన్  – 7)

ప్రశ్న : రెండవ ప్రధానాంశం ఏమిటీ?

జవాబు : ఇస్లాం ధర్మాన్ని ఆధారాలతో సహా తెలుసుకోవటం.

ప్రశ్న : ఇస్లాం అంటే ఏమిటీ?

జవాబు : ఇస్లాం అంటే స్వచ్భమైన ఏక దైవారాధనతోపాటు, బేషరతుగా అల్లాహ్‌కు లొంగిపోవటం, పూర్తిగా సమర్చించుకోవటం,దైవాజ్ఞాపాలన చేయటం, ఆయనకు విధేయత చూపటం, బహు దైవారాధనతో, బహు దైవారాధకులతో తెగతెంపులు చేసుకోవటం.

ప్రశ్న : ఇస్లాం ధర్మంలో గల అంతస్థులు ఎన్ని? అవి ఏవి?

జవాబు : ఈ అంతస్థులు మూడు. 1. ఇస్లాం 2. ఈమాన్‌ 3. ఇహ్సాన్. ప్రతి అంతస్థు లేక స్థాయిలో కొన్ని ప్రధానాంశాలు ఉన్నాయి.

ప్రశ్న : ఇస్లాంలోని ప్రధానాంశాలు – మౌలికాంశాలు – ఎన్ని?

జవాబు : ఐదు.

  • 1. అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యదైవం లేడనీ, ముహమ్మద్‌ – (సల్లల్లాహు అలైహి వ సల్లం) దైవప్రవక్తయనీ సాక్ష్యమివ్వడం.
  • 2. నమాజ్‌ను నెలకొల్పటం.
  • 3. జకాత్‌ అనే విధిగా చెల్లించవలసిన దానాన్ని చెల్లించటం.
  • 4. రమజాన్‌ నెలలో విధిగా ఉపవాసాలుండటం.
  • 5. (స్థోమత ఉంటే) హజ్‌ చేయటం.

ప్రశ్న : అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్య దైవం లేడన్న  సాక్ష్యానికి నిదర్శనం ఏమిటీ?

జవాబు : దివ్య గ్రంథమైన ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు :

“తాను తప్ప మరొక దైవం లేడు అనే సత్యానికి స్వయంగా అల్లాహ్‌యే సాక్ష్యమిచ్చాడు. దైవదూతలు, సమస్త జ్ఞానులు కూడా ఆ మహాశక్తిమంతుడూ, ఆ మహాజ్ఞానీ తప్ప వాస్తవానికి మరొక  దైవం లేడు అని నిజాయితీగానూ, న్యాయంగానూ సాక్ష్యమిస్తారు.” (ఆలి ఇమాన్‌ – 18)

ప్రశ్న : “లా ఇలాహ ఇల్లల్లాహ్‌” అంటే భావం ఏమిటీ?

జవాబు : అల్లాహ్‌ తప్ప మరొక ఆరాధ్యుడు, పూజ్యుడు లేడనీ, ఆయనే నిజ దైవమనీ భావం.

ప్రశ్న : “లా ఇలాహ్‌” అంటే….?

జవాబు : అల్లాహ్‌ తప్ప ఇతర దైవాలను వదలి వేయటం, త్రోసి పుచ్చటం అని భావం.

ప్రశ్న : “ఇల్లల్లాహ్‌” అంటే భావం ఏమిటీ?

జవాబు : ఆరాధన, దాస్యం, పూజలకు అల్లాహ్‌యే తగినవాడనీ, దాస్యంలో ఆయనకు సహవర్తులు ఎవరూ లేరని ఆచరణ ద్వారా రుజువు చేయటం.

ప్రశ్న : ఈ విషయాన్ని విడమరచి చెప్పేదేమైనా ఉందా?

జవాబు : అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు-

“ఇబ్రాహీమ్‌ తన తండ్రికీ, తన జాతివారికీ ఇలా చెప్పిన ఆ సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకో, “మీరు పూజిస్తున్నవాటితో నాకు ఏ సంబంధమూ లేదు. నా సంబంధం కేవలం నన్ను సృష్టించిన వానితోనే ఉన్నది. ఆయనే నాకు మార్గం చూపుతాడు.” ఇబ్రాహీమ్‌ ఈ వచనాన్నే తన తరువాత తన సంతానం కోసం విడిచివెళ్లాడు, వారు దాని వైపునకు మరలేందుకు.” (అజ్‌ జుఖ్రుఫ్‌ : 26-28)

మరోచోట ఇలా సెలవిచ్చాడు

“ప్రవక్తా! ఇలా చెప్పు : “గ్రంథం కల ప్రజలారా! మాకూ మీకూ మధ్య సమానమైన ఒక విషయం వైపునకు రండి. (అది ఏమి టంటే) మనం అల్లాహ్‌కు తప్ప మరెవరికీ దాస్యం చెయ్యరాదు. ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ నిలబెట్టరాదు. మనలోని వారెవరూ అల్లాహ్‌ను తప్ప మరెవరినీ తమ ప్రభువుగా చేసుకోరాదు అనేది.”ఈ సందేశాన్ని స్వీకరించటానికి వారు వైముఖ్యం కనబరిస్తే వారితో స్పష్టంగా ఇలా అను:”మేము ముస్లింలము (కేవలం అల్లాహ్‌కే దాన్యం చేసేవారు, విధేయత చూపేవారు) అనే విషయానికి మీరు సాక్షులుగా ఉండండి.” (ఆలి ఇమ్రాన్‌ – 64)

ప్రశ్న: ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) దైవప్రవక్త అన్నసాక్ష్యానికి ఆధారం ఏమిటీ?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ దైవోపదేశమే ఇందుకు ఆధారం-

“చూడండి! మీ వద్దకు ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన స్వయంగా మీలోనివాడే. మీరు తీవ్రంగా నష్టానికి గురికావటం అనేది ఆయనకు కష్టం కలిగిస్తుంది. మీ సాఫల్యాన్నిఆయన తీవ్రంగా కాంక్షిస్తాడు. విశ్వాసులపై ఆయన వాత్సల్యం కలవాడు, కారుణ్యం కలవాడు.” (అత్‌ తౌబా – 128)

అల్లాహ్‌ ఇంకా ఈ విధంగా స్పష్టం చేశాడు –

“ముహమ్మద్‌ అల్లాహ్‌ ప్రవక్త. ఆయనవెంట ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులు గానూ ఉంటారు,పరస్పరం కరుణామయులు గానూ ఉంటారు.”(అల్‌ ఫతహ్‌ – 29)

ప్రశ్న: ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవప్రవక్త (రసూలుల్లాహ్‌) అని సాక్ష్యమివ్వ డంలోని మతలబు ఏమిటీ?

జవాబు : దీని మతలబు ఏమిటంటే; ఆయన ఆదేశాలను పాలించాలి, ఆయన ఏ విషయం చెప్పినా దాన్ని సత్యమని ధృవీకరించాలి. ఆయన వారించిన వాటికి దూరంగా ఉండాలి. ఆయన చూపిన షరీయత్‌ కనుగుణంగా దైవారాధన చేయాలి.

ప్రశ్న: నమాజ్‌, రోజా గురించి ఏం ఆధారముంది? తౌహీద్‌కు గల తాత్పర్యం ఏమిటీ?

జవాబు : అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చి ఉన్నాడు :

“వారు అల్లాహ్‌కు దాస్యం చెయ్యాలని, పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్నిఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్‌ను స్థాపించాలనీ, జకాత్‌ ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి (గ్రంథ వహులకు) ఆదేశించటం జరిగింది. ఇదే సరియైన, సవ్యమైన ధర్మం (అని వారికి స్పష్టం చేయబడింది). (అల్‌ బయ్యిన – 5)

ప్రశ్న : “రోజా” (ఉపవాసం)కు ఆధారమేమన్నా ఉందా?

జవాబు : ఉంది. దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వచనం చదవండి :

“విశ్వసించిన ఓ ప్రజలారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది -ఏ విధం గా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి కూడా విధించబడిందో. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది.” (అల్‌ బఖర : 183)

ప్రశ్న : హజ్‌ చేయాలి అన్న దానికి ఆధారం ఏమిటీ?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లో హజ్‌ గురించి ఇలా సెలవీయబడింది : “ప్రజలపై అల్లాహ్‌కు ఉన్న హక్కు ఏమిటంటే, ఈ గృహానికి వెళ్ళే శక్తి గలవారు దాని హజ్‌ను విధిగా చేయాలి. ఈ ఆజ్ఞను పాలించడానికి తిరస్కరించేవాడు, అల్లాహ్‌కు ప్రపంచ ప్రజల అవసరం ఎంత మాత్రం లేదు అని స్పష్టంగా తెలుసు కోవాలి.” (ఆలి ఇమ్రాన్‌ – 97)

ప్రశ్న : ఇస్లాం ధర్మం యొక్క  రెండవ అంతస్థు ఏది?

జవాబు : ఈమాన్‌ (విశ్వాసం).

ప్రశ్న: ఈమాన్‌ శాఖలు (విభాగాలు) ఎన్ని?

జవాబు : ఈమాన్‌ శాఖలు డెబ్బయికి పైగా ఉన్నాయి. వాటిలో అన్నిటికన్నా ఉన్నతమైనది “లా ఇలాహ ఇల్లల్లాహ్‌. అన్నిటికన్నా తక్కువ స్థాయిగల శాఖ “దారిలో పడి ఉన్న బాధాకరమైన వస్తువులను తొలగించటం.” లజ్జ మరియు వ్రీడ కూడా ఈమాన్‌లో అంతర్భాగమే.

ప్రశ్న : ఈమాన్‌లోని ప్రధానాంశాలు ఎన్ని? అవి ఏవి?

జవాబు : ఈమాన్‌లోని ప్రధానాంశాలు ఆరు. అవి

  • 1. అల్లాహ్‌పై విశ్వాసం
  • 2. దైవదూతలపై విశ్వాసం
  • 3. దైవం తరఫున అవతరింపజేయబడిన గ్రంథాలపై విశ్వాసం
  • 4. దైవప్రవక్తలపై విశ్వాసం
  • 5. అంతిమ దినంపై విశ్వాసం
  • 6. మంచి జరిగినా, చెడు జరిగినా-అంతా దైవం తరఫుననే జరుగుతుంది అనే దాని (విధి వ్రాత)పై విశ్వాసం.

ప్రశ్న : ఏమిటీ దీనికి ఆధారం?

జవాబు : ఆధారం కావాలంటే దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వచనాన్ని చదవండి. “సత్కార్యం అంటే మీరు మీ ముఖాలను తూర్పుకో, పడమరకో త్రిప్పటం కాదు, సత్కార్యం అంటే మనిషి అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ, దూతలనూ, అల్లాహ్‌ అవతరింపజేసిన గ్రంథాన్నీఆయన ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించటం.” (అల్‌ బఖర : 127)

ప్రశ్న : ‘విధి’ (తక్‌దీర్‌) అనే దానికి ఆధారం ఏమిటీ?

జవాబు : దీనికి ఆధారం దివ్య గ్రంథంలోని ఈ వచనం –

“మేము ప్రతి వస్తువునూ ఒక విధి నిర్ణయం తోపాటు సృష్టించాము.” (అల్‌ ఖమర్‌ – 49)

ప్రశ్న : ఇస్లాం ధర్మం యొక్క మూడవ అంతస్థు ఏది?

జవాబు : ఇస్లాం మూడవ అంతస్థు ‘ఇహ్సాన్.”

ప్రశ్న : “ఇహ్సాన్’ అంటే అసలేమిటీ?

జవాబు : మీరు అల్లాహ్‌ను చూస్తున్నామన్న భావనతో ఆరాధన చేయండి. లేకుంటే, ఆయన మిమ్మల్నిచూస్తున్నాడన్న తలంపుతోనయినా ఆరాధన చేయండి. అంటే ఏ ఆరాధననైనా ఉత్తమ రీతిలో నిర్వర్తించటమే అసలు ఇహ్సాన్ అన్నమాట.

ప్రశ్న: దీనికి ఆధారం ఏమిటి?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని క్రింది ఆయతే దీనికి ఆధారం.

“భయభక్తులతో పనిచేస్తూ, ఉదాత్త వైఖరి కలిగి ఉండే వారితో అల్లాహ్‌ ఉంటాడు.” (అన్‌ నహ్ల్ -128)

మరో చోట అల్లాహ్‌ ఈ విధంగా ప్రబోధించాడు –

“మహా శక్తిమంతుడైన ఆ అనంతకరుణామయుడిపై భారం మోపు. ఆయన నిన్ను, (నీవు) లేచినవుడు చూస్తాడు, సజ్‌దా చేసేవారిలో నీ రాకపోకలను గమనిస్తాడు. ఆయన అన్నీ వింటాడు, అన్నీ తెలిసిన వాడు.”(అష్‌ షుఅరా: 217-220)

వేరొక చోట ఇలా సెలవీయబడింది-

“ప్రవక్తా! నీవు ఏ స్థితిలో ఉన్నాఖురాను నుండి దేనిని వినిపించినా, మానవులారా! మీరుఏది చేసినా ఆ అన్ని సందర్భాలలోనూ మేము మిమ్మల్నిచూస్తూనే ఉంటాము” (యూనుస్‌-61)

ప్రశ్న: ఇస్లాం ధర్మానికి చెందిన ఈ మూడు మెట్లకు (ఇస్లాం, ఈమాన్‌ ఇహ్సాన్‌)కి సంబంధించి హదీసు లేక సున్నతులో కూడా ఏమైనా ఆధారముందా?

జవాబు : ఉంది. హదీసె జిబ్రయీల్‌గా ఖ్యాతి చెందిన ఆ హదీసును హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (రజి అల్లాహు అన్హు) ఈ విధంగా తెలిపారు-

“మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమక్షంలో కూర్చుని ఉన్నాము. అంతలో ఒక వ్యక్తి వచ్చాడు. అతని దుస్తులు ఎంతో పరిశుభ్రంగా ఉన్నాయి. జుట్టు నల్లగా ఉంది. మరి అతనిలో ప్రయాణ బడలిక కూడా కనిపించలేదు. మాలో ఎవరూ అతన్ని ఎరుగరు. ఆ వ్యక్తి దైవవ్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ఎదుటకూర్చున్నాడు.తన మోకాళ్లను ఆయన మోకాళ్లకు ఆనించి మరీ కూర్చున్నాడు. తన అరచేతులను ఆయన తొడలపై ఉంచి, ‘ఓ ముహమ్మద్‌! నాకు ఇస్లాం గురించి తెలియజేయండి’ అని అన్నాడు. “నీవు అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని సాక్ష్యమివ్వాలి.ముహమ్మద్‌ అల్లాహ్‌ సందేశహరుడని కూడా నీవు సాక్ష్యమివ్వాలి.నమాజ్‌ను స్థాపించాలి. జకాత్‌ ఇవ్వాలి.రమజాన్‌ నెలలో ఉపవాసాలుండాలి. స్థోమత ఉంటే దైవ గృహాన్ని సందర్శించి హజ్‌ చేయాలి’ అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివరించారు.’తమరు చెప్పింది నిజం’ అన్నాడా వ్యక్తి.మాకు ఆశ్చర్యం కలిగించింది అతని ప్రవర్తన. ప్రశ్నించేవాడూ అతనే, సమాధానాన్ని సత్యమని ధృవీకరించేవాడూ అతనే. “నాకు ఈమాన్‌ గురించి వివరించండి’ అని తిరిగి ప్రశ్నించాడా పృచ్చకుడు. దానికాయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), “నీవు అల్లాహ్‌ను,ఆయన దూతలను, ఆయన (గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని, మంచి జరిగినా చెడు జరిగినా అంతా దైవం తరఫుననే జరుగుతుందన్న విధివ్రాతను విశ్వసించు.ఇదే ఈమాన్‌’ అని వివరించారు. “నాకు ఇహ్సాన్‌ గురించి చెప్పండి’ అని మళ్లీ ప్రశ్నించాడా అపరిచితుడు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా విడమరచి చెప్పారు: “నీవు అల్లాహ్‌ను చూస్తున్నానన్న (అల్లాహ్‌ ఎదుట ఉన్నాడన్న) భావంతో ఆయన్ని ఆరాధించు.ఒకవేళ నీవు ఆయన్ని చూడ లేకపోయినా, ఆయన నిన్ను చూస్తున్నాడన్న తలంపు నీలో ఉండాలి.” “నాకు ప్రళయదినం గురించి చెప్పండి” అని అడిగాడు ఆ అపరిచిత వ్యక్తి. ‘దాని గురించి ప్రశ్నించబడే వానికి ప్రశ్నించేవానికన్నా ఎక్కువేమీ తెలీదు” అన్నారాయన (సల్లలాహు అలైహి వ సల్లం) . “పోనీ నాకు దాని సూచనలయినా తెలుపగలరా?!’ అని ఇంకో ప్రశ్న వేశాడు అతను. దానికాయన ఇలా చెప్పారు: “దాసీ (బానిసరాలు, పని మనిషి తన యజమానురాలికి జన్మనిస్తుంది. కాళ్లకు చెప్పులు, శరీరంపై చొక్కా లేకుండానే గొర్రెల్ని కాచే గొర్రెల కాపరులు బ్రహ్మాండమైన కట్టడాలు కట్టడం నీవు చూస్తావు. మరి ఆ వ్యక్తి అక్కణ్ణుంచి నిష్క్రమించాడు. మేము కాస్సేపు మౌనం వహించాము. తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) “ఓ ఉమర్‌! ప్రశ్నలు వేసిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా?!’అని అడిగారు. ‘దైవానికి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కే తెలిసి ఉండాలి అని మేము విన్నవించుకున్నాము. “ఆయన జిబ్రయీల్‌. మీకుమీ ధర్మాన్ని బోధించే నిమిత్తం ఆయన మీ వద్దకు విచ్చేశారు” అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు. (సహీహ్‌ ముస్లిం)

ప్రశ్న : మూడవ ముఖ్యాంశం ఏమిటి?

జవాబు : మహనీయ ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి గురించి. ఆయన ముహమ్మద్‌ బిన్‌ అబ్దుల్లాహ్  బిన్‌ అబ్దుల్ ముత్తలిబ్‌ బిన్‌ హాషిమ్‌ ఖురైష్‌ తెగకు చెందిన వారు. ఖురైషులు అరబ్బులు. మరి ఈ అరబ్బులు దైవప్రవక్తలయిన హజ్రత్‌ ఇబ్రాహీమ్‌, హజ్రత్‌ ఇస్మాయీల్‌ (అలైహిస్సలాం)ల సంతతికి చెందిన వారు.

ప్రశ్న : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వయస్సు గురించి చెబుతారా?

జవాబు : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) 63 సంవత్సరాలు జీవించి ఉన్నారు.40 ఏళ్ల వయస్సులో దైవప్రవక్తగా నియుక్తులయ్యారు. దైవప్రవక్తగా 23 సంవత్సరాలు మానవ జాతికి మార్గదర్శకత్వం వహించారు. సూరె ‘ఇఖ్రా’తో దైవదౌత్య శుభవార్త అందింది. సూరె ‘ముద్దస్సిర్’ అందిన క్షణం నుంచి సందేశకార్యానికి నడుం బిగించారు.ఆయన మక్కాలో జన్మించారు. మక్కా నుండి మదీనాకు ప్రస్థానం (హిజ్రత్) చేశారు. మదీనాలోనే ప్రభువు వద్దకు మహా ప్రస్థానం చేశారు.

ప్రశ్న : అల్లాహ్‌ ఆయన్ని దేని కొరకు పంపాడు?

జవాబు : మానవ జాతిని షిర్క్‌ (బహు దైవారాధన) నుండి రక్షించడానికి, ఏకేశ్వరోపాసనని బోధించడానికి అల్లాహ్‌ ఆయన్ని పంపాడు.

ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటి?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని క్రింది వచనాలు దీనికి స్పష్టమైన ఆధారాలు. “వస్త్రం కప్పుకుని పడుకున్న మనిషీ! లే; లేచి హెచ్చరించు. నీ ప్రభువు ఘనతను చాటి చెప్పు. నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో, అశుద్ధతకు దూరంగా ఉండు. ఎక్కువగా పొందాలనే కాంక్షతో ఉపకారం చేయకు.నీ ప్రభువు కొరకు ఓర్పు వహించు.” (అల్‌ ముద్దస్సిర్‌ : 1- 7)

ప్రశ్న : “లే,లేచిహెచ్చరించు” అన్న మాటల్లోని అంతరార్థం ఏమిటి?

జవాబు : దీని అంతరార్థం ప్రజలకు షిర్క్‌ గురించి హెచ్చరించమనీ,తౌహీద్‌ను ఉపదేశించమనీను.

ప్రశ్న: “నీ ప్రభువు ఘనతను చాటిచెప్పు.నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో” అనడంలోని భావం ఏమిటి?

జవాబు : తౌహీద్‌ (ఏకేశ్వరోపాసన) ని స్వీకరించటం ద్వారా ప్రభువు గొప్పతనాన్ని అంగీకరించమనీ, ఆచరణలను షిర్క్‌ అనే మలినం నుండి కాపాడుకోమనీ భావం.

ప్రశ్న :“అశుద్ధతకు దూరంగా ఉండు” అనడంలోని ఔచిత్యం ఏమిటి?

జవాబు : విగ్రహాలను, విగ్రవారాధకులను విడిచిపెట్టేయమనీ, వాటితో తెగత్రెంపులు చేసుకోమనీ భావం.

ప్రశ్న : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా మలినమైన వాతావరణానికి దూరంగా ఎంత కాలం ఉన్నారు?

జవాబు : పదినంవత్సరాలు. ఆతరువాత మేరాజ్‌ యాత్ర ప్రాప్తించింది. ఆ సందర్భంగా ఐదు నమాజులు వొసగబడ్డాయి. నమాజు ద్వారా దైవ సహాయాన్ని అర్థించాలన్నది దీని అభిమతం.ఆ తరువాత ఆయన మదీనాకు వలసపోయారు (హిజ్రత్‌ చేశారు).

ప్రశ్న : హిజ్రత్‌ అంటే ఏమిటి?

జవాబు : హిజ్రత్‌ అంటే ప్రస్థానం చేయటం, ఒక చోటి నుండి మరో చోటికి వలసపోవటం! షిర్క్‌ వాతావరణం నుండి ఏకేశ్వరోపాసనా వాతావరణం వైపునకు, చెడులకు నిలయమైన చోటు నుండి స్వచ్చమయిన భావాల పరివ్యాప్తికి అనువైన చోటుకు, చెడు వ్యవస్థ నుండి సత్య ప్రధానమైన వ్యవస్థ వైపునకు తరలి వెళ్లటమే హిజ్రత్‌!

ప్రశ్న : హిజ్రత్‌ ఆజ్ఞ ఎప్పటికీ ఉంటుందా?

జవాబు : ఉంటుంది. షిర్క్‌, బిద్‌అత్‌ల కాలుష్యం నుండి తౌహీద్‌ మరియు సున్నత్‌ల పరిశుద్ధత వైపునకు, చెడు భావాల నుండి సవ్యమైన భావాల వైపునకు, చెడు సహచర్యం నుండి సద్వర్తనుల సహచర్యం వైపునకు తరలిపోవాలన్న ఆజ్ఞ అంతిమ దినం వరకూ ఉంటుంది సుమా!

ప్రశ్న : ఈ వాదనకు ఏదైనా ఆధారం ఉందా?

జవాబు : ఉంది దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వచనాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయండి-

తమ ఆత్మలకు అన్యాయం చేసుకుంటూ ఉండేవారి ప్రాణాలను తీసి, దైవదూతలు వారిని,’ఇదేమిటీ మీ స్థితి ఇలా ఉంది?’అని అడిగారు.అప్పుడు వారు ఇలా సమాధానం చెప్పారు; “మేము భూమిపై బలహీనులముగా, నిస్సహాయులముగా ఉండేవారము.”అల్లాహ్‌ భూమి విశాలముగా లేదా మీరు వలస పోవటానికి?’అని దైవదూతలు అడిగారు. వారి నివాసం నరకం. అది మహాచెడ్డ నివాసం.అయితే నిజంగానే నిస్సహాయులై బయలుదేరటానికి ఏ మార్గమూ, ఏసాధన సంపత్తీ లేని పురుషులనూ, స్రీలనూ పిల్లలనూ అల్లాహ్‌ క్షమించవచ్చు.(ఎందుకంటే) అల్లాహ్‌ ఎక్కువగా క్షమించేవాడూ అధికంగా మన్నించేవాడూను.” (అన్‌ నిసా- 97, 98)

ఇంకా ఇలా అనబడింది:

విశ్వసించిన నా దాసులారా! నా భూమి విశాలమైనది, కనుక మీరు నన్ను మాత్రమే ఆరాధించండి.” (అన్‌కబూత్‌ – 56)

ప్రశ్న : పై రెండు వచనాల అవతరణ యొక్క పూర్వ రంగం ఏమిటి?

జవాబు : మొదటి ఆయతు అవతరణా సందర్భం : మక్కాకు చెందిన కొంత మంది ఇస్లాం స్వీకరించారు. కాని వారు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తో పాటు హిజ్రత్‌ చేయలేక మక్కాలోనే ఉండి పోయారు. అటువంటి వారిలో కొంత మంది తమ విశ్వాసంపై నిలకడ కలిగి ఉండలేక, కాలం వేసే కళ్ళెంలో ఇరుక్కుని, పరిస్థితుల ఇంద్రజాలానికి మోసపోయారు. ఆఖరికి వారు బద్ర్‌ సంగ్రామంలో ముష్రిక్కుల పక్షాన నిలిచారు.అందుచేత అల్లాహ్‌ వారి వినతిని తోసిపుచ్చాడు. వారు ఒడిగట్టిన స్వామి ద్రోహానికి ప్రతిఫలంగా వారి కొరకు నరకాన్ని వొసగాడు. రెండవ వచనానికి పూర్వ రంగం ఏమంటే; మక్కాలో కొంతమంది ముస్లిములు హిజ్రత్ చేయలేక ఉండిపోయారు.అప్పుడు అల్లాహ్‌ వారి విశ్వాసాన్ని (ఈమాన్‌) వారికిజ్ఞాపకం చేసి హిజ్రత్‌ (ప్రస్థానం) వైపునకు పురికొల్పాడు.

ప్రశ్న : ‘హిజ్రత్‌’ ఒక శాశ్విత ప్రాతిపదిక గల ఆజ్ఞ అనడానికి హదీసులో ఆధారం ఏదన్నా ఉందా?

జవాబు : ఉంది. మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు:

“పశ్చాత్తాపం (ద్వారం)మూసుకునే దాకా హిజ్రత్‌ (ద్వారం) మూసుకొనదు.సూర్యుడు తను అస్తమించే చోటున ఉదయించే దాకా పశ్చాత్తాపం (ద్వారం కూడా) మూసుకొనదు సుమా!”

ప్రశ్నః మదీనా మునవ్వరాలో స్థిరపడిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు ఇచ్చిన ఆదేశాలు ఏవి?

జవాబు : మదీనాలో స్థిరపడగానే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇస్లాం యొక్క మిగిలిన ఆదేశాలను-అంటే; జకాత్‌, రోజా, హజ్‌, అజాన్‌ మరియు జిహాద్‌ తదితర ఆదేశాల ను జారీ చేశారు.

ప్రశ్న: ఈ విధంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతకాలం మదీనాలో ప్రజల జీవితాలను తీర్చిదిద్దారు?

జవాబు : 10 సంవత్సరాలు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పరమపదించారు. కాని ఆయన నెలకొల్పిన ధర్మం మాత్రం యథాతథంగా ఉంది. ఆయన మనకు అందజేయని శుభం లేదు. అన్ని రకాల హానికరమయిన వాటి నుండి ఆయన తన అనుచర సమాజాన్ని జాగరూకపరచి వాటికి దూరంగా ఉండాలని హెచ్చ రించారు.

ప్రశ్న : ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) మనకు తెలియజేసిన శుభం ఏది?ఆయన ఏ కీడు గురించి హెచ్చరించారు?

జవాబు : ఆయన మనకు తౌహీద్‌ (దేవుని ఏకత్వం) గురించి నొక్కి చెప్పారు. దైవానికి సమ్మతమయిన, ఇష్టకరమయిన వన్తువులేవో స్పష్టం చేశారు. ఇదంతా మన పాలిట మేలుగా, శుభంగా పేర్కొనబడుతుంది.

ఇకపోతే ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) , షిర్క్‌ (బహు దైవారాధన) గురించి గట్టిగా హెచ్చరించారు. దైవానికి సమ్మతం కాని, హానికరమయిన వస్తువులు ఏవేవో సూచించి వాటి యెడల మనందరినీ అప్రమత్తం చేశారు.

ప్రశ్న: అల్లాహ్‌ ఆయన్ని ఏదైనా ప్రత్యేక వర్గానికో, తెగకో ప్రవక్తగా చేసి పంపాడా?

జవాబు : అల్లాహ్‌ ఆయన్ని సమస్త మానవాళి కోసం ప్రవక్తగా చేసి పంపాడు. జిన్నులు మానవులంతా ఆయనకు విధేయత చూపటం తప్పనిసరి గావించాడు.

ప్రశ్న: దీనికి ఆధారం ఏమిటి?

జవాబు : దివ్యఖుర్‌ఆన్‌లోని ఈ ఆయత్‌ దీనికి ఆధారం-

(ఓ ముహమ్మద్‌!) ఇలా ప్రకటించు: నేను మీఅందరి వైపునకు వచ్చిన అల్లాహ్‌ సందేశహరుణ్ణి.” (అల్‌ బఖర : 158)

ఇంకా ఇలా అనబడింది –

“ఆ సంఘటన కూడా ప్రస్తావించదగినదే. అప్పుడు మేము జిన్నాతుల ఒక వర్గాన్ని ఖుర్‌ఆన్‌ వినేందుకు నీ వద్దకు తీసుకు వచ్చాము.” (అల్‌ అహ్‌ఖాఫ్‌ – 29)

ప్రశ్న : అల్లాహ్‌ ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ద్వారా ధర్మాన్ని పరిపూర్ణం గావించాడా? లేక ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) తదనంతరం ధర్మాన్ని పూర్తి చేశాడా?

జవాబు : అల్లాహ్‌ ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ద్వారా-ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) బ్రతికి ఉండగానే-ధర్మాన్ని పరిపూర్ణం గావించాడు. ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) తదనంతరం ధర్మంలో ఎలాంటి వస్తువునూ చేర్చవలసిన అవసరం లేదు.

ప్రశ్న : దీనికి ఆధారం ఏదన్నా ఉందా?

జవాబు : ఉంది. దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ ఆయత్‌ను చూడండి:

“ఈ రోజు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం గావించాను.ఇక దీనితో నా వరాలను కూడా పూర్తి చేశాను.ఇంకా ఇస్లాంను మీ జీవనధర్మంగా సమ్మతించాను.” (అల్‌ మాయిద – 3)

ప్రశ్న: ఆయన మరణించారనడానికి ఆధారం ఏమిటి?

జవాబు : ఆయన మరణం సత్యమనడానికి దివ్యఖుర్‌ఆన్‌లోని ఈవచనమే నిదర్శనం.

“(ఓ ప్రవక్తా!) నీవూ మరణిస్తావు. వారూ మరణిస్తారు.చివరకు ప్రళయం నాడు మీరంతా మీ ప్రభువు సమక్షంలో మీ మీ వ్యాజ్యాలను వినిపిస్తారు.”(అజ్‌ జుమర్‌ – 30)

ప్రశ్న : మరణించిన పిదప ప్రజలు మళ్లీ  బ్రతికించబడతారా?

జవాబు : అవును. బ్రతికించబడతారు. దివ్యఖుర్‌ఆన్‌లోని ఈ ఆయత్‌ని చూడండి. “ఈ నేల నుండే మేము మిమ్మల్ని సృష్టిం చాము, దాని లోనికే మేము మిమ్మల్ని తిరిగి తీసుకుపోతాము. దాని నుండే మిమ్మల్ని మళ్లీ వెలికి తీస్తాము.” (తాహా-55)

ఇంకా ఈ విధంగా సెలవీయబడింది.

“అల్లాహ్‌ మిమ్మల్ని భూమి నుండి చిత్ర విచిత్రంగా మొలిపించాడు. తరువాత ఆయన మిమ్మల్ని ఈ భూమిలోకే తిరిగి తీసుకుపోతాడు. మళ్లీ దానినుండే ఎకాఎకీ మిమ్మల్ని బయటకు తీసి నిలబెడతాడు.” (నూహ్‌ – 17)

ప్రశ్న : తిరిగి బ్రతికించబడిన తరువాత ప్రజల లెక్క తీసుకోబడుతుందా? వారికి శిక్షాబహుమానాలు లభిస్తాయా?

జవాబు : అవును.ప్రజల లెక్క తేల్చబడుతుంది.వారి కర్మలను బట్టి శిక్ష విధించటమో, బహుమానం ఒసగటమో జరుగుతుంది.దీనికి ఆధారం ఇది: “చెడు చేసే వారికి, అల్లాహ్‌ వారి కర్మలకు ప్రతిఫలం ఇచ్చేందుకు, సదాచరణ వైఖరి అవలంబించిన వారికి మంచి ప్రతిఫలం ప్రసాదించేందుకు (అల్లాహ్‌ ఉన్నాడు)”. (అన్‌ నజ్మ్‌ -31)

ప్రశ్న : మరణానంతర జీవితాన్ని త్రోసిపుచ్చిన వ్యక్తి గురించి ఏమనబడింది?

జవాబు : మరణానంతర జీవితాన్ని త్రోసిపుచ్చిన వాడు అవిశ్వాసి (కాఫిర్‌) అని అనబడింది. దీనికి ఆధారం దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వచనం –

త్రాము మరణించిన తరువాత మళ్లీ లేపబడటం అనేది ఎంత మాత్రం జరుగదు అని అవిశ్వాసులు పెద్ద సవాలు విసిరారు. వారితో ఇలా అను: ‘కాదు, నా ప్రభువు సాక్షిగా! మీరు తప్పకుండా లేపబడతారు. తరువాత, మీరు (ప్రపంచంలో) ఏమేమి చేశారో అదంతా మీకు తప్పకుండా తెలియ జేయటం జరుగుతుంది. ఇలా చేయటం అల్లాహ్‌కు చాలా సులభం.” (అత్‌ తగాబున్‌ -7)

ప్రశ్న: అల్లాహ్‌ తన ప్రవక్తలకు ఏమని ఉపదేశించి పంపాడు?

జవాబు : దేవునిఏకత్వాన్ని (తౌహీద్‌ను) అవలంబించేవారికి స్వర్గలోకపు శుభవార్తనివ్వమనీ, బహు దైవోపాసన (షిర్క్‌)కు ఒడిగట్టే వారిని నరక యాతన గురించి హెచ్చరించమనీ అల్లాహ్‌ తన ప్రవక్తలకు ఉపదేశించి పంపాడు.

ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటి?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు –

“ఈ ప్రవక్తలందరూ శుభవార్తను తెలిపే వారుగా, హెచ్చరిక చేసేవారుగా పంప బడ్డారు-వారి ఆవిర్భావం తరువాత అల్లాహ్‌కు ప్రతికూలంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ సాకూ మిగల కూడదని.” (అన్‌ నిసా – 163)

ప్రశ్న : ప్రప్రథమ ప్రవక్త ఎవరు?

జవాబు : హజ్రత్‌ నూహ్‌ అలైహిస్సలాం.

ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటి?

జవాబు : ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు :

“(ప్రవక్తా!) నూహ్‌ వైవునకు, ఆయన తరువాతి ప్రవక్తల వైపునకు పంపినట్లుగా మేము నీ వైపునకు వహీ (దైవవాణి) ని పంపాము.” (అన్‌ నిసా -163)

ప్రశ్న : దైవప్రవక్త  పంపబడని జాతి ఏదైనా ఉందా?

జవాబు : లేదు. అన్ని జాతుల వద్దకు దేవుని తరఫున ప్రవక్తలు పంపబడ్డారు. దీనికి ఆధారంగా దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ ఆయత్‌ను గమనించండి:

“మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరిక చేశాము: “అల్లాహ్‌ను ఆరాధించండి. మిథ్యా దైవాల (తాగూత్‌) ఆరాధ నకు దూరంగా ఉండండి.” (అన్‌ నహ్ల్ – 36)

ప్రశ్న : ‘తాగూత్’ అంటే అసలేమిటి?

జవాబు : ఆరాధన విషయంలో దాసుడు హద్దు మీరి పోవటమే ‘తాగూత్‌. తాగూత్‌ అనేది ఆరాధించే వానికీ, ఆరాధించబడే వానికీ వర్తిస్తుంది.తాగూత్‌ ఒక మిథ్య. ఒక పైశాచిక మార్గం.

ప్రశ్న : తాగూత్ లు ఎన్ని రకాలు?

జవాబు : అనేక రకాలు.అయికతే వాటిలో ఐదు రకాలు ముఖ్యమైనవి.

  • 1) దైవ ధూత్కారి అయిన ఇబ్లీస్‌
  • 2) అల్లాహ్‌ మినహా-ప్రజల చేత కొలవబడే వ్యక్తి
  • 3) తనను పూజించమని ప్రజలను కోరే వ్యక్తి.
  • 4) తనకు అగోచర జ్ఞానం ఉందని ప్రగల్భాలు పలికే వాడు.
  • 5) దైవం తరపున అవతరింపజేయబడిన షరీఅత్‌కు విరుద్ధంగా తీర్పులు చేసేవాడు (ఇటువంటి మిథ్యా దేముళ్ళను తిరస్కరించాలనీ, వారికి దూరంగా ఉండాలనీ, దైవ విధేయులుగా జీవించాలనీ అల్లాహ్‌ మనకు ఆజ్ఞాపించాడు).

ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటి?

జవాబు : దివ్యఖుర్‌ఆన్‌లోని ఈ వచనమే దీనికి ఆధారం-

“ధర్మం విషయంలో నిర్బంధం గానీ, బలాత్కారం గానీ లేదు. సత్యవాక్కు అసత్య వాక్కుల నుండి ప్రస్ఫుటం చెయ్యబడింది.ఇక నుండి’తాగూత్‌’ను తిరస్కరించి, అల్లాహ్‌ను విశ్వసించిన వాడు సుస్థిరమైన, ఎన్నటికీ విడిపోని ఆశ్రయం పొందినట్లే. (అతడు ఆశ్రయించిన) అల్లాహ్‌ సర్వమూ వింటాడు, సమస్తమూ తెలిసినవాడు.” (అల్‌ బఖరా – 256)

వేరొక చోట ఇలా సెలవిచ్చాడు :

మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరికచేశాము : “అల్లాహ్‌ను ఆరాధించండి. తాగూత్‌ (మిథ్యాదైవాల) ఆరాధన కు దూరంగా ఉండండి.” (అన్‌ నహ్ల్‌ -36)

ఇంకొక చోట ఇలా చెప్పబడింది.

ఓ ప్రవక్తా! ఇలా చెప్పు : “గ్రంథ ప్రజలారా! మాకూ-మీకూ మధ్య సమానమైన ఒక విషయం వైపునకు రండి (అదేమిటంటే) మనం అల్లాహ్‌కు తప్ప మరెవరికీ దాస్యం చెయ్యరాదు. ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ నిలబెట్టరాదు.మనలోని వారెవరూ అల్లాహ్‌ను తప్ప మరెవరినీ తమ ప్రభువుగా చేసుకోరాదు అనేది”.ఈ సందేశాన్ని స్వీకరించటానికి వారు వైముఖ్యం కనబరిస్తే వారితో స్పష్టంగా ఇలా అను: “మేము ముస్లిములలో (కేవలం అల్లాహ్‌కే దాస్యం చేసేవారు, విధేయత చూపేవారు) అనే విషయానికి మీరు సాక్షులుగా ఉండండి.” (ఆలి ఇమ్రాన్‌ – 64)

ఇదీ అసలు”లా ఇలాహ ఇల్లల్లాహ్‌” విసృత భావం హదీసులో ఇలా వుంది : “అసలు విషయం ఇస్లాం. దాని స్తంభం నమాజ్‌.దాని ఉన్నత సోపానం దైవ మార్గంలో పోరాటం.”


తిన్న తర్వాత, త్రాగిన తర్వాత అల్‌హందు లిల్లాహ్‌ అనండి

తిన్నత్రాగిన తర్వాత అల్‌ హందులిల్లాహ్‌ అనండి: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారని అనస్‌ బిన్‌ మాలిక్‌ ఈ ఉల్లేఖించారు: “మానవుడు ఏదైనా తిన్న తర్వాత లేదా ఏదైనా త్రాగిన తర్వాత అల్‌ హందు లిల్లాహ్‌ అనడం అల్లాహ్‌కు చాలా ఇష్టం. (ముస్లిం 2734). [పుణ్యఫలాలు| ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ].

చిన్న దానికి అయినా సరే అల్లాహ్ నుండి సహాయం కోరడం మర్చిపోవద్దు

షేఖ్ ముహమ్మద్ బిన్ సాలీహ్ అల్-ఉతైమీన్ [రహిమహుల్లాహ్ ] ఇలా అన్నారు: "చాలా చిన్న దానికి అయినా సరే అల్లాహ్ నుండి సహాయం కోరడం మర్చిపోవద్దు." [రియాద్ అస్-సాలీహీన్ వ్యాఖ్యానం, (1/273) | ఇంగ్లిష్ అనువాదం: అబ్బాస్ అబూ యాహ్యా హఫిజహుల్లాహ్]