(నఫిల్) స్వచ్చంద దానాల రకాలు! – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

(నఫిల్) స్వచ్చంద దానాల రకాలు!
https://youtu.be/2WVvL9Ip-l4 [11 నిముషాలు]
షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, నఫిల్ సదకా (ఐచ్ఛిక దాతృత్వం) యొక్క వివిధ రూపాలను ఇస్లాంలో వివరించబడ్డాయి. సదకా కేవలం ధనంతో ఇచ్చేది మాత్రమే కాదని, ప్రతి మంచి పని ఒక సదకా అని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీస్ ద్వారా స్పష్టం చేయబడింది. చిరునవ్వుతో పలకరించడం, దారి చూపడం, అల్లాహ్ ను స్మరించడం (తస్బీహ్, తహమీద్, తక్బీర్), మంచిని ఆజ్ఞాపించడం, చెడు నుండి నివారించడం వంటివి కూడా సదకాగా పరిగణించబడతాయి. ఒక వ్యక్తి తన కుటుంబంపై ఖర్చు చేయడం కూడా సదకా అని చెప్పబడింది. చివరగా, వ్యక్తి మరణించిన తర్వాత కూడా పుణ్యం లభించే మూడు రకాల సదకాల గురించి వివరించబడింది: సదకా-ఎ-జారియా (నిరంతర దానధర్మం), ప్రజలకు ఉపయోగపడే జ్ఞానం, మరియు తల్లిదండ్రుల కోసం ప్రార్థించే సజ్జనులైన సంతానం.

إِنَّ الْحَمْدَ لِلَّهِ وَحْدَهُ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ، أَمَّا بَعْدُ
(ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహు, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బ’అ దహు, అమ్మా బ’అద్)
నిశ్చయంగా, సర్వస్తోత్రాలు ఏకైకుడైన అల్లాహ్ కే శోభాయమానం. ఆయన తర్వాత ఏ ప్రవక్తా రారో, అట్టి ప్రవక్తపై అల్లాహ్ యొక్క కారుణ్యం మరియు శాంతి కురియుగాక. ఆ తర్వాత.

ప్రియ వీక్షకులారా, కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ సోదరులారా, మనం గత ఎపిసోడ్లలో జకాత్ గురించి తెలుసుకుందాం.

ఈరోజు, నఫిల్ సదకా రకాలు తెలుసుకుందాం. సదకా అంటే కేవలం ధనంతో, డబ్బుతో కూడుకున్నది మాత్రమే కాదు అని మనకు తెలుస్తుంది, బోధపడుతుంది, మనము ఖురాన్ మరియు హదీస్ గమనిస్తే. నఫిల్ సదకా చాలా రకాలు ఉన్నాయి. ధనంలో కూడా ఉన్నాయి, ధనం కాకపోయినా. ఉదాహరణకు, బుఖారీ, ముస్లింలో ఓ హదీస్ ఉంది. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:

كُلُّ مَعْرُوفٍ صَدَقَةٌ
(కుల్లు మ’అరూఫిన్ సదఖహ్)
ప్రతి మంచి పని ఒక సదకా (దానం).

మంచి పని ఏమిటి? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి చిరునవ్వుతో మాట్లాడినా అది మంచి పని ఇస్లాం దృష్టిలో, అది కూడా సదకా. ఒక వ్యక్తికి దారి చూపినా సదకా, మంచి పని.

ఒక హదీస్ లో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తక్బీర్, తస్బీహ్, తహమీద్, తహ్లీల్ ఇవి కూడా సదకా అని చెప్పారు. అంటే, అల్లాహు అక్బర్ అని పలకటం, సుబ్ హానల్లాహ్ అని పఠించటం, అల్ హమ్దులిల్లాహ్ అని అనటం, లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలకటం, అస్తగ్ ఫిరుల్లాహ్ అని చెప్పటం కూడా సదకా. అల్లాహు అక్బర్ ఒక సదకా. ఒక్కసారి సుబ్ హానల్లాహ్ అంటే ఒక సదకా. ఒక్కసారి అల్ హమ్దులిల్లాహ్ అంటే ఒక్క సదకా. ఒక్కసారి లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఒక్క సదకా. ఒక్కసారి అస్తగ్ ఫిరుల్లాహ్ అంటే ఒక్క సదకా.

ఇది సామాన్యంగా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడూ పలికినా, చెప్పినా మాట ఇది. కాకపోతే రమజాన్ మాసం ప్రత్యేకమైన మాసం. రమదాన్ మాసంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రతి పుణ్యానికి ఎన్నో రెట్లు పెంచి, అధికం చేసి అల్లాహ్ ప్రసాదిస్తాడు. కావున దీన్ని మనము మహాభాగ్యంగా భావించుకొని ఈ రమదాన్ మాసంలో ప్రతి వ్యక్తి దగ్గర డబ్బు ఉండదు. డబ్బు రూపంలో, బంగారం రూపంలో, వెండి రూపంలో, ధన రూపంలో, భూమి రూపంలో, వ్యాపార రూపంలో జకాత్ చెల్లించడానికి ప్రతి వ్యక్తి అర్హుడు కాకపోవచ్చు. కాకపోతే ఈ రూపాలలో, జిక్ర్ ద్వారా సదకా, దీనిని మనము మహాభాగ్యంగా భావించుకొని ఈ మాసంలో అత్యధికంగా మనము ఈ రకానికి సంబంధించిన సదకా చేసుకోవాలి.

అలాగే అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:

اَلأَمْرُ بِالْمَعْرُوفِ وَالنَّهْيُ عَنِ الْمُنْكَرِ صَدَقَةٌ
(అల్ అమ్ రు బిల్ మ’అరూఫ్ వ నహ్యు అనిల్ మున్కర్ సదఖహ్)
మంచిని ఆజ్ఞాపించడం మరియు చెడు నుండి నివారించడం కూడా సదకా.

మంచిని ఆజ్ఞాపించటం, చెడుని ఆపటం కూడా సదకా. మంచి చేయమని చెప్పటం కూడా సదకా అవుతుంది. చెడుని ఆపటం కూడా సదకా అవుతుంది అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు.

అభిమాన సోదరులారా, ఓ హదీస్ లో ఇలా ఉంది:

إِمَاطَتُكَ الْحَجَرَ وَالشَّوْكَ وَالْعَظْمَ عَنِ الطَّرِيقِ لَكَ صَدَقَةٌ
(ఇమాతతుకల్ హజర్ వష్షౌక్ వల్ అజ్మ్ అనిత్తరీఖి సదఖతున్ లక్)
దారి నుండి రాయిని, ముల్లును మరియు ఎముకను తొలగించడం నీ కోసం సదకా అవుతుంది.

దారి నుండి రాళ్లను, ఆ దారి నుండి ముళ్ళను, అలాగే ఎముకల్ని, దారి నుండి తొలగించడం నీ కోసం సదకా అవుతుంది అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. అలాగే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, అంధులకి దారి చూపటం, అలాగే చెవిటి, మూగ వారికి విషయం బోధపరచడం కూడా సదకా అవుతుంది.

అలాగే ఏదైనా ప్రాణికి నీరు త్రాపించడం కూడా సదకా. కష్టాల్లో, అవసరాల్లో ఉన్న వారికి సహాయపడటం సదకా. చివరికి అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

نَفَقَةُ الرَّجُلِ عَلَى أَهْلِهِ صَدَقَةٌ
(నఫఖతుర్రజులి అలా అహ్లిహీ సదఖహ్)
ఒక వ్యక్తి తన కుటుంబంపై చేసే ఖర్చు కూడా సదకా.

వ్యక్తి తన ఇంటి వారిని, భార్యా పిల్లలను పోషించటం కూడా సదకా అన్నారు. సుబ్ హా నల్లాహ్. అల్లాహ్ ఆదేశానుసారం, అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం ప్రకారం, ఆయన సున్నత్ ని అనుసరిస్తూ ఎవరైతే చిత్తశుద్ధితో, మంచి సంకల్పంతో దైవ ప్రసన్నత కోసం భార్యను పోషిస్తే, పిల్లల్ని పోషిస్తే, అది కూడా సదకా క్రిందకి లెక్కించబడుతుంది అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అలాగే ఇంకో హదీస్ లో:
مَا مِنْ مُسْلِمٍ يَغْرِسُ غَرْسًا … إِلاَّ كَانَ مَا أُكِلَ مِنْهُ لَهُ صَدَقَةً
(మా మిన్ ముస్లిమిన్ యగ్రిసు గర్సన్ … ఇల్లా కాన మా ఉకిల మిన్హు లహూ సదఖహ్)
ఏ ముస్లిమైనా ఒక మొక్కను నాటితే… దాని నుండి తినబడిన ప్రతి దానికీ అతనికి సదకా పుణ్యం లభిస్తుంది.

అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఎవరైతే ఒక చెట్టును నాటుతాడు. నాటిన తర్వాత, ఆ చెట్టు నుంచి ప్రయోజనం పొందే, లాభం పొందే ఆ ప్రతి వ్యక్తికి బదులుగా ఆ చెట్టు నాటిన వ్యక్తికి సదకా వస్తుంది. సదకా అంత పుణ్యం వస్తుంది. అంటే, ఏ వ్యక్తి అయితే చెట్టు నాటుతాడో, చెట్టు నాటిన తర్వాత ఆ చెట్టు ద్వారా కొందరు నీడ తీసుకుంటారు, నీడలో కూర్చుంటారు, విశ్రాంతి తీసుకుంటారు. అది కూడా సదకా. ఆ చెట్టు ఫలం ఎవరైతే తింటారో అది కూడా సదకా క్రిందికి వస్తుంది.

అభిమాన సోదరులారా, అలాగే అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, దారి నుండి హాని కలిపించే, ఇబ్బంది కలిగించే వస్తువును తొలగించటం కూడా సదకా క్రిందికి వస్తుంది అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా, ఇక చివర్లో, మూడు రకాల సదకా ఉంది. అది వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా పుణ్యం లభిస్తూనే ఉంటుంది. మూడు రకాల సదకాలు ఉన్నాయి. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:

إِذَا مَاتَ ابْنُ آدَمَ انْقَطَعَ عَمَلُهُ إِلاَّ مِنْ ثَلاثٍ
(ఇదా మాత ఇబ్ను ఆదమ ఇన్ఖత’అ అమలుహు ఇల్లా మిన్ సలాస్)
ఆదం సంతతి వాడు (మానవుడు) మరణించినప్పుడు, అతని కర్మలు మూడు విషయాలు తప్ప ఆగిపోతాయి.

ఆదం సంతతికి చెందినవాడు అంటే ఏ వ్యక్తి అయితే చనిపోతాడో, చనిపోయిన తర్వాత కర్మలు అంతమైపోతాయి. ఇప్పుడు అతనికి పాపం, పుణ్యం అనేది ఉండదు, మనిషి చనిపోయాడు. చనిపోక ముందు వరకే కదా, పాపం చేస్తున్నాడు, పుణ్యం చేస్తున్నాడు, సదాచరణ చేస్తున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు. ఇలా కర్మలు చేయటం అనేది చావు వరకు. చనిపోయిన తర్వాత ప్రతిఫలం మాత్రమే గాని, కర్మ అనేది ఉండదు.

ఏ వ్యక్తి అయితే చనిపోతాడో, అతని అమల్ (కర్మ) ఇన్ఖతా అయిపోతుంది, కట్ అయిపోతుంది. మూడు విషయాలు తప్ప అన్నారు ప్రవక్త గారు, ఇది గమనించాల్సిన విషయం. మూడు విషయాలు తప్ప.

ఒకటి,

صَدَقَةٌ جَارِيَةٌ
(సదఖతున్ జారియహ్)
నిరంతరం కొనసాగే దానం (సదకా-ఎ-జారియా).

ఎటువంటి సదకా అంటే అది జారియాగా ఉండాలి, కంటిన్యూగా ఉండాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి మస్జిద్ నిర్మించాడు. ఆ మస్జిద్ ఉన్నంతకాలం, ఆ మస్జిద్ లో నమాజ్ జరిగేంతకాలం ఆ వ్యక్తికి పుణ్యం లభిస్తూనే ఉంటుంది. మస్జిద్ నిర్మించడం, మద్రసా నిర్మించడం, వృక్షాలు నాటటం, బావి త్రవ్వించడం, ఈ విధంగా. దీనికి సదకా జారియా అంటారు. పుణ్యం లభిస్తూనే ఉంటుంది, అది ఉన్నంత వరకు.

రెండవది,

عِلْمٌ يُنْتَفَعُ بِهِ
(ఇల్మున్ యున్తఫ’ఉ బిహీ)
ప్రజలకు ఉపయోగపడే జ్ఞానం.

ప్రజలకు విద్యాబోధన చేయటం, విద్య నేర్పించటం, ప్రజలకు సన్మార్గం చూపే గ్రంథాలు రాయటం, విద్యార్థులను తయారు చేయటం. అంటే, జ్ఞానం అన్నమాట. ఏ వ్యక్తి అయితే జ్ఞానం వదిలిపోతాడో, విద్య వదిలిపోతాడో. అది చాలా రకాలుగా ఉండవచ్చు. ఒకటి, తన విద్యార్థులను వదిలి వెళ్ళాడు, నేర్పించి పోయాడు. ఖురాన్ ని, హదీస్ ని, అల్లాహ్ వాక్యాలను, ప్రవక్త గారి ప్రవచనాలను, దీన్ నేర్పించి పోయాడు. అతని శిష్యులు వేరే వారికి నేర్పుతారు, వారు వేరే వారికి నేర్పుతారు. ఈ చైన్ సాగుతూనే ఉంటుంది ప్రళయం వరకు. అప్పటి వరకు ఆ వ్యక్తికి పుణ్యం లభిస్తూనే ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి రాసిపోయాడు, కొన్ని గ్రంథాలు, కొన్ని పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలు చదివి చాలా మంది సన్మార్గం పొందుతున్నారు, మంచి విషయాలు నేర్చుకుంటున్నారు, పాపం నుంచి ఆగిపోతున్నారు. మరి ఆ పుస్తకం ఉన్నంతవరకు, ఆ పుస్తకాల ద్వారా నేర్చుకునే వారందరి వల్ల ఆ వ్యక్తికి పుణ్యం పోతూనే ఉంటుంది.

మూడవది,

وَلَدٌ صَالِحٌ يَدْعُو لَهُ
(వలదున్ సాలిహున్ యద్’ఊ లహూ)
అతని కోసం ప్రార్థించే సజ్జనుడైన సంతానం.

తల్లిదండ్రుల మన్నింపు కొరకు ప్రార్థించే సదాచార సంపన్నులైన సంతానాన్ని వదిలి వెళ్ళటం. అంటే అమ్మ నాన్న కోసం దుఆ చేసే సంతానం. మరి సంతానం అమ్మ నాన్న కోసం దుఆ ఎప్పుడు చేస్తారండీ? వారికి మనము ఆ విధంగా తయారు చేయాలి, నేర్పించాలి. వారికి దీన్ నేర్పించాలి, హలాల్ నేర్పించాలి, హరాం అంటే ఏమిటో తెలియజేయాలి, ఖురాన్ నేర్పించాలి, ఇస్లాం అంటే ఏమిటో వారికి నేర్పించాలి. వారికి మనము నేర్పిస్తే, అటువంటి సంతానం అమ్మ నాన్న కోసం దుఆ చేస్తూ ఉంటుంది. ఆ సంతానం దుఆ చేస్తూ ఉంటే, దాని పుణ్యం అమ్మ నాన్న చనిపోయినా కూడా పుణ్యం పోతూనే ఉంటుంది. ఈ మూడు రకాల సదకాలు మనిషి మరణం తర్వాత కూడా పుణ్యం లభిస్తూనే ఉంటుంది. సదకా జారియా, రెండవది ఇల్మ్, మూడవది సంతానం.

అభిమాన సోదరులారా, రమదాన్ కి సంబంధించిన మరెన్నో విషయాలు ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.

وَصَلَّى اللهُ عَلَى نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ
(వ సల్లల్లాహు అలా నబియ్యినా ముహమ్మద్, వ అలా ఆలిహి వ సహ్ బిహీ అజ్ మ’ఈన్)

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43591

స్వార్థపరులైన సోదరులు (తోట వారి గాథ)  – ఖురాన్ కథామాలిక

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

“ఆ సోదరులు నిద్ర పోతుండగానే నీ ప్రభువు తరఫున ఒక ఆపద వారి తోటను చుట్టుముట్టి పోయింది. అంతే! తెల్లవారే సరికల్లా ఆ తోట కోత కోసిన చేను మాదిరిగా అయిపోయింది.(ఖుర్ఆన్ 68 : 19 – 20)

ఒ క రోజు ప్రాతఃకాలం, నలు దిశలా ప్రశాంత వాతావరణం అలుముకుని ఉంది. రాతి నేలపై చేతికర్రతో కొడుతూ ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తోంది. మధ్యమధ్యలో ఆ వ్యక్తి ఆయాసంతో దీర్ఘశ్వాస విడువడం కూడా చెవులకు సోకుతోంది. ఆ వ్యక్తి ఒక ముసలివాడు.ఆయన తన తోట వద్దకు వెళుతున్నాడు.ఆ తోటలో అనేక పండ్ల చెట్లు ఉన్నాయి. చెట్లన్నీ విరగకాసాయి. తోట మధ్యలో ఒక సెలయేరు ప్రవహిస్తోంది. అనేక పూల వాసనతో అక్కడ గాలి మధురంగా గుబాళిస్తోంది. ప్రాతఃకాలం మసకమసక వెలుతురు నెమ్మదిగా ప్రకాశ మానం అవుతోంది. పక్షులు ప్రపంచాన్ని నిద్రలేపడానికి కిలకిలరావాలు ప్రారంభించాయి. కాని ఈ ప్రకృతి సౌందర్యం ఆ ముసలి వ్యక్తి ధ్యాసను మరల్చలేదు. విశ్వప్రభువు అనుగ్రహాలను అన్వేషించే విషయంలో ఆయన ఏమాత్రం నిర్లక్ష్యంచేయదలచుకోలేదు. ఆయన సమయం కాగానే అల్లాహ్ ను స్మరిస్తూ నమాజు చేసి అల్లాహ్ అనుగ్రహాలకు కృతజ్ఞతలు చెల్లించాడు.

తన తోటలోకి ఆయన అందరినీ అనుమతించేవాడు. అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే అవకాశం కల్పించేవాడు. అయితే ఎవరూ తన తోటను నాశనం చేయకుండా జాగ్రత్తగా ఉండేవాడు. తోటలో పండ్లను దించేటప్పుడు బీదలను పిలిచి వారికి ఉదారంగా తన ఫలసాయం నుంచి పంచి పెట్టేవాడు. అంతేకాదు, తోటలో దించకుండా మిగిలిపోయిన పండ్లను దించుకునే అనుమతి బీదలకు ఇచ్చేవాడు.

ఆ ముసలి వ్యక్తికి ముగ్గురు కుమారులు. అందులో ఇద్దరు తమ తండ్రికి పూర్తి విరుద్ధమైన స్వభావం కలిగిన వారు. తమ తండ్రి ఉదారంగా చేసే దానధర్మాలు వారికి సహించేవి కావు. వారిలో ఒకడు తండ్రితో, “మీరు బీదలకు అంతా పంచి పెట్టి మాకు రావలసిన వాటా తగ్గిపోయేలా చేస్తున్నారు” అని కూడా అన్నాడు. రెండవ కుమారుడు మరింత ముందుకు పోయి, ”మీ దానధర్మాలు చివరకు మనల్ని కూడా బిచ్చగాళ్ళయ్యేలా చేస్తాయి” అన్నాడు. ఇది విన్న మూడవ కుమారుడు జవాబు చెప్పబోయాడు. కాని తండ్రి అతడిని వారించాడు. ఆ ముసలి వ్యక్తి తన కుమారులను విచారంగా చూస్తూ, “పిల్లల్లారా! నేను దానధర్మాలు చేయడం వల్ల మనం బీదవాళ్ళమై పోతామని మీరనుకోవడం చాలా పొరపాటు. ఇది స్వార్థపూరితమైన ఆలోచన. మీరు కోరుతున్న ఈ సంపద నిజానికి మీది కాదు, నాది కాదు. ఈ సంపద అల్లాహ్ ది. నేను కేవలం ఈ సంపదకు పర్యవేక్షకుడిని మాత్రమే. ఈ సంపదను కేవలం నా స్వంతానికి మాత్రమే ఖర్చు చేసుకునే అనుమతి నాకు లేదు. అల్లాహ్ సృష్టించిన మిగిలిన వారికి కూడా దీనిలో భాగం ఉంది. ముఖ్యంగా బీదలకు, బాటసారులకు, అవసరార్థులకు ఇందులో భాగం ఉంది. పక్షులు, క్రిమి కీటకాలకు కూడా ఇందులో భాగం ఉంది. ఎందుకంటే, అవి కూడా అల్లాహ్ సృష్టిలోనివే. ఆ తర్వాత మిగిలినదే మనది. ఆ విధం గానే మనిషి తన సంపదను పరిశుద్ధం చేసుకోగలడు. సౌభాగ్యాన్ని, సంపదలో వృద్ధిని పొందగలడు. నేను ఈ విధానాన్ని నా యవ్వనం నుంచి అనుసరిస్తూ వస్తున్నాను. మరణించే వరకు ఈ పద్ధతికే కట్టుబడి ఉంటాను.

ఇప్పుడు నేను ముసలివాడినై పోయాను. నా శరీరం వ్యాధులతో క్రుంగిపోయింది. నా చావు ఇక ఎంతో దూరంలో లేదు. కాబట్టి ఇదంతా మీరు స్వంతంచేసుకునే రోజు పెద్ద దూరంలో లేదు. అప్పుడు మీ ముందు రెండు దారులుంటాయి. మీరు కూడా నా మాదిరిగా మీ సంపదను అల్లాహ్ మార్గంలో ఖర్చుచేస్తే అల్లాహ్ మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. కాని మీరు స్వార్థపరులై సంపదనుఅల్లాహ్ మార్గంలో ఖర్చు చేయకపోతే మీరు ఆయన అనుగ్రహాలను కోల్పోవడమేకాదు, చివరకు ఉత్త చేతులతో మిగులుతారు. కాబట్టి కుమారులారా! అల్లాహ్మనల్ని ఇలా ఉండాలని ఆదేశిస్తున్నాడు” అని చెప్పాడు.

ఈ సంభాషణ జరిగిన కొంత కాలానికే ఆ ముసలి వ్యక్తి మరణించాడు.తర్వాత తోటలో పండ్లు దించే సమయం వచ్చినప్పుడు బీదలు ఎప్పటి మాదిరిగా అక్కడకు వచ్చి తమకు కూడా ఇవ్వడం జరుగుతుందని ఎదురు చూడసాగారు.కాని ఇప్పుడు ఆ తోటకు యజమానులు కుమారులు. వాళ్ళు బీదలకు తోటలోలభించే పండ్లలో ఏదీ ఇవ్వరాదని, బాటసారులు తోటలో ప్రవేశించే అనుమతి ఇవ్వరాదని నిర్ణయించుకున్నారు. కాని మూడవ కుమారుడు తండ్రిని పోలినవాడు. అతను తన సోదరులతో, “మీరు చెప్పే మాటలు దుర్మార్గంతో కూడుకున్నవి. దుర్మార్గం చెడును కొనితెస్తుంది. బీదలను కాదనడం ద్వారా మనం ప్రయోజనాలు పొందలేం. పైగా మనం స్వయంగా ఇబ్బందులకు గురికావచ్చు. కాబట్టి అల్లాహ్ ప్రసాదించిన ఈ సంపద మన తండ్రి వద్ద ఉన్నప్పుడు ఆయన ఎలా ఇచ్చేవారో అలాగే ఇవ్వడం మంచిది” అన్నాడు. కాని సోదరులు ఈమాటలకు ఆగ్రహించి, “నీకు సంబంధంలేని వ్యవహారాల్లో మాకు సలహాలు ఇవ్వవద్దు. నాన్న బ్రతికి ఉన్నప్పుడు చాలా సలహాలు తీసుకున్నాం” అన్నారు.కాని మూడవ కుమారుడు తన పట్టు వదల్లేదు. ”మనం అల్లాహ్ ను ప్రార్థించి అల్లాహ్ మార్గదర్శనాన్ని కోరుకుందాం.. ప్రార్థన మనిషిని చెడు నుంచి కాపాడుతుంది” అన్నాడు. కాని సోదరులు అతని మాటలను ఏమాత్రం లక్ష్యపెట్టలేదు.

మరుసటి రోజు తెల్లవారుజామున లేచి తోటలోని పండ్లను దించి తామేపంచుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. అలాగే మరుసటి రోజు తెల్లవారుజామున తోటకు వెళ్ళారు. కాని అక్కడ కనబడిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు. వారి తోట పరిస్థితే మారిపోయింది. అంతా నాశనమై పోయింది.అసలు గుర్తుపట్టడానికి కూడా వీల్లేకుండా మారిపోయింది.

ఈ వార్త మూడవ కుమారునికి తెలిసి, “మీ దుర్మార్గపు ఆలోచనల వల్లఏమయ్యిందో చూడండి” అని వ్యాఖ్యానించాడు. ఇద్దరు సోదరులు తమ తప్పు తెలుసుకుని అల్లాహ్ ను క్షమాభిక్ష కోరారు. “మా ప్రభువు పరిశుద్ధుడు.. నిజంగానే మేము పాపాత్ములం… మన ప్రభువు దీనికి బదులు దీనికన్నా మెరుగైన తోటను మనకు ప్రసాదించడం అసంభవమేమీ కాదు” అన్నారు.(చదవండి దివ్యఖుర్ఆన్ : 68:17-33)

అల్లాహ్ మనకు సంపదను ఒక బాధ్యతగా అప్పగిస్తాడు. దానితో మనం ఏం చేస్తామో పరీక్షిస్తాడు. ఆ సంపదలో బీదలకు, అవసరార్థులకు, బాటసారులకు ఇవ్వడానికి నిరాకరిస్తే అల్లాహ్ సంపదను తీసుకుని అనేక విధాలుగా శిక్షిస్తాడు. మనం చేసిన తప్పుకు చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడితే, అల్లాహ్ తాను తీసుకున్న దానికన్నా మెరుగైనది ప్రసాదిస్తాడు.

ఖురాన్ కథామాలిక – మూలం: షేఖ్ అబూబకర్ నజార్
Qur’an Katha Maalika – Selected Stories from Qur’an (Telugu)
తెలుగు అనువాదం: అబ్దుల్ వాహెద్ & ఎస్. ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్,హైదరాబాద్
https://teluguislam.net/2022/11/12/stories-from-the-quran/

మహా సంపన్నుడు ఖారూన్ – ఖురాన్ కథామాలిక

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

(పూర్వకాలంలో కథకులు, గొప్ప సంపద అని చెప్పడానికి ‘ఖారూన్ సంపద’ అని పోల్చి చెప్పేవారు. అంటే సాటిలేని మహా సంపద అన్న భావంతో వాడేవారు.)

فَخَسَفْنَا بِهِ وَبِدَارِهِ الْأَرْضَ فَمَا كَانَ لَهُ مِن فِئَةٍ يَنصُرُونَهُ مِن دُونِ اللَّهِ وَمَا كَانَ مِنَ الْمُنتَصِرِينَ

“చివరికి మేము ఖారూన్ ను, అతని నివాసాన్ని నేలలో కూర్చివేశాము. అప్పుడు అల్లాహ్ బారి నుంచి అతన్ని ఆదుకోవటానికి ఏ సమూహమూ లేకపోయింది. మరి వాడు సయితం తనకు ఏ సాయమూ చేసుకోలేకపోయాడు.” ( సూరా అల్ ఖసస్ 28: 81)

ఖారూన్, ప్రవక్త మూసా (అలైహిస్సలాం) వంశానికి చెందినవాడు. చాలా సంపన్నుడు. ఒక మహా ప్రాసాదంలో భోగభాగ్యాలతో జీవించేవాడు. అత్యంత ఖరీదైన దుస్తులు ధరించేవాడు. అసంఖ్యాక బానిసలు ఎల్లప్పుడూ అతని సేవకు సిద్ధంగా ఉండేవారు. అన్ని రకాల సుఖవిలాసాలతో ఆడంబరంగా జీవితం గడిపేవాడు. అపారమైన ధన సంపత్తులు అతనిలో గర్వాన్ని పెంచాయి. అహంకారంతో విర్రవీగేవాడు.

ఖారూన్ బీదలను చూసి అసహ్యించుకునేవాడు. తెలివితేటలు లేకపోవడం వల్లనే వారు బీదరికంలో మగ్గుతున్నారని ఈసడించుకునేవాడు. తన తెలివితేటలు, వ్యాపార నైపుణ్యం వల్లనే తనకు అపార సంపద లభించిం దాని మిడిసిపడేవాడు.

జకాత్* చెల్లించవలసిందిగా ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అతడికి చెప్పారు. జకాత్ అన్నది బీదలకు ఒక హక్కుగా సంపన్నులు చెల్లించవలసిన నిర్ధారిత వాటా. విశ్వాసులందరూ తప్పనిసరిగా జకాత్ చెల్లించాలని అల్లాహ్ ఆదేశించాడు. కాని ఈ సలహా విన్న ఖారూన్ కోపంతో మండిపడ్డాడు. తనపై అల్లాహ్ అనుగ్రహం వర్షిస్తుందని, తన ధన సంపదలే అందుకు నిదర్శనమని ప్రవక్త మూసా (అలైహిస్సలాం)తో చెప్పాడు. తన జీవిత విధానాన్నిఆమోదించినందు వల్లనే అల్లాహ్ తన సంపదను అనునిత్యం పెంచుతున్నాడని వాదించాడు. ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అతడికి నచ్చ జెప్పారు. దుర్మార్గపు ఆలోచనల పరిణామాలు నష్టదాయకంగా ఉంటాయని హెచ్చరించారు.

చివరకు ఖారూన్ తన సంపదపై జకాత్ లెక్కించాడు. జకాత్ను లెక్కిస్తే తాను చెల్లించవలసిన మొత్తం అతడికి చాలా ఎక్కువగా కనబడింది. అంత మొత్తం చెల్లించాలంటే ప్రాణాలు పోయినట్లనిపించింది. జకాత్ చెల్లించేది లేదని తిరస్కరించడమే కాదు, ప్రవక్త మూసా (అలైహిస్సలాం) తన స్వార్థప్రయోజనాల కోసం జకాత్ చట్టం తీసుకొచ్చారని ప్రచారం మొదలుపెట్టాడు. ప్రవక్త మూసా (అస)కు వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టడానికి కొంతమందికి లంచాలు కూడా ఇచ్చాడు. ప్రవక్త మూసా (అలైహిస్సలాం) గురించి నానావిధాల పుకార్లు వ్యాపించేలా చేశాడు.

ఖారూన్ కుట్రల గురించి అల్లాహ్, ప్రవక్త మూసా (అలైహిస్సలాం)ను హెచ్చరించాడు. ఖారూన్ పిసినారితనానికి, అల్లాహ్ చట్టాల పట్ల అతని తిరస్కారానికిగాను అతడిని శిక్షించాలని ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ ను ప్రార్దించారు. అల్లాహ్ ఆగ్రహం ఖారూన్ పై విరుచుకుపడింది. భూమి ఒక్కసారిగా పగులుబారి ఖారూన్ సహా అతడి భవనాన్ని, యావత్తు సంపదను తనలో కలిపేసుకుంది. ఖారూన్ అనేవాడు ఒకప్పుడు ఉండేవాడన్న చిహ్నాలు కూడా లేకుండా అతడు తుడిచిపెట్టుకు పోయాడు. ఖారూన్ సంఘటన మూసా (అలైహిస్సలాం) జాతి ప్రజలకు ఒక గుణపాఠంగా మిగిలి పోయింది.

ఈ విషయమై దివ్య ఖుర్ఆన్లో ఇంకా ఏముందంటే, ఖారూన్ సంపదను చూసి ఈర్ష్యపడిన వారు, అప్పటి వరకు ఖారూనను కీర్తించడమే ఘనకార్యంగా భావించిన వారు ఈ సంఘటన తర్వాత, “అల్లాహ్ ఎవరికి తలచుకుంటే వారికి సంపద ఇస్తాడు. ఎవరికి తలచుకుంటే వారికి నిరాకరిస్తాడు. మనపై అల్లాహ్ అనుగ్రహం లేనట్లయితే మనల్ని కూడా భూమి మ్రింగేసి ఉండేది. అల్లాహ్ ను తిరస్కరించేవారు పురోభివృద్ధి సాధించలేరు. ఈ ప్రపంచంలో ఔన్నత్యాన్ని కోరుకోని వారికి, దుర్మార్గానికి పాల్పడని వారికి మాత్రమే పరలోక స్వర్గవనాలు లభిస్తాయి” అనడం ప్రారంభించారు.

ఖారూన్ వంటి వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కొంతమంది నడమంత్రపు సిరి పొంది తమ పాత రోజులను, అప్పటి కష్టాలను మరచి పోతారు. తాము కష్టపడి, శ్రమించి తమ తెలివితేటలతో సంపాదించిందే అంతా అనుకుంటారు. అందులో అల్లాహ్ కారుణ్యం లేదని భావిస్తారు. అల్లాహ్ పట్ల ఏలాంటి కృతజ్ఞత చూపించరు. అల్లాహ్ ఆదేశాలను విస్మరిస్తారు. బీదసాదలకు ఏలాంటి సహాయం అందించడం వారికి ఇష్టం ఉండదు. పైగా తమ సంపదను పెద్ద భవనాలు కట్టడం ద్వారా సంపన్నులకు గొప్ప విందులు ఇవ్వడం ద్వారా, అనవసరమైన ఆడంబరాల ద్వారా, ఖరీదైన దుస్తులు, వాహనాల ద్వారా ప్రదర్శిస్తూ విర్రవీగు తుంటారు. మరికొందరు ఇందుకు విరుద్ధంగా అత్యంత పిసినారులుగా మారిపోతారు. పిల్లికి బిచ్చమెత్తని ధోరణి ప్రదర్శిస్తారు. స్వంతం కోసం, తమ కుటుంబం కోసం ఖర్చుపెట్టడానికి కూడా వెనుకాడుతారు. సంపద పోగుచేయడంలోనే మునిగిపోతారు. కాని ఇలాంటి వారు తాము ఈ ప్రపంచంలో కేవలం కొంత సమయం గడిపి వెళ్ళడానికి వచ్చామన్న వాస్తవాన్ని మరచిపోతుంటారు.

అల్లాహ్ నిర్దేశించిన వాటాను బీదలకు చెల్లించడం ద్వారా మనిషి తన సంపదను పరిశుద్ధం చేసుకుంటాడు. లేనట్లయితే సంపద కలుషితమై పోతుంది. సంపద ఒక శాపంగా మారిపోతుంది. తన మార్గంలో ఖర్చు చేసిన సంపదను అనేక రెట్లు పెంచి ఇస్తానని అల్లాహ్ వాగ్దానం చేస్తున్నాడు. దాన ధర్మాలకు ఖర్చు చేసినది తనకు ఇచ్చిన ఉత్తమమైన రుణంగా అల్లాహ్ అభివర్ణిస్తున్నాడు. అల్లాహ్ కు రుణం ఇచ్చి ఆయన నుంచి తిరిగి పొందడం అన్నది మనిషికి ఎంత గౌరవప్రదం! ఎంత శుభప్రదం!!

అల్లాహ్ మనిషికి ధనసంపదలను ఒక పరీక్షగా అప్పగిస్తాడు (అమానత్-అంటే ఏదన్నా వస్తువును జాగ్రత్తగా ఉంచమని ఎవరికైనా అప్పగించడం), ధనసంపదలు కూడా అల్లాహ్ మనిషికి అప్పగించిన అమానత్ (అప్పగింత). తాను ఇచ్చిన ధనసంపదలతో ఎవరు ఏం చేస్తారన్నది చూడడానికి అల్లాహ్ వాటిని ప్రసాదిస్తాడు.

ఖురాన్ కథామాలిక – మూలం: షేఖ్ అబూబకర్ నజార్
Qur’an Katha Maalika – Selected Stories from Qur’an (Telugu)
తెలుగు అనువాదం: అబ్దుల్ వాహెద్ & హాఫిజ్ ఎస్. ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్,హైదరాబాద్
https://teluguislam.net/2022/11/12/stories-from-the-quran/

వక్ఫ్ (Waqf) మరియు ఇస్లాం [వీడియో]

అబూ బక్ర్ బేగ్ ఉమరీ, డా. సఈద్ అహ్మద్ మదనీ & నసీరుద్దీన్ జామి’ఈ
https://youtu.be/npKnVhoGZRs
[93 నిముషాలు]

నీకు నీ సంకల్పానికి అనుగుణంగా పుణ్యం లభిస్తుంది | సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్) | హదీసు కిరణాలు [ఆడియో, టెక్స్ట్]

నీకు నీ సంకల్పానికి అనుగుణంగా పుణ్యం లభిస్తుంది | సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)
https://youtu.be/lQSrDz01_OQ [19 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, రియాదుస్ సాలిహీన్ నుండి ఐదవ హదీసు వివరించబడింది. ఈ హదీసులో మ’అన్ ఇబ్ను యజీద్, అతని తండ్రి యజీద్ మరియు తాత అఖ్నస్, ముగ్గురూ సహాబాలు కావడం ఒక విశేషంగా పేర్కొనబడింది. యజీద్ మస్జిద్ లో దానం చేయాలనే ఉద్దేశ్యంతో ధనాన్ని ఉంచగా, అతని కొడుకు మ’అన్ అవసరార్థం దానిని తీసుకున్నాడు. తండ్రి దీనిపై అభ్యంతరం చెప్పగా, వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీర్పు కోసం వెళ్లారు. ప్రవక్త (స) “ఓ యజీద్, నీ సంకల్పానికి ప్రతిఫలం నీకు లభిస్తుంది, మరియు ఓ మ’అన్, నీవు తీసుకున్నది నీకే చెందుతుంది” అని తీర్పు ఇచ్చారు. ఈ సంఘటన నుండి, కర్మలు సంకల్పాలపై ఆధారపడి ఉంటాయని, ఉద్దేశ్యం మంచిదైతే ఫలితం ఊహించని విధంగా ఉన్నా పుణ్యం లభిస్తుందని వివరించబడింది. అలాగే, తండ్రీకొడుకుల మధ్య విభేదాలు వస్తే పండితుల వద్దకు వెళ్లి పరిష్కారం వెతకాలని సూచించబడింది. చివరగా, ఒక వ్యక్తి తన కొడుకుకు లేదా తండ్రికి సాధారణ దానం (సదకా) ఇవ్వవచ్చని, కానీ జకాత్ ఇవ్వరాదని, ఎందుకంటే వారి పోషణ బాధ్యత తనపైనే ఉంటుందని వివరించబడింది. అయితే, వారు అప్పుల్లో ఉంటే, ఆ అప్పు తీర్చడానికి జకాత్ ఇవ్వవచ్చని స్పష్టం చేయబడింది.

5. హజ్రత్‌ మాన్‌ బిన్‌ యజీద్‌ బిన్‌ అఖ్‌నస్‌ (రదియల్లాహు అన్హుమ్) (ఈయన, ఈయన తండ్రీ తాతలు ముగ్గురూ దైవప్రవక్త అనుచరులే) కథనం:

“మా నాన్న యజీద్‌ ఒకసారి దానధర్మాల నిమిత్తం కొన్ని దీనార్లు బయటికి తీసి వాటిని మస్జిద్ లో ఒక వ్యక్తి దగ్గర (అవసరమున్న వానికి ఇవ్వమని) ఉంచి వెళ్ళిపోయారు. అదే సమయంలో నేను అక్కడికి వచ్చాను. (అవసరం నిమిత్తం) నేను ఆ వ్యక్తి నుండి దీనార్లు పుచ్చుకొని ఇంటికి తీసుకువచ్చాను. వాటిని చూసి మా నాన్నగారు “అల్లాహ్‌ సాక్షి! నేను ఇవి నీకివ్వాలనుకోలేదు. అంటూ నాతో వాదనకు దిగారు. నేను ఆయన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనకు మా నాన్న వాదన గురించి వివరించాను. దానికి అయన: “ఓ యజీద్‌! నీకు నీ సంకల్పానికి అను గుణంగా పుణ్యం లభిస్తుంది. ఓ మాన్‌! అలాగే నువ్వు తీసుకున్న దీనార్లు కూడా నీకొరకు ధర్మ సమ్మతమే అవుతాయి” అని తీర్పు చెప్పారు” (బుఖారీ)

السلام عليكم ورحمة الله وبركاته
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.

الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين، نبينا محمد وعلى آله وصحبه أجمعين، أما بعد
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్ బిహి అజ్మయీన్, అమ్మా బాద్)
సకల లోకాల ప్రభువైన అల్లాహ్ యే సర్వ స్తోత్రాలకు అర్హుడు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ పైనా, ఆయన కుటుంబ సభ్యులు, సహచరులందరిపైనా అల్లాహ్ యొక్క శాంతి మరియు కరుణ వర్షించుగాక.

సోదర మహాశయులారా! రియాదుస్ సాలిహీన్, హదీసు మకరందం అనే ఈ ప్రఖ్యాతి గాంచిన హదీసు పుస్తకం మనం చదవడం, అందులోని హదీసుల వివరణ తెలుసుకోవడం మొదలుపెట్టాము. ఈ క్రమంలో అల్లాహ్ యొక్క దయవల్ల మనం ఇప్పటి వరకు నాలుగు హదీసులు చదివి ఉన్నాము.

ఈనాటి మన పాఠంలో ఐదవ హదీస్, మ’అన్ బిన్ యజీద్ బిన్ అఖ్నస్. మ’అన్, ఆయన తండ్రి పేరు యజీద్. ఆయన తండ్రి పేరు అఖ్నస్. మ’అన్ ఇబ్ను యజీద్ ఇబ్ను అఖ్నస్. రెండేసి మూడేసి సార్లు నేను ఈ పేర్లు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇలాంటి మహా గొప్ప అదృష్టం చాలా అరుదుగా లభిస్తుంది. ఏమిటది? కొడుకు, తండ్రి, తాత. మ’అన్ ఇబ్ను యజీద్ ఇబ్ను అఖ్నస్. వీరు ముగ్గురూ కూడా సహాబీలు.

సామాన్యంగా ఏముంటుంది? ఒక వ్యక్తి సహాబీ, మహా ఎక్కువ అంటే అతని తండ్రి కావచ్చు. లేదా ఒక వ్యక్తి, అతని కొడుకు కావచ్చు. కానీ ఇక్కడ ముగ్గురూ, కొడుకు, అతని తండ్రి, ఈ కొడుకు యొక్క తాత. ముగ్గురూ కూడా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వాస స్థితిలో కలుసుకున్నారు మరియు విశ్వాస స్థితిలోనే అల్హమ్దులిల్లాహ్ చనిపోయారు కూడా. అయితే వీరు ముగ్గురూ కూడా అల్హమ్దులిల్లాహ్ సహాబీ. ఇమామ్ నవవీ రహమహుల్లాహ్ ఈ విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు:

وهو وأبوه وجده صحابيون
(వ హువ వ అబూహు వ జద్దుహు సహాబియ్యూన్)
అతను, అతని తండ్రి మరియు అతని తాత సహాబాలు.

అయితే ఇక రండి, అసలు హదీస్ వైపునకు మనం వెళ్దాము. ఇందులో ఈ కొడుకు హదీసును ఉల్లేఖిస్తున్నారు. విషయం ఏం జరిగిందంటే, మ’అన్ యొక్క తండ్రి యజీద్, అల్లాహ్ మార్గంలో దానం చేసే ఉద్దేశంతో సొమ్ము తీసుకుని వెళ్ళాడు. మస్జిద్ లో ఒక వ్యక్తి కనబడ్డాడు. అతనికి ఇచ్చి, ఎవరైనా అవసరం గల వ్యక్తి వచ్చాడంటే అతనికి మీరు ఇవ్వండి అని చెప్పి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత కొంత సమయానికి మ’అన్ వచ్చాడు, ఈ కొడుకు. ఆ వ్యక్తితో కలిశాడు, ఏదో మాట అయి ఉంటుంది, ఆ సందర్భంలో మ’అన్ కి అది అవసరం ఉంది. ఆ వ్యక్తి ఆ దానం యొక్క సొమ్ము మ’అన్ కి ఇచ్చేశాడు. మ’అన్ కు అవసరం కూడా ఉండినది అప్పుడు.

ఆ తర్వాత ఈ విషయం మ’అన్ యొక్క తండ్రి యజీద్ కు తెలిసింది. ఎవరు? దానం చేసిన వ్యక్తి. అప్పుడు యజీద్ అన్నాడు, “అల్లాహ్ సాక్షి, నేను ఇవి నీకు ఇవ్వాలనుకోలేదు.” అప్పుడు ఈ కొడుకు మ’అన్ ఏం చేశాడు? ఇక ఈ విషయంలో తండ్రితో గొడవ పడడం మంచిది కాదు. అయితే నాన్నా, మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్లి ఈ విషయాన్ని తెలియజేసి, అక్కడి నుండి పరిష్కారం ఏంటో మనం తెలుసుకుందాము. ఇద్దరూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఈ విషయం వివరించారు. యజీద్ చెప్పాడు, నేను డబ్బు తీసుకెళ్లి కొంత సామాను తీసుకెళ్లి ఇచ్చాను మస్జిద్ లో ఒక వ్యక్తికి, ఎవరైనా అవసరం ఉన్న వ్యక్తి వచ్చేది ఉంటే ఇవ్వమని. ఆ తర్వాత ఈ సొమ్ము నా కొడుకు తీసుకొచ్చుకున్నాడు. కొడుకు చెప్పాడు, అవును, నాకు అవసరం ఉండింది. అల్లాహ్ ఎక్కడైనా నాకు ఏదైనా ఇప్పిస్తాడా అన్నట్టుగా నేను బయటికి వెళ్ళాను. మస్జిద్ లో ఈ వ్యక్తి కలిశాడు, అతని వద్ద అది ఉంది. అయితే నేను తీసుకొచ్చుకున్నాను. ఇద్దరి మాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విన్న తర్వాత:

لك ما نويت يا يزيد، ولك ما أخذت يا معن
(లక మా నవయిత యా యజీద్, వ లక మా అఖద్-త యా మ’అన్)
ఓ యజీద్! నీ సంకల్పానికి తగిన ప్రతిఫలం నీకు లభిస్తుంది. మరియు ఓ మ’అన్! నీవు తీసుకున్నది నీకే చెందుతుంది.

అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరికీ తీర్పు ఇచ్చారు. ఏంటి? ఓ యజీద్, నీకు నీ సంకల్పానికి అనుగుణంగా పుణ్యం లభిస్తుంది. నువ్వు దానం చేయాలనుకున్నావు, ఆ దానం పుణ్యం నీకు లభిస్తుంది. ఆ దానం కొడుకుకు ఇవ్వాలి అని నువ్వు అనుకోలేదు, ఎవరైనా అవసరం ఉన్న వ్యక్తికి ఇవ్వాలనుకున్నావు. ఆ నీ నియ్యత్ ప్రకారంగా, నీ సంకల్పం ప్రకారంగా నీకు పుణ్యం లభిస్తుంది. మరియు ఓ మ’అన్, నువ్వు తీసుకున్నది ఈ దానంలో కూడా నీ కొరకు ధర్మసమ్మతమే అవుతాయి, హరామ్ కావు. ఎందుకు? తండ్రి నుండి నువ్వు దానంగా ఏదీ తీసుకోలేదు. ఒక వ్యక్తి నుండి నువ్వు తీసుకున్నావు.

ఈ హదీస్ సహీహ్ బుఖారీలో వచ్చి ఉంది.

మరియు మన ఈ మొదటి శీర్షిక, టాపిక్, ఉన్వాన్ ఇఖ్లాస్ కు సంబంధించినది. చిత్తశుద్ధి. మాట్లాడే మాట గానీ, మనం చేసే ఏదైనా పని గానీ, మన స్థితిగతులు అన్నీ కూడా కేవలం అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకే ఉండాలి. అల్లాహ్ తప్ప ఇక వేరే ప్రాపంచిక ఉద్దేశాలు, ప్రాపంచిక లాభాలు పొందడానికి, ప్రజలు చూసి మెచ్చుకోవడానికి ఇలాంటి దురుద్దేశాలు ఏవీ కూడా ఉండకూడదు.

ఈ శీర్షికలో, ఈ టాపిక్ లో ఇమామ్ నవవీ రహమహుల్లాహ్ ఈ హదీసును పేర్కొనడానికి ఉద్దేశం ఏంటి? మనిషి కొన్ని సందర్భాల్లో ఒక మంచి ఉద్దేశంతో ఒక పని చేస్తాడు. కానీ చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ ఏదైతే ఉంటుందో, ఎలా కనబడుతుంది? మన నియ్యత్ కు, మన సదుద్దేశానికి వ్యతిరేకంగా కనబడుతుంది. అలాంటప్పుడు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకు? ఏ మనిషి, ఏ మంచి ఉద్దేశంతో ఏ పని చేశాడో, అతనికి అతని మంచి ఉద్దేశం ప్రకారంగానే పుణ్యం అనేది లభిస్తుంది.

ఈ హదీసులో మనం కొంచెం శ్రద్ధ వహిస్తే ఇంకా ఎన్నో విషయాలు మనకు బోధపడతాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన తండ్రితో ఏదైనా విషయంలో, అది ప్రత్యేకంగా ధర్మానికి సంబంధించిన విషయం అయి ఉండి ఉంటే, అందులో నేను ఉన్న మార్గమే, నా యొక్క ఆలోచనే, నా యొక్క అభిప్రాయమే కరెక్ట్ అయినది అని వాగ్వివాదానికి దిగి, పెద్ద తగాదాలు చేసుకొని గొడవలకు దిగకూడదు. తండ్రి యొక్క గౌరవాన్ని పాటించాలి. అలాగే, ఒకవేళ విషయం వారిద్దరి మధ్యలో సర్దుకొని, ఇంకా వేరే పెద్ద గొడవలకు దారి తీయకుండా సమాప్తమైతే అల్హమ్దులిల్లాహ్. కానీ లేదు, పరిష్కారం తేలడం లేదు, ఒక మంచి రిజల్ట్ వెళ్లడం లేదు, అలాంటప్పుడు ధర్మ జ్ఞానంలో ఎవరైతే పెద్దగా ఉన్నారో వారి వద్దకు వెళ్లి ఇద్దరూ తమ సమస్యను అక్కడ వారికి చెప్పుకొని, సరియైన ధర్మ పరిష్కారం తీసుకునే ప్రయత్నం చేయాలి. యజీద్ ఏమన్నాడు? లేదు, నువ్వు ఎందుకు తీసుకున్నావు మస్జిద్ లో ఉన్న చేసిన ధర్మాన్ని అని గొడవ పడ్డాడు. కానీ కొడుకు మ’అన్ ఏం చేశాడు? తండ్రితో గొడవ పడడం మంచిది కాదు, ప్రవక్త ఉన్నారు, ఆయన వద్దకు వెళ్లి మనం నిజం ఏంటో తెలుసుకుందాము అని.

దీని ద్వారా మనకు మరొక విషయం ఏం తెలుస్తుంది? ఏ ధర్మ విషయంలో గానీ, ఇద్దరి మధ్యలో ఏదైనా విభేదం ఏర్పడిందంటే, ఆ విభేదాలను తూతూ మంత్రం, లేదు నేను చెప్పినట్టే, ఏ లేదు నేను చెప్పిందే కరెక్ట్, ఈ విధంగా గొడవలకు దిగకుండా ధర్మజ్ఞానుల వద్దకు వెళ్లి పరిష్కారం తీసుకోవడం చాలా మంచి విషయం.

ఇక్కడ మరొక విషయం మనకు ఏం అర్థమైందంటే, మన దగ్గరి కాలంలో ఇమామ్ ఇబ్ను ఉథైమీన్ రహమహుల్లాహ్ చాలా గొప్ప పండితులు గడిసి చనిపోయారు. ఆయన రియాదుస్ సాలిహీన్ యొక్క వ్యాఖ్యానం చేస్తూ, ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పదం ఏదైతే చెప్పారో, “లక మా నవైత్” (నీవు ఏ నియ్యత్ చేశావో), ఈ పదం ద్వారా ఎన్నో విషయాలు, ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో ధర్మ విషయాలు చెప్పారు.

ఉదాహరణకు, ఒక వ్యక్తి వద్ద రెండు ఇళ్లు ఉన్నాయి అనుకోండి. ఒకటి చిన్నది, మరొకటి పెద్దది. అతడు అల్లాహ్ మార్గంలో చిన్న ఇల్లును దానం చేసేయాలి అని అనుకున్నాడు. అనుకొని, ఎవరైనా బాధ్యులతోను మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ, ఏదో కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది? మనిషి ఇంటి బయట లేదా తన యొక్క ఇంటి వాకిలిలో నిలబడి ఇద్దరు ముగ్గురు మాట్లాడుతూ ఉంటే, మాట మాటల్లో అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు. ఈ విధంగా మాట్లాడుతూ మాట్లాడుతూ, “నేను నా ఈ ఇంటిని అల్లాహ్ మార్గంలో దానం చేయాలనుకుంటున్నాను” అని పెద్ద ఇంటి వైపుకు వేలు చూపించాడు. అసలు అతని నియ్యత్ లో, సంకల్పంలో ఉన్నది ఏంటి? చిన్న ఇల్లు. కానీ ఆ మాట ధోరణిలో ఉండి, అక్కడ గమనించక వేలు అనేది ఎటు చూపించాడు? పెద్ద ఇల్లు వైపునకు. అలాంటప్పుడు ఎందరో పండితులు చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏ ఇల్లు దానం చేయాలి అతను? చిన్నదా, పెద్దదా? కాదు. నియ్యత్ ఏదైతే ఉందో, దాని ప్రకారంగానే. నియ్యత్ ఏదైతే ఉందో, దాని ప్రకారంగానే అతడు ఆచరించాలి.

అలాగే, ఒక వ్యక్తి కొందరితో కలిసి హజ్ కు బయలుదేరాడు. మీకాత్ లో ఉండి ముందు నుండే అతని యొక్క నియ్యత్ ఉన్నది, నేను హజ్జె తమత్తు చేస్తాను అని. హజ్జె తమత్తు అంటే ఏమవుతుంది? ముందు ఉమ్రా చేసి, హలాల్ అయిపోయి, మళ్ళీ ఎనిమిదవ తారీఖు నాడు మళ్ళీ హజ్ యొక్క ఇహ్రామ్ కొత్తగా చేస్తారు. అయితే వెళ్తున్నప్పుడు మీకాత్ వద్ద అందరితో పాటు “లబ్బైక్ హజ్జన్” అని అనేశాడు. వాస్తవానికి అతని యొక్క నియ్యత్ ఏముంది? హజ్ లేదా హజ్జె కిరాన్, హజ్జె ఇఫ్రాద్ చేయాలని లేదు, హజ్జె తమత్తు చేయాలని ఉంది. అయితే అతను “లబ్బైక్ హజ్జన్” అని నోటితో పలికినప్పటికీ, అతడు తన నియ్యత్ ప్రకారంగా ఉమ్రా చేయాలి ముందు. ఎందుకంటే హజ్జె తమత్తు చేసేది ఉంది. ఆ ప్రకారంగా అతను వచ్చి ఉమ్రా చేసేది ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదు.

దీని ద్వారా మరొక గొప్ప విషయం ఏం తెలుస్తుందంటే, కొన్ని సందర్భాల్లో మనిషి దానధర్మాలు ఏదైతే చేస్తాడో, చేసిన తర్వాత అతనికి తెలిసింది, హక్కుదారునికి కాకుండా వేరే ఎవరికైనా చేరుకున్నది అని. అలాంటప్పుడు అతడు బాధపడవలసిన అవసరం లేదు. దీనికి సంబంధించి మరొక పెద్ద హదీస్ కూడా ఉంది. ఒక వ్యక్తి రాత్రిపూట ఎవరూ చూడకుండా, కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకే నేను దానం చేస్తాను అని బయలుదేరాడు. బయలుదేరేసరికి ఏమైంది? ఒక రాత్రి దొంగ చేతిలో పెట్టేశాడు. మరో రాత్రి వ్యభిచారిణి చేతిలో పెట్టేశాడు. మూడో రాత్రి చాలా ధనవంతుని యొక్క చేతిలో పెట్టేశాడు. ఉదయం తెలిసింది అతనికి ఇలా జరిగింది అని. చాలా బాధపడ్డాడు. కానీ తర్వాత అతనికి చెప్పడం జరిగింది, నీవైతే దొంగకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదు, వ్యభిచారిణికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదు, ధనవంతునికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదు. నీ యొక్క నియ్యత్, నీ యొక్క సంకల్పం కరెక్ట్ గా ఉండింది గనక, దాని ప్రకారంగానే నీకు పుణ్యం కూడా లభిస్తుంది.

ఇప్పుడు ఈ హదీసులో మనం తెలుసుకున్నాము, మ’అన్ బిన్ యజీద్, అంటే యజీద్, తండ్రి, దానం మస్జిద్ లో పెట్టి వచ్చాడు. తర్వాత అతని కొడుకు వెళ్ళాడు. కొడుక్కు తెలియదు, మా నాన్నే పెట్టాడు అని కూడా. అయితే, తండ్రి తన దానం కొడుక్కు ఇవ్వచ్చా? ఇదొక ధర్మ విషయం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పటివరకైతే దానం సామాన్య దానంగా ఉందో, అంటే జకాత్ కాదు, ధర్మదానాలు, ఆమ్ సదకా ఖైరాత్ అని ఏదైతే అంటామో, జకాత్ కాదు. ఇలాంటివి కొడుక్కు ఇవ్వచ్చు, బంధువులకు ఇవ్వచ్చు, ఇంకా వేరే వారికి కూడా ఇవ్వచ్చు. కానీ, జకాత్ అన్నది కొడుక్కు ఇవ్వరాదు. ఎందుకు? జకాత్ ఇది ఒక విధి, కొడుకు యొక్క ఖర్చు తండ్రిపై విధిగా ఉంది. అందుకొరకే తండ్రి కొడుక్కు జకాత్ ఇవ్వలేడు.

కానీ ఒక మార్గం ఉంది ఉదాహరణకు, కొడుక్కు ఇవ్వడానికి. అదేమిటి? కొడుకు పెద్దగయ్యాడు, సంపాదిస్తున్నాడు, కానీ అతని యొక్క వ్యాపారంలో లేదా వేరే అనారోగ్యంలో, ఇంకా వేరే ఏదైనా కారణంగా అప్పులో పడ్డాడు. అప్పులో కొడుకు చిక్కుకున్నాడు. అయితే, తండ్రి అతని నుండి వేరై, వేరే సంపాదన, సామాన్యంగా మన వద్ద ఏమంటారు? వాని పొయ్యి వేరు, వాని వంట వేరు, ఈ విధంగా అనుకుంటాం కదా. కానీ అతని వద్ద అప్పు ఉంది, ఆ అప్పు తీరపడానికి తండ్రి తన యొక్క జకాత్ కొడుక్కు ఇవ్వచ్చు. అప్పు తీర్చడానికి.

అలాగే, ఆపోజిట్, కొడుకు తన జకాత్ తండ్రికి ఇవ్వచ్చా? లేదు. అట్టనే ఇవ్వరాదు. ఎందుకు? ఎప్పుడైతే తండ్రి వృద్ధాప్య… ముసలివాడై, లేదా అనారోగ్యం పాలై, అతడు ఇక ఏమీ సంపాదించలేని స్థితిలో ఉన్నాడో, ఆ తండ్రికి తినిపించడం, త్రాగించడం, అతని యొక్క మందుల ఖర్చులు చూసుకోవడం, అతని యొక్క బట్టల ఖర్చులు చూసుకోవడం, అతను ఉండడానికి ఒక ఇల్లు, ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? కొడుకు సంతానం చూసుకోవాలి. అయితే ఏదైనా కారణంగా తండ్రి వద్ద ఏదైనా అప్పు అయిపోయింది. మరి ఈనాటి కాలంలో మన వద్ద లాంటి పరిస్థితి ఉండకూడదు. ఇటు కొడుకు సంపాదించి పంపుతా ఉంటాడు, అటు అయ్యా… త్రాగడంలో… జ్యూస్ మరియు పాలు కాదు, బాదం పాలు కాదు. అర్థమవుతుంది కదా? ఆ, సారాయి తాగడంలో, కళ్ళు తాగడంలో ఇలాంటి వాటిలో ఖర్చు చేస్తున్నాడు లేదా అంటే, ఆ కొడుకు పంపినప్పుడు ఇచ్చేద్దాంలే అని అప్పులు చేస్తున్నాడు. ఇట్లాంటి వాటిలో కూడా చాలా అధ్వాన్నంగా పరిస్థితులు మారిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఒకవేళ తండ్రి అప్పులో చిక్కుకొని ఉండేది ఉంటే, కొడుకు వద్ద జకాత్ సొమ్ము ఏదైతే ఉందో, అప్పు తీర్చడానికి ఇవ్వచ్చు.

ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటి? మనిషి తన బాధ్యతలో ఎవరైతే ఉన్నారో, అతని యొక్క ఖర్చు కొంచెం తగ్గిపోతుంది నాకు అని అతనికి ఏదైనా జకాత్ ఇవ్వడం ఇది ధర్మసమ్మతం కాదు. ఈ విధంగా ఆలోచించుకుంటూ పోతే, పండితులు రాసినటువంటి వ్యాఖ్యానాలు మనం చూసుకుంటూ పోతే ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ ఈ హదీస్ ఏదైతే మనం ఇప్పుడు విన్నామో అల్లాహ్ యొక్క దయవల్ల, దీని యొక్క వ్యాఖ్యానం ఇంతవరకు మనం సరిపుచ్చుకుందాం.

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) – సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)
https://teluguislam.net/2019/10/19/ikhlas/

నువ్వు అల్లాహ్ ప్రసన్నత కోసం నీ భార్య నోట్లో పెట్టే ముద్దకు కూడా ప్రతిఫలం పొందుతావు [ఆడియో]

నువ్వు అల్లాహ్ ప్రసన్నత కోసం నీ భార్య నోట్లో పెట్టే ముద్దకు కూడా ప్రతిఫలం పొందుతావు
https://youtu.be/H4nt2ZIXdcA [12 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[6] ఇహలోకంలోనే స్వర్గ సుఖాల శుభవార్త పాందిన పదిమందిలో ఒకరైన అబూ ఇస్‌హాఖ్‌ సాద్‌ బిన్‌ అబూ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) కథనం :

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తాను అంతిమ హజ్‌ యాత్ర చేసిన యేట వ్యాధిగ్రస్తుణ్ణయి ఉన్న నన్ను పరామర్శించే నిమిత్తం నా వద్దకు వచ్చారు. అప్పుడు నేను విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. నేను ఆయన్ని “దైవప్రవక్తా! నా నొప్పి ఎంత తీవ్రంగా తయారయిందో తమరు చూస్తూనే ఉన్నారు. నేనా డబ్బు కలవాణ్లి. నాకు ఒక్కగానొక్క కూతురు తప్ప ఇతర వారసులెవరూ లేరు. నేను నా ధనంలోని మూడింట రొండొంతులను ఎవరికైనా దానం చేయవచ్చా?” అని అడిగాను. దానికి ఆయన “కూడదు” అన్నారు. తిరిగి నేను “సగం ధనం దానం చేయనా” అని అడిగాను. దానికి కూడా ఆయన “కూడదు” అనే అన్నారు. మళ్ళీ నేను “మూడింట ఒక వంతైనా దానం చేయలేనా దైవ ప్రవక్తా!” అని విన్నవించుకోగా అందుకు ఆయన “మూడింట ఒక వంతు అయితే చేయగలవు. కాని అది కూడా ఎక్కువే (లేక) పెద్దదే అవుతుంది” (అని అన్నారు). “ఎందుకంటే నువ్వు నీ వారసులను పరుల ముందు చేయి చాపుతూ తిరిగి దరిద్రులుగా వదలి వెళ్ళడంకన్నా స్టితిమంతులుగా వదలి వెళ్ళడమే ఎంతో శ్రేయస్కరం. (గుర్తుంచుకో!) నువ్వు దైవప్రసన్నత కోసం ఏది ఖర్చు పెట్టినా దానికి నువ్వు ప్రతిఫలం పొందుతావు. ఆఖరికి నువ్వు నీ భార్య నోట్లో పెట్టే ముద్దకు కూడా ప్రతిఫలం పొందుతావు” అని ఉపదేశించారు.

అప్పుడు నేను “ఓ దైవప్రవక్తా! నేను నా సహచరుల వెనుక ఉండిపోతానా? (అంటే నా సహచరులు ముందుగానే చనిపోయి నేను ఈ లోకంలో ఒక్కడినే ఉండిపోతానా?)” అని సందేహపడగా దానికి ఆయన “(అయితేనేమి? మంచిదేగా) ఎందుకంటే నీ సహచరుల అనంతరం నువ్వు బ్రతికివుంటే దైవప్రసన్నత కోసం నువ్వు చేసుకునే ప్రతి ఆచరణతో నీ స్థాయి, అంతస్థులు పెరుగుతాయి. బహుశా నీకు ఇంకా జీవితం గడిపే అవకాశం లభిస్తుందేమో! అప్పుడు కొంత మంది (విశ్వాసులకు) నీవల్ల మేలు కలగవచ్చు, ఇంకొంతమంది (దైవ తిరస్కారులకు) నీ వల్ల కీడు కలగవచ్చు. ఓ అల్లాహ్‌! నా సహచరుల హిజ్రత్‌ని (ప్రస్థానాన్ని) పరిపూర్ణం గావించు. వారిని పరాజయం పాలుచేయకు’ అని వేడుకున్నారు. కాని “సాద్‌ బిన్‌ ఖౌలా” దయార్హులు. ఎందుకంటే ఆయన మక్కాలో ఉండగానే కన్నుమూశారు. అందుకని ఆయన కనికరించబడాలని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దుఆ చేసేవారు. (బుఖారీ – ముస్లిం)

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) – సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)
https://teluguislam.net/2019/10/19/ikhlas/

ముస్లిం చేసే దానధర్మాలు | కలామే హిక్మత్

మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారని అబూ మూసా అష్ అరి (రదియల్లాహు అన్హు) చెప్పారు: “దానం ఇవ్వటం ప్రతి ముస్లింకు తప్పనిసరి.”
సహచరులు అడిగారు – ‘ఒకవేళ అతని వద్ద లేకుంటే?!’
ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు :’అతను తన స్వహస్తాలతో శ్రమించి సంపాదించాలి. (దాంతో) తన స్వయానికి ప్రయోజనం చేకూర్చాలి మరియు దానం ఇవ్వాలి.’
సహచరులు సందేహంగా అడిగారు – ‘ఒకవేళ అలా చేయలేకపోతే? లేదా చేయకపోతే?’
ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు: ‘దయనీయ స్థితిలో ఉన్న అగత్యపరునికి సహాయపడాలి.’
సహచరులు అడిగారు – ‘ఒకవేళ అలా చేయకపోతేనో?’
ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) బదులిచ్చారు ‘మంచిని ఆజ్ఞాపించాలి’.
సహచరులు మళ్ళీ అడిగారు ‘ఒకవేళ అది కూడా చేయలేకపోతే?!’
ఆయన(సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు : ‘(పరులను) నొప్పించకుండా జాగ్రత్త పడాలి. ఇది కూడా అతని పాలిట దానమే.” (బుఖారి)

“దానం ఇవ్వటం ప్రతి ముస్లింకు తప్పనిసరి.” ముస్నద్ తియాసి ఉల్లేఖనంలో “ప్రతిరోజు” అనే పదం అదనంగా ఉంది. ఈ దానం శక్తిమేరకు ప్రతి ఒక్కరిపైతప్పనిసరి అవుతుంది. అంటే ప్రతి ముస్లిం నైజంలో, అతని ప్రవర్తనలో సదకా (దానం) ఒక భాగం కావాలన్నది దీని పరమార్థం. అతను ఏ స్థితిలో ఉన్నా – కలిమిలో ఉన్నా లేమి తాండవిస్తున్నా – అతనిలో దాతృ స్వభావం మాత్రం ఉండాల్సిందే అన్నది పై వాక్యం ఉద్దేశ్యం.

‘ఒకవేళ అతని వద్ద లేకపోతే’ అని ప్రవక్త గారి ప్రియ సహచరులు ప్రశ్నించారు.’దానం’ అనే ప్రస్తావన రాగానే ధన ధాన్యాదుల ద్వారా చేసే సహాయం మాత్రమేనని అసలు సహచరులు తలపోశారు. అయితే ఈ “పదం”కు ఉన్న భావం ఎంతో విస్తృతమయిందని, ఆపదలో ఉన్న ఒక వ్యక్తిని మృదువుగా పలకరించి అతన్ని ఓదార్చటం, అతని ఆపదను కడతేర్చే సంకల్పంతో తరుణోపాయం సూచించటం కూడా “సదకా” కోవలోకే వస్తుందని మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) విశ్లేషించారు.

ఈ నేపథ్యంలో ఇబ్నె అబీ హంజా ఇలా అభిప్రాయపడ్డారు :

“దాన ధర్మాలు చేయడం కేవలం శ్రీమంతులకే పరిమితం కాదని, డబ్బుఖర్చుపెట్టకుండా కూడా దానధర్మాలు చేయవచ్చని ఈ హదీసు ద్వారా ఆధారంలభిస్తున్నది.”

“అతను తన స్వహస్తాలతో శ్రమించి సంపాయించాలి.” అన్న ప్రవక్త గారి పలుకు గమనించదగినది. కష్టపడి ఉపాధిని సంపాయించటం చాలా ముఖ్యం అని దీని ద్వారా విదితమవుతుంది. కష్టపడి సంపాయించ గలిగినప్పుడే ఏ మనిషయినా తన స్వయానికై ఖర్చుచేసుకుని ఇతరుల కేదైనా సహాయం చెయ్యగలుగుతాడు. శ్రమించి సంపాదించుకుంటేనే, ఎదుటివారి ముందు చేతులు చాచి యాచించే దురవస్థ రాకుండా జాగ్రత్త పడగలుగుతాడు. పైపెచ్చు సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తూ, ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ, వీలయినంత ఎక్కువగా నిరాధారులనుఆదుకోగలుగుతాడు.

“దయనీయ స్థితిలో ఉన్న అగత్యపరునికి సహాయపడాలి” అనేది హదీసు లోని మరో వాక్యం. అటువంటి సహాయం నోటి ద్వారా కావచ్చు. చేతల ద్వారా కూడా కావచ్చు. మరోవిధంగా కూడా కావచ్చు. సహాయపడే తీరు ఎన్నో రకాలు.

“మంచిని గురించి ఆజ్ఞాపించాలి” అనేది మరో వాక్యం. వేరొక ఉల్లేఖనంలో “చెడులనుండి ఆపాలి” అని కూడా ఉంది. మంచిని ఆజ్ఞాపించటంలోనే “చెడుల నుండి ఆపటం” అనే భావం ఇమిడి ఉంది. ఖుర్ఆన్ హదీసుల వెలుగులో సమ్మతమయిన ప్రతిదీ ‘మంచి’గానే పరిగణించబడుతుంది. అలాగే ఖుర్ఆన్, హదీసులలో ఏవేవైతే ‘కూడదు’ అని అనబడ్డాయో అవి చెడుగానే పరిగణింపబడతాయి. వాటి జోలికి ప్రజలను పోనివ్వకుండా చూడటం కూడా గొప్ప సత్కార్యమే.

“(పరుల మనసు) నొప్పించకుండా జాగ్రత్త పడాలి.” నోటి ద్వారా నయినా, చేతలద్వారా నయినా లేక ఆ రెండింటి ద్వారానయినా ఎదుటివారు నొచ్చుకునేలా ప్రవర్తించరాదు. ఎట్టి పరిస్థితిలోనూ దైవ ప్రసన్నత చూరగొనటమే దీని వెనుక అసలు ప్రేరణ అయివుంటే తప్పకుండా ఇది సయితం పుణ్యకార్యంగానే పరిగణించబడుతుంది. దైవదాసులకు బాధ కలగకుండా మసలు కోవటం ఒక నిజమైన ముస్లిం యొక్క చిహ్నం. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు ద్వారా ఇదే భావం వ్యక్తమవుతోంది. ఆయన ఉల్లేఖించిన ప్రవచనం ఇలా ఉంది : “నిజమైన ముస్లిం అతనే – ఎవరి నోటి మరియు చేతుల బారి నుండి ముస్లింలుసురక్షితంగా ఉండగలరో.”

“ఒకవేళ అలా చెయ్యలేకపోతే,” ప్రవక్త సహచరులు పలు కోణాల నుంచి ఒకవిషయం యొక్క లోతుపాతులను తెలుసుకునేవారు. వారలా అడగటం వల్లనే “విషయం” ప్రాముఖ్యతను సంతరించుకుంది. సదకా (దానం) యొక్క విస్తృత భావం కూడా తెలిసివచ్చింది. దానధర్మాలు చేయటం, అవసరం ఉన్న వారిని ఆదుకోవటం, మంచిని గురించి ఆజ్ఞాపించటం, చెడుల నుండి ఆపటం ఇవన్నీ చెయ్యవలసిన ముఖ్య పనులేనని, వీటికిగాను దైవసన్నిధిలో ప్రతిఫలం కూడా అపారమని తెలియవచ్చింది.

ఈ హదీసు ద్వారా స్పష్టమయిన మరో విషయం ఏమిటంటే, సత్కార్యాలు వాటి ప్రాముఖ్యత, ప్రతిఫలాల దృష్ట్యా ఎన్నో స్థాయిలను కలిగి ఉంటాయి. అయితే వీటిలో అన్నిటిక న్నా ఉత్తమమయినది, మనిషి తన ధనాన్ని ఇతరులకు దానం చేయటం. ఒక ముస్లిం ఫకీరు భిక్షకుడు – దైవమార్గంలో ఖర్చు పెట్టలేకపోతే అతను, అది మినహా మిగతా సత్కార్యాలపై చొరవ చూపాలి. అల్లాహ్ ఏ ప్రాణి పైనా అతని శక్తికి మించిన భారం మోపడు. మనిషి, తాను ఏ సత్కార్యమూ చేయలేకపోతే, అతను కనీసం చెడుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలి.

ఈ హదీసు ద్వారా విదితమయ్యే మరో విషయం ఏమిటంటే, షరీఅత్ ఆదేశాలు -స్థితిగతుల దృష్ట్యా – స్వల్పమయిన వ్యత్యాసంతో వర్తిస్తాయి. ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం), ప్రతి ముస్లిం దానం ఇవ్వటం తప్పనిసరి అని ఖరారు చేశారు. అయితే ప్రతి ముస్లిం దానధర్మాలు చెయ్యలేడు. పైగా కొంతమందైతే దానాలు పుచ్చుకోవటం తప్ప మరో గత్యంతరం లేని స్థితిలో ఉంటారు. అటువంటప్పుడు పుచ్చుకోవడం వారి కొరకు సమంజసమే అవుతుంది. విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకునే ఉద్దేశ్యంతో మాటిమాటికీ విద్వాంసుని అడగవచ్చు అని కూడా ఈ హదీసు ద్వారా తెలియవస్తోంది. అదేవిధంగా కష్టపడి చెమటోడ్చి సంపాయించడం శ్రేష్ఠతతో కూడుకున్న విషయమని అలా సంపాయించే వాడే తనను ఆదుకోవటంతో పాటు ఇతరులను కూడా ఆదుకోగలుగుతాడని అవగతమవుతోంది.

[డౌన్లోడ్ PDF]

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ

దాన ధర్మాల విశిష్టత – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

దాన ధర్మాల విశిష్టత
సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/UA3H7Z8PhLY [34 నిముషాలు]

1- దానం చేసిన వారికి ఎన్ని రెట్లు ఎక్కువ ప్రతి ఫలం ఇస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు ?
2- దానం చేసిన వారికి, ప్రపంచంలో ఏమి ప్రయోజనం కలుగుతుంది? సమాధిలో ఏమి ప్రయోజనం కలుగుతుంది ? పరలోకంలో ఏమి ఫలితం దక్కుతుంది ?
3- దానం చేసే వారి కోసం దైవ దూతలు ఏమని దుఆ చేస్తారు ?
4- దానం చేస్తే ధనం తరుగుతుందా ? పెరుగుతుందా ?
5- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎంత గొప్పగా దానం చేసే వారో ఒక ఉదాహరణ చెప్పండి ?
6- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుటుంబీకులు ఎలా దానం చేసే వారో ఒక ఉదాహరణ చెప్పండి ?
7- సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) ఎలా దానం చేసే వారో కొన్ని ఉదాహరణలు చెప్పండి ?
8- దాన ధర్మాలు చేయుటకు కొన్ని మంచి మార్గాలు ఏమిటి ?
9- మరణించిన వారి తరుపున వారసులు దానం చేయవచ్చా ?
10- దాన ధర్మాలు చేయు వారు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ?

ఈ ప్రసంగంలో, ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల యొక్క విశిష్టత మరియు ప్రాముఖ్యత గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. దానధర్మాలు చేయడం ద్వారా లభించే అనేక ప్రయోజనాలు, అవి సంపదను తగ్గించకపోగా పెంచుతాయని, అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లార్చి చెడ్డ చావు నుండి కాపాడుతాయని, సమాధిలో మరియు తీర్పు దినాన రక్షణ కల్పిస్తాయని పేర్కొనబడింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), ఆయన కుటుంబ సభ్యులు మరియు సహచరుల జీవితాల నుండి దానశీలతకు సంబంధించిన ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. చివరగా, ఉత్తమమైన దానధర్మాలు చేసే మార్గాలు, దానం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు మరియు జాగ్రత్తలను కూడా ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనం ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల విశిష్టత అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా ఖురాన్ మరియు హదీసు గ్రంథాల వెలుగులో దాన ధర్మాల విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.

చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వాసులకు దానధర్మాలు చేయాలని ఆదేశిస్తూ ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, రెండవ అధ్యాయము, 254వ వాక్యంలో మనం చూచినట్లయితే అల్లాహ్ ఈ విధంగా ఆదేశించాడు:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِمَّا رَزَقْنَاكُم
ఓ విశ్వాసులారా! మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చేయండి.

అల్లాహ్ ఇచ్చిన సొమ్ములో నుంచి అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయాలన్న ఆదేశము ఈ వాక్యంలో ఉంది. అయితే దానధర్మాలు చేస్తే కలిగే ప్రయోజనాలు, ఘనత ఏమిటంటే, ఎవరైతే దానధర్మాలు చేస్తారో వారు నిజమైన విశ్వాసులు అని అల్లాహ్ పొగిడి ఉన్నాడు.

ఖురాన్ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము, మూడు మరియు నాలుగు వాక్యాలలో అల్లాహ్ తెలియజేశాడు:

الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ أُولَٰئِكَ هُمُ الْمُؤْمِنُونَ حَقًّا

వారు నమాజును నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా మార్గంలో ఖర్చు పెడతారు. నిజమైన విశ్వాసులంటే వీరే

అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేవారు నిజమైన విశ్వాసులు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయతులో, ఈ వాక్యంలో పొగిడి ఉన్నాడు.

అలాగే ఎవరైతే అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేస్తారో వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 700 రెట్లు ఎక్కువ ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అని ఉదాహరించి మరీ తెలియజేసి ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, రెండవ అధ్యాయము, 261వ వాక్యాన్ని చూడండి:

مَّثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّهِ كَمَثَلِ حَبَّةٍ أَنبَتَتْ سَبْعَ سَنَابِلَ فِي كُلِّ سُنبُلَةٍ مِّائَةُ حَبَّةٍ ۗ وَاللَّهُ يُضَاعِفُ لِمَن يَشَاءُ ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ

అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసే వారి ఉపమానం ఇలా ఉంటుంది: ఒక విత్తనాన్ని నాటగా, అది మొలకెత్తి అందులో నుంచి ఏడు వెన్నులు పుట్టుకు వస్తాయి. ప్రతి వెన్నులోనూ నూరేసి గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లాహ్ తాను కోరిన వారికి సమృద్ధి వొసగుతాడు. అల్లాహ్ పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతీదీ తెలిసినవాడు.

మనిషి ఒక్క గింజ భూమిలో నాటితే అందులో నుంచి ఒక చెట్టు పుడుతుంది. ఆ చెట్టుకు ఏడు కొమ్మలు ఉంటాయి. ప్రతి కొమ్మకు ఒక్కొక్క వెన్నుగా, ఏడు కొమ్మలకు ఏడు వెన్నులు ఉంటాయి. ప్రతి వెన్నులో వందేసి గింజలు ఉంటాయి అంటే ఏడు వెన్నులకు 700 గింజలు ఆ మనిషికి దక్కుతాయి. నాటింది ఒక్క గింజ కానీ పొందింది 700 గింజలు. ఆ ప్రకారంగా ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఒక్క దీనారు గానీ, ఒక్క దిర్హము గానీ, ఒక్క రియాలు గానీ, ఒక్క రూపాయి గానీ చిత్తశుద్ధితో దానము చేస్తాడో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని దానాన్ని మెచ్చుకొని అతనికి 700 రెట్లు ప్రతిఫలము ప్రసాదిస్తాడు అన్నమాట ఈ వాక్యంలో తెలియజేయడం జరిగింది.

దానధర్మాలు చేసే వారికి కలిగే మరొక గొప్ప విశిష్టత ఏమిటంటే, ఎవరైతే దానధర్మాలు చేస్తారో వారి సమస్యలు పరిష్కరించబడటానికి అల్లాహ్ సులభమైన మార్గాలు తెరుస్తాడని తెలియజేసి ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, 92వ అధ్యాయము ఐదు నుండి ఏడు వరకు ఉన్న వాక్యాలను ఒకసారి మనము చూచినట్లయితే:

فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ وَصَدَّقَ بِالْحُسْنَىٰ فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ
ఎవరైతే దైవ మార్గంలో ఇచ్చాడో, తన ప్రభువుకు భయపడుతూ ఉన్నాడో ఇంకా సత్ఫలితాన్ని సత్యమని ధ్రువపరిచాడో, అతనికి మేము సులువైన మార్గపు సౌకర్యము వొసగుతాము.

సమస్యల పరిష్కారము కోసము ప్రజలు టెన్షన్ పడుతూ ఎక్కడెక్కడికో తిరుగుతూ చాలా అగచాట్లు పడుతూ ఉంటారు. అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేస్తే సమస్యల పరిష్కారము కోసము అల్లాహ్ సులభమైన మార్గాలు తెరుస్తాడు అని వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి, సమస్యలు పరిష్కరించబడాలంటే దానధర్మాలు చేసుకోవాలన్న విషయం ఇక్కడ మనకు బోధపడింది.

అలాగే దానధర్మాలు చేసే వారికి లభించే మరొక విశిష్టత ఏమిటంటే మరణించిన తర్వాత సమాధిలో అగ్ని వేడి నుండి వారిని కాపాడటం జరుగుతుంది. మనం సమాధి సంగతులు అన్న ప్రసంగంలో వివరంగా విని ఉన్నాం. ఈ సమాధి ఎలాంటిది అంటే కొంతమంది కోసము అది స్వర్గపు లోయలాగా ఉంటుంది. వారు అక్కడ ప్రశాంతంగా పడుకుంటారు. అదే సమాధి మరికొంతమందికి నరక బావి లాగా మారిపోతుంది. వారు అక్కడ కఠినమైన శిక్షలు పొందుతూ ఉంటారు. ఇదంతా వివరంగా మనము సమాధి సంగతులు అనే ప్రసంగంలో విని ఉన్నాం. కాకపోతే ఇక్కడ మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటంటే, అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేసిన వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దయా కృపతో సమాధి అగ్ని వేడి నుండి రక్షిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం అస్సహీహా గ్రంథంలోనిది, ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:

إن الصدقة لتطفئ عن أهلها حر القبور
(ఇన్న స్సదఖత లతుత్ఫిఉ అన్ అహ్లిహా హర్రల్ ఖుబూర్)
నిశ్చయంగా దానధర్మాలు, దానధర్మాలు చేసే వారి కొరకు సమాధి అగ్నిని చల్లార్చి వేస్తుంది.

అంటే దానధర్మాలు చేసిన వారు సమాధిలోని అగ్ని వేడి నుండి రక్షించబడతాడు అన్నమాట.

దానధర్మాలు చేసే వారికి కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, లెక్కింపు రోజున హషర్ మైదానంలో వారికి నీడ కల్పించడం జరుగుతుంది. పరలోకం అన్న ప్రసంగంలో మనం విని ఉన్నాం వివరంగా. లెక్కింపు రోజున హషర్ మైదానంలో ప్రజలందరినీ ప్రోగు చేయడం జరుగుతుంది. సూర్యుడు చాలా సమీపంలో ఉంటాడు. వేడి తీవ్రతతో ప్రజలు అల్లాడుతూ ఉంటారు. చెమటలో కొంతమంది మునుగుతూ ఉంటారు. అక్కడ చెట్టు నీడ గానీ, భవనం నీడ గానీ, పర్వతం నీడ గానీ ఉండదు. కేవలం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సింహాసనం నీడ మాత్రమే ఉంటుంది. అయితే అక్కడ నీడ కొంతమందికి ప్రసాదించబడుతుంది. వారిలో ఒకరు ఎవరంటే ఎవరైతే ప్రపంచంలో దానధర్మాలు చేస్తారో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం సహీ అల్ జామే గ్రంథంలోనిది. ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:

كل امرئ في ظل صدقته حتى يقضى بين الناس
(కుల్లుమ్ రిఇన్ ఫీ జిల్లి సదఖతిహీ హత్తా యుఖ్జా బైనన్నాస్)
ప్రజల మధ్య తీర్పు జరిగేంత వరకు మనిషి తాను చేసిన దానధర్మం యొక్క నీడలో ఉంచబడతాడు.

అంటే ప్రజల మధ్య తీర్పు జరిగేంత వరకు అతను ప్రశాంతంగా, అతను ప్రపంచంలో చేసుకున్న దానధర్మాలకు బదులుగా నీడ కల్పించబడి అతను అక్కడ ప్రశాంతంగా ఉంటాడు అన్నమాట.

అలాగే మిత్రులారా, దానధర్మాలు చేయటం వల్ల అల్లాహ్ ఆగ్రహము చల్లబడుతుంది మరియు దానధర్మాలు చేసే వారు చెడ్డ చావు నుండి రక్షించబడతారు అని ప్రవక్త వారు శుభవార్త తెలియజేసి ఉన్నారు. ఇబ్నె హిబ్బాన్ మరియు తబరానీ గ్రంథాలలోని ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేశారు:

إن الصدقة لتطفئ غضب الرب وتدفع ميتة السوء
(ఇన్న స్సదఖత లతుత్ఫిఉ గజబర్రబ్బి వతద్ఫఉ మీతతస్సూ)
నిశ్చయంగా దానధర్మాలు అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లార్చి వేస్తాయి మరియు చెడ్డ చావు నుండి రక్షిస్తాయి.

మనం చూస్తూ ఉన్నాం, వార్తల్లో చూస్తూ ఉన్నాం, పేపర్లలో చదువుతూ ఉన్నాం, ప్రజలు భయంకరమైన చావు చస్తూ ఉన్నారు. దానధర్మాలు చేసే వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భయంకరమైన చావు నుండి కాపాడుతాడు. దానధర్మాలు చేస్తే అల్లాహ్ ఆగ్రహము చల్లబడుతుంది మిత్రులారా.

దానధర్మాలకు ఉన్న మరొక గొప్ప విశిష్టత ఏమిటంటే, దానధర్మాలు చేసే వారి కోసం దైవదూతలు, ఇద్దరు దైవదూతలు దుఆ చేస్తారు, ప్రార్థన చేస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఉల్లేఖనం సహీ అత్తర్గీబ్ గ్రంథంలోనిది, ఈ విధంగా ప్రవక్త వారు తెలియజేశారు:

ملكان يناديان
(మలకాని యునాదియాని)
ఇద్దరు దైవదూతలు పుకారిస్తూ ఉంటారు.

అంటే ఇద్దరు దైవదూతలు వేడుకుంటూ ఉంటారు, అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉంటారు. ఏమని?

اللهم أعط منفقا خلفا
(అల్లాహుమ్మ ఆతి మున్ఫిఖన్ ఖలఫన్)
ఖర్చు పెట్టే వానికి, ఓ అల్లాహ్! నువ్వు వెంటనే ప్రతిఫలం ప్రసాదించు అని వేడుకుంటూ ఉంటారు.

దైవదూతలు ఆ భక్తుని కోసము దుఆ చేయటం అంటే ఇది గొప్ప విశిష్టత కలిగిన విషయం మిత్రులారా.

ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేమిటంటే విశ్వాస బలహీనత కలిగిన కొంతమంది దానధర్మాలు చేసుకుంటూ పోతే సొమ్ము, ధనము తరిగిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. వాస్తవం అది కాదు. నిజం ఏమిటంటే దానధర్మాలు చేయటం వలన మనిషి యొక్క ధనము పెరుగుతుంది, తరగదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ముస్లిం గ్రంథంలో ఉంది. ప్రవక్త వారు సూటిగా తెలియజేశారు:

ما نقصت صدقة من مال
(మా నఖసత్ సదఖతుమ్ మిమ్మాల్)
దానధర్మం వల్ల ఏ భక్తుని సొమ్ము, ధనము తరగదు.

తరగదు అంటే పెరుగుతుంది తప్పనిసరిగా అని అర్థం. ఇదే విషయం బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త వారి నోట తెలియజేశాడు:

قال الله: أنفق يا ابن آدم أنفق عليك
(ఖాలల్లాహ్: అన్ఫిఖ్ యా ఇబ్న ఆదమ్ ఉన్ఫిఖ్ అలైక్)
ఓ ఆదమ్ కుమారుడా (మానవుడా) నువ్వు ఖర్చు చేయి, నేను నీకు ప్రసాదిస్తాను అన్నాడు.

ఇంతకుముందు కూడా మనం విని ఉన్నాం, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మార్గంలో మనం ఒకటి ఇస్తే 700 రెట్లు అల్లాహ్ పెంచి మాకు ఇస్తాడని. ఇక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మీరు నా మార్గంలో దానధర్మాలు చేయండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు కాబట్టి మనం కొంచెం ఇస్తే అల్లాహ్ మాకు ఎక్కువగా ఇస్తాడు కాబట్టి, కొంచెం ఇచ్చి ఎక్కువ పొందుతున్నాము కదా? ఆ ప్రకారంగా మన సొమ్ము తరుగుతూ ఉందా, పెరుగుతూ ఉందా? పెరుగుతూ ఉంది. కాబట్టి అదే ప్రవక్త వారు తెలియజేశారు, దానధర్మాల వల్ల సొమ్ము తరగదు గానీ పెరుగుతుంది. చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇస్తాను అని వాగ్దానం చేశాడు కాబట్టి అల్లాహ్ ఎక్కువ ఇస్తాడు అన్నమాట.

అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శిష్యులకు, మీరు అల్లాహ్ మార్గంలో నిర్భయంగా దానధర్మాలు చేయండి, ఖర్చు పెట్టండి అని ఆదేశించేవారు. ముఖ్యంగా బిలాల్ రజియల్లాహు అన్హు వారి గురించి చూచినట్లయితే, బిలాల్ రజియల్లాహు అన్హు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు, మిష్కాత్ గ్రంథంలోని ఉల్లేఖనంలో, ప్రవక్త వారు అంటున్నారు:

أَنْفِقْ يَا بِلَالُ، وَلَا تَخْشَ مِنْ ذِي الْعَرْشِ إِقْلَالًا
(అన్ఫిఖ్ యా బిలాల్, వలా తఖ్ష మిన్ జిల్ అర్షి ఇఖ్లాలా)
ఓ బిలాల్, అల్లాహ్ మార్గంలో నువ్వు ఖర్చు చేసుకుంటూ వెళ్ళిపో, ఆ సింహాసనం మీద ఉన్న అల్లాహ్ పట్ల నువ్వు లేమికి భయపడకు.

అంటే నేను ఇచ్చుకుంటూ పోతే నాకు అల్లాహ్ ఇస్తాడో లేదో అని నువ్వు భయపడవద్దు, నిర్భయంగా నువ్వు అల్లాహ్ మీద నమ్మకంతో దానధర్మాలు చేసుకుంటూ ముందుకు సాగిపో అని ప్రవక్త వారు శిష్యులకు బోధించారు.

మిత్రులారా, ఇప్పటివరకు మనము తెలుసుకున్న విషయం ఏమిటంటే ఖురాన్ మరియు హదీసు గ్రంథాల ప్రకారంగా అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయడం వలన ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అనేక అనుగ్రహాలు భక్తులు పొందుతారు.

ఇక రండి, దానధర్మాలు చేసిన కొంతమంది భక్తుల ఉదాహరణలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచంలోనే గొప్ప భక్తులు ఎవరంటే మన అందరి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన చేసిన దానధర్మాలలో ఒక రెండు ఉదాహరణలు మీ ముందర ఉంచుతూ ఉన్నాను.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితకాలంలో హునైన్ సంగ్రామం జరిగినప్పుడు ప్రవక్త వారి చేతికి 6,000 బానిసలు, 24,000 ఒంటెలు, 1,000 గొర్రెలు, 125 kg ల వెండి వచ్చింది. ఆ పూర్తి సొమ్ము ప్రవక్త వారు వినియోగించుకోవడానికి అవకాశము ఉంది. కానీ ప్రవక్త వారు ఏం చేశారంటే, ప్రజల మధ్య 6,000 బానిసలు, 24,000 ఒంటెలు, 100 గొర్రెలు, 125 kg ల వెండి మొత్తం పంచేశారు. ఒక్క బానిసను గాని వెంట తీసుకెళ్లలేదు, ఒక్క ఒంటెను గాని, ఒక్క గొర్రెను గాని వెంట తీసుకెళ్లలేదు. అంతెందుకు, ఒక్క వెండి నాణెము కూడా ప్రవక్త వారు చేతిలో పెట్టుకొని తీసుకెళ్లలేదు. మొత్తం పంచేసి ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. చూశారా? ప్రవక్త వారు ఎంతగా దానధర్మాలు చేసేవారు, ప్రజలకు పంచిపెట్టేవారో.

మరొక ఉదాహరణ చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి సహాయం చేయండి అని అడిగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, “అల్లాహ్ మార్గం చూపిస్తాడు, కూర్చోండి” అని కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మరొక వ్యక్తి వచ్చి సహాయం చేయండి అన్నారు. అతన్ని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. ఆ తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు, అతన్ని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. ముగ్గురు వచ్చారు, ముగ్గురిని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపు గడిచింది, ఒక శిష్యుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి నాలుగు వెండి నాణేలు బహుమానంగా, హదియాగా ఇచ్చి వెళ్ళాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే అక్కడ కూర్చొని ఉన్న ముగ్గురికి ఒక్కొక్క నాణెము, ఒక్కొక్క నాణెము ఇచ్చేయగా వారు సంతోషంగా తిరిగి వెళ్లిపోయారు. ప్రవక్త వారి వద్ద ఒక్క నాణెం మిగిలిపోయింది. ఎవరైనా వస్తారేమో, అవసరార్థులు వచ్చి అడుగుతారేమో ఇద్దాము అని ఎదురుచూశారు గాని ఎవరూ రాలేదు. ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి సమయంలో ప్రవక్త వారికి నిద్ర పట్టట్లేదు. లేస్తున్నారు, నమాజ్ ఆచరిస్తున్నారు, మళ్లీ పడుకునే ప్రయత్నం చేస్తున్నారు, నిద్ర పట్టట్లేదు, మళ్లీ లేస్తున్నారు నమాజ్ ఆచరిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు చూసి ప్రవక్త వారితో ప్రశ్నించారు: “ఓ దైవ ప్రవక్తా, ఏమైందండి? మీరు చాలా కంగారు పడుతూ ఉన్నారు. కొత్త నిబంధనలు ఏమైనా వచ్చాయా? కొత్త రూల్స్ ఏమైనా వచ్చాయా? వాటిని తలుచుకొని మీరు ఏమైనా కంగారు పడుతూ ఉన్నారా?” అని అడిగితే, ప్రవక్త వారు ఆ ఒక్క వెండి నాణెము తీసి, “ఇదిగో, ఈ వెండి నాణెం వల్ల నేను కంగారు పడుతూ ఉన్నాను. దీన్ని నేను దానం చేయకముందే ఒకవేళ మరణిస్తే, అల్లాహ్ నాకు ఈ ఒక్క నాణెం గురించి అడిగితే నేను ఏమి సమాధానం చెప్పాలి? అది నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేను కంగారు పడుతున్నాను” అన్నారు. అల్లాహు అక్బర్! ఒక్క వెండి నాణెము అల్లాహ్ మార్గంలో దానం చేయకపోతే నాకేం గతి పడుతుందో అని ప్రవక్త వారు అంతగా భయపడుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు దాన్ని దానం చేసేయాలని ఎదురుచూస్తున్నారంటే, ప్రవక్త వారు ఎంతగా దానం చేసేవారో చూడండి మిత్రులారా. అందుకోసమే చూసిన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, ప్రవక్త వారు చాలా అమితంగా, పరిమితి లేకుండా దానధర్మాలు చేసేవారు. ముఖ్యంగా రమజాన్ మాసంలో అయితే గట్టిగా వీస్తున్న గాలి కంటే వేగంగా దానధర్మాలు చేసేవారు అని చూసిన వారు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు.

ఇక ప్రవక్త వారి కుటుంబీకులను గురించి మనం చూచినట్లయితే, ప్రవక్త వారి మరణానంతరం, ప్రవక్త వారి సతీమణి, విశ్వాసుల మాత ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారి వద్దకు లక్ష దిర్హములు వచ్చాయి కానుకగా. ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ఆ రోజు ఉపవాసంతో ఉన్నారు. ఆ లక్ష దిర్హములు కూడా ఆ విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ప్రజల మధ్య పంచేశారు. మొత్తం పంచేసి ఇంట్లోకి ఎప్పుడైతే వెళ్లారో, సేవకురాలు ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారితో అడుగుతూ ఉన్నారు: “ఏమమ్మా, ఆ దిర్హములలో నుంచి, అనగా ఆ లక్ష దిర్హములలో నుంచి ఏమైనా మిగుల్చుకున్నారా? ఎందుకంటే ఈ రోజు ఇంట్లో ఉపవాస విరమణ చేయటానికి, ఇఫ్తారీ చేయటానికి కూడా ఏమీ లేదు” అన్నారు. ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు అన్నారు, “నేను ఒక్క దిర్హము కూడా మిగుల్చుకోలేదు, మొత్తం పంచేశాను” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ఇంట్లో ఉపవాస విరమణ చేయటానికి కూడా ఏమీ లేని పరిస్థితిలో కూడా వారు నిర్భయంగా, ఎంత విశాలమైన హృదయంతో ప్రజలకు దానధర్మాలు చేసేవారో చూడండి ప్రవక్త వారి కుటుంబీకులు.

ఇక ప్రవక్త వారి శిష్యుల గురించి మనం చూచినట్లయితే, ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు తబూక్ యుద్ధ సమయంలో ఇంట్లోని సగం సామాగ్రి తీసుకొని వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ఉంచేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, “ఏమయ్యా, ఇంట్లో ఏమి మిగిల్చావు?” అంటే, “సగం సామాగ్రి మిగిల్చి, మిగతా సగం తీసుకొని వచ్చి మీ ముందర ఉంచేశాను, ఓ దైవ ప్రవక్తా” అన్నారు. తర్వాత అబూబకర్ రజియల్లాహు అన్హు వారు తీసుకొని వచ్చి సామాగ్రి ప్రవక్త వారి ముందర ఉంచారు. ఆయనతో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, “ఏమండీ, ఇంట్లో ఏమి మిగిల్చి వచ్చారు?” అంటే అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ మరియు ప్రవక్త వారి మీద ఉన్న విశ్వాసము, అభిమానము మాత్రమే ఇంట్లో ఉంచి, మిగతా సొమ్ము మొత్తం పట్టుకొని వచ్చి మీ ముందర ఉంచేశానండి” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో ఇద్దరి గురించి చెప్పడం జరిగింది.

మరొక శిష్యుని గురించి మనం చూచినట్లయితే ఉస్మాన్ రజియల్లాహు తాలా అన్హు వారు. ప్రవక్త వారి మరణానంతరం అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఖలీఫాగా పరిపాలన చేస్తున్న రోజుల్లో మదీనాలో ఒకసారి కరువు ఏర్పడింది. ప్రజలు వచ్చి అబూబకర్ రజియల్లాహు అన్హు వారితో, “ధాన్యము లేక ప్రజలు ఆకలితో ఉన్నారు, వారి సమస్యను పరిష్కరించండి” అని కోరినప్పుడు, అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “ఒక్క రోజు మీరు ఓపిక పట్టండి, రేపు మీ సమస్య తీరిపోతుంది” అన్నారు. మరుసటి రోజు ఉదయాన్నే ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి ఒంటెలు సిరియా దేశము నుండి ధాన్యం మోసుకొని మదీనాకు చేరాయి. ఆ రోజుల్లో ట్రక్కులు, లారీలు, గూడ్స్ రైళ్లు ఇవన్నీ లేవు కదండీ. ఒంటెల మీద, గుర్రాల మీద సామానులు, ధాన్యము వచ్చేది. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి ఒంటెల మీద సిరియా దేశం నుంచి ధాన్యము మదీనాకు చేరింది. వ్యాపారవేత్తలు ఏం చేశారంటే పరుగెత్తుకుంటూ ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వచ్చి, “ఏమండీ, ఈ ధాన్యము మాకు అమ్మండి, మేము మీకు లాభం ఇస్తాము” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు వారిని అడిగారు, “ఎంత ఇస్తారు మీరు?” అని. ఆ వ్యాపారవేత్తలు ఏమన్నారంటే, “మీరు పదికి కొన్న దాన్ని పదమూడు ఇచ్చి తీసుకుంటాము” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “నాకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారు” అన్నారు. వ్యాపారవేత్తలు కొద్దిసేపు ఆలోచించుకొని, “సరేనండి, మీరు పదికి కొన్న దాన్ని పదిహేను ఇచ్చి మేము కొంటాము, మాకు ఇచ్చేయండి” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు మళ్ళీ అదే మాట అన్నారు, “నాకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారండి” అన్నారు. వ్యాపారవేత్తలు ఆశ్చర్యపోయారు. “మదీనాలో మేమే పెద్ద వ్యాపారవేత్తలము, మాకంటే ఎక్కువ లాభము మీకు ఇచ్చి ఈ ధాన్యం కొనుగోలు చేసేవాడు ఎవడు ఉన్నాడు, చెప్పండి?” అని అడిగారు. అప్పుడు ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు ఈ విధంగా ప్రకటించారు: “చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన మార్గంలో ఒకటి ఇస్తే 700 రెట్లు ఎక్కువగా ఇస్తాను అని వాగ్దానము చేసి ఉన్నాడు కాబట్టి, మీరందరూ సాక్షిగా ఉండండి, ఈ ఒంటెల మీద ఉన్న పూర్తి ధాన్యాన్ని నేను మదీనా వాసుల కోసము దానం చేసేస్తూ ఉన్నాను, అల్లాహ్ కోసము” అని దానం చేసేశారు. అల్లాహు అక్బర్! చూశారా? ఇది ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క ఉదాహరణ.

అలాగే అబూ దహ్దా రజియల్లాహు అన్హు అని ఒక సహాబీ ఉండేవారు. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలోని రెండవ అధ్యాయము 245వ వాక్యాన్ని అవతరింపజేశాడో:

مَّن ذَا الَّذِي يُقْرِضُ اللَّهَ قَرْضًا حَسَنًا فَيُضَاعِفَهُ لَهُ أَضْعَافًا كَثِيرَةً
అల్లాహ్‌కు మంచి రుణం ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? దాన్ని ఆయన ఎన్నోరెట్లు పెంచి తిరిగి ఇస్తాడు.

ఎవరు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసి అల్లాహ్ కు అప్పు ఇస్తాడో, దాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన వద్ద పెంచి పోషించి పెద్దదిగా చేసేస్తాడు, భక్తుడు మరణించి అల్లాహ్ వద్దకు చేరినప్పుడు పెద్ద ప్రతిఫల రూపంలో అతనికి అది ఇవ్వబడుతుంది” అని ఆ వాక్యంలో తెలియజేయబడింది.

కాబట్టి ఆ వాక్యాన్ని విన్న తర్వాత ఆ సహాబీ అబూ దహ్దా రజియల్లాహు తాలా అన్హు వారు ప్రవక్త వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా ప్రకటించి ఉన్నాడు కాబట్టి, మీరు సాక్షిగా ఉండండి, మదీనాలో నాకు 600 ఖర్జూరపు చెట్లు కలిగిన ఒక తోట ఉంది. ఆ తోటను నేను అల్లాహ్ మార్గంలో దానం చేసేస్తున్నాను, అల్లాహ్ కు అప్పు ఇచ్చేస్తూ ఉన్నాను” అని ప్రకటించేశారు. తర్వాత ఆ తోట వద్దకు వెళ్లి తోట లోపల అడుగు కూడా పెట్టకుండా బయట నుంచే నిలబడిపోయి, కుటుంబ సభ్యులు తోట లోపల ఉంటే, “ఏమండీ, మీరందరూ బయటికి వచ్చేయండి, నేను అల్లాహ్ మార్గంలో ఈ తోటను దానం చేసేశాను” అని చెప్పగా కుటుంబ సభ్యులు అందరూ బయటికి వచ్చేసారు. అల్లాహు అక్బర్! ఇవన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యులు, సహాబాలు చేసిన దానధర్మాలకు కొన్ని నిదర్శనాలు.

ఇక అలనాటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంనాటి కొంతమంది మహిళల గురించి మనం చూచినట్లయితే, ఇంతకుముందు మనం ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారి గురించి విన్నాం. మిగతా వేరే సహాబియాత్ ల గురించి, మహిళల గురించి మనం చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి మహిళల మధ్య వెళ్లి ప్రసంగించారు. ప్రసంగించిన తర్వాత దానధర్మాలు చేసుకొని మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి అని చెప్పినప్పుడు, మహిళలు దానధర్మాలు చేశారు. చూసిన వారు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, అక్కడ ఉన్న మహిళల్లో కొంతమంది వారు తొడుగుతూ ఉన్న, ధరిస్తూ ఉన్న నగలు సైతము దానం చేసేశారు అని చెప్పారు. ఇవన్నీ కొంతమంది భక్తులు చేసిన దానధర్మాల ఉదాహరణలు మిత్రులారా.

అయితే ఖురాన్ మరియు హదీసులలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాంటి దానధర్మాలు చేసుకోవటం మంచిది అని విశిష్టతలు తెలియజేసి ఉన్నారు? రండి ఇప్పుడు మనము కొన్ని ఉత్తమమైన దానధర్మాలు చేసే మార్గాలను తెలుసుకుందాం.

మొదటి మార్గం: సదకా జారియా అని అరబీలో అంటారు. నిరంతరం పుణ్యం లభిస్తూ ఉండే మార్గం అని తెలుగులో దాన్ని అనువాదం చేస్తారు. నిరంతరం పుణ్యం లభిస్తూ ఉండే మార్గం ఏమిటి అంటే ఒక రెండు మూడు విషయాలు మీ ముందర ఉంచుతున్నాను చూడండి.

ఒక వ్యక్తి ఒక మస్జిద్ నిర్మించాడు. ఆ మస్జిద్ నిర్మించిన తర్వాత అతను మరణించినా, ప్రపంచంలో ఆ మస్జిద్ మిగిలి ఉన్నన్ని రోజులు, ప్రజలు అందులో నమాజ్ ఆచరిస్తున్నన్ని రోజులు, మస్జిద్ నిర్మించిన ఆ వ్యక్తి సమాధిలో ఉన్నా గాని అతనికి నిరంతరము పుణ్యము చేరుతూనే ఉంటుంది.

అలాగే ఒక వ్యక్తి ప్రజల దాహం తీర్చడానికి నీటి బావి తవ్వించాడు. తర్వాత అందులో నీళ్లు ప్రజలు తీసుకోవటం కోసము సౌకర్యాలు కల్పించాడు. ఆ తర్వాత అతను మరణించాడు. అతను మరణించి సమాధిలోకి వెళ్లిపోయినా, ఈ బావి ఉన్నన్ని రోజులు, ఆ బావి నీళ్లు ప్రజలు వాడినన్ని రోజులు ఆ వ్యక్తికి నిరంతరం పుణ్యము సరఫరా అవుతూనే ఉంటుంది, చేరుతూనే ఉంటుంది. ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయండి.

అలాగే ధార్మిక విద్య ఉంది. ఒక గురువుగారు శిష్యులకు ధార్మిక విద్య నేర్పించారు. గురువుగారు మరణించి సమాధిలోకి వెళ్లిపోయినా, శిష్యులు ప్రపంచంలో గురువు వద్ద నేర్చుకున్న విద్యను వారు ఎన్ని రోజులు అయితే అమలుపరుస్తూ ఉంటారో, ఇతరులకు బోధిస్తూ ఉంటారో ఆయనకు నిరంతరము, ఎలాంటి విరామం లేకుండా పుణ్యము సరఫరా అవుతూనే ఉంటుంది మిత్రులారా. ఇవి సదకా జారియాకు కొన్ని ఉదాహరణలు. ఇలాంటి సదకా జారియా చేసుకోవాలి. ఇది మొదటి మార్గం.

మరొక మార్గం ఏమిటంటే అనాథలను పోషించాలి. తల్లిదండ్రులు మరణించిన తర్వాత అనాథలు ఎవరైతే ఉంటారో వారిని పోషించటము కూడా గొప్ప పుణ్యకార్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

أنا وكافل اليتيم كهاتين في الجنة وأشار بالسبابة والوسطى
(అనా వకాఫిలుల్ యతీమి కహాతైని ఫిల్ జన్న వ అషార బిస్సబ్బాబతి వల్ వుస్తా)
నేను మరియు అనాథ బిడ్డకు పోషించే వ్యక్తి ఇద్దరము స్వర్గంలో పక్కపక్కనే ఉంటాము అని చూపుడు వేలు మరియు మధ్య వేలు ఇలా చూపించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. (అహ్మద్ గ్రంథంలోని ఉల్లేఖనం)

ఎంత గొప్ప విషయం అండి! ప్రవక్త వారి పొరుగులో మనము ఉండవచ్చు. అల్లాహు అక్బర్! కాబట్టి మనం చేసే దానధర్మాలలో ఒక మంచి మార్గం ఏది అంటే అనాథలను పోషించటం.

అలాగే దానధర్మాలు చేసుకోవటానికి మరొక గొప్ప మార్గం, ప్రజల ఆకలి తీర్చటం, ప్రజల దాహము తీర్చటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు, అబూ దావూద్ గ్రంథంలోని ఉల్లేఖనం సారాంశం ఏమిటంటే: “ఎవరైతే విశ్వాసులలో ఆకలితో ఉన్న వారిని అన్నం పెట్టి వారి ఆకలి తీరుస్తాడో, విశ్వాసులలో నీళ్ల కోసము తపిస్తూ ఉన్న విశ్వాసుల దాహాన్ని తీరుస్తాడో, అలాంటి వ్యక్తికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గంలోని పండ్లు, ఫలాలు తినిపిస్తాడు, స్వర్గంలోని నదుల నుండి త్రాపిస్తాడు” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ఆకలితో ఉన్నవారి ఆకలి తీరిస్తే, దాహంతో ఉన్న వారి దాహము తీరిస్తే ప్రతిఫలంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గపు పళ్ళ ఫలాలు, స్వర్గపు నదుల నీరు త్రాపిస్తాడు, ప్రసాదిస్తాడు మిత్రులారా.

అలాగే ఎవరైతే నిరుపేదలు, సరైన బట్టలు లేవు, నగ్నంగా ఉంటూ ఉన్నారు, అలాంటి వారికి బట్టలు తొడిగించడం కూడా గొప్ప సత్కార్యము, దానధర్మాలు చూసుకోవడానికి ఇది కూడా ఒక ఉత్తమమైన మార్గం. ప్రవక్త వారు తెలియజేశారు:

أَيُّمَا مُسْلِمٍ كَسَا مُسْلِمًا ثَوْبًا عَلَى عُرْيٍ كَسَاهُ اللَّهُ مِنْ خُضْرِ الْجَنَّةِ
(అయ్యుమా ముస్లిమ్ కసా ముస్లిమన్ సౌబన్ అలా ఉరన్ కసాహుల్లాహు మిన్ ఖుజ్రిల్ జన్న)
ఏ భక్తుడైతే నగ్నంగా ఉన్న వారికి బట్టలు తొడిగిస్తాడో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ప్రతిఫలంగా స్వర్గంలోని పచ్చని దుస్తులు ధరింపజేస్తాడు అన్నారు. ( అబూ దావూద్ గ్రంథంలోని ఉల్లేఖనం)

అల్లాహు అక్బర్! స్వర్గంలోని మంచి బట్టలు, ఉత్తమమైన బట్టలు, పచ్చని బట్టలు అల్లాహ్ ఆ భక్తునికి ఇస్తాడని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.

అలాగే దానధర్మాలు చేసుకోవటం కోసము మరొక సౌకర్యవంతమైన విషయం ఏమిటంటే, తల్లిదండ్రుల తరఫున, వారు మరణించిన తర్వాత వారి బిడ్డలు దానధర్మాలు చేసుకోవచ్చు. చూడండి దీనికి ఉదాహరణగా తిర్మిజీ గ్రంథంలోని ఉల్లేఖనం ప్రామాణికమైనది. సాద్ రజియల్లాహు తాలా అన్హు వారు, ఒక సహాబీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి అడుగుతూ ఉన్నారు:

يا رسول الله إن أمي توفيت أفينفعها إن تصدقت عنها
(యా రసూలల్లాహ్ ఇన్న ఉమ్మీ తువఫియత్ అఫయన్ఫఉహా ఇన్ తసద్దఖ్తు అన్హా)
ఓ దైవ ప్రవక్తా! నా తల్లి మరణించింది. నేను ఆవిడ తరపున సదఖా చేస్తే, దానధర్మాలు చేస్తే ఆవిడకు ప్రయోజనము చేకూరుతుందా? అని అడిగారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “నఅమ్. అవును, తప్పనిసరిగా ఆవిడ పేరున నువ్వు దానధర్మాలు చేసుకోవచ్చు, ఆవిడకు ప్రయోజనము చేకూరుతుంది” అని అనుమతి ఇచ్చేశారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయన వద్ద ఒక తోట ఉండింది, ఆ తోటను ఆయన వారి తల్లి పేరు మీద దానం చేసేశారు. అల్లాహు అక్బర్! ఈ ఉల్లేఖనం ప్రకారంగా మనకు స్పష్టమైన విషయం ఏమిటంటే మన తల్లిదండ్రుల్లో ఎవరు మరణించి ఉన్నా వారి బిడ్డలుగా మనము ప్రపంచంలో వారి పేరు మీద దానధర్మాలు చేయవచ్చు, వారికి పుణ్యము దక్కేలాగా ప్రయత్నించవచ్చు.

ఇక దానధర్మాలు ఎప్పుడు చేసుకోవాలి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

أن تصدق وأنت صحيح شحيح تخشى الفقر وتأمل الغنى
(అన్ తసద్దఖ వఅన్త సహీహున్ షహీహున్ తఖ్ షల్ ఫఖర వతఅమలుల్ గినా)

నువ్వు యవ్వనంగా ఉన్నప్పుడు, బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నాకు ఏమైనా ఇంకా తక్కువ పడుతుందేమో అన్న భయము కలుగుతూ ఉన్నప్పుడు, నాకు ఇంకా డబ్బు కావాలి ధనము కావాలి అని ఆశిస్తున్నప్పుడు, నువ్వు దానధర్మము చేస్తే అది నీ కొరకు ఉత్తమమైన సందర్భము అన్నారు. (బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం)

ఎప్పుడైతే మనిషి యవ్వనంగా ఉన్నప్పుడు ఎక్కువ సొమ్ము కావాలి అని అతనికి ఎక్కువ కోరికలు ఉంటాయి కాబట్టి ఎక్కువ సొమ్ము కావాలని కోరుకుంటాడు. చాలా అవసరాలు ఉంటాయి, ఆస్తులు కావాలి, ఇల్లు నిర్మించుకోవాలి, భార్య బిడ్డలకు నగలు తొడిగించుకోవాలి, ఇలా రకరకాల కోరికలు ఉంటాయి. అప్పుడు సొమ్ము కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది. అలాంటి సందర్భంలో మనిషి తన అవసరాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూ కూడా అల్లాహ్ మార్గంలో దానం చేసినట్లయితే అది ఉత్తమమైన సందర్భం అని ప్రవక్త వారు తెలియజేశారు. అదే ముసలివారు అయిపోయిన తర్వాత, చావు దగ్గరికి వచ్చేసిన తర్వాత మనిషి ఏం చేస్తాడండి? ఎలాంటి కోరికలు ఉండవు. ఇంక ఎలాగూ ప్రపంచం వదిలేసి వెళ్ళిపోతున్నాము కదా, వెంట తీసుకొని వెళ్ళము కదా అని అప్పుడు దానం చేయటం కంటే కూడా అవసరాలు ఎక్కువగా ఉన్నప్పుడు, కోరికలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో దానధర్మాలు చేస్తే అది ఎక్కువ ప్రయోజనం కల్పించే విషయం అని ప్రవక్త వారు అన్నారు.

ఇక చివర్లో, దానధర్మాలు చేసే వారికి కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. ఏంటి ఆ జాగ్రత్తలు అంటే, మొదటి విషయం, దానధర్మాలు చేసే వారు ధర్మసమ్మతమైన, హలాల్ సంపాదనతో మాత్రమే దానధర్మాలు చేయాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనం:

إن الله عز وجل لا يقبل صلاة بغير طهور ولا صدقة من غلول
(ఇన్నల్లాహ అజ్జవజల్ లా యఖ్బలు సలాతన్ బిగైరి తహూరిన్ వలా సదఖతన్ మిన్ గలూలిన్)
ఉజూ లేకుండా నమాజు చేస్తే అలాంటి నమాజు అల్లాహ్ ఆమోదించడు, హరామ్ సంపాదనతో దానధర్మాలు చేస్తే అలాంటి దానధర్మాలను కూడా అల్లాహ్ ఆమోదించడు అన్నారు.

కాబట్టి హరామ్ సంపాదనతో కాదు, హలాల్ సంపాదన, ధర్మసమ్మతమైన సంపాదనతో దానధర్మాలు చేసుకోవాలి.

రెండవ సూచన ఏమిటంటే, దానధర్మాలు చేసే వారు ప్రదర్శనా బుద్ధితో దానధర్మాలు చేయకూడదు. కేవలం అల్లాహ్ చిత్తం కోసం మాత్రమే దానధర్మాలు చేయాలి. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే నేడు ప్రజలు ఏం చేస్తారంటే, డబ్బు లేదా ఇతర వస్తువులు ఇతరులకు దానం చేస్తూ ఉన్నారంటే ఎన్ని సెల్ఫీలు, ఎన్ని ఫోటోలు, ఎన్ని వీడియోలు తీసుకుంటారంటే ఇక దాన్ని సోషల్ మీడియాలో, ప్రతి ప్లాట్‌ఫామ్‌లో, స్టేటస్‌లలో వేరే వేరే చోట ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ప్రపంచంలో నాకంటే గొప్ప దానకర్త ఎవరైనా ఉన్నారో లేదో చూడండి అని చూపిస్తూ ఉంటారు. ఇది కాదండి కావాల్సింది. ప్రపంచానికి చూపించటం, స్టేటస్‌లలో పెట్టుకోవడం కాదు, అల్లాహ్ కు నచ్చాలి. దాని కోసం మనం దానధర్మం చేయాలి. ప్రజలకు చూపించటానికి, ప్రజల దృష్టిలో నేను దాతను అనిపించుకోవడానికి కాదండి. అల్లాహ్ మెచ్చుకోవాలన్న ఉద్దేశంతో చేయాలి. ప్రదర్శనా బుద్ధితో దానం చేస్తే దాని పుణ్యం వృధా అయిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అహ్మద్ గ్రంథంలోని ఉల్లేఖనం:

ومن تصدق يرائي فقد أشرك
(వమన్ తసద్దఖ యురాయీ ఫఖద్ అష్రక)
ఎవరైతే ప్రదర్శనా బుద్ధితో, చూపించటానికి దానధర్మాలు చేస్తాడో, అతను బహుదైవారాధనకు పాల్పడినట్లు అవుతుంది అన్నారు.

అల్లాహు అక్బర్! కాబట్టి ప్రదర్శనా బుద్ధితో దానధర్మాలు చేయకూడదు.

మూడవ విషయం, దానధర్మాలు చేసిన తర్వాత ఉపకారము చాటకూడదు. దెప్పి పొడవటం అంటారు కదండీ. ఉపకారము చాటకూడదు. ఇచ్చిన తర్వాత నేను నీకు ఇచ్చాను కదా, అది ఇచ్చాను కదా, ఇది ఇచ్చాను కదా అని కొంతమంది వారి మీద ఉపకారం చాటుతూ ఉంటారు. అలా చేస్తే ఏమవుతుందంటే చేసిన ఆ దానధర్మాల పుణ్యం మొత్తం వృధా అయిపోతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు.

ఇక చివర్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే, దానం ఇచ్చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా కఠినంగా హెచ్చరించారు. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, “ఎవరైతే దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటారో వారు కక్కిన దాన్ని మళ్ళీ నోట్లో వేసుకున్న దానికి సమానం అన్నారు”. అల్లాహు అక్బర్!

ఇవి దానధర్మాలు చేసుకోవటానికి, దానధర్మాలు చేసే వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు. నేను చివర్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన అందరికీ అన్న, విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=28200

జకాతు & సదఖా (మెయిన్ పేజీ):
https://teluguislam.net/five-pillars/zakah/

అన్నదానం ఇస్లాంలో – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అన్నదానం ఇస్లాంలో – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/uwgWP1aKcjs [39 నిముషాలు]

76:5 إِنَّ الْأَبْرَارَ يَشْرَبُونَ مِن كَأْسٍ كَانَ مِزَاجُهَا كَافُورًا
నిశ్చయంగా సజ్జనులు (విశ్వాసులు) ‘కాఫూర్’ కలుపబడిన మధుపాత్రలను సేవిస్తారు.

76:6 عَيْنًا يَشْرَبُ بِهَا عِبَادُ اللَّهِ يُفَجِّرُونَهَا تَفْجِيرًا
అదొక సరోవరం. దైవదాసులు దాన్నుండి (తనివి తీరా) త్రాగుతారు. (తాము కోరిన చోటికి) దాని పాయలు తీసుకుపోతారు.

76:7 يُوفُونَ بِالنَّذْرِ وَيَخَافُونَ يَوْمًا كَانَ شَرُّهُ مُسْتَطِيرًا
వారు తమ మొక్కుబడులను చెల్లిస్తుంటారు. ఏ రోజు కీడు నలువైపులా విస్తరిస్తుందో ఆ రోజు గురించి భయపడుతుంటారు.

76:8 وَيُطْعِمُونَ الطَّعَامَ عَلَىٰ حُبِّهِ مِسْكِينًا وَيَتِيمًا وَأَسِيرًا
అల్లాహ్ ప్రీతికోసం నిరుపేదలకు, అనాధులకు, ఖైదీలకు అన్నం పెడుతుంటారు.

76:9 إِنَّمَا نُطْعِمُكُمْ لِوَجْهِ اللَّهِ لَا نُرِيدُ مِنكُمْ جَزَاءً وَلَا شُكُورًا
(పైగా వారిలా అంటారు) : “మేము కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే మీకు తినిపిస్తున్నాము. అంతేగాని మీ నుండి మేము ఎలాంటి ప్రతిఫలాన్ని గానీ, ధన్యవాదాలను గానీ ఆశించటం లేదు.”

76:10 إِنَّا نَخَافُ مِن رَّبِّنَا يَوْمًا عَبُوسًا قَمْطَرِيرًا
“నిశ్చయంగా మేము మా ప్రభువు తరఫున సంభవించే అత్యంత కఠినమైన, సుదీర్ఘమైన రోజు గురించి భయపడుతున్నాము.”

90:13 فَكُّ رَقَبَةٍ
ఏ (బానిస లేక బానిసరాలి) మెడనైనా (బానిసత్వం నుండి) విడిపించటం.

90:14 أَوْ إِطْعَامٌ فِي يَوْمٍ ذِي مَسْغَبَةٍ
లేదా ఆకలిగొన్న నాడు అన్నం పెట్టడం –

90:15 يَتِيمًا ذَا مَقْرَبَةٍ
బంధుత్వంగల ఏ అనాధకు గాని,

90:16 أَوْ مِسْكِينًا ذَا مَتْرَبَةٍ
మట్టిలో పడిఉన్న ఏ నిరుపేదకు గానీ (అన్నం పెట్టడం)!

90:17 ثُمَّ كَانَ مِنَ الَّذِينَ آمَنُوا وَتَوَاصَوْا بِالصَّبْرِ وَتَوَاصَوْا بِالْمَرْحَمَةِ
అటుపిమ్మట, విశ్వసించి పరస్పరం సహనబోధ చేసుకుంటూ, ఒండొకరికి దయాదాక్షిణ్యాల గురించి తాకీదు చేసుకునేవారైపోవాలి.

90:18 أُولَٰئِكَ أَصْحَابُ الْمَيْمَنَةِ
వీళ్ళే కుడిపక్షం వారు (భాగ్యవంతులు).

69:31 ثُمَّ الْجَحِيمَ صَلُّوهُ
“మరి వాణ్ణి నరకంలోకి త్రోసివేయండి.

69:32 ثُمَّ فِي سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًا فَاسْلُكُوهُ
“మరి వాణ్ణి డెభ్భై మూరల పొడవు గల సంకెళ్ళతో బిగించి కట్టండి.

69:33 إِنَّهُ كَانَ لَا يُؤْمِنُ بِاللَّهِ الْعَظِيمِ
“వాడు మహోన్నతుడైన అల్లాహ్ ను విశ్వసించేవాడూ కాదు,

69:34 وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ
“నిరుపేదకు అన్నం పెట్టమని (కనీసం) ప్రోత్సహించేవాడూ కాదు.

అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం | జాదుల్ ఖతీబ్

ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:-
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్

అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం: [ఇక్కడ డౌన్లోడ్ PDF]

ఖుత్బా యందలి ముఖ్యాంశాలు 

  • 1) ఖురాను హదీసుల వెలుగులో అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం ప్రాధాన్యత.
  • 2) అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం – మహత్యం మరియు లాభాలు.
  • 3) అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం- కొన్ని మహత్తరమైన ఉదాహరణలు.
  • 4) అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం – మర్యాదలు.
  • 5) అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం – కొన్ని రూపాలు.
  • 6) దానాల ద్వారా లభించిన పుణ్యాన్ని వ్యర్థం చేసే కొన్ని కార్యాలు.
  • 7) జకాత్ విధిత్వము – దాని అంశాలు.