నీకు నీ సంకల్పానికి అనుగుణంగా పుణ్యం లభిస్తుంది | సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్) | హదీసు కిరణాలు [ఆడియో, టెక్స్ట్]

నీకు నీ సంకల్పానికి అనుగుణంగా పుణ్యం లభిస్తుంది | సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)
https://youtu.be/lQSrDz01_OQ [19 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, రియాదుస్ సాలిహీన్ నుండి ఐదవ హదీసు వివరించబడింది. ఈ హదీసులో మ’అన్ ఇబ్ను యజీద్, అతని తండ్రి యజీద్ మరియు తాత అఖ్నస్, ముగ్గురూ సహాబాలు కావడం ఒక విశేషంగా పేర్కొనబడింది. యజీద్ మస్జిద్ లో దానం చేయాలనే ఉద్దేశ్యంతో ధనాన్ని ఉంచగా, అతని కొడుకు మ’అన్ అవసరార్థం దానిని తీసుకున్నాడు. తండ్రి దీనిపై అభ్యంతరం చెప్పగా, వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీర్పు కోసం వెళ్లారు. ప్రవక్త (స) “ఓ యజీద్, నీ సంకల్పానికి ప్రతిఫలం నీకు లభిస్తుంది, మరియు ఓ మ’అన్, నీవు తీసుకున్నది నీకే చెందుతుంది” అని తీర్పు ఇచ్చారు. ఈ సంఘటన నుండి, కర్మలు సంకల్పాలపై ఆధారపడి ఉంటాయని, ఉద్దేశ్యం మంచిదైతే ఫలితం ఊహించని విధంగా ఉన్నా పుణ్యం లభిస్తుందని వివరించబడింది. అలాగే, తండ్రీకొడుకుల మధ్య విభేదాలు వస్తే పండితుల వద్దకు వెళ్లి పరిష్కారం వెతకాలని సూచించబడింది. చివరగా, ఒక వ్యక్తి తన కొడుకుకు లేదా తండ్రికి సాధారణ దానం (సదకా) ఇవ్వవచ్చని, కానీ జకాత్ ఇవ్వరాదని, ఎందుకంటే వారి పోషణ బాధ్యత తనపైనే ఉంటుందని వివరించబడింది. అయితే, వారు అప్పుల్లో ఉంటే, ఆ అప్పు తీర్చడానికి జకాత్ ఇవ్వవచ్చని స్పష్టం చేయబడింది.

5. హజ్రత్‌ మాన్‌ బిన్‌ యజీద్‌ బిన్‌ అఖ్‌నస్‌ (రదియల్లాహు అన్హుమ్) (ఈయన, ఈయన తండ్రీ తాతలు ముగ్గురూ దైవప్రవక్త అనుచరులే) కథనం:

“మా నాన్న యజీద్‌ ఒకసారి దానధర్మాల నిమిత్తం కొన్ని దీనార్లు బయటికి తీసి వాటిని మస్జిద్ లో ఒక వ్యక్తి దగ్గర (అవసరమున్న వానికి ఇవ్వమని) ఉంచి వెళ్ళిపోయారు. అదే సమయంలో నేను అక్కడికి వచ్చాను. (అవసరం నిమిత్తం) నేను ఆ వ్యక్తి నుండి దీనార్లు పుచ్చుకొని ఇంటికి తీసుకువచ్చాను. వాటిని చూసి మా నాన్నగారు “అల్లాహ్‌ సాక్షి! నేను ఇవి నీకివ్వాలనుకోలేదు. అంటూ నాతో వాదనకు దిగారు. నేను ఆయన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనకు మా నాన్న వాదన గురించి వివరించాను. దానికి అయన: “ఓ యజీద్‌! నీకు నీ సంకల్పానికి అను గుణంగా పుణ్యం లభిస్తుంది. ఓ మాన్‌! అలాగే నువ్వు తీసుకున్న దీనార్లు కూడా నీకొరకు ధర్మ సమ్మతమే అవుతాయి” అని తీర్పు చెప్పారు” (బుఖారీ)

السلام عليكم ورحمة الله وبركاته
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.

الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين، نبينا محمد وعلى آله وصحبه أجمعين، أما بعد
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్ బిహి అజ్మయీన్, అమ్మా బాద్)
సకల లోకాల ప్రభువైన అల్లాహ్ యే సర్వ స్తోత్రాలకు అర్హుడు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ పైనా, ఆయన కుటుంబ సభ్యులు, సహచరులందరిపైనా అల్లాహ్ యొక్క శాంతి మరియు కరుణ వర్షించుగాక.

సోదర మహాశయులారా! రియాదుస్ సాలిహీన్, హదీసు మకరందం అనే ఈ ప్రఖ్యాతి గాంచిన హదీసు పుస్తకం మనం చదవడం, అందులోని హదీసుల వివరణ తెలుసుకోవడం మొదలుపెట్టాము. ఈ క్రమంలో అల్లాహ్ యొక్క దయవల్ల మనం ఇప్పటి వరకు నాలుగు హదీసులు చదివి ఉన్నాము.

ఈనాటి మన పాఠంలో ఐదవ హదీస్, మ’అన్ బిన్ యజీద్ బిన్ అఖ్నస్. మ’అన్, ఆయన తండ్రి పేరు యజీద్. ఆయన తండ్రి పేరు అఖ్నస్. మ’అన్ ఇబ్ను యజీద్ ఇబ్ను అఖ్నస్. రెండేసి మూడేసి సార్లు నేను ఈ పేర్లు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇలాంటి మహా గొప్ప అదృష్టం చాలా అరుదుగా లభిస్తుంది. ఏమిటది? కొడుకు, తండ్రి, తాత. మ’అన్ ఇబ్ను యజీద్ ఇబ్ను అఖ్నస్. వీరు ముగ్గురూ కూడా సహాబీలు.

సామాన్యంగా ఏముంటుంది? ఒక వ్యక్తి సహాబీ, మహా ఎక్కువ అంటే అతని తండ్రి కావచ్చు. లేదా ఒక వ్యక్తి, అతని కొడుకు కావచ్చు. కానీ ఇక్కడ ముగ్గురూ, కొడుకు, అతని తండ్రి, ఈ కొడుకు యొక్క తాత. ముగ్గురూ కూడా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వాస స్థితిలో కలుసుకున్నారు మరియు విశ్వాస స్థితిలోనే అల్హమ్దులిల్లాహ్ చనిపోయారు కూడా. అయితే వీరు ముగ్గురూ కూడా అల్హమ్దులిల్లాహ్ సహాబీ. ఇమామ్ నవవీ రహమహుల్లాహ్ ఈ విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు:

وهو وأبوه وجده صحابيون
(వ హువ వ అబూహు వ జద్దుహు సహాబియ్యూన్)
అతను, అతని తండ్రి మరియు అతని తాత సహాబాలు.

అయితే ఇక రండి, అసలు హదీస్ వైపునకు మనం వెళ్దాము. ఇందులో ఈ కొడుకు హదీసును ఉల్లేఖిస్తున్నారు. విషయం ఏం జరిగిందంటే, మ’అన్ యొక్క తండ్రి యజీద్, అల్లాహ్ మార్గంలో దానం చేసే ఉద్దేశంతో సొమ్ము తీసుకుని వెళ్ళాడు. మస్జిద్ లో ఒక వ్యక్తి కనబడ్డాడు. అతనికి ఇచ్చి, ఎవరైనా అవసరం గల వ్యక్తి వచ్చాడంటే అతనికి మీరు ఇవ్వండి అని చెప్పి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత కొంత సమయానికి మ’అన్ వచ్చాడు, ఈ కొడుకు. ఆ వ్యక్తితో కలిశాడు, ఏదో మాట అయి ఉంటుంది, ఆ సందర్భంలో మ’అన్ కి అది అవసరం ఉంది. ఆ వ్యక్తి ఆ దానం యొక్క సొమ్ము మ’అన్ కి ఇచ్చేశాడు. మ’అన్ కు అవసరం కూడా ఉండినది అప్పుడు.

ఆ తర్వాత ఈ విషయం మ’అన్ యొక్క తండ్రి యజీద్ కు తెలిసింది. ఎవరు? దానం చేసిన వ్యక్తి. అప్పుడు యజీద్ అన్నాడు, “అల్లాహ్ సాక్షి, నేను ఇవి నీకు ఇవ్వాలనుకోలేదు.” అప్పుడు ఈ కొడుకు మ’అన్ ఏం చేశాడు? ఇక ఈ విషయంలో తండ్రితో గొడవ పడడం మంచిది కాదు. అయితే నాన్నా, మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్లి ఈ విషయాన్ని తెలియజేసి, అక్కడి నుండి పరిష్కారం ఏంటో మనం తెలుసుకుందాము. ఇద్దరూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఈ విషయం వివరించారు. యజీద్ చెప్పాడు, నేను డబ్బు తీసుకెళ్లి కొంత సామాను తీసుకెళ్లి ఇచ్చాను మస్జిద్ లో ఒక వ్యక్తికి, ఎవరైనా అవసరం ఉన్న వ్యక్తి వచ్చేది ఉంటే ఇవ్వమని. ఆ తర్వాత ఈ సొమ్ము నా కొడుకు తీసుకొచ్చుకున్నాడు. కొడుకు చెప్పాడు, అవును, నాకు అవసరం ఉండింది. అల్లాహ్ ఎక్కడైనా నాకు ఏదైనా ఇప్పిస్తాడా అన్నట్టుగా నేను బయటికి వెళ్ళాను. మస్జిద్ లో ఈ వ్యక్తి కలిశాడు, అతని వద్ద అది ఉంది. అయితే నేను తీసుకొచ్చుకున్నాను. ఇద్దరి మాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విన్న తర్వాత:

لك ما نويت يا يزيد، ولك ما أخذت يا معن
(లక మా నవయిత యా యజీద్, వ లక మా అఖద్-త యా మ’అన్)
ఓ యజీద్! నీ సంకల్పానికి తగిన ప్రతిఫలం నీకు లభిస్తుంది. మరియు ఓ మ’అన్! నీవు తీసుకున్నది నీకే చెందుతుంది.

అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరికీ తీర్పు ఇచ్చారు. ఏంటి? ఓ యజీద్, నీకు నీ సంకల్పానికి అనుగుణంగా పుణ్యం లభిస్తుంది. నువ్వు దానం చేయాలనుకున్నావు, ఆ దానం పుణ్యం నీకు లభిస్తుంది. ఆ దానం కొడుకుకు ఇవ్వాలి అని నువ్వు అనుకోలేదు, ఎవరైనా అవసరం ఉన్న వ్యక్తికి ఇవ్వాలనుకున్నావు. ఆ నీ నియ్యత్ ప్రకారంగా, నీ సంకల్పం ప్రకారంగా నీకు పుణ్యం లభిస్తుంది. మరియు ఓ మ’అన్, నువ్వు తీసుకున్నది ఈ దానంలో కూడా నీ కొరకు ధర్మసమ్మతమే అవుతాయి, హరామ్ కావు. ఎందుకు? తండ్రి నుండి నువ్వు దానంగా ఏదీ తీసుకోలేదు. ఒక వ్యక్తి నుండి నువ్వు తీసుకున్నావు.

ఈ హదీస్ సహీహ్ బుఖారీలో వచ్చి ఉంది.

మరియు మన ఈ మొదటి శీర్షిక, టాపిక్, ఉన్వాన్ ఇఖ్లాస్ కు సంబంధించినది. చిత్తశుద్ధి. మాట్లాడే మాట గానీ, మనం చేసే ఏదైనా పని గానీ, మన స్థితిగతులు అన్నీ కూడా కేవలం అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకే ఉండాలి. అల్లాహ్ తప్ప ఇక వేరే ప్రాపంచిక ఉద్దేశాలు, ప్రాపంచిక లాభాలు పొందడానికి, ప్రజలు చూసి మెచ్చుకోవడానికి ఇలాంటి దురుద్దేశాలు ఏవీ కూడా ఉండకూడదు.

ఈ శీర్షికలో, ఈ టాపిక్ లో ఇమామ్ నవవీ రహమహుల్లాహ్ ఈ హదీసును పేర్కొనడానికి ఉద్దేశం ఏంటి? మనిషి కొన్ని సందర్భాల్లో ఒక మంచి ఉద్దేశంతో ఒక పని చేస్తాడు. కానీ చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ ఏదైతే ఉంటుందో, ఎలా కనబడుతుంది? మన నియ్యత్ కు, మన సదుద్దేశానికి వ్యతిరేకంగా కనబడుతుంది. అలాంటప్పుడు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకు? ఏ మనిషి, ఏ మంచి ఉద్దేశంతో ఏ పని చేశాడో, అతనికి అతని మంచి ఉద్దేశం ప్రకారంగానే పుణ్యం అనేది లభిస్తుంది.

ఈ హదీసులో మనం కొంచెం శ్రద్ధ వహిస్తే ఇంకా ఎన్నో విషయాలు మనకు బోధపడతాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన తండ్రితో ఏదైనా విషయంలో, అది ప్రత్యేకంగా ధర్మానికి సంబంధించిన విషయం అయి ఉండి ఉంటే, అందులో నేను ఉన్న మార్గమే, నా యొక్క ఆలోచనే, నా యొక్క అభిప్రాయమే కరెక్ట్ అయినది అని వాగ్వివాదానికి దిగి, పెద్ద తగాదాలు చేసుకొని గొడవలకు దిగకూడదు. తండ్రి యొక్క గౌరవాన్ని పాటించాలి. అలాగే, ఒకవేళ విషయం వారిద్దరి మధ్యలో సర్దుకొని, ఇంకా వేరే పెద్ద గొడవలకు దారి తీయకుండా సమాప్తమైతే అల్హమ్దులిల్లాహ్. కానీ లేదు, పరిష్కారం తేలడం లేదు, ఒక మంచి రిజల్ట్ వెళ్లడం లేదు, అలాంటప్పుడు ధర్మ జ్ఞానంలో ఎవరైతే పెద్దగా ఉన్నారో వారి వద్దకు వెళ్లి ఇద్దరూ తమ సమస్యను అక్కడ వారికి చెప్పుకొని, సరియైన ధర్మ పరిష్కారం తీసుకునే ప్రయత్నం చేయాలి. యజీద్ ఏమన్నాడు? లేదు, నువ్వు ఎందుకు తీసుకున్నావు మస్జిద్ లో ఉన్న చేసిన ధర్మాన్ని అని గొడవ పడ్డాడు. కానీ కొడుకు మ’అన్ ఏం చేశాడు? తండ్రితో గొడవ పడడం మంచిది కాదు, ప్రవక్త ఉన్నారు, ఆయన వద్దకు వెళ్లి మనం నిజం ఏంటో తెలుసుకుందాము అని.

దీని ద్వారా మనకు మరొక విషయం ఏం తెలుస్తుంది? ఏ ధర్మ విషయంలో గానీ, ఇద్దరి మధ్యలో ఏదైనా విభేదం ఏర్పడిందంటే, ఆ విభేదాలను తూతూ మంత్రం, లేదు నేను చెప్పినట్టే, ఏ లేదు నేను చెప్పిందే కరెక్ట్, ఈ విధంగా గొడవలకు దిగకుండా ధర్మజ్ఞానుల వద్దకు వెళ్లి పరిష్కారం తీసుకోవడం చాలా మంచి విషయం.

ఇక్కడ మరొక విషయం మనకు ఏం అర్థమైందంటే, మన దగ్గరి కాలంలో ఇమామ్ ఇబ్ను ఉథైమీన్ రహమహుల్లాహ్ చాలా గొప్ప పండితులు గడిసి చనిపోయారు. ఆయన రియాదుస్ సాలిహీన్ యొక్క వ్యాఖ్యానం చేస్తూ, ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పదం ఏదైతే చెప్పారో, “లక మా నవైత్” (నీవు ఏ నియ్యత్ చేశావో), ఈ పదం ద్వారా ఎన్నో విషయాలు, ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో ధర్మ విషయాలు చెప్పారు.

ఉదాహరణకు, ఒక వ్యక్తి వద్ద రెండు ఇళ్లు ఉన్నాయి అనుకోండి. ఒకటి చిన్నది, మరొకటి పెద్దది. అతడు అల్లాహ్ మార్గంలో చిన్న ఇల్లును దానం చేసేయాలి అని అనుకున్నాడు. అనుకొని, ఎవరైనా బాధ్యులతోను మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ, ఏదో కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది? మనిషి ఇంటి బయట లేదా తన యొక్క ఇంటి వాకిలిలో నిలబడి ఇద్దరు ముగ్గురు మాట్లాడుతూ ఉంటే, మాట మాటల్లో అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు. ఈ విధంగా మాట్లాడుతూ మాట్లాడుతూ, “నేను నా ఈ ఇంటిని అల్లాహ్ మార్గంలో దానం చేయాలనుకుంటున్నాను” అని పెద్ద ఇంటి వైపుకు వేలు చూపించాడు. అసలు అతని నియ్యత్ లో, సంకల్పంలో ఉన్నది ఏంటి? చిన్న ఇల్లు. కానీ ఆ మాట ధోరణిలో ఉండి, అక్కడ గమనించక వేలు అనేది ఎటు చూపించాడు? పెద్ద ఇల్లు వైపునకు. అలాంటప్పుడు ఎందరో పండితులు చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏ ఇల్లు దానం చేయాలి అతను? చిన్నదా, పెద్దదా? కాదు. నియ్యత్ ఏదైతే ఉందో, దాని ప్రకారంగానే. నియ్యత్ ఏదైతే ఉందో, దాని ప్రకారంగానే అతడు ఆచరించాలి.

అలాగే, ఒక వ్యక్తి కొందరితో కలిసి హజ్ కు బయలుదేరాడు. మీకాత్ లో ఉండి ముందు నుండే అతని యొక్క నియ్యత్ ఉన్నది, నేను హజ్జె తమత్తు చేస్తాను అని. హజ్జె తమత్తు అంటే ఏమవుతుంది? ముందు ఉమ్రా చేసి, హలాల్ అయిపోయి, మళ్ళీ ఎనిమిదవ తారీఖు నాడు మళ్ళీ హజ్ యొక్క ఇహ్రామ్ కొత్తగా చేస్తారు. అయితే వెళ్తున్నప్పుడు మీకాత్ వద్ద అందరితో పాటు “లబ్బైక్ హజ్జన్” అని అనేశాడు. వాస్తవానికి అతని యొక్క నియ్యత్ ఏముంది? హజ్ లేదా హజ్జె కిరాన్, హజ్జె ఇఫ్రాద్ చేయాలని లేదు, హజ్జె తమత్తు చేయాలని ఉంది. అయితే అతను “లబ్బైక్ హజ్జన్” అని నోటితో పలికినప్పటికీ, అతడు తన నియ్యత్ ప్రకారంగా ఉమ్రా చేయాలి ముందు. ఎందుకంటే హజ్జె తమత్తు చేసేది ఉంది. ఆ ప్రకారంగా అతను వచ్చి ఉమ్రా చేసేది ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదు.

దీని ద్వారా మరొక గొప్ప విషయం ఏం తెలుస్తుందంటే, కొన్ని సందర్భాల్లో మనిషి దానధర్మాలు ఏదైతే చేస్తాడో, చేసిన తర్వాత అతనికి తెలిసింది, హక్కుదారునికి కాకుండా వేరే ఎవరికైనా చేరుకున్నది అని. అలాంటప్పుడు అతడు బాధపడవలసిన అవసరం లేదు. దీనికి సంబంధించి మరొక పెద్ద హదీస్ కూడా ఉంది. ఒక వ్యక్తి రాత్రిపూట ఎవరూ చూడకుండా, కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకే నేను దానం చేస్తాను అని బయలుదేరాడు. బయలుదేరేసరికి ఏమైంది? ఒక రాత్రి దొంగ చేతిలో పెట్టేశాడు. మరో రాత్రి వ్యభిచారిణి చేతిలో పెట్టేశాడు. మూడో రాత్రి చాలా ధనవంతుని యొక్క చేతిలో పెట్టేశాడు. ఉదయం తెలిసింది అతనికి ఇలా జరిగింది అని. చాలా బాధపడ్డాడు. కానీ తర్వాత అతనికి చెప్పడం జరిగింది, నీవైతే దొంగకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదు, వ్యభిచారిణికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదు, ధనవంతునికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదు. నీ యొక్క నియ్యత్, నీ యొక్క సంకల్పం కరెక్ట్ గా ఉండింది గనక, దాని ప్రకారంగానే నీకు పుణ్యం కూడా లభిస్తుంది.

ఇప్పుడు ఈ హదీసులో మనం తెలుసుకున్నాము, మ’అన్ బిన్ యజీద్, అంటే యజీద్, తండ్రి, దానం మస్జిద్ లో పెట్టి వచ్చాడు. తర్వాత అతని కొడుకు వెళ్ళాడు. కొడుక్కు తెలియదు, మా నాన్నే పెట్టాడు అని కూడా. అయితే, తండ్రి తన దానం కొడుక్కు ఇవ్వచ్చా? ఇదొక ధర్మ విషయం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పటివరకైతే దానం సామాన్య దానంగా ఉందో, అంటే జకాత్ కాదు, ధర్మదానాలు, ఆమ్ సదకా ఖైరాత్ అని ఏదైతే అంటామో, జకాత్ కాదు. ఇలాంటివి కొడుక్కు ఇవ్వచ్చు, బంధువులకు ఇవ్వచ్చు, ఇంకా వేరే వారికి కూడా ఇవ్వచ్చు. కానీ, జకాత్ అన్నది కొడుక్కు ఇవ్వరాదు. ఎందుకు? జకాత్ ఇది ఒక విధి, కొడుకు యొక్క ఖర్చు తండ్రిపై విధిగా ఉంది. అందుకొరకే తండ్రి కొడుక్కు జకాత్ ఇవ్వలేడు.

కానీ ఒక మార్గం ఉంది ఉదాహరణకు, కొడుక్కు ఇవ్వడానికి. అదేమిటి? కొడుకు పెద్దగయ్యాడు, సంపాదిస్తున్నాడు, కానీ అతని యొక్క వ్యాపారంలో లేదా వేరే అనారోగ్యంలో, ఇంకా వేరే ఏదైనా కారణంగా అప్పులో పడ్డాడు. అప్పులో కొడుకు చిక్కుకున్నాడు. అయితే, తండ్రి అతని నుండి వేరై, వేరే సంపాదన, సామాన్యంగా మన వద్ద ఏమంటారు? వాని పొయ్యి వేరు, వాని వంట వేరు, ఈ విధంగా అనుకుంటాం కదా. కానీ అతని వద్ద అప్పు ఉంది, ఆ అప్పు తీరపడానికి తండ్రి తన యొక్క జకాత్ కొడుక్కు ఇవ్వచ్చు. అప్పు తీర్చడానికి.

అలాగే, ఆపోజిట్, కొడుకు తన జకాత్ తండ్రికి ఇవ్వచ్చా? లేదు. అట్టనే ఇవ్వరాదు. ఎందుకు? ఎప్పుడైతే తండ్రి వృద్ధాప్య… ముసలివాడై, లేదా అనారోగ్యం పాలై, అతడు ఇక ఏమీ సంపాదించలేని స్థితిలో ఉన్నాడో, ఆ తండ్రికి తినిపించడం, త్రాగించడం, అతని యొక్క మందుల ఖర్చులు చూసుకోవడం, అతని యొక్క బట్టల ఖర్చులు చూసుకోవడం, అతను ఉండడానికి ఒక ఇల్లు, ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? కొడుకు సంతానం చూసుకోవాలి. అయితే ఏదైనా కారణంగా తండ్రి వద్ద ఏదైనా అప్పు అయిపోయింది. మరి ఈనాటి కాలంలో మన వద్ద లాంటి పరిస్థితి ఉండకూడదు. ఇటు కొడుకు సంపాదించి పంపుతా ఉంటాడు, అటు అయ్యా… త్రాగడంలో… జ్యూస్ మరియు పాలు కాదు, బాదం పాలు కాదు. అర్థమవుతుంది కదా? ఆ, సారాయి తాగడంలో, కళ్ళు తాగడంలో ఇలాంటి వాటిలో ఖర్చు చేస్తున్నాడు లేదా అంటే, ఆ కొడుకు పంపినప్పుడు ఇచ్చేద్దాంలే అని అప్పులు చేస్తున్నాడు. ఇట్లాంటి వాటిలో కూడా చాలా అధ్వాన్నంగా పరిస్థితులు మారిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఒకవేళ తండ్రి అప్పులో చిక్కుకొని ఉండేది ఉంటే, కొడుకు వద్ద జకాత్ సొమ్ము ఏదైతే ఉందో, అప్పు తీర్చడానికి ఇవ్వచ్చు.

ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటి? మనిషి తన బాధ్యతలో ఎవరైతే ఉన్నారో, అతని యొక్క ఖర్చు కొంచెం తగ్గిపోతుంది నాకు అని అతనికి ఏదైనా జకాత్ ఇవ్వడం ఇది ధర్మసమ్మతం కాదు. ఈ విధంగా ఆలోచించుకుంటూ పోతే, పండితులు రాసినటువంటి వ్యాఖ్యానాలు మనం చూసుకుంటూ పోతే ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ ఈ హదీస్ ఏదైతే మనం ఇప్పుడు విన్నామో అల్లాహ్ యొక్క దయవల్ల, దీని యొక్క వ్యాఖ్యానం ఇంతవరకు మనం సరిపుచ్చుకుందాం.

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) – సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)
https://teluguislam.net/2019/10/19/ikhlas/

అల్లాహ్‌ మీ శరీరాలను, మీ ముఖాలను చూడడు. ఆయన మీ అంతరంగాలను, ఆచరణలను మాత్రమే చూస్తాడు [ఆడియో]

అల్లాహ్‌ మీ శరీరాలను, మీ ముఖాలను చూడడు. ఆయన మీ అంతరంగాలను, ఆచరణలను మాత్రమే చూస్తాడు
https://youtu.be/5AZinozb7W8 [18 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

హజ్రత్‌ అబూ హురైరా అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ సఖర్‌ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు: “అల్లాహ్‌ మీ శరీరాలను, మీ ముఖాలను చూడడు. ఆయన మీ అంతరంగాలను, ఆచరణలను మాత్రమే చూస్తాడు.” (ముస్లిం)

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) – సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)
https://teluguislam.net/2019/10/19/ikhlas/

ఇద్దరు ముస్లింలు తమ తమ ఖడ్గాలతో పరస్పరం దాడికి దిగితే, హంతకుడు, హతుడు – ఇద్దరూ నరకానికి వెళతారు | హదీసు కిరణాలు [ఆడియో]

ఇద్దరు ముస్లింలు తమ తమ ఖడ్గాలతో పరస్పరం దాడికి దిగితే, హంతకుడు, హతుడు – ఇద్దరూ నరకానికి వెళతారు
https://youtu.be/hVPv5X3woKA [10 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

9. హజ్రత్‌ అబూబక్రహ్‌ నుఫైబిన్‌ హారిస్‌ సఖఫీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) :

“ఇద్దరు ముస్లింలు తమ తమ ఖడ్గాలతో పరస్పరం దాడికి దిగితే, హంతకుడు, హతుడు – ఇద్దరూ నరకానికి వెళతారు” అని చెప్పారు. నేను “దైవప్రవక్తా! హంతకుని మాట సరేగాని హతుడేం పాపం చేశాడని నరకానికి వెళతాడు? అని సందేహపడ్డాను. అందుకాయన “అతనూ తన ప్రత్యర్థిని చంపాలన్న కసితోనే ఉన్నాడు కదా!” అని బదులిచ్చారు. (బుఖారీ -ముస్లిం)

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) [వీడియో పాఠాలు]

సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్) – (హదీసు కిరణాలు) [ఆడియో సీరీస్]
https://teluguislam.net/2019/10/19/ikhlas/

అల్లాహ్ సత్కార్యాలను, దుష్కార్యాలను రాసి, పిదప వాటిని గురించి వివరించాడు – హదీసు కిరణాలు [ఆడియో]

అల్లాహ్ సత్కార్యాలను, దుష్కార్యాలను రాసి, పిదప వాటిని గురించి వివరించాడు – రియాదుస్ సాలిహీన్
https://youtu.be/LEj9zcBqzMI [16 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్) – హదీసు 11

[11] దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ప్రభువు ద్వారా ఉల్లేఖించిన విషయాన్ని హజ్రత్‌ అబుల్‌ అబ్బాస్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ బిన్‌ అబ్దుల్‌ ముత్తలిబ్‌ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా ఉటంకించారు :

“అల్లాహ్ సత్కార్యాలను, దుష్కార్యాలను రాసి, పిదప వాటిని గురించి వివరించాడు; ఎవరైనా ఏదైనా మంచి పని చేయాలని సంకల్పించుకొని, (ఏదయినా కారణంచేత) దానిని అమలుపరచలేక పోయినప్పటికీ అల్లాహ్‌ తన వద్ద అతను ఒక సత్కార్యం పూర్తి చేసినట్టు రాసుకుంటాడు. మరి ఆవ్యక్తి ఆ మంచి పని చేయాలని ఉద్దేశించుకొన్న పిదప దాన్ని నెరవేరిస్తే దానికి అల్లాహ్‌ పది నుండి ఏడు వందల రెట్లు – ఇంకా దానికంటే ఎన్నో రెట్లు అధికంగానే సత్కర్మలు చేసినట్లు అతని ఖాతాలో రాస్తాడు. (దీనికి భిన్నంగా) ఎవడైనా ఒక చెడుపని చేయాలనుకుని ఏదయినా కారణంచేత చేయకుండా ఉంటే అప్పటికీ అల్లాహ్‌ తన వద్ద, ఆ వ్యక్తి పూర్తిగా ఒక మంచి పని చేసినట్టు రాసుకుంటాడు. అయితే అతను ఆ చెడ్డపని చేయాలని సంకల్పించుకున్న పిదప దాన్ని చేసేస్తే మాత్రం ఒక్క చెడ్డపని చేశాడని పొందుపరుస్తాడు” (బుఖ్లూరీ -ముస్లిం)

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) [వీడియో పాఠాలు]

సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్) – (హదీసు కిరణాలు) [ఆడియో సీరీస్]
https://teluguislam.net/2019/10/19/ikhlas/

విశ్వాస పాఠాలు – 1వ క్లాస్ – “ఆచరణలు కేవలం మనో సంకల్పంపై ఆధారపడి ఉంటాయి” [వీడియో]

బిస్మిల్లాహ్

[30 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

دروس في العقيدة – విశ్వాస పాఠాలు

[آَمَنَ الرَّسُولُ بِمَا أُنْزِلَ إِلَيْهِ مِن رَبِّهِ وَالمُؤْمِنُونَ كُلٌّ آَمَنَ بِاللهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِنْ رُسُلِهِ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ المَصِيرُ] {البقرة: 285}

{ప్రవక్త తనపై తన ప్రభువు నుండి అవతరించినదానిని విశ్వసించాడు. ఈ ప్రవక్తను విశ్వసించినవారు కూడా దానిని హృదయ పూర్వకంగా విశ్వసించారు. వారంతా అల్లాహ్ నూ, ఆయన దూతలనూ, ఆయన గ్రంథాలనూ, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. వారు ఇలా అంటారుః “మేము అల్లాహ్ పంపిన ప్రవక్తలలోని ఏ ఒక్కరినీ భేదభావంతో చూడము. మేము ఆదేశం విన్నాము, శిరసావహించాము. ప్రభువా! క్షమాభిక్ష పెట్టుమని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరకు మేమంతా నీవద్దకే మరలి వస్తాము}. (సూరె బఖర 2:285).

عَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ > قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: (إِنَّمَا الْأَعْمَالُ بِالنِّيَّاتِ وَإِنَّمَا لِكُلِّ امْرِئٍ مَا نَوَى فَمَنْ كَانَتْ هِجْرَتُهُ إِلَى اللهِ وَرَسُولِهِ فَهِجْرَتُهُ إِلَى اللهِ وَرَسُولِهِ وَمَنْ كَانَتْ هِجْرَتُهُ لِدُنْيَا يُصِيبُهَا أَوْ امْرَأَةٍ يَتَزَوَّجُهَا فَهِجْرَتُهُ إِلَى مَا هَاجَرَ إِلَيْهِ).

1- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్బు ఉల్లేఖించారుః “ఆచరణలు కేవలం మనో సంకల్పంపై ఆధారపడి ఉంటాయి. మనిషి దేని సంకల్పం చేసుకుంటాడో, అతనికి అదే ప్రాప్తమవుతుంది. (ఉదాహరణకుః) ఎవరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు వలసపోతాడో అతని వలస మాత్రమే నిజమయినది. ఎవరు ప్రపంచం కొరకు లేదా ఏదైనా స్త్రీని వివాహమాడటానికి వలసపోతాడో, అతని వలస ప్రపంచం కొరకు లేదా స్త్రీ కొరకు అనే పరిగణించబడుతుంది”. (బుఖారి 1, ముస్లిం 1907). విశ్వాస పాఠాలు

ఈ హదీసులో:

ఈ హదీసు ప్రతి ఆచరణకు పునాది లాంటిది. కర్మల అంగీకారం, తిరస్కారం మరియు అవి మంచివా లేదా చెడ్డవా అన్న విషయం మనోసంకల్పంపై ఆధారం పడి ఉంటుంది. ఎవరు ఏ సంకల్పం చేస్తారో అతనికి అదే ప్రాప్తమవుతుంది. ఒకప్పుడు ఆచరణ బాహ్యంగా (చూడటానికి) చాలా మంచిగా ఉండవచ్చు. కాని సత్సంకల్పం లేని కారణంగా అది చేసిన వానికి ఏ లాభమూ దొరక్కపోవచ్చు. దీనికి సంబంధించిన నిదర్శనాలు ఖుర్ఆనులో మరీ స్పష్టంగా ఉన్నాయిః

[أَلَا للهِ الدِّينُ الخَالِصُ] {الزُّمر:3} [مُخْلِصِينَ لَهُ الدِّينَ] {البيِّنة:5} [لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ] {الزُّمر:65}

{జాగ్రత్తా! ధర్మం ప్రత్యేకంగా అల్లాహ్ కు చెందిన హక్కు మాత్రమే}. (సూరె జుమర్ 39:3).
{పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని అల్లాహ్ కే ప్రత్యేకించు- కోవాలి}. (సూరె బయ్యినహ్ 98: 5).
{మీరు షిర్క్ చేస్తే మీ కర్మలన్నీ వ్యర్థమైపోతాయి}. (సూరె జుమర్ 39: 65).

ఈ హదీసులో తెలిసిన మరో విషయం ఏమనగాః మనస్సు కార్యమే (సంకల్పశుద్ధియే) అన్నిటికి మూలం. మనిషి తాను చేసే ప్రతీ కార్యం తన ప్రభువు కొరకే ప్రత్యేకించి చేయుటకు, దాన్ని షిర్క్ దరిదాపులకు, ఇతర ఉద్దేశాలకు దూరంగా ఉంచుటకు ప్రయత్నం చేయాలి. ఆ కార్యం ద్వారా అల్లాహ్ సంతృప్తి, ఆయన దర్శనం పొందే ఉద్దేశ్యం మాత్రమే ఉంచాలి.

సర్వకార్యాలు, వాటి ఉద్దేశ్యాల్ని బట్టి ఉంటాయి తప్ప బాహ్య రూపంతో కాదు. ఎవరూ మరొకరి బాహ్య రూపం, బాహ్యాచరణలతో మోసపోకూడదు. అతని సంకల్పంలో కీడు చోటు చేసుకోవచ్చు. అయినా ప్రజల పట్ల సదుద్దేశం కలిగి ఉండటమే అసలైన విషయం.

ఆరాధనలు చేసేవారి పుణ్యాల్లో వ్యత్యాసం వారి మనస్సంకల్పాన్ని బట్టి ఉంటుంది అని కూడా తెలుస్తుంది.

ప్రమాణం, మ్రొక్కుబడి, విడాకులు, అలాగే షరతులు, వాగ్థానం, ఒప్పందాల్లాంటి విషయాల్లో సంకల్పం (నియ్యత్) తప్పనిసరిగా ఉండాలి. మరచిపోయేవాడు, బలవంతం చేయబడినవాడు, అజ్ఞాని, పిచ్చివాడు మరియు చిన్న పిల్లలు చేసే పనులు (ఉద్దేశపూర్వకంగా ఉండవు గనక) వారిపై ఇస్లామీయ ఆదేశాలు విధిగా లేవు. ఎవరు ఏ సంకల్పం చేస్తారో అతనికి అదే ప్రాప్తమవుతుంది. వేరేది కూడా లభించవచ్చునా లేదా? అన్న విషయం సందిగ్ధంలో ఉంది. మనుషుల సంకల్పాలను అల్లాహ్ తప్ప మరెవరూ ఎరుగరు.

ప్రదర్శనాబుద్ధి, పేరుప్రఖ్యాతులు పొందే సంకల్పం ప్రశంసనీయమైనది కాదు అని ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. అది అల్లాహ్ యేతరులతో ఏదైనా పొందే ఉద్దేశ్యం క్రింద లెక్కించబడుతుంది. సత్సంకల్పం లేనిదే ఏ కార్యాలూ, సత్కార్యాలుగా పరిగణింపబడవు. ఎవరైతే ప్రాపంచిక లాభానికి ప్రాముఖ్యతనిచ్చి పరలోక లాభాన్ని విస్మరిస్తారో అతను పరలోక లాభాన్ని కోల్పోతాడు. మరెవరైతే పరలోక లాభానికి ప్రాముఖ్యతనిచ్చి, దానితో పాటు ప్రాపంచిక ప్రయోజనం కూడా పొందాలనుకుంటాడో అతనికి ప్రాపంచిక లాభం లభిస్తుంది మరియు పరలోకంలో కూడా సత్ఫలితం ప్రాప్తిస్తుంది. ఎవరైతే తాను చేసే ఆచరణ ద్వారా ప్రజల ప్రసన్నత పొందాలని ఉద్దేశిస్తాడో అతడు షిర్క్ చేసినవాడవుతాడు.

అల్లాహ్ చాలా సూక్ష్మజ్ఞాని అని మరియు అతి రహస్య విషయాలు కూడా ఎరుగువాడని ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. ఇంకా దుష్టులను వారి దుష్సంకల్పం వల్ల హీనపరచకుండా వారి విషయం దాచి ఉంచి అల్లాహ్ తన దాసులపై చేసిన మేలు కూడా ఈ హదీసు ద్వారా తెలుస్తుంది.

సాఫల్యానికి సబబు ఆచరణలు ఎక్కువ ఉండటం కాదు. అవి మంచివి అయి ఉండటం. ఇఖ్లాస్ (అల్లాహ్ సంతృప్తి కొరకు, ఆయనకే ప్రత్యేకించి) మరియు ప్రవక్త పద్ధతి ప్రకారం చేయబడినప్పుడే ఏదైనా కార్యం సత్కార్యం అవుతుంది. చిన్న కార్యమైనా సరే ఇఖ్లాస్ తో కూడుకుంటే అదే చాలా గొప్పది. దీనికొక హదీసు కూడా సాక్ష్యముంది. మనిషి ఏదైనా కార్యం మొదలుపెట్టే ముందు తన నియ్యత్ (సంకల్పాన్ని) నిర్థారణ చేసుకోవాలి. ఫర్జ్ అయినా, నఫిల్ అయినా, ఏ కార్యమైనా నియ్యత్ లేనిది అంగీకరింపబడదు. నియ్యత్ కొరకు నోటితో పదాలు ఉచ్చరించుట అనవసరం, దేని విషయంలో స్పష్టమైన నిదర్శనం ఉందో అది తప్ప. (ఉదాః హజ్).


విశ్వాస పాఠాలు [పుస్తకం] & వీడియో పాఠాలు:
https://teluguislam.net/2019/11/14/aqeeda-lessons/

ఉపవాసపు నియ్యత్ (సంకల్పం) ఎప్పుడు చేసుకోవాలి? [వీడియో క్లిప్]

బిస్మిల్లాహ్

[1:43 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (1:43 నిముషాలు)

ఈ వీడియో క్లిప్ క్రింద ఇవ్వబడిన వీడియో నుండి సేకరించబడింది :
ఉపవాస పాఠాలు -2: ఉపవాస ఆదేశాలు [వీడియో] [21:33 నిముషాలు]

ఇతరములు:

సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్) [ఆడియో సీరీస్]

బిస్మిల్లాహ్

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి
మొదటి చాప్టర్ 

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) [అన్నీ వీడియో పాఠాలు]
https://teluguislam.net/2021/01/28/riyad-us-saliheen-hadeeth-lessons

సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2tlGlu_q2lGAnhgxg-38Av

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

క్రింద ఇచ్చిన లింకుల మీద క్లిక్ చేసి ఆడియో వినండి:

  1. భాగం 01 (హదీసు #1) (30 నిముషాలు)
  2. భాగం 02 (హదీసు #2,3,4) (28 నిముషాలు)
  3. భాగం 03 (హదీసు #5,6) (32 నిముషాలు)
  4. భాగం 04 (హదీసు #7,8) (31 నిముషాలు)
  5. భాగం 05 (హదీసు #9,10) (29 నిముషాలు)
  6. భాగం 06 (హదీసు #11,12) (30 నిముషాలు)

6 ఆడియోలు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు


హదీసులు క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి చదవండి:
సకల అంతర్బాహ్య వాక్కర్మలలో , సర్వ కాల  సర్వావస్థల్లో  సంకల్ప శుద్ది  అవసరం [PDF]

హదీసులు మీ సౌకర్యం కోసం క్రింద ఇవ్వ బడ్డాయి:

అల్లాహ్‌ సెలవిచ్చాడు:

“వారు అల్లాహ్‌కు దాస్యం చేయాలని, పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్‌ను స్థాపించాలని, జకాత్‌ ఇస్తూ ఉండాలని మాత్రమే ఆదేశించడం జరిగింది. ఇదే ఎంతో సరియైన ధర్మం.” (అల్‌ బయ్యినహ్‌ : 5)

మరోచోట అల్లాహ్‌ సెలవిచ్చాడు :

“వాటి మాంసమూ అల్లాహ్‌ను చేరదు, వాటి రక్తమూ చేరదు. కాని మీ భయభక్తులు ఆయనకు చేరుతాయి.” (అల్‌ హజ్జ్‌ : ౩7)

ఇంకొకచోట ఆయన ఇలా ఆదేశించాడు :

“ప్రవక్తా  ప్రజలను ఇలా హెచ్చరించు : “మీరు దాచినా లేక బహిర్గతం చేసినా – మీ మనసుల్లో ఉన్నదంతా అల్లాహ్‌కు తెలుసు.” (ఆలి ఇమ్రాన్‌ : 29)


1. విశ్వాసుల నాయకులు హజ్రత్‌ అబూ హఫ్స్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు:

“ఆచరణలు సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి. ప్రతి ఒక్కరికీ అతని మనసులోని ఉద్దేశానికి అనుగుణంగా ప్రతిఫలం దొరుకుతుంది. అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త కోసం వలస పోయిన వ్యక్తి ప్రస్థానం – నిజంగానే అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త కోసం చేసిన ప్రస్థానంగా పరిగణించబడుతుంది. ఎవడైతే ప్రాపంచిక ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో లేక ఏ స్త్రీనయినా వివాహమాడాలనే సంకల్పంతో వలస పోతాడో అతడు – తాను కోరుకున్న వాటికోసం వలసపోయినట్టుగా భావించటం జరుగుతుంది.”

ఈ హదీసు ప్రామాణికతపై ఏకాభిప్రాయం ఉంది. హదీసు వేత్తల్లో అగ్రగణ్యులైన ఉభయులూ – అనగా అబూ అబ్దుల్లాహ్‌ ముహమ్మద్‌ బిన్‌ ఇస్మాయీల్‌ బుఖారీ మరియు అబుల్‌ హుసైన్‌ ముస్లిం బిన్‌ హజ్జాజ్‌లు – హదీసు సంకలన గ్రంథాలన్నిటిలోకెల్లా ప్రామాణికమైన తమ తమ గ్రంథాల్లో ఈ హదీసును పొందుపరచారు.


2. విశ్వాసుల మాతృమూర్తి ఉమ్మె అబ్దుల్లాహ్‌ హజ్రత్‌ ఆయిషా (రది అల్లాహు అన్‌హా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:

“సైనిక పటాలం ఒకటి కాబాపైకి దండెత్తే ఉద్దేశ్యంతో బయలుదేరుతుంది. ఆ సైనిక పటాలం భూమండలంలోని ఒక ప్రదేశానికి చేరుకోగానే అక్కడి వారంతా భూమిలోనికి కూరుకుపోతారు.”

హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్‌హా) అంటున్నారు – ఆ మాట విని నేను “ఓ దైవప్రవక్తా! వారంతా భూమిలో ఎందుకు కూర్చి వేయబడతారు? వారిలో బజారున పోయేవారు, వేరే ఇతరులు కూడా ఉంటారు కదా!” అని అడిగాను. (అంటే సైనికాధికారులతో పాటు సామాన్య సిపాయిలు లేదా బజారులో తిరిగే మామూలు మనుషులు కూడా ఉంటారని అర్ధం.) దానికి ఆయన “మొదటి నుంచి చివరిదాకా వారందరూ నేలలోకి కూర్చి వేయబడతారు. అయితే ఆ తరువాత వారంతా కూడా తమ తమ ఉద్దేశాల ఆధారంగా లేపబడతారు. (అంటే ప్రళయం సంభవించాక వారితో వారి సంకల్పాలనుబట్టి వ్యవహరించడం జరుగుతుంది)” అని చెప్పారు. (బుఖారీ – ముస్లిం, వాక్యాలు మాత్రం బుఖారీవి).


3. హజ్రత్‌ ఆయిషా (రది అల్లాహు అన్‌హా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు :

“మక్కా విజయం తరువాత హిజ్రత్‌ (వలస వెళ్ళవలసిన అవసరం) లేదు. అయితే దైవమార్గంలో పోరాటం మరియు సంకల్పం మాత్రం కొనసాగుతూ ఉంటాయి. దైవమార్గంలో పోరాడటం కోసం మిమ్మల్ని పిలవడం జరిగితే, మీరు (తక్షణమే) బయలు దేరండి.”(బుఖారీ,ముస్లిం)

దీని భావం ఏమిటంటే, (హిజ్రీ శకం 8వ యేట) మక్కా నగరం దారుల్‌ ఇస్లాం (ఇస్లామీయ రాజ్యం) అయిపోయింది. కనుక మక్కా విజయం తరువాత ఇక మక్కా నుండి వలస వెళ్ళాల్సిన అవసరం మిగిలి ఉండలేదు.


4. హజ్రత్‌ అబూ అబ్దుల్లాహ్‌ జాబిర్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ అన్సారీ (రది అల్లాహు అన్హు) కథనం :

మేము ఒకానొక యుద్ధంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెంట ఉన్నాము. అప్పుడు ఆయన ఈ విధంగా ప్రవచించారు : “మదీనాలో కొంతమంది (యుద్దానికి) రాలేకపోయారు. అయితే మీరు ప్రయాణించిన ప్రతిచోటా, మీరు నడిచిన ప్రతి లోయలోనూ వారు మీతోపాటే ఉన్నారు. అనారోగ్యం వారిని ఆపి ఉంచింది.”

వేరొక ఉల్లేఖనంలో “పుణ్యంలో మీతో పాటు వారు కూడా భాగస్వాములయ్యారని ఉంది” (ముస్లిం)

బుఖారీ ఉల్లేఖనంలో హజ్రత్‌ అనస్‌ (రది అల్లాహు అన్హు) ఇలా ఉటంకిస్తున్నారు :

“మేము తబూక్‌ యుద్దానంతరం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెంట తిరిగి వచ్చాము. అప్పుడు ఆయన ఇలా అన్నారు : “కొందరు మన వెనక మదీనాలోనే ఆగిపోయి ఉన్నారు. అయితే మనం నడిచిన ప్రతి కనుమ, ప్రతి లోయలోనూ వారు మనతోపాటే ఉన్నారు. తగిన కారణం వల్ల వారు రాలేకపోయారు.”


5. హజ్రత్‌ అబూ యజీద్‌ మాన్‌ బిన్‌ యజీద్‌ బిన్‌ అఖ్‌నస్‌ (రది అల్లాహు అన్హు) (ఈయన, ఈయన తండ్రీ తాతలు ముగ్గురూ దైవప్రవక్త అనుచరులే) కథనం:

“మా నాన్న యజీద్‌ ఒకసారి దానధర్మాల నిమిత్తం కొన్ని దీనార్లు బయటికి తీసి వాటిని మస్జిద్ లో ఒక వ్యక్తి దగ్గర (అవసరమున్న వానికి ఇవ్వమని) ఉంచి వెళ్ళిపోయారు. అదే సమయంలో నేను అక్కడికి వచ్చాను. (అవసరం నిమిత్తం) నేను ఆ వ్యక్తి నుండి దీనార్లు పుచ్చుకొని ఇంటికి తీసుకువచ్చాను. వాటిని చూసి మా నాన్నగారు “అల్లాహ్‌ సాక్షి! నేను ఇవి నీకివ్వాలనుకోలేదు. అంటూ నాతో వాదనకు దిగారు. నేను ఆయన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనకు మా నాన్న వాదన గురించి వివరించాను. దానికి అయన: “ఓ యజీద్‌! నీకు నీ సంకల్పానికి అను గుణంగా పుణ్యం లభిస్తుంది. ఓ మాన్‌! అలాగే నువ్వు తీసుకున్న దీనార్లు కూడా నీకొరకు ధర్మ సమ్మతమే అవుతాయి” అని తీర్పు చెప్పారు” (బుఖారీ)


6. ఇహలోకంలోనే స్వర్గ సుఖాల శుభవార్త పాందిన పదిమందిలో ఒకరైన అబూ ఇస్‌హాఖ్‌ సాద్‌ బిన్‌ అబూ వఖ్ఖాస్ (రది అల్లాహు అన్హు) కథనం :

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తాను అంతిమ హజ్‌ యాత్ర చేసిన యేట వ్యాధిగ్రస్తుణ్ణయి ఉన్న నన్ను పరామర్శించే నిమిత్తం నా వద్దకు వచ్చారు. అప్పుడు నేను విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. నేను ఆయన్ని “దైవప్రవక్తా! నా నొప్పి ఎంత తీవ్రంగా తయారయిందో తమరు చూస్తూనే ఉన్నారు. నేనా డబ్బు కలవాణ్లి. నాకు ఒక్కగానొక్క కూతురు తప్ప ఇతర వారసులెవరూ లేరు. నేను నా ధనంలోని మూడింట రొండొంతులను ఎవరికైనా దానం చేయవచ్చా?” అని అడిగాను. దానికి ఆయన “కూడదు” అన్నారు. తిరిగి నేను “సగం ధనం దానం చేయనా” అని అడిగాను. దానికి కూడా ఆయన “కూడదు” అనే అన్నారు. మళ్ళీ నేను “మూడింట ఒక వంతైనా దానం చేయలేనా దైవ ప్రవక్తా!” అని విన్నవించుకోగా అందుకు ఆయన “మూడింట ఒక వంతు అయితే చేయగలవు. కాని అది కూడా ఎక్కువే (లేక) పెద్దదే అవుతుంది” (అని అన్నారు). “ఎందుకంటే నువ్వు నీ వారసులను పరుల ముందు చేయి చాపుతూ తిరిగి దరిద్రులుగా వదలి వెళ్ళడంకన్నా స్టితిమంతులుగా వదలి వెళ్ళడమే ఎంతో శ్రేయస్కరం. (గుర్తుంచుకో!) నువ్వు దైవప్రసన్నత కోసం ఏది ఖర్చు పెట్టినా దానికి నువ్వు ప్రతిఫలం పొందుతావు. ఆఖరికి నువ్వు నీ భార్య నోట్లో పెట్టే ముద్దకు కూడా ప్రతిఫలం పొందుతావు” అని ఉపదేశించారు. అప్పుడు నేను “ఓ దైవప్రవక్తా! నేను నా సహచరుల వెనుక ఉండిపోతానా? (అంటే నా సహచరులు ముందుగానే చనిపోయి నేను ఈ లోకంలో ఒక్కడినే ఉండిపోతానా?)” అని సందేహపడగా దానికి ఆయన “(అయితేనేమి? మంచిదేగా) ఎందుకంటే నీ సహచరుల అనంతరం నువ్వు బ్రతికివుంటే దైవప్రసన్నత కోసం నువ్వు చేసుకునే ప్రతి ఆచరణతో నీ స్థాయి, అంతస్థులు పెరుగుతాయి. బహుశా నీకు ఇంకా జీవితం గడిపే అవకాశం లభిస్తుందేమో! అప్పుడు కొంత మంది (విశ్వాసులకు) నీవల్ల మేలు కలగవచ్చు, ఇంకొంతమంది (దైవ తిరస్కారులకు) నీ వల్ల కీడు కలగవచ్చు. ఓ అల్లాహ్‌! నా సహచరుల హిజ్రత్‌ని (ప్రస్థానాన్ని) పరిపూర్ణం గావించు. వారిని పరాజయం పాలుచేయకు’ అని వేడుకున్నారు. కాని “సాద్‌ బిన్‌ ఖౌలా” దయార్హులు. ఎందుకంటే ఆయన మక్కాలో ఉండగానే కన్నుమూశారు. అందుకని ఆయన కనికరించబడాలని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దుఆ చేసేవారు. (బుఖారీ – ముస్లిం)


7. హజ్రత్‌ అబూ హురైరా అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ సఖర్‌ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు:

“అల్లాహ్‌ మీ శరీరాలను, మీ ముఖాలను చూడడు. ఆయన మీ అంతరంగాలను, ఆచరణలను మాత్రమే చూస్తాడు.” (ముస్లిం)


8. హజ్రత్‌ అబూ మూసా అబ్దుల్లాహ్‌ బిన్‌ ఖైస్‌ అష్‌అరీ (రది అల్లాహు అన్హు) కథనం :

ఒకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను “ఒకడు తన శూరత్వాన్ని ప్రకటించుకోవడానికి, మరొకడు తన వంశప్రతిష్టను చాటుకోవడానికి, ఇంకొకడు పరుల మెప్పు పొందడానికి పోరాడుతున్నారు. అయితే ఈ ముగ్గురిలో ఎవరు దైవ మార్గంలో పోరాడుతున్నట్లు?” అని ప్రశ్నించడం జరిగింది. అందుకాయన “దైవవాక్కు (దైవధర్మం) ఉన్నతి కోసం పోరాడిన వాడు అల్లాహ్‌ మార్గంలో పోరాడినట్లు పరిగణించడం జరుగుతుంది” అని సమాధానమిచ్చారు. “(బుఖారి  – ముస్లిం)


9. హజ్రత్‌ అబూబక్రహ్‌ నుఫైబిన్‌ హారిస్‌ సఖఫీ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) :

“ఇద్దరు ముస్లింలు తమ తమ ఖడ్గాలతో పరస్పరం దాడికి దిగితే, హంతకుడు, హతుడు – ఇద్దరూ నరకానికి వెళతారు” అని చెప్పారు. నేను “దైవప్రవక్తా! హంతకుని మాట సరేగాని హతుడేం పాపం చేశాడని నరకానికి వెళతాడు? అని సందేహపడ్డాను. అందుకాయన “అతనూ తన ప్రత్యర్థిని చంపాలన్న కసితోనే ఉన్నాడు కదా!” అని బదులిచ్చారు. (బుఖారీ -ముస్లిం)


10. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారని హజ్రత్‌ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) తెలిపారు:

“మనిషి సామూహికంగా చేసే నమాజు అతను తన ఇంట్లో లేక బజారులో చేసే నమాజుకన్నా ఇరవై రెట్లకు పైగా ఘనమైనది. ఎందుకంటే ఒక వ్యక్తి చక్కగా వుజూ చేసుకుంటాడు, తరువాత నమాజు కోసం మస్జిద్ కు వస్తాడు. నమాజు మాత్రమే అతణ్ణి మస్జిద్కు తీసుకువస్తే – అలాంటి వ్యక్తి మస్జిద్ చేరుకునేంత వరకూ అతను వేసే ఒక్కో అడుగుకు బదులుగా అతని ఒక్కో అంతస్తు పెరుగుతూ ఉంటుంది. అతని వల్ల జరిగిన ఒక్కో పాపం తొలగించబడుతూ ఉంటుంది. ఆ తరువాత మస్జిద్లో ప్రవేశించిన పిదప నమాజు అతన్ని ఆపివుంచినంతసేపూ అతను నమాజు చేస్తున్నట్టుగానే పరిగణించ బడతాడు. మీలో ఎవడైనా నమాజు చేసిన స్థానంలో కూర్చొని ఉన్నంత వరకూ దైవదూతలు అతనిపై అల్లాహ్‌ కారుణ్యం కురవాలని వేడుకుంటూనే ఉంటారు. ఆ వ్యక్తి పరులకు హాని కలిగించనంతవరకు, అతని వుజూ భంగం కానంతవరకు దైవదూతలు “ఓ అల్లాహ్‌! ఈ వ్యక్తిని కరుణించు. ఓ అల్లాహ్‌! ఇతన్ని మన్నించు. ఓ అల్లాహ్‌! ఇతన్ని కనిపెట్టుకుని ఉండు ‘ అని విన్నవించుకుంటూ ఉంటారు”

(బుఖారీ – ముస్లిం). హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి. హదీసులో వచ్చిన పదం “యన్‌హజుహూ” అంటే అతన్ని బయటికి తీసుకువస్తుంది లేక అతన్ని లేపుతుందని అర్థం.


11. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ప్రభువు ద్వారా ఉల్లేఖించిన విషయాన్ని హజ్రత్‌ అబుల్‌ అబ్బాస్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ బిన్‌ అబ్దుల్‌ ముత్తలిబ్‌ (రది అల్లాహు అన్హు) ఈ విధంగా ఉటంకించారు :

“అల్లాహ్ సత్కార్యాలను, దుష్కార్యాలను రాసి, పిదప వాటిని గురించి వివరించాడు; ఎవరైనా ఏదైనా మంచి పని చేయాలని సంకల్పించుకొని, (ఏదయినా కారణంచేత) దానిని అమలుపరచలేక పోయినప్పటికీ అల్లాహ్‌ తన వద్ద అతను ఒక సత్కార్యం పూర్తి చేసినట్టు రాసుకుంటాడు. మరి ఆవ్యక్తి ఆ మంచి పని చేయాలని ఉద్దేశించుకొన్న పిదప దాన్ని నెరవేరిస్తే దానికి అల్లాహ్‌ పది నుండి ఏడు వందల రెట్లు – ఇంకా దానికంటే ఎన్నో రెట్లు అధికంగానే సత్కర్మలు చేసినట్లు అతని ఖాతాలో రాస్తాడు. (దీనికి భిన్నంగా) ఎవడైనా ఒక చెడుపని చేయాలనుకుని ఏదయినా కారణంచేత చేయకుండా ఉంటే అప్పటికీ అల్లాహ్‌ తన వద్ద, ఆ వ్యక్తి పూర్తిగా ఒక మంచి పని చేసినట్టు రాసుకుంటాడు. అయితే అతను ఆ చెడ్డపని చేయాలని సంకల్పించుకున్న పిదప దాన్ని చేసేస్తే మాత్రం ఒక్క చెడ్డపని చేశాడని పొందుపరుస్తాడు” (బుఖ్లూరీ -ముస్లిం)


12. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించగా తాను విన్నానని హజ్రత్ అబూ అబ్దుర్రహ్మాన్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (రది అల్లాహు అన్హు) తెలియజేశారు:

“మీ పూర్వీకుల్లోని ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణానికి బయలుదేరారు. దారిలో రాత్రయింది. ఆ ముగ్గురూ ఒక గుహలో శరణు తీసుకుందామని అందులోకి వెళ్ళారు. అంతలోనే పర్వతం పైనుంచి ఒక పెద్ద బండరాయి దొర్లిపడింది. దాంతో గుహ ముఖద్వారం మూసుకు పోయింది. దాంతో వారు ఆ ఆపద నుంచి బయటపడే మార్గం గురించి మాట్లాడుకున్నారు. ఆఖరికి తాము అంతకు మునుపు చేసుకున్న సత్కార్యాల ఆధారంగా అల్లాహ్‌ను వేడుకోవడం తప్ప ఆ విపత్తు నుండి బయట పడేందుకు వేరేమార్గం లేదన్న నిర్ణయానికి వచ్చారు.

వారిలోని ఒకడు ఇలా వేడుకున్నాడు : “దేవా! నాకు మరీ ముసలివారైన తల్లిదండ్రులుండేవారు. సాయంత్రం పూట అందరికంటే ముందు నేను నా తల్లిదండ్రులకే పాలు త్రాగించేవాడిని. వారికంటే ముందు నా భార్యాబిడ్డలకు గానీ, నా నౌకర్లకు గానీ త్రాపించేవాణ్డి కాను. ఒకరోజు నేను (పశువులకు) చెట్లమేత కోసం చాలా దూరం వెళ్ళిపోయాను. నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి నా తల్లిదండ్రులిద్దరూ నిద్రపోయారు. నేను ఆ పూట పాలు పితికి తీసుకు వచ్చాను. అప్పటికే వారు గాఢ నిద్రలో ఉండడం గమనించాను. వారిని మేల్కొలపడానికి నాకు మనసొప్పలేదు. వారికంటే ముందు నా భార్యాబిడ్డలకు, నౌకర్లకు పాలు త్రాగించడం కూడా నాకిష్టం లేదు. అందుకని నా పిల్లలు నా కాళ్ళ మీద పడి విలవిల్లాడినా కూడా (నేను వారికి త్రాపకుండా) పాలపాత్ర చేతిలో పట్టుకొని తెల్లవారే దాకా వాళ్ళ దగ్గరే నిలబడి, ఏ సమయం లోనైనా వారు మేల్కొంటారేమోనని ఎదురు చూడసాగాను. తెల్లవారిన తరువాత గాని వారు లేవలేదు. నిద మేల్కొని రాత్రి వారికోసం ఉంచబడిన పాలు తాగారు. ఓ అల్లాహ్! కేవలం నీ ప్రసన్నత కోసమే నేనీ పని చేసివుంటే మేము చిక్కుకున్న ఈ గుహ ముఖ ద్వారం నుండి బండ రాయిని తొలగించి మమ్మల్ని రక్షించు.”

అతని వేడుకోలు ఫలితంగా ఆ బండ రాయి కొద్దిగా జరిగింది. అయితే (అప్పటికీ, ఆ సందుగుండా వారు బయటికి రాలేకపోయారు.

తరువాత రెండో వ్యక్తి అభ్యర్థించుకో సాగాడు: “ఓ దేవా! నా బాబాయి కూతురు ఒకామె ఉండేది. నేనామెను అమితంగా ఇష్టపడేవాణ్ణి. (వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది): మగవారు ఆడ వారిని అమితంగా ప్రేమించినంతగా నేను ఆమెను ప్రేమించేవాడిని. ఒకసారి నేను ఆమె పొందుకోసం పరితపించాను. కాని అందుకామె ఒప్పుకోలేదు. ఆఖరికి దుర్భిక్షం ఆమెను గత్యంతరం లేక నా వద్దకు వచ్చేలా చేసింది. అప్పుడు ఆమె నాతో ఏకాంతంలో గడిపే షరతుపై నేనామెకు నూట ఇరవై దీనార్లు ఇచ్చాను (గత్యంతరం లేక ఆమె అవి తీసుకుంది). నా కోరిక తీర్చేందుకు సిద్ధమయ్యింది. నేనామెను ఆక్రమించుకున్నప్పుడు, (వేరొక ఉల్లేఖనం ప్రకారం) నేను ఆమె రెండు తొడల మధ్య కూర్చు న్నప్పుడు ఆమె నాతో; “అల్లాహ్‌కు భయపడు! అక్రమంగా కన్నెపొరను చీల్చకు అని అంది. ఆ మాటలు విన్న తడవుగా నేను ఆమె దగ్గర నుండి లేచి పోయాను. నిజానికి ఆమె నాకు ప్రజల్లో అత్యంత ప్రియతమమైనది. నేను ఆమె కిచ్చిన బంగారు దీనార్లను కూడా వదులుకున్నాను. ఓ దేవా! నేను కేవలం నీ ప్రసన్నత కోసమే ఇలా చేసి ఉన్నట్లయితే మాపై వచ్చిపడిన ఈ విపత్తు నుండి మమ్మల్ని రక్షించు.

రెండో వ్యక్తి వేడుకోలు తరువాత ఆ బండరాయి ఇంకొంచెం తొలగింది. అయినా గాని వారు బయటపడేందుకు మార్గం సుగమం కాలేదు.

ఆ తరువాత మూడో వ్యక్తి వేడుకోవడం ప్రారంభించాడు: “ప్రభూ! నేను కొంత మంది పని మనుషులను జీతానికి ఉంచుకున్నాను. నేను వారందరికీ జీతాలిచ్చేశాను. కాని వారిలో ఒకడు మాత్రం తన జీతం పుచ్చుకోకుండానే వెళ్ళిపోయాడు. నేను అతని జీతాన్ని వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాను. దాంతో చాలా ధనం పోగయ్యింది. కొంత కాలానికి ఆ వ్యక్తి వచ్చి, “ఓ దైవ దాసుడా! నాకు నా జీతం ఇవ్వు” అనడిగాడు. దానికి నేను, “నువ్వు చూస్తున్నటువంటి ఈ ఒంటెలు, ఆవులు, మేకలు, బానిసలు – అన్నీ నీ జీతం ఫలాలే (వాటిని నువ్వు తీసేసుకో)” అన్నాను. అందుకతను “ఓ దైవదాసుడా! నాతో పరాచికాలు వద్దు’ అంటూ చిన్నబోయాడు. నేను “ఇది పరాచికం కాదు (నిజం చెబుతున్నాను)” అన్నాను. అప్పుడు అతను (నా కోసం) ఏమీ వదలకుండా ఆ సంపదనంతా తరలించుకొని వెళ్ళిపోయాడు. ఓ అల్లాహ్! నేను ఈ పని కేవలం నీ ప్రసన్నతను దృష్టిలో పెట్టుకొనే చేసినట్టయితే మేము చిక్కుకున్నటువంటి ఈ ఆపద నుంచి మమ్మల్ని కాపాడు.” దాంతో ఆ బండరాయి పూర్తిగా తొలగి పోయి గుహద్వారం తెరుచుకోవటంతో వారు ముగ్గురూ బయటపడ్డారు. (బుఖారీ -ముస్లిం)

తయమ్ముం, దాని విధానం మరియు సందర్భాలు [వీడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

తయమ్ముం, దాని విధానం మరియు సందర్భాలు
[https://youtu.be/1saC1XDHDgo [30 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 


తయమ్ముమ్‌:

క్రింద తెలుపబడే కారణాలు సంభవించినప్పుడు ప్రయాణికులు, స్థానికులు ఎవరైనా సరే వుజూ మరియు గుస్ల్‌ కు బదులుగా తయమ్ముమ్‌ చేయవచ్చును.

1- అతికష్టంగా వెతికినప్పటికీ నీళ్ళు దొరకనప్పుడు, లేదా ఉండికూడా వుజూకు సరిపడనప్పుడు తయమ్ముమ్‌ చేయవచ్చును. కొంత దూరములో నీళ్ళు ఉన్నా అక్కడికి వెళ్ళి తీసుకోవడంలో అతనికి ధన, ప్రాణ నష్టమున్నప్పుడు కూడా తయమ్ముమ్‌ చేయవచ్చును.

2- వుజూ అవయవాల్లో ఏ ఒకదానికైనా గాయమయితే దాన్ని కడిగే ప్రయత్నం చేయాలి. కడగడం వల్ల నష్టం ఉంటే మసహ్‌ చేయాలి, అంటే చేయి తడి చేసి దాని మీద తుడువాలి. మసహ్‌ వల్ల కూడా హాని కలిగే భయం ఉంటే తయమ్ముమ్‌ చేయవచ్చును.

3- ఏ నీళ్ళు లేదా వాతవరణం మరీ చల్లగా ఉండి నీళ్ళ ఉపయోగం హానికరంగా ఉంటే తయమ్ముమ్‌ చేయవచ్చును.

4- నీళ్ళు కేవలం త్రాగడానికి మాత్రమే ఉన్నప్పుడు కూడా తయమ్ముమ్‌ చేయవచ్చును.

తయమ్ముమ్‌ విధానం:

మనుసులో నియ్యత్‌ /సంకల్పం చేసుకొని రెండు అరచేతులు ఒక సారి భూమిపై తట్టి ముఖముపై మళ్ళీ మణికట్ల వరకు రెండు చేతులపై మసహ్‌ చేయాలి. (కొందరు వుజూ చేసినట్టుగా మోచేతుల వరకు, కాళ్ళు సయితం మసహ్‌ చేస్తారు ఇది ప్రవక్త పద్దతి ఎంతమాత్రం కాదు). వుజూను భంగపరిచే విషయాలే తయమ్ముమ్‌ ను భంగపరుస్తాయి. నమాజుకు ముందు లేదా నమాజు మధ్యలో నీళ్ళు లభిస్తే తయమ్ముమ్‌ భంగమవుతుంది. నమాజు పూర్తి చేసుకున్న తరువాత నీళ్ళు లభిస్తే ఆ నమాజు అయినట్లే. తిరిగి మళ్ళీ చేయవలసిన అవసరం లేదు.

[ఇది నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)  గారు రాసిన “శుద్ధి & నమాజు (Tahara and Salah)” అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ఈ ఆడియోలో, ప్రవక్త తయమ్ముమ్ (నీరు లేనప్పుడు చేసే శుద్ధి) గురించి వివరిస్తున్నారు. తయమ్ముమ్ అంటే అల్లాహ్ ఆరాధన ఉద్దేశంతో పరిశుభ్రమైన మట్టిపై రెండు చేతులు కొట్టి ముఖాన్ని మరియు రెండు అరచేతులను తుడుచుకోవడం. నీరు అందుబాటులో లేనప్పుడు లేదా దాని వాడకం హానికరమైనప్పుడు తయమ్ముమ్ చేయడం విధిగా చెప్పబడింది. ఇది ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఉమ్మత్‌కు మాత్రమే ఇవ్వబడిన ఒక గొప్ప వరం మరియు సౌకర్యం అని, గత ప్రవక్తల అనుచరులకు ఈ సౌలభ్యం లేదని హదీసుల ద్వారా వివరించబడింది. తయమ్ముమ్ యొక్క షరతులు – నియ్యత్ (ఉద్దేశం), నీరు లేకపోవడం, మరియు పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించడం. చిన్న అశుద్ధి (హదసె అస్గర్) మరియు పెద్ద అశుద్ధి (హదసె అక్బర్) రెండింటికీ తయమ్ముమ్ సరిపోతుంది. అయితే, నీరు అందుబాటులోకి వచ్చిన వెంటనే, తయమ్ముమ్ చెల్లదు మరియు స్నానం లేదా వుదూ చేయడం తప్పనిసరి అవుతుంది.

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ సహ్‌బిహీ అజ్మయీన్, అమ్మా బాద్.

తయమ్ముమ్ అంటే అల్లాహ్ యొక్క ఆరాధన ఉద్దేశంతో పరిశుభ్రమైన మట్టి మీద రెండు అరచేతులను కొట్టి ముందు ముఖం మీద తర్వాత రెండు అరచేతుల మీద ఇలా తుడుచుకోవడం.

నీళ్లు లేని సందర్భంలో లేదా నీళ్లు ఉండి దాని ఉపయోగం హానికరంగా ఉన్నందువల్ల ఈ తయమ్ముమ్ చేయటం విధిగా ఉంది. అల్లాహుతాలా దీని గురించి చాలా స్పష్టంగా ఆదేశించాడు. సూరె మాయిదా సూర నెంబర్ ఐదు ఆయత్ నెంబర్ ఆరులో అల్లాహ్ ఆదేశం ఉంది.

فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا
ఫలమ్ తజిదూ మాఅన్ ఫతయమ్మమూ సయీదన్ తయ్యిబా
మీరు నీళ్లు పొందని స్థితిలో పరిశుభ్రమైన మట్టితో తయమ్ముమ్ చేసుకోండి.

فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُمْ مِنْهُ
ఫమ్సహూ బివుజూహికుమ్ వ ఐదీకుమ్ మిన్హ్
మీ ముఖాలను తుడుచుకోండి. మీ చేతులను కూడా తుడుచుకోండి.

అయితే దీని ఆదేశం ఏంటి? విధిగా ఉంది. నీళ్లు లేని సందర్భంలో లేక నీళ్లు ఉండి మన కొరకు హానికరంగా ఉన్న సందర్భంలో తయమ్ముమ్ తప్పనిసరిగా చేయాలి.

అయితే ఇక్కడ ఇంకో విషయం మనకు తెలిసి ఉండటం చాలా మంచిది. అందువల్ల మనం అల్లాహ్ యొక్క కృతజ్ఞత అనేది ఇంకా ఎంతో గొప్పగా చెల్లించుకోవచ్చు. అదేమిటి?

ఈ తయమ్ముమ్ యొక్క సౌకర్యం ఇది అల్లాహ్ వైపు నుండి కేవలం మన కొరకు ఒక గొప్ప వరం. ఎందుకంటే ఇంతకుముందు ప్రవక్తల అనుసరులకు, ఇంతకుముందు ప్రవక్తలను విశ్వసించిన వారికి ఇలాంటి సౌకర్యం అల్లాహ్ ప్రసాదించలేదు. ఈ సౌకర్యం అల్లాహ్ తాలా ఎవరికి ఇచ్చాడు ప్రత్యేకంగా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుసరులకు, ఆయనను విశ్వసించిన వారికి ప్రసాదించాడు.

ఈ విషయం బుఖారీ ముస్లింలో ఒక చాలా స్పష్టమైన హదీస్ ఉంది. జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తాలా అన్హు గారు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు: “ఐదు విషయాలు ఉన్నాయి, నాకంటే ముందు ఏ ప్రవక్తకు అవి ఇవ్వబడలేదు.” గమనించండి. అంటే ఈ ఐదు విషయాల ప్రత్యేకత అనేది కేవలం మన ప్రవక్తకే ప్రసాదించబడినది. ఒకటి, నా శత్రువులు నా నుండి ఒక నెల దూర ప్రయాణంలో ఉంటారు కానీ వారి హృదయాల్లో అల్లాహ్ నా యొక్క భయం వేస్తాడు. రెండవది, అది మన టాపిక్ కు సంబంధించింది.

وَجُعِلَتْ لِيَ الْأَرْضُ مَسْجِدًا وَطَهُورًا
వ జుఇలత్ లియల్ అర్దు మస్జిదవ్ వతహూరా
సర్వభూమిని అల్లాహ్ నా కొరకు నమాజు చేయుటకు స్థలంగా, పరిశుభ్రత పొందుటకు సాధనంగా చేశాడు.

فَأَيُّمَا رَجُلٍ مِنْ أُمَّتِي أَدْرَكَتْهُ الصَّلَاةُ فَلْيُصَلِّ
ఫఅయ్యుమా రజులిమ్ మిన్ ఉమ్మతీ అద్రకత్ హుస్సలా ఫల్ యుసల్లీ.
ఈ భూమిలో మీరు ఎక్కడ సంచరిస్తున్నా సరే, ఎక్కడా ఉన్నా సరే నమాజ్ టైం అయిన వెంటనే నమాజ్ చేసుకోవాలి. నీళ్లు లేవు, తహారత్ లేదు ఇలాంటి ఏ సాకులు చెప్పుకోరాదు.

మూడో విషయం,

وَأُحِلَّتْ لِيَ الْغَنَائِمُ وَلَمْ تَحِلَّ لِأَحَدٍ قَبْلِي
వ ఉహిల్లత్ లియల్ గనాయిమ్ వలమ్ తహిల్ల లిఅహదిన్ ఖబ్లీ.
యుద్ధ ఫలం నా కొరకు హలాల్, ధర్మసమ్మతంగా చేయబడింది. నాకంటే ముందు ఎవరి కొరకు కూడా అది ధర్మసమ్మతంగా లేకుండింది.

మాలె గనీమత్, యుద్ధ ఫలం, యుద్ధ ధనం, యుద్ధం జరిగినప్పుడు ఇస్లాం మరియు కుఫ్ర్ మధ్యలో ఇస్లాం పై ఉన్నవారు గెలిచిన తర్వాత అవిశ్వాసుల ధనం ఏదైతే పొండేవారో దానిని మాలె గనీమత్ అని అనబడుతుంది.

నాలుగో విషయం, وَأُعْطِيتُ الشَّفَاعَةَ వ ఉ’తీతుష్షఫాఆ. ప్రళయ దినాన సిఫారసు చేసే ఈ గొప్ప భాగ్యం అల్లాహ్ నాకు ప్రసాదించనున్నాడు.

ఐదో విషయం,

وَكَانَ النَّبِيُّ يُبْعَثُ إِلَى قَوْمِهِ خَاصَّةً وَبُعِثْتُ إِلَى النَّاسِ عَامَّةً
వ కానన్నబియ్యు యుబ్అసు ఇలా కౌమిహీ ఖాస్సతన్ వ బుఇస్తు ఇలన్నాసి ఆమ్మహ్.
ఇంతకుముందు ప్రవక్తలు ప్రత్యేకంగా తమ జాతి వారి వైపునకు పంపబడేవారు. కానీ నేను సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా పంపబడ్డాను.

ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు, చనిపోయారు కూడా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ప్రళయం వచ్చే వరకు ప్రతి మనిషి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించడం తప్పనిసరి. లేకుంటే అతని అంతిమ గతి ఏమవుతుంది? నరకమే అవుతుంది. అయితే మన టాపిక్ కు సంబంధించిన విషయం ఏంటి ఇక్కడ? భూమి మస్జిద్ గా కూడా ఉంది, అది తహూర్, పరిశుభ్రతకు సాధనంగా కూడా అల్లాహ్ తాలా దానిని చేశాడు.

మూడు విషయాలు మనం విన్నాము. తయమ్ముమ్ అంటే ఏమిటి, దాని ఆదేశం ఏంటి అంటే అది విధిగా ఉంది, మూడో విషయం అది అల్లాహ్ వైపు నుండి ఒక గొప్ప వరం.

నాలుగో విషయం, ఖురాన్లో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల్లో దీని గురించి చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి గనక, ఎవరికీ ఏ సందేహం అనేది ఉండకూడదు. తయమ్ముమ్ చేసే విషయంలో, ఎక్కడ ముస్లిం, ఒక విశ్వాసుడు ఏ ప్రాంతంలో ఉన్నా గానీ, అక్కడ అతనికి నైట్ ఫెయిల్ అయింది అని, భార్య భర్తలు ఉండేది ఉంటే వారిద్దరూ మధ్యలో సంబంధాలు జరిగాయి గనక వారిపై ఇప్పుడు స్నానం చేయడం విధిగా ఉంది, నీళ్లు లేవు అని, ఇంకా వేరే ఏ సాకులు కూడా చెప్పకుండా, నమాజ్ టైం అయిన వెంటనే నీళ్లు లేనప్పుడు తయమ్ముమ్ చేసి లేక నీళ్లు ఉండి మన ఆరోగ్యానికి, మన శరీరానికి హానికరంగా ఉంటే నీళ్లు వాడకుండా తయమ్ముమ్ చేసి వెంటనే నమాజ్ చేయాలి. ఈ రోజుల్లో అనేక మంది యువకులు ప్రత్యేకంగా బజారుల్లో తిరగడం, ఇంకా వేరే పనుల్లో ఉండి, నమాజ్ టైంలో ఏదైనా మస్జిద్ దగ్గర ఉన్నప్పటికీ కూడా నమాజ్ కు రారు. సాకు ఏం చెప్తారు ఎక్కువ శాతం? “నాకు తహారత్ లేదు”. ఇది చాలా ఘోరమైన పాపం.

తయమ్ముమ్ హదసె అక్బర్ (పెద్ద అశుద్ధి), హదసె అస్గర్ (చిన్న అశుద్ధి) రెండిటికీ పనిచేస్తుంది. హదసె అక్బర్ అంటే ఏంటి? స్వప్న స్కలనం కావడం (నైట్ ఫెయిల్ కావడం), లేక భార్య భర్తలు కలుసుకోవడం. ఇందువల్ల ఏదైతే స్నానం చేయడం విధిగా ఉంటుందో దానిని హదసె అక్బర్ అంటారు. సామాన్యంగా మలమూత్ర విసర్జన తర్వాత, ఏదైనా అపాన వాయువు (గాలి) వెళితే, ఇలాంటి స్థితులు ఏవైతే ఉంటాయో వాటిని హదసె అస్గర్ అంటారు.

ఈ రెండిటికీ కూడా తయమ్ముమ్ సరిపోతుంది. దానికి దలీల్ (ఆధారం) ఏమిటి? సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలో ఒక చాలా పెద్ద హదీస్ ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రయాణ విషయంలో. అందులో ఒక తయమ్ముమ్ కు సంబంధించిన విషయం ఏంటంటే, ఒకచోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ చేసి,

فَلَمَّا انْفَتَلَ مِنْ صَلَاتِهِ إِذَا هُوَ بِرَجُلٍ مُعْتَزِلٍ لَمْ يُصَلِّ مَعَ الْقَوْمِ
ఫలమ్మన్ ఫలత మిన్ సలాతిహీ ఇదా హువ బిరజులిమ్ ముఅతజిలిల్ లమ్ యుసల్లి మఅల్ కౌమ్
నమాజ్ చేసి తిరిగిన తర్వాత ఒక వ్యక్తిని చూశారు ప్రవక్త గారు. అతను ఒక పక్కకు ఉన్నాడు, అందరితో కలిసి నమాజ్ చేయలేదు.

مَا مَنَعَكَ يَا فُلَانُ أَنْ تُصَلِّيَ مَعَ الْقَوْمِ
మా మనఅక యా ఫులాన్ అన్ తుసల్లి మఅల్ కౌమ్
అందరితో జమాఅత్ తో సహా, సామూహికంగా నమాజ్ ఎందుకు చేయలేదు నీవు అని ప్రవక్త వారు అతన్ని అడిగారు.

అప్పుడు అతడు ఏం చెప్పాడు?

أَصَابَتْنِي جَنَابَةٌ وَلَا مَاءَ
అసాబత్నీ జనాబతున్ వలా మా
నేను అశుద్ధావస్థకు గురయ్యాను, స్నానం చేయడం నాకు విధిగా అయిపోయింది. నీళ్లు లేవు.

అందు గురించి ఇంతవరకు నేను స్నానం చేయలేకపోయాను గనక, మీతో పాటు నేను నమాజ్ చేయలేదు. అప్పుడు ప్రవక్త ఏమన్నారు?

عَلَيْكَ بِالصَّعِيدِ فَإِنَّهُ يَكْفِيكَ
అలైక బిస్సయీద్ ఫఇన్నహూ యక్ఫీక్
పరిశుభ్రమైన మట్టి ఉంది కదా, అది నీకు సరిపోతుంది.

అలాగే సహీహ్ బుఖారీలోనే అమ్మార్ బిన్ యాసిర్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క సంఘటన ఉంది. అప్పటి వరకు ఆయనకు తయమ్ముమ్ విషయం తెలియదు. నమాజ్ టైం అయిపోయింది, స్నానం చేయడం విధిగా ఉంది. ఆయన ఏం చేశాడు? గాడిద మట్టిలో ఎలా పొర్లుతుందో చూశారా ఎప్పుడైనా? అతను స్వయంగా అంటున్నాడు, గాడిద ఎలా మట్టిలో పొర్లుతుందో అలా నేను మట్టిలో మొత్తం స్నానం చేసినట్టుగా లేచి నమాజ్ చేసుకొని ప్రవక్త వద్దకు వచ్చాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఈ విషయం అడిగాను. ప్రవక్త గారు చెప్పారు, “అంతగా చేసే అవసరం లేదే నీకు. కేవలం రెండు చేతులు పరిశుభ్రమైన మట్టి మీద కొట్టి, మట్టి అంటి ఉంటుంది గనక అని ఒక్కసారి ఊదుకొని ముఖముపై, కుడి చేయి అరచేతితో ఎడమ చేయి అరచేతి మీద, ఈ ఎడమ చేయి యొక్క అరచేతి లోపలి భాగంతో కుడి చేయి అరచేతి పై భాగం మీద మసాజ్ చేస్తే ఒక్కసారి సరిపోతుంది.”

ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల ద్వారా మనకు ఏం తెలుస్తుంది? స్నానం చేయడం విధిగా అయిన సందర్భంలో గానీ, లేక వుదూ చేయడం విధిగా ఉన్న సందర్భంలో గానీ, ఈ రెండు సందర్భాల్లో కూడా నీళ్లు లేనప్పుడు తయమ్ముమ్ సరిపోతుంది.

స్నానం అంటే తెలుసు, వుదూలో మనం కొన్ని ప్రత్యేక అవయవాలు కడుగుతాము. స్నానం చేయడం విధిగా ఉంటే ఏం చేస్తాము? గోరంత కూడా ఎక్కడా పొడితనం ఉండకుండా మంచిగా స్నానం చేస్తాము. కానీ నీళ్లు లేని సందర్భంలో ఒకే ఒక తయమ్ముమ్ రెండిటికీ సరిపోతుంది. ఒకసారి స్నానానికి ఇంకొకసారి వుదూకు అని రెండు రెండు సార్లు తయమ్ముమ్ చేసే అవసరం లేదు. ఒక్కసారి తయమ్ముమ్ చేసి నమాజ్ చేసుకుంటే స్నానానికి బదులుగా మరియు వుదూకు బదులుగా సరిపోతుంది.

తయమ్ముమ్ కూడా ఒక ఇబాదత్. నమాజుకు వుదూ చేయడం షరత్ కదా. వుదూ దేనితో చేస్తాము? నీళ్లతోని. నీళ్లు లేని సందర్భంలో అల్లాహ్ మనకు ఈ సౌకర్యం కలుగజేశాడు. అందు గురించి ఇది కూడా ఒక ఇబాదత్ గనక ఇందులో కొన్ని షరతులు ఉన్నాయి.

మొదటి షరత్, మొదటిది నియ్యత్. నియ్యత్ అంటే తెలుసు కదా ఇంతకు ముందు ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాము. ఏదో పెద్ద మంత్రం అలా చదవడం కాదు నోటితోని. ఏ కార్యం చేస్తున్నామో, ఏ సత్కార్యం, ఏ మంచి కార్యం, ఏ ఇబాదత్, దాని యొక్క సంకల్పం మనసులో చేసుకోవాలి. ఏమని? ఈ నా యొక్క సత్కార్యం ద్వారా అల్లాహ్ యే సంతృప్తి పడాలి, అల్లాహ్ యే నాకు దీని యొక్క ప్రతిఫలం ఇవ్వాలి అన్నటువంటి నమ్మకం ఉండాలి, అన్నటువంటి సంకల్పం, నియ్యత్ అనేది ఉండాలి. వేరే ప్రజలకు చూపడానికి గాని, ముతవల్లాకు చూపడం గాని, ఇంకా మన సంతానానికి చూపించడానికి గాని, నేను ఒక ముస్లింగా అన్నటువంటి భావన ఇతరులకు కలిగించడం కొరకు ఇలాంటి ఏ ప్రాపంచిక ఉద్దేశాలు ఉండకూడదు.

రెండవ నిబంధన, రెండవ షరత్, నీళ్లు లేకపోవడం లేదా ఉండి దానిని వాడడం మనకు నష్టకరంగా ఉండడం. అందుగురించి అల్లాహుతాలా సూరె మాయిదాలో ఏదైతే చెప్పాడో, అది కూడా మనకు ఒక ఆధారంగా ఉంది:

وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ
వ ఇన్ కున్తుమ్ మర్దా అవ్ అలా సఫరిన్
ఒకవేళ మీరు రోగులై ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా…

హానికరంగా ఉండడం అనేదేదైతే చెప్తున్నామో, అది మనకు కొన్ని హదీసుల ద్వారా కూడా వివరంగా తెలుస్తుంది. అంతే కాకుండా ఖురాన్లో అల్లాహ్ ఏం చెప్పాడు? సూరె నిసా, ఆయత్ నెంబర్ 29లో ఉంది:

وَلَا تَقْتُلُوا أَنفُسَكُمْ
వలా తఖ్తులూ అన్ఫుసకుమ్
మీకు మీరు (లేదా ఒకరినొకరు) చంపుకోకండి.

ఆత్మహత్యలు చేసుకోకండి, పరస్పరం ఒకరు మరొకరిని హత్య చేయకండి. ఇవన్నీ భావాలు దీంట్లో వస్తాయి.

إِنَّ اللَّهَ كَانَ بِكُمْ رَحِيمًا
ఇన్నల్లాహ కాన బికమ్ రహీమా
నిశ్చయంగా అల్లాహ్ మీ పట్ల చాలా కనికరం కలవాడు.

ఈ విధంగా ఈ షరతులు మనకు తెలిసినాయి, అర్థమైనాయి.

మూడో షరత్ ఏంటంటే, తయమ్ముమ్ చేయడానికి పరిశుభ్రమైన మట్టితో చేయాలి. ఈ మూడు షరతులు తయమ్ముమ్ కు సంబంధించినవి.

ఇందులో రెండు ఫర్దులు ఉన్నాయి. ఒకటి ఏమిటి? ముఖాన్ని తుడవడం. మరొకటి? రెండు అరచేతులను.

అయితే ఏ సందర్భాల్లో తయమ్ముమ్ చేయవచ్చు అన్న విషయం మనకు ఇంతకు ముందే సంక్షిప్తంగా వచ్చింది. నీళ్లు లేనప్పుడు లేక ఉండి కూడా వాడడం నష్టంగా ఉన్నప్పుడు. దానినే మరికొంచెం వివరంగా తెలుసుకుందాం.

నీళ్లు లేకపోవడం అంటే ఏమిటి? నీళ్లు లేకపోవడం అంటే మనం ఎక్కడ ఉన్నామో ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో ఎక్కడా నీళ్లు వుదూ చేయడానికి దొరకకపోవడం. మనం అక్కడి వరకు మన వద్ద బండి ఉంటే బండి ద్వారా వెళ్లడం గానీ, లేక కాలి నడకతో వెళ్లడం గానీ సాధ్యం ఉండి కొన్ని అడుగులు వెళ్తే అక్కడ దొరుకుతాయి అన్నటువంటి ఛాన్స్ ఉండేది ఉంటే, నీళ్లు లేని కింద లెక్కించబడదు. ఉదాహరణకు, ఇప్పుడు ఇక్కడ మనం సౌదియాలో ఉన్నాం గనక ఇక్కడి నుండి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో నీళ్లు ఉన్నాయి అనుకోండి. మనకు ఇక్కడ దగ్గరలో లేవు, అయితే నమాజ్ టైం అయినప్పుడు మన దగ్గర ఏదైనా బండి ఉంది లేక కార్ ఉంది, లేక మన మిత్రుని దగ్గర బండి ఉంది, వేరే ఎన్నో అవసరాలకు మనం తీసుకుంటూ ఉంటాం, వాడుకుంటూ ఉంటాము. ఆ రెండు కిలోమీటర్ల దూరానికి వెళ్లి ఆ నీళ్లు తీసుకురావడం మనకు కష్టంగా ఉంటుందా? ఉండదు. అయితే దాన్ని నీళ్లు లేవు అన్న విషయం అక్కడ వర్తించదు. మనం ఎక్కడి వరకు వెళ్లి నీళ్లు తీసుకోవడం సాధ్యం ఉన్నదో అక్కడి వరకు వెళ్లి తీసుకోవాలి. ఇక ఎక్కడైతే సాధ్యం కాదో అది నీళ్లు లేవు అన్న దానికి కింద లెక్కించబడుతుంది.

రెండో విషయం, మన దగ్గర నీళ్లు ఉన్నాయి కానీ త్రాగడానికి ఉన్నాయి. ఆ నీళ్లతో మనం స్నానం చేస్తే లేక వుదూ చేయడం మొదలు పెడితే త్రాగడానికి మనకు నీళ్లు దొరకవు. కొన్ని కొన్ని సందర్భాల్లో కరువు ఏర్పడుతుంది, వర్షాలు ఉండవు, మన దగ్గర కూడా అలాంటి ప్రాంతం అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది కదా. నీళ్లు త్రాగడానికి మాత్రమే ఉన్నాయి. వాడుకోవడానికి లేవు. అలాంటి సందర్భంలో కూడా అది నీళ్లు లేని కిందనే లెక్కించబడుతుంది. ఎందుకంటే ఇస్లాం మనల్ని మనం నష్టపరుచుకోవడానికి ఆదేశించదు. ఇదే ఆయత్లో, ఎక్కడైతే మనం ఇంతకు ముందు సూరె మాయిదా ఆయత్ చదివామో అందులోనే అల్లాహుతాలా ముందు ఏం చెప్తున్నాడు?

مَا يُرِيدُ اللَّهُ لِيَجْعَلَ عَلَيْكُم مِّنْ حَرَجٍ
మా యురీదుల్లాహు లియజ్అల అలైకుమ్ మిన్ హరజ్
అల్లాహుతాలా మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికి గురి చేయదల్చుకోలేదు.

وَلَٰكِن يُرِيدُ لِيُطَهِّرَكُمْ
వలాకిన్ యురీదు లియుతహ్హిరకుమ్
అల్లాహ్ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని శుభ్రపరచడం, పరిశుద్ధులుగా చేయడం.

وَلِيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكُمْ
వ లియుతిమ్మ నిఅమతహూ అలైకుమ్
తన యొక్క కారుణ్యాన్ని మీపై సంపూర్ణం చేయడం.

ఎందుకు?

لَعَلَّكُمْ تَشْكُرُونَ
లఅల్లకుమ్ తష్కురూన్
మీరు కృతజ్ఞత చెల్లించే వాళ్ళు కావాలి అని.

గమనించండి. నీళ్లు త్రాగడానికి కూడా మనకు లేకుంటే మన జీవితమే చాలా నష్టంలో పడిపోవచ్చు. అందుగురించి వాడుకోవడానికి ఉన్న నీళ్లు మొత్తానికి అయిపోయి, కేవలం త్రాగడానికి మాత్రమే ఉన్నాయి, దానిని వాడితే ఇక మనకు చాలా ఇబ్బందికి గురవుతాము, అలాంటప్పుడు కూడా నీళ్లు లేవు అన్న విషయంలోనే వర్తిస్తుంది.

మూడో రకం, నీళ్లు ఉన్నాయి చాలా. కానీ కొనాల్సి వస్తుంది. కొనాల్సి వస్తుంది. అయితే పిసినారితనం చేసి డబ్బు పెట్టి ఎందుకు కొనాలి? ఎక్కడైనా ఫ్రీగా దొరికితే చూసుకుందాము. అన్నటువంటి భావన ఉంచుకొని, శక్తి ఉండి కూడా మనం కొనకుంటే అది పాపంలో పడిపోతాము. కానీ మన దగ్గర నీళ్లు కొనేంత శక్తి లేదు. ఉన్నాయి నీళ్లు కానీ కొనాల్సి వస్తుంది. కొనేంత శక్తి కూడా మన దగ్గర లేదు. కొన్నే కొన్ని డబ్బులు ఉన్నాయి, అవి మన ఈ రోజుకు గాని, లేకుంటే ఇంకా కొన్ని రోజుల వరకు మన అతి ముఖ్యమైన తిండి ఏదైతే ఉందో దాని గురించి గడవాలి. ఇలాంటి ఇబ్బందికరమైన జీవితం ఉన్నప్పుడు కొనడం కష్టతరంగా ఉన్నప్పుడు, కడుపు నిండా భోజనం చేసుకొని డ్రింకులు తాగవచ్చు కానీ ఇక్కడ వుదూ చేసుకోవడానికి ఒక నీళ్లు, ఒక అర లీటర్ నీళ్లు కొనలేము? ఆ డ్రింకులు ఏంటి, పెప్సీలు ఏంటి అవి మన జీవనానికి అత్యవసరమైన తిండి కింద లెక్కించబడుతుందా? లెక్కించబడదు.

విషయం అర్థమవుతుంది కదా. నీళ్లు లేవు అన్న ఈ పదం అనేది ఎన్ని రకాలుగా వస్తుంది, దాని యొక్క రూపాలు ఏంటున్నాయో అవన్నీ నేను వివరిస్తున్నాను.

రెండో విషయం, నీళ్లు ఉన్నాయి కానీ దాని ఉపయోగం మనకు నష్టకరంగా ఉంది. అంటే చలి వల్ల కావచ్చు. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. వేడి చేసుకోవడానికి ఎలాంటి సౌకర్యం లేదు ఇప్పుడు. ఒకవేళ ఉన్నది సౌకర్యం కానీ ఎంత సేపు పడుతుందంటే, మన ఈ నమాజ్ టైం అనేది దాటిపోతుంది. అలాంటప్పుడు ఆ నీళ్లు ఉపయోగించడం వల్ల మనకు నష్టం కలుగుతుంది అన్న భయం ఉండేది ఉంటే తయమ్ముమ్ చేయవచ్చు. ప్రవక్త సల్లల్లాహు వసల్లం కాలంలో ఒకసారి ఏం జరిగింది? ఒక వ్యక్తికి నెత్తిలో గాయమైంది. ప్రయాణంలో ఉన్నాడు, నెత్తిలో గాయమైంది. చాలా చల్లని రాత్రి, అతనికి స్నానం చేయడం కూడా విధి అయిపోయింది. దగ్గర ఉన్న స్నేహితులను అడిగాడు, ఏం చేయాలి నేను? ఫజర్ నమాజ్ టైం. “లేదు లేదు నీకేంటి, తప్పకుండా నువ్వు స్నానం చేసి నమాజ్ చేయాల్సిందే” అని అన్నారు అతని స్నేహితులు. అల్లాహ్ కరుణించు గాక వారిని. ఆయన స్నానం చేశాడు కానీ అందువల్ల అతని ప్రాణం పోయింది. తర్వాత ప్రవక్త సల్లల్లాహు వసల్లం వారి వద్దకు వచ్చిన తర్వాత, “మీరు మీ సోదరుని చంపేశారు. ధర్మజ్ఞానం లేనప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించలేదు? ఎందుకు అడగలేదు? అతను అలాంటి సందర్భంలో కేవలం తయమ్ముమ్ చేస్తే సరిపోయేది కదా” అని ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు బోధ చేశారు.

అయితే చలి వల్ల గాని, లేక మన శరీరంలో వుదూ చేసే అవయవాలకు ఏదైనా గాయమై ఉంది, అందువల్ల కూడా మనకు నీళ్లు వాడడం, ఉపయోగించడం నష్టకరంగా, హానికరంగా, ప్రాణం పోయేటువంటి భయం, లేక రోగం ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువ పెరిగే భయం, ఖురాన్లో అల్లాహ్ ఏం చెప్పాడు? “వ ఇన్ కున్తుమ్ మర్దా.” మీరు ఒకవేళ అనారోగ్యానికి గురియై మీకు నీళ్లు దొరకకుంటే తయమ్ముమ్ చేయవచ్చును. చూడండి, గమనించండి, ఇన్ని సౌకర్యాలు అల్లాహ్ ఇచ్చిన తర్వాత అరే జాన్దేలేరే క్యా ముస్లిం థండీ అయినా క్యా నమాజ్ పడతా? సామాన్యంగా అనుకుంటూ ఉంటాం కదా మనం. ఏంటి ఈ ముతవల్లాలు, ఈ మౌల్వీ సాబులు వీళ్లకు ఏం పని పాటలు ఉండయి, కేవలం అల్లాహ్ అల్లాహ్ అంటూ నమాజులు చేసుకుంటూ ఉంటారు, మన లెక్కలో ఎక్కడ పని చేస్తారు? కానీ అదే ఈ తిండి కొరకు, కూడు కొరకు, పని గురించి ఇంతటి చల్లని వాతావరణంలో కూడా ఎవరైనా డ్యూటీ వదులుకుంటాడా? చల్లగా ఉంది ఈ రోజు డ్యూటీకి వెళ్లకూడదు అని. ఏమీ దొరకకుంటే కప్పుకునే బ్లాంకెట్ అయినా వేసుకొని డ్యూటీకి వెళ్తాడు కానీ నమాజ్ విషయం వచ్చేది ఉంటే, అల్లాహ్ యొక్క దయ అని నమాజు ఎగ్గొడతాడు. ఇంకా సౌదియాలో ఇంటి నుండి మనం మస్జిద్ కి వెళ్ళడానికి కిలోమీటర్లు నడిచిపోయే అవసరమే పడదు. అవునా కాదా? వెనకా, ముంగట, కుడి పక్కన, ఎడమ పక్కన, ఎటు చూసినా అల్లాహ్ యొక్క దయ వల్ల మస్జిద్లే మస్జిద్లు. చాలా దగ్గరలో. అయినా గానీ మనం చలి కాలంలో ఇలాంటి సాకులు చెప్పి నమాజులను వదిలేస్తే, మనం ఇంకెవరికో కాదు నష్టంలో పడేసేది. మనకు మనం నరకానికి దారి సులభం చేసుకుంటున్నాము. అందు గురించి సోదరులారా, అల్లాహ్ మనందరికీ భయపడే మరియు ఇలాంటి సౌకర్యాలు ఏదైతే అల్లాహ్ ఇచ్చాడో వాటిని ఉపయోగించుకొని అల్లాహ్ యొక్క ఆరాధన సరైన పద్ధతిలో చేసే భాగ్యం కలిగించు గాక.

అయితే ఒక విషయం ఇక్కడ గుర్తించాలి, అదేమిటి? ఎప్పుడైతే నీళ్లు దొరుకుతాయో అప్పుడు తయమ్ముమ్ చేయడం అనేది మానేసేయాలి. నీళ్లు వచ్చిన వెంటనే. చివరికి కొందరు ఆలిములు ఏమంటున్నారో తెలుసా? నీళ్ల గురించి అన్ని రకాల ప్రయత్నం నువ్వు చేశావు, నీళ్లు దొరకలేదు, తయమ్ముమ్ చేసుకుని నమాజ్ మొదలు పెట్టావు, నీళ్లు వచ్చాయి. నమాజ్ ను తెంపేసేయ్, వుదూ చేసుకొని నమాజ్ చెయ్. అర్థమైందా?

మరో విషయం ఇక్కడ, తయమ్ముమ్ ద్వారా కూడా ఒక్కటి కంటే ఎక్కువ నమాజులు కూడా చేయవచ్చు. ఉదాహరణకు మీరు అసర్ లో తయమ్ముమ్ చేశారు. ఆ వుదూను, అంటే తయమ్ముమ్ తో ఏదైతే మీకు వుదూ అయిందో దాన్ని మీరు కాపాడుకున్నారు. మూత్రానికి వెళ్ళలేదు, ఇంకా వుదూ భంగమయ్యే ఏవైతే కారణాలు మనం ఇంతకు ముందు విన్నామో అలాంటివి ఏవీ సంభవించలేదు. అయితే మగ్రిబ్, ఇషా అన్నీ చేసుకుంటూ వచ్చినా గానీ కానీ నీళ్లు వచ్చేస్తే అరె నేను అప్పుడు తయమ్ముమ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు మగ్రిబ్ నమాజ్ కంటే ముందు నీళ్లు వచ్చేసాయి, అసర్ టైంలో నీళ్లు లేవు. మగ్రిబ్ వరకు నీళ్లు వచ్చేసినాయి. నా అప్పటి వుదూ ఉంది కదా, దానితోనే నేను మగ్రిబ్ చేసుకుంటాను. తప్పు విషయం. నీళ్లు వచ్చేసాయి ఇప్పుడు తయమ్ముమ్ నీది చెల్లదు, తయమ్ముమ్ నీది నడవదు, అది expire అయిపోయినట్లు. అర్థమవుతుంది కదా. మళ్లీ కొత్తగా వుదూ చేసుకొని మీరు మగ్రిబ్ నమాజ్ అనేది చేయాలి. అంటే నీళ్లు వచ్చిన వెంటనే తయమ్ముమ్ సమాప్తం అయిపోతుంది. దాని యొక్క ఆదేశం అనేది ఇక ఉండదు. ఎందుకు? అల్లాహ్ ఏమంటున్నాడు?

فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا
ఫలమ్ తజిదూ మాఅన్ ఫతయమ్మమూ
నీళ్లు పొందని సందర్భంలో మీరు తయమ్ముమ్ చేయండి.

నీళ్లు వచ్చిన తర్వాత? ఇక ఉండదు.

ఇంకో విషయం. స్నానం చేసే విషయంలో, అంటే స్నానం విధి అయింది, నీళ్లు లేవు. నమాజ్ టైం అయింది. ఏం చేసినాం మనం? తయమ్ముమ్ చేసుకొని నమాజ్ చేశాం. ఓకే? తర్వాత నీళ్లు వచ్చాయి. స్నానం చేయాలా చేయవద్దా? చేయాలి. ప్రశ్న అర్థమైందా? ఉదాహరణకు ఫజర్ నమాజే అనుకోండి. రాత్రి నైట్ ఫెయిల్ అయింది. నీళ్లు దొరకలేదు. లేక ఫజర్ నమాజ్ టైం గనక ఎక్ దమ్ మైనస్ డిగ్రీ వాతావరణం ఉండి, నీళ్లు వాడితే మనకు జ్వరం వచ్చేస్తుంది, నీళ్లు వాడేది ఉంటే మనకు ఇంకా ఏదైనా అనారోగ్యానికి గురి అయ్యే సూచనలు ఉన్నాయి. నీళ్లు వాడలేదు, తయమ్ముమ్ చేసుకున్నాము. పొద్దెక్కేసరికి మనకు ఆరోగ్యం బాగైపోయింది, ఇప్పుడు నీళ్లు వాడడంలో నష్టం లేదు. అప్పుడు స్నానం చేయాలా, చేయవద్దా? చేయాలి.

చాలా పెద్దగా ఉంది హదీస్ అని నేను ఇంతకు ముందు ఒక ఇమ్రాన్ బిన్ హుసైన్ రదియల్లాహు అన్హు గారి హదీస్ ఏదైతే చెప్పానో, అందులో ఆ వ్యక్తి నువ్వు ఎందుకు మాతో నమాజ్ చేయలేదు అని ప్రవక్త గారు అడిగారు కదా, అతను ఏమన్నాడు? నా దగ్గర నీళ్లు లేవు, నేను జునుబీ అయిపోయాను, అశుద్ధావస్థకు గురయ్యాను. ప్రవక్త చెప్పారు, నీకు తయమ్ముమ్ సరిపోయేది. ఆ తర్వాత కొంతసేపటికి, అయితే ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు అప్పటికే పంపి ఉన్నారు కొందరిని నీళ్ల గురించి. పోండి మీరు నీళ్ల గురించి వెతకండి అని. ఆ హదీస్ అంతా పొడుగ్గా ఉన్నది అంటే అందులో ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారి గొప్ప మహిమ కూడా ఉన్నది. మరి ఎప్పుడైనా గుర్తు చేయండి చెప్తాను దాని గురించి. కానీ సంక్షిప్తం ఏంటంటే నీళ్లు దొరుకుతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందులో తమ చేతులు పెడతారు, అల్లాహ్ బరకత్ ప్రసాదిస్తాడు, అందరూ తమ తమ దగ్గర ఉన్న పాత్రలన్నీ నింపుకుంటూ ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు చూడండి, ఏ విషయం ఎంత ముఖ్యమైనది, అవసరమైనది ఉంటుందో దాని విషయంలో అశ్రద్ధ వహించరు. ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు ప్రయాణంలో ఉన్నారు, ఎందరో సహచరులు ఉన్నారు, ఎందరియో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ నీళ్లు వచ్చిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు ఆ వ్యక్తిని గుర్తు చేసి, అతన్ని పిలవండి, హా నీళ్లు తీసుకెళ్ళు, తీసుకెళ్లి నువ్వు స్నానం చెయ్యి అని ఆదేశించారు.

సహీహ్ బుఖారీలో ఆ హదీస్ ఉంది, 344 హదీస్ నెంబర్. అయితే విషయం ఏం తెలిసింది మనకు? స్నానం విధిగా ఉన్నప్పుడు నీళ్లు లేవు లేక ఉండి దానిని వాడడం మనకు నష్టకరంగా ఉంటే నమాజ్ చేసుకున్నాము తయమ్ముమ్ తోని. కానీ తర్వాత ఆ నష్టం తొలిగిపోయింది లేదా నీళ్లు మనకు దొరికినాయి, అలాంటప్పుడు ఏం చేయాలి? స్నానం అనేది చేయాలి.

కొంచెం ఈ విషయాలు ఎక్కువ శాతం చలి కాలంలో, ఇంకా వేరే ప్రయాణంలో ఉన్న సందర్భంలో, వేరే సందర్భాల్లో కూడా మనకు అవసరం పడతాయి గనక కొంచెం వివరంగా చెప్పడం జరిగింది. అయితే, మేజోళ్లపై మసాహ్ విషయం అనేది అల్లాహ్ యొక్క దయతో మనం వచ్చే నెక్స్ట్ పాఠంలో తెలుసుకుందాము. దీని గురించి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతాయి. అయితే తప్పకుండా ఉలమాలతో, ధర్మవేత్తలతో మనం మంచి సంబంధాలు ఉంచుకొని అలాంటి ప్రశ్నలను మనం వారితో తెలుసుకోవాలి. షరీయత్ యొక్క సమాధానం, ధర్మపరమైన సమాధానం ఏముంటుందో తెలుసుకొని దాని ప్రకారంగా అల్లాహ్ యొక్క ఆరాధన చేసే ప్రయత్నం చేయండి. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.


ఇతరములు: