అయ్యూబ్ (అలైహిస్సలాం) జీవితచరిత్ర – ఖురాన్ కథామాలిక

అయ్యూబ్ (అలైహిస్సలాం) జీవితచరిత్ర
https://youtu.be/t27mDKl4w3E
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

 وَأَيُّوبَ إِذْ نَادَىٰ رَبَّهُ أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ فَاسْتَجَبْنَا لَهُ فَكَشَفْنَا مَا بِهِ مِن ضُرٍّ

మరి అయ్యూబు (స్థితిని గురించి కూడా ఓసారి మననం చేసుకోండి). అతను “నాకు ఈ వ్యాధి సోకింది. నువ్వు కరుణించే వారందరిలోకీ అపారంగా కరుణించే వాడవు” అని తన ప్రభువును మొరపెట్టుకున్నప్పుడు, మేము అతని ప్రార్థనను ఆలకించి, ఆమోదించాము. అతని బాధను దూరం చేశాము. (ఖుర్ ఆన్  21: 83, 84)

కొందరు  దైవదూతలు అల్లాహ్ సృష్టి లోని కొన్ని ప్రాణుల గురించి మాట్లాడు కోసాగారు. విధేయత చూపి అల్లాహ్ ప్రసన్నతను పొందిన వారి గురించి వారు చర్చించుకోసాగారు. అలాగే అహంభావంతో విర్రవీగి అల్లాహ్ ఆగ్రహాన్ని కొని తెచ్చుకున్న వారి గురించి సంభాషిస్తుండగా ఒక దైవదూత, “ప్రస్తుతం భూమిపై ఉన్న వారిలో అత్యుత్తముడు అయ్యూబ్. ఆయన ఉన్నత వ్యక్తిత్వం కలిగినవాడు. గొప్ప సహనశీలి. ఎల్లప్పుడూ అపార కరుణా మయుడైన విశ్వప్రభువును స్మరిస్తూ ఉంటాడు. అల్లాహ్ ను ఆరాధించే వారికి ఆయన గొప్ప ఆదర్శం. అందుకు ప్రతిఫలంగా అల్లాహ్ ఆయనకు దీర్ఘాయుష్షు ప్రసాదించాడు. అపార సంపదలు ఇచ్చాడు. అయ్యూబ్ ఎన్నడూ అహంభావానికి పాల్పడలేదు. స్వార్థం ఆయనలో లేనేలేదు. ఆయన కుటుంబం, ఆయన సేవకులు, అవసరార్థులు, బీదలు అందరూ ఆయన సంపదలో భాగం పొందుతున్నారు. ఆయన బీదలకు అన్నం పెడతారు. వారికి దుస్తులు ఇస్తారు. బానిసలకు స్వేచ్ఛ ప్రసాదించడం కోసం వారిని కొంటారు. తన నుంచి దానధర్మాలు పొందేవారు తనకు ఉపకారం చేస్తున్నట్లుగా ఆయన వ్యవహరిస్తారు. ఆయన చాలా ఉదార స్వభావి, చాలా మంచి వాడు” అంటూ ప్రశంసించారు.

ప్రవక్త మూసా (అలైహిస్సలాం) & మార్గదర్శి ఖిజర్ (అలైహిస్సలాం) – ఖురాన్ కథామాలిక

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

فَانطَلَقَا حَتَّىٰ إِذَا رَكِبَا فِي السَّفِينَةِ خَرَقَهَا ۖ قَالَ أَخَرَقْتَهَا لِتُغْرِقَ أَهْلَهَا لَقَدْ جِئْتَ شَيْئًا إِمْرًا

మూసా, ఖిజర్ లు బయలు దేరారు. చివరకు ఒక పడవలో పయనమైనప్పుడు అతను (ఖిజరు) దాని చెక్క పలకలను పగుల గొట్టారు. దానికి మూసా, “ఇదేమిటీ, పడవ ప్రయాణీకులందరి ముంచేయటానికా వీటిని పగులగొట్టారు? మీరు చాలా ఘోరమైన పనికి ఒడిగట్టారు” అని చెప్పనే చెప్పేశాడు. (సూరా అల్ కహఫ్ 18: 71)

ఒ క రోజు, మూసా (అలైహిస్సలాం) ప్రజల్లో చైతన్యాన్ని రగిలించే ఒక ప్రభావవంతమైన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం వారిపై తీవ్రమైన ప్రభావం వేసింది. ప్రజల్లో ఒక వ్యక్తి, “దైవప్రవక్తా! భూమిపై మీకన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తి ఉన్నాడా?” అని ప్రశ్నించాడు. అల్లాహ్ తనకు మహత్యాలు ప్రదర్శించే శక్తి ఇచ్చాడు, తౌరాత్ గ్రంథాన్ని ప్రసాదించాడు కాబట్టి తానే అందరికన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వాడినని భావిస్తూ మూసా (అలైహిస్సలాం) ఆ వ్యక్తితో, “లేడు” అని జవాబిచ్చారు. కాని తెలుసుకోవలసినదంతా తెలుసుకున్న వ్యక్తి ఎవరూ లేరని, సంపూర్ణ జ్ఞానానికి ఒకే దైవప్రవక్త కేంద్రం కావడం కూడా జరగదని, ఒక వ్యక్తికి తెలియని విషయాలు తెలిసిన మరో వ్యక్తి ఎల్లప్పుడు ఉంటాడని అల్లాహ్ ఆయనకు తెలియజేశాడు. అప్పుడు మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ తో, “ప్రభూ! ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారు? నేను ఆయన్ను కలుసుకుని ఆయన నుంచి విద్య నేర్చు కోవాలని భావిస్తున్నాను” అన్నారు. ఆ వ్యక్తిని గుర్తించడానికి గుర్తు చెప్పమని కూడా అల్లాహ్ ను కోరారు.

అల్లాహ్ ఆయనకు మార్గం చూపుతూ, నీటితో నిండిన ఒక పాత్రలో ఓ చేపను తీసుకుని బయలుదేరాలని, ఆ చేప పాత్ర నుంచి మాయమైన ప్రదేశంలో ఆ వ్యక్తి కనబడతాడని చెప్పాడు. మూసా (అలైహిస్సలాం) ఆ వ్యక్తిని కలుసుకోవడానికి బయలుదేరారు. ఆయన వెంట ఒక అనుచరుడు చేపవున్న నీటిపాత్రను పట్టుకుని రాసాగాడు. వారిద్దరు రెండు నదులు కలసిన సంగమ ప్రదేశానికి చేరు కున్నారు. అక్కడ విశ్రాంతి తీసుకోవాలని భావించారు. మూసా (అలైహిస్సలాం) అక్కడ నిద్రలోకి జారుకున్నారు.

ఆయన నిద్రపోతున్నప్పుడు, నీటి పాత్రలోని చేప ఎగిరి నదిలో దూకడాన్ని ఆయన అనుచరుడు చూశాడు. కాని అతడు ఈ సంఘటన గురించి మూసా (అలైహిస్సలాం)కు చెప్పడం మరచిపోయాడు. మూసా (అలైహిస్సలాం) లేచిన తర్వాత ఇద్దరూ ప్రయాణం కొనసాగించారు. వారు బాగా అలసిపోయారు, చాలా ఆకలితో ఉన్నారు. మూసా(అలైహిస్సలాం) తన అనుచరునితో ఆహారం గురించి అడిగారు. అప్పుడు అనుచరునికి నీటి పాత్రలోని చేప నదిలో దూకి వెళ్ళిపోయిన విషయం గుర్తుకువచ్చింది. ఆ విషయాన్ని మూసా (అలైహిస్సలాం)కు తెలియజేశాడు. మూసా (అలైహిస్సలాం), “అర్రర్రె.. మనం వెదుకుతున్న ప్రదేశం అదే” అన్నారు. వారు త్వరత్వరగా వెనక్కి వచ్చారు. రెండు నదులు కలసిన ప్రదేశానికి, చేప నదిలో దూకి ఈదుకుంటూ వెళ్ళిపోయిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వారికి ఒక వ్యక్తి కనిపించాడు. అతని ముఖం సగ భాగాన్ని ఒక వస్త్రం కప్పిఉంది. ఆయనే ఖిజర్ (అలైహిస్సలాం)… మార్గదర్శి!

మూసా (అలైహిస్సలాం) ఆయనకు అభివాదం చేశారు. “అస్సలాము అలైకుమ్ (మీపై శాంతి కలుగుగాక!)” అన్నారు. ఆ వ్యక్తి తన ముఖంపై ఉన్న వస్త్రాన్ని తప్పించి వారిని చూశారు. “మీరు నాకు శాంతి కలగాలని అభివాదం చేశారు. కాని ఈ దేశంలో శాంతి ఉందా? అసలు మీరెవరు?” అని ప్రశ్నించారు. మూసా (అలైహిస్సలాం) జవాబిస్తూ, “నేను ఇస్రాయీల్ వారి ప్రవక్తను” అన్నారు. ఆ వ్యక్తి తిరిగి, “మీకు బోధనలు ఎవరు చేశారు? ఎవరు మిమ్మల్ని ఇక్కడకు పంపించారు?” అనడిగారు. మూసా (అలైహిస్సలాం) జరిగిన విషయాన్ని ఆయనకు వివరించారు. చాలా మర్యాదగా, “నేను మీతో రావచ్చా.. ఆ విధంగా మీరు మీ వద్ద ఉన్న జ్ఞానాన్ని నాకు బోధించగలరు. మిమ్మల్ని కలవడానికి నేను చాలా ప్రయాసపడి ఇక్కడకు వచ్చాను. నేను మీకు అవిధేయత చూపను” అన్నారు. ఖిజర్ (అలైహిస్సలాం) ఆయనకు జవాబిస్తూ, “మీరు నన్ను భరిస్తారని నేను అనుకోవడంలేదు. ఎందుకంటే మీరు అనేక విచిత్రమైన విషయాలను చూడవచ్చు. చాలా విచిత్రమైన వాటిని చూసి మీరు నన్ను విమర్శించకుండా ఉండలేరు. ఎందుకంటే మీ అవగాహన పరిమితమైనది. అందువల్ల మీరు వాదనకు దిగుతారు” అన్నారు. మూసా (అలైహిస్సలాం) చాలా నిజాయితీగా, “అల్లాహ్ తలిస్తే… నేను సహనంతో ఉంటాను. మీ పట్ల అవిధేయత చూపను” అన్నారు. చివరకు ఖిజర్ (అలైహిస్సలాం) ఆయన్ను వెంట తీసుకువెళ్లడానికి అంగీకరిస్తూ ఒక షరతు పెట్టారు. తాను ఏం చేసినా ప్రశ్నించరాదని అన్నారు. మూసా (అలైహిస్సలాం) తన అనుచరుడిని వెనక్కు పంపి తాను ఖిజర్ (అలైహిస్సలాం)తో పాటు బయలుదేరారు.

వారు ఒక నది వద్దకు చేరుకున్నారు. ఇద్దరూ ఒక పడవలోకి ఎక్కారు. ఆ పడవ యజమాని వారిద్దరి పట్ల ఒక విధమైన అభిమానాన్ని చూపించాడు. వారిద్దరిని అభిమానంగా పడవలోకి ఆహ్వానించాడు. పడవలోకి ఎక్కిన తర్వాత ఖిజర్ (అలైహిస్సలాం) చాలా వింతగా వ్యవహరించారు. పడవ ప్రక్కల బిగించి ఉన్న కొన్ని చెక్కలను పీకిపారేశారు. దాని వల్ల పడవకు ఒకవైపు పెద్ద రంధ్రంలా ఏర్పడింది. ఈ విచిత్ర ప్రవర్తనను చూసి నిర్ఘాంతపోయిన మూసా (అలైహిస్సలాం), “అరె, ఎందుకు పడవను నాశనం చేస్తున్నారు? మన పట్ల అభిమానంగా ఆహ్వానించిన పడవ యజమానికి ఇదా మనం ఇచ్చే ప్రతిఫలం? పైగా మనమంతా మునిగిపోయే ప్రమాదం కూడా ఉందని మీరు గ్రహించడం లేదా? మీరు చేసిన పని చాలా అనుచితమైనది” అన్నారు.

ఖిజర్ (అలైహిస్సలాం) ఆయనకు తమ మధ్య కుదిరిన అంగీకారాన్ని గుర్తుచేశారు. మూసా (అలైహిస్సలాం)కు వెంటనే తాను చేసిన పొరపాటు గుర్తుకువచ్చింది. ఆయన్ను క్షమాపణలు కోరుకున్నారు. “నా మతిమరుపుకు కోపం తెచ్చుకోవద్దు, నా బలహీనత విషయంలో కఠినంగా వ్యవహరించవద్దు. మీతో రాకుండా నివారించవద్దు. నేను నా మాటకు కట్టుబడి ఉండడానికి ఈసారి పూర్తిగా ప్రయత్నం చేస్తాను” అన్నారు. అందుకు అంగీకరించి ఖిజర్ (అలైహిస్సలాం) ఆయన్ను వెంటతీసుకుని బయలుదేరారు.

దారిలో వారికి ఒక పిల్లవాడు తన మిత్రులతో ఆడుకుంటూ కనబడ్డాడు. ఖిజర్ (అలైహిస్సలాం) ఆ పిల్లవాడిని మిత్రబృందం నుంచి వేరు చేసి ఒక ప్రక్కకు తీసుకు వెళ్ళి హతమార్చారు. ఈ అఘాయిత్యం చూసి మూసా (అలైహిస్సలాం) నిర్ఘాంతపోయారు. “మీరు ఒక అమాయక పిల్లవాడిని చంపేశారు. ఇది నిజంగా అమానుషం” అని అరిచారు. ఖిజర్ (అలైహిస్సలాం) ఆయన వైపు తీక్షణంగా చూసి తమ మధ్య కుదిరిన అంగీకారాన్ని గుర్తుచేశారు. తన పనులను మరోసారి ప్రశ్నిస్తే ఇక తనతో రావడం ఉండదని హెచ్చరించారు. మూసా (అలైహిస్సలాం) మళ్ళీ క్షమాపణ కోరుకున్నారు. “నేను మరోసారి ఈ పొరపాటు చేస్తే నన్ను మీ వెంట రాకుండా చేయండి” అన్నారు. ఖిజర్ (అలైహిస్సలాం) ఆయన్ను మన్నించారు.

వారిద్దరు ఒక గ్రామానికి చేరుకున్నారు. అక్కడి గ్రామస్తులతో వారు ఆశ్రయాన్ని, ఆహారాన్ని కోరారు. కాని పిసినారి ప్రజలు వారికి ఏదీ ఇవ్వలేదు. అందువల్ల వాళ్ళిద్దరూ అలాగే ప్రయాణం కొనసాగించవలసి వచ్చింది. వారిద్దరూ వెడుతున్నప్పుడు ఒక చోట ఒక గోడ కూలడానికి సిద్ధంగా ఉండడాన్ని వాళ్ళు చూశారు. వెంటనే ఖిజర్ (అలైహిస్సలాం) ఆ గోడను మరమ్మత్తు చేయడానికి పూను కున్నారు. ఇది చూసిన మూసా (అలైహిస్సలాం) ఉండబట్టలేక, “మీరు భలే విచిత్రమైన మనిషి. ఈ స్వార్థపరుల పట్ల మీరు సానుభూతి చూపుతున్నారు. పైగా మీరు చేస్తున్న కష్టానికి ప్రతిఫలం కూడా కోరడం లేదు. మనం చేసిన కష్టానికి వారి నుంచి ప్రతిఫలం తీసుకుని మన ప్రయాణానికి కొద్దిగా ఆహారాన్ని సమకూర్చుకో గలిగే వాళ్ళం” అన్నారు. తన పనులకు తగిన వివరణ ఇచ్చే వరకు వాటిని మూసా (అలైహిస్సలాం) భరించలేరని ఖిజర్ (అలైహిస్సలాం)కు అర్థమయ్యింది. “ఇక చాలు… ఇక మనం ఎవరి దారి వారు వేరవ్వడం మంచిది. మీకు సహనం లేదు. అయితే మనం వేరయ్యే ముందు నేను చేసిన పనులకు కారణాలు వివరిస్తాను” అన్నారు. మూసా సిగ్గుపడుతూ తల వంచుకున్నారు.

1. నేను నష్టపరచిన పడవను కిరాయికి నడుపుకుని ఆ పడవ యజమాని, అతని భార్య బ్రతుకుతున్నారు. నేను ఆ పడవను ఎందుకు నష్టపరిచానంటే, వారి రాజు పడవలను స్వాధీనం చేసుకుని పెద్ద నౌకాదళాన్ని తయారు చేయాలని చూస్తున్నాడు. ఈ పడవను నష్టపరచడం వల్ల దీన్ని చూసినా కూడా పనికిరానిదిగా భావించి రాజు దాన్ని వదలివేస్తాడు. మూసా! నేను చేసిన పని చూడడానికి బాధ్యత లేని పనిగా కనబడినా… నేను నిజానికి ఆ పడవను కాపాడడానికి, పడవ యజమానిపై సానుభూతితో చేసిన పని.

2. నేను చంపిన పిల్లవాడి తల్లిదండ్రులు నిజమైన విశ్వాసులు. కాని ఆ పిల్లవాడిలో ఉన్న దుర్మార్గం గురించి నాకు తెలిసింది. కన్నకొడుకు కాబట్టి ఆ తల్లి దండ్రులు అతడి దుర్మార్గాన్ని భరిస్తారు. కాని, చివరకు వాడి దుర్మార్గాలు ఆ తల్లిదండ్రులను కూడా ప్రభావితం చేస్తాయని నేను గ్రహించాను. అతడిని చంపి నేను వారి విశ్వాసాన్ని కాపాడాను. అల్లాహ్ వారికి మంచి సంతానాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.

3. నేను ఆ గోడను నిర్మించినది స్వార్థపరులైన గ్రామస్తుల కోసం కాదు, ఆ గోడ ఇద్దరు అనాధలైన బాలలది. ఆ గోడ క్రింద గుప్తనిధి ఉందని అల్లాహ్ నాకు తెలియజేశాడు. ఆ పిల్లల తండ్రి పుణ్యాత్ముడు, దానధర్మాలు చేసేవాడు. ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యే వరకు ఆ గుప్తనిధి రహస్యంగా ఉండడం చాలా అవసరం. వారు పెద్దయిన తర్వాత అల్లాహ్ వారికి ఆ నిధిని చూపిస్తాడు. ఆ గోడ పడిపోతే స్వార్థపరులైన గ్రామస్తులు ఆ నిధిని దోచుకుంటారు. కాబట్టి నేను చేసిన ప్రతీ పని నా ప్రభువు కారుణ్యం వల్ల చేసిన పని. నేను ఏ పనీ నా స్వంతంగా చేయలేదు. ఈ మాటలు చెప్పి ఖిజర్ (అలైహిస్సలాం) వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు.

(చదవండి దివ్యఖుర్ఆన్: 18:60-82)

జ్ఞానం పొందిన వ్యక్తి తానొక్కడే కాదన్న విషయం తెలిసిన వెంటనే మూసా (అలైహిస్సలాం) మరింత జ్ఞానం సంపాదించడానికి కష్టసాధ్యమైన ప్రయాణానికి పూనుకున్నారు. జ్ఞానం సులభసాధ్యంగా లభించేది కాదు. జీవితంలో విజయం సాధించాలంటే మనిషి కష్టపడి పనిచేయవలసి ఉంటుంది.

అల్లాహ్ ఆదేశాల మర్మాలన్నింటినీ మనం అర్థం చేసుకోలేము. మనకు తప్పుగా కనబడుతున్న విషయం నిజానికి ఒక అనుగ్రహం కావచ్చు. “తాను చేసేది అల్లాహ్ కు బాగా తెలుసు”.

సూరతుల్ కహఫ్ తఫ్సీర్: ఆయతులు 60 – 82 : మూసా & ఖిజరు యొక్క వృత్తాంతము [5 వీడియోలు]
https://teluguislam.net/2020/12/26/tafseer-suratul-kahf-18/

సూరతుల్ కహఫ్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) – మెయిన్ పేజీ. (అన్నీ పాఠాల కోసం)
https://teluguislam.net/tafsir-kahf/

ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran

హునైన్ యుద్ధం  – ఖురాన్ కథామాలిక

మహాప్రవక్త ﷺ జీవిత చరిత్ర – హునైన్ యుద్ధం
https://youtu.be/ZX1VhZjtLe8
వక్త:సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

హునైన్ యుద్ధం జరిగిన రోజున అల్లాహ్ మిమ్మల్ని ఆదుకున్నాడు. ఆ సందర్భంగా మీరు మీ అధిక సంఖ్యపై గర్వపడ్డారు. కాని ఆ సంఖ్యాబలం మీకే విధంగానూ ప్రయోజనం కలిగించలేదు. భూమి విశాలంగా ఉండి కూడా మీకోసం ఇరుకై పోయింది. అప్పుడు మీరు వెన్ను చూపి మరలిపోయారు. ఆ తరువాత అల్లాహ్ తన ప్రవక్తపై, విశ్వాసులపై తన తరపు నుంచి స్థిమితాన్ని అవతరింపజేశాడు. మీకు కానరాని సేనలను పంపించాడు. సత్య తిరస్కారులను శిక్షించాడు. (9:25,26)

తాయిఫ్ నగరానికి మాజీ నాయ కుడు జురైజ్. ఆయన వయోవృద్ధుడు, అంధుడు. యుద్ధతంత్రాల గురించి ఆయనకు బాగా తెలుసు. ఆయన, ఒక ఒంటె మీద కూర్చొని ఉన్నాడు. సేవకుడు ఒంటె తోలుకొని వెళ్తున్నాడు. ప్రస్తుతం తాము ఏ ప్రదేశంలో ఉన్నామని ఆయన తన సేవకుణ్ణి అడిగాడు. అది ఔతాస్ ప్రదేశమని సేవకుడు చెప్పాడు. అక్కడే విడిది చేయమని జురైజ్ తన ప్రజలకు సలహా ఇచ్చాడు. ఆ ప్రదేశం కొండలేవీ లేకుండా, మరీ సమతలంగాను కాకుండా చాలా అనుకూలంగా ఉంది.

అక్కడికి కొద్దిదూరంలో ఆయనకు స్త్రీల, పిల్లల శబ్దాలు, జంతువుల అరుపులు వినిపించాయి. అక్కడ ఎవరున్నారని ఆయన తన సేవకుల్ని అడిగాడు. “మన కొత్త నాయకుడు మాలిక్ ప్రజలను యుద్ధానికి సమాయత్తం చేస్తున్నాడు. ధనసంపదల్ని, భార్యాబిడ్డల్ని సైతం వెంటబెట్టు కొని ఒక చోట సమావేశం అవమని ఆయన ప్రజలకు ఆదేశించాడు” అని సేవకులు జురైజ్ కు తెలిపారు. తనను ఆ కొత్త నాయకుని వద్దకు తీసుకువెళ్ళమని జురైజ్ సేవకుల్ని కోరాడు. సేవకులు ఆయన్ని మాలిక్ దగ్గరికి తీసుకు వెళ్ళారు. జురైజ్, మాలిక్ ను “ఏం జరుగుతుందిక్కడ?” అని అడిగాడు. దానికి మాలిక్ బదులిస్తూ, “ముహమ్మద్ ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాకుండానే నిక్షేపంగా మక్కాలోకి ప్రవేశించాడు. మక్కా తర్వాత పెద్ద నగరం మాదే. కనుక భవిష్యత్తులో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనపై కూడా దాడి చేయవచ్చు. హవాజిన్, నస్ర్, జుషామ్, సఖీఫ్ మొదలగు తాయిఫ్ తెగలన్నీ కూడా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీద మెరుపుదాడి చేయాలని నిశ్చయించాయి” అని చెప్పాడు. అది విని జురైజ్, “మరయితే ఇక్కడ పశువుల అరుపులు, చిన్న పిల్లల ఏడుపులు ఎందుకు వినపడుతున్నాయి?” అని అడిగాడు. దానికి సమాధానమిస్తూ మాలిక్, “మనవాళ్లు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సైన్యాన్ని చూసి బెదిరిపోయి యుద్ధం చేయకుండా ఉంటారేమోనని నాకు భయంగా ఉంది. అందుకని నేను వారి స్త్రీలను, పిల్లలను యుద్ధ మైదానానికి వెంట తీసుకొచ్చాను. తమ భార్యాబిడ్డల్ని, సిరిసంపదల్ని కాపాడుకోవటానికి అయినా మన సైనికులు తప్పకుండా యుద్ధం చేయవలసి ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు. దానికి జురైజ్ తల అడ్డంగా ఆడిస్తూ, “ఈ విషయంలో నేను నీతో ఏకీభవించలేను. మీరు ఓడిపోతే మీ భార్యాబిడ్డల ముందే అవమానం పాలవుతారు. కాబట్టి వీళ్లను యుద్ధమైదానం నుంచి పంపేయండి” అని సలహా ఇచ్చాడు. కాని మాలిక్ మాత్రం తల పొగరుతో, “నీవు ముసలోడివై పోయావు. యుద్ధ తంత్రాలకు సంబంధించి నీ విద్యలకు కాలం చెల్లింది. ఈ విషయాలను నువ్వు పట్టించుకోకు. ‘నీ కన్నా సమర్థవంతులే ఈ వ్యవహారా లను పర్యవేక్షిస్తున్నారు” అన్నాడు.

మొత్తానికి వారు ముస్లింలపై మెరుపుదాడి చేయటానికి గట్టిగా నిశ్చయించుకున్నారు.

మక్కాను జయించి మదీనాకు బయలుదేరారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). మార్గ మధ్యంలో ఆయనకు కొన్ని తెగలు తమ మీద దాడి చేయటానికి పూనుకున్నాయన్న వార్త అందింది. మదీనాకు చేరుకున్న తర్వాత ఆయన ముస్లింలకు, ఆయుధాలు దింపవద్దని ఆదేశించారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవటానికి అవకాశం లేదని చెప్పారు. అరేబియాలో అవిశ్వాసులకు గట్టి పట్టు ఉన్న చివరి ప్రాంతం తాయిఫ్. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముస్లిం సైన్యాలను అటు వైపు నడిపించారు. తన తెల్లటి కంచర గాడిదపై స్వారీ చేస్తూ ఉన్నారాయన.

దాని పేరు దుల్ దుల్. ముస్లింలు సూర్యాస్తమయానికి ముందే తాయిఫ్ నగరానికి దగ్గర్లోని హునైన్ పర్వతాల వద్దకు చేరుకున్నారు. అయితే హఠాత్తుగా అవిశ్వాసులు అన్ని వైపుల నుంచి ముస్లింలపై దాడి చేశారు. ఆ హఠాత్పరిణామానికి ముస్లింలు కకావికలయ్యారు. ముస్లిం సైన్యం ఛిన్నాభిన్నమైపోయింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆందోళనకు గురయ్యారు. కలసికట్టుగా పోరాడమని ముస్లింలను పిలిచారు. కాని ఆ స్థితిలో ఆయన మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు. వెనక్కి తిరిగి చూస్తే అబూబక్ర్, ఉమర్, అలీ, అబూ సుఫ్యాన్, ఇంకా తన వంశస్తులు మరికొంత మంది మాత్రమే ఆయనకు కనిపించారు. అబూ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హు) తన భావాలను అణచుకోలేకపోయారు. బిగ్గరగా అరుస్తూ, “అల్లాహ్ సాక్షి! ఇక మనం ఓడిపోయినట్లే. అవిశ్వాస సైన్యాలను సముద్ర కెరటాలే ఆపగల్గుతాయి” అన్నారు.

అటు శత్రువుల వైపు నుంచి హంబల్ కుమారుడు కలాదా గట్టిగా అరుస్తూ, “నేటితో ముహమ్మద్ మంత్రజాలం అంతమైపోతుంది” అన్నాడు. అన్సార్లనందరినీ తిరిగి కూడగట్టమని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అబ్బాస్ (రదియల్లాహు అన్హు)కు ఆదేశించారు. అబ్బాస్ (రదియల్లాహు అన్హు), “ఓ అన్సార్లారా!, దైవప్రవక్త కోసం ప్రాణార్పణకు సిద్ధపడ్డ వీరుల్లారా!, శత్రువులకు వ్యతిరేకంగా తనకు సహాయపడమని ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు” అని ఎలుగెత్తి ప్రకటించారు. అబ్బాస్ (రదియల్లాహు అన్హు) పిలుపు తమ కర్ణపుటాలకు తాకగానే అన్సార్ యోధులు, పారిపోతున్న వారల్లా వెనక్కి తిరిగి, “లబ్బైక్ యా రసూలల్లాహ్, లబ్బైక్ (దైవప్రవక్తా! వచ్చేస్తున్నాం)” అంటూ పరుగెత్తుకొచ్చారు. క్షణాల్లో ముస్లిం సైన్యం బారులు తీరింది. దృఢచిత్తులైన యోధులతో ముస్లిం సైన్యం అవిశ్వాసులపై ఉవ్వెత్తున ఎగిసిపడింది. ముస్లింల ధైర్యం అవిశ్వాసులకు సముద్రంలో తుఫానులా అగుపించింది. భయంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని, వెంటతెచ్చిన సామగ్రినంతటిని వదలి పెట్టేసి, యుద్ధమైదానం నుంచి పలాయనం చిత్తగించారు అవిశ్వాసులు. (చదవండి, ఖుర్ఆన్ 9: 25)

హునైన్ యుద్ధమైదానం నుంచి పారిపోయిన బనూ సఖీఫ్ తెగ తాయిఫ్ నగరంలోకి జొరబడింది. ఈ నగరంలో పటిష్టమైన కోటలెన్నో ఉన్నాయి. రక్షణ నిమిత్తం నగరం చుట్టూ ఎన్నో ప్రాకారాలు నిర్మించబడి ఉన్నాయి.

ముస్లిం సైనికులు వారిని వెంబడించారు, కాని వారు అప్పటికే తమ కోటల్లోకి వెళ్ళి దాక్కున్నారు. ఒక యేడాదికి సరిపోయే ఆహారం కూడా వారు ముందే కోటలో సమకూర్చుకొని పెట్టుకున్నారు. ముస్లిం సైనికులు సాహసం చేసి ప్రహరీ గోడలు దూకి లోనికి ప్రవేశించారు. కాని అవిశ్వాసులు పైనుంచి వారిపై ధారాపాతంగా బాణాల వర్షం కురిపించారు. దాని వల్ల ఎంతో మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. అయినా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముట్టడిని ఆపలేదు. పగలు, రేయి ఇరవై రోజుల వరకూ ఈ యుద్ధం కొనసాగింది.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక చెక్క ట్యాంకును తయారు చేసి దాన్ని బండి చక్రాలపై బిగించారు. ప్రపంచంలో మొట్టమొదటి యుద్ధ ట్యాంకుగా దీన్ని చెప్పుకోవచ్చు. కొంత మంది సైనికులు ఆ ట్యాంకులో కూర్చున్నారు. తర్వాత ఆ ట్యాంకును ప్రాకారంలోనికి నెట్టటం జరిగింది. అయితే ప్రతిఘటించేవారు కూడా బాగా తెలివైనవారే. ఇనుమును బాగా కాల్చి మండుతున్న ఆ ఇనుప ముక్కల్ని వారు చెక్క ట్యాంకులపై విసరివేయసాగారు. కాలుతున్న చెక్క ట్యాంకుల నుంచి బయటపడి, పారిపోతూ వున్న ముస్లిం సైనికుల్ని శత్రువులు బాణాలతో ఏరివేయటం ప్రారంభించారు.

ఖర్జూర చెట్లను, ద్రాక్ష తోటల్ని నరికివేస్తామని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కోటలోని వారిని బెదిరించారు. దాని వల్ల మరుసటి యేడు శత్రువులకు ధాన్యపు గింజలు ఉండవు. అందుకు భయపడి శత్రువులు లొంగిపోతారేమోనని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆశించారు. అయితే బనూ సఖీఫ్ తెగవారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు రాయబారం పంపించారు. చెట్లు రాతి నేలలో నాటబడి ఉన్నందున వాటిని గనక ఒకసారి ధ్వంసం చేస్తే మళ్లీ ఆ నేలలో చెట్లు పెరగవనీ, అలా చేయకుండా కేవలం పంట వరకు తీసుకోవలసిందని వారు దైవప్రవక్తను కోరారు. చెట్లు నరకటం వల్ల శాశ్వత నష్టం వాటిల్లుతుందని గ్రహించిన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ నిర్ణయం మానుకున్నారు.

తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరో పద్ధతిలో దాడి చేయాలని నిర్ణయించారు. కోటపై నిప్పుల బాణాలు కురిపించి, మెరుపుదాడుల్లో తర్ఫీదైన సైనికుల్ని కోట పైకి వదలాలని అనుకున్నారు అయితే అంతలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఆ నగరంతో ప్రగాఢమైన అనుబంధం ఉంది, తాను ఒక నిస్సహాయ అనాధునిగా ఉన్నప్పుడు తనను పెంచి పోషించిన హలీమా దాది ఆ నగరంలోనే నివసించేవారు. ఆ విషయం గుర్తుకు రాగానే ఆయన మనసు ద్రవించిపోయింది.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), ఆయన సహచరులు ఇండ్ల నుంచి బయలుదేరి అప్పటికి రెండు మాసాలు గడిచిపోయాయి. త్వరలో జుల్ ఖాదా నెల కూడా ప్రారంభం కానుంది. ఆ నెలలో యుద్ధం చేయటం నిషిద్దం. అందుకని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక నిర్ణయానికి వచ్చారు. శత్రువులకు ఓ సందేశం పంపిస్తూ తాము తాయిఫ్ ముట్టడిని ఎత్తివేస్తున్నామనీ, ఈ విషయమై చర్చించటానికి ఒక ప్రతినిధి బృందాన్ని పంపమని ఆ సందేశంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శత్రువులను కోశారు. అక్కణ్ణుంచి బయలుదేరే ముందు శత్రువుల నగరంపై శాపం పెట్టమని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను సహచరులు కోరారు. కాని ఆయన మాత్రం, తాయిఫ్ వాసులకు సత్యాన్ని గ్రహించే సద్బుద్ధిని ప్రసాదించమని అల్లాహ్ ను ప్రార్థించారు.

ముస్లింలు మరుసటి సంవత్సరం తిరిగొచ్చి తమ చెట్లను నరికివేశారంటే ఇక తమకు చావు తప్పదని గ్రహించిన శత్రువులు, ముస్లింలపై దాడి చేయటం, వారిని ఎదిరించటం సముచితం కాదని భావించారు. ఇరువర్గాల మధ్య ఒక ఒప్పందం తీసుకువచ్చే విషయమై చర్చించేందుకు తమ ప్రతినిధి బృందాన్ని మదీనా పంపించారు. వారి రాక గురించి తెలుసుకొని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో సంతోషించారు.

బనూ సఖీఫ్ బృందం మదీనా నగరానికి చేరుకుంది. చూస్తే అక్కడి ప్రజలందరూ ముస్లింలుగా మారి ఉన్నారు. వారి మొండితనం మెత్తబడింది. ఇప్పుడిక తాము ముస్లింల ముందు లొంగిపోవటమే సముచిత మని భావించారు వారు. కాని ఒక షరతు మీద ఇస్లాంలోకి ప్రవేశించాలని వారు భావించారు. మూడు సంవత్సరాల వరకు తమ విగ్రహాలను పూజించుకోవటానికి అనుమతి ఇవ్వాలని వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను కోరారు. కాని దైవప్రభక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి ఈ షరతును అంగీకరించలేదు. కనీసం ఒక్క సంవత్సరమైనా పూజించు కోనివ్వాలని వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను బ్రతిమాలారు. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ససేమిరా అన్నారు. కనీసం ఆరు నెలల కోసమైనా అనుమతించండి దైవప్రవక్తా! అని విన్నవించుకున్నారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), తౌహీద్ (ఏకదైవారాధన) విషయంలో ఎట్టి పరిస్థితిలోనూ తాను రాజీపడేదిలేదని, ఖరాకండిగా చెప్పేశారు. ఎట్టకేలకు తాయిఫ్ వాసులు లొంగిపోయారు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తాయిఫ్ వాసుల పట్ల ఎంతో కరుణావాత్సల్యాలతో వ్యవహరించారు. హునైన్ యుద్ధంలో పట్టుబడిన వారి బందీలను విడుదల చేశారు. ఒకప్పుడు తాయిఫ్ వాసులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను రాళ్లతో కొట్టి ఆయన రక్తం కళ్లచూశారు. తనకు సహాయం చేయమని కోరటానికి వెళితే అత్యంత పరాభవ స్థితిలో నగరం నుంచి వెడలగొట్టారు. అయినా కూడా ప్రస్తుతం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అవేవీ పట్టించుకోలేదు, బేషరతుగా వారి బందీలను విడిచి పెట్టారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అవలంబించిన ఉదార వైఖరి వారి మనసుల్ని చాలా ప్రభావితం చేసింది. వారి మనసులు ఇస్లాం వైపు మొగ్గాయి. వారందరూ దృఢమైన ముస్లింలుగా మారిపోయారు.

విధ్వంసంతో కూడిన విజయం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆశయం కాదు. యుద్ధ సమయంలో ఆయన మనుషులనే కాదు, వృక్షజాతి సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. తాయిఫ్ నగరాన్ని చూడగానే ఆయనకు తన బాల్యం గుర్తుకు వచ్చింది. చిన్నతనంలో తనను అల్లారుముద్దుగా పెంచిన ‘హలీమా అమ్మ’ ఆ నగరంలోనే నివసించేదని గుర్తుకురాగానే ఆయన హృదయం ద్రవించిపోయింది. వెంటనే ఆయన యుద్ధ తంత్రంలో మార్పులు చేసుకున్నారు.

ప్రాణ శత్రువులను సైతం శపించకుండా, వారు సన్మార్గంపైకి రావాలని ప్రార్ధించటం ఆయన ఔదార్యాన్ని చాటిచెబుతోంది.

తౌహీద్ విషయంలో ఎన్నటికీ రాజీపడకూడదు.

శత్రువులు వ్యక్తిగతంగా తనను ఎంతో బాధపెట్టారు. అయినప్పటికీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి మీద ప్రతీకారం తీర్చుకోలేదు. పైగా వారిపట్ల కరుణా వాత్సల్యాలతోనే వ్యవహరించారు. ఫలితంగా ప్రాణశత్రువులు సైతం ప్రాణ మిత్రులుగా మారి ఇస్లాంలో దృఢవిశ్వాసులుగా రాణించారు.

ఖురాన్ కథామాలిక – మూలం: షేఖ్ అబూబకర్ నజార్
Qur’an Katha Maalika – Selected Stories from Qur’an (Telugu)
తెలుగు అనువాదం: అబ్దుల్ వాహెద్ & హాఫిజ్ ఎస్. ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్,హైదరాబాద్
https://teluguislam.net/2022/11/12/stories-from-the-quran/

మహావివేకి లుక్మాన్ – ఖురాన్ కథామాలిక

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

మంచికైనా చెడుకైనా మనిషి నాలుక, హృదయాలే మూలమని చెప్పిన మహానుభావుడు లుక్మాన్

లుక్మాన్ (అలైహిస్సలాం) ఆఫ్రికా ఖండంలో జన్మించారు. ఆయన అడవుల్లో పెరిగి పెద్దయ్యారు. అడవుల్లో కాలికి చెప్పులు కూడా లేకుండా తిరిగేవారు. కేవలం ఒక వస్త్రాన్ని చుట్టుకుని అడవుల్లో వన్య మృగాలతో పాటు ఉండేవారు. అడవిలో జీవితం, రోజూ అడవి మృగాలతో తల పడడం – ఈ విధంగా ఆయన కఠిన మైన జీవితాన్ని గడిపేవారు. భయం అంటే ఎరుగని వ్యక్తిత్వాన్ని సంతరిం చుకున్నారు. తన చుట్టూ ఉన్న ప్రకృతి గురించి దీర్ఘంగా ఆలోచించేవారు. ఈ ఆలోచనల వల్ల అనేక కొత్త విషయా లను ఆయన తెలుసుకున్నారు.

ఆఫ్రికాపై దండెత్తిన బానిస వ్యాపారులు ఆయన్ను నిర్బంధించారు. ఆయన్ను ఒక బానిసగా అమ్మివేశారు. తన స్వేచ్ఛా స్వాతంత్రయాలు  కోల్పోయా రాయన. స్వేచ్ఛగా తిరగడానికి లేదు, మాట్లాడడానికి లేదు. జీవితంలో ఎదు రైన ఈ కష్టాన్ని ఆయన భరించారు, సహనం వహించారు. అల్లాహ్ అనుగ్రహం కోసం ఎదురుచూడసాగారు. 

ఆయన్ను కొనుక్కున్న వ్యక్తి మంచి మనిషి. తెలివి, వివేకం కలిగినవాడు. అతను లుక్మాన్ను దయగా చూసేవాడు. లుక్మాన్ (అలైహిస్సలాం) సాధారణమైన వ్యక్తి కాదని అతను గుర్తించాడు.

లుక్మాన్ వివేకానికి ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఒక రోజు లుక్మాన్ను పిలిచి గొర్రెను కోసి అందులో అత్యంత చెడ్డ భాగాలు తన వద్దకు తీసుకురమ్మన్నాడు. లుక్మాన్ (అలైహిస్సలాం) ఒక గొర్రెను కోసి దాని గుండె, నాలుకలను తీసుకుని యజమాని వద్దకు వెళ్ళారు. లుక్మాన్ తీసుకొచ్చిన వాటిని చూసి యజమాని మెచ్చుకోలుగా చిరు నవ్వు నవ్వాడు. శరీరంలో అత్యంత చెడ్డ భాగాలుగా గుండె, నాలుకలను తీసుకు వచ్చిన ఎన్నిక ఆయనకు నచ్చింది. లుక్మాన్ (అలైహిస్సలాం) చాలా లోతయిన విషయాన్ని ఈ విధంగా చెప్పారని అతను అర్ధం చేసుకున్నాడు. అప్పటి నుంచి యజమాని లుక్మాన్ (అలైహిస్సలాం) పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం ప్రారంభించాడు. ఆయన్ను మరింత ఆదరంగా చూడసాగాడు.

కొన్ని రోజుల తర్వాత యజమాని లుక్మాన్ను మళ్ళీ పిలిచి ఈసారి గొర్రెను కోసి దానిలో అత్యంత ఉత్తమమైన అవయవాలు తీసుకురమ్మన్నాడు. లుక్మాన్ యజమాని చెప్పినట్టు చేశారు. కాని విచిత్రంగా ఈసారి కూడా గొర్రె గుండె, నాలుకలే తీసుకువచ్చారు. యజమాని వాటిని చూసి శరీరంలో అత్యంత చెడ్డ భాగాలు, మంచి భాగాలు రెండు కూడా ఇవే ఎలా అవుతాయని ప్రశ్నించాడు. లుక్మాన్ (అలైహిస్సలాం) యజమానికి సమాధానమిస్తూ, “మనిషి మంచివాడైతే అతని గుండె, నాలుకలు చాలా ఉత్తమమైన భాగాలు, మనిషి చెడ్డవాడైతే అతని గుండె, నాలుకలు అత్యంత చెడ్డ భాగాలు” అన్నారు. ఈ సంఘటన తర్వాతి నుంచి యజమాని లుక్మాన్ పట్ల అత్యంత గౌరవాదరాలు చూపడం ప్రారంభించాడు. చాలామంది లుక్మాన్ వద్దకు సలహా కోసం కూడా వచ్చేవారు. ఆయన వివేక విచక్షణలు, తెలివితేటలు యావత్తు రాజ్యంలో మారు మోగిపోసాగాయి.

యజమాని తన కుటుంబ సభ్యులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. తన మరణానంతరం లుక్మాన్ (అలైహిస్సలాం)కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పాడు. యజమాని మరణించిన తర్వాత లుక్మాన్ (అలైహిస్సలాం)కు స్వాతంత్ర్యం లభించింది. ఆయన (అలైహిస్సలాం) అక్కడి నుంచి బయలుదేరి చాలా ప్రాంతాలు తిరిగి చివరకు బనీ ఇస్రాయీల్ వద్ద స్థిరపడ్డారు. దావూద్ (అలైహిస్సలాం) పాలనా కాలంలో ఆయన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. మహావివేకంతో, విచక్షణతో, నిష్పక్షపాతంగా ఆయన ఇచ్చే తీర్పులు చాలా ప్రసిద్ధి పొందాయి. అక్కడే ఆయన పెళ్ళి చేసుకుని సంసార జీవితాన్ని గడిపారు.

లుక్మాన్ తన కుమారుడికి చేసిన బోధ దివ్యఖుర్ఆన్ ఇలా ప్రస్తావించబడింది:

31:13 وَإِذْ قَالَ لُقْمَانُ لِابْنِهِ وَهُوَ يَعِظُهُ يَا بُنَيَّ لَا تُشْرِكْ بِاللَّهِ ۖ إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ

లుఖ్మాన్‌ తన కుమారునికి హితబోధ చేస్తూ ఇలా అన్నాడు: “ఓ నా ముద్దుల పుత్రుడా! అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించకు. నిస్సందేహంగా అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్‌ చేయటం) ఘోరమైన అన్యాయం.”

31:14 وَوَصَّيْنَا الْإِنسَانَ بِوَالِدَيْهِ حَمَلَتْهُ أُمُّهُ وَهْنًا عَلَىٰ وَهْنٍ وَفِصَالُهُ فِي عَامَيْنِ أَنِ اشْكُرْ لِي وَلِوَالِدَيْكَ إِلَيَّ الْمَصِيرُ

మరి మేము మానవునికి అతని తల్లిదండ్రుల విషయంలో గట్టిగా తాకీదు చేశాము- అతని తల్లి అతన్ని ప్రయాసపై ప్రయాసకు ఓర్చుకుంటూ తన గర్భంలో మోసింది. మరి అతని పాలను విడిపించటానికి రెండు సంవత్సరాలు పట్టింది. (కనుక ఓ మానవుడా!) నువ్వు నాకూ, నీ తల్లిదండ్రులకూ కృతజ్ఞుడవై ఉండు. (ఎట్టకేలకు మీరంతా) మరలి రావలసింది నా వద్దకే.

31:15 وَإِن جَاهَدَاكَ عَلَىٰ أَن تُشْرِكَ بِي مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ فَلَا تُطِعْهُمَا ۖ وَصَاحِبْهُمَا فِي الدُّنْيَا مَعْرُوفًا ۖ وَاتَّبِعْ سَبِيلَ مَنْ أَنَابَ إِلَيَّ ۚ ثُمَّ إِلَيَّ مَرْجِعُكُمْ فَأُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ

ఒకవేళ నీకు తెలియని వారినెవరినైనా నాకు భాగస్వాములుగా నిలబెట్టమని వారిద్దరూ నీపై ఒత్తిడి తీసుకువస్తే మటుకు నువ్వు వారి మాట వినకు. ప్రపంచంలో మాత్రం వారి యెడల ఉత్తమరీతిలో మసలుకో. అయితే (మార్గానుసరణ విషయంలో మాత్రం) నా వైపు మరలి ఉన్న వానినే ఆదర్శంగా తీసుకో. ఆ తరువాత మీరంతా నా వైపుకే మరలి రావలసి ఉంటుంది. అప్పుడు నేను మీకు, మీరు చేస్తూ ఉండిన కర్మలన్నింటినీ తెలియపరుస్తాను.”

31:16 يَا بُنَيَّ إِنَّهَا إِن تَكُ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ فَتَكُن فِي صَخْرَةٍ أَوْ فِي السَّمَاوَاتِ أَوْ فِي الْأَرْضِ يَأْتِ بِهَا اللَّهُ ۚ إِنَّ اللَّهَ لَطِيفٌ خَبِيرٌ

(లుఖ్మాన్‌ తన కుమారునికి ఇలా బోధపరిచాడు) “నాయనా! ఏదైనా వస్తువు ఆవగింజంత ఉన్నా, అది ఏదైనా రాతి బండలో ఉన్నా, లేక అది ఆకాశాలలో ఉన్నా లేదా భూమిలో ఉన్నా దాన్ని అల్లాహ్‌ తప్పకుండా తీసుకువస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ సూక్ష్మ విషయాలను ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు.

31:17 يَا بُنَيَّ أَقِمِ الصَّلَاةَ وَأْمُرْ بِالْمَعْرُوفِ وَانْهَ عَنِ الْمُنكَرِ وَاصْبِرْ عَلَىٰ مَا أَصَابَكَ ۖ إِنَّ ذَٰلِكَ مِنْ عَزْمِ الْأُمُورِ

“ఓ (ప్రియమైన) కుమారా! నువ్వు నమాజును నెలకొల్పుతూ ఉండు. సత్కార్యాల గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు. చెడు పనుల నుంచి వారిస్తూ ఉండు. ఏ ఆపద వచ్చిపడినా సహనం పాటించు. నిశ్చయంగా ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన పనులు.

31:18 وَلَا تُصَعِّرْ خَدَّكَ لِلنَّاسِ وَلَا تَمْشِ فِي الْأَرْضِ مَرَحًا ۖ إِنَّ اللَّهَ لَا يُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُورٍ

“జనుల ముందు (గర్వంతో) మొహం తిప్పుకొని మాట్లాడకు. భూమిపై నిక్కుతూ నడవకు. ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్‌ డాబులు చెప్పుకునే గర్విష్టిని ఇష్టపడడు.

31:19 وَاقْصِدْ فِي مَشْيِكَ وَاغْضُضْ مِن صَوْتِكَ ۚ إِنَّ أَنكَرَ الْأَصْوَاتِ لَصَوْتُ الْحَمِيرِ

“నీ నడకలో మధ్యేమార్గం అవలంబించు. నీ కంఠ స్వరాన్ని కాస్త తగ్గించు. నిశ్చయంగా స్వరాలన్నింటిలోకీ అత్యంత కఠోరమైనది గాడిదల స్వరం.”

(దివ్యఖుర్ఆన్ 31 : 13-19)

మనిషి మంచివాడు లేదా చెడ్డవాడన్నది అతని హృదయం, నాలుకల వల్ల తెలుస్తుంది. ఈ రెండు అవయవాలను ఎలా వాడాలన్నది మనిషి చేతుల్లో ఉంది.

మంచి యజమాని తన వద్ద ఉన్న వివేకవంతులైన నౌకర్లను గౌరవించాలి.

లుక్మాన్ తన కుమారునికి ఇచ్చిన సలహాను అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో ప్రస్తావించి మానవాళికి ఒక ఉదాహరణగా చూపించాడు. ఈ సలహాను యావత్తు మానవాళి మార్గదర్శక సూత్రంగా అనుసరించవలసి ఉంది.

ఖురాన్ కథామాలిక – మూలం: షేఖ్ అబూబకర్ నజార్
Qur’an Katha Maalika – Selected Stories from Qur’an (Telugu)
తెలుగు అనువాదం: అబ్దుల్ వాహెద్ & హాఫిజ్ ఎస్. ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్,హైదరాబాద్
https://teluguislam.net/2022/11/12/stories-from-the-quran/