త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (6) – మరణానంతర జీవితం : పార్ట్ 47 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (6)
[మరణానంతర జీవితం – పార్ట్ 47]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=rCFxyKebOx8 [22 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ప్రళయ దినాన కర్మల త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి వివరించబడింది. ప్రధానంగా, అల్లాహ్ మార్గంలో పోరాడటానికి వెళ్ళిన వారి స్త్రీలను కాపాడకుండా వారికి ద్రోహం చేయడం, ఆత్మహత్య చేసుకోవడం, అకారణంగా భర్తకు అవిధేయత చూపడం, ప్రజలు ఇష్టపడని ఇమామ్, మరియు యజమాని నుండి పారిపోయిన బానిస వంటి వారి నమాజులు స్వీకరించబడకపోవడం, దానధర్మాలు చేసి వాటిని చెప్పుకుని బాధపెట్టడం, గర్వంతో చీలమండలాల కిందికి దుస్తులు ధరించడం, మరియు అమ్మకాలలో అబద్ధపు ప్రమాణాలు చేయడం వంటి పాపాల తీవ్రత గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో చర్చించబడింది. ఈ పాపాలు కర్మల త్రాసును తేలికగా చేయడమే కాక, అల్లాహ్ యొక్క ఆగ్రహానికి మరియు కఠినమైన శిక్షకు కారణమవుతాయని హెచ్చరించబడింది.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు. అల్ హమ్దులిల్లాహి కఫా వ సలామున్ అలా ఇబాదిల్లజీనస్ తఫా అమ్మా బ’అద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము.

వాటిలో 14వ విషయం, అల్లాహ్ మార్గంలో పోరాడడానికి వెళ్ళిన వారి యొక్క స్త్రీలను కాపాడకుండా, వారి విషయంలో అపహరణలకు, అక్రమానికి పాల్పడడం.

మహాశయులారా, అల్లాహ్ మార్గంలో పోరాడడానికి అని అంటే, అల్లాహ్ పంపినటువంటి సత్య ధర్మం మరియు అసత్య ధర్మాల మధ్య ఎప్పుడైనా ఏదైనా పోరాటం జరిగితే, అందులో పాల్గొనడం అని భావం వస్తుంది. అయితే, అల్లాహ్ మార్గంలో వెళ్ళిన వారు అని అంటే, ఇందులో పోరాడడానికి వెళ్ళిన వారు మాత్రమే కాకుండా, అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రచారం చేయడానికి మరియు అల్లాహ్ యొక్క సత్య ధర్మాన్ని తెలుసుకోవడానికి, విద్య అభ్యసించడానికి ప్రయాణం చేసేవారు, ఈ విధంగా ఇంకా ఎన్నో పుణ్య కార్యాల గురించి కూడా ఈ పదం ఉపయోగపడుతుంది. అయితే మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా తెలిపారు.

حُرْمَةُ نِسَاءِ الْمُجَاهِدِينَ عَلَى الْقَاعِدِينَ كَحُرْمَةِ أُمَّهَاتِهِمْ عَلَيْهِمْ
(హుర్మతు నిసాయిల్ ముజాహిదీన అలల్ ఖాఇదీన క హుర్మతి ఉమ్మహాతిహిమ్ అలైహిమ్)

ఎలాగైతే అల్లాహ్ మార్గంలో పోరాడేందుకు వెళ్ళడానికి శక్తి లేని వారు తమ నగరాల్లో, గ్రామాల్లో, తమ ఇంట్లో కూర్చుండి ఉంటారో, వారి తల్లులు వారిపై ఎలా నిషిద్ధమో, అలాగే పోరాడటానికి వెళ్ళిన వారి స్త్రీల యొక్క పరువు కూడా అలాగే నిషిద్ధం.

అంటే, స్వయం మనం మన తల్లులను ఎలా గౌరవిస్తామో, వారి విషయంలో ఎలాంటి చెడును ఎప్పుడూ ఊహించకుండా మనం ఉంటామో, అలాగే అల్లాహ్ మార్గంలో వెళ్ళిన వారి స్త్రీలను కూడా ఆ విధంగా భావించాలి, వారికి రక్షణ ఇవ్వాలి, వారి యొక్క అవసరాలు తీర్చాలి. ఇది మన త్రాసును బరువు చేసే సత్కార్యాలలో ఒకటి. కానీ అలా చేయకుండా, ఎవరైతే అపహరణకు గురి చేస్తారో, వారి మాన పరువుల్లో జోక్యం చేసుకుంటారో, వారికి ఏ రకమైన ఇబ్బంది కలుగజేస్తారో, ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా ఆ అల్లాహ్ మార్గంలో వెళ్ళిన వ్యక్తిని పిలుస్తాడు. ఎవరి స్త్రీల విషయంలో జోక్యం చేసుకోవడం జరిగిందో, అతన్ని పిలుస్తాడు. పిలిచి, ఈ దౌర్జన్యం చేసిన వ్యక్తి పుణ్యాల్లో నుండి నీకు ఇష్టమైన పుణ్యాలు తీసుకోమని ఆదేశిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం తెలియజేస్తూ,

فما ظنكم
(ఫమా జన్నుకుమ్)

చెప్పండి, ఇతని పుణ్యాల నుండి నీకు ఇష్టమైన పుణ్యాలు తీసుకో అని ఏదైతే చెప్పడం జరుగుతుందో, అలాంటప్పుడు ఇతని పరిస్థితి ఏముంటుందో ఒకసారి ఆలోచించండి. ఇతడు పుణ్యాల నుండి తన పుణ్యాలను కోల్పోయి ఆ సమయంలో ఎంత బాధకు గురి కావచ్చు.

ఇక్కడ కూడా మీరు గమనించండి, ఇస్లాం యొక్క గొప్పతనాన్ని కూడా తెలుసుకోండి. ఈ రోజుల్లో భర్తలు ఇంటి నుండి బయటికి వెళ్ళిన తర్వాత, ఉద్యోగానికైనా, ఆ బయటికి వెళ్ళడం ఇంటి నుండి సేమ్ అదే సిటీలోనైనా, లేదా ఇంటి నుండి బయటికి వెళ్ళడం అంటే దేశం నుండి బయటికి వెళ్లి ఏదైనా సంపాదించే ప్రయత్నం చేయడం గానీ, ఆ ఇంటి యొక్క చుట్టుపక్కన ఉన్నవారు ఆ ఇంటి స్త్రీలను కాపాడుతున్నారా? వారికి రక్షణ కలుగజేస్తున్నారా? ఇంకా ఎవరైతే బయటికి వెళ్లి అల్లాహ్ మార్గంలో ఉంటున్నారో, అల్లాహ్ యొక్క సత్య ధర్మం గురించి ఏదైతే వారు ప్రయత్నం చేస్తున్నారో, అలాంటి వారి ఇళ్లల్లో వారి యొక్క స్త్రీలకు రక్షణ కల్పించడం, వారి యొక్క మాన పరువులను భద్రంగా ఉండే విధంగా చూసుకోవడం చుట్టుపక్కన ఉన్నవారందరి యొక్క బాధ్యత.

ఇంకా మహాశయులారా! ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో 15వ విషయం, ఆత్మహత్య చేసుకోవడం. అల్లాహు అక్బర్! ఈ రోజుల్లో చాలా మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అల్లాహ్ పై విశ్వాసం, నమ్మకం కలిగి ఉన్న వారిలో కూడా ఎంతోమంది తమ ఉద్యోగంలో, తమ చదువులో, ఇహలోకపు బూటకపు ప్రేమల్లో, ఇంకా వేరే ఎన్నో విషయాల్లో తమకు తాము ఫెయిల్యూర్ అనుకొని వారు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కానీ, ఆత్మహత్యకు పాల్పడడం ఇది తమను తాము ఎంతో నష్టంలో పడవేసుకోవడం.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక వ్యక్తి ఎంతో ధైర్యంతో యుద్ధంలో పాల్గొని చాలా ధీటుగా పోరాడుతున్నాడు. ఆ సందర్భంలో అతన్ని చూసిన వారు మెచ్చుకుంటూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు అతన్ని ప్రశంసించారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అతడు నరకవాసి అని. కొందరు సహచరులకు, ఏంటి, అంత ధైర్యంగా పోరాడుతున్న వ్యక్తిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నరకవాసి అని అన్నారు అని ఒక బాధగా ఏర్పడింది. కానీ వారిలోనే ఒక వ్యక్తి ఆ ధైర్యంతో పోరాడే వ్యక్తి వెనక ఉండి అతన్ని చూడడం మొదలుపెట్టాడు. చివరికి ఏం జరిగింది? ఎంతో మందిని అతను హత్య చేసి, ధైర్యంగా పోరాడుతూ ఉన్న ఆ వ్యక్తి, ఏదో ఒక బాణం వచ్చి అతనికి గుచ్చుకుంది. దాన్ని అతను భరించలేక, స్వయంగా తన బాణంతోనే తనను తాను చంపుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసిన వెంటనే అతను పరుగెత్తుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, “ప్రవక్తా, మీరు చెప్పిన మాట నిజమైంది. అల్లాహ్ సాక్షిగా మీరు సత్య ప్రవక్త, ఇందులో ఎలాంటి అనుమానం లేదు.” ప్రవక్త అడిగారు, “ఏమైంది విషయం? ఏం చూశావు? ఏం జరిగింది?” అంటే అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, “ప్రవక్తా, ఎవరి గురించైతే, ఏ మనిషి గురించైతే కొందరు సహచరులు ప్రశంసిస్తూ, పొగుడుతూ ఉండగా, మీరు అతని గురించి నరకవాసి అని చెప్పారో, అతన్ని నేను నా కళ్ళారా చూశాను, తనకు తాను చంపుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. తన బాణంతోనే తన యొక్క ఛాతిలో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా అల్లాహ్ త’ఆలా మీ యొక్క మాటను సత్యపరిచాడు,” అని తెలియపరిచాడు.

ఈ విధంగా మహాశయులారా, అందుగురించే అనేకమంది సహాబాయే కిరామ్ రదియల్లాహు అన్హుమ్ వారి యొక్క దృష్టిలో ఆత్మహత్య చేసుకున్న వారి యొక్క కర్మలు వృధా అవుతాయి. అందుకొరకే అతడు నరకంలో వెళ్తాడు అని చెప్పడం జరిగింది.

అయితే ఈ విధంగా మహాశయులారా, ఆత్మహత్యకు పాల్పడకూడదు. ఆత్మహత్య అన్నది ఏమిటి? వాస్తవానికి, ఆత్మహత్య గురించి మనకు తెలిస్తే ఎప్పుడూ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడం. ఎందుకంటే సహీ హదీసులో వచ్చి ఉంది,

ఎవరైతే ఏ మార్గంతో, ఏ విధంగా, ఏ వస్తువుతో ఆత్మహత్య చేసుకుంటాడో, అతను చనిపోయిన తర్వాత నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు, తీర్పు దినాన తీర్పు సంపూర్ణమయ్యే వరకు అతనికి అలాంటి శిక్షనే జరుగుతూ ఉంటుంది. చివరికి అతడు, అయ్యో, నేను ఆత్మహత్య చేసుకోకుంటే ఎంత బాగుండు అని చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ ఆ బాధ ఆ సందర్భంలో అతనికి ఏమీకి పనికి రాదు.

మళ్ళీ ఇక్కడ ఒక విషయం గమనించారా మీరు? ప్రవక్త కాలంలో, ప్రవక్త తోడుగా ఉండి, ప్రవక్తతో యుద్ధంలో పాల్గొని, ఎంతో ధైర్యంగా పోరాడి, ఎందరో ప్రజల ప్రశంసలను అందుకొని, ఇవన్నీ రకాల లాభాలు ఉన్నప్పటికీ ఆ మనిషి నరకంలోకి వెళ్ళాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే, అతను చేసుకున్న అంతటి సత్కార్యాలన్నీ కూడా వృధా అయినవి అనే కదా భావం. అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్మార్గం చూపుగాక.

మహాశయులారా, ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో అకారణంగా భార్య భర్తకు అవిధేయురాలై పోవుట మరియు అకారణంగా ప్రజలు వారికి నమాజు చేయించే ఇమాము పట్ల అసహ్యించుకొనుట, ఇంకా దాసుడు తన యజమానికి తెలియకుండా అపహరణం చేసి అతని నుండి పారిపోవుట. ఈ మూడు పాపాలు ఎలాంటివి అంటే, దీని మూలంగా వారి యొక్క నమాజు అల్లాహ్ వద్ద స్వీకరించబడదు. ఇక నమాజ్ త్రాసును బరువు చేసే సత్కార్యాల్లో చాలా గొప్ప సత్కార్యం. ఎప్పుడైతే ఆ నమాజ్ స్వీకరించబడదో, త్రాసు బరువు అనేది కాజాలదు, తేలికగా అవుతుంది. ఈ విధంగా మనిషి కష్టపడి చేసుకున్న పుణ్యాన్ని కూడా నోచుకోకుండా అయిపోతుంది. వినండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీసు.

ثَلَاثَةٌ لَا تُجَاوِزُ صَلَاتُهُمْ آذَانَهُمْ
(సలాసతున్ లా తుజావిజు సలాతుహుమ్ ఆజానహుమ్)
మూడు రకాల వారు, వారి యొక్క నమాజ్ వారి చెవులకు పైగా కూడా పోదు.

అంటే, అల్లాహ్ వద్దకు వెళ్లి అక్కడ అల్లాహ్ స్వీకరించడం, అది ఇంకా దూరం. వారి మీదికే వెళ్ళదు. అంటే భావం, స్వీకరించబడదు. ఎవరు ఆ ముగ్గురు? ఆ మూడు రకాల వారు ఎవరు?

తన యజమాని నుండి పారిపోయిన దాసుడు, అతను తిరిగి వచ్చేంత వరకు అతని నమాజు స్వీకరించబడదు. మరియు ఏ రాత్రి భర్త తన భార్యపై కోపగించుకొని ఉంటాడో, అకారణంగా భార్య భర్తకు అవిధేయురాలై, భర్త ఆగ్రహానికి, రాత్రంతా కోపంగా భార్యపై గడపడానికి కారణంగా మారిందో, ఆ భార్య యొక్క నమాజు కూడా స్వీకరించబడదు. మరియు ఏ ప్రజలు తమ ఇమామును అసహ్యించుకుంటున్నారో, ఒకవేళ వారి అసహనం, వారు అసహ్యించుకొనడం హక్కుగా ఉంటే, అలాంటి ఇమామ్ యొక్క నమాజు కూడా స్వీకరించబడదు. అకారణంగా ఉంటే ప్రజలు పాపంలో పడిపోతారు.

ఈ విధంగా మహాశయులారా, ఈ హదీస్ తిర్మిజీలో ఉంది. హదీస్ నెంబర్ 360. మరియు షేక్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుల్ జామేలో పేర్కొన్నారు. హదీస్ నెంబర్ 3057.

కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, ఇలాంటి భార్యలు, ఇలాంటి ఇమాములు, ఎప్పుడైతే మా నమాజు స్వీకరించబడటం లేదో, మేము ఎందుకు నమాజు చేయాలి అని నమాజును విడనాడకూడదు. నమాజు స్వీకరించకపోవడానికి కారణం ఏ పాపమైతే ఉందో, అలాంటి పాపాన్ని వదులుకొని నమాజు స్వీకరించబడే విధంగా ప్రవర్తించే ప్రయత్నం చేయాలి.

17వ కార్యం, దీనివల్లనైతే త్రాసు తేలికగా అయిపోతుందో అది, దానధర్మాలు చేసి ఒకరి పట్ల ఏదైనా మేలు చేసి అతనికి బాధ కలిగించడం. అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. మనందరికీ సంకల్ప శుద్ధి ప్రసాదించుగాక. ఈ రోజుల్లో ఈ చెడు గుణం చాలా మందిలో చూడడం జరుగుతుంది. ఒకరి పట్ల ఏదైనా మేలు చేస్తారు, ఒకరికి ఏదైనా దానధర్మాలు చేస్తారు, ఒకరికి అతను ఏదైనా విషయంలో సహాయపడతారు, ఒకరి కష్టంలో వారిని ఆదుకుంటారు, తర్వాత ఎద్దేవా చేయడం, తర్వాత మనసు నొప్పించే మాటలు మాట్లాడడం, తర్వాత నేను చేయడం వల్ల, నేను నీకు సహకరించడం వల్ల, నేను నిన్ను నీ కష్టంలో ఆదుకోవడం వల్ల ఈరోజు నువ్వు ఇంత పైకి వచ్చావు అని వారికి బాధ కలిగిస్తారు. ఇలా బాధ కలిగించే వారి ఆ దానధర్మాలు, ఆ మేలు చేసిన కార్యాలు పుణ్యం లేకుండా అయిపోతాయి. వాటి యొక్క ఫలితం అనేది వారికి దక్కదు.

ఖురాన్లో అల్లాహ్ త’ఆలా ఈ విధంగా తెలియపరిచాడు.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُمْ بِالْمَنِّ وَالْأَذَىٰ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తుబ్తిలూ సదఖాతికుమ్ బిల్ మన్ని వల్ అజా)

“ఓ విశ్వాసులారా! మీరు మీ ఉపకారాన్ని చాటుకుని, (గ్రహీతల) మనస్సులను నొప్పించి మీ దానధర్మాలను వృధా చేసుకోకండి.”(2:264)

దీనివల్ల మీ యొక్క పుణ్యం అనేది నశించిపోతుంది. మీరు చేసిన ఆ దానం, దానికి ఏ సత్ఫలితం లభించాలో అది మీకు లభించదు. ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీసులో కూడా తెలిపారు. ఆ హదీసు ఇన్ షా అల్లాహ్ దీని తర్వాత ప్రస్తావిస్తాను.

18వ కార్యం, దీనివల్లనైతే మన త్రాసు ప్రళయ దినాన తేలికంగా అయిపోతుందో, చీలమండలానికి కిందిగా దుస్తులు ధరించడం మరియు ఎవరికైనా ఏదైనా మేలు చేసి చెప్పుకొని బాధ కలిగించడం మరియు ఏదైనా సామాను విక్రయిస్తూ అసత్య ప్రమాణాలు చేయడం.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలిపారు, “సలాసతున్” మూడు రకాల మనుషులు ఉన్నారు, అల్లాహ్ త’ఆలా వారితో మాట్లాడడు, ప్రళయ దినాన అల్లాహ్ వారి వైపున చూడడు, వారిని పరిశుద్ధ పరచడు మరియు వారికి కఠినమైన శిక్ష విధిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడుసార్లు ప్రస్తావించారు. అబూజర్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు,

خَابُوا وَخَسِرُوا، مَنْ هُمْ يَا رَسُولَ اللَّهِ؟
(ఖాబూ వ ఖసిరూ, మన్ హుమ్ యా రసూలల్లాహ్?)
“ప్రవక్తా, వారైతే నాశనమైపోయారు, వారైతే చాలా నష్టపోయారు. ఎవరు అలాంటి వారు?”

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

“చీలమండలానికి కిందిగా దుస్తులు ధరించేవాడు, ఎవరికైనా ఏదైనా మేలు చేసి చెప్పుకునేవాడు, మరియు సామాను విక్రయిస్తున్నప్పుడు అసత్య ప్రమాణాలు చేసేవాడు” అని. ఈ హదీస్ ముస్లిం షరీఫ్లో ఉంది, హదీస్ నెంబర్ 106.

ఈ రోజుల్లో మనలోని ఎంతమందికి ఈ విషయం గుర్తుంది? దీనివల్ల ప్రళయ దినాన మన త్రాసు తేలికగా అవుతుంది అన్నటువంటి భయం ఉందా? మనలో ఎంతోమంది ఎలాంటి కారణం లేకుండా చీలమండలానికి కిందిగా దుస్తులు ధరిస్తూ ఉన్నారు. దీనివల్ల నాలుగు రకాల శిక్షలకు గురి అవుతాము అన్నటువంటి భయం కూడా మనలో లేకపోయింది. ఒకటి, అల్లాహ్ మన వైపున చూడడు. రెండవది, అల్లాహ్ మనతో మాట్లాడడు. మూడవది, అల్లాహ్ మనల్ని పరిశుద్ధ పరచడు. నాలుగవది, అల్లాహ్ త’ఆలా కఠిన శిక్ష ఇస్తాడు. ఈ విధంగా మహాశయులారా, ఈ నాలుగు శిక్షలు ఎవరి గురించి? ఎవరైతే దుస్తులు కిందికి ధరిస్తున్నారో, ఒకరికి ఉపకారము చేసి వారి మనసు నొప్పిస్తున్నారో, మరియు సామాను విక్రయిస్తున్న సందర్భంలో అసత్య ప్రమాణాలు చేస్తున్నారో.

ఈ విధంగా మహాశయులారా, అల్లాహ్ యొక్క దయవల్ల మనం మరణానంతర జీవితంలో ఒక అతి ముఖ్యమైన ఘట్టం, త్రాసు నెలకొల్పడం, త్రాసును నెలకొల్పడం, న్యాయంగా తూకం చేయడం మరియు ఆ త్రాసులో ఏ విషయాల వల్ల, ఏ సత్కార్యాల వల్ల త్రాసు బరువుగా ఉంటుంది, ఏ దుష్కార్యాల వల్ల త్రాసు తేలికగా అవుతుందో అన్ని వివరాలు తెలుసుకున్నాము. ఇక మిగిలినది ఏమిటి? మనము సత్కార్యాలు చేయడంలో ముందుకు వెళ్ళాలి. మన త్రాసు బరువుగా ఉండే విధంగా ఆలోచించాలి. దుష్కార్యాలకు దూరంగా ఉండాలి. తేలికగా ఉండకుండా, త్రాసు తేలికగా ఉండకుండా మనం ప్రయత్నించాలి. అప్పుడే మనం సాఫల్యం పొందగలుగుతాము. ఈ విషయాలు మీరు తెలుసుకున్నారు, మీకు చెప్పడం, తెలపడం జరిగింది. ఇక మీ బాధ్యత, మీరు దీనిపై ఆచరించి ఇతరులకు తెలియజేస్తూ ఉండాలి. దీనివల్ల మనకు కూడా ఇంకా లాభాలు కలుగుతాయి. ఎంతమందికి మనం ఈ సత్కార్యాల గురించి తెలుపుతామో, అంతే ఎక్కువగా మన యొక్క త్రాసు కూడా బరువుగా అవుతూ ఉంటుంది.

అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ప్రతిరోజు మనం పడుకునే ముందు, బిస్మిల్లాహి, ఓ అల్లాహ్ నీ యొక్క పేరుతో నేను నిద్రపోతున్నాను. ప్రళయ దినాన నా యొక్క త్రాసును నీవు బరువుగా చేయి అని దుఆ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి ఒక దుఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా కూడా రుజువై ఉన్నది.

అల్లాహ్ మనందరి త్రాసును ప్రళయ దినాన బరువుగా చేయుగాక. అల్లాహ్ త’ఆలా మనందరినీ మన త్రాసు బరువుగా అయ్యే సత్కార్యాలు చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక. మరియు ఏ దుష్కార్యాల వల్ల మన త్రాసు తేలికగా అవుతుందో, అలాంటి దుష్కార్యాల నుండి దూరం ఉండే భాగ్యం ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43905

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (1) – మరణానంతర జీవితం : పార్ట్ 42 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (1)
[మరణానంతర జీవితం – పార్ట్ 42]
https://www.youtube.com/watch?v=lATws_WFGpM [22 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ప్రళయదినాన కర్మల త్రాసు (మీజాన్) గురించి మరియు దానిని తేలికగా చేసే కార్యాల గురించి వివరించబడింది. పుణ్యాల బరువును పెంచుకోవాలనే ఆకాంక్షతో పాటు, పాపాల వల్ల త్రాసు తేలిక అవుతుందనే భయం కూడా విశ్వాసికి ఉండాలి. పాపాలు రెండు రకాలు: పెద్ద పాపాలు (గునాహె కబీరా) మరియు చిన్న పాపాలు (గునాహె సగీరా). పెద్ద పాపాలు క్షమించబడాలంటే స్వచ్ఛమైన పశ్చాత్తాపం అవసరం, అయితే చిన్న పాపాలు సత్కార్యాల ద్వారా క్షమించబడతాయి. ప్రసంగం ముగింపులో, కొన్ని ఘోరమైన పాపాల ఉదాహరణలు ఇవ్వబడ్డాయి మరియు అన్ని రకాల పాపాల నుండి దూరంగా ఉండవలసిన అవసరాన్ని నొక్కి చెప్పబడింది.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు. అల్ హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, వ’అలా ఆలిహీ వ’సహ్బిహీ వ’మన్ వాలా, అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ఈనాటి నుండి మనం త్రాసును తేలికగా చేసే కార్యాల గురించి తెలుసుకుందాము. త్రాసు పుణ్యాలతో బరువుగా ఉండాలి అన్నటువంటి కాంక్ష, కోరిక, తపన, ఆలోచన కలిగి ఉన్న విశ్వాసి, త్రాసును తేలికగా చేసే కార్యాల గురించి తెలుసుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకంటే పుణ్యాలతో త్రాసు బరువుగా అవుతూ ఉంటే, పాపాలు పెరుగుతూ ఉండడం వల్ల మన పుణ్యాల త్రాసు తేలికగా అవుతూ ఉంటుంది. అందుకు ఇహలోకంలో మన ఆత్మ శరీరాన్ని వీడక ముందే పాపాల నుండి స్వచ్ఛమైన తౌబా చేసుకోవాలి. మాటిమాటికీ అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఉండాలి.

ఈ శీర్షిక వింటూ మీరు ఎలాంటి బాధ, చింత, ఆవేదనకు గురి కాకండి. ఎందుకంటే ఈ విషయాలు తెలుసుకోవడం కూడా చాలా అవసరం. మీలో ప్రతి ఒక్కరూ ఏదైనా చిన్నపాటి వ్యాపారంలో ఉన్నారు లేదా చేసి ఉన్నారు లేదా కనీసం దాని యొక్క అవగాహన ఉంది కదా? కొంత డబ్బు పెట్టి ఒక చిన్న కొట్టు తెరుచుకున్న తర్వాత అందులో ఒకటి మూలధనం, ఆ మూలధనంతో కొంత సరుకు తీసుకొచ్చాము. ఒక్కొక్కటి అమ్మడం ప్రారంభం చేశాము. ప్రతి సరుకుపై ఏదో కొంత లాభం, ప్రాఫిట్ దాన్ని నిర్ణయించాము. అయితే సామాన్, సరుకు అంతా అమ్ముడు పోతూ ఉన్నది, పోతూ ఉన్నది, మంచి లాభాలు వస్తున్నాయి అని సంతోషపడిపోతామా? లేక మరేదైనా విషయంలో మనం జాగ్రత్త కూడా పడుతూ ఉంటామా? జాగ్రత్త పడుతూ ఉంటాము కదా? ఏదైనా సామాన్ చెడిపోయి, అమ్ముడు కాకుండా అలా నష్టపోతామా అని, దుకాన్లో సామాన్ ఏదైనా ఎలుకలు కొరికి, ఇంకా వేరే రకంగా నష్టమై మనకు ఏదైనా లాస్ జరుగుతుందా? లేదా ప్రాఫిట్ మంచిగానే ఉంది, దందా చాలా మంచిగా నడుస్తూ ఉన్నది, కానీ మన యొక్క ఖర్చులు ఎలా ఉన్నాయి? ఆ ఖర్చుల విషయంలో కూడా మనం తప్పకుండా శ్రద్ధ తీసుకుంటాము. తీసుకుంటామా లేదా?

అలాగే విశ్వాసం ఒక మూలధనం అయితే, సత్కార్యాలన్నీ కూడా మనకు ప్రాఫిట్ ని, లాభాన్ని, మంచి ఆదాయాన్ని తీసుకొస్తూ ఉంటే, ఈ పాపాలు అనేటివి లాస్ కు గురి చేసేవి. అయితే వాటి నుండి జాగ్రత్త పడి ఉండడం, ఎల్లప్పుడూ శ్రద్ధగా ఉండి పాపాలు చేయకుండా ఉండడం, ఏదైనా పాపం జరిగిన వెంటనే దాని పరిహారం ఏంటో తెలుసుకొని దాన్ని చెల్లించి, పశ్చాత్తాప రూపంలో గాని, వేరే సత్కార్యాలు చేసే రూపంలో కానీ, ఏ రూపంలో ఉన్నా గానీ మరింత పెద్ద లాస్ కు గురి కాకుండా వెంటనే సర్దుకోవడం చాలా అవసరం.

ఒక సందర్భంలో ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా ఇలా తెలిపారు. “నీవు పరలోకాన అల్లాహ్ తో కలుసుకున్నప్పుడు ఎంత తక్కువ పాపాలతో కలుసుకుంటావో అంతే నీ కొరకు మేలు. ఇహలోకంలో ఎవరైనా పుణ్యాత్ములను చూసి వారికంటే మరీ ముందుగా మనం ఉండాలి అన్నటువంటి కోరిక గల వ్యక్తి పాపాల నుండి తప్పకుండా దూరం ఉండాలి.”

ప్రళయదినాన త్రాసు నెలకోల్పడం జరుగుతుంది. దానికి రెండు పళ్ళాలు ఉంటాయి. ఒక పళ్లెంలో పుణ్యాలు, మరొక పళ్లెంలో పాపాలు. ఒక పళ్లెంలో సత్కార్యాలు, మరో పళ్లెంలో దుష్కార్యాలు తూకం చేయడం జరుగుతుంది. ఆ సమయంలో పాపాలు ఎక్కువగా ఉండేది ఉంటే, ఆ పళ్లెం బరువుగా కిందికి జారిపోతుంది మరియు ఈ పుణ్యాల త్రాసు తేలికగా అయి మీదికి పోతుంది. అప్పుడు ఏం జరుగుద్ది?

101:6 فَأَمَّا مَن ثَقُلَتْ مَوَازِينُهُ
ఎవరి త్రాసు పళ్ళాలు బరువుగా ఉంటాయో.

101:7 فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ
అతను మనసు మెచ్చిన భోగ భాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు.

101:8 وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ
మరెవరి త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో,

101:9 فَأُمُّهُ هَاوِيَةٌ
అతని నివాస స్థానం ‘హావియా’ అవుతుంది.

101:10 وَمَا أَدْرَاكَ مَا هِيَهْ
అదేమిటో (‘హావియా’ అంటే ఏమిటో) నీకేం తెలుసు?

101:11 نَارٌ حَامِيَةٌ
అది దహించివేసే అగ్ని.

ఎవరి పుణ్యాల త్రాసు బరువుగా ఉంటుందో అతను తనకు ఇష్టమైన మనోహరమైన జీవితం గడుపుతాడు. మరెవరి పుణ్యాల త్రాసు తేలికగా ఉంటుందో అతని స్థానం హావియా అవుతుంది. ఏంటి హావియా? నారున్ హామియా. అది చాలా రగులుతున్నటువంటి అగ్ని. అందులో పడవలసి వస్తుంది.

అయితే పాపాలు అనేటివి రెండు రకాలుగా ఉన్నాయి. పెద్ద పాపాలు, చిన్న పాపాలు. గునాహె కబీరా, గునాహె సగీరా. ఘోరమైన పాపాలు, పెద్ద పాపాలు చాలా ఘోరమైనవి. మరికొన్ని చిన్న పాపాలు అని అనబడతాయి. ఘోర పాపాల జాబితా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియజేశారు. వాటిలో కొన్ని ఘోర పాపాలు ఎంత ఘోరంగా ఉంటాయి అంటే సర్వ సత్కార్యాల్ని భస్మం చేసేస్తాయి, చివరికి ఏ ఒక్క పుణ్యం కూడా మిగలదు. ఇక పుణ్యమే లేనప్పుడు, పుణ్యాల త్రాసులో ఏమి మిగులుతుంది? అందుకు మనిషి స్వర్గంలో పోవడానికి అవకాశం కూడా నశించిపోతుంది.

అయితే గమనించండి, మరిన్ని వివరాలు ఇక ముందుకు రానున్నాయి. కానీ చిన్న పాపాలు అంటే, అయ్యో చిన్నవియే కదా అని విలువ లేకుండా మీరు చూడకండి. ఎలాంటి భయం లేకుండా మెదలకండి. చిన్న పాపాల విషయంలో ఒక భయంకరమైన విషయం ఏమిటంటే, ఒక సామెత ద్వారా చెప్పాలా? ఒక్కొక్క పుల్ల కలిసి మోపెడు అవుతాయి. ఒక్కొక్క చుక్కనే కదా వర్షపు పడేది? వర్షం ఎలా కురుస్తుంది? కానీ ఆ ఒక్కొక్క చుక్కనే సముద్రం, సైలాబ్, పెద్ద తుఫాన్ తీసుకొస్తుంది. పర్వతం దేన్ని అంటారు? ఒక్క రాయినా? కొన్ని రాళ్ల సముదాయాన్ని. మహాశయులారా, చిన్న పాపాల్ని మాటిమాటికీ చేస్తూ ఉంటే అవి కూడా ఘోర పాపాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది.

అయితే ఇక ముందు కార్యక్రమాల్లో మనం ఘోర పాపాలు, వాటి నష్టాలతో పాటు, ఆ ఘోర పాపాలు ఏమేమి ఉన్నాయి? ఏ పాపాలు పుణ్యాలను నశింపజేసి, త్రాసు బరువును తగ్గిస్తాయి, అవి ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము.

మహాశయులారా, పాపాలు రెండు రకాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాము. అయితే ముందు చిన్న పాపాల గురించి కొన్ని వివరాలు మనం తెలుసుకుందాము. చిన్న పాపాలు, వీటి గురించి అల్లాహు త’ఆలా మనకు ఒక వాగ్దానం చేశాడు, శుభవార్త ఇచ్చాడు. అదేమిటంటే చిన్న పాపాల్ని మన్నించేస్తాడు, క్షమించేస్తాడు అని మనకు తెలిపాడు. మరి ఈ క్షమించడం, ఈ మన్నించడం అనేది స్వయంగా అల్లాహ్ తరఫున, అంటే ఏ పుణ్యానికి బదులుగా కాకుండా స్వయంగా అల్లాహ్ యే క్షమించడం, అట్లనే. మరొక రకం, మనం కొన్ని విధులు నిర్వహిస్తాము, కొన్ని పుణ్యాలు చేస్తాము, ఉదాహరణకు ఉదూ చేయడం, నమాజ్ చేయడం, ఉపవాసం ఉండడం, హజ్ చేయడం, ఇంకా. అలాంటి సత్కార్యాల ద్వారా కూడా చిన్న పాపాలు మన్నించబడతాయి అని కూడా మనకు అల్లాహు త’ఆలా శుభవార్త ఇచ్చాడు.

కానీ ఈ శుభవార్త మనం అందుకోవడానికి రెండు షరతులు, రెండు నిబంధనలు కూడా ఉన్నాయి. ఏమిటి అవి? మొదటి నిబంధన, చిన్న పాపాలు మన్నించబడాలంటే, మొదటి నిబంధన, ఘోర పాపాల నుండి మనం దూరం ఉండాలి. ఘోర పాపాలు చేస్తూ ఉన్నాము, చిన్న పాపాలు కూడా మన్నించబడవు. రెండవ నిబంధన, ఈ చిన్న పాపాల్ని కూడా చిన్నవియే కదా అన్నటువంటి భావన ఉండకూడదు. దీనికి ఒక చిన్న సామెత ఇవ్వాలా? ఒక మనిషి మీ ముందు ఒక చిన్న తప్పు చేశాడు అనుకుందాం. చేసి, మీరు చూసిన వెంటనే, “సారీ, క్షమించండి” అతను “సారీ” అని నోటితో చెప్పక ముందు అతని యొక్క, “అరె, సారీ చెప్తున్నట్లు ఉంది”. “లేదండి, పర్వాలేదు, పర్వాలేదు, అట్లేం లేదు” అని స్వయంగా మనమే అతన్ని క్షమించేసే ప్రయత్నం చేస్తాము.

చేసింది అతను చిన్న తప్పే కావచ్చు, కానీ మీరు అతని వెంట చూస్తేనే, “ఏంటి?” తిరిగేసి, గుడ్లు తెరిచి, అయితే ఏంది? ఈ విధంగా ఎదురుమాట, అంటే చేసింది చిన్నదైనప్పటికీ, “అయ్యో, తప్పు జరిగింది కదా” అన్న భావన లేకుండా విర్రవీగడం, గర్వం చూపడం ఇది మన మానవులకే నచ్చదు. విషయం అర్థమైంది అనుకుంటాను.

ఈ విధంగా మహాశయులారా, మన చిన్న పాపాలు మన్నించబడాలంటే, ఘోర పాపాల నుండి మనం దూరం ఉండాలి మరియు చిన్న పాపాల్ని “అరె, చిన్నవియే కదా” అన్నటువంటి భావనలో ఉండకూడదు. చదవండి ఖుర్ఆన్ యొక్క ఈ ఆయత్:

الَّذِينَ يَجْتَنِبُونَ كَبَائِرَ الْإِثْمِ وَالْفَوَاحِشَ إِلَّا اللَّمَمَ ۚ إِنَّ رَبَّكَ وَاسِعُ الْمَغْفِرَةِ
[అల్లజీన యజ్తనిబూన కబాయిరల్ ఇస్మి వల్ ఫవాహిష ఇల్లల్ లమమ్, ఇన్న రబ్బక వాసివుల్ మగ్ ఫిరహ్]

ఎవరైతే పెద్ద పాపాలకు దూరంగా ఉంటారో, చిన్న చిన్న తప్పులు మినహా నీతిబాహ్యతను కూడా విడనాడతారో (వారి పాలిట) నిశ్చయంగా నీ ప్రభువు ఎంతో ఉదారంగా క్షమించేవాడు.” (53:32)

ఎవరైతే చిన్న చిన్న తప్పులు, పాపాలు తప్ప ఘోరమైన పాపాల నుండి మరియు అశ్లీలమైన కార్యాల నుండి దూరంగా ఉంటారో, అలాంటి వారి పట్ల నీ ప్రభువు ఎంతో ఉదారంగా క్షమించేవాడు, కరుణించేవాడు. ఏమర్థమైంది? పెద్ద పాపాల నుండి, మహా అశ్లీల కార్యాల నుండి దూరం ఉంటేనే చిన్న పాపాలను మన్నిస్తాడు అన్నటువంటి శుభవార్త ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఇది సూర నజ్మ్ లోని ఆయత్, ఆయత్ నంబర్ 32.

అయితే సూర నిసా, ఆయత్ నంబర్ 31 లో ఇలా తెలియబరిచాడు:

إِن تَجْتَنِبُوا كَبَائِرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنكُمْ سَيِّئَاتِكُمْ وَنُدْخِلْكُم مُّدْخَلًا كَرِيمًا
[ఇన్ తజ్తనిబూ కబాయిర మా తున్హౌన అన్హు నుకఫ్ఫిర్ అన్కుమ్ సయ్యిఆతికుమ్ వనుద్ ఖిల్కుమ్ ముద్ ఖలన్ కరీమా]

“మీకు వారించబడే మహాపరాధాలకు గనక మీరు దూరంగా ఉన్నట్లయితే, మీ చిన్న చిన్న పాపాలను మేము మీ (లెక్క) నుండి తీసేస్తాము. ఇంకా మిమ్మల్ని గౌరవప్రద స్థానాల్లో (స్వర్గాలలో) ప్రవేశింపజేస్తాము”. (4:31)

ఈ రెండు ఆయతులకు తోడుగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ హదీసును కూడా వినండి. మ’జమ్ కబీర్, తబరానీలో ఈ హదీస్ ఉంది, షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుల్ జామి’ లో ప్రస్తావించారు, 2687.

إِيَّاكُمْ وَمُحَقَّرَاتِ الذُّنُوبِ
[ఇయ్యాకుమ్ వ ముహఖ్ఖరాతిజ్ జునూబ్]

فَإِنَّمَا مَثَلُ مُحَقَّرَاتِ الذُّنُوبِ كَمَثَلِ قَوْمٍ نَزَلُوا بَطْنَ وَادٍ
[ఫ ఇన్నమా మసలు ముహఖ్ఖరాతిజ్ జునూబి క మసలి ఖౌమిన్ నజలూ బత్న వాదిన్]

మీరు చిన్న పాపాలను అల్పమైనవిగా భావించడం మానుకోండి. అల్పమైనవియే కదా, చిన్నవియే కదా అనుకోవడం ఎంత భయంకరమో దాని యొక్క దృష్టాంతం ఇలా ఉంది. కొందరు ఒక ప్రాంతంలో దిగారు, వారు అక్కడ వంట చేసుకోవడానికి ఏ అగ్ని లేదు. కొంతమందిని పంపారు, ఒక వ్యక్తి ఒక పుల్ల, మరొక వ్యక్తి ఒక చిన్న కట్టె, ఈ విధంగా కొందరు కొన్ని పుల్లలు, కొన్ని చిన్న చిన్న కట్టెలు, కొన్ని ముక్కలు తీసుకొని వచ్చారు. అవన్నీ జమా చేసిన తర్వాత ఏమైంది? మంచి మంట, మంచి వంటకాలు చేసుకున్నారు. ఈ విధంగా చిన్న పాపాలను కూడా అల్లాహు త’ఆలా పట్టడం, వాటి గురించి మందలించడం మొదలుపెట్టాడంటే, ఒక్కొక్కటి, ఒక్కొక్కటి కలిసి అవన్నీ మనిషిని వినాశనానికి కూడా గురి చేస్తాయి. అందుగురించి చిన్నవియే కదా అన్నటువంటి అల్పమైన భావంలో పడకూడదు. మనిషి చిన్న పాపాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం.

హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు అన్హు తెలిపారు, ఒక వ్యక్తి కొన్ని పాపాలు చేసి మరిచిపోతాడు, సత్కార్యాల్లో ఉంటాడు, ఆ పాపాల పట్ల క్షమాపణ కోరుకోవడం, మన్నింపు వైఖరి అవలంబించడం ఏదీ పాటించడు. అదే స్థితిలో అల్లాహ్ ను కలుసుకుంటాడు, చివరికి ఆ పాపాలు అతన్ని వినాశనానికి గురి చేస్తాయి. మరొక వ్యక్తి, అతని నుండి పాపం జరుగుతుంది, కానీ అతడు భయపడుతూ ఉంటాడు, అల్లాహ్ తో క్షమాపణ కోరుతూ ఉంటాడు, చివరికి అల్లాహ్ ను కలుసుకున్నప్పుడు అల్లాహు త’ఆలా అతన్ని మన్నించి, అతనికి మోక్షం కలిగిస్తాడు. హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు త’అన్హు గారి యొక్క ఈ కొటేషన్ ని హాఫిజ్ ఇబ్నె హజర్ అస్కలానీ రహమతుల్లాహ్ అలైహ్ ఫత్హుల్ బారీలో ప్రస్తావించారు, సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 6492 యొక్క వ్యాఖ్యానంలో.

ఇప్పుడు మహాశయులారా, ఘోర పాపాల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ఘోర పాపాన్ని దేన్ని అంటారు? ఈ విషయం అర్థమైంది అంటే మిగితవి చిన్న పాపాల్లో లెక్కించబడతాయి అన్న విషయం కూడా బోధపడుతుంది. ఖుర్ఆన్ మరియు హదీస్ లో ఏ పాపాన్ని ఘోర పాపం అని తెలపడం జరిగిందో, పెద్ద పాపం అని తెలపడం జరిగిందో, అవి ఘోర పాపాలు. మరియు ఏ పాపం గురించి అయితే ఇహలోకంలో హద్దు నిర్ణయించడం జరిగినదో, ఉదాహరణకు, దొంగ యొక్క చేతులు కట్ చేయడం, వ్యభిచారం చేసిన వారిని వంద కొరడా దెబ్బలు, ఒకవేళ వివాహితుడైతే రాళ్లతో కొట్టి చంపడం, ఇలాంటి హద్దులు ఏవైతే నిర్ణయించబడినవో ఆ పాపాలు, మరియు ఏ పాపాల గురించి అయితే నరకం యొక్క శిక్ష అని హెచ్చరించబడిందో, మరియు ఏ పాపాలు చేసే వారి గురించి అయితే శాపనార్థాలు పెట్టడం జరిగినదో, ఇవన్నీ కూడా ఘోర పాపాల్లో లెక్కించబడతాయి. అలాగే ఏ పాపాలు చేసే వారిని ఫాసిఖ్, అపరాధి, అని అనడం జరిగిందో ఆ పాపాలు కూడా ఘోర పాపాల్లో లెక్కించడం జరిగింది. అయితే ఇక మన బాధ్యత ఏమిటి? అలాంటి హదీసులను, అలాంటి ఆయతులను మనం చదివినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి, వాటికి దూరం ఉండే ప్రయత్నం చేయాలి.

ఉదాహరణకు ఒక హదీస్ వినండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

إِنَّ أَعْظَمَ الذُّنُوبِ عِنْدَ اللَّهِ
[ఇన్న అ’జమజ్ జునూబి ఇందల్లాహ్]
అల్లాహ్ వద్ద పాపాల్లో అతి ఘోరమైనవి,

رَجُلٌ تَزَوَّجَ امْرَأَةً
[రజులున్ తజవ్వజమ్ ర అతన్]
ఒక వ్యక్తి ఒక స్త్రీతో పెండ్లాడాడు,

فَلَمَّا قَضَى حَاجَتَهُ مِنْهَا طَلَّقَهَا
[ఫలమ్మా ఖదా హాజతహూ మిన్హా తల్లఖహా]
అతను ఆమెతో రాత్రి గడిపి ఆమెకు విడాకులు ఇచ్చేశాడు,

وَذَهَبَ بِمَهْرِهَا
[వ జహబ బి మహ్రిహా]
ఆమె యొక్క మహర్ ను కూడా తినేశాడు, మహర్ కూడా తీసుకున్నాడు రిటర్న్, లేదా ఇస్తానని వాగ్దానం చేసి ఇవ్వలేదు. ఇది కూడా ఘోర పాపాల్లో లెక్కించబడింది.

وَرَجُلٌ اسْتَعْمَلَ رَجُلًا فَذَهَبَ بِأُجْرَتِهِ
[వ రజులున్ ఇస్త’మల రజులన్ ఫ జహబ బి ఉజ్రతిహి]
ఒక మనిషి మరో మనిషికి, మనిషిని ఒక మజ్దూరీగా తీసుకున్నాడు, మరి అతనికి ఇచ్చే మజూరీ ఏదైతే ఉందో, బత్తెం ఏదైతే ఉందో అది ఇవ్వకుండా తానే ఉంచుకున్నాడు, తినేశాడు.

మూడో వ్యక్తి,

وَآخَرُ يَقْتُلُ دَابَّةً عَبَثًا
[వ ఆఖరు యఖ్తులు దాబ్బతన్ అబసన్]
ఎవరైతే ఏదైనా పశువును, ఏదైనా పక్షిని వృధాగా చంపేస్తున్నాడు. షికారీ చేయడం పేరుతో, లేదా కొందరికి అలవాటు ఉంటుంది, కుక్కలను, పిల్లులను పరిగెత్తించి, వెనక రాళ్లతో కొట్టి ఇంకా వేరే విధంగా.

అయితే మహాశయులారా, ఇవన్నీ కూడా ఘోర పాపాల్లో లెక్కించబడతాయి. ఇది ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మహాశయులారా, పాపాల విషయాల్లో ఖుర్ఆన్ లో గాని, హదీస్ లో గాని మరొక విషయం కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. వాటిని అంటారు,

مُحْبِطَاتُ الْأَعْمَالِ
[ముహ్బితాతుల్ అ’మాల్]
సత్కార్యాలను నశింపజేసే పాపాలు అని.

వాటి నుండి కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఇన్షా అల్లాహ్, తర్వాయి భాగాల్లో అలాంటి కార్యాల గురించి, దేని ద్వారానైతే మన త్రాసు తేలికగా అవుతుందో, దేని ద్వారానైతే త్రాసు యొక్క బరువు తగ్గిపోతుందో, ఆ పాపాలను తెలుసుకొని, వాటి నుండి దూరం ఉండే మనం ప్రయత్నం చేద్దాము.

అల్లాహు త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. అన్ని రకాల పాపాల నుండి, ఘోర పాపాల నుండి, చిన్న పాపాల నుండి మరియు مُحْبِطَاتُ الْأَعْمَالِ [ముహ్బితాతుల్ అ’మాల్] సత్కార్యాలను నశింపజేసే పాపాల నుండి కూడా అల్లాహ్ మనల్ని దూరం ఉంచుగాక.

వస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43771

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (4) – మరణానంతర జీవితం : పార్ట్ 45 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు [4] – [మరణానంతర జీవితం – పార్ట్ 45]
https://www.youtube.com/watch?v=nMRENiqwyCw [21 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ప్రళయ దినాన మంచి పనుల త్రాసును తేలికగా చేసే వివిధ పాప కార్యాల గురించి వివరిస్తున్నారు. (3) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట కంటే ఇతరుల ఆదేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం, (4) అల్లాహ్ క్షమించడని ఇతరుల గురించి ప్రమాణం చేయడం, (5) అసర్ నమాజ్‌ను వదులుకోవడం, (6) ఏకాంతంలో అల్లాహ్ నిషేధించిన కార్యాలకు పాల్పడటం మరియు (7) సరైన కారణం లేకుండా కుక్కను పెంచడం వంటివి ఇందులో ఉన్నాయి. ఈ చర్యలు కొండలంత పుణ్యాలను కూడా నాశనం చేసి, వాటిని దుమ్ము ధూళి వలె మార్చేస్తాయని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో హెచ్చరించారు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి కఫా వస్సలాతు వస్సలాము అలా ఇబాదిల్లజీ నస్తఫా అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము. అందులో మూడవది, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటపై, ఆయన ఆదేశంపై ఇతరుల ఆదేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం.

మహాశయులారా! ఇది కూడా మహా ఘోరమైన పాపం. దీనివల్ల మన పుణ్యాలన్నీ కూడా, సత్కార్యాల సత్ఫలితాలన్నీ కూడా నశించిపోయి, మన త్రాసు అనేది తేలికగా అయిపోతుంది. సూరె హుజరాత్ ఆయత్ నెంబర్ ఒకటిలో అల్లాహు త’ఆలా విశ్వాసులందరికీ ఇచ్చిన ఆదేశం ఏమిటంటే,

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُقَدِّمُوا بَيْنَ يَدَيِ اللَّهِ وَرَسُولِهِ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తుఖద్దిమూ బైన యదయిల్లాహి వ రసూలిహి)
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను మించిపోకండి.  (49:1)

మనం విశ్వాసులం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాలను అనుసరిస్తూ ఉండాలి. కానీ వారి కంటే ముందుగా, ఆదేశం లభించక ముందే తన మన ఇష్టానుసారం ఏదైనా చేయడానికి, ఆదేశం వచ్చిన తర్వాత దాన్ని అనుసరించకుండా మన అభిప్రాయాలను మనం అనుసరించడానికి ఏమాత్రం అనుమతి మనకు లేదు.

ఆ తర్వాత సూరె హుజరాత్‌లోని ఆయత్ నెంబర్ రెండును గమనించండి. అందులో ఇవ్వబడిన హెచ్చరిక ద్వారా భయ కంపితులై, అలాంటి చేష్టలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం మనం చేయాలి.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلَا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ أَن تَحْبَطَ أَعْمَالُكُمْ وَأَنتُمْ لَا تَشْعُرُونَ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్‌ఫఊ అస్వాతకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి వలా తజ్‌హరూ లహూ బిల్ ఖౌలి కజహ్రి బఅదికుమ్ లి బఅదిన్ అన్ తహ్‌బత అఅమాలుకుమ్ వ అన్తుమ్ లా తష్ఉరూరున్)
ఓ విశ్వాసులారా! మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే పైన (హెచ్చుగా) ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తో బిగ్గరగా మాట్లాడకండి. దీనివల్ల మీ కర్మలన్నీ వ్యర్ధమైపోవచ్చు. ఆ సంగతి మీకు తెలియను కూడా తెలియదు..” (49:2)

ఓ విశ్వాసులారా! ప్రవక్త మాట కంటే, ప్రవక్త స్వరం కంటే మీ స్వరం అనేది ఎత్తుగా ఉండకూడదు. మరియు మీరు పరస్పరం ఎలానైతే ఒకరు మరొకరిని పిలుచుకుంటారో అలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ప్రవర్తించకండి. చివరికి మీరు, మీరు చేసే ఈ దుష్కార్యం వల్ల, మీరు ప్రవక్త స్వరంపై మీ స్వరాన్ని ఎత్తడం వల్ల, పరస్పరం మీరు ఎలా పిలుచుకుంటారో అలా ప్రవక్తను పిలవడం ద్వారా మీ సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి. అది మీకు తెలియకుండానే జరగవచ్చు. అంటే మీ పాపాల, మీ ఈ పాపం వల్ల మీ సత్కార్యాలు నశించిపోతున్నాయి అన్న విషయం మీకు తెలియకుండానే ఇదంతా జరగవచ్చు. అల్లాహు అక్బర్. ఎంత భయంకరమైన విషయమో గమనించండి.

ప్రవక్త స్వరంపై మన స్వరాన్ని ఎత్తడం, ప్రవక్త మాటపై మన మాటను పెంచడం, పరస్పరం పిలుచుకున్నట్లు ప్రవక్తను పిలవడం, దీనివల్ల మనకు తెలియకుండానే మన సత్కార్యాలు వృధా అవుతున్నాయి అంటే, ఇక ఎవరైతే తెలిసి తెలిసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాన్ని విడనాడుతున్నారో, ప్రవక్త ఆదేశం ఒకటి ఉంది అంటే, తనకిష్టమైన నాయకుడు, తనకిష్టమైన ఇమామ్, తనకిష్టమైన పీర్, తనకిష్టమైన మౌల్వీ సాబ్, వారి యొక్క ఫత్వాలు ఇంకో రకంగా ఉంటే ప్రవక్తను వదిలేసి వారినే అనుసరిస్తున్నారో, వారి యొక్క సత్కార్యాలు వృధా కావా? అలాంటి వారు భయపడే అవసరం లేదా?

ఈ రోజుల్లో మనలోని ఎంతో మంది సోదరులు, ఒకవైపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం, మరోవైపు మన తాత ముత్తాతల విధానం, మన యొక్క దురాచారాలు, మన యొక్క గ్రామ చట్టాలు ఈ విధంగా ఉంటాయి. ప్రవక్తను వదిలేసి వాటిని అనుసరిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారు ఏ నష్టంలో పడరు అని ఏదైనా మన దగ్గర జమానత్ ఉందా? అందు గురించి మనం ఈ ఆయతులు చదివిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి.

మహాశయులారా! మన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో, అల్లాహ్ ఫలానా వ్యక్తిని క్షమించడు అని ప్రమాణం చేయడం. అల్లాహు అక్బర్. ఒకసారి ఈ హదీసును గ్రహించండి. హజ్రత్ జుందుబ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఒక వ్యక్తి ఇలా అన్నాడు,

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ لِفُلَانٍ
(ఇన్నల్లాహ లా యగ్‌ఫిరు లి ఫులాన్)
నిశ్చయంగా అల్లాహ్ ఫలానా వ్యక్తిని క్షమించడు, మన్నించడు.

అప్పుడు అల్లాహు త’ఆలాకు చాలా కోపం వచ్చింది. అల్లాహ్ ఆగ్రహానికి గురి అయ్యాడు. ఫలానా వ్యక్తిని నా అతనికి నా క్షమాపణ లభించదు అని, నా వైపు నుండి అతన్ని కరుణించడం జరగదు అని ప్రమాణాలు చేసేటువంటి అధికారం ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది? నిశ్చయంగా నేను ఫలానా వ్యక్తిని క్షమించాను మరియు ఇలాంటి ప్రమాణాలు చేసే వ్యక్తి యొక్క సర్వ సత్కార్యాలను వృధా చేసేసాను. అల్లాహు అక్బర్. గమనించారా? ఎంత భయంకరమైన విషయమో.

అయితే మహాశయులారా, అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలను, మన్నింపు క్షమాపణలను మనం మన చేతిలో, మన అధికారంలో తీసుకోకూడదు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తూ ఉంటే, “సోదరా! ఇలాంటి తప్పు చేసే వారిని అల్లాహ్ క్షమించడు అని తెలియజేయడం జరిగింది. ఇలాంటి పాపం చేసే వారిని అల్లాహ్ శపిస్తాడని తెలియజేయడం జరిగింది. ఇలాంటి పాపం చేసేది ఉంటే అల్లాహ్ నరకంలో ప్రవేశింపజేస్తాడు అని చెప్పడం జరిగింది. ఇలాంటి పాపం చేసేది ఉంటే అల్లాహ్ స్వర్గంలో పంపడం లేదు అని చెప్పడం జరిగింది.” ఇలాంటి బోధన మనం చేయాలి. కానీ, “నువ్వు ఈ తప్పు చేస్తున్నావా? నిన్ను అల్లాహ్ క్షమించనే క్షమించడు. అల్లాహ్ నీకు ఎప్పుడూ కూడా పశ్చాత్తాపపడి క్షమాపణ కోరుకునే అధికారమే, అటువంటి భాగ్యమే ప్రసాదించడు.” ఇట్లాంటి ఆదేశాలు మనం జారీ చేయకూడదు. ఒకరిని అల్లాహ్ యొక్క క్షమాపణ పట్ల నిరాశకు గురి చేయకూడదు.

ఒకవేళ ఇదే ప్రమాణాలు చేసుకుంటూ, నిన్ను ఎన్నటికీ అల్లాహ్ క్షమించడు అని అంటే, అల్లాహ్, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ అతనికి అతను ఆగ్రహానికి గురై, ఇలాంటి వ్యక్తి యొక్క సర్వ సత్కార్యాలను వృధా చేసేస్తాడు. అల్లాహు అక్బర్. అందు గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.

మహాశయులారా! త్రాసును తేలికగా చేసే పాపాల్లో, అసర్ నమాజ్‌ను వదులుకోవడం. అల్లాహు అక్బర్. అసర్ నమాజ్. అల్లాహ్ రేయింబవళ్ళలో, రాత్రి పగళ్ళలో ఐదు వేలల నమాజ్ మనపై విధిగావించాడు. ఐదు నమాజుల్లో ఒకటి మధ్యలో ఉన్న నమాజ్ అసర్ నమాజ్. ఎవరైతే అసర్ నమాజ్ వదిలేస్తారో వారి యొక్క సత్కార్యాలు వృధా అయిపోతాయి. శ్రద్ధ వహించండి ఈ హదీసుపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

مَنْ تَرَكَ صَلَاةَ الْعَصْرِ فَقَدْ حَبِطَ عَمَلُهُ
(మన్ తరక సలాతల్ అస్ర్ ఫఖద్ హబిత అమలుహూ)
ఎవరైతే అసర్ నమాజ్‌ను విడనాడతారో వారి యొక్క సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి.

ఈ అసర్ నమాజ్ ఎంత ముఖ్యమైనదంటే,

حَافِظُوا عَلَى الصَّلَوَاتِ وَالصَّلَاةِ الْوُسْطَىٰ
(హాఫిజూ అలస్సలవాతి వస్సలాతిల్ వుస్తా)
“నమాజులను, ప్రత్యేకించి మధ్య నమాజును కాపాడండి.” (2:238)

అని అల్లాహు త’ఆలా ఖురాన్లో ఆదేశం ఇచ్చాడు. మీరు అన్ని నమాజులను పాబందీగా చేస్తూ ఉండండి. కానీ మధ్యలో ఉన్న నమాజు పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి. ఇందులో మధ్యలోని నమాజ్ అంటే అసర్ నమాజ్ అని ఎన్నో హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది.

అబూ ములైహ్ రహిమహుల్లాహ్ చెప్పారు, మేము ఒక సందర్భంలో, ఒక యుద్ధంలో ఉన్నాము. గమనించండి, యుద్ధంలో ఉన్నప్పుడు ఎంత మనిషి బిజీగా ఉంటాడో, అటువైపు శత్రువుల నుండి శత్రువుల బాణాలు, ఆయుధాలు మన మీదికి వచ్చి పడే, మన ప్రాణాలు పోయే అటువంటి భయం క్షణం క్షణం ఉంటుంది. అబూ ములైహ్ అంటున్నారు, మేము ఒక యుద్ధంలో హజ్రత్ బురైదా రదియల్లాహు త’ఆలా అన్హు వెంట ఉన్నాము. అసర్ నమాజ్ సమయం ప్రవేశించింది. అప్పుడు బురైదా రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు, అసర్ నమాజ్ మీరు చేసుకోండి. ఇందులో ఆలస్యం చేయకండి. ఎందుకంటే నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను,

مَنْ تَرَكَ صَلَاةَ الْعَصْرِ فَقَدْ حَبِطَ عَمَلُهُ
(మన్ తరక సలాతల్ అస్ర్ ఫఖద్ హబిత అమలుహూ)
ఎవరైతే అసర్ నమాజ్ విడినాడారో, ఎవరైతే అసర్ నమాజ్ వదిలేశారో వారి యొక్క సర్వ సత్కార్యాలు వృధా అయిపోయాయి.

దీని గురించి మనల్ని భయకంపితులుగా చేసే హదీస్ కూడా ఉంది. సహీహ్ బుఖారీలోని హదీస్. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

الَّذِي تَفُوتُهُ صَلَاةُ الْعَصْرِ كَأَنَّمَا وُتِرَ أَهْلَهُ وَمَالَهُ
(అల్లజీ తఫూతుహూ సలాతుల్ అస్ర్ క అన్నమా వుతిర అహ్లహూ వ మాలహూ)
ఎవరి అసర్ నమాజ్ తప్పిపోయినదో, ఎవరైతే అసర్ నమాజ్ చేయలేకపోయారో వారు ఎలాంటి వారంటే వారి యొక్క సొమ్ము, ధనము, ఆస్తిపాస్తులు, ఆలు పిల్లలు అందరూ నశించిపోయినటువంటి వాడు.

ఎప్పుడైనా ఈ బాధ మనకు కలిగిందా ఒకసారి ఆలోచించండి. అటు నమాజ్ టైం అయింది, ఇటువైపున కొడుకుకు చాలా జ్వరం వచ్చింది అంటే, మనం నమాజ్‌ను వదులుకొని కొడుకును ముందు హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి అని కోరుకుంటాము. ఇక ఎవరి ఆస్తిపాస్తులు, ఆలు పిల్లలు అందరూ నశించిపోయారో అతని పరిస్థితి ఎలా ఉంటుంది? అసర్ నమాజ్ కూడా తప్పిపోయినప్పుడు అంత బాధ మనకు కలిగిందా? ఎంత బాధనైతే మన ఆస్తిపాస్తులు, మన ఆలు పిల్లలు అందరూ నశించిపోయినప్పుడు కలుగుతుందో, అలాంటి బాధ ఏదైనా ఒక్క నమాజ్ మిస్ అయినప్పుడు మనకు కలిగిందా? అందు గురించి మహాశయులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతర సత్కార్యాలన్నిటినీ కూడా వృధా చేసుకోకుండా నమాజ్ కాపాడుకుంటూ మనం ఇతర సత్కార్యాలను కూడా కాపాడుకోవాలి.

మన త్రాసు బరువును తగ్గించేసి, తేలికగా చేసే పాపాల్లో మరో భయంకరమైన పాపం, ఏకాంతంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు చూడటం లేదు కదా అని భావించుకుంటూ ఉన్నప్పుడు, అల్లాహ్ నిషేధించిన కార్యాలకు పాల్పడడం. దీనివల్ల కూడా మన ఇతర సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి. ఈ రోజుల్లో ఎంతమంది మన, మనలోని ఎంతమంది పరిస్థితి ఇలా గురై ఉంది. ఒక్కసారి ఈ హదీసును మీరు చాలా శ్రద్ధగా వినండి. దీనిని అర్థం చేసుకొని ఇందులో చూపబడిన నష్టాలకు దూరంగా ఉండేటువంటి సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.

హజ్రత్ సౌబాన్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించిన ఈ హదీస్, దీనిని మనం మన ఈ చెవులతోనే కాకుండా, హృదయంలో ఉన్నటువంటి చెవులతో శ్రద్ధగా విని ఉంటే, ఈ హదీస్ మనలోని నిద్రలో ఉన్న వారిని నిద్రలో నుండి మేల్కొలుపుతుంది. అశ్రద్ధలో ఉన్నవారి యొక్క అశ్రద్ధతనాన్ని దూరం చేసేస్తుంది. అంతటి భయంకరమైన హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

لَأَعْلَمَنَّ أَقْوَامًا مِنْ أُمَّتِي يَأْتُونَ يَوْمَ الْقِيَامَةِ بِحَسَنَاتٍ أَمْثَالِ جِبَالِ تِهَامَةَ بِيضًا فَيَجْعَلُهَا اللَّهُ عَزَّ وَجَلَّ هَبَاءً مَنْثُورًا
(ల అ’లమన్న అఖ్‍వామన్ మిన్ ఉమ్మతీ య’తూన యౌమల్ ఖియామతి బి హసనాతిన్ అమ్సాల జిబాలి తిహామా బైదా ఫ యజ్అలుహల్లాహు అజ్జవజల్ల హబాఅన్ మన్సూరా)

నేను నా అనుచర సంఘంలోని కొందరిని గుర్తుపడతాను. వారు నాకు తెలుసు. వారు తిహామా నగరంలోని పర్వతాల మాదిరిగా సత్కార్యాలను తీసుకొని ప్రళయ దినాన హాజరవుతారు. (అరబ్బులో తిహామా కొండలు చాలా ఫేమస్. అలాంటి కొండల మాదిరిగా పుణ్యాలు చేసుకొని వస్తారు ప్రళయ దినాన.) కానీ అల్లాహు త’ఆలా వాటిని దుమ్ము ధూళి వలె చేసేస్తాడు.

ఈ భయంకరమైన విషయం విని సౌబాన్ రదియల్లాహు త’ఆలా అన్హు అడిగారు, “ప్రవక్తా, వారు ఎలాంటి వారు? వారి గుణం ఏమిటి? వారి గురించి ఏదైనా స్పష్టంగా తెలపండి. మాకు తెలియకుండానే మేము అలాంటి వారిలో కలిసిపోకుండా ఉండడానికి మేము జాగ్రత్త పడతాము” అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, “వారు మీ సోదరులే, మీ వంశం వారే. వారు రాత్రి వేళల్లో నిలబడి తహజ్జుద్ నమాజ్‌లు చేసే అటువంటి వారు. మీరు ఎలా తహజ్జుద్ నమాజ్ చేస్తున్నారో అలా వారు కూడా తహజ్జుద్ నమాజ్ చేసేవారు. కానీ ఒంటరిగా ఉండి అల్లాహ్ నిషేధించిన వాటికి పాల్పడే అవకాశం దొరికితే, వాటికి దూరంగా ఉండడానికి బదులుగా ఆ నిషిద్ధ కార్యాలకు పాల్పడేవారు.”

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో, మన చేతుల్లోని స్మార్ట్ ఫోన్స్, ఒక హాస్టల్లో ఉన్నవారు కూడా, ఒకచోట పనిచేసేవాళ్ళు కూడా, హెడ్ ఫోన్స్ చెవులలో పెట్టుకున్నారు, పై నుండి దుప్పటి కప్పుకున్నారు. లోపలి నుండి స్మార్ట్ ఫోన్స్ ఆన్ చేసుకుంటూ, ఇష్టమైన చిత్రాలు చూసుకుంటూ, పాప కార్యాలు చూసుకుంటూ, పక్కన ఎవరూ కూడా వినడం లేదు, పక్కన ఉన్నవారు ఎవరూ చూడడం లేదు. ఈ విధంగా సామాన్యంగా ఈరోజు జరుగుతున్న ఇటువంటి పాపాలు, అక్రమ సంబంధాలు పెట్టుకొని వారిలో ఒంటరి తనాల్లో కలుసుకోవడం, ఎవరు చూడడం లేదు కదా అని ప్రత్యేక కోడ్ వర్డ్లలో వారితోని మాట్లాడుకోవడం, ఇంకా ఇలాంటి ఎన్నో దుష్కార్యాలు ఈనాటి సమాజంలో ప్రబలిపోతూ ఉన్నాయి. ఎప్పుడైనా ఏదైనా విషయం బయటికి వచ్చినా, దానిని ఏదో రకంగా కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం, అల్లాహు అక్బర్. మహాశయులారా, అల్లాహ్ మనందరికీ సన్మార్గం చూపుగాక. ఇంతటి భయంకరమైన హదీస్ ఇది. చూడడానికి నమాజ్‌లు చేస్తూ ఉండడం, వేరే సత్కార్యాలు చేస్తూ ఉండడం, ఒక మంచివాడుగా ప్రజల్లో పేరు పొందడం, కానీ ఒంటరిగా ఉండి పాపాలు చేసే అవకాశం వస్తే, ఏమాత్రం జంకకుండా, వెనుక ఉండకుండా, అల్లాహ్‍తో భయపడకుండా అలాంటి నిషిద్ధ కార్యాలకు పాల్పడడం, ఇది మన సత్కార్యాలన్నిటినీ వృధా చేసేస్తుంది.

మహాశయులారా, మన సత్కార్యాలను వృధా చేసి మన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో ఏడవది, కుక్కను పెంచడం. అల్లాహు అక్బర్. ఈ రోజుల్లో ఎందరో ముస్లింల ఇళ్లల్లో కూడా పెట్టీ అని, ఇంకా ఏదేదో పేర్లతో, రకరకాల, ఎంతో అందమైన ముద్దుగా ఉన్నటువంటి పేర్లతో కుక్కలను పిలుచుకుంటూ, పెంచుకుంటూ, వారిని తమ ఒడిలో తమ పిల్లల మాదిరిగా ఉంచుకుంటూ ఇలా వారిని పోషిస్తున్నారు.

ఈ రోజుల్లో ఎంతో మంది తమ సొంత పిల్లలను తమ ఒడిలో కూర్చోబెట్టుకొని ఉన్నట్లుగా కుక్కను పెంచుకుంటున్నారు. ఎంతో ముద్దు ముద్దు పేర్లతో వారిని పిలుచుకుంటూ, వారిని తమ ఒడిలో కూర్చోబెట్టుకుంటున్నారు. ఈ విధంగా మహాశయులారా, ముందే పుణ్యాలు, సత్కార్యాలు చాలా తక్కువగా మనకు ఉన్నాయి అంటే, ఇలాంటి పాప కార్యాల వల్ల మరింత మనం ప్రళయ దినాన నష్టపోతాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

مَنِ اتَّخَذَ كَلْبًا، إِلَّا كَلْبَ زَرْعٍ أَوْ غَنَمٍ أَوْ صَيْدٍ، يَنْقُصُ مِنْ أَجْرِهِ كُلَّ يَوْمٍ قِيرَاطٌ
(మనిత్తఖద కల్బన్ ఇల్లా కల్బ జర్ఇన్ అవ్ గనమిన్ అవ్ సైదిన్ యన్ఖుసు మిన్ అజ్రిహీ కుల్ల యౌమిన్ ఖీరాత్)
ఎవరైతే కుక్కను పెంచుతారో, వారి యొక్క పుణ్యాల్లో ప్రతి రోజూ ఒక ఖీరాత్ పుణ్యాలు తగ్గుతూ ఉంటాయి.

ఒక ఖీరాత్ పుణ్యాలు అంటే ఎంతో తెలుసా? జనాజా నమాజ్‌కు సంబంధించిన విషయాల్లో మనం తెలుసుకున్నాము. ఒక ఖీరాత్ అంటే ఉహుద్ పర్వతానికి సమానం. రెండు ఖీరాత్‌లు అంటే రెండు ఉహుద్ పర్వతాలు లేదా రెండు పెద్ద పర్వతాలకు సమానం.

ప్రతి రోజూ ఒక ఖీరాత్ పుణ్యం తగ్గుతూ ఉంటుంది ఎవరైతే కుక్కను పెంచుతూ ఉంటారో. కానీ ఇందులో కేవలం మూడు రకాల కుక్కలను పెంచే అనుమతి ఉంది. ఆ కుక్కలు కూడా సాధ్యమైనంత వరకు మన ఇంటి ఆవరణలో ఉండకుండా బయట ఉంచే ప్రయత్నం చేయాలి. ఎలాంటి మూడు కుక్కలు? ఒకటి, మనం మన తోట రక్షణ కొరకు పెంచే కుక్క, అది తోటలోనే ఉండాలి, ఇంటి వద్ద ఉండకూడదు. మరొకటి, మేకల రక్షణ కొరకు మనం పెంచే కుక్క, అది మేకల వద్దనే ఉండాలి, మన ఇంట్లోనికి రానివ్వకూడదు. మూడవది, كَلْبَ صَيْدٍ (కల్బ సైదిన్) వేటాడడానికి, వేరే కొన్ని జంతువులను వేటాడడానికి వేట యొక్క శిక్షణ ఇవ్వబడిన కుక్కలు. సామాన్య కుక్కలు కూడా కాదు. వేట యొక్క శిక్షణ వారికి ఇవ్వబడాలి. అలాంటి కుక్కలు, అవి కూడా ఇంట్లోనికి ప్రవేశించకుండా మనం జాగ్రత్త పడాలి.

ఈ మూడు రకాల కుక్కలు పెంచడానికి అనుమతి ఉంది. ఈ మూడు ఉద్దేశాలు కాకుండా ఇంకా ఎవరైనా కుక్కను పెంచుతున్నారు అంటే ప్రతి రోజూ వారి యొక్క సత్కార్యాలలో నుండి ఒక ఖీరాత్ సత్కార్యాలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ విధంగా మనం ఎంత నష్టానికి గురి అయిపోతామో గమనించండి.

మరికొన్ని పాప కార్యాలు ఉన్నాయి, వాటి ద్వారా కూడా మన త్రాసు అనేది తేలికగా అయిపోతుంది. తరువాయి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41887

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [1] – సంకల్ప శుద్ధి, సత్ప్రవర్తన [మరణానంతర జీవితం – పార్ట్ 23] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [1] – సంకల్ప శుద్ధి, సత్ప్రవర్తన
[మరణానంతర జీవితం – పార్ట్ 23] [21 నిముషాలు]
https://www.youtube.com/watch?v=bqcAR6CBK80
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

السلام عليكم ورحمة الله وبركاته
الحمد لله رب العالمين والعاقبة للمتقين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد

మహాశయులారా, మరణానంతర జీవితం అనే అంశంలో మీకు స్వాగతం. మరణానంతర జీవితం అనే అంశంలో ఒక ముఖ్య శీర్షిక ప్రళయ దినాన త్రాసు యొక్క ఏర్పాటు చేయడం, అందులో కర్మలను, కర్మ పత్రాలను, ఆ కర్మలు చేసిన మానవుల్ని కూడా తూకం చేయబడటం దాని గురించి మనం ఎన్నో వివరాలు విని ఉన్నాము. అయితే, ఇందులోనే ఒక ముఖ్య శీర్షిక త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు ఏమిటి?

మహాశయులారా, ఇలాంటి విషయాలు మనం ఎక్కువగా చదవడం, వినడం, తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసు బరువుగా ఉన్నప్పుడే మనం స్వర్గాల్లోకి ప్రవేశించగలుగుతాము. ఒకవేళ మన సత్కార్యాల పళ్ళెం బరువుగా కాకుండా తేలికగా ఉంటే, అల్లాహ్ కాపాడుగాక మనందరినీ రక్షించుగాక, నరకంలోనికి వెళ్ళవలసి వస్తుంది. అందుకొరకు ఈనాటి నుండి మనం అల్లాహ్ యొక్క దయవల్ల ఏ సత్కార్యాలు ప్రళయ దినాన మన త్రాసును బరువుగా చేస్తాయి, ఆ సత్కార్యాల గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాము.

ఇందులో మొదటి విషయం ఇఖ్లాస్. అంటే సంకల్ప శుద్ధి. ఏ కార్యం ఎంత ఎక్కువగా సంకల్ప శుద్ధితో కూడుకొని ఉంటుందో అంతే ఎక్కువగా దాని పుణ్యం పెరుగుతుంది. ఎంత పుణ్యం ఎక్కువగా పెరుగుతుందో అంతే పళ్ళెంలో, సత్కార్యాల త్రాసులో అది బరువుగా ఉంటుంది. ఎవరైనా ఎంత పెద్ద సత్కార్యం చేసినా, అది చూడడానికి ఎంత గొప్పగా ఉన్నా, సంకల్ప శుద్ధి కలిగి లేకుంటే, అది కేవలం అల్లాహ్ యొక్క సంతృష్టి కొరకు చేయబడకుంటే దాని యొక్క సత్ఫలితం మనిషికి ఏ మాత్రం దొరకడమే కాదు, ఏనాడైతే మనిషి దాని సత్ఫలితం పొందుదాము అని ప్రలోకాన హాజరవుతాడో అప్పుడు దుమ్ము ధూళి వలె అది వృధా అయిపోతుంది. ఏమీ ఫలితము మనిషికి లభించదు. చూడడానికి ఇహలోకంలో అతను ఎంతో కష్టపడ్డాడు. చూడడానికి ఆ కార్యం చేయడానికి అతను ఎంతో శ్రమించాడు, కానీ సంకల్ప శుద్ధి లేని వల్ల దాని పుణ్యం తుడుచుకుపోతుంది. సత్ఫలితం లేకుండా చేస్తుంది.

పరలోకం పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

పరలోకం పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ
https://youtu.be/NsqbSZr8XQI [14 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లామీయ విశ్వాసంలోని ఐదవ ముఖ్యమైన అంశమైన పరలోక జీవితంపై విశ్వాసం గురించి వివరించబడింది. పరలోకం అంటే ఏమిటి, దాని ఉనికికి ఖురాన్ మరియు హదీసుల నుండి ఆధారాలు, మరియు ప్రపంచంలో జరిగే అన్యాయాలకు అంతిమ న్యాయం జరగాల్సిన ఆవశ్యకత వంటి విషయాలు చర్చించబడ్డాయి. పరలోకంలో జరిగే ముఖ్య సంఘటనలైన హషర్ మైదానం (సమావేశ స్థలం), కర్మపత్రాల పంపిణీ, మీజాన్ (త్రాసు), జహన్నం (నరకం), మరియు జన్నత్ (స్వర్గం) గురించి కూడా ప్రస్తావించబడింది. చివరగా, పరలోకంపై విశ్వాసం ఒక వ్యక్తిని దైవభీతితో జీవించేలా, పుణ్యకార్యాల వైపు ప్రేరేపించేలా మరియు పాపాలకు దూరంగా ఉంచేలా ఎలా చేస్తుందో, తద్వారా సమాజంలో శాంతి ఎలా నెలకొంటుందో వివరించబడింది.

అల్ హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్.

అన్ని రకాల ప్రశంసలు, పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలు మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ప్రసంగంలో, విశ్వాస ముఖ్యాంశాలలోని ఐదవ ముఖ్యాంశం పరలోకం పట్ల విశ్వాసం గురించి తెలుసుకుందాం.

పరలోకం అంటే ఏమిటి? పరలోకాన్ని విశ్వసించడానికి మన వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి? పరలోకంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటి? పరలోకాన్ని విశ్వసిస్తే మనిషికి కలిగే ప్రయోజనము ఏమిటి? ఇవన్నీ ఇన్ షా అల్లాహ్ ఈ ప్రసంగంలో వస్తాయి.

ఆ హదీస్ మరొక్కసారి మనము విందాం. జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్తా, ఈమాన్ అంటే ఏమిటి అని ప్రశ్నించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇస్తూ, అల్లాహ్ ను విశ్వసించటం, దూతలను విశ్వసించటం, గ్రంథాలను విశ్వసించటం, ప్రవక్తలను విశ్వసించటం, పరలోకాన్ని విశ్వసించటం, విధివ్రాతను విశ్వసించటం అని సమాధానం ఇచ్చినప్పుడు, జిబ్రీల్ అలైహిస్సలాం వారు నిజమే అని ధ్రువీకరించారు కదండీ. ఆ ప్రకారంగా ఈమాన్ (విశ్వాసం) అంటే ఆరు విషయాలను విశ్వసించవలసి ఉంది కదండీ. అందులోని ఐదవ విషయం, పరలోకం పట్ల విశ్వాసం. ఈ పరలోకం పట్ల విశ్వాసం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మీ ముందర ఉంచుతున్నాను. ఇన్ షా అల్లాహ్, శ్రద్ధగా విని ఆచరించే ప్రయత్నము చేయండి.

ముందుగా, పరలోకం అంటే ఏమిటి తెలుసుకుందాం. పరలోకం అంటే, మానవులందరూ కూడా మరణించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవులందరినీ ఒక రోజు మళ్ళీ బ్రతికిస్తాడు. ఆ రోజు వారి కర్మల లెక్కింపు జరుగుతుంది. ఎవరైతే సత్కార్యాలు ఎక్కువగా చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, వారికి బహుమానాలు ఇవ్వబడతాయి. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, వారికి శిక్షలు విధించటం జరుగుతుంది. ఇలా జరిగే దినాన్ని పరలోక దినం, లెక్కింపు దినం అని కూడా అంటూ ఉంటారు.

పరలోకం ఉంది అని నమ్మటానికి ఆధారాలు మనము ఇప్పుడు చూచినట్లయితే, ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పదేపదే పరలోకం గురించి మరియు పరలోకంలో జరగబోయే విషయాల గురించి మనకు తెలియపరిచి ఉన్నాడు. హదీసులలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలలో కూడా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట పరలోకము మరియు పరలోకంలో జరగబోయే విషయాల ప్రస్తావన మనకు కనబడుతూ ఉంటుంది. ఒక ఉదాహరణ మీ ముందర ఉంచుతున్నాను చూడండి. ఖురాన్ గ్రంథము 23వ అధ్యాయము 15, 16 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

ثُمَّ اِنَّكُمْ بَعْدَ ذٰلِكَ لَمَيِّتُوْنَ ثُمَّ اِنَّكُمْ يَوْمَ الْقِيٰمَةِ تُبْعَثُوْنَ
ఆ తరువాత మీరంతా తప్పకుండా మరణిస్తారు. మరి ప్రళయ దినాన మీరంతా నిశ్చయంగా లేపబడతారు. (23:15-16)

ఈ రెండు వాక్యాలలో ప్రళయ దినం ప్రస్తావన కూడా వచ్చి ఉంది. మనిషి మరణించిన తర్వాత మళ్ళీ బ్రతికించబడతారు అనే ప్రస్తావన కూడా వచ్చి ఉంది. ఇలా చాలా వాక్యాలు ఉన్నాయి, చాలా హదీసులు, ఉల్లేఖనాలు ఉన్నాయి. తద్వారా, పరలోకము తప్పనిసరిగా ఉంది అని గ్రంథాల ద్వారా స్పష్టమవుతూ ఉంది. ప్రతి విశ్వాసి కూడా పరలోకాన్నే విశ్వసించటం తప్పనిసరి.

ఇక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే, పరలోకం సంభవిస్తుంది అని కూడా మనకు తెలుస్తుంది. అది ఎలాగంటే, మనం చూస్తూ ఉంటాం. చాలా చోట్ల ప్రపంచంలో, బలవంతులు, దౌర్జన్యపరులు నిరుపేదలపై, బలహీనులపై దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు. హత్యలు చేస్తూ ఉంటారు, అత్యాచారాలు చేస్తూ ఉంటారు, ప్రాణాలు తీసేసి ఇది ప్రమాదము అని చిత్రీకరిస్తూ ఉంటారు, అరాచకాలు సృష్టిస్తూనే ఉంటారు, కబ్జాల మీద కబ్జాలు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉంటే, మనం చూస్తూ ఉంటాం. బలహీనులు న్యాయం కావాలి అని ఎదురు చూస్తూనే ఉంటారు, కానీ వారికి ఎక్కడ కూడా న్యాయం దొరకదు, చివరికి వారు అలాగే బాధపడుతూనే మరణించి ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. బలవంతుల్లో కొందరు, రాజకీయ నాయకుల, అధికారుల అండదండలతో, ధనముతో తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. వారు చేసిన అరాచకాలకు శిక్షలు పడవు. ఏదో ఒక రకంగా పలుకుబడి ద్వారా వారు తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. చివరికి వారు కూడా ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు.

ప్రశ్న ఏమిటంటే, మరి అన్యాయానికి గురి అయిన ఈ పీడితులకు, దేవుడు కూడా న్యాయం చేయడా? అన్యాయము చేసి, అరాచకాలు సృష్టించిన ఈ దుర్మార్గులకు, దేవుడు కూడా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కూడా శిక్షించడా? అంటే, దానికి ఇస్లాం ఇచ్చే సమాధానం ఏమిటంటే, తప్పనిసరిగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు, మరియు అతనికి న్యాయం చేస్తాడు. అలాగే ప్రతి నేరస్తునికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని నేరానికి సరిపడేటట్టుగానే శిక్షిస్తాడు. ఎంతటి నేరము ఉంటుందో అంతటి కఠినమైన శిక్ష కూడా విధిస్తాడు. దీనికి సరైన ప్రదేశము పరలోకము.

పరలోకంలో నిరుపేద, ధనికుడు, బలహీనుడు, బలవంతుడు, రాజకీయ అండదండలు, ధనము, పలుకుబడి ఇవన్నీ ఏమీ గానీ ఉండవు, పనికిరావు కూడా. అక్కడ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు మరియు ప్రతి నేరస్తునికి అతని నేరానికి తగినంత శిక్ష కూడా విధిస్తాడు. ఆ రోజు న్యాయము స్థాపించబడుతుంది. ఆ ప్రకారంగా పరలోకము తప్పనిసరిగా సంభవిస్తుంది అని మనకు స్పష్టమవుతుంది మిత్రులారా.

పరలోకంలో ఏమేమి ఉంటాయి అనే విషయాలు మనం చూచినట్లయితే, చాలా విషయాలు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియపరిచి ఉన్నారు. కొన్ని విషయాలు మాత్రమే ఈ ప్రసంగంలో చెబుతున్నాను. ఇన్ షా అల్లాహ్, పరలోకంలో ఏమి జరుగుతుంది అనే ప్రసంగం వినండి, అందులో వివరాలు ఇన్ షా అల్లాహ్ మీకు దొరుకుతాయి. ఇక రండి, కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పరలోకంలో హషర్ మైదానము ఉంది. హషర్ మైదానము అంటే ఏమిటి? ప్రళయం సంభవించిన తర్వాత, యుగాంతము సంభవించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ భూమి ఆకాశాలను సృష్టిస్తాడు. ఆ రోజు భూమి ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక చదరపు మైదానములా, పాన్పు లాగా ఉంటుంది. ఆ మైదానంలో ఒక చెట్టు గానీ, ఒక గుట్ట గానీ, ఒక భవనము గానీ ఉండదు. ఆ మైదానంలో, ఆది మానవుడైన ఆదమ్ అలైహిస్సలాం వద్ద నుండి యుగాంతం సంభవించినంత వరకు ఎంతమంది మానవులైతే జన్మించి, మరణించారో వారందరినీ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ బ్రతికించి నిలబెడతాడు.

వారందరూ కూడా ఆ మైదానంలో నిలబడినప్పుడు, వారి వారి చేతికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. ఎవరైతే సత్కార్యాలు చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, కుడిచేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు వారి కర్మలను, వారి సత్కార్యాలను చూసి, చదివి సంతోషిస్తూ ఉంటారు, వారి మొహము ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, అరాచకాలు సృష్టించి ఉంటారో, ఎడమ చేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు చేసుకున్న పాపాలన్నీ వారు ఆ రోజు చదువుకుంటూ, ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. వారి మొహం ఆ రోజు నల్లబడిపోతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే, దానిని హషర్ మైదానము అని అంటారు.

అలాగే పరలోకంలో ఏముంది అని మనం చూచినట్లయితే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మీజాన్ ఉంచి ఉన్నాడు. మీజాన్ అంటే ఏమిటి? త్రాసు అని అర్థం. ఆ త్రాసులో ఏమి తూంచబడుతుంది అంటే, ప్రజల పుణ్యాలు, పాపాలు తూచబడతాయి. ఎవరి పుణ్యాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు విజేతలుగా నిలబడతారు. ఎవరి పాపాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు దోషులుగా నిలబడతారు. ఆ రోజు తుది నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాదే. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎవరిని మన్నించాలనుకుంటాడో వారిని మన్నిస్తాడు. మరి ఎవరినైతే శిక్షించాలనుకుంటాడో వారిని శిక్షిస్తాడు. నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చేతిలోనే ఉంటుంది. కాకపోతే, విశ్వాసం ప్రామాణికమైనది అవుతుంది కాబట్టి మిత్రులారా, ఆ రోజు రానున్నది. ప్రపంచంలోనే విశ్వసించండి, సత్కార్యాలు చేయండి అని మనకు తెలపబడింది. మొత్తానికి పరలోకంలో త్రాసు ఉంది, అందులో ప్రజల కర్మలు తూచబడతాయి.

అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జహన్నం సిద్ధం చేసి ఉంచాడు. జహన్నం అంటే నరకం అని అర్థం. నరకంలో ఏముంది అంటే, అది ఒక పెద్ద బావి, దాని నిండా అగ్ని ఉంది. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కారానికి పాల్పడి ఉంటారో, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అలాంటి వారిని శిక్షించడానికి నరకంలో పడవేస్తాడు. ఎవరు ఎన్ని ఘోరమైన నేరాలు, పాపాలు చేసి ఉంటారో, వారికి నరకంలో అంత కఠినమైన శిక్ష కూడా విధించబడుతుంది. అల్లాహ్ మన అందరికీ దాని నుండి, దాని శిక్షల నుండి రక్షించుగాక, ఆమీన్.

అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జన్నహ్, ఉర్దూలో జన్నత్, తెలుగులో స్వర్గం సిద్ధం చేసి ఉన్నాడు. స్వర్గంలో ఏమున్నాయి అంటే, అందులో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అనుగ్రహాలు అన్నీ ఉంచి ఉన్నాడు. ఆ అనుగ్రహాలు ఎవరికి దక్కుతాయి అంటే, ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు, పుణ్యాలు ఎక్కువగా చేసుకుని ఉంటారో, వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆ స్వర్గము ప్రసాదిస్తాడు. ఎవరు ఎన్ని ఎక్కువ పుణ్యాలు చేసుకొని ఉంటారో, వారు స్వర్గంలో అంత ఉన్నతమైన స్థానాలలో చేరుకుంటారు. స్వర్గంలో ఉన్నవారు, ప్రశాంతంగా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి భయము లేకుండా, సంతోషంగా జీవించుకుంటూ ఉంటారు. అలాంటి స్వర్గం అల్లాహ్ మన అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.

పరలోకంలో ఇంకా ఏమి ఉంటాయి అంటే, పరలోకంలో హౌదె కౌసర్ ఉంది, పరలోకంలో పుల్ సిరాత్ ఉంది, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మీరు పరలోకంలో ఏమి జరుగుతుంది, పరలోక విశేషాలు అనే ప్రసంగాలు వినండి, ఇన్ షా అల్లాహ్ తెలుస్తుంది. సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి, ఇక చివరులో మనము…

పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి అనేది ఇన్ షా అల్లాహ్ తెలుసుకొని మాటను ముగిద్దాం. పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటట? మనిషి పరలోకాన్ని విశ్వసించటం వలన దైవభీతితో జీవిస్తాడు. పుణ్యాలు బాగా చేసి, పరలోక అనుగ్రహాలు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. పాపాలు చేస్తే పరలోకంలో శిక్షలు తప్పవు అని భయపడుతూ ఉంటాడు. మరియు అలా భయపడటం వలన, అతను అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అలా చేయటం వలన సమాజంలో శాంతి నెలకొంటుంది.

ఒకసారి ఆలోచించి చూడండి. ప్రతి వ్యక్తి పరలోకాన్ని విశ్వసించి, పరలోకంలో ఉన్న అనుగ్రహాలను విశ్వసించి, పరలోకంలో ఉన్న శిక్షలను కూడా విశ్వసించి, వాటిని దృష్టిలో పెట్టుకుని జీవిస్తున్నప్పుడు, సత్కార్యాలు చేసుకుందాం, పుణ్యాలు సంపాదించుకుని స్వర్గానికి చేరుకుందాం అనుకుంటూ ఉంటే, అలాగే పాపాలు చేయవద్దు, చేస్తే నరకానికి వెళ్లి శిక్షలు అనుభవించవలసి ఉంటుంది కాబట్టి, వద్దు అయ్యా పాపాలు, నేరాలు అని దానికి దూరంగా ఉంటూ ఉంటే, ప్రతి వ్యక్తి ఆ విధంగా విశ్వసించి జీవించుకుంటే, అలాంటి సమాజము శాంతియుతంగా ఉంటుంది అని చెప్పటానికి ఇంకేమి కావాలి మిత్రులారా.

కాబట్టి, నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మన అందరికీ సంపూర్ణ విశ్వాసులుగా జీవించే భాగ్యం ప్రసాదించుగాక. నరక శిక్షల నుండి అల్లాహ్ మమ్మల్ని కాపాడి, స్వర్గవాసులుగా మమ్మల్ని అందరినీ స్వర్గానికి చేర్చుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30634

పరలోకం (The Hereafter) – మెయిన్ పేజీ
https://teluguislam.net/hereafter/