మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కుటుంబం

బిస్మిల్లాహ్

మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కుటుంబం
మహా ప్రవక్త జీవిత చరిత్ర: అర్రహీఖుల్‌ మఖ్ తూమ్ (పూర్తి పుస్తకం)
షేఖ్ సఫియుర్  రహ్మాన్ ముబారక్ ఫూరి

1. హజ్రత్ ఖదీజా (రదియల్లాహు అన్హా)

హిజ్రత్ కు పూర్వం మక్కాలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కుటుంబమంతా ఆయన సతీమణి ఖదీజా (రదియల్లాహు అన్హా) ఒక్కరే. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివాహం ఆయన ఇరవై అయిదవ ఏట జరిగింది. అప్పుడు హజ్రత్ ఖదీజా (రదియల్లాహు అన్హా) గారి వయస్సు నలభై ఏండ్లు. ఈమె ఆయనకు మొదటి భార్య. ఆమె బ్రతికి ఉండగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరే వివాహం చేసుకోలేదు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సంతానం ఒక్క హజ్రత్ ఇబ్రాహీం తప్ప కుమారులు, కుమార్తెలందరూ ఆమె గర్భాన జన్మించినవారే. కుమారుల్లో ఏ ఒక్కరూ జీవించి ఉండలేదు. అయితే కుమార్తెలందరూ సజీవంగానే ఉండినారు. వారి పేర్లు ఇవి:

  • 1. హజ్రత్ జైనబ్ (రదియల్లాహు అన్హా)
  • 2. హజ్రత్ రుఖయ్యా (రదియల్లాహు అన్హా)
  • 3. హజ్రత్ ఉమ్మె కుల్సూమ్ (రదియల్లాహు అన్హా) మరియు
  • 4. హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) లు.

హజ్రత్ జైనబ్ (రదియల్లాహు అన్హా) పెళ్ళి హిజ్రత్ కు పూర్వం ఆమె మేనత్త కుమారుడు హజ్రత్ అబుల్ ఆస్ బిన్ రబీతో జరిగింది. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) తో హజ్రత్ రుఖయ్యా (రదియల్లాహు అన్హా) వివాహం జరిగింది. ఆమె చనిపోయిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్రత్ ఉమ్మె కుల్సూమ్ (రదియల్లాహు అన్హా) వివాహం తిరిగి ఆయనతోనే చేశారు. హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) వివాహం, బద్ర్ యుద్ధం మరియు ఉహద్ యుద్ధం మధ్య కాలంలో హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) తో జరిగింది. ఆమె గర్బాన హజ్రత్ హసన్ (రదియల్లాహు అన్హు) , హజ్రత్ హుసైన్ (రదియల్లాహు అన్హు) లు (కుమారులు) హజ్రత్ జైనబ్, ఉమ్మె కుల్సూమ్ లు (కుమార్తెలు) జన్మించారు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సమాజానికి భిన్నంగా, ఓ ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నారు. వివిధ అవసరాల దృష్ట్యా ఆయన నల్గురి కంటే ఎక్కువ మంది భార్యలను వివాహం చేసుకొనే రాయితీ దైవం ఆయనకు ఒసిగాడన్న విషయం విదితమే. కాబట్టి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏ స్త్రీలనైతే వివాహ మాడారో వారు మొత్తం పదకొండుగురు. వారిలో తొమ్మండుగురు ఆయన పరమపదించేటప్పుడు సజీవంగానే ఉన్నారు. ఇద్దరు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జీవిత కాలంలోనే మరణించారు. (అంటే హజ్రత్ ఖదీజా రదియల్లాహు అన్హా మరియు ఉమ్ముల్ మసాకీన్ హజ్రత్ జైనబ్ బిన్తె కజీమా రదియల్లాహు అన్హా) వీరేకాకుండా మరిద్దరు ఉన్నారనేది, వారితో ఆయన నికాహ్ జరిగిందా లేదా అనే విషయంలో అభిప్రాయ భేదం ఉంది. కాని వారు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో రాత్రి గడపలేదనేది ఏకాభిప్రాయంతో ఒప్పుకున్న విషయం .

ఈ క్రింద మేము ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సతీమణుల పేర్లు, వారి వివరాలు క్రమపద్ధతిలో సంగ్రహంగా మీ ముందుంచుతున్నాం.

2. హజ్రత్ సౌదా బిన్తె‌ జమ్ఆ (రదియల్లాహు అన్హా)

ఈమెగారితో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివాహం , హజ్రత్ ఖదీజా (రదియల్లాహు అన్హా) మరణా నంతరం, ప్రవక్త అయిన పదవ సంవత్సరం షవ్వాల్ నెలలో జరిగింది. హజ్రత్ సౌదా (రదియల్లాహు అన్హా) అంతకు ముందు తమ పినతండ్రి కుమారుడు సక్రాన్ వివాహ బంధంలో ఉంటూ ఉండేవారు. సక్రాన్ మరణించడం వల్ల ఆమె అప్పుడు వితంతువుగా ఉన్నారు.

3. హజ్రత్ ఆయిషా సిద్దీకా బిన్తె‌ అబూ బక్ర్ (రదియల్లాహు అన్హా)

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), ఆమెను ప్రవక్త పదవి లభించిన పదకొండవ యేట షవ్వాల్ నెలలో వివాహమాడారు. అంటే హజ్రత్ సౌదా (రదియల్లాహు అన్హా) ను వివాహం చేసుకున్న ఒక సంవత్సరం తరువాత, హిజ్రత్ కంటే రెండు సంవత్సరాల అయిదు నెలలకు ముందు అన్నమాట. అప్పుడు ఆమె వయస్సు ఆరు సంవత్సరాలు. హిజ్రత్ తరువాత ఏడు నెలలకు షవ్వాల్ నెల, హిజ్రీ శకం ఒకటిలో ఆమెను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు పంపించడం జరిగింది. అప్పుడు ఆమె వయస్సు తొమ్మిది సంవత్సరాలు, ఆమె అప్పుడు కన్య. ఆమెను తప్ప మరే కన్యను మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివాహం చేసుకోలేదు. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు అతిప్రియమైన సతీమణి. సమాజంలోని స్త్రీలందరికంటే ఆమె ఒక్కరే ధర్మజ్ఞానం కలిగిన విద్యావంతురాలు.

4. హజ్రత్ హఫ్సా బిన్తె‌ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హా)

ఈమె మొదటి భర్త కనీస్ బిన్ హుజాఫా సహమి (రదియల్లాహు అన్హు) . ఈయన బద్ర్ మరియు ఉహద్ యుద్దాల మధ్యకాలంలో చనిపోవడం వలన హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హా) వితంతువు అయ్యారు. ఆ తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెను వివాహమాడారు. ఇది హిజ్రీశకం మూడవ సంవత్సరం నాటి మాట.

5. హజ్రత్ జైనబ్ బిన్తె‌ కజీమా (రదియల్లాహు అన్హా)

ఈమె బనూ హిలాల్ బిన్ ఆమిర్ సఅసఆ తెగవారు. నిరుపేదలపై ఆమె చూపే ప్రేమానురాగాలు, దయాదాక్షిణ్యాల కారణంగా ఆమె ఉమ్ముల్ మసాకీన్ (నిరు పేదల తల్లి)గా ప్రఖ్యాతిగాంచారు. ఈమె హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ హజష్ కు భార్య. ఆయన ఉహద్ యుద్ధంలో అమరగతి నొందిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెను వివాహమాడారు. కేవలం ఎనిమిది నెలలు మాత్రమే భార్యగా ఉండి మరణించారు.

6. హజ్రత్ ఉమ్మె సల్మా బిన్తె‌ అబీ ఉమయ్యా (రదియల్లాహు అన్హా)

ఈమె క్రితం అబూ సల్మాకు భార్యగా ఉండేవారు. హి.శ.4, జమా దిల్ ఆఖిరా నెలలో హజ్రత్ అబూ సల్మా (రదియల్లాహు అన్హు) చనిపోయిన తరువాత అదే సంవత్సరం షవ్వాల్ నెలలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈమెను వివాహమాడారు.

7.జైనబ్ బిన్తె జహష్ బిన్ రియాబ్ (రదియల్లాహు అన్హా)

ఈమె బనూ అసద్ బిన్ కజీమా కుటుంబానికి సంబంధించిన వారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు మేనత్త కూతురు కూడా. ఈమె వివాహం మొదట జైద్ బిన్ హారిసా (రదియల్లాహు అన్హు) తో జరిగింది. ఈయన్ను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి కుమారుడుగా తలచడం జరిగేది. కాని హజ్రత్ జైద్ (రదియల్లాహు అన్హు) తో ఆమెకు పొసగలేదు. జైద్(రదియల్లాహు అన్హు) ఆమెకు తలాక్ ఇచ్చారు. ఇద్దత్ గడువు పూర్తి అయిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను సంబోధిస్తూ దివ్యఖుర్ఆన్ లో ఈ ఆయత్ అవతరించింది:

 فَلَمَّا قَضَى زَيْدٌ مِنْهَا وَطَرًا زَوَّجْنَاكَهَا

జైద్ ఆమెతో తన అవసరం పూర్తి చేసుకున్న తరువాత మేము ఆమెను ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) భార్యగా చేశాము.” (ఖుర్’ఆన్ 33:337)

ఆయనకు సంబంధించే అహ్జాబ్ సూరాలో మరిన్ని ఆయత్ లు అవతరించాయి. ఆ ఆయత్ లలో దత్తపుత్రునికి సంబంధించి ఖచ్చితమైన తీర్పు ఇవ్వడం జరిగింది- వివరాలు ముందు రాబోతున్నాయి- హజ్రత్ జైనబ్ (రదియల్లాహు అన్హా) తో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివాహం హి.శ. 5, జీకాదా మాసంలో లేదా అంతకంటే కొంచెం ముందుగా జరిగింది.

8. జువైరియా బిన్తె హారిస్ (రదియల్లాహు అన్హా)

ఈమె తండ్రిగారు ఖుజాఅ తెగకు చెందిన బనుల్ ముస్తలిక్ సర్దారు. హజ్రత్ జువైరియా (రదియల్లాహు అన్హా) బనూ ముస్తలిక్ ఖైదీల వెంట బందీ అయివచ్చినవారు. బందీల పంపకం జరిగేటప్పుడు ఈమె సాబిత్ బిన్ కైస్ బిన్ షమాస్ (రదియల్లాహు అన్హు) గారి భాగానికి వచ్చారు. ఆయన, ఆమెతో, ఓ ధనరాశికి బదులు స్వతంత్రురాలుగా చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమె తరఫున ఆ మొత్తాన్ని కట్టి విడిపించి వివాహం చేసుకున్నారామెను. ఇది హి.శ. 5 లేదా 6, షాబాన్ నెలలో జరిగిన సంఘటన.

9. ఉమ్మె హబీబా రమలా బిన్తె‌ అబీ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హా)

ఈమె మునుపు ఉబైదుల్లాహ్ బిన్ హజష్ వివాహబంధంలో ఉన్న మహిళ. అతని వెంట హిజ్రత్ చేసి అబీసీనియాకు కూడా వెళ్ళారు. కాని ఉబైదుల్లాహ్ అక్కడకు వెళ్ళిన తరువాత ధర్మభ్రష్టుడై క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు. అక్కడే చనిపోయాడు. అయితే ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా) మాత్రం ఇస్లామ్ ధర్మంపై స్థిరంగా ఉండిపోయారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), హిజ్రీ శక సంవత్సరం 7లో, అమ్రూ బిన్ ఉమయ్యా జమ్రికు లేఖ ఇచ్చి నజాషీ వద్దకు పంపారు. ఆ లేఖలో ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా) తో తమ నికాహ్ చేయమని కూడా రాశారు. నజాషీ, ఉమ్మె హబీబా స్వీకారంతో ఆమె నికాహ్ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో చేసివేశాడు. షుర్జీల్ బిన్ హస్నా వెంట ఆమెను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు పంపించడం జరిగింది.

10. హజ్రత్ సఫియ్యా (రదియల్లాహు అన్హా) బిన్తె‌ హుయ్ బిన్ అక్తబ్

వీరు బనీ ఇస్రాయీల్ (యూదుల)కు చెందినవారు. ఖైబర్ యుద్ధం సందర్భంగా పట్టుబడి బందీగా వచ్చినవారు. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెను తన కోసం ఎంచుకొని స్వతంత్రురాలుగా చేసి వివాహమాడారు. ఇది ఖైబర్ విజయం హి.శ. 7 తరువాతి సంఘటన.

11. హజ్రత్ మైమూనా బిన్తె హారిస్ (రదియల్లాహు అన్హా)

ఈమె ఉమ్ముల్ ఫజ్ల్  లుబాబా బిన్తె హారిస్ సోదరి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెను హిజ్రీ శక సంవత్సరం, జీకాదా నెలలో ఉమ్రయె కజా పూర్తి చేసి – ప్రామాణికమైన కథనం ప్రకారం, ఇహ్రామ్ నుండి హలాల్ అయిన తరువాత – వివాహమాడారు.

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివాహమాడిన సతీమణుల సంఖ్య ఇలా పదకొండుకు చేరింది. వీరిలో ఇద్దరు హజ్రత్ ఖదీజా (రదియల్లాహు అన్హా) మరియు ఉమ్ముల్ మసాకీన్ హజ్రత్ జైనబ్ (రదియల్లాహు అన్హా) ఇద్దరూ ఆయన జీవించి ఉండగానే పరమపదించారు. మిగతా తొమ్మండుగురు సతీమణులు ప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) మరణం తరువాత కూడా జీవించే ఉన్నారు.

వారే కాకుండా, ఆయనతో సంసారం చేయని మరిద్దరు మహిళలున్నారు. వారిలో ఒకరు బనూ కిలాబ్ కు చెందిన మహిళ అయితే మరొకరు ‘కిందా’ తెగకు చెందినవారు. ఈ కిందా తెగ మహిళే ‘జోనియా’గా పిలువబడతారు. వీరితో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివాహం జరిగిందా లేదా? వారి వంశ వృక్షం ఏమిటీ అనే విషయంలో సీరత్ చరిత్రకారుల నడుమ భేదాభిప్రాయాలున్నాయి. ఆ వివరాలేమిటో తెలిపే అవసరం ఇక్కడ లేదని అనుకుంటున్నాము.

ఇక స్త్రీ బానిసల విషయానికి వస్తే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గర ఇద్దరు స్త్రీ బానిసలు ఉండేవారని తెలుస్తోంది. వారిలో ఒకరు ‘మారియ కబ్తియా(రదియల్లాహు అన్హా) ‘. ఈమెను ఈజిప్టు చక్రవర్తి మకూకస్ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు కానుకగా సమర్పించాడు. ఆమె గర్భాన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కుమారుడు ఇబ్రాహీం జన్మించారు. ఆయన బాల్యంలోనే హిజ్రీ శక సంవత్సరం 10, షవ్వాల్ నెల 28 లేక 29వ తేదీ (క్రీ.శ. జనవరి 27, 632)న మదీనాలో మరణించారు.  మరో బానిస స్త్రీ రైనా బిన్తె జైద్ (రదియల్లాహు అన్హా) . ఈమె యూదుల తెగ బనీ నజీర్ లేదా బనూ కురైజాకు చెందినవారు: ఈమె బనూ కురైజా ఖైదీల్లో ఉండగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెను తన కోసం ఎంపిక చేసుకొని తన దగ్గర ఉంచుకున్నారు.

కొందరు పరిశోధకులు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెను బానిసగా కాకుండా స్వతంత్రురాలిగా చేసి వివాహమాడారని తలుస్తారు. కాని ఇబ్నె ఖైమ్ దృష్టిలో మొదటిదే సరిఅయినది. అబూ ఉబైదా (రదియల్లాహు అన్హా), ఈ ఇద్దరు స్త్రీ బానిసలే కాకుండా మరిద్దరు స్త్రీ బానిసల గురించి చెప్పారు. ఆ ఇద్దరిలో ఒకరి పేరు జమీలా. ఈమె ఏదో ఒక యుద్ధంలో బందీ అయి వచ్చారు. మరొకరు ఎవరో ఓ స్త్రీ బానిస. ఆమెను హజ్రత్ జైనబ్ బిన్తె హజష్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు బహూకరించారు.’ [చూడండి, జాదుల్ మఆద్-1/29]

ఇక్కడి వరకు చెప్పుకున్న తరువాత మనం కొంచెం సేపు ఆగి, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)గారి జీవితానికి సంబంధించిన మరో పార్శ్వాన్ని స్పృశించ వలసిన అవసరం ఉంది. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), లైంగిక శక్తి సమృద్ధిగా ఉన్న యవ్వన దశలోనే అంటే ముప్పై ఏండ్ల ప్రాయంలోనే ఒకే భార్యతో తృప్తిపడుతూ గడిపేశారు. ఆ భార్య కూడా దాదాపు వృద్ధాప్య దశకు చేరుకున్న భార్యే. అంటే మొదట ఖదీజా (రదియల్లాహు అన్హా) ఆ తరువాత హజ్రత్ సౌదా (రదియల్లాహు అన్హా) లు మాత్రమే. అయితే, ఆయన(సల్లల్లాహు అలైహి వ సల్లం) వృద్ధాప్య దశకు చేరిన తరువాత హఠాత్తుగా ఒక వివాహం తరువాత మరొకటిగా తొమ్మిది వివాహాలు చేసుకోవడానికి ఆయనలో లైంగిక శక్తి అంతగా పెరిగిపోయిందన్న భావన ఏ విధంగా చూసినా సరియైన భావనేనా? కాదు. అలా జరగడానికి వీల్లేదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి యవ్వన దశ మరియు వృద్ధాప్య దశ రెంటిపై దృష్టిని సారించిన తరువాత ఏ వివేకవంతుడైనా అలాంటి భావన సరియైనది కాదు అని ఒప్పుకుంటాడు. యదార్థం ఏమిటంటే, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇన్ని వివాహాలు, మరేవో అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేసుకున్నవే. ఈ వివాహాలు సాధారణ వివాహాలలో ఉండే నిర్ణీత ఉద్దేశ్యాలకంటే ఎంతో ఉన్నతమైనవి. ఇప్పుడు మనం ఆ ఉద్దేశ్యాలను కొద్దిగా తరచి చూద్దాం .

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) , హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హా) లను వివాహ మాడి, హజ్రత్ అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) , హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) లతో ఏ వియ్యాన్ని అయితే అందుకున్నారో, అలాగే హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) కు హజ్రత్ రుకయ్యా (రదియల్లాహు అన్హా), హజ్రత్ ఉమ్మె కుల్సూమ్ (రదియల్లాహు అన్హా) లను ఒకరి తరువాత ఒకరినిచ్చి, హజ్రత్ అలి (రదియల్లాహు అన్హు) గారికి తన ముద్దుల కుమార్తె హజ్రత్ ఫాతిమానిచ్చి పెళ్ళి చేసి ఏ వియ్యాన్ని అయితే అందుకున్నారో, ఆ వివాహాల ఉద్దేశ్యం, ఆ నలుగురు మహా పురుషులతో తన సంబంధాలను పటిష్ఠపర్చుకోవడమే. ఈ నలుగురూ గడ్డు సమయాల్లో ఇస్లామ్ కోసం త్యాగం చేసిన మహామహులు. వారి ప్రత్యేకత ఏమిటో మనందరికీ తెలిసిందే.

అరబ్బు ఆచారం ప్రకారం, వియ్యపు బంధుత్వం ఎంతో గౌరవమైన దృష్టితో చూడబడుతుంది. వారి దృష్టిలో అల్లుని బంధుత్వం అంటే, వివిధ తెగల నడుమ దగ్గరి సంబంధానికి పునాదిలాంటిది. అల్లునితో యుద్ధం చేయడం సిగ్గుచేటు. ఈ సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకొని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరికొన్ని వివాహాలు చేసుకోవలసి వచ్చింది. ఉద్దేశ్యం, వివిధ వ్యక్తులు, వివిధ తెగల శత్రుత్వాన్ని నీరుగార్చడం. వారిలో అప్పటి వరకు రగులుకుంటున్న ద్వేషాగ్ని కీలలను ఆర్పివేయడం. హజ్రత్ ఉమ్మె సల్మా (రదియల్లాహు అన్హా) బనీ మక్జూమ్ తెగకు చెందిన మహిళ. ఈ తెగ అబూ జహల్ మరియు ఖాలిద్ బిన్ వలీలకు చెందిన తెగ. మహాప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెతో వివాహమాడగా, ఇదివరకు ఉహద్ యుద్ధంలో ఖాలిద్ బిన్ వలీద్ ప్రదర్శించిన కఠిన వైఖరి కాస్తా చల్లారిపోయింది. కాగా, కొన్ని రోజుల అనంతరం ఆయన తన ఇష్ట పూర్తిగా ఇస్లామ్ ధర్మాన్ని స్వీకరించారు. అలాగే అబూ సుఫ్యాన్ కుమార్తె ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా) ను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివాహమాడారు. ఆ తరువాత అబూ సుఫ్ యాన్ ఇక మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఎదురుబడలేదు.

హజ్రత్ జువైరియా, హజ్రత్ సఫియ్యా (రదియల్లాహు అన్హా) లు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు సతీమణు లైన తరువాత బనూ ముస్తలిక్ మరియు బనీ నజీర్ తెగలు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో యుద్దాలు మానేశారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ ఇద్దరు మహిళలను పెళ్ళాడిన తరువాత చరిత్రలో ఈ రెండు తెగలు ఎలాంటి పోరాటాలకుగాని, కుట్రలకు గాని దిగినట్లు ఆధారాలు లభించవు. పైగా, హజ్రత్ జువైరియా (రదియల్లాహు అన్హా) తన జాతి స్త్రీలకంటే శుభాలనుగొని తెచ్చారు. అది ఎలాగంటే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెతో వివాహమాడగా, సహాబా (రదియల్లాహు అన్హుమ్) ఆమె తెగకు చెందిన వంద కుటుంబాలను, “వీరంతా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి అత్తవారి కుటుంబానికి చెందినవారు” అంటూ చెర నుండి విడుదల చేశారు. అలా వారి మనస్సులపై పడిన ప్రభావం ఎలాగుండిందో మనం అర్థం చేసుకోవచ్చు.

అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటంటే, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఓ అనాగరిక జాతికి శిక్షణ గరిపి, దాని హృదయాన్ని ప్రక్షాళన చేసి ఆ జాతి వారికి సభ్యతా సంస్కారాలు నేర్పడానికి దైవం తరఫున నియమించబడిన మహా మనిషి. అప్పటివరకు ఈ జాతి నాగరికత, సభ్యతా సంస్కారాలు, సామాజిక కట్టుబాట్లు, సత్సమాజ నిర్మాణంలో పాల్గొనే బాధ్యతలు ఏవో తెలియని జాతి. ఇస్లామీయ సమాజ నిర్మాణం ఏ సూత్రాల పైన అయితే నిర్మించవలసి ఉండిందో, ఆ నిర్మాణ కార్యక్రమంలో స్త్రీ పురుషుల కలివిడికి ఏ మాత్రం వీలులేదు.

కాబట్టి అలా కలివిడి లేని సూత్రాలను అవలంబిస్తూ స్త్రీలకు నేరుగా శిక్షణ గరపడానికి వీలుండదు. విద్యావికాసాలు గరపడం, వారిని సుశిక్షితులుగా చేసే అవసరం పురుషులకు తోడు స్త్రీలకు కూడా అంతే ముఖ్యమైనది. ఇంకా చెప్పాలంటే ఆ అవసరం పురుషులకంటే అధికమే.

పల్లెల్లో, నగరాల్లో నివసించే అన్ని రకాల వయస్సు కలిగిన మహిళలకు శిక్షణ గరపడం, వారికి ధర్మశాస్త్ర ఆదేశాలను ఎరుకపర్చడం, వారిలో విద్యా బుద్ధులను వ్యాపింపజేసి వారి హృదయాల నుండి అజ్ఞానపు అంధకారాన్ని పోగొట్టడం మరియు వారిలో ధర్మజ్ఞాన ప్రచారాన్ని చేబట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ కారణం చేత, ఆ లక్ష్యసాధన కోసం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం)కు రకరకాల వయస్సులు, వివిధ రకాల సామర్థ్యాలు కలిగిన మహిళలను ఎంపిక చేసుకునే అవసరం ఎంతైనా ఉండింది.

కాబట్టి ప్రవక్త మహనీయుల ప్రైవేటు జీవితానికి సంబంధించిన విషయాలను కూడా ముస్లిం సమాజం ముందు పెట్టే ఘనత చాలా మట్టుకు ముస్లిముల మాతృమూర్తులు అయిన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సతీమణులకే దక్కిందన్న విషయం మనం గ్రహించగలం. ముఖ్యంగా అధిక కాలం వరకు జీవించిన హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారికి ఆ క్రెడిట్టు దక్కుతుంది. ఈమె దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ప్రతి కదలికను, ప్రతి ప్రవచనాన్ని ఉల్లేఖించినవారు.

ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేసుకున్న వివాహాల్లో ఒక వివాహం, అప్పటి మూఢ ఆచారాన్నొకదాన్ని చెరిపివేయడానికి అమలులోనికి వచ్చింది. ఆ మూఢాచారం అరబ్బు సమాజంలో తాతముత్తాతల కాలం నుండి రివాజులో ఉండి బాగా ముదిరి పోయిన ఆచారం. ఇది ఒకరిని దత్తపుత్రునిగా చేసుకునే ఆచారం. అజ్ఞాన కాలంలో దత్తపుత్రునికి, సొంత కుమారునికి ఉండే హక్కులన్నీ ఉండేవి. ఈ ఆచారం, సంప్రదాయం అరబ్బు సమాజం నుండి చెరిపివేయలేనంతగా వ్రేళ్ళూనుకొని ఉంది. ఆ కాలంలో. అయితే ఈ మూఢా చారం, ఈ అజ్ఞానపు సంప్రదాయం , ఇస్లామ్ ప్రవేశ పెట్టిన నికాహ్, తలాక్, వారసత్వం మరియు ఇతర సిద్ధాంతాలు, సూత్రాలకు పూర్తిగా భిన్నమైన ఆచారం. అదేకాకుండా అజ్ఞాన కాలంనాటి ఈ సంప్రదాయాన్ని మట్టు పెట్టడం ఇస్లామ్ ధర్మం యొక్క ప్రథమ లక్ష్యం కూడా. అందుకని దీన్ని చెరిపి వేయడానికి అల్లాహ్ తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివాహం హజ్రత్ జైనబ్ బిన్తె జహష్ తో చేయడం జరిగింది. హజ్రత్ జైనబ్ (రదియల్లాహు అన్హా) మొదట హజ్రత్ జైద్ (రదియల్లాహు అన్హు) కు భార్యగా ఉండేవారు. ఈయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు దత్తపుత్రుడు. అయితే, ఆ భార్యాభర్తల నడుమ పొసగని కారణంగా హజ్రత్ జైద్ (రదియల్లాహు అన్హు) ఆమెకు తలాక్ (విడాకులు) ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దైవతిరస్కారులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు వ్యతిరేకంగా అహ్జాబ్ యుద్ధానికి (అగడ్త యుద్ధానికి) సిద్ధపడుతున్న కాలమది.

ఇటు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు దైవం తరఫున దత్తత ఆచారాన్ని అంతమొందించే సూచనలు అందుతున్నాయి. ఆ కారణంచేత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ గడ్డు పరిస్థితిలో హజ్రత్ జైద్(రదియల్లాహు అన్హు) తన భార్యకు తలాక్ గనకా ఇస్తే, ఆ తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్రత్ జైనబ్ ను వివాహమాడినట్లయితే మునాఫిక్ లు, బహుదైవారాధకులు, యూదులు అందరూ దాన్ని ఆసరాగా చేసుకొని, ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభిస్తారు. అమాయక ముస్లింలను రకరకాల అనుమానాలకు గురిచేసి వారిపై చెడు ప్రభావాలు పడేటట్లు చేస్తారేమో అనే ఆశంక తలెత్తింది. కాబట్టి, అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రయత్నం అంతా, హజ్రత్ జైద్ (రదియల్లాహు అన్హు) తన భార్యకు విడాకులు ఇవ్వకుండా ఉండాలన్నదే.

కాని అల్లాహ్ కు ఈ ధోరణి నచ్చలేదు. ఆయన తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు హెచ్చరిక చేస్తూ ఈ క్రింది ఆయత్ ను అవతరింపజేశాడు.

وَإِذْ تَقُولُ لِلَّذِي أَنْعَمَ اللَّهُ عَلَيْهِ وَأَنْعَمْتَ عَلَيْهِ أَمْسِكْ عَلَيْكَ زَوْجَكَ وَاتَّقِ اللَّهَ وَتُخْفِي فِي نَفْسِكَ مَا اللَّهُ مُبْدِيهِ وَتَخْشَى النَّاسَ وَاللَّهُ أَحَقُّ أَن تَخْشَاهُ

ఓ ప్రవక్తా! అల్లాహ్, ఏ వ్యక్తికి మేలుచేశాడో ఆ వ్యక్తితో నీవు, నీ భార్యను విడిచి పెట్టకు, అల్లాహ్ కు భయపడు’ అని అంటున్న సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు నీవు బయట పెట్టదలచిన విషయాన్ని నీ మనస్సులో దాచి ఉంచావు. నీవు ప్రజలకు. భయపడుతున్నావు. వాస్తవానికి భయపడడానికి అల్లాహ్ యే ఎక్కువ హక్కుదారుడు.” (అల్ అహ్ జాబ్ 33 : 37)

ఎలాగైతేనేమి హజ్రత్ జైద్ (రదియల్లాహు అన్హు) , జైనబ్ (రదియల్లాహు అన్హా) కు తలాక్ ఇచ్చేశారు. ఆమె ఇద్దత్ గడువు పూర్తి అయిన తరువాత ఆమెతో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివాహానికి ఆదేశం అవతరించింది. ఈ ఆయత్ లో అల్లాహ్ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ నికాహ్ నిర్బంధంగా చేసుకోవాలని ఆదేశించాడు. ఆ ఆయత్ ఇలా ఉంది:

فَلَمَّا قَضَىٰ زَيْدٌ مِّنْهَا وَطَرًا زَوَّجْنَاكَهَا لِكَيْ لَا يَكُونَ عَلَى الْمُؤْمِنِينَ حَرَجٌ فِي أَزْوَاجِ أَدْعِيَائِهِمْ إِذَا قَضَوْا مِنْهُنَّ وَطَرًا

తరువాత జైద్ ఆమె విషయంలో తన అవసరాన్ని పూర్తి చేసుకున్నప్పుడు, మేము ఆమె (విడాకులు పొందిన స్త్రీ)తో నీకు వివాహం జరిపించాము. విశ్వాసులకు తమ దత్తపుత్రుల భార్యల విషయంలో, వారు తమ భార్యలకు సంబంధించిన తమ అవసరాన్ని పూర్తి చేసుకున్నప్పుడు ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు.” (33 : 37)

దీని ఉద్దేశ్యం ఏమిటంటే, దత్తపుత్రులకు సంబంధించిన అజ్ఞానపు ఆచారం, అంతకు పూర్వం అవతరించిన ఈ క్రింది ఆదేశాల ద్వారా అంతం చేసినట్లే కార్యరూపంగా అంతమొందించడం.

ادْعُوهُمْ لِآبَائِهِمْ هُوَ أَقْسَطُ عِندَ اللَّهِ

దత్తపుత్రులను వారి తండ్రులతో ఉన్న సంబంధం ప్రకారం పిలవండి. ఇది అల్లాహ్ దృష్టిలో ఎంతో న్యాయసమ్మతమైన విషయం.” (అల్  అహ్ జాబ్ 33 : 5)

مَّا كَانَ مُحَمَّدٌ أَبَا أَحَدٍ مِّن رِّجَالِكُمْ وَلَٰكِن رَّسُولَ اللَّهِ وَخَاتَمَ النَّبِيِّينَ

(మానవులారా!) ముహమ్మద్ మీలోని ఏ పురుషునికీ తండ్రి కారు. కాని ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త. దైవప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరివారు.”(అల్  అహ్ జాబ్ 33:40)

ఈ సందర్భంగా ఓ విషయాన్ని మనం గమనించాల్సి ఉంది. ఒక సమాజంలో ఏదైనా దుస్సంప్రదాయం లేదా దురాచారం బాగా వేళ్ళూను కొనిపోతే, కేవలం మాటల ద్వారా దాన్ని చెరిపివేయలేం. లేదా ఆ ఆచార సంప్రదాయాల్లో మార్పు తీసుకురావడం సాధ్యపడదు. ఏ వ్యక్తి అయితే దాన్ని తుడిచివేయడానికి కంకణం కట్టుకుంటాడో లేదా వాటిలో మార్పులు తెచ్చే కృషి చేస్తాడో, ఆ వ్యక్తి చేతలు కూడా దానికి తగిన విధంగా ఉండడం అవసరం. “హుదైబియా ఒప్పందం” సందర్భంగా ముస్లిముల వైఖరి ద్వారా ఆ యదార్థం మరింత తేటతెల్లం అవుతుంది. ‘ఉర్వా బిన్ మస్ఊద్ సకఫీ’ హుదైబియాకు వచ్చినప్పుడు ముస్లిముల సమర్పణ త్యాగనిరతి ఎలాంటిదో చూసి ఉన్నాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉమ్మి వేసినప్పుడు అది సహాబాల (రదియల్లాహు అన్హా) చేతుల్లో పడుతోంది. వారు దాన్ని అందుకోవడానికి, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వుజూ చేయగా క్రింద ఒలుకుతున్న నీటిని అందుకోవడానికి ఎగబడుతున్నారు. అవును! ఈ సహాబాలే ఆ చెట్టు క్రింద మరణాన్నయినా కొనితెచ్చుకుంటామని ప్రవక్త చేతుల మీద ప్రమాణం చేయడానికి తొందరపడుతున్నారు. వీరంతా ఎవరు? వారు హజ్రత్ ‘అబూబక్ర్(రదియల్లాహు అన్హు) , హజ్రత్ ఉమర్(రదియల్లాహు అన్హు) లాంటి త్యాగధనులు.

కానీ ఆ సహాబాల(రదియల్లాహు అన్హుమ్) ను – ఎవరైతే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై తమ ప్రాణాలను సైతం అర్పించడం అదృష్టం అనుకుంటూ ఉండేవారో- ఒప్పందం కుదిరిన తరువాత, తమ తమ హదీ పశువుల్ని జిబహ్ చేయమని ఆదేశించగా వారిలో ఏ ఒక్కరూ తమ స్థానం నుంచి కదలలేదు. చివరికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు బాధ  కూడా కలిగింది. పిదప ఆయన సతీమణి హజ్రత్ ఉమ్మె సల్మా(రదియల్లాహు అన్హా) , మీరే లేచి నా పశువులను జిబహ్ చేయండి అనే సలహా ఇచ్చారు. ఆ సలహాను పాటిస్తూ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తమ ఖుర్బానీ పశువులను జిబహ్ చేసేశారు. అప్పుడు ప్రతి సహాబీ(రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అనుసరించడానికి పరుగులు పెట్టనారంభించాడు. సహాబాలంతా తమ తమ పశువులను జిబహ్ చేసేశారు. ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తోందేమిటంటే, బాగా వ్రేళ్ళునుకొని పోయిన దురాచారాలను రూపుమాపాలంటే మాటలకు, చేతలకు ఉన్న ప్రభావంలో ఎంత తేడా ఉందనేదే. కాబట్టి దత్తత తీసుకునే అజ్ఞాన కాలపు ఆచారాన్ని అంతం చేయడానికిగాను మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన దత్తపుత్రుడు జైద్ (రదియల్లాహు అన్హు) విడాలికులిచ్చిన భార్యతో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివాహం జరిపించడం జరిగింది.

ఈ నికాహ్ జరగగానే మునాఫిక్ లు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దుష్ప్రచారాల దుమారాలు లేపడం మొదలెట్టారు. రకరకాల దుష్ట ఆలోచనలను, అపోహల్ని వ్యాపింపజేశారు. వాటి ప్రభావాలు ఎంతో కొంత అమాయక ముస్లిములపై కూడా పడ్డాయి. ఈ ప్రాపగండాను బలపరచడానికి మరో షరయీ (ధర్మశాస్త్ర సంబంధమైన) అవకాశం మునాఫిక్ ల చేతికి చిక్కింది. అదేమిటంటే, హజ్రత్ జైనబ్ (రదియల్లాహు అన్హా) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఐదవ భార్య కావడం. అప్పటికే ముస్లిములకు నల్గురు భార్యలే ధర్మసమ్మతం అన్న విషయం తెలుసు. అదంతా ఒక ఎత్తు అయితే ఈ దుష్ప్రచారానికి ప్రాణంలాంటి విషయం , అప్పటి వరకు హజ్రత్ జైద్ (రదియల్లాహు అన్హు) , దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు కుమారునిగానే తలచబడడం. ఆ కుమారుని భార్యతో నికాహ్ చేసుకోవడం అప్పటి ఆచారాల ప్రకారం వ్యభిచారంగా తలచబడడం. చివరకు అల్లాహ్ అహ్జాబ్ సూరాలో ఈ రెండు విషయాల గురించి ఆయతులు అవతరింప జేయవలసి వచ్చింది. ఆ దైవవాణి అవతరణ జరిగిన తరువాత, సహాబా(రదియల్లాహు అన్హుమ్) కు, ఇస్లామ్ ధర్మంలో దత్తపుత్రునికి ఎలాంటి విలువ లేదు అని, అల్లాహ్ కొన్ని ఉన్నతమైన, ప్రత్యేకమైన ఉద్దేశ్యాల సాధన కోసం తన ప్రవక్తకు ప్రత్యేకంగా, భార్యల సంఖ్య విషయంలో ఇతరులెవరికీ ఇవ్వనటువంటి అనుమతిని ఒసిగాడన్న విషయం తెలిసిపోయింది.

ఉమ్మహాతుల్ మోమినీన్ (విశ్వాసుల మాతృమూర్తులైన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సతీమణులు) ఎడల దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేసిన సంసారం తీరు ఎంతో గౌరవ ప్రదమైనది, ఉన్నతమైనది మరియు ఎంతో మర్యాదతో కూడుకున్నదిగా ఉండేది. దుర్భరమైన దారిద్య్రంను అనుభవిస్తూ, ఎంతో గడ్డు జీవితాన్ని గడుపుతున్నప్పటికీ, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సతీమణులు కూడా తమ దాంపత్య హక్కులను నిర్వర్తిస్తూ, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎడల ఎంత గౌరవంగా, సమ్మతంగా, తృప్తిగా, మర్యాదగా, సహనంగా, సేవా తత్పరత తో మెలిగేవారు. ఈ గడ్డు పరిస్థితులను సహించడం మరొకరి వల్ల అయ్యేది కాదు. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హా) ఓ ఉల్లేఖనంలో, “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), తాము పరమపదించే వరకు మైదా పిండితో చేసిన రొట్టె తినడం గాని, నా కళ్ళతో (ఆయన ఇంట) వేయించిన మేకను చూడడంగాని జరగలేదు” అని చెప్పారు. [సహీహ్ బుఖారి -2/956]

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి ఉల్లేఖనం ఇలా ఉంది: “అలా పస్తులతో రెండు నెలలు గడిచిపోయి మూడో నెల నెలవంక అగుపడే వరకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంట పొయ్యే వెలగకపోయేది.” హజ్రత్ ఉర్వా (రదియల్లాహు అన్హు) ఆమెతో, “మరి మీరు ఏమి తినేవారు?” అని అడగగా, ఆమె, “కేవలం రెండు నల్లని పదార్థాలు. అంటే ఖర్జూరం మరియు నీరు.” [సహీహ్ బుఖారి-2/956]. దీనికి సంబంధించిన హదీసులు అనేకం ఉన్నాయి.

ఇంత గడ్డు పరిస్థితులు చోటుచేసుకొని ఉన్నప్పటికీ, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సతీమణులచే విమర్శకు గురిఅయ్యే ఏ పొరపాటూ జరగలేదు – కేవలం ఓసారి, అది కూడా మానవ బలహీనతల కారణంగా ఓ పొరపాటు తప్ప. ఈ పొరపాటును ఆధారంగా చేసుకొని కొన్ని ఆదేశాలు ఇవ్వవలసి ఉన్నందున అది జరిగిపోయింది. కాబట్టి అల్లాహ్ ఈ సందర్భంగా వారిని ఇలా హెచ్చ రించాడు:

يَا أَيُّهَا النَّبِيُّ قُل لِّأَزْوَاجِكَ إِن كُنتُنَّ تُرِدْنَ الْحَيَاةَ الدُّنْيَا وَزِينَتَهَا فَتَعَالَيْنَ أُمَتِّعْكُنَّ وَأُسَرِّحْكُنَّ سَرَاحًا جَمِيلًا وَإِن كُنتُنَّ تُرِدْنَ اللَّهَ وَرَسُولَهُ وَالدَّارَ الْآخِرَةَ فَإِنَّ اللَّهَ أَعَدَّ لِلْمُحْسِنَاتِ مِنكُنَّ أَجْرًا عَظِيمًا

ఓ ప్రవక్తా! నీ భార్యలతో ఇలా అను; ఒకవేళ మీరు ప్రాపంచిక జీవితాన్నీ, దాని శోభనూ కోరుతూ ఉన్నట్లయితే, రండి, నేను మీకు ఎంతో కొంత ఇచ్చివేసి మంచి పద్ధతి ప్రకారం సాగనంపుతాను. కాని ఒకవేళ మీరు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను, పరలోక నివాసాన్ని కోరుతూ ఉన్నట్లయితే తెలుసుకోండి, మీలోని పుణ్యవతుల నిమిత్తం అల్లాహ్ గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు.”(అల్  అహ్ జాబ్ 33 : 28,29)

ఇక పరిశుద్ధ సతీమణుల ఔన్నత్యాన్ని కూడా అంచనా వేయండి. వారంతా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కే ప్రాధాన్యత ఇచ్చారు. వారిలో ఏ ఒక్కరూ ప్రాపంచిక సుఖభోగాల వైపునకు కన్నెత్తయినా చూడలేదు. ఇలాగే సవతుల నడుమ ప్రతి రోజు కొన్ని మనస్పర్ధలు ఏర్పడుతూనే ఉంటాయి. కాని సవతుల సంఖ్య అధికమైనప్పటికీ అలాంటి సంఘటన జరగడం ఎప్పుడో ఒకప్పుడు చోటుచేసుకోవడం జరిగింది. అది కూడా మానవ బలహీనతల కారణంగానే. ఆ పొరపాటును అల్లాహ్ ఎత్తిచూపి వారిని హెచ్చరించినందున ఆ తరువాత అలాంటిది మరేదీ జరగలేదు. ఖుర్ఆన్ లోని తహ్రీమ్ సూరా మొదటి అయిదు ఆయత్ లలో ఆ విషయమే చెప్పడం జరిగింది.

చివరగా, ఈ సందర్భంలో, బహుభార్యత్వం గురించి చర్చించే అవసరం లేదని అనుకుంటున్నాము. ఎందుకంటే దీన్ని అందరికంటే అతిగా విమర్శించే వారు ఐరోపా వారే. వారు ప్రస్తుతం ఏ రకమైన జీవితాన్నయితే గడుపుతున్నారో, మరే దురదృష్టకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారో మనకు తెలుసు. బహుభార్యత్వ సిద్ధాంతాన్ని కాదని వారెలాంటి బాధలను కష్టాలను ఎదుర్కొంటున్నారో దాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ఇక ఈ విషయాన్ని చర్చించే అవసరమే లేదని చెప్పడం సరిపోతుంది. పాశ్చాత్య సమాజపు దురదృష్టకర నికృష్ట జీవితం, బహుభార్యత్వ సిద్ధాంతం సత్యంపై ఆధారపడి ఉందనడానికి నిదర్శనం. వివేకుల కోసం ఇందులో గొప్ప గుణపాఠమూ ఉంది.


ఇది క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:  [లింక్ క్లిక్ చేసి పూర్తి పుస్తకం చదవవచ్చు]

మహా ప్రవక్త జీవిత చరిత్ర: అర్రహీఖుల్‌ మఖ్ తూమ్ (పూర్తి పుస్తకం)
https://teluguislam.net/2020/01/25/seerah-arraheeq-al-makhtoum/
షేఖ్ సఫియుర్  రహ్మాన్ ముబారక్ ఫూరి


ఇతరములు:

అల్లాహ్ అంటే ఎవరు? ఇస్లాం అంటే ఏమిటి? [ఆడియో & టెక్స్ట్]

అల్లాహ్ అంటే ఎవరు? ఇస్లాం అంటే ఏమిటి?
https://youtu.be/e6YALKM5wwU [33 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, అల్లాహ్ యొక్క ఏకత్వం, ఆయన గుణగణాలు మరియు సృష్టిలో ఆయన పాత్ర గురించి వివరించబడింది. అల్లాహ్ యే ఈ సృష్టి అంతటికీ మూలాధారుడని, ఆయనే జీవన్మరణాలకు అధిపతి అని మరియు సర్వ మానవాళికి ఉపాధిని ప్రసాదించేవాడని ఖురాన్ ఆయతుల ద్వారా స్పష్టం చేయబడింది. మానవులకు మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ ప్రవక్తలను పంపాడని, వారిలో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పబడింది. ఇస్లాం అంటే అల్లాహ్ కు లొంగిపోవడమని, ఇది కేవలం ఒక మతవర్గానికి చెందినది కాదని, సర్వ మానవాళికి చెందిన సత్య ధర్మమని నొక్కి చెప్పబడింది. భారతదేశంలో ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోనే ప్రవేశించిందని, ఆది మానవుడు ఆదం అలైహిస్సలాం కూడా భారత ఖండంలోనే అవతరించారని చారిత్రక ఆధారాలతో వివరించబడింది. చివరగా, ఇస్లాంను కాదని మరో మార్గాన్ని అనుసరించేవారు పరలోకంలో నష్టపోతారని ఖురాన్ హెచ్చరికతో ప్రసంగం ముగించబడింది.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

అల్లాహ్ త’ఆలా ఈ సృష్టి అంతటికీ మూలాధారుడు. ఆది నుండి ఉన్నవాడు, అంతము వరకు ఉండేవాడు. సర్వ ప్రాణి, సర్వ సృష్టికి సమాప్తము, వినాశనము అనేది ఉంటుంది. కానీ అల్లాహ్, అతనికి ఎలాంటి మరణము గానీ, ఎలాంటి సమాప్తము గానీ లేదు.

అల్లాహ్, ఏ అస్తిత్వాన్ని, ఎవరినైతే మనం అల్లాహ్ అని అంటామో ఆయన గురించి ఖురాన్ దివ్య గ్రంథంలో ఎన్నో ఆయతులలో ఆయన యొక్క పరిచయం చాలా వివరంగా ఉంది.

اللَّهُ الَّذِي خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ
(అల్లాహుల్లదీ ఖలకకుమ్, సుమ్మ రజఖకుమ్, సుమ్మ యుమీతుకుమ్, సుమ్మ యుహ్యీకుమ్)
ఆయనే మిమ్మల్ని సృష్టించినవాడు. అల్లాహ్ ఆయనే మీ అందరికీ ఆహారం ప్రసాదించేవాడు. ఆ అల్లాహ్ యే మీ అందరికీ మరణం ప్రసాదిస్తాడు మరియు ఆ తర్వాత మరోసారి మిమ్మల్ని బ్రతికిస్తాడు, తిరిగి లేపుతాడు. (30:40)

ఈ విధంగా చూసుకుంటూ పోతే అల్లాహ్ గురించి ఖురాన్ గ్రంథంలో ప్రత్యేకంగా సూర రూమ్, ఇంకా వేరే కొన్ని సూరాలలో చాలా స్పష్టంగా ఆయతులు ఉన్నాయి. ఉదాహరణకు సూర ఆరాఫ్, ఆయత్ నంబర్ 54.

إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ
నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై (అర్ష్‌పై) ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌ అపారమైన శుభాలు కలవాడు.(7:54)

ఆయనే రాత్రిని పగటిపై కప్పుతున్నాడు. మరియు ఈ పగలు అనేది రాత్రి వెంట పడుతుంది. మరియు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆయన ఆజ్ఞకు లోబడి ఉన్నాయి. వినండి, ఈ లోకంలో ఆదేశం చెల్లేది, ఆజ్ఞ పాలన జరిగేది అల్లాహ్ ది మాత్రమే. సృష్టి ఆయనదే గనక ఆజ్ఞా పాలన కూడా ఆయనదే జరుగును. ఆ అల్లాహ్ సర్వ విశ్వ విశ్వాసాలకు, ఈ సర్వ లోకాలకు ప్రభువు, చాలా శుభము కలవాడు.

ఇంకా ఖురాన్ గ్రంథంలో మనం చూసినట్లయితే,

اللَّهُ الَّذِي رَفَعَ السَّمَاوَاتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا
(అల్లాహుల్లదీ రఫ అస్సమావాత్ బిగైరి అమదిన్ తరౌనహా)
స్తంభాలు లేకుండా (నే) ఆకాశాలను అంతేసి ఎత్తుకు లేపిన వాడే అల్లాహ్‌. దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు. (13:2)

ఆ ఆకాశాలను ఎలాంటి పిల్లర్ లేకుండా ఏ ఒక్క పిల్లర్ లేకుండా పైకి లేపి నిలిపాడు, తరౌనహా, దీనికి ఏ ఒక్క పిల్లర్ లేని విషయం మీరు చూస్తున్నారు. మరోచోట సూర ఇబ్రాహీంలో,

اللَّهِ الَّذِي لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ
(అల్లాహుల్లదీ లహూ మా ఫిస్సమావాతి వ మా ఫిల్ అర్ద్)
ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్తమూ ఆ అల్లాహ్‌దే. (14:2)

وَوَيْلٌ لِلْكَافِرِينَ مِنْ عَذَابٍ شَدِيدٍ
(వ వైలున్ లిల్ కాఫిరీన మిన్ అదాబిన్ షదీద్)
తిరస్కారుల కొరకు కఠిన శిక్ష మూలంగా వినాశం ఉంది. (14:2)

మరి ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తున్నారో, అల్లాహ్ ను తిరస్కరిస్తున్నారో అలాంటి వారికి వినాశనం ఉంది మరియు చాలా భయంకరమైన శిక్ష ఉంది. ఇంకా ఈ రకంగా చూసుకుంటే ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఉదాహరణకు సూర ఇబ్రాహీం.

اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ وَسَخَّرَ لَكُمُ الْفُلْكَ لِتَجْرِيَ فِي الْبَحْرِ بِأَمْرِهِ ۖ وَسَخَّرَ لَكُمُ الْأَنْهَارَ
భూమ్యాకాశాలను సృష్టించి, ఆకాశాల నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీ ఆహారం కోసం పండ్లు ఫలాలను ఉత్పన్నం చేసినవాడే అల్లాహ్‌. ఆయనే తన ఆజ్ఞతో సముద్రంలో నౌకలు నడవటానికి వాటిని మీకు లోబరచాడు. ఆయనే నదీ నదాలను మీ అధీనంలో ఉంచాడు. (14:32)

అయితే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్, ఆ సృష్టికర్త, పోషణకర్త, జీవన్మరణాల ప్రధాత, ఈ సర్వ సృష్టికి మూలం ఆయనే. అయితే సర్వ సృష్టిని మన సేవ కొరకు, మనం వాటి ద్వారా లాభం పొందడానికి సృష్టించాడు. సూర బఖరాలోని మూడవ రుకూలో,

هُوَ الَّذِي خَلَقَ لَكُمْ مَا فِي الْأَرْضِ جَمِيعًا
(అల్లదీ ఖలక లకుమ్ మా ఫిల్ అర్ది జమీఆ)
భూమిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకే సృష్టించినవాడు ఆయనే. (2:29)

ఆ అల్లాహు త’ఆలా ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని, ఖలక లకుమ్ మా ఫిల్ అర్ది జమీఆ, సమస్తాన్ని మీ కొరకు పుట్టించాడు. కానీ మనల్ని కేవలం ఆయన్ని ఆరాధించుటకే పుట్టించాడు. ఆయన్ను ఎలా ఆరాధించాలి? అందుకొరకు ఆయన స్వయంగా ఏదైనా అవతారం ఎత్తి ఈ లోకంలో రాలేదు. ఎలాగైతే వేరే కొందరు తప్పుడు మార్గాల్లో ఉన్నారో, కొందరు ఏమనుకుంటారు, స్వయంగా అల్లాహ్ లేదా వారి వారి భాషల్లో వారు అల్లాహ్ ను దేవుడు అని, ఈశ్వరుడు అని ఏదైతే అనుకుంటారో వారి యొక్క తప్పుడు విశ్వాస ప్రకారం, ఆ సృష్టికర్త మానవులకు మార్గం చూపడానికి అవతారం ఎత్తి వస్తాడు అని, లేదా ఇద్దరు ముగ్గురు కలిసి ఒక దేవుడై వారిలో ఒకరిని మానవులకు మార్గం చూపడానికి పంపాడు అని, ఇవన్నీ కూడా తప్పుడు విశ్వాసాలు.

ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ ఏం చేశాడు? ఆయన మానవుల్లోనే అతి ఉత్తమ నడవడిక గల మరియు మానవుల్లోనే అందరికీ తెలిసి ఉన్న ఒక మంచి వ్యక్తిని తనకు మరియు తన దాసులకు మధ్య ప్రవక్తగా, ఒక సందేశ దూతగా ఎన్నుకున్నాడు.

اللَّهُ يَصْطَفِي مِنَ الْمَلَائِكَةِ رُسُلًا وَمِنَ النَّاسِ
(అల్లాహు యస్తఫీ మినల్ మలాఇకతి రుసులన్ వ మినన్నాస్)
అల్లాహ్ తన సందేశహరులుగా దైవదూతలలో నుండి, మానవులలో నుండి ఎన్నుకుంటాడు. (22:75)

అల్లాహు త’ఆలా దైవదూతల్లో కూడా సందేశ దూతలను ఎన్నుకుంటాడు, అలాగే మానవుల్లో కూడా అల్లాహు త’ఆలా తనకిష్టమైన వారిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. ఎన్నుకొని అతని వద్దకు తన దూత ద్వారా గాని లేదా డైరెక్ట్ అతని హృదయ ఫలకం మీద తన యొక్క సందేశాన్ని అవతరింపజేస్తాడు. ఆ ప్రవక్త అల్లాహ్ యొక్క ఆ సందేశాన్ని తీసుకొని, స్వీకరించి, నేర్చుకొని, తర్వాత ప్రజలకు వినిపిస్తారు.

ఈ విధంగా ఖురాన్ లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఎన్నో సందర్భాల్లో ఈ విషయం తెలిపి ఉన్నాడు. అల్లాహు త’ఆలా తనకిష్టమైన ప్రజల్లోని ఒక వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత ఆ ప్రవక్తగా చేసిన తర్వాత అతని వద్దకు దైవదూతను పంపి గానీ, అతని వద్దకు దివ్యవాణి పంపి గానీ, వహీ. మరి లేదా ఏదైనా పర్దా, హిజాబ్ అడ్డులో ఉండి మాట్లాడి గానీ అల్లాహు త’ఆలా తన యొక్క సందేశాన్ని అతని వద్దకు చేర్పిస్తాడు. ఈ విధంగా మానవులు ఎలా అల్లాహ్ ను ఆరాధించాలి, ఆ ఆరాధన మార్గాన్ని తన ప్రవక్తల ద్వారా వారికి నేర్పుతాడు.

ఇక ఎవరైతే వక్రమార్గంలో పడి, స్వాభావిక వారి యొక్క ఫిత్రత్, స్వాభావికం, ప్రకృతి విధానాన్ని వదిలేసి తప్పుడు ఆచారాల్లో, దురాచారాల్లో పడి ఉంటారో, వారు ఏమంటారు, ఈ మాలాంటి ఒక మనిషి మమ్మల్ని ఎందుకు మంచి గురించి చెప్పాలి? ఎందరో ప్రవక్త కాలాల్లో ప్రవక్తను తిరస్కరించినవారు,

أَبَشَرٌ يَهْدُونَنَا
(అ బషరున్ యహ్దూననా)
‘ఏమిటి, సాటి మానవులు మాకు మార్గదర్శకత్వం చేస్తారా?!’ (64:6)

మాలాంటి మనిషే కదా ఇతను, ఇతని మీదనే అల్లాహు త’ఆలా ఎందుకు వహీ పంపాడు? ఇతన్నే ప్రవక్తగా ఎందుకు ఎన్నుకున్నాడు? మాలో ఇంకా వేరే ఎవరు లేకుండేనా? అంటే దీని భావం ఏంటి? ఈ విధంగా వ్యతిరేకించడం మనిషిలో ఈ వ్యతిరేక గుణం మొదలైంది అంటే, ప్రతి దాన్ని, స్వయంగా తన తండ్రిని అనవచ్చు. నువ్వే నాకు ఎందుకు తండ్రిగా అయినావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? నువ్వే నాకు ఎందుకు తల్లిగా అయినావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? నువ్వే మాకు ఎందుకు రాజుగా ఉన్నావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? ఇతడే ఎందుకు మాకు ప్రవక్తగా వచ్చాడు అన్న విషయం, దాని గురించి అల్లాహు త’ఆలా ఒక సమాధానం ఏమి చెప్పాడు? అల్లాహ్ అతనిదే సృష్టి, అతనిదే ఆజ్ఞా పాలన జరుగును. అతడు తాను కోరిన వారిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. అల్లాహ్ యొక్క సృష్టిలో అల్లాహ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడిగే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే అల్లాహ్ చేసేది మానవుల మేలు కొరకు, అది ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. కానీ ఎవరైతే ఇలాంటి అడ్డ ప్రశ్నలు వేస్తారో వారు ప్రకృతి సిద్ధాంతాలకు దూరమై వక్రమార్గంలో నడుస్తూ ఉంటారు.

మరికొందరు ఏమన్నారు? సరే, మాకు సన్మార్గం చూపడానికి అల్లాహ్ యొక్క ఇష్టం ఉండేది ఉంటే, ఏదైనా దైవదూతలను పంపే, పంపకపోయేదా? దైవదూతలను ఎందుకు పంపలేదు? అయితే సూర అన్ఆమ్ లో దాని యొక్క సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. వలౌ జఅల్నాహు మలకన్, ఒకవేళ దైవదూతలను మేము వారి మధ్యలో ప్రవక్తగా చేసి పంపినా, వారిని ఆ దైవదూత రూపంలో ఉంచలేము. వారిని ఒక మనిషిగా చేసి వారికి ఎందుకంటే గమనించండి, మానవుల అవసరాలు దైవదూతల అవసరాలకు భిన్నంగా ఉంటాయి. అయితే మానవులకు సన్మార్గం చూపడానికి మానవుల్లోనే ఒక జ్ఞానం ఉన్న, మంచి నడవడిక గల, ఇతరులకు ఆదర్శంగా ఉండగలిగే అటువంటి వారినే అల్లాహు త’ఆలా ఎన్నుకుంటాడు.

అయితే సోదరులారా, చెప్పే విషయం ఏంటంటే, అల్లాహ్, ఆయన ఎలాంటి అవతారం ఎత్తడు. ఆయన ఒకరి ఏదైనా వేషంలో ఇహలోకంలోకి రాడు, మానవులకు మార్గం చూపడానికి. ఆయన సిద్ధాంతం ఏంటి? ఇంతకుముందు గ్రంథాల్లో కూడా ఆ విషయాల్ని తెలియబరిచాడు. చిట్టచివరి గ్రంథం ఖురాన్ లో కూడా స్పష్టపరిచాడు. అయితే మానవులకు మార్గం చూపడానికి అల్లాహు త’ఆలా ప్రవక్తల పరంపర ఏదైతే మొదలుపెట్టాడో ఆదం అలైహిస్సలాం నుండి, చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఈ పరంపర సాగుతూ వచ్చింది. ముహమ్మద్ ప్రవక్త ద్వారా ఈ ప్రవక్తల పరంపరను అల్లాహు త’ఆలా అంతం చేశాడు. ఆయనను చివరి ప్రవక్తగా పంపాడు. మరియు ప్రళయం సంభవించే వరకు ఆ ప్రవక్తనే మనం ఆదర్శంగా, మనం అంటే సర్వ మానవులం, ఆదర్శంగా చేసుకొని అల్లాహ్ ఆయనపై పంపినటువంటి దివ్య ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకొని, ఆ దివ్య ఖురాన్ ను ప్రవక్త ముహమ్మద్ వారు ఎలా ఆచరించారో అలా ఆచరించే ప్రయత్నం చేయాలి అని అల్లాహ్ మనకు ఆదేశించాడు. అందు గురించి సూర ఇబ్రాహీం గానీ ఇంకా వేరే సూరాలు మనం చూసేది ఉంటే,

كِتَابٌ أَنْزَلْنَاهُ إِلَيْكَ لِتُخْرِجَ النَّاسَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ
(కితాబున్ అన్జల్నాహు ఇలైక లితుఖ్రిజన్నాస మినజ్జులుమాతి ఇలన్నూర్)
(ఇది) ఒక గ్రంథం. దీనిని మేము నీపై అవతరింపజేశాము – నీవు ప్రజలను వారి ప్రభువు అనుమతితో చీకట్లలో నుంచి వెలుగులోకి తీసుకురావటానికి. (14:1)

సర్వ ప్రజల్ని మీరు చీకట్లలో నుండి తీసి వెలుతురులోకి, ప్రకాశంలోకి తీసుకురావాలి అని. అయితే ఈ రోజుల్లో ఎంతోమంది ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకోలేదో, వారు ఏమనుకుంటారు, ఇస్లాం ధర్మం అన్నది ప్రవక్త ముహమ్మద్ ది. ఇది కేవలం ముస్లింల ప్రవక్త, కేవలం ముస్లింల ధర్మం మరియు ఖురాన్ ఇది కేవలం ముస్లింల ధర్మం. కానీ ఇది నిజమైన మాట కాదు.

స్వయంగా ఒకవేళ మనం ఖురాన్ లో చూసి ఉంటే, ఇక్కడ ఎన్నో సందర్భాల్లో అల్లాహు త’ఆలా ఖురాన్ గురించి, ప్రవక్త ముహమ్మద్ గురించి, ఇస్లాం ధర్మం గురించి, అల్లాహ్ గురించి, అల్లాహ్ అంటే అల్లాహ్ స్వయంగా తన గురించి, అల్లాహ్ అనే అతను ముస్లింల దేవుడే కాదు. సర్వ మానవుల దేవుడు. అందు గురించి ఖురాన్ స్టార్టింగ్ లోనే మొట్టమొదటి ఆదేశం అని అనబడుతుంది. రెండో రుకూ పూర్తయిన తర్వాత మూడో రుకూ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో,

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ
(యా అయ్యుహన్నాస్ ఉ’బుదూ రబ్బకుమ్)
ఓ ప్రజలారా! మిమ్మల్ని, మీకు పూర్వం గడిచిన వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. తద్వారా మీరు దైవభీతిపరులు కాగలరు. (2:21)

ఓ ప్రజలారా, ముస్లింలారా, అరబ్బులారా, ఈ విధంగా అనబడలేదు. యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా, ఉ’బుదూ రబ్బకుమ్, మీ ప్రభువుని మీరు ఆరాధించండి. ఎవరు ఆ ప్రభువు? అల్లదీ ఖలకకుమ్, ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, వల్లదీన మిన్ కబ్లికుమ్, మీ కంటే ముందు ఉన్న వారిని, ముందు గతించిన వారిని పుట్టించాడో. లఅల్లకుమ్ తత్తకూన్, ఈ విధంగా మీరు నరకం నుండి తమకు తాము రక్షించుకోవచ్చు.

అయితే ఇక్కడ సర్వ ప్రజల్ని అల్లాహ్ ఉద్దేశించి కేవలం ఆ ఏకైక సృష్టికర్తను, అల్లాహ్ ను మాత్రమే పూజించాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా,

يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا
(యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీఆ)
“ఓ మానవులారా! నేను మీ అందరి వైపునకు అల్లాహ్ పంపిన ప్రవక్తను.” (7:158)

ఓ జనులారా, ఓ మానవులారా, నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా చేసి పంపబడ్డాను. నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా చేసి పంపబడ్డాను. సందేశ దూతగా పంపబడ్డాను. ఎవరి వైపు నుండి? ఆ అల్లాహ్ వైపు నుండి,

الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ
(లహూ ముల్కుస్సమావాతి వల్ అర్ద్)
భూమ్యాకాశాల సామ్రాజ్యం ఆయనదే. (7:158)

ఈ సర్వ ఆకాశాల మరియు భూమిలో ఉన్న సర్వానికి అధికారి ఆయన మాత్రమే.

ఇక ఖురాన్ గ్రంథం, ఇంతకుముందు నేను సూర ఇబ్రాహీం ఒక ఆయత్ మీకు ముందు చదివాను, కితాబున్ అన్జల్నాహు ఇలైక లితుఖ్రిజన్నాస్. ఈ గ్రంథం ఏదైతే మీపై అవతరింపజేశామో, దీని ద్వారా మీరు ప్రజలను, అరబ్బులను అని అనలేదు, ప్రజలను మిమ్మల్ని చీకట్ల నుండి వెలుతురు వైపునకు తీయడానికి పంపాము. అంతేకాకుండా ఒక చాలా ప్రఖ్యాతి గాంచిన ఆయత్, సర్వసామాన్యంగా ఎందరో హిందువులకు కూడా ఇది తెలిసి ఉంటుంది కావచ్చు.

شَهْرُ رَمَضَانَ الَّذِي أُنْزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِلنَّاسِ
(షహ్రు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆన్, హుదల్లిన్నాస్)
రమజాను నెల – ఆ నెలలోనే ఖుర్ఆన్ అవతరించింది. అది మానవులందరికీ మార్గదర్శకత్వం వహించేది. (2:185)

రమదాన్ మాసంలో ఖురాన్ అవతరించింది, హుదల్లిన్నాస్, ఈ ఖురాన్ సర్వ మానవాళికి మార్గదర్శకత్వం.

అయితే సోదరులారా, ఈ రోజుల్లో సర్వ మానవులు కేవలం అల్లాహ్ ను మాత్రమే విశ్వసించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని విశ్వసించాలి, ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించాలి, తమ జీవితం అల్లాహ్ పంపిన ఈ గ్రంథం, అల్లాహ్ పంపిన చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శ ప్రకారంగానే గడపాలి.

కానీ, మన, సామాన్యంగా మనం, మన తెలుగు దేశంలో అనండి, తెలుగుదేశం అంటున్నాను, అంటే పార్టీ అనట్లే నేను, ఆంధ్ర, తెలంగాణ అని ఇక రెండు పేర్లు చెప్పేదానికి బదులుగా, లేక మొత్తం భారతదేశంలో అనండి, సామాన్యంగా ఏమంటారు, ఈ ఇస్లాం దేశం ఒక 700 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం మన ఇండియాలోకి వచ్చింది. అంతకుముందు ఇస్లాం అనేది లేదు. అందు గురించి మధ్యంతరంలో పుట్టుకొచ్చిన విషయం ఇది, దీన్ని ఎందుకు మనం స్వీకరించాలి? మన తాత ముత్తాతలు పాతకాలం నుండి ఏ ఆచారం మీద ఉన్నారో, ఏ ధర్మం మీద ఉన్నారో అలాగే ఉండాలి అని ఒక మాట అంటారు. విన్నారు కదా ఎన్నోసార్లు.

అయితే దీంతో మనకు గొడవ అవసరం లేదు. ప్రేమపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా, గ్రంథాల ఆధారంతో మీరు సత్యాన్ని తెలుసుకోండి అని వారికి నచ్చచెబుదాము. దానికి మనం ఏ పద్ధతిలో వారికి నచ్చ చెప్పాలి? మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇస్లాం అంటే ఏంటి? దాని అర్థం, దాని భావం ఏంటో నచ్చచెప్పాలి. ఇస్లాం అంటే ఏదో కొత్త ధర్మం కాదు. ఇస్లాం అంటే ఒకరికి ఏదైనా శత్రుత్వం వహించే లేదా ఒకరి గురించి ఏదైనా చెడు చూపించేటువంటి విషయం కాదు. ఇస్లాం అన్నదానికి భావం, మనం మన సృష్టికర్తకు లొంగబడి ఆయన ముందు తలవంచి ఆయన ఇష్ట ప్రకారం జీవితం గడపడం. ఇంకా నేను వివరంలో లోతుగా వెళ్ళలేను, సలము నుండి ఒక భావం దీని గురించి లొంగిపోవట అని వస్తుంది. శాంతిని పొందుట అని కూడా వస్తుంది. ఈ రెండిటినీ కలిపితే, మీరు మీ సృష్టికర్తకు లొంగిపోయి ఇహపరలోకాల్లో శాంతిని పొందండి.

ఈ రకంగా చూసుకుంటే, సీన్, లామ్, మీమ్ అన్న ఈ మూడు అక్షరాలు మూల పదం ఏదైతే ఉందో ఇస్లాంకి, దానికి అనుగుణంగా ఈ పదం ఎన్నో రకాలుగా ఏదైతే వాడబడుతుందో, అస్లమ, యుస్లిము, యుస్లిమూన, ముస్లిమూన, ఈ విధంగా ఖురాన్ లో మీరు చూసి ఉంటే, ఒక సందర్భంలో అల్లాహ్ త’ఆలా ఏం చెప్పాడో గమనించండి.

أَفَغَيْرَ دِينِ اللَّهِ يَبْغُونَ
(అఫగైర దీనిల్లాహి యబ్గూన్)
ఏమిటి, వీరు అల్లాహ్ ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తున్నారా? (3:83)

ఏమైంది ఈ ప్రజలకు? అల్లాహ్ పంపినటువంటి సత్య ధర్మాన్ని మాకు వద్దు, మేము ఈ సత్య ధర్మాన్ని స్వీకరించమని అంటున్నారా, తిరస్కరిస్తున్నారా, ఇష్టం లేదు అని అంటున్నారా?

وَلَهُ أَسْلَمَ مَنْ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا
(వలహూ అస్లమ మన్ ఫిస్సమావాతి వల్ అర్ది తౌఅన్ వ కర్హా)
వాస్తవానికి భూమ్యాకాశాలలోని సమస్త వస్తువులు – ఇష్టపూర్వకంగా గానీ, అయిష్టంగా గానీ – ఆయనకే విధేయత చూపుతున్నాయి. (3:83)

మీరు మానవులు, ఐదు ఫిట్ల మనిషి, నాలుగున్నర ఫిట్ల మనిషి, మీ సంగతేంటి? మీకంటే పెద్ద పెద్ద సృష్టి రాశులు, ఆకాశం, ఆకాశాల్లో ఉన్న సర్వము, భూమి, భూమిలో ఉన్న సర్వము, అవన్నీ కూడా అస్లమ, లొంగిపోయి ఉన్నాయి. విధేయత పాటిస్తున్నాయి. అల్లాహ్ ఆజ్ఞా పాలన చేస్తున్నాయి, వారికి ఇష్టమైనా, ఇష్టం కాకపోయినా. అస్లమ, వారందరూ ఇస్లాంలోకి వచ్చారు, అంటే ఏంటిది? ఈ సర్వ సృష్టి మనం చూస్తున్నాము, సూర్యుడిని అల్లాహ్ పుట్టించినప్పటి నుండి ఒక్కసారైనా దైవం, అంటే అల్లాహ్ యొక్క నిర్ణయం, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆ సూర్యుని గురించి నిర్ణయించిన దారిని, మార్గాన్ని ధిక్కరించి, వ్యతిరేకించి నడుస్తుందా? నడుస్తున్నాడా? అలా అయితే ఇప్పటివరకు ఎప్పుడో నాశనం అయిపోయేది.

సోదరులారా, ఈ ఒక్క విషయం చెప్పాను సూర్యుడని. ఇస్లాం ధర్మం అంటే ఏంటిది? ఇది ఏదో కొత్త 400 సంవత్సరాల క్రితం, 1400 సంవత్సరాల క్రితం, 700 సంవత్సరాల క్రితం వచ్చిన ధర్మం కాదు. ఆది మానవుడి నుండే కాదు, అంతకు ముందు నుండి ఉంది. ప్రతి సృష్టి అల్లాహ్ కు లొంగి ఉన్నది. అయితే మానవులను కూడా అల్లాహ్ పుట్టించింది ఆయన ఆదేశం పాటించి, ఆయనను మాత్రమే ఆరాధించుటకు.

అయితే చివరిగా ఈ సందేశం సంపూర్ణం చేయబడింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద. అందుగురించే ఇప్పుడు ఇదియే ఇస్లాం, అంటే ఖురాన్, అల్లాహ్, ముహమ్మద్ ప్రవక్త. వీటిని ఈ ముగ్గురిని, మూడింటిని మనం స్వీకరించడం, అంగీకరించడం, ఒప్పుకోవడం ప్రకారంగా జీవితం గడపడం తప్పనిసరి.

ఇక ఏదైతే పుకారు ఉందో, వెయ్యి సంవత్సరాల క్రితమని, ఇది కూడా తప్పు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నగరంలో ఉన్నప్పుడే భారత ఖండంలో ఇస్లాం ప్రవేశించింది. ఇస్లాం అంటే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పరిచయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన సత్య ధర్మం అప్పుడే ఇండియాలో చేరింది. ఇప్పటికీ దాని యొక్క గుర్తులు, దాని యొక్క చిహ్నాలు కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించిన సహాబాలు, వారిలో ఇద్దరి సమాధులు ఇప్పటికీ ఇండియాలో ఉన్నాయి. కానీ చరిత్ర నుండి కూడా దూరమై, కళ్ళు మూసుకొని లేదా తెలిసినప్పటికీ వాటి మీద ముసుగు వేసి సత్యాన్ని స్వీకరించకపోతే అది వేరే విషయం.

మరొక చారిత్రక విషయం, దాని గురించి ఖురాన్ లో, హదీస్ లో ఎలాంటి ప్రూఫ్ అనేది లేదు, కానీ చారిత్రకంగా ఒక విషయం చాలా ప్రఖ్యాతి గాంచి ఉంది. అదేమిటంటే ఆది మానవుడు అని ఎవరినైతే అనడం జరుగుతుందో, అంటే ఆదం అలైహిస్సలాం మరియు ఆయన యొక్క భార్య హవ్వా అలైహిస్సలాం, వీరిద్దరినీ అల్లాహు త’ఆలా స్వర్గం నుండి ఏదైతే దించాడో అప్పుడు ఆదం అలైహిస్సలాం ఆ కాలంలో ఇండియా, ఇప్పుడు ఉన్న ఇండియా, శ్రీలంక ఇదంతా కలిసి ఉండే, అయితే సరాందీప్ అనే ప్రాంతంలో వచ్చారు, దిగారు, తర్వాత అక్కడి నుండి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్లి మక్కాలో చేరుకున్నారు అని కూడా చారిత్రకంగా ఒక మాట ఉంది. దీన్ని నిరాకరించడానికి ఇంతకంటే బలమైన ఏదైనా విషయం ఉండేది ఉంటే అది వేరే విషయం. కానీ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను? అయితే మన భారత ఖండంలోనే ఆది మానవుడు అవతరించాడు. ఆ ఆది మానవుడు అల్లాహ్ యొక్క దాసుడు. అతను ముస్లిం. అతని నుండి వచ్చిన సర్వ సంతానము ఇస్లాం ధర్మ ప్రకారంగానే ఉంటుంది. అల్లాహ్ ఖురాన్ లో ఏమి చెప్పాడు?

فِطْرَتَ اللَّهِ الَّتِي فَطَرَ النَّاسَ عَلَيْهَا
(ఫిత్ రతల్లాహిల్లతీ ఫతరన్నాస అలైహా)
అల్లాహ్ మానవులను ఏ ప్రకృతిపై పుట్టించాడో దానినే అవలంబించు. (30:30)

మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, “కుల్లు మౌలూదిన్ యూలదు అలల్ ఫిత్రా.” పుట్టే ప్రతి పిల్లవాడు ఫిత్రత్, ప్రకృతి ధర్మం, స్వాభావిక ధర్మంపై పుడతాడు. కానీ అతనికి మాటలు రావు, ఇంకా ఏమీ అనుభవం ఉండదు గనక, ఫ అబవాహు యుహవ్విదానిహి. అతని యొక్క తల్లిదండ్రి యూదులైతే, అబ్బాయిని కూడా యూదునిగా చేసేస్తారు. తల్లిదండ్రులు ఒకవేళ అగ్ని పూజారులైతే, ఆ పిల్లవాడు కూడా అలాగే మారిపోతాడు. కానీ ఎప్పుడైతే అతడు పెరుగుతాడో, బుద్ధి జ్ఞానం గలవాడైతాడో, సత్యాన్ని తెలుసుకుంటాడో, ధర్మాన్ని వెతుకుతాడో, అతనికి సత్యం అనేది తెలిసి రావచ్చు. ఒకవేళ ఇహలోక ఏదైనా ఆశలు, ఇహలోక ఏవైనా భయాలు, లేదా హోదా, అంతస్తుల దురాశలు, ఇలాంటివి ఏవీ అడ్డు రాకుంటే, తప్పకుండా మనిషి సత్యం విన్న తర్వాత, అతనికి మాట అర్థమవుతుంది, స్వీకరించగలడు. ఎందుకంటే ఇహలోకంలో నేనే రాజుని అని కాదు, నేనే మీ ప్రభువుని, నా ముందే మీరు తలవంచాలి అన్నటువంటి గర్వానికి గురియై ఎంతో గర్వంతో విర్రవీగుతూ కొంతకాలం ప్రజల్ని తన ముందు, తమ ముందు వంచించుకున్న అలాంటి పెద్ద పెద్ద నాయకులు స్వయంగా వారి ప్రాణం పోయే సందర్భంలో ఏమన్నారు? ఫిరౌన్, అతని కంటే దుర్మార్గుడు, దౌర్జన్యుడు బహుశా ఇంకా వేరే ఒకడు రాలేదు. అతడు కూడా ఏమన్నాడు? మూసా మరియు హారూన్ ల యొక్క ప్రభువు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రభువుని నేను విశ్వసిస్తున్నాను అన్నాడు.

మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ ప్రవక్త. ఆయన కాలంలో ఎవరైతే ప్రవక్తకు వ్యతిరేకంగా నాయకత్వం వహించారో, వారిలో ఒకరి పేరు అబూ జహల్. ప్రవక్త అతని గురించి ఏమన్నాడు ఒకసారి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ జహల్ గురించి ఒకసారి ఏమన్నారు? ఈ అబూ జహల్ ఈ కాలానికి ఫిరౌన్ లాంటివాడు. కానీ అంతటి ఆ దుర్మార్గుడు దొంగచాటుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ పఠించేటప్పుడు వినేవాడు. విన్నాడు. విని, సత్యం అతనికి తెలిసింది. అతని యొక్క దగ్గరి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు లాంటి వాడు, అతన్ని అడిగాడు కూడా, రాత్రి నేను కూడా ఖురాన్ విన్నాను, నువ్వు కూడా దొంగచాటుగా విన్నావు అంటే నేను వినలేదు అని ముందు అన్నాడు. తర్వాత చెప్పాడు, చెప్పే మాట అతనిది బాగానే అనిపిస్తుంది, కానీ ఇతడి వంశం, అబూ జహల్ యొక్క వంశం ముత్తాతల్లో ఒకరి వైపు నుండి వస్తుంది, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబ్దే మునాఫ్ నుండి వస్తారు. వీరి యొక్క వంశంలో వారు ఎలాంటి అన్ని మంచి కార్యాలు చేసుకుంటూ వచ్చారో, మనం కూడా చేసుకుంటూ వచ్చాము. కానీ ఈరోజు ఇతడు కొత్త ఏదో మాట మొదలు పెట్టాడు కదా, అలాంటి హోదా అంతస్తు మనకు దొరకదు కదా. అంటే కేవలం ప్రపంచ దురాశలకు లోనై సత్యాన్ని తిరస్కరించలేదు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చిన తర్వాత, మదీనా వలస వచ్చిన తర్వాత అక్కడ ప్రవక్తకు శత్రువుల్లో చాలా కఠినంగా వ్యతిరేకించిన వారిలో ఒకతని పేరు హుయై బిన్ అఖ్తబ్, యూదుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్యల్లో ఒక భార్య ఎవరు? సఫియ్యా రదియల్లాహు అన్హా. ఆ నాయకుని యొక్క కుమార్తె. ఆమె ఇస్లాం స్వీకరించింది. ప్రవక్తకు భార్యగా అయింది. ఆమె ఒక సందర్భంలో చెప్తుంది, నేను ఇంకా చాలా నా చిన్న వయసు నాది. ప్రవక్త ఆ రోజుల్లో మదీనాలో వచ్చే సందర్భంలో మా నాన్న మరియు మా చిన్న తండ్రి, చాచా, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అతడు వచ్చేసాడు మదీనాలో అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి. మరి ఏంటి ఉద్దేశం? అతని గురించి మన గ్రంథాల్లో కూడా వచ్చింది ఉంది కదా, చిట్టచివరి ప్రవక్త అని. ఇద్దరు ఆ సత్య విషయాలన్నీ తెలుసు వారికి. ఎందుకంటే యూద గ్రంథాల్లో కూడా ప్రవక్త ముహమ్మద్ గురించి వచ్చింది ఉంది ప్రస్తావన. కానీ వారు ఏమన్నారు? లేదు, లేదు, లేదు, మనం ప్రాణం ఉన్నంతవరకు అతన్ని వ్యతిరేకించి, అతనికి తిరుగుబాటుగా, ఎదురుగానే మనం ఉండాలి, అంటే ఈ రోజుల్లో ఏమనవచ్చు మనం, అపోజిషన్ పార్టీలోనే ఉండాలి, ఎప్పుడు కూడా వారితో కలవవద్దు.

అయితే ప్రపంచ దురాశాలకు గురై కూడా ఎందరో ఇలాంటి సత్యాన్ని తిరస్కరించిన వారు ఉన్నారు. అందు గురించి సోదరులారా, ఇవన్నీ మనకు ఇహలోకంలో కొద్ది రోజులు మాత్రమే పనికి వస్తే రావచ్చు, అందరికీ కూడా రావు. కానీ చివరికి చనిపోయే సందర్భంలో కూడా సత్యాన్ని తిరస్కరించడం, ధర్మాన్ని వ్యతిరేకించడం, ఏ మాట మనకు తెలిసిందో అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు నుండి దాన్ని అమలు చేయనందుకు, అమలు పరచనందుకు, తప్పకుండా దీని గురించి ప్రశ్నించబడుతుంది మరియు పరలోకంలోనైతే చాలా నష్టపోతాము. అందు గురించి ఖురాన్ లో అల్లాహ్ త’ఆలా ఏం చెప్పాడు?

وَمَنْ يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
(వ మన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుఖ్బల మిన్హు)
ఎవడైనా ఇస్లాంను కాదని మరో ధర్మాన్ని అవలంబించదలిస్తే, అది అతని నుండి ఎంతమాత్రం స్వీకరించబడదు. మరి అతను పరలోకంలో నష్టపోయే వారిలో చేరతాడు. (3:85)

ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని తనకు ధర్మంగా ఒప్పుకుంటాడో, దాన్ని స్వీకరించి బ్రతుకుతాడో, ఫలన్ యుఖ్బల మిన్హ్, అది అతని నుండి ఎన్నటికీ స్వీకరించబడదు. వహువ ఫిల్ ఆఖిరతి, ఇక్కడ ఒక విషయం గమనించండి. అల్లాహ్ ఏమంటున్నాడు? వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. అతడు పరలోకంలో చాలా నష్టపోయే వారిలో కలుస్తాడు. ఇహలోకం గురించి చెప్పలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొందరు తప్పుడు మార్గంలో ఉన్నప్పటికీ అల్లాహ్ తొందరగా పట్టి శిక్షించడు. కొంత వెసులుబాటుని ఇస్తూ ఉంటాడు. అందు గురించి ఇలాంటి వెసులుబాటుని పొంది తప్పుడు భావంలో పడకూడదు. అల్లాహు త’ఆలా మనందరికీ సన్మార్గం చూపుగాక. ఇస్లాం ధర్మం స్వయంగా అర్థం చేసుకొని ఇతరులకు దానిని అర్థం మంచిగా నచ్చచెప్పే భాగ్యం ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.