విశ్వాస మూల సూత్రాలు: మొదటి పాఠం: తౌహీద్, దాని రకాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[18 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

తౌహీద్‌ దాని రకాలు:

తౌహీద్‌ అంటే విధిగా, అల్లాహ్‌ కు ప్రత్యేకంగా చేయబడే ప్రతి ఇబాదత్‌ (ఆరాధన)లో అల్లాహ్‌ ను అద్వితీయునిగా నమ్మడం. అల్లాహ్‌ ఇచ్చిన ఆదేశాల్లో ఇది చాలా గొప్పది. అల్లాహ్‌ ఇలా ఆదేశించాడు:

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ

(ఇలా చెప్పండి! ఆయన అల్లాహ్‌, అద్వితీయుడు). (సూరె ఇఖ్లాస్‌ 112:1).

మరోచోట ఇలా సెలవిచ్చాడు:

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ

(నేను మానవులను, జిన్నాతులను కేవలం నన్ను ఆరాధించుటకే పుట్టించాను). (సూరె జారియాత్‌ 51: 56)

మరో ఆదేశం:

وَاعْبُدُوا اللَّهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا

(కేవలం అల్లాహ్‌నే ఆరాధించండి, ఆయనతో ఎవరినీ సాటి కల్పించ కండి). (సూరె నిసా 4: 36)


తౌహీద్‌ మూడు రకాలు: (1) తౌహీదె రుబూబియత్‌, (2) తౌహీదె ఉలూహియత్‌, (3) తౌహీదె అస్మా వ సిఫాత్‌.

(1) తౌహీదె రుబూబియత్‌:

అంటే: సృష్టి, దాని నిర్వహణలో అద్వితీయుడు అల్లాహ్‌ మాత్రమే. ఆయనే పోషకుడు, జీవన్మరణ ప్రధాత. భూమ్యాకాశాల అధికారం ఆయన చేతిలోనే ఉంది. దీనికి సంబంధించిన నిదర్శనాలు దివ్యగ్రంథం ఖుర్‌ఆనులో చదవండి:

هَلْ مِنْ خَالِقٍ غَيْرُ اللَّهِ يَرْزُقُكُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ ۚ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ

(ఆకాశము నుండి భూమి నుండి అల్లాహ్‌ తప్ప వేరే సృష్టికర్త మీకు ఆహారము నొసంగువాడు గలడా? ఆయన తప్ప వేరే ఆరాధింపదగిన వాడెవడు లేడు). (ఫాతిర్‌ 35: 3).

تَبَارَكَ الَّذِي بِيَدِهِ الْمُلْكُ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

(ఎవని చేతిలో సమస్త లోకపాలన గలదో ఆ అల్లాహ్‌ చాలా శుభాలు గలవాడు, ఆయన సర్వముపై సంపూర్ణ శక్తి గలవాడు). (ముల్క్‌ 67: 1).

అల్లాహ్‌ అధికారం విశ్వమంతటిలో ఉంది. తనిష్టానుసారం అందులో మార్పు చేస్తూ ఉంటాడు. నిర్వహణలో అద్వితీయుడు కూడా కేవలం అల్లాహ్‌ మాత్రమే. సృష్టి కార్యాలు నెరవేర్చువాడు ఆయనే. ఈ ఆయతు చదవండి:

أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ

(వినండి! సృష్టించుట, ఆజ్ఞాపించుట ఆయన పనే. సర్వ లోకములకు పోషకుడగు అల్లాహ్‌ ఎంతో శుభదాయకుడు). (ఆరాఫ్‌ 7: 54).

అతని ఈ నిర్వహణ కార్యక్రమం సర్వసృష్టిలో నడుస్తూ ఉన్నది. తౌహీద్‌ యొక్క ఈ రకాన్ని తిరస్కరించినవారు చాలా అరుదు. వారు బాహ్యంగా తిరస్కరించినా, వారి అంతరాత్మ మటుకు దాన్ని ఒప్పుకుంటుంది. (ఫిర్‌ఔన్‌ వాళ్ళ గురించి) ఈ ఆయతు చదవండి:

وَجَحَدُوا بِهَا وَاسْتَيْقَنَتْهَا أَنفُسُهُمْ ظُلْمًا وَعُلُوًّا

(నిజానికి వారి మనస్సులు (సత్యాన్ని) నమ్మినప్పటికీ అన్యాయం, అహంకారంతో వారు దానిని తిరస్కరించారు). (నమ్ల్‌ 27:14).

ఈ ఒక్క రకాన్ని నమ్మినంత మాత్రాన ఏమీ ప్రయోజనం ఉండదు. ప్రవక్త కాలంలోని ముష్రికులు తౌహీదు యొక్క ఈ రకాన్ని నమ్మారు కాని అది వారికి ఏ లాభాన్నివ్వలేదు. ఖుర్‌ఆన్‌ సాక్ష్యం చదవండి:

وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ لَيَقُولُنَّ اللَّهُ ۖ فَأَنَّىٰ يُؤْفَكُونَ

(భూమ్యాకాశాలను ఎవరు సృష్టించారని, సూర్య చంద్రుల్ని ఎవరు అదుపులో ఉంచ గలిగారని నీవు అడిగితే, అల్లాహ్‌ యే అని వారు తప్పకుండా అంటారు. అలాంటప్పుడు వారు ఎలా మోనపోతున్నారు?). (అన్‌ కబూత్‌ 29:61)


(2) తౌహీదె ఉలూహియత్‌:

అంటే: ఆరాధనలకు అర్హుడయిన అద్వితీయుడు ఆ పరమ పవిత్రుడు మాత్రమే. పూజ చేయుటకు మరియు సాన్నిధ్యము పొందుటకు ఏ మానవుడూ అల్లాహ్‌ తో మరెవ్వరినీ సాటి కల్పించ కూడదు. తౌహీద్‌ యొక్క మూడు రకాల్లో ఇదే అతిముఖ్య మైనది, గొప్పది. దీని కొరకే అల్లాహ్‌ మానవులను సృష్టించాడు. అల్హాహ్‌ ఆదేశం చదవండి:

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ

(నేను మానవులను, జిన్నాతులను కేవలం నన్ను ఆరాధించుటకే వుట్టించాను). (జారియాత్‌ 51: 56).

ఈ విషయమే ప్రజలకు క్లుప్తంగా బోధించడానికి అల్లాహ్‌ ప్రవక్తలను పంపాడు, గ్రంథాలను అవతరింపజేశాడు. దీని సాక్ష్యాధారం దివ్య ఖుర్‌ఆనులో ఇలా ఉంది:

وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ

(మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా, అతనికి వహీ ద్వారా ‘నేను తప్ప వేరు పూజ్యుడు లేడు, కనుక మీరు నన్ను మాత్రమే ఆరాధించండి’ అనే విషయాన్ని తెలియజేశాము). (అంబియా 21: 25).

తౌహీద్‌ యొక్క ఈ రకాన్నే బహుదైవరాధకులు తిరస్కరించారు, వారి ప్రవక్తలు ఈ తౌహీద్‌ యొక్క బోధ చేసినప్పుడు. దీనికి ఖుర్‌ఆన్‌ ఇలా సాక్ష్యమిస్తుంది:

قَالُوا أَجِئْتَنَا لِنَعْبُدَ اللَّهَ وَحْدَهُ وَنَذَرَ مَا كَانَ يَعْبُدُ آبَاؤُنَا

((బహుదైవారాధకులు తమ ప్రవక్తలకు ఇలా జవాబిచ్చారు): నీవు మా వద్దకు రావటానికి కారణం, మేము ఒక్క అల్లాహ్‌ నే ఆరాధించాలనా, మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని విసర్జించాలనా?). (ఆరాఫ్‌ 7: 70).

అందుకే ఇబాదత్‌ (ఆరాధన) యొక్క ఏ రకమూ కూడా అల్లాహ్‌ యేతరులకు చేయుట ఎంత మాత్రం సమంజసం కాదు. ఆ అల్లాహ్‌ యేతరులు ఎవరైనా సరే: అతిసన్నిహితులైన దైవదూతలు, ప్రవక్తలు, మహా భక్తులు, సృష్టి రాసుల్లో ఎవ్వరినీ కూడా అల్లాహ్‌ తో సాటి కల్పించకూడదు.


(3) తౌహీదె అస్మా వ సిఫాత్‌:

అంటే: అల్లాహ్‌ స్వయాన తన గురించి మరియు ప్రవక్త అల్లాహ్‌ గురించి ఏ పవిత్ర నామముల, ఉత్తమ గుణముల గురించి తెలిపారో వాటిని అల్లాహ్‌ కు తగిన రీతిలో విశ్వసించాలి. ఏ మాత్రం ‘తహ్‌ రీఫ్‌’,త’తీల్‌’, ‘తక్‌ యీఫ్‌’, ‘తమ్‌ సీల్‌'(1) లేకుండా. ఆయన గుణ నామములను యథార్థంగా నమ్మాలి. యథార్దానికి విరుద్ధంగా కాదు. వేటికి అల్లాహ్‌ అతీతుడని అల్లాహ్‌, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో వాటి నుండి అల్లాహ్‌ అతీతుడని నమ్మాలి. “వేటి గురించి అల్లాహ్‌ అర్హుడా, అతీతుడా అని స్పష్టం లేదో వాటిలో మౌనం వహించాలి అంటే వాటికి అల్లాహ్‌ అర్హుడని అనవద్దు అతీతుడనీ అనవద్దు.

1 ‘తహ్‌ రీఫ్‌’ అంటే: ఏ ఆధారము లేకుండా నామగుణాల భావాన్ని మార్చుట. తారుమారు చేయుట. ‘త’తీల్‌’ అంటే: అల్లాహ్‌ గుణనామాలన్నిటిని లేదా కొన్నిటిని తిరస్మరించుట. అల్లాహ్‌ ను నిరాకారునిగా నమ్ముట. ‘తక్‌ యీఫ్‌’ అంటే: అల్లాహ్‌ గుణాలను మాట, ఊహ ద్వారా ఏదైనా ఒక రూపం ఇచ్చే ప్రయత్నం చేయుట. అల్లాహ్‌ చేయి అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని అనుట. ‘తమ్‌సీల్‌’ అంటే: అల్లాహ్‌ గుణాలను సృష్టి గుణాలతో పోల్పుట. లేదా సృష్టి గుణాల మాదిరిగా ఉంటాయని విశ్వసించుట.

పవిత్ర నామముల ఉదాహరణ: పవిత్రుడైన అల్లాహ్‌ ‘అల్‌ హయ్య్‌‘ తన నామమని తెలిపాడు. అయితే ‘అల్‌ హయ్య్‌’ అల్లాహ్‌ నామాల్లో ఒకటని నమ్మాలి. ఇంకా ఆ పేరులో ఉన్న భావమును కూడా విశ్వసించాలి. అనగా ఆయన శాశ్వతముగా ఉండువాడు, ఆయనకు ముందు ఎవరు లేరు, తరువాత ఎవరు లేరు. (ఆయన సజీవుడు, నిత్యుడు). అదే విధముగా ‘సమీ‘ ఆయన పేరు, ‘సమ’ (వినుట) ఆయన గుణం అని నమ్మాలి.

గుణముల ఉదాహరణ:

అల్లాహ్‌ ఆదేశం:

وَقَالَتِ الْيَهُودُ يَدُ اللَّهِ مَغْلُولَةٌ ۚ غُلَّتْ أَيْدِيهِمْ وَلُعِنُوا بِمَا قَالُوا ۘ بَلْ يَدَاهُ مَبْسُوطَتَانِ يُنفِقُ كَيْفَ يَشَاءُ

(యూదులు ‘అల్లాహ్‌ చేతులు కట్టుబడినవి’ అని పలుకు చున్నారు. వారి చేతులే కట్టుబడుగాక! వారు పలికిన దానికి వారికి శాపమున్నది. అల్లాహ్‌ చేతులు విచ్చలవిడిగా ఉన్నవి. తాను కోరునట్లు వినియోగ పరుచుచున్నాడు). (మాఇద 5: 64).

పై ఆయతులో అల్లాహ్‌ తనకు రెండు చేతులున్నవని, అవి విచ్చలవిడిగా ఉన్నవని తెలిపాడు. అంటే వాటి ద్వారా తనిష్టాను సారం అనుగ్రహాలు నొసంగుతాడని తెలిపాడు. అయితే అల్లాహ్‌ కు రెండు చేతులున్నాయని, వాటి ద్వారా అనుగ్రహాలు నొసంగుతాడని విశ్వసించడం మనపై విధిగా ఉంది. ఆ చేతులు ఇలా ఉంటాయని మనుసులో ఊహించే, లేదా నోటితో పలుకే ప్రయత్నం కూడా చేయవద్దు. వాటిని మానవుల చేతులతో పోల్చకూడదు. ఎందుకనగా అల్లాహ్‌ సూరె షూరా (42: 11) లో ఇలా ఆదేశించాడు:

لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ ۖ وَهُوَ السَّمِيعُ الْبَصِيرُ

(ఆయనకు పోలినది ఏదిలేదు. మరియు ఆయన వినువాడు, చూచువాడు).

ఈ తౌహీద్‌ యొక్క సారాంశమేమిటంటే: అల్లాహ్‌ తన కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ కొరకు ఏ ఏ నామ గుణాలను తెలిపారో వాటిని నమ్మాలి. వేటికి అల్లాహ్‌ అతీతుడని అల్లాహ్‌, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో వాటి నుండి అల్లాహ్‌ అతీతుడని నమ్మాలి. అయితే. వాటిని తారుమారు చేయకుండా, ఇతరులతో పోల్చకుండా, నిరాకారునిగా భావించకుండా నమ్మాలి. ఏ గుణనామముల విషయములో, అవి అల్లాహ్‌ కు సంబంధించినవేనా, లేదా అని స్పష్టం లేదో ఆ పదాల భావం లో అల్లాహ్‌ పట్ల అగౌరవం ఉంటే వాటిని ఖండించాలి. వాటి భావం లో ఏలాంటీ దోషం లేకుంటే వాటిని స్వీకరించవచ్చు.


పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)

ఇతరములు: [విశ్వాసము]

ధర్మాన్ని పరిహసించటం, ధార్మిక చిహ్నాలను కించపరచటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

తాను విశ్వసించే మత ధర్మాన్ని పరిహసించిన మనిషి ధర్మభ్రష్ఠుడైపోతాడు. ఆ ధర్మం నుండి పూర్తిగా బహిష్కృతుడవుతాడు. విశ్వప్రభువు ఇలా సెలవిచ్చాడు :

وَلَئِن سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ ۚ قُلْ أَبِاللَّهِ وَآيَاتِهِ وَرَسُولِهِ كُنتُمْ تَسْتَهْزِئُونَ لَا تَعْتَذِرُوا قَدْ كَفَرْتُم بَعْدَ إِيمَانِكُمْ

వారితో అను: “ఏమిటీ, మీరు అల్లాహ్‌తో, ఆయన ఆయతులతో, ఆయన ప్రవక్తతో పరిహాసమాడుతున్నారా? మీరింక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి ఒడిగట్టారు.” (అత్‌ తౌబా – 65, 66)

అల్లాహ్‌తో, ఆయన ప్రవక్తతో, ఆయన సూక్తులతో పరిహాసమాడటం అవిశ్వాసానికి (కుఫ్ర్కు) తార్కాణమని ఈ ఆయతుల ద్వారా రూఢీ అవుతోంది. కాబట్టి ఎవరు ఈ విషయాలలో ఏ ఒక్కదానినయినా పరిహసిస్తాడో అతను అన్నింటినీ పరిహసించిన వాడిగానే పరిగణించబడతాడు. అలనాడు (మదీనాలో) కపటుల విషయంలో జరిగింది కూడా ఇదే. వారు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను, ప్రవక్త సహచరులను ఎగతాళి చేశారు. అందుచేత పై ఆయతులు అవతరించాయి.

ధార్మిక చిహ్నాలలో ఏ ఒక్కదానినయినా పరిహసించేవాడు ధార్మిక చిహ్నాలన్నింటినీ తప్పనిసరిగా కించపరుస్తాడు. అలాగే అల్లాహ్ ఏకత్వాన్ని (తౌహీద్‌ను) చిన్నచూపు చూసేవాడు, నిజ దైవాన్ని వదలి మృతులను వేడుకోవటాన్ని గౌరవ దృష్టితో చూస్తారు. వారిని ఏకేశ్వరోపాసన వైపు పిలిచినపుడు, షిర్క్‌ నుండి వారించినపుడు ఎగతాళి చేస్తారు. అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు:

وَإِذَا رَأَوْكَ إِن يَتَّخِذُونَكَ إِلَّا هُزُوًا أَهَٰذَا الَّذِي بَعَثَ اللَّهُ رَسُولًا إِن كَادَ لَيُضِلُّنَا عَنْ آلِهَتِنَا لَوْلَا أَن صَبَرْنَا عَلَيْهَا

వారు నిన్ను చూచినప్పుడల్లా, నీతో వేళాకోళానికి దిగుతారు. “అల్లాహ్ ప్రవక్తగా చేసి పంపినది ఈయన గారినేనా?! మేము మా దేవుళ్లపై గట్టిగా నిలబడి ఉండకపోతే, ఇతను మమ్మల్ని మా దేవుళ్ల నుండి తప్పించేవాడే” అని ఎద్దేవా చేస్తారు. (అల్‌ ఫుర్ఖాన్‌ : 41, 42)

మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారిని షిర్క్‌ నుండి వారించినపుడు, వారు ఆయన్ని పరిహసించారు. ఇది తరతరాలుగా జరుగుతూ వస్తున్నదే. దైవప్రవక్తలు తమ జాతి ప్రజలను ఏకేశ్వరోపాసన వైపు ఆహ్వానించినప్పుడల్లా ముష్రిక్కులు వారిలో తప్పులెన్నే ప్రయత్నం చేశారు. ప్రవక్తలను అవివేకుల క్రింద జమకట్టారు. వారిని మార్గవిహీనులన్నారు. పిచ్చోళ్ళన్నారు. ఎందుకంటే వారి హృదయాలలో షిర్క్‌ (బహుదైవారాధన) పట్ల భక్తి భావం ఉండేది. అలాగే ముష్రిక్కులను పోలిన పనులు చేసే వారిలో కూడా ఇదే ఆలోచన ఉంటుంది. ఏక దైవారాధన వైపు పిలిచే వారిని చూసినపుడు వారు ఓర్చుకోలేరు. వారి గురించి చులకనగా మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళ హృదయాలలో కూడా షిర్క్‌ పట్ల (ప్రేమ గూడు కట్టుకుంది. ఈ నేపథ్యంలో అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు:

وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللَّهِ أَندَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّهِ

“అల్లాహ్‌ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి, అల్లాహ్‌ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరున్నారు.” (అల్‌ బఖర : 165)

కాబట్టి అల్లాహ్‌ పట్ల భక్తి కలగవలసిన విధంగా సృష్టిలో వేరే ఇతరుల పట్ల భక్తి కలిగి ఉండేవాడు ఖచ్చితంగా ముష్రిక్కే. ఇంకా – కేవలం అల్లాహ్‌ కొరకు ప్రేమించటంలో – అల్లాహ్‌ ప్రేమతో పాటు ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండటంలో గల వ్యత్యాసాన్ని చూడటం అవసరం. (అల్లాహ్‌ కొరకు ప్రేమించటం వాంఛనీయం. అల్లాహ్‌ పట్ల గల ప్రేమ మాదిరిగా ఇతరులను ప్రేమించటం అవాంఛనీయం). సమాధులను విగ్రహంగా మార్చుకున్న వారిని చూడండి – వారు దేవుని ఏకత్వాన్ని (తౌహీద్‌ని) పరిహసిస్తారు. దైవారాధనను గేలి చేస్తారు. అల్లాహ్‌ను వదలి తాము సిఫారసుదారులుగా ఆశ్రయించిన వారి పట్ల మాత్రం భక్తీ ప్రపత్తులు కలిగి ఉంటారు. వారిలోని ఒక వ్యక్తి అల్లాహ్‌ పేరు మీద అబద్ధ ప్రమాణం చేస్తాడు గాని తాను నమ్మినడుచుకునే ముర్షిద్‌ పేరు మీద మాత్రం అబద్ధ ప్రమాణం చేయడానికి ఎంతకీ సాహసించడు. ప్రజాబాహుళ్యంలో మీరు అనేకమందిని చూస్తుంటారు. వారి దృష్టిలో తమ ముర్షిద్‌కు విన్నపాలు చేసుకోవటం – అతని సమాధి వద్ద చేసినా, సమాధికి దూర స్థలంలో చేసినా – మస్జిద్ లో తెల్లవారుజామున అల్లాహ్‌కు విజ్ఞప్తి చేసుకోవటం కన్నా ఎక్కువ లాభదాయకమయింది అని భావిస్తారు. తమ ముర్షిద్‌ బాటను వదలి ఏకదైవారాధనా మార్గాన్ని అవలంబించిన వారిని వారు వేళాకోళం చేస్తారు. అలాంటి వారిలో చాలామంది మస్జిదులకు రారు గాని దర్గాలకు మాత్రం వెళతారు. దర్గాలను దేదీప్యమానంగా ముస్తాబుచేస్తారు. ఇదంతా ఏమిటి? అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను, ఆయన సూక్తులను పరిహసించి షిర్క్ కు స్వాగతం పలకటం కాదా!? (మజ్మూఅ అల్‌ ఫతావా : 15/48, 49)

నేటి సమాధి పూజారుల్లో ఈ ధోరణి అత్యధికంగా ఉంది.

ఎగతాళి రెండు రకాలుగా ఉంటుంది

1. బాహాటంగా ఎగతాళి చేయటం : అంటే ఇంతకు ముందు ఖుర్‌ఆన్‌ సూక్తుల్లో చెప్పబడినట్లుగా అడ్డూ ఆపూ లేకుండా సత్యాన్ని సత్య ప్రేమికుల్ని ఎగతాళి చేయటం. ఉదాహరణకు : మీ మతధర్మం ఐదవ మతం అని కొందరంటే, మీది బూటకపు మతం అని మరికొందరంటారు. అలాగే మంచిని పెంపొందించే వారిని, చెడుల నుండి ఆపేవారిని చూసి, “అబ్బో! బయలుదేరారు పేద్ద ధర్మోద్దారకులు” అంటూ వెటకారంగా ప్రేలుతారు. అంతకన్నా దారుణమైన వాక్యాలు – వ్రాయటానికి కూడా వీలులేని మాటలు చెప్పటం జరుగుతుంది.

(2) ద్వంద్వార్థాలతో ఎగతాళి చేయటం : ఈ ఎగతాళి కూడా తీరంలేని సముద్రం వంటిది. కన్నుగీటి సైగలు చేయటం, నాలుక వెళ్ళబెట్టడం, మూతి ముడుపులతో వెకిలి సైగలు చేయటం, ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తున్నప్పుడు, హదీసులు పఠిస్తున్నప్పుడు లేదా మంచి పనులు చేస్తున్నప్పుడు చేతులతో సైగలు చేయటం మొదలగునవి. (మజ్మూఅతు త్తౌహీద్‌ – నజ్‌దియ : పేజీ : 409)

మరి కొంతమంది చెప్పే కొన్ని మాటలు కూడా ఈ ‘పరిహాస పరిధిలోకే వస్తాయి. ఉదాహరణకు : “ఇస్లాం 21వ శతాబ్దికి సరిపోదు. ఇది మధ్య యుగాలకు తగినది.” “ఇస్లాం ఛాందసుల మతం”, “శిక్షల విషయంలో ఇస్లాం మరీ అమానుషంగా వ్యవహరిస్తుంది”, “విడాకులను, బహుభార్యత్వాన్ని అనుమతించి ఇస్లాం మహిళా హక్కులను హరించింది”, “ఇస్లాం శాసనాల ప్రకారం తీర్పు ఇవ్వటం కన్నా స్వయం కల్పిత చట్టాల కనుగుణంగా తీర్పు ఇవ్వటం మిన్న” లాంటి మాటలను కొందరు పలుకుతుంటారు. అలాగే ఏకేశ్వరోపాసనా సందేశం ఇచ్చేవారిని గురించి మాట్లాడుతూ, “వారు తీవ్రవాదులు. వారు ముస్లింలోని సంఘీభావాన్ని చిందరవందర చేస్తున్నారు” అంటారు. లేదంటే “వారు వహాబీలు” అంటారు. ఈ విధంగా వారు తమ మాటల తూటాలతో ఏక దైవారాధకులను, సత్యధర్మ ప్రేమికులను అనుదినం ఆటపట్టిస్తూ ఉంటారు.

దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారి సున్నతులలో ఏదైనా ఒక సున్నత్‌ను ఖచ్చితంగా అనుసరించే వారిని పట్టుకుని ఎగతాళి చేయటం కూడా ఈ కోవకు చెందినదే.

ఉదాహరణకు – “గడ్డం పెంచినంత మాత్రాన ధర్మావలంబనలో పెరుగుదల రాదు” అని అనటం. అలాంటివే మరెన్నో తుచ్చమయిన పలుకులతో మనసులను గాయపరచటం.


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది

కొన్నిస్థలాల, చిహ్నాల, మృతుల నుండి శుభం (బరకత్‌) పొందటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

కొన్నిస్థలాల, చిహ్నాల, మృతుల నుండి శుభం (బరకత్‌) పొందటం :

కొత్తగా కనిపెట్టిన బిద్అతు(కల్పితాచారం)లలో ‘సృష్టితాల‘ నుండి “శుభం” పొందగోరటం కూడా ఒకటి. ఇది కూడా విగ్రహారాధనలో ఒక భాగమే. ఈ వల పన్నటం ద్వారా ఎంతోమంది బ్రతకనేర్చిన స్వార్ధపరులు అమాయక వ్యక్తుల జేబులు ఖాళీ చేస్తుంటారు.

బరకత్‌” అంటే ఏదైనా వస్తువులో శుభం, సమృద్ధి స్థిరంగా ఉండటం అని భావం.

ఇలాంటి శుభం లేక సమృద్ధి కొరకు ప్రార్థించాల్సింది అల్లాహ్ నే . ఎందుకంటే ఆ వస్తువును ప్రసాదించిన వానికే బరకత్ పొందుపరిచే శక్తి ఉంటుంది. ఆ పని అల్లాహ్‌ మాత్రమే చేయగలడు. ఎందుకంటే శుభాన్ని అవతరింపజేసేవాడు, దానిని స్థిరపరిచేవాడు అల్లాహ్‌ మాత్రమే. మనుషులకు, వేరే ఇతర సృష్టితాలకు బరకత్‌ని ప్రసాదించే శక్తిగానీ, బరకత్‌ అనే దానికి ఉనికినిచ్చే శక్తిగానీ, దానిని నిలిపి ఉంచే శక్తిగానీ ఉండదు.

కాబట్టి స్థలాల నుండి, చిహ్నాల నుండి, చనిపోయిన వ్యక్తుల నుండి “శుభం” (తబర్రుక్‌) పొందటం ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే ఆ వస్తువుకు శుభం చేకూర్చే శక్తి స్వత సిద్ధంగా ఉందని మనిషి గనక నమ్మాడంటే అది ‘షిర్క్‌‘ అవుతుంది. ఒకవేళ అతను ఫలానా వస్తువును సందర్శించటం, దానిని తాకటం, దానిని తన శరీరంపై స్పర్శించటం అల్లాహ్‌ తరపున బరకత్‌ ప్రాప్తికి సాధనమని నమ్మితే అది షిర్క్‌ కాదుగానీ, షిర్క్‌కు దోహదపడే ఒక సాధనమవుతుంది.

ఇక ప్రవక్త ప్రియ సహచరుల విషయానికి వస్తే వారు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కేశముల ద్వారా, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) గారి లాలాజలం ద్వారా, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) వుజూ చేసిన నీళ్ల ద్వారా బరకత్‌ (శుభం) పొందేందుకు పోటీపడేవారు. అయితే ఇదంతా ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) జీవించి ఉన్నంతవరకే జరిగింది. దీనికి ఆధారం ఏమిటంటే, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) పరమపదించిన తరువాత, సహచరులు ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) సమాధి ఉన్న గదిలోకి వెళ్ళి శుభం పొందలేదు. ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) నమాజ్‌ చేసిన వివిధ స్థలాలకు వెళ్ళి, లేదా ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) విశ్రాంతి పొందిన స్థలాలకు వెళ్ళి అక్కడి నుండి “శుభం” పొందలేదు. కాబట్టి ఔలియాల (అల్లాహ్‌ ప్రియతములైన వ్యక్తుల) స్థలాలకు వెళ్ళి అక్కడి నుండి శుభం పొందగోరటం ధర్మసమ్మతం కాదు.

అలాగే ప్రవక్త సహచరులు తమలోని గొప్ప వ్యక్తుల నుండి కూడా శుభం పొందేవారు కారు. ఉదాహరణకు : హజ్రత్ అబూబకర్‌, హజ్రత్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హుమా), ఇంకా ఆ కోవకు చెందిన మరెందరో సహాబీల జీవిత కాలంలోగానీ, వారు మరణించిన తరువాత గానీ వారి నుండి శుభం పొందేందుకు యత్నించలేదు. వారు హిరా గుహ వద్దకు వెళ్ళి నమాజ్‌ చేయటంగానీ, దుఆ చేయటంగానీ చేయలేదు.అల్లాహ్ మూసా (అలైహిస్సలాం)తో సంభాషించిన తూర్‌ పర్వత సందర్శన నిమిత్తం వెళ్ళటంగానీ, అక్కడ నమాజ్‌ చేయటం గానీ చేయలేదు. దైవప్రవక్తల సమాధులున్నాయని అనుమానించ బడుతున్న పర్వతాల వద్దకు, స్థలాల వద్దకు కూడా వారు వెళ్ళలేదు.

అలాగే మదీనా నగరంలో మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నిత్యం నమాజ్‌ చేసే స్థలంలోనే నిలబడటంగానీ, మక్కాలో ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) నమాజ్‌ చేసీన స్థలాలలో తొలికాలపు మహనీయులు నిలబడటం గానీ, ఆ స్థలాలను తాకటంగానీ, ముద్దాడటం గానీ చేసేవారు కారు.

కాస్త ఆలోచించండి! మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) గారి శుభప్రదమైన అడుగులు పడిన స్థలాలను, ఆయన నమాజ్‌ చేసిన స్థలాలనే తాకటం, ముద్దుపెట్టుకోవటం ఆయన అనుయాయులకు ధర్మసమ్మతం కానపుడు వేరేతరులు సంచరించిన, ఆరాధనలు చేసిన స్థలాలను, ప్రదేశాలను ముద్దాడటం ఎంత వరకు సమ్మతం? ఎంతవరకు సహేతుకం?

ఆ స్థలాలలో దేనినయినా తాకటం లేదా ముద్దుపెట్టుకోవటం మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) షరీయత్‌ ప్రకారం ధర్మసమ్మతం కాదన్న విషయం ఇస్తామీయ విద్వాంసులకు బాగా తెలుసు. (ఇఖ్తెజ  అస్సిరాతల్‌ ముస్తఖీమ్‌ – 2/795-802. డా. నాసిరుల్‌ అఖల్‌ పరిశోధన).


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (పేజీలు 224-226)

విగ్రహాల, స్మారక చిహ్నాల పట్ల భక్తి ప్రపత్తులు – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

అరబీలో ‘తమాసీల్‘  అనబడుతుంది. అంటే విగ్రహాలు, స్థూపాలు అని అర్థం. అవి మానవ రూపంలోగానీ, జంతువుల రూపంలోగానీ, మరేదైనా సజీవ వస్తువు ఆకారంలోగానీ చెక్కబడి ఉంటాయి. ‘నుసుబ్‌’ అంటే ఒక చిహ్నం (జెండా) లేక ప్రత్యేక రాయి. అక్కడ బహుదైవారాధకులు బలి ఇస్తారు. “స్మారక చిహ్నాలు” అంటే ప్రజలు బహిరంగ స్థలాలలో తమ నాయకుల గౌరవార్థం, వారి ఘనకార్యాల స్మారకార్థం నిర్మించుకుని ప్రతిష్టించే స్థూపాలు లేక విగ్రహాలు.

సజీవుల ఆకారం వే(చే)యటాన్ని మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారించారు. ముఖ్యంగా సమాజంలోని ప్రముఖుల, ఆదరణీయుల రూపాలను వేయరాదు. ఉదాహరణకు: రాజులు, విద్వాంసులు, సజ్జనులు, సన్యాసులు, నాయకుల రూపచిత్రాలు. ఈ చిత్రాలు పలకపై వేసినా, కాగితంపై గీసినా, గోడపై చిత్రీకరించినా, దుస్తులపై వేయబడినా, కెమెరాల ద్వారా తీయబడినవైనా, శిలలపై చెక్కబడినా – ఇవన్నీ ధార్మికంగా నిషిద్ధమే (హరామే).

అలాగే గోడలపై చిత్ర పటాలను వ్రేలాడదీయటం, విగ్రహాలను ప్రతిష్టించటం కూడా ఈ కోవకు చెందినవే. స్మారక చిహ్నాలు ఇందులోకే వస్తాయి. దేవుని ఈ భూమిపై మొట్టమొదటిసారి షిర్క్‌ ఈ రూపచిత్రాల, విగ్రహ ప్రతిష్టాపన ద్వారానే పొడసూపింది. దైవప్రవక్త హజ్రత్‌ నూహ్‌ ( అలైహిస్సలాం) జాతిలో కొంతమంది పుణ్య పురుషులుండేవారు. వారి మరణం పట్ల ఆ జాతివారు తీవ్రంగా దుఃఖించారు. ఆ సమయంలో షైతాన్‌ రంగప్రవేశం చేసి, ఆ పుణ్య పురుషులు కూర్చునే సభాస్థలిలో వారి విగ్రహాలను ప్రతిష్టించి, వాటిపై వారి పేర్లను వ్రాయమని ఆ ప్రజల ఆంతర్యాల్లో ప్రేరేపించాడు. వారు అలాగే చేశారు. ఆ సమయంలో వారు ఆ విగ్రహాలను పూజించలేదు. వారు మరణించిన తరువాత వారి తరువాతి తరాల వారు ఆ విగ్రహాలను పూజించటం మొదలెట్టారు. ఎందుకంటే ఆ విగ్రహాలను ప్రతిష్టించటం వెనుక వాస్తవికత వారికి తెలీదు. ఆ విధంగా నూహ్‌ జాతి వారిలో విగ్రహారాధన చోటు చేసుకుంది. (సహీహ్‌ బుఖారీ)

ఈ విగ్రహారాధన రూపంలో పొడసూపిన షిర్క్‌ నుండి నిరోధించేందుకు అల్లాహ్ తన ప్రవక్త నూహ్‌ (అలైహిస్సలాం)ను పంపాడు. కాని నూహ్‌ పిలుపును ఆ జాతి జనులు త్రోసిపుచ్చారు. విగ్రహ రూపంలో ఉన్న తమ పూర్వీకుల పూజపై స్థిరంగా ఉండిపోయారు. పైగా వారిలా అన్నారు :

وَقَالُوا لَا تَذَرُنَّ آلِهَتَكُمْ وَلَا تَذَرُنَّ وَدًّا وَلَا سُوَاعًا وَلَا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا

“ఎట్టి పరిస్థితిలోనూ మీ పూజ్య దైవాలను వదలకండి. వద్ద్‌ను, సువాను గానీ,  యగూస్‌, యవూఖ్‌, నస్ర్ లను గానీ వదలిపెట్టకండి.”(నూహ్‌:23)

(1) వద్ద్‌(2) సువా (3) యగూస్‌ (4) యవూఖ్‌ (5) నస్ర్ – ఇవి చనిపోయిన పుణ్య పురుషుల పేర్లు. వారి స్మారకార్థం వారి పేర్లతో మొదట విగ్రహాలను ప్రతిష్టించారు. కాని అవే చివరకు పూజనీయం అయ్యాయి.

చూశారా! కేవలం స్మారక చిహ్నాలుగా ప్రతిష్టించబడిన విగ్రహాలు ఎలా షిర్మ్‌కు దారితీశాయో! చివరకు ఈ పని దైవప్రవక్త పట్ల శత్రుత్వంగా పరిణమించింది. తత్కారణంగా వారు పెనుతుఫాను ద్వారా అంతమొందించబడ్డారు. వారు దేవుని దృష్టిలోనూ, ప్రజల దృష్టిలోనూ ఆగ్రహించబడినవారుగా నిలిచారు. రూపచిత్రాలు, విగ్రహ ప్రతిష్టాపన ఎంత తీవ్రమైన పనో దీని ద్వారా అవగతమవుతోంది. అందుకే మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) రూపాలను చిత్రించేవారిని థూత్మరించారు. ప్రళయదినాన వారు చాలా తీవ్రమయిన శిక్షకు గురిచేయబడతారని చెప్పారు. రూప చిత్రాలను నిర్మూలించాలని ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ఆదేశించారు. ఫోటోలు ఉన్న ఇండ్లల్లో దైవదూతలు ప్రవేశించరని తెలిపారు. ఎందుకంటే వీటి పరిణామం తీవ్రంగా ఉంటుంది. వీటి మూలంగా భూమండలంలో ప్రప్రథమంగా షిర్క్‌ ప్రబలింది. ఈ రకమయిన విగ్రహాలు, చిత్రాలు సభాస్థలాలలో ప్రతిష్టించినా, బహిరంగంగా పెట్టినా, పార్కులలో ప్రతిష్టించినా చెడుకు తొలి మెట్టు!!

అన్యుల సంగతిని అలా ఉంచితే ముస్లిముల కొరకు మాత్రం ఇది ఎట్టి పరిస్థితిలోనూ సమ్మతం కాదు. ఈ విషయంలో వారు అన్యులకు ప్రభావితులై కాల ప్రవాహంలో కొట్టుకుపోరాదు. తమ ధార్మిక విశిష్టతకు మూల సరోవరమయిన ‘విశ్వాసాన్ని’ (అఖీదా) వారు కాపాడుకోవాలి. “మరీ అంత ఇదిగా చెబితే ఎలాగండీ! ధర్మా ధర్మాల గురించి వారికి తెలియదా ఏమి!?” అని దాటవేయటం ఏ విధంగాను సరికాదు. ఎందుకంటారా!? షైతాన్‌ భావితరాల వారిపై దృష్టిని కేంద్రీకరిస్తాడు. భావితరాలలో విషయ పరిజ్ఞానం లోపించగానే ఆ ధూర్తుడు పాదరసంలా పారుతాడు. తన నక్కజిత్తులలో నవతరాలను బోల్తా కొట్టిస్తాడు. నూహ్‌ (అలైహిస్సలాం) జాతి వారి విషయంలో జరిగింది కూడా ఇదే కదా! జ్ఞాన సంపన్నులైన వారి పూర్వీకులు మరణించిన పిదప, భావి తరాలలో అజ్ఞానం ప్రబలింది. మనిషి బ్రతికి ఉన్నన్నాళ్ళూ ఈ ఉపద్రవానికి (షిర్క్‌) లోనయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే దైవప్రవక్త హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ (అలైహిస్సలాం) అల్లాహ్  ను ఇలా వేడుకున్నారు.

وَاجْنُبْنِي وَبَنِيَّ أَن نَّعْبُدَ الْأَصْنَامَ

“(ప్రభూ!) నన్నూ, నా సంతానాన్ని విగ్రహారాధన నుండి కాపాడు.” (ఇబ్రాహీమ్‌ – 35)

అందుకే అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) వారు తన స్వవిషయంలో దీని గురించి భయపడ్డారు. అందుకే పూర్వకాలపు సత్పురుషులు ఇలా వ్యాఖ్యానించారు:

“ఇబ్రాహీమ్‌ (అలైహిస్సలాం) తరువాత ఈ విషయంలో ఎవరు మాత్రం నిర్భయంగా ఉండగలరు?”


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (పేజీలు 131-132)

నిఫాఖ్‌ (కపటత్వం) మరియు దాని రకాలు – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

నిఫాఖ్‌ (కపటత్వం) నిర్వచనం, దాని రకాలు

(1) నిఫాఖ్‌ (కపటత్వం, వంచన) నిర్వచనం :

నిఫాఖ్‌” అనేది నిఘంటువు ప్రకారం “నాఫఖ” అనె క్రియతో ముడిపడి ఉంది. నాఫఖ యునాఫిఖు నిఫాఖన్‌ వ మునాఫఖతన్‌ అని అనబడుతుంది – ఈ పదం “అన్నాఫిఖాఅ” నుండి గ్రహించబడినది. అంటే ఉడుము తన కన్నం నుండి బయటపడే రహస్యమార్గం అని భావం. కన్నంలో ఉన్న ఉడుమును ఒక మార్గం నుంది పట్టుకోటానికి ప్రయత్నించినపుడు అది రెండో వైపు నుండి పారిపోతుంది. మరో ఉవాచ ప్రకారం ఇది ‘నఖఫ  నుండి సంగ్రహించబడినది. ఉడుము దాక్కున్న కన్నాన్ని నఫఖ అంటారు. (అన్నిహాయతుల్‌ ఇబ్బ్నుల్‌ అసీర్‌ – 5/98)

షరీయత్‌ ప్రకారం ‘నిఫాఖ్‌’ అంటే:

ఇస్లాం గురించి, మంచి గురించి ప్రకటించటం. దాంతోపాటే తిరస్కారభావాన్ని, కపటత్వాన్ని మనసులో దాచి పెట్టడం. దీనికి నిఫాఖ్‌ అనే నామకరణం ఎందుకు చేయబడిందంటే మునాఫిఖ్‌ (కపటవిశ్వాసి, వంచకుడు) షరీయతులో ఒక ద్వారం గుండా ప్రవేశించి, మరో ద్వారం గుండా షరీయత్‌ నుండి బయటికెళ్ళిపోతాడు. దీనిపై అల్లాహ్‌ ఈ విధంగా హెచ్చరించాడు –

إِنَّ الْمُنَافِقِينَ هُمُ الْفَاسِقُونَ

“నిశ్చయంగా కపటులు పాపాత్ములు (అవిధేయులు).” (అత్‌ తౌబా : 67)

అంటే వారు షరీయత్‌ కట్టుబాట్లను ఖాతరు చేయకుండా వెళ్ళిపోయువారన్నమాట!

అల్లాహ్‌ కపట విశ్వాసులను అవిశ్వాసులకన్నా చెడ్డవారుగా ఖరారు చేశాడు :

إِنَّ الْمُنَافِقِينَ فِي الدَّرْكِ الْأَسْفَلِ مِنَ النَّارِ

“నిశ్చయంగా కపటులు నరకంలోని అధమాతి అధమ శ్రేణిలోకి వెళతారు.” (అన్‌ నిసా :145)

ఇంకా ఇలా సెలవిచ్చాడు :

إِنَّ الْمُنَافِقِينَ يُخَادِعُونَ اللَّهَ وَهُوَ خَادِعُهُمْ

“నిశ్చయంగా కపటులు తమ జిత్తులతో అల్లాహ్‌నే మోసగించాలనుకుంటున్నారు. అయితే అల్లాహ్‌ వారి జిత్తులకు తగిన శిక్ష విధించనున్నాడు” (అన్‌ నిసా : 142).

ఇంకా ఈ విధంగా కూడా సెలవిచ్చాడు:

يُخَادِعُونَ اللَّهَ وَالَّذِينَ آمَنُوا وَمَا يَخْدَعُونَ إِلَّا أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ فِي قُلُوبِهِم مَّرَضٌ فَزَادَهُمُ اللَّهُ مَرَضًا ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْذِبُونَ

“వారు అల్లాహ్‌ను, విశ్వాసులనూ మోసపుచ్చుతున్నారు. అయితే వాస్తవానికి వారు స్వయంగా – తమను తామే – మోసపుచ్చుకుంటున్నారు. కాని ఈ విషయాన్ని వారు గ్రహించటం లేదు. వారి హృదయాలలో రోగం ఉంది. ఆ రోగాన్ని అల్లాహ్‌ మరింతగా పెంచాడు. వారు చెప్పే అబద్ధం మూలంగా వారి కొరకు వ్యధాభరితమయిన శిక్ష ఉంది.” (అల్‌ బఖర – 9, 10)

(2) నిఫాఖ్‌ (కాపట్యం) రకాలు ;

నిఫాఖ్‌ (కపటత్వం) రెండు రకాలు : (1) విశ్వాసపరమైన కపటత్వం (2) క్రియాత్మకమైన కపటత్వం.

మొదటిది: విశ్వాసపరమైన కపటత్వం

ఇదే నిఫాఖె అక్బర్‌. అంటే పెద్ద తరహా కపటత్వం. దీనికి ఆలవాలమై ఉన్న వ్యక్తి పైకి ఇస్లాం స్వీకరించినట్లు ప్రకటిస్తాడు. లోపల కుఫ్ర్ని (అవిశ్వాసాన్ని) దాచిపెట్టుకుంటాడు. ఈ రకమయిన కపటత్వం కలవాడు ఇస్లాం నుండి పూర్తిగా బహిష్క్రుతుడైనట్లే. దీనికి పాల్పడినవాడు నరకంలోని అట్టడుగు వర్గీయుల్లో చేరతాడు. అల్లాహ్‌ కపటులను అత్యంత చెడ్డవారుగా అభివర్ణించాడు. ఉదాహరణకు : అవిశ్వాసం, అవినీతి, ధర్మాన్ని ధర్మావలంబీకులను పరిహసించటం, వారిని చూసి వెకిలి సైగలు చేయటం, ఇస్లాం విరోధులతో కుమ్మక్కు అవటం వారిలోని దుర్గుణాలు. కపట విశ్వాసులు శత్రుత్వంలో ఇస్లాం శత్రువులకు సమ ఉజ్జీలుగా ఉంటారు. ఈ కపటులు అన్ని కాలాల్లో ఉన్నారు, ఉంటారు. ముఖ్యంగా ఇస్లాం ప్రాబల్యం వహించినపుడు ఓర్చుకోలేకపోతారు. బహిరంగంగా ముస్లింలను ఎదిరించే శక్తి వారిలో ఉండదు. అందుకే ఇస్లాంకు, ముస్లిములకు వ్యతిరేకంగా కుట్రలు పన్నే ఉద్దేశంతో ఇస్లాం స్వీకరిస్తున్నట్లు ప్రకటిస్తారు. ఆ విధంగా ఇస్లాం ముసుగులో ఎసరుపెడతారు. అలా ఉండటం వల్ల తమ ధన ప్రాణాలకు రక్షణ ఉంటుందన్న స్వార్ధం కూడా వారి అంతరంగంలో దాగి ఉంటుంది.

అందుకే కపట విశ్వాసి (మునాఫిఖ్‌) అల్లాహ్‌ను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని విశ్వసించినట్లు పైకి ప్రకటిస్తాడు. కాని అతని అంతరంగంలో తిరస్కరణాభావం తిష్టవేసి ఉంటుంది. నిజానికి అతనికి అల్లాహ్‌ పై విశ్వాసముండదు. ఖుర్‌ఆన్‌ దైవప్రోక్తమని, ఆయన దానిని ఒక మానవమాత్రుని (ముహమ్మద్‌ – సల్లలాహు అలైహి వ సల్లం) పై అవతరింపజేశాడని, ఆయన్ని సమస్త మానవుల వైపు సందేశహరునిగా పంపాడనీ, ఆ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అల్లాహ్ ఆదేశానుసారం ప్రజలకు మార్గదర్శకత్వం వహిస్తారని, ఆయన విధించే శిక్ష గురించి సావధానపరుస్తారని స్వయంగా అల్లాహ్ తెలియజేశాడు. అయినప్పటికీ కపట విశ్వాసికి ఇదేమీ పట్టదు. అల్లాహ్‌ దివ్య ఖుర్‌ఆన్‌లో కపటుల బండారాన్ని బట్టబయలు చేశాడు. వారి లోగుట్టును రట్టు చేశాడు. వారి విషయంలో అప్రమత్తంగా ఉండమని తన దాసులను సావధానపరిచాడు.

అల్‌ బఖరా సూరాలోని తొలి వాక్యాలలోనే మానవుల లోని మూడు వర్గాల ప్రస్తావన తేబడింది – (1) విశ్వాసులు (2) అవిశ్వాసులు (3) కపటులు. విశ్వాసుల ప్రస్తావన 4 సూక్తులలో, అవిశ్వాసుల ప్రస్తావన 2 సూక్తులలో వస్తే కపటుల ప్రస్తావన 13 సూక్తులలో వచ్చింది. ఎందుకంటే కపటులు అధిక సంఖ్యలో ఉన్నారు – నివురు గప్పిన నిప్పులా ఉంటారు. వారెక్కడ ఉన్నా అక్కడి ప్రజల పాలిట ఒక పరీక్షగా, ఉపద్రవంగానే ఉంటారు. కాగా; ఇస్లాం మరియు ముస్లింల పాలిట వారి బెడద తీవ్రమైనది. ఎందుకంటే వారి మూలంగా సదా ఇస్లాంకు ఎన్నో కష్టాలు వచ్చిపడ్డాయి. వారు బాహ్యంలో ఇస్లాం అనుయాయులుగా కనిపిస్తారు. సమర్థకులుగా ముందుకు వస్తారు. యదార్దానికి వారు ఇస్లాం ధర్మానికి బద్ధశత్రువులుగా ఉంటారు. సర్వవిధాలా వారు ఇస్లాంకు తూట్లు పొడుస్తుంటారు. అమాయకులు, అవివేకులు వారిని చూసి మంచివారుగా తలపోస్తారు. వారి మాటల్ని సంస్కరణతో కూడిన మాటలుగా భావిస్తారు. కాని వారి మాటల్లో అజ్ఞానం, కల్లోలం కలగలసి ఉంటుంది.

(‘సిఫాతుల్‌ మునాఫిఖీన్‌ లి ఇబ్బ్నుల్‌ ఖయ్యిమ్‌’ నుండి సేకరించబడింది. )

విశ్వాసపరమైన కపటత్వం ఆరు రకాలు :

  1. మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ను ధిక్కరించటం.
  2. మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) షరీయతులోని కొన్ని విషయాలను అసత్యమంటూ త్రోసిపుచ్చటం.
  3. మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) పై అక్కసును వెళ్ళగ్రక్కటం, విరోధ భావం కలిగి ఉండటం.
  4. మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తెచ్చిన షరీయతులోని కొన్ని విషయాల పట్ల ఓర్వలేనితనాన్ని ప్రదర్శించటం.
  5. మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ధర్మం అధోగతిలో ఉన్నట్టు అనిపిస్తే సంతోషించటం.
  6. మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ధర్మానికి చేకూరిన ప్రాబల్యాన్ని చూసి సహించలేకపోవటం.

(మజ్మూఅతుత్తౌహీద్‌ – పేజి : 9)

రెండవ రకం – క్రియాత్మకమైన కపటత్వం (నిఫాఖె అమలీ) :

అంటే మనిషి హృదయంలో విశ్వాస (ఈమాన్‌) మైతే ఉంటుంది గాని అతని ఆచరణల్లో కపటత్వం తొంగి చూస్తుంటుంది. ఇటువంటి ఆచరణ మనిషిని ఇస్లాం పరిధి నుండి బయటికి నెట్టదు. కాని కపటత్వం ముదిరే ప్రమాదం మాత్రం పొంచి ఉంటుంది. ఇలాంటి వ్యక్తిలో విశ్వాసం, కాపట్యం – రెండూ ఉంటాయి. అయితే కాపట్యం మోతాదు పెరిగిపోయినపుడు అతను పక్కా కపటిగా తయారవుతాడు. దీనికి ప్రమాణం ప్రవక్త మహనీయుల (సల్లలాహు అలైహి వ సల్లం) వారి ఈ ప్రవచనం.

 أَرْبَعٌ مَنْ كُنَّ فِيهِ كَانَ مُنَافِقًا خَالِصًا، وَمَنْ كَانَتْ فِيهِ خَصْلَةٌ مِنْهُنَّ كَانَتْ فِيهِ خَصْلَةٌ مِنَ النِّفَاقِ حَتَّى يَدَعَهَا: إِذَا اؤْتُمِنَ خَانَ وَإِذَا حَدَّثَ كَذَبَ وَإِذَا عَاهَدَ غَدَرَ، وَإِذَا خَاصَمَ فَجَرَ  

“నాలుగు లక్షణాలున్నాయి. అవి గనక ఎవరిలోనయినా ఉంటే అతను పక్కా కపట విశ్వాసి అవుతాడు. ఎవరిలోనయినా వాటిలో ఏ ఒక్క లక్షణమైనా ఉంటే కాపట్యానికి సంబంధించిన ఒక లక్షణం అతనిలో ఉన్నట్లు లెక్క – దానిని అతను విడిచిపెట్టనంత వరకూ (ఆ అవగుణం కారణంగా అతను నిందార్హుడే). అవేమంటే;

  • (1) అతనికేదన్నా అమానతు (సొత్తు)ను అప్పగిస్తే ద్రోహానికి పాల్పడతాడు.
  • (2) మాట్లాడితే అబద్ధం చెబుతాడు.
  • (3) నమ్మి ఒడంబడిక చేసుకున్నప్పుడు నమ్మక (ద్రోహం చేస్తాడు.
  • (4) పోట్లాట జరిగినపుడు దుర్భాషకు దిగుతాడు.”

(బుఖారీ, ముస్లిం)

కనుక ఏ మనిషిలోనయినా ఈ నాలుగు అవ లక్షణాలు ఏకకాలంలో తిష్టవే స్తే, అతనిలో చెడు పూర్తిగా జొరబడినట్లే. అతనిలో కపట లక్షణాలన్నీ పొడసూపినట్లె. మరెవరిలోనయినా వీటిలో ఒక అవలక్షణం ఉంటే, అతనిలో కాపట్యానికి సంబంధించిన ఒక ఆనవాలు ఉందన్నమాట! ఒక్కోసారి ఒక దాసునిలో మంచి లక్షణాలు – చెడు లక్షణాలు, విశ్వాస లక్షణాలు – అవిశ్వాస, కాపట్య లక్షణాలు – రెండూ చోటు చేసుకుంటాయి. తత్కారణంగా అతను బహుమానంతో పాటు శిక్షకు కూడా అర్హుడవుతుంటాడు. మస్జిదులో జరిగే సామూహిక నమాజ్‌ పట్ల అనాసక్తత, బద్దకం కూడా ఈ కాపట్య లక్షణాలలో ఒకటి.

కపటత్వం (నిఫాఖ్‌) మహా చెడ్డ వస్తువు. అందుకే ప్రవక్త ప్రియసహచరులు (రది అల్లాహు అన్హుమ్) కాపట్యానికి లోనయ్యె విషయం పట్ల నిత్యం భయపడుతూ ఉండేవారు. ఇబ్నె అబీ ములైకా ఇలా అంటున్నారు :

“నేను ముప్పయి మంది సహాబా (ప్రవక్త సహచరుల)ను కలుసుకున్నాను. వారంతా తమను కాపట్యం ఎక్కడ చుట్టుకుంటుందోనని భయపడుతూ ఉండేవారు.”

నిఫాఖె అక్బర్  – నిఫాఖె అస్గర్‌కి మధ్య గల తేడాలు :

(1)  నిఫాఖె అక్బర్‌ (పెద్ద తరహా కాపట్యం) మనిషిని ఇస్లామీయ సమాజం నుండి బహిష్కరిస్తుంది. నిఫాఖె అస్గర్ (చిన్న తరహా కాపట్యం) సమాజం నుండి బహిష్మరించదు.

(2)  విశ్వాసాలలోని అంతర్బాహ్యాలలో గల విభేదానికి మరో పేరె నిఫాఖె అక్బర్‌. కాగా ఆచరణల్లోని అంతర్బాహ్యాలలో గల వైరుధ్యమే నిఫాఖె అస్గర్.

(3) ఒక విశ్వాసి వల్ల పెద్ద తరహా కపట చేష్ట జరగదు. చిన్న తరహా కపట చేష్టలే అతని వల్ల జరిగేందుకు ఆస్కారముంటుంది.

(4) పెద్ద తరహా కాపట్యానికి (నిఫాఖె అక్బర్‌కి) ఒడిగట్టిన వ్యక్తి చాలా వరకు పశ్చాత్తాపం ప్రకటించడు. ఒకవేళ అతను పరిపాలకుని సమక్షంలో పశ్చాత్తాపం చెందితే అతని పశ్చాత్తాపం స్వీకారయోగ్యమవుతుందా? లేదా? అనే విషయంలో విద్వాంసుల మధ్య భేదాభిప్రాయం ఉంది. తద్భిన్నంగా చిన్న తరహా కాపట్యానికి పాల్పడిన వ్యక్తి ఒక్కోసారి అల్లాహ్‌ సన్నిధిలో పశ్చాత్తాపపడుతుంటాడు. అల్లాహ్‌ అతని పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడు.

షేఖుల్‌ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు :

“తరచూ జరిగేదేమిటంటే ఒక విశ్వాసి కాపట్యానికి సంబంధించిన ఏదో ఒక విషయానికి లోనవుతాడు. తరువాత అల్లాహ్‌ అతని పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడు. ఒక్కోసారి అతని ఆంతర్యంలో కొన్ని విషయాలు జనిస్తుంటాయి. అవి కాపట్యానికి ఆనవాలుగా ఉంటాయి. ఎట్టకేలకు అల్లాహ్‌ అతని ఆ స్థితిని కూడా రూపుమాపు తాడు. ఒక విశ్వాసి ఒక్కోసారి పైశాచిక ప్రేరణలకు, అవిశ్వాస శంకలకు లోనవుతుంటాడు. తత్కారణంగా అతని మనసు కుంచించుకుపోతూ ఉంటుంది. అతను తీవ్రంగా మనస్తాపానికి గురవుతాడు. ఆ విషయమే ఒకసారి ప్రియ సహచరులు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తో చెప్పుకున్నారు :

“దైవప్రవక్తా (సల్లలాహు అలైహి వ సల్లం)! మాలో కొందరి హృదయాలలో కలిగే భావాలు ఎంత తీవ్రమైనవంటే, వాటిని గురించి నోటితో చెప్పటం కన్నా నింగి నుంచి నేలపై పడిపోవటమే మిన్న అని అనుకుంటున్నాము”. దానికి ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు : “ఈ భావనే అసలు విశ్వాసం (ఈమాన్‌).” (ముస్నదె అహ్మద్‌, ముస్లిం)

మరో ఉల్లేఖనంలోని పదాలు ఇలా ఉన్నాయి :

‘వాటిని నోటితో చెప్పటం కష్టమని భావిస్తున్నాడు.’

దానికి ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు : “షైతాన్‌ ఎత్తుగడలను శంకలుగా మార్చివేసిన అల్లాహ్‌కే సకల స్తోత్రాలు.” అంటే ఆంతర్యంలో జనించే ఇలాంటి దుష్ప్రేరణలపై అయిష్టతను వ్యక్తపరచటం, వాటీని మనసులో నుంచి తీసిపడవెయ్యటం విశ్వాసానికి చిహ్నం అన్నమాట!” (కితాబుల్‌ ఈమాన్‌, పేజీ – 288)

నిఫాఖె అక్బర్‌ (పెద్ద తరహా కాపట్యం) సంగతి వేరు. అలాంటి వారి గురించి అల్లాహ్‌ ఏమంటున్నాడో చూడండి:

صُمٌّ بُكْمٌ عُمْيٌ فَهُمْ لَا يَرْجِعُونَ

“వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు. వారిక మరలిరారు.” (అల్‌ బఖర : 18)

అంటే వారు మనస్ఫూర్తిగా ఇస్లాం వైపునకు రుజువర్తనులవరు. అలాంటి వారి గురించి అల్లాహ్‌ ఈ విధంగా కూడా సెలవిచ్చాడు :

أَوَلَا يَرَوْنَ أَنَّهُمْ يُفْتَنُونَ فِي كُلِّ عَامٍ مَّرَّةً أَوْ مَرَّتَيْنِ ثُمَّ لَا يَتُوبُونَ وَلَا هُمْ يَذَّكَّرُونَ

“ఏమిటీ, ప్రతి ఏటా ఒకసారో, రెండుసార్లో తాము ఏదో ఒక ఆపదలో చిక్కుకుపోవటాన్ని వారు గమనించటం లేదా? అయినాసరే, వారు పశ్చాత్తాపాపడటంగానీ, గుణపాఠం నేర్చుకోవటంగానీ జరగటం లేదు.” (అత్‌ తౌబా : 126)

షేఖుల్‌ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు :

“వారి పశ్చాత్తాపం స్వీకరించబడే విషయంలో విద్వాంసుల మధ్య భిన్నాభిప్రాయం ఉంది. ఎందుకంటే అందులోని వాస్తవికత ఏపాటిదో తెలీదు. ఎందుచేతనంటే వారు నిత్యం తమను ఇస్లాం  అనుయాయులుగానే చెప్పుకుంటూ ఉంటారు.” (మజ్మూఅ ఫతావా – 28/434, 435)


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది

నక్షత్రాల ప్రభావ విశ్వాసం

బిస్మిల్లాహ్

మానవ జీవితంలో, విశ్వంలో సంభవించే సంఘటనల్లో నక్షత్రాల ప్రభావం ఉంటుందని విశ్వసించుట కూడా షిర్క్‌.

జైద్‌ బిన్‌ ఖాలిద్‌ జుహనీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: హుదైబియా ప్రాంతంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు నమాజు చేయించారు. అదే రాత్రి వర్షం కురిసింది. నమాజు ముగించి ప్రజల వైపునకు తిరిగి “మీ ప్రభువు ఏమన్నాడో మీకు తెలుసా?” అని అడిగారు. అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త కే బాగా తెలుసు అని సహచరులు సమాధానం పలికారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్‌ ఇలా తెలిపాడని విశదీకరించారు: “ఈ రోజు ఉదయం నా దాసుల్లో కొందరు విశ్వాసులయ్యారు, మరికొందరు అవిశ్వాసులయ్యారు. ‘అల్లాహ్‌ దయవలన మాకు వర్షం కురిసింది’ అని అన్నవారు తారాబలాన్ని నిరాకరించి, నన్ను విశ్వసించిన వారయ్యారు. దీనికి భిన్నంగా ఫలాన నక్షత్ర ప్రభావంతో వర్షం కురిసింది అన్నవారు నక్షత్ర విశ్వాసులయి, నన్ను తిరస్కరించిన వారయ్యారు”. (బుఖారి 846, ముస్లిం 71).

అదే విధంగా పత్రిక, మ్యాగజైన్లలో వచ్చే రాశిచక్ర వివరాలను చదివి, అవి నక్షత్రాల ప్రభావంతోనే ఉంటాయని విశ్వసిస్తే అతను బహుదైవారాధకుడవుతాడు. ఒకవేళ అతను తృప్తి కొరకు చదివితే పాపాత్ముడవుతాడు. ఎందుకనగా? షిర్క్‌ విషయాలను చదివి తృప్తి పొందడం యోగ్యం కాదు, దానిని విశ్వసించాలని షైతాన్‌ ప్రేరేపించవచ్చు కూడా, అప్పడు అది చదవడం ఒక షిర్క్‌ పని కోసం ఆధారంగా మారిపోతుంది.


[ఇది ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు అను పుస్తకం నుంచి తీసుకోబడింది. ]

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/

ముహర్రం నెలలో “నెల్లూరు రొట్టెల పండగ” పేరుతో జరిగే షిర్క్ మరియు దురాచారాలు

బిస్మిల్లాహ్

[నెల్లూరు రొట్టెల పండగ పేరుతో జరిగే షిర్క్ మరియు అధర్మ కార్యాల గురుంచి ఈ పోస్టులో వివరించబడింది] 

నెల్లూరు ఆంధ్రరాష్ట్రానికి చెందిన ఒక జిల్లా, సముద్రం ఒడ్డున ఉన్న ఒక అందమైన పట్టణము. 12వందల సంవత్సరాల క్రితం పన్నెండు మంది అరబ్‌ ముస్లిములు వలస వచ్చారు అని కథనాలు చెప్పుకుంటారు. వారందరూ జాతులకు, మతాలకు అతీతంగా శాంతిని నెలకొల్పాలని వచ్చినట్లు భావిస్తారు. మరియు కొన్ని రోజుల తరువాత వారందరూ షహీద్‌ కాబడ్డారనీ అంటారు. ఆ తరువాత వారందరినీ ఆ సెలయేరు (ఒక పెద్ద చెరువు) వద్దనే సమాధి చేసారు. తరువాత కొంత మంది ప్రజలు ఆ సమాధులనే దర్గాలుగా నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆ పన్నెండు దర్గాలను కలిపి “బారా షహీద్‌ మజార్‌ షరీఫ్‌” అని పేర్కొంటారు. అక్కడే మరొక దర్గా “సయ్యద్‌ బాబా” అని “లాల్‌ దర్గా” పేరుతో ఉంది.

రొట్టెల పండుగ పేరుతో 10 నుండి 15 లక్షల మంది ప్రజలు ధర్మాలకు అతీతంగా, ప్రతి ఏట ముహర్రం నెలలో సందర్శిస్తారు. అక్కడ ఉత్సవాల పేరుతో ముహర్రం నెల 10, 11, 12వ తేదిలలో రొట్టెల మార్పిడి జరుగుతుంది. అలా మూడు నాలుగు రోజుల పాటు ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు.

అంటే అక్కడ వచ్ఛేవారి వివిధ మొక్కుబడుల ప్రకారం రొట్టెలకు పేర్లు కేటాయించుకుంటారు. ఉదాహరణకు “పిల్లల రొట్టెలు” – ఎవరికైన సంతానం లేకపోతే ఆ నదిలో నిలబడి తలపై ఆ నది నీళ్ళను తీర్ధంలా చల్లుకొని, సంతానం లేనివారు సంతానం కలిగినవారి నుండి రొట్టెలను తీసుకొని తింటారు. అలా చేస్తే సంతాన ప్రాప్తి జరుగుతుందని వారి మూఢ నమ్మకం. అలా సంతానం లేనివారు రొట్టెలను తిన్న తరువాత వారికి సంతానము కలిగితే, తిరిగి వచ్చి వారుకూడా రొట్టెలను ఇతరులకు ఇస్తారు. అలా అనేక మంది ప్రజలు తమ తమ మ్రొక్కుబడుల ప్రకారం ప్రతి ఏట రొట్టెల మార్పిడి జరిపే ఆచారాన్ని “నెల్లురు రొట్టెల పండుగ” అని అంటారు.

ప్రజల సమస్యలకు అనుగుణంగా రొట్టెలకు పేర్లు పెట్టుకుంటారు. అంటే; ఉద్యోగం రొట్టెలు, ధనం రొట్టెలు, విదేశాలకు పోయే వీసా రొట్టెలు, అసెంబ్లీ రొట్టెలు, ఆరోగ్యం రొట్టెలు, వివాహం రొట్టెలు అని వివిధ సమస్యల పేర్లతో రొట్టెల మార్పిడి జరుగుతుంది. తరువాత అక్కడికి వచ్చేవారు అక్కడ ఉన్న దర్గాలను కూడా ఆరాధిస్తారు. ప్రతి దర్గా వద్ద జరిగే షిర్క్‌ మరియు బిద్‌అత్‌ వంటి అధర్మ కార్యాలను బహిరంగా పాటిస్తారు.

“బారా షహీద్ మజార్‌ షరీఫ్‌”కు వచ్చే ప్రజలు తమ నమ్మకాల ప్రకారం నాణల రూపంలో ఆ దర్గాలపై నాణెములను(చిల్లరడబ్బులు) విసురుతారు. దర్గాల నిర్వాహకులు దర్గాలపై నుండి రూపాయి లేక రెండు రూపాయి బిళ్లలను తీసుకుని, ఎర్రటి లేక పచ్చటి రంగుల గుడ్డపేలికలలో చుట్టి, ప్రజల మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకొని, ఆ ఒక్క రూపాయిని పది రూపాయిలకు లేక ఇరవై రూపాయిలకు విక్రయిస్తారు. ఎందుకంటే? ఆ నాణెములను ప్రజలు తమ దగ్గర ఉంచుకుంటే ధనంలో శుభాలు కలుగుతాయని నమ్మిస్తారు.

అధికమైన సంఖ్యలో స్త్రీలు అక్కడ సమావేశమవుతారు. ఎందుకంటే? మూఢ నమ్మకాల వలలో స్త్రీలే అతి ఎక్కువగా చిక్కుకుంటారు. మరియు ఇస్లాం ధర్మం తెలియని అజ్ఞాన ముస్లింలు మరియు బలహీన విశ్వాసులు అలాంటి మూఢ విశ్వాసాలకు తొందరగా ప్రభావితులవుతారు. ఎందుకంటే? ఎదో విధంగా తమ అదృష్టాలను పరిక్షించుకొని, కష్టాలను దూరం చేసుకోవాలని వారి తపన. మన సమాజంలో అలాంటి మూఢ విశ్వాసాలు కలిగిన వారు చాలా మంది ఉన్నారు. మరియు వారు దేశ, విదేశాల దర్గాలను సందర్శించి ఆరాధిస్తూ ఉంటారు.

కనుక అల్లాహ్  వాటిని ఖండిస్తూ ఇలా తెలియజేసాడు:

إِنْ هِيَ إِلَّا أَسْمَاءٌ سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا أَنزَلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ ۚ إِن يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَمَا تَهْوَى الْأَنفُسُ ۖ وَلَقَدْ جَاءَهُم مِّن رَّبِّهِمُ الْهُدَىٰ

“ఇవన్నీ మీరు మరియు మీ తండ్రి, తాతలు పెట్టిన పేర్లు మాత్రమే, అల్లాహ్‌ వీటిని గురించి ఎట్టి ప్రమాణం  అవతరింప జేయలేదు. వారు కేవలం తము ఊహాగానాలను మరియు తమ ఆత్మలు కోరే మనోవాంఛలను మాత్రమే అనుసరిస్తున్నారు. వాస్తవానికి వారి ప్రభువు తరపునుండి వారి వద్దకు మార్గదర్శకత్వం కూడా వచ్చి ఉన్నది?” (సూరతున్‌ నజ్మ్‌:23)

అల్లాహ్ ఇలా తెలియజేసాడు:

قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِن شِرْكٍ وَمَا لَهُ مِنْهُم مِّن ظَهِيرٍ

(ఓ ప్రవక్తా!)వారికి ఇలా చెప్పు: “అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవ్వంత అధికారంగానీ వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్‌కు సహాయకుడు కూడా కాదు” (సూరతుస్‌ సబా:22).

అల్లాహ్‌ను మాత్రమే ప్రార్ధించాలి. భయం, భక్తి ఆశ, ప్రేమానురాగం, మొరపెట్టుకోవడం, అణుకువ, అశక్తత, శరణు వేడుకోవడం, జిబహ్‌ చేయడము, మొక్కుబడులు చెల్లించడం, ఉపాధిని కోరడం వంటి కార్యాలన్నీ ఆరాధనలే. కనుక ఆ ఆరాధనలు అల్లాహ్‌కే సొంతం చేసి ఆరాధించాలి. అల్లాహ్‌ను తప్ప మరెవరినీ ఆరాధించకూడదు.

కనుక అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు:

وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ

“మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తనూ పంపినా: “నిశ్చయంగా, నేను (అల్లాహ్‌) తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! కావున మీరు నన్నే ( అల్లాహ్‌నే) ఆరాధించండి” అని దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చి పంపాము.” (సూరతుల్‌ అంబియా:25)

అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు:

وَعَلَى اللَّهِ فَتَوَكَّلُوا إِن كُنتُم مُّؤْمِنِينَ

“మీరు నిజంగానే ముస్లిములైతే అల్లాహ్‌నే నమ్ముకోండి” (సూరతుల్‌ మాయిదా:23)

మరోచోట అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు:

وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ

“అల్లాహ్‌ను నమ్మకున్నవారికి అల్లాహ్‌యే చాలు.” (సూరతు తలాఖ్ :3)

ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “ఎప్పుడైతే మీరు సహయం కొరకై మొరపెట్టుకుంటారో అప్పుడు అల్లాహ్‌ను మాత్రమే సహాయానికై ఆర్థించండి.” (తిర్మిజీ:2516, జిలాలుల్‌ జన్నహ్‌: 316-318).

ముఖ్య గమనిక: “రొట్టెల పండుగ పేరున మనం చేసే ఆచారాలు, ఆరాధనలు, మొక్కుబడులు ధర్మం కానే కావు. ఎవరైనా అల్లాహ్‌ పేరుపై తప్ప ఇతరులెవరి పేరుపై నైనా మొక్కుబడులు చెల్లిస్తే అది “షిర్క్” ఆచారమే అవుతుంది. ఒక వేళ ఎవరైనా తెలిసి తెలియక మొక్కుబడులు చేసుకొని ఉంటే, వాటిని నెరవేర్చకూడదు. దాని వల్ల ఎలాంటి నష్టంగాని లేక కీడుగాని జరగదు. కనుక ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “ఎవరైతే అల్లాహ్‌ విధేయత పట్ల మొక్కుబడి చేసుకున్నారో వారు ఆ మొక్కుబడిని తీర్చాలి. మరియు ఎవరైతే అల్లాహ్‌ అవిధేయత పట్ల మొక్కుకున్నారో వారు ఆ మొక్కబడిని తీర్చకూడదు.”” (బుఖారి :2602).


ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 67-70). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)

అఖీదా-యే-తౌహీద్ (అల్లాహ్ ఏకత్వం)- డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం]

బిస్మిల్లాహ్

Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan
దేవుని ఏకత్వం అఖీదా ఏ తౌహీద్ పుస్తకం
డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan దేవుని ఏకత్వం అఖీదా ఏ తౌహీద్ పుస్తకం డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

[ఇక్కడ చదవండి / PDF డౌన్ లోడ్ చేసుకోండి]
https://tinyurl.com/aqeeda-tawheed
[228 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

విషయసూచిక

ఉరుసులు, దర్గాల వాస్తవికత

బిస్మిల్లాహ్

దర్గాలు

1- దర్గాలు అంటే; కొంత మంది ప్రజలు ఒక పుణ్యాత్ముని సమాధిని ఎన్నుకొని, అక్కడ మహిమలు జరుగుతున్నాయని దానిపై గుంబద్‌లు, గోపురాలు నిర్మించి, అక్కడ అర్చకులుగా కొంత మంది కూర్చుని కొన్ని కార్యకలాపాలను నిర్వహించుకొనే స్థలాలను “దర్గాలు” అంటారు.

2- సమాధి చేయబడి ఉన్న వారి సంతానం నుండి ఒక వారసుణ్ణి “సజ్జాదా నషీన్‌(పీఠాధిపతి) గా ఎన్నుకుంటారు. వారినే “పీర్‌ సాహెబ్” అంటారు. మరియు సమాధి చేయబడిన వ్యక్తిని “వలీఅల్లాహ్” గా భావించి దర్గా నిర్మాణం చేస్తారు.

౩- కొంత మంది స్వార్థపరులు అడవుల్లో, కొండల్లో, లేక పట్టణము యొక్క పొలిమేరన ఒక సమాధిని ఉద్బవింపజేసుకొని, దానికి ఒక పుణ్యాత్ముని పేరుపెట్టి, ఆ సమాధి వల్ల అనేక “కరామత్‌లు” (మహిమలు) జరుగుతున్నాయంటూ కట్టుకథలు చెప్పుకుంటారు. ఇలా వివిధ రకాలుగా ‘దర్గా’లను నిర్మంచుకుంటారు.

దర్గాల అలంకరణ:

దర్గాల నిర్వాహకులు దర్గాల అలంకరణ కొరకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. మొట్ట మొదట సమాధులను పటిష్టవంతం చేస్తారు. తరువాత దానిపై ఒక మహా కట్టడాన్ని నిర్మిస్తారు. మశీదుల గుంబద్‌ల వలే దానిపై కూడా గుంబద్‌లు నిర్మిస్తారు. పచ్చటి మరియు కాషాయ రంగులతో సమాధిని కలర్‌ చేస్తారు. చివరికి ఒక పటిష్టవంతమైన ఆరాధన నిలయంగా నిర్మిస్తారు. తరువాత ప్రతి ఏట ఆ సమాధులను ఆకర్ణణీయకంగా, మనోరంజకంగా రూపుదిద్దుతారు. దర్గాలను మరియు వాటిలో ఉన్న సమాధులను నీళ్ళతో కడిగి శుభ్రపరుస్తారు. తరువాత వాటిపైన సిల్కు చాదర్లు మరియు పూల దండలు కప్పుతారు, దర్గా మొత్తం ఎర్రటి మరియు పచ్చటి లైట్లతో అలంకరిస్తారు. పవిత్రంగా భావించి సమాధి చుట్టు దీపాలు వెలిగిస్తారు, సాంబ్రాణి పొగలు రేకెత్తిస్తుంటారు. అక్కడ “ముజావర్‌” గౌరవ మర్యాదలతో కూర్చొని, అక్కడికి ఆరాధన భావంతో వచ్చేవారి కోసం సమాధి పూజలు (ఫాతిహాలు) జరుపుతుంటారు.

ఉరుస్‌ ఆచారాలు:

అరబీ నిఘంటువులో “ఉర్స్‌” అర్దం: పెళ్ళి కొడుకు లేక పెళ్ళి మరియు సంతోషం అన్న అర్దాలున్నాయి. దీనినే ప్రజలు ఉరుస్‌ అని అంటుంటారు.

మన సమాజంలో ప్రసిద్ది చెందిన ‘ఉరుస్‌‘ అంటే: పుణ్యాత్ముల పేరున నిర్మించబడిన దర్గాల (సమాధుల) వద్ద ప్రతి ఏట మరణదినం (వర్ధంతి) ఉత్సవాలు నెరవేర్చి ‘ఉరుస్‌’ అనే వ్యతిరేకమైన పదాన్ని వాడుతున్నారు.

పుణ్యాత్ముడని భావించిన వ్యక్తి మరణించిన తేది ప్రకారం అతని సమాధిపై ‘సందల్‌ కి రస్మ్‌‘ పేరుతో పూల పందిరిని తయారు చేసుకొని ఊరంతా ఊరేగిస్తూ, మహా హంగామా చేసుకుంటూ, దర్గాకి చేరుకొని అక్కడున్న సమాధిపై దానిని ఉంచుతారు. అలాగే జండాను కూడా ఊరంతా ఊరేగిస్తూ తీసుకొచ్చి ఆ దర్గాలోనే ఒక చెట్టున పాతి పెడతారు. దానిని ‘ఝoడా చెట్టు’ అంటారు. మరియు “మలంగ్‌” అనే వ్యక్తి మూడు రోజుల వరకు కాళ్ళను, చేతులను దారాలతో బంధించుకొని ఆ దర్గాలోనే బస చేస్తాడు. ఆ మూడు రోజుల వరకు తినుటకై అతను పండ్లు ఫలాలు మరియు పాలు తీసుకుంటాడు. తరువాత చివరి రోజున ఫకీర్లుజర్బ్”  పేరున తమ శరీరాలలో కమ్మీలు, కత్తులు పొడుచుకునే ‘కనికట్టు‘ నాటకాలు బహిరంగంగా నిర్వహిస్తారు.

ఈ ఉత్సవాలను మూడురోజుల పాటు జరుపుతారు. తరువాత జనసంఖ్య రాకను బట్టి ఉరుసును 15 రోజుల వరకు పెంచుకుంటారు. మరియు ఆ రోజుల్లో సమాధి చుట్టుప్రక్కల మహా సంతను ఏర్పాటు చేస్తారు. ఆ సంతలో నలువైపుల నుండి వ్యాపారస్తులు అక్కడికి చేరుకొని తమ సామగ్రి అమ్మకాలు జోరుగా జరుపుకుంటారు. ఆ దర్గా సిబ్బంది ఆ వ్యాపారస్తుల నుండి బాడుగ పేరుతో సొమ్మును వసూలు చేస్తారు. ఆ సంతలో ప్రత్యేకమైన, ఆకర్షనీయమైన ఖవ్వాలీ పాడే గాయని, గాయకులు ఆటపాటల కచ్చేరీలు రాత్రంతా నిర్వహిస్తారు. ఆ రాత్రుల్లో మద్య పానీయాలు సేవించి, మతిపోయే గంజాయి త్రాగుడుతో అనేక మంది ప్రజలు ఊగుతూ తూగుతుంటారు. ఆ ‘ఉరుసుల’లో పిల్లలు, పెద్దలు మరియు వృద్దులు, ఆడా మగా, హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు పాల్గొంటారు. దీనిని పుణ్యాత్ముల పేరిట ‘“ఉరుస్‌” ఉత్సవాలు అని జరుపుకుంటారు.

ఈ ఆచారాలకు మరియు ఇస్లాం ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. కనుక ఇది ఇస్లామీయ ధర్మ ఆచారం అనటం కూడా ఘోరమైన పాపమే.

దర్గాల గురువులు మరియు వారి వాస్తవికత

సమాధి ఆధిపత్యానికి చెందిన పీర్‌సాహెబ్‌ (పీఠాధిపతి) చుట్టూ కొందరు ప్రత్యేకమైన శిష్యులు ఉంటారు, వారిని ‘ముజావర్లు” అంటారు. వీరే అక్కడికి వచ్చే ప్రజలకు గురువులు, ఆ సమాధులకు అర్చకులు. వీరు ఇస్లామీయ ధర్మఙ్ఞానం లేని మూర్ఖులు, మత్తుపానీయాలు సేవించే మస్తాన్లు, గంజాయి సిగరెట్లు కాల్చే గుణహీనులు, తంబాకు మరియు పాన్‌పరాక్‌ నమిలే  అసమర్థులు, ప్రజల విశ్వాసాలతో ఆడుకునే మంత్రగాళ్ళు, భయంభక్తి లేని షైతానులు, మోసగాళ్ళకే మోసగాళ్ళు, అమాయక ప్రజల సొమ్మును దోచుకొనే గజదొంగలు, పొట్టకొస్తే అక్షరం ముక్కరాని అజ్ఞానులు, లేనిపోని కట్టు కథలు “ఔలియాల కరామతులు” (మహిమలు) అంటూ ఉపన్యాసాలు పీకుతారు. అమాయక ప్రజలను మూఢ విశ్వాసాల లోయలోకి నెట్టుతారు. అలా సమాధి చేయబడి ఉన్నవారిని మరియు ఆ పీఠాధిపతిని దేవుని స్థాయికి పెంచి స్పష్టమైన షిర్క్‌ కార్యాకాలాపాలు నిర్వహస్తుంటారు.

అలాంటి గుణహీనులు సంతానం లేనివారికి సంతాన ప్రాప్తిని, నిరుద్యోగులకు ఉద్యోగాలను, కష్టాల నుండి రక్షణను, నష్టాల నుండి లాభాలను, దుఃఖాల నుండి సుఖాలను, అశాంతి నుండి శాంతిని, అస్వస్థత నుండి స్వస్థతను, చేతబడి నుండి రక్షణను, అపజయాల నుండి విజయాలను, అగౌరవం నుండి గౌరవాలను ప్రసాదిస్తారా! అంతే కాదు, దేవుని ఆరాధన లేకుండానే పరలోక మోక్షాన్ని, స్వర్గ ప్రవేశ పత్రాలను సయితం ప్రసాదిస్తామంటూ, ఆ పత్రాలను కొన్నవారికి స్వర్గమే నిలయమంటూ ప్రచారం కూడా చేస్తుంటారు.

ఇస్లాం ధర్మంలో సమాధుల కట్టడాలు , వాటిపై ముజావర్లుగా కూర్చోవటం నిషిద్ధం:

సమాధులను సున్నంతో లేక సిమెంట్‌తో పటిష్టవంతంగా నిర్మించడం, వాటిని గొప్ప స్థానానికి పెంచడం, అక్కడ పీఠాధీపతులు (ముజావర్‌)గా కూర్చోవడం అధర్మమైనది. మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) వాటి గురించి కఠినంగా హెచ్చరించారు.

హజ్రత్ జాబిర్‌ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం):

ఉరుసులు, దర్గాల వాస్తవికత

“సమాధిని పటిష్టవంతం చేయడాన్ని, దానిపై (ముజావర్లుగా) కూర్చోవటాన్ని, దానిపై కట్టడం నిర్మించడాన్ని నిషేధించారు” (ముస్లిం :970)

హజ్రత్ అలీ (రజియల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో ఇలా అన్నారు:

ఉరుసులు, దర్గాల వాస్తవికత

“ప్రతి ఆరాధ్య విగ్రహాన్ని పగలగొట్టు మరియు ప్రతి ఎత్తుగా ఉన్న సమాధిని నేలమట్టం చెయ్యి.” (ముస్లిం :969)

ఇక్కడ ఎత్తుగా కట్టబడిన సమాధిని సహితం నేలమట్టం చేయవలసిందిగా ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేసారు. అయిన మన అమాయక ముస్లింలు పుణ్యాత్ముల పేరుతో లేక మహానీయుల పేరుతో సమాధుల్ని ఎత్తుగా కట్టడమే కాకుండా, వాటిపై పటిష్టవంతమైన గోపురాలు కట్టి, ఆరాధ్య నిలయాలుగా చేసుకున్నారు. మరియు వాటి వద్ద ముజావర్లగా నియుక్తులై అమాయక ప్రజలను ధర్మం పేరుతో మోసగిస్తున్నారు.

సమాధుల ఆరాధన

అనేక మంది ప్రజలు మూఢ విశ్వాసాలకు గురికాబడి, సమాధుల వద్దకు జియారత్‌ పేరున, వాటి ఆరాధనకై పలు ప్రదేశాలకు ప్రయాణిస్తుంటారు. మరియు కొంత మంది ప్రజలు హజ్‌ ఆరాధనకు ప్రయాణించినట్లు సమాధుల ఆరాధనకై ప్రయాణిస్తారు. ఏ విధంగానయితే ఒక్క అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలో అదే విధంగా ఆ సమాధులను ఆరాధిస్తారు. అంటే: “దర్గాల వద్ద సజ్దాలు  చేయటం, వాటి చుట్టూ ప్రదక్షణలు చేయటం, అక్కడ తలనీలాలు అర్పించటం, వాటి ముందు భయంభక్తిని చూపటం, అక్కడ నమాజులు చదవటం, ఖుర్‌ఆన్‌ పారాయణం చేయటం, వారిని మొరపెట్టుకోవటం, వారి పేరుతో మొక్కుబడులు చెల్లించటం, వారి పేరున జంతువులను బలినివ్వటం, అక్కడ అన్నదానాల ఏర్పాటు చేయటం, తమ మొక్కుబడుల ప్రకారం అక్కడ బస చేయటం వంటి అనేక విధాల ఆరాధనలు పాటిస్తారు.

ఆ సమాధుల పట్ల అతిగా ప్రవర్తిస్తూ వాటిని చుంబించటం, అక్కడ కాల్చబడిన అగరబత్తీల వీబూదిని తబ్బరుక్‌గా  భావించి తినడం, దానిని శరీరంపై రుద్దుకోవటం, అక్కడ దీపాలుగా వెలిగించబడిఉన్న నూనెను, సమాధిపై ఉన్న పూలను తబ్బరుక్‌గా తీసుకోవటం, టెంకాయలు మరియు తీపు వస్తువులు ఆ సమాధుల కొరకు అర్పించి, వాటిపై ఫాతిహాలు చదివిన తరువాత తబ్బరుక్‌గా భావించటం వంటి అనేక విధాల కార్యకలాపాలు జరుపుతారు. దాని ప్రతిఫలంగా సమాధిలో ఉన్న ఆ “వలీఅల్లాహ్‌” సిఫారసు అల్లాహ్‌ వద్ద వారికి ప్రాప్తిస్తుందని విశ్వసిస్తారు. మరియు అల్లాహ్ వద్ద వారు ఎవరికైనా సిఫారసు చేస్తే, వారి సిఫారసును అల్లాహ్‌ ధిక్కరించడని భావిస్తారు.

మరియు కొంత మంది ప్రజలు: అల్లాహ్‌కు చెందిన కొన్ని అద్భుతమైన శక్తులకు ‘ఔలియాలు‘ కూడా అర్హులని విశ్వసిస్తారు. మరియు ఆ పుణ్యాత్ములే వారిని నష్టాల నుండి ఆదుకుంటారు, కష్టాల నుండి రక్షిస్తారు అని విశ్వసిస్తారు. అందుకని వారు దేశవిదేశాలలో పేరు ప్రతిష్టలు పాందిన దర్గాలకు “జియారత్‌” పేరున తిరుగుతుంటారు. మరియు యా అలీ మదద్‌, యా ముష్కిల్‌ కుషా దస్తగీర్ , యా గౌస్‌ మదద్‌, యా ఖాజా గరీబున్‌ నవాజ్‌ వంటి షిర్క్‌ పదాలను వాడుతుంటారు.

దర్గాల నిర్మాణం మరియు వాటి సందర్శనం, వాటి కొరకు ప్రయాణించడం మరియు అక్కడ నిర్వహించే ఏ ఒక్క కార్యానికీ ఖుర్‌ఆన్‌ మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు. అలైహి వసల్లం) ద్వారా ఎలాంటి ప్రామాణికమైన సాక్ష్యాధారాలు లేవు. పైగా ఆరాధన భావంతో ఇలాంటి ప్రదేశాలకు ప్రయాణించడం లేక సందర్శించడం ఇస్లాం ధర్మంలో నిషేధించడం జరిగింది. కనుక ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు;

ఉరుసులు, దర్గాల వాస్తవికత

“మీరు మూడు మసీదులకు తప్ప మరేచోటుకు (ఆరాధన భావంతో) ప్రయాణం చేయకండి. ఒకటి కాబతుల్లాహ్‌ (మక్కా మసీదు), రెండు మస్జిదే నబవి (మదీనా మసీదు), మూడు మస్జిదే అఖ్సా (జెరూసలేం మసీదు) ” (బుఖారీ:1115, ముస్లిం: 2475)

హజ్రత్  అబూ హురైరా (రజియల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

ఉరుసులు, దర్గాల వాస్తవికత

“మీ ఇండ్లను స్మశానవాటిక చేయకండి, నా సమాధిని మీరు (ప్రజలు) ఉత్సవ కేంద్రంగా చేయకండి. అయితే నా కొరకు దరూద్‌ దుఆ చేయండి, మీరు ఎక్కడ ఉన్నా మీప్రార్ధన నాకు చేరుతుంది.” (అబూదావూద్‌: 2042)

హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హ) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణ సమయాన ఇలా ప్రవచించారు:

“అల్లాహ్‌ యూదుల్ని, క్రైస్తవుల్ని శపించాడు. వారు తమ ప్రవక్తల సమాధుల్ని సజ్‌దా (ఆరాధ్య) నిలయాలుగా చేసుకున్నారు.” (బుఖారీ)

పైన ఇవ్వబడిన హదీసులను గమనించినట్లయితే ప్రవక్తల సమాధులను ఆరాధ్య నిలయాలుగా చేసుకోకూడదని ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాంటప్పుడు పుణ్యాత్ముల సమాధులను ఆరాధన పరంగా గౌరవించడం, ఆరాధన పరంగా సమాధుల వద్దకు ప్రయాణించడం, అక్కడ ఉరుసుల పేరుతో సంబరాలు జరపడం వంటి అధర్మ కార్యాలు ధర్మం ఎలా ఔతుంది? మరియు యూదులు, క్రైస్తవులు అల్లాహ్ ఆగ్రహానికి మరియు మార్గభ్రష్ఠత్వానికి గురికాబడిన ముఖ్య కారణం సమాధులను ఆరాధ్య నిలయాలుగా చేసుకోవడమే అన్న విషయం కూడా స్పష్టంగా ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసుల ద్వారా తెలుస్తున్నది.

అలాగే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సమాధి వద్దకు సహితం సంబరాల (ఉరుసు) కొరకు సమావేశం కాకూడదని హెచ్చరించారు. చివరకు ఆయనపై దరూద్‌ పంపాలనుకున్నా సమాధి వద్దకు రావలసిన అక్కర లేదు. మీరెక్కడ నుండి ఐనా నా కొరకు దరూద్‌ చదవండి, అది నా వద్దకు చేర్చబడుతుంది అన్న విషయాన్ని కూడా తెలియజేశారు.

ఇస్లామీయ సోదరులారా! ప్రవక్తల సమాధులనే ఉత్సవ స్థలాలుగా, ఆరాధ్య నిలయాలుగా చేసుకోవడం తప్పయితే, ‘ఔలియాల’ సమాధుల్ని ఉత్సవ కేంద్రాలుగా, ఆరాధ్య నిలయాలుగా చేసుకొనే ప్రశ్న ఎలా జనిస్తుంది? యదార్ధం ఏమిటంటే, కొంత మంది ప్రజలు తమ స్వార్ధాల కొరకు ఇస్లామీయ హద్దుల్ని దాటి దర్గాల సందర్శన పేరుతో వాటిని ఆరాధ్య నిలయాలుగా, ఉత్సవ ప్రదేశాలుగా చేసుకున్నారు. అలాంటివారంతా ప్రవక్త ముహమ్మద్‌ ( సల్లల్లాహు అలైహి వసల్లం) హితవుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అందువలన సమాధుల కట్టడాలు, అక్కడ నిర్వహించే ఆరాధ్య కార్యాలు, ఖవ్వాలీల కచ్చేరీలు పూర్తిగా ఇస్లామీయ ధర్మానికి విరుద్ధం. కనుక ‘ఉరుసు’లను నిర్వహించడం, ఉరుసుల కొరకు చందాలు ఇవ్వటం, వారికి సహాయం చేయటం వంటి కార్యాలన్నీ ఇస్లామీయ నిజ ధర్మానికి వ్యతిరేకంగా సహాయం చేయటంతో సమానమే.


ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 100-108). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)

ఇతరములు:

నీ దేవుడు ఇతడేనా? (من هو إلهك) [వీడియో & టెక్స్ట్]


నీ దేవుడు ఇతడేనా? (من هو إلهك)
https://www.youtube.com/watch?v=Sukuaeb6NQg [ 3 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం ఖురాన్‌లోని సూరా రూమ్, 40వ ఆయతుపై దృష్టి పెడుతుంది. అల్లాహ్‌కు మాత్రమే ఉన్న నాలుగు ప్రత్యేక శక్తులను ఇది వివరిస్తుంది: సృష్టించడం, జీవనోపాధిని ప్రసాదించడం, మరణాన్ని ఇవ్వడం మరియు పునరుత్థానం చేయడం (తిరిగి బ్రతికించడం). అల్లాహ్‌తో పాటు పూజించబడే ఇతర భాగస్వాములు (దైవాలు) ఈ పనులలో ఏ ఒక్కటైనా చేయగలరా అని ఈ ఆయతు ప్రశ్నిస్తుందని వక్త నొక్కిచెప్పారు. వారు ఏమీ చేయలేరని, కాబట్టి అలాంటి భాగస్వామ్యాల నుండి అల్లాహ్ పవిత్రుడు మరియు ఉన్నతుడని స్పష్టం చేశారు. అందువల్ల, మానవులు ఈ నాలుగు గుణాలు ఉన్న ఏకైక సత్య దేవుడైన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలని, ఎందుకంటే మరణం తర్వాత ప్రతి ఒక్కరూ ఆయన వద్దకే తిరిగి వెళ్ళాలని మరియు అక్కడ ఆయనే తప్ప మరెవరూ సహాయం చేయలేరని ఇది ఒక శక్తివంతమైన పిలుపు.


أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అ’ఊజు బిల్లాహి మినష్-షైతానిర్-రజీమ్)
(శపించబడిన షైతాన్ నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను).

اللَّهُ الَّذِي خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ
(అల్లాహుల్లజీ ఖలఖకుమ్ సుమ్మ రజఖకుమ్ సుమ్మ యుమీతుకుమ్ సుమ్మ యుహ్యీకుమ్)

సూరా రూమ్‌లోని ఆయతు నంబర్ 40లో అల్లాహుతాలా చెప్పాడు,

“అల్లాహ్! ఆయనే మిమ్మల్ని సృష్టించాడు. ఆయనే మీకు ఉపాధి ప్రసాదించాడు. మరియు ఆయనే మీకు మరణం ప్రసాదిస్తాడు. ఆ తర్వాత మళ్లీ మిమ్మల్ని బ్రతికిస్తాడు.”

ఈ నాలుగు విషయాలు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తెలిపిన తర్వాత ఏమంటున్నాడో కొంచెం గమనించండి:
هَلْ مِن شُرَكَائِكُم مَّن يَفْعَلُ مِن ذَٰلِكُم مِّن شَيْءٍ
(హల్ మిన్ షురకా’ఇకుమ్ మన్ యఫ్’అలు మిన్ జాలికుమ్ మిన్ షై’)

“మీరు ఆ అల్లాహ్‌ను వదిలి ఎవరినైతే ఆరాధిస్తున్నారో, ఎవరెవరినైతే సాటి కల్పిస్తున్నారో, వారిలో ఏ ఒక్కరైనా ఈ నాలుగు, నాలుగిటిలో ఏ ఒక్క విషయం చేసేటటువంటి శక్తి గలవారా?”

ఏంటి ఈ నాలుగు? సృష్టించడం, మరియు ఉపాధిని ప్రసాదించడం, బ్రతికి ఉన్న వారికి మరణం ప్రసాదించడం, మరియు అందరూ చనిపోయిన తర్వాత ప్రళయం సంభవించిన తర్వాత మరోసారి వారందరినీ బ్రతికింపజేసి, వారందరినీ లేపి, సమూహపరచి, వారితో లెక్క తీసుకోవడం. ఈ నాలుగు విషయాలు గానీ, నాలుగిటిలో ఏదైనా ఒకటి గానీ, మీ ఈ సాటి కల్పింపబడేవారు ఎవరైనా చేయగలుగుతారా? వాస్తవానికి ఎవరూ చేయలేరు. అందు గురించే అల్లాహ్ స్వయంగా ఏమంటున్నాడు:

سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
(సుబ్హానహూ వ త’ఆలా అమ్మా యుష్రికూన్)
“వారు ఆ అల్లాహ్‌తో పాటు ఎవరెవరినైతే సాటి కల్పిస్తున్నారో, భాగస్వాములుగా చేస్తున్నారో, అలాంటి భాగస్వామ్యానికి ఆ అల్లాహ్ ఎంతో అతీతుడు మరియు ఎంతో ఉన్నతుడు. అలాంటి ఏ అవసరం అల్లాహ్‌కు లేదు.”

అందుగురించే మానవులారా! మానవులారా! ఇలాంటి నాలుగు రకాల క్వాలిటీస్ ఉన్న ఆ సత్య ప్రభువును మాత్రమే మీరు పూజించండి. ఎవరెవరినైతే పూజిస్తున్నారో, వారిలో ఇలాంటి శక్తి ఏదైనా ఉందా లేదా ముందే మీరు పరిశీలించుకోండి. లేదా అంటే, ఒక రోజు కాకున్నా ఒక రోజు మనం చనిపోయేవాళ్ళం. ఆ తర్వాత ఆ సృష్టికర్త వద్దకే మనం మరలింపబడతాము. అక్కడ మనకు ఆ అల్లాహ్ తప్ప ఇంకా ఎవరూ కూడా పనికిరారు. అల్లాహ్ మనందరికీ సన్మార్గం చూపుగాక.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
(మరియు మా చివరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రములు).

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్)
(మీపై శాంతి మరియు అల్లాహ్ కారుణ్యం కురియుగాక).

ఇతరములు: