రజబ్ మాసపు క్రొత్త పోకడ (బిద్అత్)లు – జాదుల్ ఖతీబ్ [ఖుత్బా]

[డౌన్ లోడ్ PDF]

1) రజబ్ మాసం నిషేధిత మాసాల్లో ఒకటి
2) రజబ్ మాసంలోని కొన్ని బిద్అత్ (కొత్తపోకడ)లు
3) సలాతుల్ రగాయిబ్

4) రజబ్ మాసంలో ప్రత్యేక ఉపవాసాలు
5) రజబ్ మాసపు 27వ రాత్రి ఆరాధన లేదా మరుసటి దినపు ఉపవాసం
6) రజబ్ మాసంలో ఉమ్రా చేయడం ఉత్తమమా?
7) రజబ్ కే కుండే (రజబ్ మాసపు నైవేద్య వంటకాలు)

ఇస్లామీయ సోదరులారా! నిషేధిత నాలుగు మాసాల్లో రజబ్ మాసం కూడా ఒకటి.

అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ ۚ

నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర – అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజు నుంచీ (ఈ లెక్క ఇలాగే సాగుతోంది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి). ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి.” (తౌబా: 36)

అంటే మొదట్నుంచి అల్లాహ్ దృష్టిలో మాసాల సంఖ్య పన్నెండు. అందులో నాలుగు నెలలు నిషేధిత మాసాలు.

ఈ నాలుగు నిషిద్ధ మాసాలు ఏవి?

దీని వివరణ మనకు సహీహ్ బుఖారీ లోని ఒక హదీసు ద్వారా తెలుస్తుంది. అబూ బక్ర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఒక సం॥ పన్నెండు నెలలు కలిగి వుంది. వీటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి. వీటిలో మూడేమో ఒకదాని తర్వాత మరొకటి వచ్చేవి. అవేమంటే – జిల్ ఖాదా, జిల్ హిజ్జ మరియు ముహర్రం. ఇక నాల్గవది జమాదిస్సానీ మరియు షాబాన్ నెలల మధ్య వచ్చే రజబ్ -ఏ-ముజిర్.” (బుఖారీ – తౌబా సూరహ్ తఫ్సీర్)

ఈ హదీసులో రజబ్ మాసాన్ని ‘ముజిర్’ తెగతో జోడించి చెప్పబడింది. కారణం ఏమిటంటే ఇతర తెగల కన్నా ఈ తెగ రజబ్ మాసాన్ని ఎక్కువగా గౌరవిస్తూ మితి మీరి ప్రవర్తించేది.

ప్రియులారా! ఇంతకు ముందు పేర్కొన్న – నాలుగు నిషిద్ధ మాసాలను గూర్చి తెలిపే తౌబా సూరాలోని ఆయతును అల్లాహ్ వివరించాక (ప్రత్యేకంగా) “మీపై మీరు దౌర్జన్యం చేసుకోకండి” అని ఆజ్ఞాపించాడు.

దౌర్జన్యం విషయానికొస్తే అది సం॥ పొడుగునా, ఎల్లవేళలా వారించ బడింది. కానీ, ఈ నాలుగు మాసాల్లో – వాటి గౌరవాన్ని, పవిత్రతను దృష్టిలో వుంచుకొని అల్లాహ్ ప్రత్యేకంగా, ‘దౌర్జన్యం చేసుకోకండి’ అని వారించాడు.

ఇక్కడ “దౌర్జన్యం” అంటే అర్థం ఏమిటి? ఒక అర్థం ఏమిటంటే – ఈ మాసాల్లో యుద్ధాలు, ఒకర్నొకరు చంపుకోడాలు చేయకండి అని. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

”నిషిద్ధ మాసాల్లో యుద్ధం చెయ్యటం గురించి ప్రజలు నిన్ను అడుగుతున్నారు. నువ్వు వారికిలా చెప్పు – ఈ మాసాలలో యుద్ధం చెయ్యటం మహాపరాధం.” (బఖర : 217)

అజ్ఞాన కాలంలో కూడా ప్రజలు ఈ నాలుగు మాసాల నిషేధాన్ని గుర్తించి వాటిలో యుద్ధాలు, గొడవలకు స్వస్తి పలికేవారు. అరబ్బీభాషలో ‘రజబ్’ అన్న పదం ‘తర్జీబ్‘ నుండి వచ్చింది. దీని అర్థం ‘గౌరవించడం‘ అని కూడా. ఈ మాసాన్ని ‘రజబ్’ అని పిలవడానికి కారణం అరబ్బులు ఈ మాసాన్ని గౌరవించేవారు. ఈ మాసంలో విగ్రహాల పేరు మీద జంతువులు బలి ఇచ్చేవారు. ఈ ఆచారాన్ని ‘అతీరా’ అని పిలిచేవారు. తదుపరి ఇస్లాం వచ్చాక అది కూడా వీటి గౌరవాన్ని, పవిత్రతను యధావిధిగా వుంచి వీటిలో గొడవ పడడాన్ని పెద్దపాపంగా ఖరారు చేసింది. కానీ, రజబ్ మాసంలో తలపెట్టే ‘అతీరా’ కార్యాన్ని పూర్తిగా నిషేధించింది.

జుమా నమాజ్ యొక్క ప్రత్యేకతలు, ఘనతలు  – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా]

అంశము: జుమా నమాజ్ యొక్క ప్రత్యేకతలు, ఘనతలు         

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

మొదటి ఖుత్బా :-

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

ఓ ముస్లింలారా! అల్లాహ్ యొక్క దైవభీతిని కలిగి ఉండండి, ఎల్లవేళలా ఆయన భయాన్ని కలిగి ఉండండి మరియు తెలుసుకోండి! అల్లాహ్ యే ఈ సృష్టి ప్రదాత. ఆయన ఎవరిని కోరుతాడో వారికి ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు, వారు మనుషులైనా లేక ప్రదేశమైనా, లేక ఏదైనా సందర్భం అయినా, లేక ఏదైనా ఆరాధన అయినా అది ఆయన వివేకంపై ఆధారపడి ఉంది. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ
(నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు.) (అల్ ఖసస్ 28:68)

మరియు నిశ్చయంగా అల్లాహ్ నమాజులలో జుమా నమాజును ఎంచుకున్నాడు. మరియు దానికి కొన్ని ప్రత్యేకతలను ప్రసాదించాడు. మరియు కొన్ని సున్నతులను మరికొన్ని ఆచరణలను అభిలషణీయం (ముస్తహబ్)గా నిర్వచించాడు.

1. జుమా ప్రార్థన ఇస్లాం యొక్క అతి ముఖ్యమైన విధులలో ఒకటి మరియు ముస్లింల గొప్ప సమావేశాలలో ఒకటి.

2. జుమా నమాజ్ యొక్క సున్నతులు:- (గుసుల్ చేయడం) అనగా తప్పనిసరిగా తలస్నానం చేయడం, సువాసనలు పూసుకోవడం, మరియు మిస్వాక్ చేయడం, మంచి పరిశుభ్రమైన దుస్తులు ధరించడం సున్నత్ ఆచరణ లోనివి.  అబూ దర్దా (రదియల్లాహు అన్హు) గారి హదీసు ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు; “ఎవరైతే జుమ్అహ్ రోజు తలస్నానం చేసి, మంచి అందమైన దుస్తులు ధరించి మరియు పరిమళాలు పూసుకొని ప్రశాంతంగా జుమా నమాజ్ కొరకు బయలుదేరుతాడో దారి మధ్యలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని వేధించకుండా ఉండి, మస్జిద్ చేరుకుని తన అదృష్టం కొద్ది నఫిల్ నెరవేర్చి ఇమామ్ కొరకు వేచి చూస్తూ ఉంటాడో’ అతని రెండు జుమాల మధ్య పాపాలు క్షమించబడతాయి.” (అహ్మద్)

సల్మాన్ ఫార్సీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు; “మనిషి శుక్రవారం నాడు తలంటు పోసుకొని, వీలైనంతవరకు పరిశుద్ధతను పాటించి, నూనె రాసుకొని లేక తన ఇంట్లో ఉన్న పరిమళాన్ని పూసుకుని, ఆ తర్వాత మస్జిద్ కి వెళ్లి అక్కడ ఏ ఇద్దరి మధ్య నుంచి కూడా తోసుకొని వెళ్ళకుండా (ఎక్కడో ఒక చోట) తన అదృష్టంలో వ్రాసివున్న నమాజు చేసుకొని ఆ తర్వాత ఇమామ్ ఖుత్బా (ఉపన్యాసం) ఇచ్చినప్పుడు నిశ్శబ్దంగా కూర్చుంటే ఆ శుక్రవారం నుండి మరొక శుక్రవారం వరకు అతని వల్ల జరిగే పాపాలు మన్నించబడతాయి”. (బుఖారి)

హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “జుమ్అహ్ నాడు గుసుల్ (తలంటు స్నానం) చేయటం ప్రతి వయోజనుడికి తప్పనిసరి (వాజిబ్) మరియు వారు మిస్వాక్ చేయాలి మరియు ఒకవేళ పరిమళం ఉంటే పూసుకోవాలి” (బుఖారీ-ముస్లిం)

3. జుమ్అహ్  యొక్క మరొక సున్నత్ ఏమిటంటే నమాజు కొరకు ప్రత్యేకమైన దుస్తులు ఏర్పాటు చేసుకోవాలి. ఆధారం: ఆయిషా (రదియల్లాహు అన్హ) గారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త వారు శుక్రవారం రోజున ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు, అయితే ప్రజలు రోజు వినియోగించే దుస్తువులను ధరించి ఉన్నారు అప్పుడు అలాంటి వారిని ఉద్దేశించి ఇలా అన్నారు “ఈ రోజు మీరు (ప్రజలు) గనక అవకాశం ఉండి ఉంటే రోజూ ధరించే దుస్తులు కాకుండా జుమా నమాజు కొరకు ప్రత్యేకమైన దుస్తులు ఏర్పాటు చేసుకోండి” అని అన్నారు.(అబూ దావుద్)

ఈ హదీసు ద్వారా అర్థమయ్యే విషయం ఏమిటంటే జుమా నమాజ్ కొరకు అన్నిటికంటే అందమైన దుస్తులను ఏర్పాటు చేసుకోవాలి అనే విషయం తెలుస్తుంది.

4. జుమా నమాజ్ యొక్క అభిలషణీయమైన (ముస్తహబ్) కార్యాలలో ఒకటి మస్జిదును పరిమళింప చేయాలి.  ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) గారు ఇలా ఆజ్ఞాపించారు – “మీరు మధ్యాహ్నం వేళ జుమా రోజున మస్జిదె నబవిని సువాసనలతో పరిమళింప చేయండి”. (ముస్నద్)

5. జుమా నమాజ్ యొక్క సున్నతులలో ఒకటి జుమా నమాజ్ కొరకు త్వరపడటం, మరియు కాలినడకన మస్జిదుకు వెళ్లడం. ఇది ఉత్తమమైన ఆచరణ.

ఔస్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త  ప్రవచనం, “జుమా రోజు స్నానం చేయించి, తాను కూడా స్నానం చేసి, ఉదయాన్నే ప్రారంభ సమయంలో మస్జిద్ కు వాహనంపై రాకుండా నడచి వచ్చి, ఇమాముకు దగ్గరగా కూర్చొని శ్రద్ధగా ఖుత్బా విని ఎటువంటి చెడుపని చేయకుండా ఉంటే, అతని ప్రతి అడుగుకు బదులు సంవత్సరమంతా ఉపవాసాలు మరియు రాత్రంతా ఆరాధనలు చేసినంత పుణ్యం లభిస్తుంది.” (తిర్మిజి’, అబూ దావూద్, నసాయి)

దైవప్రవక్త  ప్రవచనంలో గుసుల్ చేయించమని ఉంది, అనగా తన భార్యతో సంభోగించడం. దీని వివరణ అహ్మద్ గారు ఇలా తెలియజేశారు; మరియు ఇందులో ఉన్నటువంటి వివేకాత్మకమైన విషయాన్ని కూడా తెలియపరిచారు, సంభోగం వలన మనిషి మనసుకు ప్రశాంతత లభిస్తుంది  దాని వలన ఒక నమాజికి నమాజులో ఉపశమనం లభిస్తుంది.

మరొక వివరణ ఏమిటంటే తలను శుభ్రంగా కడగడం, తలంటి స్నానం చేయడం ఎందుకంటే మామూలుగా మనం తలకు నూనె రాస్తాము అందువలన గుసుల్ స్నానం చేసే ముందు తలను శుభ్రంగా కడగమని ఆజ్ఞాపించబడింది.

జుమా నమాజ్ కొరకు త్వరగా మస్జిద్ చేరుకోవడానికి గొప్ప ప్రాధాన్యత ఉంది. అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయితే శుక్రవారం రోజు లైంగిక అశుద్ధావస్థ నుండి పరిశుద్ధత పొందటానికి చేస్తున్నంత చక్కగా ‘గుస్ల్’ (స్నానం) చేసి జుమా నమాజ్ చేయటానికి త్వరగా వెళతాడో అతను ఒక ఒంటెను బలి ఇచ్చినట్లుగా పరిగణించబడతాడు. అతని తర్వాత రెండవ వేళలో (ఆ విధంగా స్నానం చేసి) వెళ్ళే వ్యక్తి ఒక ఆవును బలి ఇచ్చినట్లుగా భావింపబడతాడు. ఆ తర్వాత మూడో వేళలో వెళ్ళే వాడికి కొమ్ములు తిరిగిన పొట్టేలును బలి ఇచ్చినంత పుణ్యం లభిస్తుంది. ఇక నాల్గవ వేళలో వెళ్ళేవాడు ఒక కోడిని బలిచ్చినట్లుగా, ఐదవ వేళలో వెళ్ళేవాడు ఒక గ్రుడ్డును దానం చేసినట్లుగా పరిగణించ బడతాడు. ఆ తర్వాత ఇమామ్ (ఖుత్బా ఇవ్వడానికి) బయలుదేరి రాగానే దైవదూతలు (హాజరు వేయటం ఆపి) ఖుత్బా వినటానికి మస్జిద్లోకి వచ్చేస్తారు”.(బుఖారీ-ముస్లిం)

6. జుమా నమాజ్ యొక్క ప్రత్యేకతలలో మరొకటి ఏమిటంటే; నమాజ్ కొరకు మస్జిద్ వైపు రావాలి మరియు ఇమామ్ మింబర్ పై ఎక్కక మునుపే నఫిల్ నమాజులు ఆచరించాలి. అది సూర్యుడు నడి నెత్తిపై నుండి వాలే సమయంలోనైనా సరే అనివార్యం (మక్రూహ్) కాదు దీని ఆధారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి హదీసు ద్వారా మనకు అర్థమవుతుంది, ఇప్పుడే మనం దాన్ని చదివి ఉన్నాము “అతని అదృష్టంలో ఎంత నమాజ్ అయితే ఉందో దాన్ని ఆచరించాలి” ఇది ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) గారి మాట మరియు ఇమామ్ ఇబ్నే తైమియా (రహిమహుల్లాహ్)గారు కూడా ఇలానే అన్నారు.

8. జుమా నమాజ్ యొక్క సున్నతులలో ఒకటేమిటంటే ఖుత్బా సమయంలో మౌనంగా ఉండాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలియజేశారు; “శుక్రవారం రోజు ఇమామ్ జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు, మీరు గనక మీ (ప్రక్కన కూర్చున్న) సహచరునితో ‘నిశ్శబ్దంగా’ ఉండు అని అంటే మీరొక పనికిమాలిన పనికి పాల్పడినవారవుతారు.” (బుఖారి- ముస్లిం)

9. జుమా నమాజు యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే; ఆ రెండు రకాతులలో సూర జుమా మరియు సూర మునాఫిఖూన్ లేక సూర ఆలా మరియు సూర గాషియా పఠించాలి. ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఈ సూరాలను జుమా నమాజులో చదివేవారు. ఇమామ్ ఇబ్నే ఖయ్యిం (రహిమహుల్లాహ్) గారు జుమా రోజున ఈ రెండు సూరాలు పఠించడం వెనుక ఉన్న వివేకాన్ని తెలియపరుస్తూ ఇలా అన్నారు; ఈ సూర జుమా నమాజ్ కొరకు  త్వరపడడానికి మరియు దాని కొరకు వచ్చే అడ్డంకులు తొలగించుకోవడానికి మరియు అతి ఎక్కువగా అల్లాహ్ ను స్మరించడం యొక్క ఆదేశాన్ని కలిగి ఉంది, దీని వలన ప్రజలకు ఇహపరాల సాఫల్యం లభిస్తుంది మరియు అల్లాహ్ స్మరణను మరవడం ద్వారా ఇహపరాల జీవితం వినాశనానికి లోనవుతుంది, రెండవ రకాతులో మునాఫిఖూన్ పటించబడుతుంది దీనికి గల కారణం ఏమిటంటే ఉమ్మతును దీని వలన కలిగే వినాశనం నుంచి హెచ్చరించడానికి మరియు ప్రజల యొక్క సిరిసంపదలు వారిని జుమా ఆరాధన నుంచి ఏమరపాటుకు లోను కాకుండా చేయడానికి ఒకవేళ ప్రజలు అలా చేస్తే వారు తప్పకుండా నష్టానికి లోనవుతారు. మరియు అదే విధంగా ఈ సురా పఠించడానికి గల కారణం ప్రజలను దానధర్మాలు చేయడం కొరకు ప్రేరేపించడం, మరియు అకస్మాత్తుగా వచ్చేటువంటి ఆ మరణం గురించి అవగాహన కలుగచేయడం, ఆ మరణ సమయంలో ప్రజలు కొంత సమయం కావాలని కోరుకుంటారు కానీ వారి ఆ కోరిక అస్సలు నెరవేరదు.

10. జుమా నమాజ్ యొక్క ప్రత్యేకతలలో ఒకటి ఏమిటంటే ఎవరైతే దీనిని విడిచిపెడతారో వారి కొరకు హెచ్చరిక ఉంది. అబూ జాద్ జమ్రి (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు తెలియజేశారు; “ఏ వ్యక్తి అయితే ఏ కారణం లేకుండా మామూలుగా భావించి మూడు జుమా నమాజులను విడిచిపెడతాడో అల్లాహ్ అతని హృదయంపై (మొహర్) సీలు వేస్తాడు.” (అహ్మద్)

11. జుమా నమాజ్ యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే; ఎవరైతే ప్రజల మెడలపై నుండి గెంతుతారో మరియు అనవసరమైన కార్యాలకు పాల్పడతారో వారు ఘోరంగా నష్టానికి లోనవుతారు. అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు; “ఎవరైతే వ్యర్ధమైన పనికి పాల్పడ్డారో లేక ప్రజల మెడలపై నుంచి గెంతారో అలాంటి వారికి జుమా పుణ్యఫలం లభించదు వారికి జుహర్ నమాజ్ పుణ్యం మాత్రమే లభిస్తుంది”.(అబూ దావుద్)

కావున ఎవరైతే జుమా నమాజుకి వస్తారో  వారు దాని గొప్పదనాన్ని తప్పక తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది అల్లాహ్ యొక్క గొప్ప సూచనల లోనిది, ఇమామ్ ప్రసంగించేటప్పుడు మనిషి తన అవయవాల పట్ల జాగ్రత్త వహించాలి, అనవసరంగా కుదపరాదు అనగా రాళ్లతో పుల్లలతో ఆడుకోవడం లేక నేలపై గీతలు గీయడం లేక మిస్వాక్ చేయడం ఇలాంటి పనులకు దూరంగా ఉండాలి.  ఇది జుమా యొక్క మర్యాదలలో ఒకటి మరియు అదే విధంగా మౌనం వహించడం కూడా జుమాయొక్క మర్యాదలలోనిదే. ఇలా చేయకుంటే జుమాయొక్క పుణ్య ఫలం లో కొరత ఏర్పడుతుంది లేక పూర్తి పుణ్యఫలాన్ని కోల్పోయిన వారమవుతాం మరియు  జుమా జుహర్ గా మారుతుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు; “మీరు ప్రసంగ సమయంలో మీ తోటి వ్యక్తితో నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పడం కూడా వ్యర్థ మైన పనికి పాల్పడినట్లే”.

12. జుమా నమాజ్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే జుమా నమాజు తర్వాత నాలుగు రకాతులు నమాజ్ చదవడం (ముస్తహబ్) అనగా అభిలషణీయం. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు తెలియజేశారు; “ఏ వ్యక్తి అయితే జుమా నమాజు చదువుతాడో అతను దాని తర్వాత నాలుగు రకాతుల నఫిల్ నమాజ్ చదవాలి.”(ముస్లిం)

13. జుమా నమాజు యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇమామ్ ఇబ్నే ఖయ్యిం (రహిమహుల్లాహ్) తెలియచేశారు; జుమా నమాజుకు ఇతర నమాజుల కంటే గొప్ప ప్రత్యేకత ఉంది, అదేమిటంటే ఇందులో ప్రజలు ప్రత్యేకంగా పెద్ద సంఖ్యలో సమావేశం అవుతారు, ఒక ప్రశాంత వాతావరణం నెలకొంటుంది, ఆ సమయంలో ఖురాన్ పారాయణం బిగ్గరగా చేయరాదు, ఇలాంటి ఎన్నో షరతులు ఇందులో ఉన్నాయి. (జాదుల్ మఆద్)

ఓ అల్లాహ్ దాసులారా! ఇవి జుమా నమాజుకి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు. వీటి ద్వారానే ఇతర నమాజుల కంటే ఈ జుమా నమాజ్ కు ప్రాముఖ్యత లభించింది, మరియు అల్లాహ్ దగ్గర ఇది గొప్ప ప్రాధాన్యత కలది, కనుక మనం తప్పకుండా వీటిపై ఆచరించాలి, మరియు ఈ ఆచరణకై అల్లాహ్ యొక్క సహాయాన్ని కోరుతూ ఉండాలి, మరియు అల్లాహ్ తో ఈ ఆచరణల పుణ్యఫలాన్ని ఆశించాలి.

అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక, ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక, అల్లాహ్ మనందరిని క్షమించుగాక, మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా)  పశ్చాత్తాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.  

రెండవ ఖుత్బా

స్తోత్రం మరియు దరూద్ తరువాత

ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి! అల్లాహ్ మీపై కరుణించు గాక. అల్లాహ్ మీకు ఒక పెద్ద ఆచరణకై అజ్ఞాపించి ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోండి. మరియు దైవదూతలకు కూడా ఇదే ఆజ్ఞాపించాడు. అల్లాహ్ ఇలా అన్నాడు:

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا

(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.) (అల్ అహ్ జాబ్ 33:56)

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు మరియు ప్రేమించు.ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమానబరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపాశకులకు నీ సహాయాన్ని అందించు.

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين

రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ
జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి

పుస్తకం నుండి: ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్

సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు – ఇమాం ఇబ్నె బాజ్ [పుస్తకం]

సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు – ఇమాం ఇబ్నె బాజ్ [పుస్తకం]

Important-lessons-for-every-muslim-ibn-baz

అద్దురూసుల్ ముహిమ్మతు లి ఆమ్మతిల్ ఉమ్మ
(సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు)

క్రింది లింక్ క్లిక్ చేసి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి
సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు – ఇమాం ఇబ్నె బాజ్ [డైరెక్ట్ PDF]

  1. మొదటి పాఠం – సూరతుల్ ఫాతిహ మరియు చిన్న సూరాలు.
  2. రెండవ పాఠం – ఇస్లాం ములస్తంభాలు.
  3. మూడవ పాఠం – ఈమాన్ (విశ్వాస) మూలస్తంభాలు.
  4. నాల్గవ పాఠం – తౌహీద్ రకాలు మరియు షిర్కు రకాలు.
  5. ఐదవ పాఠం – ఇహ్సాన్
  6. ఆరవ పాఠం – నమాజు షరతులు
  7. ఏడవ పాఠం – నమాజు యొక్క విధులు
  8. ఎనిమిదో పాఠం – నమాజులో అనివార్య కార్యాలు
  9. తొమ్మిదవ పాఠం – తషహ్హుద్ యొక్క వివరణ.
  10. పదవ పాఠం – నమాజు యొక్క సున్నతులు
  11. పదకొండవ పాఠం – నమాజును భంగం చేసేవి.
  12. పన్నెండవ పాఠం: – వుజూ షరతులు.
  13. పదమూడవ పాఠం – వుజూలో తప్పనిసరి చేయవలసిన కార్యాలు.
  14. పద్నాల్గవ పాఠం – వుజూను భంగపరిచే విషయాలు.
  15. పదిహేనొవ పాఠం – ప్రతీ ముస్లిం చట్టబద్ధమైన గుణములతో అలంకరించుకోవటం
  16. పదహారవ పాఠం – ఇస్లామీయ పద్దతులను అవలంభించటం.
  17. పదిహేడవ పాఠం – షిర్కు మరియు తదితర పాపముల నుండి హెచ్చరించటం.
  18. పద్దెనిమిదవ పాఠం – మృతుని జనాజా సిద్ధం చేయటం, అతని జనాజా నమాజు చదవటం, అతనిని పూడ్చటం.

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వ సల్లల్లాహు వ సల్లమ అలా అబ్దిహి వ రసూలిహి నబియ్యినా ముహమ్మద్, వ అలా ఆలిహి వ అస్హాబిహీ అజ్మయీన్. (స్థుతులన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే, మంచి పర్యవాసనం దైవభీతి కలవారి కొరకే, అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కలిగించుగాక).

అమ్మా బాద్:

ఇస్లాం ధర్మం గురించి ప్రజలు తెలుసుకోవలసిన కొన్ని పదాల ప్రకటనలో ఇవి సంక్షిప్త పదాలు. వాటిని నేను అద్దురూసుల్ ముహిమ్మతు లి ఆమ్మతిల్ ఉమ్మ (సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు) అని నామకరణం చేశాను.

వాటితో ముస్లిములకు ప్రయోజనం కలిగించమని మరియు నా నుండి వాటిని స్వీకరించమని నేను అల్లాహ్ తో వేడుకుంటున్నాను. నిశ్చయంగా ఆయన ఉదారమైనవాడు మరియు దయగలవాడు.

అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్

మానవ సేవ – ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవడంలో అల్లాహ్ ప్రసన్నత ఇమిడి ఉంది – కలామే హిక్మత్ 

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు-

“ప్రళయదినం నాడు అల్లాహ్ అవశ్యంగా అడుగుతాడు: ‘ఓ ఆదం కుమారా! నేను వ్యాధిగ్రస్తుడినయ్యాను. నువ్వు నన్ను పరామర్శించలేదు’ అతనంటాడు: ‘ఓ!” ప్రభూ! నేను నిన్ను పరామర్శించడమేమిటి? నువ్వైతే సమస్త లోకాల పాలకుడవు?’ అల్లాహ్ అంటాడు: ‘నా ఫలానా దాసుడు వ్యాధిగ్రస్తుడైన సంగతి నీకు తెలీదా? కాని నువ్వతన్ని పరామర్శించలేదు. నువ్వతన్ని పరామర్శించి ఉంటే నన్నక్కడ పొందేవాడివి కాదా?’

ఓ ఆదం పుత్రుడా! నేను నిన్ను అన్నం అడిగాను. కాని నువ్వు నాకు అన్నం పెట్టలేదు.’ అతనంటాడు : ‘నా దేవా! నేన్నీకు ఎలా అన్నం పెట్టగలను? నువ్వైతే నిఖిల జగతికి పరిపోషకుడివి.’ అల్లాహ్ అంటాడు: ‘నా ఫలానా దాసుడు భోజనం కోసం నిన్ను మొరపెట్టుకున్న సంగతి నీకు తెలీదా? అయితే నువ్వతనికి భోంచేయించలేదు. ఒకవేళ నువ్వతనికి అన్నం పెట్టివుంటే దాని (ఫలాన్ని) నా దగ్గర పొందేవాడివి కాదా?’

‘ఓ ఆదం కుమారుడా! నేన్నిన్ను మంచినీళ్ళడిగాను. నువ్వు నాకు త్రాపలేదు.’ అతనంటాడు : ‘ఓ నా స్వామీ! నేన్నీకు మంచినీళ్ళు ఎలా త్రాపగలను? నువ్వు సకల లోకాల స్వామివి కదా!’ అల్లాహ్ అంటాడు: ‘నా ఫలానా దాసుడు నిన్ను నీరు కోసం వేడుకున్నాడు. కాని నువ్వతనికి నీరు త్రాపలేదు. ఒకవేళ నువ్వతనికి నీరు త్రాగించి ఉంటే దాన్ని బహుమతిని నా వద్ద పొందేవాడివి.” (ముస్లిం)

పెండ్లి ప్రాముఖ్యత  – కలామే హిక్మత్

అల్ ఖమ ఇలా అన్నారు –

“నేను మినాలో అబ్దుల్లాహ్ వెంట నడుస్తూ ఉండగా ఆయన్ని ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) కలుసుకున్నారు. వారు ఆయనతో మాట్లాడసాగారు. ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఆయనతో అన్నారు : “ఓ అబూ అబ్దుర్రహ్మాన్! మీ వివాహం ఒక యుక్త వయస్కురాలైన అమ్మాయితో ఎందుకు జరిపించకూడదు? తద్వారా మీకు పూర్వకాలం (యౌవనం) ఎందుకు జ్ఞాపకం చేయకూడదు?” అబ్దుల్లాహ్ బదులిచ్చారు – “మీరు కూడా అదే మాటంటున్నారా? దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు “ఓ యువకుల్లారా! మీలో నికాహ్ చేసుకోగల శక్తి ఉన్నవారు నికాహ్ చేసుకోవాలి. ఎందుకంటే చూపులను వాల్చడానికి, మర్మాంగాలను పరిరక్షించుకోవటానికి అలా చేయటం మంచిది. ఎవరికయితే నికాహ్ చేసుకునే స్థోమత లేదో వారు తప్పకుండా ఉపవాసం ఉంటుండాలి. అది అతని కొరకు డాలు వంటిది అని ప్రబోధించారు” అని అన్నారు. (ముస్లిం)

అల్ ఖమ గారు, మహాప్రవక్త ప్రియ సహచరుల శిష్యగణంలోని వారు. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) యొక్క ముఖ్య శిష్యులు. ఈయన హిజ్రీ శకం 60 తరువాత మరణించారు.

‘మినా’ మక్కా సమీపంలోని ఒక ప్రదేశం. అక్కడ హజ్ యాత్రీకులు జిల్ హిజ్జా 8 నుండి 12వ తేదీ వరకు విడిదిచేస్తారు. ఉస్మాన్ మరియు అబ్దుల్లాహ్ మధ్య ఆ సంభాషణ బహుశా హజ్ దినాలలోనే జరిగి ఉంటుంది.

అబ్దుల్లాహ్ అంటే ఇక్కడ హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) అన్నమాట. హదీసువేత్తల పరిభాష ప్రకారం – హదీసులో ఎప్పుడు అబ్దుల్లాహ్ ప్రస్తావన వచ్చినా అది అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కే వర్తించటం పరిపాటి.

తొలి తొలి రోజుల్లో ఇస్లాంను స్వీకరించిన వారిలో హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఒకరు. మహాప్రవక్త ముహమ్మద్ ప్రత్యేక సాన్నిహిత్యం ఉన్నవారిలో ఆయన ఆరవవారు. యుద్ధాలన్నింటిలో ఆయన ఇస్లాం తరపున పాల్గొన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమపదించిన తరువాత ఆయన ఇస్లామీయ రాజ్యంలో పలు ముఖ్యమయిన బాధ్యతలను నిర్వర్తిస్తుండేవారు. హిజ్రీ శకం 32వ ఏట హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ మరణించారు. అప్పటికి ఆయన వయస్సు 60 ఏండ్లకు పైబడింది.

అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల ప్రేమ & సద్వర్తనుల సహచర్యం – కలామే హిక్మత్

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : ఒక వ్యక్తి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ప్రళయ దినం గురించి దర్యాప్తుచేశాడు. “ఆ (ప్రళయ) ఘడియ ఎప్పుడొస్తుంది?” అని అతను ప్రశ్నించాడు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) బదులిచ్చారు : ”నువ్వు దానిని ఏర్పాటు చేసుకున్నావా?” దానికి ఆ వ్యక్తి, “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల ప్రేమ కలిగి ఉండటం తప్ప మరే తయారీ చేసుకోలేదు” అని అన్నాడు. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం), ”నువ్వు ప్రేమించేవారితో పాటు ఉంటావు” అని ప్రబోధించారు. (బుఖారి)

అనస్ (రదియల్లాహు అన్హు) ఏమంటున్నారో చూడండి: “నేనయితే మహాప్రవక్త మరియు అబూబకర్ (రదియల్లాహు అన్హు)ల పట్ల ప్రేమ కలిగి ఉండేవాడిని. ఒకవేళ నేను ఆ మహనీయులు చేసినన్ని మహత్కార్యాలు చేయలేకపోయినప్పటికీ ఈ ప్రేమ మూలంగా తీర్పుదినాన వారి సహచర్యంలోనే ఉండగలనన్న ఆశ నాకుంది.”

బుఖారిలోని మరో ఉల్లేఖనం ఇలా ఉంది : ఒకతను మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో, ”ఓ దైవప్రవక్తా! ఆ ఘడియ ఎప్పుడు వస్తుంది?” అని అడిగాడు. “నువ్వు దాని కొరకు చేసిన తయారీ ఏమిటీ?” అని మహాప్రవక్త ఎదురు ప్రశ్న వేశారు. అప్పుడు ఆ వ్యక్తి ”దానిగ్గాను నా వద్ద ఎక్కువ నమాజులు లేవు. ఎక్కువ ఉపవాసాలూ లేవు. ఎక్కువ దానధర్మాలు కూడా లేవు. అయితే నేను అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను ప్రేమిస్తున్నాను” అని విన్నవించుకున్నాడు. ఇది విని, “నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వారి వెంట ఉంటావు” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు.

దైవప్రవక్తను ఈ విధంగా ప్రశ్నించిన వ్యక్తి ఒక పల్లెటూరి వాడని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తోంది. పల్లెటూరి మనుషులు విషయాన్ని దర్యాప్తు చేసే తీరే వేరు. వారిలో మొహమాటంగాని, ఊగిసలాటగాని సాధారణంగా ఉండదు. కాగా, మహాప్రవక్త ప్రియ సహచరుల ధోరణి దీనికి కొంత భిన్నంగా ఉండేది. ఏ విషయాన్ని ప్రవక్తకు అడగాలన్నా కించిత్ భయం, జంకు వారికి ఉండేది. పల్లెటూరి నుండి ఏ పామరుడయినా వచ్చి ప్రవక్తను ధర్మసందేహాలు అడిగితే బావుండేదని వారు తలపోస్తూ ఉండేవారు. ఆ విధంగా తమకు మరిన్ని ధార్మిక విషయాలు తెలుస్తాయన్నది వారి ఉద్దేశం.

1. ‘ఆ ఘడియ ఎప్పుడొస్తుంది?’ అనేది హదీసులోని ఒక వాక్యం. అరబీలో ”అ సాఅత్” అని ఉంది. దీనికి తెలుగులో “నిర్ధారిత సమయం” అని అర్థం వస్తుంది. నిర్ధారిత సమయం అంటే మనిషి మరణించగానే అతని కర్మల లెక్కను తీసుకునే సమయమైనా కావాలి లేదా సమస్త జనులను నిలబెట్టి లెక్కతీసుకునే ప్రళయదినమైనా కావాలి.

2. “నువ్వు దాన్ని ఏర్పాటు చేసుకున్నావా?” అనేది హదీసులోని మరో వాక్యం. ప్రళయదిన ప్రతిఫలం గురించి అంత తొందరపడుతున్నావు. సరే, మరి అక్కడ నీకు గౌరవ స్థానం లభించేందుకు కావలసిన సత్కార్యాలు చేసుకున్నావా? అన్న భావం ఆ ప్రశ్నలో ఇమిడి ఉంది. ఇది ఎంతో వివేకవంతమయిన, ఆలోచనాత్మకమయిన ప్రశ్న. ప్రళయదినం సంభవించటమైతే తథ్యం. అది తన నిర్ణీత సమయంలో రానే వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? అన్న ఆదుర్దా కన్నా దానికోసం తను సన్నద్ధమై ఉన్నానా? లేదా? అన్న చింత మనిషికి ఎక్కువగా ఉండాలి.

3. ”నేనే తయారీ చేసుకోలేదు” అని ఆ పల్లెటూరి వ్యక్తి అనటంలోని ఉద్దేశ్యం తాను బొత్తిగా నమాజ్ చేయటం లేదని, దానధర్మాలు చేయటం లేదని కాదు. ఆ విధ్యుక్తధర్మాలను తను నెరవేరుస్తున్నాడు. అయితే అవి అతని దృష్టిలో బహుస్వల్పం అన్నమాట. మరో ఉల్లేఖనంలో ఆ విషయమే ఉంది (నా దగ్గర నమాజులు, ఉపవాసాలు, దానధర్మాలు ఎక్కువగా లేదని ఆ వ్యక్తి చెప్పాడు).

విధ్యుక్త ధర్మాలను (ఫరాయజ్) నెరవేర్చనిదే ఏ వ్యక్తి తాను అల్లాహ్ మరియు ఆయన అంతిమ ప్రవక్త అభిమానినని చెప్పుకోలేడు. సహాబాల హయాంలో ఇలా ఆలోచించే వారే కాదు. విశ్వసించి, ముస్లింనని ప్రకటించుకుని ఇస్లాంలోని ప్రధాన విధులపట్ల అలసత్వం వహించటం ఆనాడు ఎక్కడా లేదు.

4. “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పట్ల ప్రేమ తప్ప”

అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల ఎవరి హృదయంలోనయినా ప్రేమ ఉంటే అది అది అతనిలోని విశ్వాసానికి (ఈమాన్ కు) ప్రబల తార్కాణం అన్నమాట. విశ్వాసం లేనిదే ప్రేమ ప్రసక్తే రాదు. అంటే తన మనసులో విశ్వాసం ఉంది గనకనే అల్లాహ్ ను, దైవప్రవక్తను తాను ప్రేమిస్తున్నానని, అందుకనే తనకు పరలోకం గురించిన చింత అధికంగా ఉందని ఆ పల్లెటూరి వ్యక్తి ఉద్దేశ్యం. అతని ఆలోచన ఎంతో అర్థవంతమైంది కూడా.

5. ”నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వారి వెంట ఉంటావు.”

అంటే నీ విశ్వాసం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల నీకు గల ప్రేమ నీకు ఉపయోగపడతాయి. తీర్పుదినాన నీ చేత ప్రేమించబడిన వారి సహచర్యం నీకు ప్రాప్తమవుతుంది. ఇంకా నువ్వు వారి శ్రేణిలోని వ్యక్తిగానే పరిగణించబడతావు. అల్లాహ్ ను ప్రేమించినవాడు ప్రళయదినాన అల్లాహ్ ఆగ్రహానికి గురికాకుండా ఉంటాడు. మహాప్రవక్తను ప్రేమించినవాడు, ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) చెంత స్వర్గంలో ఉంటాడు. విశ్వాసుల పలు అంతస్థులు ఉంటాయి. ఒకరు ఎగువ స్థాయిలో ఉంటే మరొకరు దిగువస్థాయిలో ఉంటారు. ఎగువ స్థాయిలో నున్న వారు దిగువ స్థాయిలో ఉన్నవారిని చూచి అల్పులని భావించరు. అలాగే దిగువ స్థాయిలో నున్నవారు ఎగువస్థాయిలో నున్నవారిని చూసి అసూయ చెందరు. ప్రతి ఒక్కరూ అల్లాహ్ అనుగ్రహాలను ఆస్వాదిస్తూ ఆనందంలో మునిగి ఉంటాడు.

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పల్లెటూరి వ్యక్తికి చేసిన ఉపదేశం విని సహచరులు ఎంతో సంతోషించారు. అది వారిలోని విశ్వాస భాగ్యానికి ప్రతీక. వారు అన్నిటికన్నా ఎక్కువగా పరలోకం గురించి ఆలోచిస్తుండేవారు. తాము ప్రేమించిన వారి వెంటే ఉంటామన్న సంగతి తెలియగానే వారి సాఫల్యం వారి కళ్ళముందు కదలాడింది. ఎందుకంటే మహాప్రవక్త యెడల వారికి గల ప్రేమ నిజమైనది, అపారమైనది, నిష్కల్మషమైనది.

కేవలం నోటితో ప్రకటించినంత మాత్రాన నిజమైన ప్రేమ వెల్లడి కాదు. ఆచరణకు, త్యాగానికి అది మారు పేరు. తాము ప్రేమించేవారి అభీష్టానుసారం మసలుకున్నప్పుడే, వారు సమ్మతించిన మార్గాన్ని అనుసరించినప్పుడే అది సార్థకమవుతుంది.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) గారు మహాప్రవక్త మరియు అబూబకర్ (రదియల్లాహు అన్హు) లను ఎంతగానో ప్రేమించేవారు. ఆ కారణంగా తనకు వారి సహచర్యం లభిస్తుందని ఆయన ఆశిస్తుండేవారు. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అత్యంత ప్రియమైన సహచరులు. ఇహలోకంలో వారు ఎప్పుడూ ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేవారు. ఒకేచోట వారి అంత్యక్రియలు జరిగాయి. స్వర్గంలో కూడా వారు ఒకేచోట ఉంటారు. దైవప్రవక్తల తరువాత – సామాన్య మానవులలో శ్రేష్టులైన వారు అబూబకర్ గారే. ఆ తరువాత స్థానం హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారిది.

6. ఆ మహనీయులు చేసినన్ని సత్కార్యాలు నేను చేయలేకపోయినా వారిని ప్రేమిస్తున్నందున పరలోకంలో వారి సహచర్యం నాకు లభిస్తుందని ఆశిస్తున్నానని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) అన్నారు.

అంటే, నా సత్కార్యాలు వారి సత్కార్యాలు, త్యాగాల ముందు బహు స్వల్పమైనవి. అయితే నేను వారిని ప్రేమ అనే తీగతో అల్లుకుపోయాను. అందుచేత ఎలాగోలా స్వర్గంలోకి ప్రవేశిస్తాను.

అబూ మూసా అష్అరి ఉల్లేఖనం ఒకటి ఇలా ఉంది : “ఒక మనిషి కొందరిపట్ల ప్రేమ కలిగి ఉంటాడు. కాని వారి స్థాయిలో మహత్కార్యాలు చేయలేడు. మరి అప్పుడతని పరిస్థితి ఏమిటి? అని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అడగగా, ”మనిషి ఎవరిని ప్రేమిస్తాడో వారి వెంట ఉంటాడు” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) బదులిచ్చారు.

ఈ అధ్యాయంలోని హదీసు ద్వారా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను ప్రేమించటం వల్ల ప్రాప్తమయ్యే మహాభాగ్యం ఎటువంటిదో విదితమవుతోంది. అదేవిధంగా దైవదాసుల్లోని సద్వర్తనుల సావాసంలో ఉండటం శుభసూచకమని కూడా బోధపడుతోంది. ఇకపోతే, అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను ప్రేమించటమంటే ఏ విధంగా ప్రేమించటం అన్న ప్రశ్న జనిస్తుంది. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోరిన విధంగా జీవితం గడపటం, వారు వద్దన్న విషయాల జోలికి పోకుండా ఉండటం, వారి ప్రసన్నతను చూరగొనగలిగే పనులను చేయటమే ఆ ప్రేమకు ప్రతిరూపం.

ఇక, సద్వర్తనులయిన మానవులను ప్రేమించటం అంటే వారి దాస్యం చేయమని భావం ఎంతమాత్రం కాదు. వారి మాదిరిగా మంచి పనులు చేస్తూ, వారి స్థాయికి ఎదగటానికి ప్రయత్నించాలి.

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ, అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్

150 కంఠస్తం చేయదగిన దైవ ప్రవక్త ﷺ హదీసులు [పుస్తకం]

మూలం : మౌలానా కె. అమీనుర్రహ్మాన్ మదనీ
భావానువాదం : ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్

క్రింది లింక్ నొక్కి పూర్తి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి
150 కంఠస్తం చేయదగిన దైవ ప్రవక్త ﷺ హదీసులు
[డైరెక్ట్ PDF] [పాకెట్ సైజు]

జనం నోళ్లల్లో నానిపోయే చిన్న చిన్న హదీసులను ఏర్చికూర్చి రూపొందించిన చిరుపుస్తకం. ఎంతో వినసొంపుగా ఉండే ఈ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసులు పాఠకుల సంభాషణను సుసంపన్నం చేస్తాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పలుకుల్లోని ఆ లాలిత్యం మన మాటల్లోనూ జాలువారాలని, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పదాల్లోని పదునుతో మన భావాల్లోను పటుత్వం రావాలని – ఆ దివ్య ప్రవచనాల తెలుగు లిపిని రంగురంగుల ఆకర్షణీయమైన నిండు వాల్ పేపర్స్ పై ఎంతో రమణీయంగా తీర్చిదిద్ది రూపొందించిన పుస్తకం.

ప్రకాశకులు

మరిన్ని ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

1.4 విశ్వాస ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  
విశ్వాస ప్రకరణం [PDF]

5 – حديث أبي هُرَيْرَةَ قال كان النبيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بارزًا يومًا للناسِ فأَتاه رجلٌ فقال: ما الإيمان قال: الإيمان أن تؤمنَ بالله وملائكتِهِ وبلقائِهِ وبرسلِهِ وتؤمَن بالبعثِ قال: ما الإسلامُ قال: الإسلامُ أن تعبدَ اللهَ ولا تشركَ به وتقيمَ الصلاةَ وتؤدِّيَ الزكاةَ المفروضةَ وتصومَ رمضانَ قال: ما الإحسان قال: أن تعبدَ الله كأنك تراهُ، فإِن لم تكن تراه فإِنه يراك قال: متى الساعةُ قال: ما المسئولُ عنها بأَعْلَم مِنَ السائل، وسأُخبرُكَ عن أشراطِها؛ إِذا وَلَدَتِ الأَمَةُ رَبَّهَا، وَإِذا تطاولَ رُعاةُ الإبِلِ البَهْمُ في البنيان، في خمسٍ لا يعلمهنَّ إِلاَّ الله ثم تلا النبيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ (إِنَّ الله عنده علم الساعة) الآية: ثم أدبر فقال: رُدُّوه فلم يَرَوْا شيئاً فقال: هذا جبريل جاءَ يُعَلِّمُ الناسَ دينَهم
__________
أخرجه البخاري في: 2 كتاب الإيمان: 37 باب سؤال جبريل النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عن الإيمان والإسلام

5. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం :- ఒక రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజలతో సమావేశమయి ఉండగా, ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి “దైవప్రవక్తా! విశ్వాసం అంటే ఏమిటి?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానమిస్తూ “విశ్వాసం ఉంటే నీవు అల్లాహ్ ను, దైవ దూతలను, దైవప్రవక్తలను, (పరలోకంలో) అల్లాహ్ ముందు హాజరు కావలసి ఉంటుందన్న విషయాన్ని, (మరణానంతరం మానవులు) తిరిగి బ్రతికించబడతారన్న విషయాన్ని నమ్మాలి” అని అన్నారు.

“మరి ఇస్లాం అంటే ఏమిటి?” అని ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు. “ఇస్లాం అంటే (1) నీవు అల్లాహ్ ను మాత్రమే (దేవుని గా భావించి) ఆరాధించాలి. (దైవత్వంలో) మరెవరినీ ఆయనకు సహవర్తులుగా చేయకూడదు. (2) నమాజు (ప్రార్ధనా) వ్యవస్థను నెలగొల్పాలి. (3) జకాత్ (పేదల ఆర్థిక హక్కు)ను విధిగా నెరవేర్చాలి. (4) రమజాన్ నెల ఉపవాసాలు పాటించాలి” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

“ఇహ్సాన్ అంటే ఏమిటి?” ఆ వ్యక్తి తిరిగి ప్రశ్నించాడు. “ఇహ్సాన్ అంటే, నీవు అల్లాహ్ ను ప్రత్యక్షంగా చూస్తున్నట్లు (అత్యంత భయభక్తులతో) ఆయన్ని ఆరాధించాలి. నీవు ఆయన్ని చూడలేకపోయినా ఆయన మాత్రం నిన్ను తప్పకుండా చూస్తున్నాడు. (అన్న యదార్ధాన్ని గుర్తుంచుకో)” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

“దైవప్రవక్తా! మరి ప్రళయం ఎప్పుడొస్తుంది?” మరో ప్రశ్న అడిగాడు ఆ వ్యక్తి. ప్రళయం గురించి ప్రశ్నించేవాడికన్నా సమాధానమిచ్చేవాడికి ఎక్కువేమీ తెలియదు. కాకపోతే ప్రళయ సంభవం గురించి నేను కొన్ని సూచనలు తెలియజేస్తాను. అప్పుడు దాసి తన యజమానిని కంటుంది. (అనాగరికులుగా ఉన్న) పశువుల కాపర్లు పెద్ద పెద్ద భవంతులు కట్టడంలో ఒకర్నొకరు పోటీపడతారు. ఆ ఐదు అగోచర విషయాల్లో ప్రళయం ఒకటి. దాని సంగతి అల్లాహ్ కి తప్ప మరెవ్వరికీ తెలియదు,” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

ఆ తరువాత ఆయన ఆ గడియకు సంబంధించిన జ్ఞానం అల్లాహ్ వద్ద మాత్రమే ఉన్నది. ఆయనే వర్షాన్ని కురిపిస్తాడు. తల్లుల గర్భాలలో పెరుగుతున్న దేమిటో ఆయనే ఎరుగు. తాను రేపటి రోజున ఏమి సంపాదించనున్నదో ఏ ప్రాణీ ఎరుగదు. ఏ భూభాగంపై తనకు మృత్యువు రానున్నదో ఏ వ్యక్తి ఎరుగడు (లుక్మాన్ – 34)” అన్న ఖుర్ఆన్ సూక్తిని పఠించారు.

ఈ సంభాషణ తరువాత ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘ఆ వ్యక్తిని పిలవండి’ అన్నారు. కాని కొందరు సహచరులు వెళ్ళి చూస్తే ఆ వ్యక్తి ఎక్కడా కన్పించలేదు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (అసలు విషయం బయట పెడ్తూ) “ఆ వ్యక్తి (ఎవరో కాదు) జిబ్రయీల్ (దైవదూత). ఈ విధంగా ఆయన ప్రజలకు వారి ధర్మం గురించి చెప్పడానికి వచ్చారు” అని అన్నారు.

[బుఖారీ; 2వ ప్రకరణం – విశ్వాసం, 37వ అధ్యాయం – జిబ్రయీల్…]

1.5 శుచి, శుభ్రతల ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  
శుచి, శుభ్రతల ప్రకరణం [PDF]

134 – حديث أَبِي هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: لاَ يَقْبَلُ اللهُ صَلاةَ أَحَدِكُمْ إِذَا أَحْدَثَ حَتَّى يَتَوَضَّأَ
__________
أخرجه البخاري في: 90 كتاب الحيل: 2 باب في الصلاة

134. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- మీలో ఎవరి వుజూ (ముఖం కాళ్ళు చేతుల పరిశుభ్రత) అయినా భంగమయితే అతను (తిరిగి) వుజూ చేయనంతవరకు అతను చేసే నమాజును అల్లాహ్ స్వీకరించడు.

[సహీహ్ బుఖారీ : 90వ ప్రకరణం – హీల్, 2వ అధ్యాయం – ఫిస్సలాత్]

135 – حديث عُثْمَانَ بْنِ عَفَّانَ دَعَا بِإِنَاءٍ فَأَفْرَغَ عَلَى كَفَّيْهِ ثَلاَثَ مِرَارٍ فَغَسَلَهُمَا، ثُمَّ أَدْخَلَ يَمِينَهُ فِي الإِنَاءِ، فَمَضْمَضَ وَاسْتَنْشَقَ، ثُمَّ غَسَلَ وَجْهَهُ ثَلاَثًا، وَيَدَيْهِ إِلَى الْمِرْفَقَيْنِ ثَلاَثَ مِرَارٍ، ثُمَّ مَسَحَ بِرَأْسِهِ، ثُمَّ غَسَلَ رِجْلَيْهِ ثَلاَثَ مِرَارٍ إِلَى الْكَعْبَيْنِ، ثُمَّ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَنْ تَوَضَّأَ نَحْوَ وُضُوئِي هذَا ثُمَّ صَلَّى رَكْعَتَيْنِ لاَ يُحَدِّثُ فِيهِمَا نَفْسَهُ غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 24 باب الوضوء ثلاثًا ثلاثًا

135. హజ్రత్ ఉస్మాన్ బిన్ అప్పాన్ (రదియల్లాహు అన్హు) గురించి ఉల్లేఖకులు ఇలా తెలిపారు: హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఒక చెంబులో నీళ్ళు తెప్పించి, మొదట తన రెండు ముంజేతులపై నీళ్ళు పోసి కడుక్కున్నారు. తరువాత కుడి చేతిని చెంబులో ముంచి, (పిడికెడు నీళ్ళతో) నోరు పుక్కిలించారు. అలాగే ముక్కులోకి నీళ్ళు ఎక్కించి శుభ్రపరచుకున్నారు. ఆ తరువాత మూడుసార్లు ముఖం కడుక్కున్నారు. దాని తరువాత మూడుసార్లు చేతులు మోచేతుల దాకా కడుక్కున్నారు. దాని తర్వాత తడి చేతులతో తల తుడుచుకున్నారు. ఆ పై రెండు కాళ్ళు చీలమండలం వరకు మూడుసార్లు కడుక్కున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారని తెలిపారు – “ఎవరు నా పద్ధతి ప్రకారం వుజూ చేసి, మనసులో ఎలాంటి (ప్రాపంచిక) ఆలోచనలు రానివ్వకుండా పూర్తి ఏకాగ్రతతో రెండు రకాతులు నమాజు చేస్తారో అతని (ఆ తరువాయి నమాజు వరకు) జరగబోయే పాపాలు క్షమించబడతాయి.” *

[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 24వ అధ్యాయం – అల్ ఉజూయె సలాసన్ సలాసా]

* ఇక్కడ ‘పాపాలు’ అంటే చిన్న చిన్న పాపాలని అర్థం; పెద్ద పాపాలు కాదు. (అనువాదకుడు)

1.11 ఈద్ (పండుగ) నమాజ్ ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

505 – حديث ابْنِ عَبَّاسٍ قَالَ: شَهِدْتُ الْفِطْرَ مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَأَبِي بَكْرٍ وَعُمَرَ وَعُثْمَانَ يُصَلُّونَهَا قَبْلَ الْخُطْبَةِ، ثَمَّ يُخْطَبُ بَعْد

خَرَجَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَأَنِّي أَنْظُرُ إِلَيْهِ حينَ يُجْلِسُ بِيَدِهِ، ثُمَّ أَقْبَلَ يَشُقُّهُمْ، حَتَّى جَاءَ النِّسَاءَ، مَعَهُ بِلاَلٌ فَقَالَ: (يَأَيُّهَا النَّبيُّ إِذَا جَاءَكَ الْمُؤمِنَاتُ يُبَايِعْنَكَ) الآيَةَ ثُمَّ قَالَ حينَ فَرَغَ مِنْهَا: آنْتُنَّ عَلَى ذلِكِ فَقَالَتِ امْرَأَةٌ وَاحِدَةٌ مِنْهُنَّ، لَمْ يُجِبْهُ غَيْرُهَا: نَعَمْ قَالَ: فَتَصَدَّقْنَ فَبَسَطَ بِلاَلٌ ثَوْبَهُ، ثُمَّ قَالَ: هَلُمَّ لَكُنَّ فِدَاءً أَبِي وَأُمِّي فَيُلْقِينَ الْفَتَخَ وَالْخَوَاتِيمَ فِي ثَوْبِ بِلاَلٍ
__________
أخرجه البخاري في: 13 كتاب العيدين: 19 باب موعظة الإمام النساء يوم العيد

505. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:-

నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి ఈదుల్ ఫిత్ర్ నమాజు చేశాను. అలాగే శ్రేష్ఠ ఖలీఫాలయిన అబూబక్ర్ (రదియల్లాహు అన్హు), ఉమర్ (రదియల్లాహు అన్హు), ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) గార్లతో కలసి కూడా ఈదుల్ ఫిత్ర్ నమాజు చేశాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), శ్రేష్ఠ ఖలీఫాలు కూడా మొదట నమాజు చేసి ఆ తరువాత ఖుత్బా (ఉపన్యాసం) ఇచ్చేవారు. ఆనాడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (ఉపన్యాస వేదిక నుంచి) క్రిందికి దిగి, ప్రజలను కూర్చోమని చేత్తో సైగ చేస్తూ (పురుషుల) పంక్తులను చీల్చుకుంటూ స్త్రీల పంక్తుల సమీపానికి చేరుకున్న దృశ్యం ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదలుతోంది. ఆ సమయంలో హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఉన్నారు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “యా హయ్యుహన్నబియ్యు ఇజా జా అకల్ మూమినాతు యుబాయీనక అలా అల్లా యుష్రిక్ న” (ప్రవక్తా! విశ్వసించిన స్త్రీలు నీ దగ్గరికి వచ్చి తాము అల్లాహ్ కు (ఆయన దైవత్వంలో) మరెవరినీ సాటి కల్పించబోమని, దొంగతనం చేయబోమని, వ్యభిచారానికి పాల్పడబోమని, తమ సంతనాన్ని హతమార్చము అనీ, అక్రమ సంబంధాలను గురించిన అపనిందలు సృష్టించమని, మంచి విషయాల్లో నీకు అవిధేయత చూపమని ప్రమాణం చేస్తే, వారి చేత ప్రమాణం చేయించు. వారి పాప మన్నింపు కోసం అల్లాహ్ ను ప్రార్థించు. అల్లాహ్ తప్పకుండా క్షమించేవాడు, కరుణించేవాడు.) ( ఖుర్ఆన్ : 60-12) అనే సూక్తి పఠించారు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ సూక్తి పఠించిన తరువాత “మీరీ విషయాలను గురించి నా ముందు ప్రమాణం చేస్తారా?” అని మహిళల్ని ప్రశ్నించారు. అప్పుడు వారిలో ఒక స్త్రీ మాత్రమే చేస్తానని సమాధానమిచ్చింది. మిగిలిన వారంతా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఉండిపోయారు. “సరే మీరు సదఖా (విరాళాలు) ఇవ్వండి” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) తన కండువా తీసి క్రింద పరుస్తూ “నా తల్లిదండ్రుల్ని మీ కోసం సమర్పింతు” అని అన్నారు. అప్పుడు స్త్రీలు తమ ఉంగరాలు, మెట్టెలు తీసి ఆ వస్త్రంలో వేయనారంభించారు.

సహీహ్ బుఖారీ: 13వ ప్రకరణం – ఈదైన్, 19వ అధ్యాయం – మౌయిజతిల్ ఇమామిన్నిసా (యౌముల్ ఈద్)