విధివ్రాత (తఖ్దీర్) పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ  [వీడియో & టెక్స్ట్]

విధివ్రాత పట్ల విశ్వాసం
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=uiNNKuljqEU [13 నిముషాలు]

ఈ ప్రసంగంలో, విశ్వాస ముఖ్యాంశాలలో ఆరవది మరియు అత్యంత ముఖ్యమైనదైన విధివ్రాత (ఖద్ర్) పట్ల విశ్వాసం గురించి వివరించబడింది. విధివ్రాతను అర్థం చేసుకోవడానికి నాలుగు ముఖ్యమైన విషయాలు చర్చించబడ్డాయి: అల్లాహ్‌కు ప్రతి విషయము వివరంగా తెలిసి ఉంది, ప్రతిదీ ‘లౌహె మెహఫూజ్’లో వ్రాయబడి ఉంది, అల్లాహ్ తలచినది మాత్రమే సంభవిస్తుంది, మరియు ప్రతి వస్తువును సృష్టించి, దానికి తగ్గట్టుగా దాని లెక్కను నిర్ధారించాడు అని నమ్మడం. మానవునికి మంచి చెడులను ఎన్నుకునే స్వేచ్ఛ ఇవ్వబడిందని, దాని ఆధారంగానే తీర్పు ఉంటుందని కూడా స్పష్టం చేయబడింది. చివరగా, విధివ్రాత పట్ల విశ్వాసం కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు—అసూయ నుండి రక్షణ, ధైర్యం కలగడం, మరియు మనశ్శాంతి, సంతృప్తి లభించడం—వివరించబడ్డాయి.

అల్ హమ్దు లిల్లాహి వహదా, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాదా. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలు. అందులోని ఆరవ ముఖ్యాంశం. ఈమాన్ బిల్ ఖద్ర్, విధి వ్రాత పట్ల విశ్వాసం. దీని గురించి ఇన్షా అల్లాహ్ ఈ ప్రసంగంలో మనం క్లుప్తంగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.

ఒకసారి ఆ హదీసును మరొకసారి మనం విందాం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం వారు మానవ ఆకారంలో వచ్చి, “ఓ దైవ ప్రవక్తా, ఈమాన్ అంటే ఏమిటి?” అని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరిస్తూ,

أَنْ تُؤْمِنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ وَالْيَوْمِ الْآخِرِ وَتُؤْمِنَ بِالْقَدَرِ خَيْرِهِ وَشَرِّهِ
[అన్ తు’మిన బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి వల్ యౌమిల్ ఆఖిరి వ తు’మిన బిల్ ఖద్రి ఖైరిహి వ షర్రిహి]

అని సమాధానం ఇచ్చారు. దీని అర్థం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈమాన్, విశ్వాసం అంటే ఆరు విషయాల గురించి ప్రస్తావిస్తూ ఏమంటున్నారు? అల్లాహ్‌ను విశ్వసించటం, దైవదూతలను విశ్వసించటం, దైవ గ్రంథాలను విశ్వసించటం, దైవ ప్రవక్తలను విశ్వసించటం, పరలోక దినాన్ని విశ్వసించటం, మంచి చెడు విధివ్రాత పట్ల విశ్వాసం కలిగి ఉండటం. ఈ ఆరు విషయాలను నమ్మటం, విశ్వసించటాన్ని ఈమాన్ అంటారు, విశ్వాసం అంటారు అని ప్రవక్త వారు సమాధానం ఇచ్చారు. ఇందులో ఆరవ విషయం గురించి ఆలోచించారా, గమనించారా? ఆరవ విషయం ఏమిటి?

اَلْإِيمَانُ بِالْقَدَرِ خَيْرِهِ وَ شَرِّهِ
[అల్ ఈమాను బిల్ ఖద్రి ఖైరిహి వ షర్రిహి]

మంచి చెడు విధి వ్రాత పట్ల విశ్వాసం కలిగి ఉండటం. విశ్వాస ముఖ్యాంశాలలో ఈ ఆరవ ముఖ్యాంశం, విధివ్రాత పట్ల విశ్వాసం, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం.

మిత్రులారా, విధివ్రాత పట్ల విశ్వాసం కలిగి ఉండటం అనే విషయాన్ని బాగా అర్థం చేసుకోవటానికి, ఒక క్లారిటీకి, ఒక అవగాహనకు రావటానికి నాలుగు విషయాలు తెలుసుకొని నమ్మితే ఆ వ్యక్తి విధివ్రాత పట్ల ఒక అవగాహనకు వస్తాడు అని ధార్మిక పండితులు తెలియజేశారు. ఆ నాలుగు విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మొదటి విషయం ఏమిటంటే, అల్లాహ్‌కు ప్రతి విషయము వివరంగా తెలిసి ఉంది అని నమ్మాలి ప్రతి వ్యక్తి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు పూర్వం జరిగినది తెలుసు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు ప్రస్తుతం జరుగుచున్నది కూడా తెలుసు. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు భవిష్యత్తులో జరగబోయేది కూడా తెలుసు. దీనికి ఆధారం మనం చూచినట్లయితే, ఖురాన్ గ్రంథము, తొమ్మిదవ అధ్యాయము, 115వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు:

إِنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
[ఇన్నల్లాహ బికుల్లి షైఇన్ అలీమ్]

అంటే, నిశ్చయంగా అల్లాహ్‌కు ప్రతీదీ తెలుసు. జరిగిపోయినది తెలుసు, జరుగుచున్నది తెలుసు, జరగబోయేది కూడా అల్లాహ్‌కు తెలుసు. ఆయన మొత్తం జ్ఞానం కలిగి ఉన్నవాడు, అన్నీ తెలిసినవాడు అని మనము ఈ విషయాన్ని నమ్మాలి. ఇది మొదటి విషయం అండి.

ఇక రెండో విషయం ఏమిటి? సృష్టికి సంబంధించిన ప్రతి దాని అదృష్టాన్ని అల్లాహ్ వ్రాసి పెట్టాడు. ఎక్కడ వ్రాసి పెట్టాడు? లౌహె మెహఫూజ్ అనే ఒక పవిత్రమైన, పటిష్టమైన గ్రంథము ఉంది. ఆ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దివ్య దృష్టితో భవిష్యత్తులో ఏమి జరగబోవుచున్నది అనేది మొత్తము చూసేసి, వ్రాయించేసి ఉన్నాడు. దానిని లౌహె మెహఫూజ్‌లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వ్రాసి ఉంచాడు అన్న విషయాన్ని మనము నమ్మాలి. మరి దీనికి ఆధారం ఏమిటి అంటే, ఖురాన్ గ్రంథము 36వ అధ్యాయము, 12వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ فِي إِمَامٍ مُّبِينٍ
[వ కుల్ల షైఇన్ అహ్సైనాహు ఫీ ఇమామిమ్ ముబీన్]

అంటే, ఇంకా మేము ప్రతి విషయాన్ని స్పష్టమైన ఒక గ్రంథంలో నమోదు చేసి పెట్టాము. అదే లౌహె మెహఫూజ్, అది స్పష్టమైన గ్రంథము. ఆ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా జరగబోయేది అంతా ముందే చూసి వ్రాయించి భద్రంగా ఉంచి ఉన్నాడు. ఈ విషయం కూడా మనము తెలుసుకొని గట్టిగా నమ్మాలి.

ఇక మూడో విషయం ఏమిటి అంటే, అల్లాహ్ తలచినది మాత్రమే సంభవిస్తుంది. ఈ సృష్టి మొత్తంలో ఎక్కడైనా సరే, అల్లాహ్ ఎలా తలుస్తాడో అలాగే జరుగుతుంది. ఎక్కడ వర్షాలు కురవాలి, ఎక్కడ ఎండ పడాలి, ఎక్కడ చలి వీయాలి, ఎక్కడ గాలులు వీయాలి, ఎక్కడ పంటలు పండాలి, ఇదంతా అల్లాహ్ తలచినట్లే జరుగుతుందండి, మీరు మేము అనుకున్నట్లు జరగదు. ఎక్కడైనా సరే ఏదైనా సంభవించాలి అంటే అది అల్లాహ్ తలచినట్టుగానే సంభవిస్తుంది, జరుగుతుంది. మరి దీనికి ఆధారం ఏమిటి అంటే, ఖురాన్ గ్రంథం 81వ అధ్యాయం, 29వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు:

وَمَا تَشَاءُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ
[వమా తషాఊన ఇల్లా అయ్ యషా అల్లాహు రబ్బుల్ ఆలమీన్]

అంటే, సర్వలోక ప్రభువైన అల్లాహ్ కోరనంత వరకు మీరేదీ కోరలేరు. మీరు కోరుకున్నట్లు ఎక్కడా ఏమీ జరగదు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తలచినట్లే జరుగుతుంది అన్న విషయము ఈ వాక్యంలో అల్లాహ్ తెలియపరిచి ఉన్నాడు. అది కూడా మనము తెలుసుకొని గట్టిగా నమ్మాలి.

ఇక నాలుగో విషయం, అదేమిటంటే, విశ్వంలో ఉన్న వాటన్నింటినీ సృష్టించినవాడు, సృష్టికర్త ఒక్కడే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అని తెలుసుకొని మనము గట్టిగా నమ్మాలి. ఈ విశ్వంలో ఏమేమి ఉన్నాయో, అవన్నీ సృష్టించబడి ఉన్నవి. ఒక అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మాత్రమే సృష్టికర్త. సృష్టికర్త ఆయన అల్లాహ్. ఆయన తప్ప ఈ సృష్టిలో ఉన్నది మొత్తము కూడా సృష్టించబడినది. సృష్టికర్త అల్లాహ్ ఒక్కడే అన్న విషయము ప్రతి వ్యక్తి నమ్మాలి. మరి దానికి ఆధారం ఏమిటి అని మనం చూచినట్లయితే, ఖురాన్ గ్రంథం, 25వ అధ్యాయం, రెండవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు:

وَخَلَقَ كُلَّ شَيْءٍ فَقَدَّرَهُ تَقْدِيرًا
[వ ఖలక కుల్ల షైఇన్ ఫకద్దరహు తఖ్దీరా]

అంటే, ఆయన ప్రతి వస్తువును సృష్టించి, దానికి తగ్గట్టుగా దాని లెక్కను నిర్ధారించాడు. అంటే ఈ సృష్టిలో ఉన్న మొత్తాన్ని సృష్టించినవాడు, దాని లెక్కను నిర్ధారించినవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మాత్రమే. ఆ విషయాన్ని కూడా ప్రతి వ్యక్తి తెలుసుకొని గట్టిగా నమ్మాలి.

ఈ నాలుగు విషయాలు ఎప్పుడైతే మనిషి బాగా అర్థం చేసుకొని నమ్ముతాడో అప్పుడు విధివ్రాత పట్ల అతనికి ఒక అవగాహన వచ్చేస్తుంది.

అలాగే విధివ్రాతల పట్ల మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనిషికి ఎన్నుకునే అధికారము ఇచ్చి ఉన్నాడు. అంటే ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనిషికి మంచి చెడుల మధ్య వ్యత్యాసము గ్రహించే అధికారం ఇచ్చాడు. ఏది మంచిది, ఏది చెడ్డది అనేది గ్రహించే శక్తి మానవునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చి ఉన్నాడు. అలాగే, మంచి చెడు అన్న విషయాన్ని గ్రహించిన తర్వాత, మంచిని ఎన్నుకోవాలా చెడుని ఎన్నుకోవాలా ఎన్నుకునే అధికారము కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవునికి ఇచ్చి ఉన్నాడు. మానవుడు తలిస్తే, మంచి చెడు అనేది తెలుసుకున్న తర్వాత, అతను మంచిని కూడా ఎన్నుకొని మంచివాడు కావచ్చు. అలాగే చెడ్డను, చెడును ఎంచుకొని అతను చెడ్డవాడుగా కూడా అయిపోవచ్చు. ఆ ఎన్నుకునే అధికారము మానవునికి ఇవ్వబడి ఉంది.

చూడండి, ఖురాన్ గ్రంథంలో, 76వ అధ్యాయం, మూడవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తూ ఉన్నాడు:

إِنَّا هَدَيْنَاهُ السَّبِيلَ إِمَّا شَاكِرًا وَإِمَّا كَفُورًا
[ఇన్నా హదైనాహుస్ సబీలా ఇమ్మా షాకిరౌ వ ఇమ్మా కఫూరా]

అంటే, మేమతడికి మార్గం కూడా చూపాము, ఇక వాడు కృతజ్ఞుడుగా వ్యవహరించినా లేక కృతఘ్నతకు పాల్పడినా వాడి ఇష్టం, మేము వాడి స్వేచ్ఛను హరించలేదు అని తెలుపబడి ఉంది. అల్లాహు అక్బర్! అంటే, మంచి చెడు అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవునికి చూపించేశాడు. ఇక ఎన్నుకునే అధికారం అతనికి ఉంది కాబట్టి, అతను మంచిని ఎన్నుకొని అల్లాహ్‌కు కృతజ్ఞతలు చెల్లుస్తూ మంచివాడిగా ఉండిపోతాడో, లేదా చెడును ఎన్నుకొని అల్లాహ్‌కు కృతఘ్నుడైపోయి మార్గభ్రష్టుడైపోతాడో, అతని స్వేచ్ఛలోకి, అతనికి మనము వదిలేశామని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు. కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనిషికి ఎన్నుకునే అధికారం ఇచ్చి ఉన్నాడు, మంచిని ఎన్నుకునే బాధ్యత మనది, చెడు నుంచి దూరంగా ఉండే బాధ్యత మనది.

ఇక చివర్లో, విధివ్రాత పట్ల విశ్వాసం కలిగి ఉంటే ఫలితం ఏమి దక్కుతుంది మానవునికి అనేది తెలుసుకొని ఇన్షా అల్లాహ్ మాటను ముగిద్దాం. విధివ్రాతను నమ్మితే మనిషికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అందులోని మూడు ముఖ్యమైన ప్రయోజనాలు మీ ముందర ఉంచుతూ ఉన్నాను, చూడండి.

మొదటి ప్రయోజనం ఏమిటంటే, మనిషి అసూయ నుండి రక్షించబడతాడు. ఎవరికైనా దైవానుగ్రహాలు దక్కాయి అంటే, వారికి అల్లాహ్ ఇచ్చాడులే అని మానవుడు సంతృప్తి పడతాడు. అసూయ పడితే అల్లాహ్ నిర్ణయానికి ఎదురెళ్లడం అవుతుంది అని అతను భయపడతాడు. మానవులకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొందరికి బాగా ఇస్తాడు కదా, మరి కొందరికి ఇవ్వకుండా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరీక్ష పెడతాడు కదా. విధివ్రాతను నమ్మిన వ్యక్తి, అనుగ్రహాలు దక్కిన వారిని చూసి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తలచి వారికి ఇవ్వాలనుకున్నారు ఇచ్చాడు, అది అల్లాహ్ చిత్తం ప్రకారం జరిగిందిలే అని, అనుగ్రహాలు దక్కిన వారిని చూసి ఇతను అసూయ పడడు. అల్లాహ్ వారికి ఇచ్చాడులే అని, వారి మీద అసూయ పడడు. ఒకవేళ నేను వారి మీద అసూయ పడితే, వారికి ఇవ్వబడిన అనుగ్రహాలు చూసి నేను లోలోపల కుళ్ళిపోతే, దైవ నిర్ణయానికి నేను ఎదురెళ్లిన వాడిని అవుతానేమోనని అతను భయపడతాడు, అసూయ పడడు. ఇది మొదటి ప్రయోజనం.

రెండో ప్రయోజనం ఏమిటి? మనిషికి ధైర్యం వస్తుంది. విధివ్రాతను నమ్మితే, విధివ్రాతను విశ్వసిస్తే మనిషికి ధైర్యం వస్తుంది. అది ఎట్లాగంటే, ఏదైనా అల్లాహ్ తలిస్తేనే జరుగుతుంది, లేదంటే జరగదు అని అతను బాగా నమ్ముతాడు కాబట్టి, ఏదైనా విషయం కొనాలి అన్నా, ఏదైనా పని ప్రారంభించాలి అన్నా, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నా అతను అటూ ఇటూ చేసి లేదా ఏమేమో ప్రపంచంలో జరుగుతున్న వార్తలు చూసి భయపడడు. అల్లాహ్ ఎలా తలిస్తే అలా జరుగుతుందిలే అని నమ్మకంతో, ధైర్యంతో ముందడుగు వేస్తాడు. కాబట్టి, విధివ్రాత పట్ల విశ్వాసం కలిగి ఉండితే మనిషికి ధైర్యము వస్తుంది, ఆ ధైర్యంతో అతను ముందడుగు వేస్తాడు. ఇది రెండవ ప్రయోజనం.

ఇక మూడవ ప్రయోజనం మనం చూచినట్లయితే, మనిషికి మనశ్శాంతి, సంతృప్తి చెందే గుణం వస్తుంది. మన కోసం అల్లాహ్ నిర్ణయించినది మనకు దొరికింది, ఏదైనా మనకు దొరకలేదు అంటే అది అల్లాహ్ నిర్ణయం ప్రకారమే జరిగింది. కాబట్టి, నేను ఎందుకు తొందరపడాలి, లేదంటే నాకు దక్కలేదు అని నేను ఎందుకు బెంగపడాలి? ఆ విధంగా అతను తెలుసుకొని, నాకు దక్కిన కాడికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిర్ణయం ప్రకారమే దక్కిందిలే అని అతను సంతృప్తి పడతాడు, దిగులు పడకుండా అతను మనశ్శాంతిగా జీవిస్తాడు మిత్రులారా.

ఇవి విధివ్రాత పట్ల విశ్వాసం కలిగి ఉండే వారికి లభించే ప్రయోజనాలలో మూడు ముఖ్యమైన ప్రయోజనాలు. విధివ్రాత పట్ల ఈ కొన్ని విషయాలు మనము తెలుసుకొని నమ్ముదాం.

నేను అల్లాహ్‌తో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్నందరికీ సంపూర్ణ విశ్వాసులుగా జీవితాంతము జీవించే భాగ్యము ప్రసాదించు గాక. ఆమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=40192

తఖ్దీర్ (విధి వ్రాత) ( మెయిన్ పేజీ ):
https://teluguislam.net/qadr-taqdeer-vidhi-rata/

పరలోకం పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

పరలోకం పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ
https://youtu.be/NsqbSZr8XQI [14 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లామీయ విశ్వాసంలోని ఐదవ ముఖ్యమైన అంశమైన పరలోక జీవితంపై విశ్వాసం గురించి వివరించబడింది. పరలోకం అంటే ఏమిటి, దాని ఉనికికి ఖురాన్ మరియు హదీసుల నుండి ఆధారాలు, మరియు ప్రపంచంలో జరిగే అన్యాయాలకు అంతిమ న్యాయం జరగాల్సిన ఆవశ్యకత వంటి విషయాలు చర్చించబడ్డాయి. పరలోకంలో జరిగే ముఖ్య సంఘటనలైన హషర్ మైదానం (సమావేశ స్థలం), కర్మపత్రాల పంపిణీ, మీజాన్ (త్రాసు), జహన్నం (నరకం), మరియు జన్నత్ (స్వర్గం) గురించి కూడా ప్రస్తావించబడింది. చివరగా, పరలోకంపై విశ్వాసం ఒక వ్యక్తిని దైవభీతితో జీవించేలా, పుణ్యకార్యాల వైపు ప్రేరేపించేలా మరియు పాపాలకు దూరంగా ఉంచేలా ఎలా చేస్తుందో, తద్వారా సమాజంలో శాంతి ఎలా నెలకొంటుందో వివరించబడింది.

అల్ హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్.

అన్ని రకాల ప్రశంసలు, పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలు మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ప్రసంగంలో, విశ్వాస ముఖ్యాంశాలలోని ఐదవ ముఖ్యాంశం పరలోకం పట్ల విశ్వాసం గురించి తెలుసుకుందాం.

పరలోకం అంటే ఏమిటి? పరలోకాన్ని విశ్వసించడానికి మన వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి? పరలోకంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటి? పరలోకాన్ని విశ్వసిస్తే మనిషికి కలిగే ప్రయోజనము ఏమిటి? ఇవన్నీ ఇన్ షా అల్లాహ్ ఈ ప్రసంగంలో వస్తాయి.

ఆ హదీస్ మరొక్కసారి మనము విందాం. జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్తా, ఈమాన్ అంటే ఏమిటి అని ప్రశ్నించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇస్తూ, అల్లాహ్ ను విశ్వసించటం, దూతలను విశ్వసించటం, గ్రంథాలను విశ్వసించటం, ప్రవక్తలను విశ్వసించటం, పరలోకాన్ని విశ్వసించటం, విధివ్రాతను విశ్వసించటం అని సమాధానం ఇచ్చినప్పుడు, జిబ్రీల్ అలైహిస్సలాం వారు నిజమే అని ధ్రువీకరించారు కదండీ. ఆ ప్రకారంగా ఈమాన్ (విశ్వాసం) అంటే ఆరు విషయాలను విశ్వసించవలసి ఉంది కదండీ. అందులోని ఐదవ విషయం, పరలోకం పట్ల విశ్వాసం. ఈ పరలోకం పట్ల విశ్వాసం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మీ ముందర ఉంచుతున్నాను. ఇన్ షా అల్లాహ్, శ్రద్ధగా విని ఆచరించే ప్రయత్నము చేయండి.

ముందుగా, పరలోకం అంటే ఏమిటి తెలుసుకుందాం. పరలోకం అంటే, మానవులందరూ కూడా మరణించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవులందరినీ ఒక రోజు మళ్ళీ బ్రతికిస్తాడు. ఆ రోజు వారి కర్మల లెక్కింపు జరుగుతుంది. ఎవరైతే సత్కార్యాలు ఎక్కువగా చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, వారికి బహుమానాలు ఇవ్వబడతాయి. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, వారికి శిక్షలు విధించటం జరుగుతుంది. ఇలా జరిగే దినాన్ని పరలోక దినం, లెక్కింపు దినం అని కూడా అంటూ ఉంటారు.

పరలోకం ఉంది అని నమ్మటానికి ఆధారాలు మనము ఇప్పుడు చూచినట్లయితే, ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పదేపదే పరలోకం గురించి మరియు పరలోకంలో జరగబోయే విషయాల గురించి మనకు తెలియపరిచి ఉన్నాడు. హదీసులలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలలో కూడా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట పరలోకము మరియు పరలోకంలో జరగబోయే విషయాల ప్రస్తావన మనకు కనబడుతూ ఉంటుంది. ఒక ఉదాహరణ మీ ముందర ఉంచుతున్నాను చూడండి. ఖురాన్ గ్రంథము 23వ అధ్యాయము 15, 16 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

ثُمَّ اِنَّكُمْ بَعْدَ ذٰلِكَ لَمَيِّتُوْنَ ثُمَّ اِنَّكُمْ يَوْمَ الْقِيٰمَةِ تُبْعَثُوْنَ
ఆ తరువాత మీరంతా తప్పకుండా మరణిస్తారు. మరి ప్రళయ దినాన మీరంతా నిశ్చయంగా లేపబడతారు. (23:15-16)

ఈ రెండు వాక్యాలలో ప్రళయ దినం ప్రస్తావన కూడా వచ్చి ఉంది. మనిషి మరణించిన తర్వాత మళ్ళీ బ్రతికించబడతారు అనే ప్రస్తావన కూడా వచ్చి ఉంది. ఇలా చాలా వాక్యాలు ఉన్నాయి, చాలా హదీసులు, ఉల్లేఖనాలు ఉన్నాయి. తద్వారా, పరలోకము తప్పనిసరిగా ఉంది అని గ్రంథాల ద్వారా స్పష్టమవుతూ ఉంది. ప్రతి విశ్వాసి కూడా పరలోకాన్నే విశ్వసించటం తప్పనిసరి.

ఇక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే, పరలోకం సంభవిస్తుంది అని కూడా మనకు తెలుస్తుంది. అది ఎలాగంటే, మనం చూస్తూ ఉంటాం. చాలా చోట్ల ప్రపంచంలో, బలవంతులు, దౌర్జన్యపరులు నిరుపేదలపై, బలహీనులపై దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు. హత్యలు చేస్తూ ఉంటారు, అత్యాచారాలు చేస్తూ ఉంటారు, ప్రాణాలు తీసేసి ఇది ప్రమాదము అని చిత్రీకరిస్తూ ఉంటారు, అరాచకాలు సృష్టిస్తూనే ఉంటారు, కబ్జాల మీద కబ్జాలు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉంటే, మనం చూస్తూ ఉంటాం. బలహీనులు న్యాయం కావాలి అని ఎదురు చూస్తూనే ఉంటారు, కానీ వారికి ఎక్కడ కూడా న్యాయం దొరకదు, చివరికి వారు అలాగే బాధపడుతూనే మరణించి ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. బలవంతుల్లో కొందరు, రాజకీయ నాయకుల, అధికారుల అండదండలతో, ధనముతో తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. వారు చేసిన అరాచకాలకు శిక్షలు పడవు. ఏదో ఒక రకంగా పలుకుబడి ద్వారా వారు తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. చివరికి వారు కూడా ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు.

ప్రశ్న ఏమిటంటే, మరి అన్యాయానికి గురి అయిన ఈ పీడితులకు, దేవుడు కూడా న్యాయం చేయడా? అన్యాయము చేసి, అరాచకాలు సృష్టించిన ఈ దుర్మార్గులకు, దేవుడు కూడా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కూడా శిక్షించడా? అంటే, దానికి ఇస్లాం ఇచ్చే సమాధానం ఏమిటంటే, తప్పనిసరిగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు, మరియు అతనికి న్యాయం చేస్తాడు. అలాగే ప్రతి నేరస్తునికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని నేరానికి సరిపడేటట్టుగానే శిక్షిస్తాడు. ఎంతటి నేరము ఉంటుందో అంతటి కఠినమైన శిక్ష కూడా విధిస్తాడు. దీనికి సరైన ప్రదేశము పరలోకము.

పరలోకంలో నిరుపేద, ధనికుడు, బలహీనుడు, బలవంతుడు, రాజకీయ అండదండలు, ధనము, పలుకుబడి ఇవన్నీ ఏమీ గానీ ఉండవు, పనికిరావు కూడా. అక్కడ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు మరియు ప్రతి నేరస్తునికి అతని నేరానికి తగినంత శిక్ష కూడా విధిస్తాడు. ఆ రోజు న్యాయము స్థాపించబడుతుంది. ఆ ప్రకారంగా పరలోకము తప్పనిసరిగా సంభవిస్తుంది అని మనకు స్పష్టమవుతుంది మిత్రులారా.

పరలోకంలో ఏమేమి ఉంటాయి అనే విషయాలు మనం చూచినట్లయితే, చాలా విషయాలు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియపరిచి ఉన్నారు. కొన్ని విషయాలు మాత్రమే ఈ ప్రసంగంలో చెబుతున్నాను. ఇన్ షా అల్లాహ్, పరలోకంలో ఏమి జరుగుతుంది అనే ప్రసంగం వినండి, అందులో వివరాలు ఇన్ షా అల్లాహ్ మీకు దొరుకుతాయి. ఇక రండి, కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పరలోకంలో హషర్ మైదానము ఉంది. హషర్ మైదానము అంటే ఏమిటి? ప్రళయం సంభవించిన తర్వాత, యుగాంతము సంభవించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ భూమి ఆకాశాలను సృష్టిస్తాడు. ఆ రోజు భూమి ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక చదరపు మైదానములా, పాన్పు లాగా ఉంటుంది. ఆ మైదానంలో ఒక చెట్టు గానీ, ఒక గుట్ట గానీ, ఒక భవనము గానీ ఉండదు. ఆ మైదానంలో, ఆది మానవుడైన ఆదమ్ అలైహిస్సలాం వద్ద నుండి యుగాంతం సంభవించినంత వరకు ఎంతమంది మానవులైతే జన్మించి, మరణించారో వారందరినీ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ బ్రతికించి నిలబెడతాడు.

వారందరూ కూడా ఆ మైదానంలో నిలబడినప్పుడు, వారి వారి చేతికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. ఎవరైతే సత్కార్యాలు చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, కుడిచేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు వారి కర్మలను, వారి సత్కార్యాలను చూసి, చదివి సంతోషిస్తూ ఉంటారు, వారి మొహము ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, అరాచకాలు సృష్టించి ఉంటారో, ఎడమ చేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు చేసుకున్న పాపాలన్నీ వారు ఆ రోజు చదువుకుంటూ, ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. వారి మొహం ఆ రోజు నల్లబడిపోతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే, దానిని హషర్ మైదానము అని అంటారు.

అలాగే పరలోకంలో ఏముంది అని మనం చూచినట్లయితే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మీజాన్ ఉంచి ఉన్నాడు. మీజాన్ అంటే ఏమిటి? త్రాసు అని అర్థం. ఆ త్రాసులో ఏమి తూంచబడుతుంది అంటే, ప్రజల పుణ్యాలు, పాపాలు తూచబడతాయి. ఎవరి పుణ్యాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు విజేతలుగా నిలబడతారు. ఎవరి పాపాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు దోషులుగా నిలబడతారు. ఆ రోజు తుది నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాదే. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎవరిని మన్నించాలనుకుంటాడో వారిని మన్నిస్తాడు. మరి ఎవరినైతే శిక్షించాలనుకుంటాడో వారిని శిక్షిస్తాడు. నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చేతిలోనే ఉంటుంది. కాకపోతే, విశ్వాసం ప్రామాణికమైనది అవుతుంది కాబట్టి మిత్రులారా, ఆ రోజు రానున్నది. ప్రపంచంలోనే విశ్వసించండి, సత్కార్యాలు చేయండి అని మనకు తెలపబడింది. మొత్తానికి పరలోకంలో త్రాసు ఉంది, అందులో ప్రజల కర్మలు తూచబడతాయి.

అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జహన్నం సిద్ధం చేసి ఉంచాడు. జహన్నం అంటే నరకం అని అర్థం. నరకంలో ఏముంది అంటే, అది ఒక పెద్ద బావి, దాని నిండా అగ్ని ఉంది. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కారానికి పాల్పడి ఉంటారో, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అలాంటి వారిని శిక్షించడానికి నరకంలో పడవేస్తాడు. ఎవరు ఎన్ని ఘోరమైన నేరాలు, పాపాలు చేసి ఉంటారో, వారికి నరకంలో అంత కఠినమైన శిక్ష కూడా విధించబడుతుంది. అల్లాహ్ మన అందరికీ దాని నుండి, దాని శిక్షల నుండి రక్షించుగాక, ఆమీన్.

అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జన్నహ్, ఉర్దూలో జన్నత్, తెలుగులో స్వర్గం సిద్ధం చేసి ఉన్నాడు. స్వర్గంలో ఏమున్నాయి అంటే, అందులో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అనుగ్రహాలు అన్నీ ఉంచి ఉన్నాడు. ఆ అనుగ్రహాలు ఎవరికి దక్కుతాయి అంటే, ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు, పుణ్యాలు ఎక్కువగా చేసుకుని ఉంటారో, వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆ స్వర్గము ప్రసాదిస్తాడు. ఎవరు ఎన్ని ఎక్కువ పుణ్యాలు చేసుకొని ఉంటారో, వారు స్వర్గంలో అంత ఉన్నతమైన స్థానాలలో చేరుకుంటారు. స్వర్గంలో ఉన్నవారు, ప్రశాంతంగా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి భయము లేకుండా, సంతోషంగా జీవించుకుంటూ ఉంటారు. అలాంటి స్వర్గం అల్లాహ్ మన అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.

పరలోకంలో ఇంకా ఏమి ఉంటాయి అంటే, పరలోకంలో హౌదె కౌసర్ ఉంది, పరలోకంలో పుల్ సిరాత్ ఉంది, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మీరు పరలోకంలో ఏమి జరుగుతుంది, పరలోక విశేషాలు అనే ప్రసంగాలు వినండి, ఇన్ షా అల్లాహ్ తెలుస్తుంది. సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి, ఇక చివరులో మనము…

పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి అనేది ఇన్ షా అల్లాహ్ తెలుసుకొని మాటను ముగిద్దాం. పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటట? మనిషి పరలోకాన్ని విశ్వసించటం వలన దైవభీతితో జీవిస్తాడు. పుణ్యాలు బాగా చేసి, పరలోక అనుగ్రహాలు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. పాపాలు చేస్తే పరలోకంలో శిక్షలు తప్పవు అని భయపడుతూ ఉంటాడు. మరియు అలా భయపడటం వలన, అతను అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అలా చేయటం వలన సమాజంలో శాంతి నెలకొంటుంది.

ఒకసారి ఆలోచించి చూడండి. ప్రతి వ్యక్తి పరలోకాన్ని విశ్వసించి, పరలోకంలో ఉన్న అనుగ్రహాలను విశ్వసించి, పరలోకంలో ఉన్న శిక్షలను కూడా విశ్వసించి, వాటిని దృష్టిలో పెట్టుకుని జీవిస్తున్నప్పుడు, సత్కార్యాలు చేసుకుందాం, పుణ్యాలు సంపాదించుకుని స్వర్గానికి చేరుకుందాం అనుకుంటూ ఉంటే, అలాగే పాపాలు చేయవద్దు, చేస్తే నరకానికి వెళ్లి శిక్షలు అనుభవించవలసి ఉంటుంది కాబట్టి, వద్దు అయ్యా పాపాలు, నేరాలు అని దానికి దూరంగా ఉంటూ ఉంటే, ప్రతి వ్యక్తి ఆ విధంగా విశ్వసించి జీవించుకుంటే, అలాంటి సమాజము శాంతియుతంగా ఉంటుంది అని చెప్పటానికి ఇంకేమి కావాలి మిత్రులారా.

కాబట్టి, నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మన అందరికీ సంపూర్ణ విశ్వాసులుగా జీవించే భాగ్యం ప్రసాదించుగాక. నరక శిక్షల నుండి అల్లాహ్ మమ్మల్ని కాపాడి, స్వర్గవాసులుగా మమ్మల్ని అందరినీ స్వర్గానికి చేర్చుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30634

పరలోకం (The Hereafter) – మెయిన్ పేజీ
https://teluguislam.net/hereafter/

అల్లాహ్ పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ పట్ల విశ్వాసం
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/0Ud2-JK7Y7k [17 నిముషాలు]

ఈ ప్రసంగంలో, విశ్వాసంలోని ప్రాథమిక అంశాల గురించి వివరించబడింది. ముఖ్యంగా ‘అర్కానుల్ ఈమాన్’ (విశ్వాస మూలస్తంభాలు) లోని మొదటి అంశమైన అల్లాహ్ పట్ల విశ్వాసం గురించి వివరంగా చర్చించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు జిబ్రీల్ అలైహిస్సలాం మధ్య జరిగిన సంభాషణ ద్వారా ఈమాన్ యొక్క ఆరు మూలస్తంభాలు వివరించబడ్డాయి: అల్లాహ్ ను విశ్వసించడం, ఆయన దైవదూతలను, గ్రంథాలను, ప్రవక్తలను, పరలోక దినాన్ని మరియు మంచి చెడు విధిరాతను విశ్వసించడం. అల్లాహ్ అస్తిత్వం, ఆయన సర్వాధికారాలు (తౌహీద్ అర్-రుబూబియ్య), ఆరాధనలకు ఆయన ఒక్కడే అర్హుడు (తౌహీద్ అల్-ఉలూహియ్య), మరియు ఆయన పవిత్ర నామాలు, గుణగణాలు (తౌహీద్ అల్-అస్మా వస్సిఫాత్) అనే మూడు ముఖ్య విషయాలను తెలుసుకోవడం ద్వారా అల్లాహ్ పై సంపూర్ణ విశ్వాసం కలుగుతుందని బోధించబడింది. ఖురాన్ ఆయతుల ఆధారాలతో ఈ అంశాలు స్పష్టంగా వివరించబడ్డాయి.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలలోని మొదటి ముఖ్యాంశం, అల్లాహ్ పట్ల విశ్వాసం గురించి ఈ ప్రసంగంలో మనం తెలుసుకోబోతున్నాం.

చూడండి, దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం మానవ రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమావేశంలో వచ్చి, “ఈమాన్ (విశ్వాసం) అంటే ఏమిటి? తెలుపండి” అన్నారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానమిస్తూ, “ఈమాన్ (విశ్వాసం) అంటే అల్లాహ్ ను విశ్వసించాలి, దైవదూతలను విశ్వసించాలి, దైవ గ్రంథాలను విశ్వసించాలి, దైవ ప్రవక్తలను విశ్వసించాలి, పరలోక దినాన్ని విశ్వసించాలి, మంచి చెడు విధివ్రాతను విశ్వసించాలి.” ఈ ఆరు విషయాలను విశ్వసించటాన్ని ఈమాన్, విశ్వాసం అంటారు అని చెప్పారు. దానికి దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం వారు, “అవును, మీరు చెప్పింది నిజమే” అన్నారు.

రండి ఈరోజు మనము విశ్వాస ముఖ్యాంశాలలోని మొదటి విషయం, అల్లాహ్ పై విశ్వాసం గురించి తెలుసుకుందాం.

అల్లాహ్ ను విశ్వసించడం అంటే అల్లాహ్ ఉన్నాడు అని, అల్లాహ్ సర్వాధికారాలు కలిగి ఉన్నాడు అని, అల్లాహ్ ఆరాధనలన్నింటికీ అర్హుడు అని, అల్లాహ్ కు గొప్ప నామాలు, పేర్లు ఉన్నాయి అని విశ్వసించటం. దీని క్లుప్తమైన వివరణ ఇప్పుడు మీ ముందర ఉంచడం జరుగుతూ ఉంది.

అల్లాహ్ ఉన్నాడు అని ప్రతి వ్యక్తి నమ్మాలి. ఇదే వాస్తవము కూడా. అల్లాహ్ ఉన్నాడు అని మనందరి ఆత్మ సాక్ష్యమిస్తుంది. సమస్యలు, బాధలు వచ్చినప్పుడు “దేవుడా” అని విన్నవించుకుంటుంది మన ఆత్మ. సృష్టిలో గొప్ప గొప్ప నిదర్శనాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉంచి ఉన్నాడు. ఆ నిదర్శనాలను చూసి, అల్లాహ్ ఉన్నాడు, సృష్టికర్త అయిన ప్రభువైన అల్లాహ్ ఉన్నాడు అని మనము గుర్తించాలి. ఉదాహరణకు, భూమి, ఆకాశాలు, పర్వతాలు, సముద్రాలు, సూర్యచంద్రులు, ఇవన్నీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టించినవి. అల్లాహ్ కాకుండా ప్రపంచంలోని ఏ సామ్రాజ్యంలో, ఏ ఫ్యాక్టరీలో ఇవన్నీ తయారు అవ్వవు. వీటన్నింటినీ సృష్టించిన వాడు గొప్ప శక్తిమంతుడు, ఆయనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. మానవుల ద్వారా భూమి, ఆకాశాలను, సముద్రాలను, వీటిని పుట్టించడమో, సృష్టించటమో వీలుకాని పని. కాబట్టి, ఇది మానవులు సృష్టించిన సృష్టి కాదు, సృష్టికర్త, ప్రభువు అల్లాహ్ సృష్టించిన సృష్టి అని ఈ సృష్టిలో ఉన్న నిదర్శనాలు చూసి మనము అల్లాహ్ ఉన్నాడు అని గుర్తించాలి.

ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము, ఒకవేళ సృష్టిలో ఉన్న నిదర్శనాలను చూసి మనము తెలుసుకోకపోయినా, మన శరీరంలో ఉన్న అవయవాలను బట్టి కూడా మనము మహాప్రభువు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉన్నాడని తెలుసుకోవచ్చు. మన శరీరంలో ఉన్న అవయవాలలో నుంచి ఏ ఒక్క అవయవము పాడైపోయినా, అలాంటి అవయవము ప్రపంచంలోని ఏ సామ్రాజ్యంలో కూడా తయారు కాబడదు. మళ్ళీ అల్లాహ్ సృష్టించిన వేరే మనిషి శరీరం నుండి తీసుకుని మనము ఒకవేళ దాన్ని అతికించుకున్నా గానీ, అది అల్లాహ్ ఇచ్చిన అవయవం లాగా పని చేయదు. కాబట్టి మన శరీర అవయవాలే సృష్టికర్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క గొప్పతనాన్ని మనకు సూచిస్తూ ఉన్నాయి. ఆ ప్రకారంగా మనము అల్లాహ్, సృష్టికర్త ఉన్నాడు అని మనం నమ్మాలి. ఇదే నిజమైన నమ్మకం.

చూడండి, ఖురాను గ్రంథం 52వ అధ్యాయం, 35వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

أَمْ خُلِقُوا مِنْ غَيْرِ شَيْءٍ أَمْ هُمُ الْخَالِقُونَ
(అమ్ ఖులిఖూ మిన్ ఘైరి షైఇన్ అమ్ హుముల్ ఖాలిఖూన్)
ఏమిటి, వీరు (పుట్టించేవాడు) ఎవరూ లేకుండానే వారంతట వారే పుట్టుకు వచ్చారా? లేక వారే స్వయంగా సృష్టికర్తలా?” (52:35)

అంటే, ఎవరికి వారు స్వయంగా సృష్టించబడలేదు, వారిని సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు అని ఆలోచింపజేస్తున్నాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా.

అలాగే, ఖురాను గ్రంథం 51వ అధ్యాయం, 20 మరియు 21 వాక్యాలలో అల్లాహ్ తెలియజేశాడు:

وَفِي الْأَرْضِ آيَاتٌ لِّلْمُوقِنِينَ
(వఫిల్ అర్ది ఆయాతుల్ లిల్ మూఖినీన్)
నమ్మేవారికి భూమిలో పలు నిదర్శనాలున్నాయి.” (51:20)

وَفِي أَنفُسِكُمْ ۚ أَفَلَا تُبْصِرُونَ
(వఫీ అన్ఫుసికుమ్ అఫలా తుబ్సిరూన్)
స్వయంగా మీ ఆత్మల్లో (అస్తిత్వంలో) కూడా ఉన్నాయి. మరి మీరు పరిశీలనగా చూడటం లేదా?” (51:21)

చూశారా? మన శరీరంలోనే నిదర్శనాలు ఉన్నాయి. అవి చూసి అల్లాహ్ ను గుర్తుపట్టండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు తెలియజేసి ఉన్నాడు. మొత్తానికి, సృష్టికర్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉన్నాడు. అదే విషయం మన ఆత్మ సాక్ష్యమిస్తుంది, అదే విషయం సృష్టిలో ఉన్న నిదర్శనాలు, సూచనలు మనకు సూచిస్తూ ఉన్నాయి.

ఇక, అల్లాహ్ ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మూడు విషయాలను బాగా అవగాహన చేసుకోవాలి. ఆ మూడు విషయాలు ఏమిటంటే:

మొదటి విషయం: అల్లాహ్ సర్వాధికారాలు కలిగి ఉన్నాడు అని నమ్మాలి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టికర్త, వస్తువులన్నింటినీ ఆయనే సృష్టించాడు, అన్నింటికీ ఆయనే యజమాని, ఆయన వద్దే సర్వాధికారాలు ఉన్నాయి అని విశ్వసించాలి. దీనిని అరబీ భాషలో తౌహీద్ అర్-రుబూబియ్య అంటారు.

ఖురాను గ్రంథం 39వ అధ్యాయం, 62వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ
(అల్లాహు ఖాలిఖు కుల్లి షైఇన్)
అన్ని వస్తువులనూ సృష్టించినవాడు అల్లాహ్‌యే.”  (39:62)

జనన మరణాలను ప్రసాదించువాడు, ఉపాధి ప్రసాదించువాడు, లాభనష్టాలు కలిగించువాడు, సంతానము ప్రసాదించువాడు, వర్షాలు కురిపించువాడు, పంటలు పండించువాడు, సర్వాధికారాలు కలిగి ఉన్నవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అని మనము తెలుసుకొని విశ్వసించాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గురించి తెలుసుకోవటానికి మరో రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ ఒక్కడే ఆరాధనలన్నింటికీ అర్హుడు అని నమ్మాలి. దీనిని అరబీ భాషలో తౌహీద్ ఉలూహియ్య అంటారు.

ఆరాధనలు ప్రత్యక్షమైన ఆరాధనలు ఉన్నాయి, గుప్తమైన ఆరాధనలు ఉన్నాయి, చిన్న ఆరాధనలు ఉన్నాయి, పెద్ద ఆరాధనలు ఉన్నాయి. ఆరాధన ఏదైనా సరే, ప్రతి ఆరాధనకు అర్హుడు అల్లాహ్ ఒక్కడే అని మనము తెలుసుకొని నమ్మాలి. ఆ తర్వాత ప్రతి చిన్న, పెద్ద, బహిరంగమైనది, గుప్తమైనది ఆరాధన ఏదైననూ అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి, ఎందుకంటే ఆరాధనలకు అర్హుడు ఆయన ఒక్కడే కాబట్టి.

ప్రత్యక్ష ఆరాధనలు ఏవి? గుప్తమైన ఆరాధనలు ఏవి? అంటే నమాజు, ఉపవాసము, దుఆ, జంతుబలి, ఉమ్రా, హజ్, ఇవన్నీ ప్రత్యక్షంగా కంటికి కనిపించే ఆరాధనలు. గుప్తమైన ఆరాధనలు అంటే అల్లాహ్ పట్ల అభిమానం, అల్లాహ్ మీద నమ్మకం, అల్లాహ్ తో భయపడటం, ఇవి పైకి కనిపించని రహస్యంగా, గుప్తంగా ఉండే ఆరాధనలు. ఈ ఆరాధనలు అన్నీ కూడాను మనము కేవలం అల్లాహ్ కోసమే చేయాలి.

ఆరాధనల గురించి ఒక రెండు ముఖ్యమైన విషయాలు మీ ముందర ఉంచి నా మాటను ఇన్షా అల్లాహ్ ముందుకు కొనసాగిస్తాను. అసలు ఆరాధన ఎంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను, జిన్నాతులను ఈ ఆరాధన కోసమే సృష్టించాడు అని తెలియజేసి ఉన్నాడు.

ఖురాను గ్రంథం 51వ అధ్యాయము, 56వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ
(వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియ’బుదూన్)
“నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే.” (51:56)

చూశారా? మానవులు మరియు జిన్నాతులు అల్లాహ్ ను ఆరాధించటానికి సృష్టించబడ్డారు. మరి ఏ విషయం కోసం అయితే మానవులు సృష్టించబడ్డారో, అదే విషయాన్ని విస్మరిస్తే ఎలాగ? కాబట్టి ఆరాధన ముఖ్యమైన విషయం, మన పుట్టుక అందుకోసమే జరిగింది కాబట్టి, అల్లాహ్ ను ఆరాధించుకుంటూ ఉండాలి.

అలాగే, ప్రవక్తలు పంపించబడినది మరియు దైవ గ్రంథాలు అవతరింపజేయబడినది కూడా మానవులు అల్లాహ్ ను ఆరాధించటం కోసమే. మానవులు షైతాను వలలో చిక్కి, ఎప్పుడైతే అల్లాహ్ ను మరిచిపోయారో, అల్లాహ్ ను ఆరాధించటం మానేశారో, అల్లాహ్ ను వదిలి బహుదైవారాధన, మిథ్యా దేవుళ్ళను ఆరాధించడం ప్రారంభించారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలను మళ్ళీ రుజుమార్గం పైకి తీసుకురావటానికి, అల్లాహ్ ను ఆరాధించే వారిలాగా చేయటానికి ప్రవక్తలను పంపించాడు, దైవ గ్రంథాలు అవతరింపజేశాడు.

చూడండి ఖురాను గ్రంథం 16వ అధ్యాయం, 36వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ
(వలఖద్ బ’అస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలన్ అని’బుదుల్లాహ వజ్తనిబుత్ తాఘూత్)

మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా (ప్రజలారా!) “అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి” అని బోధపరచాము. గా ఉండండి” అని బోధపరచాము.” (16:36)

చూశారా? ప్రవక్తలు వచ్చింది ఎందుకోసం అంటే అల్లాహ్ ఒక్కడే ఆరాధనలకు అర్హుడు, ఆయననే ఆరాధించండి, మిథ్యా దేవుళ్ళను ఆరాధించకండి అని చెప్పటానికే వచ్చారు. అందుకోసమే గ్రంథాలు అవతరింపజేయబడ్డాయి. కాబట్టి ఆరాధన ముఖ్యమైనది. ఆరాధనలు మనము అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి.

ఇక, ఆరాధన స్వీకరించబడాలంటే రెండు ముఖ్యమైన షరతులు ఉంటాయండి. ఒక షరతు ఏమిటంటే అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే ఆరాధనలు చేయాలి, దీనిని అరబీ భాషలో ఇఖ్లాస్ లిల్లాహ్ అంటారు. రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం ప్రకారమే ఆరాధనలు చేయాలి. అరబీ భాషలో దీనిని ముతాబి’అతు సున్నతి రసూలిల్లాహ్ అంటారు. ఆరాధన స్వీకరించబడాలంటే మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సమాజము కాబట్టి, ప్రతి ఆరాధన అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే చేయాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసి చూపించిన పద్ధతి ప్రకారము చేయాలి. అప్పుడే ఆ ఆరాధన స్వీకరించబడుతుంది.

ఇక, అల్లాహ్ ను కాకుండా ఇతరులను ఆరాధిస్తే, అది బహుదైవారాధన అనిపించుకుంటుంది, దానిని అరబీ భాషలో షిర్క్ అంటారో. బహుదైవారాధన, షిర్క్, పెద్ద నేరము, క్షమించరాని నేరము. ఎట్టి పరిస్థితిలో ఆ నేరానికి పాల్పడకూడదు అని తెలియజేయడం జరిగింది.

ఇక, అల్లాహ్ ను తెలుసుకోవటానికి మూడవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ కు పవిత్రమైన నామాలు, పేర్లు ఉన్నాయి, వాటిని ఉన్నది ఉన్నట్టుగానే విశ్వసించాలి. దీనిని అరబీ భాషలో తౌహీదుల్ అస్మా వస్సిఫాత్ అంటారు. ఈ పేర్లలో అల్లాహ్ యొక్క గుణాలు తెలియజేయడం జరిగి ఉంది. కాబట్టి అందులో ఎలాంటి వక్రీకరణ చేయకుండా, మన ఇష్టానుసారంగా అర్థాలు తేకుండా, ఏ విధంగా అయితే అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేసి ఉన్నారో, ఆ ప్రకారము ఉన్నది ఉన్నట్టుగానే విశ్వసించాలి.

ఉదాహరణకు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు రహ్మాన్, రహీమ్ అని పేర్లు ఉన్నాయి. రహ్మాన్, రహీమ్ అంటే అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అని. అలాగే అల్లాహ్ కు సమీ’, బసీర్ అనే పేర్లు ఉన్నాయి. సమీ’ అంటే వినేవాడు, బసీర్ అంటే చూసేవాడు అని అర్థం. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు రజ్జాఖ్, గఫూర్ అని పేర్లు ఉన్నాయి. రజ్జాఖ్ అంటే ఉపాధి ప్రదాత, గఫూర్ అంటే మన్నించేవాడు, క్షమించేవాడు. ఆ ప్రకారంగా, అల్లాహ్ యొక్క గుణాలను, అల్లాహ్ యొక్క లక్షణాలను తెలిపే చాలా పేర్లు ఉన్నాయి. అవి ఉన్నది ఉన్నట్టుగానే మనము విశ్వసించాలి.

ఇక, ఈ అల్లాహ్ యొక్క నామాల ద్వారా మనము అల్లాహ్ తో దుఆ చేస్తే, ఆ దుఆ తొందరగా స్వీకరించబడటానికి అవకాశం ఉంటుంది.

ఖురాను గ్రంథం 7వ అధ్యాయం, 180 వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا
(వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫద్’ఊహు బిహా)
అల్లాహ్‌కు మంచి మంచి పేర్లున్నాయి. కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి.” (7:180)

అల్లాహ్ కు ఉన్న పేర్లతో ఆయన్నే పిలవండి అని అల్లాహ్ చెప్పాడు కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు, ఉదాహరణకు మనతో పాపము దొర్లింది, మన్నించమని మనం అల్లాహ్ తో వేడుకుంటున్నామంటే, “ఓ పాపాలను మన్నించే ప్రభువు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, యా గఫూర్, ఓ పాపాలను మన్నించే ప్రభువా, ఓ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, నీవు గఫూర్, పాపాలను మన్నించేవాడివి, నన్ను మన్నించు” అని వేడుకోవాలి. అలా వేడుకుంటే చూడండి, ప్రార్థనలో ఎంత విశిష్టత వస్తూ ఉందో చూశారా? ఆ ప్రకారంగా మనము వేడుకోవాలి.

ఇవి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను పూర్తిగా విశ్వసించటానికి ఈ మూడు ముఖ్యమైన విషయాలు. అల్లాహ్ సర్వాధికారాలు కలిగి ఉన్నాడు అని, అల్లాహ్ ఒక్కడే ఆరాధనలన్నింటికీ అర్హుడు అని, అల్లాహ్ కు పేర్లు ఉన్నాయి అని, ఈ మూడు విషయాలను మనం అవగాహన చేసుకుంటే అల్లాహ్ మీద మనకు సంపూర్ణ విశ్వాసం కలుగుతుంది.

ఈ మూడింటిలో నుండి ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాము, మిగతా రెండు విషయాలని మనము వదిలేశాము అంటే అప్పుడు మన విశ్వాసము అల్లాహ్ మీద సంపూర్ణము కాజాలదు. ఉదాహరణకు, మక్కా వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రవక్త పదవి లభించే సమయానికి అల్లాహ్ గురించి తెలుసుకొని ఉన్నారు. ఒక విషయం మాత్రమే తెలుసుకున్నారు: సృష్టి మొత్తానికి అల్లాహ్ ఒక్కడే సృష్టికర్త, ఆయన వద్దే సర్వాధికారాలు ఉన్నాయని ఆ ఒక్క విషయాన్ని మాత్రమే వారు తెలుసుకున్నారు. కానీ ఆరాధనల విషయంలో మాత్రం వారు తప్పు చేసేవారు, విగ్రహాలను ఆరాధించేవారు. అల్లాహ్ కు గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయన్న విషయాన్ని వారు విశ్వసించే వారు కాదు. కాబట్టి వారి విశ్వాసము అసంపూర్ణము అని చెప్పబడింది, వారు విశ్వాసులు కారు అని చెప్పబడింది. కాబట్టి, అల్లాహ్ మీద మన విశ్వాసము పూర్తి అవ్వాలంటే, అల్లాహ్ గురించి ఈ మూడు విషయాల అవగాహన చేసుకుని మనము నమ్మాలి, ఆచరించాలి.

అల్లాహ్ మీద విశ్వాసం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ను తెలుసుకొని విశ్వసిస్తాడో అతనిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదుకుంటాడు, సహకరిస్తాడు, అతని కోరికలు తీరుస్తాడు, సమస్యలు పరిష్కరిస్తాడు. అలాగే, అల్లాహ్ ను విశ్వసించిన వ్యక్తి మంచి జీవితం గడుపుతాడు. మార్గభ్రష్టత్వానికి గురి అయ్యి పశువుల్లాగా, చాలామంది చేస్తున్న చేష్టలకు దూరంగా ఉంటాడు. అలాగే మనిషి అల్లాహ్ ను విశ్వసించటము ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ప్రసన్నత పొందుతాడు.

ఇవి అల్లాహ్ పట్ల విశ్వాసం గురించి మనము తెలుసుకొనవలసిన ముఖ్యమైన విషయాలు. నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ అన్న, విన్న విషయాల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30628


అల్లాహ్ (త’ఆలా) – మెయిన్ పేజీ:
https://teluguislam.net/allah/

దైవ గ్రంథాల పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

దైవ గ్రంథాల పట్ల విశ్వాసం
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/L5UicLobEHE [12 నిముషాలు]

ఈ ప్రసంగంలో, వక్త ఇస్లాంలో విశ్వాసం యొక్క మూడవ ముఖ్యమైన అంశం గురించి వివరిస్తారు: దైవ గ్రంథాలను విశ్వసించడం. ప్రారంభంలో, అతను అల్లాహ్ యొక్క ఏకత్వం మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. దైవ గ్రంథాలు అంటే ఏమిటి, అవి ఎందుకు అవతరింపబడ్డాయి, మరియు ఖురాన్ ప్రకారం ఎన్ని గ్రంథాలు ఉన్నాయి అనే విషయాలను చర్చిస్తారు. ఈ గ్రంథాలలో ఇబ్రాహీం (అలైహిస్సలాం) యొక్క సహీఫాలు, తౌరాత్, జబూర్, ఇంజీల్ మరియు ఖురాన్ ఉన్నాయి. ఒక ముస్లింగా ఖురాన్‌ను అనుసరించడం యొక్క ప్రాముఖ్యతను మరియు దాని ప్రత్యేకతలను కూడా వివరిస్తారు. చివరిగా, పూర్వ గ్రంథాల పట్ల ఒక ముస్లిం యొక్క వైఖరి ఎలా ఉండాలి, అంటే వాటి అసలు రూపాన్ని విశ్వసించడం, కానీ కాలక్రమేణా వాటిలో జరిగిన మార్పులను గుర్తించడం గురించి వివరిస్తారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్. నబియినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అర్కానుల్ ఈమాన్, ఈమాన్ ముఖ్యాంశాలలోని మూడవ ముఖ్యాంశం దైవ గ్రంథాలపై విశ్వాసం గురించి ఇన్షా అల్లాహ్ ఈ ప్రసంగంలో మనం తెలుసుకోబోతున్నాం.

దైవ గ్రంథాలు అంటే ఏమిటి?
మొత్తం ఎన్ని దైవ గ్రంథాలు భూమండలం మీద అవతరించబడ్డాయి?
ఖురాన్ లో ఎన్ని గ్రంథాల ప్రస్తావన వచ్చి ఉంది?
మనము ఏ గ్రంథాన్ని అనుసరించాలి?
అలాగే పూర్వపు అవతరింపబడిన గ్రంథాల పట్ల మన వైఖరి ఎలా ఉండాలి?

ఈ విషయాలన్నీ ఇన్షా అల్లాహ్ మనము ఈ ప్రసంగంలో తెలుసుకోబోతున్నాం.

ముందుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు దైవ ప్రవక్త జిబ్రయీల్ (అలైహిస్సలాం) వారు మానవ ఆకారంలో వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతూ విశ్వాసం అంటే ఏమిటి ఓ దైవ ప్రవక్త అని అడిగినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆరు విషయాలను నమ్మటం, విశ్వసించటం ఈమాన్ అంటారు అని ఆరు విషయాలను ప్రస్తావించారు. అల్లాహ్ ను విశ్వసించటం, ప్రవక్తలను విశ్వసించటం, దూతలను విశ్వసించటం, గ్రంథాలను విశ్వసించటం, పరలోక దినాన్ని విశ్వసించటం, మంచి చెడు విధివ్రాతలను విశ్వసించటం. మొత్తం ఈ ఆరు విషయాలను విశ్వసించటాన్ని విశ్వాసం ఈమాన్ అంటారు అని ప్రవక్త వారు తెలియజేశారు కదండీ. అందులో మూడవ విషయం, మూడవ విషయం దైవ గ్రంథాల పట్ల విశ్వాసం అని ప్రవక్త వారు తెలియజేశారు. ఆ దైవ గ్రంథాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

అసలు ఈ దైవ గ్రంథాలు అని వేటిని అంటారు అంటే, చూడండి మానవులను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భూమండలం మీద పంపించిన తర్వాత మానవులు వారి సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చిత్తం ప్రకారము జీవించాలి అనేది మానవుల మీద అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఒక బాధ్యత నిర్ణయించాడు. మరి మానవులకు ఏ పని అల్లాహ్ చిత్తం ప్రకారము జరుగుతుంది మరియు ఏ పని అల్లాహ్ చిత్తానికి విరుద్ధంగా జరుగుతుంది అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తేనే కదా వారు తెలుసుకుంటారు. లేదంటే మానవులు చేసే ఏ పని అల్లాహ్ కు నచ్చుతున్నది ఏ పని అల్లాహ్ కు నచ్చటం లేదు అనేది వారికి ఎలా తెలుస్తుందండి? అలా తెలియజేయటానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భూమండలంలో నివసిస్తున్న మానవుల్లోనే కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకొని వివిధ యుగాలలో, వివిధ ప్రదేశాలలో వారి వద్దకు దైవదూత ద్వారా వాక్యాలు పంపించాడు.

ఆ వాక్యాలలో మానవులు ఏ పనులు చేస్తే పుణ్యం అనిపించుకుంటుంది, ఏ పనులు చేస్తే పాపం అనిపించుకుంటుంది, వారు ఏ విధంగా జీవించుకుంటే ప్రశాంతంగా జీవిస్తారు, ఏ విధంగా చేస్తే వారు పాపాలకు, అక్రమాలకు పాల్పడి అశాంతికి గురయ్యి అల్లకల్లోలానికి గురైపోతారు, తర్వాత ఏ పనిలో వారికి పుణ్యము దక్కుతుంది, ఏ పనిలో వారికి పాపము దక్కుతుంది అనే విషయాలన్నీ కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వాక్యాలలో ప్రవక్తల వద్దకు పంపించగా, ప్రవక్తలు ఆ దైవ వాక్యాలన్నింటినీ వారి వారి యుగాలలో ఎలాంటి సౌకర్యాలు ఉండేవో ఆ సౌకర్యాల ప్రకారము వాటన్నింటినీ ఒకచోట భద్రపరిచారు. అది ఆకులు కావచ్చు, చర్మము కావచ్చు, వేరే విషయాలైనా కావచ్చు. అలా భద్రపరచబడిన ఆ దైవ వాక్యాలన్నింటినీ కలిపి దైవ గ్రంథము అంటారు. దైవ గ్రంథంలో మొత్తం దైవ నియమాలు ఉంటాయి, అల్లాహ్ వాక్యాలు ఉంటాయి, ఏది పాపము, ఏది పుణ్యము, ఏది సత్కార్యము అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అందులో వివరంగా విడమరిచి తెలియజేసి ఉంటాడు.

అయితే మొత్తం ఎన్ని దైవ గ్రంథాలు భూమండలం మీదికి అవతరించబడ్డాయి అంటే వాటి సరైన సంఖ్య అల్లాహ్ కు మాత్రమే తెలుసు. మనకు అటు ఖురాన్ లో గాని, అటు ప్రామాణికమైన హదీసు గ్రంథాలలో కానీ ఎక్కడా కూడా ఎన్ని దైవ గ్రంథాలు భూమండలం మీద అవతరించబడ్డాయి అనేది పూర్తి దైవ గ్రంథాల సంఖ్యా వివరాలు తెలుపబడలేదు.

సరే మరి ఖురాన్ గ్రంథంలో ఎన్ని దైవ గ్రంథాల ప్రస్తావన వచ్చి ఉన్నది అని మనం చూచినట్లయితే, ఖురాన్ లో ఇంచుమించు ఐదు గ్రంథాల గురించి ప్రస్తావన వచ్చి ఉంది.

ఒకటి, సుహుఫు ఇబ్రాహీం – ఇబ్రాహీం (అలైహిస్సలాం) వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చిన కొన్ని సహీఫాలు, గ్రంథాలు. వాటిని సుహుఫు ఇబ్రాహీం అంటారు. రెండవది తౌరాత్ గ్రంథము. ఈ గ్రంథము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మూసా (అలైహిస్సలాం) వారికి ఇచ్చి ఉన్నాడు. మూడవది, జబూర్ గ్రంథము. ఈ గ్రంథము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) వారికి ఇచ్చి ఉన్నాడు. నాలుగవది ఇంజీల్ గ్రంథము. ఈ గ్రంథము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ఈసా (అలైహిస్సలాం) వారికి ఇచ్చి ఉన్నాడు. ఇక ఐదవ గ్రంథము, ఖురాన్ గ్రంథము. ఈ ఖురాన్ గ్రంథము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చి ఉన్నాడు. ఖురాన్ లో ఈ ఐదు గ్రంథాల గురించి ప్రస్తావన వచ్చి ఉన్నది.

ఇక హదీసులలో మనం చూచినట్లయితే, ప్రవక్త షీస్ (అలైహిస్సలాం) వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సహీఫాలు ఇచ్చి ఉన్నాడు అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. అలాగే ప్రవక్త ఇద్రీస్ (అలైహిస్సలాం) వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సహీఫాలు ఇచ్చి ఉన్నాడు అని ప్రవక్త వారు మనకు తెలియజేసి ఉన్నారు.

మనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులము కదండీ. మరి మనము ఏ గ్రంథాన్ని అనుసరించాలి అంటే, మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులము కాబట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేయబడిన ఖురాన్ గ్రంథాన్ని అనుసరించాలి. ఖురాన్ గ్రంథాన్ని అనుసరించటం మనందరి బాధ్యత.

మరి ఈ ఖురాన్ గ్రంథం యొక్క కొన్ని ప్రత్యేకతలు దృష్టిలో ఉంచుకోండి. ఖురాన్ గ్రంథము చివరి ఆకాశ గ్రంథము, చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేయబడింది. ఖురాన్ గ్రంథము అప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే అది అవతరింపజేయబడిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా ఎలాంటి కల్పితాలకు గురి కాకుండగా సురక్షితంగా ఉంది. ఇన్షా అల్లాహ్ ప్రళయం వరకు కూడా అది సురక్షితంగానే ఉంటుంది. ఖురాన్ గ్రంథము చదివి, అర్థం చేసుకుని ఆచరించటము ప్రతీ విశ్వాసి యొక్క కర్తవ్యము.

ఖురాన్ అల్లాహ్ వాక్యము కాబట్టి దానిని ప్రేమాభిమానాలతో మనము చదవటంతో పాటు ఎంతో గౌరవించాలి మరియు ఆచరించాలి. నేడు ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాతి భాషలన్నింటిలో కూడా ఖురాన్ యొక్క అనువాదము చేయబడి ఉన్నది కాబట్టి విశ్వాసి, మానవుడు ప్రపంచపు ఏ మూలన నివసించిన వాడైనా సరే అతను అతనికి ఏ భాష వస్తుందో ఆ భాషలోనే ఖురాన్ గ్రంథాన్ని చదివి అల్లాహ్ ఏమి తెలియజేస్తున్నాడు మానవులకి అనేది తెలుసుకొని అల్లాహ్ ను విశ్వసించి అల్లాహ్ తెలియజేసిన నియమాల అనుసారంగా జీవించుకోవలసిన బాధ్యత ప్రతి మానవుని మీద ఉంది.

ఇక చివర్లో ఖురాన్ కంటే పూర్వము దైవ గ్రంథాలు అవతరించబడ్డాయి కదా, ఆ దైవ గ్రంథాల పట్ల మన వైఖరి ఏ విధంగా ఉండాలి అనేది తెలుసుకుందాం. చూడండి, ఖురాన్ కంటే ముందు ప్రవక్తలకు దైవ గ్రంథాలు ఇవ్వబడ్డాయి, ఇది వాస్తవం. ఈసా (అలైహిస్సలాం) వారికి గ్రంథం ఇవ్వబడింది, దావూద్ (అలైహిస్సలాం) వారికి గ్రంథం ఇవ్వబడింది, మూసా (అలైహిస్సలాం) వారికి గ్రంథం ఇవ్వబడింది, ఇబ్రాహీం (అలైహిస్సలాం) వారికి గ్రంథం ఇవ్వబడింది కదా. మరి ఆ గ్రంథాల పట్ల మన వైఖరి ఏమిటంటే అవన్నీ దైవ గ్రంథాలు అని మనం విశ్వసించాలి. అలాగే అవి ప్రవక్తల వద్ద పంపబడిన రోజుల్లో సురక్షితంగానే ఉండేవి. వాటిలో మొత్తము దైవ వాక్యాలే ఉండేవి. కానీ ఆ ప్రవక్తలు మరణించిన తర్వాత ఆ ప్రవక్తల అనుచరులు ఆ ఆ గ్రంథాలలో కల్పితాలు చేసేశారు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు తెలియజేసి ఉన్నాడు కాబట్టి, అవి సురక్షితమైన గ్రంథాలు కావు, సురక్షితమైన రూపంలో నేడు ప్రపంచంలో ఎక్కడా నిలబడి లేవు అని మనం తెలుసుకోవాలి. అలాగే విశ్వసించాలి కూడా.

మనం చూచినట్లయితే నేడు తౌరాత్ గ్రంథము అని ఒక గ్రంథం కనిపిస్తుంది. నేడు మనం చూస్తున్న ఆ తౌరాత్ గ్రంథము ప్రవక్త మూసా (అలైహిస్సలాం) వారికి ఇవ్వబడిన అలనాటి కాలంలో ఉన్న వాక్యాలతో నిండిన గ్రంథము కాదు. అది నేడు మన దగ్గరికి చేరే సరికి చాలా కల్పితాలకు గురైపోయి ఉంది. ఆ విషయాన్ని మనం నమ్మాలి. అలాగే ఇంజీల్ గ్రంథము అని ఒక గ్రంథం మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త ఈసా (అలైహిస్సలాం) వారికి ఆ రోజుల్లో ఇవ్వబడిన ఆ ఇంజీల్ గ్రంథము అది అలాగే నేడు భద్రంగా లేదు. మన సమయానికి వచ్చేసరికి అవి చాలా కల్పితాలకు గురై మన దగ్గరికి చేరింది. కాబట్టి ఆ విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి. ఒక్క ఖురాన్ గ్రంథము మాత్రమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలము నుండి నేటి వరకు ఇన్షా అల్లాహ్ ప్రళయం వరకు కూడా సురక్షితంగా ఉంది, సురక్షితంగా ఉంటుంది.

ఇక పూర్వపు గ్రంథాలలో కొన్ని విషయాలు ఉన్నాయి కదా, అవి మూడు రకాల విషయాలు. ఒక రకమైన విషయాలు ఏమిటంటే అవి సత్యాలు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా లేదంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ధ్రువీకరించి ఉన్నారు. ఆ విషయాలను మనం అవి సత్యాలు అని ధ్రువీకరించాలి. కొన్ని విషయాలు ఎలాంటివి అంటే అవి అసత్యాలు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు తెలియజేసి ఉన్నాడు లేదంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేసి ఉన్నారు. అవన్నీ అసత్యాలు అని మనము వాటిని ఖండించాలి. మరి కొన్ని విషయాలు ఎలాంటివి అంటే వాటి గురించి అటు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గాని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గాని మనకు వాటి గురించి ఏమీ తెలియజేయలేదు. అలాంటి విషయాల గురించి మనం కూడా నిశ్శబ్దం పాటించాలి. అవి సత్యము అని ధ్రువీకరించకూడదు, అసత్యాలు అని ఖండించనూ కూడదు. ఎందుకంటే వాటి గురించి సరైన సమాచారము మనకు ఇవ్వబడలేదు కాబట్టి మనము వాటిని ధ్రువీకరించము అలాగే ఖండించము. నిశ్శబ్దం పాటిస్తాము. ఇది ఒక విశ్వాసి పూర్వపు గ్రంథాల పట్ల ఉండవలసిన వైఖరి.

ఇక నేను చివర్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ దైవ గ్రంథాల పట్ల సరైన అవగాహన కలిగి మరియు దైవ గ్రంథాలను ఏ విధంగా అయితే విశ్వసించాలని తెలుపబడిందో ఆ విధంగా విశ్వసించి నడుచుకునే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

దైవ గ్రంధాలపై విశ్వాసం (మెయిన్ పేజీ):
https://teluguislam.net/belief-in-books/