మానవుల కర్మల నమోదు | మరణానంతర జీవితం : పార్ట్ 48 | [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

మానవుల కర్మల నమోదు  – [మరణానంతర జీవితం – పార్ట్ 48]
https://www.youtube.com/watch?v=MoutOVAU1zA [25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ప్రళయ దినం (యౌమ్ అల్-ఖియామా) మరియు మానవుల కర్మలను నమోదు చేసే వ్యవస్థ గురించి వివరిస్తున్నారు. ప్రతి వ్యక్తితో ఇద్దరు దైవదూతలు (కిరామన్ కాతిబీన్) ఉంటారని, వారు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని, మరియు వారి మనస్సులోని గట్టి సంకల్పాలను కూడా నమోదు చేస్తారని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో స్పష్టం చేశారు. ఈ దైవదూతలు అత్యంత విశ్వసనీయులని, ఎలాంటి పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా రాస్తారని తెలిపారు. మంచి చేయాలనే సంకల్పానికి కూడా పుణ్యం లభిస్తుందని, కానీ చెడు చేయాలనే గట్టి నిశ్చయానికి కూడా పాపం నమోదు చేయబడుతుందని ప్రవక్త బోధనల ద్వారా వివరించారు. కర్మల నమోదు కేవలం మనతో ఉండే ఇద్దరు దూతలతోనే పరిమితం కాదని, జుమా నమాజ్ హాజరు లేదా ప్రత్యేక ప్రార్థనల వంటి సందర్భాలలో ఇతర దైవదూతలు కూడా నమోదు చేస్తారని ఉదాహరణలతో పేర్కొన్నారు. చివరగా, మన కర్మలన్నీ నమోదు చేయబడుతున్నాయనే భయంతో జాగ్రత్తగా జీవించాలని, మంచి పనుల వైపు మొగ్గుచూపి, చెడుకు దూరంగా ఉండాలని ఉద్బోధించారు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి కఫా, వస్సలాతు వస్సలాము అలా ఇబాదిల్లజీనస్తఫా, అమ్మాబాద్.. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

మహాశయులారా! ప్రళయ దినం. ఆ మహా భయంకరమైన దినం. ఏ రోజైతే మనం సమాధుల నుండి లేపబడి, ఎక్కడెక్కడా ఎవరు ఏ స్థితిలో చనిపోయారో వారందరినీ కూడా సమీకరించి ఒక మహా మైదానంలో పోగు చేయడం జరుగుతుంది. అక్కడ చాలా దీర్ఘకాలం అది ఉంటుంది. అక్కడి ఒక రోజు ఇహలోకపు 50 వేల సంవత్సరాలకు సమానంగా ఉంటుంది. అక్కడ ప్రతి ప్రాణి పట్ల న్యాయం జరుగుతుంది. ఎవరికీ ఏ అణువంత అన్యాయం జరగదు. ప్రతి ఒక్కరు ఆ రోజు తనను తాను తప్ప మరెవరి గురించి ఆలోచించడు.

ఆ దీర్ఘకాలమున పాపాల వల్ల మరియు సూర్యుడు కేవలం ఒక మైల్ దూరాన ఉండి, అక్కడి ఏ గాంభీర్య పరిస్థితి ఉంటుందో దానిని అతి త్వరలో దాటిపోవాలని మనిషి ఎంతో ఆలోచిస్తాడు. కానీ ఎక్కడికీ పరుగెత్తి వెళ్ళలేడు. అక్కడి ఘట్టాల్లో ఒక ముఖ్యమైన ఘట్టం ప్రతి మనిషి ఇహలోకంలో తాను చేస్తున్న కర్మలు ఏదైతే రాయబడుతున్నాయో ఆ కర్మ పత్రాలు తన కుడి చేతిలో లేదా తన ఎడమ చేతిలో – అల్లాహ్ దీని నుండి మనందరినీ కాపాడుగాక – తీసుకోవలసింది ఉంటుంది. ఇది కూడా ఒక చాలా భయంకర స్థితి, ఎంతో ఆవేదన మరియు బాధతో కూడిన ఆ సమయం. దాని గురించే ఇన్ షా అల్లాహ్, ఈరోజు మరియు తర్వాత వచ్చే కార్యక్రమాలలో మనం కొన్ని సత్యాలు తెలుసుకుంటాము. చాలా శ్రద్ధగా విని మనలో ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మనలోని ప్రతి వ్యక్తి చేయాలని ఆశిస్తున్నాను.

అయితే మహాశయులారా! ఇహలోకంలో మనం పుట్టిన తర్వాత మనలోని ప్రతి ఒక్కరితో ఇద్దరు దైవదూతలు మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి కర్మ, చివరికి మనం ఏదైనా గట్టి నిర్ణయం మనసులో చేసుకుంటే అది కూడా రాయడానికి సిద్ధమై ఉన్నారు.

إِذْ يَتَلَقَّى الْمُتَلَقِّيَانِ عَنِ الْيَمِينِ وَعَنِ الشِّمَالِ قَعِيدٌ
(ఇది యతలక్కల్ ముతలక్కియాని అనిల్ యమీని వనిష్షిమాలి క’యీద్)
ఒకడు కుడివైపున, మరొకడు ఎడమవైపున కూర్చొని వ్రాసేవారు వ్రాస్తున్నప్పటి స్థితిని (జ్ఞాపకం చేసుకో). (50:17)

కుడి వైపున అటు ఎడమ వైపున సిద్ధంగా ఉండి మనిషితో జరిగే ప్రతి కార్యం రాయడానికి దైవదూతలు హాజరై ఉన్నారు. ఆ సందర్భంలో మన ఈ జీవితంలో మనం చేసినది ప్రతి ఒక్కటి రాయబడుతుంది. ఏ ఒక్క విషయం కూడా దైవదూతలు వదలకుండా రాస్తూ ఉంటారు. సత్కార్యాలైతే, సద్వచనాలైతే, మంచి ఆలోచనలైతే కుడి వైపున ఉన్న దైవదూత రాస్తూ ఉంటాడు. ఒకవేళ దుష్కర్మలు, దుశ్చేష్టలు మరియు చెడు సంభాషణ, ఇంకా చెడు ఆలోచన ఇవన్నీ ఎడమ వైపున ఉన్న దైవదూత రాస్తూ ఉంటాడు. అల్లాహు త’ఆలా ఈ విషయాన్ని ఖురాన్లో అనేక సందర్భాల్లో ప్రస్తావించాడు.

అయితే, మన ఈ కర్మలు రాయబడుతున్నాయి అనడానికి అల్లాహు త’ఆలా ఖురాన్లో ఎన్నో సాక్ష్యాధారాలు మనకు తెలిపాడు. ఎన్నో నిదర్శనాలు మనకు తెలిపాడు. ఆ నిదర్శనాలను, అంటే ఆ ఖురాన్ ఆయతులను, మనం గ్రహించి వాటిపై దృష్టి వహించి పారాయణం చేస్తే మనకు ఎన్నో విషయాలు బోధపడతాయి. కొన్ని సందర్భాల్లో ఆయతులు మనకు దైవదూతలు రాస్తున్నారు అని స్పష్టంగా కనబడతాయి. ఉదాహరణకు:

وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ كِرَامًا كَاتِبِينَ
(వ ఇన్న అలైకుమ్ లహాఫిజీన్. కిరామన్ కాతిబీన్)
నిశ్చయంగా మీపై పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు. వారు గౌరవనీయులైన వ్రాతగాళ్ళు. (82:10-11)

మీపై నిఘా వేసి, మీ రక్షణలో దైవదూతలు ఉన్నారు, గౌరవనీయులైన లేఖకులు వారు.

మరికొన్ని సందర్భాల్లో ఖురాన్లో ఆ దైవదూతలు నిఘా వేసి మరియు వారు సంసిద్ధంగా ఉండి మనిషి నోట వెళ్ళే ప్రతి మాట వెళ్ళడానికి ఆలస్యం కాకముందే తొందరగానే దానిని రాసుకుంటారు అని కూడా తెలపడం జరిగింది.

మరికొన్ని సందర్భాల్లో మానవులు చేసే కర్మలన్నీ కూడా స్వయంగా అల్లాహు త’ఆలా రాస్తాడు అన్నట్లు కూడా మనకు తెలియజేయడం జరిగింది. మరికొన్ని సందర్భాలలో ఎవరో ఉన్నారు రాసేవారు. వారు రాస్తున్నారు మీరు చేసే కర్మలను. వారెవరు? పేరు చెప్పి అక్కడ మనకు ఎలాంటి వివరణ ఇవ్వబడలేదు. ఈ విధంగా వివిధ రకాలు ఏదైతే అవలంబించడం జరిగిందో ఈ లేఖకుల పట్ల, మన కర్మలు నోట్ చేయడం జరుగుతున్నాయి అని ఒక భయం మనిషిలో ఏర్పడి ప్రతి మాట మాట్లాడే ముందు, ప్రతి కర్మ చేసే ముందు, ప్రతి ఆలోచన ఆలోచించే ముందు మనిషి దానిని నిర్ధారణ చేసుకోవాలి. ఇది చేయవచ్చా, చేయకూడదా? యోగ్యమా, కాదా? ధర్మసమ్మతమా, అక్రమ మార్గమా? అన్న విషయాలు తెలుసుకోవాలి.

కొన్ని సందర్భాల్లో మేము స్వయంగా రాస్తున్నాము అని అల్లాహ్ ఏదైతే తెలిపాడో, దీనివల్ల అల్లాహ్ యొక్క భయం ప్రజల్లో మరింత ఎక్కువ పెరగాలని కూడా, ఉదాహరణకు, యూదులు అల్లాహ్ పట్ల ఎన్నో దుర్భాషలాడేవారు. ఒక సందర్భంలో వారు, “మేము ఎక్కువ ధనవంతులం, అల్లాహ్ యే పేదవాడు” అన్నటువంటి మాటలు మాట్లాడారు. అల్లాహు త’ఆలా ఆ సందర్భంలో ఖురాన్ ఆయత్ ను అవతరింపజేసి:

لَّقَدْ سَمِعَ اللَّهُ قَوْلَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ فَقِيرٌ وَنَحْنُ أَغْنِيَاءُ ۘ سَنَكْتُبُ مَا قَالُوا
‘అల్లాహ్‌ పేదవాడు, మేము ధనవంతులం’ అని పలికిన వారి మాటను అల్లాహ్‌ విన్నాడు. వారి మాటను మేము వ్రాసి పెడ్తాము. (3:181)

ఎవరైతే మేము ధనవంతులము మరియు అల్లాహ్ నిరుపేద, బీదవాడు అని అన్నారో, వారి మాటలను అల్లాహు త’ఆలా విన్నాడు. మేము వారు చెప్పే మాటలు రాస్తూ ఉన్నాము.

మరికొన్ని సందర్భాల్లో మా లేఖకులైన దైవదూతలు రాస్తున్నారు అన్న విషయం అల్లాహు త’ఆలా ఏదైతే తెలిపాడో, అయితే ఆ దైవదూతలు ఎల్లవేళల్లో వారి వెంటే ఉన్నారు అన్నటువంటి భయం వారిలో కలగాలి అని అల్లాహు త’ఆలా ఈ విధంగా ఆ విషయాన్ని తెలియపరిచాడు.

أَمْ يَحْسَبُونَ أَنَّا لَا نَسْمَعُ سِرَّهُمْ وَنَجْوَاهُم ۚ بَلَىٰ وَرُسُلُنَا لَدَيْهِمْ يَكْتُبُونَ
(అమ్ యహ్సబూన అన్నా లా నస్మ’ఉ సిర్రహుమ్ వ నజ్వాహుమ్, బలా వరుసులునా లదైహిమ్ యక్తుబూన్)
ఏమిటి, వారు తమ రహస్యాలను, తమ గుసగుసలను మేము వినలేమని అనుకుంటున్నారా? ఎందుకు వినం? పైగా మా దూతలు వారి వద్దనే ఉంటూ అన్నీ వ్రాస్తున్నారు. (43:80)

ఏమీ? వారు రహస్యంగా, గుప్తంగా మరియు వారు గుసగుసలాడుకునే ఆ గుసగుసలాట మాకు ఏ మాత్రం తెలియదు అని భావిస్తున్నారా? ఇక్కడ గమనించండి, సిర్రహుమ్. సిర్ అంటే రహస్యంగా మాట్లాడుకునే విషయాలు. నజ్వాహుమ్ అంటే ఒకరి చెవిలో ఒకరు ఏ గుసగుసలాటనైతే జరుపుకుంటారో వాటిని అంటారు. అయితే అల్లాహ్ ఏమంటున్నాడు? ఇలా ఎవరికీ తెలియకుండా రహస్యంగా మాట్లాడుకునే విషయాలు, ఒకరి చెవిలో మరొకరు గుసగుసలాట జరుపుకునే ఈ సంఘటనలు, విషయాలన్నీ కూడా మాకు తెలియవు, మా జ్ఞాన పరిధిలో రావు అని వారు భావిస్తున్నారా? అలా భావించనవసరం లేదు. బలా! వరుసులునా లదైహిమ్ యక్తుబూన్. ఎందుకు లేదు? మేము వారి రహస్యాలు వింటాము. మేము వారి గుసగుసలను కూడా తెలిసి ఉన్నాము. అంతేకాదు, వరుసులునా లదైహిమ్ యక్తుబూన్. మా దైవదూతలు ఉన్నారు. వారి వద్దనే ఉన్నారు. వారు రాస్తూనే ఉన్నారు.

ఈ ఆయతులన్నింటిలో మనకు బోధపడే విషయాలు ఏమిటో వాటిని మనం తెలుసుకోవాలి. ఆ బోధపడే విషయాలు ఏమిటో మనం తెలుసుకునే ముందు, కొన్ని సందర్భాల్లో రాసేవారు ఎవరో పేరు చెప్పకుండా రాసేవారు ఉన్నారు అని ఏదైతే అల్లాహ్ చెప్పాడో, ఆ ఆయతులను కూడా మనం విందాము.

మహాశయులారా! కొన్ని సందర్భాలలో అల్లాహు త’ఆలా ఆ రాసేవారు ఎవరో వారి పేరు చెప్పకుండా రాసేవారు ఉన్నారు, రాస్తున్నారు, వారు చేసే చేష్టలు లిఖించబడుతున్నాయి అన్నట్లుగా తెలియజేస్తాడు. ఉదాహరణకు ఈ ఆయత్ చూడండి:

وَجَعَلُوا الْمَلَائِكَةَ الَّذِينَ هُمْ عِبَادُ الرَّحْمَٰنِ إِنَاثًا ۚ أَشَهِدُوا خَلْقَهُمْ ۚ سَتُكْتَبُ شَهَادَتُهُمْ وَيُسْأَلُونَ
(వ జ’అలుల్ మలాఇకతల్లజీన హుమ్ ఇబాదుర్రహ్మాని ఇనాసా, అషహిదూ ఖల్కహుమ్, సతుక్తుబు షహాదతుహుమ్ వ యుస్’అలూన్)
వారు కరుణామయుని దాసులైన దైవదూతలను స్త్రీలుగా ఖరారు చేశారు. ఏమయ్యా! వారి పుట్టుకను వీరు కళ్ళారా చూశారా? వారి సాక్ష్యం వ్రాసి పెట్టబడుతుంది. వారిని ప్రశ్నించటం జరుగుతుంది. (43:19)

వారు అంటే బహుదైవారాధకులు, రహ్మాన్ అయిన అల్లాహ్ యొక్క దాసులు, దైవదూతలు ఎవరైతే ఉన్నారో వారిని అల్లాహ్ కు కుమార్తెలుగా చేశారు. వారు స్త్రీలుగా, దేవతలుగా భావించి వారు పూజిస్తున్నారు. అషహిదూ ఖల్కహుమ్? ఆ బహుదైవారాధకులు అల్లాహు త’ఆలా ఆ దైవదూతల్ని సృష్టించే సందర్భంలో అక్కడ వారు హాజరై ఉన్నారా? వారు సాక్షులుగా ఉన్నారా? సతుక్తుబు షహాదతుహుమ్. అలా ఏమైనా ఉంటే, వారి యొక్క ఆ సాక్ష్యం అనేది లిఖించబడుతుంది. వ యుస్’అలూన్. మరియు వారిని ప్రశ్నించడం కూడా జరుగుతుంది. అంటే లిఖించడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఆ లిఖించేవారు ఎవరో? దైవదూతలు. కానీ ఈ పద్ధతి ఎందుకు అవలంబించడం జరిగిందంటే, మానవుల్లో, ఆఁ ఉన్నారు, లిఖించేవారు ఉన్నారు అన్నటువంటి భయం కలగాలి.

అలాగే సత్కార్యాల విషయంలో కూడా సత్కార్యాలు చేసేవారు, మా సత్కార్యాలు వృధా అవుతున్నాయి అని భయపడే అవసరం లేదు.

إِلَّا كُتِبَ لَهُم بِهِ عَمَلٌ صَالِحٌ
(ఇల్లా కుతిబ లహుమ్ బిహీ అమలున్ సాలిహున్)
వారి తరఫున ఒక సత్కార్యం వ్రాయబడకుండా ఉండదు. (9:121)

అని సూరె తౌబాలో శుభవార్త ఇవ్వడం జరిగింది. వారు అల్లాహ్ మార్గంలో వెళ్ళినప్పుడు, ఏ దారిన నడిచినా, ఏ లోయలో దిగినా, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా, ఆకలితో దప్పులతో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా వారికి కుతిబ లహుమ్ బిహి అమలున్ సాలిహ్. వారు కష్టపడే ప్రతి కష్టానికి, ప్రతి అడుగుకు బదులుగా పుణ్యం అనేది రాయడం జరుగుతుంది. రాయబడుతుంది. అలాగే మరో సందర్భంలో, వారు ఏ కొంచెం దానం చేసినా అది లిఖించబడుతుంది అని చెప్పడం జరిగింది.

ఈ విధంగా మహాశయులారా, ఇహలోకంలో ఏ స్థితిలో ఉన్నా మనం, ఒక పెద్ద సమూహంలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, రాత్రిలో ఉన్నా, పగలులో ఉన్నా, స్త్రీలైనా, పురుషులైనా, వృద్ధులైనా, యువకులైనా ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు మాట్లాడే మాట, వారు చేసే చేష్టలు, వారు చేసే కర్మలు మరియు ఆలోచించే వారి యొక్క ఊహాగానాలు కూడా, ఆలోచనలను కూడా వ్రాయడం జరుగుతుంది.

మహాశయులారా! ఇదే విషయాన్ని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా తెలిపారు. అల్లాహు త’ఆలా మానవులు చేసే కర్మల గురించి ఒక నిర్ణయం చేసి ఉంచాడు. అదేమిటంటే:

ఇదా హమ్మ అబ్దీ బి హసనతిన్. నా దాసుడు ఒక మంచి కార్యం చేయాలని నిశ్చయించుకున్నప్పుడు, ఆ నిశ్చయానికి, బలమైన సంకల్పానికి వారు పూనుకున్నప్పుడు, ఒక పుణ్యం రాయండి అని అల్లాహు త’ఆలా వారికి ఆదేశిస్తాడు. ఎప్పుడైతే వారు ఆ నిశ్చయించుకున్న, సంకల్పించుకున్న పుణ్యాన్ని ఆచరణ రూపంలో చేస్తారో వారికి ఆ సత్కార్యానికి బదులుగా ఒకటి నుండి పది వరకు, పది నుండి 700 వరకు, అంతకంటే ఎక్కువగా అల్లాహు త’ఆలా తలచిన వారికి పుణ్యాలు వ్రాయమని ఆదేశిస్తాడు.

అదే ఒకవేళ ఎవరైనా ఒక చెడు చేయాలని ఆలోచిస్తే, అల్లాహు త’ఆలా ఇప్పుడే ఏమీ రాయకండి అని వారిని పాపం గురించి లిఖించడం నుండి ఆపేస్తాడు. ఎప్పుడైతే మనిషి ఆ చెడు ఊహను, ఆలోచనను ఆచరణ రూపంలో తీసుకొస్తాడో, అతనికి అతని కర్మ పత్రంలో ఒక పాపం రాయండి అని చెప్తాడు. ఒకవేళ అతను దానిని ఆచరించకుండా ఆ చెడు ఆలోచనను వదులుకుంటే, అతడు చెడు ఆలోచనను వదులుకున్నాడు గనుక అతనికి ఒక పుణ్యం రాయండి అని అల్లాహు త’ఆలా ఆదేశిస్తాడు.

ఈ విధంగా అల్లాహు త’ఆలా మనపై ఎంత గొప్ప దయ తలచి ఉన్నాడో గమనించండి. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేమిటంటే, కేవలం ఆలోచించుకోవడం, ఊహాగానాల వరకు ఉండడం అది వేరే విషయం. ఎవరైనా చెడు గురించి బలమైన రూపంలో సంకల్పించుకొని, దానికి సంబంధించిన సాధనాలు, అవసరాలు, కారణాలు సమకూరినప్పుడు, అవన్నీ కూడా అతనికి యోగ్యమైనప్పుడు, అతని ఆధీనంలో వచ్చినప్పుడు, తప్పకుండా అది చేస్తాడు ఆ పాపం అని పూనుకుంటే, అలాంటి గట్టి సంకల్పం కూడా కొన్ని సందర్భాల్లో రాయడం జరుగుతుంది.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచ విషయాన్ని ఒక సామెతగా తెలిపారు. తిర్మిజీ మరియు ముస్నద్ అహ్మద్ లోని హదీస్ ఇది.

ఇక్కడ మీరు గమనించారా? మనిషి వద్ద సౌకర్యాలు ఉంటే, వాటిని ఉపయోగించి పాపంలో దూకిపోతాను అని ఏదైతే నిశ్చయించుకుంటాడో, బలమైన సంకల్పం చేస్తాడో, దానివల్ల కూడా కొన్ని సందర్భాల్లో మనిషికి పాపం రాయబడుతుంది. అందుగురించే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే ఏ కర్మ కూడా, మనం చేసే ఏ పని కూడా, మనం మాట్లాడే ఏ మాట కూడా వృధా అవ్వడం లేదు. అది ఎక్కడో గాలిలో ఎగిరిపోతుంది అని మనం భావించకూడదు. అవన్నీ కూడా రాయడం జరుగుతుంది. ప్రళయ దినాన ఎప్పుడైతే మనం అల్లాహ్ వద్ద హాజరవుతామో, అక్కడ వీటన్నిటినీ మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది.

మహాశయులారా! ఇంతవరకు తెలుసుకున్న విషయాలు, వాటిలో ఏ ఏ ఆధారాలైతే మన ముందుకు వచ్చాయో, వాటి ద్వారా మనకు బోధపడిన విషయాలు ఏమిటంటే:

(1) మనలోని ప్రతి వ్యక్తి వెంట ఇద్దరు దైవదూతలు కనీసం ఉన్నారు. వారు మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి కర్మ, మనం ఊహించే ప్రతి ఊహ, వీటన్నిటినీ కూడా రాస్తూ ఉంటారు.

(2) రెండో విషయం, ఆ దైవదూతలు స్వచ్ఛతనీయులు, విశ్వసనీయులు. వారు ఎలాంటి అపహరణకు గురి కారు. వారికి మనుషుల్లో ఎవరు కూడా ఇతను నా వారు, అతను నా వాడు కాదు, ఇతను నాకు స్నేహితుడు, అతడు నాకు శత్రువు అన్నటువంటి ఏ భావాలు వారికి ఉండవు. ఎవరి పట్ల కూడా ఏ మాత్రం రియాయితీ లేకుండా, ఎలాంటి మినహాయింపు లేకుండా, ఎవరి పట్ల ఏ ప్రేమానుభావాలు చూపి వారు చేసే కర్మలు రాయకుండా, లేదా ఇంకెవరి పట్లనైనా ద్వేషం, కోపం, శత్రుత్వం చూపి వారు చేయనిది కూడా వారు చేశారు అన్నట్టుగా రాయడం, ఇలా ఎంతమాత్రం జరగదు. వారు విశ్వసనీయులు, స్వచ్ఛవంతులు. వారు అల్లాహ్ యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నారు. మానవులు ఎంత చేస్తారో, ఏం మాట్లాడతారో అది మాత్రమే రాస్తారు. ఎక్కువ కూడా రాయరు, రాయకుండా ఉండరు.

(3) మరో గమనార్హమైన విషయం ఏమిటంటే, ఆ దైవదూతలకు ఏ విషయమూ కూడా తెలియకుండా ఉండదు. మనం నిద్రలో ఉన్నా, మనం మేల్కొని ఉన్నా, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా గానీ, వారికి మనం చేసే ప్రతీది తెలుసు. ఏ ఒక్క విషయం కూడా వారికి దాగి ఉండదు.

ఈ విషయం మనకు మరింత స్పష్టంగా బోధపడాలని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నో వివిధ సందర్భాల్లో, ఎన్నో ఉదాహరణల ద్వారా కూడా మనకు తెలియపరిచారు.

అయితే, మన కర్మ పత్రాల్లో మనతో ఉన్న దైవదూతలు రాసే విషయాలే కాకుండా, వేరే కొన్ని సందర్భాల్లో కూడా కొందరు దైవదూతలు ఉంటారు. ఉదాహరణకు, జుమా నమాజ్, శుక్రవారం రోజున జుమా నమాజ్ కంటే ముందు కొందరు దైవదూతలు ప్రతి జుమా మస్జిద్ కు వస్తారు. అక్కడ ఎవరెవరు ఎంత ముందు మస్జిద్ కు వస్తూ ఉన్నారో వారి పేర్లు వారు రాసుకుంటూ ఉంటారు. మరి ఎవరైతే అజాన్ తర్వాత వస్తారో వారి హాజరు ఆ దైవదూతల యొక్క రిజిస్టర్ లో ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే ఇమామ్ మెంబర్ పై ఖుత్బా ఇవ్వడానికి ఎక్కుతాడో మరియు అటు ముఅద్దిన్ అజాన్ ప్రారంభం చేస్తాడో, దైవదూతలు తమ రిజిస్టర్ లన్నిటినీ కూడా మూసుకొని ఖుత్బా వినడానికి హాజరవుతారు.

అంతేకాకుండా, మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి నమాజ్ లో “హమ్దన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్” అని పలికాడు. నమాజ్ అయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “నీవు పలికిన ఈ పదాలను రాసుకోవడానికి 30 కంటే ఎక్కువ మంది దైవదూతలు నేను ముందు రాయాలంటే నేను ముందు రాయాలి అని ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు” అని తెలిపారు.

ఈ విధంగా మహాశయులారా! ఇక్కడ మనకు మరొక విషయం కూడా బోధపడింది. అదేమిటంటే మన వెంట ఉన్న దైవదూతలే కాకుండా, వేరే వేరే సందర్భాల్లో, వివిధ సమయాల్లో కొందరు దైవదూతలు కొన్ని విషయాలు మంచివి కానీ చెడువి కానీ రాస్తూ ఉంటారు. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండి మంచి విషయాల్లో ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి, చెడు వాటి నుండి మనం దూరం ఉండాలి.

అయితే, ఈ కర్మలు ఏవైతే రాయబడుతున్నాయో, మనం ఆ ప్రళయ దినాన ఎక్కడైతే హాజరవుతామో, అక్కడ ఈ కర్మ పత్రాలన్నీ తెరవడం జరుగుతుంది. దాని యొక్క వివరాలు ఇన్ షా అల్లాహ్, తరువాయి భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41712

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

దైవదూతల పై విశ్వాసం – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖుత్బా అంశము:  దైవదూతల పై విశ్వాసం

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا. يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.     

ఓ ముస్లింలారా! నేను మీకు మరియు స్వయాన నాకు అల్లాహ్ యొక్క దైవ భీతి కలిగి ఉండాలని ఉపదేశిస్తున్నాను. అల్లాహ్ తఆలా మన ముందు తరాల వారి కొరకు మరియు మన తర్వాత తరాల వారి కొరకు కూడా ఇదే ఉపదేశం చేయడం జరిగింది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.

 [وَلَقَدۡ وَصَّيۡنَا ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ مِن قَبۡلِكُمۡ وَإِيَّاكُمۡ أَنِ ٱتَّقُواْ ٱللَّهَۚ]
(వాస్తవానికి మేము అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండమని, పూర్వం గ్రంథం ఇచ్చిన వారికీ మరియు మీకూ ఆజ్ఞాపించాము.)

కనుక అల్లాహ్ తో భయపడండి. ఆయనకు విధేయత చూపండి. అవిధేయత నుండి దూరంగాఉండండి.

తెలుసుకోండి! ఇస్లాంలో దైవదూతలపై విశ్వాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ఇస్లాం యొక్క విశ్వాస మూల స్తంభాలలో రెండవది. అల్లాహ్ కు మరియు ఆయన సృష్టికి, ఆయన ప్రవక్తలకు మధ్యవర్తులు వీరే. ఈ దైవదూతలు అదృశ్య సృష్టి, ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క ఆరాధనలో ఉంటారు. వారు  ఎటువంటి దైవత్వ లక్షణాలను కలిగిలేరు, అల్లాహ్ వారిని నూర్ (కాంతి)తో సృష్టించాడు

వారు అల్లాహ్ యొక్క ఆజ్ఞలకు పూర్తిగా విధేయత చూపుతారు, ఆజ్ఞలను   శిరసావహించే శక్తిని అల్లాహ్ వారికి ప్రసాదించాడు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.

[لَّا يَعۡصُونَ ٱللَّهَ مَآ أَمَرَهُمۡ وَيَفۡعَلُونَ مَا يُؤۡمَرُونَ]
(వారు అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించరు మరియు వారికిచ్చిన ఆజ్ఞలనే నెరవేరుస్తూ ఉంటారు)

మరొక చోట ఇలా సెలవిస్తున్నాడు:

[وَمَنۡ عِندَهُۥ لَا يَسۡتَكۡبِرُونَ عَنۡ عِبَادَتِهِۦ وَلَا يَسۡتَحۡسِرُونَ]
(మరియు ఆయనకు దగ్గరగా ఉన్నవారు, ఆయనను ఆరాధిస్తూ ఉన్నామని గర్వించరు మరియు (ఆయన ఆరాధనలో) అలసట కూడా చూపరు.)

అదేవిధంగా దైవ దూతలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి సంఖ్య కేవలం అల్లాహ్ కు మాత్రమే తెలుసు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.  

[وَمَا يَعۡلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَۚ وَمَا هِيَ إِلَّا ذِكۡرَىٰ لِلۡبَشَرِ]
(మరియు నీ ప్రభూవు సైన్యాలను ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు ఇదంతా మానవునికి ఒక జ్ఞాపిక మాత్రమే.)

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) మేరాజ్ లో జరిగిన సంఘటన గురించి ఇలా తెలియచేస్తున్నారు: మహాప్రవక్త (సల్లల్లాహు అలైహివసల్లం) వారిని బైతె మామూర్ వద్దకు తీసుకు వెళ్ళడం జరిగింది. ప్రవక్త గారు దాని గురించి జిబ్రాయిల్ (అలైహిస్సలాం) వారిని ప్రశ్నించగా ఆయన ఇలా తెలియ చేశారు – “దీనిని బైతె మామూర్ అంటారు. ఇందులో ప్రతిరోజూ డెబ్బై వేల మంది దైవ దూతలు నమాజ్ చదువుతారు. ఒక సారి చదివిన వారికి మళ్ళీ అవకాశం లభించదు. అదే వారి చివరి ప్రవేశం అవుతుంది“. (బుఖారి:3207- ముస్లిం:164)

[1] వారి ఉనికి పై విశ్వాసం

[2] వారిని ప్రేమించాలి, వారిని ద్వేషించే వారు మరియు వారితో శతృత్వం ఉంచేవారు ఆవిశ్వాసులు (కాఫిర్) అవుతారు.

అల్లాహ్ ఇలా అంటున్నాడు:

[لِلۡمُؤۡمِنِينَ٩٧ مَن كَانَ عَدُوّٗا لِّلَّهِ وَمَلَٰٓئِكَتِهِۦ وَرُسُلِهِۦ وَجِبۡرِيلَ وَمِيكَىٰلَ فَإِنَّ ٱللَّهَ عَدُوّٞ لِّلۡكَٰفِرِينَ]

(అల్లాహ్ కు ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీల్ కు మరియు మీకాయీల్ కు ఎవరు శత్రువులో, నిశ్చయంగా అలాంటి సత్యతిరస్కారులకు అల్లాహ్ శత్రువు.)

[3] మనకు తెలిసిన దైవదూతలను విశ్వాసించడం. ఉదా: జిబ్రాయిల్ అలైహిస్సలాం. అదేవిధంగా మనకు తెలియని దైవదూతలను కూడా సంపూర్ణంగా విశ్వసించడం.

[4] దైవదూతలు కలిగి ఉన్న సహజసిద్ద లక్షణాలపై (వారు కలిగిఉన్న పోలికపై) విశ్వాసం తేవడం. ఉదా: జిబ్రాయిల్ దైవదూత ఆయన సహజసిద్ద లక్షణాలలో ఒకదాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం తెలియచేశారు. నేను జిబ్రాయిల్ దూతను అతని అసలు రూపంలో చూశాను ఆయన ఆరు వందల రెక్కలు కలిగిఉన్నాడు. అవి ఆకాశపు అంచులను సైతం కప్పి ఉన్నాయి. (బుఖారి: 3233,3232 – ముస్లిం: 174,177 )

దైవదూతలు అల్లాహ్ ఆజ్ఞతో మానవ రూపంలోకి కూడా మారవచ్చు. ఉదా: అల్లాహ్ తఆలా జిబ్రాయిల్ అలైహిస్సలాం వారిని మర్యమ్ (అలైహస్సలాం) దగ్గరికి పంపినప్పుడు ఆయన మానవరూపం లోనే వచ్చాడు. అదేవిధంగా జిబ్రాయిల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చినప్పుడు. ప్రవక్త గారు సహాబాల సమావేశంలో కూర్చొనిఉండగా ఇంతలో ఒక వ్యక్తి సమావేశంలోకి వచ్చాడు. అతని వస్త్రాలు తెల్లవిగాను, తలవెంట్రుకలు దట్టంగా ఉండి మిక్కిలి నల్లవిగాను ఉన్నాయి. అతనిపై ప్రయాణపు అలసట, ఆనవాళ్ళు కనబడట్లేదు. పైగా మాలో ఎవరు అతన్ని ఎరుగరూ కూడ. అతనికి తెలిసిన వారు లేరు కూడ. అతను నేరుగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ఆయన మోకాళ్ళకు తన మోకాళ్ళు ఆనించి, చేతులు తొడలపై పెట్టుకుని సవినయంగా (మర్యాదస్థితిలో కూర్చున్నాడు. ఇస్లాం, ఇహ్సాన్, ఖియామత్ మరియు దాని సూచనల గురించి ప్రశ్నించాడు. ప్రవక్త గారు వాటన్నిటికీ సమాధానం ఇచ్చారు. ఆ తరువాత అతను వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి గురించి సహాబాలు ప్రశ్నించగా  అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం “ఆయన ‘జిబ్రయీల్’ (దైవదూత). ఆయన మీ వద్దకు ధార్మిక విద్యను నేర్పటానికి వచ్చారు” అని వివరించారు. (ముస్లిం-9).

మరియు అదేవిధంగా ఇబ్రహీం మరియు లూత్ ప్రవక్తల వద్దకు వచ్చిన దైవదూతలు కూడా మానవ రూపంలోనే వచ్చారు. (షరహ్ సలాసతు ఉసూల్)

దైవదూతల నాయకుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం దైవదూతల్లో కెల్లా గొప్పవాడు  అల్లాహ్ తఆలా ఆయన గుణాలను తెలియచేస్తూ ఇలా అంటున్నాడు .

[إِنَّهُۥ لَقَوۡلُ رَسُولٖ كَرِيمٖ١٩ ذِي قُوَّةٍ عِندَ ذِي ٱلۡعَرۡشِ مَكِينٖ]
(నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన వాక్కు! అతను (జిబ్రీల్) మహా బలశాలి, సింహాసన (అర్ష్) అధిపతి సన్నిధిలో ఉన్నత స్థానం గలవాడు!)

మరొక చోట అల్లాహ్ ఇలా అంటున్నాడు.

[مُّطَاعٖ ثَمَّ أَمِينٖ]
(అతని ఆజ్ఞలు పాటింపబడతాయి మరియు (అతను) విశ్వసనీయుడు)  

మరోకచోట ప్రవక్త గారి ప్రస్తావనతో జిబ్రాయీల్ దూత ప్రస్థావనను చేస్తూ ఆయన ఎంత గొప్పవాడో తెలియ చేయడం జరిగినది.

[ عَلَّمَهُۥ شَدِيدُ ٱلۡقُوَىٰ٥ ذُو مِرَّةٖ فَٱسۡتَوَىٰ]

(అసాధారణ శక్తిగల దైవదూత (జిబ్రాయీల్) అతనికి ఖుర్ఆన్ నేర్పాడు. అతడు గొప్ప శక్తి సంపన్నుడు. మరి అతను తిన్నగా నిలబడ్డాడు)

అంటే ప్రవక్త వారికి వహీ నేర్పించినది జిబ్రయీల్ అలైహిస్సలాం వారు. ఆయన అల్లాహ్ యొక్క ఆజ్ఞా పాలన చేస్తారు. ప్రవక్తలకు వహీ అందచేస్తారు. ఆ వహీ గురించి షైతానులకు తెలియకుండా కాపాడుతాడు. ఇది అల్లాహ్ వైపునుంచే ఆ వహీ ని శక్తి సంపన్నుడు అయిన దూత ద్వారా పంపాడు.

అల్లాహ్ అంటున్నాడు [ذُو مِرَّةٖ] అంటే అంతర్గతంగా, బహిర్గతంగా  ఏర్పడే ఆపద నుండి రక్షించే శక్తి ఆయనకు ప్రసాదించబడింది. అనగా ఆయన అంత గొప్పగా సృష్టించబడ్డాడు.     

[5] దైవదూతల యొక్క ఏ సుగుణాల గురిచి మనకు తెలుసో వాటిపై విశ్వాసముంచాలి. ఉదా: సిగ్గు , బిడియం దీనికి ఆధారంగా ప్రవక్త గారి హదీస్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) గారి గురించి అనడం జరిగినది “ఏమిటి నేను దైవ దూతలు సైతం సిగ్గు పడేటు వంటి వ్యక్తి తో నేను సిగ్గు పడకూడదా” (ముస్లిం 2401)   

అల్లాహ్ వేటినైతే ద్వేషిస్తాడో దైవ దూతలు కూడా వాటిని ద్వేషిస్తారు. అందకే వారు కుక్క మరియు చిత్ర పటాలు ఉన్న గృహం లోకి ప్రవేశించరు. ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం వారు ఇలా తెలియ చేస్తున్నారు : “దైవ దూతలు ఆ ఇంట్లోకి ప్రవేశించరు, ఏ ఇంట్లోనైతే కుక్క ఉంటుందో మరియు అందులోకి ప్రవేశించరు మరియు ఎందులోనైతే ప్రాణ జీవుల పటాలు ఉంటాయో“. (బుఖారి 3235- ముస్లిం 2106)

ఏ విషయాల నుండి అయితే మనిషికి ఇబ్బంది కలుగుతుందో ఆ విషయాల నుండి దైవదూతలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉల్లి మరియు వెల్లుల్లి లాంటి దుర్వాసన వచ్చే పదార్థాలు తిన్న వ్యక్తిని మస్జిద్ కి రావడం నుండి వారించారు. మరియు దుర్వాసన కలిగినటువంటి ప్రతి వస్తువు కూడా ఈ ఆజ్ఞ పరిధిలోకి వస్తుంది ఉదా: సిగరెట్

మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు – “ఎవరైతే ఉల్లి మరియు వెల్లుల్లి తిన్నారో వారు మా మస్జిద్ దగ్గరకు రావద్దు. ఎందుకంటే దైవదూతలకు ఆ విషయాల నుండి ఇబ్బంది కలుగుతుంది, ఏ విషయాల నుండి అయితే ఆదం సంతతికి ఇబ్బంది అవుతుందో“. (ముస్లిం 564)

[6] సర్వ శక్తిమంతుడైన అల్లాహ్ ఆజ్ఞకు అనుగుణంగా వారు ప్రతి సాధారణమైన పనిని మరియు ప్రత్యేకమైన పనిని చేస్తారు. సాధారణమైన పని అనగా ఉదాహరణకు అల్లాహ్ యొక్క పరిశుద్ధతను కొనియాడటం మరియు ఎటువంటి అలసట లేకుండా ఉదయం సాయంత్రం ఆయనను ఆరాధించుటం. అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు.

[فَٱلتَّٰلِيَٰتِ ذِكۡرًا ]
(మరి అల్లాహ్ ఉపదేశాన్ని పఠించే వారితోడు)

అందులో కొంతమంది దైవదూతలకు కొన్ని ప్రత్యేక పనులు అప్పగించబడ్డాయి. ఉదాహరణకి జిబ్రయీల్ దూత వహీ ని ప్రవక్తల వరకు చేరవేస్తారు. మరియు ఇతర దైవదూతలు కూడా ఈ వహీని అందజేసే పని కూడా చేసి ఉండవచ్చు.  అల్లాహ్ఈ విధంగా అంటున్నాడు.

[فَٱلۡمُلۡقِيَٰتِ ذِكۡرًا٥ عُذۡرًا أَوۡ نُذۡرًا٦ ]
(జ్ఞాపికను తీసుకువచ్చే దూతల సాక్షిగా ! సాకులు లేకుండా చేయడానికి హెచ్చరించడానికి )

ఆ దైవదూతలు ప్రవక్తల పై అల్లాహ్ యొక్క వహీని తీసుకొస్తారు.

ఒక ఉదాహరణ: మీకాయిల్ అలైహిస్సలాం వారికి వర్షం కురిపించే బాధ్యత అప్పగించడం జరిగింది. మరియు అదే విధంగా శంఖం పూరించే దైవ దూత కూడా నియమించబడి ఉన్నాడు ఆయన పేరు ఇస్రాఫీల్. శంఖం పూరించడం అనగా హదీసులో వస్తుంది – శంఖం ఎప్పుడైతే పూరించబడుతుందో ఆరోజున ప్రళయం సంభవిస్తుంది మరియు ప్రజలందరూ సమాధుల నుండి లేచి నిల్చుంటారు

ఈ ముగ్గురు దైవదూతలు గొప్పవారు మరియు వారికి ప్రసాదించబడిన కార్యాలు కూడా గొప్పవే. జీవితానికి సంబంధించినవి  జిబ్రాయిల్ దూతకు వహీ అందజేసే బాధ్యత, అది హృదయ జీవితానికి సంబంధించింది. మీకాయిల్ దూతకు వర్షం కురిపించే బాధ్యత, అది భూజీవితానికి సంబంధించినది. మరియు ఇస్రాఫీల్ దూతకు శంఖం పూరించే బాధ్యత అనగా అప్పుడు మృతదేహాలకు మళ్లీ తిరిగి జీవితం ప్రసాదించబడుతుంది

మరొక దైవదూత పేరు మలకుల్ మౌత్. ఆయనకు ప్రాణం తీసే బాధ్యత అప్పగించడం జరిగింది. అల్లాహ్  ఈ విధంగా అంటున్నాడు.

 [۞قُلۡ يَتَوَفَّىٰكُم مَّلَكُ ٱلۡمَوۡتِ ٱلَّذِي وُكِّلَ بِكُمۡ ثُمَّ إِلَىٰ رَبِّكُمۡ تُرۡجَعُونَ]
(వారితో ఇలా అను: “మీపై నియమించబడిన మృత్యుదూత మీ ప్రాణం తీస్తాడు. ఆ తరువాత మీరు మీ ప్రభువు వద్దకు మరలింపబడతారు.”)

ఈ మలకుల్ మౌత్ దూతను ఇజ్రాయిల్ అని అందరూ పిలుస్తారు. కానీ ఖుర్ఆన్ మరియు హదీసుల ద్వారా మనకు ఆధారం లభించదు. కనుక మనం కేవలం ఖుర్ఆన్ లో ఉన్నట్లుగా మలకుల్ మౌత్ అని మాత్రమే పిలవాలి. మరియు ఈ మలకుల్ మౌత్ దూతకు సహాయపడే దైవదూతలు కూడా ఉన్నారు. అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు.  

[وَهُوَ ٱلۡقَاهِرُ فَوۡقَ عِبَادِهِۦۖ وَيُرۡسِلُ عَلَيۡكُمۡ حَفَظَةً حَتَّىٰٓ إِذَا جَآءَ أَحَدَكُمُ ٱلۡمَوۡتُ تَوَفَّتۡهُ رُسُلُنَا وَهُمۡ لَا يُفَرِّطُونَ ]

(ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు. మరియు ఆయన మీపై కనిపెట్టుకొని ఉండే వారిని పంపుతాడు. చివరకు మీలో ఒకరికి చావు సమయం వచ్చినపుడు, మేము పంపిన దూతలు అతనిని మరణింపజేస్తారు మరియు వారెప్పుడూ అశ్రద్ధ చూపరు)

ఈ వాక్యంలో ఉన్న (رُسُلُنَا) అనే పదానికి అర్థం దైవదూతలు అని. మరియు ఈ దైవదూతలే మలకులు మౌత్ దూతకు సహాయపడతారు. అల్లాహ్  యొక్క ఆజ్ఞలో (لَا يُفَرِّطُونَ) ఈ పదం యొక్క అర్థం ఏమిటంటే వారికి ప్రసాదించబడినటువంటి బాధ్యతలో వారు ఎలాంటి అశ్రద్ద వహించరు .

అదేవిధంగా కొంతమంది దైవదూతలు ఈ భూమిపై సంచరిస్తూ ఉంటారు. వారు అల్లాహ్ స్మరణ చేసేటువంటి సభలను మరియు జ్ఞానం నేర్చుకునేటువంటి సభలను వెతుకుతూ ఉంటారు. వాటిలో నుండి ఏదైనా సభ వారికి కనపడితే వారు ఒకరినొకరు పిలుచుకొని ఆ సభలలో కూర్చుని ఆ సభను ఈ ప్రపంచ ఆకాశం వరకు తమ రెక్కలతో కప్పి ఉంచుతారు.

అదేవిధంగా దైవదూతలలో మరికొంతమంది మానవుల కర్మలను భద్రపరచడానికి, వాటిని లిఖించి ఉంచడానికి నియమించబడి ఉన్నారు. ప్రతి వ్యక్తితో పాటు ఇద్దరు దైవదూతలు ఉంటారు, ఒకరు అతని కుడివైపున మరొకరు అతని ఎడమవైపున ఉంటారు. అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు .

[إِذۡ يَتَلَقَّى ٱلۡمُتَلَقِّيَانِ عَنِ ٱلۡيَمِينِ وَعَنِ ٱلشِّمَالِ قَعِيدٞ١٧ مَّا يَلۡفِظُ مِن قَوۡلٍ إِلَّا لَدَيۡهِ رَقِيبٌ عَتِيدٞ]

((జ్ఞాపకముంచుకోండి) అతని కుడి మరియు ఎడమ ప్రక్కలలో కూర్చుండి (ప్రతి విషయాన్ని వ్రాసే) ఇద్దరు పర్యవేక్షకులు (దేవదూతలు) అతనిని కలుసుకొన్న తరువాత నుంచి – అతనితో బాటు ఒక పర్యవేక్షకుడైనా సిద్ధంగా లేనిదే – అతడు ఏ మాటనూ పలకలేడు.)

మరొకచోట ఇలా తెలియజేస్తున్నాడు .

[وَإِنَّ عَلَيۡكُمۡ لَحَٰفِظِينَ١٠ كِرَامٗا كَٰتِبِينَ١١ يَعۡلَمُونَ مَا تَفۡعَلُون]
(నిశ్చయంగా మీపై పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు (వారు మీ ఖర్మలను నమోదు చేసే ) గౌరవ నీయులైన లేఖకులు మీరు చేసేదంతా వారికి తెలుసు సుమా !)

అదేవిధంగా సమాధిలో మనిషిని ప్రశ్నించడానికి కొంతమంది దైవదూతలు నియమించబడి ఉన్నారు. ఎప్పుడైతే మనిషిని సమాధిలో పెట్టడం జరుగుతుందో అప్పుడు వారు వచ్చి మీ ప్రభువు ఎవరు మీ ప్రవక్త ఎవరు మీ ధర్మం ఏది అని ప్రశ్నిస్తారు. (బుఖారి 1374)

మరి కొంతమంది దైవదూతలు స్వర్గవాసుల సేవ కొరకు నియమించబడి ఉన్నారు. అల్లాహ్  స్వర్గవాసుల గురించి తెలియజేస్తూ ఈ విధంగా అన్నాడు

[وَٱلۡمَلَٰٓئِكَةُ يَدۡخُلُونَ عَلَيۡهِم مِّن كُلِّ بَابٖ٢٣ سَلَٰمٌ عَلَيۡكُم بِمَا صَبَرۡتُمۡۚ فَنِعۡمَ عُقۡبَى ٱلدَّارِ٢٤]
(మరియు ప్రతి ద్వారం నుండి దేవదూతలు వారి (స్వాగతం) కొరకు వస్తారు. (దేవదూతలు అంటారు): “మీ సహనానికి, ఫలితంగా ఇప్పుడు మీకు శాంతి కలుగు గాక(సలాం)! ఇక ఈ అంతిమ (పరలోక) గృహం ఎంతో సౌఖ్యదాయకమైనది!”)

మరికొందరు దైవదూతలు నరకం పై నియమించబడి ఉన్నారు. వారి యొక్క నాయకుడి పేరు మాలిక్. అతను నరక పాలకుడు. అల్లాహ్ నరకవాసుల ప్రాధేయతను గురించి ప్రస్తావిస్తున్నాడు.

[وَنَادَوۡاْ يَٰمَٰلِكُ لِيَقۡضِ عَلَيۡنَا رَبُّكَۖ قَالَ إِنَّكُم مَّٰكِثُونَ٧٧ وَنَادَوۡاْ يَٰمَٰلِكُ لِيَقۡضِ عَلَيۡنَا رَبُّكَۖ قَالَ إِنَّكُم مَّٰكِثُونَ٧٧ ]
(మరియు వారిలా మొరపెట్టుకుంటారు: “ఓ నరక పాలకుడా (మాలిక్)! నీ ప్రభువును మమ్మల్ని అంతం చేయమను.” అతను అంటాడు: “నిశ్చయంగా మీరిక్కడే (ఇదే విధంగా) పడి ఉంటారు.”)

మరికొందరు దైవదూతలు పర్వతాలపై నియమితులై ఉన్నారు. తాయిఫ్ వారు మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని బాధించినప్పుడు దేవదూత వచ్చి ప్రవక్తతో ఇలా అన్నారు. “ఒకవేళ మీరే గనుక కోరుకుంటే మేము ఈ మక్కా నగరానికి ఇరువైపులా ఉన్న పర్వతాలను కలిపివేస్తాము”. అప్పుడు మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: “వద్దు నాకు నమ్మకం ఉంది అల్లాహ్ వీరి సంతతి నుండి తప్పకుండా ఆయన్ని మాత్రమే ఆరాధించి ఆయనకు ఎవరిని సాటి కల్పించనటువంటి వారిని పుట్టిస్తాడు“.(బుఖారి 3231 – ముస్లిం 1795)

మరి కొంతమంది దైవదూతలు మేఘాల కొరకు నియమితులై ఉన్నారు. వారు అల్లాహ్ యొక్క ఆజ్ఞ మేరకు మేఘాలను ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి నడిపిస్తారు. అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు

[فَٱلزَّٰجِرَٰتِ زَجۡرٗا٢]
(మేఘాలను నడిపించే వారి (దైవదూతల) సాక్షిగా!)

దైవదూతలు విశ్వాసులను ప్రేమిస్తారు. వారి కొరకు దువా చేస్తారు మరియు ఇస్తగ్ ఫార్ చేస్తారు. అల్లాహ్ ఆర్ష్ వద్ద నియమితులైన దైవదూతల గురించి తెలియజేస్తూ ఇలా అంటున్నాడు.

 [ٱلَّذِينَ يَحۡمِلُونَ ٱلۡعَرۡشَ وَمَنۡ حَوۡلَهُۥ يُسَبِّحُونَ بِحَمۡدِ رَبِّهِمۡ وَيُؤۡمِنُونَ بِهِۦ وَيَسۡتَغۡفِرُونَ لِلَّذِينَ ءَامَنُواْۖ رَبَّنَا وَسِعۡتَ كُلَّ شَيۡءٖ رَّحۡمَةٗ وَعِلۡمٗا فَٱغۡفِرۡ لِلَّذِينَ تَابُواْ وَٱتَّبَعُواْ سَبِيلَكَ وَقِهِمۡ عَذَابَ ٱلۡجَحِيمِ٧ رَبَّنَا وَأَدۡخِلۡهُمۡ جَنَّٰتِ عَدۡنٍ ٱلَّتِي وَعَدتَّهُمۡ وَمَن صَلَحَ مِنۡ ءَابَآئِهِمۡ وَأَزۡوَٰجِهِمۡ وَذُرِّيَّٰتِهِمۡۚ إِنَّكَ أَنتَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ٨ وَقِهِمُ ٱلسَّيِّ‍َٔاتِۚ وَمَن تَقِ ٱلسَّيِّ‍َٔاتِ يَوۡمَئِذٖ فَقَدۡ رَحِمۡتَهُۥۚ وَذَٰلِكَ هُوَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ]

(సింహాసనాన్ని (అర్ష్ ను) మోసేవారు మరియు దాని చుట్టూ ఉండేవారు (దైవదూతలు), తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ ఉంటారు. మరియు ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటారు. మరియు విశ్వసించిన వారి కొరకు క్షమాభిక్ష కోరుతూ: “ఓ మా ప్రభూ! నీవు నీ కారుణ్యం మరియు నీ జ్ఞానంతో ప్రతి దానిని ఆవరించి ఉన్నావు. కావున పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలి, నీ మార్గాన్ని అనుసరించే వారిని క్షమించు; మరియు వారిని భగభగమండే నరకాగ్ని శిక్ష నుండి కాపాడు!” ఓ మా ప్రభూ! ఇంకా వారిని, నీవు వాగ్దానం చేసిన, కలకాలముండే స్వర్గవనాలలో ప్రవేశింపజేయి మరియు వారి తండ్రులలో వారి సహవాసులలో (అజ్వాజ్ లలో) మరియు వారి సంతానంలో, సద్వర్తనులైన వారిని కూడా! నిశ్చయంగా నీవే సర్వశక్తిమంతుడవు, మహా వివేకవంతుడవు. మరియు వారిని దుష్కార్యాల నుండి కాపాడు. మరియు ఆ రోజు నీవు ఎవడినైతే దుష్కార్యాల నుండి కాపాడుతావో! వాస్తవంగా వాడిని నీవు కరుణించినట్లే! మరియు అదే ఆ గొప్ప సాఫల్యం (విజయం).)

మరియు దైవదూతలు ఆ వ్యక్తి పాప క్షమాపణ గురించి దువా చేస్తారు, ఏ వ్యక్తి అయితే మస్జిద్ లో ఒక నమాజ్ ముగించుకొని మరో నమాజ్ కొరకు వేచి చూస్తాడో. దైవ దూతలు ఇలా అంటారు – “ఓ అల్లాహ్ అతనిని క్షమించు. ఓ అల్లాహ్ అతనిని కరుణించు“. (అబూ దావూద్ 469- తిర్మీజీ 330 – నసాయి 733)

మరియు దైవదూతలు ఆ వ్యక్తి గురించి కూడా క్షమాపణ మరియు కారుణ్యం గురించి దుఆ చేస్తారు, ఏ వ్యక్తి అయితే మస్జిద్  లో మొదటి సఫ్ (పంక్తి ) లో నమాజ్ ఆచరిస్తాడో. (అబూ దావూద్ 674- నసాయి 646-ఇబ్నె మాజ 997 )

మరియు దైవదూతలు వారి గురించి కూడా దుఆ చేస్తారు ఎవరైతే ప్రజలకు మంచి గురించి ఆదేశిస్తారో. అబూ ఉమామ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఇలా తెలియజేశారు – “అల్లాహ్ మరియు ఆయన దైవదూతలు ఆకాశంలోని వారు భూమిపై వారు చివరికి పుట్టలలో ఉండే  చీమలు సైతం నీటిలో ఉండే చేపల సైతం ఆ వ్యక్తి శుభాల మేళ్ల గురించి దుఆ చేస్తారు, ఏ వ్యక్తి అయితే మంచిని బోధిస్తాడో” .(తిర్మీజీ 2685)

మరియు దైవదూతలు ఆ వ్యక్తిపై శాపాన్ని పంపుతారు, ఏ వ్యక్తి అయితే తన తోటి ముస్లిం సోదరులకు ఏదైనా ఇనుప వస్తువును లేక ఏదైనా పదునైన  ఆయుధం చూపిస్తాడో.. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం వారు ఇలా తెలియజేశారు: “ఎవరైతే తనతోటి సోదరులకు ఆయుధం లేక ఏదైనా పదునైన వస్తువును సూచించి చూపిస్తాడో, అతను ఒకే తల్లి తండ్రి పుట్టిన సోదరుడైన సరే, దైవదూతలు ఆ వస్తువుని విడిచి పెట్టే వరకు అతనిపై  శాపాన్ని పంపుతారు“. (ముస్లిం 2616)

దైవదూతలు ఫజ్ర్ నమాజులో విశ్వాసులతోపాటు హాజరవుతారు.

[وَقُرۡءَانَ ٱلۡفَجۡرِۖ إِنَّ قُرۡءَانَ ٱلۡفَجۡرِ كَانَ مَشۡهُودٗا٧٨]
(మరియు ప్రాతఃకాలంలో (నమాజ్ లో) ఖుర్ఆన్ పఠించు. నిశ్చయంగా ప్రాతఃకాల ఖుర్ఆన్ పఠనం (దేవదూతల ద్వారా) వీక్షింప బడుతుంది)

ఫజ్ర్ లో ఖురాన్ చదవడం అనగా ఫజ్ర్ నమాజులో ఇతర నమాజుల కంటే ఎక్కువగా ఖురాన్ పారాయణం జరుగుతుంది. ఈ నమాజులో చేసేటువంటి ఖురాన్ పారాయణకు ప్రాధాన్యత కూడా ఉంది, ఎందుకంటే ఆ సమయంలో రాత్రి మరియు పగటికి సంబంధించిన దేవదూతలు హాజరవుతారు.( తఫ్సీర్ సాది)

వీటి ద్వారా అర్థమయ్యే విషయం ఏమిటంటే దైవ దూతలు అల్లాహ్ తఆలా ఏ  ఆదేశాలనైతే వారికి ఇచ్చాడో వారు ఆ ఆదేశాల ప్రకారం తప్పక వారి యొక్క బాధ్యతను నెరవేరుస్తూ ఉంటారు. అందుకే అల్లాహ్  దేవదూతలను సందేశం అందజేసే వారిగా పేర్కొన్నాడు. అల్లాహ్ తఆల  సెలవిస్తున్నాడు.

[ٱلۡحَمۡدُ لِلَّهِ فَاطِرِ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ جَاعِلِ ٱلۡمَلَٰٓئِكَةِ رُسُلًا أُوْلِيٓ أَجۡنِحَةٖ]

(సర్వ స్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆకాశాలు ,మరియు భూమి యొక్క సృష్టికి మూలాధారి. ఆయనే దైవదూతలను సందేశాన్ని అందచేసే వారిగా నియమించాడు. )

అనగా దైవదూతలను వహీ కొరకు మరియు ప్రాణం తీయడం కొరకు, మేఘాలను చేరవేయడం కొరకు మరియు ఆదం సంతతి యొక్క కర్మలు లిఖించడం కొరకు నియమించడం జరిగింది.

ఇబ్నె తైమియా (రహిమహుల్లాహ్) ఈ విధంగా తెలియజేస్తున్నారు: దైవదూతల విషయం చాలాగొప్పది. వారు అల్లాహ్ యొక్క ఆదేశాలను, వ్యవహారాలను  నిర్వర్తించడానికి  పంపించబడినటువంటివారు. అల్లాహ్  ఇలా అంటున్నాడు.  

[فَٱلۡمُدَبِّرَٰتِ أَمۡرٗا]
(మరియు తన ప్రభువు అజ్ఞానుసారం వ్యవహారాలు నిర్వహించే దేవదూతల సాక్షిగా)

మరోచోట ఇలా ఉంది

[فَٱلۡمُقَسِّمَٰتِ أَمۡرًا]
(మరియు అల్లాహ్ ఆజ్ఞ తో (అనుగ్రహాలను)పంచి పెట్టె దేవదూతల సాక్షిగా)

అల్లాహ్ తఆలా తన గ్రంథాలలో దైవదూతల యొక్క ప్రస్తావన అనేకమార్లు చేశాడు. వారి గురించి అనేక విషయాలు తెలియజేశారు అంటే దీని ద్వారా వారి యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది.

మరియు దైవదూతల యొక్క మరో గొప్పదనం ఏమిటంటే అల్లాహ్ తఆలా వారి యొక్క సాక్ష్యం ఇస్తున్నాడు

[فَٱلۡمُدَبِّرَٰتِ أَمۡرٗا]
(మరియు తన ప్రభువు అజ్ఞానుసారం వ్యవహారాలు నిర్వహించే దేవదూతల సాక్షిగా )

దైవదూతలలో కొంతమంది ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క ఆరాధనలో నిమగ్నమై ఉంటారు. మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు: “నిశ్చయంగా ఆకాశం నిండిపోయి ఉంది. అందులో నాలుగు వేళ్ళు పట్టే స్థలం కూడా ఖాళీ లేదు. అయినప్పటికీ సాష్టాంగ పడే దైవదూతలు సాష్టాంగ పడుతూనే ఉన్నారు. ఆకాశం అంత విశాలంగా ఉన్నప్పటికీ దైవదూతల ఆరాధన కొరకు ఇరుకైపోయింది. అల్లాహ్ పరిశుద్దుడు, చాలా గొప్పవాడు“. (తిర్మీజీ 2312 – అహ్మద్ 173/5 – ఇబ్నె మాజా 4190.)

దైవదూతలపై విశ్వాసం యొక్క ప్రాథమిక విషయాలను మీ ముందు ఉంచడం జరిగింది. అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షీంప చేయుగాక ,ఆయన వివేకం తో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక ,అల్లాహ్ మనందరిని క్షమించుగాక,మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి నిశ్చయంగా ఆయన (తౌబా) పాశ్చయాత్తాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.   

స్తోత్రం మరియు దరూద్ తరువాత

తెలుసుకోండి, అల్లాహ్ మీపై కరుణించు గాక! దైవదూతలపై విశ్వాసం ఉంచడం వలన గొప్ప లాభాలు ఉన్నాయి.

1. అల్లాహ్ యొక్క గొప్పదనం, మహిమ మరియు ఆయన యొక్క ఆధిపత్యం గురించి తెలుస్తుంది. ఆయన సృష్టించినటువంటి సృష్టి ఇంత గొప్పగా ఉంటే మరి ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఎంత గొప్పవాడో  అన్నది మనకు అర్థమవుతుంది.

2. ఆదం సంతానం పట్ల అల్లాహ్ చూపినటువంటి అనుగ్రహం మరియు దయ మూలంగా అల్లాహ్ కు కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన దైవదూతలలో కొందరిని వారి రక్షణ కొరకు, వారి కర్మలను లిఖించడానికి మరియు వారి ఇతర ప్రయోజనాల కొరకు నియమించి ఉంచాడు.

3. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు వారు చేసినటువంటి ఆరాధన కొరకు వారిని ప్రేమించుట.

కనుక మీరు తెలుసుకోండి, అల్లాహ్ మీపై కరుణించుగాక! పుణ్యాత్ములైనటువంటి ఆదం సంతానము దైవదూతల కంటే గొప్పవారు. ఇది అహ్లుస్సున్నహ్ వల్ జమాఅ వారి వాక్యం. ఎందుకంటే ఆదం సంతతిలో సహజ సిద్ధమైన కామ క్రోధములు పెట్టడం జరిగింది. అందువలన అతనిలో ప్రతిఘటించేటువంటి శక్తి, అణచివేసే శక్తి ఉంటుంది. అతని యొక్క మనసు చెడు వైపునకు ప్రేరేపిస్తుంది. అతని రక్తంలో షైతాన్ ప్రవహిస్తుంటాడు, అయినప్పటికీ అతను నిగ్రహంగా ఉంటూ అల్లాహ్ ఆరాధన చేస్తాడు. దీనికి వ్యతిరేకంగా దైవదూతలకు ఇవేమీ ఉండవు మరియు షైతాన్ వారిని తప్పుదారి కూడా పట్టించలేడు. అందుకే ఆదం సంతానానికి  దైవదూతలు కంటే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

తెలుసుకోండి, షాబాన్ మాసం లో ఉపవాసాలు ఉండటం అభిలషణీయమైన ఆచరణ. ఆయేషా (రదియల్లాహు అన్హా) తెలియచేస్తున్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు షాబాన్ మాసంలో నఫీల్ ఉపవాసాలు ఎంత ఎక్కువగా పాటించేవారు అంటే ఇక ప్రవక్త ఉపవాసం వదిలిపెట్టరేమో అన్నంత భయం ఉండేది. మరియు నేను మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూశాను రమజాన్ పూర్తి ఉపవాసాల తర్వాత షాబాన్ మాసం లో ఉపవాసాలు పాఠించినంత మరే మాసంలో పాటించలేదు” (అహ్మద్ 201/5)

ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి, అల్లాహ్ మీపై కరుణించుగాక! అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కారానికై  అజ్ఞాపించి ఉన్నాడాని మీరు గుర్తుపెట్టుకోండి, అల్లాహ్ ఇలా అన్నాడు:

 [إِنَّ ٱللَّهَ وَمَلَٰٓئِكَتَهُۥ يُصَلُّونَ عَلَى ٱلنَّبِىِّۚ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ صَلُّوا۟ عَلَيْهِ وَسَلِّمُوا۟ تَسْلِيمًا] 
(నిశ్చయంగా అల్లాహ్‌, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.)

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై నీ కారుణ్యాన్ని అవతరింప చేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు.

ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లిం లకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు. ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రత ను ప్రసాదించు. మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారీగా చేయి ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని, పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు. నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు . ఆమీన్

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

దేవదూతలు (మెయిన్ పేజీ):
https://teluguislam.net/angels/

దైవ దూతల పట్ల విశ్వాసం – సలీమ్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

దైవ దూతల పట్ల విశ్వాసం
ముహమ్మద్ సలీమ్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/MiDl95p280k [15 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లామీయ విశ్వాస మూలస్తంభాలలో రెండవది అయిన దైవదూతల పట్ల విశ్వాసం గురించి వివరించబడింది. దైవదూతలు ఎవరనేది, వారి లక్షణాలు, వారి పుట్టుక, వారి సంఖ్య, మరియు వారి శక్తి సామర్థ్యాల గురించి చర్చించబడింది. దైవదూతలు కాంతితో సృష్టించబడినవారని, వారు పాపాలు చేయరని, ఎల్లప్పుడూ అల్లాహ్‌ను ఆరాధిస్తారని చెప్పబడింది. వారి సంఖ్య అపారమని, ప్రతిరోజు 70,000 మంది దైవదూతలు ‘బైతే మామూర్’లో ఆరాధన చేస్తారని హదీసు ద్వారా వివరించబడింది. చివరగా, జిబ్రీల్, మీకాయీల్, ఇస్రాఫీల్, మల‌కుల్ మౌత్ వంటి కొంతమంది ముఖ్యమైన దైవదూతల పేర్లు, వారి బాధ్యతల గురించి కూడా తెలియజేయబడింది.

అల్ హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్. అన్ని రకాల ప్రశంసలు, పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ
[అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలలోని రెండవ ముఖ్యాంశం, దైవదూతల పట్ల విశ్వాసం గురించి ఇన్ షా అల్లాహ్ ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం.

ఇంతకు ముందు కూడా మనము హదీసు విని ఉన్నాం, జిబ్రీల్ అలైహిస్సలాం, దైవదూత, మానవ రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్తా, ఈమాన్ అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏమిటి?” అని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈమాన్ గురించి, విశ్వాసం గురించి తెలియజేస్తూ, “అల్లాహ్‌ను విశ్వసించటం, దైవదూతలను విశ్వసించటం, దైవ గ్రంథాలను విశ్వసించటం, దైవ ప్రవక్తలను విశ్వసించటం, పరలోక దినాన్ని విశ్వసించటం, మంచి-చెడు విధివ్రాతను విశ్వసించటం,” ఈ ఆరు విషయాలను విశ్వసించటాన్ని ఈమాన్, విశ్వాసం అంటారు అని సమాధానం ఇచ్చినప్పుడు, దైవదూత, “మీరు చెప్పింది నిజమే” అని ధ్రువీకరించారు.

అయితే, ప్రవక్త వారు తెలియజేసిన ఆరు విషయాలలో నుంచి రెండవ విషయం దైవదూతల పట్ల విశ్వాసం గురించి ఇన్ షా అల్లాహ్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

దైవదూతలు ఎవరు? దైవదూతల లక్షణాలు ఏమిటి? దైవదూతల పుట్టుక ఎలా జరిగింది? దైవదూతల సంఖ్య ఎంత? దైవదూతల శక్తి సామర్థ్యాలు ఏమిటి? కొంతమంది దైవదూతల పేర్లు మరియు బాధ్యతలు, ఇవన్నీ విషయాలు ఇన్ షా అల్లాహ్ ఈ ప్రసంగంలో మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

ముందుగా, దైవదూతలు ఎవరు అనేది తెలుసుకుందాం. దైవదూతలు అల్లాహ్ సృష్టించిన ఒక ప్రాణి. మానవులు అల్లాహ్ సృష్టించిన ఒక ప్రాణి, జంతువులు అల్లాహ్ సృష్టించిన ఒక ప్రాణి, పక్షులు ఒక ప్రాణి, జలచరాలు ఒక ప్రాణి. అలాగే, దైవదూతలు కూడా అల్లాహ్ సృష్టించిన ఒక ప్రాణి. దైవదూతలు మానవుల కంటికి కనిపించరు. అయితే, దైవదూతలు ఉన్నారు అనేది వాస్తవము కాబట్టి, ఆ వాస్తవాన్ని మనము నమ్మాలి, విశ్వసించాలి.

దైవదూతల లక్షణాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దైవదూతలు పుణ్యాత్ములు, ఎల్లప్పుడూ అల్లాహ్‌ను స్మరిస్తూ, ఆరాధిస్తూ ఉంటారు. అల్లాహ్ ఆదేశాలను అతిక్రమించటం, పాపాలకు పాల్పడటం దైవదూతలకు రాదు. ఖురాన్ గ్రంథం, ఆరవ అధ్యాయం 66వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశారు:

لَّا يَعْصُونَ ٱللَّهَ مَآ أَمَرَهُمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ
[లా య’సూనల్లాహ మా అమరహుమ్ వ యఫ్’అలూన మా యు’మరూన్]
అల్లాహ్ ఆజ్ఞలను పాలించటంలో వారు ఏ మాత్రం అలక్ష్యం చేయరు. పైగా వారికి జారీ చేయబడిన ఆజ్ఞలను వారు ఖచ్చితంగా పాటిస్తారు, పాలిస్తారు.

చూశారా? అల్లాహ్ వారికి ఇచ్చిన బాధ్యత వారు ఖచ్చితంగా నెరవేరుస్తారు. అల్లాహ్ ఆజ్ఞలను అతిక్రమించటం వారికి రాదు. పాపాలు చేయటం, అల్లాహ్ ఆజ్ఞలను ఉల్లంఘించటం వారికి రానే రాదు.

దైవదూతలకు మానవుల లాంటి లక్షణాలు ఉండవు. ఉదాహరణకు, కామం, ఆకలి, దప్పిక, అలసట, నిద్ర మొదలైన అవసరాలు దైవదూతలకు ఉండవు. ఇవన్నీ మానవులకు ఉంటాయి, కానీ దైవదూతలకు అలాంటి అవసరాలు, లక్షణాలు లేవు అని తెలుపబడింది.

మరి దైవదూతల పుట్టుక ఎలా జరిగింది అని మనం చూచినట్లయితే, దైవదూతలను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కాంతితో సృష్టించాడు. మానవులను దేనితో సృష్టించాడు? మట్టితో మానవులను సృష్టించాడు. ఇది మనం తెలుసుకొని ఉన్నాం ముందు ప్రసంగాలలో. దైవదూతలను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కాంతితో పుట్టించాడు, నూర్, కాంతితో పుట్టించాడు. మనం చూచినట్లయితే, ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

خُلِقَتِ الْمَلَائِكَةُ مِنْ نُورٍ
[ఖులిఖతిల్ మలాయికతు మిన్ నూర్]
దైవదూతలు నూర్ అనగా కాంతితో పుట్టించబడ్డారు, సృష్టించబడ్డారు.

దైవదూతలలో ఆడ-మగ అనే లింగభేదము లేదు. కావున, దైవదూతల మధ్య వివాహాలు జరగవు. వివాహాలు జరగవు కాబట్టి, వారిలో వంశపరంపర కూడా లేదు. ఇది దైవదూతల గురించి మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం.

ఇక, దైవదూతల సంఖ్య ఎంత ఉంది? మానవులను ఫలానా దేశంలో ఇంతమంది ఉన్నారు, ఫలానా దేశంలో అంతమంది జనాభా ఉన్నారు మానవులు అని లెక్కింపు అనేది మనం చూస్తూ ఉంటాం. మరి, దైవదూతల లెక్కింపు ఎవరైనా చేశారా? దైవదూతలు ఎంతమంది ఉన్నారు? అంటే, మనం చూచినట్లయితే, దైవదూతల సంఖ్య చాలా ఎక్కువ. అది ఎలాగంటే, ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక రెండు హదీసులు మీ ముందర నేను ఉంచుతున్నాను చూడండి.

మేరాజ్ యాత్రలో భాగంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆకాశాల పైకి వెళ్ళినప్పుడు, అక్కడ ఆకాశాల పైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ‘బైతే మామూర్’ ఒక పుణ్యక్షేత్రము ఆకాశాల పైన ఉంది, అది చూపించడం జరిగింది. జిబ్రీల్ అలైహిస్సలాం దైవదూత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడుతూ, “ఓ దైవ ప్రవక్తా, ఈ బైతే మామూర్‌లో ప్రతి రోజూ 70,000 మంది దైవదూతలు ఆరాధనలో పాల్గొంటారు. ఒక్కసారి ఆ బైతే మామూర్ పుణ్యక్షేత్రంలో ఆరాధన ముగించుకొని ఆ 70,000 మంది దైవదూతలు బయటికి వచ్చేస్తే, మళ్ళీ వారికి అక్కడ వెళ్లి ఆరాధన చేసుకోవడానికి వంతు రాదు. అంటే ప్రళయం వచ్చేస్తుంది గానీ, ఒక్కసారి అక్కడ ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత, ఆ దైవదూతలకు మరొకసారి అక్కడ అవకాశం దొరకదు, వారి వంతు రాదు,” అన్నారు. ఆ ప్రకారంగా ఎంతమంది దైవదూతలు ఉన్నారో మనము ఇట్టే ఆలోచించవచ్చు.

మరొక ఉల్లేఖనంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

مَا فِيهَا مَوْضِعُ أَرْبَعِ أَصَابِعَ إِلَّا وَمَلَكٌ قَائِمٌ أَوْ رَاكِعٌ أَوْ سَاجِدٌ
[మా ఫీహా మౌదివు అర్‌బయి అసాబిఇన్ ఇల్లా వ మలకున్ ఖాయిమున్ అవ్ రాకివున్ అవ్ సాజిదున్]
దీని అర్థం ఏమిటంటే, ఆకాశం దైవదూతలతో నిండి కిటకిటలాడుతున్నది. ప్రతి నాలుగు వ్రేళ్లంతటి స్థానంలో ఒక దైవదూత ఖియాంలో, రుకూలో, సజ్దాలో నిమగ్నమై ఉన్నాడు.

అంటే, ప్రతి బెత్తెడు, నాలుగు వేళ్ళంతటి స్థానంలో ఒక్కొక్క దూత నిలబడి ఉన్నాడు ఆకాశం మీద అంటే, ఆకాశం ఎంత పెద్దది? అంత పెద్ద ఆకాశంలో ప్రతి నాలుగు వేళ్ళంతటి స్థానంలో ఒక దైవదూత నిలబడి ఉన్నారంటే, మరి వారి సంఖ్య ఎంత? మనం లెక్క చేయలేము. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను మనం లెక్క చేయలేము. నక్షత్రాల కంటే బహుశా దైవదూతలు ఎక్కువ ఉన్నారేమో. కాబట్టి, దైవదూతల సరైన లెక్కింపు ఎవరికీ తెలియజేయబడలేదు. వారి లెక్కింపు అల్లాహ్‌కు మాత్రమే తెలుసు. ఈ విషయం కూడా మనము గట్టిగా విశ్వసించాలి, నమ్మాలి.

ఇక, దైవదూతల శక్తి సామర్థ్యాల గురించి మనము చూచినట్లయితే, దైవదూతలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గొప్ప గొప్ప శక్తులు ప్రసాదించాడు. దైవదూతలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెక్కలు ఇచ్చాడు. కొంతమంది దైవదూతలకు రెండు రెక్కలు ఉంటాయి, మరికొంత మందికి నాలుగు, ఆ తర్వాత అలాగే ఎంత పెద్ద దైవదూత ఉంటే అన్ని ఎక్కువ రెక్కలు వారికి ఉంటాయి అని తెలుపబడింది. మనం చూచినట్లయితే, ఖురాన్ గ్రంథం 35వ అధ్యాయం, ఒకటవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

جَاعِلِ ٱلْمَلَٰٓئِكَةِ رُسُلًا أُو۟لِىٓ أَجْنِحَةٍ مَّثْنَىٰ وَثُلَٰثَ وَرُبَٰعَ ۚ يَزِيدُ فِى ٱلْخَلْقِ مَا يَشَآءُ
[జాయిలిల్ మలాయికతి రుసులన్ ఉలీ అజ్నిహతిమ్ మస్నా వ సులాస వ రుబాఅ. యజీదు ఫిల్ ఖల్కి మా యషా]
ఆయన రెండేసి, మూడేసి, నాలుగేసి రెక్కలు గల దూతలను తన సందేశ వాహకులుగా చేసుకుంటాడు. సృష్టిలో తాను కోరిన దాన్ని పెంచుతాడు.

అంటే దైవదూతలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెక్కలు ఇచ్చాడు. వారి రెక్కలు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పెంచుతూ పోయాడు అన్న విషయము ఇక్కడ తెలుపబడింది. మనము బుఖారీ, ముస్లింలో ఉన్న ఉల్లేఖనాన్ని చూసినట్లయితే, అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “మేరాజ్ యాత్రలో భాగంగా నేను ఆకాశాల పైకి వెళ్ళినప్పుడు, అక్కడ జిబ్రీల్ అలైహిస్సలాం వారిని ఆకాశాల మీద వారి నిజ స్వరూపంలో నేను ఆయనను చూశాను.” జిబ్రీల్ అలైహిస్సలాం వారిని ప్రవక్త వారు ఆకాశాల మీద వారి నిజ స్వరూపంలో చూశారు. నిజ స్వరూపంలో చూసినప్పుడు వారు ఎలా ఉన్నారంటే, జిబ్రీల్ అలైహిస్సలాం వారికి ఆరు వందల రెక్కలు ఉన్నాయి. అల్లాహు అక్బర్! ఆరు వందల రెక్కలు ఆయన ఒక్కరికే ఉన్నాయంటే, ఆయన ఎంత గొప్ప, పెద్ద దైవదూతనో మనము అర్థం చేసుకోవచ్చు.

అలాగే, దైవదూతలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రూపాలు ధరించే శక్తి కూడా ఇచ్చి ఉన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు జిబ్రీల్ అలైహిస్సలాం వారు మానవ రూపము ధరించి వచ్చి దైవ వాక్యాలు వినిపించి వెళ్ళేవారు. కొన్ని సందర్భాలలో ఆయన మానవ రూపంలో వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు శిష్యులు, సహాబాలు కూడా జిబ్రీల్ అలైహిస్సలాం వారిని మానవ రూపంలో చూశారు. అలాంటి ఉదాహరణలు మనము ప్రసంగాలలో విని ఉన్నాం.

అలాగే, దైవదూతలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వేగంగా కదిలే, ప్రయాణించే శక్తి ఇచ్చాడు. దైవదూతలు భూమి ఆకాశాల మధ్య రాకపోకలు జరుపుతూ ఉంటారు. భూమి ఆకాశాల మధ్య ఎంతో, భూమి ఆకాశాల మధ్య ఎంతో దూరము ఉంది. అంత దూరాన్ని వారు క్షణాలలో ఛేదించేస్తూ ఉంటారు. వారు అంత స్పీడుగా, వేగంగా వస్తూ వెళుతూ ఉంటారు. అంత వేగంగా కదిలే శక్తి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతలకు ఇచ్చి ఉన్నాడు. ఇవి దైవదూతల యొక్క లక్షణాలు, దైవదూతల యొక్క శక్తి సామర్థ్యాలు.

ఇక, కొంతమంది దైవదూతల పేర్లు మరియు వారి బాధ్యతల ప్రస్తావన కూడా గ్రంథాలలో వచ్చి ఉంది. అవి తెలుసుకొని ఇన్ షా అల్లాహ్ మాటను ముగిద్దాం.

దైవదూతలలో జిబ్రీల్ అలైహిస్సలాం వారు దైవదూతలందరిలో గొప్పవారు మరియు దైవదూతలందరికీ ఆయన నాయకుడు అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు. మరి జిబ్రీల్ అలైహిస్సలాం వారి యొక్క బాధ్యత ఏమిటంటే, అల్లాహ్ వద్ద నుండి వాక్యాలు తీసుకొని వచ్చి దైవ ప్రవక్తలకు దైవ వాక్యాలు వినిపించి వెళ్ళేవారు. అలాగే, ఇతర బాధ్యతలు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఇచ్చినప్పుడు, ఆ బాధ్యతలు కూడా ఆయన నెరవేర్చేవారు. ముఖ్యంగా, దైవ వాక్యాలు అల్లాహ్ నుండి తీసుకొని వచ్చి దైవ ప్రవక్తలకు వినిపించటము ఆయన నిర్వహించిన గొప్ప బాధ్యత.

మీకాయీల్ అలైహిస్సలాం అనే ఒక దైవదూత. మీకాయీల్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వర్షం కురిపించే బాధ్యత ఇచ్చాడు. మీకాయీల్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ ఎక్కడ, ఎంత వర్షం కురిపించమని ఆదేశిస్తాడో, ఆయన ఆ ప్రదేశంలో అంత వర్షం కురిపిస్తూ ఉంటారు.

ఇస్రాఫీల్ అలైహిస్సలాం అని ఒక దైవదూత ఉన్నారు. ఆయన ప్రళయ దినాన అల్లాహ్ ఆదేశంతో శంఖంలో ఊదుతారు. ఆ శంఖం ఊదబడిన తర్వాత ప్రళయం సంభవిస్తుంది.

మల‌కుల్ మౌత్ అనే ఒక దైవదూత ఉన్నారు. మల‌కుల్ మౌత్ దైవదూత ప్రాణాలు హరిస్తూ ఉంటారు.

‘ముఅఖ్ఖిబాత్’ అని దైవదూతలు ఉన్నారు. వారు మానవుల రక్షణ కొరకు నియమించబడి ఉన్నారు. మానవులు నిద్రపోతున్నప్పుడు, నిద్ర లేచి నడుస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, స్థానికంగా ఉంటున్నప్పుడు, ఎల్లవేళలా ఆ దైవదూతలు వారి రక్షణలలో, రక్షణలో నియమించబడి ఉన్నారు. అలాంటి దైవదూతలను ‘ముఅఖ్ఖిబాత్’ అంటారు.

అలాగే, ‘ఖజనతుల్ జన్నహ్’, స్వర్గంలో కొంతమంది దైవదూతలు ఉన్నారు. వారికి ‘ఖజనతుల్ జన్నహ్’ అంటారు. స్వర్గవాసులు ఎప్పుడైతే స్వర్గంలోకి ప్రవేశిస్తారో, ఆ ‘ఖజనతుల్ జన్నహ్’ అనే దైవదూతలు స్వర్గవాసులని స్వర్గంలో వచ్చేటప్పుడు సాదరంగా ఆహ్వానిస్తారు.

అలాగే, ‘ఖజనతున్ నార్’ అని కొంతమంది దైవదూతలు ఉన్నారు. వారు నరకంలో నియమించబడి ఉన్నారు. నరకవాసులు నరకంలో వెళ్ళిపోయిన తర్వాత, ఆ బాధలు భరించక, ఆ నరకంలో ఉన్న దూతలను, “మాకు చావు ఇచ్చేయమని అల్లాహ్‌తో కోరమని” వేడుకుంటారు. ఆ ప్రకారంగా ‘ఖజనతున్ నార్’ అనే కొంతమంది దైవదూతలు నరకంలో నియమించబడి ఉన్నారు.

అలాగే, ‘సయ్యాహీన్’ అని కొంతమంది దైవదూతలు ఉన్నారు. వారు భూమండలం మొత్తము తిరుగుతూ ఉంటారు, సంచరిస్తూ ఉంటారు. ప్రజలు ఎవరైనా, ఎక్కడైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దైవ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూద్ పఠిస్తూ ఉంటే గనక, ఆ దరూద్ వారు సేకరించి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వెళ్ళి వినిపిస్తారు.

అలాగే, ‘కిరామన్ కాతిబీన్’ అని దైవదూతలు ఉన్నారు. వారు మానవులు చేసే కర్మలన్నీ లిఖిస్తూ ఉంటారు. మంచి కార్యము, చెడు కార్యము, వారు చేసే పని, వారు మాట్లాడే ప్రతి మాట, వారు నమోదు చేస్తూ ఉంటారు. వారిని ‘కిరామన్ కాతిబీన్’ దైవదూతలు అంటారు.

ఇవి దైవదూతల గురించి మనము తెలుసుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలు. నేను అల్లాహ్‌తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనమందరికీ సంపూర్ణ విశ్వాసులుగా, ధర్మం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం ప్రసాదించుగాక, ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30622

దేవదూతలు (ملائِكة‎) – మెయిన్ పేజీ
https://teluguislam.net/angels/