సులైమాన్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]

బిస్మిల్లాహ్
సులైమాన్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ప్రవక్త సులైమాన్ (అలైహిస్సలాం)
(970-931 క్రీ.పూ.)

“చివరకు సులైమాన్ సైన్యమంతా ఒక చీమల లోయకు చేరుకున్నప్పుడు ఒక చీమ ఇలా ప్రకటించింది: “ఓ చీమల్లారా! సులైమాను, అతని సైన్యాలు తెలీకుండా మిమ్మల్ని నలిపివేసే స్థితి ఏర్పడకుండా ఉండేందుకు, మీరు మీ మీ పుట్టలలోనికి దూరిపోండి.” ” (ఖుర్ఆన్ 27: 18)

ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) వివేకం మూర్తీభవించిన పాలకులు. ఆయన కుమారుడు సులైమాన్ మరింత తెలివి, వివేకసంపద కలిగినవారు. ఆయన చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడే తెలివితేటలు, వివేక విచక్షణలు ప్రదర్శించారు. రాజ దర్బారులో వివాదాల, ఫిర్యాదుల తీర్పులు జరుగుతున్నప్పుడు ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) తన కుమారుణ్ణి కూడా దర్బారులో పిలిచి కూర్చుండబెట్టేవారు.

ఒకసారి ఒక రైతు ఓ ఫిర్యాదు తీసుకుని వచ్చాడు. ఆ రైతు తన పొలంలో గోధుమ, మొక్కజొన్న పండించే వాడు. పొలంలో ఫలవృక్షాలు కూడా ఉండేవి. ఈ రైతుకు పొరుగున మరో వ్యక్తి ఉన్నాడు. ఈ పొరుగు వ్యక్తి గొర్రెలు పెంచేవాడు. రైతు పొలంలో పంట బాగా ఏపుగా పెరిగినప్పుడు పొరుగువాని గొర్రెలు పొలంలో పడి పంట మొత్తం ఆగం చేసి వెళ్ళేవి. ఈ వివాదం దర్బారుకు వచ్చింది. పొరుగువాడు రైతు చేసిన ఫిర్యాదు నిజమేనని ఒప్పుకున్నాడు. ఇద్దరి వాంగ్మూలాలు విన్న తర్వాత ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) తన తీర్పు చెబుతూ, రైతుకు జరిగిన నష్టానికిగాను పొరుగు వ్యక్తి తన గొర్రెలను రైతుకు ఇచ్చి నష్ట పరిహారం చెల్లించాలని అన్నారు. తన గొర్రెలు విచ్చలవిడిగా తిరగడానికి వదలి వేసిన పొరుగువాడు ఈ విధంగా గుణపాఠం కూడా నేర్చుకుంటాడని దావూద్ (అలైహిస్సలాం) అన్నారు. అప్పటికి సులైమాన్ వయసు కేవలం పదకొండు సంవత్సరాలు మాత్రమే. ఆయన ఈ తీర్పు విని లేచి నిలబడి మాట్లాడడానికి తండ్రి అనుమతి కోరారు. తండ్రి ఆయనకు అనుమతి ఇచ్చారు. సులైమాన్ మాట్లాడుతూ తాను ఈ తీర్పుతో ఏకీభవించడం లేదని, ఈ శిక్ష చాలా తీవ్రంగా ఉందని అన్నారు. బాల సులైమాన్ ధైర్యంగా చెప్పిన ఈ మాటలు విని పూర్తి దర్బారు నిర్ఘాంతపోయింది. దర్బారులో గుసగుసలు వ్యాపించాయి. దావూద్ ప్రవక్త చిరునవ్వుతో తన కుమారుడిని చూస్తూ ఈ వివాదానికి నీ తీర్పు ఏమిటో చెప్పు అన్నారు. అప్పుడు సులైమాన్ మాట్లాడుతూ, గొర్రెలను కొంతకాలం వరకు రైతుకు అధీనం చేయాలని, ఆ విధంగా రైతు వాటి ఉత్పత్తుల ద్వారా అంటే పాలు, ఉన్ని, వగైరాలతో లాభం పొంది తన నష్టాన్ని పూడ్చుకుంటాడని, ఈ లోగా గొర్రెల యజమాని ఒక సంవత్సరం పాటు రైతు పొలాన్ని సాగుచేసి పంట పండించి పంట కోయకుండా రైతుకు అప్పగించాలని, రైతు తన అధీనంలో ఉన్న గొర్రెలను, ఎన్ని గొర్రెలయితే పొరుగువాడు తన అధీనం చేశాడో అన్ని గొర్రెలను తిరిగి అతనికి అప్పగించాలని, వాటికి పుట్టిన గొర్రెపిల్లలను ఇవ్వనవసరం లేదని అన్నారు. ఈ విధంగా గొర్రెల యజమాని నిర్లక్ష్యానికి తగిన శిక్ష కూడా పడుతుందని, అతను ఒక సంవత్సరం పాటు ఎలాంటి ప్రతిఫలం లేకుండా పొలంలో పని చేసి పంట పండించి రైతుకు అప్ప గించవలసి ఉంటుందని, అలాగే అతను పూర్తిగా తన గొర్రెలను కోల్పోయే పరిస్థితి కూడా ఉండదని చెప్పారు. పంట సిద్ధంగా ఉన్న పొలాన్ని అతను అప్పగించిన తర్వాత రైతు దానిని కోసుకోవచ్చు. ఈ తీర్పును రాజదర్బారు నిశ్శబ్దంగా వింటూ ఉండిపోయింది.

రాజు దావూద్ (అలైహిస్సలాం) తన తీర్పును ఉపసంహరించుకుంటున్నానని, తన కుమారుని తీర్పును అమలు చేయాలని ఆదేశించారు. కుమారుని తీర్పు నిష్పక్ష పాతంగా, న్యాయసమ్మతంగా, వివేకవంతంగా, తన తీర్పు కన్నా ఉత్తమంగా ఉందని ప్రకటించారు. రైతు, గొర్రెల యజమాని ఇద్దరూ కూడా తీర్పు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. (చదవండి దివ్యఖుర్ఆన్ : 21:78-82)

ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) తన తర్వాత తన కుమారుడు సులైమాన్ ను రాజుగా చేయాలని నిర్ణయించారు. కాని దావూద్ (అలైహిస్సలాం) గారి మరో కుమారుడు అబ్సాలోమ్ పెద్దవాడు. పెద్దవాడయినప్పటికీ రాజబాధ్యతలు నిర్వర్తించే యోగ్యతలు అతనికి లేవు. తన తండ్రి సులైమాన్ ను రాజుగా చేయాలని నిర్ణయించడం అబ్సాలోమ్ కు నచ్చలేదు. అతనిలో ఈర్ష్యాద్వేషాలు బుసలు కొట్టాయి. ఎలాగైనా రాజ సింహాసనాన్ని హస్తగతం చేసుకోవాలని అతను కుట్రపన్నాడు.

ముందుగా అతడు ప్రజలను మభ్యపుచ్చి తన పక్షానికి వచ్చేలా చేయాలనుకున్నాడు. ప్రజలను తన వైపు త్రిప్పుకోవడానికి ఒక పథకం వేశాడు. ప్రజలు తమ వివాదాల పరిష్కారానికి సులైమాన్ దర్బారుకు వస్తున్నప్పుడు వారిని అక్కడకు వెళ్ళకుండా అడ్డుకుని తన వద్దకు వచ్చేలా చేశాడు. ఆ విధంగా తాను చాలా వివేకవంతుడినన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి ప్రయత్నించాడు. ఆ పిదప తన కుట్రకు పనికివచ్చే కొంతమంది దుర్మార్గులను తన అనుచరులుగా చేర్చుకున్నాడు. ఒక రోజు అతను తన తండ్రితో గిబియన్ పట్టణానికి వెళ్తాను అనుమతించమని కోరాడు. గిబియన్ పట్టణంలో తాను చేయవలసిన పని ఉందని సాకులు చెప్పాడు. తనతో పాటు తన అనుచరులను తీసుకుని వెళ్ళాడు. గిబియన్ పట్టణానికి వెళ్ళిన వెంటనే బనీ ఇస్రాయీల్లోని వివిధ తెగలకు రహస్య సందేశాలు పంపాడు. నగారా శబ్దం వినగానే తనను రాజుగా ప్రకటించాలని వారందరికీ సూచనలు పంపించాడు. కాని దావూద్ (అలైహిస్సలాం) పట్ల విశ్వాసం కలిగిన ప్రజలు ఈ ఆదేశాన్ని లక్ష్యపెట్టలేదు. అబ్సాలోమ్ అనుచరులకు, వివిధ తెగలకు మధ్య తీవ్రమైన పోరాటం జరిగింది. జెరుసలేమ్ పట్టణం దాదాపుగా నాశనం అయ్యింది.

తన కుమారుని ద్రోహం గురించి దావూద్ ప్రవక్తకు తెలిసింది. తన స్వంత కుమారుడు ఇలా వ్యవహరించాడని తెలిసి ఆయన చాలా బాధకు గురయ్యారు. అయినా ఆయన సంయమనాన్ని కోల్పోలేదు. తన రాజ్యంలో రక్తపాతాన్ని ఆయన ఇష్టపడలేదు. అబ్సాలోమ్ పట్టణాన్ని బలవంతంగా వశపరచుకోవచ్చని ఆయన భయపడ్డారు. అందువల్ల ఆయన తన వారికి వెంటనే పట్టణాన్ని వదిలి వేయాలని సందేశం పంపించారు. హాని కలుగకముందే అక్కడి నుంచి తప్పించుకొమ్మని చెప్పారు. చాలా మంది పట్టణాన్ని వదలి జోర్డాన్ నదిని దాటి వచ్చేశారు. దావూద్ (అలైహిస్సలాం) ఆలివ్ కొండను ఎక్కి అల్లాహ్ ను ప్రార్థించారు. ప్రజలను ఈ ప్రమాదం నుంచి కాపాడమని వేడుకున్నారు. కొంతమంది ప్రజలు తమ దుస్థితికి రాజుగారే కారణమని విమర్శించారు. కాని చాలా మంది దావూద్ పక్షాన విశ్వాసంగా నిలబడ్డారు. ఆయన వారితో, “నా స్వంత కుమారుడు నాకు ద్రోహం చేసినప్పుడు పరులు నాకు వ్యతిరేకమయ్యారని నేను ఎలా చెప్పగలను” అన్నారు.

దావూద్ (అలైహిస్సలాం) కొందరు అధికారులను అక్కడికి పంపి పరిస్థితి చక్క దిద్దమన్నారు. అబ్సాలోమ్కు ఎలాంటి హాని చేయవద్దని వారిని ఆదేశించారు. దావూద్ (అలైహిస్సలాం) పంపిన అధికారులు కఠినంగా అక్కడి తిరుగుబాటును అణచి వేశారు ఈ పోరాటంలో అబ్సాలోమ్ హతమయ్యాడు. జెరుసలేమ్ మళ్ళీ శాంతిభద్రతలు పునరుద్ధరించబడ్డాయి. దావూద్ (అలైహిస్సలాం) రాజుగా పరిపాలించడం కొనసాగింది.

తన తండ్రి మరణానంతరం సులైమాన్ (అలైహిస్సలాం) రాజుగా పాలనాపగ్గాలు చేపట్టారు. తన రాజ్యం వంటి మరో రాజ్యం లేనంత చక్కగా పాలించే అనుగ్రహం ప్రసాదించాలని ఆయన అల్లాహ్ ను ప్రార్థించారు. అల్లాహ్ ఆయన కోరికను మన్నించాడు. సులైమాన్ (అలైహిస్సలాం) మహావివేకవంతుడు మాత్రమే కాదు, అల్లాహ్ ఆయనకు అనేక వరాలు ప్రసాదించాడు. ఆయన గాలులను తన అదుపులో ఉంచుకోగలిగేవారు. పశుపక్ష్యాదులతో మాట్లాడగలిగేవారు. భూగర్భంలో ఉన్న ఖనిజాలను త్రవ్వి బయటకు తీసి వాటితో ఉపకరణాలు, ఆయుధాలు తయారు చేసే విద్యను మనుష్యులకు, జిన్నాతులకు (అగ్నితో సృష్టించబడిన బుద్ధిజీవులైన ప్రాణులకు) నేర్పాలని అల్లాహ్ ఆయనకు ఆదేశించాడు. అల్లాహ్ ఆయనకు ఒక రాగి గనిని కూడా ప్రసాదించాడు. ఆ కాలంలో రాగి అరుదైన లోహంగా ఉండేది.

ఒక రోజు సులైమాన్ (అలైహిస్సలాం) తన సైన్యాన్ని సమావేశపరచారు. అదొక విచిత్రమైన సైన్యం. అందులో మనుష్యులు, పశుపక్ష్యాదులు, జిన్నాతులు ఉన్నారు. సైన్యాన్ని తీసుకుని ఆయన అష్కెలాన్ రాజ్యానికి బయలుదేరారు.

వారు ఒక లోయ నుంచి వెళుతున్నప్పుడు ఒక చీమ ఈ సైన్యం రావడాన్ని చూసింది. మిగిలిన చీమలను హెచ్చరిస్తూ, ”పారిపోండి. పుట్టల్లో తలదాచు కోండి. లేకపోతే మనల్ని చూడకుండా సులైమాన్ సైన్యం మనల్ని తొక్కేస్తుంది” అని అరిచింది. ఈ అరుపు సులైమాన్ చెవులకు సోకింది. ఆయన నవ్వుకున్నారు. ఒక ప్రవక్తగా తాను కావాలని అల్లాహ్ సృష్టి దేనికీ హాని తలపెట్టనన్న విషయాన్ని ఆ చీమ గుర్తించినందుకు సంతోషించారు. చీమలను కాపాడినందుకు ఆయన అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

జెరుసలేమ్ ఒక పెద్ద శిలపై సులైమాన్ (అలైహిస్సలాం) ఒక అందమైన ఆరాధనాలయాన్ని నిర్మించారు. ప్రజలు అల్లాహ్ ను ఆరాధించడానికి వచ్చేలా ఈ ఆరాధనాలయాన్ని కట్టారు. నేడు దీనిని “మస్జిదుల్ అక్సా” లేదా “మస్జిదుల్ ఖుద్స్” లేదా ”డోమ్ ఆఫ్ రాక్” అని పిలుస్తున్నారు. ఇక్కడి నుంచి సులైమాన్ (అలైహిస్సలాం) వెంట పెద్ద సంఖ్యలో అనుచరులు మక్కాలోని పవిత్ర గృహానికి యాత్రకు బయలు దేరారు. వారు తమ హజ్ యాత్ర పూర్తి చేసుకుని అక్కడి నుంచి యమన్ చేరుకుని సనా పట్టణానికి వచ్చారు. ఇక్కడ తెలివిగా పట్టణాల్లో నీటిపారుదల సదుపాయాన్ని ఏర్పాటు చేసిన పద్ధతి చూసి ఆయన చాలా ప్రభావితులయ్యారు. తన రాజ్యంలో కూడా అలాంటి నీటిపారుదల సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని భావించారు. కాని తన రాజ్యంలో అందుకు అవసరమైన నీటివనరులు లేవు. ఆయన వెంటనే హూపో పక్షి కోసం కబురంపారు. ఆ పక్షి భూగర్భంలో జనవనరులను పసిగట్టగలదు. ఆయన హూపో పక్షి కోసం నాలుగు చెరగులా సందేశాలు పంపారు. కాని ఆ పక్షి ఎక్కడా లేదు. ఆయన కోపంగా ఆ పక్షి కనుక సరియైన కారణం లేకుండా గైర్హాజరైతే దానిని కఠినంగా శిక్షిస్తానని అన్నారు.

చివరకు హూపో పక్షి సులైమాన్ వద్దకు వచ్చింది. తన ఆలస్యానికి కారణాన్ని వివరించింది. “మీకు తెలియని ఒక విషయాన్ని నేను కని పెట్టి వచ్చాను. నేను సబా (షీబా) నుంచి ఒక శుభవార్త తీసుకుని వచ్చాను” అంది. ఈ మాటలు విన్న సులైమాన్ ఆగ్రహం మాయమై ఆయనలో కుతూహలం చోటుచేసుకుంది. ”సబా రాజ్యాన్ని బిల్కిస్ అనే రాణి పాలిస్తోంది. ఆమెకు అన్ని సౌభాగ్యాలు పుష్కలంగా ఉన్నాయి. ఆమె సింహాసనం చాలా అద్భుతంగా ఉంది. కాని ఇంత సంపద ఉన్నప్పటికీ, ఆమె హృదయంలో, ఆ రాజ్య ప్రజల హృదయాల్లో షైతాన్ తిష్ఠవేసుకుని ఉన్నాడు. ప్రజలు ఆమె పట్ల చాలా విశ్వాసంగా ఉన్నారు. వారంతా విశ్వప్రభువైన అల్లాహ్ కు బదులు సూర్యుణ్ణి పూజించడం చూసి నేను నిర్ఘాంతపోయాను” అని ఆ పక్షి వివరించింది.

హూపో పక్షి చెప్పిన మాటలు నిర్ధారించుకోవడానికి సులైమాన్ (అలైహిస్సలాం) ఆ పక్షితో సబా రాణికి ఒక లేఖ పంపారు. రాణికి లేఖ చేరవేసి అక్కడే రహస్యంగా ఉండి రాణి ఏం చేస్తుందో చూడమని పక్షికి సూచనలిచ్చారు.

హూపో పక్షి ఆ లేఖను సబా రాణి ముందు పడవేసి ఎగిరిపోయింది. వెళ్ళి ఓ మూలన దాక్కుని చూడసాగింది. సబా రాణి ఆ లేఖను ఆశ్చర్యంగా తీసుకుని చదివింది. “ఈ లేఖ సులైమాన్ నుంచి పంపబడింది. అనంత కరుణా మయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభం. నాకు వ్యతిరేకంగా బలప్రదర్శనకు దిగవద్దు. లొంగిపోయిన మనిషి మాదిరిగా నా వద్దకు రావాలి…..” ఈ లేఖ చూసి రాణి చాలా ఆందోళనకు గురయ్యింది. వెంటనే తన సలహాదారులను పిలిపించింది. వారు ఆమెతో తాము కేవలం సలహా మాత్రమే ఇవ్వగలమని, ఆదేశాలిచ్చి చర్యలు తీసుకోవలసినది రాణిగారేనని విన్నవించు కున్నారు. వారి ఉద్దేశ్యాన్ని ఆమె గ్రహించింది. వారంతా సులైమాన్తో యుద్ధరంగంలో ఢీకోవాలని భావిస్తున్నారు. కాని ఆమె వారితో, ”స్నేహం, శాంతి యుద్ధం కన్నా మంచివి. వివేక వంతమైనవి. యుద్ధం వల్ల పరాభవాలు వాటిల్లుతాయి. ప్రజలు బానిసలవుతారు. సంపద నాశనం అవుతుంది. నేను సులైమాన్కు కానుకలు పంపాలని భావిస్తున్నాను. మన ఖజానాలోని విలువైన వస్తువుల్ని పంపుదాం. ఈ కానుకలు తీసుకుని వెళ్ళే రాజప్రతినిధులు సులైమాన్ గురించి కూడా తెలుసుకోవచ్చు, అతని సైనిక బలాన్ని కూడా అంచనా వేయవచ్చు” అని చెప్పింది.

కాని ఆమెకు తన మాటలన్నింటినీ హూపో పక్షి వింటుందన్న విషయం తెలియదు. హూపో వెంటనే సులైమాన్ వద్దకు వెళ్ళి ఈ విషయాలు చేరవేసింది.

సులైమాన్ (అలైహిస్సలాం) వెంటనే తన అధీనంలో ఉన్న ఒక జిన్నుతో ఒక మహా ప్రాసాదాన్ని నిర్మించమని ఆదేశించారు. ఆ మహాసౌధంలో రాబోయే అతిథులను స్వాగతిస్తానని చెప్పారు. సబా రాణి వద్ద నుంచి వచ్చిన రాజప్రతినిధులను ఆయన చాలా ఆదరంగా స్వాగతించారు. అద్భుతమైన ఆ భవనాలను చూసి వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. వారు తమ రాణి పంపిన విలువైన కానుకలను సులైమాన్ (అలైహిస్సలాం)కు అందజేశారు. స్నేహానికి గుర్తులుగా వాటిని తమ రాణి పంపిందని, వాటిని స్వీకరించాలని కోరారు. కాని సులైమాన్ ఆ కానుకలను విప్పి చూడకుండానే వారిని ఉద్దేశించి, “అల్లాహ్ నాకు పుష్కలంగా ప్రసాదించాడు. ఒక పెద్ద రాజ్యాన్ని ఇచ్చాడు. ప్రవక్త పదవిని ఇచ్చాడు. కాబట్టి నేను లంచాలకు లొంగే అవకాశం లేదు. నా లక్ష్యం ఒక్కటే, తౌహీద్ (ఏకదైవారాధన)ను వ్యాపింప జేయడం” అన్నారు. అంతేకాదు, ఆ కానుకలను తిరిగి తీసుకువెళ్ళాలని ఆదేశించారు. మీ రాణి తన ఆరాధనా పద్ధతిని మార్చుకోనట్లయితే రాజ్యాన్ని వశపరచు కుంటానని, ప్రజల్ని అక్కడి నుంచి వెళ్ళగొడతానని కఠినంగా చెప్పారు.

రాణి ప్రతినిధులు ఆ కానుకలు తీసుకుని ఆమె వద్దకు చేరుకుని సులైమాన్ (అలైహిస్సలాం) చెప్పిన మాటలు చెప్పారు. అంతేకాదు, సులైమాన్ రాజ్యంలో తాము చూసిన అద్భుతాలను కూడా వివరించారు. సులైమాన్ సందేశం పట్ల ఆమె ఆగ్రహం ప్రదర్శించే బదులు సులైమాన్ రాజ్యాన్ని సందర్శించాలని నిర్ణయించుకుంది. తనకు విశ్వాసపాత్రులైన నౌకర్లతో ఆమె సబా రాజ్యాన్ని వదలి బయలుదేరింది. ఒక సందేశహరుడితో సులైమాన్ (అలైహిస్సలాం) వద్దకు తాను వస్తున్న వర్తమానం ముందుగానే పంపించింది.

సులైమాన్ (అలైహిస్సలాం) తన అధీనంలో ఉన్న జిన్నులను పిలిచి సబా రాణి రాక ముందే ఆమె సింహాసనాన్ని తన వద్దకు ఎవరు తీసుకువస్తారని అడిగారు. ఒక జిన్ను, ”ఈ సమావేశం ముగిసేలోపే ఆ సింహాసనాన్ని మీ ముందు ఉంచుతాను. నేను నిస్సందేహంగా బలం కలవాడిని. ఇలాంటి పనులు చేయడానికి నమ్మక స్తుడిని” అన్నాడు. కాని ఈ పని చేయడానికి జిన్నులు పోటీపడ్డారు. ఇంతలో ప్రత్యేక జ్ఞానం కలిగిన ఒక జిన్ను, “నేను రెప్పపాటులో ఆ సింహాననాన్ని మీ ముందు ఉంచుతాను” అంటూ మాట పూర్తయ్యేలోపే సింహాసనాన్ని ముందు ఉంచాడు. సులైమాన్ (అలైహిస్సలాం) ఆశ్చర్యంగా, ”ఇదంతా అల్లాహ్ అనుగ్రహం నేను కృతజ్ఞత చూపుతానో లేదో అని ఆయన పరీక్షిస్తున్నాడు” అన్నారు. ఆ తర్వాత ఆయన ఆ జిన్నుతో ఆ సింహాసనం ఆకారాన్ని మార్చమన్నారు.

బిల్కీస్ సులైమాన్ రాజప్రాసాదంలోకి వచ్చినప్పుడు ఆమెను ఘనంగా స్వాగతించడం జరిగింది. ఆ తర్వాత సులైమాన్ (అలైహిస్సలాం) తన వద్ద ఆకారం మార్చి ఉన్న సింహాసనాన్ని ఆమెకు చూపించి ఆమె సింహాసనం కూడా అలాంటిదేనా అని ప్రశ్నించారు. ఆమె ఆ సింహాసనాన్ని పదే పదే చూసింది. తాను చూస్తున్న సింహాసనం తన సింహాసనం అయ్యే అవకాశం లేదని భావించింది. ఎందుకంటే, తన సింహాసనం తన రాజభవనంలో ఉంది. కాని తన సింహాసనానికి ఈ సింహాసనానికి పోలికలు చాలా ఉండడం చూసి ఆమె ఆశ్చర్యంగా, “ఈ సింహాసనం నా సింహాసనాన్ని చాలా విధాలుగా పోలి ఉంది” అంటూ జవాబిచ్చింది. ఆమె చాలా తెలివైన, దౌత్యపరమైన నైపుణ్యం ఉన్న మహిళగా సులైమాన్ (అలైహిస్సలాం) గుర్తించారు.

ఆ తర్వాత ఆయన అమెను ఒక పెద్ద హాలులోకి ఆహ్వానించారు. ఆ గది లో నేల అంతా గాజుతో పరచబడి ఉంది. ఆమె గాజు నేలను చూసి అదంతా నీరుగా భ్రమపడింది. ఆమె అక్కడ అడుగుపెట్టేటప్పుడు తన దుస్తులు తడవకుండా కొద్దిగా కాలిమడమల పైకి లాక్కుంది. సులైమాన్ (అలైహిస్సలాం) ఆమెను చూస్తూ ఇక్కడ నీరు లేదు, గాజుతో చేసిన నేల అని చెప్పారు. ఆమె ఆశ్చర్య పోయింది. అలాంటి నిర్మాణాన్ని ఆమె అంతకుముందు ఎన్నడూ చూడలేదు. తన ముందు ఉన్నది విజ్ఞానవివేకాలు మూర్తీభవించిన అసాధారణ వ్యక్తి అని ఆమె గుర్తించింది. ఆయన కేవలం ఒక రాజ్యానికి పాలకుడు మాత్రమే కాదని, అల్లాహ్ ప్రవక్త కూడా అని తెలుసుకుంది. ఆమె తన ఆరాధనా పద్ధతులలోని తప్పులకు పశ్చాత్తాపపడింది. సూర్యుణ్ణి పూజించే అలవాటు మానుకుంది. అల్లాహ్ ను ఒకే ఒక్క దేవునిగా విశ్వసించింది. తన రాజ్యంలోని ప్రజలను కూడా అదే విధంగా చేయాలని కోరింది. (చదవండి దివ్యఖుర్ఆన్ : 6:84, 21:81-82, 34:12-14, 27:15-44, 2-103, 38:32-40)

సులైమాన్ (అలైహిస్సలాం) కాలంలో ప్రజలు గుర్రాలపై ప్రయాణాలు చేసేవారు. యుద్ధరంగంలో సైనికులకు యుద్ధ సామగ్రిని, ఆయుధాలను చేరవేయడానికి గుర్రాలనే ఉపయోగించేవారు. వస్తురవాణాకు, వాహనాలు లాగడానికి కూడా గుర్రాలనే వాడేవారు. గుర్రాల పట్ల చాలా శ్రద్ధ చూపేవారు. వాటికి చక్కని శిక్షణ ఇచ్చేవారు. సులైమాన్ (అలైహిస్సలాం) గుర్రపుశాలలో చాలా గుర్రాలు ఉండేవి. గుర్రాలంటే ఆయనకు చాలా శ్రద్ధ ఉండేది. ఒకసారి ఆయన తన గుర్రపుశాలలో గుర్రాలను చూస్తూ వాటిని ప్రేమగా నిమురుతూ చాలాసేపు గడిపారు. సూర్యుడు అస్తమించే సమయం అయిపోయింది. అస్ర్ నమాజు సమయం దాటిపోతోంది. ఆయన తాను చేస్తున్న ఆలస్యాన్ని గుర్తించి వెంటనే, “నేను ఈ సంపదను నా ప్రభువు సంస్మరణార్థం ప్రేమించాను.”…..”వాటిని నా వద్దకు తిరిగి తీసుకు రండి” అన్నారు. (చదవండి దివ్యఖుర్ఆన్: 38:32-33)

సులైమాన్ (అలైహిస్సలాం) పాలనలో అనేక పనులను జిన్నులే చేస్తుండేవి. జిన్నులు చేసిన పాపాలకు శిక్షగా వాటితో ఈ పనులు చేయించడం జరిగేది. అగ్నితో సృష్టించబడిన జిన్నులు తమకు సమస్త శక్తులున్నాయని, తాము అగోచరాలను కూడా చూడగలమని, భవిష్యత్తును తెలుసుకోగలమని ప్రజలను నమ్మించడం వంటి పాపాలకు పాల్పడేవారు. తన అనుచరుల్లో ఇలాంటి తప్పుడు విశ్వాసాలు చోటుచేసుకోకుండా చూడవలసిన బాధ్యత ఒక ప్రవక్తగా సులైమాన్ (అలైహిస్సలాం) పై ఉంది. భవిష్యత్తు తెలుసుకునే శక్తి జిన్నులకు గాని, ప్రవక్తలకు గాని ఎవరికీ లేదని, కేవలం అల్లాహ్ కు తప్ప అలాంటి శక్తి మరెవ్వరికీ లేదని ప్రజలు తెలుసుకునేలా చేయడం ఆయన బాధ్యత. ఈ దిశగా ఆయన చేసిన ప్రయత్నాలు ఆయన మరణానంతరం కూడా కొనసాగడం చెప్పుకోదగిన విశేషం.

ఒక గనిలో జిన్నుల పనిని పర్యవేక్షిస్తూ ఆయన తన చేతికర్రకు ఆనుకుని కూర్చుని ఉన్నారు. ఆ విధంగా కూర్చున్న స్థితిలోనే ఆయన తుదిశ్వాసను విడిచారు. చాలా సమయం వరకు ఆయన (అలైహిస్సలాం) మరణం గురించి ఎవరికీ తెలియదు. ఆయన (అలైహిస్సలాం) అక్కడ కూర్చున్నట్లే చాలా మందికి కనబడ్డారు. సులైమాన్ (అలైహిస్సలాం) చూస్తున్నారన్న భయంతో జిన్నులు విరామం లేకుండా పని కొనసాగిస్తూ పోయారు. ఈ సంఘటనను దివ్యఖుర్ఆన్ ఇలా వివరించింది. “ఆ తరువాత సులైమాన్ పై మేము మరణ నిర్ణయాన్ని అమలు జరిపినప్పుడు, జిన్నాతులకు అతని మరణం గురించి తెలియజేసిన వస్తువు అతని చేతి కర్రను తింటూ ఉన్న చెదపురుగు తప్ప మరొకటేదీ కాదు, ఈ విధంగా సులైమాన్ పడిపోగా, తమకు అగోచర విషయాలు తెలిసి ఉంటే అవమానకరమైన ఈ బాధకు గురి అయి ఉండేవారము కాము అని జిన్నాతులకు స్పష్టంగా తెలిసి పోయింది.”

ఆ విధంగా ఆయన మరణం కూడా ఆయన అనుచరులకు ఒక పాఠంగా మిగిలింది. జిన్నులేకాదు, ఎవరూ కూడా భవిష్యత్తును గురించి తెలుసుకునే అవకాశం లేదన్నది అందరికీ తెలిసివచ్చింది. (చదవండి దివ్యఖుర్ఆన్ : 34:14)

  • సరియైన విధంగా న్యాయం చేయాలంటే, తీర్పు చెప్పేముందు ఇరు పక్షాల వాదనను పూర్తిగా వినాలి. న్యాయం జరిగిందని ప్రజలు తెలుసుకునేలా ఉండాలి.
  • వయసులో చిన్నవాడైన తన కుమారుడి వివేకాన్ని గుర్తించి తండ్రి తన స్వంత నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు.
  • ప్రార్థనలతో సహా వివిధ పనులకు తగిన విధంగా సమయాన్ని విభజించు కోవాలి. ప్రవక్తలు, చాలామంది పాలకులు ఇహపరలోకాల విధులు నిర్వర్తించడానికి తగిన విధంగా సమయాన్ని విభజించుకునేవారు.
  • మనిషి ఆధ్యాత్మిక శక్తి అతని ధార్మిక విశ్వాసంలో ఉంది.
  • మంచి పనులు జాతిని పతనానికి గురికాకుండా కాపాడుతాయి. అయితే విదేశీ దాడుల నుంచి కాపాడుకోవడానికి సైనిక ఏర్పాట్లు అవసరం.
  • ఆత్మసమీక్ష : మనిషి తన ఆచరణల విషయంలో ఏమాత్రం అనుమానం వచ్చినా తక్షణం అల్లాహ్ వైపునకు మరలి మార్గదర్శనం కోసం ప్రార్థించాలి.
  • అల్లాహ్ సృష్టి పట్ల సులైమాన్ (అలైహిస్సలాం) చాలా శ్రద్ధ తీసుకునేవారు, చివరకు ఒక చీమకు కూడా హాని కలుగడాన్ని ఇష్టపడలేదు.
  • వివేకజ్ఞానాలు ఉన్న సులైమాన్ (అలైహిస్సలాం) కూడా ఒక పక్షి నుంచి నేర్చుకు న్నారు. ఆ పక్షి సలహా తీసుకుని ఆ ప్రకారం వ్యవహరించారు.
  • పరస్పర సంప్రదింపులు: బిల్కిస్ ఒక స్త్రీ, ఆమె ఒక పాలకురాలు కూడా. అయినప్పటికీ అల్లాహ్ ఆమె పాలనాశైలిని గుర్తించాడు. ఆమె ఇతరులతో సంప్రదింపులు జరిపింది, కాని వారిచ్చిన తప్పుడు సలహాలను పాటించ లేదు.
  • శాంతి అన్నది సంతోషాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. యుద్ధాలు, పోరాటాలు వినాశానికి కారణమవుతాయి.
  • లంచాలకు, అవినీతికి ఎన్నడూ లొంగరాదు.
  • సులైమాన్ (అలైహిస్సలాం) మరణం కూడా మానవాళికి గుణపాఠం వంటిది. మనిషి జిన్నులను కూడా పాలించగలడు. అవి మనిషిపై ఆధిపత్యాన్ని సాధించలేవు. వాటికి భవిష్యత్తును తెలుసుకునే శక్తి కాని, అగోచరాలను గ్రహించే శక్తి కాని లేవు.
  • బైబిలులో కింగ్స్.. చాప్టర్ 2లో సులైమాన్ (అలైహిస్సలాం) దేవుని ఆదేశాలకు విరుద్ధంగా 700 మంది మహిళలను వివాహం చేసుకున్నారని, 300 మంది మహిళలను ఉంచుకున్నారని, ఆ మహిళలు ఆయన్ను విగ్రహారాధన చేసేలా ప్రలోభపెట్టారని, ఆయన అనేక విగ్రహారాధనాలయాలు కట్టించాడని, తన భార్యల కోసం బలిపీఠాలు కట్టించాడని ఇలాంటి అనేక అసత్య ఆరోపణలు ఉన్నాయి. కాని దివ్యఖుర్ఆన్ ఈ అసత్య ఆరోపణలను, అలాగే బ్లాక్ మ్యాజిక్కు పాల్పడ్డాడన్న ఆరోపణలన్నింటినీ ఖండిస్తోంది. (చదవండి దివ్యఖుర్ఆన్ 2-102)

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జీవిత చరిత్ర – సలీం జామిఈ [ఆడియో, టెక్స్ట్]

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జీవిత చరిత్ర
https://youtu.be/6wNGPCoz60I [30 నిముషాలు]
సలీం జామిఈ హఫిజహుల్లాహ్

ఈ జుమా ప్రసంగంలో వక్త, ప్రముఖ సహచరుడు హజ్రత్ సల్మాన్ ఫార్సీ (రజియల్లాహు అన్హు) గారి జీవిత చరిత్ర మరియు సత్యం కోసం వారు చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని వివరించారు. అల్లాహ్ మానవులకు ప్రసాదించిన అత్యున్నత వరమైన ‘ఇస్లాం’ విలువను వివరిస్తూ, సల్మాన్ ఫార్సీ (రజియల్లాహు అన్హు) పర్షియాలో అగ్ని ఆరాధకుడిగా ఉండి, సత్యధర్మాన్ని అన్వేషిస్తూ క్రైస్తవ మత గురువుల వద్దకు చేరి, చివరికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి రాక గురించి తెలుసుకున్న తీరును కళ్లకు కట్టినట్లు చెప్పారు. బానిసత్వాన్ని అనుభవించి, మదీనాలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని కలుసుకొని, ప్రవక్తత సూచనలను (సదఖాను తినకపోవడం, బహుమానాన్ని స్వీకరించడం, ప్రవక్తతా ముద్ర) స్వయంగా పరీక్షించి ఇస్లాంను స్వీకరించిన వైనాన్ని, ఆ తర్వాత తన స్వేచ్ఛ కోసం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేసిన అద్భుత సహకారాన్ని ఈ ప్రసంగం వివరిస్తుంది.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వ లోకాల సృష్టికర్త పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి.

ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సహోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు గారి జీవిత చరిత్రను మనం తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా! మానవునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రపంచంలో ఎన్నో అనుగ్రహాలను ప్రసాదించాడు. అల్లాహ్ మానవులకిచ్చిన అనుగ్రహాలను లెక్కచేయలేనన్నివి ఉన్నాయి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు. నిజమే, అయితే అల్లాహ్ మానవులకు ప్రసాదించిన అనుగ్రహాలలో గొప్ప అనుగ్రహం ఏది అంటే, అది దైవ ధర్మ ఆచరణ.

అభిమాన సోదరులారా! ఒక్కసారి ఆలోచించి చూడండి, మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముస్లింలుగా, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే వారిగా పుట్టించాడు, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించాడు. ఇది ఎంత గొప్ప వరమో ఒక్కసారి ఆలోచించండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో తెలియజేశాడు:

إِنَّ الدِّينَ عِندَ اللَّهِ الْإِسْلَامُ
[ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం]
నిశ్చయంగా అల్లాహ్ వద్ద ధర్మం (ఒక్క) ఇస్లాం మాత్రమే. (3:19)

మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్పష్టంగా తెలియజేశాడు:

وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
[వమన్ యబ్ తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్ బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్]
ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు. (3:85)

కావున అభిమాన సోదరులారా! మనం ముస్లింలుగా, ఇస్లాం ధర్మాన్ని ఆచరిస్తూ ఏ చిన్న కార్యము చేస్తున్నా, ఏ పెద్ద కార్యము చేస్తున్నా దానికి రేపు ఇన్షా అల్లాహ్ విలువ ఉంటుంది. అయితే ఈ ఇస్లాం ధర్మాన్ని మనం ఎలా పొందాము? అల్లాహ్ దయవల్ల ఎలాంటి శ్రమ లేకుండా, ఎలాంటి కృషి లేకుండా, ఎలాంటి కష్టము లేకుండా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి పరీక్ష లేకుండా మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ అనుగ్రహాన్ని అలాగే బహుమానంగా ఉచితంగా ఇచ్చేశాడు.

అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మందికి ఈ ఇస్లాం ధర్మ స్వీకరణ భాగ్యం ఉచితంగా దొరకలేదు. వారు ఈ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడానికి, ఈ ఇస్లాం ధర్మాన్ని ఆచరించడానికి ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, ఎన్నో పరీక్షల్నీ ఎదుర్కొన్నారు అభిమాన సోదరులారా. అలా అల్లాహ్ ను అర్థం చేసుకోవడానికి, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడానికి కష్టపడిన, పరీక్షలు ఎదుర్కొన్న ఒక వ్యక్తి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు. రండి, ఈనాడు ఆ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు గారి యొక్క జీవిత చరిత్రను ఇన్షా అల్లాహ్ క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అభిమాన సోదరులారా! సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఇరాన్ దేశానికి చెందిన అస్బహాన్ నగరంలో పుట్టారు. వారి తండ్రి ఆ నగరానికి ఒక గురువు, మత గురువు, పెద్ద. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు పుట్టినప్పటి నుండి తండ్రి వద్దనే మత విషయాలు నేర్చుకున్నారు. ఆ రోజుల్లో ‘మజూసీ’ ధర్మాన్ని అక్కడ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆచరించారు. మజూసీ ధర్మంలో ప్రజలు అగ్నిని పూజించేవారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి తండ్రి కూడా అగ్నిని పూజించేవాడు, తన కుమారుణ్ణి కూడా అగ్నిని పూజించేటట్టుగా నేర్పించాడు.

చివరికి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి తండ్రి అగ్ని పూజ కొరకు ఎంతగా పరిమితం చేసేసాడంటే, ఎలాగైతే ఒక మహిళను ఇంట్లోనే ఉంచేస్తారో ఆ విధంగా సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని కూడా వారి తండ్రి అగ్ని వద్దనే ఒక కుటుంబ.. ఒక ఇంటిలోనే ఉంచేశాడు. బయటి ప్రపంచం గురించి ఆయనకు ఎక్కువగా తెలియదు.

అయితే అభిమాన సోదరులారా, ఒకరోజు ఏదో ఒక ముఖ్య.. ఒక ముఖ్యమైన పని మీద తండ్రి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని బయటకు పంపించారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు బయట ప్రపంచం గురించి ఎక్కువగా తెలియని వారు, ఆ పని మీద బయటకు వెళ్ళారు. వీధుల్లో నుంచి వెళుతూ ఉంటే ఒకచోట చర్చి ఉండింది, ఆ చర్చి లోపల నుంచి శబ్దాలు వస్తుండటాన్ని ఆయన గమనించారు. ఆ శబ్దాన్ని గమనించిన సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఏముందో చూద్దామని లోపలికి ప్రవేశించారు. వెళ్లి చూస్తే అక్కడ ప్రజలందరూ కలిసి పూజ చేస్తున్నారు. ఆయనకు చాలా నచ్చింది. నచ్చిన కారణంగా ఆయన అక్కడే చూస్తూ కూర్చుండిపోయాడు. సమయం గడిచిపోయింది. చీకటి అయిపోయింది కానీ ఆయన వచ్చిన పనిని మర్చిపోయాడు.

తర్వాత తండ్రి, సల్మాన్ ఫార్సీ వెళ్లి ఇంతవరకు రాలేదే అని వెతకటానికి వేరే మనుషుల్ని పంపించాడు. రాత్రి అయిన తర్వాత, చీకటి పడిన తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు తిరిగి నాన్న దగ్గరికి వెళ్ళారు. అప్పుడు నాన్నగారు సల్మాన్.. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి మీద కోపగించుకున్నారు. “నేను నీకు పంపించిన పని ఏమిటి? నువ్వు ఇంతవరకు ఎక్కడున్నావు? త్వరగా ఎందుకు రాలేదు? నువ్వు రాని కారణంగా ఇక్కడ అగ్ని ఆరిపోయింది. ఇక్కడ అగ్ని ఆరిపోకూడదు, ఆరిపోకుండా చూసుకోవలసిన బాధ్యత నీది” అని కోపగించుకున్నప్పుడు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు నాన్నగారితో అన్నారు: “నాన్నగారు, ఈరోజు నేను ఒక వింత విషయాన్ని చూశాను, అది నాకు చాలా నచ్చింది. ఒకచోట నేను కొంతమందిని చూశాను, వారు దేవుణ్ణి మరో రకంగా పూజిస్తున్నారు, వారి పూజా పద్ధతి నాకు చాలా నచ్చిందండి” అన్నారు.

అప్పుడు నాన్నగారికి చాలా కోపం వచ్చింది. “అరే! నీవు, నీ తండ్రులు, నీ తాతలు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తున్నారో ఆ ధర్మము నువ్వు చూసిన వారి ధర్మము కంటే గొప్పది రా, దీన్నే నువ్వు ఆచరించాలి” అన్నారు.

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అన్నారు: “లేదండి నాన్నగారు, మనం చేసేది నాకు నచ్చట్లేదు. మన చేతులతో మనము కాల్చిన అగ్నిని మళ్ళీ మనం పూజించడం ఏందండి? కొద్దిసేపు మనము అక్కడ కట్టెలు వేయకపోతే ఆ అగ్ని చల్లారిపోతుంది. దాన్ని మనము దేవుడని పూజించడం ఇది నాకు నచ్చలేదండి. చర్చిలో వాళ్ళు చేస్తున్న విషయం నాకు చాలా నచ్చిందండి, అదే నాకు మంచిదనిపిస్తోందండి” అన్నారు.

నాన్నగారికి విషయం అర్థమైపోయింది. బిడ్డ చేయి జారిపోతున్నాడని గమనించిన నాన్నగారు వెంటనే సంకెళ్లు వేసేసి ఆయనకు ఇంటిలోనే బంధించేశారు. బంధించేసిన తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఒక వ్యక్తి ద్వారా ఆ క్రైస్తవుల వద్దకు సందేశాన్ని పంపించారు. “ఏమండీ! మీరు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తున్నారో, ఈ ధర్మం ఎక్కడ పుట్టింది? ఈ ధర్మం యొక్క పునాదులు ఎక్కడున్నాయి? ఆ ప్రదేశం గురించి నాకు తెలియజేయండి” అన్నారు. ఆ వ్యక్తి అక్కడినుండి సమాధానం తీసుకొచ్చాడు, “ఈ ధర్మము ‘షామ’లో (అంటే షామ్ అంటే: ఫలస్తీన్, లబ్నాన్, జోర్డాన్ [ఉర్దున్] మరియు సిరియా.. ఈ పూర్తి భాగాన్ని ఆ రోజుల్లో ‘షామ్’ అనేవారు, తర్వాత దాన్ని నాలుగు ముక్కలుగా విభజించేశారు), ఆ షామ్.. ఆ షామ్ దేశంలో ఆ ధర్మం పుట్టింది, దాని యొక్క పునాదులు అక్కడే ఉన్నాయి” అని సమాధానం వచ్చింది. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారన్నారు: “ఎవరైనా ఆ దేశస్తులు మన దేశానికి వస్తే నాకు కబురు పంపించండి” అన్నారు.

అలాగే కొద్ది రోజుల తర్వాత కొంతమంది ఈ షామ్ దేశము నుండి ఈ ఇరాన్ దేశానికి వ్యాపారం నిమిత్తం వచ్చారు. అప్పుడు కొంతమంది వెళ్లి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి, “మీరు కోరుకున్నట్లుగానే షామ్ దేశస్తులు కొంతమంది వ్యాపారం నిమిత్తం ఇక్కడికి వచ్చి ఉన్నారు, మీరు వారితో కలవాలంటే కలవచ్చు” అన్నారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు ఏమన్నారంటే: “నేను ఇప్పుడు రాలేను, కలవలేను. వాళ్ళు మళ్లీ తిరిగి ప్రయాణం చేసేటప్పుడు నాకు కబురు పంపించండి” అన్నారు.

అలాగే వాళ్ళు తిరిగి మళ్ళీ వారి దేశానికి వెళుతున్నప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి కబురు పంపించగా, ఆయన ఏదో ఒకలాగా సంకెళ్లను తుంచుకుని వారితో పాటు కలిసి ఆ ఇరాన్ దేశము నుండి షామ్ దేశానికి ఆ వ్యాపారానికి వచ్చిన వ్యక్తులతో పాటు కలిసి వెళ్లిపోయారు. షామ్ వెళ్లిన తర్వాత అక్కడ ప్రజలతో చర్చించారు, “ఇక్కడ గొప్ప భక్తుడు అంటే ఎవరు? ఉత్తమమైన వ్యక్తి అంటే ఎవరు? వాని గురించి నాకు చెప్పండి, నేను ఆయన దగ్గరికి వెళ్లి శిష్యరికం చేరుకోవాలనుకుంటున్నాను” అన్నారు. అక్కడ ఒక పెద్ద చర్చి ఉంటే, ఆ చర్చిలో ఉన్న ఒక ఫాదర్ గురించి ఆయనకు తెలియజేయగా, ఆయన వెంటనే ఆ ఫాదర్ దగ్గరికి వెళ్లి: “అయ్యా, నేను ఫలానా దేశస్తుణ్ణి, నాకు అక్కడ ఉన్న విషయాలు నచ్చక మీ ధర్మాన్ని నేను ఇష్టపడి వచ్చాను కాబట్టి, నేను మీ దగ్గర శిష్యునిగా చేరాలనుకుంటున్నాను, అనుమతి ఉందా?” అని అడగ్గా, అతను “సరే బాబు నా దగ్గర నీవు శిష్యునిగా ఉండు” అని ఉంచుకున్నాడు.

ఆయన దగ్గర ఉండి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆయన నేర్పిన విధంగానే ధార్మిక విషయాలు నేర్చుకుని ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఆ పాదరి.. ఆ ఫాదర్ వద్ద ఒక చెడు అలవాటు ఉండేది, అది ఆయనకు నచ్చలేదు. ఆ అలవాటు ఏంటంటే, ఆయన ప్రజలకు దానధర్మాలు చేయండి అని చెప్పి బోధించేవాడు. ఆయన మాటలు విని ప్రజలు దానధర్మాలు తీసుకొని వచ్చి ఆయన చేతికి ఇస్తే, ఆ దానధర్మాల సొమ్ముని తీసుకొని వెళ్లి పేదలకు పంచకుండా అతను ప్రోగు చేసుకుని దాచుకునేవాడు. అది సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి నచ్చలేదు.

కొద్ది రోజుల తర్వాత అతని మరణం సంభవించింది. మరణం సంభవించక ముందు అతను దాచుకున్న సొమ్ము గురించి ఎవ్వరికీ చెప్పలేదు. ఒక్క సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి మాత్రమే తెలుసు. అతను మరణించిన తర్వాత ప్రజలందరూ ప్రోగయితే, అప్పుడు సల్మాన్ రజియల్లాహు అన్హు వారందరి ముందర కుండబద్దలు కొట్టేశారు. అదేమన్నారంటే: “అయ్యా, ఎవరినైతే మీరు గొప్ప వ్యక్తి అనుకుంటున్నారో, అతని యొక్క లక్షణం ఏమిటంటే మీరు ఇచ్చే సొమ్ముని ఆయన దాచుకున్నాడు. రండి చూపిస్తాను” అని చెప్పేసి ఆయన దాచుకున్న సొమ్ము మొత్తాన్ని చూపించేశారు. అప్పుడు ప్రజలకు పట్టరాని కోపం వచ్చింది. “ఎవరినైతే మేము గొప్ప వ్యక్తి అనుకున్నామో అతను ఇలాంటి మూర్ఖుడా” అని చెప్పి చాలా కోపగించుకున్నారు.

సరే, ఆ తర్వాత అతని స్థానంలో మరొక ఫాదర్ ని తీసుకొని వచ్చి అక్కడ ఉంచారు. ఆ ఫాదర్ చాలా గొప్ప వ్యక్తి, చాలా భక్తుడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అతని వద్ద శిష్యునిగా ఉండి దైవభక్తి, అలాగే దైవ ఆరాధనలో నిమగ్నమైపోయారు. రోజులు గడిచాయి. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆ ఫాదర్ వద్ద చాలా విషయాలు నేర్చుకున్నారు, ఆ ఫాదర్ ని చాలా ఇష్టపడ్డారు. అతనిలో ఎలాంటి తప్పులు ఆయన గమనించలేదు.

చివరికి కొద్ది రోజుల తర్వాత ఆయన మరణం సంభవించినప్పుడు, మరణానికి ముందు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అతని వద్ద వెళ్లి: “ఏమండీ, నేను ఫలానా దేశస్తుడిని, అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మీరు మరణిస్తున్నారు, మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్లి ఈ విషయాలు నేర్చుకోవాలి? దైవ ధర్మ ఆచరణ చేయాలి? మీరు చెప్పిన వ్యక్తి వద్ద నేను వెళతాను, ఎవరి దగ్గర వెళ్లాలో చెప్పండి” అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే: “చూడు నాయనా! నీవు ఒక మంచి వ్యక్తివి అనిపిస్తున్నావు కాబట్టి, నాలాంటి వ్యక్తి నీకు ఈ నగరంలో దొరకడు. నీవు ‘మోసుల్’ అనే నగరానికి వెళ్ళిపో, అక్కడ ఫలానా పేరు చెప్పు, ఆ వ్యక్తి వద్ద వెళ్లి నీవు శిష్యరికం చేయి, అతను కూడా మంచి వ్యక్తి” అన్నారు.

చూడండి, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు మళ్లీ అక్కడి నుండి మోసుల్ నగరానికి వెళ్ళారు. ఆ వ్యక్తి గురించి తెలుసుకున్నారు, ఆయన దగ్గర వెళ్లి జరిగిన విషయాలన్నీ చెప్పి: “అయ్యా, నాకు ఫలానా వ్యక్తి మీ వద్దకు పంపించాడు. నేను మీ వద్ద వచ్చి దైవ విషయాలు, దైవ భక్తి విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను, అనుమతి ఉందా?” అంటే ఆయన సంతోషంగా పిలుచుకున్నాడు. అతని వద్ద శిష్యరికం చేశారు. అతను కూడా చాలా గొప్ప భక్తుడు. అతని వద్ద కూడా సల్మాన్ రజియల్లాహు అన్హు కొద్ది రోజులు శిష్యరికం చేసిన తర్వాత, చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎలాంటి పరీక్షలకు గురి చేస్తున్నాడో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి, కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తికి కూడా మరణం సంభవించింది. మరణానికి ముందు ఆ వ్యక్తితో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జరిగిన విషయం అంతా చెప్పారు. “అయ్యా నేను ఇరాన్ దేశస్తుడిని, అక్కడి నుంచి మళ్ళీ షామ్ వచ్చాను, షామ్ నుంచి ఫలానా వ్యక్తి నాకు మీ దగ్గరికి పంపించాడు. ఇప్పుడు మీరు కూడా మరణిస్తున్నారు, నేను దైవ విషయాలు భక్తి విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్లి ఈ విషయాలు నేర్చుకోవాలి?” అని అడగ్గా, ఆయన ఏం చెప్పారంటే: “‘నసీబైన్’ అనే ఒక నగరం ఉంది, ఆ నగరంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లండి, అతనికంటే గొప్ప వ్యక్తి నా దృష్టిలో ఎవడూ లేడు” అన్నారు.

మళ్ళీ నసీబైన్ లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, ఆయన దగ్గర శిష్యరికం చేశారు. ఆయన కూడా చనిపోతూ ఉంటే ఆయన దగ్గర కూడా: “అయ్యా, మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్ళాలి?” అంటే, అప్పుడు ఆయన చెప్పాడు: “‘అమ్మూరియా’ అనే ఒక ప్రదేశం ఉంది అక్కడికి వెళ్లండి” అన్నారు. సరే అమ్మూరియా ప్రదేశానికి వెళ్ళారు, అక్కడ శిష్యరికం చేశారు. ఆయన కూడా చనిపోయే సమయం వచ్చింది. అల్లాహు అక్బర్! ఎన్ని చోట్ల చూడండి.. ఇరాన్ నుండి సిరియాకు, సిరియా నుండి మళ్ళీ మోసుల్ కు, మోసుల్ నుండి నసీబైన్ కు, నసీబైన్ నుండి మళ్ళీ అమ్మూరియాకు. ఇన్ని చోట్ల తిరుగుతున్నారు ఎవరి కోసమండి? డబ్బు కోసమా? ధనం కోసమా? ఆస్తి కోసమా? కేవలం భక్తి కోసం ఇన్ని చోట్ల తిరుగుతున్నారు అభిమాన సోదరులారా.

అమ్మూరియాలో వెళ్ళిన తర్వాత, అప్పుడు అక్కడున్న ఫాదర్ మరణించేటప్పుడు: “అయ్యా, నేను తిరుగుతూనే ఉన్నాను, మీ తర్వాత ఇక నేను ఎక్కడికి వెళ్లాలో చెప్పండి” అని చెప్పగా, అప్పుడు ఆయన ఒక్క మాట చెప్పాడు. గమనించండి అభిమాన సోదరులారా, ఇక్కడి నుంచి టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది విషయం. ఆయన ఏం చెప్పాడంటే: “నాయనా, నేడు ప్రపంచంలో పరిస్థితుల్ని చూస్తూ ఉంటే చివరి ప్రవక్త వచ్చే సమయం వచ్చేసింది అనిపిస్తుంది. చివరి ప్రవక్త గురించి నాకు తెలిసిన జ్ఞానం ఏమిటంటే, అతను అరబ్బు దేశస్తుడై ఉంటాడు.” ఎవరు చెప్తున్నారండి? ఒక చర్చికి గురువైన ఫాదర్ గారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? వారి శిష్యునికే చెప్తున్నారు. ఏమంటున్నారంటే: “చివరి ప్రవక్త వచ్చే సమయం వచ్చేసింది అని నాకు అనిపిస్తుంది, అతను అరబ్బు దేశస్తుడై ఉంటాడు” – మొదటి విషయం.

రెండవ విషయం ఏమిటంటే: “అతను పుట్టిన నగరము నుండి ప్రయాణము చేసి, రెండు పర్వతాల మధ్య ఒక నగరం ఉంటుంది, ఆ నగరంలో ఖర్జూర చెట్లు ఉంటాయి, ఆ నగరానికి వలస ప్రయాణం చేస్తాడు.” రెండు విషయాలు. మూడో విషయం ఏమిటంటే: “అతను ‘సదఖ’ (దానధర్మాలు) తినడు.” నాలుగో విషయం ఏమిటంటే: “‘హదియా’ – బహుమానంగా ఇచ్చిన విషయాలను తీసుకుంటాడు, తింటాడు.” ఐదవ విషయం ఏమిటంటే: “అతని రెండు భుజాల మధ్య అల్లాహ్ తరపు నుంచి ఒక స్టాంప్ ఉంటుంది, దాన్నే ‘మొహ్రె నబువత్’ (ప్రవక్త పదవికి సూచనగా) ఒక స్టాంప్ లాంటిది ఉంటుంది” అన్నారు. ఈ ఐదు సూచనలు చెప్పాడు ఆయన.

అయితే అభిమాన సోదరులారా! సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అమ్మూరియాలో ఉన్నప్పుడు కొంచెం కష్టపడి కొన్ని ఆవులను కూడా సంపాదించుకొని పెంచుకున్నారు. ఇక వెయిట్ చేస్తున్నారు. అరబ్బు దేశం నుంచి ఎవరైనా వ్యాపారం కోసం ఇక్కడికి వస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు, ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత కొంతమంది అరబ్బు దేశస్తులు ఆ ప్రదేశానికి వ్యాపారానికి వెళ్లారు. అప్పుడు ఆయన వెంటనే వారి దగ్గరికి వెళ్లి: “ఏమండీ నేను కూడా మీతో పాటు అరబ్బు దేశానికి వచ్చేస్తాను. కావాలంటే నా దగ్గర ఉన్న ఈ ఆవులన్నీ మీకు ఇచ్చేస్తాను. దయచేసి నన్ను మీరు మీతో పాటు అరబ్బు దేశానికి తీసుకెళ్లండి” అని విన్నవించుకున్నారు.

అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి విన్నపాన్ని తీసుకున్న వాళ్ళు, ఆవులని తీసుకొని, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని కూడా తీసుకొని అక్కడి నుంచి తిరిగి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. వచ్చిన వాళ్ళు మోసం చేశారు. ఆవులని లాక్కున్నారు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని మదీనాకి సమీపంలో ‘వాది అల్ ఖురా’ (ఇప్పుడు అది మదీనాలో కలిసిపోయింది, ఆ రోజుల్లో వాది అల్ ఖురా) అనే చోట తీసుకొని వచ్చి ఒక యూదుని చేతికి బానిసగా అమ్మేశారు. “అయ్యో నేను బానిసను కాదు” అని ఆయన మొత్తుకున్నా బలవంతంగా ఆయనను అమ్మేశారు.

అయితే ఆ యూదుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని తన వద్ద బానిసగా, ఖర్జూరపు తోటకు కాపలాదారిగా ఉంచుకున్నాడు. ఆయన అక్కడ ఉంటూనే రెండు పర్వతాల మధ్య కనిపిస్తున్న ఖర్జూర చెట్ల మధ్య కనిపిస్తున్న నగరాన్ని చూసుకున్నాడు. “అరే! నా గురువుగారు చెప్పిన నగరం లాగే ఈ నగరం కనిపిస్తా ఉంది” అని ఆయన మనసులో ఒక తపన, కోరిక కలిగింది. ఇక ప్రవక్త కోసం ఆయన తపిస్తున్నారు. ఆయన చెప్పినట్టుగా ప్రవక్త ఈ ప్రదేశానికే వస్తాడు అనే ఆలోచనలో ఆయన తపిస్తూ ఉన్నాడు.

మరి కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ యూదుడు ఏం చేశాడంటే, మదీనా నగరంలో ఉండే ఒక బంధువుకి అతనిని అమ్మేశాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఇక మదీనా నగరంలోనే ‘బనూ ఖురైజా’ అనే చోటికి వచ్చేశారు. అక్కడికి వచ్చేసిన తర్వాత ఆయనకు నమ్మకం కుదిరింది, ఆయన చెప్పినట్లుగానే ఇక్కడ ఖర్జూర చెట్లు ఉన్నాయి, రెండు పర్వతాల మధ్య ఈ నగరం ఉంది. ఇక ప్రవక్త రావడమే తరువాయి. “ప్రవక్త గారు ఎప్పుడు వస్తారు? ప్రవక్త గారు ఎప్పుడు వస్తారు? నా కోరిక ఎప్పుడు తీరుతుంది?” అని చెప్పి ఆయన ఎదురుచూస్తున్నారు, తపిస్తూ ఉన్నారు అభిమాన సోదరులారా.

రోజులు గడిచాయి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కాలో ప్రవక్త పదవి ఇచ్చిన తర్వాత, 13 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఆయనను చంపాలని ప్రయత్నం చేశారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త వారికి మక్కా నుండి మదీనాకు వెళ్లిపోమని ఆదేశించినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వెళుతూ వెళుతూ ముందు ఎక్కడ దిగారండి? ‘ఖుబా’లో దిగారు.

ఖుబాలో దిగినప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఖర్జూరపు చెట్టు మీద నిలబడి ఉంటే, ఆయన యజమాని వద్ద ఒక బంధువు వచ్చి: “ఏమండీ! మీకు తెలుసా? కొంతమంది ఖుబాకు వెళుతున్నారు. అక్కడ ఎవడో మక్కా నుంచి ఒకడు వచ్చాడంట. ఆయన గురించి అందరూ ‘ప్రవక్త ప్రవక్త’ అని చెప్పుకుంటున్నారు” అని చెప్పేశాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి చెవులు ఆ మాట పడగానే కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి. ఎంతగా ఆయన సంతోషించాడంటే, ఇక కళ్ళు తిరిగి పడిపోతారేమో అని అనిపించింది. ఆ తర్వాత “ఏమైంది? ఎవరు? ఎవరు?” అని చెప్పేసి దగ్గరికి వచ్చి అడగ్గానే, యజమాని కోపంతో, “బానిస నువ్వయ్యి మా మధ్యలో వస్తావా? మా మాటల్లో మాట కలుపుతావా?” అని చెప్పేసి గట్టిగా గుద్దాడు. “వెళ్లి పని చూసుకో” అన్నాడు.

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు సాయంత్రం వరకు వేచి చూసి, ఆయన దగ్గర ఉన్న కొద్ది మొత్తం తినే పదార్థాన్ని తీసుకొని, ఖుబాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్న చోటికి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆయన ఎలా పరీక్షిస్తున్నారో చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చేసి, ఆ తినే పదార్థాన్ని ఆయన చేతికి ఇస్తూ ఏమంటున్నారంటే: “అయ్యా, మీరు గొప్ప భక్తుల్లాగా అనిపిస్తున్నారు. మీతో పాటు ఉన్న మీ శిష్యులు కూడా చాలా ఆకలితో ఉన్నట్టు అనిపిస్తోంది. కాబట్టి ఇది నా తరపు నుంచి ‘సదఖ’ – తీసుకోండి” అన్నారు.

‘సదఖ తీసుకోండి’ అని చెప్పగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొని శిష్యులకు ఇచ్చేశారు. శిష్యులు తిన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తినలేదు. అది గమనించిన సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు కన్ఫర్మ్ చేసుకున్నారు, “ఆ! ఈయన సదఖ తినట్లేదు.” ఒక విషయం కన్ఫర్మ్ అయిపోయింది.

మళ్ళీ ఇంటికి వెళ్లారు. కొద్ది రోజుల తర్వాత ఆయన దగ్గర ఉన్న మరీ కొన్ని పదార్థాలను తీసుకొని.. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉంటే మళ్ళీ మదీనాకు వెళ్లారు. మదీనాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శిష్యులతో పాటు కూర్చొని ఉంటే, “అయ్యా, ఇది నా తరపు నుండి ‘హదియా’ – బహుమానం” అని చెప్పారు. చెప్పగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొని, తానూ తిన్నారు, శిష్యులకు తినిపించారు. రెండో విషయం కన్ఫర్మ్ అయిపోయింది. సదఖ తినట్లేదు, హదియా తింటున్నారు.

ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక జనాజా వెంబడి వెళుతూ ఉంటే, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆయన వెంటవెంట వెళ్లి అటు ఇటు అటు ఇటు ఎదురుచూస్తున్నారు. “ఎప్పుడెప్పుడు ఆయన బట్ట జారుతుంది, ఆ రెండు భుజాల మధ్య ఉన్న ఆ గుర్తుని నేను చూడాలి” అని వెనక వెనకే వెనక వెనకే ఆయన కదులుతూ ఉంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గమనించేశారు. ఇతను వెనుక నుంచి ఏదో కోరుకుంటున్నాడు అని అర్థం చేసుకున్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వెంటనే బట్టను అక్కడి నుంచి పక్కకు జరపగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వీపు మీద ఉన్న ఆ ముద్రను చూసి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ముద్దు పెట్టుకొని: “ఓ దైవ ప్రవక్త! నేను మీకోసం ఇంతగా తపించాను, ఫలానా దేశం నుండి ప్రయాణం చేశాను, ఫలానా ఫలానా ఫలానా చోటికి నేను తిరిగాను, మీకోసం ఎదురు చూశాను, చివరికి బానిసగా మారిపోయాను, ఇక్కడ నన్ను బానిసగా చేసేసారు, మీకోసం నేను ఎదురుచూస్తున్నాను ఓ దైవ ప్రవక్త” అని చెప్పేసి ఏడ్చారు.

అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం: “ఓ సల్మాన్! వెనుక నుండి ముందుకు రా” అని చెప్పి, ముందర కూర్చోబెట్టి జరిగిన పూర్తి కథను విన్నారు.

ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సల్మాన్ తో అన్నారు: “ఓ సల్మాన్! నీవు ఒక మంచి సమయాన్ని చూసుకొని, నీ యజమానితో ‘నేను పరిహారం చెల్లించేస్తాను నన్ను స్వతంత్రుడ్ని చేసేయ్’ అని అడుగు. అతను ఏం కోరతాడో అది ఇచ్చేద్దాం” అన్నారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వెళ్లారు. సమయం కోసం ఎదురుచూశారు. సమయం కోసం ఎదురుచూసిన తర్వాత ఒకరోజు యజమానితో చెప్పారు: “అయ్యా, మీకు ఏం కావాలో చెప్పండి నేను చెల్లించేస్తాను, నాకు మాత్రం విముక్తుడిని చేసేయండి ఈ బానిస నుండి” అన్నాడు.

అప్పుడు ఆయన ఏమన్నాడంటే: “నాకు మూడు వందలు లేదా ఐదు వందల ఖర్జూరపు చెట్లు నాటి ఇవ్వు. ఆ తర్వాత 400 ల బంగారు నాణాలు ఇవ్వు” అని షరతు పెట్టాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చి: “ఓ దైవ ప్రవక్త! నా యజమాని ఈ విధంగా షరతు పెట్టాడండి” అని చెప్పారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలతో అన్నారు: “ఏమండీ! మీ సోదరుడిని ఆదుకోండి” అన్నారు. అప్పుడు సహాబాలందరూ కలిసి, ఒక్కొక్కరు 10 చెట్లు, 20 చెట్లు, 30 చెట్లు, 40 చెట్లు.. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎవరికి ఎంత శక్తి ఇచ్చాడో అన్ని ఖర్జూరపు చెట్లు తీసుకొని వెళ్లి అక్కడ 500 ల ఖర్జూరపు చెట్లు నాటేశారు.

నాటే ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట చెప్పారు, అదేమిటంటే: “గుంతలు తవ్వండి. నాటే ముందు నన్ను పిలవండి, నేను వచ్చి ప్రారంభిస్తాను” అన్నారు. గుంతలు తవ్వారు. ఖర్జూరపు చెట్లు సిద్ధంగా ఉంచారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పిలవగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్లి అక్కడ ‘బిస్మిల్లాహ్’ అని చెప్పి ఖర్జూరపు చెట్లు నాటడం ప్రారంభించిన తర్వాత, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు చెప్పారు: “అక్కడ నాటిన 500 ల చెట్లలో ఏ ఒక్క చెట్టు కూడా మరణించలేదు, అన్నీ బ్రతుక్కున్నాయి.” అన్నీ బ్రతికిన తర్వాత, యజమానితో: “ఏమండీ మీరు చెప్పినట్లుగానే 500 ల ఖర్జూరపు చెట్లు నాటేశాము, ఇక బంగారు నాణాలు మాత్రమే ఇవ్వవలసి ఉంది.”

కొద్ది రోజుల తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి కొంచం బంగారం వచ్చింది. ఆ బంగారాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి చేతికి ఇచ్చి: “ఓ సల్మాన్! ఇది తీసుకొని వెళ్లి నిను యజమానికి ఇచ్చేయ్” అన్నారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆ బంగారాన్ని తీసుకొని వెళ్లి యజమానికి ఇవ్వగా, అతను తూచాడు. తూచితే 400 ల బంగారు నాణాలకు సమానంగా అది ఉండింది. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి అతను బానిసత్వం నుండి విముక్తిని ఇస్తూ స్వతంత్రుడ్ని చేసేసాడు.

అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చిన తర్వాత బదర్ సంగ్రామం జరిగింది, అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు అందులో పాల్గొనలేదు, ఎందుకంటే ఆయన బానిసగా ఉన్నారు. ఆ తర్వాత ఉహద్ సంగ్రామం జరిగింది, ఆ సంగ్రామంలో కూడా సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు పాల్గొనలేదు. కారణం ఏమిటంటే ఆయన బానిసగా అక్కడ ఉండిపోయారు.

ఆ తర్వాత ఐదవ సంవత్సరంలో ఎప్పుడైతే మక్కా వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరియు ముస్లింలను ఇస్లాం ధర్మాన్ని అణచివేయాలని వచ్చారో, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా కంగారు పడ్డారు. ఎందుకంటే పేద పరిస్థితి, ఆపైన కరువు. ఈ రెండు విషయాల వల్ల మళ్లీ శత్రువును ఎదుర్కోవాలంటే చాలా భయంకరమైన పరిస్థితి ఉండింది కాబట్టి, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలను కూర్చోబెట్టి: “ఏమి చేయాలి? ఎలా శత్రువుని ఎదుర్కోవాలి?” అని ప్రశ్నించినప్పుడు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలహా ఇచ్చారు. అదేమిటంటే: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మనం మదీనాకు నలువైపుల నుండి కందకాన్ని తవ్వేద్దాం. మా దేశంలో, ఇరాన్ లో ఇలాగే చేస్తాం” అన్నారు.

అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆయన ఇచ్చిన సలహా నచ్చింది. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, సహాబాలకు ఆదేశించారు, అక్కడ కందకం తవ్వేశారు. అయితే అభిమాన సోదరులారా, సమయం ఎక్కువైపోయింది. చివరిగా రెండు మాటలు చెప్పి ముగిస్తున్నాను. అదేమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి చేరుకున్న తర్వాత, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద శిష్యునిగా ఉండి, ఎంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇష్టపడ్డారు, అభిమాన పడ్డారు. దైవ ధర్మాన్ని బాగా నేర్చుకున్నారు. అల్లాహ్ ఆరాధన నేర్చుకుని, అల్లాహ్ మార్గంలో ఆయన ప్రతిచోట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహకరించారు.

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ఆయన అన్నారు: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మీరు కందకంలో ఒకచోట గొడ్డలితో కొడుతూ ఉంటే అక్కడ తెల్లటి మెరుపు నేను చూశాను, అదేంటి?” అని అడిగారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: “దాన్ని నువ్వు చూశావా?” అంటే సల్మాన్ ఫార్సీ, “అవునండి నేను చూశాను” అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: “ఆ మెరుపులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాకు ఇరాన్ మరియు ఇరాన్ లో ఉన్న నగరాలన్నింటిని చూపించాడు. ఆ నగరాలన్నింటి చోట నా ధర్మము చేరిపోతుంది” అన్నారు. అల్లాహు అక్బర్!

అది విన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఆ మాట విన్న తర్వాత సల్మాన్ ఫార్సీ అన్నారు: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! అక్కడ దైవ ధర్మం చేరే సమయానికి నేను కూడా అందులో పాల్గొనాలనే దువా చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కోసం దువా చేశారు. అలాగే సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు బ్రతికి ఉండగానే ఆయన దేశానికి ఇస్లాం ధర్మం చేరిపోయింది.

ఆ తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు దైవాన్ని ఆరాధిస్తూ, దైవ ధర్మ సేవ కొరకు పోరాడుతూ ఆయన ఈ ప్రపంచం నుంచి తనువు చాలించారు. అల్లాహ్ తో నేను దువా చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ ఇస్లాం ధర్మం మీద నిలకడగా నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ఇస్లాం ఆచరించే మార్గంలో ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా, సులభంగా ఇస్లాం ధర్మాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. పరీక్షల్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని నెగ్గించుగాక.

అకూలు కౌలి హాజా, అస్తగ్ఫిరుల్లాహ లి వలకుమ్ వ లిసాయరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్.


సహాబా (రదియల్లాహు అన్హుమ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1KN6AyXdv30x30ykoVkyVt

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

బిలాల్ (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర – Bilal bin Rabah [ఆడియో]

బిస్మిల్లాహ్

[23 నిముషాలు]
సలీం జామిఈ హఫిజహుల్లాహ్

సహాబా (రదియల్లాహు అన్హుమ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1KN6AyXdv30x30ykoVkyVt

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ఆదం (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియోలు | టెక్స్ట్]

ఆదం (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – యూట్యూబ్ ప్లే లిస్ట్ [3 భాగాలు]
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0ZDGMr5t5ob5y_APUUiX6A

ఆదం (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – (పార్ట్ 1)
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిదహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=TJlbNHv1IX8

ఈ ప్రసంగం మానవుని సృష్టికి సంబంధించిన ఇస్లామీయ గాథను వివరిస్తుంది. అల్లాహ్ దైవదూతలను కాంతి నుండి, జిన్నాతులను అగ్ని నుండి సృష్టించిన తరువాత, భూమండలంలోని మట్టితో మొదటి మానవుడైన ఆదం (అలైహిస్సలం)ను తన స్వహస్తాలతో సృష్టించాడు. అల్లాహ్ ఆదం (అలైహిస్సలం)కు వస్తువుల పేర్ల జ్ఞానాన్ని నేర్పి, దైవదూతల కంటే ఆయన శ్రేష్ఠతను చాటాడు. తరువాత, ఆదం (అలైహిస్సలం) పక్కటెముక నుండి హవ్వా (అలైహస్సలాం)ను సృష్టించి, వారిద్దరినీ స్వర్గంలో నివసించమని ఆజ్ఞాపించాడు, అయితే ఒక నిర్దిష్ట వృక్ష ఫలాన్ని తినవద్దని నిషేధించాడు. అహంకారం కారణంగా స్వర్గం నుండి బహిష్కరించబడిన ఇబ్లీస్ (షైతాన్), వారిద్దరినీ ప్రలోభపెట్టి ఆ ఫలాన్ని తినేలా చేశాడు. ఈ అవిధేయత కారణంగా, ఆదం మరియు హవ్వా (అలైహిమస్సలాం) కూడా స్వర్గం నుండి బహిష్కరించబడ్డారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మొదటి మనిషి ఎవరు? మొదటి మనిషి ఎలా సృష్టించబడ్డాడు? దేనితో సృష్టించబడ్డాడు? ప్రారంభంలో మనిషి ఆకారము ఎలా ఉండేది? మొదటి మానవుని పేరు ఏమిటి? ప్రారంభంలో మనిషి అజ్ఞానినా? మరి అతనికి జ్ఞానం ఎలా ఇవ్వబడింది? మొదటి మహిళ ఎవరు? ఆమె పేరు ఏమిటి? ఆమె ఎలా సృష్టించబడింది? మానవులు ప్రారంభంలో స్వర్గంలో ఉన్నారంట, నిజమేనా? షైతాన్ అంటే ఎవరు? దేనితో సృష్టించబడ్డాడు? పుట్టుకతోనే షైతాను చెడ్డవాడా? లేక మధ్యలో ఏదైనా కారణంగా అతనిలో ఇలాంటి మార్పు వచ్చిందా? ఈ విషయాలు నేటి మన ప్రసంగంలో ఇస్లామీయ ధార్మిక గ్రంథాల వెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మిత్రులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా భూమి ఆకాశాలను, వాటి మధ్య ఉన్న సమస్తాన్ని సృష్టించాడు. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే, దూతల్ని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సృష్టించాడు. దైవదూతల్ని కాంతితో సృష్టించాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రవక్త వారి పలుకులు:

خُلِقَتِ الْمَلَائِكَةُ مِنْ نُورٍ
[ఖులికతిల్ మలాయికతు మిన్నూర్]
దైవదూతలు కాంతితో సృష్టించబడ్డారు.

మిత్రులారా, దైవదూతల సంఖ్య అనేకం. అల్లాహ్ ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించటం వారి పని. అల్లాహ్ ఆజ్ఞలను అతిక్రమించడం, పాపాలకు పాల్పడటం వారి స్వభావంలోనే లేదు. అలాంటి భక్తి కలిగిన ఉత్తమ జీవులు, మంచి జీవులు దైవదూతలు.

ఆ తర్వాత మనం చూచినట్లయితే, జిన్నాతులని కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సృష్టించాడు. జిన్నాతులను అగ్ని జ్వాలతో సృష్టించాడు అని తెలుపబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

وَخَلَقَ الْجَانَّ مِنْ مَارِجٍ مِنْ نَارٍ
[వ ఖలఖల్ జాన్న మిమ్మా రిజిమ్ మిన్నార్]
మరియు జిన్నులను అగ్ని జ్వాలతో సృష్టించాడు. (55:15)

అభిమాన సోదరులారా, జిన్నాతులలో ముఖ్యమైన వాడు ఇబ్లీస్. అతని ప్రస్తావన మున్ముందు ఇన్ షా అల్లాహ్ వస్తుంది.

ఆ తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా భూమండలంలోని రకరకాల మట్టి నమూనాలను సేకరించి, తన స్వహస్తాలతో ఒక ఆకారాన్ని తయారు చేశాడు. ఆ ఆకారాన్ని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తయారు చేసి కొద్ది రోజుల వరకు అలాగే వదిలేసినప్పుడు, అటువైపు నుంచి దైవదూతలు మరియు జిన్నాతులు వస్తూ వెళ్తూ, వస్తూ వెళ్తూ ఆ ఆకారాన్ని చూసి, ఏదో కొత్త జీవి సృష్టించబడుతున్నది అని అర్థం చేసుకున్నారు.

ఒకసారి అయితే అల్లాహ్ మరియు దైవదూతల మధ్య ఆ కొత్త జీవి గురించి సంభాషణ కూడా జరిగింది. ఆ సంభాషణ ఖుర్ఆన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు. దైవదూతలు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో ప్రశ్నించారు, “ఓ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, ఎవరు ఈ కొత్త జీవి?” అని అడిగినప్పుడు, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సమాధానం ఇచ్చాడు:

إِنِّي جَاعِلٌ فِي الْأَرْضِ خَلِيفَةً
[ఇన్నీ జాఇలున్ ఫిల్ అర్ది ఖలీఫా]
“నిశ్చయంగా నేను భూమిపై నా ప్రతినిధిని (ఖలీఫాను) నియమించబోతున్నాను.” (2:30)

దానికి దైవదూతలు ఒక సందేహం వ్యక్తపరిచారు. ఆ సందేహం ఏమిటంటే:

أَتَجْعَلُ فِيهَا مَنْ يُفْسِدُ فِيهَا وَيَسْفِكُ الدِّمَاءَ وَنَحْنُ نُسَبِّحُ بِحَمْدِكَ وَنُقَدِّسُ لَكَ
[అతజ్ అలు ఫీహా మయ్యుఫ్సిదు ఫీహా వయస్ఫికుద్దిమా వనహ్ను నుసబ్బిహు బిహందిక వనుఖద్దిసులక్]
“మేము నీ పవిత్రతను కొనియాడుతూ, నీ స్తోత్రపాఠాలు చేస్తూ ఉండగా, నువ్వు భూమిలో కల్లోలం రేకెత్తించి, రక్తం ప్రవహింపజేసే వాడిని నియమిస్తావా?” అని అడిగారు. (2:30)

ఓ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, నీవు భూమిలో కల్లోలాన్ని రేకెత్తించి, రక్తం ప్రవహింపజేసేవాణ్ణి ఎందుకు సృష్టిస్తున్నావు? నిన్ను కొనియాడటానికి, నిన్ను స్తుతించటానికి, నీ నామాన్ని ఉచ్చరించటానికి మేము ఉన్నాము కదా? అని దైవదూతలు అడిగారు.

మిత్రులారా, ఇక్కడ మనం ఒక్క నిమిషం ఆగి ఒక విషయం ఆలోచించాలి. అదేమిటంటే, ఇంకా ఒక ఆకారము సృష్టించబడింది, ఆ జీవి ఇంకా ఉనికిలోనికే రాలేదు. అయితే దైవదూతలకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? ఈ జీవి భూమిలో రక్తపాతాలు సృష్టించుకుంటాడన్న సందేహము ఎందుకు వచ్చింది? అంటే, ధార్మిక పండితులు దాని వివరణ ఇలా తెలియజేశారు: ఇప్పటివరకు మనం విన్నాం, మానవుని కంటే ముందు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దైవదూతల్ని, జిన్నాతుల్ని సృష్టించాడని. ఆ జిన్నాతులను అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సృష్టించి భూమి మీద నివసింపజేసినప్పుడు, ఆ జిన్నాతులు పరస్పరం గొడవ పడ్డాయి, రక్తపాతాలు సృష్టించుకున్నాయి. తత్కారణంగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దూతల్ని పంపించి వారిని శిక్షించాడు. దైవదూతలు వచ్చి జిన్నాతులను ఇక్కడి నుంచి తరిమేసి సముద్రాల మధ్య ఉన్న దీవుల్లోకి పరిమితం చేసేశారు. అంటే, మనిషి కంటే ముందు ఒక జీవిని భూమి మీద అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నివసింపజేస్తే, వారు పరస్పరం గొడవపడ్డారు, వారు రక్తపాతాలు సృష్టించుకున్నారు కదా! కాబట్టి దైవదూతలకు ఆ సందేహం కలిగి, వారు “ఈ జీవి కూడా అలాగే రక్తపాతాలు సృష్టించుకుంటాడేమో” అని అల్లాహ్ ముందర సందేహం వ్యక్తపరిచారు.

దానికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇచ్చిన సమాధానం ఏమిటంటే:

إِنِّي أَعْلَمُ مَا لَا تَعْلَمُونَ
[ఇన్నీ ఆ’లము మాలా తా’లమూన్]
“నాకు తెలిసింది మీకు తెలియదు” అని సమాధానమిచ్చాడు. (2:30)

మిత్రులారా, రోజులు గడిచాయి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తన స్వహస్తాలతో సృష్టించిన ఆ ఆకారంలో తను సృష్టించిన ఆత్మను ఊదాడు. “వ నఫఖ్తు ఫీహి మిర్రూహీ” అని తెలుపబడింది మిత్రులారా. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆత్మను ఆ ఆకారంలోకి ఊదినప్పుడు, ఆ ఆకారం శరీర అవయవాలు ఒక్కొక్కటిగా, ఒక్కొక్కటిగా ఏర్పడటం ప్రారంభించింది. చూస్తూ ఉండంగానే మనిషి సంపూర్ణంగా అవతరించాడు.

అభిమాన సోదరులారా, మనిషి శరీరం తయారయ్యింది, మానవుడు పూర్తిగా తయారైపోయాడు. అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ముందర మనిషి నిలబడినప్పుడు, అతనికి తుమ్ము వచ్చింది. అల్లాహ్ ఆజ్ఞతో మనిషి “అల్ హందులిల్లాహ్” అని పలికాడు. మిత్రులారా, మనిషి సృష్టించబడిన తర్వాత అతని నోటి నుండి వచ్చిన మొదటి పలుకు “అల్ హందులిల్లాహ్”, అనగా అల్లాహ్ కు కృతజ్ఞతలు. ఆ మాట వినగానే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనిషికి సమాధానం ఇచ్చాడు. ఏమని సమాధానం ఇచ్చాడంటే “యర్ హముకల్లాహు యా ఆదం“, ఓ ఆదం, అల్లాహ్ నీ మీద కరుణించాడు. ఆ విధంగా మొదటి మనిషికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అని పిలిచి, ఆదం అనే నామకరణం చేశాడు.

అభిమాన సోదరులారా, ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మొదటి మనిషి అయిన ఆదం అలైహిస్సలం వారికి, అక్కడ కూర్చొని ఉన్న దైవదూతల వద్దకు వెళ్లి వారికి సలాము చెప్పు అని ఆదేశించాడు. ఆదం అలైహిస్సలం దైవదూతల వద్దకు వెళ్లి “అస్సలాము అలైకుం” అని సలాం పలికారు. దానికి దైవదూతలు “వ అలైకుముస్సలాం వ రహ్మతుల్లాహ్” అని సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం విని ఆదం అలైహిస్సలం అల్లాహ్ వద్దకు వచ్చేసి, “ఓ అల్లాహ్, నేను దైవదూతలకు అస్సలాము అలైకుం అని సలాం చెబితే, వారు వ అలైకుముస్సలాం వ రహ్మతుల్లాహ్ అని సమాధానం ఇచ్చారు” అని చెప్పారు. అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలం వారితో అన్నాడు, “ఓ ఆదం, నీకు మరియు నీ సంతానానికి పరస్పరం పలకరించుకోవడానికి ఇవే పలుకులు నేను ఇస్తున్నాను” అని చెప్పాడు.

మిత్రులారా, ఆ నాటి నుండి ఈ నాటి వరకు కూడా, ఇన్ షా అల్లాహ్ ప్రళయం వరకు కూడా, అల్లాహ్ భక్తులు పరస్పరం ఎదురైనప్పుడు ఇవే పలుకులతో పలకరించుకుంటూ ఉంటారు. ఇక్కడ నాకు మరొక విషయం గుర్తుకు వస్తూ ఉంది. సందర్భానుసారం అది కూడా నేను వివరించి ముందుకు సాగుతాను మిత్రులారా. అదేమిటంటే, అస్సలాము అలైకుం, వ అలైకుముస్సలాం వ రహ్మతుల్లాహ్ – ఈ పలుకులు ఏ ధర్మంలో తెలియజేయబడ్డాయి మరియు ఏ ధర్మాన్ని అవలంబించే వాళ్ళు పలుకుతున్నారు? అందరూ ముక్తకంఠంతో ఒకే మాట చెబుతారు, అదేమిటంటే “ఈ పలుకులు ఇస్లాం ధర్మంలో మాత్రమే నేర్పబడ్డాయి, మరియు ఇస్లాం ధర్మాన్ని ఆచరిస్తున్న ముస్లింలు మాత్రమే ఈ పలుకులు పలుకుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం” అంటారు. అయితే ఇప్పుడు చెప్పండి, ఈ పలుకులు ఇస్లామీయ ధర్మం పలుకులు అయితే, మరి ఇస్లాం ధర్మం ఎప్పటి నుంచి మొదలైంది అండి? మనిషి పుట్టుక నుండే ఇస్లామీయ ధర్మము ఉంది, ఇస్లామీయ ధార్మిక నియమాలు కూడా ఉన్నాయి అని మనకి ఇక్కడ స్పష్టమవుతుంది.

ఆ తర్వాత మిత్రులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలం వారి వీపు మీద తన చేయితో స్పర్శించగా, అక్కడ చాలా ఆత్మలు ఉనికిలోకి వచ్చాయి. వాటన్నిటికీ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కాంతిని ప్రసాదించాడు, అవి మెరిసిపోతూ ఉన్నాయి. అది చూసి ఆదం అలైహిస్సలం వారు, “ఓ అల్లాహ్, ఎవరు వీరు?” అని అడిగారు. అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలం వారితో అన్నాడు, “వీరంతా రాబోయే నీ సంతానము” అని చెప్పాడు.

ఆదం అలైహిస్సలం వారందరినీ బాగా గమనిస్తే, ఒక ఆత్మ వద్ద కాంతి చాలా ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంది. ఆయనను చూసి ఆదం అలైహిస్సలం అల్లాహ్ తో అడిగారు, “ఓ అల్లాహ్, అక్కడ కొంచెం ఎక్కువగా కాంతి ప్రకాశిస్తూ ఉంది, అతను ఎవరు?” అని ప్రత్యేకంగా అడిగారు. దానికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అన్నాడు, “ఇతను నీ బిడ్డ దావూద్, అతని ఆయుష్షు 40 సంవత్సరాలు” అన్నాడు. అది విని ఆదం అలైహిస్సలం వారు అల్లాహ్ తో అన్నారు, “ఓ అల్లాహ్, అతనికి కేవలం 40 సంవత్సరాలే ఆయుష్షానా? నా ఆయుష్షులో నుంచి ఒక 60 సంవత్సరాలు తీసి అతని ఆయుష్షులో కలిపేయండి” అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో కోరారు. ఆయన కోరిక మేరకు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆజ్ఞతో అలాగే 60 సంవత్సరాలు దావూద్ అలైహిస్సలం వారి ఆయుష్షులో పెంచడం జరిగింది. ఆ విధంగా దావూద్ అలైహిస్సలం వారి ఆయుష్షు 100 సంవత్సరాలు అయింది మిత్రులారా.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలం వారికి విద్య నేర్పాడు, వస్తువుల పేర్లు నేర్పాడు, వాటి వినియోగం కూడా నేర్పాడు అని ధార్మిక పండితులు తెలియజేశారు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథంలో తెలియజేశాడు:

وَعَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا
[వ అల్లమ ఆదమల్ అస్మాఅ కుల్లహా]
తరువాత అల్లాహ్‌ ఆదంకు అన్ని వస్తువుల పేర్లను నేర్పాడు. (2:31)

అంటే, మనిషి పుట్టిన తర్వాత అల్లాహ్ తరఫు నుండి ఆయనకు జ్ఞానం ఇవ్వబడింది అన్న విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఆ తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దైవదూతలను పిలిచి, దైవదూతల ముందర ఆ వస్తువులన్నింటినీ ప్రవేశపెట్టి, అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దైవదూతలతో మరొక ప్రశ్న అడిగాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే:

أَنْبِئُونِي بِأَسْمَاءِ هَؤُلَاءِ إِنْ كُنْتُمْ صَادِقِينَ
[అంబిఊనీ బి అస్మాఇ హాఉలాఇ ఇన్ కున్తుం సాదిఖీన్]
“మీరు సత్యవంతులే అయితే, వీటి పేర్లు చెప్పండి” అని అన్నాడు. (2:31)

ఇక్కడ కనిపిస్తున్న వస్తువుల పేర్లు నాకు చెప్పండి అంటే, దైవదూతలు అల్లాహ్ తో అన్నారు:

سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا إِنَّكَ أَنْتَ الْعَلِيمُ الْحَكِيمُ
[సుబ్ హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీమ్]
వారంతా ఇలా అన్నారు : “(ఓ అల్లాహ్‌!) నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయంగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవూ నీవే!” (2:32)

అంటే, వీటి జ్ఞానము మాకు లేదు, మేము చెప్పలేము అని దైవదూతలు అక్కడ చెప్పేశారు. అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ ఆదం అలైహిస్సలం వారితో, “ఓ ఆదం, వీటి పేర్లు నువ్వు తెలుపు” అని ఆదేశించాడు. అప్పుడు ఆదం అలైహిస్సలం అక్కడ ఉన్న వస్తువుల పేర్లన్నీ చకచకా తెలియజేశారు. ఇది నది, ఇది భవనము, ఇది వృక్షము, ఇది ఫలము, ఈ విధంగా వస్తువుల పేర్లన్నీ ఆయన పలికేశారు. మిత్రులారా, అప్పుడు దూతలకు అర్థమయింది, ఈ కొత్త జీవిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, ముఖ్యంగా విద్య ఉంది, జ్ఞానం ఉంది అని. అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కూడా దూతలతో అన్నాడు, “నేను ముందే మిమ్మల్ని చెప్పాను కదా, నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు అని. ఇందులో, ఈ కొత్త జీవిలో ఈ ప్రత్యేకతలు ఉన్నాయి, చూడండి” అన్నాడు.

ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దూతలందరినీ ఆదం అలైహిస్సలం వారి ముందర సాష్టాంగపడమని, సజ్దా చేయమని ఆదేశించాడు. అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం, దైవదూతలందరూ సజ్దా చేశారు, సాష్టాంగపడ్డారు. కానీ, అప్పటికే ఎంతో గౌరవ మర్యాదలతో స్వర్గంలో ఉన్నతమైన స్థానంలో ఉంటున్న ఇబ్లీస్ మాత్రం సాష్టాంగపడలేదు.

అది చూసి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇబ్లీస్ తో అడిగాడు:

يَا إِبْلِيسُ مَا مَنَعَكَ أَنْ تَسْجُدَ لِمَا خَلَقْتُ بِيَدَيَّ
[యా ఇబ్లీసు మా మనఅక అన్ తస్జుద లిమా ఖలఖ్తు బియదయ్య]
“ఓ ఇబ్లీస్‌! నేను నా స్వహస్తాలతో సృష్టించిన వానిముందు సాష్టాంగపడకుండా ఏ విషయం నిన్ను ఆపింది?” (38:75)

దానికి ఇబ్లీస్ అల్లాహ్ కు సమాధానం ఇచ్చాడు, చూడండి ఏమంటున్నాడో:

قَالَ أَنَا خَيْرٌ مِنْهُ خَلَقْتَنِي مِنْ نَارٍ وَخَلَقْتَهُ مِنْ طِينٍ
[ఖాల అన ఖైరుమ్ మిన్హు ఖలఖ్తనీ మిన్నారిన్ వ ఖలఖ్తహు మిన్తీన్]
“నేను అతనికంటే ఘనుడను. (ఎందుకంటే) నీవు నన్ను అగ్నితో సృష్టించావు. అతన్నేమో మట్టితో సృష్టించావు” అని వాడు సమాధానమిచ్చాడు. (38:76)

అంటే, నేను అతని కంటే గొప్పవాణ్ణి, అగ్నితో పుట్టినవాణ్ణి కదా, నేను గొప్పవాణ్ణి. అతను మట్టితో పుట్టాడు కదా, అతను అల్పుడు అని అతను భావించాడు. ఒక రకంగా చెప్పాలంటే, అతను లోలోపల గర్వపడ్డాడు, అహంకారానికి గురయ్యాడు. అదే విషయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ లో కూడా తెలియజేసి ఉన్నాడు:

أَبَى وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكَافِرِينَ
[అబా వస్తక్బర వకాన మినల్ కాఫిరీన్]
వాడు మాత్రం తిరస్కరించాడు. అహంకారి అయి, అవిధేయులలో చేరిపోయాడు. (2:34)

మిత్రులారా, అహంకారం ప్రదర్శిస్తే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు నచ్చదు. అహంకారిని అల్లాహ్ ఎట్టి పరిస్థితిలో ఇష్టపడడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “ఎవరి వద్ద అయినా రవ్వంత అహంకారం ఉన్నా, అతను స్వర్గంలో ప్రవేశింపజాలడు” అన్నారు. మనిషికి అహంకారం తగదు మిత్రులారా. అదేవిధంగా ఇబ్లీస్ కూడా అదే పొరపాటు చేశాడు, అహంకారానికి గురయ్యాడు, అల్లాహ్ సాష్టాంగపడమంటే సాష్టాంగపడలేదు. అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కోపగించుకొని, ఆగ్రహించి, అతన్ని స్వర్గం నుండి బహిష్కరించేశాడు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేశాడు:

فَاخْرُجْ مِنْهَا فَإِنَّكَ رَجِيمٌ
[ఫఖ్రుజ్ మిన్హా ఫఇన్నక రజీమ్]
(అప్పుడు అల్లాహ్‌ ఈ విధంగా) సెలవిచ్చాడు : “నువ్విక్కణ్ణుంచి వెళ్ళిపో. నువ్వు ధూత్కరించబడ్డావు. (38:77)

మిత్రులారా, అతను ప్రదర్శించిన అహంకారం కారణంగా తన గౌరవాన్ని కోల్పోయాడు, తన ఉన్నతమైన స్థానాన్ని కోల్పోయాడు, స్వర్గ బహిష్కరణకు గురైపోయాడు షైతాను.

ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలం వారిని స్వర్గంలోకి ప్రవేశింపజేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఏ రోజు అయితే ఆదం అలైహిస్సలం వారు పుట్టారో అది జుమా రోజు, అంటే శుక్రవారం రోజు. మరియు ఏ రోజు అయితే ఆదం అలైహిస్సలం వారు స్వర్గంలో ప్రవేశించారో అది కూడా జుమా రోజు, శుక్రవారం రోజు. అంటే శుక్రవారం రోజున ఆదం అలైహిస్సలం వారు స్వర్గంలోకి ప్రవేశించారు.

స్వర్గంలో వెళ్ళిన తర్వాత, ఆదం అలైహిస్సలం ప్రశాంతంగా జీవితం గడుపుతూ ఉన్నారు. అయితే అక్కడ ఆయనకు ఒంటరితనం అనిపించింది. ఒక రోజు ఆయన పడుకుంటూ ఉంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయన పక్కటెముకల నుండి, ఎడమ వైపున ఉన్న పక్కటెముక నుండి ఒక మహిళను సృష్టించాడు. ఆమె పేరు హవ్వా. ఆదం అలైహిస్సలం వారు నిద్ర లేచి చూస్తే, ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉండటాన్ని గమనించి “ఎవరు మీరు?” అని ప్రశ్నించారు. హవ్వా అలైహస్సలాం వారు అన్నారు, “నా పేరు హవ్వా, నన్ను అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మీ కోసం పుట్టించాడండి” అని చెప్పారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారిద్దరితో మాట్లాడాడు. “మీరిద్దరూ జంటగా ఈ స్వర్గంలో తిరగండి, స్వేచ్ఛగా మీకు తోచిన చోటు నుండి తినండి, స్వేచ్ఛగా మీకు తోచిన చోటు నుండి త్రాగండి” అని చెబుతూ, ఒకే ఒక నిబంధన పెట్టాడు. ఏంటి ఆ నిబంధన?

وَلَا تَقْرَبَا هَذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ
[వలా తఖ్రబా హాదిహిష్షజరత ఫతకూనా మినజ్జాలిమీన్]
కాని ఈ వృక్షం దరిదాపులకు కూడా పోవద్దు. లేదంటే దుర్మార్గులలో చేరిపోతారు” (2:35)

ఆదం అలైహిస్సలం మరియు హవ్వా అలైహస్సలాం వారిద్దరూ జంటగా స్వర్గంలో ప్రశాంతంగా, హాయిగా జీవిస్తూ ఉన్నారు మిత్రులారా.

అల్లాహ్ ఆజ్ఞకు కట్టుబడి వారు స్వర్గంలో ప్రశాంతంగా, గౌరవంగా జీవించుకుంటూ ఉంటే, స్వర్గ బహిష్కరణకు గురైన షైతాను వారిని చూసి లోలోపల కుళ్ళిపోయాడు, అసూయకు గురయ్యాడు. అసూయకు గురయ్యి, ఎలాగైనా సరే వీరిద్దరితో నేను తప్పు చేయించాలి, వారిని కూడా స్వర్గ బహిష్కరణకు గురి చేయాలి అని లోలోపలే అతను అసూయపడ్డాడు.

ఆ తర్వాత, వారిద్దరి వద్దకు షైతాన్ దుష్ప్రేరేపణ కల్పించడం మొదలెట్టేశాడు. దాన్ని వస్వసా అని అంటారు మిత్రులారా. దుష్ప్రేరణ రేకెత్తించడం ప్రారంభించాడు. అతను ఏమన్నాడంటే, “ఏమండీ, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మిమ్మల్ని స్వర్గంలో స్వేచ్ఛగా అన్నీ తినండి, స్వేచ్ఛగా మీకు తోచిన చోటు నుండి తాగండి అని చెబుతూ, కేవలం ఆ ఒక్క వృక్ష ఫలమే ఎందుకు తినవద్దు అని నిబంధన పెట్టాడో తెలుసా? ఆ వృక్ష ఫలాన్ని మీరు తినినట్లయితే, మీరు దైవదూతలుగా మారిపోతారు, శాశ్వతమైన రాజ్యం మీకు దక్కుతుంది, శాశ్వతమైన జీవితం మీకు దక్కుతుంది. అందుకోసమే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మీకు ఆ వృక్షం వద్దకు కూడా వెళ్ళవద్దు అని నిబంధన పెట్టేశాడు” అని చెబుతూ, షైతాన్ ఒట్టేసుకున్నాడండి, ప్రమాణం చేసేశాడు.

అతను ప్రమాణం చేసి మరీ చెబుతూ ఉంటే, మిత్రులారా, వారిద్దరూ అతని మాటల్లో పడిపోయారు. అతని మాటల్లో పడి, వారిద్దరూ కలిసి ఆ వృక్ష ఫలాన్ని తినేశారు. మిత్రులారా, ఖుర్ఆన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు. 20వ అధ్యాయం, 121వ వాక్యంలో:

فَأَكَلَا مِنْهَا
[ఫ అకలా మిన్హా]
చివరకు వారిద్దరూ దానిని తిన్నారు. (20:121)

అలాగే, 7వ అధ్యాయం, 20వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:

فَوَسْوَسَ لَهُمَا الشَّيْطَانُ
[ఫ వస్వస లహుమష్షైతాను]
అప్పుడు షైతాను వారిద్దరి మనస్సులలో దుష్ప్రేరణను రేకెత్తించాడు. (7:20)

మిత్రులారా, ఇద్దరూ కూడా షైతాను మాటల్లో పడి ఆ వృక్ష ఫలము తిన్నారు అని ఖుర్ఆన్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అయితే, మహిళ ఒక్కరే ఈ పాపానికి ఒడిగట్టారు, దీనికి కారణము మహిళ అని నిందించడము సమంజసము కాదు అని మనకు ఖుర్ఆన్ ద్వారా తెలియజేయబడింది మిత్రులారా.

ఎప్పుడైతే వారు ఆ వృక్ష ఫలాన్ని తిన్నారో, వారి మర్మస్థానాలు బహిర్గతమైపోయాయి. వారు స్వర్గంలోని ఆకులు తీసుకొని వారి మర్మస్థానాలను కప్పుకోవడం ప్రారంభించారు. అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారిద్దరితో మాట్లాడాడు. “ఏమండీ, నేను నిషేధించిన చెట్టు, వృక్ష ఫలాన్ని మీరు తిన్నారు అంటే, మీరు కూడా నా ఆజ్ఞను అతిక్రమించారు. కాబట్టి, మీరు కూడా శిక్షార్హులు, మీకు శిక్ష ఏమిటంటే మీరు కూడా స్వర్గం నుండి బయటికి వెళ్ళండి” అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారిద్దరినీ, ఆ తప్పు చేసిన కారణంగా, ఆ నిషేధించబడిన వృక్ష ఫలము తిన్న కారణంగా, స్వర్గం నుంచి బయటికి బహిష్కరించాడు మిత్రులారా.

ఆ తర్వాత ఏమి జరిగింది? స్వర్గం నుంచి బహిష్కరించబడిన తర్వాత మానవులను అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎక్కడికి చేర్చాడు? ఆ తదుపరి జరిగిన వృత్తాంతాన్ని ఇన్ షా అల్లాహ్ మనం రెండవ భాగంలో తెలుసుకుందాం.

అల్లాహ్ తో మేము దుఆ చేస్తున్నాము, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ అల్లాహ్ ఆజ్ఞలను పాటిస్తూ, అహంకారానికి గురికాకుండా, అల్లాహ్ ఆరాధన చేసుకుంటూ జీవితం గడిపే భాగ్యం ప్రసాదించు గాక. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

[రెండవ భాగం]

ఆదం (అలైహిస్సలాం) జీవిత చరిత్ర (పార్ట్ 2)
https://www.youtube.com/watch?v=X-bmzBv-g8U
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిదహుల్లాహ్)

ఈ ప్రసంగం ఆదం (అలైహిస్సలాం) జీవిత చరిత్రలో రెండవ భాగాన్ని వివరిస్తుంది. స్వర్గం నుండి బహిష్కరించబడిన తరువాత, ఆదం (అలైహిస్సలం) మరియు హవ్వా (అలైహస్సలాం) భూమిపై వేర్వేరు ప్రదేశాలలో దిగి, పశ్చాత్తాపంతో అల్లాహ్‌ను క్షమాపణ వేడుకున్నారు. అల్లాహ్ వారిని క్షమించి, అరఫా మైదానంలో తిరిగి కలిపాడు. వారికి కవలలుగా సంతానం కలిగింది. వారి కుమారులైన కాబిల్ మరియు హాబిల్ మధ్య వివాహ విషయంలో వివాదం తలెత్తగా, దానిని పరిష్కరించడానికి అల్లాహ్ వారిని ఖుర్బానీ (బలి) చేయమని ఆదేశించాడు. హాబిల్ ఖుర్బానీ స్వీకరించబడి, కాబిల్ ఖుర్బానీ తిరస్కరించబడటంతో, అసూయతో కాబిల్ తన సోదరుడైన హాబిల్‌ను హత్య చేశాడు. ఇది భూమిపై జరిగిన మొదటి హత్య. తరువాత, ఒక కాకి ద్వారా అల్లాహ్ శవాన్ని ఎలా ఖననం చేయాలో కాబిల్‌కు నేర్పాడు. చివరగా, ఆదం (అలైహిస్సలం) 960 సంవత్సరాలు జీవించి మరణించగా, దైవదూతలు ఆయన ఖనన సంస్కారాలు నిర్వహించి మానవాళికి మార్గనిర్దేశం చేశారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

మిత్రులారా, మనిషి భూమి మీద మొదటిసారి ఎక్కడ పాదం మోపాడు? మనిషికి భూమి మీద పంపించబడిన తర్వాత ఎన్ని సంవత్సరాల ఆయుష్షు ఇవ్వబడింది? మొదటి మనిషి ఎన్ని సంవత్సరాలు జీవించాడు? మొదటి మనిషికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎంత మంది బిడ్డలను ప్రసాదించాడు? మనిషికి పుట్టిన బిడ్డలలో, ఓ ఇద్దరు బిడ్డల గురించి ప్రత్యేకంగా ధార్మిక గ్రంథాలలో తెలుపబడిన విషయాలు, మొదటి మనిషి యొక్క మరణం మరియు అతని ఖనన సంస్కారాలు, ఈ విషయాలన్నీ మనము ఈనాటి ప్రసంగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, ఎప్పుడైతే ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహస్సలాం స్వర్గంలో నిషేధించిన వృక్ష ఫలాన్ని తిని అల్లాహ్ ఆజ్ఞను అతిక్రమించారో, వారిని స్వర్గం నుండి బహిష్కరించి భూమి మీదకి దింపేశాడు. దైవదూతలు ఇద్దరినీ భూమి మీదికి తీసుకువచ్చారు. ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారం, ఆదం అలైహిస్సలాం వారిని దైవదూతలు భారతదేశంలో దింపారు. నేడు శ్రీలంక అని ఒక దేశం పేరు మనం వింటూ ఉన్నాము కదా, ఒకప్పుడు అది భారతదేశపు భూభాగంలోనే ఒక భాగము. అక్కడ దైవదూతలు ఆదం అలైహిస్సలాం వారిని దింపారు. మరియు హవ్వా అలైహస్సలాం వారిని దైవదూతలు సౌదీ అరేబియాలోని జిద్దా నగరం వద్ద దింపారు. అంటే ఇద్దరినీ కూడా వేరు వేరు ప్రదేశాలలో దైవదూతలు దింపేశారు.

భూమి మీద దిగిన తర్వాత, వారు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సమక్షంలో కన్నీరు కార్చి, ఏడ్చి, పశ్చాత్తాపపడి క్షమాభిక్ష వేడుకున్నారు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలాం వారికి కొన్ని పలుకులు కూడా నేర్పాడు. ఆ పలుకులతో ఆదం అలైహిస్సలాం వారు అల్లాహ్ తో క్షమాభిక్ష కోరారు. ఏమిటి ఆ పలుకులు అంటే, ఖుర్ఆన్ గ్రంథంలో మనం చూచినట్లయితే, ఏడవ అధ్యాయం, 23వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేశాడు:

قَالَا رَبَّنَا ظَلَمْنَا أَنْفُسَنَا وَإِنْ لَمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ

[రబ్బనా జలమ్నా అన్ఫుసనా వ ఇల్లమ్ తగ్ఫిర్లనా వ తర్హమ్నా లనకునన్న మినల్ ఖాసిరీన్]
వారిద్దరూ, “మా ప్రభూ! మేము మా స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాము. ఇప్పుడు నీవు గనక మాకు క్షమాభిక్ష పెట్టి, మాపై దయదలచకపోతే నిశ్చయంగా మేము నష్టపోతాము” అని వేడుకున్నారు (7:23)

ఈ విధంగా అల్లాహ్ నేర్పిన ఆ పలుకులను నేర్చుకొని, ఆది దంపతులైన ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహస్సలాం ఇద్దరూ అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాపపడి వేడుకోగా, కరుణామయుడైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారి మీద కరుణించి, వారి పశ్చాత్తాపాన్ని ఆమోదించి, వారి పాపాన్ని మన్నించేశాడు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేశాడు, “ఫతాబ అలైహి ఇన్నహూ హువత్తవ్వాబుర్రహీం.” అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం వారి తౌబా స్వీకరించి మన్నించేశాడు. నిశ్చయంగా ఆయన కరుణించేవాడు మరియు పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు.

మిత్రులారా, మనిషి చేసిన పాపము క్షమించబడింది, మన్నించబడింది అని ఖుర్ఆన్ గ్రంథము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే మిత్రులారా, ఎప్పుడైతే వారి పాపము మన్నించబడిందో, క్షమించబడిందో, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దైవదూతల్ని పంపించి, వేరు వేరు ప్రదేశాలలో ఉన్న వారిద్దరినీ మళ్ళీ ఒకచోట కలిపేశాడు. ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారం, దైవదూతలు వచ్చి, ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహస్సలాం వారి ఇద్దరినీ మక్కా సమీపంలో ఉన్న అరఫా మైదానంలోని జబలె రహ్మా వద్ద వారిద్దరినీ కలిపేశారు. మిత్రులారా, విడిపోయిన ఆ ఆలుమగలిద్దరూ, దూరం దూరంగా ఉన్న ఆ ఆలుమగలిద్దరూ పరస్పరం అక్కడ, అరఫా మైదానంలో జబలె రహ్మా వద్ద ఒకరికొకరు ఎదురయ్యారు. వారిద్దరూ అక్కడ ఒకరికొకరు పరిచయమయ్యారు కాబట్టి ఆ మైదానానికి పరిచయ స్థలం అనే భావన వచ్చేటట్టుగా అరఫా అని పేరు పడింది అని ధార్మిక పండితులు తెలియజేస్తారు.

సరే, ఆ విధంగా ఆది దంపతులు ఇద్దరూ ఒకచోట వచ్చారు, వారిద్దరూ కలిసి నివసించడం ప్రారంభించారు. మిత్రులారా, ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారం, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలాం వారిని భూమండలం మీద, మీకు ఒక నిర్దిష్ట కాలం వరకు జీవితం ఇవ్వబడింది, మీరు అక్కడ ఆ నిర్దిష్ట కాలం వరకు జీవించండి, మీకు సంతానము కూడా కలుగుతుంది, ఆ విధంగా ప్రపంచము నడుస్తుంది, మళ్ళీ మీకు మరణం అని ఒకటి వస్తుంది, ఆ మరణం సంభవించిన తర్వాత మళ్ళీ మీరు తిరిగి నా సమక్షంలోకి వస్తారు, అప్పుడు మళ్ళీ నేను మీ స్థానమైన స్వర్గానికి చేరుస్తాను అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేశారు అని ధార్మిక పండితులు తెలియజేశారు.

అయితే మిత్రులారా, ఎప్పుడైతే మనిషి యొక్క పాపము మన్నించబడిందో, అతను మరణించి మళ్ళీ స్వర్గానికి వెళ్లిపోబోతున్నాడు అన్న విషయము తెలిసిందో, అసూయకు గురై ఉన్న షైతాను మరింత అసూయకు గురయ్యాడు. మామూలుగా చేయాల్సింది ఏమిటండి? మనిషితో తప్పు దొల్లింది, షైతానుతో కూడా తప్పు దొర్లింది. ఇద్దరికీ ఒకే శిక్ష. షైతాను కూడా స్వర్గం నుంచి బహిష్కరించబడ్డాడు, మానవుడు కూడా స్వర్గం నుంచి బహిష్కరించబడ్డాడు. మానవుడు అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాపపడి, క్షమాభిక్ష వేడుకున్నాడు, అతని పాపము క్షమించబడింది. మరి అలాంటప్పుడు షైతాను ఏమి చేయాలి? అతను కూడా అల్లాహ్ వద్ద వెళ్లి, క్షమాభిక్ష వేడుకొని, మన్నింపు వేడుకొని, తౌబా చేసుకోవాలి, పశ్చాత్తాప పడాలి. కానీ అతను ఏం చేశాడంటే, మరింత అసూయకు గురైపోయి, “అరే, నేను స్వర్గం నుంచి మనిషిని బయటికి వచ్చేటట్టు, బహిష్కరించబడేటట్టు చేస్తే, ఇతను మళ్ళీ స్వర్గవాసి అయిపోతున్నాడే” అని అల్లాహ్ వద్దకు వెళ్లి మళ్ళీ అతను సవాలు చేశాడు. ఏమని సవాలు చేశాడంటే, “ఓ అల్లాహ్, నేను కూడా భూమి మీదకు వెళ్లి, మనిషి దారిలో కూర్చొని, కుడి వైపు నుండి, ఎడమ వైపు నుండి, నలువైపుల నుండి నేను అతన్ని నీ మార్గములో, నీ దారిలో నడవకుండా మార్గభ్రష్టత్వానికి గురయ్యేటట్టు చేస్తాను, దారి తప్పేటట్టు చేసేస్తాను” అని సవాలు విసిరాడు.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని మాటలు వింటూ ఉంటే, అతను మళ్ళీ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో అడిగాడు, “ఇదంతా చేయటానికి నాకు కొన్ని శక్తులు కావాలి” అన్నాడు. ఏమిటి ఆ శక్తులు అంటే, అతను అన్నాడు:

أَنْظِرْنِي إِلَى يَوْمِ يُبْعَثُونَ
“ప్రజలు తిరిగి లేపబడే రోజు వరకు నాకు గడువు ఇవ్వు.” (7:14)

అనగా, అందరూ తిరిగి లేపబడే రోజు వరకు నాకు గడువు ఇవ్వు. అంటే ప్రళయం వరకు నాకు చావు రాకూడదు అన్న విషయం అతను అల్లాహ్ తో కోరాడు. అలాగే, మరిన్ని కొన్ని కోరికలు అతను కోరాడు. ముఖ్యంగా మనం చూచినట్లయితే, మనిషి హృదయం పక్కన కూర్చొని, మనిషి మనసులో చెడు ఆలోచనలు కలిగించడానికి స్థానము కావాలి అని కోరుకున్నాడు. ఆ విధంగా మరిన్ని కోరికలు అతను కోరుకుంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని కోరికల ప్రకారం అతనికి ఆ శక్తులన్నీ ఇచ్చాడు. “ప్రళయం వరకు నాకు మరణం సంభవించకూడదు” అంటే అది కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతనికి ఇచ్చేశాడు. “కాల ఇన్నక మినల్ ముంజరీన్, సరే, నీకు ఆ గడువు ఇవ్వబడింది, వెళ్ళు” అని చెప్పాడు. అతను ఆ శక్తులు తీసుకొని భూమి మీదకి వస్తూ ఉంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతనితో అన్నాడు, “నీవు వెళ్లి నీ ప్రయత్నము చెయ్. నేను కూడా నా భక్తుల వద్దకు నా వాక్యాలు పంపిస్తాను. ఒకవేళ ఎవరైనా నీ మాట విని, నా దారి వదిలేసి, దారి తప్పిపోయి మార్గభ్రష్టత్వానికి గురైపోతే, నిన్ను మరియు నీ మాట విని మార్గభ్రష్టత్వానికి గురవుతున్న వారిని ఇద్దరినీ కూడా నేను నరకంలో శిక్షిస్తాను” అని చెప్పేశాడు.

సరే, ఏది ఏమైనను మిత్రులారా, ఇద్దరూ ఇటు మానవులు, అటు జిన్నాతులు భూమి మీద నివసించడం ప్రారంభించారు. మొదటి మానవుడైన ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహస్సలాం తో కలిసి ఈ భూమి మీద నివసిస్తూ ఉంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారికి సంతానాన్ని ప్రసాదించాడు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దయతో హవ్వా అలైహస్సలాం వారికి ప్రతి కాన్పులో ఇద్దరు బిడ్డలు పుట్టేవారు, ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ. ఇద్దరు బిడ్డలు ప్రతి కాన్పులో పుట్టేవారు. ఆ విధంగా హవ్వా అలైహస్సలాం వారికి 20 కాన్పుల్లో 40 మంది బిడ్డలు పుట్టారు అని ధార్మిక పండితులు తెలియజేశారు.

మిత్రులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలాం వారికి సంతానం ఇచ్చినప్పుడు, ఆ సంతానాన్ని పోషించుకుంటూ, వారికి దైవ వాక్యాలు, నిబంధనలు నేర్పించుకుంటూ ఆది మానవులైన ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహస్సలాం వారు ఈ భూమండలం మీద జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. చూస్తూ ఉండంగానే, ఆది మానవులైన ఆదం అలైహిస్సలాం వారి సంతానము పెరుగుతూ పోయింది భూమండలం మీద. ప్రజల సంఖ్య పెరుగుతూ పోయింది, రోజులు గడుస్తూ పోయాయి. ఆ తర్వాత, ఆదం అలైహిస్సలాం వారి బిడ్డల మధ్య ఒక విషయంలో గొడవ జరిగింది.

మిత్రులారా, ఆదం అలైహిస్సలాం వారి బిడ్డల్లో కాబిల్ మరియు హాబిల్ అనే వారు ఇద్దరూ ముఖ్యమైన వ్యక్తులు. కాబిల్ అనే ఆదం అలైహిస్సలాం కుమారుడు వ్యవసాయం చేసేవాడు. హాబిల్ అనే ఆదం అలైహిస్సలాం కుమారుడు పశువుల కాపరిగా, పశువులను మేపేవాడు. అయితే, వారిద్దరూ పెరిగి పెద్దవారయ్యాక, వివాహ విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆనాటి నియమ నిబంధనల ప్రకారము, ఏ అమ్మాయినైతే కాబిల్ వివాహం చేసుకుంటాను అని కోరాడో, ఆ అమ్మాయిని హాబిల్ కి ఇచ్చి వివాహం చేయాలి. కానీ, కాబిల్ ఆ అమ్మాయితో నేనే వివాహం చేసుకుంటాను అని పట్టుపట్టాడు. ఆనాటి నియమ నిబంధనలకు అతని ఆ కోరిక విరుద్ధమైనది.

విషయం తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది. ఆదం అలైహిస్సలాం, కాబిల్ కి చాలా రకాలుగా నచ్చజెప్పారు, “బిడ్డా, నువ్వు కోరుతున్న కోరిక అధర్మమైనది, ఈ విధంగా నీవు పట్టుపట్టడం, మొండి వైఖరి వివలంబించడం మంచిది కాదు” అని ఆదం అలైహిస్సలాం కాబిల్ కి ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా, అతను మాత్రం వినలేదు. చివరికి ఆదం అలైహిస్సలాం వారు ఏమన్నారంటే, “సరే, ఒక పని చేయండి, మీరిద్దరూ కలిసి అల్లాహ్ సమక్షంలో ఖుర్బానీ చేయండి. ఎవరి ఖుర్బానీ స్వీకరించబడుతుందో, అతనికి ఇచ్చి ఆ అమ్మాయితో వివాహం చేసేస్తాము” అని చెప్పారు.

మిత్రులారా, ఈ విషయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథంలో స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు, ఐదవ అధ్యాయం, 27వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేశాడు:

وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ ابْنَيْ آدَمَ بِالْحَقِّ إِذْ قَرَّبَا قُرْبَانًا فَتُقُبِّلَ مِنْ أَحَدِهِمَا وَلَمْ يُتَقَبَّلْ مِنَ الْآخَرِ
ఆదం యొక్క ఇద్దరు కుమారుల వృత్తాంతాన్ని కూడా వారికి యధాతథంగా వినిపించు. వారిరువురూ దైవానికి ఖుర్బానీ సమర్పించగా, వారిలో ఒకరి నజరానా స్వీకరించబడింది. మరొకరిది స్వీకరించబడలేదు.(5:27)

ఎవరి ఖుర్బానీ స్వీకరించబడింది, ఎవరి ఖుర్బానీ స్వీకరించబడలేదు అన్న విషయాన్ని ధార్మిక పండితులు తెలియజేశారు. అదేమిటంటే, ఆదం అలైహిస్సలాం వారు చెప్పిన ప్రకారం, కాబిల్ మరియు హాబిల్ ఇద్దరూ కూడా ఖుర్బానీ చేయటానికి ఒక ప్రదేశాన్ని ఎన్నుకున్నారు, ఒక సమయాన్ని ఎన్నుకున్నారు. నిర్దిష్ట సమయం వచ్చినప్పుడు, కాబిల్, అతను వ్యవసాయం చేసేవాడు కాబట్టి, అతను కొన్ని ధాన్యాలు తీసుకొని వెళ్లి ఒక మైదానంలో ఉంచాడు. ఇటు హాబిల్, గొర్రెల కాపరి కాబట్టి, ఒక గొర్రెను లేదా ఒక పశువుని తీసుకొని వెళ్లి మైదానంలో నిలబెట్టాడు. ఆ రోజుల్లో ఖుర్బానీ ఇచ్చే విధానం ఏమిటంటే, వారి ఖుర్బానీ తీసుకొని వెళ్లి మైదానంలో ఉంచితే, ఎవరి ఖుర్బానీ స్వీకరించబడుతుందో, అతని ఖుర్బానీని ఆకాశం నుండి అగ్ని వచ్చి కాల్చేస్తుంది. అప్పుడు ప్రజలకు అర్థమైపోతుంది, ఫలానా ఫలానా వ్యక్తుల ఖుర్బానీ స్వీకరించబడింది అని.

కాబట్టి, వారిద్దరూ కూడా, కాబిల్ మరియు హాబిల్ ఇద్దరూ కూడా, వారి వారి ఖుర్బానీని తీసుకొని వెళ్లి మైదానంలో ఉంచారు. మైదానంలో ఉంచగా, అగ్ని వచ్చి హాబిల్ పెట్టిన ఖుర్బానీని కాల్చి వెళ్లిపోయింది. అప్పుడు స్పష్టమైపోయింది, హాబిల్ మాత్రమే సత్యం మీద ఉన్నాడు, అతని మాట న్యాయమైనది. కాబిల్ అసత్యం పైన ఉన్నాడు, అతను అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు అని స్పష్టమైపోయింది. ఎప్పుడైతే కాబిల్ కు తెలిసిందో, “నా ఖుర్బానీ స్వీకరించబడలేదు, తిరస్కరించబడింది” అని, అతను అతని తమ్ముని మీద కోపం పెంచుకున్నాడు. కోపం పెంచుకొని, అతని తమ్ముని వద్దకు వెళ్లి అతను ఏమన్నాడంటే:

لَأَقْتُلَنَّكَ
“నిశ్చయంగా నేను నిన్ను చంపేస్తాను.” (5:27)

నువ్వు నాకు అడ్డుపడుతున్నావు, నేను నిన్ను హతమార్చేస్తాను అన్నాడు. అంటే చంపేస్తాను అని అతన్ని బెదిరించాడు. మిత్రులారా, అది విని హాబిల్, అతను మంచి వ్యక్తి, మృదు స్వభావి, ఆయన ఏమన్నాడంటే:

إِنَّمَا يَتَقَبَّلُ اللَّهُ مِنَ الْمُتَّقِينَ
“అల్లాహ్‌ భయభక్తులు గలవారి ఖుర్బానీనే స్వీకరిస్తాడు.” (5:27)

దైవభీతి ఉన్నవారి ఖుర్బానీ అల్లాహ్ త’ఆలా స్వీకరిస్తాడు, నాలో దైవభీతి ఉండింది కాబట్టి అల్లాహ్ నా ఖుర్బానీ స్వీకరించాడు, నీవు అన్యాయంగా పోతున్నావు కాబట్టి నీ ఖుర్బానీ స్వీకరించబడలేదు. నువ్వు నన్ను చంపుతాను అని బెదిరిస్తున్నావు కదా!

لَئِنْ بَسَطْتَ إِلَيَّ يَدَكَ لِتَقْتُلَنِي مَا أَنَا بِبَاسِطٍ يَدِيَ إِلَيْكَ لِأَقْتُلَكَ
ఒకవేళ నువ్వు నన్ను హత్య చేయటానికి చెయ్యి ఎత్తితే, నేను మాత్రం నిన్ను హత్య చేయటానికి నా చెయ్యి ఎత్తను. (5:28)

ఒకవేళ నువ్వు నా ప్రాణము తీస్తే, నా పాపము మూటగట్టుకుంటావు అని చెప్పాడు. మిత్రులారా, కాబిల్ ఆ మాటలు విని కూడా మారలేదు. అతని మనసులో ఒకే మొండిపట్టు ఉండింది, ఎలాగైనా సరే నా మాటను నేను నెగ్గించుకోవాలి అని అతను పట్టుపట్టాడు. షైతాను కూడా అతనికి పురికొల్పాడు.

ఒకరోజు హాబిల్ నిద్రిస్తూ ఉంటే, అతను ఒక పెద్ద రాయి తీసుకొని వెళ్లి అతని తల మీద పడేశాడు. ఆ విధంగా కాబిల్ హాబిల్ ని హతమార్చేశాడు. మరికొన్ని ఉల్లేఖనాలు ఏమని ఉందంటే, ఒక గట్టి వస్తువు తీసుకొని అతని తల మీద కొట్టాడు, తత్కారణంగా అతను ప్రాణాలు కోల్పోయాడు అని చెప్పబడింది. ఏది ఏమైనను సరే, కాబిల్ హాబిల్ ని హతమార్చేశాడు.

మొదటిసారి ఈ భూమండలం మీద ఒక వ్యక్తి ప్రాణాలు పోయాయి, ఒక నేరము జరిగింది. ఆ నేరం ఏమిటంటే హత్య. ఒక హత్యా నేరము ఈ భూమండలం మీద మొదటిసారి జరిగింది మిత్రులారా. ఇక్కడ ఒక విషయం మనం దృష్టిలో పెట్టుకుందాం. అదేమిటంటే, మొదటి హత్య ఈ భూమండలం మీద కాబిల్ చేశాడు. ఆ తర్వాత ప్రపంచం నడుస్తూనే ఉంది, ప్రజలు పుడుతూనే పోతున్నారు. ప్రతి యుగములో కూడా కొంతమంది దుర్మార్గులు, కొంతమంది యువకుల ప్రాణాలు తీసేస్తున్నారు, హత్యలు చేసేస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఈ ప్రపంచంలో, భూమండలం మీద ఎక్కడ హత్య జరిగినా, హంతకునికి పాపం ఉంటుంది. దానితో పాటు, ఒక భాగము పాపమిది ఆ కాబిల్ ఖాతాలోకి కూడా చేరుతుంది. ఎందుకంటే ఆ పాపాన్ని ఈ భూమండలం మీద ప్రవేశపెట్టింది అతడే కాబట్టి.

మిత్రులారా, ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “మన్ దల్ల అలా ఖైరిన్ ఫలహూ మిస్లు అజ్రి ఫాయిలిహి,” ఎవరైనా ఒక మంచి మార్గం చూపిస్తే, ఆ మంచి మార్గంలో ఎంతమంది నడుచుకుంటారో, నడుచుకున్న వాళ్ళకి కూడా పుణ్యం ఉంటుంది, దారి చూపించిన వ్యక్తికి కూడా ఒక భాగము అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పుణ్యం ప్రసాదిస్తూనే ఉంటాడు.

అలాగే, “వ మన్ దల్ల అలా ఇస్మిన్ ఫలహూ మిస్లు అజ్రి మా ఆసామా,” ఎవరైనా ఒక చెడ్డ దారి చూపిస్తే, ఆ చెడ్డ దారిలో ఎంతమంది నడుచుకుంటారో, ఆ చెడ్డ దారిలో నడుచుకొని ఎంతమంది పాపాలు మూటగట్టుకుంటారో, పాపం చేసిన వారికి కూడా పాపం ఉంటుంది, ఆ దారి చూపించిన వ్యక్తికి కూడా ఒక భాగము పాపం దొరుకుతూనే ఉంటుంది అని చెప్పారు.

కాబట్టి, జాగ్రత్త పడాలి మిత్రులారా. మనం మన ఇరుపక్కల ఉన్న వారికి మంచి విషయాలు నేర్పిస్తున్నామా, మంచి దారి చూపిస్తున్నామా, లేదా మా తరఫు నుంచి ఇతరులకు మేము చెడ్డ అలవాట్లు నేర్పిస్తున్నామా అనేది జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.

సరే, ఇక్కడ కాబిల్, హాబిల్ ని హతమార్చేశాడు. హతమార్చిన తర్వాత, మొదటిసారి ఒక వ్యక్తి ప్రాణము పోయింది, అక్కడ శవం మిగిలింది. ఆ శవాన్ని ఇప్పుడు ఏమి చేయాలి? ఇంతవరకు, ఒకరి మరణం కూడా సహజంగా సంభవించలేదు కాబట్టి, ఎవరికీ తెలియదు మరణించిన వ్యక్తికి ఏమి చేయాలి అనేది. అతనికి కూడా తోచలేదు ఏమి చేయాలి అనేది. అతను ఏం చేశాడు, తన తమ్ముని శవాన్ని భుజాన వేసుకొని తిరుగుతూ ఉన్నాడు, అతనికి అర్థం కావటం లేదు.

మిత్రులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కాకిని పంపించాడు. ఒక కాకి వచ్చింది. అది భూమి మీద దిగి కాళ్ళతో మట్టిని తవ్వ సాగింది. మిత్రులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథంలో, ఐదవ అధ్యాయం, 31వ వాక్యంలో ఈ విషయాన్ని తెలియజేశాడు:

فَبَعَثَ اللَّهُ غُرَابًا يَبْحَثُ فِي الْأَرْضِ لِيُرِيَهُ كَيْفَ يُوَارِي سَوْءَةَ أَخِيهِ
ఆ తరువాత సోదరుని శవాన్ని ఎలా దాచాలో అతనికి చూపించటానికి అల్లాహ్‌ ఒక కాకిని పంపాడు. అది నేలను త్రవ్వసాగింది. (5:31)

ఒక కాకిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పంపాడు. అది నేల మీద దిగి త్రవ్వ సాగింది. తన తమ్ముని శవాన్ని ఎలా కప్పి పెట్టాలో అతనికి నేర్పించటానికి అని చెప్పబడింది మిత్రులారా. కొంతమంది ధార్మిక పండితులు ఈ వాక్యాన్ని వివరిస్తూ ఏమని చెప్పారంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా రెండు కాకిల్ని పంపించాడు, ఆ రెండు కాకులు పరస్పరం గొడవ పడ్డాయి, ఒక కాకి మరొక కాకిని చంపేసింది. చనిపోయిన ఆ కాకిని, బతికి ఉన్న ఆ కాకి తన కాళ్ళతో మట్టి తవ్వి, ఆ కాకి మరణించిన కాకిని ఆ గుంతలోకి తోసేసి, దానిపైన మళ్ళీ మట్టి కప్పేసింది. ఇది అంతా ఆ కాబిల్ ముందరే జరిగింది. అది చూసి, కాబిల్ తల పట్టుకొని, “అయ్యో, ఈ కాకికి ఉన్నంత జ్ఞానము కూడా నాకు లేకపోయేనే, నా తమ్ముని శవాన్ని ఏమి చేయాలో నాకు అర్థం కాకపోయేనే” అని అతను, ఆ తర్వాత భూమిలో గుంత తవ్వి, తన తమ్ముని శవాన్ని భూమిలో కప్పేశాడు.

ఆ విధంగా మిత్రులారా, కాబిల్ తన తమ్ముడు హాబిల్ ని చంపి, హత్య చేసి, భూమిలో పాతిపెట్టేశాడు. నేరం జరిగింది కదా, తప్పు చేశాడు కదా! ఇక తల్లిదండ్రుల ముందర వెళ్లి, అక్క చెల్లెళ్ళ, తమ్ముళ్ళ ముందర తలెత్తుకొని తిరగగలడా? తిరగలేడు. కాబట్టి, అప్పుడు అతను ఏం చేశాడంటే, తల్లిదండ్రుల వద్ద నుంచి దూరంగా వెళ్లిపోయి స్థిరపడిపోయారు. మిత్రులారా, అతను వెళ్లి దూరంగా స్థిరపడిపోయాడు. ఇన్ షా అల్లాహ్, ఆ తర్వాత ఏమి జరిగింది అన్న విషయం తర్వాత తెలుసుకుందాం.

ఇక్కడ ఉన్న మన ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహస్సలాం మరియు వారి సంతానము అందరూ కలిసిమెలిసి నివసిస్తూ ఉన్నారు. ఆదం అలైహిస్సలాం వారి వయస్సు 940 సంవత్సరాలకు చేరింది. అప్పుడు దైవదూతలు మనిషి ఆకారంలో భూమి మీదకి దిగారు.

ఆ రోజు జరిగిన విషయం ఏమిటంటే, ఆదం అలైహిస్సలాం తన బిడ్డల్ని పిలిచి, “బిడ్డలారా, నాకు కొన్ని పండ్లు తినాలని అనిపిస్తుంది, మీరు వెళ్లి కొన్ని పండ్లు తీసుకొని రండి” అంటే, బిడ్డలు తండ్రి కోసము పండ్లు తీసుకురావటానికి బయలుదేరారు. అంతలోనే అటువైపు నుంచి దైవదూతలు మనిషి ఆకారంలో, ఖనన వస్త్రాలు, శవ వస్త్రాలు తీసుకొని, అలాగే సువాసనలు తీసుకొని వస్తూ ఉన్నారు. వారికి ఎదుటపడి, “ఎక్కడికి మీరు వెళ్తున్నారు?” అని ప్రశ్నిస్తే, “మా తండ్రి కోసము పళ్ళు ఫలాలు తీసుకురావడానికి వెళ్తున్నాము” అంటే, అప్పుడు దూతలు అన్నారు, “లేదండి, మీ తండ్రి వద్దకు వెళ్ళండి, మీ తండ్రి మరణ సమయము సమీపించింది” అని వారు పంపించేశారు.

ఆ తర్వాత దైవదూతలు, ఆదం అలైహిస్సలాం వారి వద్దకు వచ్చారు. “మీ సమయం ముగిసింది, మీ ఆయుష్షు పూర్తయ్యింది. ఇక పదండి, మీకు ఇప్పుడు మరణం సంభవిస్తుంది” అంటే, ఆదం అలైహిస్సలాం వారు అన్నారు, “అదేంటండి, నాకు 940 సంవత్సరాలే కదా, ఇంకా 60 సంవత్సరాలు నా ఆయుష్షు మిగిలి ఉంది కదా! అప్పుడే మీరు వచ్చేసారు ఏమిటి?” అని ఆశ్చర్యంగా అడిగారు. అప్పుడు దైవదూతలు ఆయనకు జరిగిన సంఘటన తెలిపారు, “ప్రారంభంలో, మీ ఒక బిడ్డ ఆయుష్షు 40 సంవత్సరాలే అని మీకు తెలిసినప్పుడు, మీరు మీ ఆయుష్షులో నుంచి 60 సంవత్సరాలు అతని ఆయుష్షులో కలపండి అని చెప్పారు కదా! కాబట్టి మీ ఆయుష్షులో నుంచి 60 సంవత్సరాలు తీసి అతనికి ఇవ్వడం జరిగింది, ఇప్పుడు మీ ఆయుష్షు 940 సంవత్సరాలే, అది పూర్తి అయిపోయింది” అని చెప్పారు. మిత్రులారా, ఈ విషయం చెప్పి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “ఆది మానవుడు కూడా మరిచిపోయాడు, మనుష్యుల్లో కూడా మరిచిపోవటం అనేది ఒక సహజ లక్షణం” అన్నారు.

ఆ తర్వాత మిత్రులారా, దైవదూతలు ఆదం అలైహిస్సలాం వారి ప్రాణము తీయటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, హవ్వా అలైహస్సలాం ఏడవడం ప్రారంభించారు. హవ్వా అలైహస్సలాం ఏడుస్తూ ఉంటే, ఆది మానవుడు ఆమెకు చెప్పారు, “లేదు, నాకు దూతలతో పాటు వదిలేయండి” అని చెప్పేశారు. ఆ తర్వాత దైవదూతలు ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం వారి ప్రాణాలు తీశారు. ఆ తర్వాత, దైవదూతలే ఆదం అలైహిస్సలాం వారికి స్నానము చేయించారు, శవ వస్త్రాలు తొడిగించారు, సువాసనలు పూశారు, భూమి తవ్వి, ఆ తర్వాత ఆదం అలైహిస్సలాం వారికి అక్కడ ఖనన సంస్కారాలు చేయించి, “మానవులారా, మీలో ఎవరైనా మరణిస్తే, ఇదే విధంగా మీరు ఖనన సంస్కారాలు చేసుకోవాలి” అని దైవదూతలు అక్కడ ఉన్న ఆదం అలైహిస్సలాం వారి సంతానానికి నేర్పించి వెళ్లిపోయారు.

మిత్రులారా, ఈ విధంగా ఆదం అలైహిస్సలాం వారి యొక్క జీవిత చరిత్ర పూర్తయింది. ఆ తర్వాత విషయాలు వచ్చే ఎపిసోడ్లలో ఇన్ షా అల్లాహ్ ఆ భాగాలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ దైవ ప్రవక్తల జీవితాలను తెలుసుకొని, మన భక్తిని పెంచుకొని, దైవ విధేయులుగా, భక్తులుగా జీవించే భాగ్యం ప్రసాదించు గాక. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఆదం (అలైహిస్సలాం) జీవిత చరిత్ర (పార్ట్ 3)ఆదం (అలైహిస్సలాం) జీవిత పాఠాలు
https://www.youtube.com/watch?v=HWwkHE2iErQ
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిదహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఆదం (అలైహిస్సలం) జీవిత చరిత్ర నుండి నేర్చుకోవలసిన పాఠాలు వివరించబడ్డాయి. మొదటిది, మానవుని సృష్టి – అల్లాహ్ తన స్వహస్తాలతో, తన ఆత్మను ఊది, జ్ఞానాన్ని ప్రసాదించి మానవుడిని సృష్టించాడు, ఇది ఇతర సృష్టితాలపై మానవుని ఆధిక్యతను సూచిస్తుంది. రెండవది, అహంకారం యొక్క పరిణామం – షైతాన్ తన అహంకారం కారణంగా శపించబడి స్వర్గం నుండి బహిష్కరించబడ్డాడు. అహంకారం సత్యాన్ని తిరస్కరించడం, ఇతరులను తక్కువగా చూడటమేనని, ఇది వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించబడింది. మూడవది, షైతాన్ మానవుని బహిరంగ శత్రువు అని, అతను ఎల్లప్పుడూ చెడు మరియు నీతిబాహ్యత వైపు ప్రేరేపిస్తాడని, అతని పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించబడింది. నాలుగవది, అల్లాహ్ దయ మరియు క్షమాపణ – ఆదం (అలైహిస్సలం) తప్పు చేసి పశ్చాత్తాపపడగా, అల్లాహ్ క్షమించాడు. అల్లాహ్ నిరంతరం క్షమాపణను అంగీకరించడానికి సిద్ధంగా ఉంటాడని, కాబట్టి మనం ఎల్లప్పుడూ పశ్చాత్తాపపడాలని బోధించబడింది. చివరిగా, మొదటి నేరమైన హత్య గురించి చర్చిస్తూ, ఒక చెడు మార్గాన్ని ప్రారంభించిన వ్యక్తి, ఆ మార్గాన్ని అనుసరించేవారి పాపంలో కూడా భాగస్వామి అవుతాడని, కాబట్టి చెడుకు దూరంగా ఉండాలని నొక్కి చెప్పబడింది.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, “ఆదం అలైహిస్సలాం జీవిత పాఠాలు” అనే నేటి ప్రసంగ అంశానికి మిమ్మల్నందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అభిమాన సోదరులారా, ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర చదివి లేక విని మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి.

ముందుగా మనం తెలుసుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే, మానవుని పుట్టుక ఎలా జరిగింది? నేడు ప్రపంచంలో మానవుడు కోతి జాతి నుండి అభివృద్ధి చెందిన జీవి అని ప్రచారం చేయబడి ఉంది. మరికొందరైతే సముద్రం నుండి బయటకు వచ్చిన ఒక జీవి క్రమంగా అభివృద్ధి చెందుతూ మానవునిగా రూపం దాల్చింది అని ప్రచారం చేస్తున్నారు. ఇలా రకరకాలుగా మానవుని పుట్టుక గురించి ప్రచారాలు ప్రపంచంలో జరిగి ఉన్నాయి. అయితే అభిమాన సోదరులారా, వాస్తవం ఏమిటంటే, ఇవన్నీ కేవలం మానవుని ఊహా కల్పితాలు మాత్రమే. మనిషి పుట్టుక ఎలా జరిగింది అనేది మనిషిని మరియు మొత్తం ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ఏమి చెబుతున్నాడో తెలుసుకుంటే, మనిషి పుట్టుక ఎలా జరిగింది అన్న విషయం స్పష్టమవుతుంది.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా యొక్క నైజం ఏమిటంటే, ఆయన ఏదైనా ఒక వస్తువుని తయారు చేయదలిస్తే, కేవలం అతను నోటితో “కున్” అనగా “అయిపో” అని చెప్పగానే అది అయిపోతుంది. ఈ విషయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ లో 36వ అధ్యాయం, 82వ వాక్యంలో తెలియజేసి ఉన్నాడు.

إِنَّمَا أَمْرُهُ إِذَا أَرَادَ شَيْئًا أَنْ يَقُولَ لَهُ كُنْ فَيَكُونُ
ఆయన ఎప్పుడైనా, ఏదైనా వస్తువును చేయ సంకల్పించుకుని ‘అయిపో’ అని ఆదేశించగానే అది అయిపోతుంది. (36:82)

మిత్రులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవుడిని సృష్టించాడు. మానవుడిని కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కేవలం నోటితో “కున్ (అయిపో)” అని చెప్పేస్తే మానవుడు కూడా సృష్టించబడేవాడే. కానీ అలా చేయలేదండి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవుడిని సృష్టించటానికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని, భూమండలం మీద ఉన్న రకరకాల మట్టి నమూనాలను సేకరించి, తన స్వహస్తాలతో మానవ ఆకారాన్ని రూపుదిద్దాడు.

మిత్రులారా, ఖుర్ఆన్ లోని 38వ అధ్యాయం 75వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:

خَلَقْتُ بِيَدَيَّ
నేను నా స్వహస్తాలతో సృష్టించాను. (38:75)

అలాగే మరోచోట 15వ అధ్యాయం, 29వ వాక్యంలో తెలియజేశాడు:

وَنَفَخْتُ فِيهِ مِنْ رُوحِي
నేను మానవునిలో నా ఆత్మను ఊదాను. (15:29)

అలాగే మరొకచోట మానవుని గురించి రెండవ అధ్యాయం 31వ వాక్యంలో తెలియజేస్తున్నాడు:

وَعَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا
ఆది మానవుడైన ఆదంకు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వస్తువులన్నింటి పేర్లు నేర్పాడు. విద్యాబోధన స్వయంగా అల్లాహ్ చేశాడు. (2:31)

ఏ మానవునికైతే అల్లాహ్ తన స్వహస్తాలతో సృష్టించాడో, తన ఆత్మను ఊదాడో, తానే స్వయంగా విద్యాబోధన చేశాడో, అలాంటి మానవుడిని పట్టుకొని, కోతితో అభివృద్ధి చెందిన జీవి అని చెప్పటము లేదా సముద్రం నుంచి బయటికి వచ్చిన జీవి అని చెప్పటము, ముమ్మాటికీ ఇది మానవజాతిని కించపరచటమే సోదరులారా. వాస్తవం ఏమిటంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రపంచంలో ఉన్న జీవులన్నింటిలో మానవుడిని ఉత్తమ జీవిగా, శ్రేష్టమైన జీవిగా చేశాడు.

ఒక ఆది మానవుడే కాదు, ఆ ఆది మానవుడి సంతానమైన మానవులందరికీ కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇతర జాతుల మీద గౌరవ స్థానం కల్పించాడండి. ఈ విషయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ లోని 17వ అధ్యాయం 70వ వాక్యంలో తెలియజేశాడు:

وَلَقَدْ كَرَّمْنَا بَنِي آدَمَ وَحَمَلْنَاهُمْ فِي الْبَرِّ وَالْبَحْرِ وَرَزَقْنَاهُمْ مِنَ الطَّيِّبَاتِ وَفَضَّلْنَاهُمْ عَلَى كَثِيرٍ مِمَّنْ خَلَقْنَا تَفْضِيلًا
మేము ఆదం సంతతికి గౌరవం వొసగాము. వారికి నేలపైనా, నీటిలోనూ నడిచే వాహనాలను ఇచ్చాము. ఇంకా పరిశుద్ధమైన వస్తువులను వారికి ఆహారంగా ప్రసాదించాము. మేము సృష్టించిన ఎన్నో సృష్టితాలపై వారికి ఆధిక్యతను ఇచ్చాము. (17:70)

ఇది చివర్లో చెప్పిన మాట ఒకసారి మనము దయచేసి జాగ్రత్తగా గమనించాలి. అదేమిటంటే, సృష్టించిన ఎన్నో సృష్టితాలపై వారికి ఆధిక్యతను ఇచ్చాము. అంటే, ప్రపంచంలో అల్లాహ్ చే సృష్టించబడిన సృష్టితాలన్నింటి మీద మానవజాతిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆధిక్యతను, గౌరవాన్ని ఇచ్చి ఉన్నాడు కాబట్టి, మనిషి ప్రపంచంలో ఉన్న జీవులన్నింటిలో శ్రేష్టమైన జీవి మరియు అతని పుట్టుక మట్టితో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవ రూపంలోనే తన స్వహస్తాలతో చేశాడన్న విషయం మనము గమనించాలి మిత్రులారా.

అలాగే, ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర నుండి మనం తెలుసుకోవలసిన రెండవ విషయం, అహంకార పరిణామం ఎలా ఉంటుంది?

మిత్రులారా, అహంకారం అల్లాహ్ కు నచ్చదు. అహంకారిని అల్లాహ్ ఇష్టపడడు. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలాం వారి ముందర సాష్టాంగపడండి అని ఆదేశించాడో, అల్లాహ్ ఆదేశాన్ని షైతాన్ శిరసావహించలేదు. ఏమిటయ్యా ఎందుకు నీవు సాష్టాంగపడలేదు అంటే, అతనేమో “నన్ను అగ్నితో సృష్టించావు, మానవుడిని మట్టితో సృష్టించావు, నేను ఉత్తముణ్ణి” అని చెప్పాడు. అంటే, లోలోపల అతను అహంకారానికి గురి అయ్యి, “నేను అగ్నితో తయారు చేయబడిన వ్యక్తిని, గొప్పవాడిని, మానవుడు మట్టితో తయారు చేయబడ్డవాడు అల్పుడు,” అని లోలోపల అహంకారానికి గురి అయ్యి అతను ఆదం అలైహిస్సలాం వారి ముందర సాష్టాంగపడలేదు.

తత్కారణంగా జరిగిన విషయం ఏమిటి? అహంకారం ప్రదర్శించిన కారణంగా అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యాడు. అల్లాహ్ అతనికి ఎంతో గౌరవంగా స్వర్గంలో ప్రసాదించి ఉన్న గౌరవ స్థానాన్ని కోల్పోయాడు. స్వర్గం నుండి ధూత్కరించబడ్డాడు, బహిష్కరించబడ్డాడు. అంటే, అహంకారం వలన మనిషి తన గౌరవ స్థానాలను కోల్పోతాడు, దైవ శిక్షకు గురవుతాడని స్పష్టమవుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్పష్టంగా తెలియజేశారు:

لَا يَدْخُلُ الْجَنَّةَ مَنْ كَانَ فِي قَلْبِهِ مِثْقَالُ ذَرَّةٍ مِنْ كِبْرٍ
[లా యద్ఖులుల్ జన్నత మన్ కాన ఫీ ఖల్బిహి మిస్ఖాలు జర్రతిమ్ మిన్ కిబ్ర్]
ఎవరి హృదయంలోనైనా జొన్నగింజంత అహంకారమున్నా అతను స్వర్గంలోకి ప్రవేశింపజాలడు ( సహీ ముస్లిం)

మరొక ఉల్లేఖనంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గం మరియు నరకం గురించి తెలియజేస్తున్నారు. స్వర్గము మరియు నరకం పరస్పరము సంభాషణ చేసుకుంటాయి. స్వర్గంలో ఉన్నవారు ఎవరు, నరకంలో ఉన్నవారు ఎవరు అని పరస్పరము మాట్లాడుకుంటే, అప్పుడు నరకము స్వర్గముతో ఇలా అంటుంది:

فَقَالَتِ النَّارُ فِيَّ الْجَبَّارُونَ وَالْمُتَكَبِّرُونَ
[ఫకాలతిన్నారు ఫియ్యల్ జబ్బారూన వల్ ముతకబ్బిరూన]
నరకం స్వర్గంతో అంటుంది, “నా లోపల అందరూ దౌర్జన్యపరులు మరియు అహంకారులు ఉన్నారండి” అని చెబుతుంది.

అంటే మిత్రులారా, నరకంలో వెళ్ళేవాళ్ళలో అధిక శాతం ప్రజలు ఎవరు ఉంటారంటే, దౌర్జన్యపరులు ఉంటారు మరియు అహంకారులు ఉంటారు. అంటే, అహంకారి నరకానికి వెళ్తాడు, స్వర్గాన్ని కోల్పోతాడని స్పష్టమవుతుంది.

ఈ ఉల్లేఖనాలు విన్న తర్వాత కొంతమందికి ఒక అనుమానం కలుగుతుంది. అదేమిటంటే, ఏమండీ, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రసాదించిన మంచి బట్టలు ధరించటం, మంచి పాదరక్షలు ధరించటం, ఇవి కూడా అహంకారానికి చిహ్నమేనా అని అనుమానం కలిగి కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఇదే ప్రశ్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా ఒక వ్యక్తి అడిగాడు. ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడిగాడు:

إِنَّ الرَّجُلَ يُحِبُّ أَنْ يَكُونَ ثَوْبُهُ حَسَنًا وَنَعْلُهُ حَسَنَةً
ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మనిషి తన బట్టలు మంచివి ఉండాలని, తన పాదరక్షలు కూడా మంచివి ఉండాలని కోరుకుంటాడు. అలా మంచి బట్టలు, మంచి పాదరక్షలు ధరించడము కూడా అహంకారమేనా? అని అడిగితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బదులిచ్చారు:

إِنَّ اللَّهَ جَمِيلٌ يُحِبُّ الْجَمَالَ
అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అత్యంత సుందరుడు. సుందరమైన వాటిని ఇష్టపడతాడు.

الْكِبْرُ بَطَرُ الْحَقِّ وَغَمْطُ النَّاسِ
అహంకారం దేనిని అంటారంటే, సత్యాన్ని అంగీకరించకుండా ప్రజల్ని చులకనగా చూడటం.

ప్రజల్ని చిన్నచూపుతో చూసే భావం మరియు సత్యాన్ని అంగీకరించకుండా తిరస్కరించే భావాన్ని అహంకారం అంటారు అని చెప్పారు.

మిత్రులారా, పరిశుభ్రంగా ఉంచటం, మంచి బట్టలు ధరించటం, పరిశుద్ధంగా ఉండటం అహంకారము కాదు. కానీ ఒకవేళ బట్టల నుండే, వస్త్రాల నుండే ఎవరైనా అహంకారం ప్రదర్శిస్తే, అది కూడా అహంకారం అనబడుతుంది. ఉదాహరణకు, ముఖ్యంగా పురుషుల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైనా పురుషుడు చీలమండల కింద భూమికి ఆనుతూ బట్టలు ధరించి, గర్వంగా అతను నడిస్తే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతన్ని కూడా ఎంత భాగమైతే అతను చీలమండల కిందికి వదిలాడో బట్టల్ని, అంత భాగాన్ని నరకంలో కాల్చుతాడు అని చెప్పారు. మరొక ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, పూర్వం ఒక వ్యక్తి తన బట్టల్ను భూమిపై ఈడ్చుకుంటూ గర్వంతో, అహంకారంతో ప్రజల మధ్య నడుస్తూ ఉంటే, అందరూ చూస్తూ ఉండంగానే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతన్ని అలాగే భూమిలోకి పాతేశాడు. అల్లాహు అక్బర్. ఈ ఉల్లేఖనాలన్నింటినీ, షైతాను మరియు ఆదం అలైహిస్సలాం వారి వృత్తాంతాన్ని దృష్టిలో పెట్టుకుంటే, మనకు స్పష్టమయ్యే విషయం ఏమిటంటే మిత్రులారా, అహంకారము మానవునికి ఎట్టి పరిస్థితుల్లో తగదు. అహంకారం వల్ల మనిషి తన గౌరవ స్థానాన్ని, అల్లాహ్ అనుగ్రహాలను కోల్పోతాడు, నరకవాసి అయిపోతాడు. కాబట్టి, అహంకారం నుండి దూరంగా ఉండాలి.

అలాగే, ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర నుండి మనం గ్రహించవలసిన మరొక విషయం ఏమిటంటే, షైతాన్ మానవుని బహిరంగ శత్రువు. మిత్రులారా, ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం విన్నాం, ఎప్పుడైతే ఆదం అలైహిస్సలాం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో తప్పు చేసిన తర్వాత క్షమించమని వేడుకున్నారో, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దయ తలచి ఆదం అలైహిస్సలాం వారి తప్పుని మన్నించేశాడు. ఆ విషయాలన్నీ మనము ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో తెలుసుకున్నాం.

అయితే, షైతాన్ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో సవాలు చేశాడు. నేను మళ్ళీ వెళ్లి మానవుని దారిలో కూర్చుండిపోయి, నలువైపుల నుండి అతన్ని నీ మార్గం మీద నడవకుండా పక్కకి దారి తప్పేటట్టు చేసేస్తాను అని సవాలు విసిరి వచ్చాడు. మిత్రులారా, అతను సవాలు విసిరి వస్తే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవులను హెచ్చరించాడు. ఏమన్నాడు?

وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُبِينٌ
షైతాన్‌ అడుగుజాడలలో మాత్రం నడవకండి. వాడు మీకు బహిరంగ శత్రువు. [2:168]

మానవులారా, మీరు షైతాను అడుగుజాడలలో నడవకండి, వాడు మీకు బహిరంగ శత్రువు అని చెప్పారు. మిత్రులారా, షైతాన్ మానవునికి బహిరంగ శత్రువు. అతను మానవునికి ఏమంటాడు, ఏ పనులు చేయమంటాడు, అది కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ లో తెలియజేశాడు. ఖుర్ఆన్ లోని రెండవ అధ్యాయం, 169వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేశాడు:

إِنَّمَا يَأْمُرُكُمْ بِالسُّوءِ وَالْفَحْشَاءِ وَأَنْ تَقُولُوا عَلَى اللَّهِ مَا لَا تَعْلَمُونَ
వాడు మిమ్మల్ని కేవలం చెడు వైపుకు, నీతి బాహ్యత వైపుకు పురికొల్పుతాడు. ఏ విషయాల జ్ఞానం మీకు లేదో వాటిని అల్లాహ్‌ పేరుతో చెప్పమని మీకు ఆజ్ఞాపిస్తాడు. (2:169)

అనగా, కేవలం చెడు వైపుకు, నీతిబాహ్యత వైపుకు పురికొల్పుతాడు ఆ షైతాన్. కాబట్టి, మీరు జాగ్రత్తపడండి. ఎందుకంటే, అతను మీకు తెలియని వాటిని అల్లాహ్ పేరుతో చెప్పండి అని ఆజ్ఞాపిస్తాడు. నీతిబాహ్యమైన పనులు చేయమని, తెలియని విషయాలు అల్లాహ్ చెప్పాడు అని చెప్పమని అతను ఆజ్ఞాపిస్తాడు కాబట్టి, షైతాను మాటల్లో పడకుండా జాగ్రత్త పడండి అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవులను హెచ్చరించి ఉన్నాడు.

మిత్రులారా, షైతాన్ ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం వారిని తప్పు చేయించి స్వర్గం నుండి బహిష్కరణకు గురయ్యేటట్టు చేశాడు. మన నుండి కూడా తప్పులు చేయించి, మనల్ని కూడా స్వర్గానికి చేరకుండా నరకానికి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు కాబట్టి, షైతాన్ మన శత్రువు అన్న విషయము తెలుసుకొని, మనసులో అతను కలిగించే ఆలోచనలకు మనము గురికాకుండా జాగ్రత్త పడాలి.

అలాగే, ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర నుండి మనం గ్రహించవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దయామయుడు. ఆయన ఎంత గొప్ప దయ కలిగినవాడంటే మిత్రులారా, మనిషి వల్ల తప్పు దొర్లితే, తప్పు దొర్లిన తర్వాత మానవుడు అల్లాహ్ సన్నిధిలో క్షమాభిక్ష వేడుకుంటే, పశ్చాత్తాపపడితే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తన దయతో మనిషి పశ్చాత్తాపాన్ని ఆమోదించి, అతని పాపాన్ని తుడిచేస్తాడు, మన్నించేస్తాడు, క్షమించేస్తాడు.

మిత్రులారా, ఆదం అలైహిస్సలాం వారు కూడా షైతాను మాటల్లో పడి, అతను చెప్పిన మాటల్ని నమ్మి, నిషేధించిన వృక్ష ఫలాన్ని తిని, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పెట్టిన నిబంధనను అతిక్రమించారు కాబట్టి, ఆయనతో కూడా పొరపాటు జరిగింది. ఆయనతో పొరపాటు దొర్లిన తర్వాత, ఆయన ప్రపంచంలోకి వచ్చిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో క్షమాభిక్ష వేడుకున్నారు. ఆయన క్షమాభిక్ష వేడుకుంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయనను మన్నించాడు. ఈ రెండు విషయాలు కూడా ఖుర్ఆన్ లో తెలుపబడి ఉన్నాయి. ఖుర్ఆన్ లోని ఏడవ అధ్యాయం, 23వ వాక్యంలో, ఏ పలుకులు తీసుకొని ఆదం అలైహిస్సలాం అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుకున్నారని తెలుపబడింది:

رَبَّنَا ظَلَمْنَا أَنْفُسَنَا وَإِنْ لَمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
వారిద్దరూ, “మా ప్రభూ! మేము మా స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాము. ఇప్పుడు నీవు గనక మాకు క్షమాభిక్ష పెట్టి, మాపై దయదలచకపోతే నిశ్చయంగా మేము నష్టపోతాము” అని వేడుకున్నారు. (7:23)

ఈ పలుకులతో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారి సన్నిధిలో క్షమాభిక్ష వేడుకోగా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారిని మన్నించేశాడు. మన్నించేశాడన్న విషయం కూడా తెలియజేసి ఉన్నాడు, రెండవ అధ్యాయం, 37వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:

فَتَابَ عَلَيْهِ
ఆదం అలైహిస్సలాం క్షమాభిక్ష వేడుకుంటే, “ఫతాబ అలైహి“, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయన తోబాను, పశ్చాత్తాపాన్ని ఆమోదించి, ఆయనను క్షమించేశాడు.

మిత్రులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనంలో ఈ విధంగా తెలుపబడింది:

إِنَّ اللَّهَ يَبْسُطُ يَدَهُ بِاللَّيْلِ لِيَتُوبَ مُسِيءُ النَّهَارِ، وَيَبْسُطُ يَدَهُ بِالنَّهَارِ لِيَتُوبَ مُسِيءُ اللَّيْلِ، حَتَّى تَطْلُعَ الشَّمْسُ مِنْ مَغْرِبِهَا
[ఇన్నల్లాహ యబ్ సుతు యదహు బిల్ లైలి లియతూబ ముసి ఉన్నహార్, వయబ్ సుతు యదహు బిన్నహారి లియతూబ ముసి ఉల్ లైల్, హత్తా తత్లుఅష్షమ్సు మిమ్ మగ్రిబిహా]

అనగా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా రాత్రంతా చేయి చాచి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరి కోసం అండి? ఉదయం పూట తప్పు చేసిన వారు రాత్రి తప్పును గ్రహించి అల్లాహ్ తో క్షమాభిక్ష వేడుకుంటారేమో, వారిని మన్నించేద్దాము అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చేతులు చాచి మరి ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే, పగలంతా కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చేతులు చాచి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరి కోసం అంటే, రాత్రి పూట తప్పులు చేసిన వారు బహుశా ఉదయాన్నే తప్పును గ్రహించి అల్లాహ్ తో క్షమాభిక్ష వేడుకుంటారేమో అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారిని క్షమించటానికి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇలా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, సూర్యుడు పడమర దిక్కు నుంచి ఉదయించే రోజు వచ్చేంతవరకు కూడా ఇదే విధంగా భక్తుల పాపాలను మన్నించటానికి రేయింబవళ్ళు ఎదురు చూస్తూ ఉంటాడు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

అల్లాహు అక్బర్. ఎంత దయామయుడండి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా! మన్నించటానికి, క్షమించటానికి రేయింబవళ్ళు ఆయన ఎదురు చూస్తూ ఉంటే, తప్పులు చేసే మనము అల్లాహ్ తో క్షమాభిక్ష వేడుకోవటానికి ఆలస్యం ఎందుకు చేయాలి మిత్రులారా? వెంటనే మనము కూడా అల్లాహ్ సన్నిధిలో క్షమాభిక్ష వేడుకుంటూ ప్రతిరోజు గడపాలి. ఎందుకంటే, మనం ప్రతిరోజు తప్పులు దొర్లుతూనే ఉంటాయి కాబట్టి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఉల్లేఖనంలో ఇలా తెలుపబడింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలుపుతున్నారు:

يَا أَيُّهَا النَّاسُ تُوبُوا إِلَى اللَّهِ فَإِنِّي أَتُوبُ فِي الْيَوْمِ إِلَيْهِ مِائَةَ مَرَّةٍ
ఓ మానవులారా, మీరు అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాప పడండి. నేను కూడా ప్రతిరోజు అల్లాహ్ సమక్షంలో 100 సార్లు పశ్చాత్తాప పడతాను అని చెప్పారు.

అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తప్పులు చేయరండి ఆయన. తప్పులు చేయకపోయినా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారి సన్నిధిలో ఆయన 100 సార్లు క్షమాభిక్ష వేడుకుంటున్నారు ప్రతిరోజు అంటే, అడుగడుగునా తప్పులు చేసే మనము అల్లాహ్ తో ఎన్ని సార్లు క్షమాభిక్ష వేడుకోవాలి, పశ్చాత్తాప పడాలి, గమనించండి మిత్రులారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా ఒక విషయాన్ని తెలియజేశారు, ఆయన ఏమన్నారంటే:

كُلُّ بَنِي آدَمَ خَطَّاءٌ وَخَيْرُ الْخَطَّائِينَ التَّوَّابُونَ
ప్రతి మానవుడు తప్పు చేస్తాడు. అయితే తప్పు చేసిన వాళ్ళలో క్షమాభిక్ష వేడుకున్నవాడు ఉత్తముడు అని చెప్పారు.

కాబట్టి మిత్రులారా, నాతో, మనందరితో తప్పులు దొర్లుతూనే ఉంటాయి. అయితే మన బాధ్యత ఏమిటంటే, మనము వెంటనే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో పశ్చాత్తాపపడి క్షమాభిక్ష వేడుకోవాలి. ఆది మానవునితో కూడా తప్పు జరిగింది, ఆయన కూడా క్షమాభిక్ష వేడుకున్నారు. ఆదిమానవుని సంతానమైన మనతో కూడా తప్పులు దొర్లుతాయి, మనము కూడా క్షమాభిక్ష వేడుకుంటూనే ఉండాలి.

ఇక ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర నుండి మనం గ్రహించవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మొదటి నేరం ఎవరు చేశారు? మొదటి నేరం చేసిన కారణంగా, దాని దుష్ప్రభావం అతనిపై ఎలా పడుతూ ఉంది?

మిత్రులారా, ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం విన్నాం, ఆదం అలైహిస్సలాం వారి ఇద్దరు కుమారులు హాబిల్ మరియు కాబిల్ మధ్య వివాహ విషయంలో గొడవ జరిగింది. అయితే, కాబిల్ అన్యాయంగా, దౌర్జన్యంగా, మొండిపట్టు పట్టి, చివరికి తన సోదరుడైన హాబిల్ ని హతమార్చేశాడు.

మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

لَا تُقْتَلُ نَفْسٌ ظُلْمًا إِلَّا كَانَ عَلَى ابْنِ آدَمَ الْأَوَّلِ كِفْلٌ مِنْ دَمِهَا لِأَنَّهُ كَانَ أَوَّلَ مَنْ سَنَّ الْقَتْلَ
ప్రపంచంలో ఎప్పుడు, ఎక్కడ, ఎక్కడైనా అన్యాయంగా ఒక మనిషి ప్రాణం తీయబడింది, హత్య చేయబడింది అంటే, ఆ హత్య యొక్క పాపములోని ఒక భాగము కాబిల్ ఖాతాలోకి కూడా చేరుతుంది.

ఎందుకంటే, ప్రపంచంలో హత్య అనే ఒక నేరాన్ని ప్రారంభించి మానవులకు అతనే చూపించాడు కాబట్టి, ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ అయితే హత్యలు జరుగుతాయో, హత్య చేసిన వారికి కూడా పాపము ఉంటుంది, ఆ హత్య ప్రపంచానికి నేర్పించిన కాబిల్ కి కూడా ఆ నేరములోని పాప భాగము చేరుతుంది అని చెప్పారు.

మిత్రులారా, అందుకోసమే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు హెచ్చరించారు:

وَمَنْ دَعَا إِلَى ضَلَالَةٍ كَانَ عَلَيْهِ مِنَ الْإِثْمِ مِثْلُ آثَامِ مَنْ تَبِعَهُ، لَا يَنْقُصُ ذَلِكَ مِنْ آثَامِهِمْ شَيْئًا
అనగా, ఎవరైనా ఒక వ్యక్తి ప్రజలను మార్గభ్రష్టత్వానికి గురిచేసే ఏదైనా ఒక కార్యం నేర్పిస్తే, ఆ మార్గంలో ఎంతమంది అయితే నడుచుకొని పాపానికి పాల్పడతారో, వారికి కూడా పాపము ఉంటుంది, ఆ మార్గము చూపించిన వ్యక్తికి కూడా ఆ పాపము యొక్క భాగము చేరుతుంది అని చెప్పారు.

మిత్రులారా, ఈ విధంగా ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర నుండి మనము అనేక విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అవన్నీ మనము ఒక్కొక్కటిగా నేర్చుకొని, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో భయపడుతూ, పశ్చాత్తాపపడుతూ, అల్లాహ్ ను ఆరాధించుకుంటూ జీవితం గడిపే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=15524

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

ఇబ్రాహీం (అలైహిస్సలాం) & తౌహీద్ [వీడియో]

బిస్మిల్లాహ్

[43:27 నిముషాలు]
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ హఫిజహుల్లాహ్

జుల్ హిజ్జ, బక్రీద్, ఉమ్రా, హజ్జ్ – మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/umrah-hajj-telugu-islam

విశ్వాసము – మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/belief-iman-telugu-islam

ప్రవక్తలపై విశ్వాసం [వీడియో]

బిస్మిల్లాహ్

[4:45 నిముషాలు]
ఈ వీడియో క్లిప్ క్రింది వీడియో నుండి తీసుకోబడింది.
విశ్వాస మూల సూత్రాలు: మూడవ పాఠం – విశ్వాస మూల స్తంభాలు (అర్కానె ఈమాన్‌)
https://teluguislam.net/2019/11/23/pillars-of-eman/

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

4- ప్రవక్తలపై విశ్వాసం:

ప్రవక్తలపై సంక్షిప్తంగా ఇలా విశ్వసించాలి: అల్లాహ్‌ తన దాసుల వైపునకు ప్రవక్తల్ని శుభవార్తనిచ్చువారిగా, హెచ్చరించువారిగా, ధర్మం వైపునకు పిలుచువారిగా జేసి పంపాడు.

وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ

(మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరిక చేశాము: ‘అల్లాహ్‌ ను ఆరాధించండి. మిథ్యా దైవాల ఆరాధనకు దూరంగా ఉండండి’). (సూరె నహ్ల్‌ 16: 36).

ప్రవక్తల్ని విశ్వసించినవారే సాఫల్యం పొందువారు. వారిని తిరస్కరించినవారే నష్టం, అవమానం పాలయ్యేవారు.

ప్రవక్తలందరి పిలుపు ఒక్కటేనని మనం విశ్నసించాలి. అది అల్లాహ్‌ ఏకత్వం మరియు సర్వ ఆరాధనల్లో ఆయన్ని అద్వితీయునిగా నమ్మటం. అయితే వారికి నొసంగబడిన ధర్మశాస్త్రాలు, ఆదేశాలు, శాసనాలు వేరు వేరు. అల్లాహ్‌ కొందరికి మరి కొందరిపై ఘనత ప్రసాదించాడు. అందరిలోకెల్లా గొప్ప ఘనతగల మరియు చిట్టచివరి, అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ స సల్లల్లాహు అలైహి వసల్లం. చదవండి అల్లాహ్ ఆదేశాలు:

وَلَقَدْ فَضَّلْنَا بَعْضَ النَّبِيِّينَ عَلَىٰ بَعْضٍ

(మేము కొందరు ప్రవక్తలకు మరికొందరు ప్రవక్తల కంటే ఉన్నత స్థానాలను ఇచ్చాము). 
(సూరె బనీ ఇస్రాఈల్‌ 17: 55).

మరో చోట ఆదేశించాడు;

مَّا كَانَ مُحَمَّدٌ أَبَا أَحَدٍ مِّن رِّجَالِكُمْ وَلَٰكِن رَّسُولَ اللَّهِ وَخَاتَمَ النَّبِيِّينَ

((మానవులారా) ముహమ్మద్‌ మీలోని ఏ వురుషునికీ తండ్రి కారు. కాని ఆయన అల్లాహ్‌ యొక్క ప్రవక్త, దైవప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరివారు). (అహ్‌ జాబ్‌ 33: 40).

ఇక ఏ ప్రవక్తల పేర్తతో సహా అల్లాహ్‌ లేక ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారో వారిని అదే వివరంగా విశ్వసించాలి. ఉదా: నూహ్‌, హూద్‌, సాలిహ్‌, ఇబ్రాహీం, వగైరా ప్రవక్తలు. అల్లాహ్‌ వారందరిపై అనేకానేక దయాకరుణా మేఘాలు కురిపించుగాకా! ఆమీన్‌.