ప్రళయదినం నాడు దేవుని నీడ పట్టున ఆశ్రయం పొందే ఏడుగురు వ్యక్తులు

610. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా  తెలిపారు:-

దేవుని (కారుణ్య) ఛాయ తప్ప మరెలాంటి ఛాయ లభించని (ప్రళయ) దినాన దేవుడు ఏడుగురు వ్యక్తులను తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు. వారిలో

  1.  న్యాయంగా పాలన చేసే పరిపాలకుడు;

  2.  తన యౌవన జీవితం (వ్యర్ధ కార్యకలాపాల్లో గడపకుండా అంతిమ శ్వాస వరకూ) దైవారాధనలో గడిపిన యువకుడు;

  3.  మనసంతా మస్జిదులోనే ఉండేటటువంటి వ్యక్తి (అంటే ఉద్యోగం, వ్యాపారం తదితర ప్రపంచ వ్యవహారాల్లో నిమగ్నుడయి పోయినా ధ్యాసంతా మస్జిదు వైపు  ఉండేటటువంటి మనిషన్న మాట);

  4.  కేవలం ధైవప్రసన్నత కోసం పరస్పరం అభిమానించుకునే, ధైవప్రసన్నత కోసమే పరస్పరం కలుసుకొని విడిపోయే ఇద్దరు వ్యక్తులు;

  5.  అంతస్తు, అందచందాలు గల స్త్రీ అసభ్యకార్యానికి పిలిచి నప్పుడు, తాను దైవానికి భయపడుతున్నానంటూ ఆమె కోరికను తిరస్కరించిన వ్యక్తి ;

  6.  కుడి చేత్తో ఇచ్చింది ఎడమచేతికి సయితం తెలియనంత గోప్యంగా దానధర్మాలు చేసిన వ్యక్తి;

  7.  ఏకాంతంలో దైవాన్ని తలచుకొని కంటతడి పెట్టే వ్యక్తి.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 36 వ అధ్యాయం – మన్ జలస ఫిల్ మస్జిది యన్తజిరుస్సలాతి వ ఫజ్లిల్ మసాజిద్]

జకాత్ ప్రకరణం : 30 వ అధ్యాయం – గుప్తదానం – దాని ప్రాముఖ్యత
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

అజాన్ చెప్పడంలో మరియు సామూహిక నమాజు చేయటంలో గల పుణ్యాలు

251. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:-

అజాన్ చెప్పడంలో, మొదటి పంక్తిలో చేరడంలో ఎంత పుణ్యం ఉందో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు లాటరీ పద్ధతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, మీరు తప్పకుండా పరస్పరం లాటరీ వేసుకుంటారు. అలాగే వేళ కాగానే తొలి సమయంలో నమాజు చేయడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటీ పడతారు. అదే విధంగా ఇషా, ఫజ్ర్ (సామూహిక) నమాజులు చేయడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే, వాటికోసం కాళ్ళీడ్చుకుంటూ నడవ వలసి వచ్చినా సరే వారు పరస్పరం పోటీపడి వస్తారు.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 9 వ అధ్యాయం – అల్ ఇస్తిహామి ఫిల్ అజాన్]

నమాజు ప్రకరణం – 28 వ అధ్యాయం – పంక్తులను వంకరటింకరగా లేకుండా తిన్నగా ఉంచాలి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

ఇస్లాం ప్రకారం అన్నిటికన్నా శ్రేష్ఠమైన పనులు (ఆచరణలు)

24. హజ్రత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ (రధి అల్లాహు అన్హు) కధనం:-

ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “ఇస్లాం కు సంబంధించిన ఆచరణలలో అన్నిటికన్నా శ్రేష్ఠమైన ఆచరణ ఏది ?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీవు బీదసాదలకు అన్నంపెట్టు . (అలాగే)  పరిచయమున్నా లేకపోయినా ప్రతివ్యక్తి కీ సలాం చెయ్యి. ఇవే అన్నిటికంటే శ్రేష్ఠమైన ఆచరణలు” అని బోధించారు.

[సహీహ్ బుఖారీ : 2 వ ప్రకరణం – ఈమాన్, 6 వ అధ్యాయం – తాముల్ తఆమ్ మినల్ ఇస్లాం]

విశ్వాస ప్రకరణం : 14 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించేవాడు

26. హజ్రత్ అనస్ (రధి అల్లాహు అన్హు) కధనం:- ఈ క్రింది మూడు లక్షణాలు కలిగి ఉన్నవాడు విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేశారు :

1. అందరికంటే ఎక్కువ దేవుడ్ని, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అభిమానించడం,
2. ఎవరిని అభిమానించినా కేవలం దైవప్రసన్నత కోసం అభిమానించడం,
3. (నరక) అగ్నిలో పడటానికి ఎంతగా అసహ్యించుకుంటాడో  అవిశ్వాస స్థితి వైపుకు మరలిపోవడానికి కూడా అంతగా అసహ్యించుకోవడం.

[సహీహ్ బుఖారీ : 2 వ ప్రకరణం – ఈమాన్, 9 వ అధ్యాయం – హలావతిల్ ఈమాన్]

విశ్వాస ప్రకరణం : 15 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

ఏక ధైవారాధకుల నరక విమోచనకై సిఫారసు

116. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రధి అల్లాహు అన్హు) కధనం:-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు :

 (పరలోకంలో కర్మల విచారణ ముగిసిన తరువాత) స్వర్గవాసులు స్వర్గంలో, నరకవాసులు నరకంలో ప్రవేశిస్తారు. ఆ తరువాత “హృదయంలో ఆవగింజంత విశ్వాసం ఉన్న వారిని (సయితం) నరకం నుండి బయటకు తీయండి” అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఈ ఆజ్ఞతో (చాలామంది) మానవులు నరకం నుండి బయటపడతారు. వారిలో కొందరు (బాగా కాలిపోయి బొగ్గులా) నల్లగా మారిపోతారు. అలాంటి వారిని వర్షనది లేక ‘జీవనది’ లో పడవేస్తారు. దాంతో వారు యేటి ఒడ్డున ధాన్యపు విత్తనం మొలకెత్తినట్లు మొలకెత్తుతారు. ఆ మొక్క పసిమి వన్నెతో ఎంత అందంగా ముస్తాబయి మొలకెత్తుతుందో మీరు చూడలేదా?

[సహీహ్ బుఖారీ : 2 వ ప్రకరణం – ఈమాన్,15  వ అధ్యాయం – తఫాజులి అహ్ లిల్ ఈమాని ఫిల్ ఆమాల్]

విశ్వాస ప్రకరణం : 80 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

శ్రమకోర్చి ఖుర్ఆన్ పఠించే వ్యక్తి ఘనత

461. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:-

“ఖుర్ఆన్ కంఠపాఠి గౌరవనీయులైన దైవదూత లాంటివాడు. అతను (ప్రళయదినాన) వారితోనే ఉంటాడు. ఖుర్ఆన్ పఠించడం తనకు ఎంతో ప్రయాసతో కూడిన పని అయినప్పటికీ, దాన్ని పఠించి కంఠస్తం చేసే వ్యక్తి రెట్టింపు పుణ్యఫలానికి అర్హుడవుతాడు.”

[సహీహ్ బుఖారీ : 65 వ ప్రకరణం – అత్తఫ్సీర్ ఖుర్ఆన్, 80 వ అధ్యాయం – ‘అబస’ సూరా]

ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం – 38 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

ముష్టి ఎత్తకుండా లేమిలో సహనం వహించడం

627. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రధి అల్లాహు అన్హు) కధనం:-

కొందరు అన్సార్ ముస్లింలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి కొంత ధనం అర్ధించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ఇచ్చారు. కానీ వారు మళ్ళీ అడిగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రెండోసారి కూడా ఇచ్చారు. ఇలా ఇస్తూపోయారు, చివరికి ఆయన దగ్గర ఉన్నదంతా హరించుకుపోయింది. అప్పుడు ఆయన ఇలా అన్నారు :

“నా దగ్గరున్న ధనసంపద (ఎంతైనా) మీ కివ్వడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. మీకు ఇవ్వకుండా నేను ఏదీ దాచుకోను. కాని (ఒక విషయం గుర్తుంచుకోండి) దానం అడగకుండా ఉండే వాడికి దేవుడు అలాంటి పరిస్థితి రాకుండా  కాపాడుతాడు. నిరపేక్షా వైఖరిని అవలంబించే వాడికి దేవుడు అక్కరలేనంత ప్రసాదిస్తాడు. సహనం  వహించే వాడికి సహనశక్తి ప్రసాదిస్తాడు. (దైవానుగ్రహాలలో) సహనానికి మించిన మహాభాగ్యం లేదు.”

సహీహ్ బుఖారీ : 24 వ ప్రకరణం – జకాత్, 50 వ అధ్యాయం – అల్ ఇస్తిఫాఫి అనిల్ మస్అల

జకాత్ ప్రకరణం : 42 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నమాజు కోసం మస్జిదుకు వెళ్ళే వారికి అడుగడుగునా పుణ్యమే

388. హజ్రత్ అబూ మూసా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:-

“మస్జిద్ కు అందరికంటే ఎక్కువ దూరముండే వ్యక్తి నమాజు కోసం అందరికంటే ఎక్కువ దూరం నడవ వలసి వస్తుంది. అందువల్ల అతనికే అందరికన్నా ఎక్కువ నమాజు పుణ్యం లభిస్తుంది. అలాగే (ఇషా) నమాజు తొందరగా చేసి పడుకునే వ్యక్తి కంటే ఇమామ్ వెనుక సామూహిక నమాజు కోసం ఎదురు చూసే వ్యక్తికి ఎక్కువ పుణ్యం లభిస్తుంది.”

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 31 వ అధ్యాయం – సలాతిల్ ఫజ్రి ఫీజమాఅత్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 50 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నమాజు చేయకుండా తెల్లవారే దాకా పడుకునే వ్యక్తి

444. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-

“మనిషి రాత్రివేళ పడుకున్న తరువాత షైతాన్ అతని ముచ్చిలి గుంటపై మూడు ముళ్ళు వేస్తాడు. ప్రతిముడి మీద ‘రాత్రి ఇంకా చాలా ఉంది, హాయిగా పడుకో’ అంటూ మంత్రించి ఊదుతాడు. అప్పుడు మనిషి మేల్కొని దేవుడ్ని స్మరించగానే ఒక ముడి ఊడిపోతుంది.తరువాత వుజూ చేస్తే రెండవ ముడి ఊడిపోతుంది. ఆ తరువాత నమాజు చేస్తే మూడవ ముడి కూడా ఊడిపోతుంది. దాంతో ఆ వ్యక్తి తెల్లవారుజామున ఎంతో ఉత్సాహంతో, సంతోషంతో లేస్తాడు. అలా చేయకపోతే వళ్ళు బరువయి బద్ధకంగా లేస్తాడు”

[సహీహ్ బుఖారీ : 19 వ ప్రకరణం – తహజ్జుద్, 12 వ అధ్యాయం – అఖ్దషైతాని అలా ఖాఫియాతిర్రాస్]

ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం – 28 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నమాజు కోసం పరుగెత్తరాదు, నింపాదిగా నడవాలి

351. హజ్రత్ అబూ ఖతాదా (రధి అల్లాహు అన్హు) కధనం:-

మేమంతా  ఓ రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తొ కలిసి నమాజు చేస్తుంటే, కొందరు పరిగెత్తుకొస్తున్న అడుగుల చప్పుడు  దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు విన్పించింది. నమాజు ముగిసిన తరువాత ఆయన వారిని ఉద్దేశించి
“ఏమిటీ, ఏమయింది మీకు అలా పరిగెత్తుకు వచ్చారు?”
అని అడిగారు. దానికి వారు

“మేము త్వరగా జమాఅత్ (సామూహిక నమాజు)లో కలవడానికి పరిగెత్తాము”
అని విన్నవించుకున్నారు.

అప్పుడు  దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హితవు చేస్తూ
“ఇక నుండి అలా చేయకండి. నమాజు చేయడానికి వచ్చినప్పుడల్లా హుందాగా, నింపాదిగా నడచి రండి. సామూహిక నమాజులో ఎంత భాగం లభిస్తే అంతే చేయండి. మిగిలిన భాగాన్ని మీరంతగా మీరు (వ్యక్తిగతంగా) చేసి నమాజును పూర్తి చేసుకోండి”
అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 20  వ అధ్యాయం – ఖౌలిర్రజులి ఫఅతతుసస్సలాత్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 28 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్