మూడు విడాకులు (తలాఖ్ లు) ఒక్కటేనా (هل الطلاق الثلاث واحد؟)

బిస్మిల్లాహ్

ఒకే సమయం, సందర్భంలో ఇచ్చిన మూడు విడాకులు మూడు అవుతాయని చాలా మంది అనుకుంటారు, వాస్తవమేమిటంటే అవి ఒకటిగానే లెక్కించబడతాయి. దీని ఆధారాలు ఈ వీడియోలో తెలుసుకోండి.

[6 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

నక్షత్రాల ప్రభావ విశ్వాసం

బిస్మిల్లాహ్

మానవ జీవితంలో, విశ్వంలో సంభవించే సంఘటనల్లో నక్షత్రాల ప్రభావం ఉంటుందని విశ్వసించుట కూడా షిర్క్‌.

జైద్‌ బిన్‌ ఖాలిద్‌ జుహనీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: హుదైబియా ప్రాంతంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు నమాజు చేయించారు. అదే రాత్రి వర్షం కురిసింది. నమాజు ముగించి ప్రజల వైపునకు తిరిగి “మీ ప్రభువు ఏమన్నాడో మీకు తెలుసా?” అని అడిగారు. అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త కే బాగా తెలుసు అని సహచరులు సమాధానం పలికారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్‌ ఇలా తెలిపాడని విశదీకరించారు: “ఈ రోజు ఉదయం నా దాసుల్లో కొందరు విశ్వాసులయ్యారు, మరికొందరు అవిశ్వాసులయ్యారు. ‘అల్లాహ్‌ దయవలన మాకు వర్షం కురిసింది’ అని అన్నవారు తారాబలాన్ని నిరాకరించి, నన్ను విశ్వసించిన వారయ్యారు. దీనికి భిన్నంగా ఫలాన నక్షత్ర ప్రభావంతో వర్షం కురిసింది అన్నవారు నక్షత్ర విశ్వాసులయి, నన్ను తిరస్కరించిన వారయ్యారు”. (బుఖారి 846, ముస్లిం 71).

అదే విధంగా పత్రిక, మ్యాగజైన్లలో వచ్చే రాశిచక్ర వివరాలను చదివి, అవి నక్షత్రాల ప్రభావంతోనే ఉంటాయని విశ్వసిస్తే అతను బహుదైవారాధకుడవుతాడు. ఒకవేళ అతను తృప్తి కొరకు చదివితే పాపాత్ముడవుతాడు. ఎందుకనగా? షిర్క్‌ విషయాలను చదివి తృప్తి పొందడం యోగ్యం కాదు, దానిని విశ్వసించాలని షైతాన్‌ ప్రేరేపించవచ్చు కూడా, అప్పడు అది చదవడం ఒక షిర్క్‌ పని కోసం ఆధారంగా మారిపోతుంది.


[ఇది ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు అను పుస్తకం నుంచి తీసుకోబడింది. ]

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/

పర స్త్రీతో ఏకాంతంలో ఉండుట | ఇస్లామీయ  నిషిద్ధతలు & జాగ్రత్తలు

బిస్మిల్లాహ్

షైతాన్‌ ఎల్లప్పుడూ మానవులను ఏదైనా ఉపద్రవంలో పడవేయడానికి మరియు నిషిద్ధ కార్యానికి గురిచెయ్యడానికి పరితపిస్తూ ఉంటాడు. అందుకే అల్లాహ్‌ మనల్ని ఈ విధంగా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ وَمَن يَتَّبِعْ خُطُوَاتِ الشَّيْطَانِ فَإِنَّهُ يَأْمُرُ بِالْفَحْشَاءِ وَالْمُنكَرِ

“విశ్వాసులారా! షైతాను అడుగుజాడలలో నడవకండి, ఎవడు షైతాన్‌ అడుగుజాడలలో నడుస్తాడో నిశ్చయంగా షైతాన్‌ అతనిని అశ్లీలమైన మరియు అసభ్యకరమైన పనులు చేయటానికి ప్రోత్సహిస్తాడు” (సూర నూర్‌ 24:21)

being-alone-with-a-non-mahram-woman

మనిషి శరీరంలో రక్తం ఎలా ప్రవహిస్తుందో అలాగే షైతాన్‌ మానవ శరీరంలో తిరుగుతుంటాడు. మానవులను అశ్లీల  కార్యం (వ్యభిచారం)లో పడవేయడానికి షైతాన్‌ మార్గాల్లో ఒకటి పరస్త్రీతో ఒంటరిగా ఉండడం. అందుకే ఇస్లాం ధర్మం ఆ మార్గాన్ని మూసివేసింది. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఆదేశించారు?

“వినండి! ఏ పురుషుడైనా ఏ స్త్రీతో ఏకాంతంలో ఉంటాడో వారిద్దరితో మూడోవాడు షైతాన్‌ ఉంటాడు”. (తిర్మిజి 2165. మిష్కాతుల్‌ మసాబీహ్‌ 3118).

being-alone-with-a-non-mahram-woman

ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారని అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్ర్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“ఈ రోజు తరువాత ఎవ్వరూ కుడా భర్త లేకుండా ఒంటరిగా ఉన్న స్త్రీ ఇంటిలో ప్రవేశించకూడదు. (ఏదైనా అవసరం ఉండి పోదలుచుకుంటే) అతనితో ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులు ఉండాలి”.(ముస్లిం 2173).

ఏ పురుషుడు కూడా ఇంటిలోగాని, గదిలోగాని, వాహనములోగాని ఎక్కడైనా పరస్త్రీతో ఏకాంతంలో ఉండకూడదు. ఆమె సోదరుని భార్య అయినా, సేవకురాలు, ఆడ పనిమనిషి అయినా, డాక్టర్‌ వద్ద ఆడరోగి అయినా ఎవరైనా సరే. అనేక మంది తమపై లేదా ఇతరులపై నమ్మకంతో ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు. అందువల్ల వ్యభిచారంలో లేదా దాని కారణంగల విషయాల్లో పడే భయం ఉంటుంది. తర్వాత వంశవృక్ష౦లో లోటు మరియు అక్రమ సంతానాలు అధికమవుతున్న విషాద వార్తలు వినవస్తాయి.


[ఇది ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు అను పుస్తకం నుంచి తీసుకోబడింది. ]

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/

“నమాజు సరిగా నెరవేర్చని వ్యక్తి” హదీసు

బిస్మిల్లాహ్

పారిభాషిక పదంగా “నమాజు సరిగా నెరవేర్చని వ్యక్తి”

అల్లామా అల్‌బానీ, బహుశా పాఠకుల సౌకర్యార్థం, పుస్తక అంశాలలో కేవలం “నమాజు సరిగా నెరవేర్చని వ్యక్తి” అన్న ఒక్క పదం తప్ప మరే పారిభాషిక పదాన్ని ఉపయోగించలేదు. వాస్తవానికి ఈ పదం, యావత్తు ముస్లిం సమాజం దృష్టిలో, ఎంతో ఖ్యాతిగాంచిన మరియు జ్ఞాన తూకంలో ఎంతో విలువ పొందిన ఒక ముఖ్యమైన హదీసును గూర్చి సూచిస్తుంది.

ఈ హదీసును ధార్మిక పండితులు “నమాజు సరిగా నెరవేర్చని వ్యక్తి (ముసయీ సలాత్‌) హదీసు” గా  పిలుస్తారు.

ఈ హదీసు, దీని సంపూర్ణ రూపంలో ఏ ఒక్క ఉల్లేఖనంలో కూడా లభించనందున, పాఠకుల ప్రయోజనార్థం, దీని సంపూర్ణ రూపాన్ని అవసరమైన పదజాలంతో సమర్పిస్తున్నాం. తద్వారా పండితులు మరియు సామాన్య ప్రజానీకం – వీరిలో ప్రతి ఒక్కరూ దీని ద్వారా ప్రయోజనం పొందగలరని ఆశించవచ్చు.

నమాజు సరిగా నెరవేర్చని  వ్యక్తికి సంబంధించిన సంపూర్ణ హదీసు

రఫా బిన్‌ రాఫే (రజిఅల్లాహు అన్హు) కథనం:

ఒకరోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మస్జిదె నబవీలో కూర్చొని వున్నారు. మేము కూడా ఆయన దగ్గర కూర్చొని వున్నాం. ఇంతలో, పల్లెవాసిలా కనబడే ఒక వ్యక్తి మస్జిద్‌లోకి ప్రవేశించి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు దగ్గరలోనే ఖిబ్లా వైపునకు తిరిగి అసంపూర్ణ రుకూ, సజ్దాలతో (రుకూ, సజ్దాలు ప్రశాంతంగా  చేయకుండా) రెండు తేలికపాటి రకాతులు పూర్తి చేశాడు. తదుపరి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు మరియు అక్కడున్న వారికి సలాం చేశాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “వ అలైకుం సలాం” అని జవాబిచ్చి, “వెళ్ళు, వెళ్లి తిరిగి నమాజు చేయి, ఎందుకంటే నువ్వు అసలు నమాజే చేయలేదు” – అని ఆజ్ఞాపిం చారు.

ఆ వ్యక్తి తిరిగి వెళ్ళి మునపటి లాగే మళ్ళీ నమాజు చేశాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతన్ని గమనించసాగారు. కానీ ఆ వ్యక్తి మాత్రం, నమాజులో తను చేస్తున్న పొరపాట్లను గూర్చి తెలుసుకోలేక పోయాడు. నమాజు పూర్తి చేసి మళ్ళీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు మరియు అక్కడున్న వారికి సలాం చేశాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “వ అలైకుం సలాం” అని జవాబిచ్చి “వెళ్ళు, వెళ్ళి మళ్ళీ నమాజు చేయి, నీ నమాజు అసలు నెరవేరలేదు” అని పురమాయించారు. ఇలా, ఆ వ్యక్తి మూడుసార్లు తన నమాజును పూర్తిచేశాడు. (బుఖారీ,ముస్లిం)

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రతిసారీ అతనికి “వ అలైకుం సలాం” అని జవాబిచ్చి “వెళ్ళు, వెళ్ళి మళ్ళీ నమాజు చేయి, ఎందుకంటే నీ నమాజు అసలు నెరవేరలేదు” అని పురమాయించారు.

దైవప్రవక్త (సల్లల్తాహు అలైహి వ సల్లం) మాటలు విని అక్కడున్నవారు — “బహుశా, ఎవరయితే తేలికపాటి నమాజు చేస్తారో వారి నమాజు అసలు నెరవేరదు కాబోలు” అని భావించారు. ఆ వ్యక్తి – “నా నమాజులో అయ్యే పొరపాట్లను గూర్చి నేను తెలుసుకోలేక పోతున్నాను. మీపై ఖుర్‌ఆన్‌ గ్రంథాన్ని అవతరింపజేసిన వాని సాక్షిగా! నాకింతకన్నా మంచిగా నమాజు చేయడం రాదు. నేను నా ప్రయత్న మంతా చేశాను. మీరే నాకు చెప్పండి మరియు నేర్పించండి. ఎందుకంటే – నేను మానవ మాత్రుణ్ణి, నా ద్వారా తప్పొప్పులు రెండూ జరిగే ఆస్కారముంది” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విన్నవించు కున్నాడు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతనికి ఇలా హితబోధ చేశారు:

“బాగా విను! నువ్వెప్పుడైనా నమాజు చేయాలని సంకల్పించుకున్నప్పుడు, మంచిగా వుజూ చేయి. ఎందు కంటే – అల్లాహ్‌ ఆదేశించిన దాని ప్రకారం – వుజూ సరిగా చేయనంత వరకు ఎవరి నమాజ్‌ కూడా నెరవేరదు. అంటే – వుజూ సరిగా చేయ నంతవరకు ఎవరి నమాజ్‌ కూడా నెరవేరదు. అంటే – అతను తన ముఖాన్ని రెండు చేతులను, మోచేతి క్రీళ్ల వరకు కడిగి, తలను రెండు చేతులతో స్పర్శించి (మసహ్‌ చేసి) తదుపరి రెండు కాళ్ళను చీలమండ వరకు శుభ్రం చేసుకోవాలి.

తదుపరి, అజాన్‌ యిచ్చి ఇఖామత్‌ పలుకు, ఖిబ్లా వైవునకు తిరిగి నిలబడిన తర్వాత, అల్లాహు అక్బర్‌ అని పలికి, అల్లాహ్‌ స్తోత్రాన్ని గొప్పతనాన్ని స్మరించు, తదుపరి ఫాతిహా సూరా మరియు దానితో పాటు మరేదైనా పఠించు.

అబూదావూద్‌ లోని మరో ఉల్లేఖనంలో   యిలా ఉంది: (ఫాతిహా సూరా పఠించిన అనంతరం) దివ్యఖుర్‌ఆన్‌లో నుండి నీకు అనుమతి యివ్వబడిన దానిని, సులభమైన దానిని పఠించు. ఒకవేళ ఖుర్‌ఆన్‌ జ్ఞప్తి యందు లేకపోతే, అప్పుడు ‘అల్‌హందులిల్లాహ్‌, అల్లాహు అక్బర్ , లా ఇలాహ ఇల్లల్లాహ్‌ ‘ అని పలుకు.

తదుపరి ‘అల్లాహు అక్బర్‌’ అంటూ ప్రశాంతంగా కీళ్లన్నీ కుదుటపడి ప్రశాంతత పొందేలా రుకూ చేయి. రుకూ చేసేటప్పుడు నీ అరచేతులను మోకాళ్ళపై పెట్టు మరియు వీపును తిన్నగా వుంచు.

తదుపరి ‘సమిఅల్లాహు లిమన్‌ హమిద’  అంటూ ఎముకలన్నీ తమ తమ స్థానాలకు వచ్ఛే విధంగా నిటారుగా నిలబడు. తిరిగి అల్లాహు అక్బర్‌ అని సజ్దాలోకి వెళ్ళు మరియు నీ ముఖాన్ని నుదుటిని – శరీర కీళ్ళు కుదుటపడి ప్రశాంతత పొందేలా నేలపై గట్టిగా వుంచు. తదుపరి అల్లాహు అక్బర్‌ అంటూ తలను సజ్దా నుండి పైకెత్తి నీ పిరుదులపై చక్కగా కూర్చో.

(అబూదావూద్‌ లోని వేరొక ఉల్లేఖనం లో యిలా ఉంది): సజ్దా నుండి నీవు తల పైకెత్తినప్పుడు, నీ ఎడమ తొడపై కూర్చో. తదుపరి “అల్లాహు అక్బర్‌” అని పలికి సజ్దాలోకి వెళ్ళి నీ ముఖాన్ని ప్రతి కీలూ కుదుట పడి ప్రశాంతత పొందేలా నేలపై వుంచు. తదుపరి తల పైకెత్తి అల్లాహు అక్బర్‌” అని అను.

(అబూదావూద్‌లోని ఇంకొక ఉల్లేఖనం లో యిలా ఉంది):“నమాజు మధ్యలో నీవు కూర్చున్నప్పుడు ప్రశాంతంగా నీ ఎడమ తొడపై కూర్చొని తషహ్హుద్ చేస్తూ ఉండు.”

(అబూదావూద్‌ లోని మరొక ఉల్లేఖనం లో యిలా ఉంది):తదుపరి నీవు నిలబడినప్పుడు, మునపటిలాగే చేస్తూ నీ నమాజును పూర్తి చెయ్యి.”

ఇలా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నాలుగు రకాతులు నమాజ్‌ చదివే పద్ధతిని తెలియజేశారు. తదుపరి ఇలా పలికారు: ఇక ఎవరైతే ఇలా చేయరో (అంటే ఖియ్యాం, రుకూ, సజ్దాలు మరియు తషహ్హుద్ లలో పూర్తి ప్రశాంతతను ప్రదర్శించకుండా నమాజ్‌ చేయరో) వారి నమాజ్‌ సంపూర్ణం కానేరదు. ఒకవేళ యిలా చేస్తే, అప్పుడు వారి నమాజ్‌ సంపూర్ణం అవుతుంది. ఒకవేళ వీటిలో ఏ విషయంలోనైనా తొందరపాటును ప్రదర్శిస్తే దానికి తగ్గట్టుగానే మీ నమాజులో తగ్గుదల వస్తుంది.


ఇది దైవ ప్రవక్త నమాజు స్వరూపం – షేఖ్ అల్ అల్బానీ (రహిమహుల్లా) (పుస్తకం) నుండి తీసుకో బడింది. (16-21పేజీలు)

ఇతర లింకులు: 

ప్రశాంతంగా రుకూ చేయటం తప్పనిసరి (వాజిబ్‌)

బిస్మిల్లాహ్

రుకూ

ఖుర్‌ఆన్‌ పఠనం పూర్తయిన తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాసేపు అలాగే మౌనంగా [303] నిలబడి ఉండేవారు. ఆ తర్వాత ఇంతకు ముందు ‘తక్బీరే తహ్రీమా’ అంశం క్రింద వివరించినట్టుగా చేతులు పైకెత్తేవారు (రఫయదైన్‌ చేసేవారు).[304] తదుపరి “అల్లాహు అక్బర్” [305] అంటూ రుకూలోకి వెళ్ళిపోయేవారు. [306]

నమాజ్‌ను సరిగా నెరవేర్చని వ్యక్తి“కి ఈ రెండు విషయాల గురించి ఆజ్ఞాపిస్తూ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు:

“నమాజ్‌ చేసే వ్యక్తి ఎవరయినా ముందుగా అల్లాహ్‌ ఆదేశించినదాని ప్రకారం చక్కగా వుజూ చేసుకోవాలి. తర్వాత “అల్లాహు అక్బర్” అని చెబుతూ అల్లాహ్‌ను స్తుతించాలి, ఆయన పవిత్రతను కొనియాడాలి. ఆ తర్వాత ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ తనకు నేర్పించిన దానిలో, తనకు అనుమతి ప్రసాదించిన దానిలో తనకు వీలు కలిగినంత పఠనం చేయాలి. ఆ తర్వాత “అల్లాహు అక్బర్‌” అంటూ రుకూ చేయాలి. దేహంలోని కీళ్ళన్నీ వాటి వాటి స్థానాల్లో కుదుటపడి, ప్రశాంతతను పొందే విధంగా రుకూలో రెండు చెతుల్ని మోకాళ్ల చిప్పలపై ఉంచాలి. ….(సశేషం) ఈ విధంగా చేయని వారెవరైనా, వారి నమాజు సంపూర్ణమైనదిగా భావించబడజాలదు.”” [307]

రుకూ చేసే పద్దతి

“రుకూ స్థితిలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన అరచేతుల్నిమోకాళ్ల మీద ఉంచేవారు”,[308] “అలా చేయమని ఆయన ప్రజలకు సయితం ఆదేశించేవారు”.[309] ఈ విధంగా చేయమని ఆయన “నమాజ్‌ సరిగా నెరవేర్చని వ్యక్తి“కి కూడా ఆజ్ఞాపించి ఉన్నారు. కొన్ని వాక్యాల క్రితమే ఈ విషయం గడిచింది.

“రుకూలో ఆయన తన రెండు చేతులతో మోకాళ్లను పట్టుకొని ఉన్నట్లుగా వాటిని గట్టిగా అదిమి ఉంచేవారు”[310] “ఆ సమయంలో చేతివేళ్లను విశాలంగా ఉంచుతారు”. [311] “నమాజ్‌ను సరిగా నెరవేర్చని వ్యక్తి”కి ఇలా చేయమని ఆజ్ఞాపిస్తూ ఆయన “రుకూ చేసినప్పుడు నీ అరిచేతుల్ని మోకాళ్ల మీద పెట్టుకో. చేతివ్రేళ్లను వదులుగానూ, విశాలంగానూ ఉంచు. ప్రతి అవయవం తన స్థానంలోకి వెళ్ళిపోయే వరకు అదే స్థితిలో ఉండు” అని పురమాయించారు.[312] రుకూ స్థితిలో ఆయన తన మోచేతుల్ని ప్రక్కలకు ఎడంగా ఉంచేవారు.[313] రుకూలో వీపును విశాలంగా,[314] నీళ్లు పోసినా అటూ ఇటూ జారిపోనంత తిన్నగా ఉంచేవారు.[315]

“రుకూ స్థితిలో నీ అరచేతుల్ని మోకాళ్ళ మీద పెట్టుకో. వీపును పొడుగ్గా ఉంచు. రుకూ స్థితికి బలాన్నివ్వు” అని ఆయన “నమాజును సరిగా నెరవేర్చని వ్యక్తి“కి సూచించారు.[316] రుకూలో తలను ఆయన వంచిగాని, పైకెత్తిగాని ఉంచేవారు కాదు.[317] పైగా ఆయన (రుకూ స్థితిలో) తన తలను వీపుకు సమాంతరంగా ఉంచేవారు. [318]

ప్రశాంతంగా రుకూ చేయటం తప్పనిసరి (వాజిబ్‌)

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో ప్రశాంతంగా రుకూ చేసేవారు. అలా చేయమని ఆయన “నమాజును సరిగా నెరవేర్చని వ్యక్తి“కి కూడా ఆదేశించి ఉన్నారు. గత అంశం ప్రారంభంలో దీని ప్రస్తావన వచ్చింది.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అంటుండేవారు: “మీరు రుకూ మరియు సజ్దాలు బాగా చేయండి. ఎవరి చేతిలో నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. మీరు రుకూ చేసినప్పుడు, సజ్దా చేసినప్పుడు నేను మిమ్మల్ని నా వెనుక వైపు నుంచి చూస్తూ ఉంటాను.” [319]

ఒకతను నమాజు చేస్తున్నాడు. కాని అతను రుకూ సరిగా చేయటం లేదు. సజ్దా కూడా చాలా తొందరతొందరగా చేస్తున్నాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతన్ని చూసి, “ఒకవేళ ఇతనికి ఇదే స్థితిలో మరణం గనక వస్తే ఇతను ముహమ్మద్‌ ప్రవక్త ధర్మంపై మరణించినట్లు కాదు. (కాకి నెత్తురులో ముక్కు పొడిచినట్లు ఇతను చాలా వేగంగా నమాజ్‌ చేస్తున్నాడు). రుకూ సరిగ్గా నెరవేర్చకుండా సజ్దాలు కూడా సుడిగాలిలా చేసే వ్యక్తి బాగా ఆకలితో ఉండి, ఒకటి రెండు ఖర్జూర పండ్లు తిన్నప్పటికీ ఆకలి చల్లారని మనిషిలాంటివాడు” అని చెప్పారు. [320]

తన ముక్కును నేలకేసి పొడిచే కోడి లాగా నమాజులో తొందర చేయవద్దని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనకు ఉపదేశించారనీ, నమాజులో నక్క లాగా కుడి ఎడమలు దిక్కులు చూడవద్దని తనను ఆదేశించారని, కోతి లాగా పిరుదుల్ని చేతులను నేలకు ఆనించి పెట్టి, పిక్కలను, తొడలను నిలబెట్టి కూర్చో రాదని కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తనకు ఆదేశించారని అబూ హురైరా (రజిఅల్లాహు అన్హు)  తెలియజేశారు. [321]

“నమాజు నుండి దొంగిలించేవాడు అందరిలోకెల్లా చెడ్డ దొంగ” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అన్నారు. ఈ మాట విని ఆయన సహచరులు (ఆశ్చర్య పోయారు). “దైవవక్తా! అసలు ఎవరైనా నమాజులో నుండి ఎలా దొంగిలిస్తారు?” అని అడిగారు. దాని కాయన “అంటే అతను రుకూ, సజ్దాలు పూర్తిగా నెరవేర్చడు” అంటూ తన మాటకు అర్ధం చెప్పారు. [322]

ఒకతను నమాజు చేస్తూ రుకూ, సజ్దాల్లో వీపుని తిన్నగా ఉంచటం లేదు (దగ్గర్లో) నమాజు చేస్తున్న దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన క్రీగంట చూపులతో అతన్ని గమనించారు. నమాజు పూర్తయిన తర్వాత ఆయన అందర్ని ఉద్దేశించి “ముస్లింలారా! రుకూ, సజ్దాల్లో తమ వీపుల్ని తిన్నగా ఉంచని వారి నమాజు నెరవేరదు” అని హెచ్చరించారు. [323]

మరో హదీసు ప్రకారం ఆయన “రుకూ, సజ్దాల్లో వీపుని తిన్నగా ఉంచి చేయబడని నమాజు సరిపోదు” అని అన్నారు. [324]

 

హదీసు రెఫరెన్సులు:

[303]. అబూదావూద్‌, హాకిమ్‌ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ దీనితో ఏకీభవించారు. ఈ మౌనం కేవలం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రశాంతంగా శ్వాస తీసుకోగలిగినంత పరిమాణంలో వుండేదని ఇబ్నె ఖయ్యూం (రహిమహుల్లాహ్‌) అభిప్రాయ పడ్డారు.

[304,305,306]. బుఖారీ, ముస్లిం.

ఈ రఫయదైన్‌ మరియు దీనితోపాటు రుకూ నుండి లేచేటప్పుడు చేసే రఫయదైన్‌ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా ఎన్నో పరంపరలతో నిరూపించబడి ఉంది. ముగ్గురు ఇమాములు, ఎంతో మంది హదీసువేత్తలు. ధార్మికజ్ఞానుల అభిమతం కూడా ఇదే. తారీఖ్‌ ఇబ్నె అసాకిర్‌ (15/78/2) నందు ఇమామ్‌ మాలిక్‌ జీవితాంతం దీనిపై ఆచరించారని వుంది. కొందరు హనఫీ ఉలమాలు కూడా దీనిని యిష్టపడ్డారు. వీరిలో ఇమామ్‌ అబూ యూసుఫ్‌ శిష్యులు ఇసామ్‌ బిన్‌ యూసుఫ్‌ ఖల్‌బీ (మరణం 210 హి.) కూడా ఒకరు. ఆయన గురించి యిది వరకే వివరించబడింది.

అబ్బుల్లా ఇబ్నె అహ్మద్‌ తన ‘మసాయల్’  – 60వ పేజీలో తన తండ్రి ద్వారా యిలా ఉల్లేఖించారు: ఉఖ్బా బిన్‌ ఆమిర్‌ (రజి అల్లాహు అన్హు) ద్వారా నమాజులో రఫయదైన్‌ గురించి యిలా ఉల్లేఖించబడింది: ఒక్కో రఫయదైన్‌కు బదులుగా పదిపుణ్యాలు దొరుకుతాయి.

నేను చెప్పేదేమిటంటే – ఉఖ్బా బీన్‌ ఆమిర్‌ మాట – బుఖారీ, ముస్లింలోని ఎవరైనా ఏదైనా సత్మార్యం చేయాలని సంకల్పించుకొని, తదుపరి దానిని పూర్తి చేస్తే దానికి బదులుగా అతనికి 10 నుంది 700 పుణ్యాలు దొరుకుతాయి అన్న హదీసుకు అనుగుణంగా వుంది. మరిన్ని వివరాల కోసం ‘సహీ అత్తర్‌గీబ్‌- 16వ పేజీ చూడగలరు.

[307]. అబూదావూద్‌,నసాయి. హాకిమ్‌ దీనిని సహీగా ఖరారు చేశారు మరియు జహబీ దీనితో ఏకీభవించారు.

[308]. బుఖారీ, అబూదావూద్‌.

[309]. బుఖారీ, ముస్లిం.

[310]. బుఖారీ, అబూ దావూద్‌.

[311]. హాకిమ్‌ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ కూడా దీనితో ఏకీభవించారు. అబూదావూద్‌, తయాలిసీ కూడా దీనిని ఉల్లేఖించారు. దీని తఖ్రీజ్‌ – సహీ అబూదావూద్‌: 809 నందు చేయబడింది.

[312]. సహీ ఇబ్నె ఖుజైమా, సహీ ఇబ్నె హిబ్బాన్‌.

[313]. తిర్మిజి, ఇబ్నె ఖుజైమా దీనిని సహీగా ఖరారు చేశారు.

[314]. బైహఖీ – సహీ బుఖారీ పరంపరతో.

[315]. తబ్రానీ – మోజమిల్‌ కబీర్‌ వ సగీర్‌, జవాయెద్‌ ముస్నద్‌ అబ్దుల్లా  బిన్‌ అహ్మద్‌,ఇబ్నెమాజా.

[316]. అహ్మద్‌, అబూదావూద్‌ – సహీ పరంపరతో.

[317]. అబూదావూద్‌, బుఖారీ – జుజ్‌ అల్‌ ఖీరా ఖలఫుల్‌ ఇమామ్‌ – సహీ పరంపరతో

[318]. ముస్లిం, అబూ ఆవాన

[319]. బుఖారీ, ముస్లిం. నేను చెప్పదేమిటంటే – ఇలా చూడగలగడం ఒక వాస్తవం. యిది ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అద్భుతాలలో ఒకటి. అయితే ఇది నమాజు కొరకే ప్రత్యేకం. ఇతర సందర్భాలలో దీనికి సంబంధించిన ఆధారమేదీ లేదు.

[320]. మున్నద్‌ అబూ యాలా (340, 349/1), ఆజూరీ- అర్బయీన్‌, బైహఖీ,  తబ్రానీ (1/192/1), జియా – అల్‌ మున్తఖా (276/1), ఇబ్నె అసాకిర్‌ (2/226/2, 414/1, 8/14/1,76/2) – హసన్‌ పరంపరతో. ఇబ్నె ఖుజైమా దీనిని సహీగా ఖరారు చేశారు (1/82/1). ఇబ్నె బత్తా, మొదటి భాగంలోని అదనపు పదజాలం లేకుందా దీనిని బలపర్చే ఒక ముర్సల్‌ హదీసును “అల్‌ ఇబానా” (5/43/1) నందు ఉల్లేఖించారు.

[321]. తయాలిసీ, అహ్మద్‌, ఇబ్నె అబీషైబా. ఇది హసన్‌ హదీసు. ఈ విషయం నేను హాఫిజ్‌ అబ్దుల్  హఖ్‌ ఇష్‌బిలీ – అల్‌ అహ్‌కామ్‌ – హదీసు నెం. 1348 పాద సూచికలో వివరించాను.

[322]. ఇబ్నె అబీ షైబా (1/89/2), తబ్రానీ, హాకిమ్‌ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ కూడా దీనితో ఏకీభవించారు.


ఇది దైవ ప్రవక్త నమాజు స్వరూపం – షేఖ్ అల్ అల్బానీ (రహిమహుల్లా) (పుస్తకం) నుండి తీసుకో బడింది. (150-154 పేజీలు)

ఇతర లింకులు: 

మృతునికి అతని అసలు స్థానం స్వర్గం లేక నరకం చూపబడుతుంది

బిస్మిల్లాహ్

1822. హజ్రత్‌ అబ్దుల్లాహ్ బిన్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలియజేశారు :-

“మీలో ఎవరైనా చనిపోయినప్పుడు అతనికి (సమాధిలో) ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం అతను ఉండవలసిన శాశ్వత స్థానం చూపబడుతుంది. అతను గనక స్వర్గవాసి అయి ఉంటే అతనికి స్వర్గవాసుల స్థానం చూపబడుతుంది; నరకవాసి అయి ఉంటే అతనికి నరకవాసుల స్థానం చూపబడుతుంది. అప్పుడు “ఇదే నీ అసలు స్థానం. నిన్ను ప్రళయదినాన లేపినప్పుడు ఈ స్థానానికే నీవు చేరుకోవలసి ఉంటుంది” అని అతనికి చెప్పబడుతుంది.”

(సహీహ్‌ బుఖారీ:- 23వ ప్రకరణం – జనాయిజ్‌, 90వ అధ్యాయం – అల్‌మయ్యతి యూరజు అలైహి మఖ్‌ అదుహు బిల్‌ ఘదాతి వల్‌ అషియ్యి)

[అల్-లూలు-వల్-మర్జాన్ (మహా ప్రవక్త మహితోక్తులు), vol 2,స్వర్గ భాగ్యాల , స్వర్గ వాసుల ప్రకరణం]

కరుణ చూపే వారిపై అల్లాహ్ కరుణ చూపుతాడు [వీడియో]

బిస్మిల్లాహ్

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/eu7r]
[30 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

ముహర్రం నెలలో “నెల్లూరు రొట్టెల పండగ” పేరుతో జరిగే షిర్క్ మరియు దురాచారాలు

బిస్మిల్లాహ్

[నెల్లూరు రొట్టెల పండగ పేరుతో జరిగే షిర్క్ మరియు అధర్మ కార్యాల గురుంచి ఈ పోస్టులో వివరించబడింది] 

నెల్లూరు ఆంధ్రరాష్ట్రానికి చెందిన ఒక జిల్లా, సముద్రం ఒడ్డున ఉన్న ఒక అందమైన పట్టణము. 12వందల సంవత్సరాల క్రితం పన్నెండు మంది అరబ్‌ ముస్లిములు వలస వచ్చారు అని కథనాలు చెప్పుకుంటారు. వారందరూ జాతులకు, మతాలకు అతీతంగా శాంతిని నెలకొల్పాలని వచ్చినట్లు భావిస్తారు. మరియు కొన్ని రోజుల తరువాత వారందరూ షహీద్‌ కాబడ్డారనీ అంటారు. ఆ తరువాత వారందరినీ ఆ సెలయేరు (ఒక పెద్ద చెరువు) వద్దనే సమాధి చేసారు. తరువాత కొంత మంది ప్రజలు ఆ సమాధులనే దర్గాలుగా నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆ పన్నెండు దర్గాలను కలిపి “బారా షహీద్‌ మజార్‌ షరీఫ్‌” అని పేర్కొంటారు. అక్కడే మరొక దర్గా “సయ్యద్‌ బాబా” అని “లాల్‌ దర్గా” పేరుతో ఉంది.

రొట్టెల పండుగ పేరుతో 10 నుండి 15 లక్షల మంది ప్రజలు ధర్మాలకు అతీతంగా, ప్రతి ఏట ముహర్రం నెలలో సందర్శిస్తారు. అక్కడ ఉత్సవాల పేరుతో ముహర్రం నెల 10, 11, 12వ తేదిలలో రొట్టెల మార్పిడి జరుగుతుంది. అలా మూడు నాలుగు రోజుల పాటు ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు.

అంటే అక్కడ వచ్ఛేవారి వివిధ మొక్కుబడుల ప్రకారం రొట్టెలకు పేర్లు కేటాయించుకుంటారు. ఉదాహరణకు “పిల్లల రొట్టెలు” – ఎవరికైన సంతానం లేకపోతే ఆ నదిలో నిలబడి తలపై ఆ నది నీళ్ళను తీర్ధంలా చల్లుకొని, సంతానం లేనివారు సంతానం కలిగినవారి నుండి రొట్టెలను తీసుకొని తింటారు. అలా చేస్తే సంతాన ప్రాప్తి జరుగుతుందని వారి మూఢ నమ్మకం. అలా సంతానం లేనివారు రొట్టెలను తిన్న తరువాత వారికి సంతానము కలిగితే, తిరిగి వచ్చి వారుకూడా రొట్టెలను ఇతరులకు ఇస్తారు. అలా అనేక మంది ప్రజలు తమ తమ మ్రొక్కుబడుల ప్రకారం ప్రతి ఏట రొట్టెల మార్పిడి జరిపే ఆచారాన్ని “నెల్లురు రొట్టెల పండుగ” అని అంటారు.

ప్రజల సమస్యలకు అనుగుణంగా రొట్టెలకు పేర్లు పెట్టుకుంటారు. అంటే; ఉద్యోగం రొట్టెలు, ధనం రొట్టెలు, విదేశాలకు పోయే వీసా రొట్టెలు, అసెంబ్లీ రొట్టెలు, ఆరోగ్యం రొట్టెలు, వివాహం రొట్టెలు అని వివిధ సమస్యల పేర్లతో రొట్టెల మార్పిడి జరుగుతుంది. తరువాత అక్కడికి వచ్చేవారు అక్కడ ఉన్న దర్గాలను కూడా ఆరాధిస్తారు. ప్రతి దర్గా వద్ద జరిగే షిర్క్‌ మరియు బిద్‌అత్‌ వంటి అధర్మ కార్యాలను బహిరంగా పాటిస్తారు.

“బారా షహీద్ మజార్‌ షరీఫ్‌”కు వచ్చే ప్రజలు తమ నమ్మకాల ప్రకారం నాణల రూపంలో ఆ దర్గాలపై నాణెములను(చిల్లరడబ్బులు) విసురుతారు. దర్గాల నిర్వాహకులు దర్గాలపై నుండి రూపాయి లేక రెండు రూపాయి బిళ్లలను తీసుకుని, ఎర్రటి లేక పచ్చటి రంగుల గుడ్డపేలికలలో చుట్టి, ప్రజల మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకొని, ఆ ఒక్క రూపాయిని పది రూపాయిలకు లేక ఇరవై రూపాయిలకు విక్రయిస్తారు. ఎందుకంటే? ఆ నాణెములను ప్రజలు తమ దగ్గర ఉంచుకుంటే ధనంలో శుభాలు కలుగుతాయని నమ్మిస్తారు.

అధికమైన సంఖ్యలో స్త్రీలు అక్కడ సమావేశమవుతారు. ఎందుకంటే? మూఢ నమ్మకాల వలలో స్త్రీలే అతి ఎక్కువగా చిక్కుకుంటారు. మరియు ఇస్లాం ధర్మం తెలియని అజ్ఞాన ముస్లింలు మరియు బలహీన విశ్వాసులు అలాంటి మూఢ విశ్వాసాలకు తొందరగా ప్రభావితులవుతారు. ఎందుకంటే? ఎదో విధంగా తమ అదృష్టాలను పరిక్షించుకొని, కష్టాలను దూరం చేసుకోవాలని వారి తపన. మన సమాజంలో అలాంటి మూఢ విశ్వాసాలు కలిగిన వారు చాలా మంది ఉన్నారు. మరియు వారు దేశ, విదేశాల దర్గాలను సందర్శించి ఆరాధిస్తూ ఉంటారు.

కనుక అల్లాహ్  వాటిని ఖండిస్తూ ఇలా తెలియజేసాడు:

إِنْ هِيَ إِلَّا أَسْمَاءٌ سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا أَنزَلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ ۚ إِن يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَمَا تَهْوَى الْأَنفُسُ ۖ وَلَقَدْ جَاءَهُم مِّن رَّبِّهِمُ الْهُدَىٰ

“ఇవన్నీ మీరు మరియు మీ తండ్రి, తాతలు పెట్టిన పేర్లు మాత్రమే, అల్లాహ్‌ వీటిని గురించి ఎట్టి ప్రమాణం  అవతరింప జేయలేదు. వారు కేవలం తము ఊహాగానాలను మరియు తమ ఆత్మలు కోరే మనోవాంఛలను మాత్రమే అనుసరిస్తున్నారు. వాస్తవానికి వారి ప్రభువు తరపునుండి వారి వద్దకు మార్గదర్శకత్వం కూడా వచ్చి ఉన్నది?” (సూరతున్‌ నజ్మ్‌:23)

అల్లాహ్ ఇలా తెలియజేసాడు:

قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِن شِرْكٍ وَمَا لَهُ مِنْهُم مِّن ظَهِيرٍ

(ఓ ప్రవక్తా!)వారికి ఇలా చెప్పు: “అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవ్వంత అధికారంగానీ వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్‌కు సహాయకుడు కూడా కాదు” (సూరతుస్‌ సబా:22).

అల్లాహ్‌ను మాత్రమే ప్రార్ధించాలి. భయం, భక్తి ఆశ, ప్రేమానురాగం, మొరపెట్టుకోవడం, అణుకువ, అశక్తత, శరణు వేడుకోవడం, జిబహ్‌ చేయడము, మొక్కుబడులు చెల్లించడం, ఉపాధిని కోరడం వంటి కార్యాలన్నీ ఆరాధనలే. కనుక ఆ ఆరాధనలు అల్లాహ్‌కే సొంతం చేసి ఆరాధించాలి. అల్లాహ్‌ను తప్ప మరెవరినీ ఆరాధించకూడదు.

కనుక అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు:

وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ

“మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తనూ పంపినా: “నిశ్చయంగా, నేను (అల్లాహ్‌) తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! కావున మీరు నన్నే ( అల్లాహ్‌నే) ఆరాధించండి” అని దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చి పంపాము.” (సూరతుల్‌ అంబియా:25)

అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు:

وَعَلَى اللَّهِ فَتَوَكَّلُوا إِن كُنتُم مُّؤْمِنِينَ

“మీరు నిజంగానే ముస్లిములైతే అల్లాహ్‌నే నమ్ముకోండి” (సూరతుల్‌ మాయిదా:23)

మరోచోట అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు:

وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ

“అల్లాహ్‌ను నమ్మకున్నవారికి అల్లాహ్‌యే చాలు.” (సూరతు తలాఖ్ :3)

ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “ఎప్పుడైతే మీరు సహయం కొరకై మొరపెట్టుకుంటారో అప్పుడు అల్లాహ్‌ను మాత్రమే సహాయానికై ఆర్థించండి.” (తిర్మిజీ:2516, జిలాలుల్‌ జన్నహ్‌: 316-318).

ముఖ్య గమనిక: “రొట్టెల పండుగ పేరున మనం చేసే ఆచారాలు, ఆరాధనలు, మొక్కుబడులు ధర్మం కానే కావు. ఎవరైనా అల్లాహ్‌ పేరుపై తప్ప ఇతరులెవరి పేరుపై నైనా మొక్కుబడులు చెల్లిస్తే అది “షిర్క్” ఆచారమే అవుతుంది. ఒక వేళ ఎవరైనా తెలిసి తెలియక మొక్కుబడులు చేసుకొని ఉంటే, వాటిని నెరవేర్చకూడదు. దాని వల్ల ఎలాంటి నష్టంగాని లేక కీడుగాని జరగదు. కనుక ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “ఎవరైతే అల్లాహ్‌ విధేయత పట్ల మొక్కుబడి చేసుకున్నారో వారు ఆ మొక్కుబడిని తీర్చాలి. మరియు ఎవరైతే అల్లాహ్‌ అవిధేయత పట్ల మొక్కుకున్నారో వారు ఆ మొక్కబడిని తీర్చకూడదు.”” (బుఖారి :2602).


ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 67-70). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)

ఇమామ్‌ బు’ఖారీ (రహిమహుల్లాహ్)

బిస్మిల్లాహ్

ఇమామ్‌ ము’హమ్మద్‌ బిన్‌ ఇస్మా’యీల్‌ బిన్‌ ఇబ్రాహీమ్‌ బు’ఖారీ (రహిమహుల్లాహ్)

బు’ఖారీ పేరు, ముహమ్మద్‌ – అబూ అబ్దుల్లాహ్‌. బిరుదు ఇమాముల్‌ ము’హద్దిసీన్‌, అమీరుల్‌ ము’హద్దిసీ’న్‌. ఇతని వంశపరంపర ము’హమ్మద్‌ బిన్‌ ఇస్మా’యీల్‌ బిన్‌ ఇబ్రాహీమ్‌ బిన్‌ అల్‌ ము’గీరహ్‌.

జననం: ఖురసాన్‌ సమర్ఖంద్, ఇప్పటి ఉజ్బెకిస్తాన్‌, 13-10-194 హిజ్రీ (19-7-810 క్రీ.శ.).
మరణం: 1-10- 256 హి (1-9-870 క్రీ.శ.), 60 సం. వయస్సులో సమర్ఖంద్ లో. ఇతను అబ్బాసీయ పరిపాలనా కాలంలో ఉన్నారు.
ఇతని శిక్షకులు: అహ్మద్‌ బిన్‌ హంబల్‌, అలీబిన్‌ మదీనీ , ఇస్-హాఖ్ బిన్‌ రహ్వే.
ఇతని శిశ్యులు: ముస్లిం బిన్‌ హజ్జాజ్‌, ఇబ్నె అబీ ఆసిం. సహీహ్‌ బుఖారీ ఇతని ముఖ్య పుస్తకం.

బు’ఖారీ తండ్రి పేరు ఇస్మా’యీల్‌, బిరుదు అబుల్‌ ‘హసన్‌. ఇతను మలిక్‌ బిన్‌ అనస్‌ శిష్యులు. ఇతను చాలా పెద్ద ‘హదీసు’వేత్త. ఇస్మా’యీల్‌ చాలా పరిశుద్దులు మరియు ధర్మ సంపాదకులు. ఒకసారి మాట్లా డుతూ ‘నా సంపాదనలో ఒక్క దిర్‌హమ్‌ అయినా అధర్మ సంపాదన లేదు,’ అని అన్నారు. (అస్‌’ఖలానీ) 

బు’ఖారీలో ఎన్నో గొప్ప గుణాలు ఉండేవి. ఇవేకాక మరో గొప్పతనం ఏమిటంటే, తండ్రి కొడుకులు ఇద్దరూ ‘హదీసు’వేత్తలే. బు’ఖారీ తల్లి చాలా భక్తురాలు, మహత్మ్యాలు కలిగి ఉండేది. ఎల్లప్పుడూ దైవాన్ని ప్రార్ధించడం, దైవభీతితో కన్నీళ్ళు కార్చటం, దీనంగా మొరపెట్టుకోవటం చేసేది. బు’ఖారీ కళ్ళు చిన్న తనంలోనే అస్వస్థతకు గురయ్యాయి. దృష్టి క్రమంగా పోసాగింది. వైద్యులు ఇక నయం కాదని చేతు లెత్తేశారు. బు’ఖారీ తల్లి ఇబ్రాహీమ్‌ (అలైహిస్సలాం)ను కలలో చూశారు. ‘నీ ప్రార్దన మరియు ఏడ్వటం వల్ల అల్లాహ్‌ నీ కొడుకు కళ్ళకు స్వస్టత ప్రసాదించాడు,’ అని అతను అంటున్నారు. ఉదయం లేచి చూసే సరికి బు’ఖారీ కళ్ళు నయం అయి ఉన్నాయి. కంటి చూపు తిరిగి వచ్చి ఉంది. అయితే అంతకు ముందు కంటి చూపు ఎందుకు పోయిందో కారణం తెలియలేదు. కంటి చూపు తిరిగి వచ్చిన తర్వాత వెన్నెల రాత్రుల్లో కూర్చొని “తారీఖ్‌ కబీర్‌” అనే పుస్తకం వ్రాశారు.

బాల్యం, విద్యాభ్యాసం, శిక్షణ, గురువులు:

బు’ఖారాలో 194 హిజ్రీ శకంలో రమజాన్‌ 13వ తేదీన జుమ’అహ్‌ నమా’జ్‌ తర్వాత జన్మించారు. బు’ఖారీ గురించి చాలా తక్కువ విషయాలు తెలిసినా, అతని విద్యాభ్యాసం, శిక్షణ జరిగిన తీరు చాలా ఉత్తమ మైనదని తెలుస్తుంది. ఎందుకంటే అతని తండ్రి కూడా ఒక ‘హదీసు’వేత్త. అతని తండ్రి ఇస్మా’యీల్‌ బాల్యం లోనే మరణించారు. అందువల్ల తల్లి సంరక్షణా బాధ్యతలు తనపై ఎత్తుకున్నారు. కొంత వయస్సు పెరిగిన తర్వాత ‘హదీసు’ విద్య నేర్చుకోవాలనే కోరిక కలిగింది. ఎందుకంటే వారిది ‘హదీసు’వేత్తల కుటుంబం.

ము’హమ్మద్‌ బిన్‌ అబీ ‘హాతిమ్‌ వర్రాఖ్‌ కథనం: బు’ఖారీ ఇలా అంటూ ఉండగా నేను విన్నాను: “నేనింకా బడిలో ఉండగానే ‘హదీసు’ విద్య నేర్చు కోవాలనే కోరిక నాకు కలిగింది.” వర్రాఖ్‌ బు’ఖారీని “మీకు ‘హదీసు’ విద్య నేర్చుకోవాలని కోరిక కలిగినప్పుడు మీ వయస్సు ఎంత” అని అడిగితే “అప్పుడు నా వయస్సు 10 సంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ ఉంటుంది” అని సమాధానం ఇచ్చారు. అప్పటి నుండే బు’ఖారీ ‘హదీసు’వేత్తల సభలలో పాల్గొనసాగారు.

ప్రారంభదశలోనే ఒక సంఘటన జరిగింది. బు’ఖారా లోని ప్రఖ్యాత పండితులు దా’ఖలీ అలవాటు ప్రకారం ‘హదీసు’లను బోధిస్తున్నారు. అప్పుడు ఆ సభలో బు’ఖారీ కూడా ఉన్నారు. దా’ఖలి ఒక ‘హదీసు’ ప్రామా ణికతను పేర్కొంటూ, ‘సుఫియాన్‌ అన్‌ అబి’జ్జుబే ర్‌ అన్‌ ఇబ్రాహీమ్‌” అని అన్నారు. బు’ఖారీ అది విని, “అన్న అబా’జ్జుబేర్‌ లమ్‌ యరౌ ఇబ్రాహిమ్‌” – అంటే ‘అబు ‘జ్జుబేర్  ఇబ్రాహీమ్‌ ద్వారా ఉల్లేఖించ లేదు,’ అని అన్నారు. అప్పుడు బు’ఖారీ వయస్సు 11 సంవత్సరాలు.

బు’ఖారీ అప్రమత్తత: అజ్‌లోనీ బు’ఖారీ అప్రమత్తత గురించి, ఉపద్రవాలకు దూరంగా ఉండటాన్ని గురించి ఒక సంఘటన పేర్కొన్నారు. “బు’ఖారీ తన విద్యాభ్యాసం రోజుల్లో ఒకసారి సముద్ర ప్రయాణం చేశారు. ఓడపై ఎక్కారు. అతని వద్ద 1000 అష్రఫీ లు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి బు’ఖారీకి సేవలుచేసి, చాలా గౌరవభావం వ్యక్తం చేశాడు. బు’ఖారీతో చాలా కలివిడిగా ప్రవర్తించ సాగాడు. బు’ఖారీ కూడా అతన్ని తన శ్రేయోభిలాషిగా భావించసాగారు. చివరికి తన వద్ద 1000 అష్రఫీ లు ఉన్నాయని కూడా అతనికి తెలుపడం జరగింది.

ఒక రోజు బు’ఖారీ మిత్రుడు నిద్రలేచి ఏడ్వటం పెడబొబ్బలు పెట్టటం, తల మొత్తుకోవడం చేశాడు. అది చూసి ప్రజలు ఆశ్చర్యపడసాగారు. అసలు  ఏమయిందని అడిగారు.’ ప్రజలు అంతగా అడుగుతుంటే, ఆ వ్యక్తి నా దగ్గర 1000 అష్రఫీల సంచి ఉండేది. అది పోయింది అని ఏడ్వసాగాడు. ప్రజలు పడవలో ఉన్న వారందరినీ సోదా చేశారు. బు’ఖారీ ఎవరికీ తెలియకుండా తన అష్రఫీల సంచిని సముద్రంలో పారవేశారు. ఆ తరువాత బు’ఖారీని కూడా సోదా చేయడం జరిగింది. ఎవరి వద్దా అది దొరక్కపోయేసరికి, వారు ఆ వ్యక్తినే చీవాట్లు పెట్టారు.

ప్రజలందరూ ఓడనుండి దిగారు. ఆవ్యక్తి ఏకాంతంలో బు’ఖారీని కలిశాడు. ‘తమరు ఆ అష్రఫీల సంచి ఏం చేశారు?’ అని అడిగాడు. బు’ఖారీ, ‘ఆ సంచిని సముద్రంలో పారవేశాను,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘ఇంత పెద్ద మొత్తాన్ని పారవేయటానికి మీ మనసెలా ఒప్పింది,’ అని అడిగాడు. “నీకు బుద్దుందా? నా జీవిత మంతా ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం) ‘హదీసు’లను రాయడంలోనే గడచి పోయింది. నాకు ప్రజల్లో గౌరవ ఆదరణలు ఉన్నాయి. మరి నాపై దొంగతనం నిందరావటాన్ని నేనెలా భరించగలను? జీవితమంతా శ్రమించి సంపాదించిన నీతి నిజాయితీని కొన్ని అష్రఫీలకు ఎలా బలి చేయగలను,” అని సమాధానం ఇచ్చారు.

సద్గుణాలు, అలవాట్లు, ప్రవర్తన: బు’ఖారీకి వారసత్వంలో తండ్రి ఆస్తి అధిక మొత్తంలో లభించింది. అతని తండ్రిగారిది చాలా పెద్ద వ్యాపారం. సాధారణంగా వ్యాపారుల్లో అనేక అవకతవకలు, లోటుపాట్లు జరుగుతుంటాయి. అందువల్ల వ్యాపారం చేసేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. బు’ఖారీ తండ్రి ఇస్మా’యీల్‌ తన మరణ సమయంలో తన ప్రత్యేక శిష్యుడైన అబూ హఫ్స్‌తో, ‘నేను నా ధనంలో ఒక్క దిర్‌హమ్‌ కూడా అధర్మమైనదిగా ఎరుగను.’ అని అన్నారు. అది విన్న అబూ హఫ్స్‌ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇస్మా’యీల్‌ వ్యాపారంలో చాలా అప్రమత్తంగా ఉండే వారు. ఇస్మా’యీల్‌ తన మరణ సమయంలో అబూ హఫ్స్‌తో నా వారసునికి సహాయ సహకారాలు అందించాలి, అతన్ని విడిచివెళ్ళిపోకూడదు, కష్టాల్లో అతని నుండి సహాయం పొందు,’ అని హితవుచేశారు.

‘హదీసు’వేత్త ముహమ్మద్‌ బిన్‌ అబీ  హాతిమ్‌ కథనం: బు’ఖారీ ఆ ధనాన్ని వ్యాపారంలో పెట్టారు. ఎటువంటి చింత లేకుండా ధార్మిక సేవలో నిమగ్నమై పోయారు. అల్లాహ్‌ అతన్ని ఎటువంటి కష్టాలకు, ఆపదలకు గురికాకుండా సంరక్షించాడు.

స్వభావంలో ఎంతో నమ్రత, సున్నితత్వం, కారుణ్య గుణం ఉండేది. ఒకసారి వ్యాపార భాగస్వామి 25వేల దిర్‌హమ్‌లు నొక్కేశాడు. శిష్యులు, ‘అప్పు తీసుకున్న వాడు వచ్చాడు, అతన్నుండి అప్పు వసూలు చేసుకోండి, ‘ అని అన్నారు. దానికి బు’ఖారీ, ‘అప్పు వాడిని ఇబ్బంది పెట్టడం సబబు కాదు’ అని అన్నారు. బు’ఖారీ తన వ్యాపార లాభాలతో పండితులను, విద్యార్దులను సంరక్షించాలని ప్రయత్నించేవారు. ప్రతి నెల తన ఆదాయంలో నుండి 500 దిర్‌హమ్‌లు దీనికి కేటాయించేవారు. పండితులకు, విద్యార్దులకు ఉపకార వేతనాలు ఇచ్చి ప్రోత్సహించేవారు. అన్నపానీయాల విషయంలో భోగ, విలాసాలకు దూరంగా ఉండేవారు.

బు’ఖారీ గుమస్తా అయిన ము’హమ్మద్‌ బిన్‌ అబీ ‘హాతిమ్‌ కథనం: ఒకసారి విద్యార్జన  కాలంలో ఆదమ్‌ బిన్‌ అబీ అయాస్‌ వద్దకు వెళ్ళే ప్రయాణంలో ప్రయాణ సామగ్రి అంతా అయిపోయింది. కొన్ని రోజుల వరకు ఆకులు అలములు తిని గడిపారు. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు, ఎవరినీ ఏదీ అడగలేదు. బు’ఖారీ దైవభీతి, దైవభక్తి, దయ, న్యాయం, ధర్మం మొదలైన ఉత్తమ గుణాలు కలిగి ఉండేవారు.

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ము’హమ్మద్‌ అస్సియార్ ఫీ   కథనం: నేను ఒకసారి ము’హమ్మద్‌ బిన్‌ ఇస్మా’యీల్‌ ఇంటికి వెళ్ళాను. అతని సేవకురాలు అతని ప్రక్క నుండి వెళ్ళింది. ఆమె కాలు తగిలి సిరా పడిపోయింది. వెంటనే బు’ఖారీ ఆగ్రహంచెంది, ‘ఎలా నడుస్తున్నావు?’ అని అన్నారు. దానికి సేవకురాలు, ‘దారిలేకపోతే ఎలా నడిచేది? ‘ అని చెప్పింది. అది విని బు’ఖారీ ఆగ్రహం చెందడానికి బదులు, “పో నిన్ను నేను విడుదల చేసి వేశాను,” అని అన్నారు. అప్పుడు నేను “ఆమె మిమ్మల్ని కోపం తెప్పించింది. తమరు కోప్పడటానికి బదులు ఆమెను విడుదల చేసివేశారా?” అని అడిగాను. దానికి బు’ఖారీ, “ఆమె చేసిందానికి నన్ను నేను సంతృప్తి పరచుకున్నాను.” అంటే బు’ఖారీ ఆమెను చీవాట్లు పెట్టేబదులు తన్ను తాను చీవాట్లు పెట్టుకున్నారు.

ఒకసారి బు’ఖారీ తండ్రిగారి శిష్యుడైన అబూ ‘హఫ్‌స్‌ కొంతసరుకును బు’ఖారీ వద్దకుపంపారు. కొంత మంది వ్యాపారులు సాయంత్రం వచ్చి 5000 రుసుము ఇచ్చి సరుకు తీసుకొని వెళతామని అన్నారు. దానికి బు’ఖారీ ‘ఇప్పుడు వెళ్ళిపోండి, ఉదయం రండి, ఇచ్చి తీసుకువెళ్ళండి’ అని అన్నారు. మరుసటి రోజు ఉదయం కొందరు వ్యాపారులు వచ్చి, 5వేలకు బదులు 10 వేలు ఇచ్చి సరకు తీసుకువెళతా మన్నారు. కాని బు’ఖారీ తరువాత వచ్చిన వ్యాపారులను రాత్రి వచ్చిన వ్యాపారికి అమ్మాలని నిశ్చయించుకున్నాను అని చెప్పి వాళ్ళను పంపి వేశారు. అనంతరం మొదట వచ్చిన వ్యాపారులకు ఆ సరకును అమ్మివేశారు. ఈ విధంగా డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వక తన వాగ్దానానికి ప్రాధాన్యత ఇచ్చారు.

‘హదీసు’వేత్తల నాయకుడు బగ్దాద్‌ పట్టణం చేరుకున్నారు. బగ్దాద్‌ బనీ ‘అబ్బాస్‌ పరపాలనా కాలంలో ఇస్లామీయ విద్యకు కేంద్రంగా మారిపోయింది. హారూన్‌, మామూన్‌ వంటి మహారాజులు దీని అభివృద్ధికి కృషి చేశారు. బగ్దాద్‌ గొప్పగొప్ప పండితులకు, ధార్మికవేత్తలకు నిలయంగా మారింది. బు’ఖారీ పేరు ప్రఖ్యాతులు బగ్దాద్‌ వరకు వ్యాపించాయి.

బు’ఖారీ బగ్దాద్‌ వచ్చారు. అతని రాక మామూలు విషయం కాదు. అతన్ని పరీక్షించటానికి బగ్దాద్‌ నగర పండితులు, ‘హదీసు’వేత్తలందరూ ఏకమయ్యారు. వంద ‘హదీసు’లను వాటి సాక్ష్యాధారాలను కలగా పులగం చేసి, బహిరంగంగా ప్రజల ముందు పరీక్షించడానికి ఏర్పాటు చేశారు. నగరంలోని మహా విద్యావంతు లందరూ ఏకమయ్యారు. అతని ముందు నిర్దేశించిన వ్యక్తులు ‘హదీసు’లు చదవసాగారు. బు’ఖారీ, “నాకు తెలియదు” అని అన్నారు. ఈ విధంగా అనేక మంది వ్యక్తులు కలగాపులగం చేసిన, మార్పులు చేర్పులు చేసిన ‘హదీసు’లు చదవగా బు’ఖారీ కేవలం, “నాకు తెలియదనే” సమాధానం ఇచ్చారు. ఈవిధంగా నిర్ణయించిన ‘హదీసు’లన్సీ అయిపోయాయి.

బు’ఖారీని ఎరుగని వారు, బు’ఖారీ ఓడిపోయారని భావించారు. కాని అతన్ని గురించి తెలిసిన వారు బు’ఖారీ మా ఎత్తు తెలుసుకున్నారు అని గ్రహించారు. బు’ఖారీ వెంటనే నిలబడి వారు కలగాపులగం చేసి, మార్పులు చేర్పులు చేసి చదివిన ‘హదీసు’లను సరైన రీతిలో ఏమాత్రం తప్పులేకుండా చదివి వినిపించారు. ఈ విధంగా వారు వినిపించిన ‘హదీసు’లన్నింటినీ వారికి ఎలాంటి తప్పులు లేకుండా  వినిపించారు. అది చూసి బగ్దాద్‌ ప్రజానీకం ఆశ్చర్య పడకుండా ఉండలేక పోయారు. ఇంకా వారి గొప్పతనాన్ని స్వీకరించారు.

మరణం: బు’ఖారీ 13 రోజులు తక్కువ 62 సంవత్సరాల వయస్సులో ‘ఈదుల్‌ ఫి’త్ర్‌ నాడు రాత్రి 256 హిజ్రీ శకంలో మరణించారు. మరణించిన తరువాత కూడా శరీరం నుండి చెమట వస్తూనే ఉంది. చివరికి స్నానం చేయించి కఫన్‌ చుట్టువేయడం జరిగింది. కొంతమంది సమర్‌ఖంద్‌ తీసుకువెళదామని కోరారు. ఇంకా ఖనన ప్రదేశం విషయంలో కూడా భేదాభిప్రాయాలు తలెత్తాయి. కాని తరువాత అక్కడే ఖననం చేయాలని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ‘ఈదుల్‌ ఫి’త్ర్‌ నాడు “జుహర్‌ నమాజు తర్వాత ఖననం చేయబడ్డారు.

వర్రాఖ్  కథనం: బు’ఖారీ తన మరణానికి ముందు తనను ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం) సాంప్రదాయం ప్రకారం 3 వస్త్రాల్లో  ఖననం చేయాలని ఉపదేశించారు.

ఖతీబ్‌ అబ్దుల్‌ వాహిద్‌ బిన్‌ ఆదమ్‌ అత్తవాల్‌లేసీ  యొక్క సంఘటన పేర్కొన్నారు, “నేను ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం)ను తన సహచరుల బృందం వెంట ఒకచోట వేచిఉన్నారు. ఎవరి గురించో ఎదురుచూస్తున్నారు. నేను సలామ్‌ చేసి, ‘ఎవరి గురించి ఎదురుచూస్తున్నారు’ అని అడిగాను. దానికి ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం), ‘నేను ము’హమ్మద్‌ బిన్‌ ఇస్మాయీ’ల్‌ గురించి ఎదురుచూస్తున్నాను,’ అని సమాధానం ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత బు’ఖారీ మరణవార్త నాకు తెలిసింది. అప్పుడు నేను కల సమయాన్ని, మరణసమయాన్ని కలిపి చూశాను. ఆ రెండూ ఒకే సమయం, ఒకే దినంగా నిర్దారించాను. ఎందు కంటే షరీఅత్‌లో సత్యమైన స్వప్నాలు దైవ దౌత్యంలో ని 46వ భాగంగా నిర్దారించటం జరిగింది. బు’ఖారీ మరణంపై పండితులందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.

బు’ఖారీ రచనలు; అత్తార’ఖుల్‌ కబీర్‌, అత్తారీఖుల్‌ అవ్‌ సత్‌, అత్తారీఖ్‌ అస్సగీర్‌, అల్‌ జామిఉల్‌ కబీర్‌, ఖల్‌ఖు అఫ్‌ఆలిల్‌ ఇబాద్‌, కితాబుద్దుఅఫాయిల్‌ అస్సగీర్‌, అల్‌ ముస్నదుల్‌ కబీర్‌, అత్తఫ్‌సీరుల్‌ కబీర్‌, కితాబుల్‌ హిబహ్‌, అసామిస్సహాబహ్‌, కితాబుల్‌ విజ్‌ దాన్‌, కితాబుల్‌ మబ్‌సూత్‌, కితాబుల్‌ ఇలల్‌, కితా బుల్‌ కినా, కితాబుల్‌ ఫవాయిద్‌, అల్‌ అదబుల్‌ ముఫ్రద్‌, జుజ్ఉరఫ్‌ఉల్‌ యదైన్‌, బిర్రుల్‌ వాలిదైన్‌, కితాబుల్‌ అష్‌రిబహ్‌, ఖ’దాయస్సహాబహ్‌ వత్తాబి యీన్‌, కితాబుర్రిఖాఖ్‌, అల్‌ జామిఉస్సగీర్‌ పిల్‌ ‘హదీస్‌’, జు’జ్‌ ఉ ఖిరాఅతి ‘ఖల్‌ఫల్‌ ఇమామ్‌ మొదలైనవి.

సహీ బు’ఖారీ ఆదరణ, దాని గొప్పతనం: బు’ఖారీ రచనల్లో ”అల్‌ జామిఉ’స్స’హీ’హ్‌” ఈనాడు ‘స’హీహ్‌ బు’ఖారీ పేరుతో ప్రాచుర్యంలో ఉంది. ప్రపంచంలోని ఇస్లామీయ  ప్రాంతాలన్నింటిలో దీన్ని ప్రచురించడం జరిగింది. బు’ఖారీకి ‘హదీసు’వేత్తల నాయకుడిగా బిరుదు ఇచ్చే కారణాల్లో ఈ పుస్తకం కూడా ఒక కారణమే. దైవగ్రంథం ఖుర్‌ఆన్‌ తరువాత ఏ పండితుని పుస్తకానికి ఈ స్థానం  లభించలేదు.

‘స’హీ’హ్‌ బు’ఖారీ రాయాలనే ఆలోచన: ఇస్‌’హాఖ్‌ బిన్‌ రాహవియహ్‌ బు’ఖారీని ‘స’హీ’హ్‌ బు’ఖారీ రాయమని కోరారు. ఇబ్రాహీమ్‌ బిన్‌ మాఖల్‌ నసఫీ కథనం: బు’ఖారీ ఇలా అన్నారు, “ఒకరోజు మేము ఇస్‌’హాఖ్‌ బిన్‌ రాహవియహ్‌ వద్ద కూర్చొని ఉన్నాము. అప్పు డతను, “నువ్వు ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం) ప్రామాణిక ‘హదీసు’లను ఒకచోట చేర్చితే బాగుండు,” అని అన్నారు. ఆ మాట నా మనసులో నాటుకుంది. నేను అప్పటి నుండే ‘స’హీ’హ్‌ బు’ఖారీని వ్రాయడం ప్రారంభించాను.

మరో కారణం ఏమిటంటే, బు’ఖారీ ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం)ను కలలో చూశారు. “నేను ప్రవక్త(సల్లల్లాహుఅలైహివసల్లం) సన్నిధిలో నిలబడి నా చేతిలో ఉన్న విసనకర్రతో ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం)పై నుండి ఈగలను తోలుతున్నాను.”” మేల్కొన్న తరువాత పండితులతో దాని పరమార్దాన్ని  గురించి అడిగాను. దానికి వారు, ‘ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం)పై కల్పించిన అసత్య ‘హదీసు’లను నీవు తొలగిస్తావు ,’ అని పరమార్దం తెలిపారు. ఎందు కంటే సత్యస్వప్పాలు దైవదౌత్యంలోని 46వ భాగం అని ఉంది. ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం)ను కలలో చూసిన వారు నిజంగా కలలోచూశారు. ఈకల కూడా మరింత కుతూహలాన్ని, ఉత్సాహాన్ని నింపింది. ఈవిధంగా “జామె’ ‘స’హీహ్‌” రచనలో బు’ఖారీ నిమగ్నంఅయిపోయారు.

రచనా సమయం మరియు సరళి: ‘స’హీహ్‌ బు’ఖారీని, బు’ఖారీ ఎప్పుడు మరియు ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు. ఎలా రచించారు. రచించిన తరువాత, ఎవరి ముందు ప్రవేశపెట్టారు. ప్రతి విషయంపై చర్చించారు.

వర్రాఖ్‌ కథనం: బు’ఖారీ ఇలా అన్నారు: “నేను జామె’ ‘స’హీహ్‌ను మూడుసార్లు రచించాను. అంటే దాన్ని మూడుసార్లు సరిదిద్దాను.”

అబుల్‌ ‘హైస’మ్‌ కష్‌మిష్నీ కథనం: నేను ఫర్‌బరీ ద్వారా ఇలా విన్నాను, అతను ఇలా అన్నారు. బు’ఖారీ కథనం: “నేను ఏ ‘హదీసు’నూ స్నానం చేసి రండు రకాతులు చదవనంత వరకు అల్‌ జామి’ఉ’స్స’హిహ్‌లో చేర్చలేదు.”

మరో ఉల్లేఖనంలో ఇలా కూడా ఉంది: “దాన్ని నేను మస్టిదె ‘హరామ్‌లో రచించాను. ఇంకా ప్రతి ‘హదీసు’పై రెండు రకాతుల నమా’జు చదివి ఇస్తిఖారా చేసేవాడిని. దానిపట్ల పూర్తి నమ్మకం కలిగిన తరువాతనే ‘అల్‌ జామి’ఉ’స్స’హిహ్‌’లో చేర్చేవాడిని. దీన్ని నేను నా సాఫల్యం కోసం వ్రాశాను. 6 లక్షల ‘హదీసుల్లో ప్రామాణికమైన ‘హదీసు’లను ఎంచి వ్రాశాను.”

ఇబ్నె అదీ తన గురువుల బృందం ద్వారా ఇలా పేర్కొన్నారు: బు’ఖారీ అల్‌ జామి’ఉ’స్స’హీ’హ్‌ యొక్క అధ్యాయాలన్నిటిని ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం) గది మరియు మింబర్ల మధ్య కూర్చొని, ప్రతి అధ్యాయానికి ముందు రెండు రకాతులు నమా’జు చదివి వ్రాసేవారు.

వర్రాఖ్‌ కథనం: నేను బు’ఖారీ వెంట ఉన్నాను. నేను బు’ఖారీని కితాబుత్తఫ్‌సీర్‌ వ్రాస్తూ ఉండగా చూశాను. రాత్రి 15, 20 సార్లు లేచి దీపం వెలిగించి ‘హదీసు’లపై గుర్తుపెట్టి పడుకునేవారు. దీన్నిబట్టి బు’ఖారీ ఎల్ల ప్పుడూ, ప్రతిచోట తన ధ్యానం అంతా దానిపైనే పెట్టే వారు. ఒక ‘హదీసు’ పట్ల పూర్తి నమ్మకం కలగగానే దానిపై గుర్తు పెట్టేవారు. ఇక అధ్యాయాలను బు’ఖారీ ఒకసారి ‘హరమ్‌లో మరోసారి ప్రవక్త (సల్లల్లాహుఅలైహివసల్లం) గదికి మింబరుకు మధ్య సంకలనం చేసేవారు. ఈ అధ్యాయాలలో ‘హదీసు’లను సంకలనం చేసినపుడు ముందు స్నానం చేసి నమా’జు చదివి ఇస్తిఖారా చేసేవారు.

అబూ జ’అఫర్‌ అఖీలీ కథనం: బు’ఖారీ, ‘స’హీహ్‌ బు’ఖారీని రచించి, ఆనాటి గొప్ప పండితులు అంటే అహ్మద్‌ బిన్‌ హంబల్‌, ‘అలీ బిన్‌ మదీనీ, య’హ్‌యా బిన్‌ ము’యీన్‌ మొదలైన వారి ముందు పెట్టారు. అందరూ చాలామెచ్చుకున్నారు. ఇంకా ప్రశంసించారు. దాని ప్రామాణికతను మెచ్చుకున్నారు. కాని నాలుగు ‘హదీసు’ల పట్ల అభ్యంతరం తెలిపారు. ఈ నాలుగు ‘హదీసు’ల విషయంలో కూడా బు’ఖారీ అభిప్రాయం సరైనదిగా తేలింది. ఆ నాలుగు ‘హదీసు’లు కూడా ప్రామాణికమైనవిగా తేలాయి.(సీరతుల్‌ బు’ఖారీ).


ఇది మిష్కాతుల్ మసాబీహ్ [హదీసులు] అను పుస్తకంలో “హదీసు వేత్తల జీవిత విశేషాలు నుండి తీసుకోబడింది

అఖీదా-యే-తౌహీద్ (అల్లాహ్ ఏకత్వం)- డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం]

బిస్మిల్లాహ్

Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan
దేవుని ఏకత్వం అఖీదా ఏ తౌహీద్ పుస్తకం
డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan దేవుని ఏకత్వం అఖీదా ఏ తౌహీద్ పుస్తకం డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

[ఇక్కడ చదవండి / PDF డౌన్ లోడ్ చేసుకోండి]
https://tinyurl.com/aqeeda-tawheed
[228 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

విషయసూచిక