పారిభాషిక పదంగా “నమాజు సరిగా నెరవేర్చని వ్యక్తి”
అల్లామా అల్బానీ, బహుశా పాఠకుల సౌకర్యార్థం, పుస్తక అంశాలలో కేవలం “నమాజు సరిగా నెరవేర్చని వ్యక్తి” అన్న ఒక్క పదం తప్ప మరే పారిభాషిక పదాన్ని ఉపయోగించలేదు. వాస్తవానికి ఈ పదం, యావత్తు ముస్లిం సమాజం దృష్టిలో, ఎంతో ఖ్యాతిగాంచిన మరియు జ్ఞాన తూకంలో ఎంతో విలువ పొందిన ఒక ముఖ్యమైన హదీసును గూర్చి సూచిస్తుంది.
ఈ హదీసును ధార్మిక పండితులు “నమాజు సరిగా నెరవేర్చని వ్యక్తి (ముసయీ సలాత్) హదీసు” గా పిలుస్తారు.
ఈ హదీసు, దీని సంపూర్ణ రూపంలో ఏ ఒక్క ఉల్లేఖనంలో కూడా లభించనందున, పాఠకుల ప్రయోజనార్థం, దీని సంపూర్ణ రూపాన్ని అవసరమైన పదజాలంతో సమర్పిస్తున్నాం. తద్వారా పండితులు మరియు సామాన్య ప్రజానీకం – వీరిలో ప్రతి ఒక్కరూ దీని ద్వారా ప్రయోజనం పొందగలరని ఆశించవచ్చు.
నమాజు సరిగా నెరవేర్చని వ్యక్తికి సంబంధించిన సంపూర్ణ హదీసు
రఫా బిన్ రాఫే (రజిఅల్లాహు అన్హు) కథనం:
ఒకరోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మస్జిదె నబవీలో కూర్చొని వున్నారు. మేము కూడా ఆయన దగ్గర కూర్చొని వున్నాం. ఇంతలో, పల్లెవాసిలా కనబడే ఒక వ్యక్తి మస్జిద్లోకి ప్రవేశించి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు దగ్గరలోనే ఖిబ్లా వైపునకు తిరిగి అసంపూర్ణ రుకూ, సజ్దాలతో (రుకూ, సజ్దాలు ప్రశాంతంగా చేయకుండా) రెండు తేలికపాటి రకాతులు పూర్తి చేశాడు. తదుపరి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు మరియు అక్కడున్న వారికి సలాం చేశాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “వ అలైకుం సలాం” అని జవాబిచ్చి, “వెళ్ళు, వెళ్లి తిరిగి నమాజు చేయి, ఎందుకంటే నువ్వు అసలు నమాజే చేయలేదు” – అని ఆజ్ఞాపిం చారు.
ఆ వ్యక్తి తిరిగి వెళ్ళి మునపటి లాగే మళ్ళీ నమాజు చేశాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతన్ని గమనించసాగారు. కానీ ఆ వ్యక్తి మాత్రం, నమాజులో తను చేస్తున్న పొరపాట్లను గూర్చి తెలుసుకోలేక పోయాడు. నమాజు పూర్తి చేసి మళ్ళీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు మరియు అక్కడున్న వారికి సలాం చేశాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “వ అలైకుం సలాం” అని జవాబిచ్చి “వెళ్ళు, వెళ్ళి మళ్ళీ నమాజు చేయి, నీ నమాజు అసలు నెరవేరలేదు” అని పురమాయించారు. ఇలా, ఆ వ్యక్తి మూడుసార్లు తన నమాజును పూర్తిచేశాడు. (బుఖారీ,ముస్లిం)
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రతిసారీ అతనికి “వ అలైకుం సలాం” అని జవాబిచ్చి “వెళ్ళు, వెళ్ళి మళ్ళీ నమాజు చేయి, ఎందుకంటే నీ నమాజు అసలు నెరవేరలేదు” అని పురమాయించారు.
దైవప్రవక్త (సల్లల్తాహు అలైహి వ సల్లం) మాటలు విని అక్కడున్నవారు — “బహుశా, ఎవరయితే తేలికపాటి నమాజు చేస్తారో వారి నమాజు అసలు నెరవేరదు కాబోలు” అని భావించారు. ఆ వ్యక్తి – “నా నమాజులో అయ్యే పొరపాట్లను గూర్చి నేను తెలుసుకోలేక పోతున్నాను. మీపై ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేసిన వాని సాక్షిగా! నాకింతకన్నా మంచిగా నమాజు చేయడం రాదు. నేను నా ప్రయత్న మంతా చేశాను. మీరే నాకు చెప్పండి మరియు నేర్పించండి. ఎందుకంటే – నేను మానవ మాత్రుణ్ణి, నా ద్వారా తప్పొప్పులు రెండూ జరిగే ఆస్కారముంది” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విన్నవించు కున్నాడు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతనికి ఇలా హితబోధ చేశారు:
“బాగా విను! నువ్వెప్పుడైనా నమాజు చేయాలని సంకల్పించుకున్నప్పుడు, మంచిగా వుజూ చేయి. ఎందు కంటే – అల్లాహ్ ఆదేశించిన దాని ప్రకారం – వుజూ సరిగా చేయనంత వరకు ఎవరి నమాజ్ కూడా నెరవేరదు. అంటే – వుజూ సరిగా చేయ నంతవరకు ఎవరి నమాజ్ కూడా నెరవేరదు. అంటే – అతను తన ముఖాన్ని రెండు చేతులను, మోచేతి క్రీళ్ల వరకు కడిగి, తలను రెండు చేతులతో స్పర్శించి (మసహ్ చేసి) తదుపరి రెండు కాళ్ళను చీలమండ వరకు శుభ్రం చేసుకోవాలి.
తదుపరి, అజాన్ యిచ్చి ఇఖామత్ పలుకు, ఖిబ్లా వైవునకు తిరిగి నిలబడిన తర్వాత, అల్లాహు అక్బర్ అని పలికి, అల్లాహ్ స్తోత్రాన్ని గొప్పతనాన్ని స్మరించు, తదుపరి ఫాతిహా సూరా మరియు దానితో పాటు మరేదైనా పఠించు.
అబూదావూద్ లోని మరో ఉల్లేఖనంలో యిలా ఉంది: (ఫాతిహా సూరా పఠించిన అనంతరం) దివ్యఖుర్ఆన్లో నుండి నీకు అనుమతి యివ్వబడిన దానిని, సులభమైన దానిని పఠించు. ఒకవేళ ఖుర్ఆన్ జ్ఞప్తి యందు లేకపోతే, అప్పుడు ‘అల్హందులిల్లాహ్, అల్లాహు అక్బర్ , లా ఇలాహ ఇల్లల్లాహ్ ‘ అని పలుకు.
తదుపరి ‘అల్లాహు అక్బర్’ అంటూ ప్రశాంతంగా కీళ్లన్నీ కుదుటపడి ప్రశాంతత పొందేలా రుకూ చేయి. రుకూ చేసేటప్పుడు నీ అరచేతులను మోకాళ్ళపై పెట్టు మరియు వీపును తిన్నగా వుంచు.
తదుపరి ‘సమిఅల్లాహు లిమన్ హమిద’ అంటూ ఎముకలన్నీ తమ తమ స్థానాలకు వచ్ఛే విధంగా నిటారుగా నిలబడు. తిరిగి అల్లాహు అక్బర్ అని సజ్దాలోకి వెళ్ళు మరియు నీ ముఖాన్ని నుదుటిని – శరీర కీళ్ళు కుదుటపడి ప్రశాంతత పొందేలా నేలపై గట్టిగా వుంచు. తదుపరి అల్లాహు అక్బర్ అంటూ తలను సజ్దా నుండి పైకెత్తి నీ పిరుదులపై చక్కగా కూర్చో.
(అబూదావూద్ లోని వేరొక ఉల్లేఖనం లో యిలా ఉంది): సజ్దా నుండి నీవు తల పైకెత్తినప్పుడు, నీ ఎడమ తొడపై కూర్చో. తదుపరి “అల్లాహు అక్బర్” అని పలికి సజ్దాలోకి వెళ్ళి నీ ముఖాన్ని ప్రతి కీలూ కుదుట పడి ప్రశాంతత పొందేలా నేలపై వుంచు. తదుపరి తల పైకెత్తి అల్లాహు అక్బర్” అని అను.
(అబూదావూద్లోని ఇంకొక ఉల్లేఖనం లో యిలా ఉంది):“నమాజు మధ్యలో నీవు కూర్చున్నప్పుడు ప్రశాంతంగా నీ ఎడమ తొడపై కూర్చొని తషహ్హుద్ చేస్తూ ఉండు.”
(అబూదావూద్ లోని మరొక ఉల్లేఖనం లో యిలా ఉంది):“తదుపరి నీవు నిలబడినప్పుడు, మునపటిలాగే చేస్తూ నీ నమాజును పూర్తి చెయ్యి.”
ఇలా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నాలుగు రకాతులు నమాజ్ చదివే పద్ధతిని తెలియజేశారు. తదుపరి ఇలా పలికారు: ఇక ఎవరైతే ఇలా చేయరో (అంటే ఖియ్యాం, రుకూ, సజ్దాలు మరియు తషహ్హుద్ లలో పూర్తి ప్రశాంతతను ప్రదర్శించకుండా నమాజ్ చేయరో) వారి నమాజ్ సంపూర్ణం కానేరదు. ఒకవేళ యిలా చేస్తే, అప్పుడు వారి నమాజ్ సంపూర్ణం అవుతుంది. ఒకవేళ వీటిలో ఏ విషయంలోనైనా తొందరపాటును ప్రదర్శిస్తే దానికి తగ్గట్టుగానే మీ నమాజులో తగ్గుదల వస్తుంది.
ఇది దైవ ప్రవక్త నమాజు స్వరూపం – షేఖ్ అల్ అల్బానీ (రహిమహుల్లా) (పుస్తకం) నుండి తీసుకో బడింది. (16-21పేజీలు)
ఇతర లింకులు: