ఖవారీజుల గురించి ఒక సంక్షిప్త పరిచయం – షేక్ సాలిహ్ అల్-ఫౌజాన్

రచయిత: షేక్ సాలిహ్ అల్-ఫౌజాన్
మూలం: లమ్హా అన్-ఇల్-ఫిరఖ్-ఇద్-దాలహ్ (పేజీలు. 31-37), షబ్బాబ్ అర్-రాజిహీ గారి నోట్స్ తో.
Lamha ‘an-il-Firaq-id-Daalah (pg. 31-37) w/ notes by Shabbaab Ar-Raajihee
ప్రచురణ: Al-Ibaanah.com
https://abdurrahman.org/?p=21054

ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) గారి ఖిలాఫత్ (పాలనా) చివరి రోజుల్లో పాలకుడిపై తిరుగుబాటు (ఖురూజ్) చేసిన వారే ఖవారీజులు. వారి తిరుగుబాటు కారణంగా ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) హత్యకు గురయ్యారు.

ఆ తర్వాత అలీ (రదియల్లాహు అన్హు) ఖిలాఫత్ కాలంలో వారి చెడు మరింత పెరిగింది. వారు ఆయనను అవిశ్వాసి (కాఫిర్) గా ప్రకటిస్తూ ఆయనపై తిరుగుబాటు చేశారు. అంతేకాక, ప్రవక్త అనుచరులైన సహాబాలు వారి (తప్పుడు) విశ్వాసాలతో ఏకీభవించనందుకు, సహాబాలను కూడా వారు అవిశ్వాసులు (కాఫిర్లు) గా తీర్మానించారు. కాబట్టి తమ అభిప్రాయాలను వ్యతిరేకించే వారందరినీ వారు అవిశ్వాసులుగా పరిగణించారు. ఫలితంగా, సృష్టిలో అత్యుత్తమమైన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరులైన సహాబాలనే వారు అవిశ్వాసులుగా ప్రకటించారు. ఇదెందుకు? ఎందుకంటే వారి మార్గభ్రష్టత్వం మరియు కుఫ్ర్ (అవిశ్వాస) విధానాలతో సహాబాలు ఏకీభవించలేదు.

ఖవారీజ్ ల విశ్వాసాలు (అఖీదా): వారు సున్నత్ మరియు జమాఅత్‌కు కట్టుబడి ఉండరు, అలాగే నాయకుడికి (అమీర్ కు) విధేయత చూపరు. దానికి బదులుగా, ఆయనపై తిరుగుబాటు చేయడాన్ని, ఆయన పట్ల విధేయతను విచ్ఛిన్నం చేయడాన్ని వారు ధర్మంలోని భాగంగా భావిస్తారు [1]. ఇది విధేయత చూపాలని ఆజ్ఞాపించిన అల్లాహ్ ప్రవక్త సలహాకు మరియు అల్లాహ్ తన గ్రంథంలో ఆజ్ఞాపించిన దానికి పూర్తి విరుద్ధం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ وَأُولِي الْأَمْرِ مِنكُمْ
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు విధేయత చూపండి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపండి. మరియు మీలోని అధికారులకు కూడా. .” [సూరా అన్-నిసా: 59]

కాబట్టి పాలకుడికి విధేయత చూపడాన్ని అల్లాహ్ ఇస్లాం ధర్మంలో ఒక భాగంగా చేశాడు. మరియు అల్లాహ్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా పాలకుడికి విధేయత చూపడాన్ని ధర్మంలో భాగంగా చేశారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా అన్నారు:

«أُوصِيكُمْ بِتَقْوَى اللَّهِ وَالسَّمْعِ وَالطَّاعَةِ وَإِنْ عَبْدًا حَبَشِيًّا، فَإِنَّهُ مَنْ يَعِشْ مِنْكُمْ بَعْدِي فَسَيَرَى اخْتِلَافًا كَثِيرًا»

“మీరు అల్లాహ్ పట్ల భయభక్తులు (తఖ్వా) కలిగి ఉండాలని మరియు (నాయకుడి మాట) విని, విధేయత చూపాలని నేను మీకు ఉపదేశిస్తున్నాను, ఒక బానిస మీపై నాయకుడిగా నియమించబడినప్పటికీ సరే. ఎందుకంటే మీలో జీవించి ఉన్నవారు (ముందు ముందు) ఎన్నో విభేదాలను చూస్తారు…[2]

కాబట్టి ముస్లిం పాలకుడికి విధేయత చూపడం అనేది (ఇస్లాం) ధర్మంలోని భాగం. కానీ ఖవారీజులు ఇలా అంటారు: “లేదు, ఈ విధేయతకు మేము అతీతులం (మాకు స్వేచ్ఛ ఉంది).” ఈనాటి తిరుగుబాటు మరియు అల్లర్ల మార్గం కూడా ఇదే!

కాబట్టి ఖవారీజులు అంటే ముస్లింల ఐక్య సమూహంలో (జమాఅత్ లో) చీలికను తీసుకురావడానికి మరియు నాయకులపై తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించేవారు – ఇలా చేయడంలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పట్ల స్పష్టమైన అవిధేయత ఉంది. అలాగే, మహా పాపం (కబీరా పాపం) చేసిన ముస్లింను వారు అవిశ్వాసి (కాఫిర్) గా పరిగణిస్తారు.

కాబట్టి, వ్యభిచారి, దొంగ, మద్యం సేవించేవాడు – ఇలా మహా పాపాలు చేసే వారందరినీ వారు కాఫిర్లుగా తీర్మానిస్తారు. దీనికి భిన్నంగా, అహ్లుస్-సున్నహ్ వల్-జమాఅత్ వారు అలాంటి వ్యక్తిని “తక్కువ ఈమాన్ కలిగిన ముస్లిం[3] గా భావిస్తారు మరియు అతనిని “ధర్మంలో పాపాత్ముడు (ఫాసిఖ్/ఆసీ)” అని పిలుస్తారు. కాబట్టి అతను తన ఈమాన్ వల్ల ఒక “విశ్వాసి (ముమిన్)”, అలాగే తన మహా పాపం వల్ల ఒక “పాపాత్ముడు”. ఎందుకంటే షిర్క్ (అల్లాహ్ కు సాటి కల్పించడం) మరియు ఇస్లాంను భంగపరిచే స్పష్టమైన విషయాలు (నవాఖిజ్ అల్-ఇస్లాం) తప్ప మరొకటి ఏదీ ఒక వ్యక్తిని ఇస్లాం పరిధి నుండి బయటకు పంపవు. షిర్క్ కంటే తక్కువ స్థాయి పాపాలు, అవి మహా పాపాలైనప్పటికీ, ఒక వ్యక్తిని ఈమాన్ పరిధి నుండి బహిష్కరించడానికి కారణం కావు. అల్లాహ్ ఇలా అంటున్నాడు:

﴿إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ﴾
నిశ్చయంగా అల్లాహ్, తనకు సాటి కల్పించటాన్ని (షిర్క్‌ను) క్షమించడు. ఇది తప్ప ఇతర పాపాలను తాను కోరిన వారికి క్షమిస్తాడు.” [సూరా అన్-నిసా: 48, 116]

కానీ ఖవారీజులు ఇలా అంటారు: “మహా పాపం చేసినవాడు కాఫిర్ (అవిశ్వాసి), అతను క్షమించబడడు మరియు అతను నరకాగ్నిలో శాశ్వతంగా ఉండిపోతాడు.” ఇది ఖురాన్‌లో స్పష్టంగా చెప్పబడిన దానికి విరుద్ధం. దీనికి కారణం వారికి ధర్మం పట్ల సరైన అవగాహన (ఫిఖ్హ్/సమజ్) లేకపోవడమే.

వారు ఈ తప్పుడు విశ్వాసాలలో పడటానికి ప్రధాన కారణం వారి జ్ఞానలేమి (ఇల్మ్ లేకపోవడం) అని గమనించండి. ఎందుకంటే వారు ఆరాధనలు (ఇబాదత్), నమాజ్, ఉపవాసం మరియు ఖురాన్ పారాయణంలో చాలా తీవ్రంగా (ముందు) ఉంటారు. మరియు వారికి ధర్మం పట్ల బలమైన ఆవేశం (రోషం) ఉంటుంది, కానీ వారికి సరైన జ్ఞానం ఉండదు – ఇదే అసలు సమస్య.

కాబట్టి భయభక్తులు (తఖ్వా) మరియు ఆరాధనల్లో తీవ్రంగా కృషి చేయడం అనేది ధర్మ పరిజ్ఞానం మరియు సరైన అవగాహనతో కూడి ఉండాలి. అందువల్లే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సహాబాలకు వారిని (ఖవారీజులను) ఈ విధంగా వర్ణించారు: ప్రవక్త అనుచరులైన సహాబాలు ఖవారీజుల నమాజును చూసి తమ నమాజును తక్కువగా భావిస్తారని మరియు వారి ఆరాధనను చూసి తమ ఆరాధనను తక్కువగా భావిస్తారని చెప్పారు. ఆ తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:

«يَمْرُقُونَ مِنَ الدِّينِ كَمَا يَمْرُقُ السَّهْمُ مِنَ الرَّمِيَّةِ»

వేటాడిన జంతువు శరీరం గుండా బాణం ఎలాగైతే దూసుకుపోతుందో, వారు (ఖవారీజులు) ధర్మం నుండి అలా బయటికి వెళ్లిపోతారు[4] – వారి ఆరాధనలు, వారి భక్తి మరియు వారు రాత్రి పూట చేసే తహజ్జుద్ నమాజ్ ఉన్నప్పటికీ సరే.

కాబట్టి వారి కృషి సరైన పునాదిపై మరియు ప్రామాణికమైన జ్ఞానంపై ఆధారపడి లేకపోవడం వల్ల, అది వారికీ మరియు ఈ ఉమ్మత్ (సమాజం) కీ ఒక మార్గభ్రష్టత్వంగా, ఒక జాడ్యంగా మరియు తీవ్రమైన కీడుగా మారింది.

అంతేకాకుండా, ఖవారీజుల చరిత్రలో వారు ఏ ఒక్క రోజైనా అవిశ్వాసులతో (కాఫిర్లతో) పోరాడినట్లు ఎక్కడా దాఖలాలు లేవు! బదులుగా, వారు కేవలం ముస్లింలతో మాత్రమే పోరాడుతారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా సెలవిచ్చినట్లు:

«يَقْتُلُونَ أَهْلَ الإِسْلاَمِ وَيَدَعُونَ أَهْلَ الأَوْثَانِ»
మరియు వారు ఇస్లాం ప్రజలను చంపి, విగ్రహారాధకులను వదిలివేస్తారు.” [5]

కాబట్టి ఖవారీజుల చరిత్రలో వారు ఏనాడైనా కాఫిర్లు మరియు ముష్రిక్కులతో పోరాడినట్లు మనకు తెలియదు. వారు ఎల్లప్పుడూ ముస్లింలతోనే పోరాడుతూ వస్తున్నారు. వారే ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ను చంపారు, వారే అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ను చంపారు. వారే జుబైర్ ఇబ్నుల్-అవ్వామ్ ను మరియు అత్యుత్తమ సహాబాలను చంపారు. మరియు వారు ముస్లింలను చంపడం నేటికీ ఆపలేదు.

ఇదంతా అల్లాహ్ ధర్మం పట్ల వారికి ఉన్న అజ్ఞానం వల్లే. అయినప్పటికీ, వారికి భయభక్తులు మరియు ఆరాధనా భావం ఉన్నాయి, కానీ ఇవి ప్రామాణికమైన జ్ఞానంపై ఆధారపడి లేనందున, అది వారికి ఒక వ్యాధిగా మారింది. అందుకనే గొప్ప పండితుడైన ఇబ్న్ అల్-ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) వారిని వర్ణిస్తూ ఇలా అన్నారు:

«وَلَهُم نُصُوصٌ قَصَّرُوا فِي فَهْمِهَا *** فَأُتُوا مِنَ التَّقْصِيرِ فِي العِرْفَانِ»
వారి వద్ద ఆధారాలు (నుసూస్) ఉన్నాయి, కానీ వాటిని అర్థం చేసుకోవడంలో వారు విఫలమయ్యారు.
కాబట్టి వారికి పరిమితమైన (తక్కువ) జ్ఞానమే ఇవ్వబడింది
.” [6]

కాబట్టి వారు ఖురాన్ మరియు సున్నత్ వాక్యాలను ఆధారాలుగా ఉపయోగిస్తారు కానీ వాటిని వారు అర్థం చేసుకోరు. పాపాలు చేసిన వారిని శిక్షిస్తామనే హెచ్చరికలు ఉన్న వాక్యాలను వారు ఆధారాలుగా చూపుతారు, కానీ వాటి నిజమైన అర్థాలను వారు గ్రహించరు. వారు ఆ వాక్యాలను, షిర్క్ కంటే తక్కువ పాపాలు చేసిన వారికి క్షమాపణ మరియు పశ్చాత్తాపాన్ని (తౌబా) స్వీకరిస్తామనే వాగ్దానం ఉన్న ఇతర వాక్యాలతో కలిపి చూడరు. కాబట్టి వారు గ్రంథంలోని ఒక భాగాన్ని అంగీకరిస్తారు మరియు మరొక భాగాన్ని వదిలివేస్తారు – ఇదంతా వారి అజ్ఞానం వల్లే.

కాబట్టి ధర్మం పట్ల మితిమీరిన ప్రేమ మరియు ఉత్సాహం (జజ్బా) ఉండటం మాత్రమే సరిపోదు. అవి అల్లాహ్ ధర్మం గురించిన ఇల్మ్ (జ్ఞానం) మరియు అవగాహనపై ఆధారపడి ఉండాలి. అప్పుడే ఆ జ్ఞానం నుండి వారు మార్గనిర్దేశం పొందుతారు మరియు విషయాలను వాటి సరైన స్థానంలో ఉంచుతారు.

కాబట్టి ధర్మం పట్ల ప్రేమ మరియు ఉత్సాహం ఉండటం మంచిదే, కానీ వాటికి ఖురాన్ మరియు సున్నత్ అనుసరణ ద్వారా సరైన దిశానిర్దేశం చేయబడాలి.

ధర్మంలో అత్యున్నత స్థానం ఉన్నవారు మరియు ముస్లింల పట్ల అత్యంత చిత్తశుద్ధి కలిగినవారు సహాబాలే. అయినప్పటికీ, ఖవారీజుల వల్ల ఉన్న ప్రమాదం మరియు చెడు వలన సహాబాలు వారితో పోరాడారు.

అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) నహ్రవాన్ యుద్ధంలో వారిని అత్యంత తీవ్రంగా వధించేంతగా వారితో పోరాడారు. ఇలా చేయడం ద్వారా, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపిన శుభవార్తను సాకారం చేశారు. ఎందుకంటే, వారిని చంపిన వారికి పుణ్యం మరియు స్వర్గం లభిస్తుందని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శుభవార్త ఇచ్చారు. కాబట్టి అలీ బిన్ అబీ తాలిబ్ వారిని చంపిన వ్యక్తి – అందువలన ఆయన అల్లాహ్ ప్రవక్త నుండి ఈ శుభవార్తను పొందారు.[7] ముస్లింలకు వారి కీడు జరగకుండా అడ్డుకోవడానికే ఆయన వారిని వధించారు.

ప్రతి తరంలోనూ, ముస్లింలకు ఈ దుష్ట విధానం (మన్హజ్) ఉనికి గురించి తెలిస్తే, మొదటగా వారిని అల్లాహ్ మార్గం వైపుకు పిలవడం మరియు వారికి అవగాహన కల్పించడం ద్వారా దానిని నయం చేయడానికి ప్రయత్నించడం విధి (వాజిబ్). కానీ వారు దీనిని అంగీకరించకపోతే, వారి చెడును నిరోధించడానికి (అధికారంలో ఉన్న ముస్లిం పాలకుడి నేతృత్వంలో) ముస్లింలు వారితో పోరాడాలి.

అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) తన సోదరుడు (Cousin), ఉమ్మత్ యొక్క గొప్ప పండితుడు (హబ్ర్) మరియు ఖురాన్ వ్యాఖ్యాత (తుర్జుమానుల్ ఖురాన్) అయిన అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమ) ను వారి వద్దకు పంపారు. ఆయన వారితో చర్చలు (మునాజరా) జరిపారు, దాంతో వారిలోని ఆరు వేల మంది పశ్చాత్తాపపడి (తౌబా చేసుకొని) తిరిగి వచ్చారు, కానీ చాలా మంది పశ్చాత్తాపపడకుండా అలాగే ఉండిపోయారు. అప్పుడు అమీర్-ఉల్-ముమినీన్, అలీ బిన్ అబీ తాలిబ్, మిగిలిన సహాబాలతో కలిసి వారితో పోరాడారు. ముస్లింలకు వారి కీడు మరియు హాని కలగకుండా నిరోధించడానికే ఈ పోరాటం జరిగింది.

ఇది అల్-ఖవారీజ్ అని పిలువబడే వర్గం (ఫిర్ఖా) మరియు వారి విశ్వాసాల గురించిన వివరణ.

[1] మన కాలంలో, పాపకార్యం కాని విషయాల్లో పాలకులకు విని, విధేయత చూపాలని విశ్వసించే వారిని బహుశా ప్రభుత్వ ఏజెంట్లుగా లేదా అమాయకులుగా ముద్రవేస్తున్నారు! అందుకనే ఈ ఖవారీజులు మింబర్ల పైనుండి మరియు వారి సమావేశాలలో పాలకులపై దాడి చేయడం మరియు వారి తప్పులను బహిరంగంగా ఎత్తిచూపడం మీరు చూస్తారు. కానీ అల్లాహ్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

«مَنْ أَرَادَ أَنْ يَنْصَحَ لِسُلْطَانٍ بِأَمْرٍ فَلا يُبْدِ لَهُ عَلانِيَةً، وَلَكِنْ لِيَأْخُذْ بِيَدِهِ فَيَخْلُ بِهِ، فَإِنْ قَبِلَ مِنْهُ فَذَاكَ، وَإِنْ كَانَ لَمْ يَقْبَلْ كَانَ قَدْ أَدَّى الَّذِي عَلَيْهِ»

“ఎవరైనా అధికారికి (సుల్తాన్ కు) ఒక విషయంపై సలహా ఇవ్వాలనుకుంటే, అతను దానిని బహిరంగంగా వెల్లడించకూడదు, బదులుగా అతని చేతిని పట్టుకుని ఏకాంతంలోకి వెళ్ళాలి. అతను దానిని (సలహాను) అంగీకరిస్తే అతనికి ప్రతిఫలం ఉంటుంది, ఒకవేళ అతను అంగీకరించకపోతే, సలహా ఇచ్చినవాడు తన బాధ్యతను నెరవేర్చినవాడవుతాడు.”

ఇయ్యాద్ బిన్ గనమ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన ద్వారా అహ్మద్ (3/404) నమోదు చేశారు. ఇబ్న్ అబీ ఆసిమ్ కూడా దీనిని తన ‘అస్-సున్నహ్’ (2/522) గ్రంథంలో నమోదు చేశారు.

అధికారి (పాలకుడు) వీరిలో ఎవరినైనా బహిరంగ సభల్లో మాట్లాడకుండా నిషేధించినప్పుడు, వారు ఏకమై నిరసన ప్రదర్శనలు (demonstrations) చేస్తారు. ఒకరిని మాట్లాడకుండా అడ్డుకోవడం లేదా జైలులో పెట్టడం అనేది తిరుగుబాటును సమర్థిస్తుందని వారి అజ్ఞానంతో వారు భావిస్తారు! సహీహ్ ముస్లిం (1855) లోని ఔఫ్ బిన్ మాలిక్ అల్-అష్జఈ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనలోని ప్రవక్త ప్రవచనం వారు వినలేదా?:

«لا، مَا أَقَامُوا فِيكُمُ الصَّلاةَ»
“…లేదు, వారు నమాజును స్థాపిస్తున్నంత కాలం (మీరు వారిపై తిరుగుబాటు చేయకండి).”

ఇంకా సహీహ్ బుఖారీ, ముస్లింలలో ఉన్న ఉబాదా బిన్ అస్-సామిత్ (రదియల్లాహు అన్హు) హదీసులో, ప్రవక్త ఇలా అన్నారు:

«إِلَّا أَنْ تَرَوْا كُفْرًا بَوَاحًا، عِنْدَكُمْ مِنَ اللَّهِ فِيهِ بُرْهَانٌ»
…మీరు స్పష్టమైన మరియు బహిరంగ అవిశ్వాసాన్ని (కుఫ్ర-ఎ-బవాహ్) చూస్తే తప్ప, అప్పుడు మాత్రమే మీ వద్ద అల్లాహ్ ముందు సమర్పించడానికి స్పష్టమైన ఆధారం ఉంటుంది.”

అణచివేసే పాలకులపై పోరాడేందుకు అనుమతి కోరుతూ సహాబాలు ప్రవక్తను అడిగిన ప్రశ్నకు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇచ్చిన సమాధానం ఇది.

ఇమామ్ అహ్మద్ జైలులో ఎంతకాలం ఉన్నారో వీరికి తెలియదా? మరియు షేక్-ఉల్-ఇస్లాం ఇబ్న్ తైమియ్య ఎక్కడ మరణించారు?! ఖురాన్ సృష్టించబడినదని చెప్పనందుకు ఇమామ్ అహ్మద్ చాలా సంవత్సరాలు జైలులో ఉండి కొరడా దెబ్బలు తినలేదా? మరి అప్పుడు ఆయన ప్రజలను ఖలీఫాపై తిరుగుబాటు చేయమని ఎందుకు ఆదేశించలేదు? షేక్-ఉల్-ఇస్లాం (ఇబ్న్ తైమియ్య) రెండు సంవత్సరాలకు పైగా జైలులో ఉండి అక్కడే మరణించారని వారికి తెలియదా? ఆయన ప్రజలను నాయకుడిపై తిరుగుబాటు చేయమని ఎందుకు ఆదేశించలేదు? అంతకుమించి, ఈ పండితులు సద్గుణాలు మరియు జ్ఞానం పరంగా అత్యున్నత స్థానంలో ఉన్నారు, మరి వారి కంటే తక్కువ స్థాయి ఉన్నవారి సంగతేంటి??? యువత పండితులను (ఉలమాలను) విడిచిపెట్టి, వారి పుస్తకాలను మర్చిపోయి, ఆధునిక కాలపు మేధావులు, కవులు మరియు ఇస్లామిక్ రచయితల నుండి తమ జ్ఞానాన్ని తీసుకోవడం ప్రారంభించిన తర్వాతే ఈ భావజాలాలు మరియు చర్యలు మనకు వ్యాపించాయి! వ లా హౌల వ లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్!

[2] అహ్మద్, ఇబ్న్ మాజా, అత్-తిర్మిజీ, అల్-హాకిమ్ మరియు ఇతరులు ఉల్లేఖించిన సహీహ్ (ప్రామాణిక) హదీసు [అనువాదకునిచే సంక్షిప్తం చేయబడినది].

[3] వారు ఒక పాపాన్ని చిన్నదిగా భావించి (ఇస్తిఖ్ఫాఫ్) చేసినప్పటికీ, దానిని ధర్మసమ్మతంగా (ఇస్తిహ్లాల్ / హలాల్) చేయనంత కాలం వారు కాఫిర్లు కారు. కానీ వారిలో కొందరు చెప్పేది దీనికి విరుద్ధం: “ఒక పాపాన్ని తేలికగా భావించి చేసే వ్యక్తి, ఇస్లాం నుండి బయటికి వెళ్ళేంత అవిశ్వాసానికి పాల్పడతాడు” అని అంటారు. మన షేక్, షేక్ అబ్దుల్-అజీజ్ ఇబ్న్ అబ్దిల్లాహ్ బిన్ బాజ్ గారిని 1415 హిజ్రీలో తాయిఫ్ లో అడిగినప్పుడు, ఈ వాక్యమే ఖవారీజుల విశ్వాసాల యొక్క సారాంశం అని ఆయన చెప్పారు.

[4] అహ్మద్, ముస్లిం, అల్-బుఖారీ మరియు ఇతరులు అనేక మంది సహాబాల ద్వారా ఉల్లేఖించిన సుదీర్ఘ హదీసులోని భాగం [అనువాదకునిచే సంక్షిప్తం చేయబడినది].

[5] అహ్మద్, ముస్లిం, అల్-బుఖారీ మరియు ఇతరులు ఉల్లేఖించిన సుదీర్ఘ హదీసులోని భాగం [అనువాదకునిచే సంక్షిప్తం చేయబడినది].

[6] ఇబ్న్ అల్-ఖయ్యిమ్ రచించిన అన్-నూనియ్య (పేజీ. 97).

[7] అల్-బుఖారీ తన సహీహ్ (6930) లో, ముస్లిం తన సహీహ్ (1066) లో, అహ్మద్ తన ముస్నద్ (1/113) లో, ఇబ్న్ అబీ ఆసిమ్ తన అస్-సున్నహ్ (914) లో మరియు అబ్దుల్లాహ్ బిన్ అల్-ఇమామ్ అహ్మద్ తన అస్-సున్నహ్ (1487) లో నమోదు చేశారు: అలీ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా అన్నారు:

«سَيَخْرُجُ قَوْمٌ فِي آخِرِ الزَّمَانِ حُدَثَاءُ الأَسْنَانِ، سُفَهَاءُ الأَحْلاَمِ، يَقُولُونَ مِنْ خَيْرِ قَوْلِ الْبَرِيَّةِ، لاَ يُجَاوِزُ إِيمَانُهُمْ حَنَاجِرَهُمْ، يَمْرُقُونَ مِنَ الدِّينِ كَمَا يَمْرُقُ السَّهْمُ مِنَ الرَّمِيَّةِ، فَأَيْنَمَا لَقِيتُمُوهُمْ فَاقْتُلُوهُمْ، فَإِنَّ فِي قَتْلِهِمْ أَجْرًا لِمَنْ قَتَلَهُمْ يَوْمَ الْقِيَامَةِ»

“నేను అల్లాహ్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అనడం విన్నాను: ‘చివరి రోజుల్లో, వయస్సులో చిన్నవారైన మరియు మూర్ఖపు ఆలోచనలు ఉన్న ఒక సమూహం ఉద్భవిస్తుంది. వారు సృష్టిలోనే అత్యుత్తమమైన మాటలతో మాట్లాడతారు. కానీ వారి ఈమాన్ (విశ్వాసం) వారి గొంతులను దాటదు. కాబట్టి మీరు వారిని ఎక్కడ ఎదుర్కొన్నా, వారిని చంపండి (ఇస్లామిక్ ప్రభుత్వ నేతృత్వంలో), ఎందుకంటే వారిని చంపిన వారికి తీర్పు దినాన ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది.'”

ఖవారీజులు మరియు వారి సంకేతాల గురించిన హదీసును ఉల్లేఖించిన తరువాత, అబూ సయీద్ అల్-ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “అల్లాహ్ ప్రవక్త అనుచరులలో ఇరవై లేదా ఇరవై కంటే ఎక్కువ మంది సహాబాలు, వారిని చంపే బాధ్యతను అలీ చేపట్టారని నాకు వివరించారు.” అహ్మద్ తన ముస్నద్ (3/33) లో మరియు ఆయన కుమారుడు అబ్దుల్లాహ్ తన అస్-సున్నహ్ (1512) లో ఉల్లేఖించారు.

ఉత్పత్తి మరియు తిరుగుబాటు: ఖవారీజులు ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) మరియు అలీ (రదియల్లాహు అన్హు) గారి కాలంలో ముస్లిం పాలకులపై తిరుగుబాటు చేయడం ద్వారా ఉద్భవించారు. వారు తమ అభిప్రాయాలతో ఏకీభవించని అత్యుత్తమ సహాబాలను సైతం అవిశ్వాసులుగా (కాఫిర్లుగా) ప్రకటించారు.

పాలకులకు అవిధేయత: అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పాలకులకు విధేయత చూపాలని ఆజ్ఞాపించినప్పటికీ, ఖవారీజులు పాలకులపై తిరుగుబాటు చేయడాన్ని మరియు వారిని వ్యతిరేకించడాన్ని ధర్మంలోని భాగంగా భావిస్తారు.

మహా పాపాలకు కాఫిర్లుగా తీర్మానించడం: వ్యభిచారం, దొంగతనం లాంటి మహా పాపాలు (కబీరా పాపాలు) చేసిన ముస్లింలను ఖవారీజులు ఇస్లాం నుండి బహిష్కరించి, వారిని కాఫిర్లుగా మరియు శాశ్వత నరకవాసులుగా పరిగణిస్తారు.

అహ్లుస్-సున్నహ్ వల్-జమాఅత్ విశ్వాసం: అహ్లుస్-సున్నహ్ విధానం ప్రకారం షిర్క్ (అల్లాహ్ కు సాటి కల్పించడం) మరియు ఇస్లాంను భంగపరిచే ఇతర స్పష్టమైన విషయాలు (నవాఖిజ్ అల్-ఇస్లాం) తప్ప, మరే ఇతర మహా పాపాలు (వ్యభిచారం, దొంగతనం, మద్యం సేవించడం వంటివి) ఒక వ్యక్తిని ఇస్లాం పరిధి నుండి బయటకు పంపవు (ఒకవేళ ఆ పాపాలను వారు ధర్మసమ్మతంగా/హలాల్ గా భావిస్తే తప్ప). షిర్క్ మరియు కుఫ్ర కంటే తక్కువ స్థాయి పాపాలు చేసిన వ్యక్తి “తక్కువ ఈమాన్ కలిగిన ముస్లిం” మరియు “ధర్మంలో పాపాత్ముడు” అవుతాడే తప్ప కాఫిర్ కాడు.

అజ్ఞానం మరియు అతిభక్తి: ఖవారీజులు నమాజు, ఉపవాసాలు మరియు ఖురాన్ పారాయణంలో చాలా ముందుంటారు. కానీ వారికి ధర్మం పట్ల సరైన జ్ఞానం (ఇల్మ్) మరియు అవగాహన (ఫిఖ్హ్) ఉండవు. జ్ఞానం లేని వారి అతి ఉత్సాహమే వారి మార్గభ్రష్టత్వానికి కారణం.

ఆధారాల దుర్వినియోగం: వారు ఖురాన్ మరియు హదీసులను చదివినప్పటికీ వాటి నిజమైన అర్థాన్ని గ్రహించరు. కేవలం పాపాలకు విధించే శిక్షల వాక్యాలను మాత్రమే తీసుకుని, అల్లాహ్ యొక్క క్షమాపణకు సంబంధించిన వాక్యాలను విడిచిపెడతారు.

ముస్లింల పట్ల క్రూరత్వం: చరిత్రలో ఖవారీజులు ఏనాడూ కాఫిర్లతో పోరాడలేదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందుగానే హెచ్చరించినట్లు, వారు కేవలం ముస్లింలను మాత్రమే వధిస్తారు.

సహాబాల చర్య: అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) మొదట అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ ద్వారా వారికి ధర్మాన్ని బోధించారు. అప్పటికి వినకుండా ముస్లింలకు హాని చేస్తున్న వారిపై నహ్రవాన్ యుద్ధంలో పోరాడి వారిని అంతమొందించారు.

మన బాధ్యత: ఇలాంటి మార్గభ్రష్ట భావజాలం ఉన్నవారికి ముందుగా సరైన జ్ఞానాన్ని బోధించి అవగాహన కల్పించాలి. వారు వినకపోతే, వారి కీడు నుండి ముస్లిం సమాజాన్ని రక్షించడానికి (ఇస్లామిక్ పాలకుడి నేతృత్వంలో) వారితో పోరాడటం బాధ్యత.

మార్గదర్శక ఖలీఫా హజ్రత్ అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) [పుస్తకం]

మార్గదర్శక ఖలీఫా హజ్రత్ అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) [పుస్తకం]

క్రింది లింక్ నొక్కి పూర్తి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి
మార్గదర్శక ఖలీఫా హజ్రత్ అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) [డైరెక్ట్ PDF] [48 పేజీలు]
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

ఖవారిజ్ అంటే ఎవరు? వారి లక్షణాలు ఏమిటి? [వీడియో & టెక్స్ట్]

ఖవారిజ్ అంటే ఎవరు? వారి లక్షణాలు ఏమిటి?
Who is Khawarij and What are their Characteristics?
https://youtu.be/xUow1N1qSrg [31:13 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఖవారిజ్‌లు అనే వర్గం ఇస్లామిక్ చరిత్రలో ఎలా ఏర్పడిందో, వారి లక్షణాలు మరియు ప్రమాదకరమైన సిద్ధాంతాల గురించి ఈ ప్రసంగంలో వివరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోనే ఈ ఆలోచనా విధానానికి బీజం పడిందని, దుల్-ఖువైసిరా అనే వ్యక్తి ప్రవక్త న్యాయంపై సందేహం వ్యక్తం చేయడం ద్వారా ఇది మొదలైందని వక్త తెలిపారు. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) మరియు ముఆవియా (రదియల్లాహు అన్హు) మధ్య జరిగిన యుద్ధం సమయంలో, అల్లాహ్ గ్రంథం ప్రకారం తీర్పు చెప్పడానికి మధ్యవర్తులను పెట్టడాన్ని ఖవారిజ్‌లు వ్యతిరేకించారు. వారు స్వల్ప జ్ఞానంతో, ఖురాన్ ఆయతులను తప్పుగా అర్థం చేసుకుని, సహచరులను (సహబాలను) కాఫిర్లుగా ప్రకటించారు. ఖవారిజ్‌ల ప్రధాన లక్షణాలు: అల్పాచల జ్ఞానం, పండితుల పట్ల అగౌరవం, పాపాత్ములను కాఫిర్లుగా భావించడం, ముస్లింల రక్తాన్ని చిందించడం ధర్మబద్ధం అనుకోవడం, పాపం చేసిన వారు శాశ్వతంగా నరకంలో ఉంటారని నమ్మడం, తమ భావాలకు సరిపోని హదీసులను తిరస్కరించడం మరియు పాలకులపై తిరుగుబాటు చేయడం. ఈ లక్షణాల పట్ల ముస్లింలు జాగ్రత్తగా ఉండాలని మరియు తొందరపడి ఇతరులను ఖవారిజ్‌లుగా నిందించకూడదని వక్త హెచ్చరించారు.

ఇస్లాం మరియు ముస్లిములకు చాలా నష్టం కలిగించిన దుష్ట వర్గాల్లో ఒకటి ’ఖవారిజ్‘. వారి గురించి తెలుసుకోవడం ప్రతి ముస్లిం బాధ్యత ఈ వీడియోలో సంక్షిప్తంగా వారి కొన్ని లక్షణాలు తెలుపబడ్డాయి. తెలుసుకోండి, వాటికి దూరంగా ఉండండి, ఇతరులకు తెలియజేయండి అల్లాహ్ మనందరికీ ప్రయోజనకరమైన ధర్మజ్ఞానం ప్రసాదించుగాక.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వఆలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్ అమ్మాబాద్.

సోదర మహాశయులారా! ఈనాటి దర్సులో మనం ఇన్ షా అల్లాహ్ ఒక కొత్త విషయం తెలుసుకోబోతున్నాము. ఖవారిజ్ అంటే ఎవరు? వారి యొక్క గుణాలు ఏమిటి? మరియు ఈ రోజుల్లో ఎవరిలోనైనా మనం అలాంటి గుణాలు చూస్తే వారి పట్ల మనం ఎలా మసులుకోవాలి? వారితో మన వ్యవహారం ఎలా ఉండాలి?

సోదర మహాశయులారా! సహబాల కాలంలోనే ‘ఖవారిజ్’ అని ఒక వర్గం సహబాల సరైన మార్గం నుండి, సన్మార్గం నుండి దూరమైంది, వేరైంది. అది ఒక వర్గం రూపంలో, ఒక ఫిర్కా రూపంలో ప్రస్తుతం మనకు కనబడకపోయినా, వారిలో ఉన్నటువంటి ఎన్నో చెడు గుణాలు ఈ రోజుల్లో ఎంతో మందిలో లేదా ఎన్నో వర్గాలలో మనం చూస్తూ ఉన్నాము. మరొక బాధాకరమైన విషయం ఏమిటంటే, స్వయం తమకు తాము ఎన్నో మంచి పేర్లు పెట్టుకొని కూడా కొందరు ఈ ఖవారిజ్‌ల గుణాలు అవలంబించి ఉన్నారు మరియు ఈ గుణాలు ఖవారిజ్‌ల యొక్క గుణాలు అని స్వయం వారికి తెలియదు. అందుకొరకు వారి గురించి తెలుసుకోవడం చాలా అవసరం.

ఖవారిజ్, వీరి యొక్క పేరు ‘హరూరియా‘ అని కూడా ఉంది. వాటి యొక్క కారణాలు కూడా ఇక ముందుకు వస్తాయి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒక సంఘటన జరిగింది. దాన్ని బట్టి ఖవారిజ్‌ల యొక్క బీజం ఆనాడే కనబడింది, చిగురించింది అని కొందరు పండితులు అంటారు. సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలో వచ్చిన హదీస్, హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో మాలె గనీమత్ (యుద్ధ ధనం) పంచిపెడుతున్నారు. ఒక వ్యక్తి వచ్చాడు, అతని పేరు అబ్దుల్లాహ్ జుల్-ఖువైసిరా. వచ్చి,

اِعْدِلْ يَا رَسُولَ اللَّهِ
(ఇ’దిల్ యా రసూలల్లాహ్)
ఓ ప్రవక్తా! నీవు న్యాయం పాటించు అని అన్నాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

وَيْلَكَ! وَمَنْ يَعْدِلُ إِذَا لَمْ أَعْدِلْ
(వైలక! వమన్ య’దిలు ఇజా లమ్ అ’దిల్)
నేను ఒకవేళ న్యాయం పాటించకుంటే, ఎవరు న్యాయం పాటిస్తారు మరి?

అక్కడే ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉండి:

دَعْنِي أَضْرِبْ عُنُقَهُ
(ద’నీ అద్రిబ్ ఉనుకహు)
ప్రవక్తా నాకు అనుమతి ఇవ్వండి, నేను ఇతని మెడ నరికేస్తాను” అని చెప్పారు.

ప్రవక్త విషయంలో ఒక చాలా ఘోరమైన అమర్యాద, అగౌరవం పాటించాడు కదా, అసభ్యతగా వ్యవహరించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

دَعْهُ فَإِنَّ لَهُ أَصْحَابًا يَحْقِرُ أَحَدُكُمْ صَلَاتَهُ مَعَ صَلَاتِهِمْ وَصِيَامَهُ مَعَ صِيَامِهِمْ
(ద’హు ఫఇన్న లహు అస్ హాబన్, యహ్కిరు అహదుకుమ్ సలాతహు మఅ సలాతిహిమ్ వ సియామహు మఅ సియామిహిమ్)

వదిలేయ్. ఇతని వెనుక ఇతని అనుచరులు వస్తారు. వీరి అనుచరుల్లో ఎలా ఉంటారంటే – మీలో ఒక వ్యక్తి వారిని చూసి, తమ నమాజును “అయ్యో మేమేమి నమాజు చేస్తున్నాము, మాకంటే ఎక్కువ చేస్తున్నారు కదా” అని భావిస్తారు. ఉపవాసాలు కూడా వారు బాగా పాటిస్తారు. మీరు మీ ఉపవాసాలను ఏమీ లెక్కించరు, అంతగా వారు ఉపవాసాలు పాటిస్తారు.

కానీ విషయం ఏంటి?

يَمْرُقُونَ مِنَ الدِّينِ كَمَا يَمْرُقُ السَّهْمُ مِنَ الرَّمِيَّةِ
(యమ్రుకూన మినద్దీని కమా యమ్రుకుస్సహ్ ము మినర్ రమియ్యతి)

కానీ ధర్మం వారిలో ఉండదు. ధర్మం నుండి వారు వెళ్లిపోతారు. ఎలాగైతే ధనస్సు ఉంటుంది కదా బాణం వదలడానికి, ఇలా బాణం వదిలిన తర్వాత మళ్ళీ తిరిగి ధనస్సులోకి రావాలంటే వస్తదా బాణం? రాదు. ఏ విధంగానైతే విడిపోయిన బాణం తిరిగి రాదో, వారిలో నుండి ధర్మం అనేది ఆ విధంగా వెళ్ళిపోయింది, ఇక తిరిగి రాదు. అలాంటి వారు వారు.

కానీ, హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) వారి యొక్క ఖిలాఫత్ కాలంలో వీరు ముందుకు వచ్చారు. బహిరంగంగా, స్పష్టంగా వెలికి వచ్చారు. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) మరియు హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) వారి మధ్య ఒక యుద్ధం జరిగింది. ‘సిఫ్ఫీన్‘ అని అంటారు. అయితే మన ముస్లింల మధ్యలో ఇలా జరగకూడదు, రక్తపాతాలు కాకూడదు అని ముఆవియా (రదియల్లాహు అన్హు) వైపు వారు ఖురాన్ గ్రంథాన్ని పైకెత్తారు. ఎత్తి, “ఈ గ్రంథం మన మధ్యలో తీర్పు కొరకు మనం ఏకీభవిద్దాము. ఇక యుద్ధాన్ని మనం మానుకుందాము” అన్నారు. అప్పుడు అందరూ యుద్ధాన్ని సమాప్తం చేసి, ఇక సంధి కుదుర్చుకోవడానికి, ‘సులహ్’ కొరకు ముందుకు వచ్చారు.

అలీ (రదియల్లాహు అన్హు) వైపు నుండి ఒక వ్యక్తిని, ముఆవియా (రదియల్లాహు అన్హు) వైపు నుండి ఒక వ్యక్తిని ముందుకు పంపడం జరిగింది. వారు అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్ వెలుగులో తీర్పు చేయాలి, మనం ఈ యుద్ధాన్ని ఇక ముందుకు సాగకుండా చూసుకోవాలి. వాస్తవానికి ఇది మంచి విషయం. కానీ అక్కడ ఎంతో మంది, వారు అలీ (రదియల్లాహు అన్హు) సైన్యంలో ఉన్నవారు, వారు అలీ (రదియల్లాహు అన్హు) కు వ్యతిరేకంగా తిరిగారు. వ్యతిరేకంగా తిరిగి అలీ (రదియల్లాహు అన్హు) ను కాఫిర్ అని చెప్పేశారు. నౌజుబిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్!

ఎందుకని? వారి యొక్క తప్పుడు ఆలోచన చూడండి. ఏమన్నారు? సూరె మాయిదా ఆయత్ నెంబర్ 44 చదివారు:

وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الْكَافِرُونَ
(వమన్ లమ్ యహ్కుమ్ బిమా అన్జలల్లాహు ఫవూలాయిక హుముల్ కాఫిరూన్)
మరియు అల్లాహ్ అవతరింపజేసిన దానిననుసరించి తీర్పు చేయనివారే అవిశ్వాసులు (కాఫిరులు). (5:44)

అల్లాహ్ అవతరించిన దాని ప్రకారం ఎవరైతే తీర్పు చేయరో వారు కాఫిర్లు. అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్ నుండి తీర్పు చేద్దామని చెప్పారు, తర్వాత ఇద్దరు మనుషులను ముందుకు పంపుతున్నారు. ఆ ఇద్దరు మనుషులు ఏం తీర్పు చేస్తారు? ఇద్దరు మనుషులు తీర్పు సరిగా చేయరు, అల్లాహ్ యొక్క గ్రంథం తీర్పు చేయాలి. అందుకొరకు తీర్పు చేయడానికి ఇద్దరు మనుషులను పంపడం జరిగింది, అందుకని అటు అలీ (నౌజుబిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్) కాఫిర్ అయిపోయాడు, ఇటు ముఆవియా కూడా కాఫిర్ అయిపోయాడు అని ఈ విధంగా పుకార్లు లేపారు. అస్తగ్ఫిరుల్లాహ్!

వాస్తవానికి గమనిస్తే ఇదేంటి? చూడడానికి ఖురాన్ ఆయత్ ను తెలిపారు. కానీ ఖురాన్ ఆయత్ ను వారు స్వయంగా అర్థం చేసుకోలేదు. వాస్తవానికి ఖురాన్ తీర్పు చెబుతుంది, కానీ ఖురాన్ తీర్పు ఎలా చెబుతుంది? ఖురాన్ స్వయంగా మాట్లాడుతుందా మన మధ్యలో పెట్టిన తర్వాత? ఖురాన్ పట్ల ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉందో, ఖురాన్ ఎవరు చాలా మంచి విధంగా చదివి, దానిని అర్థం చేసుకుని, దాని యొక్క అన్ని వివరాలు తెలిసి ఉన్నారో, అలాంటి ధర్మ జ్ఞానులు ఆ ఖురాన్ కు అనుగుణంగా తీర్పు చేసే ప్రయత్నం చేస్తారు. ఖురాన్ లో స్వయంగా ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి.

స్వయంగా ఈ సూరె మాయిదాలోనే ఒక సంఘటన ఉంది, సూరె నిసాలో కూడా ఉన్నది. ఉదాహరణకు సూరె నిసాలో మీరు కూడా ఎన్నోసార్లు ఈ విషయం విని ఉంటారు. భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవ జరిగింది, ఇప్పుడు విడాకులకు వస్తుంది సమస్య. అప్పుడు అల్లాహ్ ఏమంటున్నాడు?

فَابْعَثُوا حَكَمًا مِّنْ أَهْلِهِ وَحَكَمًا مِّنْ أَهْلِهَا
(ఫబ్ అథూ హకమన్ మిన్ అహ్లిహి వ హకమన్ మిన్ అహ్లిహా)

ఒకవేళ వారిరువురి (భార్యాభర్తల) మధ్య వైరం ఏర్పడుతుందని మీకు భయముంటే, ఒక మధ్యవర్తిని పురుషుని కుటుంబం నుండి, మరొక మధ్యవర్తిని స్త్రీ కుటుంబం నుండి (పరిష్కారానికి) నియమించండి. (4:35)

భర్త వైపు నుండి ఒక వ్యక్తి తీర్పు చేయడానికి, మరియు భార్య వైపు నుండి ఒక వ్యక్తి. అంటే వారు తమ ఇష్టానుసారం ఏదో రాష్ట్రంలో నడుస్తున్నట్టుగా, మన పల్లెటూర్లో నడుస్తున్నటువంటి చట్టాల మాదిరిగా చేస్తే దాని గురించి అల్లాహ్ చెప్తున్నాడా? లేదు. వారు వారిద్దరి మధ్యలో భార్యాభర్తల్లో తీర్పు చేయాలి అల్లాహ్ యొక్క ఇష్ట ప్రకారంగా మరియు అల్లాహ్ అవతరించిన షరియత్ ను అనుసరించి. కానీ అది చేయడానికి ఎవరు? ఇద్దరు మనుషులే ముందుకు వచ్చేది.

అలాగే సూరె మాయిదాలో ఒక సందర్భంలో, ఎవరైనా ఇహ్రామ్ స్థితిలో ఉండి వేటాడాడు. ఇహ్రామ్ స్థితిలో భూమిపై సంచరించేటువంటి జంతువుల యొక్క వేట ఆడడం నిషిద్ధం. కానీ ఎవరైనా అలా షికారు చేశాడు, వేటాడాడు. దానికి పరిష్కారంగా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఏదైతే ఆదేశం ఇచ్చాడో, అందులో ఇక ఈ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే ఇహ్రామ్ స్థితిలో ఉండి షికారు చేశాడో, అతడు ఫిదియా – దానికి ఫైన్ గా, పరిహారంగా ఏమి చెల్లించాలి అనేది నిర్ణయం ఎవరు చేస్తారు? న్యాయవంతులైన, ధర్మ జ్ఞానం తెలిసిన మనుషులు చేస్తారు.

విషయం అర్థమవుతుంది కదా. ఇక్కడ నేనిదంతా డీటెయిల్ ఎందుకు చెప్పానంటే, ఖురాన్ ప్రకారంగానే మనం తీర్పు జరగాలి మన మధ్యలో, కానీ చేసేవారు ఎవరుంటారు? మనుషులే ఉంటారు. కానీ ఆ మనుషులు సామాన్య మనుషులు కాదు, ధర్మం గురించి ఎక్కువగా తెలిసిన వారు. కానీ ఈ విషయం వారి బుర్రలో దిగలేదు. వారేమన్నారు? “ఖురాన్ ప్రకారంగా తీర్పు చేద్దామని ఇద్దరినీ మనుషులను పంపుతున్నారు, అందుగురించి మీరు కాఫిర్ అయిపోయారు” అని అన్నారు నౌజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. ఆ కాలంలో ఉన్నటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క స్వచ్ఛమైన సహబాలు, ఖులఫాయే రాషిదీన్ లోని ఒకరు హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) వారిని! ఇలాంటి వారి గుణం.

అయితే అక్కడి నుండి ఒక పెద్ద వర్గం వేరైపోయింది. సామాన్యంగా ‘ఖురూజ్’ అన్న పదం మీకు తెలుసు, వెళ్ళిపోవడం. అయితే వీరు సహబాల జమాత్ నుండి, ముస్లింల ఒక సత్యమైన వర్గం నుండి, ముస్లింల నుండి వేరైపోయారు, బయటికి వెళ్లిపోయారు. ఈ విధంగా వారిని ‘ఖవారిజ్’ అని అనడం జరిగింది. అయితే వారందరూ వెళ్లి ఒక ప్రాంతంలో తమ అడ్డాగా చేసుకొని, అక్కడ ఉండడం మొదలుపెట్టారు. ఆ ప్రాంతాన్ని ‘హరూరా‘ అని అంటారు. అందుకొరకు వారి యొక్క పేరు ‘హరూరియా‘ అని కూడా పడింది.

అయితే ఆ తర్వాత అలీ (రదియల్లాహు అన్హు) ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ని పంపించారు. వారింకా మూఢనమ్మకాల్లో ఉన్నారు, వారికి సరైన జ్ఞానం ఇంకా లేదు, వారికి ఇస్లాం విషయంలో ఇంకా మంచి లోతు జ్ఞానం ప్రసాదించాలి అని ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ని పంపారు. ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) వారి వద్దకు వెళ్లి చాలా సేపు వారితో ఉండి – ఆ యొక్క వివరాలు కూడా మనకు గ్రంథాల్లో ఉన్నాయి – చాలా సేపటి వరకు వారితో డిబేట్ చేశారు, వారితో వాదం చేశారు, వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ యొక్క దయ వల్ల చాలా మంది సరైన విషయాన్ని, సరైన విశ్వాసాన్ని, అసలు ఇక్కడ మనం పాటించవలసిన నమ్మకం, విశ్వాసం, వ్యవహారం ఏంటి అర్థం చేసుకొని, అలీ (రదియల్లాహు అన్హు) వైపుకు వచ్చారు. అయినా కొంతమంది మొండితనం పాటించే వాళ్ళు ఉంటారు కదా, “నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు” అన్నట్లుగా. అలాంటి మొండితనంలో ఎంతోమంది ఉండిపోయారు.

ఆ తర్వాత వారు తమ మొండితనంలో ఉండి, మౌనంగా ఉంటే కూడా అంత నష్టం కాకపోవచ్చేమో. కానీ అంతకే వారు మౌనంగా ఉండకుండా ఏమన్నారు? “ఎవరైతే మా ఈ విశ్వాసం, మా ఈ పద్ధతిలో లేరో వారందరూ కాఫిర్లు” అస్తగ్ఫిరుల్లాహ్. ఖవారిజ్ అంటే వీరు. వారి తప్ప ఇక వేరే ఎవరినీ కూడా ముస్లింలుగా నమ్మరు. అంతేకాదు, వారు ఉన్న ఆ ప్రాంతానికి చుట్టుపక్కల దగ్గరలో నుండి ఎవరైనా ముస్లింలు పోతే, దాటుతే వారిని హత్య చేసేవారు.

చివరికి అబ్దుల్లాహ్ బిన్ ఖబ్బాబ్ బిన్ అరత్ – ఖబ్బాబ్ బిన్ అరత్ ఒక గొప్ప సహాబీ, అతని యొక్క ఒక కుమారుడు అబ్దుల్లాహ్ బిన్ ఖబ్బాబ్ బిన్ అరత్ – ఒక సందర్భంలో అతనితో ఉన్నటువంటి ఒక బానిసరాలు వెంట ఆయన వెళ్తున్నాడు, వారికి ఆ విషయం తెలిసింది. ఆ సందర్భంలో ఆ బానిసరాలు గర్భవతి. అయితే ఆ మూర్ఖులు, ఆ దుండగులు, ఆ దౌర్జన్యపరులు, ఖవారిజ్ – ఆ ఒక స్త్రీని కూడా స్త్రీ అని గౌరవించలేదు, అంతేకాకుండా ఆమె గర్భంతో ఉంది కదా అన్న విషయం కూడా పట్టించుకోకుండా ఆమెను చంపేశారు. అంతేకాదు ఆమె కడుపులో పొడిచి శిశువుని బయటికి తీసి కూడా.. ఇట్లాంటి దౌర్జన్యాలు చేసేవారు వారు.

అయితే సోదర మహాశయులారా, వారి యొక్క పుట్టుక అనండి, వారి యొక్క ఆరంభం అనండి, దాని గురించి కొన్ని విషయాలు నేను ఇప్పటివరకు చెప్పాను. అయితే సంక్షిప్తంగా వారి యొక్క కొన్ని ప్రత్యేక గుణాలు ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకోవడం చాలా అవసరం.

వారిలో ఉన్నటువంటి ఒక చెడు గుణం ఏమిటంటే, ధర్మ జ్ఞాన విషయంలో ఇంకా మనం ముందుకు వెళ్లాలి అన్నటువంటి తపన, ఆలోచన ఉండదు. ధర్మ పండితులతో జ్ఞానం నేర్చుకోరు. అందుకొరకే సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం హదీసులో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

يَقْرَءُونَ الْقُرْآنَ لَا يُجَاوِزُ حَنَاجِرَهُمْ
(యఖ్ రవూనల్ ఖురాన లా యుజావిజు హనాజిరహుమ్)
వారు ఖురాన్ చదువుతారు, కానీ అది వారి ఈ గొంతుకు కిందికి దిగదు.

అంటే ఏంటి? ఖురాన్ పఠన అనేది, తిలావత్ అనేది చాలా మంచిగా చేస్తారు. కానీ చదువుతున్నది ఏమిటి? అది ధర్మ జ్ఞానుల వద్ద, మంచి పెద్ద ఉలమాల వద్ద కూర్చుండి విద్య నేర్చుకోవాలి. తఫ్సీర్ నేర్చుకోవాలి, హదీస్ నేర్చుకోవాలి, ఫిఖహ్ నేర్చుకోవాలి, అఖీదా ఈమాన్ అన్ని వివరాలు నేర్చుకోవాలి, అఖ్లాఖ్, ఆదాబ్, సులూక్ ఇవన్నీ నేర్చుకోవాలి. కానీ దీని గురించి, పండితులతో, ధర్మవేత్తలతో ధర్మం నేర్చుకోవడంలో మరీ వెనుక ఉంటారు. ఖురాన్ చదవడానికి మహా స్వచ్ఛంగా, ఎంతో మంచిగా చదువుతున్నారు అన్నట్లుగా నటిస్తారు, కానీ ఖురాన్ అర్థభావాలను తెలుసుకోరు.

వారిలో ఉన్నటువంటి రెండవ చెడు గుణం ఏమిటంటే – మొదటి గుణం తెలిసింది కదా, ధర్మ పండితులతో ధర్మ జ్ఞానం నేర్చుకోరు – కానీ రెండో చెడు గుణం ఏమిటి? ధర్మవేత్తల మీద ఆక్షేపణలు, ఏతరాజ్, క్రిటిసైజ్. “మీకు తెలియదు, మీరు మంచిగా చెప్పడం లేదు, మీరు అన్ని స్పష్టంగా చెప్పరు”. ఈ విధంగా ధర్మ పండితుల మీద వారు ఇలాంటి క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. దీనికి ఒక గొప్ప సాక్ష్యం, ఇంతకుముందు నేను ప్రస్తావించినట్లు, చదువుతున్నాడు ఖురాన్ ఆయత్, అలీ (రదియల్లాహు అన్హు), ముఆవియా (రదియల్లాహు అన్హు) వారిని కాఫిర్లు అని అంటున్నాడు. అలీ (రదియల్లాహు అన్హు) గొప్ప ధర్మవేత్త, ఖలీఫా మరియు ఆయన ధర్మవేత్త కూడా. అయితే ఈ విధంగా తమ వద్ద ఉన్న అల్ప జ్ఞానంతో ధర్మ పండితులకు ఛాలెంజ్ చేస్తారు.

వారిలో ఉన్నటువంటి మూడవ చెడు గుణం ఏమిటంటే, పాపాల లో రెండు రకాలు ఉన్నాయి: చిన్న పాపాలు మరియు ఘోరమైన పెద్ద పాపాలు. సామాన్యంగా వాటిని మనం ‘కబీరా గునాహ్’ అని ఉర్దూలో, లేకుంటే ‘కబాయిర్’ అని ఉర్దూ, అరబ్బీ రెండు భాషల్లో కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. అయితే కబాయిర్, వాస్తవానికి ఇవి చాలా ఘోరమైన పాపాలు. కానీ సహబాలు, తాబెయీన్, తబె-తాబెయీన్, అయిమ్మా, ముహద్దిసీన్ వీరందరి ఏకాభిప్రాయం ఏమిటంటే – ఎవరైనా కబీరా గునాహ్ చేసినంత మాత్రాన అతడు కాఫిర్ అయిపోడు. కబీరా గునాహ్ కు ఎవరైనా పాల్పడితే వారిని మనం కాఫిర్ అని అనరాదు. కానీ ఈ ఖవారిజ్ ఏమంటారు? “కబీరా గునాహ్ చేసిన వాడు కాఫిర్” అని అనేస్తారు. అర్థమవుతుంది కదా? ఎన్ని గుణాలు తెలుసుకున్నాము ఇప్పటివరకు? మూడు.

నాలుగవ విషయం, నాలుగవ చెడు గుణం వారిలో ఉన్నది – వారి బాటలో, వారి ఆలోచన ప్రకారం ఎవరైతే లేరో, వారి యొక్క ధనం దోచుకోవడం, వారి యొక్క ప్రాణానికి ఏ విలువ లేకుండా హత్య చేయడం వారి వద్ద హలాల్. వారి తప్ప ఇతరుల ధర్మం, ఇతరుల ప్రాణం, ధనం, మానం వీటికి ఏ మాత్రం విలువ వారి వద్ద లేదు.

అందుగురించే సహీహ్ బుఖారీలో వచ్చి ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

يَقْتُلُونَ أَهْلَ الْإِسْلَامِ وَيَدَعُونَ أَهْلَ الْأَوْثَانِ
(యఖ్ తులూన అహ్లల్ ఇస్లాం వ యదవూన అహ్లల్ ఔథాన్)

ముస్లింలను చంపుతారు. కానీ విశ్వాసం, అవిశ్వాసుల మధ్యలో, సత్యం అసత్యం, ఇస్లాం మరియు కుఫ్ర్ మధ్యలో యుద్ధాలు జరిగే సందర్భంలో అక్కడ వారు పోరు. కానీ ముస్లింలను చంపడానికి అయితే ముందుగా ఉంటారు.

నాలుగవది ఏమిటి? ముస్లింల హత్య చేయడం వారి వద్ద హలాల్.

ఐదవ విషయం, ఐదవ చెడు గుణం వారిది – ఎవరైతే కబీరా గునాహ్ కు పాల్పడ్డారో, వారు శాశ్వతంగా నరకంలో ఉంటారు అని అంటారు. మరియు సహబాలు, తాబెయీన్, తబె-తాబెయీన్, ముస్లింలందరి ఏకాభిప్రాయం ఏమిటి? ఎవరైనా కబీరా గునాహ్ కు పాల్పడ్డారంటే అల్లాహ్ క్షమించనూవచ్చు, లేదా అల్లాహ్ క్షమించకుంటే ఆ పాపంకు తగ్గట్టు నరకంలో శిక్ష ఇచ్చిన తర్వాత అతని వద్ద ఏ తౌహీద్ అయితే ఉందో దాని కారణంగా అల్లాహ్ మళ్లీ అతన్ని స్వర్గంలో పంపిస్తాడు. దీని గురించి సహీహ్ బుఖారీ ఇంకా ఎన్నో హదీసులు ఉన్నాయి. ఇంతకుముందు మనం విశ్వాసపున సూత్రాల్లో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ యొక్క ఘనతలో ఆ హదీస్ కూడా చదివాము. కానీ వీరేమంటారు? “ఎవరైనా కబీరా గునాహ్ చేశారంటే అతడు శాశ్వతంగా నరకంలో, ఇక స్వర్గంలో పోయే అవకాశమే లేదు” అని అంటారు. ఇది చాలా తప్పు మాట.

ఇక్కడ ఒక విషయం గమనించండి. వారు ఖురాన్ లోని ఒక ఆయత్ కూడా తెలుపుతారు. ఉదాహరణకు అల్లాహ్ తాలా సూరె నిసా ఆయత్ నెంబర్ 93 లో – ఎవరైతే కావాలని, తెలిసి ఒక విశ్వాసుని హత్య చేస్తాడో, అలాంటి వ్యక్తి గురించి అల్లాహ్ తాలా ఐదు రకాల శిక్షలు తెలిపాడు. వాటిలో ఒకటి ఏమిటి? నరకంలో ఉంటాడు అని. కానీ దీని యొక్క తఫ్సీర్ స్వయంగా వేరే ఖురాన్ ఆయత్ ల ద్వారా మరియు వేరే హదీసుల ద్వారా పండితులు ఏం చెప్పారు? దాన్ని ఖవారిజ్ ఏమీ పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? స్వయం వారి దగ్గర ధర్మ జ్ఞానం అనేది సంపూర్ణంగా లేదు. ఇప్పటివరకు ఎన్ని విషయాలు విన్నారు? ఐదు చెడు గుణాలు.

ఇక రండి, ఆరవది. ఆరవ విషయం ఏమిటి? వారు హదీసులను తిరస్కరిస్తారు. ఎందుకు తిరస్కరిస్తారు? ఖురాన్ కు వ్యతిరేకంగా ఉంది అని. గమనించండి, ముందే అల్ప జ్ఞానం ఉంది, కానీ అక్కడ తన యొక్క కొరత, తన యొక్క దోషం, తన యొక్క లోపం స్వయం అర్థం చేసుకోకుండా ఎంత చెడ్డ పనికి దిగుతున్నాడో చూడండి. ఖురాన్ కు ఈ హదీస్ వ్యతిరేకంగా ఉంది అని హదీస్ ను తిరస్కరిస్తాడు. కానీ వాస్తవ విషయం ఏంటో తెలుసా? చాలా శ్రద్ధగా మీరు విషయం గుర్తుంచుకోండి. ఎప్పుడూ కూడా ఏ ఖురాన్ ఆయత్ మరో ఆయత్ కు, లేదా ఏ ఖురాన్ ఆయత్ సహీహ్ హదీస్ కు వ్యతిరేకంగా కాజాలదు. నేను కాదు చెప్పింది ఈ మాట, పెద్ద పెద్ద ముహద్దిసీన్లు చెప్పారు. ఇమామ్ ఇబ్న్ హిబ్బాన్ (రహిమహుల్లాహ్) ఒక సందర్భంలో చెప్పారు: “తీసుకురండి మీలో ఎవరి వద్దనైనా ఏదైనా ఖురాన్ ఆయత్ మరియు హదీస్ వ్యతిరేకంగా కనబడుతుంది, తీసుకురండి నేను దానికి పరిష్కారం చూపిస్తాను” అని అనేవారు.

అంటే ఏమిటి? నా వద్ద ఉన్న తక్కువ జ్ఞానం, లేదా నాకు జ్ఞానం లేనందువల్ల ఈ ఆయత్ ఈ హదీస్ కు వ్యతిరేకంగా అని నేను చూస్తున్న కావచ్చు. కానీ నేనేం చేయాలి అప్పుడు? పెద్ద పండితుల వద్దకు వెళ్లి దాని యొక్క వివరణ తెలుసుకోవాలి. కానీ అలా తెలుసుకోకుండా వీరేం చేస్తారు? హదీసులను రద్దు చేస్తారు, హదీసులను తిరస్కరిస్తారు.

వాస్తవ విషయం ఏమిటంటే, కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు చూడడానికి ఏదైనా ఆయత్ మరో ఆయత్ కు వ్యతిరేకంగా, లేదా ఆయత్ హదీస్ కు వ్యతిరేకంగా, లేదా హదీస్ హదీస్ కు వ్యతిరేకంగా ఇలా కనబడినప్పుడు మనం ధర్మవేత్తలతో సంప్రదించి దాని యొక్క వివరణ కోరాలి, తెలుసుకోవాలి.

వారి ఏడవ చెడు గుణం ఏమిటంటే, వారు ముస్లిం నాయకుడు, ఇస్లాంకు వ్యతిరేకంగా ఏదైనా మాట చెప్పాడు, ఏదైనా పని చేశాడు అంటే, అతనికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి, అతని యొక్క విధేయత నుండి దూరమై, అతనికి వ్యతిరేకంగా ఒక పోరాటం చేయడానికి దిగుతారు. మరి ఇస్లాం మనల్ని ఈ విషయం నుండి ఆపుతున్నది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చెప్పారు: ఎవరైతే నాయకులు ఉన్నారో, వారి పరిపాలన విషయంలో మీరు జోక్యం చేసుకోకండి. ఎక్కడైనా ఏదైనా వారితో తప్పు జరిగింది అంటే, మీరు వారి పట్ల విధేయత పాటించే బాధ్యత ఏదైతే ఉందో, దాని నుండి మీరు వెనుతిరగకండి. ఉర్దూలో అంటారు ‘అలమె బగావత్ బులంద్ కర్నా’. వారికి విరుద్ధంగా పోరాటం చేయరాదు. ఎందుకు? దీనివల్ల కల్లోలం ఏర్పడుతుంది, అల్లర్లు ఏర్పడతాయి, ఒక మహా ఫసాద్ అయిపోతుంది, ముస్లింల రక్తపాతాలన్నీ కూడా ప్రవహిస్తూ ఉంటాయి. అందుకొరకు ఎవరైనా నాయకుడు ఏదైనా తప్పు చేస్తే, ఎవరు వారి వద్దకు చేరుకొని వారిని నచ్చజెప్పగలుగుతారో, నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. కానీ వెంటనే “ఇతడు ఇలా చేశాడు” అని బహిరంగంగా దానికి ప్రచారం చేసి, అతనికి వ్యతిరేకంగా ఏదైనా యుద్ధం చేయడానికి, కత్తి తీయడానికి ప్రయత్నం చేయడం, ఇది ఇస్లాం నేర్పలేదు. కానీ ఖవారిజ్ వారి యొక్క ఏడవ చెడు గుణం – ముస్లిం నాయకులకు వ్యతిరేకంగా, ముస్లిం పరిపాలకు వ్యతిరేకంగా పోరాటానికి దిగుతారు.

సోదర మహాశయులారా! చూసుకుంటే ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ టైం ఎక్కువైపోతుంది గనుక మనం ఈ కొన్ని విషయాల మీద, అంటే వారి గుణాలు ఏవైతే తెలుసుకున్నామో, ఆ తర్వాత ఇక ముఖ్యమైన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. అవేమిటి?

ప్రస్తుతం మనం ఈ చెడ్డ ఏడు గుణాలు తెలుసుకున్నాము. ఎవరిలో మనం ఈ ఏడు గుణాలు, లేదా ఏడిట్లో ఏదైనా ఒకటి చూసామంటే వారిని మనం తొందరగా “ఇతడు ఖారిజీ, ఇతడు ఖవారిజ్ లో ఒకడు” అని పలకాలా? లేదు. ఇక్కడ విషయం గమనించాలి. అల్లాహ్ మనకు నేర్పిన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలిపిన, సహబాలు పాటించినటువంటి ఒక గొప్ప పద్ధతి – సలఫ్ మార్గం అనేది సర్వ మానవాళికి శ్రేయస్కరమైన మార్గం. ఎవరైనా ఏదైనా తప్పు చేశారంటే, ఖవారిజ్‌లకు ప్రత్యేకమైన ఈ గుణాలు అని మనం తెలుసుకున్నాము, కానీ ఈ గుణాలలో ఏదైనా ఒకటి ఎవరిలో ఉంది అంటే వెంటనే “నువ్వు ఖారిజీ అయిపోయావు” అని అతని మీద ఫత్వా ఇవ్వడం ఇది సరికాదు. అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి.

ముందు మనం పాటించవలసిన విషయం ఏంటి? ఎవరిలోనైనా ఈ ఏడిట్లో ఏదైనా ఒక గుణం చూసామంటే, అలాంటి చెడ్డ గుణం మనలో పాకకూడదు అని మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత, అతన్ని మనం నచ్చజెప్పే అటువంటి ఏదైనా శక్తి, ధర్మ జ్ఞానం, దానికి సంబంధించినటువంటి వివేకం మనలో ఉందా? అది మనం చూసుకోవాలి. ఉంటే అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. లేదా అంటే, ఎవరు నచ్చజెప్పగలుగుతారో, ఎవరు అతనికి బోధ చేయగలుగుతారో వారి వద్దకు మనం వెళ్లి వారికి ఈ విషయం తెలియజేయాలి. కానీ అతని మాటలు వినడంలో, అతని యొక్క స్నేహితంలో మనం పడి ఏదైనా అలాంటి పొరపాటుకు మనం గురి అయ్యే ప్రయత్నం, గురి అయ్యే అటువంటి తప్పులో మనం ఎన్నడూ పడకూడదు. ఎందుకంటే కొందరు “లేదు నేను అతనికి జవాబు ఇస్తాను, నేను అతనికి గుణపాఠం నేర్పుతాను” ఇటువంటి తొందరపాటులో పడి, “అరే అతడు ఖారిజీలో అటువంటి గుణం ఉంది అని అనుకున్నాను కానీ అతడు ఖురాన్ నుండే ఆధారం ఇస్తున్నాడు కదా, హదీస్ నుండే ఆధారం ఇస్తున్నాడు కదా” ఇటువంటి భావనలో పడి, నిన్ను కూడా అతడే లాక్కొని, అతని వైపు లాక్కొని నిన్ను ఎక్కడ ప్రమాదంలో పడవేస్తాడో, అందుకొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఈ రోజుల్లో ఖవారిజ్ అన్న పేరుతో ఒక వర్గం స్పష్టంగా ఎక్కడా కూడా లేదు, కానీ ఈ గుణాలు ఏవైతే తెలుపబడ్డాయో ఎన్నో వర్గాలలో, ఎందరిలో ఉన్నాయి. అందుకొరకే చివరలో నేను చెప్పినటువంటి ఈ జాగ్రత్తలు మనం తప్పకుండా తీసుకోవాలి. అల్లాహ్ మనందరికీ ఇట్లాంటి చెడ్డ గుణాల నుండి దూరం ఉండేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఇస్లాంను ఖురాన్ హదీసుల ద్వారా సహబాలు అర్థం చేసుకున్న విధంగా అర్థం చేసుకొని ఆచరించే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=14412

బిద్అత్ (కల్పితాచారం) – Bidah – మెయిన్ పేజీ
https://teluguislam.net/others/bidah/