అల్లాహ్ సత్కార్యాలను, దుష్కార్యాలను రాసి, పిదప వాటిని గురించి వివరించాడు – హదీసు కిరణాలు [ఆడియో]

అల్లాహ్ సత్కార్యాలను, దుష్కార్యాలను రాసి, పిదప వాటిని గురించి వివరించాడు – రియాదుస్ సాలిహీన్
https://youtu.be/LEj9zcBqzMI [16 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్) – హదీసు 11

[11] దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ప్రభువు ద్వారా ఉల్లేఖించిన విషయాన్ని హజ్రత్‌ అబుల్‌ అబ్బాస్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ బిన్‌ అబ్దుల్‌ ముత్తలిబ్‌ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా ఉటంకించారు :

“అల్లాహ్ సత్కార్యాలను, దుష్కార్యాలను రాసి, పిదప వాటిని గురించి వివరించాడు; ఎవరైనా ఏదైనా మంచి పని చేయాలని సంకల్పించుకొని, (ఏదయినా కారణంచేత) దానిని అమలుపరచలేక పోయినప్పటికీ అల్లాహ్‌ తన వద్ద అతను ఒక సత్కార్యం పూర్తి చేసినట్టు రాసుకుంటాడు. మరి ఆవ్యక్తి ఆ మంచి పని చేయాలని ఉద్దేశించుకొన్న పిదప దాన్ని నెరవేరిస్తే దానికి అల్లాహ్‌ పది నుండి ఏడు వందల రెట్లు – ఇంకా దానికంటే ఎన్నో రెట్లు అధికంగానే సత్కర్మలు చేసినట్లు అతని ఖాతాలో రాస్తాడు. (దీనికి భిన్నంగా) ఎవడైనా ఒక చెడుపని చేయాలనుకుని ఏదయినా కారణంచేత చేయకుండా ఉంటే అప్పటికీ అల్లాహ్‌ తన వద్ద, ఆ వ్యక్తి పూర్తిగా ఒక మంచి పని చేసినట్టు రాసుకుంటాడు. అయితే అతను ఆ చెడ్డపని చేయాలని సంకల్పించుకున్న పిదప దాన్ని చేసేస్తే మాత్రం ఒక్క చెడ్డపని చేశాడని పొందుపరుస్తాడు” (బుఖ్లూరీ -ముస్లిం)

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) [వీడియో పాఠాలు]

సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్) – (హదీసు కిరణాలు) [ఆడియో సీరీస్]
https://teluguislam.net/2019/10/19/ikhlas/

వడ్డీ (Riba) [పుస్తకం]

[డౌన్లోడ్ పుస్తకం]
[32 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

వడ్డీ – యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1NM8ynZdYubB7u7F0gGvnP

వడ్డీ (అన్ని పోస్టులు):
https://teluguislam.net/category/riba-interest-vaddi/

అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో

దివ్యఖుర్ఆన్లో సృష్టికర్త వడ్డీ సొమ్ము తినేవారిని ఉద్దేశ్యించి ఇలా సెలవిచ్చాడు:

“వడ్డీ తినేవారి స్థితి షైతాను పట్టడం వల్ల ఉన్మాది అయిన వ్యక్తి స్థితి లాంటిది. వారు ఈ స్థితికి గురి కావటానికి కారణమేమిటంటే ‘వ్యాపారం కూడా వడ్డీ లాంటిదేగా’ అని వారంటారు. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం (హలాల్) చేశాడు. వడ్డీని నిషిద్దం (హరామ్) గావించాడు. కనుక ఈ హితబోధ అందే వ్యక్తి మున్ముందు వడ్డీ తినటం త్యజిస్తే, అతను పూర్వం తిన్నదేదో తిన్నాడు. అతని వ్యవహారం చివరకు అల్లాహ్ వద్దకే పోతుంది. ఈ ఆదేశం తర్వాత మళ్ళీ ఈ దుశ్చేష్టకు పాల్పడేవాడు నిశ్చయంగా నరకవాసి. అక్కడ అతడు శాశ్వతంగా ఉంటాడు. అల్లాహ్ వడ్డీని నశింపజేస్తాడు. దానధర్మాలను పెంచి అధికం చేస్తాడు. కృతఘ్నుడూ, దుష్టుడూ అయిన వ్యక్తిని అల్లాహ్ ప్రేమించడు. కాని విశ్వసించి మంచి పనులు చేసేవారికి, నమాజును స్థాపించేవారికి, జకాత్ ను ఇచ్చేవారికి వారి ప్రభువు వద్ద తగిన ప్రతిఫలం లభిస్తుంది. వారికి భయం కానీ, శోకం కానీ కలిగే అవకాశం లేదు. విశ్వసించిన ప్రజలారా! మీరు నిజంగా విశ్వాసులే అయితే అల్లాహ్ కు భయపడండి, ఇంకా మీకు ప్రజల నుండి రావలసిన వడ్డీని విడిచిపెట్టండి. కాని ఒకవేళ మీరు అలా చెయ్యకపోతే, మీ పై అల్లాహ్ తరఫు నుండి యుద్ధ ప్రకటన ఉంది అనే విషయం తెలుసుకోండి. ఇప్పుడైనా మీరు పశ్చాత్తాపపడితే (వడ్డీని వదులుకుంటే) అసలు సొమ్ము తీసుకోవటానికి హక్కుదారులవుతారు. మీరూ అన్యాయం చెయ్యకూడదు. మీకూ అన్యాయం జరగకూడదు. మీ బాకీదారుడు ఆర్థిక ఇబ్బందులలో ఉంటే, అతని పరిస్థితి మెరుగుపడేవరకు గడువు ఇవ్వండి. లేక ఆ రుణాన్ని మాఫీ చేయండి. మీరు తెలుసుకో గలిగితే ఇదే మీ కొరకు మేలైనది. (అల్ బఖర 2 : 275-280)

దివ్యఖుర్ఆన్లోని ఈ వాక్యాలు అరేబియాలో ఇస్లామీయ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అవతరించాయి. దీని తర్వాత ఇస్లామీయ ప్రభుత్వం పరిధిలో వడ్డీ వ్యాపారం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడింది.

వడ్డీ‘ని దివ్యఖుర్ఆన్లో ‘రిబా‘గా పేర్కొనటం జరిగింది. రిబా అంటే ‘అధికం‘ లేక ‘అదనం‘ అనే అర్థాలు వస్తాయి. అరబ్బులు ఈ పదాన్ని అధిక సొమ్ము అన్న భావంలో వాడేవారు. అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తికి ఒక నిర్ణీత మొత్తాన్ని ఒక నిర్ణీత గడువు వరకు రుణంగా ఇచ్చిదాన్ని పుచ్చుకునే సమయంలో అసలుతో పాటు ఒప్పందం ప్రకారం మరి కొంత అదనపు మొత్తం వసూలు చేసేవాడు. దీన్నే మన నాట ‘వడ్డీ’గా వ్యవహరిస్తాము.

ఈ వడ్డీ వ్యవస్థ ఈ శతాబ్దికి చెందింది కాదనీ, తరతరాలుగా ఇది మానవ సముదాయాల్లో వ్రేళ్లూనుకొని ఉందని తెలుస్తోంది. ప్రపంచంలోని ఇతర దేశాలు, జాతుల మాదిరిగా అరబ్బులలోనూ వడ్డీ లావాదేవీలు కొనసాగేవి. మన దేశంలోని వడ్డీ వ్యాపారులు, వడ్డీ మార్వాడీల వలెనే అరేబియాలో కూడా పెట్టుబడిదారులు వడ్డీ వ్యాపారాన్ని తమ ప్రధాన వృత్తిగా ఎన్నుకునేవారు. రుణగ్రస్తుడు నిర్ణీత గడువులో రుణం చెల్లించలేకపోతే, గడువును పొడిగించి చక్రవడ్డీ తరహాలో మరింత అదనపు సొమ్మును రాబట్టేవారు. తత్కారణంగా ఒకవైపు బాకీదారుల బాకీ నానాటికీ పెరిగిపోతుంటే మరోవైపు వడ్డీ ఆసాములు పేద ప్రజల రక్తం పీలుస్తూ కోట్లకు పడగలెత్తేవారు.

కాగా; ఈ పోకడ ఇస్లాం స్వభావ స్వరూపాలకు ఎంతకీ సరిపడదు. అది ప్రబోధించే సిద్ధాంతానికి వడ్డీ విరుద్ధమైనది. ఇస్లాం అభాగ్య జీవుల్ని ఆదుకోమనీ, పేదవారికి సహాయపడమనీ, అగత్యపరుల అక్కరలు తీర్చమనీ అంటుంది. పైగా ఈ పనులన్నీ ప్రాపంచిక పరమార్థాలతో గాకుండా అల్లాహ్ ప్రసన్నతను, పరలోక ప్రయోజనాలను ఆశించి చేయాలని ప్రబోధిస్తోంది.

సకల రుగ్మతలకు మూలమైన మద్యపానం నుండి జన సామాన్యాన్ని రక్షించడానికి దైవ గ్రంథమైన ఖుర్ఆన్ మరియు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనాలు అంచెలవారీ విధానాన్ని అనుసరించినట్లే వడ్డీ అనే క్రూరాతిక్రూరమైన ఆచారాన్ని రూపుమాపడానికి యుక్తితో, సావధానంతో కూడిన వైఖరిని అనుసరించటం జరిగింది. మొదట్లో ఒక్కసారిగా వడ్డీని నిషేధిస్తున్నట్లు ప్రకటిస్తే ప్రజలకు అది మింగుడు పడేది కాదేమో! అందుకే సకారాత్మకమైన పద్ధతిలో “మీరు సంపదను అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి, పేద ప్రజలకు సహాయం చేయండి, బలహీనులను ఆదుకోండి, అగత్యపరుల అవసరాలను తీర్చండి; దయ, జాలి, త్యాగం, దాతృత్వం వంటి ఉన్నత నైతిక సుగుణాలను అలవర్చుకోండి” అని వారిని మానసికంగా సన్నద్ధుల్ని చేయటం జరిగింది.

“మీరు ఎల్లకాలం ఇక్కడ ఉండరు. మీరు నశించినట్లే మీ సిరిసంపదలు కూడా నశిస్తాయి. కాబట్టి అశాశ్వితమైన ఈ ఆస్తిపాస్తుల్ని వెచ్చించి శాశ్వతమైన పరలోక సాఫల్యాన్ని, స్వర్గలోక సుఖాలను సంపాదించండి. ఖారూన్ వంటి ధన పిపాసకులకు పట్టిన గతిని చూసైనా గుణపాఠం నేర్చుకోండి” అంటూ ఒక్కొక్క వాస్తవాన్నీ వారి దృష్టికి తీసుకురావటం జరిగింది.

ఈ ఉపదేశాలు క్రమక్రమంగా ప్రజల మనోభావాలపై ప్రభావం చూపసాగాయి. స్వార్థమే పరమార్థంగా జీవించే ప్రజలు సొసైటీలోని సాటి సోదరుల కష్టాలను సానుభూతితో అర్థం చేసుకోసాగారు. శాశ్వితమైన స్వర్గ సుఖాల ముందు ప్రాపంచిక తళుకు బెళుకులన్నీ అల్పంగా కనిపించసాగాయి. సమాజంలో నిర్మాణాత్మకమైన ఈ కృషి జరిగిన మీదట నిర్దాక్షిణ్యమైన ఈ ‘వ్యాపారాన్ని’ నిషేధించే చట్టం ప్రవేశ పెట్టబడింది. సూరె బఖరాలోని ఈ ఆయతుల (ఆయత్ నెం. 275-280) ద్వారా ఇస్లాంలో వడ్డీ శాశ్వతంగా నిషేధించబడింది.

గతంలో జరిగిందేదో జరిగిపోయిందనీ, ఇక మీదట ఎవరయినా ఈ ఆజ్ఞను లెక్కచేయకపోతే వారు అల్లాహ్ మరియు ప్రవక్తకు బద్ద విరోధులవుతారనీ, అటువంటి వారిపై అల్లాహ్ మరియు దైవప్రవక్త తరఫున యుద్ధ ప్రకటన జరిగినట్లేనని పై వచనాలలో స్పష్టం చేయబడింది. (అల్లాహ్ రక్షించుగాక!)

వడ్డీ సొమ్ము తినేవారి గురించి ఇంతటి తీవ్రమైన హెచ్చరిక రావటం ఆలోచించదగినది. పెద్దపెద్ద పాపాలకు పాల్పడిన వారి కోసం కూడా ఇంతటి తీవ్రమైన హెచ్చరిక రాలేదు. మద్యం సేవించే వారున్నారు, వ్యభిచారం చేసే వారున్నారు; హత్యలు చేసేవారున్నారు. ఇవన్నీ నిషిద్ధాలే. పెద్ద పెద్ద అపరాధాలే. అల్లాహ్ సమక్షంలో ఈ పాపాలకు పాల్పడిన వారికి శిక్ష లభించడమూ తథ్యమే. కాని అల్లాహ్ తరఫున, దైవప్రవక్త తరఫున యుద్ధం ప్రకటించబడే వార్నింగ్ ఒక్క వడ్డీ సొమ్ము తినేవారి విషయంలోనే ఇవ్వబడింది. దీన్ని బట్టి ఇదెంత తీవ్రమైన, అసహ్యకరమైన పాపమో ఊహించవచ్చు. మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధనల ద్వారా కూడా ఇది అత్యంత ఘోరమైన పాపాల జాబితాలో చేర్చబడినట్లు అవగతమవుతోంది. వడ్డీకి ఇచ్చేవారు, వడ్డీ పుచ్చుకునేవారు వడ్డీ లావాదేవీలకు సంబంధించిన దస్తావేజులు వ్రాసేవారు ముగ్గురూ ధూత్కారులుగానే ఖరారు చేయబడ్డారు. మరి కొన్ని ఉల్లేఖనాల ప్రకారం వడ్డీ పాపం వ్యభిచారపు పాపం కన్నా డెబ్బయిరెట్లు అధికమని తెలియవస్తోంది.

‘వడ్డీ కూడా వ్యాపారం లాంటిదేగా’ అని సందేహపడేవారికి, ‘రెండింటి ఉద్దేశ్యం లాభార్జనే కదా!’ అని ప్రశ్నించే వారికి సమాధానం కేవలం హేతుపరంగా ఇస్తే సరిపోదు. ఈ విషయాన్ని భౌతికంగానే కాక ఆధ్యాత్మిక దృష్టితో కూడా పరికించటం అవసరం.

అల్లాహ్ ఆదేశానుసారం ఈ రెండింటి (వడ్డీ-వ్యాపారం)లో భూమ్యాకాశాలంత వ్యత్యాసం ఉంది. పరమ ప్రభువు ఒక దానిని హరామ్ (అధర్మం) గావించగా రెండవ దానిని హలాల్ (ధర్మసమ్మతం)గా ఖరారు చేశాడు. అటువంటప్పుడు రెండూ సమానమెలా అవుతాయి? ఒక వస్తువును సృజించిన వాడే దాని లాభనష్టాలను సరిగ్గా బేరీజు వేయగలుగుతాడు. మరి ఆ సృష్టి కర్త ఒక దానిని హరామ్, మరొక దానిని హలాల్ గా చేశాడంటే హరామ్ గా ఖరారు చేసిన వస్తువులో తప్పకుండా ఏదో ‘కీడు’ ఉండి ఉండాలి. జనసామాన్యానికి ఈ సంగతి బోధపడినా, పడకపోయినా అదంతే. ఎందుకంటే సమస్త విశ్వమండలంలో ఉన్న వస్తువుల వాస్తవిక జ్ఞానం భూమ్యాకాశాలను పరివేష్ఠించి ఉన్న ఆ ప్రభువుకే బాగా తెలుసు. ఆయన జ్ఞాన పరిధికి తాకని వస్తువు అంటూ లేదు. లోకంలోని వ్యక్తులు, సమాజాలకు తమ సొంత లాభనష్టాలు, మంచీ చెబ్బరలు మాత్రమే తెలుసు. సమస్త లోకం యొక్క మంచీ చెబ్బరలను వారు గ్రహించలేరు. కొన్ని వస్తువులు ఒక వ్యక్తికో, ఒక సంఘానికో లాభదాయకంగా కనిపించవచ్చు. అయితే యావత్తు జాతి లేక యావద్దేశానికి అది హానికరం కావచ్చు.

మరొక వాక్యంలో, అల్లాహ్ వడ్డీని మట్టుపెడతాడనీ, దానధర్మాలను వికసింపజేస్తాడని చెప్పబడింది. వడ్డీతో పాటు దానధర్మాలు ప్రస్తావన రావటం ఆశ్చర్యం కల్గిస్తుంది. అయితే ఈ ప్రస్తావన ఒక ప్రత్యేక దృక్పథంతో తీసుకురాబడింది. వాస్తవానికి వడ్డీ మరియు దానధర్మాలు (సదఖాత్) పరస్పర విరుద్ధమైనవి. రెండింటి పరిణామాలు కూడా పరస్పర వ్యాఘాతమైనవి. సాధారణంగా ఈ రెండు పనులు చేసేవారి ఉద్దేశ్యాలు, లక్ష్యాలు కూడా ఒక దానితో ఒకటి సమన్వయం చెందవు.

దానధర్మాలు ఎదుటివారి నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయబడతాయి. వడ్డీ దీనికి భిన్నమైనది. ఎలాంటి మొహమాటం లేకుండా ఎదుటివారి నుండి వడ్డీ సొమ్ము రాబట్టడం జరుగుతుంది. రెండు పనులు చేసేవారి సంకల్పంలో వైరుధ్యం ఎందుకు ఉందంటే దానమిచ్చేవాడు పుణ్యార్జన లక్ష్యంతో, అల్లాహ్ మెప్పును పొందే ఉద్దేశ్యంతో ఇస్తాడు. ఈ పవిత్ర ఆశయం కోసం అతడు తన ఐశ్వర్యం కర్పూరంలా కరిగిపోయినా చింతించడు. కాని వడ్డీ పుచ్చుకునేవాడు!? అతడు పొద్దస్తమానం దొడ్డిదోవలో సంపదను పోగు చేసేందుకు తహతహలాడుతుంటాడు. అందుకే. అటువంటి సంపదను అల్లాహ్ అసహ్యించుకుంటాడు. ఈ కారణంగా ఈ సంపదలోని శుభం లేక వికాసగుణం (బరకత్) మటుమాయమైపోతుంది. కాగా; సదఖాలు (దానధర్మాలు) చేసేవారి ఆస్తిలో అల్లాహ్ శ్రేయో వికాసాలను పుష్కలంగా పొందుపరుస్తాడు.

వడ్డీని రూపుమాపి దానధర్మాలను వికసింపజేయడంలోని ఆంతర్యం ఏమిటీ? అన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. రూపుమాపడం లేదా వికసింపజేయటం అన్నది పరలోక ప్రతిఫలం దృష్ట్యా చెప్పబడిందని కొంత మంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు. అంటే వడ్డీ తినేవాడి సొమ్ము పరలోకంలో ఎంత మాత్రం అతనికి ఉపయోగపడదనీ, పైగా అది అతని పాలిట విపత్తుగా పరిణమిస్తుందని, అదే దానధర్మాలు చేసేవారికి అవి పరలోకంలో శాశ్వత అనుగ్రహాలకు, స్వర్గలోక సుఖాలకు పాత్రుల్ని చేస్తాయని పండితులు వివరించారు. సర్వసాధారణంగా విద్వాంసులు దీనిపై చేసే వ్యాఖ్య ఇలా ఉంది: వడ్డీని రూపు మాపటం, దానాలను వికసింపజేయటం పరలోకం దష్ట్యా ఎలాగూ ఉంది. అయితే దాని గుణం ఎంతో కొంత ఈ లోకంలోనే కనిపిస్తుంది.

ప్రజల కడుపులు కొట్టి సంపాదించే ఈ అధర్మమైన సొమ్ము అట్టే కాలం నిలవదు కూడా. పెద్ద పెద్ద కోటీశ్వరులు, వడ్డీ వ్యాపారులు చూస్తుండగానే దివాలా తీసి రోడ్డున పడటం చూస్తుంటాము. అంటే; వడ్డీలేని వ్యాపారాలకు నష్టం రాదని కాదు. వ్యాపారంలో లాభనష్టాలు సహజం. కాని శిఖరాగ్రాన ఉన్నవారు ఒక్కసారిగా అధఃపాతాళానికి పడిపోవటం, నిన్న కోటీశ్వరుడిగా ఉండి నేడు ఒక్కొక్క రూపాయి కోసం దేవురించటం వంటి ఉదాహరణలు మనకు వడ్డీ లావాదేవీల్లో, జూదం పట్టాల అడ్డాలలోనే కనిపిస్తాయి. ఈ సొమ్ము ఎంత శీఘ్రంగా పెరిగినా దీర్ఘకాలం నిలవదు. ఈ పాడు సంపద వారసులకు అచ్చిరాదు. సాధారణంగా ఏదో ఒక విపత్తు వచ్చి కూడబెట్టిన దాన్ని కాస్తా హరించివేస్తుంది.

ఒకవేళ ఆ సంపద వృధా అవుతున్నట్టు పైకి కనిపించకపోయినా దాని లాభాలకు, శుభాలకు మనిషి దూరం అవటం తథ్యం. ఎందుకంటే అధర్మమార్గాల ద్వారా సొమ్మును కూడబెట్టే వ్యక్తి పన్నుల మినహాయింపు నుండి బయట పడేందుకు డొంకదారులు వెతుకుతాడు. స్టేటస్ కోసం వెండీ బంగారాలను, వజ్ర వైఢూర్యాలను సమీకరిస్తాడు. వాటి మూలంగా నిజానికి అతడికి చేకూరే లాభం ఏమీ ఉండదు. వజ్రవైఢూర్యాలు ఆకలి దప్పులు తీర్చవు. ఎండ వేడిమి నుంచీ, చలి తీవ్రత నుంచి అవి అతన్ని కాపాడలేవు. పైగా వాటిని భద్రపరచడానికి నానా కష్టాలు పడాలి. మానసిక ఉద్రిక్తతను అనుభవించాలి.

నిజం చెప్పాలంటే మనిషికి శాంతిని, తృప్తినీ, హాయినీ, గౌరవాన్ని ప్రసాదించే ఐశ్వర్యమే సిసలైన ఐశ్వర్యం. అతని ఐశ్వర్యం అతని జీవితానికి సార్ధకతను చేకూర్చగలగాలి. తన ఆస్తి వల్ల తనకు కలిగిన లాభమే తన సంతతికి కూడా కలగాలని మనిషి అభిలషిస్తాడు. అతని ఈ అభిలాష ఎంతో సహజం కూడా. వాస్తవానికి ఈ సుఖశాంతులు ఎవరికయినా వారి ఆస్తి వల్ల ప్రాప్తిస్తే అది కొద్ది ఆస్తి అయినప్పటికీ ఎంతో విలువైనది, శుభవంతమైనది. నిజానికి శుభము, సమృద్ధి అంటే ఇదే. మరే వ్యక్తి ఈ శుభానికి నోచుకోకుండా పోతాడో అతడి సంపద పరిమాణం రీత్యా చాలా ఎక్కువే అయినప్పటికీ యదార్థానికి అది తరిగిపోయింది.

పైకి అది పెరుగుతున్నట్లు కానవస్తుంది. కాని అది పెరుగుదల కాదు. అది బలుపు కాదు వాపు. వ్యాధి మూలంగా ఒక్కొక్కప్పుడు మనిషి శరీరం విపరీతంగా బరువు పెరుగుతుంది. వివేకవంతుడైన మనిషి ఎవరూ ఆ ‘బరువు’ ను ఆరోగ్యానికి ఆనవాలుగా భావించడు. ఎందుకంటే ఈ ‘పెరుగుదల’ వినాశానికి సంకేతం అని అతనికి తెలుసు. వడ్డీ సొమ్ము పరిస్థితి కూడా ఇంతే. వడ్డీని ఆర్జించే వాని సంపద ఎంతగా పెరుగుతున్నట్టు కానవచ్చినా దాని శ్రేయోవికాసాలకు అతడు నోచుకోకుండా పోతాడు.

ఇక్కడ కొంతమందికి సందేహం కలుగవచ్చు. నేటి వడ్డీ వ్యాపారులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారే! వారు పెద్ద పెద్ద మేడల్లో, ఎయిర్ కండీషన్డ్ భవనాలలో సేద తీరుతున్నారే! సుఖ సౌఖ్యాలనిచ్చే సకల వస్తు సామగ్రి వారి వద్దనే ఉంది కదా! అవసరానికి మించిన నౌకర్లు వారి దగ్గరే ఉన్నారు. కోరుకున్న రాజభోగాలు అన్నీ వారి స్వంతమై ఉన్నాయి. మరి అటువంటప్పుడు వాళ్ళు ఈ సొమ్ము నుండి లబ్ది పొందడం లేదని ఎలా అంటారు? అని ప్రశ్నించవచ్చు.

అయితే ఇక్కడ విస్మరించరాని విషయం ఒకటుంది. సౌఖ్య సామగ్రి వేరు ‘సౌఖ్యం’ వేరు. సౌఖ్యాన్నిచ్చే సామగ్రి కర్మాగారాల్లో తయారయి, మార్కెట్లలో అమ్ముడు అవుతుంది. కాని ‘సౌఖ్యం’ అనేది ఉంది చూశారు, అది ఏ ఫ్యాక్టరీలోనో తయారు కాదు. అది ఏ మార్కెట్టులోనో విక్రయించబడదు. అది పరమ ప్రభువు తరఫున ప్రసాదించబడే ‘దయానుగ్రహం’. అది ఎంత ఖరీదైనదంటే మనిషి తన దగ్గరున్న సర్వస్వాన్ని అర్పించి కూడా కొనలేకపోతాడు. ఒక్క నిద్ర ప్రసాదించే సుఖాన్నే తీసుకోండి. దాన్ని పొందడం కోసం మనిషి ఖరీదైన బంగళా కట్టగలడు. ఖరీదైన ఫర్నీచర్ను సమకూర్చుకోగలడు. సుతిమెత్తని పరుపులను, కళ్ళు చెదిరే కార్పెట్లును కొనగలడు. గాలి, వెలుతురు నిరంతరాయంగా ఉండే ఉద్దేశ్యంతో జనరేటర్ను కూడా తెచ్చుకోవచ్చు. కాని ఇంత చేసినా ఆ ఇంటి యజమానికి తియ్యని నిద్ర పట్టగలదని గ్యారంటీ ఏమైనా ఉందా? ఎంత మాత్రం లేదు. మీకు నమ్మకం కుదరకపోతే సౌఖ్య సామగ్రిని పుష్కలంగా సమకూర్చుకున్న వారి గురించి సర్వే చేయండి. వేలాది మంది మీకు నెగటివ్ సమాధానమిస్తారు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల ప్రజల్లో 75 శాతం మంది నిద్ర మాత్రలు మింగి పడుకుంటారని నివేదికలు తెలుపుతున్నాయి. కొన్ని సందర్భాల్లో నిద్రమాత్రలు కూడా పని చేయమని మారాం చేస్తాయి. ఇతరత్రా సుఖాల సంగతి కూడా ఇంతే. మీరు డబ్బులు తగలెట్టి విలాస సామగ్రిని కొనుక్కురావచ్చు. కాని విలాసవంతమైన ఆ జీవితం మీకు ప్రాప్తించే ష్యూరిటీ లేదు.

ఈ పూర్వరంగంలో విషయాన్ని పరికిస్తే మీకే బోధపడుతుంది – వడ్డీ కాముకుల అంగట్లో అన్నీ ఉంటాయి గాని వారికి కావలసిన సుఖం, శాంతి, తృప్తి మాత్రం కరువైపోతాయని! వారు కోటిని కోటిన్నరగా, కోటిన్నరని రెండు కోట్లుగా మార్చాలని పరితపిస్తుంటారే తప్ప తమ ఆయురారోగ్యాల చింత కూడా వారికి ఉండదు. ఆలుబిడ్డలు వారితో కొన్ని క్షణాలైనా గడపాలని పరితపించిపోతుంటారు. కాని ఆ మధుర క్షణాల కోసం కూడా వారికి టైం దొరకదు. ఫ్లైట్ల కోసం పరుగులు తీస్తుండటం, గాల్లో విహరించటంలోనే వారి జీవిత కాలం గడచిపోతుంది. ఆ విధంగా వారు సుఖపడే సామగ్రినయితే ప్రోగు చేస్తారు. కాని సుఖాన్ని ఆస్వాదించలేకపోతారు.

పోనీ వాళ్ళు స్వయంగా సుఖపడకపోతే పోనివ్వండి. తమ ఉనికి ద్వారా వారు ఇతరులకు ప్రయోజనం ఏమైనా చేకూర్చుతారా అంటే అదీ ఉండదు. వడ్డీ సొమ్మును కూడబెట్టే అత్యాశ వాళ్ళను కఠిన మనస్కులుగా మార్చివేస్తుంది. వారి గుండెల్లోంచి దయ, జాలి, కనికారం మటుమాయమైపోతాయి. ఎంతసేపటికీ అభాగ్య జీవుల బలహీనతను సొమ్ము చేసుకుని వాళ్ళ రక్తాన్ని పీల్చి తమ శరీరాన్ని పోషించుకోవడమే వారి పరమావధి అయి ఉంటుంది. అందుచేత సొసైటీలోని ప్రజల హృదయాల్లో వారి పట్ల గౌరవభావం లేశమైనా ఉండదు. మన దేశంలోని వడ్డీ వ్యాపారస్తులను గానీ, అమెరికా బ్రిటన్ల లోని వడ్డీ కుబేరులైన యూదుల చరిత్రను గానీ తరచి చూస్తే. మీకు అవగతమవుతుంది -వారి లాకర్లలో క్వింటాళ్ళ కొద్దీ బంగారు వెండి వజ్రాలుండవచ్చుగాక! కాని ప్రపంచంలో ఎక్కడా, మానవ సముదాయాల్లో ఏ మూలన కూడా ఈ ‘అయ్యవార్ల’కు పరువు ప్రతిష్ఠ ఉన్నట్లు కనిపించదు. పైగా ఈ కుబేరుల పట్ల పేద ప్రజల్లో అసూయాద్వేషాలు ఏర్పడి వర్గ సంఘర్షణకు దారితీస్తాయి. 20వ శతాబ్దిలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన వర్గ సంఘర్షణలకు కారణం ఈ అసూయాద్వేషాలేనన్నది జగమెరిగిన సత్యం. కార్మిక వర్గానికీ పెట్టుబడిదారీ వర్గానికీ మధ్య సాగిన ఈ సంఘర్షణే ప్రపంచాన్ని రెండు బ్లాకులుగా నిలువునా చీల్చివేసింది. ఒక నకారాత్మక (Negative) ధోరణి నుండి పుట్టుకు వచ్చిన సిద్ధాంతం మరో నకారాత్మక పుంతను తొక్కి భీకర రూపం దాల్చింది. తత్ఫలితంగా యావత్ప్రపంచమే రణరంగానికి, నరమేధానికి నిలయమైపోయింది. దీనికంతటికీ మూలకారణం ఏమిటీ? అత్యాశకు పోయిన ధనికులకు కనీసావసరాలకు నోచుకోని అభాగ్య జీవులకు మధ్య ఏర్పడిన అంతులేని అగాధం కాదా? ఈ అగాధానికి మూలం అక్రమ సముపార్జన కాదా?

రక్తం పీల్చే ఈ జలగల మరో ఉపమానం ఇలా ఉంటుంది – పేద ప్రజల రక్తాన్ని పీల్చి తమ వల్లు పెంచుకునే ఈ ఆసాముల సమూహం ఒకటి ఒకచోట ఒక కాలనీని నిర్మించుకుంటే, వీక్షించదలచే వారికి అది అందంగా కానవస్తుంది. అక్కడ నివసించే వారంతా ఆరోగ్యవంతులుగా ఉంటారు. వారి వాకిళ్ళు పచ్చగా నిగనిగ లాడుతుంటాయి. మరి ఈ ఒక్క వాడను చూచి ఇది దేశప్రగతికి ప్రతిబింబం అనాలా? మంచినీ, మానవత్వాన్ని కాంక్షించేవారు ఈ ఒక్క కాలనీని చూసి మురిసిపోరు. అల్లంత దూరాన ఈ అయ్యవార్ల దోపిడీకి గురై పూరి గుడిసెల్లో నివసిస్తున్న పేద ప్రజల పాట్లను కూడా వారు చూడదలుస్తారు. ఈ స్థితిని వారు ప్రగతికి ప్రతీకగా కాక మానవత్వాన్ని మంటగలిపే పోకడగా అభివర్ణిస్తారు.

తద్భిన్నంగా సదఖాలు ఇచ్చే వారినీ, దానధర్మాలు చేసే వారిని చూడండి – వారు ధనార్జన కోసం నిద్రాహారాలు మానేసి పరుగులు తీయరు. వారెంతో స్థిమితంతో ఉంటారు. తమకు లభించిన దానితోనే సంతృప్తి చెంది అందులోంచి కూడా హక్కుదారుల హక్కును తీసి ఉంచుతారు. తత్ఫలితంగా వారు ప్రశాంతంగా జీవితం గడపటంతో పాటు బడుగు ప్రజల శుభాశీస్సుల్ని అందుకుంటూ ఉంటారు. అల్లాహ్ “వడ్డీని నశింపజేసి దాన ధర్మాలను వికసింపజేయటం” అంటే ఇదే.

“మీ బాకీదారుడు ఆర్థిక ఇబ్బందులలో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకు గడువు ఇవ్వండి లేదా ఆ రుణాన్ని మాఫీ చేయండి. మీరు తెలుసుకోగలిగితే ఇదే మీ కొరకు మేలైనది. “ అని అనబడింది.

‘వడ్డీ’ని ‘నిషిద్ధం’గా ఖరారు చేసిన తరువాత అల్లాహ్ ముస్లింలకు చేసిన సూచన ఇది. ఈ నిషేధాజ్ఞ రాకపూర్వం అరబ్బులు తమ బాకీదారుడు ఆర్థిక సమస్యల వల్ల గడువు లోపల బాకీ చెల్లించకపోతే రావలసిన వడ్డీని అసలు కింద జమ చేసుకొని వడ్డీపై వడ్డీ (చక్రవడ్డీ)ని వసూలు చేస్తుండేవారు.

రాజాధిరాజు అయిన అల్లాహ్ ఈ విషయమై శాశ్వతంగా చట్టం ప్రవేశపెట్టి, రుణగ్రస్తుడు దారిద్ర్య స్థితికి లోనై రుణం చెల్లించలేకుండా ఉన్న పక్షంలో అతన్ని వేధించటం ధర్మ సమ్మతం కాదనీ, స్థితిమంతుడయ్యే వరకు అతనికి గడువు ఇవ్వవలసిందేనని నిర్ణయించాడు. పైపెచ్చు ఆ బాకీదారుణ్ణి పెద్ద మనస్సుతో మన్నించి వదలివేస్తే అది మీ పాలిట శ్రేయస్కరమని ప్రోత్సహించటం జరిగింది.

ఇక్కడ ఈ రకమైన ‘మాఫీ’నిసదఖా’తో పోల్చడం జరిగింది. అంటే వడ్డీని వదలి వేయటమేగాక రావలసిన అసలు విషయంలో కూడా చేతులు దులుపు కోవటం అన్నమాట! పైకి ఇది రుణదాతలకు నష్టకరంగానే అగుపిస్తుంది. కాని ఖుర్ఆన్ మాత్రం దీనిని ‘శుభకరం’గా అభివర్ణించింది. ఈ శుభం (మేలు) రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి: మూన్నాళ్ళ ఈ జీవితం ముగిసిన తరువాత అతను వదలుకున్న కొద్దిపాటి సొమ్ముకు బదులుగా శాశ్వితమైన స్వర్గానుగ్రహం అతనికి ప్రాప్తిస్తుంది. రెండు: అతని మన్నింపుల వైఖరి యొక్క శుభపరిణామం ఈ లోకంలోనే కొంత అడ్వాన్సుగా అతనికి కనిపిస్తుంది. ఉదాహరణకు:- అతని దగ్గర ఉన్న సొమ్ము పరిమితమే కావచ్చు. కాని వృధా ఖర్చుల నుండి, అనూహ్యమైన విపత్తుల నుండి అల్లాహ్ అతన్ని రక్షిస్తాడు. రోగాలు, మందులు మాకుల పేరిట, డాక్టర్ల ఫీజుల పేరిట అక్రమార్కుల సొమ్ము లక్షల్లో కరిగిపోగా, సామాన్యజనులు చాలా స్వల్ప మొత్తంలోనే స్వస్థతను పొందుతుంటారు. ఇలాంటి ఉదాహరణలు కొందరికి శుష్క ప్రియాలుగా కన్పించవచ్చునేమోగాని దైనందిన జీవితంలో లెక్కకు మించిన ఇలాంటి ఉపమానాల్ని మనం చూస్తుంటాము.

దారిద్ర్య స్థితిని ఎదుర్కొంటున్న రుణగ్రస్తుని యెడల మృదు వైఖరిని అవలంబించే వారికి హదీసులలో కూడా శుభవార్త వినిపించబడింది. తబ్రానీలోని ఒక హదీసులో ఉంది :

“ఏ వ్యక్తి అయితే ఎవరికీ ఏ నీడా లభించని రోజున అల్లాహ్ కారుణ్య ఛాయ తనకు లభించాలని కోరుకుంటాడో అతడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రుణగ్రస్తుని పట్ల మృదువుగా మెలగాలి లేక అతన్ని మన్నించి వదలి పెట్టాలి”.

మరొక హదీసులో ఇలా ఉంది:-

“ఎవరయితే తన ప్రార్థనలు స్వీకరించబడాలనీ, తన కష్టాలు దూరం కావాలని కోరుకుంటున్నాడో అతడు కష్టాల్లో ఉన్న తన బాకీదారుడికి మరింత గడువును ఇవ్వాలి”.

సహీహ్ ముస్లింలోని ఒక హదీసు ఇది:

“ఎవరయితే ఒక పేద రుణగ్రస్తుడికి గడువు ఇస్తాడో అతనికి ప్రతి రోజూ అతనిచ్చిన రుణానికి సమానంగా దానధర్మాల పుణ్యం లభిస్తూ ఉంటుంది. ఒక గడువు ముగిసే వరకూ పుణ్యం ఈ లెక్కన లభిస్తూ ఉంటుంది. నిర్ణీత గడువు ముగిసే నాటికి రుణగ్రస్తుడు రుణాన్ని తీర్చలేని స్థితిలో ఉండి, రుణదాత మరికొంత గడువును ఇస్తే అట్టిపరిస్థితిలో రెట్టింపు మొత్తం దానమిచ్చిన పుణ్యం ప్రాప్తిస్తుంది.” (సహీహ్ ముస్లిం, ముస్నద్ అహ్మద్)

వడ్డీ యొక్క వాస్తవికతను తెలుసుకోవడానికి దివ్య గ్రంథంలోని ఇతర వచనాలను కూడా ఇక్కడ ప్రస్తావించటం అవసరం.

“విశ్వసించిన ప్రజలారా! ఇబ్బడిముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినటం మానండి. అల్లాహ్ కు భయపడండి. మీరు సాఫల్యం పొందే అవకాశం ఉంది.” (ఆలి ఇమ్రాన్ 3:130)

పై వచనంలో “ఇబ్బడి ముబ్బడిగా పెరిగే” అనే ప్రత్యేక పదం వాడబడింది. పూర్వం అరేబియాలో ఒక నిర్ణీత గడువు కొరకు వడ్డీపై అప్పు ఇచ్చి గడువు ప్రకారం అప్పు తీర్చకపోతే రుణగ్రస్తునికి మరికొంత గడువు ఇచ్చేవారు. అయితే అదనపు గడువునకుగాను అదనపు వడ్డీని విధించేవారు. మలిసారి గడువు ముగిసేనాటికి రుణం వసూలు కాకుంటే వడ్డీ శాతం మరింతగా పెంచబడేది. ఆ విధంగా ఒకవైపు రుణదాతకు ఇబ్బడిముబ్బడిగా వడ్డీ సొమ్ము వచ్చి పడుతుంటే మరోవైపు వడ్డీ భారంతో రుణగ్రస్తుని నడ్డి విరిగిపోతుండేది.

నిసా సూరాలో ఈ విధంగా సెలవీయబడింది

“యూదుల ఈ దుర్మార్గ వైఖరి వల్లనూ, వారు ఎక్కువగా అల్లాహ్ మార్గంలో ఆటంకాలు సృష్టిస్తున్నందువల్లనూ, వారికి నిషేధించబడిన వడ్డీని తీసుకుంటున్నందువల్లనూ, అధర్మంగా ఇతరుల సొమ్మును కబళిస్తున్నందువల్లనూ మేము వారి కొరకు పూర్వం ధర్మ సమ్మతములైన ఎన్నో పరిశుద్ధమైన వస్తువులను నిషిద్ధాలుగా చేశాము. వారిలో అవిశ్వాసులుగా ఉన్న వారి కొరకు మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము.” (అన్ నిసా – 160,161)

దైవప్రవక్త హజ్రత్ మూసా (అలైహిస్సలాం) గారి షరీయత్లో కూడా ‘వడ్డీ’ అధర్మంగా ఖరారయినట్టు పై రెండు వచనాల ద్వారా రూఢీ అవుతోంది. ఈ ఆదేశాన్ని ధిక్కరించి, ప్రాపంచిక వ్యామోహంలో యూదులు వడ్డీ సొమ్మును తినసాగితే అల్లాహ్ ఆగ్రహం చెంది కొన్ని హలాల్ వస్తువులు సయితం వారి కొరకు ‘హరామ్’ చేసేశాడు.

ఈ చర్చను మూడు భాగాలుగా విభజించవచ్చు.

(a) ఖుర్ఆన్ హదీసులలో వడ్డీ వాస్తవికత ఏమిటీ?
(b) వడ్డీ నిషేధించబడటంలోని ఔచిత్యం ఏమిటీ?
(c) వడ్డీ ఎంత నికృష్టమైనదైనా అది నేటి ఆర్థిక వ్యవస్థలో, వాణిజ్య రంగంలో అవిభాజ్యమైన అంశంగా మారిపోయింది కదా! ఖుర్ఆన్ ఆదేశాల ప్రకారం దాన్ని విడనాడితే బ్యాంకింగ్ వ్యవస్థ నడిచేదెలా?

(అ) అరబీ భాషలో వడ్డీ కొరకు వాడబడిన పదం ‘రిబా‘. మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రభవించక పూర్వం కూడా అరేబియా ప్రాంతంలో ఈ పదం వ్యవహారంలో ఉంది. కేవలం వ్యవహారంలో ఉండటమే కాదు, ప్రజలు ‘రిబా’ ప్రాతిపదికన లావాదేవీలు ముమ్మరంగా జరిపేవారు. అంతెందుకు, తౌరాత్ గ్రంథం అవతరించిన కాలంలో (దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం హయాంలో) కూడా యూదులు వడ్డీ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా అది ‘హరాం’ గావించబడిందని సూరె నిసాలోని ఆయతుల ద్వారా బోధపడుతోంది. తేలిందేమంటే అరబ్బులకు ‘రిబా’ అనే పదం కొత్తకాదు. అందుచేతనే ‘రిబా’ సొమ్మును తినటం హరాం (అధర్మం) అని హిజ్రీ 8వ ఏట ఖుర్ఆన్లో ఆజ్ఞ అవతరించినపుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులకు దాని తఫ్సీర్ లను (వడ్డీ గురించిన వివరాలను) విడమరచి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడలేదు. ఏ విధంగా నయితే మద్యపానాన్ని నిషేధించగానే ప్రవక్త సహచరులు దాన్ని తు.చ. తప్పకుండా పాటించారో అదే విధంగా వడ్డీ (రిబా) నిషేధాజ్ఞలు రాగానే వారు వడ్డీ లావాదేవీలన్నిటినీ త్యజించారు. ఆనాటికి ముస్లిమేతర సోదరుల నుండి తమకు రావలసి ఉన్న భారీ మొత్తాన్ని సయితం ముస్లింలు వదులుకున్నారు.

చెప్పవచ్చిందేమంటే వడ్డీ నిషేధాజ్ఞలు వచ్చిన కాలంలో దానికి సంబంధించిన మతలబులు ఏమీ గుట్టుగానో లేక అనిర్వచనీయంగానో ఉంచబడలేదు. ప్రజా జీవితాల్లో పాతుకుపోయి వున్న వడ్డీ (రిబా)నే ఖుర్ఆన్ నిషిద్ధంగా ప్రకటించింది. మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) దీనిని కేవలం ఒక నైతిక కట్టడిగా గాకుండా ‘ఒకదేశ చట్టం’గానే ప్రవేశపెట్టారు. కాకపోతే రెండవ ఖలీఫా హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కాలంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆ చట్టం అన్వయింపుకు సంబంధించిన కొన్ని చిక్కులు ఎదురై షరియత్ కోవిదులలో ద్వంద్వాభిప్రాయాలు వినిపించాయి, అది వేరే విషయం! అయితే రిబా (వడ్డీ) హరాం అనే విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి సందేహంగానీ, భేదాభిప్రాయంగానీ లేదు. వివరాల్లోకి పోతే సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను తరచి చూడవలసి ఉంటుంది. విషయం లోతుల్లోకి పోవటం మా ఉద్దేశ్యం కాదు. వడ్డీ మూలంగా సమాజంలో జనించే ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక కీడులను స్థూలంగా పాఠకుల ముందుంచి, అల్లాహ్ ఆజ్ఞల్ని అనుసరించటంలో దాసుల ఇహపర సాఫల్యాలు ఇమిడి ఉన్నాయని తెలుపడమే ఈ చిరు పుస్తకం ఉద్దేశ్యం.

సారాంశం ఏమిటంటే (1) అప్పుగా ఇచ్చి దానిపై లాభం లేక అదనపు మొత్తం పొందజూడటం వడ్డీ అవుతుంది. (2) ఈ వడ్డీ అధర్మమని ఖుర్ఆన్ హదీసులు స్పష్టం చేయగానే మహాప్రవక్త సహచరులు నిస్సంకోచంగా దీనిని విడనాడారు. ఈ విషయంలో వారు ఎలాంటి ఊగిసలాటకు లోను కాలేదు. (3) క్రింద పేర్కొనబడిన వస్తువులు లావాదేవీలు జరిపినపుడు సరిసమానంగా ఇచ్చి పుచ్చుకోవాలి, ఒకవేళ వాటిలో హెచ్చుతగ్గులు చేస్తే అది కూడా వడ్డీ క్రిందికి వస్తుంది. అవేమంటే; (1) బంగారం, (2) వెండి, (3) గోధుమలు, (4)జవలు, (5) ఖర్జూరం, (6) ద్రాక్ష.

నేడు ఏ వడ్డీనయితే మానవ ఆర్థికాంశానికి కీలకంగా భావించబడుతున్నదో అది ఖుర్ఆన్ హదీసుల ప్రకారం నిషిద్ధం. ఈ విషయంలో ద్వంద్వాభిప్రాయానికి తావులేదు. దీని నిషిద్ధం గురించి 7 ఖుర్ఆన్ వచనాలు, 40కి పై చిలుకు ప్రవక్త ప్రవచనాలు సాక్షిగా ఉన్నాయి.

(b) ఇక ఈ వడ్డీ నిషేధించబడటంలోని ఔచిత్యం లేక పరమార్థం ఏమిటి? ఏ కారణంగా దీనిపై వేటు వేయబడింది? ఏ కారణంగా ఇది శాపగ్రస్తమైన వ్యవస్థగా భావించబడింది? ఇందులో గల ఆధ్యాత్మిక లేక ఆర్థిక కీడు ఏమిటి? అన్న విషయానికి వద్దాం.

ఇక్కడ మనం ఒక విషయాన్ని ప్రశాంత మనస్సుతో అర్థం చేసుకోవాలి. అదేమంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజా బాహుళ్యంలో ప్రవేశపెట్టబడిన ఏ ఒక్క వస్తువులో కూడా ఏదో ఒక్క మేలు ఉండకపోదు. ఆఖరికి పాము, తేలు లాంటి విషపూరిత జంతువుల్లో, తోడేళ్లు, సింహాల వంటి క్రూర జంతువుల్లో కూడా లోక కళ్యాణానికి ఉద్దేశించిన బాగోగులు ఎన్నో కొన్ని ఉంటాయి. మానవుడు తొక్కే అడ్డదారుల్లో, వినాశకర పోకడల్లో కూడా ఏదో ఒక లాభం తప్పకుండా దాగి ఉంటుంది. అయితే ఏ మతమైనా, మరే మానవ సమాజమైనా, ఇంకే ఇతర సైద్ధాంతిక వర్గమైనా అతి తక్కువ నష్టాలతో సరిపెట్టి అత్యధిక లాభాలనిచ్చే వస్తువునే లాభకరమైన వస్తువు లేదా మేలైన వస్తువుగా పరిగణిస్తుంది. ఉదాహరణకు:- ఖుర్ఆన్ మద్యపానాన్ని నిషేధిస్తూ, ఇది ఘోరమైన పాపాలకు మూలమనీ, అయితే ఇందులో ప్రజల కోసం ఎంతో కొంత లాభం కూడా ఉందని చెప్పింది. కాని ఇందలి కీడు ఇందలి మేలు కన్నా చాలా ఎక్కువ అని స్పష్టం చేసింది. కాబట్టి నష్టాల ఆధిపత్యం వేటిలోనయితే ఉంటుందో వాటినల్లా నష్టకరమైనవిగానే పరిగణించి వాటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం.

వడ్డీ పరిస్థితి కూడా అంతే. వడ్డీ సొమ్ము తినేవాడికి అది తాత్కాలికంగా లాభకరంగా కనిపించవచ్చు. అయితే దాని ఐహిక, పారలౌకిక అనర్థాలు అతనికి వచ్చిన లాభం కన్నా ఎన్నోరెట్లు అధికమై ఉంటాయి. ఏదేని ఒక వస్తువు తృటిలో ప్రయోజనం చేకూర్చి దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బతీస్తుందని తెలిసినపుడు వివేకవంతుడైన వ్యక్తి ఎవడూ ఆ వస్తువును లాభకరమైన వస్తువుల జాబితాలో చేర్చడు. పైగా దానిని నష్టాల జాబితాలోనే వ్రాసుకుంటాడు. అదే విధంగా ఒక వస్తువు ఒక వ్యక్తికి మేలు చేకూర్చి సమాజం మొత్తానికి హాని కలిగిస్తుందని తెలిసినపుడు విజ్ఞుడైన మనిషి ఎవడూ దానిని మేలైన వస్తువుగా ఖరారు చేయలేడు. దొంగతనం లేక దొమ్మీ వల్ల ఒక వ్యక్తి లేక ఒక ముఠా లాభం పొందవచ్చు. కాని ఈ కీడు యొక్క ప్రభావం మొత్తం సమాజంపైనే పడుతుంది. సమాజమంతటా భయోత్పాతం నెలకొంటుంది. అందుచేత ఎవరూ దొంగతనాన్ని, దొమ్మీలను మంచివిగా తలపోయరు.

ఈ ఉపోద్ఘాతం తర్వాత మీరు వడ్డీ సమస్యపై దృష్టిని సారించండి. కాస్త నిదానంగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. వడ్డీని ఆర్జించే వాడికి తాత్కాలిక లాభాలకన్నా అతనికి వాటిల్లే ఆధ్యాత్మిక, నైతిక దివాలా చాలా తీవ్రంగా ఉంటుందని, మంచిని, మానవత్వాన్ని కాంక్షించే మనుషుల జాబితాలో ఆ వ్యక్తికి చోటు లేకుండా పోతుంది. అతనికొక్కడికి వచ్చే లాభం సమాజాన్నంతటినీ భారీ నష్టంలో పడదోస్తుంది. కాని విచారకరమైన విషయం ఏమిటంటే లోకంలో ఏదైనా ఒక వస్తువు చెలామణిలోకి వచ్చేస్తే దాని మేళ్లు మాత్రమే ప్రజల కంటికి కనిపిస్తుంటాయి. కీడులు మాత్రం కంటికి ఆనవు.

నేటి ఆధునికయుగంలో వడ్డీ ఒక అంటువ్యాధిలా ప్రబలి, యావత్తు ప్రపంచాన్ని చుట్టు ముట్టేసింది. అది మానవ అభిరుచి పై ఎంత తీవ్రమైన ప్రభావం చూపిందంటే దాని వాతన పడిన వారు చేదైన దానిని తియ్యనిదిగా నమ్ముతున్నారు. సమస్త మానవాళి ఆర్థిక వినాశానికి హేతువు అయిన వస్తువు (వడ్డీ) ఆర్థిక సమస్యల పరిష్కారమార్గంగా పరిగణించబడుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఏ ఆలోచనాపరుడైనా లేక ఏ ఆర్థికవేత్త అయినా ఈ వడ్డీకి వ్యతిరేకంగా నినదిస్తే అతన్ని పిచ్చివాడిగా జమకట్టేస్తారు.

కాని ఒక విషయాన్ని విస్మరించరాదు – ఒక దేశంలో ఒక అంటువ్యాధి ప్రబలిపోయి దాని చికిత్స అంతగా ప్రభావం చూపకపోవటాన్ని చూసి ఏ డాక్టరైనా ఆ వ్యాధిని వ్యాధిగా పరిగణించకుండా దాన్నే ఒక ఔషధంగా,పరిష్కార మార్గంగా సూచించాడనుకోండి. ఆ డాక్టరును డాక్టరని అంటారా! అతడు డాక్టర్ కాడు. నరరూప రాక్షసుడు, ప్రవీణుడైన డాక్టర్ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా వ్యాధిని వ్యాధిగానే తలపోస్తాడు. వ్యాధి నివారణను సూచిస్తాడు.

దైవ ప్రవక్తలు (అలైహిముస్సలాం) మానవ సంస్కరణకు బాధ్యులుగా ఉండేవారు. ఎవరు తమ మాటను ఖాతరు చేసినా చేయకపోయినా వారు తమ పనిని తాము చేసుకుపోయేవారు. వారు గనక ప్రజల మనోకాంక్షల కనుగుణంగా నడుచుకుంటూ పోతే నేడు లోకమంతా అవిశ్వాస భావాలతో, మిథ్యావాదులతో అంధకార బంధురంగా ఉండేది.

వడ్డీ నేటి ఆర్థిక జగతికి వెన్నెముకగా భావించబడుతూ ఉన్నప్పటికీ – యూరపుకు చెందిన కొంతమంది విజ్ఞులు ఇప్పటికే దీన్ని ప్రమాదకరమైన బిందువుగా తలపోస్తున్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక కాదని, వెన్నె ముకను తొలచివేసే ఒక పురుగు అని వారు ఇప్పటికే అంగీకరించారు.

కాని శోచనీయమైన విషయం ఏమిటంటే మేధావులు, అర్థశాస్త్ర నిపుణులు కూడా ఒక్కోసారి ఆచార సంప్రదాయాల వలయంలో చిక్కుకుపోయి స్వేచ్ఛగా ఆలోచించలేకపోతారు. కాలపు క్రేజుకు తలఒగ్గి అంతరాత్మ ప్రబోధాన్ని అణచివేస్తారు.

కొద్దిమంది బలుపు కోసం కోట్లాది మంది ప్రాణులు భారీ మూల్యం చెల్లించవలసి రావటం, అనేక మానవ సముదాయాలు ఆకలి దప్పులకు, ఆర్థిక మాంద్యానికి లోను కావటం, దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న ప్రజల బ్రతుకులు మరింత నికృష్ట స్థితికి చేరటం, అదే సమయంలో గుప్పెడు మంది పెట్టుబడిదారులు సామాన్య జనుల రక్తం పీల్చి తమ కండలు పెంచుకోవటం సర్వసాధారణమైపోయింది. కడుపు మండి ఎప్పుడైనా ఈ సత్యాన్ని వాళ్ల ముందు వెల్లడిస్తే దాన్ని త్రోసి పుచ్చుతూ వారు అమెరికా, ఇంగ్లాండ్ల మార్కెట్లలో నిలబెట్టి వడ్డీ సమృద్ధిని మనకు చూపించదలుస్తారు. అక్కడ సమృద్ధి కనబడటంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మేకలను భక్షించే మృగాలు బలిష్టంగానే ఉంటాయి కదా! కాని ఈ మృగాల వేటకు గురైన ప్రజల్లోకి చొచ్చుకుపోయి వారి స్థితిగతుల్ని కాస్త వీక్షించమనండి – అక్కడ ఈ మృగాల వేటకు గురైన వేలాదిమంది సామాన్య జనులు జీవచ్ఛవాల్లా పడి ఉండటం కాన వస్తుంది. ఇలాంటి ఆర్థిక ప్రక్రియను ఇస్లాం ఆరోగ్యవంతమైన ప్రక్రియగా భావించదు. గుప్పెడు మంది బడా వాణిజ్యవేత్తల బలుపుకోసం యావత్తు మానవ సమాజం చిక్కి శల్యమై పోవటం ప్రగతి అనిపించుకోదు.

(c) నేడు వడ్డీ కొత్త పుంతలు తొక్కుతోంది. దీని వ్రేళ్ళు నలువైపుల నుండీ ఆర్థిక వ్యస్థను ఆక్టోపస్ లా అల్లుకుపోతున్నాయి. మద్యం, జూదం, వ్యభిచారం వంటి చెడుగులు నాగరికత పేరిట, ఫ్యాషన్ పేరిట కొత్త మెరుగులు దిద్దుకొని ప్రజల ముందు ప్రత్యక్షమైనట్లే వడ్డీ కూడా కొత్త అవతారమెత్తి ప్రజా జీవితాలతో ఆడుకుంటోంది. నిన్నటి వరకూ దుకాణాలకే పరిమితమైన ఈ రుగ్మత నేడు సేవింగ్ స్కీములు, బ్యాంకులు, సొసైటీల రూపంలో ఆవిర్భవించింది. ఈ కొంగొత్త వ్యవస్థ వల్ల సమాజమంతటికీ లాభం చేకూరుతుందని మభ్య పెట్టడం జరుగుతోంది. డబ్బుండీ వ్యాపారం చేయలేనివారు కొందరుంటే, వ్యాపారం చేయగోరినా చాలినంత పెట్టుబడిలేని వారు కొందరుంటారు. అలాంటి వారి దగ్గరున్న డబ్బును పొదుపు పథకాల క్రింద రాబట్టం జరుగుతుంది. వారికి వడ్డీ రూపేణ ఎంతో కొంత ‘లాభం’ లభిస్తుందనుకోండి. అయితే అలా పోగైన సంపద తిరిగి బడా వ్యాపారుల చేతుల్లోకి రుణం క్రింద వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ వడ్డీ లాభాలు అటు సామాన్యులకూ ఇటు పెద్ద వర్తకులకు కూడా లాభసాటిగా ఉన్నట్లు అగుపిస్తుంది.

కాని న్యాయ దృష్టిలో ఆలోచిస్తే ఇదొక మేడిపండు తప్ప మరేమీ కాదన్న వాస్తవం బోధపడుతుంది. ముదనష్టపు వస్తువులను మృదుమధురమైనవిగా సమర్పించే కిటుకులు మన వాళ్లకు బాగా తెలుసు. సారాయి భట్టీలలో అత్యంత దుర్భరమైన స్థితిలో తయారయిన సారాయిని అందమైన హోటళ్లలో సంస్కారవంతమైన శైలిలో సమర్పించటం ఎలాంటిదో, సాని కొంపల్లో మ్రగ్గే వారిని ‘కాల్ గర్ల్’ పేరుతో స్టార్ హోటళ్లకు రప్పించటం ఎటువంటిదో ఇదీ అటువంటిదే. నైతికంగా మానవ సమాజాలను తొలచివేసే వస్తువులకు ఆధునికత పేరిట అందమైన తొడుగులు తొడిగించినంత మాత్రాన అవి విషపూరితం కాకుండా పోవు.

పొదుపు మొత్తాలపై బ్యాంకుల ద్వారా లభించే కొద్దిపాటి వడ్డీ వల్ల వారి జరుగుబాటు ఎలాగూ కాదు. బ్రతుకు తెరువు కోసం వాళ్ళు కూలీనాలీయో ఉద్యోగమో ఎలాగూ చేయక తప్పదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు వ్యాపారం మొదలెట్టి మార్కెట్టులోని వైపరీత్యాలకు తట్టుకొని నిలబడలేరు. పెద్ద తరహాలో వ్యాపారం చేద్దామంటే వారికి భారీ మొత్తంలో రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు రావు. వ్యాపార రంగంలో పరపతి ఉండి, ఓ మిలియనీరుగా చెలామణీ అవుతున్న వాడికి కోటి రూపాయిలైనా బ్యాంకుల నుండి రుణంగా లభిస్తాయి గాని ఒక సామాన్యుడికి పదివేల అప్పు కూడా పుట్టదు. ఆ విధంగా కలవాడు తన స్థాయి కన్నా పదిరెట్ల వ్యాపారం చేయగలుగుతాడు. లాభాలు కూడా అదే విధంగా జుర్రుకుంటాడు. కాని ఒక సన్నకారు వ్యాపారస్తుడు అప్పుడప్పు చేసి ఒక వేళ వ్యాపారం చేసినా అతడికి వచ్చే లాభం అతని జరుగుబాటుకు కూడా సరిపోదు. ఇదిలా ఉండగా వ్యాపార సంబంధమైన వైపరీత్యాలు గాని సంభవిస్తే ఉన్నది కూడా ఊడ్చుకుపోతుంది. ఆ వైపరీత్యాల్ని సృష్టించేది కూడా ఎవరో కాదు, బడా వాణిజ్యవేత్తలేనన్నది బహిరంగ రహస్యం. తేలిందేమంటే మార్కెట్టులో కొద్దిమంది పెద్ద తరహా వ్యాపారస్తులే మిగులుతారు. మూలధనమంతా క్రమక్రమంగా వారి ఇనుప్పెట్టెలకు తరలిపోతుంది.

1. సమాజమంతా వర్తకానికి దూరమై కొద్దిమంది పెట్టుబడిదారులు ఆర్థిక రంగాన్ని ఏలడం అన్యాయం కాదా?

2. మార్కెట్టులో కొద్దిమంది ఏకస్వామ్యం ఆధిపత్యం పెరిగిపోతుంది. వారు కోరినప్పుడల్లా నిత్యావసర వస్తువులు కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెంచేస్తూ ఉంటారు. మరో విధంగా చెప్పాలంటే క్రయవిక్రయాల వ్యవస్థ అంతా వారి గుప్పెట్లో ఉంటుంది. పరోక్షంగా వాళ్లు దేశాన్నే శాసించే స్థాయికి చేరుకుంటారు. సామాన్య ప్రజల సొమ్ముతో తెగబలిసిన ఈ ఆసాములకు ప్రజా సంక్షేమం పట్ల గాని, సామాజిక న్యాయం అంటేగాని ఎలాంటి ఆసక్తి ఉండదు.

అదే వర్తకం వికేంద్రీకరణ జరిగి, మార్కెట్టులో పరిపూర్ణమైన పోటీ విధానం అమల్లోకి వచ్చినట్లయితే పరిస్థితి తద్ఛిన్నంగా ఉంటుంది. చిన్న చిన్న వర్తకులకు కూడా లాభాలు వచ్చి వారి ఆత్మ విశ్వాసం ఇనుమడిస్తుంది. వేలాది మందికి జీవనోపాధి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ సమస్య కొంతలో కొంత పరిష్కృతమవుతుంది. ప్రగతి ఫలాలు అందరికీ లభించి ఆర్థిక అసమానతల అగాధం కొంతవరకైనా పూడుకుంటుంది. కాని ఈ విషయం జనసామాన్యానికి అర్థమయ్యేలా చెప్పేదెవరు? వినాశకరమైన రోగం తగిలించబడింది. ప్రచారం చేసే వారేమో దీన్ని ఒక రోగంగా గాక దివ్య ఔషధంగా ప్రచారం చేస్తున్నారు.

3. బ్యాంకుల వడ్డీ వల్ల సమాజానికి వాటిల్లే మరో ఆర్థిక అనర్థం ఏమిటో చూడండి – ఒక వ్యక్తి వద్ద లక్ష రూపాయిల మూలధనముంటే అతను బ్యాంకు నుండి రుణం తీసుకొని 10 లక్షల వ్యాపారం చేస్తాడు. ఒకవేళ అతడి వ్యాపారం అనూహ్యమైన ఒడిదుడుకులకు లోనై అతడు దివాలా తీస్తే అతడికి కలిగే నష్టం ఒక లక్ష (10 శాతం) మాత్రమే. కాని మిగిలిన 90 శాతం నష్టం ఎవరిపై పడుతుంది? సమాజంపైనే కదా! పైకి బ్యాంకుకు నష్టం వాటిల్లినట్లుగా అగుపిస్తుంది. కాని వాస్తవానికి ఆ బ్యాంకు సొమ్ము ఎవరిది? ప్రజలది కాదా? దీని ద్వారా బోధపడిందేమంటే పెట్టుబడిదారుడు లాభాలు వచ్చినంత కాలం తానొక్కడే లాభాలను ఆర్జించాడు. సమాజానికి లభించింది నామమాత్రం. కాని నష్టం వాటిల్లేసరికి 90 శాతం నష్టం సమాజంపైకి నెట్టేయబడింది.

4. వడ్డీ వ్యవస్థ వలన కలిగే మరో పరాభవం ఏమిటంటే, వడ్డీ సొమ్ముతో వ్యాపారం మొదలెట్టిన వ్యక్తి ఒకసారి నష్టాల ఊబిలో పడ్డాడంటే ఇక అతడు పైకి రాలేడు. ఎందుకంటే నష్టాన్ని భరించేటంత మూలధనం అతని వద్దనయితే లేదు. నష్టాలు వాటిల్లినపుడు అతని ఇక్కట్లు రెట్టింపు అవుతాయి. ఒకవైపు ఉన్నది కాస్తా ఊడ్చుకుపోయింది. రెండోవైపు అతడు బ్యాంకు రుణభారం క్రింద నలిగిపోయాడు. దాన్ని చెల్లించే దారి లేదు. కాని అదే వడ్డీ రహిత వ్యాపారంలో నష్టం వాటిల్లి ఉంటే అతడు బికారి మాత్రమే అయ్యేవాడు. కాని రుణగ్రస్తుడు అయ్యేవాడు కాదు.

ఒక్కడ ఒక సందేహం ఉత్పన్నమవటం సహజం. బ్యాంకుల ద్వారా జాతీయ సంపద ఒక చోట ప్రోగవటం వల్ల జనసామాన్యానికి ఎంతో కొంతయినా లాభం చేకూరింది కదా! పెట్టుబడిదారులకు అధిక మొత్తంలో లాభం చేకూరవచ్చుగాక, కాని సామాన్య ప్రజానీకానికి కూడా ఎంతోకొంత ముట్టింది కదా! ప్రజాధనాన్ని పొదుపు చేసే ఈ బ్యాంకు స్కీములే గనక లేకుంటే ఈ సంపద అంతా పూర్వకాలపు వ్యాపారస్తులు, జమీందార్లు ఖజానాను భూస్థాపితం చేసినట్లుగా ఈ కాలపు ప్రజలు కూడా సంపదను ఫ్రీజ్ చేసేసి నిరుపయోగం చేసేవారు కదా! అని కొందరు ప్రశ్నించవచ్చు.

దీనికి సమాధానం ఏమిటంటే ఇస్లాం వడ్డీని అధర్మంగా ఖరారు చేసి దాని ద్వారాలను మూసివేసినట్లే, సంపదను ఒకచోట ప్రోగు చేసిపెట్టే వారిపై జకాత్ అనే విద్యుక్త ధర్మాన్ని మోపి వాళ్ళు సంపదను నిరుపయోగం చేయకుండా బ్రేకువేసింది. పైగా ఆ సంపదను వెలికితీసి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టక తప్పని పరిస్థితిని సృష్టించింది. ఎలాగంటారేమో! ఇస్లాం ప్రకారం ఏ ముస్లిమైనా బంగారాన్ని గాని, నగదును గానీ నిల్వ చేస్తే అతడు ఆ సొమ్ముపై సాలీనా రెండున్నర శాతం చొప్పున జకాత్ ని తీసి సమాజంలోని అగత్యపరులకు, నిరాధారులకు ఇవ్వవలసి ఉంటుంది. ఆ విధంగా అతడు తన నిల్వలను పెట్టుబడిగా మార్చకుండా అట్టే పెట్టుకొని ఉంటే కొన్ని సంవత్సరాలకే ఆ ఖజానా కాస్తా ఖాళీ అయిపోతుంది. కాబట్టి అతడు తన దగ్గరున్న మిగులును ఫ్రీజ్ చేసి ఉంచే బదులు దాన్ని వాణిజ్యంలోనో వ్యవసాయంలోనో పెట్టుబడిగా పెట్టి దానిపై వచ్చే లాభాలపైన జకాత్ ఇవ్వడానికే ప్రాధాన్యతనిస్తాడు. అంటే తన దగ్గరున్న సంపద ద్వారా తాను లబ్దిపొందడంతో పాటు ఇతరులకు కూడా జకాత్ రూపంలో లాభాలను పంచిపెడతాడు.

జకాత్ చెల్లింపు ద్వారా సమాజంలోని నిరుపేదలకు, అగత్యపరులకు సాయం లభించినట్లే ముస్లింల ఆర్థిక స్థితిగతులు చక్కబడే అవకాశాలు కూడా మెరుగుపడతాయి. వర్తకాన్ని ప్రోత్సహించేందుకు జకాత్ దోహదపడుతుంది. ఎందుకంటే, నగదు సొమ్మును ఏడాది కాలం పాటు ఇనుప్పెట్టెల్లో మూసి ఉంచడం వల్ల తనకు ప్రయోజనం ఏమీ కలగకపోగా, జకాత్ రూపేణా కొంతధనం బయటకు వెళ్ళిపోతుందే అని మనిషి ఆలోచనలో పడి ఆ నగదుతో వ్యాపారం మొదలెడతాడు. వేలాది మందికి చెందిన కష్టార్జితాన్ని బ్యాంకుల ద్వారా రాబట్టి ఒక పారిశ్రామికవేత్త వ్యాపారం చేసే బదులు స్థితిమంతుడయిన ప్రతి ఒక్కడూ వ్యాపార రంగంలో అడుగుపెడతాడు. వాణిజ్యరంగంలో ఆరోగ్యవంతమైన పోటీ పెరుగుతుంది. మార్కెట్లో ఏకస్వామ్య వ్యవస్థ బదులు పరిపూర్ణపోటీ విధానం అమల్లోకి వస్తుంది. మార్కెట్ సమతౌల్యం ఏర్పడుతుంది. తత్ఫలితంగా సమాజంలోని బడుగు జీవులకు, నిరాధారులకు వెసులుబాటు లభిస్తుంది.

వడ్డీ వ్యాపారం మూలంగా వాటిల్లే ఆర్థిక అస్తవ్యస్త స్థితిని అవలోకనం చేశాము. ఇక దీని మూలంగా మానవుని ఆధ్యాత్మిక, నైతిక రంగాలపై పడే దుష్ప్రభావాన్ని చూద్దాము –

1. మానవుని గుణగణాలలో అత్యంత ముఖ్యమైనది, ఉజ్వలమైనది త్యాగగుణం మరియు దాతృ స్వభావం. స్వయంగా బాధల్ని భరించి ఇతరులకు సుఖాన్ని పంచిపెట్టడమనే భావన ఉన్నత మానవీయతకు తార్కాణం. అయితే వడ్డీ పిశాచం తిష్ఠ వేసిన సమాజాల్లో ఈ పరోపకార గుణం దాదాపు నశిస్తుంది. పరులకు ఉపకారం కాదు కదా పరులు కష్టపడి పైకొచ్చి తన సరసన నిలబడటాన్ని కూడా ఒక వడ్డీ వ్యాపారి సహించలేడు.

2. అతడు ఆపదల్లో ఉన్న వారిపై జాలి చూపకపోగా వారి ఆపదల్ని తన స్వార్థ ప్రయోజనాలకై సొమ్ము చేసుకోజూస్తాడు.

3. వడ్డీ ఆర్జన వల్ల అతనిలో పేరాశ పెరిగిపోతుంది. క్రమంగా అతని హృదయంలోని దయాదాక్షిణ్యాలు మటుమాయమవుతాయి. మంచీ-చెడుల మధ్య గల వ్యత్యాసాన్ని మరచిపోతాడు. ఆ విధంగా అతను నైతికంగా దిగజారి కడకు మానవత్వానికే దూరమైపోతాడు.

వడ్డీ మూలంగా సమాజానికి వాటిల్లే నైతిక, ఆధ్యాత్మిక, ఆర్థిక అనర్థాలను వివరించారు సరే, మరయితే ఈ వడ్డీ లేకుండా వ్యవస్థ నడిచేదెలా? ఆర్థిక వ్యవస్థ అణువణువునూ ‘వడ్డీ’ పెనవేసుకొని ఉండగా దీన్ని ఒక్కసారిగా విడనాడితే వ్యాపారస్తులకు బ్రతికి బట్టకట్టే మార్గం ఏది? అన్న ప్రశ్న ఇక్కడ తలెత్తడం సహజం.

మనం ఇక్కడ ఆవేశానికి లోనవకుండా ఒక విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించాలి. ఒక వ్యాధి ప్రబలిపోయి అది అంటువ్యాధిగా మారిపోయినపుడు చికిత్స దుర్లభంగా కనిపిస్తుంది. కానీ ఆ చికిత్స వృధాపోదు. ఆర్థిక సంస్కరణలు ఫలప్రదం కావడానికి సమయం పడుతుంది. దీని కొరకు వ్యక్తులు, సమాజాలు సహన స్థయిర్యాలతో వ్యవహరించవలసి ఉంటుంది. దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ స్వయంగా ఇలా సెలవిచ్చాడు.

“అల్లాహ్ ధర్మం విషయంలో మీపై ఎలాంటి లేమి (ఇబ్బంది) నీ ఉంచలేదు.”

దీన్ని బట్టి అవగతమయ్యేదేమిటంటే వడ్డీకి అతీతంగా మానవ సమాజాలకు ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకులు, కష్టనష్టాలు లేకుండా నడిపించే మార్గం తప్పక ఉంది.

సమాజంలోని నిరుపేదల అభాగ్యజీవుల పాట్లను నిరోధించే ఉపాయాలు ఇస్లాంలో ఉన్నాయి. ఇస్లాం ధర్మం పట్ల, దాని ఉపదేశాల పట్ల అనాసక్తత మూలంగా ముస్లింల స్థితిగతులు ఇలా తగలడ్డాయి గాని వారు గనక ఇస్లాం ప్రబోధనలను ఖచ్చితంగా తమ దైనందిన జీవితాల్లో ప్రవేశపెట్టుకున్నట్లయితే వారి జీవన గతే మారిపోతుంది. జకాత్, సదకాల రూపంలో వారు సక్రమంగా తమ సంపదను పంపిణీ చేసినట్లయితే నేడున్న సమస్యలు ఉండవు. ఇదంతా వారి నిర్లక్ష్య ధోరణి యొక్క పరిణామమే. నిజం చెప్పాలంటే నేడు జకాత్ విధానం దాదాపు లేదు. ముస్లింలలో చాలామంది నమాజ్ మాదిరిగానే జకాత్ జోలికిపోరు. జకాత్ ఇచ్చేవారు కూడా పాక్షికంగానే ఇస్తున్నారు. జకాత్ ను పూర్తిగా ఇచ్చేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. పోనీ వారైనా ఆ జకాత్ సొమ్మేదో సక్రమంగా పంపిణీ చేస్తున్నారా అంటే అదీ లేదు. తమ సొమ్ముల్లో ఏడాదికోసారి జకాత్ తీస్తే సరిపోదు, దాన్ని సజావుగా చెల్లించాలి, నిర్ణీత పద్దులకు మాత్రమే కేటాయించాలన్నది అల్లాహ్ ఆదేశం. జకాత్ సొమ్మును దాని హక్కుదారులకు మాత్రమే చెల్లించే నిమిత్తం సిసలైన హక్కుదారులను అన్వేషించే దాతలు ఎంత మంది ఉన్నారో మీరే చెప్పండి.

ముస్లింల మిగులు ధనం ఎంత స్వల్పంగా ఉన్నా సరే, వారిలోని ప్రతి ఒక్క స్థితిమంతుడు గనక చిత్తశుద్ధితో జకాత్ అనే విధానాన్ని వేరుపరచి సక్రమమైన పద్ధతిలో దాని హక్కుదారులకు చేరవేసినట్లయితే అసలెవరికీ ముష్టెత్తుకునే దుస్థితి దాపురించదు. చీటికి మాటికీ అప్పుల కోసం ‘అయ్యవార్ల’ వద్దకు పరుగులు తీయాల్సిన అగత్యం కూడా ఉండదు.

మరి ఈ జకాత్ నే షరీఅత్ ఆదేశాలకు లోబడి సామూహిక పద్ధతిలో వసూలు చేసి ‘బైతుల్ మాల్’ అనే సంస్థను స్థాపించినట్లయితే మరిన్ని మేళ్లు చేకూరుతాయి. అలా పెద్ద మొత్తంలో వసూలైన జకాత్ ను బైతుల్ మాల్ ద్వారా వడ్డీలేని రుణాలుగా కూడా ఇవ్వవచ్చు. జీవనోపాధి లేక రోడ్డున పడ్డ అనేక మందికి రుణాలు ఇచ్చి కుటీర పరిశ్రమల్ని స్థాపించవచ్చు. ఈ విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఒక ఐరోపా ఆర్థిక నిపుణుడు నిజం చెప్పాడు. అతనిలా అన్నాడు – “ముస్లింల జకాత్ వ్యవస్థ ఎంత ప్రభావవంతమైనదంటే, ముస్లింలే గనక దాన్ని సక్రమంగా పాటిస్తే ఆ జాతిలో ఒక్క దరిద్రుడు, అగత్యపరుడూ మిగలడు”.

ఈ చర్చ ద్వారా చివరకు మేము చెప్పదలచిందేమంటే; వడ్డీ ఒక అంటువ్యాధిలా ప్రబలి పోయిన ఈ రోజుల్లో ఇక దాన్ని విడనాడే దారేలేదని తలపోయటం సరైనది కాదు. కాకపోతే ఇది ఒక్క వ్యక్తి లేక కొందరు వ్యక్తుల పని కాదు. ప్రభుత్వాలు, సామూహిక సంస్థలు చొరవ తీసుకొని వ్యవస్థను మార్చడానికి యత్నించినపుడే ఆశించిన ఫలితాలు వస్తాయి. కనీసం ముస్లిం సమాజాలు, ముస్లిం రాజ్యాలు ఈ సమస్యపై దృష్టిని కేంద్రీకరించి వడ్డీ రహిత వ్యవస్థ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే వడ్డీ పిశాచం నుండీ ప్రజానీకాన్ని కాపాడటం దుర్లభమేమీ కాదు. వారు ఈ లక్ష్యాల్ని సాధించిననాడు ఆర్థికంగా యావత్ప్రపంచానికే ఆదర్శప్రాయం కాగలుగుతారు.

మరో విషయాన్ని మేము ముస్లింలకు ప్రత్యేకంగా విన్నవించుకోదలిచాము – వారు కనీసం రోగాన్ని రోగంగానే చూడాలి. అధర్మాన్ని (హరాం) అధర్మంగానే చూడాలి. షరీఅత్లో అధర్మమైన ఒక వస్తువును ధర్మసమ్మతం (హలాల్)గా తలపోయడం కన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. అత్యంత విచారకరమైన విషయమేమంటే ముస్లిం సమాజాల్లో కొంత మంది మేధావులు ఈ ‘హరామ్’ ను ‘హలాల్’గా నిరూపించడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఇది చాలా ఘోరమైన పాపం అన్న సంగతిని వారు మరచిపోతున్నారు. అల్లాహ్ వాక్యాలతో చెలగాటమాడటం ధిక్కారవైఖరికి ప్రతీక అని వారు గ్రహించకపోతే అది వారి గ్రహచారం. కనీసం హరామ్ ను హరామ్ గా భావించటం వల్ల వారికి వాటిల్లే నష్టం ఏమీలేదు కదా!

చివర్లో మేము వడ్డీ నిషిద్ధం మరియు దానికి సంబంధించి అల్లాహ్ తరఫున చేయబడిన హెచ్చరికలను తెలిపేందుకు గాను మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రవచనాలను పొందుపరచదలిచాము. కనీసం పాపాన్ని పాపంగా తలపోసే భావన అయినా ప్రజల్లో మేల్కొనాలన్నదీ, దానికి దూరంగా ఉండటానికి ప్రజలు ఉపాయాలు ఆలోచించాలన్నది మా ఉద్దేశ్యం. ఈ హరామ్ ను హలాల్ గా పరిగణించి వారు రెట్టింపు పాపాన్ని మూటగట్టుకోకుండా ఉన్నా చాలు కొంత వరకు ఉద్దేశ్యం నెరవేరినట్లే. ముస్లింలలో చాలా మంది రాత్రిపూట తహజ్జుద్ నమాజులో, అల్లాహ్ నామస్మరణలో గడుపుతారు. కాని తెల్లవారాక వారు తమ వ్యాపార వ్యవహారాలలో తలమునకలవగానే తాము వడ్డీ అనే అధర్మమైన వ్యవహారానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చేయూతనిస్తున్నామన్న సంగతి మరచిపోతారు. ఇది కడు శోచనీయమని వేరుగా చెప్పనవసరం లేదు. వడ్డీ గురించి తన అనుచర సమాజానికి మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేసిన హెచ్చరికల్ని చదవండి.

1) “ఏడు ప్రాణాంతక వస్తువుల బారి నుండి మిమ్మల్ని కాపాడుకోండి” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు. ‘అవేమిటి ఓ దైవ ప్రవక్తా!’ అని సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) ప్రశ్నించగా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు:- 1) ఒక్కడైన అల్లాహ్ (ఆరాధనలలో)కు సహవర్తునిగా వేరొక దైవాన్ని నిలబెట్టడం. 2) చేతబడి (బాణామతి) చేయడం, 3) ఏ వ్యక్తినయినా అన్యాయంగా హతమార్చడం 4) వడ్డీ తినడం 5) అనాధ సొమ్మును భక్షించటం. 6) ధర్మయుద్ధ సమయంలో యుద్ధ రంగం నుండి వెన్ను చూపి పారిపోవటం 7) సౌశీల్యవతి అయిన మహిళపై అపనింద మోపడం”. (ఈ హదీసు సహీహ్ బుఖారీ మరియు ముస్లింలో ఉంది.)

2) అంతిమ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఇవాళ రాత్రి నేను నా దగ్గరకొచ్చిన ఇద్దరు వ్యక్తుల్ని చూశాను. వాళ్లు నన్ను బైతుల్ మఖ్దిస్ వరకు గొనిపోయారు. మేము మరింత ముందుకు సాగిపోగా అక్కడ ఒక నెత్తుటి కాలువ కనిపించింది. అందులో ఒక మనిషి నిలబడి ఉన్నాడు. మరొకతను కాలువ ఒడ్డున నిలుచుని ఉన్నాడు. కాలువలో నిలుచున్న వ్యక్తి బయటకు రావటానికి యత్నించినపుడు ఒడ్డున ఉన్న వ్యక్తి అతని ముఖంపై రాయి రువ్వుతున్నాడు. ఆ దెబ్బతో అతడు మునుపున్న చోటికే పరుగెత్తుకెళుతున్నాడు. మళ్లీ అతడు కాలువ నుంచి బయట పడేందుకు ప్రయత్నించగా ఒడ్డున ఉన్నవాడు మళ్లీ రాయి రువ్వసాగుతున్నాడు. ఏమిటీ తతంగం? అని నేను నా వెంట వున్న ఇద్దరిని ప్రశ్నించగా ‘కాలువలో చిక్కుకుపోయిన వ్యక్తి వడ్డీ సొమ్ము తినేవాడు (ఇప్పుడు తన కర్మకు శిక్ష అనుభవిస్తున్నాడు) అని వాళ్లు బదులిచ్చారు.” (ఈ హదీసు సహీహ్ బుఖారీలోని కితాబుల్ బుయూలో ఉంది).

3) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వడ్డీ తీసుకునే వారినీ, వడ్డీ ఇచ్చే వారిని కూడా ధూత్కరించారు. మరికొన్ని ఉల్లేఖనాలలో వడ్డీ వ్యవహారం పై సాక్ష్యమిచ్చేవారు, తత్సంబంధితమైన దస్తావేజులు వ్రాసేవారు కూడా ధూత్కరించబడ్డారు.

సహీహ్ ముస్లింలోని ఒక ఉల్లేఖనంలో ఇలా అనబడింది “వీళ్ళంతా ఈ పాపంలో సమాన భాగస్థులే”. మరి కొన్ని ఉల్లేఖనాలలో, సాక్షులు, దస్తావేజులు వ్రాసేవారు తమకు అది వడ్డీ వ్యవహారం అని తెలిసి ఉన్న పక్షంలోనే ధూత్కారానికి గురవుతారు.

4) మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ప్రబోధించారు. “నాలుగు రకాల మనుషులున్నారు. వారికి స్వర్గంలో ప్రవేశం లభించదు గాక లభించదని అల్లాహ్ నిర్ధిష్టంగా నిర్ణయించాడు. ఆ నలుగురు ఎవరంటే (a) మద్యపానానికి ఆలవాటు పడినవాడు. (b) వడ్డీని తిన్నవాడు (c) అనాధ సొమ్మును అన్యాయంగా స్వాహా చేసేవాడు (d) తల్లిదండ్రుల మాట విననివాడు. (ఈ ఉల్లేఖనం ‘ముస్తద్రిక్ హాకిమ్’లో ఉంది)

5) మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు: “వడ్డీతో కూడిన ఒక్క దిర్హమ్ తిన్నవాడు ముప్ఫయి ఆరుసార్లు వ్యభిచారం చేసిన దానికన్నా ఎక్కువ పాపం చేసినట్లు లెక్క”.

మరొక ఉల్లేఖనంలో “అక్రమ ధనంతో పెరిగిన కండ కోసం అగ్నియే సబబైనది”.

దాంతో పాటు మరో ఉల్లేఖనం ఈ విధంగా ఉంది :- “ఒక ముస్లిం మాన మర్యాదల్ని మంట గలపడం వడ్డీ తినటం కన్నా ఎక్కువ పాపిష్టికరం” (ఈ ఉల్లేఖనం ముస్నద్ అహ్మద్, బ్రానీలలో ఉంది)

6) వేరొక హదీసులో ఉంది:- మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు “(వృక్షం యొక్క) ఫలం నిరుపయోగం కాక ముందే దాన్ని అమ్మి వేయాలి”. ఇంకా ఇలా అన్నారు – “ఏదేని ఒక పేటలో వ్యభిచారం, వడ్డీ వ్యాపారం పెరిగిపోతే అది అల్లాహ్ ఆగ్రహాన్ని తన పైకి ఆహ్వానించినట్లే.” (ఈ ఉల్లేఖనం ‘ముస్తద్రక్ హాకిమ్ లో ఉంది.)

7) మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు “ఏ జాతిలోనయినా లావాదేవీలు వడ్డీ ప్రాతిపదికగా సాగితే అల్లాహ్ వారిపై నిత్యావసర వస్తువుల ధరను విపరీతం చేస్తాడు. మరే జాతిలోనయినా లంచగొండితనం ప్రబలిపోతే శత్రువును చూసి వణికిపోయే భయోత్పాత స్థితి వారిపై నెలకొంటుంది”. (ఈ ఉల్లేఖనం ముస్నద్ అహ్మద్లో ఉంది)

8) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వివరించారు:- షబే మేరాజ్ సందర్భంగా మేము ఏడవ ఆకాశంలో చేరినపుడు నేను నా పైన ఒక మెరుపును చూశాను. ఆ తరువాత మాకు ఒక జన సమూహం తారసిల్లింది. వారి పొట్టలు నివాస గృహాల మాదిరిగా వ్యాకోచించి ఉన్నాయి. వాటిల్లో సర్పాలు నిండి ఉన్నాయి. అవి బయటకు కనిపిస్తూ ఉన్నాయి. ‘ఎవరు వీరు?’ అని నేను దైవదూత జిబ్రయీల్ (అలైహిస్సలాం)ని అడిగాను. ‘వీళ్లు వడ్డీ సొమ్ము తిన్నవారు’ అని ఆయన సమాధానమిచ్చారు. (ఈ ఉల్లేఖనం ముస్నద్ అహ్మద్ లో నిది)

9) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఔఫ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు)ని ఉద్దేశ్యించి చెప్పారు – “క్షమార్హం కాని పాపాలకు దూరంగా ఉండండి. వాటిల్లో ఒకటి:- యుద్ధప్రాప్తిని తస్కరించటం, రెండు:- వడ్డీ సొమ్ము తినటం”. (తబ్రానీ)

10) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా ఉపదేశించారు: “మీరు ఎవరికయితే అప్పు ఇచ్చారో అతన్నుంచి కానుక కూడా స్వీకరించకండి”. (బహుశా అతను ఈ కానుక అప్పుకు బదులుగా ఇచ్చాడేమో. అది బహుశా వడ్డీయేమో. అందుచేత అతని కానుకను స్వీకరించే విషయంలో కూడా జాగ్రత్తపడటం మంచిది.)

దివ్యఖుర్ఆన్లోని ఏడు వచనాలు మరియు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పది హదీసుల ఆధారంగా వడ్డీ నిషిద్దం గురించి స్థూలంగా మీ ముందుంచటం జరిగింది. విషయాన్ని వివరంగా చర్చిస్తే ఓ పెద్ద గ్రంథమే తయారవుతుంది
.
ధర్మంలో హరామ్ (నిషిద్ధం) – హలాల్ (ధర్మ సమ్మతం)లు కీలకమైనవి. మోమిన్ (విశ్వాసి) అయిన వాడు హలాల్ వస్తువులను స్వీకరించి హరామ్ వస్తువులను పరిత్యజిస్తాడు. హరామ్ వస్తువుల పట్ల ఏహ్యభావం కలిగి ఉంటాడు. ఇస్లామీయ షరీఅత్ హరామ్ గా ఖరారు చేసిన వాటిలో ఏదైనా హరామే. హరామ్ వస్తువుల జాబితాలో వచ్చే కొన్నింటిని అసహ్యించుకొని మరికొన్నింటిని స్వీకరించటం అంటే ధర్మాన్ని పాక్షికంగా అవలంబించటమే.

కాగా, అల్లాహ్ విశ్వాసుల్ని ఉద్దేశ్యించి ఏమంటున్నాడో తెలుసా?!

‘యా అయ్యుహల్లజీన ఆమనుద్ ఖులూ ఫిస్సిల్మి కాప్ఫహ్’
ఓ విశ్వాసులారా ! ఇస్లాంలో ప్రవేశిస్తే (పాక్షికంగా కాదు) పూర్తి స్థాయిలో ప్రవేశించండి.

సమాప్తం

వడ్డీ – యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1NM8ynZdYubB7u7F0gGvnP

భూకంపాలు, వరదలు మరియు ఇస్లాం సిద్ధాంతాలు – సలీం జామి’ఈ [వీడియో]

భూకంపాలు, వరదలు మరియు ఇస్లాం సిద్ధాంతాలు – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/NClr-TiBAc4 [25 నిముషాలు]

ఈ వీడియోలో తెలుసుకోవలసిన విషయాలు:

1- భూకంపాలు సంభవించేలా చేస్తున్నది ఎవరు ?
2- సునామీలు, భూకంపాలు, వరదలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు సంభవిస్తాయి ?
3- అభం శుభం తెలియని పిల్లలు వీటి వల్ల మరణిస్తున్నారు వారు చేసిన పాపం ఏమిటి ?
4- దైవ వాక్యాలు బోధించే పండితులు సర్వం కోల్పోయి రోడ్డున పడుతున్నారు వారి నేరం ఏమిటి ?
5- ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక విశ్వాసి గా మన బాధ్యత ఏమిటి ?
6- పదే పదే ఎక్కువగా భూకంపాలు సంభవించటం దేనికి సంకేతం ?
7- పూర్తి భూమి కంపించే రోజు రానుందా ?

“మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది”. మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి. మీ బంధుమిత్రులను చేర్పించండి, ఇన్ షా అల్లాహ్.
https://chat.whatsapp.com/JYb4QhZ4Hlu5Ek076Xx4fJ

3 కఫ్ఫారాత్, 3 దరజాత్, 3 ముంజియాత్, 3 ముహ్ లికాత్

3 కఫ్ఫారాత్, 3 దరజాత్, 3 ముంజియాత్, 3 ముహ్ లికాత్
https://youtu.be/Wa4vEgWCsDE [ 2 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:

మూడు (కఫ్ఫారాత్) పరిహారాలున్నాయి,
మూడు (దరజాత్) స్థానాలను పెంచేవి ఉన్నాయి
మూడు (ముంజియాత్) మోక్ష సాధనాలున్నాయి
మూడు (ముహ్ లికాత్) వినాశనానికి గురి చేసేటివి ఉన్నాయి

కఫ్ఫారాత్:
1- విపరీత చలిలో సంపూర్ణ వుజూ చేయుట
2- ఒక నమాజు తర్వాత మరో నమాజు కొరకు వేచించుట
3- జమాఅతుతో (సాముహిక) నమాజు చేయుట కొరకు కాలి నడకతో వెళ్ళుట
.

దరజాత్:
1- అన్నం తినిపించుటు,
2- సలాం వ్యాపింపజేయుట
3- రాత్రి ప్రజలు పడుకున్నప్పుడు లేచి తహజ్జుద్ నమాజు చేయుట
.

ముంజియాత్:
1- కోపం, సంతోషం అన్ని స్థితుల్లో న్యాయం పాటించుట
2- పేదరికం, సిరివంతం అన్ని స్థితుల్లో మధ్యేమార్గాన్ని అవలంభించుట
3- ఏకాంతంలో ఉన్నా, నలుగురి మధ్యలో ఉన్నా అల్లాహ్ తో భయపడుతూ ఉండుట.

ముహ్ లికాత్:
1- దురాశ, పిసినారితనానికి బానిస అయిపోవడం
2- మనోవాంఛల (అంధా)నుకరణ
3- అహంభావం, మిడిసిపడడం

[ముస్నద్ బజ్జార్, సహీ తర్గీబ్ 453]

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

హదీసు 6 : దైవభీతి మరియు చిత్తశుద్ధి | అల్ అర్బయీన్ అన్నవవియ్యహ్

عَنْ أَبِي عَبْدِ اللَّهِ النُّعْمَانِ بْنِ بَشِيرٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا، قَالَ: سَمِعْت رَسُولَ اللَّهِ صلى الله عليه و سلم يَقُولُ: “إنَّ الْحَلَالَ بَيِّنٌ، وَإِنَّ الْحَرَامَ بَيِّنٌ، وَبَيْنَهُمَا أُمُورٌ مُشْتَبِهَاتٌ لَا يَعْلَمُهُنَّ كَثِيرٌ مِنْ النَّاسِ، فَمَنْ اتَّقَى الشُّبُهَاتِ فَقْد اسْتَبْرَأَ لِدِينِهِ وَعِرْضِهِ، وَمَنْ وَقَعَ فِي الشُّبُهَاتِ وَقَعَ فِي الْحَرَامِ، كَالرَّاعِي يَرْعَى حَوْلَ الْحِمَى يُوشِكُ أَنْ يَرْتَعَ فِيهِ، أَلَا وَإِنَّ لِكُلِّ مَلِكٍ حِمًى، أَلَا وَإِنَّ حِمَى اللَّهِ مَحَارِمُهُ، أَلَا وَإِنَّ فِي الْجَسَدِ مُضْغَةً إذَا صَلَحَتْ صَلَحَ الْجَسَدُ كُلُّهُ، وَإذَا فَسَدَتْ فَسَدَ الْجَسَدُ كُلُّهُ، أَلَا وَهِيَ الْقَلْبُ

[رَوَاهُ الْبُخَارِيُّ]، [وَمُسْلِمٌ] 

అనువాదం 

నోమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెబుతుండగా నేను విన్నాను: 

“నిశ్చయముగా ‘హలాల్’ (ధర్మ సమ్మతమైన) విషయాలు స్పష్టంగా తెలుపబడ్డాయి, ‘హరామ్’ (నిషేధిత) విషయాలు కూడా స్పష్టంగా తెలుపబడ్డాయి. అయితే ఆ రెండింటి మధ్య కొన్ని అస్పష్ట విషయాలు ఉన్నాయి. వాటి గురించి చాలా మంది ఎరుగరు. అయితే ఎవరైతే అస్పష్ట విషయాలకు దూరంగా ఉంటారో, వారు తమ ధర్మాన్ని, గౌరవాన్ని కాపాడుకున్న వారవుతారు. మరి ఎవరైతే అస్పష్ట విషయాల్లో పడిపోతారో వారు ‘హరాం’ నిషిద్ధ విషయాల్లో పడిపోతారు. పశువుల్ని మేపుకుంటున్న కాపరిలా, అతను గరిక గట్టుపై పశువుల్ని మేపు కుంటుంటాడు. అతని పశువులు ప్రక్కనున్న పొలములోకి చొరబడే అవకాశం అతి దగ్గరలోనే వుంది. గుర్తుంచుకోండి! నిశ్చయంగా ప్రతి రాజుకి కాపాడుకునే సరిహద్దులుంటాయి. గుర్తుంచుకోండి! మరి నిశ్చయంగా అల్లాహ్ (సామ్రాజ్య) సరిహద్దులంటే ఆయన నిషేధించి (హరాం చేసి)న విషయాలే. వినండి.! నిశ్చయంగా మానవ శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉంది. అది క్షేమముగా వుంటే మొత్తం శరీరం క్షేమముగా వుంటుంది. ఒక వేళ అది చెడిపోతే మొత్తం మానవ శరీరమే చెడిపోతుంది. బాగా గుర్తుంచుకోండి! ఆ మాంసపు ముద్దే మానవ హృదయం”. 

పుస్తక సూచనలు

సహీహ్ బుఖారీ – 52, సహీహ్ ముస్లిం-1599.
తెలుగు రియాజుస్సాలిహీన్ 1 పేజి 780, హ588. 
(సహీహ్ బుఖారీ, విశ్వాస ప్రకరణం. సహీహ్ ముస్లిం, లావాదేవీల ప్రకరణం) 

హదీసు ప్రయోజనాలు 

1. ‘షరీఅత్’లో హలాల్ (సమ్మత), మరియు హరామ్ (అసమ్మత) విషయాలను వివరించబడింది. ఇక అస్పష్టమైన అంశాలు కొన్ని వున్నాయి, వాటి గురించి లోతైన అవగాహన కొందరికే ఉంటుంది. 

2. ప్రవక్త వారి ఉన్నతమైన బోధనా ఉదాహరణలతో కూడి ఉన్నది. 

3. బుద్ధి (ఆలోచన) అనేది హృదయంలో వుంటుంది. ప్రవక్త వారి అదేశం: వినండి.! నిశ్చయంగా మానవ శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉంది. అది బాగుంటే మొత్తం శరీరం బాగుంటుంది. ఒకవేళ అది చెడిపోతే మొత్తం మానవ శరీరమే చెడిపోతుంది. బాగా గుర్తుంచుకోండి! అదే మానవ హృదయం”. 

4. అలజడి గాని, దిద్దుబాటు గాని, హృదయం చుట్టూ తిరుగుతుంటుంది. అందుకనే ప్రతి చక్కబెట్టే విషయంతో హృదయాన్ని చక్కబెట్టడానికి ప్రయత్నిస్తూవుండాలి. 

5 అన్ని అవయవాల కంటే హృదయం ఉన్నతమైనది. 

6. బాహ్య విషయాల్లో అలజడి అంతర విషయాల్లోని అలజడిని దృవీకరిస్తూంది. “వినండి.! నిశ్చయంగా మానవ శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉంది. అది క్షేమముగా వుంటే మొత్తం శరీరం క్షేమముగా వుంటుంది. ఒకవేళ అది చెడిపోతే మొత్తం మానవ శరీరమే చెడిపోతుంది. బాగా గుర్తుంచుకోండి! అదే మానవ హృదయం”. 

7. అస్పష్ఠ విషయాల్లో పడకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే స్పష్టమైన (హరాం) విషయాలకు గురికాకుండ ఉండటానికి. 

8. ధార్మిక విషయాలను మరియు మానవాళికి సౌలభ్యం చేకూర్చె వాటిని కాపాడాలి. 

9. అనుమానాలు రేకెత్తించే విషయాలకు దూరంగా వుండాలి. 

10. ఎవరైతే అస్పష్ఠ విషయాలలో జాగ్రత్త వహించరో వారు తమకు తాము వాటితో మిళితం చేసుకుంటారు లేక హరాం (నిషేధిత) విషయాలకు లోనవుతారు. 

11. హరాం (నిషేధిత) విషయాల వైపుకు ప్రేరేపించే వాటికి అడ్డుకట్ట. ప్రవక్త ( సల్లల్లాహు అలైహి వసల్లం) వాక్యం: “గుర్తుంచుకోండి! నిశ్చయంగా ప్రతి రాజుకి ఒక కాపాడుకునే కంచె ఉంటుంది. గుర్తుంచుకోండి! మరి నిశ్చయంగా అల్లాహ్ (సామ్రాజ్య) సరిహద్దులంటే ఆయన నిషేధించి (హరాం చేసి)న విషయాలే”. 

12. మంచి వృత్తిని ఎన్నుకోవడంలో హృదయము యొక్క దిద్దుబాటు వుంటుంది. 

13. ధార్మిక జ్ఞానములో స్పష్టత సాధించాలని ప్రోత్సహించబడింది. 

14. ‘ముర్జియా’ (ఒక వర్గం పేరు) యొక్క విశ్వాస’ భావనలను ఖండించబడింది. వారి భావన: “ఈమాన్ ఉంటే పాపాలు (దుష్కార్యాలు) నష్టపర్చలేవు”. 

హదీసు ఉల్లేఖులు 

హజ్రత్ అబూ అబ్దుల్లాహ్ నౌమాన్ బిన్ బషీర్ (రజియల్లాహు అన్హు): 

నౌమాన్ బిన్ బషీర్ బిన్ సఅలబ బిన్ సఅద్ బిన్ ఖల్లాస్, అల్ అన్సారి, అల్ ఖజ్ రజి  పేరు. ‘కున్నియత్’ ‘అబూ అబ్దుల్లాహ్ ‘. వీరి తల్లి దండ్రులు ఇద్దరు సహాబీలుగా పేరుగావించినవారు. ‘హిజ్రత్’ యొక్క 14వ మాసములో జన్మించారు, మదీన అన్సారుల్లో వున్నందున అన్సారి మరియు మదనిగా పిలవబడ్డారు. ‘షామ్’ లో నివాసము ఏర్పర్చుకున్నారు. ‘ముఆవియహ్’ తరపున తొలుత ‘కూఫా’ తరువాత ‘హిమ్స్’ ప్రాంతాల యొక్క అధికారి, మరియు గవర్నరుగా నిర్ణయించబడ్డారు. 64వ హి.శ. లో ‘రాహిత్’ నాడు ‘ఖాలిద్ బిన్ ఖలీ, కలాయి’ చేతుల్లో ‘షహీద్’ (అమరగతులు) అయ్యారు. హదీసు గ్రంథాల్లో వారి ఉల్లేఖనాల సంఖ్య 114గా చెప్పబడుతుంది. 

(రి.సా. ఉర్దు – 1, పేజి:232) 

అల్ అర్బయీన్ అన్నవవియ్యహ్ – 40 హదీసుల సమాహారం (మెయిన్ పేజీ)
https://teluguislam.net/40h/

పాపుల జాబితాలో చేరకూడదని చేతులు కాల్చుకున్న యువకుని గాధ [వీడియో]

పాపుల జాబితాలో చేరకూడదని చేతులు కాల్చుకున్న యువకుని గాధ
https://youtu.be/glPEuAcNRsI [9 నిముషాలు]
వక్త: సయ్యద్ అబ్దుస్సలామ్ ఉమ్రి (హఫిజహుల్లాహ్)

మరిన్ని కధలు:
https://teluguislam.net/category/stories-kadhalu/

నిత్య వధువు నిరంతర సాధువుగా మారిన వేళ [గాధ] (వీడియో)

నిత్య వధువు నిరంతర సాధువుగా మారిన వేళ [గాధ] (వీడియో)
https://youtu.be/Z9jbQBLwys8 [8 నిముషాలు]
వక్త: సయ్యద్ అబ్దుస్సలామ్ ఉమ్రి (హఫిజహుల్లాహ్)

మరిన్ని కధలు:
https://teluguislam.net/category/stories-kadhalu/

సత్కార్యాలను బూడిద చేసే దుష్కార్యాలు – నసీరుద్దీన్ జామి’ఈ [ఆడియో & టెక్స్ట్]

సత్కార్యాలను బూడిద చేసే దుష్కార్యాలు – నసీరుద్దీన్ జామి’ఈ
https://youtu.be/HVq6SNiWQRs [11 నిముషాలు]

ప్రతీ ఒక్కరూ తప్పకుండా వినవలసిన అంశం ఇది ⤵️
సత్కార్యాలను బూడిద చేసే దుష్కార్యాలు 🎤
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
⏰ 11:29 నిమిషాలు
జుమా ఖుత్బా ఇచ్చేవారికి కొన్ని పాయింట్స్

ఈ ప్రసంగంలో, సత్కార్యాలను నాశనం చేసే పాపాల గురించి వివరించబడింది. ప్రారంభంలో, మంచి పనులను పాడుచేసే పాపాల గురించి ఖురాన్ ఆయత్ (సూరత్ ముహమ్మద్, 33) ఉటంకిస్తూ, ఈ పాపాలు సత్కార్యాలపై ఏడు రకాలుగా ప్రభావం చూపుతాయని వర్గీకరించారు. అవి: అన్ని మంచి పనులను నాశనం చేసేవి, నిర్దిష్టమైన మంచి పనులను పాడుచేసేవి, మంచి పని తర్వాత చేసిన పాపాలు, పుణ్యాల ఫలాన్ని తగ్గించేవి, ప్రళయదినాన పుణ్యాలను సమం చేసేవి, పుణ్యాల ప్రయోజనాలను తొలగించేవి మరియు ఒకరి పుణ్యాలను ఇతరులకు బదిలీ చేసేవి. ఆ తర్వాత, షిర్క్ (బహుదైవారాధన), కుఫ్ర్ (అవిశ్వాసం), ప్రవక్తను అగౌరవపరచడం, అల్లాహ్ అవతరింపజేసిన దానిని ద్వేషించడం, జ్యోతిష్కులను సంప్రదించడం, రియా (ప్రదర్శన బుద్ధి), బిద్అత్ (మతంలో కొత్త కల్పనలు), నమాజు వదిలివేయడం, తల్లిదండ్రులను హింసించడం, ఉపకారం చేసి మాట అనడం, ఏకాంతంలో పాపాలు చేయడం, మద్యపానానికి బానిసవ్వడం, అక్రమ సంపాదన, మరియు ఇతరులను అణచివేయడం వంటి 16 నిర్దిష్ట పాపాలను వాటి ఆధారాలతో సహా వివరించారు. అన్ని రకాల పాపాలకు దూరంగా ఉంటూ, ధర్మజ్ఞానాన్ని నేర్చుకుని, ఇహపరలోకాలలో సౌభాగ్యం పొందాలని ప్రసంగం ముగిసింది.

అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహ్. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

ప్రియులారా! ఈరోజు అల్లాహ్ యొక్క దయతో మనం సత్కార్యాలను నశింప జేసే పాప కార్యాలు ఏమిటో తెలుసుకుందాము. అయితే ముందు సూరత్ ముహమ్మద్, ఆయత్ 33:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ وَلَا تُبْطِلُوا أَعْمَالَكُمْ
[యా అయ్యుహల్లజీన ఆమనూ అతీవుల్లాహ వ అతీవుర్రసూల వలా తుబ్తిలూ ఆమాలకుమ్]
ఓ విశ్వాసులారా! అల్లాహ్ యొక్క విధేయత పాటించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధేయత పాటించండి. మీ యొక్క సత్కార్యాలను మీరు నాశనం చేసుకోకండి.

ఈ భావంలో ఖురాన్ లో ఇంకా వేరే ఆయతులు కూడా ఉన్నాయి. అయితే, ఆ పాప కార్యాలు ఏమిటి?, వేటి ద్వారానైతే సత్కార్యాలు నశించిపోతాయో, ఒక్కొక్కటి తెలుసుకునేకి ముందు సంక్షిప్తంగా ఒక నియమం తెలుసుకోవడం చాలా మంచిది. అయితే ఇక్కడ ఒకటే కాదు, పాప కార్యాల వల్ల సత్కార్యాలు ఏవైతే నశించిపోతాయో, దాని యొక్క చిన్న వివరణ ముందు అర్థం చేసుకోండి.

ఒకటి, కొన్ని పాపాలు ఉంటాయి, వాటి ద్వారా సర్వ సత్కార్యాలు నాశనమైపోతాయి.

రెండవది, కొన్ని పాపాలు ఉంటాయి, అవి ఏ సత్కార్యాలలో కలుషితమవుతాయో, ఆ సత్కార్యాలు నాశనమవుతాయి.

మూడవది, సత్కార్యం తర్వాత కొన్ని పాపాలు ఉంటాయి, అవి జరిగితే ఆ సత్కార్యాలు నాశనమవుతాయి.

నాలుగవది, కొన్ని పాపాల వల్ల, కొన్ని రకాల సత్కార్యాలు చూడడానికి నెరవేరుతాయి, కానీ ఆ సత్కార్యాలు పాప పరిహారంగా పనికిరావు లేదా పుణ్యాల రెట్టింపుకు కారణం కావు లేదా అల్లాహ్ వద్ద మనకు ఏ సాన్నిధ్యం లభించాలో అది ప్రాప్తం కాదు.

ఐదవది, కొన్ని రకాల పాపాలు ప్రళయ దినాన త్రాసులో పుణ్యాలకు సమానంగా అయిపోతే, సత్కార్యాలకు సమానంగా అయిపోతే, ఆ సత్కార్యాలు నశించిపోతాయి.

ఆరవది, కొన్ని పాపాలు సత్కార్యాల ద్వారా మనకు వచ్చేటువంటి లాభాలు, వాటిని నశింపజేస్తాయి.

ఏడవ విషయం, చాలా శ్రద్ధగా వినండి. కొన్ని రకాల పాపాలు మనతో జరిగినందుకు, ప్రళయ దినాన మన నుండి, మనలోని పుణ్యాలు ఆ పాపాలకు కారణంగా తీసుకోవడం జరుగుతుంది, వేరేవారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం సత్కార్యాల లాభం నుండి కోల్పోయి మన సత్కార్యాలు నాశనమవుతాయి.

అయితే, ఈ నియమాలు కొన్ని తెలుసుకున్న తర్వాత, ఇక రండి. నేను ప్రతి ఒక్కదానికి దలీల్ ఇక్కడ వివరంగా చెప్పలేను. మీరు చిన్న ప్రయత్నం చేసి చదివి, వెతికే ప్రయత్నం చేయండి. కానీ, నేను ఒక్కొక్క పాపం గురించి తెలియజేస్తాను.

మొదటిది, షిర్క్. దీని గురించి అల్లాహుతాలా సూరతు జుమర్ లో చాలా స్పష్టంగా తెలియజేశాడు, لَيَحْبَطَنَّ عَمَلُكَ [లయహ్బతన్న అమలుక్] (నీ ఆచరణ వ్యర్థమైపోతుంది). ఆయత్ నెంబర్ 65, 66. అలాగే సూరతుల్ అన్ఆమ్, ఆయత్ నెంబర్ 80 తర్వాత నుండి 88వ ఆయత్ లు మీరు చూస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది.

రెండవది, కుఫ్ర్ మరియు ఇర్తిదాద్. షిర్క్ అంటే ముందు తెలుసు కదా, బహుదైవారాధన, ఏ రకమైనది గానీ. రెండవది కుఫ్ర్ మరియు ఇర్తిదాద్. మనిషి ఒక ముస్లింగా ఉండిన తర్వాత కుఫ్ర్ లో పడిపోవడం, సత్యతిరస్కారానికి పాల్పడడం, ఇస్లాంను త్యజించడం, విడనాడడం లేదా ఇర్తిదాద్, ఇస్లాం నుండి బహిష్కరణకు కారణమయ్యేటువంటి పాపానికి ఒడిగట్టడం. సూరతుల్ బఖరా, ఆయత్ నెంబర్ 217 చూడండి.

ఇక మూడవది, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎలా గౌరవించాలో, అలా గౌరవించకపోవడం. దీని గురించి సూరత్ హుజరాత్ లోని ఆయత్ నెంబర్ రెండు చూడవచ్చు.

నాలుగవది, అల్లాహ్ అవతరింపజేసిన విషయాలను అసహ్యించుకోవడం. ఇది కూడా చాలా ఘోరమైన పాపం. సూరత్ ముహమ్మద్, ఆయత్ నెంబర్ 8 మరియు 9 చదవండి.

ఇక, మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అని జ్యోతిష్కుల వద్దకు వెళ్లి చేయి చూపించడం, తెలుసుకోవడం. వీటి ద్వారా కూడా చాలా నష్టం జరుగుతుంది. దీనికి సంబంధించి సహీ ముస్లింలోని హదీస్ నెంబర్ 2230 చూడవచ్చును.

అలాగే, రియాకారి (ప్రదర్శనా బుద్ధి, చూపుగోలుతనం). దీనికి సంబంధించి ఎన్నో ఆయత్ లు కూడా ఉన్నాయి, హదీస్ లు కూడా ఉన్నాయి. అయితే సహీ తర్గీబ్ లో, షేఖ్ అల్బానీ వారిది, హదీద్ నెంబర్ 131లో,

إِنَّ اللَّهَ لَا يَقْبَلُ مِنَ الْعَمَلِ إِلَّا مَا كَانَ لَهُ خَالِصًا وَابْتُغِيَ بِهِ وَجْهُهُ
[ఇన్నల్లాహ లా యఖ్బలు మినల్ అమలి ఇల్లా మా కాన లహూ ఖాలిసన్ వబ్తుగియ బిహి వజ్హుహూ]
నిశ్చయంగా అల్లాహ్ కేవలం తన కొరకు చిత్తశుద్ధితో, ఆయన ప్రసన్నతను ఆశించి చేసే కర్మను తప్ప మరేదీ స్వీకరించడు

అల్లాహ్ యొక్క ప్రసన్నత కోరి ఆయన కొరకే ప్రత్యేకంగా చేయబడిన సత్కార్యాన్ని మాత్రమే అల్లాహ్ స్వీకరిస్తాడు.

ఇక సోదర మహాశయులారా, ఏడవది బిద్అత్.. బిద్అత్ కు పాల్పడడం గానీ, స్వయం బిద్అత్ ను ఏదైనా కనుగొని ప్రజల్లో దాన్ని ప్రచారం చేయడం గానీ, బిద్అత్ విషయాలను పాటించడం గానీ. దీనికి సంబంధించి సహీ బుఖారీ 2697, అలాగే సహీ బుఖారీలో 3243 మరియు సహీ ముస్లింలో కూడా ఈ హదీస్ చాలా ప్రఖ్యాతిగాంచినది.

مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ فِيهِ فَهُوَ رَدٌّ
[మన్ అహ్దస ఫీ అమ్రినా హాదా మా లైస ఫీహి ఫహువ రద్దున్]
ఎవరైతే మా ఈ ధర్మంలో లేనిదాన్ని కొత్తగా కల్పిస్తాడో అది త్రోసిపుచ్చబడుతుంది

ఎనిమిదవది, నమాజులను విడనాడడం. దీనికి సంబంధించి ప్రళయదినాన విషయంలో ఏదైతే మనకు చాలా భయంకరమైన హెచ్చరిక ఇవ్వడం జరిగిందో, ఇబ్నె మాజాలో కూడా ఉంది, షేఖ్ అల్బానీ రహీముహుల్లాహ్ సహీహుల్ జామిలో ప్రస్తావించారు, 2573. మరియు ప్రత్యేకంగా అసర్ నమాజ్ విడనాడడం కారణంగా సర్వ సత్కార్యాలు నాశనమవుతాయి అన్నటువంటి చాలా హెచ్చరిక కూడా సహీ హదీస్ లో వచ్చి ఉంది.

అలాగే తొమ్మిదవది, తల్లిదండ్రుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వారి సేవ, వారి పట్ల ఏదైతే మనం ఉత్తమ రీతిలో మెలగాలో అలా మెలగకుండా ఉండడం. దీనికి సంబంధించి సహీహుల్ జామిఅ 3065లో హదీస్ వచ్చి ఉంది.

ఇక, ఎవరి పట్లనైనా ఏదైనా మేలు చేసి అతని మనస్సు గాయపరచడం. నేను చేయడం వల్ల నువ్వు ఇలా ఇంత పెద్దగా అయ్యావు, ఇంత పైకి వచ్చావు అన్నటువంటి మాటలు చెప్పి మనసు నొప్పించడం. సూరతుల్ బఖరా 264 ఆయత్ నెంబర్ చూడండి.

ఇక, అల్లాహ్ యొక్క భయం లేకుండా ఒంటరితనాల్లో ఉండి పాపాలపై పాపాలు చేస్తూ పోవడం. వారి యొక్క సత్కార్యాలు తిహామా పర్వతాలకు సమానంగా అంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అల్లాహుతాలా బూడిద మాదిరిగా చేస్తాడు అన్నటువంటి హెచ్చరిక సహీహుల్ జామిఅ 5028లో వచ్చి ఉంది. ఇబ్నె మాజాలోని హదీస్ కూడాను ఇది.

అలాగే 13వది, ఎవరైతే మత్తుకు బానిసగా అయిపోతారో, అల్లాహు అక్బర్, వారి గురించి కూడా హెచ్చరిక ఉంది. సహీహుల్ జామిఅ 6313.

ఇక, 14 వది, ఎవరైతే “అల్లాహ్ నిన్ను క్షమించడు” అన్నటువంటి నిర్ణయాలు ఏదైతే అల్లాహ్ చేయవలసి ఉందో, అవి తన చేతిలోకి తీసుకుంటాడో, సహీ ముస్లింలో హదీస్ వచ్చింది, 2621.

15వది, ఎవరైనా విశ్వాసుణ్ణి హతమార్చాలి అన్నటువంటి తపన కలిగి ఉండడం. అలాంటి వారి యొక్క ఫర్జ్ లు, నఫిల్ లు ఏవీ స్వీకరించబడవు అన్నటువంటి హెచ్చరిక ఉంది. సహీహుల్ జామిఅ 6459.

ఇక, 16వది, ఎవరైతే అక్రమ సంపాదన సంపాదిస్తున్నారో, ధర్మ సంపాదన వదులుకొని హరాం పద్ధతులను అవలంబిస్తున్నారో సంపాదించడంలో, వారి గురించి చాలా పొడవైన హదీస్ సహీ ముస్లింలో వచ్చి ఉంది, 1686.

ఇక, అల్లాహ్ యొక్క దాసులపై అన్యాయాలు చేయడం, అన్యాయంగా వారిని తిట్టడం, వారి యొక్క హక్కును కాజేయడం, వారిపై అపనిందలు వేయడం, వారిని కొట్టడం, ఇలాంటి పాపాల వల్ల ప్రళయ దినాన మన పుణ్యాలు వారికి ఇవ్వబడతాయి అన్నటువంటి హెచ్చరిక ఇవ్వడం జరిగింది. ఎవరు దివాలా తీస్తారో అన్నటువంటి ప్రశ్న ఏదైతే ప్రవక్త అడిగారో ఆ హదీస్ లో. హదీస్ నెంబర్ 2581.

సోదర మహాశయులారా, సోదరీమణులారా, సంక్షిప్తాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి, అన్ని రకాల పాపాలకు దూరంగా ఉండాలి, ఎప్పుడైనా ఏ పాపమైనా గానీ మన యొక్క ఏ పుణ్యాలనైనా గానీ భస్మం చేయవచ్చు. అందుకొరకు మనం ప్రతి పాపం నుండి దూరం ఉండే ప్రయత్నం చేయాలి.

ఇన్షా అల్లాహ్ వేరే సందర్భంలో ఏ పుణ్యాల వల్ల కొన్ని పాపాలు మన్నించబడతాయి అన్నటువంటి అంశాన్ని కూడా మనం తెలుసుకుందాము.

ఖురాన్, హదీసులు చదువుతూ ఉండండి. జ్ఞానం, ధర్మ జ్ఞానం నేర్చుకుంటూ ఉండండి. అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో, ప్రవక్త విధానంలో జీవితం గడుపుతూ ఇహపరలోకాలలో సుఖశాంతులు పొందుతూ ఉండండి. అల్లాహ్ మనందరినీ అన్ని రకాల పాపాల నుండి దూరం ఉండే అటువంటి రక్షణలో ఉంచుకొని, సౌభాగ్యాలు మన జీవితంలో మనకు ప్రసాదిస్తూ ఉండుగాక. ఆమీన్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్:
https://teluguislam.net/?p=26625

ఇంటి ఓనర్ కి డబ్బు అప్పు ఇచ్చి, దానికి వడ్డీ తీసుకోకుండా, అతని ఇంట్లో అద్దె ఇవ్వకుండా ఉండవచ్చా? [ఆడియో]

ఇంటి ఓనర్ కి డబ్బు అప్పు ఇచ్చి, దానికి వడ్డీ తీసుకోకుండా, అతని ఇంట్లో అద్దె ఇవ్వకుండా ఉండవచ్చా? [ఆడియో]
https://youtu.be/9_0mCbZ5wWc [5 నిముషాలు]

(తీర్పు దినం రోజు) వడ్డీ సొమ్ము తినేవారు షైతాను పట్టటంవల్ల ఉన్మాది అయిన వాని లాగానే నిలబడతారు. వారికీ దుర్గతి పట్టడానికి కారణం “వ్యాపారం కూడా వడ్డీలాంటిదే కదా!” అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి, వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్ద నుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో, అతను గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం దైవాధీనం. ఇకమీదట కూడా దీనికి పాల్పడినవారే నరకవాసులు. వారు కలకాలం అందులో పడి ఉంటారు.  [అల్ బఖర – 2 : 275 ]

అల్లాహ్ వడ్డీని హరింపజేస్తాడు. దానధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని, పాపిష్టులను అల్లాహ్ సుతరామూ ప్రేమించడు.విశ్వసించి (సున్నత్ ప్రకారం) సత్కార్యాలు చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్ ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, చీకూ చింతగానీ ఉండవు.

ఓ విశ్వసించినవారలారా! అల్లాహ్ కు భయపడండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయినట్లయితే మిగిలిఉన్న వడ్డీని విడిచి పెట్టండి. ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధంకండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరు ఒకరికి అన్యాయం చేయకూడదు. మీకు కూడా అన్యాయం జరగకూడదు. ఒకవేళ రుణగ్రస్తుడు ఇబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకూ అతనికి గడువు ఇవ్వాలి. లేదా మన్నించి దానంగా వదిలి పెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీకొరకు శ్రేయోదాయకం.[అల్ బఖర – 2 : 276 – 280 ]

వడ్డీ:
https://teluguislam.net/category/riba-interest-vaddi/

వడ్డీ (Interest, Riba)

వడ్డీ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1NM8ynZdYubB7u7F0gGvnP

దైవ భీతితో కంటతడి పెట్టటం – హబీబుర్రహ్మాన్ జామి’ఈ [వీడియో]

దైవ భీతితో కంటతడి పెట్టటం – హబీబుర్రహ్మాన్ జామి’ఈ [వీడియో]
https://youtu.be/J1AoCveWZ2s [11 నిముషాలు]

దైవ భీతితో కంటతడి పెట్టటం – హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) [PDF]
https://teluguislam.net/wp-content/uploads/2022/01/rs-54.pdf

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు:

“(పితకబడిన) పాలు తిరిగి పొదుగులోకి వెళ్ళిపోయే వరకూ దైవభీతితో కంటతడి పెట్టినవాడు నరకానికి పోడు. అదేవిధంగా దైవ మార్గంలో లేపబడిన దుమ్ముధూళి, నరకధూమంతో కలవదు.”

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి, హసన్ మరియు సహీహ్ పేర్కొన్నారు. (సుననె తిర్మిజీలోని జిహాద్ ప్రకరణం)

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలియజేశారు:

“అల్లాహ్ నీడ తప్ప మరెలాంటి నీడకనబడని (ప్రళయ) దినాన దేవుడు ఏడుగురిని తన (కారుణ్య) ఛాయలో ఉంచుతాడు. ఆ ఏడుగురు: (1) న్యాయంగా పరిపాలిం చిన పాలకుడు. (2) తన యవ్వనాన్ని దైవారాధనలో గడిపిన యువకుడు. (3) మనసంతా మస్జిద్లోనే ఉండే వ్యక్తి. (4) కేవలం దైవ ప్రసన్నత కోసం పరస్పరం ప్రేమించుకునే ఇద్దరు వ్యక్తులు (అలాగే), దైవ ప్రసన్నత ప్రాతిపదికగా పరస్పరం విడిపోయేవారు. (5) అందం, అంతస్థూ కలిగి వున్న స్త్రీ చెడు కార్యానికి పిలిస్తే తాను దేవునికి భయపడుతున్నానంటూ ఆమె కోరికను నిరాకరించిన వ్యక్తి. (6) కుడి చేత్తో చేసింది ఎడమచేతికి కూడా తెలియ నంత గోప్యంగా దానాలు చేసిన వ్యక్తి. (7) ఏకాంతంలో అల్లాహ్ ను జ్ఞాపకం చేసు కొని (ఆయన భీతితో) కన్నీరు కార్చిన వ్యక్తి.” (బుఖారీ – ముస్లిం)

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ షిఖీర్ (రదియల్లాహు అన్హు) కథనం:

“నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికి వెళ్ళాను. ఆ సమయంలో ఆయన నమాజ్ చేస్తున్నారు. (నమాజ్లో) ఆయన ఏడుస్తుంటే పొయ్యిపై ఉంచిన కుండ శబ్దం చేసినట్టు ఆయన రొమ్ము నుండి శబ్దం రాసాగింది.”

(ఈ హదీసు ప్రామాణికమైనది, అబూ దావూద్ దీనిని ఉల్లేఖించారు. దీన్నే ఇమామ్ తిర్మిజీ ‘షమాయిల్లో ప్రామాణికమైన ఆధారంతో ఉల్లేఖించారు.)

17:109 وَيَخِرُّونَ لِلْأَذْقَانِ يَبْكُونَ وَيَزِيدُهُمْ خُشُوعًا ۩
వారు విలపిస్తూ, ముఖాల ఆధారంగా (సాష్టాంగ) పడిపోతారు. ఈ ఖుర్‌ఆన్‌ వారి అణకువను (వినమ్రతను) మరింత పెంచుతుంది.

19:58 أُولَٰئِكَ الَّذِينَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِم مِّنَ النَّبِيِّينَ مِن ذُرِّيَّةِ آدَمَ وَمِمَّنْ حَمَلْنَا مَعَ نُوحٍ وَمِن ذُرِّيَّةِ إِبْرَاهِيمَ وَإِسْرَائِيلَ وَمِمَّنْ هَدَيْنَا وَاجْتَبَيْنَا ۚ إِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُ الرَّحْمَٰنِ خَرُّوا سُجَّدًا وَبُكِيًّا ۩
అల్లాహ్‌ అనుగ్రహించిన ప్రవక్తలు వీరు. వారు ఆదం సంతతికి చెందినవారు. నూహుతో పాటు మేము ఓడలోకి ఎక్కించిన వారి వంశీయులు. ఇబ్రాహీము, యాఖూబు (ఇస్రాయీలు)సంతతికి చెందినవారు. వారంతా మా ద్వారా సన్మార్గం పొందినవారు, మా చేత ఎన్నుకోబడిన ప్రజల్లోని వారు. వారి ముందు కరుణామయుడైన అల్లాహ్ వచనాలు పారాయణం చేయబడినప్పుడు వారు విలపిస్తూ సాష్టాంగపడేవారు.

53:59 أَفَمِنْ هَٰذَا الْحَدِيثِ تَعْجَبُونَ
ఏమిటీ, మీరు ఈ విషయంపై ఆశ్చర్యపోతున్నారా?
53:60 وَتَضْحَكُونَ وَلَا تَبْكُونَ
నవ్విపోతున్నారా? ఏడుపు రావటం లేదా?