ఆదర్శ సమాజ సంస్థాపనలో హరామ్ మరియు హలాల్ యొక్క ప్రభావం https://youtu.be/B57_ENYyOeo [27 నిముషాలు] షేఖ్ షరీఫ్ హఫిజహుల్లాహ్
ఈ ప్రసంగంలో, వక్త ఒక ఆదర్శ సమాజం యొక్క పునాదుల గురించి వివరిస్తారు. హలాల్ (ధర్మసమ్మతం) మరియు హరాం (నిషిద్ధం) అనేవి కేవలం ఆహారానికి సంబంధించినవి కావని, జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయని స్పష్టం చేశారు. ఆదర్శ సమాజ స్థాపనకు మొదటి మెట్టు షిర్క్ (బహుదైవారాధన)ను విడనాడి తౌహీద్ (ఏకదైవారాధన)ను స్వీకరించడం అని ఉద్ఘాటించారు. తర్వాత, తల్లిదండ్రుల పట్ల విధేయత, అశ్లీలతకు దూరంగా ఉండటం మరియు హలాల్ జీవనోపాధి యొక్క ప్రాముఖ్యతను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించారు. హరాం సంపాదన మరియు వినియోగం వల్ల కలిగే పర్యవసానాలు, ప్రార్థనలు స్వీకరించబడకపోవడం మరియు హృదయం కఠినంగా మారడం వంటివి ఉంటాయని హెచ్చరించారు. చివరగా, సమాజ సంస్కరణకు ప్రతి ఒక్కరూ హలాల్ మరియు హరాం పట్ల స్పష్టమైన అవగాహన కలిగి, వాటిని ఆచరించాలని పిలుపునిచ్చారు.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَبِهِ نَسْتَعِينُ وَالصَّلاةُ وَالسَّلامُ عَلَى رَسُولِهِ الْأَمِينِ، أَمَّا بَعْدُ (అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వబిహీ నస్త’ఈన్, వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్, అమ్మా బాద్) సర్వలోకాల ప్రభువైన అల్లాహ్కే సర్వ స్తోత్రాలు. మేము ఆయన సహాయాన్నే అర్థిస్తాము. మరియు ఆయన యొక్క నమ్మకమైన ప్రవక్తపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.
بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో (ప్రారంభిస్తున్నాను).
كُنتُمْ خَيْرَ أُمَّةٍ أُخْرِجَتْ لِلنَّاسِ تَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَتَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَتُؤْمِنُونَ بِاللَّهِ మానవజాతి (హితం) కోసం వెలికితీయబడిన శ్రేష్ఠమైన సమాజం మీరే. మీరు మంచిని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి వారిస్తారు. అల్లాహ్ను విశ్వసిస్తారు. (3:110)
رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي رَبِّ زِدْنِي عِلْمًا ఓ నా ప్రభూ! నా హృదయాన్ని నా కోసం విశాలపరచు. నా కార్యాన్ని నాకు సులభతరం చెయ్యి. నా నాలుకలోని ముడిని విప్పు, నా మాటను వారు అర్థం చేసుకోగలిగేటట్లు. ఓ ప్రభూ! నా జ్ఞానాన్ని వృద్ధి చేయి.
سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا ۖ إِنَّكَ أَنتَ الْعَلِيمُ الْحَكِيمُ “(ఓ అల్లాహ్!) నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయంగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవూ నీవే!” (2:32)
అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను, షైతాన్ యొక్క కీడు నుండి, షైతాన్ యొక్క చేష్టల నుండి రక్షణ పొందుట కొరకు. అనంత కరుణామయుడు, అపార కృపాప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
ప్రియమైన ధార్మిక సోదరులారా, ధార్మిక సోదరీమణులారా, విశాఖపట్నం జిల్లా జమియత్ అహ్లె హదీస్ ఆధ్వర్యములో ఏర్పాటు చేయబడిన ఆదర్శ సమాజం అనే ఈ ఆధ్యాత్మిక, ధార్మిక సమావేశానికి నేను మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను ప్రియులారా.
హలాల్ మరియు హరాం యొక్క ప్రాముఖ్యత
సోదరులారా, ఈ సమావేశములో నాకు ఇవ్వబడిన అంశము సమాజముపై హరాం మరియు హలాల్ యొక్క ప్రభావం. సోదరులారా, ఏదైనా సమాజం ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దబడాలంటే, ఆ సమాజం అనుసరిస్తున్న పంథాపై సమాజం యొక్క అభివృద్ధి, దాని యొక్క పురోగతి ఆధారపడి ఉంటాయి.
మరి ఇస్లాం ధర్మశాస్త్రం ఈ సమాజాన్ని ఉత్తమ సమాజంగా మార్చటానికి ఏ విధంగా ప్రయత్నిస్తుంది? ఈరోజు మనం ఒక ఆదర్శ సమాజంగా ఏర్పడాలి అంటే ఏం చేయాలి? రోజుకు ఐదు పూటల మస్జిదులో నమాజ్ స్థాపించాం, మనం ఆదర్శ సమాజంగా మారిపోతామా? ఆదర్శ సమాజంగా ఒక సంఘం మారాలి అంటే ఆ సంఘం అల్లాహ్ త’ఆలా నిర్ణయించిన హద్దులకు లోబడి జీవితాన్ని గడపాలి. ఎప్పటివరకైతే అల్లాహ్ త’ఆలా దేనిని అయితే హరాం అన్నాడో దానికి దూరంగా ఉండనంత వరకు, దేనినైతే అల్లాహ్ హలాల్ చేశాడో దానిపై ఆచరించనంత వరకు ఈ సమాజం ఆదర్శ సమాజంగా మారదు ప్రియులారా.
హరాం, హలాల్ అన్న పదాలు మనం వింటూ ఉంటాం సాధారణంగా. ప్రతి దైనందిన జీవితంలో. వాస్తవానికి హరాం అంటే అర్థం ఏంటి? హలాల్ అంటే అర్థం ఏంటి? హరాం అనగా ప్రియులారా, ఆ కార్యం దేనినైతే మనిషి చేస్తాడో అతడు పాపి అవుతాడు. అతగాడికి పాపం ప్రసాదించబడుతుంది. హలాల్ దేన్ని అంటారు? హలాల్ ఆ పని దేనిని చేయటం వల్లనైతే మనిషి పుణ్యాన్ని పొందుతాడో. చిన్న మాట, హరాం చేసినవాడు పాపాన్ని అనుభవిస్తాడు. హలాల్ చేసినవాడు పుణ్యాన్ని పొందుతాడు.
ఆదర్శ సమాజ స్థాపనలో మొదటి మెట్టు: తౌహీద్
ఖురాన్ గ్రంథములో అల్లాహ్ త’ఆలా హరాం హలాల్కు సంబంధించిన మాటలు చాలా చెప్పారు. నేను ఈరోజు ముందు మీ ముందు సూరె అన్’ఆమ్, ఆరవ అధ్యాయము, వాక్యము సంఖ్య 151, 152, 153 వెలుగులో కొన్ని మాటలు చెబుతాను. ఈ వాక్యాలలో అల్లాహ్ ఏమంటున్నారు?
قُلْ تَعَالَوْا أَتْلُ مَا حَرَّمَ رَبُّكُمْ عَلَيْكُمْ (ఓ ప్రవక్తా!) వారికి చెప్పండి: రండి! మీ ప్రభువు మీకు ఏ విషయాలను హరాం చేశాడో నేను బోధిస్తాను.
అల్లాహ్ త’ఆలా దేన్ని హరాం చేశారు?
أَلَّا تُشْرِكُوا بِهِ شَيْئًا మీరు అల్లాహ్తో పాటు షిర్క్ చేయకండి.
ఏదైనా సమాజం ఉన్నత సమాజంగా, ఆదర్శ సమాజంగా మారాలి అంటే ఆ జాతిలో షిర్క్ ఉండకూడదు. ఈరోజు మనం షిర్క్ చేసినట్లయితే మనం ఎన్నటికీ ఆదర్శ సమాజంగా మారలేము. కాబట్టి మొదటి మాట, మనం తౌహీద్ పైకి రావాలి. ఈరోజు తౌహీద్ వైపునకు మనం రాకపోతే ప్రపంచంలో మనం ఆరాధన చేస్తున్నాం కానీ తౌహీద్ యొక్క మూల స్తంభాలు మనం తెలుసుకోలేదు.
గురువుగారు ఒక పుస్తకం పేరు చెప్పారండి. ఈరోజు మనం అహ్లుల్ హదీస్, ఖురాన్ హదీస్ పై ఆచరించే వారం. గురువుగారు చెప్పిన పుస్తకం గనక మనము చదివి ఉండకపోతే మనలో చిన్న లోపం ఉన్నట్టు ప్రియులారా. గురువుగారు చెప్పిన పుస్తకం పేరు ఏంటి? ఉసూలు స్సలాసా (మూడు మూల సూత్రాలు). ధర్మం యొక్క మూడు ప్రాథమిక మూల సూత్రాలు. మీరు చనిపోయిన తర్వాత మీ సమాధిలో ప్రశ్నింపబడే మూడు ప్రశ్నలు. నీ దైవం ఎవరు? నీ ధర్మం ఏమిటి? నీ ప్రవక్త ఎవరు? ఒక చిన్న పుస్తకం, తౌహీద్ యొక్క జ్ఞానాన్ని మనం పొందాలి ప్రియులారా. ఈరోజు రోజుకు ఐదు పూటల నమాజ్ ఆచరిస్తున్నాం, కానీ మన సమాజానికి ప్రశ్నించండి. సోదరులారా, చెవియొగ్గి వినండి. ప్రశ్నించండి. అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు? అని అడిగితే ఈరోజు మనలో చాలామందికి సరిఅయిన జవాబు తెలియదు. అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు? అని అడిగితె కొంతమంది హర్ జగహ్ అల్లాహ్ హై భాయ్ అని అంటారు . అరే! మరి అల్లాహ్ ఖురాన్ లో ఏమి చెబుతున్నాడో చూడండి :
الرَّحْمَنُ عَلَى الْعَرْشِ اسْتَوَى అనంత కరుణామయుడు అర్ష్ పై ఆసీనుడై ఉన్నాడు. (20:5)
ఇది తౌహీద్, అఖీదా ప్రియులారా. అల్లాహ్ త’ఆలాకి రూపం ఉందా? అనేక మంది అంటారు అల్లాహ్ నిరాకారుడు అని. లేదు ప్రియులారా, అల్లాహ్ ఆకారం కలిగి ఉన్నాడు. కానీ అల్లాహ్ యొక్క ఆకారం ఎలా ఉందో మనకు తెలియదు ప్రియులారా.
కాబట్టి ఆదర్శ సమాజం యొక్క స్థాపనలో మూల స్తంభం తౌహీద్ పై నిలబడటం. ఎవరైతే తౌహీద్ పై నిలబడతారో ప్రపంచములో శాంతి ఏర్పడుతుంది.
ఈరోజు ముస్లిం సమాజమా, నీ యొక్క బాధ్యత, ఈ రోజు ప్రపంచానికి మనం అల్లాహ్ యొక్క ఏకత్వం వైపునకు దావత్ ఇవ్వాలి. ఈరోజు ప్రపంచంలో మనుషులు మతాలు, కులాలు, ముఠాలు, వర్గాలుగా ముక్కలైపోయారు. వీరినందరినీ మనము గనక మనందరి సృష్టికర్త ఒక్కడే అన్న నినాదం వైపునకు తీసుకువస్తే ప్రపంచములో ఆదర్శ సమాజం ఏర్పడుతుంది. దీని కోసం మనం ఎంతవరకు పని చేస్తున్నాం? ఈ తౌహీద్ యొక్క ప్రభావం ప్రపంచములో ఉంటుంది. తౌహీద్ యొక్క ప్రభావం ఆఖిరత్ లో ఉంటుంది. కేవలం అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్ అని చెప్పేస్తారు కానీ మూఢనమ్మకాలపై విశ్వాసం. ఒక తుమ్మితే బయటకు వెళ్ళకపోవటం, జ్వరం వస్తే తావీజు కట్టుకోవటం, ఇంకా నిమ్మకాయలపై, గుమ్మడికాయలపై, రాళ్లపై, చెట్లపై నమ్మకం పెట్టుకుంటే మనకి స్వర్గము లేదు.
ఎవరు సాఫల్యం చెందుతాడు?
الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا إِيمَانَهُم بِظُلْمٍ ఎవరైతే అల్లాహ్ను విశ్వసించిన తర్వాత తమ ఈమాన్ను షిర్క్తో కలుషితం చేయరో,
أُولَئِكَ لَهُمُ الأَمْنُ అలాంటి వారి కొరకు శాంతి ఉంది. (6:82)
కాబట్టి, ఆదర్శ సమాజం యొక్క స్థాపనలో మనం చేయాల్సిన మొదటి పని అల్లాహ్ యొక్క తౌహీదులోనికి పూర్తిగా ప్రవేశించాలి. అల్లాహ్ యొక్క తౌహీదులోనికి మనం వచ్చేస్తే ప్రపంచంలో శాంతి ఉంది. ఆఖిరత్లో ఏముంది?
إِنَّ الَّذِينَ قَالُوا رَبُّنَا اللَّهُ ثُمَّ اسْتَقَامُوا تَتَنَزَّلُ عَلَيْهِمُ الْمَلائِكَةُ أَلاَّ تَخَافُوا وَلا تَحْزَنُوا وَأَبْشِرُوا بِالْجَنَّةِ الَّتِي كُنتُمْ تُوعَدُونَ ఎవరైతే, “అల్లాహ్ యే నా ప్రభువు” అని పలికిన పిదప, దానిపై స్థిరముగా నిలబడిపోయాడో, అలాంటి వారి వైపునకు వారు మరణించే సమయంలో దైవదూతలు వస్తారు, వారితో చెబుతారు: మీరు భయపడకండి, మీరు దుఃఖించకండి. అల్లాహ్ మీ కొరకు స్వర్గం యొక్క వాగ్దానము చేశాడు. (41:30)
ప్రియులారా, మొదటి మాట. ఇంకొకసారి విన్నవిస్తున్నాను. ప్రసంగాలు అవుతూ ఉంటాయి, వచ్చి కూర్చుంటాం, వెళ్ళిపోతాం. మనం జ్ఞానాన్ని ఆర్జించకపోతే మన జీవితాలలో తౌహీద్, అఖీదా రాదు. నేను విన్నవిస్తున్నాను, ఉసూలే స్సలాసా పుస్తకాన్ని చదవండి. నేను అభ్యర్థిస్తున్నాను, మనం ఇన్షా అల్లాహ్ త’ఆలా ఒక పుస్తకాన్ని చదివి తౌహీద్ యొక్క జ్ఞానాన్ని మన జీవితాల్లో తీసుకువద్దాం. అప్పుడే మన సమాజం ఆదర్శ సమాజంగా మారగలదు.
తల్లిదండ్రుల పట్ల విధేయత
ఇక రెండవ మాట ప్రియులారా, అల్లాహ్ అంటూ ఉన్నారు, ఆదర్శ సమాజం ఏర్పాటు కావటానికి మీరు చేయాల్సిన పని ప్రియులారా,
وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا మీరు మీ తల్లిదండ్రులతో చక్కగా వ్యవహరించండి, వారిని గౌరవించండి.
ఈ సమాజం ఎంత గొప్ప సమాజంగా మారిపోయినా, తల్లిదండ్రి యొక్క విధేయత లేనంత వరకు ఈ సమాజం ఆదర్శ సమాజం కాలేదు. షిర్క్ ఎంత హరామో, తల్లిదండ్రి విశ్వాసులైతే వారి అవిధేయత అంతే హరాం. అల్లాహ్ ఖురాన్లో ఎక్కడ తౌహీద్ యొక్క ప్రస్తావన చేసినా వెంటనే తల్లిదండ్రి విధేయత గురించి అల్లాహ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హుమా హదీసుల్లేఖిస్తున్నారు. ప్రవక్త అంటున్నారు: “రిధా రబ్బీ ఫీ రిధల్ వాలిదైన్.” అల్లాహ్ యొక్క సంతృప్తి, అల్లాహ్ యొక్క ఆనందం, అల్లాహ్ యొక్క సంతుష్టీకరణ మీ తల్లిదండ్రిని గనక మీరు సంతోష పెడితే అందులో అల్లాహ్ యొక్క సంతోషం ఉంది. మీ తల్లిదండ్రిని గనక మీరు ఇష్టపెట్టకపోతే మీతో అల్లాహ్ ఇష్టపెట్టడు. కాబట్టి ఈరోజు ఆదర్శ సమాజం అన్న ఈ కాన్ఫరెన్స్ ద్వారా నేను మీకు ఇస్తున్న రెండో సందేశం, తల్లిదండ్రి విధేయత.
అదే అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హుమా ఒక వ్యక్తిని చూశారు. ఆ వ్యక్తి యమన్ దేశము నుండి కాబాకు వచ్చి తన తల్లిని భుజాలపై కూర్చోబెట్టుకొని కాబా ప్రదక్షిణ చేస్తున్నాడు. ప్రదక్షిణ అయిన తర్వాత ఆ వ్యక్తి అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హుమా వద్దకు వచ్చి అడిగాడు: “అయ్యా, ఈమె నా తల్లి. ఈమెను నేను నా భుజాలపై కూర్చోబెట్టుకొని కాబా యాత్ర చేశాను. నేను ఈమె యొక్క హక్కును, ఈమె రుణాన్ని నేను చెల్లించానా? ఈమె హక్కును నేను చెల్లించానా?” అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హుమా అంటున్నారు: “నీ మాతృమూర్తి నీకు జన్మనిచ్చినప్పుడు పడిన కష్టములో, పడిన బాధలో ఒక శ్వాస యొక్క రుణాన్ని కూడా నీవు నీ తల్లితో తీర్చుకోలేదయ్యా” అన్నారు. అల్లాహు అక్బర్! ప్రియులారా, ఆదర్శ సమాజం యొక్క స్థాపనలో తల్లిదండ్రి విధేయత మహోన్నతమైన స్థానాన్ని కలిగి ఉంటుంది.
అశ్లీలతకు దూరంగా ఉండటం
ఇక నా అంశములో మూడవ మాట ప్రియులారా, ఆదర్శ సమాజం యొక్క స్థాపనలో ఏ హరాం విషయముల నుండి మనం దూరంగా ఉండాలి? అల్లాహ్ అంటున్నారు:
وَلَا تَقْرَبُوا الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ మీరు అశ్లీలం దరిదాపులకు వెళ్ళకండి, బహిరంగంగా చేసే అశ్లీలం మరియు గుట్టు చప్పుడు కాకుండా చేసే అశ్లీలం.
అల్లాహ్ అంటున్నారు, మీరు అశ్లీలం దరిదాపులకు వెళితే సమాజం ఉత్తమ సమాజంగా మారదు. ఎలాంటి అశ్లీలం? అల్లాహ్ అంటున్నారు, బాహాటంగా చేసే అశ్లీలం, గుట్టు చప్పుడు కాకుండా, నన్ను ఎవరూ చూడటము లేదే అని మనము చేసే అశ్లీలం. అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథములో చెడు పని చేయకండి అని చెప్పలేదు, చెడు పని దరిదాపులకు కూడా వెళ్ళకండి అన్నారు.
అశ్లీలం అంటే ఏంటి? ఈరోజు అశ్లీలం రకరకాలుగా ఉంది. సంగీతం అశ్లీలం, పాటలు అశ్లీలం, చలన చిత్రాలు అశ్లీలం, వస్త్రధారణలో అశ్లీలం, ప్రేమ పేరుతో జీవితాన్ని నాశనం చేయటం, ప్రేమకు ముందు అశ్లీలం.
వలీ లేకుండా నికాహ్ చేసుకొని సమాజములో అశ్లీలం. ఈరోజు ఆదర్శ సమాజం ఏర్పాటు చేయాలంటే మన నికాహ్ వ్యవహారాలు ఈరోజు ఎలా ఉన్నాయి ప్రియులారా? నాకు బాధనిపిస్తుంది. నేను ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తిరుగుతాను. ఏ విధంగా ఉంది అంటే, వారు ఎవరో అంటున్నారు ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలతో నికాహ్ చేసుకుంటున్నారు, ఫలానా జిహాద్ ఏదో అంటున్నారు. అది కాదు, దానికి విరుద్ధంగా జరుగుతుంది. మన ఆడపిల్లలు ప్రియులారా, ఈరోజు సమాజంలో అల్లాహ్ రక్షించాలి. ప్రియమైన సోదరీమణులారా, మీరు గనక వింటే అశ్లీలం హరాం. అశ్లీలం నిషిద్ధం ప్రియులారా. అశ్లీలానికి దూరంగా ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేము.
పదండి చూద్దాం. అశ్లీలం అంటే ఏంటి? పాటలు. సినిమా పాటలు మనం వింటున్నాం. ఏవండీ, మ్యూజిక్ ఏంటండీ? మ్యూజిక్ హరాం అండీ అని చెబితే ఈరోజు అంటారు, “అరే! మనసు బాగాలేదండీ. అశ్లీలంతో కూడిన సంగీతం, సాధారణ సంగీతం వింటే మనసుకు వినసొంపుగా ఉంటుంది” అని అంటారు. ఇబ్నె తైమియా రహిమహుల్లాహ్ త’ఆలా అంటున్నారు, “అది మద్యము. మనిషి హృదయానికి సంగీతం మద్యపానము లాంటిది. సంగీతం ఎలాగైతే మనిషిని, మద్యపానం ఎలాగైతే నాశనం చేస్తుందో, సంగీతం మనిషిని నాశనం చేస్తుంది.”
ఈరోజు ప్రేమ పేరుతో వివాహాలు. మీ తల్లిదండ్రి నిన్ను కని, జన్మనిచ్చి, పెంచి పోషిస్తే, తల్లిదండ్రి యొక్క గౌరవాన్ని బజారులో కలపటం ఆదర్శ సమాజం కాదు. మొబైల్ లో హరాం చూస్తే, దీని పర్యవసానం ఏంటి?
సౌబాన్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు: ప్రవక్త వారు ఇలా అంటున్నారు: “నా సమాజములో కొంతమంది ప్రళయ దినాన తిహామా పర్వతమంత పరిమాణములో పుణ్యాన్ని తీసుకు వస్తారు.” కానీ అల్లాహ్ ఏం చేస్తాడు? “హబా అమ్ మన్సూరా.” వారి యొక్క పుణ్య కార్యాలను అల్లాహ్ ధూళి చేసేస్తాడు, దుమ్ము చేసేస్తాడు. వారి పుణ్య కార్యాలు పనికి రావు. తిహామా పర్వతమంత పరిమాణంలో పుణ్య కార్యాలు. ప్రవక్తా! ఏమై ఉంటుంది వారి జీవితం? వారు మాలాగా విశ్వసిస్తారే, నమాజును స్థాపించే వారే కదా? ప్రవక్త అంటున్నారు, వారు ఏకాంతములో హరాం పనులు చేసేవారై ఉంటారు. నీ జీవితం లో నమాజ్ మరియు మిగతా మంచి పనులు చేస్తావు. కానీ ఏకాంతములో నీవు చేసిన హరాం పని ప్రళయ దినాన నీ ఆచరణ మొత్తాన్ని తుక్కు చేసేస్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి.
ఇక ఆఖరి చివరి మాట. ఈరోజు ఇస్లాం ధర్మంలో స్త్రీకి అల్లాహ్ త’ఆలా హిజాబ్ను ఇచ్చాడు. ఈరోజు మన సోదరీమణులు హిజాబ్ లేకుండా తిరుగుతున్నారు. ఇది అశ్లీలం కాదా ప్రియులారా? హిజాబ్ లేకుండా తిరగటం అశ్లీలము కాదా? ఈరోజు ఇంట్లో బయలుదేరి హిజాబ్ ఒంటిపై ఉంటుంది, ఇంటి నుండి వెళ్ళిన తర్వాత హిజాబ్ బ్యాగులో ఉంటుంది. ఇది ఎక్కడి ఈమాన్ ప్రియులారా? తల్లిదండ్రులారా, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, మీ పిల్లల యొక్క ట్రైనింగ్ మనం ఉత్తమ పద్ధతిలో చేయాలి. నా కూతురు అండి, నాకు ప్రేమ. కూతురికి ఏం చెప్పలేకపోతున్నాను. కూతుర్ని ఏం చేయలేకపోతున్నాను. ప్రవక్త వారు ఫాతిమా రదియల్లాహు త’ఆలా అన్హా గురించి ఏమన్నారు? ఫాతిమా నా శరీరంలో ముక్క(ఒక భాగం) . అంటే ఫాతిమాను అంత ప్రవక్త వారు ప్రేమించేవారు. ఒకసారి జుహైనా తెగకు చెందిన స్త్రీ దొంగతనం చేసింది. ఆ దొంగతనానికి సంబంధించి ప్రవక్త వారు చెయ్యి కత్తిరించమని ఆజ్ఞ ఇచ్చారు. రికమెండేషన్ వచ్చింది. ప్రవక్త ఏమన్నారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణం ఎవరి చేతిలో ఉందో అల్లాహ్ సాక్షిగా! నా శరీరంలో ముక్క అయిన ఫాతిమా దొంగతనము చేసినా, ఈ ముహమ్మద్ తన కూతురు ఫాతిమా యొక్క చేతులు కత్తిరిస్తాడు. సుబ్ హా నల్లాహ్! కూతుర్ని ప్రవక్త ప్రేమించారు, కానీ ఏమంటున్నారు? హరాం పని చేస్తే కూతుర్ని కూడా ప్రవక్త శిక్షించటానికి వెనుకాడలేదు.
ఈరోజు మన ఇండ్లు ఎలా ఉన్నాయి? సోదరీమణులారా, మీరు వినండి. హిజాబ్ అల్లాహ్ త’ఆలా ఆకాశాల పై నుండి స్త్రీలకు ఇచ్చిన వరం ప్రియులారా. ఒక నల్లటి నీగ్రో స్త్రీ ప్రవక్త వద్దకు వచ్చింది: “ప్రవక్తా!” “చెప్పమ్మా.” “ప్రవక్తా!” “చెప్పు.” “నాకు మూర్ఛ వ్యాధి ఉంది ప్రవక్తా. మూర్ఛ వ్యాధి వస్తే, మూర్ఛ వ్యాధికి శరీరం కొట్టుకొని కింద పడిపోతాను ప్రవక్తా. కింద పడిపోయిన సమయంలో నా శరీరంపై బట్టలు అటూ ఇటూ చిందరవందర అయిపోతాయి. తమరు అల్లాహ్ తో దుఆ చేయండి, నాకు మూర్ఛ వ్యాధి తగ్గిపోవాలని.” ప్రవక్త అన్నారు: “అమ్మా! ఆ మూర్ఛ వ్యాధిపై ఓర్పు వహించు. అల్లాహ్ నీకు స్వర్గాన్ని ఇస్తాడు. లేదంటావా, నువ్వు ప్రార్థించమంటావా, నేను ప్రార్థిస్తాను తల్లి. కానీ స్వర్గం యొక్క వాగ్దానం చేయను.” ఆ స్త్రీ అంటుంది: “లేదు ప్రవక్తా, ఆ వ్యాధిపైనే జీవితం గడిపేస్తాను. కానీ ఒక్క దుఆ చేసి పెట్టండి ప్రవక్తా. ఎప్పుడైతే ఆ వ్యాధి వచ్చి, మూర్ఛ వచ్చి నేను కింద పడిపోతానో, నా దేహంపై బట్టలు చిందరవందర అయిపోతాయి కదా ప్రవక్తా. అల్లాహ్ తో దుఆ చేయండి, ఆ మూర్ఛ వ్యాధి వచ్చి నేను కింద పడిపోతే, నా శరీరంపై బట్టలు చిందరవందర కాకూడదు, పరపురుషుడు నా దేహాన్ని చూడకూడదు.” అల్లాహు అక్బర్! ఈరోజు మన సోదరీమణులు ఎక్కడ ఉన్నారు?
హలాల్ జీవనోపాధి మరియు దాని ప్రభావం
ప్రియులారా, ఇక మనం మాట్లాడుకుంటే సోదరులారా, ఈరోజు మనం ఆదర్శ సమాజం స్థాపించటానికి చేయాల్సిన పని, మనం తినేది హలాల్ అవ్వాలి. అల్లాహ్ ఏమన్నారు ఇదే వాక్యాలలో? “వ అవుఫుల్ కైల.” మీరు ఎప్పుడైతే కొలతలు తూస్తారో చక్కగా తూకం చేయండి. “వల్ మీజాన బిల్ ఖిస్త్.” మీరు ఎప్పుడైతే త్రాసు చూస్తారో త్రాసును చక్కగా చూడండి. మనం నమాజ్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ హరాం తింటున్నాం. ఈ హరాం గొప్ప డేంజర్ అండి. మనం దేన్ని తింటున్నాం పొట్టలో?
يَا أَيُّهَا الرُّسُلُ كُلُوا مِنَ الطَّيِّبَاتِ وَاعْمَلُوا صَالِحًا ఓ ప్రవక్తలారా! తయ్యిబ్ (పవిత్రమైన) హలాల్ తినండి మరియు సత్కార్యాలు చేయండి. (23:51)
ఈ వాక్యం ద్వారా ఉలమాలు రాస్తున్న మాట ఏంటి? ఎవడైతే హలాల్ తింటాడో వాడే సత్కార్యము చేయగలడు. హరాం తిన్నవాడు సత్కార్యము చేయలేడు. ప్రపంచంలో, హరాం యొక్క పర్యవసానాలు ఏంటి? వడ్డీ కానివ్వండి, తూకములో లోపము చేయటం కానివ్వండి, అబద్ధపు సాక్ష్యం చెప్పి వస్తువు అమ్మటం కానివ్వండి, అబద్ధపు ప్రమాణాలు చేయనివ్వండి. డబ్బు అయితే వచ్చేస్తుంది. దీని పర్యవసానాలు? “ఇన్నల్లాహ తయ్యిబ్, లా యఖ్బలు ఇల్లత్ తయ్యిబా.” అల్లాహ్ పరిశుద్ధుడు, పరిశుద్ధము కాకుండా ఏమీ స్వీకరించడు. మనం తినేది హరాం, సంపాదన హరాం. అబద్ధము చెప్పి, దొంగతనము చేసి, మోసము చేసి, కల్తీ చేసి అమ్మేస్తున్నాను. అల్లాహ్ ఆరాధన స్వీకరించడు.
మొదటి హదీస్, ఒక వ్యక్తి మక్కా వెళ్ళాడు, కాబాకు వెళ్ళాడు. చేతులు పైకెత్తాడు: “అల్లాహ్! నా ప్రార్థన ఆలకించు.” అల్లాహ్ అన్నాడు, “వీడి బట్ట హరాం, వీడి తిండి హరాం, వీడు హరాం”. వీడి యొక్క దుఆ అల్లాహ్ త’ఆలా ఎలా స్వీకరిస్తాడు? సుబ్ హా నల్లాహ్! ఆలోచించండి, హరాం తింటే వాటి ఏం జరుగుతుంది?
సుఫ్యాన్ అసౌరీ రహిమహుల్లాహ్ యొక్క శిష్యుడు, అతని పేరు యూసుఫ్ అస్బాత్. ఆయన అన్నారు, షైతాన్ ఏం చేస్తాడట? షైతాన్ ఉదయాన్నే తన సైన్యాన్ని పంపుతాడు: “అరే ఎవరు ఆరాధన చేస్తున్నారో చూసుకొని రా.” ఎప్పుడైతే వెళ్లి ఒక వ్యక్తి హరాం తింటున్నాడు తెలుస్తుందో వెంటనే అంటాడు షైతాన్: “వాడి వద్దకు నువ్వు వెళ్ళొద్దు. వాడి హరాం వాడిని నాశనం చేసేస్తుంది.”
అదే హలాల్ తింటే మన ఇండ్లు సంస్కరించబడతాయి, మన యొక్క సమాజం సంస్కరించబడుతుంది. సలఫ్ ఎలా ఉండేవారు తినటంలో? అబ్దుల్లా బిన్ ముబారక్ రహిమహుల్లాహ్ ఒక గొప్ప విద్యావంతుడు. అబ్దుల్లా బిన్ ముబారక్ వాళ్ళ తండ్రి ముబారక్ ఒక దానిమ్మ తోటలో పని చేసేవారు. చాలా రోజులకు దానిమ్మ తోట యజమాని వచ్చి అన్నాడు: “ముబారక్! ఒక దానిమ్మ చెట్టు నుండి ఒక దానిమ్మ పండు తీసుకురా.” ముబారక్ వెళ్లారు. దానిమ్మ చెట్టు నుండి దానిమ్మ పండు తీసుకువచ్చారు యజమానికి ఇచ్చారు. యజమాని తిన్నాడు, పుల్లగా ఉంది. “ముబారక్! ఇంకో దానిమ్మ పండు తీసుకురా.” హజరతే ముబారక్ రహిమహుల్లాహ్ వెళ్లారు. ఇంకో దానిమ్మ పండు తీసుకువచ్చారు, అదీ పుల్లగా ఉంది. అడిగారు యజమాని: “ఏమయ్యా! ఇన్నేళ్ల బట్టి నా తోటలో పని చేస్తున్నావు. ఏ చెట్టు దానిమ్మ పండు పుల్లగా ఉంటుందో, ఏ చెట్టు దానిమ్మ పండు తియ్యగా ఉంటుందో నీకు తెలియదా?” ముబారక్ అన్నారు: “అయ్యా, నేను మీ తోటలో కాపలా వాడిని. ఏ పండు ఎలా ఉందో చెక్ చేసే వాడిని కాదు. ఈ రోజు వరకు ఏ పండు ఎలా ఉంటుందో నేను తినలేదయ్యా.” యజమాని సంతోషపడ్డాడు. తన కూతురిని ముబారక్కి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇద్దరికీ కలిగిన సంతానం అబ్దుల్లా బిన్ ముబారక్ రహిమహుల్లాహ్.
బుఖారీ రహిమహుల్లాహ్ నాన్న ఇస్మాయిల్ అంటారు,: “నా ఇంట్లో ఒక్క దిర్హము కూడా హరాం ప్రవేశించలేదు.” హరాం కాదు, అనుమానాస్పదము కూడా. పర్యవసానం? బుఖారీ రహిమహుల్లాహ్ వచ్చారు. కాబట్టి ఆదర్శ సమాజ సంస్థాపనకు మనం తింటున్న ఆహారం, మనం చేస్తున్న వ్యాపారం చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. లేదంటారా, ప్రపంచంలో మన హృదయం కఠినమైపోతుంది.
హసన్ బస్రీ రహిమహుల్లాహ్ అంటారు: “ఈ ప్రపంచములో అల్లాహ్ మనిషికి ఇచ్చే అతి పెద్ద శిక్ష, హరాం తినటం వల్ల వాడి హృదయం బండరాయి మాదిరిగా అయిపోతుంది.” ప్రేమ, కారుణ్యం వాడి హృదయంలో ఉండవు. కాబట్టి, మనం ఈరోజు ఈ యొక్క ఆదర్శ సమాజాన్ని స్థాపించాలంటే ఈ మార్గంపై నడవాలి ప్రియులారా. ప్రవక్త ఈ వాక్యాలు చెప్పి అదే అన్నారు:
وَأَنَّ هَذَا صِرَاطِي مُسْتَقِيمًا فَاتَّبِعُوهُ وَلاَ تَتَّبِعُواْ السُّبُلَ فَتَفَرَّقَ بِكُمْ عَن سَبِيلِهِ ذَلِكُمْ وَصَّاكُم بِهِ لَعَلَّكُمْ تَتَّقُونَ ఇది నా మార్గం. దీనిపై అనుసరించండి. మీరు నా మార్గంపై ఉంటారు. నా మార్గాన్ని విడిచిపెట్టేస్తే మీరు వేరే మార్గాలపై వెళ్ళిపోతారు.
అల్లాహ్ త’ఆలా మనందరికీ ప్రవక్త వారు, అల్లాహ్ బోధించిన ఈ మార్గంపై నడిచే సద్భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. “సన్మార్గం వైపునకు ఆహ్వానించే వానికి అతని ద్వారా సన్మార్గం పొందిన వారికి లభించినంత పుణ్యఫలం లభిస్తుంది. (అయితే) వారి ప్రతిఫలంలో మటుకు ఎటువంటి కొరతా రాదు. (ఇకపోతే) మార్గవిహీనత వైపునకు పిలిచే వ్యక్తికి, అతని ద్వారా మార్గభ్రష్టులైన వారికి లభించినంత దుష్ఫలం లభిస్తుంది. కాగా, ఆ మార్గభ్రష్టుల దుష్కర్మలు తగ్గటమూ జరగదు.” (ముస్లిం)
ఈ పవిత్ర హదీసు ద్వారా రూఢీ అయ్యేదేమిటంటే సౌశీల్యం దైవ మార్గదర్శకత్వాల ప్రాతిపదికలపై అల్లాహ్ వైపునకు, సత్కార్యాల వైపునకు సందేశం ఇచ్చేవాడు ఎంతో ఆదరణీయుడు. అతనికి లభించే ప్రతిఫలం అపారం. దాన్ని అతను ఊహించనైనా లేడు. అల్లాహ్ శుభవార్త ఇచ్చాడు :
అల్లాహ్ వైపు (జనులను) పిలుస్తూ, సత్కార్యాలు చేస్తూ ‘నేను విధేయుల (ముస్లింల)లో ఒకడను’ అని పలికేవాని మాటకంటే మంచిమాట మరెవరిది కాగలదు?(హామీమ్ సజ్దా 41 : 33)
అల్లాహ్ వైపునకు ఆహ్వానించే వాని మాటకు అంతటి ఉన్నత స్థానం ఎందుకివ్వబడిందంటే అతని మాట ద్వారా ఎంతోమంది దైవ మార్గదర్శకత్వం పొందుతారు. వారందరికీ ఆ మహాభాగ్యం లభించటానికి కారకుడైనందుకు గాను వారు సంపాదించినంత పుణ్యం ఇతనికి కూడా ప్రాప్తిస్తుంది. సత్య సందేశానికి ఉన్న ప్రాధాన్యత ఎంతటిదో ఈ ఒక్క హదీసు ద్వారా అంచనా వేయవచ్చు.
పోతే; మార్గ విహీనత, మార్గభ్రష్టతల వైపునకు ప్రజలను పిలవటం మహా పాతకం. అదెంత ఘోరమయిన అపరాధం అంటే అతని ద్వారా ఎంతమంది మార్గభ్రష్టులయ్యారో, అంతమందీ ఎన్ని పాపాలు చేశారో అన్ని పాపాల భారం అతని పై కూడా పడుతుంది. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించినట్లు హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) చెప్పారు : “ఏ ప్రాణీ అన్యాయంగా వధించబడినా దాని రక్తపు భారం ఆదం యొక్క మొదటి కుమారునిపై పడుతుంది. ఎందుకంటే మొదటి హత్య చేసిన వాడు అతనే.” (బుఖారీ, ముస్లిం, తిర్మిజి)
ఆదం కుమారుడైన ఖాబైల్, మరో కుమారుడైన హాబైల్ని హతమార్చాడు. లోకంలో అది మొట్టమొదటి హత్య. ప్రళయదినం వరకు ఎన్ని హత్యలు జరిగినా వాటి పాపం ఖాబైల్ ఖాతాలోకి వెళుతూనే ఉంటుంది. ఎందుకంటే అతనే హత్యల ద్వారం తెరిచాడు. ఈ విధంగానే చెడుల వైపునకు ప్రజలను పురికొల్పేవాడు కూడా ప్రళయం వరకు అతని అనుయాయులు చేసిన పాపభారాన్ని మోస్తూ ఉంటాడు. మరోవైపు ఆ చెడులు చేసే వారి దుష్పలం కూడా ఏమాత్రం తగ్గదు.
“ఎవరయితే సన్మార్గం వైపునకు ఆహ్వానిస్తారో…”
“ఎవరయితే మార్గ విహీనత వైపునకు పిలుస్తారో….”
అన్ని రకాల పిలుపు లేక ఆహ్వానం ఇందులో ఇమిడిఉంది. అది మూజువాణీగా కావచ్చు, సైగ ద్వారా కావచ్చు, ఆచరణ ద్వారా కావచ్చు, వ్రాతపూర్వకంగా కూడా కావచ్చు. ఇక్కడ సన్మార్గం అంటే దైవాదేశాలు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పవిత్ర పలుకులకు సంబంధించిన విషయం. అల్లాహ్ సెలవిచ్చాడు :
మేము వారితో అన్నాము: “మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి. నా ఉపదేశం ఎప్పుడు మీ వద్దకు వచ్చినా, దాన్ని అనుసరించే వారికి ఎలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.”(అల్ బఖర 2 : 38)
ఇక్కడ ‘నా తరఫు ఉపదేశం’ అంటే ఆకాశ గ్రంథాలు ప్రవక్తల ప్రబోధనలని భావం. అల్లాహ్ తరఫున అవతరించిన ఆదేశాలను పాటించటం, దైవప్రవక్తకు విధేయత చూపటం కూడా సన్మార్గానుసరణగానే భావించబడుతుంది.
(ప్రజలారా!) మీ ప్రభువు తరఫున మీకు వొసగబడిన దానిని మీరు అనుసరించండి. అల్లాహ్ను వదలి ఇతర సంరక్షకులను అనుసరించకండి. మీరు బహుకొద్దిగా మాత్రమే హితబోధను గ్రహిస్తారు.(అల్ ఆరాఫ్ : 3)
(అంతలోనే ఆ) నగరం చివరి వైపు నుంచి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు : “ఓ నా జాతివారలారా! మీరు ప్రవక్తలను అనుసరించండి. మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగని వారి, సన్మార్గాన ఉన్న వారి వెనుక నడవండి.”(యాసీన్ : 20, 21)
ఏ గ్రంథమైతే దైవోపదేశాలకు, దైవప్రవక్త సంప్రదాయానికి అనుగుణంగా లేదో అది మార్గ విహీనత వైపునకు గొనిపోయే గ్రంథంగానే పరిగణించబడుతుంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు “మా ఈ (ధర్మ) వ్యవహారంలో ఎవరయినా లేనిపోని విషయాన్ని కల్పిస్తే అది రద్దు చేయబడుతుంది“ (బుఖారి, ముస్లిం). మరో సందర్భంలో ఇలా పలికారు : “మా పద్ధతిలో లేనిదాన్ని ఎవరయినా చేస్తే అది స్వీకారయోగ్యం కానేరదు.” (ముస్లిం)
“వారి పుణ్యఫలంలో ఏ కొరతా రాదు” అంటే సజ్జనుల లెక్కలోని సత్కర్మలను తీసి, వారిని సన్మార్గంలోకి తెచ్చిన వ్యక్తికి ఇవ్వటం జరగదు అని భావం. అల్లాహ్ కారుణ్యం అనంతమైనది. అది ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. విరివిగా లభిస్తుంది. ఈ వాక్యంలో అటు సద్వర్తనులకు, ఇటు సన్మార్గం వైపునకు ఆహ్వానించే వారికి ఇద్దరికీ శుభవర్తమానం ఉంది.
“వారి పాపాల భారంలో ఎటువంటి తగ్గింపూ జరగదు” : చెడులకు నాంది పలికి, అవి వెర్రితలలు వేయటానికి కారకుడైనందున ఆ చెడులను అనుసరించే వారందరికీ లభించేంత పాప భారం ఈ చెడుల పితామహుడికి కూడా లభిస్తుంది. ఈ వాక్యంలో దుర్వర్తనులకు, దుర్వర్తనం వైపునకు పిలిచిన వారికి కూడా గట్టి హెచ్చరిక ఉంది.
ప్రజలకు మార్గ దర్శకత్వం వహించటంలో ఉన్నత సంప్రదాయాలను నెలకొల్పటం, సత్ క్రియలకు పురికొల్పటం కూడా చేరి ఉంది. జరీర్ బిన్ అబ్దుల్లా గారి హదీసు ద్వారా ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. ఆయన ప్రకారం ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి కొంతమంది పల్లెవాసులు వచ్చారు. వారు ఆపదలో ఉన్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి దురవస్థను, అక్కరలను పసిగట్టి దానధర్మాల ద్వారా వారిని ఆదుకోవలసిందిగా ప్రజలకు పురికొల్పారు. అయితే ప్రజలు దానధర్మాలు చేయటంలో నిర్లిప్తత వహించారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ముఖారవిందంపై విచార ఛాయలు ప్రస్ఫుటమయ్యాయి. అంతలో ఒక అన్సారి వెండి నాణాల సంచి తెచ్చారు. మరొకరు కూడా అదే పని చేశారు. ఆపై ఒకరి తరువాత ఒకరు తెచ్చి దానం చేయసాగారు. ప్రవక్త గారి మోము ఆనందంతో విచ్చుకునేవరకూ వారు తెస్తూనే ఉన్నారు. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు: “ఎవరయినా ఇస్లాంలో ఉత్తమ సంప్రదాయాన్ని నెలకొల్పితే తదనంతరం కూడా అది కొనసాగితే, దాన్ని పాటించే వారందరికీ లభించినంత పుణ్యఫలం, దాన్ని నెలకొల్పిన ఒక్క వ్యక్తికీ లభిస్తుంది. (అలా అని) అటు, దాన్ని అనుసరించే వారి ప్రతిఫలంలో కోత విధించటం జరగదు. (అదేవిధంగా) ఇస్లాంలో ఎవరయినా దుస్సంప్రదాయాన్ని ప్రవేశపెడితే, తరువాత వారు దాన్ని పాటిస్తే, ఆ పాటించే వారందరిపై పడే పాపభారం దాని మూల స్థాపకుడి పై కూడా పడుతుంది. అటు ఆ దుర్మార్గగాముల పాపంలో తగ్గింపు కూడా ఉండదు.” (ముస్లిం)
ఉన్నత సంప్రదాయాలను, ఉత్తమ అలవాట్లను నెలకొల్పటమంటే భావం ముస్లిములు షరీఅత్ ఆదేశాలను పాటించడంలో మార్గం సుగమం అయ్యే పనులు చేయడమని. అదేవిధంగా ఖుర్ఆన్, హదీసులను ఆయా ప్రజల మాతృ భాషలోకి అనువదించి, ధర్మావలంబనలో సాయపడటం కూడా ఈ కోవలోకే వస్తుంది.
ఈ హదీసులో పేర్కొనబడిన అన్సారీ సహచరుడు అందరి కంటే ముందు వెండి నాణాల సంచి తెచ్చి సమర్పించుకోవటం వల్ల ఇతర ముస్లిముల్లోని సేవాభావం జాగృత మయ్యింది. వారంతా దాన ధర్మాలకు పూనుకుని ఆ సత్కార్యంలో తలో చేయి వేశారు. దానికి గాను వారందరికీ లభించే సత్ఫలితం ఆ మొదటి అన్సారీకి లభిస్తుంది.
ఎందుచేతనంటే సత్కార్యం కోసం ఆయన వేసిన ముందడుగు ఇతర సహచరులకు ప్రేరణ నిచ్చింది. స్ఫూర్తి నిచ్చింది. ఇదేవిధంగా ఎవరయితే హితకార్యాల కోసం ప్రేరణ, ప్రోత్సాహాల వాతావరణం సృష్టిస్తారో వారి స్థానం గొప్పది. అయితే అటువంటి వారందరి ధ్యేయం అల్లాహ్ యొక్క ప్రసన్నతను చూరగొనడం అయి ఉండాలి. దాంతోపాటు చేసే పని కూడా ఉత్తమ పద్ధతిలోనే చేయాలి.
ఈ హదీసు ద్వారా మంచికై పురికొల్పే పని ఎంత మహత్పూర్వకమో, ఎంత ప్రాధాన్యతతో కూడుకున్నదో విశధమవుతోంది. అలాగే చెడులను సర్వసామాన్యం చేయడం ఎంత ఘోరపాతకమో స్పష్టమవుతోంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇద్దరు ముస్లింలు తమ తమ ఖడ్గాలతో పరస్పరం దాడికి దిగితే, హంతకుడు, హతుడు – ఇద్దరూ నరకానికి వెళతారు https://youtu.be/hVPv5X3woKA [10 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
9. హజ్రత్ అబూబక్రహ్ నుఫైబిన్ హారిస్ సఖఫీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) :
“ఇద్దరు ముస్లింలు తమ తమ ఖడ్గాలతో పరస్పరం దాడికి దిగితే, హంతకుడు, హతుడు – ఇద్దరూ నరకానికి వెళతారు” అని చెప్పారు. నేను “దైవప్రవక్తా! హంతకుని మాట సరేగాని హతుడేం పాపం చేశాడని నరకానికి వెళతాడు? అని సందేహపడ్డాను. అందుకాయన “అతనూ తన ప్రత్యర్థిని చంపాలన్న కసితోనే ఉన్నాడు కదా!” అని బదులిచ్చారు. (బుఖారీ -ముస్లిం)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ సత్కార్యాలను, దుష్కార్యాలను రాసి, పిదప వాటిని గురించి వివరించాడు – రియాదుస్ సాలిహీన్ https://youtu.be/LEj9zcBqzMI [16 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[11] దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ప్రభువు ద్వారా ఉల్లేఖించిన విషయాన్ని హజ్రత్ అబుల్ అబ్బాస్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా ఉటంకించారు :
“అల్లాహ్ సత్కార్యాలను, దుష్కార్యాలను రాసి, పిదప వాటిని గురించి వివరించాడు; ఎవరైనా ఏదైనా మంచి పని చేయాలని సంకల్పించుకొని, (ఏదయినా కారణంచేత) దానిని అమలుపరచలేక పోయినప్పటికీ అల్లాహ్ తన వద్ద అతను ఒక సత్కార్యం పూర్తి చేసినట్టు రాసుకుంటాడు. మరి ఆవ్యక్తి ఆ మంచి పని చేయాలని ఉద్దేశించుకొన్న పిదప దాన్ని నెరవేరిస్తే దానికి అల్లాహ్ పది నుండి ఏడు వందల రెట్లు – ఇంకా దానికంటే ఎన్నో రెట్లు అధికంగానే సత్కర్మలు చేసినట్లు అతని ఖాతాలో రాస్తాడు. (దీనికి భిన్నంగా) ఎవడైనా ఒక చెడుపని చేయాలనుకుని ఏదయినా కారణంచేత చేయకుండా ఉంటే అప్పటికీ అల్లాహ్ తన వద్ద, ఆ వ్యక్తి పూర్తిగా ఒక మంచి పని చేసినట్టు రాసుకుంటాడు. అయితే అతను ఆ చెడ్డపని చేయాలని సంకల్పించుకున్న పిదప దాన్ని చేసేస్తే మాత్రం ఒక్క చెడ్డపని చేశాడని పొందుపరుస్తాడు” (బుఖ్లూరీ -ముస్లిం)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దివ్యఖుర్ఆన్లో సృష్టికర్త వడ్డీ సొమ్ము తినేవారిని ఉద్దేశ్యించి ఇలా సెలవిచ్చాడు:
“వడ్డీ తినేవారి స్థితి షైతాను పట్టడం వల్ల ఉన్మాది అయిన వ్యక్తి స్థితి లాంటిది. వారు ఈ స్థితికి గురి కావటానికి కారణమేమిటంటే ‘వ్యాపారం కూడా వడ్డీ లాంటిదేగా’ అని వారంటారు. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం (హలాల్) చేశాడు. వడ్డీని నిషిద్దం (హరామ్) గావించాడు. కనుక ఈ హితబోధ అందే వ్యక్తి మున్ముందు వడ్డీ తినటం త్యజిస్తే, అతను పూర్వం తిన్నదేదో తిన్నాడు. అతని వ్యవహారం చివరకు అల్లాహ్ వద్దకే పోతుంది. ఈ ఆదేశం తర్వాత మళ్ళీ ఈ దుశ్చేష్టకు పాల్పడేవాడు నిశ్చయంగా నరకవాసి. అక్కడ అతడు శాశ్వతంగా ఉంటాడు. అల్లాహ్ వడ్డీని నశింపజేస్తాడు. దానధర్మాలను పెంచి అధికం చేస్తాడు. కృతఘ్నుడూ, దుష్టుడూ అయిన వ్యక్తిని అల్లాహ్ ప్రేమించడు. కాని విశ్వసించి మంచి పనులు చేసేవారికి, నమాజును స్థాపించేవారికి, జకాత్ ను ఇచ్చేవారికి వారి ప్రభువు వద్ద తగిన ప్రతిఫలం లభిస్తుంది. వారికి భయం కానీ, శోకం కానీ కలిగే అవకాశం లేదు. విశ్వసించిన ప్రజలారా! మీరు నిజంగా విశ్వాసులే అయితే అల్లాహ్ కు భయపడండి, ఇంకా మీకు ప్రజల నుండి రావలసిన వడ్డీని విడిచిపెట్టండి. కాని ఒకవేళ మీరు అలా చెయ్యకపోతే, మీ పై అల్లాహ్ తరఫు నుండి యుద్ధ ప్రకటన ఉంది అనే విషయం తెలుసుకోండి. ఇప్పుడైనా మీరు పశ్చాత్తాపపడితే (వడ్డీని వదులుకుంటే) అసలు సొమ్ము తీసుకోవటానికి హక్కుదారులవుతారు. మీరూ అన్యాయం చెయ్యకూడదు. మీకూ అన్యాయం జరగకూడదు. మీ బాకీదారుడు ఆర్థిక ఇబ్బందులలో ఉంటే, అతని పరిస్థితి మెరుగుపడేవరకు గడువు ఇవ్వండి. లేక ఆ రుణాన్ని మాఫీ చేయండి. మీరు తెలుసుకో గలిగితే ఇదే మీ కొరకు మేలైనది. (అల్ బఖర 2 : 275-280)
దివ్యఖుర్ఆన్లోని ఈ వాక్యాలు అరేబియాలో ఇస్లామీయ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అవతరించాయి. దీని తర్వాత ఇస్లామీయ ప్రభుత్వం పరిధిలో వడ్డీ వ్యాపారం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడింది.
పూర్వ రంగం
‘వడ్డీ‘ని దివ్యఖుర్ఆన్లో ‘రిబా‘గా పేర్కొనటం జరిగింది. రిబా అంటే ‘అధికం‘ లేక ‘అదనం‘ అనే అర్థాలు వస్తాయి. అరబ్బులు ఈ పదాన్ని అధిక సొమ్ము అన్న భావంలో వాడేవారు. అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తికి ఒక నిర్ణీత మొత్తాన్ని ఒక నిర్ణీత గడువు వరకు రుణంగా ఇచ్చిదాన్ని పుచ్చుకునే సమయంలో అసలుతో పాటు ఒప్పందం ప్రకారం మరి కొంత అదనపు మొత్తం వసూలు చేసేవాడు. దీన్నే మన నాట ‘వడ్డీ’గా వ్యవహరిస్తాము.
ఈ వడ్డీ వ్యవస్థ ఈ శతాబ్దికి చెందింది కాదనీ, తరతరాలుగా ఇది మానవ సముదాయాల్లో వ్రేళ్లూనుకొని ఉందని తెలుస్తోంది. ప్రపంచంలోని ఇతర దేశాలు, జాతుల మాదిరిగా అరబ్బులలోనూ వడ్డీ లావాదేవీలు కొనసాగేవి. మన దేశంలోని వడ్డీ వ్యాపారులు, వడ్డీ మార్వాడీల వలెనే అరేబియాలో కూడా పెట్టుబడిదారులు వడ్డీ వ్యాపారాన్ని తమ ప్రధాన వృత్తిగా ఎన్నుకునేవారు. రుణగ్రస్తుడు నిర్ణీత గడువులో రుణం చెల్లించలేకపోతే, గడువును పొడిగించి చక్రవడ్డీ తరహాలో మరింత అదనపు సొమ్మును రాబట్టేవారు. తత్కారణంగా ఒకవైపు బాకీదారుల బాకీ నానాటికీ పెరిగిపోతుంటే మరోవైపు వడ్డీ ఆసాములు పేద ప్రజల రక్తం పీలుస్తూ కోట్లకు పడగలెత్తేవారు.
ఇస్లాం నైజానికి విరుద్ధం వడ్డీ
కాగా; ఈ పోకడ ఇస్లాం స్వభావ స్వరూపాలకు ఎంతకీ సరిపడదు. అది ప్రబోధించే సిద్ధాంతానికి వడ్డీ విరుద్ధమైనది. ఇస్లాం అభాగ్య జీవుల్ని ఆదుకోమనీ, పేదవారికి సహాయపడమనీ, అగత్యపరుల అక్కరలు తీర్చమనీ అంటుంది. పైగా ఈ పనులన్నీ ప్రాపంచిక పరమార్థాలతో గాకుండా అల్లాహ్ ప్రసన్నతను, పరలోక ప్రయోజనాలను ఆశించి చేయాలని ప్రబోధిస్తోంది.
సకల రుగ్మతలకు మూలమైన మద్యపానం నుండి జన సామాన్యాన్ని రక్షించడానికి దైవ గ్రంథమైన ఖుర్ఆన్ మరియు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనాలు అంచెలవారీ విధానాన్ని అనుసరించినట్లే వడ్డీ అనే క్రూరాతిక్రూరమైన ఆచారాన్ని రూపుమాపడానికి యుక్తితో, సావధానంతో కూడిన వైఖరిని అనుసరించటం జరిగింది. మొదట్లో ఒక్కసారిగా వడ్డీని నిషేధిస్తున్నట్లు ప్రకటిస్తే ప్రజలకు అది మింగుడు పడేది కాదేమో! అందుకే సకారాత్మకమైన పద్ధతిలో “మీరు సంపదను అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి, పేద ప్రజలకు సహాయం చేయండి, బలహీనులను ఆదుకోండి, అగత్యపరుల అవసరాలను తీర్చండి; దయ, జాలి, త్యాగం, దాతృత్వం వంటి ఉన్నత నైతిక సుగుణాలను అలవర్చుకోండి” అని వారిని మానసికంగా సన్నద్ధుల్ని చేయటం జరిగింది.
“మీరు ఎల్లకాలం ఇక్కడ ఉండరు. మీరు నశించినట్లే మీ సిరిసంపదలు కూడా నశిస్తాయి. కాబట్టి అశాశ్వితమైన ఈ ఆస్తిపాస్తుల్ని వెచ్చించి శాశ్వతమైన పరలోక సాఫల్యాన్ని, స్వర్గలోక సుఖాలను సంపాదించండి. ఖారూన్ వంటి ధన పిపాసకులకు పట్టిన గతిని చూసైనా గుణపాఠం నేర్చుకోండి” అంటూ ఒక్కొక్క వాస్తవాన్నీ వారి దృష్టికి తీసుకురావటం జరిగింది.
ఈ ఉపదేశాలు క్రమక్రమంగా ప్రజల మనోభావాలపై ప్రభావం చూపసాగాయి. స్వార్థమే పరమార్థంగా జీవించే ప్రజలు సొసైటీలోని సాటి సోదరుల కష్టాలను సానుభూతితో అర్థం చేసుకోసాగారు. శాశ్వితమైన స్వర్గ సుఖాల ముందు ప్రాపంచిక తళుకు బెళుకులన్నీ అల్పంగా కనిపించసాగాయి. సమాజంలో నిర్మాణాత్మకమైన ఈ కృషి జరిగిన మీదట నిర్దాక్షిణ్యమైన ఈ ‘వ్యాపారాన్ని’ నిషేధించే చట్టం ప్రవేశ పెట్టబడింది. సూరె బఖరాలోని ఈ ఆయతుల (ఆయత్ నెం. 275-280) ద్వారా ఇస్లాంలో వడ్డీ శాశ్వతంగా నిషేధించబడింది.
గతంలో జరిగిందేదో జరిగిపోయిందనీ, ఇక మీదట ఎవరయినా ఈ ఆజ్ఞను లెక్కచేయకపోతే వారు అల్లాహ్ మరియు ప్రవక్తకు బద్ద విరోధులవుతారనీ, అటువంటి వారిపై అల్లాహ్ మరియు దైవప్రవక్త తరఫున యుద్ధ ప్రకటన జరిగినట్లేనని పై వచనాలలో స్పష్టం చేయబడింది. (అల్లాహ్ రక్షించుగాక!)
మహాపాపం
వడ్డీ సొమ్ము తినేవారి గురించి ఇంతటి తీవ్రమైన హెచ్చరిక రావటం ఆలోచించదగినది. పెద్దపెద్ద పాపాలకు పాల్పడిన వారి కోసం కూడా ఇంతటి తీవ్రమైన హెచ్చరిక రాలేదు. మద్యం సేవించే వారున్నారు, వ్యభిచారం చేసే వారున్నారు; హత్యలు చేసేవారున్నారు. ఇవన్నీ నిషిద్ధాలే. పెద్ద పెద్ద అపరాధాలే. అల్లాహ్ సమక్షంలో ఈ పాపాలకు పాల్పడిన వారికి శిక్ష లభించడమూ తథ్యమే. కాని అల్లాహ్ తరఫున, దైవప్రవక్త తరఫున యుద్ధం ప్రకటించబడే వార్నింగ్ ఒక్క వడ్డీ సొమ్ము తినేవారి విషయంలోనే ఇవ్వబడింది. దీన్ని బట్టి ఇదెంత తీవ్రమైన, అసహ్యకరమైన పాపమో ఊహించవచ్చు. మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధనల ద్వారా కూడా ఇది అత్యంత ఘోరమైన పాపాల జాబితాలో చేర్చబడినట్లు అవగతమవుతోంది. వడ్డీకి ఇచ్చేవారు, వడ్డీ పుచ్చుకునేవారు వడ్డీ లావాదేవీలకు సంబంధించిన దస్తావేజులు వ్రాసేవారు ముగ్గురూ ధూత్కారులుగానే ఖరారు చేయబడ్డారు. మరి కొన్ని ఉల్లేఖనాల ప్రకారం వడ్డీ పాపం వ్యభిచారపు పాపం కన్నా డెబ్బయిరెట్లు అధికమని తెలియవస్తోంది.
‘వడ్డీ కూడా వ్యాపారం లాంటిదేగా’ అని సందేహపడేవారికి, ‘రెండింటి ఉద్దేశ్యం లాభార్జనే కదా!’ అని ప్రశ్నించే వారికి సమాధానం కేవలం హేతుపరంగా ఇస్తే సరిపోదు. ఈ విషయాన్ని భౌతికంగానే కాక ఆధ్యాత్మిక దృష్టితో కూడా పరికించటం అవసరం.
అల్లాహ్ ఆదేశానుసారం ఈ రెండింటి (వడ్డీ-వ్యాపారం)లో భూమ్యాకాశాలంత వ్యత్యాసం ఉంది. పరమ ప్రభువు ఒక దానిని హరామ్ (అధర్మం) గావించగా రెండవ దానిని హలాల్ (ధర్మసమ్మతం)గా ఖరారు చేశాడు. అటువంటప్పుడు రెండూ సమానమెలా అవుతాయి? ఒక వస్తువును సృజించిన వాడే దాని లాభనష్టాలను సరిగ్గా బేరీజు వేయగలుగుతాడు. మరి ఆ సృష్టి కర్త ఒక దానిని హరామ్, మరొక దానిని హలాల్ గా చేశాడంటే హరామ్ గా ఖరారు చేసిన వస్తువులో తప్పకుండా ఏదో ‘కీడు’ ఉండి ఉండాలి. జనసామాన్యానికి ఈ సంగతి బోధపడినా, పడకపోయినా అదంతే. ఎందుకంటే సమస్త విశ్వమండలంలో ఉన్న వస్తువుల వాస్తవిక జ్ఞానం భూమ్యాకాశాలను పరివేష్ఠించి ఉన్న ఆ ప్రభువుకే బాగా తెలుసు. ఆయన జ్ఞాన పరిధికి తాకని వస్తువు అంటూ లేదు. లోకంలోని వ్యక్తులు, సమాజాలకు తమ సొంత లాభనష్టాలు, మంచీ చెబ్బరలు మాత్రమే తెలుసు. సమస్త లోకం యొక్క మంచీ చెబ్బరలను వారు గ్రహించలేరు. కొన్ని వస్తువులు ఒక వ్యక్తికో, ఒక సంఘానికో లాభదాయకంగా కనిపించవచ్చు. అయితే యావత్తు జాతి లేక యావద్దేశానికి అది హానికరం కావచ్చు.
మరొక వాక్యంలో, అల్లాహ్ వడ్డీని మట్టుపెడతాడనీ, దానధర్మాలను వికసింపజేస్తాడని చెప్పబడింది. వడ్డీతో పాటు దానధర్మాలు ప్రస్తావన రావటం ఆశ్చర్యం కల్గిస్తుంది. అయితే ఈ ప్రస్తావన ఒక ప్రత్యేక దృక్పథంతో తీసుకురాబడింది. వాస్తవానికి వడ్డీ మరియు దానధర్మాలు (సదఖాత్) పరస్పర విరుద్ధమైనవి. రెండింటి పరిణామాలు కూడా పరస్పర వ్యాఘాతమైనవి. సాధారణంగా ఈ రెండు పనులు చేసేవారి ఉద్దేశ్యాలు, లక్ష్యాలు కూడా ఒక దానితో ఒకటి సమన్వయం చెందవు.
రెండు విరుద్ధ స్వభావాలు
దానధర్మాలు ఎదుటివారి నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయబడతాయి. వడ్డీ దీనికి భిన్నమైనది. ఎలాంటి మొహమాటం లేకుండా ఎదుటివారి నుండి వడ్డీ సొమ్ము రాబట్టడం జరుగుతుంది. రెండు పనులు చేసేవారి సంకల్పంలో వైరుధ్యం ఎందుకు ఉందంటే దానమిచ్చేవాడు పుణ్యార్జన లక్ష్యంతో, అల్లాహ్ మెప్పును పొందే ఉద్దేశ్యంతో ఇస్తాడు. ఈ పవిత్ర ఆశయం కోసం అతడు తన ఐశ్వర్యం కర్పూరంలా కరిగిపోయినా చింతించడు. కాని వడ్డీ పుచ్చుకునేవాడు!? అతడు పొద్దస్తమానం దొడ్డిదోవలో సంపదను పోగు చేసేందుకు తహతహలాడుతుంటాడు. అందుకే. అటువంటి సంపదను అల్లాహ్ అసహ్యించుకుంటాడు. ఈ కారణంగా ఈ సంపదలోని శుభం లేక వికాసగుణం (బరకత్) మటుమాయమైపోతుంది. కాగా; సదఖాలు (దానధర్మాలు) చేసేవారి ఆస్తిలో అల్లాహ్ శ్రేయో వికాసాలను పుష్కలంగా పొందుపరుస్తాడు.
శుభంలేని సొమ్ము వడ్డీ
వడ్డీని రూపుమాపి దానధర్మాలను వికసింపజేయడంలోని ఆంతర్యం ఏమిటీ? అన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. రూపుమాపడం లేదా వికసింపజేయటం అన్నది పరలోక ప్రతిఫలం దృష్ట్యా చెప్పబడిందని కొంత మంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు. అంటే వడ్డీ తినేవాడి సొమ్ము పరలోకంలో ఎంత మాత్రం అతనికి ఉపయోగపడదనీ, పైగా అది అతని పాలిట విపత్తుగా పరిణమిస్తుందని, అదే దానధర్మాలు చేసేవారికి అవి పరలోకంలో శాశ్వత అనుగ్రహాలకు, స్వర్గలోక సుఖాలకు పాత్రుల్ని చేస్తాయని పండితులు వివరించారు. సర్వసాధారణంగా విద్వాంసులు దీనిపై చేసే వ్యాఖ్య ఇలా ఉంది: వడ్డీని రూపు మాపటం, దానాలను వికసింపజేయటం పరలోకం దష్ట్యా ఎలాగూ ఉంది. అయితే దాని గుణం ఎంతో కొంత ఈ లోకంలోనే కనిపిస్తుంది.
ప్రజల కడుపులు కొట్టి సంపాదించే ఈ అధర్మమైన సొమ్ము అట్టే కాలం నిలవదు కూడా. పెద్ద పెద్ద కోటీశ్వరులు, వడ్డీ వ్యాపారులు చూస్తుండగానే దివాలా తీసి రోడ్డున పడటం చూస్తుంటాము. అంటే; వడ్డీలేని వ్యాపారాలకు నష్టం రాదని కాదు. వ్యాపారంలో లాభనష్టాలు సహజం. కాని శిఖరాగ్రాన ఉన్నవారు ఒక్కసారిగా అధఃపాతాళానికి పడిపోవటం, నిన్న కోటీశ్వరుడిగా ఉండి నేడు ఒక్కొక్క రూపాయి కోసం దేవురించటం వంటి ఉదాహరణలు మనకు వడ్డీ లావాదేవీల్లో, జూదం పట్టాల అడ్డాలలోనే కనిపిస్తాయి. ఈ సొమ్ము ఎంత శీఘ్రంగా పెరిగినా దీర్ఘకాలం నిలవదు. ఈ పాడు సంపద వారసులకు అచ్చిరాదు. సాధారణంగా ఏదో ఒక విపత్తు వచ్చి కూడబెట్టిన దాన్ని కాస్తా హరించివేస్తుంది.
ఒకవేళ ఆ సంపద వృధా అవుతున్నట్టు పైకి కనిపించకపోయినా దాని లాభాలకు, శుభాలకు మనిషి దూరం అవటం తథ్యం. ఎందుకంటే అధర్మమార్గాల ద్వారా సొమ్మును కూడబెట్టే వ్యక్తి పన్నుల మినహాయింపు నుండి బయట పడేందుకు డొంకదారులు వెతుకుతాడు. స్టేటస్ కోసం వెండీ బంగారాలను, వజ్ర వైఢూర్యాలను సమీకరిస్తాడు. వాటి మూలంగా నిజానికి అతడికి చేకూరే లాభం ఏమీ ఉండదు. వజ్రవైఢూర్యాలు ఆకలి దప్పులు తీర్చవు. ఎండ వేడిమి నుంచీ, చలి తీవ్రత నుంచి అవి అతన్ని కాపాడలేవు. పైగా వాటిని భద్రపరచడానికి నానా కష్టాలు పడాలి. మానసిక ఉద్రిక్తతను అనుభవించాలి.
నిజం చెప్పాలంటే మనిషికి శాంతిని, తృప్తినీ, హాయినీ, గౌరవాన్ని ప్రసాదించే ఐశ్వర్యమే సిసలైన ఐశ్వర్యం. అతని ఐశ్వర్యం అతని జీవితానికి సార్ధకతను చేకూర్చగలగాలి. తన ఆస్తి వల్ల తనకు కలిగిన లాభమే తన సంతతికి కూడా కలగాలని మనిషి అభిలషిస్తాడు. అతని ఈ అభిలాష ఎంతో సహజం కూడా. వాస్తవానికి ఈ సుఖశాంతులు ఎవరికయినా వారి ఆస్తి వల్ల ప్రాప్తిస్తే అది కొద్ది ఆస్తి అయినప్పటికీ ఎంతో విలువైనది, శుభవంతమైనది. నిజానికి శుభము, సమృద్ధి అంటే ఇదే. మరే వ్యక్తి ఈ శుభానికి నోచుకోకుండా పోతాడో అతడి సంపద పరిమాణం రీత్యా చాలా ఎక్కువే అయినప్పటికీ యదార్థానికి అది తరిగిపోయింది.
వినాశానికి సంకేతం!
పైకి అది పెరుగుతున్నట్లు కానవస్తుంది. కాని అది పెరుగుదల కాదు. అది బలుపు కాదు వాపు. వ్యాధి మూలంగా ఒక్కొక్కప్పుడు మనిషి శరీరం విపరీతంగా బరువు పెరుగుతుంది. వివేకవంతుడైన మనిషి ఎవరూ ఆ ‘బరువు’ ను ఆరోగ్యానికి ఆనవాలుగా భావించడు. ఎందుకంటే ఈ ‘పెరుగుదల’ వినాశానికి సంకేతం అని అతనికి తెలుసు. వడ్డీ సొమ్ము పరిస్థితి కూడా ఇంతే. వడ్డీని ఆర్జించే వాని సంపద ఎంతగా పెరుగుతున్నట్టు కానవచ్చినా దాని శ్రేయోవికాసాలకు అతడు నోచుకోకుండా పోతాడు.
ఇక్కడ కొంతమందికి సందేహం కలుగవచ్చు. నేటి వడ్డీ వ్యాపారులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారే! వారు పెద్ద పెద్ద మేడల్లో, ఎయిర్ కండీషన్డ్ భవనాలలో సేద తీరుతున్నారే! సుఖ సౌఖ్యాలనిచ్చే సకల వస్తు సామగ్రి వారి వద్దనే ఉంది కదా! అవసరానికి మించిన నౌకర్లు వారి దగ్గరే ఉన్నారు. కోరుకున్న రాజభోగాలు అన్నీ వారి స్వంతమై ఉన్నాయి. మరి అటువంటప్పుడు వాళ్ళు ఈ సొమ్ము నుండి లబ్ది పొందడం లేదని ఎలా అంటారు? అని ప్రశ్నించవచ్చు.
అయితే ఇక్కడ విస్మరించరాని విషయం ఒకటుంది. సౌఖ్య సామగ్రి వేరు ‘సౌఖ్యం’ వేరు. సౌఖ్యాన్నిచ్చే సామగ్రి కర్మాగారాల్లో తయారయి, మార్కెట్లలో అమ్ముడు అవుతుంది. కాని ‘సౌఖ్యం’ అనేది ఉంది చూశారు, అది ఏ ఫ్యాక్టరీలోనో తయారు కాదు. అది ఏ మార్కెట్టులోనో విక్రయించబడదు. అది పరమ ప్రభువు తరఫున ప్రసాదించబడే ‘దయానుగ్రహం’. అది ఎంత ఖరీదైనదంటే మనిషి తన దగ్గరున్న సర్వస్వాన్ని అర్పించి కూడా కొనలేకపోతాడు. ఒక్క నిద్ర ప్రసాదించే సుఖాన్నే తీసుకోండి. దాన్ని పొందడం కోసం మనిషి ఖరీదైన బంగళా కట్టగలడు. ఖరీదైన ఫర్నీచర్ను సమకూర్చుకోగలడు. సుతిమెత్తని పరుపులను, కళ్ళు చెదిరే కార్పెట్లును కొనగలడు. గాలి, వెలుతురు నిరంతరాయంగా ఉండే ఉద్దేశ్యంతో జనరేటర్ను కూడా తెచ్చుకోవచ్చు. కాని ఇంత చేసినా ఆ ఇంటి యజమానికి తియ్యని నిద్ర పట్టగలదని గ్యారంటీ ఏమైనా ఉందా? ఎంత మాత్రం లేదు. మీకు నమ్మకం కుదరకపోతే సౌఖ్య సామగ్రిని పుష్కలంగా సమకూర్చుకున్న వారి గురించి సర్వే చేయండి. వేలాది మంది మీకు నెగటివ్ సమాధానమిస్తారు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల ప్రజల్లో 75 శాతం మంది నిద్ర మాత్రలు మింగి పడుకుంటారని నివేదికలు తెలుపుతున్నాయి. కొన్ని సందర్భాల్లో నిద్రమాత్రలు కూడా పని చేయమని మారాం చేస్తాయి. ఇతరత్రా సుఖాల సంగతి కూడా ఇంతే. మీరు డబ్బులు తగలెట్టి విలాస సామగ్రిని కొనుక్కురావచ్చు. కాని విలాసవంతమైన ఆ జీవితం మీకు ప్రాప్తించే ష్యూరిటీ లేదు.
ఈ పూర్వరంగంలో విషయాన్ని పరికిస్తే మీకే బోధపడుతుంది – వడ్డీ కాముకుల అంగట్లో అన్నీ ఉంటాయి గాని వారికి కావలసిన సుఖం, శాంతి, తృప్తి మాత్రం కరువైపోతాయని! వారు కోటిని కోటిన్నరగా, కోటిన్నరని రెండు కోట్లుగా మార్చాలని పరితపిస్తుంటారే తప్ప తమ ఆయురారోగ్యాల చింత కూడా వారికి ఉండదు. ఆలుబిడ్డలు వారితో కొన్ని క్షణాలైనా గడపాలని పరితపించిపోతుంటారు. కాని ఆ మధుర క్షణాల కోసం కూడా వారికి టైం దొరకదు. ఫ్లైట్ల కోసం పరుగులు తీస్తుండటం, గాల్లో విహరించటంలోనే వారి జీవిత కాలం గడచిపోతుంది. ఆ విధంగా వారు సుఖపడే సామగ్రినయితే ప్రోగు చేస్తారు. కాని సుఖాన్ని ఆస్వాదించలేకపోతారు.
అంతరాలకు మూలం
పోనీ వాళ్ళు స్వయంగా సుఖపడకపోతే పోనివ్వండి. తమ ఉనికి ద్వారా వారు ఇతరులకు ప్రయోజనం ఏమైనా చేకూర్చుతారా అంటే అదీ ఉండదు. వడ్డీ సొమ్మును కూడబెట్టే అత్యాశ వాళ్ళను కఠిన మనస్కులుగా మార్చివేస్తుంది. వారి గుండెల్లోంచి దయ, జాలి, కనికారం మటుమాయమైపోతాయి. ఎంతసేపటికీ అభాగ్య జీవుల బలహీనతను సొమ్ము చేసుకుని వాళ్ళ రక్తాన్ని పీల్చి తమ శరీరాన్ని పోషించుకోవడమే వారి పరమావధి అయి ఉంటుంది. అందుచేత సొసైటీలోని ప్రజల హృదయాల్లో వారి పట్ల గౌరవభావం లేశమైనా ఉండదు. మన దేశంలోని వడ్డీ వ్యాపారస్తులను గానీ, అమెరికా బ్రిటన్ల లోని వడ్డీ కుబేరులైన యూదుల చరిత్రను గానీ తరచి చూస్తే. మీకు అవగతమవుతుంది -వారి లాకర్లలో క్వింటాళ్ళ కొద్దీ బంగారు వెండి వజ్రాలుండవచ్చుగాక! కాని ప్రపంచంలో ఎక్కడా, మానవ సముదాయాల్లో ఏ మూలన కూడా ఈ ‘అయ్యవార్ల’కు పరువు ప్రతిష్ఠ ఉన్నట్లు కనిపించదు. పైగా ఈ కుబేరుల పట్ల పేద ప్రజల్లో అసూయాద్వేషాలు ఏర్పడి వర్గ సంఘర్షణకు దారితీస్తాయి. 20వ శతాబ్దిలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన వర్గ సంఘర్షణలకు కారణం ఈ అసూయాద్వేషాలేనన్నది జగమెరిగిన సత్యం. కార్మిక వర్గానికీ పెట్టుబడిదారీ వర్గానికీ మధ్య సాగిన ఈ సంఘర్షణే ప్రపంచాన్ని రెండు బ్లాకులుగా నిలువునా చీల్చివేసింది. ఒక నకారాత్మక (Negative) ధోరణి నుండి పుట్టుకు వచ్చిన సిద్ధాంతం మరో నకారాత్మక పుంతను తొక్కి భీకర రూపం దాల్చింది. తత్ఫలితంగా యావత్ప్రపంచమే రణరంగానికి, నరమేధానికి నిలయమైపోయింది. దీనికంతటికీ మూలకారణం ఏమిటీ? అత్యాశకు పోయిన ధనికులకు కనీసావసరాలకు నోచుకోని అభాగ్య జీవులకు మధ్య ఏర్పడిన అంతులేని అగాధం కాదా? ఈ అగాధానికి మూలం అక్రమ సముపార్జన కాదా?
కడుపులు కొట్టి…..
రక్తం పీల్చే ఈ జలగల మరో ఉపమానం ఇలా ఉంటుంది – పేద ప్రజల రక్తాన్ని పీల్చి తమ వల్లు పెంచుకునే ఈ ఆసాముల సమూహం ఒకటి ఒకచోట ఒక కాలనీని నిర్మించుకుంటే, వీక్షించదలచే వారికి అది అందంగా కానవస్తుంది. అక్కడ నివసించే వారంతా ఆరోగ్యవంతులుగా ఉంటారు. వారి వాకిళ్ళు పచ్చగా నిగనిగ లాడుతుంటాయి. మరి ఈ ఒక్క వాడను చూచి ఇది దేశప్రగతికి ప్రతిబింబం అనాలా? మంచినీ, మానవత్వాన్ని కాంక్షించేవారు ఈ ఒక్క కాలనీని చూసి మురిసిపోరు. అల్లంత దూరాన ఈ అయ్యవార్ల దోపిడీకి గురై పూరి గుడిసెల్లో నివసిస్తున్న పేద ప్రజల పాట్లను కూడా వారు చూడదలుస్తారు. ఈ స్థితిని వారు ప్రగతికి ప్రతీకగా కాక మానవత్వాన్ని మంటగలిపే పోకడగా అభివర్ణిస్తారు.
తద్భిన్నంగా సదఖాలు ఇచ్చే వారినీ, దానధర్మాలు చేసే వారిని చూడండి – వారు ధనార్జన కోసం నిద్రాహారాలు మానేసి పరుగులు తీయరు. వారెంతో స్థిమితంతో ఉంటారు. తమకు లభించిన దానితోనే సంతృప్తి చెంది అందులోంచి కూడా హక్కుదారుల హక్కును తీసి ఉంచుతారు. తత్ఫలితంగా వారు ప్రశాంతంగా జీవితం గడపటంతో పాటు బడుగు ప్రజల శుభాశీస్సుల్ని అందుకుంటూ ఉంటారు. అల్లాహ్ “వడ్డీని నశింపజేసి దాన ధర్మాలను వికసింపజేయటం” అంటే ఇదే.
“మీ బాకీదారుడు ఆర్థిక ఇబ్బందులలో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకు గడువు ఇవ్వండి లేదా ఆ రుణాన్ని మాఫీ చేయండి. మీరు తెలుసుకోగలిగితే ఇదే మీ కొరకు మేలైనది. “ అని అనబడింది.
‘వడ్డీ’ని ‘నిషిద్ధం’గా ఖరారు చేసిన తరువాత అల్లాహ్ ముస్లింలకు చేసిన సూచన ఇది. ఈ నిషేధాజ్ఞ రాకపూర్వం అరబ్బులు తమ బాకీదారుడు ఆర్థిక సమస్యల వల్ల గడువు లోపల బాకీ చెల్లించకపోతే రావలసిన వడ్డీని అసలు కింద జమ చేసుకొని వడ్డీపై వడ్డీ (చక్రవడ్డీ)ని వసూలు చేస్తుండేవారు.
ఉదార వైఖరి ఫలితం
రాజాధిరాజు అయిన అల్లాహ్ ఈ విషయమై శాశ్వతంగా చట్టం ప్రవేశపెట్టి, రుణగ్రస్తుడు దారిద్ర్య స్థితికి లోనై రుణం చెల్లించలేకుండా ఉన్న పక్షంలో అతన్ని వేధించటం ధర్మ సమ్మతం కాదనీ, స్థితిమంతుడయ్యే వరకు అతనికి గడువు ఇవ్వవలసిందేనని నిర్ణయించాడు. పైపెచ్చు ఆ బాకీదారుణ్ణి పెద్ద మనస్సుతో మన్నించి వదలివేస్తే అది మీ పాలిట శ్రేయస్కరమని ప్రోత్సహించటం జరిగింది.
ఇక్కడ ఈ రకమైన ‘మాఫీ’ని ‘సదఖా’తో పోల్చడం జరిగింది. అంటే వడ్డీని వదలి వేయటమేగాక రావలసిన అసలు విషయంలో కూడా చేతులు దులుపు కోవటం అన్నమాట! పైకి ఇది రుణదాతలకు నష్టకరంగానే అగుపిస్తుంది. కాని ఖుర్ఆన్ మాత్రం దీనిని ‘శుభకరం’గా అభివర్ణించింది. ఈ శుభం (మేలు) రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి: మూన్నాళ్ళ ఈ జీవితం ముగిసిన తరువాత అతను వదలుకున్న కొద్దిపాటి సొమ్ముకు బదులుగా శాశ్వితమైన స్వర్గానుగ్రహం అతనికి ప్రాప్తిస్తుంది. రెండు: అతని మన్నింపుల వైఖరి యొక్క శుభపరిణామం ఈ లోకంలోనే కొంత అడ్వాన్సుగా అతనికి కనిపిస్తుంది. ఉదాహరణకు:- అతని దగ్గర ఉన్న సొమ్ము పరిమితమే కావచ్చు. కాని వృధా ఖర్చుల నుండి, అనూహ్యమైన విపత్తుల నుండి అల్లాహ్ అతన్ని రక్షిస్తాడు. రోగాలు, మందులు మాకుల పేరిట, డాక్టర్ల ఫీజుల పేరిట అక్రమార్కుల సొమ్ము లక్షల్లో కరిగిపోగా, సామాన్యజనులు చాలా స్వల్ప మొత్తంలోనే స్వస్థతను పొందుతుంటారు. ఇలాంటి ఉదాహరణలు కొందరికి శుష్క ప్రియాలుగా కన్పించవచ్చునేమోగాని దైనందిన జీవితంలో లెక్కకు మించిన ఇలాంటి ఉపమానాల్ని మనం చూస్తుంటాము.
దారిద్ర్య స్థితిని ఎదుర్కొంటున్న రుణగ్రస్తుని యెడల మృదు వైఖరిని అవలంబించే వారికి హదీసులలో కూడా శుభవార్త వినిపించబడింది. తబ్రానీలోని ఒక హదీసులో ఉంది :
“ఏ వ్యక్తి అయితే ఎవరికీ ఏ నీడా లభించని రోజున అల్లాహ్ కారుణ్య ఛాయ తనకు లభించాలని కోరుకుంటాడో అతడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రుణగ్రస్తుని పట్ల మృదువుగా మెలగాలి లేక అతన్ని మన్నించి వదలి పెట్టాలి”.
మరొక హదీసులో ఇలా ఉంది:-
“ఎవరయితే తన ప్రార్థనలు స్వీకరించబడాలనీ, తన కష్టాలు దూరం కావాలని కోరుకుంటున్నాడో అతడు కష్టాల్లో ఉన్న తన బాకీదారుడికి మరింత గడువును ఇవ్వాలి”.
సహీహ్ ముస్లింలోని ఒక హదీసు ఇది:
“ఎవరయితే ఒక పేద రుణగ్రస్తుడికి గడువు ఇస్తాడో అతనికి ప్రతి రోజూ అతనిచ్చిన రుణానికి సమానంగా దానధర్మాల పుణ్యం లభిస్తూ ఉంటుంది. ఒక గడువు ముగిసే వరకూ పుణ్యం ఈ లెక్కన లభిస్తూ ఉంటుంది. నిర్ణీత గడువు ముగిసే నాటికి రుణగ్రస్తుడు రుణాన్ని తీర్చలేని స్థితిలో ఉండి, రుణదాత మరికొంత గడువును ఇస్తే అట్టిపరిస్థితిలో రెట్టింపు మొత్తం దానమిచ్చిన పుణ్యం ప్రాప్తిస్తుంది.” (సహీహ్ ముస్లిం, ముస్నద్ అహ్మద్)
వడ్డీ యొక్క వాస్తవికతను తెలుసుకోవడానికి దివ్య గ్రంథంలోని ఇతర వచనాలను కూడా ఇక్కడ ప్రస్తావించటం అవసరం.
“విశ్వసించిన ప్రజలారా! ఇబ్బడిముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినటం మానండి. అల్లాహ్ కు భయపడండి. మీరు సాఫల్యం పొందే అవకాశం ఉంది.” (ఆలి ఇమ్రాన్ 3:130)
అల్లాహ్ ఆగ్రహానికి కారణం
పై వచనంలో “ఇబ్బడి ముబ్బడిగా పెరిగే” అనే ప్రత్యేక పదం వాడబడింది. పూర్వం అరేబియాలో ఒక నిర్ణీత గడువు కొరకు వడ్డీపై అప్పు ఇచ్చి గడువు ప్రకారం అప్పు తీర్చకపోతే రుణగ్రస్తునికి మరికొంత గడువు ఇచ్చేవారు. అయితే అదనపు గడువునకుగాను అదనపు వడ్డీని విధించేవారు. మలిసారి గడువు ముగిసేనాటికి రుణం వసూలు కాకుంటే వడ్డీ శాతం మరింతగా పెంచబడేది. ఆ విధంగా ఒకవైపు రుణదాతకు ఇబ్బడిముబ్బడిగా వడ్డీ సొమ్ము వచ్చి పడుతుంటే మరోవైపు వడ్డీ భారంతో రుణగ్రస్తుని నడ్డి విరిగిపోతుండేది.
నిసా సూరాలో ఈ విధంగా సెలవీయబడింది
“యూదుల ఈ దుర్మార్గ వైఖరి వల్లనూ, వారు ఎక్కువగా అల్లాహ్ మార్గంలో ఆటంకాలు సృష్టిస్తున్నందువల్లనూ, వారికి నిషేధించబడిన వడ్డీని తీసుకుంటున్నందువల్లనూ, అధర్మంగా ఇతరుల సొమ్మును కబళిస్తున్నందువల్లనూ మేము వారి కొరకు పూర్వం ధర్మ సమ్మతములైన ఎన్నో పరిశుద్ధమైన వస్తువులను నిషిద్ధాలుగా చేశాము. వారిలో అవిశ్వాసులుగా ఉన్న వారి కొరకు మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము.”(అన్ నిసా – 160,161)
దైవప్రవక్త హజ్రత్ మూసా (అలైహిస్సలాం) గారి షరీయత్లో కూడా ‘వడ్డీ’ అధర్మంగా ఖరారయినట్టు పై రెండు వచనాల ద్వారా రూఢీ అవుతోంది. ఈ ఆదేశాన్ని ధిక్కరించి, ప్రాపంచిక వ్యామోహంలో యూదులు వడ్డీ సొమ్మును తినసాగితే అల్లాహ్ ఆగ్రహం చెంది కొన్ని హలాల్ వస్తువులు సయితం వారి కొరకు ‘హరామ్’ చేసేశాడు.
ఇస్లాం దృక్పథం ప్రకారం వడ్డీ నిర్వచనం. అది హరామ్ అవడంలోని పరమార్ధం.
ఈ చర్చను మూడు భాగాలుగా విభజించవచ్చు.
(a) ఖుర్ఆన్ హదీసులలో వడ్డీ వాస్తవికత ఏమిటీ? (b) వడ్డీ నిషేధించబడటంలోని ఔచిత్యం ఏమిటీ? (c) వడ్డీ ఎంత నికృష్టమైనదైనా అది నేటి ఆర్థిక వ్యవస్థలో, వాణిజ్య రంగంలో అవిభాజ్యమైన అంశంగా మారిపోయింది కదా! ఖుర్ఆన్ ఆదేశాల ప్రకారం దాన్ని విడనాడితే బ్యాంకింగ్ వ్యవస్థ నడిచేదెలా?
(a) రిబా – ఖుర్ఆన్ హదీసులలో వడ్డీ వాస్తవికత ఏమిటీ?
(అ) అరబీ భాషలో వడ్డీ కొరకు వాడబడిన పదం ‘రిబా‘. మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రభవించక పూర్వం కూడా అరేబియా ప్రాంతంలో ఈ పదం వ్యవహారంలో ఉంది. కేవలం వ్యవహారంలో ఉండటమే కాదు, ప్రజలు ‘రిబా’ ప్రాతిపదికన లావాదేవీలు ముమ్మరంగా జరిపేవారు. అంతెందుకు, తౌరాత్ గ్రంథం అవతరించిన కాలంలో (దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం హయాంలో) కూడా యూదులు వడ్డీ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా అది ‘హరాం’ గావించబడిందని సూరె నిసాలోని ఆయతుల ద్వారా బోధపడుతోంది. తేలిందేమంటే అరబ్బులకు ‘రిబా’ అనే పదం కొత్తకాదు. అందుచేతనే ‘రిబా’ సొమ్మును తినటం హరాం (అధర్మం) అని హిజ్రీ 8వ ఏట ఖుర్ఆన్లో ఆజ్ఞ అవతరించినపుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులకు దాని తఫ్సీర్ లను (వడ్డీ గురించిన వివరాలను) విడమరచి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడలేదు. ఏ విధంగా నయితే మద్యపానాన్ని నిషేధించగానే ప్రవక్త సహచరులు దాన్ని తు.చ. తప్పకుండా పాటించారో అదే విధంగా వడ్డీ (రిబా) నిషేధాజ్ఞలు రాగానే వారు వడ్డీ లావాదేవీలన్నిటినీ త్యజించారు. ఆనాటికి ముస్లిమేతర సోదరుల నుండి తమకు రావలసి ఉన్న భారీ మొత్తాన్ని సయితం ముస్లింలు వదులుకున్నారు.
చెప్పవచ్చిందేమంటే వడ్డీ నిషేధాజ్ఞలు వచ్చిన కాలంలో దానికి సంబంధించిన మతలబులు ఏమీ గుట్టుగానో లేక అనిర్వచనీయంగానో ఉంచబడలేదు. ప్రజా జీవితాల్లో పాతుకుపోయి వున్న వడ్డీ (రిబా)నే ఖుర్ఆన్ నిషిద్ధంగా ప్రకటించింది. మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) దీనిని కేవలం ఒక నైతిక కట్టడిగా గాకుండా ‘ఒకదేశ చట్టం’గానే ప్రవేశపెట్టారు. కాకపోతే రెండవ ఖలీఫా హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కాలంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆ చట్టం అన్వయింపుకు సంబంధించిన కొన్ని చిక్కులు ఎదురై షరియత్ కోవిదులలో ద్వంద్వాభిప్రాయాలు వినిపించాయి, అది వేరే విషయం! అయితే రిబా (వడ్డీ) హరాం అనే విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి సందేహంగానీ, భేదాభిప్రాయంగానీ లేదు. వివరాల్లోకి పోతే సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను తరచి చూడవలసి ఉంటుంది. విషయం లోతుల్లోకి పోవటం మా ఉద్దేశ్యం కాదు. వడ్డీ మూలంగా సమాజంలో జనించే ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక కీడులను స్థూలంగా పాఠకుల ముందుంచి, అల్లాహ్ ఆజ్ఞల్ని అనుసరించటంలో దాసుల ఇహపర సాఫల్యాలు ఇమిడి ఉన్నాయని తెలుపడమే ఈ చిరు పుస్తకం ఉద్దేశ్యం.
సారాంశం ఏమిటంటే (1) అప్పుగా ఇచ్చి దానిపై లాభం లేక అదనపు మొత్తం పొందజూడటం వడ్డీ అవుతుంది. (2) ఈ వడ్డీ అధర్మమని ఖుర్ఆన్ హదీసులు స్పష్టం చేయగానే మహాప్రవక్త సహచరులు నిస్సంకోచంగా దీనిని విడనాడారు. ఈ విషయంలో వారు ఎలాంటి ఊగిసలాటకు లోను కాలేదు. (3) క్రింద పేర్కొనబడిన వస్తువులు లావాదేవీలు జరిపినపుడు సరిసమానంగా ఇచ్చి పుచ్చుకోవాలి, ఒకవేళ వాటిలో హెచ్చుతగ్గులు చేస్తే అది కూడా వడ్డీ క్రిందికి వస్తుంది. అవేమంటే; (1) బంగారం, (2) వెండి, (3) గోధుమలు, (4)జవలు, (5) ఖర్జూరం, (6) ద్రాక్ష.
నేడు ఏ వడ్డీనయితే మానవ ఆర్థికాంశానికి కీలకంగా భావించబడుతున్నదో అది ఖుర్ఆన్ హదీసుల ప్రకారం నిషిద్ధం. ఈ విషయంలో ద్వంద్వాభిప్రాయానికి తావులేదు. దీని నిషిద్ధం గురించి 7 ఖుర్ఆన్ వచనాలు, 40కి పై చిలుకు ప్రవక్త ప్రవచనాలు సాక్షిగా ఉన్నాయి.
(b) వడ్డీ నిషేధించబడటంలోని ఔచిత్యం ఏమిటీ?
(b) ఇక ఈ వడ్డీ నిషేధించబడటంలోని ఔచిత్యం లేక పరమార్థం ఏమిటి? ఏ కారణంగా దీనిపై వేటు వేయబడింది? ఏ కారణంగా ఇది శాపగ్రస్తమైన వ్యవస్థగా భావించబడింది? ఇందులో గల ఆధ్యాత్మిక లేక ఆర్థిక కీడు ఏమిటి? అన్న విషయానికి వద్దాం.
ఇక్కడ మనం ఒక విషయాన్ని ప్రశాంత మనస్సుతో అర్థం చేసుకోవాలి. అదేమంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజా బాహుళ్యంలో ప్రవేశపెట్టబడిన ఏ ఒక్క వస్తువులో కూడా ఏదో ఒక్క మేలు ఉండకపోదు. ఆఖరికి పాము, తేలు లాంటి విషపూరిత జంతువుల్లో, తోడేళ్లు, సింహాల వంటి క్రూర జంతువుల్లో కూడా లోక కళ్యాణానికి ఉద్దేశించిన బాగోగులు ఎన్నో కొన్ని ఉంటాయి. మానవుడు తొక్కే అడ్డదారుల్లో, వినాశకర పోకడల్లో కూడా ఏదో ఒక లాభం తప్పకుండా దాగి ఉంటుంది. అయితే ఏ మతమైనా, మరే మానవ సమాజమైనా, ఇంకే ఇతర సైద్ధాంతిక వర్గమైనా అతి తక్కువ నష్టాలతో సరిపెట్టి అత్యధిక లాభాలనిచ్చే వస్తువునే లాభకరమైన వస్తువు లేదా మేలైన వస్తువుగా పరిగణిస్తుంది. ఉదాహరణకు:- ఖుర్ఆన్ మద్యపానాన్ని నిషేధిస్తూ, ఇది ఘోరమైన పాపాలకు మూలమనీ, అయితే ఇందులో ప్రజల కోసం ఎంతో కొంత లాభం కూడా ఉందని చెప్పింది. కాని ఇందలి కీడు ఇందలి మేలు కన్నా చాలా ఎక్కువ అని స్పష్టం చేసింది. కాబట్టి నష్టాల ఆధిపత్యం వేటిలోనయితే ఉంటుందో వాటినల్లా నష్టకరమైనవిగానే పరిగణించి వాటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం.
వడ్డీ పరిస్థితి కూడా అంతే. వడ్డీ సొమ్ము తినేవాడికి అది తాత్కాలికంగా లాభకరంగా కనిపించవచ్చు. అయితే దాని ఐహిక, పారలౌకిక అనర్థాలు అతనికి వచ్చిన లాభం కన్నా ఎన్నోరెట్లు అధికమై ఉంటాయి. ఏదేని ఒక వస్తువు తృటిలో ప్రయోజనం చేకూర్చి దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బతీస్తుందని తెలిసినపుడు వివేకవంతుడైన వ్యక్తి ఎవడూ ఆ వస్తువును లాభకరమైన వస్తువుల జాబితాలో చేర్చడు. పైగా దానిని నష్టాల జాబితాలోనే వ్రాసుకుంటాడు. అదే విధంగా ఒక వస్తువు ఒక వ్యక్తికి మేలు చేకూర్చి సమాజం మొత్తానికి హాని కలిగిస్తుందని తెలిసినపుడు విజ్ఞుడైన మనిషి ఎవడూ దానిని మేలైన వస్తువుగా ఖరారు చేయలేడు. దొంగతనం లేక దొమ్మీ వల్ల ఒక వ్యక్తి లేక ఒక ముఠా లాభం పొందవచ్చు. కాని ఈ కీడు యొక్క ప్రభావం మొత్తం సమాజంపైనే పడుతుంది. సమాజమంతటా భయోత్పాతం నెలకొంటుంది. అందుచేత ఎవరూ దొంగతనాన్ని, దొమ్మీలను మంచివిగా తలపోయరు.
ఈ ఉపోద్ఘాతం తర్వాత మీరు వడ్డీ సమస్యపై దృష్టిని సారించండి. కాస్త నిదానంగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. వడ్డీని ఆర్జించే వాడికి తాత్కాలిక లాభాలకన్నా అతనికి వాటిల్లే ఆధ్యాత్మిక, నైతిక దివాలా చాలా తీవ్రంగా ఉంటుందని, మంచిని, మానవత్వాన్ని కాంక్షించే మనుషుల జాబితాలో ఆ వ్యక్తికి చోటు లేకుండా పోతుంది. అతనికొక్కడికి వచ్చే లాభం సమాజాన్నంతటినీ భారీ నష్టంలో పడదోస్తుంది. కాని విచారకరమైన విషయం ఏమిటంటే లోకంలో ఏదైనా ఒక వస్తువు చెలామణిలోకి వచ్చేస్తే దాని మేళ్లు మాత్రమే ప్రజల కంటికి కనిపిస్తుంటాయి. కీడులు మాత్రం కంటికి ఆనవు.
చీడ పురుగు
నేటి ఆధునికయుగంలో వడ్డీ ఒక అంటువ్యాధిలా ప్రబలి, యావత్తు ప్రపంచాన్ని చుట్టు ముట్టేసింది. అది మానవ అభిరుచి పై ఎంత తీవ్రమైన ప్రభావం చూపిందంటే దాని వాతన పడిన వారు చేదైన దానిని తియ్యనిదిగా నమ్ముతున్నారు. సమస్త మానవాళి ఆర్థిక వినాశానికి హేతువు అయిన వస్తువు (వడ్డీ) ఆర్థిక సమస్యల పరిష్కారమార్గంగా పరిగణించబడుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఏ ఆలోచనాపరుడైనా లేక ఏ ఆర్థికవేత్త అయినా ఈ వడ్డీకి వ్యతిరేకంగా నినదిస్తే అతన్ని పిచ్చివాడిగా జమకట్టేస్తారు.
కాని ఒక విషయాన్ని విస్మరించరాదు – ఒక దేశంలో ఒక అంటువ్యాధి ప్రబలిపోయి దాని చికిత్స అంతగా ప్రభావం చూపకపోవటాన్ని చూసి ఏ డాక్టరైనా ఆ వ్యాధిని వ్యాధిగా పరిగణించకుండా దాన్నే ఒక ఔషధంగా,పరిష్కార మార్గంగా సూచించాడనుకోండి. ఆ డాక్టరును డాక్టరని అంటారా! అతడు డాక్టర్ కాడు. నరరూప రాక్షసుడు, ప్రవీణుడైన డాక్టర్ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా వ్యాధిని వ్యాధిగానే తలపోస్తాడు. వ్యాధి నివారణను సూచిస్తాడు.
దైవ ప్రవక్తలు (అలైహిముస్సలాం) మానవ సంస్కరణకు బాధ్యులుగా ఉండేవారు. ఎవరు తమ మాటను ఖాతరు చేసినా చేయకపోయినా వారు తమ పనిని తాము చేసుకుపోయేవారు. వారు గనక ప్రజల మనోకాంక్షల కనుగుణంగా నడుచుకుంటూ పోతే నేడు లోకమంతా అవిశ్వాస భావాలతో, మిథ్యావాదులతో అంధకార బంధురంగా ఉండేది.
వడ్డీ నేటి ఆర్థిక జగతికి వెన్నెముకగా భావించబడుతూ ఉన్నప్పటికీ – యూరపుకు చెందిన కొంతమంది విజ్ఞులు ఇప్పటికే దీన్ని ప్రమాదకరమైన బిందువుగా తలపోస్తున్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక కాదని, వెన్నె ముకను తొలచివేసే ఒక పురుగు అని వారు ఇప్పటికే అంగీకరించారు.
కాని శోచనీయమైన విషయం ఏమిటంటే మేధావులు, అర్థశాస్త్ర నిపుణులు కూడా ఒక్కోసారి ఆచార సంప్రదాయాల వలయంలో చిక్కుకుపోయి స్వేచ్ఛగా ఆలోచించలేకపోతారు. కాలపు క్రేజుకు తలఒగ్గి అంతరాత్మ ప్రబోధాన్ని అణచివేస్తారు.
కొద్దిమంది బలుపు కోసం కోట్లాది మంది ప్రాణులు భారీ మూల్యం చెల్లించవలసి రావటం, అనేక మానవ సముదాయాలు ఆకలి దప్పులకు, ఆర్థిక మాంద్యానికి లోను కావటం, దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న ప్రజల బ్రతుకులు మరింత నికృష్ట స్థితికి చేరటం, అదే సమయంలో గుప్పెడు మంది పెట్టుబడిదారులు సామాన్య జనుల రక్తం పీల్చి తమ కండలు పెంచుకోవటం సర్వసాధారణమైపోయింది. కడుపు మండి ఎప్పుడైనా ఈ సత్యాన్ని వాళ్ల ముందు వెల్లడిస్తే దాన్ని త్రోసి పుచ్చుతూ వారు అమెరికా, ఇంగ్లాండ్ల మార్కెట్లలో నిలబెట్టి వడ్డీ సమృద్ధిని మనకు చూపించదలుస్తారు. అక్కడ సమృద్ధి కనబడటంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మేకలను భక్షించే మృగాలు బలిష్టంగానే ఉంటాయి కదా! కాని ఈ మృగాల వేటకు గురైన ప్రజల్లోకి చొచ్చుకుపోయి వారి స్థితిగతుల్ని కాస్త వీక్షించమనండి – అక్కడ ఈ మృగాల వేటకు గురైన వేలాదిమంది సామాన్య జనులు జీవచ్ఛవాల్లా పడి ఉండటం కాన వస్తుంది. ఇలాంటి ఆర్థిక ప్రక్రియను ఇస్లాం ఆరోగ్యవంతమైన ప్రక్రియగా భావించదు. గుప్పెడు మంది బడా వాణిజ్యవేత్తల బలుపుకోసం యావత్తు మానవ సమాజం చిక్కి శల్యమై పోవటం ప్రగతి అనిపించుకోదు.
వడ్డీ యొక్క ఆర్థిక కీడు
(c) నేడు వడ్డీ కొత్త పుంతలు తొక్కుతోంది. దీని వ్రేళ్ళు నలువైపుల నుండీ ఆర్థిక వ్యస్థను ఆక్టోపస్ లా అల్లుకుపోతున్నాయి. మద్యం, జూదం, వ్యభిచారం వంటి చెడుగులు నాగరికత పేరిట, ఫ్యాషన్ పేరిట కొత్త మెరుగులు దిద్దుకొని ప్రజల ముందు ప్రత్యక్షమైనట్లే వడ్డీ కూడా కొత్త అవతారమెత్తి ప్రజా జీవితాలతో ఆడుకుంటోంది. నిన్నటి వరకూ దుకాణాలకే పరిమితమైన ఈ రుగ్మత నేడు సేవింగ్ స్కీములు, బ్యాంకులు, సొసైటీల రూపంలో ఆవిర్భవించింది. ఈ కొంగొత్త వ్యవస్థ వల్ల సమాజమంతటికీ లాభం చేకూరుతుందని మభ్య పెట్టడం జరుగుతోంది. డబ్బుండీ వ్యాపారం చేయలేనివారు కొందరుంటే, వ్యాపారం చేయగోరినా చాలినంత పెట్టుబడిలేని వారు కొందరుంటారు. అలాంటి వారి దగ్గరున్న డబ్బును పొదుపు పథకాల క్రింద రాబట్టం జరుగుతుంది. వారికి వడ్డీ రూపేణ ఎంతో కొంత ‘లాభం’ లభిస్తుందనుకోండి. అయితే అలా పోగైన సంపద తిరిగి బడా వ్యాపారుల చేతుల్లోకి రుణం క్రింద వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ వడ్డీ లాభాలు అటు సామాన్యులకూ ఇటు పెద్ద వర్తకులకు కూడా లాభసాటిగా ఉన్నట్లు అగుపిస్తుంది.
మేడిపండు
కాని న్యాయ దృష్టిలో ఆలోచిస్తే ఇదొక మేడిపండు తప్ప మరేమీ కాదన్న వాస్తవం బోధపడుతుంది. ముదనష్టపు వస్తువులను మృదుమధురమైనవిగా సమర్పించే కిటుకులు మన వాళ్లకు బాగా తెలుసు. సారాయి భట్టీలలో అత్యంత దుర్భరమైన స్థితిలో తయారయిన సారాయిని అందమైన హోటళ్లలో సంస్కారవంతమైన శైలిలో సమర్పించటం ఎలాంటిదో, సాని కొంపల్లో మ్రగ్గే వారిని ‘కాల్ గర్ల్’ పేరుతో స్టార్ హోటళ్లకు రప్పించటం ఎటువంటిదో ఇదీ అటువంటిదే. నైతికంగా మానవ సమాజాలను తొలచివేసే వస్తువులకు ఆధునికత పేరిట అందమైన తొడుగులు తొడిగించినంత మాత్రాన అవి విషపూరితం కాకుండా పోవు.
పొదుపు మొత్తాలపై బ్యాంకుల ద్వారా లభించే కొద్దిపాటి వడ్డీ వల్ల వారి జరుగుబాటు ఎలాగూ కాదు. బ్రతుకు తెరువు కోసం వాళ్ళు కూలీనాలీయో ఉద్యోగమో ఎలాగూ చేయక తప్పదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు వ్యాపారం మొదలెట్టి మార్కెట్టులోని వైపరీత్యాలకు తట్టుకొని నిలబడలేరు. పెద్ద తరహాలో వ్యాపారం చేద్దామంటే వారికి భారీ మొత్తంలో రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు రావు. వ్యాపార రంగంలో పరపతి ఉండి, ఓ మిలియనీరుగా చెలామణీ అవుతున్న వాడికి కోటి రూపాయిలైనా బ్యాంకుల నుండి రుణంగా లభిస్తాయి గాని ఒక సామాన్యుడికి పదివేల అప్పు కూడా పుట్టదు. ఆ విధంగా కలవాడు తన స్థాయి కన్నా పదిరెట్ల వ్యాపారం చేయగలుగుతాడు. లాభాలు కూడా అదే విధంగా జుర్రుకుంటాడు. కాని ఒక సన్నకారు వ్యాపారస్తుడు అప్పుడప్పు చేసి ఒక వేళ వ్యాపారం చేసినా అతడికి వచ్చే లాభం అతని జరుగుబాటుకు కూడా సరిపోదు. ఇదిలా ఉండగా వ్యాపార సంబంధమైన వైపరీత్యాలు గాని సంభవిస్తే ఉన్నది కూడా ఊడ్చుకుపోతుంది. ఆ వైపరీత్యాల్ని సృష్టించేది కూడా ఎవరో కాదు, బడా వాణిజ్యవేత్తలేనన్నది బహిరంగ రహస్యం. తేలిందేమంటే మార్కెట్టులో కొద్దిమంది పెద్ద తరహా వ్యాపారస్తులే మిగులుతారు. మూలధనమంతా క్రమక్రమంగా వారి ఇనుప్పెట్టెలకు తరలిపోతుంది.
2. మార్కెట్టులో కొద్దిమంది ఏకస్వామ్యం ఆధిపత్యం పెరిగిపోతుంది. వారు కోరినప్పుడల్లా నిత్యావసర వస్తువులు కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెంచేస్తూ ఉంటారు. మరో విధంగా చెప్పాలంటే క్రయవిక్రయాల వ్యవస్థ అంతా వారి గుప్పెట్లో ఉంటుంది. పరోక్షంగా వాళ్లు దేశాన్నే శాసించే స్థాయికి చేరుకుంటారు. సామాన్య ప్రజల సొమ్ముతో తెగబలిసిన ఈ ఆసాములకు ప్రజా సంక్షేమం పట్ల గాని, సామాజిక న్యాయం అంటేగాని ఎలాంటి ఆసక్తి ఉండదు.
అదే వర్తకం వికేంద్రీకరణ జరిగి, మార్కెట్టులో పరిపూర్ణమైన పోటీ విధానం అమల్లోకి వచ్చినట్లయితే పరిస్థితి తద్ఛిన్నంగా ఉంటుంది. చిన్న చిన్న వర్తకులకు కూడా లాభాలు వచ్చి వారి ఆత్మ విశ్వాసం ఇనుమడిస్తుంది. వేలాది మందికి జీవనోపాధి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ సమస్య కొంతలో కొంత పరిష్కృతమవుతుంది. ప్రగతి ఫలాలు అందరికీ లభించి ఆర్థిక అసమానతల అగాధం కొంతవరకైనా పూడుకుంటుంది. కాని ఈ విషయం జనసామాన్యానికి అర్థమయ్యేలా చెప్పేదెవరు? వినాశకరమైన రోగం తగిలించబడింది. ప్రచారం చేసే వారేమో దీన్ని ఒక రోగంగా గాక దివ్య ఔషధంగా ప్రచారం చేస్తున్నారు.
3. బ్యాంకుల వడ్డీ వల్ల సమాజానికి వాటిల్లే మరో ఆర్థిక అనర్థం ఏమిటో చూడండి – ఒక వ్యక్తి వద్ద లక్ష రూపాయిల మూలధనముంటే అతను బ్యాంకు నుండి రుణం తీసుకొని 10 లక్షల వ్యాపారం చేస్తాడు. ఒకవేళ అతడి వ్యాపారం అనూహ్యమైన ఒడిదుడుకులకు లోనై అతడు దివాలా తీస్తే అతడికి కలిగే నష్టం ఒక లక్ష (10 శాతం) మాత్రమే. కాని మిగిలిన 90 శాతం నష్టం ఎవరిపై పడుతుంది? సమాజంపైనే కదా! పైకి బ్యాంకుకు నష్టం వాటిల్లినట్లుగా అగుపిస్తుంది. కాని వాస్తవానికి ఆ బ్యాంకు సొమ్ము ఎవరిది? ప్రజలది కాదా? దీని ద్వారా బోధపడిందేమంటే పెట్టుబడిదారుడు లాభాలు వచ్చినంత కాలం తానొక్కడే లాభాలను ఆర్జించాడు. సమాజానికి లభించింది నామమాత్రం. కాని నష్టం వాటిల్లేసరికి 90 శాతం నష్టం సమాజంపైకి నెట్టేయబడింది.
4. వడ్డీ వ్యవస్థ వలన కలిగే మరో పరాభవం ఏమిటంటే, వడ్డీ సొమ్ముతో వ్యాపారం మొదలెట్టిన వ్యక్తి ఒకసారి నష్టాల ఊబిలో పడ్డాడంటే ఇక అతడు పైకి రాలేడు. ఎందుకంటే నష్టాన్ని భరించేటంత మూలధనం అతని వద్దనయితే లేదు. నష్టాలు వాటిల్లినపుడు అతని ఇక్కట్లు రెట్టింపు అవుతాయి. ఒకవైపు ఉన్నది కాస్తా ఊడ్చుకుపోయింది. రెండోవైపు అతడు బ్యాంకు రుణభారం క్రింద నలిగిపోయాడు. దాన్ని చెల్లించే దారి లేదు. కాని అదే వడ్డీ రహిత వ్యాపారంలో నష్టం వాటిల్లి ఉంటే అతడు బికారి మాత్రమే అయ్యేవాడు. కాని రుణగ్రస్తుడు అయ్యేవాడు కాదు.
ఒక సందేహం
ఒక్కడ ఒక సందేహం ఉత్పన్నమవటం సహజం. బ్యాంకుల ద్వారా జాతీయ సంపద ఒక చోట ప్రోగవటం వల్ల జనసామాన్యానికి ఎంతో కొంతయినా లాభం చేకూరింది కదా! పెట్టుబడిదారులకు అధిక మొత్తంలో లాభం చేకూరవచ్చుగాక, కాని సామాన్య ప్రజానీకానికి కూడా ఎంతోకొంత ముట్టింది కదా! ప్రజాధనాన్ని పొదుపు చేసే ఈ బ్యాంకు స్కీములే గనక లేకుంటే ఈ సంపద అంతా పూర్వకాలపు వ్యాపారస్తులు, జమీందార్లు ఖజానాను భూస్థాపితం చేసినట్లుగా ఈ కాలపు ప్రజలు కూడా సంపదను ఫ్రీజ్ చేసేసి నిరుపయోగం చేసేవారు కదా! అని కొందరు ప్రశ్నించవచ్చు.
దీనికి సమాధానం ఏమిటంటే ఇస్లాం వడ్డీని అధర్మంగా ఖరారు చేసి దాని ద్వారాలను మూసివేసినట్లే, సంపదను ఒకచోట ప్రోగు చేసిపెట్టే వారిపై జకాత్ అనే విద్యుక్త ధర్మాన్ని మోపి వాళ్ళు సంపదను నిరుపయోగం చేయకుండా బ్రేకువేసింది. పైగా ఆ సంపదను వెలికితీసి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టక తప్పని పరిస్థితిని సృష్టించింది. ఎలాగంటారేమో! ఇస్లాం ప్రకారం ఏ ముస్లిమైనా బంగారాన్ని గాని, నగదును గానీ నిల్వ చేస్తే అతడు ఆ సొమ్ముపై సాలీనా రెండున్నర శాతం చొప్పున జకాత్ ని తీసి సమాజంలోని అగత్యపరులకు, నిరాధారులకు ఇవ్వవలసి ఉంటుంది. ఆ విధంగా అతడు తన నిల్వలను పెట్టుబడిగా మార్చకుండా అట్టే పెట్టుకొని ఉంటే కొన్ని సంవత్సరాలకే ఆ ఖజానా కాస్తా ఖాళీ అయిపోతుంది. కాబట్టి అతడు తన దగ్గరున్న మిగులును ఫ్రీజ్ చేసి ఉంచే బదులు దాన్ని వాణిజ్యంలోనో వ్యవసాయంలోనో పెట్టుబడిగా పెట్టి దానిపై వచ్చే లాభాలపైన జకాత్ ఇవ్వడానికే ప్రాధాన్యతనిస్తాడు. అంటే తన దగ్గరున్న సంపద ద్వారా తాను లబ్దిపొందడంతో పాటు ఇతరులకు కూడా జకాత్ రూపంలో లాభాలను పంచిపెడతాడు.
జకాత్ వాణిజ్య వికాసానికి దోహదకారి
జకాత్ చెల్లింపు ద్వారా సమాజంలోని నిరుపేదలకు, అగత్యపరులకు సాయం లభించినట్లే ముస్లింల ఆర్థిక స్థితిగతులు చక్కబడే అవకాశాలు కూడా మెరుగుపడతాయి. వర్తకాన్ని ప్రోత్సహించేందుకు జకాత్ దోహదపడుతుంది. ఎందుకంటే, నగదు సొమ్మును ఏడాది కాలం పాటు ఇనుప్పెట్టెల్లో మూసి ఉంచడం వల్ల తనకు ప్రయోజనం ఏమీ కలగకపోగా, జకాత్ రూపేణా కొంతధనం బయటకు వెళ్ళిపోతుందే అని మనిషి ఆలోచనలో పడి ఆ నగదుతో వ్యాపారం మొదలెడతాడు. వేలాది మందికి చెందిన కష్టార్జితాన్ని బ్యాంకుల ద్వారా రాబట్టి ఒక పారిశ్రామికవేత్త వ్యాపారం చేసే బదులు స్థితిమంతుడయిన ప్రతి ఒక్కడూ వ్యాపార రంగంలో అడుగుపెడతాడు. వాణిజ్యరంగంలో ఆరోగ్యవంతమైన పోటీ పెరుగుతుంది. మార్కెట్లో ఏకస్వామ్య వ్యవస్థ బదులు పరిపూర్ణపోటీ విధానం అమల్లోకి వస్తుంది. మార్కెట్ సమతౌల్యం ఏర్పడుతుంది. తత్ఫలితంగా సమాజంలోని బడుగు జీవులకు, నిరాధారులకు వెసులుబాటు లభిస్తుంది.
వడ్డీ యొక్క ఆధ్యాత్మిక అనర్ధాలు
వడ్డీ వ్యాపారం మూలంగా వాటిల్లే ఆర్థిక అస్తవ్యస్త స్థితిని అవలోకనం చేశాము. ఇక దీని మూలంగా మానవుని ఆధ్యాత్మిక, నైతిక రంగాలపై పడే దుష్ప్రభావాన్ని చూద్దాము –
1. మానవుని గుణగణాలలో అత్యంత ముఖ్యమైనది, ఉజ్వలమైనది త్యాగగుణం మరియు దాతృ స్వభావం. స్వయంగా బాధల్ని భరించి ఇతరులకు సుఖాన్ని పంచిపెట్టడమనే భావన ఉన్నత మానవీయతకు తార్కాణం. అయితే వడ్డీ పిశాచం తిష్ఠ వేసిన సమాజాల్లో ఈ పరోపకార గుణం దాదాపు నశిస్తుంది. పరులకు ఉపకారం కాదు కదా పరులు కష్టపడి పైకొచ్చి తన సరసన నిలబడటాన్ని కూడా ఒక వడ్డీ వ్యాపారి సహించలేడు.
2. అతడు ఆపదల్లో ఉన్న వారిపై జాలి చూపకపోగా వారి ఆపదల్ని తన స్వార్థ ప్రయోజనాలకై సొమ్ము చేసుకోజూస్తాడు.
3. వడ్డీ ఆర్జన వల్ల అతనిలో పేరాశ పెరిగిపోతుంది. క్రమంగా అతని హృదయంలోని దయాదాక్షిణ్యాలు మటుమాయమవుతాయి. మంచీ-చెడుల మధ్య గల వ్యత్యాసాన్ని మరచిపోతాడు. ఆ విధంగా అతను నైతికంగా దిగజారి కడకు మానవత్వానికే దూరమైపోతాడు.
వడ్డీలేని ఆర్థిక వ్యవస్థకు మనుగడ లేదా?
వడ్డీ మూలంగా సమాజానికి వాటిల్లే నైతిక, ఆధ్యాత్మిక, ఆర్థిక అనర్థాలను వివరించారు సరే, మరయితే ఈ వడ్డీ లేకుండా వ్యవస్థ నడిచేదెలా? ఆర్థిక వ్యవస్థ అణువణువునూ ‘వడ్డీ’ పెనవేసుకొని ఉండగా దీన్ని ఒక్కసారిగా విడనాడితే వ్యాపారస్తులకు బ్రతికి బట్టకట్టే మార్గం ఏది? అన్న ప్రశ్న ఇక్కడ తలెత్తడం సహజం.
మనం ఇక్కడ ఆవేశానికి లోనవకుండా ఒక విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించాలి. ఒక వ్యాధి ప్రబలిపోయి అది అంటువ్యాధిగా మారిపోయినపుడు చికిత్స దుర్లభంగా కనిపిస్తుంది. కానీ ఆ చికిత్స వృధాపోదు. ఆర్థిక సంస్కరణలు ఫలప్రదం కావడానికి సమయం పడుతుంది. దీని కొరకు వ్యక్తులు, సమాజాలు సహన స్థయిర్యాలతో వ్యవహరించవలసి ఉంటుంది. దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ స్వయంగా ఇలా సెలవిచ్చాడు.
“అల్లాహ్ ధర్మం విషయంలో మీపై ఎలాంటి లేమి (ఇబ్బంది) నీ ఉంచలేదు.”
దీన్ని బట్టి అవగతమయ్యేదేమిటంటే వడ్డీకి అతీతంగా మానవ సమాజాలకు ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకులు, కష్టనష్టాలు లేకుండా నడిపించే మార్గం తప్పక ఉంది.
ఇస్లాం చూపే మార్గం
సమాజంలోని నిరుపేదల అభాగ్యజీవుల పాట్లను నిరోధించే ఉపాయాలు ఇస్లాంలో ఉన్నాయి. ఇస్లాం ధర్మం పట్ల, దాని ఉపదేశాల పట్ల అనాసక్తత మూలంగా ముస్లింల స్థితిగతులు ఇలా తగలడ్డాయి గాని వారు గనక ఇస్లాం ప్రబోధనలను ఖచ్చితంగా తమ దైనందిన జీవితాల్లో ప్రవేశపెట్టుకున్నట్లయితే వారి జీవన గతే మారిపోతుంది. జకాత్, సదకాల రూపంలో వారు సక్రమంగా తమ సంపదను పంపిణీ చేసినట్లయితే నేడున్న సమస్యలు ఉండవు. ఇదంతా వారి నిర్లక్ష్య ధోరణి యొక్క పరిణామమే. నిజం చెప్పాలంటే నేడు జకాత్ విధానం దాదాపు లేదు. ముస్లింలలో చాలామంది నమాజ్ మాదిరిగానే జకాత్ జోలికిపోరు. జకాత్ ఇచ్చేవారు కూడా పాక్షికంగానే ఇస్తున్నారు. జకాత్ ను పూర్తిగా ఇచ్చేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. పోనీ వారైనా ఆ జకాత్ సొమ్మేదో సక్రమంగా పంపిణీ చేస్తున్నారా అంటే అదీ లేదు. తమ సొమ్ముల్లో ఏడాదికోసారి జకాత్ తీస్తే సరిపోదు, దాన్ని సజావుగా చెల్లించాలి, నిర్ణీత పద్దులకు మాత్రమే కేటాయించాలన్నది అల్లాహ్ ఆదేశం. జకాత్ సొమ్మును దాని హక్కుదారులకు మాత్రమే చెల్లించే నిమిత్తం సిసలైన హక్కుదారులను అన్వేషించే దాతలు ఎంత మంది ఉన్నారో మీరే చెప్పండి.
ముస్లింల మిగులు ధనం ఎంత స్వల్పంగా ఉన్నా సరే, వారిలోని ప్రతి ఒక్క స్థితిమంతుడు గనక చిత్తశుద్ధితో జకాత్ అనే విధానాన్ని వేరుపరచి సక్రమమైన పద్ధతిలో దాని హక్కుదారులకు చేరవేసినట్లయితే అసలెవరికీ ముష్టెత్తుకునే దుస్థితి దాపురించదు. చీటికి మాటికీ అప్పుల కోసం ‘అయ్యవార్ల’ వద్దకు పరుగులు తీయాల్సిన అగత్యం కూడా ఉండదు.
మరి ఈ జకాత్ నే షరీఅత్ ఆదేశాలకు లోబడి సామూహిక పద్ధతిలో వసూలు చేసి ‘బైతుల్ మాల్’ అనే సంస్థను స్థాపించినట్లయితే మరిన్ని మేళ్లు చేకూరుతాయి. అలా పెద్ద మొత్తంలో వసూలైన జకాత్ ను బైతుల్ మాల్ ద్వారా వడ్డీలేని రుణాలుగా కూడా ఇవ్వవచ్చు. జీవనోపాధి లేక రోడ్డున పడ్డ అనేక మందికి రుణాలు ఇచ్చి కుటీర పరిశ్రమల్ని స్థాపించవచ్చు. ఈ విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఒక ఐరోపా ఆర్థిక నిపుణుడు నిజం చెప్పాడు. అతనిలా అన్నాడు – “ముస్లింల జకాత్ వ్యవస్థ ఎంత ప్రభావవంతమైనదంటే, ముస్లింలే గనక దాన్ని సక్రమంగా పాటిస్తే ఆ జాతిలో ఒక్క దరిద్రుడు, అగత్యపరుడూ మిగలడు”.
చిత్తశుద్ధి ఉంటే…
ఈ చర్చ ద్వారా చివరకు మేము చెప్పదలచిందేమంటే; వడ్డీ ఒక అంటువ్యాధిలా ప్రబలి పోయిన ఈ రోజుల్లో ఇక దాన్ని విడనాడే దారేలేదని తలపోయటం సరైనది కాదు. కాకపోతే ఇది ఒక్క వ్యక్తి లేక కొందరు వ్యక్తుల పని కాదు. ప్రభుత్వాలు, సామూహిక సంస్థలు చొరవ తీసుకొని వ్యవస్థను మార్చడానికి యత్నించినపుడే ఆశించిన ఫలితాలు వస్తాయి. కనీసం ముస్లిం సమాజాలు, ముస్లిం రాజ్యాలు ఈ సమస్యపై దృష్టిని కేంద్రీకరించి వడ్డీ రహిత వ్యవస్థ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే వడ్డీ పిశాచం నుండీ ప్రజానీకాన్ని కాపాడటం దుర్లభమేమీ కాదు. వారు ఈ లక్ష్యాల్ని సాధించిననాడు ఆర్థికంగా యావత్ప్రపంచానికే ఆదర్శప్రాయం కాగలుగుతారు.
మరో విషయాన్ని మేము ముస్లింలకు ప్రత్యేకంగా విన్నవించుకోదలిచాము – వారు కనీసం రోగాన్ని రోగంగానే చూడాలి. అధర్మాన్ని (హరాం) అధర్మంగానే చూడాలి. షరీఅత్లో అధర్మమైన ఒక వస్తువును ధర్మసమ్మతం (హలాల్)గా తలపోయడం కన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. అత్యంత విచారకరమైన విషయమేమంటే ముస్లిం సమాజాల్లో కొంత మంది మేధావులు ఈ ‘హరామ్’ ను ‘హలాల్’గా నిరూపించడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఇది చాలా ఘోరమైన పాపం అన్న సంగతిని వారు మరచిపోతున్నారు. అల్లాహ్ వాక్యాలతో చెలగాటమాడటం ధిక్కారవైఖరికి ప్రతీక అని వారు గ్రహించకపోతే అది వారి గ్రహచారం. కనీసం హరామ్ ను హరామ్ గా భావించటం వల్ల వారికి వాటిల్లే నష్టం ఏమీలేదు కదా!
వడ్డీ నిషిద్ధం పై మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఉపదేశాలు
చివర్లో మేము వడ్డీ నిషిద్ధం మరియు దానికి సంబంధించి అల్లాహ్ తరఫున చేయబడిన హెచ్చరికలను తెలిపేందుకు గాను మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రవచనాలను పొందుపరచదలిచాము. కనీసం పాపాన్ని పాపంగా తలపోసే భావన అయినా ప్రజల్లో మేల్కొనాలన్నదీ, దానికి దూరంగా ఉండటానికి ప్రజలు ఉపాయాలు ఆలోచించాలన్నది మా ఉద్దేశ్యం. ఈ హరామ్ ను హలాల్ గా పరిగణించి వారు రెట్టింపు పాపాన్ని మూటగట్టుకోకుండా ఉన్నా చాలు కొంత వరకు ఉద్దేశ్యం నెరవేరినట్లే. ముస్లింలలో చాలా మంది రాత్రిపూట తహజ్జుద్ నమాజులో, అల్లాహ్ నామస్మరణలో గడుపుతారు. కాని తెల్లవారాక వారు తమ వ్యాపార వ్యవహారాలలో తలమునకలవగానే తాము వడ్డీ అనే అధర్మమైన వ్యవహారానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చేయూతనిస్తున్నామన్న సంగతి మరచిపోతారు. ఇది కడు శోచనీయమని వేరుగా చెప్పనవసరం లేదు. వడ్డీ గురించి తన అనుచర సమాజానికి మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేసిన హెచ్చరికల్ని చదవండి.
1) “ఏడు ప్రాణాంతక వస్తువుల బారి నుండి మిమ్మల్ని కాపాడుకోండి” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు. ‘అవేమిటి ఓ దైవ ప్రవక్తా!’ అని సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) ప్రశ్నించగా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు:- 1) ఒక్కడైన అల్లాహ్ (ఆరాధనలలో)కు సహవర్తునిగా వేరొక దైవాన్ని నిలబెట్టడం. 2) చేతబడి (బాణామతి) చేయడం, 3) ఏ వ్యక్తినయినా అన్యాయంగా హతమార్చడం 4) వడ్డీ తినడం 5) అనాధ సొమ్మును భక్షించటం. 6) ధర్మయుద్ధ సమయంలో యుద్ధ రంగం నుండి వెన్ను చూపి పారిపోవటం 7) సౌశీల్యవతి అయిన మహిళపై అపనింద మోపడం”. (ఈ హదీసు సహీహ్ బుఖారీ మరియు ముస్లింలో ఉంది.)
2) అంతిమ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఇవాళ రాత్రి నేను నా దగ్గరకొచ్చిన ఇద్దరు వ్యక్తుల్ని చూశాను. వాళ్లు నన్ను బైతుల్ మఖ్దిస్ వరకు గొనిపోయారు. మేము మరింత ముందుకు సాగిపోగా అక్కడ ఒక నెత్తుటి కాలువ కనిపించింది. అందులో ఒక మనిషి నిలబడి ఉన్నాడు. మరొకతను కాలువ ఒడ్డున నిలుచుని ఉన్నాడు. కాలువలో నిలుచున్న వ్యక్తి బయటకు రావటానికి యత్నించినపుడు ఒడ్డున ఉన్న వ్యక్తి అతని ముఖంపై రాయి రువ్వుతున్నాడు. ఆ దెబ్బతో అతడు మునుపున్న చోటికే పరుగెత్తుకెళుతున్నాడు. మళ్లీ అతడు కాలువ నుంచి బయట పడేందుకు ప్రయత్నించగా ఒడ్డున ఉన్నవాడు మళ్లీ రాయి రువ్వసాగుతున్నాడు. ఏమిటీ తతంగం? అని నేను నా వెంట వున్న ఇద్దరిని ప్రశ్నించగా ‘కాలువలో చిక్కుకుపోయిన వ్యక్తి వడ్డీ సొమ్ము తినేవాడు (ఇప్పుడు తన కర్మకు శిక్ష అనుభవిస్తున్నాడు) అని వాళ్లు బదులిచ్చారు.” (ఈ హదీసు సహీహ్ బుఖారీలోని కితాబుల్ బుయూలో ఉంది).
3) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వడ్డీ తీసుకునే వారినీ, వడ్డీ ఇచ్చే వారిని కూడా ధూత్కరించారు. మరికొన్ని ఉల్లేఖనాలలో వడ్డీ వ్యవహారం పై సాక్ష్యమిచ్చేవారు, తత్సంబంధితమైన దస్తావేజులు వ్రాసేవారు కూడా ధూత్కరించబడ్డారు.
సహీహ్ ముస్లింలోని ఒక ఉల్లేఖనంలో ఇలా అనబడింది “వీళ్ళంతా ఈ పాపంలో సమాన భాగస్థులే”. మరి కొన్ని ఉల్లేఖనాలలో, సాక్షులు, దస్తావేజులు వ్రాసేవారు తమకు అది వడ్డీ వ్యవహారం అని తెలిసి ఉన్న పక్షంలోనే ధూత్కారానికి గురవుతారు.
4) మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ప్రబోధించారు. “నాలుగు రకాల మనుషులున్నారు. వారికి స్వర్గంలో ప్రవేశం లభించదు గాక లభించదని అల్లాహ్ నిర్ధిష్టంగా నిర్ణయించాడు. ఆ నలుగురు ఎవరంటే (a) మద్యపానానికి ఆలవాటు పడినవాడు. (b) వడ్డీని తిన్నవాడు (c) అనాధ సొమ్మును అన్యాయంగా స్వాహా చేసేవాడు (d) తల్లిదండ్రుల మాట విననివాడు. (ఈ ఉల్లేఖనం ‘ముస్తద్రిక్ హాకిమ్’లో ఉంది)
5) మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు: “వడ్డీతో కూడిన ఒక్క దిర్హమ్ తిన్నవాడు ముప్ఫయి ఆరుసార్లు వ్యభిచారం చేసిన దానికన్నా ఎక్కువ పాపం చేసినట్లు లెక్క”.
మరొక ఉల్లేఖనంలో “అక్రమ ధనంతో పెరిగిన కండ కోసం అగ్నియే సబబైనది”.
దాంతో పాటు మరో ఉల్లేఖనం ఈ విధంగా ఉంది :- “ఒక ముస్లిం మాన మర్యాదల్ని మంట గలపడం వడ్డీ తినటం కన్నా ఎక్కువ పాపిష్టికరం” (ఈ ఉల్లేఖనం ముస్నద్ అహ్మద్, బ్రానీలలో ఉంది)
6) వేరొక హదీసులో ఉంది:- మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు “(వృక్షం యొక్క) ఫలం నిరుపయోగం కాక ముందే దాన్ని అమ్మి వేయాలి”. ఇంకా ఇలా అన్నారు – “ఏదేని ఒక పేటలో వ్యభిచారం, వడ్డీ వ్యాపారం పెరిగిపోతే అది అల్లాహ్ ఆగ్రహాన్ని తన పైకి ఆహ్వానించినట్లే.” (ఈ ఉల్లేఖనం ‘ముస్తద్రక్ హాకిమ్ లో ఉంది.)
7) మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు “ఏ జాతిలోనయినా లావాదేవీలు వడ్డీ ప్రాతిపదికగా సాగితే అల్లాహ్ వారిపై నిత్యావసర వస్తువుల ధరను విపరీతం చేస్తాడు. మరే జాతిలోనయినా లంచగొండితనం ప్రబలిపోతే శత్రువును చూసి వణికిపోయే భయోత్పాత స్థితి వారిపై నెలకొంటుంది”. (ఈ ఉల్లేఖనం ముస్నద్ అహ్మద్లో ఉంది)
8) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వివరించారు:- షబే మేరాజ్ సందర్భంగా మేము ఏడవ ఆకాశంలో చేరినపుడు నేను నా పైన ఒక మెరుపును చూశాను. ఆ తరువాత మాకు ఒక జన సమూహం తారసిల్లింది. వారి పొట్టలు నివాస గృహాల మాదిరిగా వ్యాకోచించి ఉన్నాయి. వాటిల్లో సర్పాలు నిండి ఉన్నాయి. అవి బయటకు కనిపిస్తూ ఉన్నాయి. ‘ఎవరు వీరు?’ అని నేను దైవదూత జిబ్రయీల్ (అలైహిస్సలాం)ని అడిగాను. ‘వీళ్లు వడ్డీ సొమ్ము తిన్నవారు’ అని ఆయన సమాధానమిచ్చారు. (ఈ ఉల్లేఖనం ముస్నద్ అహ్మద్ లో నిది)
9) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఔఫ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు)ని ఉద్దేశ్యించి చెప్పారు – “క్షమార్హం కాని పాపాలకు దూరంగా ఉండండి. వాటిల్లో ఒకటి:- యుద్ధప్రాప్తిని తస్కరించటం, రెండు:- వడ్డీ సొమ్ము తినటం”. (తబ్రానీ)
10) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా ఉపదేశించారు: “మీరు ఎవరికయితే అప్పు ఇచ్చారో అతన్నుంచి కానుక కూడా స్వీకరించకండి”. (బహుశా అతను ఈ కానుక అప్పుకు బదులుగా ఇచ్చాడేమో. అది బహుశా వడ్డీయేమో. అందుచేత అతని కానుకను స్వీకరించే విషయంలో కూడా జాగ్రత్తపడటం మంచిది.)
దివ్యఖుర్ఆన్లోని ఏడు వచనాలు మరియు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పది హదీసుల ఆధారంగా వడ్డీ నిషిద్దం గురించి స్థూలంగా మీ ముందుంచటం జరిగింది. విషయాన్ని వివరంగా చర్చిస్తే ఓ పెద్ద గ్రంథమే తయారవుతుంది . ధర్మంలో హరామ్ (నిషిద్ధం) – హలాల్ (ధర్మ సమ్మతం)లు కీలకమైనవి. మోమిన్ (విశ్వాసి) అయిన వాడు హలాల్ వస్తువులను స్వీకరించి హరామ్ వస్తువులను పరిత్యజిస్తాడు. హరామ్ వస్తువుల పట్ల ఏహ్యభావం కలిగి ఉంటాడు. ఇస్లామీయ షరీఅత్ హరామ్ గా ఖరారు చేసిన వాటిలో ఏదైనా హరామే. హరామ్ వస్తువుల జాబితాలో వచ్చే కొన్నింటిని అసహ్యించుకొని మరికొన్నింటిని స్వీకరించటం అంటే ధర్మాన్ని పాక్షికంగా అవలంబించటమే.
కాగా, అల్లాహ్ విశ్వాసుల్ని ఉద్దేశ్యించి ఏమంటున్నాడో తెలుసా?!
‘యా అయ్యుహల్లజీన ఆమనుద్ ఖులూ ఫిస్సిల్మి కాప్ఫహ్’ ఓ విశ్వాసులారా ! ఇస్లాంలో ప్రవేశిస్తే (పాక్షికంగా కాదు) పూర్తి స్థాయిలో ప్రవేశించండి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
భూకంపాలు, వరదలు మరియు ఇస్లాం సిద్ధాంతాలు – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/NClr-TiBAc4 [25 నిముషాలు]
ఈ వీడియోలో తెలుసుకోవలసిన విషయాలు:
1- భూకంపాలు సంభవించేలా చేస్తున్నది ఎవరు ? 2- సునామీలు, భూకంపాలు, వరదలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు సంభవిస్తాయి ? 3- అభం శుభం తెలియని పిల్లలు వీటి వల్ల మరణిస్తున్నారు వారు చేసిన పాపం ఏమిటి ? 4- దైవ వాక్యాలు బోధించే పండితులు సర్వం కోల్పోయి రోడ్డున పడుతున్నారు వారి నేరం ఏమిటి ? 5- ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక విశ్వాసి గా మన బాధ్యత ఏమిటి ? 6- పదే పదే ఎక్కువగా భూకంపాలు సంభవించటం దేనికి సంకేతం ? 7- పూర్తి భూమి కంపించే రోజు రానుందా ?
“మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది”. మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి. మీ బంధుమిత్రులను చేర్పించండి, ఇన్ షా అల్లాహ్. https://chat.whatsapp.com/JYb4QhZ4Hlu5Ek076Xx4fJ
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:
మూడు (కఫ్ఫారాత్) పరిహారాలున్నాయి, మూడు (దరజాత్) స్థానాలను పెంచేవి ఉన్నాయి మూడు (ముంజియాత్) మోక్ష సాధనాలున్నాయి మూడు (ముహ్ లికాత్) వినాశనానికి గురి చేసేటివి ఉన్నాయి
కఫ్ఫారాత్: 1- విపరీత చలిలో సంపూర్ణ వుజూ చేయుట 2- ఒక నమాజు తర్వాత మరో నమాజు కొరకు వేచించుట 3- జమాఅతుతో (సాముహిక) నమాజు చేయుట కొరకు కాలి నడకతో వెళ్ళుట.
దరజాత్: 1- అన్నం తినిపించుటు, 2- సలాం వ్యాపింపజేయుట 3- రాత్రి ప్రజలు పడుకున్నప్పుడు లేచి తహజ్జుద్ నమాజు చేయుట.
ముంజియాత్: 1- కోపం, సంతోషం అన్ని స్థితుల్లో న్యాయం పాటించుట 2- పేదరికం, సిరివంతం అన్ని స్థితుల్లో మధ్యేమార్గాన్ని అవలంభించుట 3- ఏకాంతంలో ఉన్నా, నలుగురి మధ్యలో ఉన్నా అల్లాహ్ తో భయపడుతూ ఉండుట.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
నోమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెబుతుండగా నేను విన్నాను:
“నిశ్చయముగా ‘హలాల్’ (ధర్మ సమ్మతమైన) విషయాలు స్పష్టంగా తెలుపబడ్డాయి, ‘హరామ్’ (నిషేధిత) విషయాలు కూడా స్పష్టంగా తెలుపబడ్డాయి. అయితే ఆ రెండింటి మధ్య కొన్ని అస్పష్ట విషయాలు ఉన్నాయి. వాటి గురించి చాలా మంది ఎరుగరు. అయితే ఎవరైతే అస్పష్ట విషయాలకు దూరంగా ఉంటారో, వారు తమ ధర్మాన్ని, గౌరవాన్ని కాపాడుకున్న వారవుతారు. మరి ఎవరైతే అస్పష్ట విషయాల్లో పడిపోతారో వారు ‘హరాం’ నిషిద్ధ విషయాల్లో పడిపోతారు. పశువుల్ని మేపుకుంటున్న కాపరిలా, అతను గరిక గట్టుపై పశువుల్ని మేపు కుంటుంటాడు. అతని పశువులు ప్రక్కనున్న పొలములోకి చొరబడే అవకాశం అతి దగ్గరలోనే వుంది. గుర్తుంచుకోండి! నిశ్చయంగా ప్రతి రాజుకి కాపాడుకునే సరిహద్దులుంటాయి. గుర్తుంచుకోండి! మరి నిశ్చయంగా అల్లాహ్ (సామ్రాజ్య) సరిహద్దులంటే ఆయన నిషేధించి (హరాం చేసి)న విషయాలే. వినండి.! నిశ్చయంగా మానవ శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉంది. అది క్షేమముగా వుంటే మొత్తం శరీరం క్షేమముగా వుంటుంది. ఒక వేళ అది చెడిపోతే మొత్తం మానవ శరీరమే చెడిపోతుంది. బాగా గుర్తుంచుకోండి! ఆ మాంసపు ముద్దే మానవ హృదయం”.
1. ‘షరీఅత్’లో హలాల్ (సమ్మత), మరియు హరామ్ (అసమ్మత) విషయాలను వివరించబడింది. ఇక అస్పష్టమైన అంశాలు కొన్ని వున్నాయి, వాటి గురించి లోతైన అవగాహన కొందరికే ఉంటుంది.
2. ప్రవక్త వారి ఉన్నతమైన బోధనా ఉదాహరణలతో కూడి ఉన్నది.
3. బుద్ధి (ఆలోచన) అనేది హృదయంలో వుంటుంది. ప్రవక్త వారి అదేశం: వినండి.! నిశ్చయంగా మానవ శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉంది. అది బాగుంటే మొత్తం శరీరం బాగుంటుంది. ఒకవేళ అది చెడిపోతే మొత్తం మానవ శరీరమే చెడిపోతుంది. బాగా గుర్తుంచుకోండి! అదే మానవ హృదయం”.
4. అలజడి గాని, దిద్దుబాటు గాని, హృదయం చుట్టూ తిరుగుతుంటుంది. అందుకనే ప్రతి చక్కబెట్టే విషయంతో హృదయాన్ని చక్కబెట్టడానికి ప్రయత్నిస్తూవుండాలి.
5 అన్ని అవయవాల కంటే హృదయం ఉన్నతమైనది.
6. బాహ్య విషయాల్లో అలజడి అంతర విషయాల్లోని అలజడిని దృవీకరిస్తూంది. “వినండి.! నిశ్చయంగా మానవ శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉంది. అది క్షేమముగా వుంటే మొత్తం శరీరం క్షేమముగా వుంటుంది. ఒకవేళ అది చెడిపోతే మొత్తం మానవ శరీరమే చెడిపోతుంది. బాగా గుర్తుంచుకోండి! అదే మానవ హృదయం”.
7. అస్పష్ఠ విషయాల్లో పడకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే స్పష్టమైన (హరాం) విషయాలకు గురికాకుండ ఉండటానికి.
8. ధార్మిక విషయాలను మరియు మానవాళికి సౌలభ్యం చేకూర్చె వాటిని కాపాడాలి.
9. అనుమానాలు రేకెత్తించే విషయాలకు దూరంగా వుండాలి.
10. ఎవరైతే అస్పష్ఠ విషయాలలో జాగ్రత్త వహించరో వారు తమకు తాము వాటితో మిళితం చేసుకుంటారు లేక హరాం (నిషేధిత) విషయాలకు లోనవుతారు.
11. హరాం (నిషేధిత) విషయాల వైపుకు ప్రేరేపించే వాటికి అడ్డుకట్ట. ప్రవక్త ( సల్లల్లాహు అలైహి వసల్లం) వాక్యం: “గుర్తుంచుకోండి! నిశ్చయంగా ప్రతి రాజుకి ఒక కాపాడుకునే కంచె ఉంటుంది. గుర్తుంచుకోండి! మరి నిశ్చయంగా అల్లాహ్ (సామ్రాజ్య) సరిహద్దులంటే ఆయన నిషేధించి (హరాం చేసి)న విషయాలే”.
12. మంచి వృత్తిని ఎన్నుకోవడంలో హృదయము యొక్క దిద్దుబాటు వుంటుంది.
13. ధార్మిక జ్ఞానములో స్పష్టత సాధించాలని ప్రోత్సహించబడింది.
14. ‘ముర్జియా’ (ఒక వర్గం పేరు) యొక్క విశ్వాస’ భావనలను ఖండించబడింది. వారి భావన: “ఈమాన్ ఉంటే పాపాలు (దుష్కార్యాలు) నష్టపర్చలేవు”.
హదీసు ఉల్లేఖులు
హజ్రత్ అబూ అబ్దుల్లాహ్ నౌమాన్ బిన్ బషీర్ (రజియల్లాహు అన్హు):
నౌమాన్ బిన్ బషీర్ బిన్ సఅలబ బిన్ సఅద్ బిన్ ఖల్లాస్, అల్ అన్సారి, అల్ ఖజ్ రజి పేరు. ‘కున్నియత్’ ‘అబూ అబ్దుల్లాహ్ ‘. వీరి తల్లి దండ్రులు ఇద్దరు సహాబీలుగా పేరుగావించినవారు. ‘హిజ్రత్’ యొక్క 14వ మాసములో జన్మించారు, మదీన అన్సారుల్లో వున్నందున అన్సారి మరియు మదనిగా పిలవబడ్డారు. ‘షామ్’ లో నివాసము ఏర్పర్చుకున్నారు. ‘ముఆవియహ్’ తరపున తొలుత ‘కూఫా’ తరువాత ‘హిమ్స్’ ప్రాంతాల యొక్క అధికారి, మరియు గవర్నరుగా నిర్ణయించబడ్డారు. 64వ హి.శ. లో ‘రాహిత్’ నాడు ‘ఖాలిద్ బిన్ ఖలీ, కలాయి’ చేతుల్లో ‘షహీద్’ (అమరగతులు) అయ్యారు. హదీసు గ్రంథాల్లో వారి ఉల్లేఖనాల సంఖ్య 114గా చెప్పబడుతుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.