దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
క్రింది లింక్ నొక్కి పూర్తి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి మార్గదర్శక ఖలీఫా హజ్రత్ ఉమర్ ఫారూఖ్ (రదియల్లాహు అన్హు) [డైరెక్ట్ PDF] [71పేజీలు] మూలం : మౌలానా చిరాగ్ హసన్ హస్రత్ , అనువాదం : సుహైల్ అహ్మద్ అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్
తొలి పలుకులు
మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రియ సహచరుల గురించీ, ముఖ్యంగా మార్గదర్శక ఖలీఫాల (ఖులఫాయె రాషిదీన్) జీవిత చరిత్ర గురించి పుస్తకాలు ఎందుకు ప్రచురించటం లేదు? అని పాఠకులు చాలా కాలంగా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఒనరుల కొరతవల్లనూ, ఇతరత్రా పనుల ఒత్తిడి మూలంగానూ పాఠకుల ఈ కోర్కెను ఇంతకాలంగా వాయిదా వేస్తూ వచ్చాము. అల్లాహ్ కృప వల్ల గత నెలలోనే ప్రథమ ఖలీఫా హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) జీవిత విశేషాలపై ఒక చిరుపుస్తకాన్ని వెలువరించాము.
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శిక్షణలో ఆరితేరిన సహాబీలు ఎంతో అదృష్టవంతులు. ప్రవక్తగారి ఒక్కొక్క పలుకును, ఒక్కొక్క సంజ్ఞను శిరసావహించి, ఒక్కో ఆచరణను తు.చ. తప్పకుండా అనుసరించిన సహాబీల జీవితాలను అధ్యయనం చేసిన కొద్దీ మన “విశ్వాసం” (ఈమాన్) బలపడుతుంది. ధర్మపథంలో ఆత్మస్థయిర్యం ఒనగూడుతుంది.
మీ ముందున్న ఈ చిరుపుస్తకం (ద్వితీయ ఖలీఫా హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు) కూడా మీ ధార్మిక పరిజ్ఞానంలో వృద్ధినొసగగలదని భావిస్తున్నాము. తెలుగు అనువాదకులు మిత్రులు సుహైల్ అహ్మద్ గారు గత ఐదారేండ్లుగా అల్ హఖ్ రెసిడెన్షియల్ స్కూలు (హైదరాబాద్)లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఈయన మొదటిసారిగా ‘తర్జుమా’కు ఉపక్రమించారు. మున్ముందు వీరు మరిన్ని రచనలు, అనువాదాలు చేయగలరని ఆశిస్తూ.
– అజీజుర్రహ్మాన్ (డైరెక్టర్, అల్హఖ్ తెలుగు పబ్లికేషన్స్)
ఇస్లాంకు పూర్వం
మక్కా నగరానికి నాయకత్వం వహించే ఖురైష్ తెగ పది శాఖలుగా చీలి ఉండేది. ఆ పది కుటుంబ పెద్దలపై వేర్వేరు బాధ్యతలు ఉండేవి. ఒకరు కాబా గృహ యాత్రీకులకు నీళ్ళందించేవారు. మరొకరు నేర విచారణ జరిపేవారు. అలాగే ఇంకొక కుటుంబం యుద్ధకాలంలో సైన్యాధిపత్య బాధ్యతలు స్వీకరించేది. ఈ పది కుటుంబాల్లో బనూ అదీ (అదీ కుటుంబం) కూడా ఒకటి. ఖురైష్ తెగవారు ఇతర తెగల వద్దకు రాయబారం పంపించదలచినప్పుడు, అదీ కుటుంబీకులకే ఈ కార్యబాధ్యతలు అప్పగించేవారు. ఈ అదీ కుటుంబానికి చెందినవారే హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు).
హజ్రత్ ఉమర్ (రజి) హిజ్రత్కు నలభై సంవత్సరాల ముందు జన్మించారు. ఆయన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కన్నా పదమూడు సంవత్సరాలు మరియు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ (రజి) కన్నా పదకొండు సంవత్సరాలు వయస్సులో చిన్నవారు. వీరి కుటుంబాలు సఫా మర్వా కొండ ప్రాంతాల నడుమ ఉండేవి. హజ్రత్ ఉమర్ (రజి) కూడ ఇక్కడే జన్మించారు. పెరిగి పెద్దవారయింది కూడా ఇక్కడే. ప్రాజ్ఞ వయసొచ్చేసరికి నాన్నగారు ఒంటెలు మేపే పనిని అప్పగించారు. ఒక అంగి వేసుకొని మక్కా సమీపంలోని మైదానంలో ఒంటెలు మేపేవారాయన. పని చేస్తూ అలసిపోయి విశ్రాంతి కోసం కొద్దిసేపు కూర్చొన్నప్పుడు తండ్రిగారి చేతి మొట్టికాయలు పడేవి.
ఆ రోజుల్లో, అరబ్బుల్లో వంశపారంపర్య జాబితాల కంఠస్థం ఒక తప్పనిసరి విద్యగా పరిగణించబడేది. కొందరికైతే వేరు వేరు తెగలకు చెందిన పుట్టుపూర్వోత్తరాలన్నీ జ్ఞాపకముండేవి. వీరు తమ తాత ముత్తాతల పేర్లతో పాటు తమ వంశస్థుల పేర్లనన్నింటినీ చకచకా చెప్పేవారు. హజ్రత్ ఉమర్ (రజి) వంశస్థులు కూడా ఈ అద్భుత విచిత్ర విద్యలో ఆరితేరినవారే. ఉమర్ గారు కూడా స్వయాన తన తండ్రి ఖత్తాబ్ నుండి ఈ విద్యను అభ్యసించారు. ఏకాగ్రచిత్తంతో పరిశ్రమించి నిష్ణాతులనిపించుకున్నారు. దీంతోపాటు ఆయన సైనిక విన్యాసాల్లోని మెళుకువలన్నింటిపై బాగా పట్టు సంపాదించారు. తృటిలో అశ్వంపై లంఘించి వాయువేగంతో దూసుకు పోతుంటే, (వేగంలో) వాహనానికి, వాహకుడికి మధ్య తారతమ్యం కానరాకుండా పోయేది.
మక్కాకు సమీపంలో ‘అక్కాజ్’ అనే విశాల మైదానముండేది. ప్రతి సంవత్సరం అక్కడ భారీ మేళాలు వెలిసేవి. కళాప్రవీణులందరూ అక్కడ గుమిగూడేవారు. ప్రదర్శనలు-విన్యాసాలు-ప్రతిఘటనల మధ్య ఈ మేళాలు అనంత వైభవంతో, అపార సౌందర్యాలతో ప్రేక్షకులనలరించేవి. యుద్ధవీరులు సైనిక విన్యాసాలు ప్రదర్శించేవారు.
కవిపుంగవులు తమ కవిత్వాల ద్వారా ప్రజల నీరాజనాలు పొందేవారు. గుర్రపుస్వారీ, బాణసంచా ఖడ్గపోరాటం మల్ల యుద్ధాల్లో పోటీలు జరిగేవి. హజ్రత్ ఉమర్ (రజి) కూడా “అక్కాజ్ మైదానంలో మల్ల యుద్ధ పోటీల్లో పాల్గొనేవారు. ఆయన అరబ్బులందరిలో ఎదురులేని పరాక్రమశాలిగా పేరు పొందారు. హజ్రత్ ఉమర్ (రజి) స్వయంగా కవి కాకపోయినా కవిత్వంపై గల ఆసక్తి వల్ల ఎందరో కవుల కవిత్వాలను జ్ఞాపకముంచుకొనేవారు.
ఆజానుబాహులు. ఆయన పదిమందిలో నిల్చుంటే (గుర్రంపై కూర్చున్నట్లు) ఎత్తుగా కనిపించేవారు. ఆయన కంఠం కంచుకంఠం. హజ్ సమయంలో తన గుడారం నుండి ‘తక్బీర్’ పలికితే మస్జిద్ దాకా వినిపించేది. అనర్గళ ఉపన్యాసాల ద్వారా ప్రజల హృదయాలను ఆకట్టుకునే ప్రావీణ్యం గల వక్త ఆయన. ఆయన నైజంలో కోపం కించిత్ ఎక్కువ ఉండేది. ఆయనంటే అందరూ భయపడేవారు. ఖలీఫా అయిన తరువాత ఆయన మనస్సు కొంచెం మెత్తబడింది. అరబ్బుల్లో సాధారణంగా అన్ని తెగలు, ప్రధానంగా ఖురైష్ తెగ ముఖ్యవృత్తి వ్యాపారం. వ్యాపార నిమిత్తం కొందరు సిరియా ఈరాన్లలో పర్యటించగా, మరికొందరు భారత్-చైనాలకు పయనించేవారు. హజ్రత్ ఉమర్ (రజి) కూడా వ్యాపారం చేసేవారు. విద్యావంతులు తక్కువగా ఉండే ఆ కాలంలో, హజ్రత్ ఉమర్ (రజి) యుక్త వయస్సులోనే విద్యనభ్యసించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దైవదౌత్యం లభించినప్పుడు, ఖురైష్ తెగలో ప్రతిభావంతులైన విద్యావంతుల సంఖ్య కేవలం పదిహేడు మాత్రమే!
ఇస్లాం స్వీకారం
హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) ఆఖరి సంతానమైన హజ్రత్ ఇస్మాయీల్ (అలైహిస్సలాం) వంశానికి చెందినది ఖురైష్ కుటుంబం. ఆరంభ దశలో వారు తమ మత పెద్దలనుసరించే మతాన్నే అవలంబించేవారు. వారి మత పెద్దలు నిఖిల జగతికి యజమాని అయిన అల్లాహ్ నే ఆరాధించేవారు. కాలం గడిచిన కొలదీ, వారందరూ సన్మార్గాన్ని వీడి అపమార్గాల్లో జీవనం గడపసాగారు. చివరకు దైవ ధిక్కార ధోరణికి కూడా ఒడిగట్టుతూ, సూర్యచంద్ర నక్షత్రాలను, రాయీరప్పలను ఆరాధ్యదైవాలుగా పూజించసాగారు. దైవభీతికి దూరమై, స్వేచ్ఛాజీవులై నిర్భయంగా జీవిస్తూ, అతిపవిత్రమైన కాబా గృహంలోనే మూడొందల అరవై విగ్రహాలను ప్రతిష్ఠించారు. వారినే ఆరాధ్య దైవాలుగా, ఆపద్బాంధువులుగా భావించి, పూజాపునస్కారాలు జరపసాగారు. మొక్కుబడులు తీర్చుకొనేవారు. అయితే ఆ అజ్ఞానయుగంలో విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఏకేశ్వరవాదాన్ని విశ్వసించే సజ్జనులు అప్పటికీ కొందరున్నారు. వారు హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) మతాన్ని అవలంబించేవారు. హజ్రత్ ఉమర్ (రజి) పినతండ్రి కుమారుడైన ‘జైద్ బిన్ నఫీల్’ కూడా వారిలో ఒకరు. ఆయన సాంగత్య ప్రభావం వల్ల బాల్యదశ నుండి హజ్రత్ ఉమర్ (రజి) చెవుల్లో ఏకేశ్వరనినాదాలు ప్రతిధ్వనింపసాగాయి. అయినప్పటికీ ఆయన తమ పూర్వీకుల మతంపైనే నిలకడగా ఉన్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దైవదౌత్యం లభించిన తరువాత చాలాకాలం వరకు కూడా ఆయన ఇస్లాం స్వీకరించలేదు.
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దైవదౌత్యం లభించినప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) వయస్సు ఇరవై ఏడు సంవత్సరాలు. ఆయన మక్కా నగర ప్రముఖులలో ఒకరుగా పరిగణింపబడేవారు. అదీ కుటుంబానికి అప్పగింపబడిన కార్యబాధ్యతలన్నీ హజ్రత్ ఉమర్ స్వయంగా నిర్వహించేవారు. ఖురైష్ నాయకులు వేరే తెగ వైపుకు రాయబారం పంపించదలచినప్పుడు, హజ్రత్ ఉమర్ (రజి)నే పంపించేవారు. ఎందుకంటే, ఆయన వాక్చాతుర్యం అటువంటిది. సంసార గొడవల్లో ఎప్పుడైనా ఇరువురి మధ్య కలహాలు రేగి, కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) పెద్దమనిషిగా తీర్పులు ఇచ్చేవారు. మక్కా నగరంలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏకేశ్వర నినాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ప్రముఖులలో హజ్రత్ ఉమర్ (రజి) కూడా ఉన్నారు. ఒకమారు ఆయన తన వద్ద బానిసరాలిగా ఉండే ‘లుబీనా’ ఇస్లాం స్వీకరించగా, ఆమెను శతవిధాలా దండించారు.
ఒకరోజు ఆయన మక్కానగర స్థితిగతులపై ఆలోచిస్తూ, మక్కానగరంలో రోజు-రోజుకూ విపరీతంగా ప్రబలుతున్న ఏకేశ్వర నినాదానికి మూలకారకుడైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను హతమార్చడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమని భావించి ఇంటి నుండి బయలుదేరారు. మార్గమధ్యంలో (అంతకు ముందే ఇస్లాం స్వీకరించిన) అదీ తెగసభ్యుడు ‘నయీమ్ బిన్ అబ్దుల్లా’ తారసపడ్డారు. కుశల ప్రశ్నలు వేశారు నయీమ్. హజ్రత్ ఉమర్ (రజి) ముఖకవళికలను గమనించిన నయీమ్ కు ప్రమాద సూచిక కనిపించింది. ‘ఎక్కడికి వెళ్తున్నావు?’ అని అడిగారు నయీమ్. “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను హతమార్చడానికి” అని ఆవేశంతో సమాధానమిచ్చారు ఉమర్ . అందుకు నయీమ్ స్పందించి ‘ముందు నీ ఇంటి వ్యవహారం చక్కదిద్దుకో, స్వయంగా నీ అక్కా-బావలిద్దరూ ముస్లింలైపోయారు” అని చెప్పారు. అంతే! హజ్రత్ ఉమర్ (రజి) వెనుతిరిగారు. తిన్నగా సోదరి ఇంటికే వెళ్ళారు. ఆ సమయంలో వారిద్దరూ దివ్యఖురాన్ పారాయణంలో నిమగ్నులై ఉన్నారు. హజ్రత్ ఉమర్ (రజి) రాకను గమనించిన వారిద్దరూ దివ్యఖురాన్ పవిత్ర పుటలను దాచేశారు. ‘ఇందాక మీరు చదువుతున్నదేమిటి?’ అని నిప్పులు చెరుగుతూ అడిగారు ఉమర్. దానికి ఆ దంపతులిద్దరూ సమాధానమివ్వక మౌనం వహించారు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) “మీరిద్దరూ, మన పూర్వీకుల ధర్మాన్ని విడనాడారని నాకు తెలిసింది” అని అగ్రహోదగ్రులై బావను కొట్టసాగారు. సోదరి అడ్డుపడగా ఆమెను కూడా ఎడాపెడా బాదారు. ‘మా ప్రాణాలు పోయినా సరే, మేము ఇస్లాం నుండి వెనుదిరగడం అసంభవం” అని వారిద్దరూ నిర్ద్వంద్వంగా చెప్పేశారు. రక్తంలో తడిసి ముద్దయిన సోదరిని చూచి, ఆయన ఆవేశం చల్లబడింది. ‘సరే….. మీరిందాకా చదివిందేమిటి? చూపించండి?” అన్నారు ఉమర్ (రజి). దివ్యఖురాన్ పుటలను కొన్నిటిని ఆయనకు చూపించారు ఆ దంపతులు. ఆయన కూడా దైవగ్రంధ పారాయణం మొదలెట్టారు. పఠిస్తున్న కొద్దీ ఆయన ముఖకవళికలలో మార్పు రాసాగింది. దైవగ్రంధ వచనాలలోని మాధుర్యాన్ని ఆయన ఆస్వాదించసాగారు. నెమ్మదిగా రాతిగుండె కరగడం మొదలెట్టింది. ఒక్కసారిగా ఆలోచనా సముద్రంలో మునిగిపోయారు. కొన్ని క్షణాల తరువాత అప్రయత్నంగా ఆయన నోట వెలువడిందొక నిర్ణయాత్మకమయిన వాక్యం! “నేను అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసిస్తున్నాను”.
అక్కడ నుండి నేరుగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకు బయలు దేరారు. తలుపు తట్టి లోనికి ప్రవేశానికై అనుమతికోరారు. ఖడ్గము చేతపట్టుకొని యున్న హజ్రత్ ఉమర్ (రజి)ను చూచిన సహచరులందరూ ఆందోళన చెందారు. అప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పినతండ్రియైన హజ్రత్ హమ్జా (రజి) అక్కడే ఉన్నారు. ఆయన కూడా మక్కా నగరంలో ఎన్నదగ్గ శూరుడు. “మంచి ఉద్దేశ్యంతో వస్తే సరి… లేదా… అతని ఖడ్గంతో అతన్నే వధిస్తాను!” అని హజ్రత్ హమ్డా (రజి) అందరికీ అభయమిచ్చారు.
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) లేచి, ఉమర్ తో “నీ రాకలోని ఉద్దేశ్య మేమిటి?” అని నిదానంగా అడిగారు. అందుకు ఉమర్ (రజి) కంపిస్తూ “ఇస్లాం స్వీకరించడానికి వచ్చాను.” అని సమాధానమిచ్చారు. ఈ మాట విన్న ముస్లింలందరూ సంతోషంతో ‘అల్లాహు అక్బర్’ అంటూ మక్కా పర్వతాలన్నీ ప్రతిధ్వనించేలా తక్బీర్ పలికారు.
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దైవదౌత్యం లభించిన ఆరవయేట హజ్రత్ ఉమర్ (రజి) ఇస్లాం స్వీకరించారు. అప్పటికి ఆయన వయస్సు ముప్ఫైమూడు సంవత్సరాలు. ఆయన ఇస్లాం స్వీకారం మక్కాలో తీవ్ర సంచలనం సృష్టించింది. విరోధులందరూ ఆయన ఇంటిని చుట్టుముట్టారు. పలు దిశల నుండి నిరసన ధ్వనులు మ్రోగసాగాయి. ఆయన నిర్ణయానికి మండి పడినప్పటికీ బంధుప్రీతి మూలంగా కొంతమంది ఆయన జోలికి రాలేకపోయారు. వారందరూ కేవలం నిరసనలు, నినాదాలతోనే తమ కోపాగ్నిని బహిర్గతం చేశారు. హజ్రత్ ఉమర్ (రజి) ఇస్లాం స్వీకరణ నాటికి మక్కాలో ముస్లింల సంఖ్య కేవలం నలభై మాత్రమే. వారు తమ తమ ఇండ్లల్లోనే నమాజ్ చేసేవారు. ‘కాబా’లో నమాజ్ చేయడానికి ఎవరూ సాహసించేవారు కాదు. కాని హజ్రత్ ఉమర్ (రజి) ఇస్లాం స్వీకరణతో ముస్లింలందరూ నిర్భయంగా కాబాలో నమాజ్ చేయగలిగారు. వారినడ్డుకునే ధైర్యం ఎవరికీ లేకపోయింది.
ఇస్లాం స్వీకారం తరువాత
హజ్రత్ ఉమర్ (రజి) ఇస్లాం స్వీకరించిన తరువాత ఏడు సంవత్సరాల వరకు మక్కాలోనే ఉన్నారు. ఆ కాలం విశ్వాసులకు వ్యధాభరితమైన కాలం. దైవ తిరస్కారులు (కాఫిర్లు) ముస్లింలను శతవిధాలుగా హింసించేవారు. చిత్రహింసలూ పెట్టేవారూ. మక్కానగర వీధులగుండా విశ్వాసులెవరైనా పోతూ ఉంటే వారిని పరిహసించేవారు. రాళ్ళు రువ్వి గాయపరచేవారు. ఇస్లాం స్వీకరించిన బానిసలను, దళిత జనులను అనుదినం వేధించడం మామూలే. అయితే, మక్కాలో ఇస్లాం స్వీకరించిన ప్రముఖులను, సర్దారులను కూడా ఖురైషులు వదలలేదు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పినతండ్రి అయిన అబూతాలిబ్ (హజ్రత్ అలీ తండ్రి) ఇస్లాం స్వీకరించనప్పటికీ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అన్ని విధాల ఆదుకునేవారు. ఆయన ప్రవర్తనను పరికించిన ఖురైషీయులు, ఆయనకు అల్టిమేటం ఇస్తూ, “మీ అబ్బాయిని మాకప్పగించండి, లేదా మాదారి నుండి వైదొలగండి” అని చెప్పేశారు. కాని ఆయన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తోడ్పడటం మానలేదు. పైగా ఆయన హషిమ్ కుటుంబీకులందరినీ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సహాయపడేలా ఒప్పించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అబూతాలిబ్ అండదండలు ఉన్నంత వరకు వారితో సంబంధములన్నీ తెంపుకోవాలని ఖురైషీయులు నిశ్చయించారు. సంఘ బహిష్కారానికి సంబంధించిన పత్రాన్ని వ్రాయించి, దానిపై అందరి సంతకాలు తీసుకొని కాబా గృహం వద్ద దానిని వ్రేలాడదీశారు.
అబూతాలిబ్ కుటుంబ సభ్యులందరితో కలసి ఒక పర్వత లోయలో శరణు తీసుకున్నారు. అది ‘షేబే- అబీతాలిబ్’ లోయగా ప్రసిద్ది చెందింది. లోయ వాసులకు ఎలాంటి అన్నపానీయాలు సరఫరా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు ఖురైషీయులు. లోయల్లో అబీతాలిబ్ కుటుంబీకులందరూ దాదాపు మూడు సంవత్సరాలు ఆకులలములు తిని కడు దీనావస్థలో కాలం వెళ్ళబుచ్చేవారు. వారి పిల్లలు ఆకలిదప్పులకు తాళలేక అలమటిస్తూ ఉన్నా ఖురైష్ కరకు గుండెలు కరిగేవి కావు. వ్యధాభరితమైన ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండిన ముస్లింలు అవకాశం దొరికినప్పుడు చాటుగా తినుబండారాలు సరఫరా చేసేవారు. కాని అవి వారందరికీ సరిపోయేవి కావు. లోయవాసులు దయనీయస్థితిపై జాలి కలిగిన కొందరు బసూహాషిమ్ బంధువులు దైవగృహ ద్వారంపై వ్రేలాడదీసియున్న ఫర్మానాను చించివేశారు.
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మూడు సంవత్సరాల అతికఠినమైన సంఘబహిష్కార ఆంక్షల నుండి విముక్తి పొందిన కొద్దిరోజుల్లోనే మరో విషాదకర సంఘటన జరిగింది. పినతండ్రి అబూతాలిబ్ మరణించారు. వాలుగు రోజుల తరువాత ప్రవక్త సతీమణి హజ్రత్ ఖదీజా (రజి) కూడా ఊర్థ్వలోకాలకెళ్ళి పోయారు. అబూతాలిబ్ బ్రతికి ఉన్నంతకాలం ఖురైషీయులు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జోలికి పోవడానికి సాహసించలేకపోయేవారు. వారెప్పుడైనా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు హాని కల్గించే యత్నం చేసినా, అబూతాలిబ్ అండదండల వలన వారి ఎత్తులు ఫలించేవి కావు. కాని అబూతాలిబ్ మరణంతో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను కాపాడుతున్న తాలిబ్ రక్షాకవచము కూడా తొలగిపోయింది. ముస్లింలపై ఖురైషీయుల ఆగడాలు పెచ్చరిల్లిపోయాయి. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దైవదౌత్యం లభించిన తొమ్మిదవయేట అబూతాలిబ్ మరణించారు. అయితే మక్కాకు సుమారు రెండొందల మైళ్ళ దూరంలో ‘యస్ రిబ్’ అని పిలువబడే మదీనా పట్టణానికి ఇస్లాం పరిమళం సోకింది. స్వల్పకాల వ్యవధిలోనే అనేకులు ఇస్లాం స్వీకరించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనాకు ఏతెంచాలని మదీనా ముస్లింలు కోరారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనకు బదులు సహాబీలను మదీనా వెళ్ళడానికి అనుమతించారు. మొదటి విడత ఐదుమంది మదీనా వెళ్ళారు. వారిలో హజ్రత్ బిలాల్ (రజి) ఒకరు. రెండవ విడత హజ్రత్ ఉమర్ (రజి) ఇరవై సహాబీలతో మదీనాకు ప్రస్థానం చేశారు. ఈ విధంగా దాదాపు ముస్లింలందరూ మదీనా వెళ్ళిన తరువాత, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ అబూబకర్ (రజి)తో కలిసి మదీనాకు పయనించారు. అందరికన్నా చివర హజ్రత్ అలీ (రజి) మదీనాకు చేరారు. ఎందుకంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనవద్ద ప్రజలు ఉంచిన అమానతులను సంబంధీకులకు అప్పగించే బాధ్యతను హజ్రత్ అలీ (రజి) గారిపై మోపారు.
ఆనాడు మదీనా పట్టణం చాలా చిన్నది. అందుచేత మహాజిరు లందరూ ఆ పట్టణానికి దాదాపు మూడు మైళ్ళ దూరంలో ఉన్న ‘ఖుబా’ ప్రాంతంలో నిలిచారు. హజ్రత్ ఉమర్ (రజి)కూడా అక్కడే బసచేశారు. కొన్ని రోజుల తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), హజ్రత్ అబూబకర్ (రజి) ఇద్దరూ కలసి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రెండువారాల పాటు బసచేసి, ఒక ఆరాధనాలయాన్ని (మస్జిద్ ను) నిర్మించారు. తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనా వెళ్ళిపోయారు. కాని హజ్రత్ ఉమర్ (రజి) ‘ఖుబా’లోనే ఉండిపోయారు. అటు మదీనాలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహాజిర్ల మరియు అన్సార్ల మధ్య సోదర ఒప్పందం చేయించారు. మదీనా ప్రజలు, తమతో మమేకమైన మక్కావాసికి, తమ సిరిసంపదలన్నింటిలో సగభాగం పంచిపెట్టారు. మదీనావాసుల్లో ప్రముఖుడైన (బనూసాలెమ్ తెగ సర్దారు) ‘ఉత్బాన్ బిన్ మాలిక్’ (రజి) ఖుబా నగరంలోనే ఉన్నారు. హజ్రత్ ఉత్బాన్ బిన్ మాలిక్ (రజి) హజ్రత్ ఉమర్ (రజి)లు రెండ్రోజుల కొకసారి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో హాజరవటం మామూలుగా చేసుకున్నారు. మదీనా చేరిన తరువాత మస్జిదె నబవీలో నమాజీల సంఖ్య బాగా పెరగసాగింది. ముస్లింలకు సరైన సమయానికి నమాజుకు పిలిపించటానికి ఒక వ్యవస్థ అనేది ఉండాలని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తలంచారు. ఎందుకంటే సమయ నిర్ధారణ లేనందువలన కొందరు సమయానికన్నా ముందు, మరికొందరు ఆలస్యంగా నమాజుకు వచ్చేవారు. సరైన సమయం తెలియనందున కొందరు సామూహిక నమాజ్ కూడా చేయలేకపోయేవారు. క్రైస్తవుల వలే తాము కూడా శంఖమూది నమాజ్ వైపుకు పిలువవచ్చు అని కొందరు సలహా ఇచ్చారు. ఆ సమయంలో హజ్రత్ ఉమర్ (రజి) కూడా అక్కడే ఉన్నారు. శంఖమూది ప్రజలను నమాజ్ వైపు పిలవడానికి బదులుగా, ఒక వ్యక్తిని నియమించి అతనికి ఈ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఆయన సలహా నచ్చింది. అప్పుడే, ఆయన మధుర కంఠస్వరం గల హజ్రత్ బిలాల్ (రజి)ను ఈ పని నిమిత్తం నియమించారు. అజాన్ ఇవ్వమని ఆదేశించారు. అప్పటి నుండీ ప్రజలకు దైవారాధన వైపుకు పిలవటానికి ఈ సులువైన ప్రభావవంతమైన విధానం ఆచరణలో ఉంది. ఇది ఒక విధంగా నమాజ్కు ఉపోద్ఘాతం వంటిది.
హిజ్రత్ అనంతరం
హిజ్రత్ అనంతరం ముస్లింలకు ఖురైష్ సుదీర్ఘ యుద్ధ పరంపరకు బీజం పడింది. ప్రారంభంలో ఇరువురి మధ్య చిన్నపాటి జగడాలు మాత్రమే జరిగేవి. హిజ్రత్ రెండవ సంవత్సరం బద్ర్ మైదానంలో సంభవించిన ధర్మసంగ్రామం, ఖురైషీయుల శక్తి ప్రాబల్యములన్నింటినీ నీరుగార్చింది. వంద స్వారీలు కలిగి, వేయిమంది సైనికులతో ఖురైషీయులు కయ్యానికి కాలుదువ్వారు. వారిని ప్రతిఘటించడానికి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కేవలం మూడొందల పదమూడు మంది యోధులతో సంగ్రామ స్ధలానికి చేరుకున్నారు. హజ్రత్ ఉమర్ (రజి) పన్నెండు మందితో కలసి పాల్గొన్నారు. అందులో కొందరు ఆయన కుటుంబీకులు కాగా, మరికొందరు మిత్రవర్గానికి చెందినవారు. అల్లాహ్ ఈ యుద్ధంలో ముస్లింలకు అద్భుత విజయాన్ని ప్రసాదించాడు. శత్రుసైన్య ప్రముఖ నాయకుడైన అబూజహల్తో పాటు డెబ్బైమంది శత్రు సైనికులు ఈ యుద్ధంలో మరణించారు. దాదాపు అంతేమంది బంధించబడ్డారు కూడా. విశ్వాసవర్గానికి చెందిన పద్నాలుగు మంది సైనికులు అమరగతి నొందారు. హజ్రత్ ఉమర్ (రజి) కూడా ఈ యుద్ధంలో వీరోచితంగా పోరాడారు. ఈ యుద్ధంలో హజ్రత్ ఉమర్ (రజి) చేత హతమార్చబడిన ఖురైష్ ప్రధాన నాయకుడు ‘హజ్రత్ ఆసీ బిన్ హెషామ్’ వరుసకు ఆయన మామ అవుతాడు. విశ్వాసవర్గ వైపు నుండి వీరగతి పొందిన వారిలో హజ్రత్ ఉమర్ (రజి) బానిస ‘మహాబా’ కూడా ఉన్నాడు. ఖైదీలుగా బంధించబడిన వారిలో కొందరు ముస్లింల బంధువులు కూడా ఉన్నారు. ఖైదీలుగా బంధింపబడ్డ హజ్రత్ అబ్బాస్ (రజి), మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు పినతండ్రి మరియు హజ్రత్ హంజా (రజి)కు సోదరులు. హజ్రత్ అలీ (రజి) సోదరుడు హజ్రత్ అఖిల్ (రజి) కూడా ఖైదీలలో ఒకరు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖైదీల పట్ల జరుపబోయే వ్యవహారం గురించి సహాబీలందరితో సమాలోచన జరిపారు. ‘ఖైదీలకు బంధవిముక్తి ప్రసాదించాలని’ హజ్రత్ అబూబకర్ (రజి) సలహా ఇచ్చారు. “ధర్మం విషయంలో అనుబంధం ఆత్మీయతలకు ఎలాంటి తావు లేకుండా, ఖైదీలందరినీ హతమార్చవలయునని” హజ్రత్ ఉమర్ (రజి) నిర్మొహమాటంగా తమ మనోసంకల్పాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు ఎవరి బంధువులను వారు తుదముట్టించాలనీ, హంజా (రజి) అబ్బాస్ ను, అలీ (రజి) అఖీల్ ని హత మార్చాలని కూడా ఆవేశపూరితంగా చెప్పారు. కాని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ అబూబకర్ (రజి) సలహాను సమర్థిస్తూ ఖైదీలను విడుదల చేశారు.
రెండవ సంవత్సరం ఖురైషీయులు పెద్ద సైనిక బలగాలతో, బద్ర్ యుద్ధ ఒటమికి ప్రతీకారాన్ని తీర్చుకొనేందుకు వచ్చారు. వారి సైన్యంలో కవచాలు ధరించిన ఏడొందల సిపాయిలు ఉన్నారు. మరియు రెండొందల మంది స్వారీ అయి ఉన్నారు. మదీనా పట్టణానికి మూడు మైళ్ళ దూరంలో ‘ఉహద్’ పేరుతో విశాల మైదానమొకటి ఉంది. అక్కడే ముస్లింలకు- ఖురైషీయులకు మధ్య, యుద్ధం జరిగింది. ఇటు ముస్లింలు ఏడువందల సైనికులతో ప్రతిఘటనకు సన్నద్ధులయ్యారు. యుద్ధ మైదానంలో ముస్లిం సైనికుల వీరోచిత పోరాటానికి, శత్రుసైన్యం తొలుత ఖంగుతింది. ముఖ్యంగా హజ్రత్ హంజా (రజి), హజ్రత్ అలీ (రజి) మరియు హజ్రత్ అబూదజానా (రజి)లు ప్రత్యర్థులపై విరుచుకుపడి కలకలం రేపారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యుద్ధం ప్రారంభంగాక ముందు యాభై మంది బాణ సంచారులను రక్షణార్థం ఉహద్ కొండలపై నియమించారు. ఖురైషీ సైనికులు యుద్ధ మైదానం విడిచి పారిపోవడం గమనించిన వీరు తమ స్థానాలను వదలి శత్రుసైన్యం వైపు పరిగెత్తారు. అటుకొండ ప్రాంతం వెనుక భాగంలో వేచి వున్న శత్రు సైన్యబలగమొకటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మెరుపుదాడికి దిగింది. పారిపోతున్న ఖురైషీ సైనికులు ఇదే అదనుగా వచ్చారు. అంతే!…. రణరంగ రూపురేఖలే మారిపోయాయి.
బద్ర్ సంగ్రామంలో, శత్రుసైన్య వీరులెందరినో హతమార్చిన హజ్రత్ హంజా (రజి) ఒక బానిస చేతిలో వీరగతి పొందారు. స్వయంగా ప్రియప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా గాయపడ్డారు. ఒక దశలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమపదించారన్న వదంతులు వాయువేగంతో వ్యాపించాయి. అది విన్న ముస్లింలు కొందరు నిస్పృహచెంది మదీనావైపుకు తిరోన్ముఖులయ్యారు. మరికొందరు ప్రత్యర్థులకు లొంగిపోయారు. ‘మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) లేని తమ జీవితం నిరర్థకమని తలంచి కొందరు ఆవేశంతో శత్రుసైన్యం వైపుకు దూసుకుపోయారు. యుద్ధ మైదానంలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణవార్త విన్న హజ్రత్ ఉమర్ (రజి) రణరంగాన్ని వదలి వెళ్ళకపోయినా, ఖడ్గాన్ని పారేసి, ఇక బ్రతికి మాత్రం ప్రయోజనమేమిటని ఆలోచిస్తూ ఒక ప్రక్క కూర్చున్నారు. అంతలోనే సహాబీలలో ఒకరు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను చూశారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించారని తీవ్ర మనస్థాపం చెందిన సహచరులు, ఆయన జీవించియున్నారని తెలియగానే, అమితానందంతో ఆయన చుట్టూ గుమిగూడారు. హజ్రత్ ఉమర్ (రజి) పట్టరానంత సంతోషంతో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను సమీపించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవించి ఉన్నారని తెలియగానే ఖురైషీయులు తిరిగి దాడి చేశారు. ముస్లింల ఎదురుదాడికి వారందరూ పలాయనం చిత్తగించారు. సరైన సమయం చూచి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహాబీలందరితో ఒక కొండ పైభాగాన చేరుకున్నారు. అప్పుడు ఖురైషు నాయకుడొకడు అటువైపుకు వచ్చి “ప్రజలారా! మీలో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉన్నారా?” అని ప్రశ్నించాడు. అందరూ మౌనం వహించారు. ఎవరూ సమాధానమివ్వలేదు మరియు రెండవసారి అతడు “మీలో, అబూబకర్ (రజి) మరియు ఉమర్ (రజి) బ్రతికియున్నారా?” అని గర్జించాడు. ఈసారి కూడా సమాధానం రాకపోవడంతో బహుశా వీరందరూ యుద్ధభూమిలో మరణించి ఉంటారని అబూసుఫియాన్ అన్నాడు. అప్పటి వరకూ నిశబ్దంగా ఉన్న ఉమర్ (రజి)కు ఓపిక నశించింది. ‘ఓ అల్లాహ్ విరోధీ! మేమంతా బ్రతికే ఉన్నామ”ని ఎలుగెత్తి ప్రకటించారు. “ఓ హబల్! (*) నీవు ఉన్నతుడవు” అని అబూ సుఫియాన్ అన్నాడు. దానికి సమాధానమివ్వమని దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశించగా హజ్రత్ ఉమర్ (రజి) బిగ్గరగా చాటారు ‘అల్లాహ్ యే ఉన్నతుడు. సర్వాధికుడు!’
(*) ఖురైషులు కల్పించుకున్న ఆరాధ్య దైవాలలో ‘హబల్’ ఒకడు.
ఉహద్ యుద్ధంలో ముస్లింలపై ఖురైషీయులదే పైచేయి అయినప్పటికీ వారికి పరిపూర్ణ విజయం మాత్రం లభించలేదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారు మదీనాపై దాడి చేయ ప్రయత్నించలేదు. తమకు లభించిన ఈ విజయాన్నే గొప్పగా భావించి వెళ్ళిపోయారు.
కొన్ని రోజుల తరువాత యూదులు మరియు ముస్లింల మధ్య ఘర్షణలు తలెత్తాయి. మదీనాకు చెందిన యూదులు తమ ఒడంబడికకు కట్టుబడ లేదు. అనుదినం ఒక ఉపద్రవం సృష్టించేవారు. చివరకు వారు మదీనా నుండి బహిష్కరించబడ్డారు. మదీనా నుండి ప్రస్థానము చేసి వారు ఖైబర్ ప్రాంతంలో తిష్ఠవేశారు. ముస్లింలకు విరుద్ధంగా కొన్ని తెగలను ప్రేరేపించారు. ఖురైషీయులు ఇలాంటి సందర్భాల కోసమే ఎప్పటి నుంచో వేచి యున్నారు. యూదులు వారిని, ముస్లింలకు ప్రతికూలంగా సహాయం కోరగా, వారు పదివేలమంది సైనికులతో దండెత్తి వచ్చారు. అటు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహాబాలందరితో సమాలోచన జరిపి, మదీనా చుట్టూ కందకం త్రవ్వాలని నిశ్చయించారు. శత్రుసైన్యం నెలరోజుల పాటు మదీనాను ముట్టడించింది. అసలే ఆ రోజుల్లో మదీనాలో కరువు ఏర్పడి ఉంది. ఆహార ధాన్యాల కొరత వల్ల ముస్లింలు పస్తులుండేవారు. ఖుద్దుగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మూడేసి రోజులు ఆకలి బాధను సహించారు.
శత్రు సైనికులు అడపాదడపా కందకం దాటి దాడి చేసేవారు. అందువల్ల కందకం.వల్ల దాడి జరిపే శత్రు సైనికులనెదిరించడానికి సహాబాల సారధ్యంలో సైనిక బృందాలు నియమింపబడ్డాయి. హజ్రత్ ఉమర్ (రజి) స్వయంగా ఒక నిర్ణీత ప్రదేశం వద్ద కందకానికి కాపలా కాస్తున్నారు. ఆ స్థలంలో ఆయన పేర ఒక మస్జిద్ నిర్మింపబడింది. నేటికీ అది చిరస్మరణీయంగా మిగిలి ఉంది. ఈ యుద్ధ సందర్భంగా ఒకమారు శత్రు సైనిక వీరులు నలుగురు అగడ్త దాటి దండయాత్రకు దిగారు. వారిలో అరబ్బులందరిలో పరాక్రమశాలిగా వ్యవహరింపబడే ‘అమ్ర్ బిన్ అబ్దూ’ ఒకడు. అతడు ఏకంగా ‘నన్నెదిరించేవారెవరైనా ఉన్నారా?’ అని సవాలు విసిరాడు. ఇటునుండి హజ్రత్ అలీ (రజి) సమరానికి సిద్ధమై, పోరాడి అతన్ని కడతేర్చారు. మిగిలిన ముగ్గురూ హజ్రత్ అలీపై దాడి జరిపారు. కాని ఆయన ఖడ్గ విన్యాసం చూసి తోక ముడిచారు. పారిపోయే యత్నంలో ఒకడు కాలుజారి గోతిలో పడిపోయాడు. అతను కూడా హజ్రత్ అలీ (రజి)చే తుదముట్టించబడ్డాడు. ఒకవైపు ‘అమ్ర్ బిన్ అబ్దూ’ లాంటి పరాక్రమశాలి మరణం శత్రుసైన్యంలో కలకలం రేపగా మరోవైపు ఆ రాత్రి భయంకరమైన పెనుగాలులు వీచి, గుడారములన్నీ నేలకూలాయి. మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్టయింది అవిశ్వాసుల పరిస్థితి. బ్రతికుంటే బలుసాకైనా తినవచ్చని తలంచి వచ్చినదారే వెళ్ళిపోయారు.
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హిజ్రత్ ఆరవయేట దైవగృహాన్ని (కాబాను) సందర్శించాలనుకున్నారు. ఈ శుభయాత్రలో ఆయన వెంట పధ్నాలుగు వందల మంది సహాబాలు ఉన్నారు. యుద్ధ సమయం కానందున, వారు ఆయుధము లేమీ లేకుండానే వెళ్ళారు. మదీనా నుండి ఆరుమైళ్ళు ప్రయాణించిన పిదప హజ్రత్ ఉమర్ (రజి), ఈ విధంగా నిరాయుధులై ప్రయాణించటం సరికాదని సలహా ఇచ్చారు. ఆయన సలహా మేరకు ఆయుధాలు తెప్పించబడ్డాయి. మక్కాకు సమీపించక ముందే ఖురైషీయులు యుద్ధ సన్నాహాల్లో ఉన్నారని వార్తలందాయి. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ ఉమర్ (రజి)ను రాయబారిగా పంపాలనుకున్నారు. “మక్కాలో నాకు రక్షణ ఇవ్వగలవారు ఎవ్వరూ లేరు… పైగా ఖురైషీయులు నన్ను చంపాలని చూస్తున్నారు” అని హజ్రత్ ఉమర్ (రజి) అన్నారు. హజ్రత్ ఉస్మాన్ (రజి)ను పంపండి, ఎందుకంటే ఆయన కుటుంబీకులెందరో అక్కడ ఉన్నారు అని సలహా ఇచ్చారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సహచరులతో హుదైబియా వద్ద విడిది చేసి, ఖురైషీయులతో సంప్రదింపుల నిమిత్తం హజ్రత్ ఉస్మాన్ (రజి)ను పంపారు. అటు ఖురైషీయులు వారిని ఆపుకున్నారు. హజ్రత్ ఉస్మాన్ (రజి) హత్యగావింపబడ్డారన్న వార్తలు వాయు వేగంతో వ్యాపించాయి. “మన ప్రాణాల్నైనా ధారపోసి, హజ్రత్ ఉస్మాన్ (రజి) హత్యకు ప్రతీకారం తీర్చు కుంటాము” అని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహాబాలందరితో ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఈ ప్రతిజ్ఞ ఒక తుమ్మ చెట్టు క్రింద తీసుకొనబడింది. అందుకే దీనిని “బైతు- ష్షజర” అంటారు. ఇదిలా వుండగా తరువాత ఖురైషీయులు చర్చల నిమిత్తం ఒక రాయబారిని పంపారు. వారిరువురి మధ్య ఎన్నో వాగ్వివాదాల తర్జనభర్జనల తరువాత కొన్ని షరతులపై సయోధ్య కుదిరింది. దీని ప్రకారం ఆ సంవత్సరం ముస్లింలు మక్కాలో ప్రవేశించకూడదు. రాబోయే సంవత్సరం దైవగృహ దర్శనార్థం వచ్చి, కేవలం మూడు రోజులు విడిది చేసి వెళ్ళిపోవాలి. మక్కావాసులైన ముస్లింలను తమ వెంట తీసుకుపోరాదు. మక్కాలోని విశ్వాసులు, అవిశ్వాసులు ఎవరైనా మదీనా వెళ్ళితే మాత్రం వారిని తిప్పి పంపివేయాలి. మరయితే మక్కాకు ప్రస్థానం చేసి వచ్చే ముస్లింలను తిరిగి పంపడమనేది జరగదు.
ఒడంబడికలోని ఆఖరి నిబంధనను పరిశీలిస్తే, ముస్లింలు, ఒత్తిడికి తలొగ్గి రాజీపడ్డారని అవగతమౌతుంది. దీనిపై హజ్రత్ ఉమర్ (రజి) ఎంతో కలత చెందారు. “ఈ విధంగా తలొగ్గి సంధి కుదుర్చుకోవటం సమంజసం కాదని” ఆయన అబూబకర్ (రజి) ముందు వెల్లడించారు. మహాప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఏది చేసినా ముందుచూపుతోనే చేస్తారని హజ్రత్ అబూబకర్ (రజి) ఆయనకు నచ్చజెప్పారు. హజ్రత్ ఉమర్ (రజి) సంతృప్తి చెందలేదు. ఆయన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్ద కెళ్ళి ‘మీరు నిజమైన ప్రవక్త కారా!’ అని ప్రశ్నించారు. “నిస్సందేహంగా, నేను నిజమైన దైవప్రవక్తనే” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానమిచ్చారు. ‘మరలాంటప్పుడు ఈ అవమానాన్ని మనమెందుకు భరించాలి’. శత్రువులకు లొంగిపోయినట్లుగా సంధిచేసే అవసరమెందు కొచ్చింది’ అని హజ్రత్ ఉమర్ (రజి) ప్రశ్నించారు. ‘నేను ఎట్టి పరిస్థితుల్లోనూ దైవాజ్ఞను జవదాటలేను’ అని సమాధానమిచ్చారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). హజ్రత్ ఉమర్ (రజి) మహాప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) తో తాను సంభాషించిన తీరును తలచుకొని జీవితాంతం బాధపడేవారు. పాపపరిహారంగా ఎన్నో ఉపవాసాలు కూడా పాటించారు. ఎన్నో ప్రార్థనలు చేశారు. బానిసలెందరినో విముక్తుల్ని గావించారు. కానీ అప్పటికీ ఆయన మనస్సు కుదుటపడలేదు.
మహాప్రవక్త (నఅసం) హుదైబియా నుండి వెళ్ళినప్పుడు మార్గమధ్యంలో ‘మేము, మీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము’ అని అల్లాహ్ సందేశం అవతరించింది. అప్పటి వరకూ హజ్రత్ ఉమర్ (రజి)కు ఒడంబడికపై మనశ్శాంతి కలుగలేదు. ఆయన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో, అ స్పష్టమైన విజయమేమిటి?’ అని అడిగారు. హుదైబియా ఒడంబడిక నిస్సందేహంగా ఇస్లాంకు లభించిన విజయమేనని కొన్నాళ్ళ తరువాత అందరికీ తెలిసింది. ఒడంబడిక అనంతరం అరేబియాలో ముస్లింలకు-ముస్లిమేతరులకు మధ్య సంబంధాలు మెరుగైనాయి. మక్కా మరియు ఇతర అరబ్బు ప్రాంతాల వారు మదీనాకు వచ్చి పోయేవారు. సంబంధాలు పరస్పరం మెరుగుపడటం వల్ల ప్రజలకు ముస్లింల ఆచరణా వ్యవహారశైలుల్ని గమనించే అవకాశం లభించింది. వారి హృదయాలు నెమ్మదిగా అల్లాహ్ సత్యధర్మం వైపుకు మొగ్గసాగాయి. ఒడంబడిక రెండు సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ రెండు సంవత్సరాల్లో ఇస్లాం స్వీకరించిన వారి సంఖ్య, లోగడ పద్దెనిమిది సంవత్సరాల్లో ఇస్లాం స్వీకరించిన వారికంటే అధికమే!
హుదైబియా ఒడంబడిక అనంతరం ఖైబర్ యుద్ధం జరిగింది. మదీనా నుండి బహిష్కరించబడిన యూదులు ఖైబర్ ప్రాంతంలో నివసించనారంభించారు. వీరు రోజుకొక ఉపద్రవం సృష్టించేవారు. కందక యుద్ధం కూడా వీరి మూలంగానే జరిగింది. ఖురైషీయులను ముస్లింలకు విరుద్ధంగా ప్రేరేపించింది కూడా యూదులే. కందక యుద్ధంలో ఓటమి చవి చూసిన తరువాత కూడా, వీరు తమ దుష్టకార్యకలాపాలను విడనాడలేదు. అందుచేత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), ముస్లింలను యూదుల దుష్టపన్నాగాల నుండి ముక్తిని ప్రసాదించటానికై పదహారు వందల మంది సైనికులతో ఖైబర్ దిశగా ప్రయాణించారు. ఖైబర్ లో యూదులు పటిష్టమైన కోటలను నిర్మించారు. ఒక్కొక్కటిగా వాటినన్నింటినీ ముస్లింలు వశపరచుకున్నారు. కాని యూదుల ప్రముఖ యుద్ధవీరుడైన ‘మర్ హబ్’ అధీనంలో ఉన్న రెండు కోటలు మాత్రం ఇంకా జయింపబడలేదు. కోటను ముట్టడించమని హజ్రత్ ఉమర్ (రజి)కు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశమిచ్చారు.
కాని ఆయనకు విజయం లభించలేదు. రెండవసారి కూడా హజ్రత్ ఉమర్(రజి)ను పంపగా, ఈసారి కూడా సఫలీకృతులు కాలేకపోయారు. మూడవరోజు హజ్రత్ అలీ (రజి) ‘మర్ హబ్ ఓడించి కోటను వశపరచు కున్నారు. ‘మర్ హబ్’ మరణానంతరం యూదులు లొంగిపోయారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖైబర్ భూమిని ముస్లింలకు పంచిపెట్టారు. హజ్రత్ ఉమర్ (రజి)కు కూడా సస్యశ్యామలమైన కొంత భూమి లభించింది. దాన్ని ఆయన అల్లాహ్ మార్గంలో అంకితం చేశారు.
హుదైబియా ఒడంబడికను ఖురైషీయులు రెండేళ్ళ తరువాత ఉల్లంఘించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పదివేలమంది సైనికులతో మక్కా వైపునకు పయనించారు. మార్గమధ్యంలో ఇతర తెగలు కూడా సైన్యంలోకి వచ్చి చేరాయి. మక్కాకు ఒక మైలు దూరంలో సైనిక బృందం విడిది చేసింది. కారుచీకటిని చీల్చడానికి సైనికులు మంటలు వేశారు. అనేక బృందాలు పెట్టిన వేర్వేరు మంటలతో ఎడారి ప్రాంతమంతా ఒక్కసారిగా జిగేలు మంది. మక్కా నుండి అబూసుఫ్యాన్ ఇద్దరు నాయకులతో పరిస్థితుల్ని సమీక్షించే నిమిత్తం బయలుదేరాడు. వెలుగుల్లో మునిగి తేలుతున్న ఇసుకపుడమిని వీక్షించి అబుసుఫియాన్ నివ్వెరపోయాడు. కాని అదే సమయంలో అతడు హజ్రత్ ఉమర్ (రజి) కంటపడ్డాడు. ఆయన అతని కథను కంచికి చేర్చాలనుకున్నారు. కాని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పినతండ్రి హజ్రత్ అబ్బాస్ (రజి) ఆయన్ను అడ్డుకున్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో హాజరుపరచగా ఆయన అతనికి క్షమాభిక్ష ప్రసాదించారు.
మక్కావాసుల్లో పోరాట పటిమ ఇంకెక్కడిది? వారంతా తమ దురాగతాలకు గాను క్షమాభిక్ష కోరడానికి హాజరయ్యారు. వారి దుష్కర్మలన్నీ క్షమింపబడ్డాయి. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రమాణాలు తీసుకునేప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) కూడా అక్కడే ఉన్నారు. స్త్రీల వంతు వచ్చినప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ ఉమర్ (రజి)ను ప్రమాణాలు తీసుకోమన్నారు. స్త్రీలు హజ్రత్ ఉమర్ (రజి) చేతిపై ప్రమాణం చేశారు.
మక్కా జయింపబడిన తరువాత హునైన్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అప్పటి వరకూ ఇస్లాం స్వీకరించని రెండు బలమైన తెగలతో ముస్లింలు తలపడవలసి వచ్చింది. ఈ యుద్ధంలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో పాటు హజ్రత్ ఉమర్ (రజి) కూడా పాల్గొన్నారు. మరుసటి సంవత్సరం తబూక్ సంగ్రామం జరిగింది. రోమ్ మరియు సిరియా దేశాలకు చెందిన క్రైస్తవులు మదీనా పట్టణంపై దండయాత్ర జరపనున్నారని వార్తలు వ్యాపించటంతో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని మార్గమధ్యంలోనే నిలువరించాలని నిర్ణయించారు. ఆ సంవత్సరం అరబ్బులో కరువు ఏర్పడింది. అయినప్పటికీ సహాబీలందరూ తమ స్థోమతకు మించి విరాళాలు, ఒంటెలు, గుర్రాలు సమర్పించారు. హజ్రత్ ఉమర్ (రజి) తన సంపదలో సగభాగాన్ని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో సమర్పించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులతో తబూక్ ను సమీపించారు. తీరా అక్కడకు వెళ్ళిన తరువాత క్రైస్తవులు దండయాత్ర జరపనున్నారన్న వార్త అసత్యమని తెలిసింది. ఈ సంఘటన జరిగిన ఒక ఏడాదికి ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్ చేశారు. దీనినే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘అంతిమ హజ్ యాత్ర’ అంటారు. ఈ సందర్భంలో కూడా హజ్రత్ ఉమర్ (రజి) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంటనే ఉన్నారు. ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్ చేసి నేరుగా మదీనా చేరుకున్నారు. కొన్ని రోజుల తరువాత అస్వస్థతకు లోనయ్యారు. క్రమంగా ఆరోగ్యం క్షీణించసాగింది. ఈ అస్వస్థతతోనే తనువు చాలించారు అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం.
హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) హయాంలో
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన చివరి కాలంలో వ్యాధిగ్రస్తులై ఉన్నా నమాజు చదివించేవారు. దినదినం ఆరోగ్యం క్షీణించటం వల్ల నమాజ్ చదివించడం కష్టతరమైపోయింది. అంచేత ఆయన హజ్రత్ అబూబకర్ (రజి)ను నమాజ్ చేయించమని కోరారు. హజ్రత్ అబూబకర్ (రజ), హజ్రత్ ఉమర్(రజ)ను నమాజ్ చదివించమన్నారు. హజ్రత్ ఉమర్ (రజ) నిరాకరించారు. పైగా ‘నమాజ్ చదివించడానికి మీరే అన్ని విధాలుగా అర్హులు, కాబట్టి మీరే నమాజ్ చదివించండి’ అని సలహా ఇచ్చారు. ప్రియప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొన్ని రోజులు అస్వస్థతకు లోనై ఉండి తుదకు ప్రభువు సన్నిధికి చేరుకున్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి మరణవార్తను హజ్రత్ ఉమర్ (రజి) విశ్వసించలేకపోయారు. కారుణ్యమూర్తి ఛాయ నిజంగానే ముస్లింలపై లేకుండా పోయిందా…? అని వాపోయారు. నలుదిశలా ప్రజలను ఆందోళనకర స్థితిలో చూసిన ఆయన ‘ప్రియప్రవక్త’ (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమపదించారని పలికిన వాని తల ఏకంగా ఖండిస్తాను’ అని ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. ‘అల్లాహ్ త్వరలోనే ఆయన్ని బ్రతికిస్తాడు. ఆయన తిరస్కారులను, కపటులను శిక్షిస్తారు’ అని కూడా ప్రకటించారు. అయితే హజ్రత్ అబూబకర్ (రజి) ఉపన్యాసం విన్న తరువాత ఆయన ఆవేశం చల్లారింది. ప్రియప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమపదించారన్న వార్త సత్యమని ఆయనకు అర్ధమైంది. హఠాత్తుగా గుండెపై పిడుగు పడినట్లయింది. కాళ్ళక్రింద నేల కదలినట్లయింది. ఒక్కసారిగా మూర్చపోయిన వానిలా నేలపై పడి పోయారు.
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దైవదౌత్యం లభించిన ఆరవయేట హజ్రత్ ఉమర్ (రజి) ఇస్లాం స్వీకరించారు. ఆయనకన్నా ముందు ఇస్లాం స్వీకరించిన వారు ఎందరో ఉన్నారు. అయినప్పటికీ ఆయన అగ్రశ్రేణి సహచరుల జాబితాలో పరిగణింపబడేవారు. కీలకమయిన సలహా సంప్రదింపులలో ఆయన పేరు ఉండేది. హజ్రత్ అబూబకర్ (రజి) తరువాత హజ్రత్ ఉమర్ (రజి) పేరే సర్వత్రా వినవచ్చేది. ఆయన ప్రియప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సమీపబంధువులు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సతీమణులలో ఒకరైన హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హ) ఆయన పుత్రికే. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ను ‘ఫారూఖ్‘ అని బిరుదిచ్చారు. (ఫారూఖ్ అంటే సత్యాసత్యాలను స్పష్టంగా వేరుపరచేవాడు అని అర్థం) అంచేత ‘ఫారూఖ్’ హజ్రత్ ఉమర్ (రజి) నామంలో మిళితమై హజ్రత్ ఉమర్ ఫారూఖ్ (రజి)గా వ్యవహరింపబడసాగింది.
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానంతరం ముస్లింలలో చీలిక వస్తుందన్న భయం పీడించింది. తమలో నుండే ఎవరినైనా ఖలీఫాగా నియమించాలన్న సంకల్పంతో అన్సార్లు ఒకవైపు సమావేశమయ్యారు. ఆ ఉత్కంఠభరిత వాతావరణంలో ముస్లింల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తకుండా హజ్రత్ ఉమర్ (రజి) అహర్నిశలూ కృషి చేశారు. ఆయన మరియు హజ్రత్ అబూబకర్ (రజి) కలిసి అన్సార్ (మదీనావాసులు) ల వద్దకు చేరుకున్నారు. అక్కడ హజ్రత్ అబూబకర్ (రజి) ఉపన్యాసమిస్తూ హజ్రత్ ఉమర్ (రజి) పేరును ఖలీఫాగా ప్రతిపాదించారు. కాని హజ్రత్ ఉమర్ (రజి) ‘మీరుండగా నేనేవిధంగా ఖలీఫాగా కొనసాగుతాను’? అని సున్నితంగా తిరస్కరించారు. అంతేకాదు, హజ్రత్ అబూబకర్ (రజి)ను ఖలీఫాగా ఆమోదిస్తున్నట్లు ఆయన చేతిపై ప్రమాణాలు చేశారు. తరువాత ప్రజలందరూ ఆయన చేతిపై ప్రమాణం (బైత్) చేశారు.
ఖలీఫాగా హజ్రత్ అబూబకర్ (రజి) హయాంలో సంభవించిన ముఖ్యసంఘటనలను ఎదుర్కొనటంలో హజ్రత్ ఉమర్ (రజి) సలహాలు కీలకపాత్ర వహించాయి. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానంతరం అరబ్బులు అనేకులు “జకాత్” ఇవ్వడానికి నిరాకరించారు. కొందరైతే స్వయంగా తమను ప్రవక్తలుగా ప్రకటించుకున్నారు. మరి ఆ స్వకల్పిత ప్రవక్తల్ని అనేక తెగలు విశ్వసించాయి కూడా. జకాత్ ఇవ్వ నిరాకరించిన వారి పట్ల మృదువైఖరితో వ్యవహరించాలని సహాబాలు తమ మనోభావాల్ని వ్యక్తపరిచారు. హజ్రత్ ఉమర్ (రజి) కూడా వారితో ఏకీభవించారు. అయితే హజ్రత్ అబూబకర్ (రజి) ఖురాన్ ఆధారంగా జకాత్ ప్రాముఖ్యాన్ని విడమరచి చెప్పిన తరువాత హజ్రత్ ఉమర్ (రజి) కూడా ఆయనతో ఏకీభవించారు. ఖురాన్ ఆదేశాన్ని విన్నప్పుడల్లా హజ్రత్ ఉమర్ (రజి) తన స్వంత అభిప్రాయాలను ప్రక్కనపెట్టి, తక్షణం తలవంచేవారు. ఇది ఆయన విధేయతాభావానికి ఒక మచ్చుతునక మాత్రమే.
హజ్రత్ ఉమర్ (రజి) స్వభావంలో ఆవేశం అధికమనిపిస్తుంది. చిన్నపాటి మాటలపై కూడా ఆవేశపూరితులై ఖడ్గాన్నే లేవనెత్తేవారు. హజ్రత్ అబూబకర్ (రజి) కాలంలో కూడా ఆయన ప్రవర్తనావళిలో ఎలాంటి మార్పులు గోచరించలేదు. హజ్రత్ అబూబకర్ (రజి) అస్వస్థతకు లోనై ఉన్నప్పుడు హజ్రత్ ఉమర్ (రజి)ను ఖలీఫాగా నియమించాలనుకున్నారు. ‘ఖలీఫా నియమకానికి ఆయన అన్ని విధాలా అర్హులే’ కాని ఆయనలోని కరకుదనం మాత్రం వాంఛించదగినది కాదు” అని సలహాదారులు కొందరు సూచించారు. ప్రస్తుత ఖలీఫాయైన మీ ముందే ఆయన మా పట్ల ఇంత కఠినంగా ప్రవర్తిస్తే, ఖలీఫాగా ఇంకా ఏం చేస్తారో అల్లాహ్ యెరుగు” అని అభిప్రాయపడ్డారు. దానికి అబూ బకర్(రజి) “నా మెతక వైఖరి కారణంగా ఆయన కఠినంగా ప్రవర్తించారు. ఖిలాఫత్ బాధ్యతలు గనక భుజాలపై పడితే మనసు దానంతట అదే మెత్తబడుతుంది” అని వారిని సముదాయించారు. నిజంగానే ఖలీఫాగా నియమింపబడిన తరువాత హజ్రత్ ఉమర్ (రజి)లో ఆశించిన మార్పు వచ్చేసింది. అవును, బాధ్యత అటువంటిది మరి! అందునా అల్లాహ్ సమక్షంలో జవాబుదారుడినని భావించిన పరిపాలకుడాయె!!
ఖిలాఫత్
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దైవదౌత్యం లభించిన ఆరవయేట హజ్రత్ ఉమర్ (రజి) ఇస్లాం స్వీకరించారు. అప్పుడాయన వయస్సు ముఫ్ఫైమూడు. ఖలీఫాగా నియమించబడే నాటికి ఆయన వయస్సు యాభైమూడు. ఆయన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచర్యంలో పద్దెనిమిది సంవత్సరములు గడిపారు. ముఖ్యమైన యుద్ధాలన్నింటిలోనూ పాల్గొని హేమాహేమీలను సైతం గడగడలాడించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అంటే ఆయనకు అమితమైన ప్రేమ, గౌరవము, ఆదరాభిమానమూను. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఆయన ఎంతో ఆదరించేవారు. హజ్రత్ ఉమర్ (రజి) సాధారణంగా బిగ్గరగా మాట్లాడేవారు. మహాప్రవక్త (సఅనం) సమక్షంలో హెచ్చుస్వరంతో మాట్లాడరాదని అల్లాహ్ ఆజ్ఞ అవతరించిన తరువాత, ఆయన చాలా నెమ్మదిగా మాట్లాడేవారు. ఒక్కొక్కప్పుడు ఆయన మాట్లాడేదేమిటో కూడా అర్థమయ్యేదికాదు.
హజ్రత్ఉ మర్ (రజి) ఎత్తైన మనిషి. పెద్ద జనసమూహంలో ఎక్కడ నిలబడినా తొందరగా కనిపించే వారు. గోధుమ వర్ణంగల శరీరఛాయ, గుబురు పొడవాటి మీసాలతో గాంభీర్యం ఉట్టిపడేలా ఉండేవారు. తల వెంట్రుకలు ముందు నుంచి లేచి ఉండేవి. ఆయన ఎదుట నిలబడటానికి అందరూ భయపడేవారు. అయినప్పటికీ ఆయన వినమ్రత, అణకువ గల సత్పురుషులు, నిరాడంబర జీవి. మితంగా భుజించేవారు. జల్లెడవేయని గోధుమ పిండితో చేయబడిన రొట్టెలను తినేవారు. ఒకప్పుడు అరబ్బు దేశంలో కరువు ఏర్పడినప్పుడు గోధుమపిండి లభించకపోవడంతో జొన్నరొట్టెలు తిన్నారు. అప్పుడప్పుడు రొట్టెలను నెయ్యి, తేనె, మాంసం, మరియు పాలతో తినేవారు. ముతక దుస్తులు ధరించేవారు. ప్రయాణీకుల మాదిరిగా తలపై టోపీ ధరించేవారు. ధరించిన దుస్తులలో అక్కడక్కడ అతుకులు కూడా ఉండేవి. ఒకమారు కూఫా నుండి కొందరు ఆయన్ని కలవడానికి వచ్చారు. హజ్రత్ ఉమర్ (రజి) కోసం వారెంతో నిరీక్షించారు. చివరకు ఆయన ఆలస్యంగా వచ్చారు. వంటిపై ఉన్న దుస్తులను ఉతికి, ఆరవేసి మరల ధరించేందుకు ఇంత ఆలస్యమైందని అప్పుడు తెలిసింది.
హజ్రత్ ఉమర్ (రజి) తన పనులు స్వయంగా తానే చేసుకునేవారు. ఆయన ధర్మనిష్ఠతో, ధర్మపరాయణతతో జీవితం గడిపే మహాత్ములు. అయినప్పటికీ పరలోక ధ్యానంలో నిమగ్నులై ఉండేవారు. నమాజ్ చేసేటప్పుడు దైవభీతివలన మనస్సు కరిగి కన్నీరై ప్రవహించేది. అప్పుడప్పుడు ఆయన నమాజ్ లో భోరున ఏడ్చేవారు. ఆయన పైకి నిర్భయునిగా కనిపించినా, ఆయన రవ్వంత గర్వంలేని దయామూర్తి. ఒకమారు ఆయన ఉపన్యాసమిస్తూ ఇలా అన్నారు: “ఒకప్పుడు నేను దీనావస్థలో ఉండేవాణ్ణి. ప్రజలకు నీళ్ళు తోడి అందించేవాడిని. వారు ప్రతిఫలంగా నాకు ఖర్జూరపు పండ్లు ఇచ్చేవారు. దానితోనే నా జరుగుబాటు అయ్యేది”. ఉపన్యాసమిచ్చి ఆయన వేదిక దిగగానే, ఒక వ్యక్తి “ఇలాంటి మాటలు ఉపన్యాసం’లో వ్యక్తీకరించడం సమంజసం కాదు” అని అన్నాడు. అప్పుడు హజ్రత్ ఉమర్ ‘ (రజి) “నా నైజంలో కించిత్ గర్వం తొంగిచూసింది. దాన్ని పారద్రోలటానికి నేను నా గతాన్ని నెమరువేసుకున్నాను” అని వివరణ ఇచ్చారాయన.
ఖలీఫాగా నియమింపబడక ముందు వ్యాపారమే ఆయన జీవనా ధారం. ఖలీఫాగా పదవీబాధ్యతలు స్వీకరించిన తరువాత భార్యాపిల్లల పోషణ కష్టతరమైపోయింది. ఈ విషయమై ఆయన సహచరులను పిలిచి సంప్రతించారు. “మీరు కూడా హజ్రత్ అబూబకర్ (రజి) మాదిరిగా అన్న పానీయాలు, వస్త్రధారణకవసరమైనంత ధనాన్ని కోశాగారం నుండి తీసుకోండి” అని హజ్రత్ అలీ (రజి) అన్నారు. ముస్లింలకు వారి శక్తియుక్తుల, ప్రతిభానైపుణ్యాల ఆధారంగా ఆయన ఉపకార వేతనాలను (భృతి) నిర్ధారించారు. ఉపకారవేతనాలను చెల్లించటంలో ముస్లింలు ఇస్లాంకు చేసిన సేవలను ఆధారంగా తీసుకొనేవారు. బద్ర్ సంగ్రామంలో పాల్గొన్నవారికి అధిక స్థాయిలో ఉపకారవేతనం ఉండేది. రెండవ స్థాయిలో ఉహద్ యుద్ధంలో పాల్గొన్నవారు ఉండేవారు. ఈ విధంగా అనేక భాగాలుగా చేసి ఆయన ఉపకారవేతనాలు చెల్లించారు. హజ్రత్ ఉమర్ (రజి) కంటే అధిక మొత్తంలో ఉపకారవేతనం పొందేవారు అనేకమంది ఉండేవారు.
మక్కానుండి హిజ్రత్ (వలస) చేసిన హజ్రత్ ఉమర్ (రజి), మదీనా పట్టణానికి మూడు మైళ్ళదూరంలో ఉన్న ఖుబా ప్రాంతంలో విడిదిచేశారు. హజ్రత్ ఉత్బాన్ బిన్ మాలిక్ (రజి) ఆయన ధార్మిక సోదరుడు. హజ్రత్ ఉమర్ (రజి) రెండు రోజుల కొకసారి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో హాజరయ్యేవారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి తాను వెళ్ళలేని రోజు హజ్రత్ ఉత్బాన్ బిన్ మాలిక్ (రజి) ను పంపేవారు. హజ్రత్ ఉమర్ (రజి) ఖలీఫాగా నియమింపబడిన తరువాత మదీనాలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఆయన నివాసం మస్జిదె నబవీ సమీపంలో ఉండేది. హజ్రత్ అబూబకర్ (రజి) ఖలీఫా (అల్లాహ్ ప్రతినిధి)గా ఉన్న కాలంలోనే, ప్రజలు హజ్రత్ ఉమర్ (రజి)ను ‘అమీరుల్ మోమినీన్’ (విశ్వాసుల నాయకుడు) అని వ్యవహరించేవారు. ఖిలాఫత్ నిర్వహణలో హజ్రత్ ఉమర్ (రజి), అబూబకర్ (రజి) కు పూర్తి సహాయసహకారాలు అందించేవారు. కఠిన నిర్ణయాలెప్పుడైనా తీసుకోదలచి నప్పుడు సహాబాలందరి సలహాలు తీసుకొనేవారు. ఈ సమాలోచనా సభలో, ప్రజల్లో పలుకుబడి గల నాయకులను పిలిపించేవారు. వారిలో వృద్ధులు, యువకులు మరియు మధ్యవయస్కులు కూడా ఉండేవారు. అవసరాని కనుగుణంగా ఈ సమావేశాలకు మహాజిర్ లు, అన్సార్ లు మరియు సైనికాధికారులను కూడా ఆహ్వానించేవారు. ఈ సలహా సంప్రదింపుల సమావేశం సాధారణంగా ‘మస్జిదె నబవీ’లో జరిగేది. సలహామండలి సభ్యులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా, నిర్ద్వంద్వంగా సలహాలు ఇచ్చేవారు. ఖలీఫా స్వయంగా ఏదైనా తప్పిదానికి లోనైతే ఆయన్ని అభిశంసించే అధికారం ప్రజలకు ఉండేది. ఆయన మండలాధికారుల పనితీరును నిశితంగా పర్యవేక్షించేవారు. అధికారులెవరైనా తప్పుడు కార్యాలకు పాల్పడినట్లయితే వారిని ప్రజలందరి సమక్షంలో శిక్షించేవారు.
‘గస్సాన్’ తెగకు చెందిన రాకుమారుడు ‘జబలాబిన్ ఏహమ్’ ఆస్తీ అంతస్తులుగల వాడు. హజ్రత్ ఉమర్ (రజి) హయాంలో అతడు మదీనా వచ్చి ఇస్లాం స్వీకరించాడు. ఒకరోజు అతడు కాబాగృహ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక పల్లెటూరి వ్యక్తి అతని దుప్పటిని త్రొక్కినాడు. ‘ఏహామ్’ ఆగ్రహోదగ్రుడై ఆ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టాడు. ఈ సంఘటనపై హజ్రత్ ఉమర్ (రజి)కు ఫిర్యాదు అందింది. ఆయన ‘ఏహమ్’ను పిలిపించి ‘నీవు ఇతడికి చెంపదెబ్బ కొట్టావు, కాని ఇప్పుడు నీవు ఇతనిచేత చెంపదెబ్బ తినాలి’ అని అన్నారు. అప్పుడు ‘ఏహమ్” మా ఇద్దరి మధ్య భూమ్యాకాశాలంత తారతమ్యముంది అని అన్నాడు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) “ధనిక పేదల మధ్య ఎలాంటి తారతమ్యాలకు ఇస్లాంలో తావులేదు. తప్పుచేసిన ప్రతి వ్యక్తీ శిక్షింపబడక తప్పదు” అని అన్నారు. ‘ఏహామ్’ ఆలోచించడానికి ఒకరాత్రి సమయం కావాలని విన్నవించుకున్నాడు. హజ్రత్ ఉమర్ (రజి) అతని విన్నపాన్ని ఆమోదించారు. అతడు అర్థరాత్రి ఆ ప్రాంతం విడిచి పారిపోయాడు.
హజ్రత్ ఉమర్ (రజి) ముస్లింల విషయంలో చింతాగ్రస్థులై ఉండేవారు. వారిలో ఎవరికేదైనా నష్టం జరిగితే ఆయన మనస్సు బాధతో చివుక్కుమనేది. రాత్రి సమయాల్లో గస్తీ చేసి ప్రజల పరిస్థితులను బేరీజు చేసేవారు. మదీనా పొలిమేరల్లో విడిదిచేసివున్న యాత్రీకుల స్థితిగతులను పర్యవేక్షించేవారు. ఒక సాధారణ సైనికుని మాదిరిగా రాత్రి మొత్తం గడిపేవారు. ఒకరాత్రి మదీనాకు కొంత దూరంలో ఒక గుడారంలో మండుటాగ్ని కనిపించింది. దగ్గరికి వెళ్ళిచూశారు. మంటకిరువైపులా నలుగురు పిల్లలు కూర్చుని ఉన్నారు. విషయమేమని అడగ్గా తన పిల్లలకు ఎన్నో రోజుల నుండి తినడానికి తిండి లేదనీ, కుండలో నీళ్ళు పోసి పొయ్యిమీదుంచాననీ ఒక స్త్రీ వివరించింది. అది విన్న వెంటనే హజ్రత్ ఉమర్ (రజి) మదీనాకు వెళ్ళారు. నెయ్యి, మాంసం, పిండి, మరియు ఖర్జూరపు పండ్లు తెచ్చి ఆ ముందుంచారు. ఆమె పిండితో రొట్టెలు చేసి పిల్లలకు తినిపించింది. హజ్రత్ ఉమర్ (రజి) వెళ్తుండగా ఆమె ఆయన్ను పిలిచి “హజ్రత్ ఉమర్ (రజి) స్థానంలో మీరు ఖలీఫాగా ఉంటే బాగుండు!” అని అంది. ఆమె పలుకులు హజ్రత్ ఉమర్ (రజి) హృదయాంతరాళాన్ని కుదిపివేసాయి. మరునాడు ఆమెను దర్బారుకు పిలిపించి పెన్షన్ ఇప్పించారు.
ఖలీఫాగా నియామకం జరిగిన తరువాత హజ్రత్ ఉమర్ (రజి) విలాసవంతమయిన విశ్రాంతితో కూడిన జీవితానికి ఆమడ దూరంగా ఉండేవారు. తన వద్ద ఉన్న మొత్తం సమయాన్ని ఖిలాఫత్ కార్యకలాపాల పై వెచ్చించేవారు. మస్జిద్లో కూర్చున్నా సహచరులతో సలహా సంప్రతింపులు జరిపేవారు. రోమ్ మరియు ఈరాన్కు సైనిక బృందాలు పంపించమని మస్జిద్ లోనే ప్రతిపాదనలు వస్తున్నాయి. సైన్యాధికారులకు ఉపదేశాలు పంపబడుతున్నాయి. అధికారులపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ సమస్యలన్నింటినీ పరిశీలించి, పరిష్కరించి మరీ లేచేవారు. నీటిబిందెలను భుజాలపై ఎత్తుకుని వితంతువులకు నీళ్ళందించేవారు. వారి దీవెనలు పొందేవారు. మస్జిదె నబవీలో ఐదు పర్యాయాలు నమాజు సారధ్యం వహించే బాధ్యత కూడా ఆయనపై ఉండేది. ఎలాంటి కార్యంలో నిమగ్నమై ఉన్నా నమాజ్ సమయానికి మస్జిద్ చేరుకొనేవారు. ఒకరోజు నమాజ్ చేయించి మస్జిద్ నుండి బయటకు రాగానే, ప్రజాధనం (బైతూల్ మాల్) నుండి ఒక ఒంటె పారి పోయిందని తెలిసింది. వెంటనే ఆయన దానిని వెదికేందుకు వెళ్ళిపోయారు. ఈ పనికోసం సేవకుడెవరినైనా పంపించవచ్చుగదా! అని ప్రజలు సలహా ఇవ్వగా ‘నేనే సేవకుణ్ణి’ అంటూ తన బాధ్యతలను గుర్తు చేసుకునేవారు. ఆ సమయంలో ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి. పనిచేసి అలసిపోయినప్పుడు కటిక నేలపై మేను వాల్చేవారు. రాత్రి సమయాల్లో మస్జిదె నబవీలో ఇషా నమాజు చేయించాక, ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు వెళ్ళేవారు. ఒక్కోసారి రాత్రంతా గస్తీలోనే గడిచిపోయేది.
ఇరాక్ – ఈరాన్ యుద్దాలు
ఆ కాలంలో అరబ్బు దేశానికిరువైపులా బలమైన సామ్రాజ్యాలు రెండు ఉన్నాయన్న అంశము గమనార్హం. ఒకవైపు ఆసియా, ఆఫ్రికా, ఐరోపా వంటి మూడు ఖండాలలో విస్తరించియున్న రోము సామ్రాజ్యం ఉండగా, రెండవవైపు ఆసియా ఖండ అధిక భూభాగాన్ని ఆధీనంలో ఉంచుకున్న ఈరాన్ సామ్రాజ్యం ఉంది. ఈ రెండు సామ్రాజ్యాధిపతులు మహాప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం)జీవిత కాలంలోనే ముస్లింలతో కయ్యానికి కాలుదువ్వారు. హజ్రత్ అబూబకర్(రజి) హయాంలో అది యుద్ధ రూపాన్ని దాల్చింది. ఒకవైపు ముస్లింలు అనేక ప్రదేశాలనుండి ఈరానీయులను తరిమివేశారు. రెండవవైపు ముస్లింలు సిరియా, ఫాలస్తీనాలలో రోమన్ క్రైస్తవులను అంచెలంచలుగా ఓడించి పెద్ద భూభాగాన్ని హస్తగతం చేసుకున్నారు. ‘యరమూక్’ యుద్ధం ముస్లింలకు క్రైస్తవులకు మధ్య జరిగిన యుద్ధాలలో పెద్దది. ఈ యుద్ధం హజ్రత్ అబూబకర్ (రజి) ఖిలాఫత్ చివరి కాలంలో ప్రారంభమైంది. యుద్ధం సమాప్తం కాకముంచే హజ్రత్ అబూబకర్ (రజి) మరణించారు. అయితే హజ్రత్ ఉమర్ (రజి) హయాంలో ఈరాన్తో అనేక యుద్ధాలు జరిగాయి.
హజ్రత్ అబూబకర్(రజి) ఇరాఖైపై దండయాత్ర నిమిత్తం హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రజి)కు సైన్యం ఇచ్చి పంపారు. హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్(రజి). మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులు. అగ్రశ్రేణి సైన్యాధిపతి. “మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ను, ‘సైఫుల్లా” అను బిరుదుతో సత్కరించారు. సైఫుల్లా అంటే అల్లాహ్ ఖడ్గం అని అర్థం.
ఈయన ఇరాక్లోని కొంత భాగాన్ని జయించారు. తరువాత హజ్రత్ అబూబకర్ (రజి) ఆయన్ను సిరియా వైపుకు పంపి, ఆయన స్థానంలో ఇరాక్ మరియు అరేబియా సరిహద్దు ప్రాంతవాసియైన, అప్పుడప్పుడే ఇస్లాం స్వీకరించిన ‘ముసన్నా బిన్ హారిస్ (రజి) ను సైన్యాధిపతిగా నియమించారు. ముసన్నా వద్ద ఉన్న సైన్యం చాలా తక్కువ. అంచేత ఆయన ‘హీరా’ నగరాన్ని జయించిన తరువాత హజ్రత్ అబూబకర్ (రజి) సన్నిధిలో హాజరైనారు. హజ్రత్ ముసన్నా (రజి) హాజరైన రోజు హజ్రత్ అబూబకర్ (రజి) తీవ్ర జ్వరముతో బాధపడుతూ ఉన్నారు. అయినా హజ్రత్ ఉమర్ (రజి) ను పిలిచి ముసన్నా (రజి) సహాయార్థం సైన్యాన్ని పంపవలసిందిగా ఆదేశించారు. ఆ రోజు సాయంకాలమే ఆయన పరమపదించారు.
హజ్రత్ ఉమర్ (రజి) చేతిపై ప్రమాణం (బైత్) చేయటానికి మారుమూల ప్రదేశాల నుండి ప్రజలు వచ్చారు. హజ్రత్ ఉమర్ (రజి) వారికి ఇరాక్ పరిస్థితులను వివరించారు. ధర్మయుద్ధం (జిహాద్) కోసం వారిని ప్రేరేపించారు. మొట్టమొదటగా సఖీఫ్ తెగకు చెందిన ప్రముఖ నాయకుడు ఇరాఖ్ వెళ్ళి ఈరానీయులతో పోరాడటానికి సంసిద్ధత వ్యక్తపరచాడు. తరువాత ప్రజలందరూ సన్నద్ధులయ్యారు. హజ్రత్ ఉమర్ (రజి), అబూ ఉబైదా (రజి)ను సైన్యాధిపతిగా నియమించారు. వారు ఇస్లామీయ సైన్యం విడిది చేసియున్న ‘హీరా’ ప్రాంతానికి బయలుదేరారు.
ఆ రోజుల్లో ‘పూరాన్ దఖ్త్’ ఈరాన్ మహారాణి. ఆమె తమకు కలిగే పరాజయ పరంపరకు కలవరం చెంది ‘ఖురాసాన్’ గవర్నర్ పుత్రుడైన ‘రుస్తుమ్’ ను పిలిచి రక్షణశాఖామంత్రిగా నియమించింది. ‘రుస్తుమ్’ రణనీతిలో ఆరితేరిన వాడు. పరాక్రమశాలి కూడానూ. అతడు రాయబారులను పంపి ప్రముఖ సర్దారులందరినీ సమావేశపరచాడు. ముస్లింలకు విరుద్ధంగా పోరాడమని వారిని ప్రేరేపించాడు. ఫలితంగా ముస్లింలు హస్తగతం చేసుకొన్న కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగింది. పలు ప్రాంతాలు ముస్లింల చేజారిపోయాయి. అయినప్పటికీ రణరంగంలో ముస్లింలు, ఈరానీయులతో తలపడినప్పుడు ముస్లింలదే పై చేయి అయింది. వారు అనేక ప్రాంతాలను తిరిగి కైవసం చేసుకున్నారు. ఈ వార్తలు ‘రుస్తుమ్’ కు తెలిసిన వెంటనే అతడు, ఈరాన్ దేశ జాతీయ పతాకం ‘దుర్ ఫిష్ కాదియాని’ తీసుకున్నాడు. ప్రజలు ఈ జాతీయ పతాకాన్ని అమితంగా గౌరవించేవారు. చక్రవర్తి సింహాసనాన్ని అధిరోహించినప్పుడు, ఈ జాతీయ జెండాపై బంగారం, వెండి, వజ్రాల వర్షం కురిపించేవారు. ఈ ధ్వజం చేబూనిన ప్రతీ యుద్ధం’లోనూ విజయం తమకే ప్రాప్తమవుతుందన్నది ఈరానీయుల దృఢ విశ్వాసం. “బహ్మన్” అనే ప్రముఖ నాయకుడికి ఈ పతాకమిచ్చి ముస్లింలతో సమరానికి పంపడం జరిగింది.
‘బహ్మన్’ నైలు నదీ తీరం చేరాడు. ఇటువైపు నుండి ‘హజ్రత్ అబూ ఉబైద్ సఖ్ ఫీ’ కూడా పయనించి నదికి రెండవ వైపు చేరుకున్నారు. నైలునదికి ఒక వైపున ముస్లింలు రెండవ వైపున ఈరానీయులు విడిదిచేశారు. ఇరుసైన్యాల మధ్య నదీ ప్రవాహం మాత్రమే అడ్డుగా ఉంది. “వీరు తీరం దాటి వస్తారా! లేక మేమే రావాలా?” అని బహ్మన్ ముస్లింలకు సందేశం పంపించాడు. ఈరానీయులనే నదీ దాటి రమ్మని సందేశం పంపమని ముసన్నా బిన్ హారిస్ మరియు ఇతర నాయకులు సలహా ఇచ్చారు. కాని ఔత్సాహికుడైన అబూఉబైదా (రజి) వారి సలహాను లెక్కచెయ్యక హడావిడిగా నదిపై వంతెన నిర్మించి సైన్యంతో సహా నదిని దాటేశాడు. చూడబోతే ఆవల వైపు యుద్ధ మైదానం మరీ ఇరుకుగా ఉంది. ముస్లిం సైనికులకు వెనక్కి తగ్గడానికి కూడా స్థలం లేదు. పైగా ఈరానీ సైన్యంలో ఏనుగులు అధికంగా ఉన్నాయి. మృదంగాలు, డప్పులు వాయిస్తూ ఈరానీ సైన్యం వడివడిగా ముందుకు కదులుతూ ఉంటే, నల్లమేఘాల్లా తమవైపు సమీపిస్తున్న ఏనుగులను చూసి ముస్లిం సైన్యంలోని గుర్రాలు బెదిరిపోయాయి. అబూఉబైదా (రజి) వెంటనే స్పందిస్తూ “ఏనుగులన్నింటినీ చుట్టు ముట్టి వాటి పగ్గాలను కోసేయమని” సైనికులను ఆదేశించాడు. ఒకప్పుడు భారతరాజు ఈరాన్ చక్రవర్తికి బహూకరించిన తెల్లటి ఏనుగు యుద్ధంలో ముందుకు దూసుకు పోసాగింది. అబూఉబైదా (రజి) ఆ ఏనుగుపై లంఘించి, ఒక వేటుతో దాని తొండాన్ని నేలకూల్చారు. గాయాలపాలైన ఏనుగు అదుపు తప్పి ఆగ్రహావేశాలతో అబూ ఉబైదాను పడవేసి, ఉదరభాగంపై కాలు వేసి నలిపివేసింది. అబూఉబైదా (రజి) అక్కడికక్కడే ‘కన్నుమూశారు. ఆయన సోదరుడు సైనిక ధ్వజాన్ని చేతపట్టుకున్నారు. తుదకు ఆయన కూడా హతులయ్యారు. అంతలో శత్రుసైనికుడు ముస్లింలు పారిపోకుండా వంతెనను కూల్చివేశాడు. యుద్ధ మైదనంతో బెదిరిపోయిన ఏనుగులు వీరవిహారం చేశాయి. మారణహోమం రేకెత్తించాయి. ఒక్క ముస్లిం సైనికుడు కూడా ప్రాణాలతో మిగులుతాడా అన్న ఆందోళన కలిగింది. ఈ పరిస్థితులను వీక్షించిన ‘ముసన్నా (రజి)’ వెంటనే సైనిక పగ్గాలు తన ఆధీనంలో తీసుకున్నారు. ఒక వంక వంతెన మరమ్మత్తుకు వెంటనే కొంత మందిని పంపారు. మరోవంక మిగిలిన సైన్యంతో ఈరానీ సైన్యాన్ని చుట్టుముట్టారు. ఎట్టకేలకు సైనికులు నది దాటటంలో సఫలమయ్యారు.. నది దాటిన పిదప సైనికులను గణించగా మొత్తం తొమ్మిది వేలమందిలో కేవలం మూడు వేల మంది మాత్రమే మిగిలి ఉన్నారు. నాలుగు వేల సైనికులు సమరభూమిలో స్వర్గసీమకు చేరుకున్నారు. దాదాపు రెండువేల మంది సైనికులు పారిపోయ్యారు. యుద్ధభూమి నుండి వెనుదిరిగిన సైనికులు సంవత్సరాల పాటు ముఖాలు చాటేసుకొని తిరిగారు. కొంతకాలం తరువాత వైలు నదీ తీరాన మరొకసారి యుద్ధం జరిగింది. అప్పుడు ‘మహరాన్’ ఈరానీ సైన్యానికాధిపత్యం వహించాడు. ముస్లిం సైన్యానికి ‘హజ్రత్ ముసన్నా బిప్ హారిస్ (రజి)’ సారథ్యం వహించారు ముసన్నా (రజి) నది దాటి యుద్ధం చేయడానికి బదులు ఈరానీయులనే నది దాటి రమ్మని కబురంపారు. ఈ యుద్ధంలో ఈరానీయులు పెద్ద సైనిక బలగాలతో రంగంలోకి దూకారు, మహాబీభత్సం సృష్టించిన ఈ యుద్ధంలో ముస్లింలదే పై చేయి అయింది.
పరాభవాన్ని మూటగట్టుకుని ఈరానీయులు తిరోగమించారన్న వార్తలు ఈరానీ రాజధాని ‘మదాయన్’ వరకు వ్యాపించాయి. అప్పుడు ఈరానీ నాయకులు, ఐశ్వర్యవంతులందరూ కలసి యువకిశోరుడైన ‘యజ్ద్ గిర్ద్’కు రాజ్యాధికారం కట్టబెట్టారు. అతడు రాజ్యాధికార బాధ్యతలు స్వీకరించగానే ఈరానీయులలో పోరాటపటిమ, పరాక్రమశక్తులు పదింతలు పెరిగాయి. తమ జాతి గౌరవాన్నీ నీలబెట్టుకొనేందుకు వారు రేయింబవళ్లు. యుద్ధ సన్నాహాలు ప్రారంభించారు. ఈ సంగతి తెలుసుకున్న హజ్రత్ ఉమర్ (రజి), హజ్రత్ ముసన్నా (రజి)కు అరబ్బు సరిహద్దు ప్రాంతాలకు తిరిగి రమ్మని సందేశం పంపారు తరువాత ఆయన కూడా సైనిక సమీకరణకు ఉపక్రమించారు. హజ్ కాలం కావటం వల్ల సులభంగా విశాల సైన్యం సమకూరింది. హజ్రత ఉమర్ (రజి) స్వయంగా ఈ సైన్యంతో బయలుదేరాలని సంకల్పించుకున్నారు. అయితే హజ్రత్ ఉమర్ (రజి) మదీనాలో ఉండడం చాలా అవసరమని సహచరులు సలహా ఇచ్చారు. చివరకు ‘హజ్రత్ సాద్ బిన్ వఖాస్’ (రజి)ను సైనికాధికారిగా నియమించి ఈరాన్ పంపారు. కాని హజ్రత్ సాద్ బిన్ వఖాస్ (రజి) ఈరాస్ చేరకముందే హజ్రత్ ముసన్నా (రజి) కన్ను మూశారు. వంతెన యుద్ధంలో ఆయనకు తగిలిన గాయాలు తిరగదోడాయి. కడకు ఆయన ఆ బాధతోనే తనువు చాలించారు.
హజ్రత్ సాద్ (రజి) ముప్ఫైవేల మంది సైనికులతో వచ్చారు. ఆయన్ని ప్రతిఘటించడానికి ‘రుస్తూమ్’ విశాలమైన సైన్యంతో ఎదురువచ్చాడు. అతని శిరస్సుపై దుర్ ఫిషే జాతీయ పతాకం రెపలాడుతూ ఉంది. అతని వెనుక పెద్ద పెద్ద సర్దారుల బృందం కూడా ఉంది. వారిలో ప్రముఖ నాయకుడైన ‘బహిమన్’ కూడా ఉన్నాడు ఇతడు వంతెన యుద్ధంలో ఈరానీ సైన్యాధిపతిగా ఉన్నాడు. “ఖాదసియా” మైదానంలో శత్రు సైన్యాలు ముఖా-ముఖి అయ్యాయి. ‘రుస్తుమ్’ భారీ సైన్యాన్ని వెంట బెట్టుకొని పచ్చినప్పటికీ యుద్ధాన్నారంభించడానికి సాహసించలేకపోయాడు. కారణం అంతకు ముందు ఎదురయిన చేదు అనుభవమే. అందుకేనేమో సంధి కోసం సన్నాహాలు ప్రారంభించాడు. చాలా రోజుల వరకు ఇరుపక్షాల తరపున రాయబారాలు నడిచాయి. అనశ్చితస్థితి నెలకొన్నది. కాని ఫలితం శూన్యం. ఇరువురి మధ్య ఒడంబడిక కుదరలేదు. యుద్ధ మేఘాలు ఆవరించాయి. సరిగ్గా అదే సమయంలో ‘సాద్ బిన్ వఖాస్’ (రజి)ను అనారోగ్యం చుట్టుముట్టింది. కనీసం రెండడుగులు ముందుకు వేసి నడవలేని స్థితిక ఆయన ఆరోగ్యం క్షీణించింది. అంచేత ఆయన (ముస్లింల అధీనంలో ఉన్న) ఒక కోటపై కూర్చొని ఉండేవారు. అక్కడి నుంచే సూచనలు ఒక కాగితంపై వ్రాసి రాయిలో చుట్టి కోటపైనుండి పడవేసేవారు. దాని ప్రకారమే సైన్యం తమ రణనీతిని రూపొందించుకునేది.
ఆ కాలపు యుద్ధ నియమ నిబంధనల ప్రకారం ఇరువైపుల నుండి సైనికులు ఒక్కక్కరూ మైదానంలో దిగేవారు. వారిద్దరి మధ్య చాలాసేపు పోరాటం జరిగేది. తరువాత రెండు సైన్యాలు యుద్ధానికి దిగేవి, ఖాదసియా మైదానంలో కూడా యుద్ధం ఇదే విధంగా జరిగింది. మొదట ఈరానీ సైన్యం నుండి యుద్ధవీరుడొకడు మైదానంలో దిగి, ప్రతిపక్ష సైనికుడిని యుద్ధానికి రమ్మని కవ్వించాడు. ముస్లిం సైన్యం నుండి జుబైద్ తెగ నాయకుడైన ఉమరి ఎన్ మాదీకర్బ్ (రజి) అతనితో తలపడ్డారు. ఇద్దరి మధ్య భీకర పోరాటం జరిగింది. చివరకు అతడు నేలకొరిగాడు. ఇదే విధంగా చాలాసేపు ఇరువైపుల నుండి యుద్ధవీరులు ఒంటరి పోరాటం సాగించారు. తరువాత ఈరానీయులు సైన్యంతో సహా ముందుకురికారు. వారి ఏసుగులు స్వైర విహారం చేయసాగాయి. వాటిని చూచి ముస్లిం సైన్యపు గుర్రాలు బెదిరిపోయాయి. సాద్ బిన్ వఖాస్ (రజి) ఇస్లామి సైన్యం వైపు నల్లమేఘాల్లా దూసుకెళుతున్న ఏనుగులను నిరోధించమని ‘అసద్’ తెగ నాయకుడిని ఆదేశించారు. ఆయన బాణసంచారులను కొందరిని తీసుకొని పెనుతుఫాను సృష్టిస్తున్న మదపుటేనుగులను ఆపారు. ‘తమీమ్’ తెగకు చెందిన యోధులు గుర్రాల నుండి దిగి బాణాల వర్షం కురిపించారు. బీభత్సం సృష్టిస్తున్న ఈ యుద్ధ పరిణామాలు తలకముందే సూర్యుడు తలదాచుకున్నాడు. యుద్ధ మైదానమంతా అంథకారం అలముకుంది. సైన్యాలు తమ తమ స్థావరాలకు తిరిగి వెళ్ళిపోయాయి.
రెండవ రోజు ఇంకా యుద్ధం మొదలవలేదు. అంతలోనే ఒక వైపు నుండి ధూళి లేపుతూ సైనిక బృందం ఒకటి దావడం అందరూ గమనించారు. సైనికుల ఖడ్గమొనలు, ఈటెలకొనలు కాంతి పరావర్తనం వలన నక్షత్రాల మాదిరిగా మెరుస్తూ కనిపించాయి. ఈరాన్ నుండి సైన్యం వచ్చిందని కొందరు భావించగా, మదీనా నుండి సైన్యం అడుగిడిందని మరికొందరు తలంచారు. వారందరూ ఈ ఊహాగానాల్లోనే నిమగ్నమై ఉండగా వార్తాహరులు కొందరు పరుగెత్తుకుంటూ వచ్చి “సిరియా ఇస్లామీ సైనిక నాయకుడైన ‘హజ్రత్ అబూఉబైదా బిన్ జర్రాహ్ (రజి) హాషియ్ లిన్ ఉత్ప(రజి) మరియు ఖాఖాన్ బిస్ అమ్ (రజి)’ సారధ్యంలో ఆరువేల సిపాయిలు తరలి వచ్చాయ”ని చెప్పారు. ‘ఖాఖాన్ బిన్ అమ్రి'(రజి) సమత స్థలానికి చేరిన ముందే నెంగినే యుద్ధంలో ఈరాని సైనికులకు నాయకత్వం వహించిన నాయకుడు ‘బహీమని’ ఆయనత పోరాటానికి దిగాడు. తనను ఎదురించే ప్రయత్నం చేసేవాడు ‘బహిమన్’ అని తెలిసిన ‘ఖాఖాన్ (రజ) అతనిపై విరుచుకుపడి ప్రత్యర్ధిని ఉక్కిది బిక్కిరి చేశాడు. ఖడ్గ పోరాటంలోని మెళకువలన్నింటిని ‘బహిమస్’ ప్రయోగించాడు. కాని ఆకస్మాత్తుగా అతనిపై పడిన ఒక్కవేటుకు చేయి తెగిపడింది. ఇటు ఇస్లామీ సైన్యం అల్లాహు అక్బర్’ అని నినాదాలు చేయసాగింది. యుద్ధమైదానమంతా ఈ నినాదాలతో మ్రోగిపోసాగింది. ఈధానీ సైనికుల గుండెల్లో దడ పెరిగింది. వారి ముఖాలపై విషాద ఛాయలు గోచరించసాగాయి. ఇరుసైన్యాల మధ్య భీకర యుద్ధం ప్రారంభమయింది. యుద్ధ మైదానంలో ఈరానీయుల ఏనుగులు గందరగోళాన్ని సృష్టించాయి. ఏనుగుల కోలాహలానికి గుఱ్ఱాలు బెదిరి అదుపు తప్పాయి. ‘ఖాఖాన్ బిస్ అమ్'(రజి) దీనికి విరుగుడు కని పెట్టారు. ఒంటె వీపులపై ఉయ్యాలను కట్టించి, నల్లటి ముసుగును దానికి తొడిగించాడు. ఒంటె వీపులపై ఉన్న విచిత్ర ఉయ్యాల వలన ఒంటెలు భయంకర విచిత్ర జంతువులుగా కనిపించాయి. వాటిని చూచి ఏనుగులు భయపడి చెల్లా చెదురైనాయి.
ఖాదసియా యుద్ధం మూడు రోజులపాటు జరిగింది. మూడవరోజు యుద్ధపు తుది ఘట్టం. ‘ఖాఖాన్’ (రజి) రాత్రిపూట కొంతమంది సైనికులను అడవిలో దాచి ఉంచారు. ఉదయం యుద్ధం ప్రారంభం కాగానే నందమంది సైనికుల బృందం ‘అల్లాహు అక్బర్’ నినాదాలు చేస్తూ రణరంగంలోకి దూకింది. సిరియానుండి మరో సైనిక పటాలం వచ్చిందని అందరూ తలంచారు. దైవ కృష్ణవలన ఆ రోజు ఏడొందల సైనికుల బలగమొకటి వచ్చింది. ఆ రోజు ఈరావీయులు తమ సైన్యానికిరువైపులా ఏనుగులను నిలబెట్టి ఉంచారు. ‘అమ్రూ మాది కర్స్ (రజి), ‘ఖాఖాన్ (రజి) మరియు ‘ఆసిమ్ ‘ (రజి) శరీరదారుడ్యంగల రెండు ఏనుగల వైపు గురిపెట్టారు. వాటిలో ఒకటి శ్వేతగజము కాగా రెండవది నలుపు రంగు ఏసుగు. హజ్రత్ ఆసిమ్ (రజి) తెల్ల ఏనుగుపై ఈటెతో దాడిచేసి, దాని రెండు కళ్ళూ పనికిరాకుండా చేశాడు. ‘ఖాఖాన్ (రజి)’ ఒక్క వేటుతో దాని తొండాన్ని సరికివేశాడు. నల్ల ఏనుగులు గాయాలపాలై ఫారిపోసాగాయి. వారు తమ ఇతర నాయకులతో కలసి ఇతర ఏనుగులపై కూడా దాడి జరిపారు యుద్ధభూమినుండి వాటినన్నింటినీ పారద్రోలారు. అదుపుతప్పి పరిగెత్తే గజగాములు అడ్డువచ్చిన వారినందరినీ తొక్కుకుంటూ వీరవిహారం చేశాయి.
అంతే! ఈరానీ సైన్యంలో కలకలం మొదలయింది. ఆ తరుణం లోనే సూర్యాస్తమయం జరిగింది. యుద్ధనిబంధనల ప్రకారం రెండు సైన్యాలు యుద్ధాన్ని ఆపి తమ స్థావరాలకు తిరిగి వెళ్ళిపోవాలి. కాని ముస్లింలు అటో- ఇటో తేల్చుకోవాలని శపథం చేసుకున్నారు. నడిరేయి చీకట్లో, చంద్రుని వెలుగునీడల మధ్య ఖర్గ విన్యాసాలు జరగసాగాయి. తన శిరస్సుపై ఈరానీ జాతీయ పతాకం తగిలించుకొనిన ‘రుస్తూమ్’ యుద్ధమైదానంలో ఉన్నంత వరకూ, ఈరానీయులు సమరభూమి నుండి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయరని ముస్లిం సైనికాధికారులకు తెలుసు. ఖాన్ బిన్ అమ్రూ(రజి)). ‘మాదీకర్స్ (రజి)’, ‘అష్తోత్ (రజి)’ మరియు ‘ఆసిమ్ (రజి)’లు అశ్వరూఢులై రుస్తుమ్ విడిదిచేసి ఉన్న దిశగా పయనించారు. ముస్లిం నాయకులు తనవైపుకే దూసుకురావడాన్ని గమనించిన ‘రుస్తూమ్’ అప్పటికప్పుడే ఖడ్గాన్ని తీసి పోరాటానికి సిద్ధం అయ్యాడు. క్షతగాత్రుడై ప్రాణభయంతో పలాయనం చిత్తగించాడు. దారిలో ఒక పెద్ద కాలువ వచ్చింది. ఎలాగయినా దాన్ని ఈదుకుంటూ అవతలివైపుకు చేరుకోవచ్చని ఆశించాడు. కాని హిలాల్ (రణి)’ అనే సిపాయి అతన్ని వెంబడించి అతని కథను కంచికి చేర్చారు.
‘రుస్తుమ్’ మరణంతో ఈరానీ సైన్యంలో ఆత్మ విశ్వాసం పదలి విషాదఛాయలు అలముకున్నాయి. వారు మానసికంగా కృంగిపోయారు. ముస్లిం సైనికులు వేల సంఖ్యలో ఈరానీ సైనికులను హతమార్చారు. విజయం ముస్లింలను వరించింది. ఇరాఖ్ లో ఈరానీయుల పెత్తవానికి చరమగీతం పాడబడింది. ఈరాన్ రాజధాని ‘మదాయన్’పై విజయం ఈ యుద్ధంలోని ప్రధాన ఘట్టం. ఈ ప్రదేశము దజీలా’ తీరాన ఉండేది. తురానీయులు దజలానటిపై గల వంతెనను కూల్చివేశారు. ఓడలను కాల్చివేశారు. ఈ పరిస్థితిని వీక్షించిన సాద్ బిస్ సఖాన్ (రజి) అగ్రహావేశంతో నదీప్రవాహాన్ని చీల్చుతూ గుర్రాన్ని నదిలో పరుగెత్తించారు. సైన్యాధిపతి శౌర్యం చూచిన మిగిలిన సైనికులు కూడా ఆయస్ను అనుసరించారు. ‘సాద్ బిన్ ఖాస్’ (రజి) సారథ్యంలో ముస్లిం సైన్యం సదీప్రవాహాన్ని చీల్చుకుంటూ వస్తున్న అపురూప దృశ్యం తిలకించిన శత్రుసైనికులు ఆశ్చర్యచకితులయ్యారు. మానవ మేధస్సుకు అందని ముస్లింల అపురూప విన్యాసాన్ని చూచిన ఈరానీయులు… వీరు మానవులు కారు… దయ్యాలు, భూతాలై ఉంటాయి. వీరితో యుద్ధం అసంభవం’ అని తలంచి యుద్ధమైదానం నుండి పారిపోయారు. ఇలా ఒక్క విజయంతో దాదాపు ఈధాన్ ప్రాంతాలన్నీ ముస్లింల వశమైనాయి. కాని ‘ఈరాన్’ ఇంకా మిగిలే ఉంది హజ్రత్ ఉమర్ (రజి) తరపునుండి ‘ఈరాస్’ పై దాడికి సంబంధించిన ఎలాంటి సంకేతం రానందున ముస్లింలు ఆగిపోయారు.
ముస్లింలు ఈరాస్పై దండెత్తినప్పుడు ఈరానీయుల్లో ఐకమత్యం అంతంత మాత్రమే. కాని అరబ్బులు సంఘటితంగా ఉన్నారు. హజ్రత్ ఉమర్ (రజి) హయాంలో ముస్లింలతో పారాటం జరిపిన వారిలో ఈరానీయులు బలమైనవారు. వారిలో జాత్యాభిమానము అమితంగా ఉండేది. దానితోపాటు వారివద్ద యుద్ధ సామగ్రికి ఎలాంటి కొదువ లేకుండింది. యుద్ధపు టేనుగులు, గుర్రాలు వారి వద్ద అధికంగా ఉండేవి. ప్రత్యేకంగా ఏనుగులు విధ్వంసాన్ని సృష్టించేవి. అడ్డువచ్చిన వారందరినీ అని మసలి వేసేవి. పైగా ఏనుగుల నీవులపై లోహపు పల్లకీలు కట్టబడియుండేవి. వాటిలో బాణాసంచారులు కూర్చొని బాణాల వర్షం కురిపించేవారు. ఈ పల్లకీలు ఒక విధంగా చెప్పాలంటే సడిచే విధ్వంస వాహనాలు. ఇటు ఏనుగులు యుధ్ధమైదానంలో విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉంటే ఈరానీయులు యుద్ధంలో చెలరేగిపోయేవారు. వారికి విరుద్ధంగా ముస్లిం సైనికులు యుద్ధాల్లో ఖడ్గాలు మరియు ఈటెలు అధికంగా ఉపయోగించేవారు. గాయాలబారిన పడకుండా కొందరు చర్మపు కవచములు తొడిగేవారు. ముస్లిం సైనికులలో అధికులు త్రుప్పుపట్టిన ఖడ్గాలతో పోరాడేవారు. ముస్లిం సైనికులు యుద్ధ భూమిలో నిరాయుధులై ఉన్నప్పటికీ, దైవకృపవలన వారు త్రుప్పుపట్టిన ఖడ్గాలతో, లోహపు ఈటెలను ముక్కలు, ముక్కలు గావించారు. ముస్లింలు ఉపయోగించే బాణాలు కూడా పరిమాణంలో చిన్నవిగా ఉండేవి. వాస్తవమేమిటంటే…. ముస్లింలు సాధించిన విజయగాధలు సైనిక బలగాలు, ఆయుధ పరిమాణాలపై ఆధారపడిలేవు. కేవలం వారు విశ్వాస ప్రతిష్ఠ, దైవనిష్ఠల ద్వారానే విజయం సాధించారు. వారు మృత్యువుకు భయపడేవారు కాదు. అరచేతిలో ప్రాణముంచుకొని యుద్ధంలో దిగేవారు. పరిణామం తేల్చుకోవాల్సినప్పుడు గుర్రం వీపులపై నుండి దుమికి వీరోచితంగా పోరాడేవారు. వీరగతి ప్రాప్తికొరకు సైనిక బలగాలపై ఊడిపడి పంక్తులకు పంక్తులే నేలమట్టం చేసేవారు.
ప్రముఖ సేనాని ‘ముసన్నా బిన్ హారిస్ (రజి)’ ఇస్లాం స్వీకరణకు ముందు ఇలా అనేవారు. “ఒకప్పుడు పదిమంది అరబ్బు సైనికులు, ఒక్కో ఈరానీ సైనికుని ముందు నిలబడడానికి సాహసించే వారు కాదు…. కాని ఇప్పుడు పదిమంది ఈరానీ సైనికులకు ఒక అరబ్బు సైనికుడు చాలు”. అదీ ‘విశ్వాసం’ (ఈమాన్) ప్రసాదించిన బలం!
సిరియా మరియు ఈజిప్ట్ సంగ్రామాలు
ఆఫ్రికా, ఆసియా, ఐరోపా ఖండ భూభాగాలను కలుపుకొని బలమైన సామ్రాజ్యంగా ఏర్పడింది రోమ్ సామ్రాజ్యం. ఆసియా ఖండంలోని సిరియా, పాలస్తీనా, సరిహద్దు ప్రాంతాలు ఈ సామ్రాజ్య అధీనంలో ఉండేవి. ఈజిప్ట్ మరియు ఆఫ్రికా ఖండ సరిహద్దు ప్రాంతాల అధిక భూభాగం కూడా రోమనుల అధీనంలోనే ఉండేది. ఇది కాకుండా ఐరోపా ఖండం కూడా రోమనుల ఆధీనంలోనే ఉండేది. రోమన్ క్రైస్తవులు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవనకాలం నుండే పోరాటాలు ప్రారంభించారు. ప్రథమ ఖలీఫా హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ (రజి) హయాంలో ఈ పోరాటాలు తీవ్రరూపం దాల్చాయి. ముస్లింలు ఆ రాజ్యపు అధిక భూభాగాన్ని హస్తగతం చేసుకున్నారు. రోమన్ క్రైస్తవులు, ముస్లింలకు మధ్య జరిగిన సమరాల్లో ‘యరమూక్’ యుద్ధం అతి పెద్దది. ఈ యుద్ధం హజ్రత్ అబూబకర్ (రజి) జీవితపు చివరి కాలంలో ప్రారంభమై ఆయన మరణాంతరం హజ్రత్ ఉమర్ (రజి) హయాంలో ముగిసింది. యరమూక్ యుద్ధంలో, రోమనులు రెండు లక్షల పైచిలుకు సైన్యంతో సన్నద్ధమై వచ్చారు. వారితో పోల్చినట్లయితే ముస్లిం సైన్యం కేవలం ఐదవ వంతు మాత్రమే అయినప్పటికీ యుద్ధ మైదానంలో ముస్లింలదే పై చేయి అయింది. రోమనుల శక్తియుక్తులన్నీ పటాపంచలై పోయాయి. ఇక మీదట వారు ముస్లింలకు వ్యతిరేకంగా విశాల సైన్యాన్ని సమకూర్చుకోటానికి సాహసించలేకపోయారు. హజ్రత్ అబూబకర్ (రజి) హయాంలో సిరియా ఇస్లామీ సైన్యాధిపత్య బాధ్యతలు ‘హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రజి)’ అధీనంలో ఉండేవి. హజ్రత్ ఉమర్ (రజి) ఖలీఫాగా ఎన్నికయిన తరువాత హజ్రత్ అబూఉబైదా బిన్ జర్రాహ్ (రజి)ను, ఖాలిద్ బిన్ వలీద్ (రజి) స్థానంలో సైన్యాధిపతిగా నియమించారు. హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రజి) ప్రతిభా నైపుణ్యం గల అగ్రశ్రేణి సైనికాధికారి. సమరభూమిలో శత్రు సైనికులను చిత్తు చేయడంలో ఆయన ఆరితేరిన దిట్ట. అయితే, ఆయన మితిమీరిన ఆవేశంతో ముస్లిం సైనికుల ప్రాణాలనిరకాటంలో పెడతారేమోనన్న ఆలోచన హజ్రత్ ఉమర్ (రజి)ను వెంటాడుతుండేది. హజ్రత్ అబూఉబైదా (రజి) ప్రథమంగా ఇస్లాం స్వీకరించిన సహాబాలలో ఒకరు. పైగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సన్నిహితులు కూడాను, ఆయన కనికర హృదయం గలవారు. ఆచితూచి అడుగువేసి ముస్లింల ప్రాణాలకు అపాయం కలుగకుండా యుద్ధ సన్నాహాలు చేసేవారు. హజ్రత్ అబూఉబైదా (రజి) ఎల్లప్పుడూ ఖాలిద్ బిన్ వలీద్ (రజి)తో సంప్రదిస్తూ ఉండేవారు. యుద్ధ మైదానంలో సైనికులు మోహరించే స్థానం సులభంగా విజయం సాధించటానికి శత్రుసైన్యపు ఏ భాగంపై గురి పెట్టాలి – ఇత్యాది నిర్ణయాలన్నీయు ఖాలిద్ బిన్ వలీద్ తో సలహా సంప్రదింపులు జరిపిన తరువాతనే తీసుకోబడేవి.
యర మూక్ యుద్ధంలో ఈరానీయులను ఓడించిన తరువాత ముస్లింలు డెమాస్కస్ నగరం వైపు పురోగమించారు. ఆ ప్రాంతం మొత్తాన్నీ నలువైపుల నుండి ముట్టడించారు. ఒకరోజు ‘క్రైస్తవ సైన్యాధికారి ఇంట పుత్రుడు జన్మించాడన్న వార్త ఖాలిద్ బిన్ వలీద్ (రజి) కు అందింది. ఈ సందర్భంలో నగర ప్రముఖులందరూ అతని భవనంలో విందు జరుపుకోవడానికి వచ్చారు. క్రైస్తవులు రక్షణార్థం తమ నగరం చుట్టూ కందకాలు త్రవ్వి వాటిని నీటితో నింపి యుంచేవారు. హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రజి) కందకాన్ని ఈదుకుంటూ పోయి త్రాడు సహాయంతో ప్రహరిగోడపై ఎక్కిపోయారు. లోనికి దుమికి నగర ప్రముఖ ప్రవేశద్వారాన్ని తెంచారు. అంతలోనే ఇస్లామీ సైన్యం మొత్తం నగరంలోనికి ప్రవేశించింది. అప్పటికి క్రైస్తవ సైన్యాధికారులు మత్తులో మునిగి కదలలేని స్థితిలో పడి ఉన్నారు. వారెవ్వరూ యుద్ధానికి సాహసించలేదు. కొద్దిసేపటికి వారు ‘శరణం’ ‘శరణం’ అన్న నినాదాలు చేస్తూ ముందుకు వచ్చారు. ఈ విధంగా ముస్లింలు డెమాస్కస్ నగరాన్ని సులభంగా జయించగలిగారు. ‘డెమాస్కస్ ‘ తరువాత సిరియా దేశ ప్రముఖ నగరాలు ఒక్కొక్కటీ ముస్లింల అధీనంలోకి వచ్చాయి. కొన్ని సందర్భాల్లో తీవ్ర ప్రతిఘటనలు కూడా జరిగాయి. ఈ యుద్ధాల్లో ‘అజ్ నాదీన్ ‘ యుద్ధం అత పెద్దది. ఈ ప్రాంతం క్రైస్తవ నాయకుల పట్టులో ఉండేది. పైగా అక్కడి నాయకుడు రణనీతిలో సాటిలేని మేటి. కాని ఈ యుద్ధంలో అతని ప్రతిభా నైపుణ్యాలేవీ పనికి రాకుండా పోయాయి. క్రైస్తవులకు ఘోర పరాజయం చవిచూడవలసి వచ్చింది. ఈ నగరాన్ని జయించిన తరువాత ముస్లిం సైనికులు ‘బైతుల్ మఖ్దిస్ ‘ను ముట్టడించారు.
ఈ నగరం దైవ ప్రవక్తల జీవిత విశేషాలకు నిలయం. యూదులు, క్రైస్తవుల మాదిరిగా ముస్లింలు కూడా ఈ నగరాన్ని పవిత్రమైనదిగా తలపోస్తారు. క్రైస్తవులు ‘బైతుల్ మఖ్దిస్’ను ముస్లింలకు అప్పగించటానికైతే అంగీకరించారు కాని, వారు హజ్రతీ ఉమర్ (రజి)ను స్వయంగా విచ్చేసి వాగ్దాన పత్రం పై సంతకం చేయాలని షరతు విధించారు.
హజ్రత్ ఉపుర్ (రజ) తన స్థానంలో హజ్రత్ అలీ (రజి)కి కార్యబాధ్యతలు అప్పగించి ‘బైతుల్ మఖ్దిస్’కు పయనించారు. ఆయన వెంట ఎలాంటి సైనిక బలగాలు లేవు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సాన్నిధ్యంలో జీవనం గడిపిన కొందరు వృద్ధ వయస్కులు మాత్రమే ఆయన వెంట ఉన్నారు. ఆ చిన్నపాటి బృందాన్ని తిలకించడానికి ఆబాల గోపాలమంతా తరలి వచ్చింది. తమ చక్రవర్తుల దర్పాన్ని మందీ మార్బలాన్ని తిలకించే సిరియా ప్రజానీకం ఈ సాధారణ మానవ సమూహాన్ని చూచి ఆశ్చర్యపోయింది. స్వయంగా ఖలీఫా ఆధిపత్యం వహించే ఈ బృందంలో డప్పు వాయిద్యాలుగానీ, నర్తకీలుగానీ, భజనపరులుగానీ ఎవరూ లేకపోవడంతో సిరియా ప్రజానీకం నివ్వెరపోయింది. మరి అదే రోమన్ రాజులు ప్రయాణించేటప్పుడు రాజు వాహనానికి కిరువైపులా సైనిక సమూహాలు, ఖడ్గం చేతపట్టుకొని పట్టువస్త్రాలు ధరించినవారు ఒకవైపు ఉండగా, ఊరేగింపు ముందు భాగంలో ‘పిల్లలు జరగండి’. రాజు గారొస్తున్నారు. అని నివాదం చేసే నినాదకర్తలు మరియు వెనుక భాగంలో తినుభండారాలు, టెంటులను మొదలగు వాటిని మోసుకు వస్తున్న ఒంటెలు ఉండేవి. రాజ వాహనం తిష్టవేసిన ప్రదేశమంతా ఒక నగరంగా వెలసి పోయేది. కాని హజ్రత్ ఉమర్ (రజి) సారధ్యంలో వచ్చినవారు ముతక దుస్తులు వేసుకొని ఉన్నారు. వాటిపై చర్మపు అతుకులు ఉన్నాయి. యాత్రీకులు ధరించే టాప్ ఒకరు ధరించి యుండగా, మరికొందరు తలపాగా కట్టుకొని ఉన్నారు. వస్త్రధారణరీత్యా వారిలో రాజెవరో, రైతెవరో తెలియని పరిస్థితి। వారు దిగినచోటనే గుడారములు కట్టారు. ముందుగా ‘వుజ’ చేసి ‘అజాన్’ ఇచ్చారు. నమాజ్ చేశారు. అనంతరం సంచుల నుండి తినుబండారాలు బయటకు తీసి సహపంక్తి భోజనం చేశారు. భోజనంలో పిండి. కొన్ని ఖర్జూరములు, జున్నుముక్కలు, మాంసం మొదలగునవి ఉన్నాయి. అన్న పానీయాలు పూర్తయిన తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత సంఘటనలు లేదా ప్రాపంచిక స్థితిగతులపై సింహావలోకనం జరిపారు. వారి ముఖాలు దేదిప్యమానంగా వెలిగిపోతున్నాయి అయితే వారి చూపుల్లో చూపులు కలిపే ధైర్యం ఎవరికీ లేదు. అదో అనిర్వచనీయమైన పరిస్థితి.
హజ్రత్ ఉమర్ (రజి) ‘బైతుల్ మఖ్దిస్’ చేరుకోగానే కొందరు నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. వారు పట్టు వస్త్రములు ధరించి ఆకర్షణీయంగా ఉన్నారు. హజ్రత్ ఉమర్ (రజి)కు కోసం వచ్చింది. ‘మీరు పరాయి రాజ్యంలోకి రాగానే ఇక్కడి తళుకు బెళుకులకు ఆకర్షితులైపోయారా? అని మండిపడ్డారు. “ఆహాఁ అదికాదు. ఈ వస్త్రాల లోపల మేము కవచాలు ధరించి ఉన్నాము” అని వారు సమాధానమిచ్చారు. అప్పుడు గాని ఆయన కోపం చల్లారలేదు.
హజ్రత్ ఉమర్ (రజి) బైతుల్ మఖ్దిస్ లో అనేక రోజులు బస చేశారు. క్రైస్తవులను కలుసుకున్నారు. క్రైస్తవ ప్రార్ధనాలయాన్ని సందర్శించారు. వాగ్దాన పత్రంపై సంతకం చేశారు. ముస్లింలను కలిశారు. వారికి హితబోధ చేశారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముఅజ్జన్ ‘హజ్రత్ బిలాల్ (రజి) ఆ సందర్భంలో అక్కడే ఉన్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానంతరం ఆయన ‘అజాన్’ ఇవ్వలేదు. ఆ రోజు ఆయన హజ్రత్ ఉమర్ (రజి) కోరికపై ‘అజాన్’ ఇచ్చారు. ఆయన మధురమైన కంఠం నుండి అజాన్ పదాలు జాలువారుతుంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితపు మధుర ఘడియలు గుర్తొచ్చి అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. అక్కడ హజ్రత్ ఉమర్ (రజి) నమాజ్ చదివారు. తరువాత కొందరు ముస్లింలు ఆ ప్రాంతంలో ఒక మస్జిదు నిర్మించారు. ఆ మస్జిదు హజ్రత్ ఉమర్ (రజి) పేరుతో నేటికీ చిరస్మరణీయంగా మిగిలి ఉంది.
ఆ ఈ సంఘటన జరిగిన రెండవ సంవత్సరం సిరియాలో భయంకర మహమ్మారి ప్రబలింది. ఈ వార్త విన్న హజ్రత్ ఉమర్ (రజి) ఆందోళన చెంది వెంటనే సిరియాకు బయలుదేరారు. అప్పటికే మహమ్మారి విస్తృతంగా వ్యాపించింది. అందువల్ల దానిని నిర్మూలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి వెళ్ళిపోయారు. సిరియా ప్రయాణ సమయంలో ఆయన ఒంటరిగా వెళ్ళారు. ఆయన వెంట కేవలం ఒక బానిస మాత్రమే ఉన్నాడు. ఇద్దరికీ ఒకే ఒంటె ఉంది. దానిపై హజ్రత్ ఉమర్ (రజి) మరియు ఆ బానిస వంతుల వారీగా కూర్చునేవారు. సిరియా చేరేసరికి బానిస ఒంటె పై కూర్చుని ఉన్నాడు. హజ్రత్ ఉమర్ (రజి) ఒంటె పగ్గాలు పట్టుకుని ముందు నడుస్తున్నారు. అక్కడి అధికారులు, అనధికారులు ఈ దృశ్యం చూచి నివ్వెరపోయారు.
ఈ మహమ్మారి వలన ముస్లింలు నష్టాల ఊబిలో చిక్కుకుపోయారు, అపారమైన ప్రాణనష్టం సంభవించింది. దాదాపు పదిహేను వేల ముస్లింలు మృత్యువాతన పడ్డారు. వారిలో హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రజి), హజ్రత్ అబూ ఉబైదా బిన్ జర్రాహ్ (రజి) కూడా ఉన్నారు. మరణానంతరం హజ్రత్ ఉమర్ (రజి) ఆయన ఆస్తిపాస్తులను వారి వారసులతో పంచిపెట్టారు. ప్రజల్లో జీతభత్యాలు, ఉపకారవేతనాలు పంచిపెట్టారు. ఈ కార్యసాధనకై ఆయనకు సిరియాలోని పలు ప్రాంతాలలో పర్యటించవలసి వచ్చింది.
అప్పుడు ఈజిప్ట్ దేశం కూడా రోమను సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉంది. ఖురైషీయులలో ప్రముఖులైన హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్ (రజి) ఇస్లాం స్వీకరణకు ముందు అక్కడే ఉండేవారు. అక్కడి పరిస్థితులపై ఆయనకు మంచి అవగాహన ఉంది. ఆయన హజ్రత్ ఉమర్ (రజి)తో ఈజిప్ట్ పై దండయాత్రకు అనుమతివ్వమని కోరారు. అందుకు హజ్రత్ ఉమర్ (రజి) అంగీకరించలేదు. కానీ హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్ (రజి) మరొకసారి అనుమతి కోరగా, ఆయన అనుమతించారు. కాని ఈజిప్ట్ చేరకముందు నా ఉత్తరం గనుక మీకు అందితే తక్షణం వెనక్కి తిరిగి రావాలి అని తాకీదు చేశారు. హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్ (రజి) ఈజిప్ట్కు చేరుకున్న తరువాత హజ్రత్ ఉమర్ (రజి) ఉత్తరం అందింది. అప్పటికే ఆయన ఈజిప్ట్ సరిహద్దు ప్రాంతాన్ని దాటి యున్నారు. అంచేత ఆయన వెనుతిరగకుండా ముందుకు పయనించారు.
అమ్ర్ బిన్ ఆస్ (రజి) వెంట నాలుగువేల మంది సైనికులు ఉన్నారు. ఈజిప్ట్ అధినేత అయిన ‘మఖూఖష్’ భారీ సైన్యంతో ఆయన్ను ఎదిరించడానికి వచ్చారు. అనేకమార్లు పోరాటాలు జరిగాయి. అన్ని విధాలా ముస్లింలదే పై చేయి అయింది. చివరకు ‘మఖూఖష్’ ఒక కోటలో కూర్చొని యుధ్ధపుణ్యహం రచించసాగారు. ఈ కోట నైలునదీ తీరాన ఉంది. నదీ మార్గము నుండి కోటవాసులకు ఆహార సామగ్రి సరఫరా అయ్యేది. హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్ (రజి), హజ్రత్ ఉమర్ (రజి)కు ఉత్తరం వ్రాసారు. ఆయన ప్రముఖ నాయకుడైన హజ్రత్ జుబైర్ బిన్ అవ్వామ్ (రజి) సారథ్యంలో పదివేల సైన్యాన్ని పంపించారు. ఈ సైన్యం ఏడు నెలల వరకూ కోటను ముట్టడించింది. కాని కోటను జయించడంలో విఫలమయ్యింది. ఒకరోజు హజ్రత్ జుబైర్ బిన్ అవ్వామ్ (రజి) ఖడ్గం తీసుకొని వల త్రాడు సహాయంతో కోట ప్రహరీ గోడపై ఎక్కిపోయారు. కొందరు సహబాలు కూడా ఆయన్ను అనుసరించారు. వారి నినాదాలకు రోమన్ సైన్యం భయభ్రాంతులకు లోనయింది. ఒక్కసారిగా ముస్లిం సైన్యమంతా ‘అల్లాహు అక్బర్’ అని నివారం చేయగా, అది కోటలు బీటలు వారినట్లు ప్రతిధ్వనించింది. రోమన్ సైనికులు భయపడి పారిపోవటానికి మార్గం వెతకసాగారు. అంతలో హజ్రత్ జుబైర్ (రజి) గోడపై నుండి లోపలికి దూకి కోట ముఖద్వారాన్ని తెరిచారు. ముస్లిం సైన్యమంతయూ కోటలోకి జొరబడింది. క్రైస్తవ సైన్యం లొంగిపోయింది. ఈ విధంగా ముస్లింలు కోటను సునాయాసంగా జయించగలిగారు.
ఈ విజయానంతరం ముస్లింలు ‘అస్కందరియా’ (అలెగ్జాండ్రియా) పట్టణం వైపు పురోగమించారు. తీవ్ర ప్రతిఘటన తరువాత ఆ నగరం వశమయింది. దాంతో క్రైస్తవుల ప్రాబల్యం దాదాపు అంతరించింది. అనంతరం ఈజిప్ట్ ప్రధాన పట్టణాలన్నీ ముస్లింల హస్తగతమయ్యాయి.
హజ్రత్ ఉమర్ (రజి) పదిన్నర సంవత్సరాలు ఖలిఫాగా ఉన్నారు. పైన ప్రస్తావించిన యుద్ధాలన్నీ ఆయన హాయాంలోనే జరిగాయి. దాదాపు ఈరాన్ సామ్రాజ్యమంతా ముస్లింల అధీనంలోకి వచ్చేసింది. కాని రోమన్ సామ్రాజ్యపు కాంతభాగం మాత్రమే ముస్లింలు జయించగలిగారు. ఆసియా ఖండపు ఒక ప్రాంతం విడిచి ఐరోపాలో కూడా వారి పరిపాలన అనేక సంవత్సరాలు కొనసాగింది ఈరానీయులు అగ్నిని పూజించేవారు మరియు రోమన్లు, క్రైస్తవులు. కాని యుద్ధ మైదానంలో ఇరువురూ ఆరితేరినవారే రోమన్ సైన్యంలో ఏనుగులు ఉండని మాట వాస్తవమే. ఈరానీయులలో రోమన్లకన్నా జాత్యాభిమానం అధికంగా ఉండేది.
ప్రపంచంలో ఎందరో విజయధీరులు ఉన్నారు. కానీ ముస్లింల విజయపరంపర తీరే వేరు. వారు ఇతరుల మాదిరిగా నిస్సహాయులపై చేయి చేసుకోలేదు. పిల్లలు, వృద్ధుల జోలికి పోలేదు. తమను ఎదిరించడానికి వచ్చిన వారితోనే వారు యుద్ధం చేశారు. వెళ్ళిన చోటల్లా వారు చెట్లను, పంటపొలాలను నాశనం చేయలేదు. వెళ్ళిన ప్రతిచోటా వీరు తమదైన శైలిలో ఎదుటివారి మనస్సులను గెలుచుకున్నారు. యర్ మూక్ యుద్ధ సందర్భంలో ముస్లింలు సిరియా నుండి వెళ్ళవలసి వచ్చినప్పుడు ‘అల్లాహ్ మిమ్మల్ని మళ్ళీ మా వైపు వంపుగాక’ అని విలపిస్తూ క్రైస్తవులు వీడ్కోలు చెప్పారు.
ఆనాడు ముస్లిమేతరులకు మతావలంబన విషయంలో పూర్తి స్వాతంత్ర్యం ఉండేది. వారు తమ మత సిద్ధాంతాల కనుగుణంగా ప్రార్థనలు జరిపేవారు. వారిని ఆపే సాహసం ఎవ్వరూ చేయలేకపోయేవారు. ముస్లింలు, ముస్లిమేతరులపై ఎలాంటి ఒత్తిడి తెచ్చినా శిక్షించబడేవారు. ఒకప్పుడు ఒక ముస్లిం, ఒక ముస్లిమేతరుడ్ని హతమార్చాడు. హజ్రత్ ఉమర్ (రజి) వెంటనే హంతకుడిని వారి బంధువులకు అప్పగించారు. వాస్తవమేమిటంటే మహాప్రసక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), ఆయన ప్రియ సహచరులు దైవభీతితో, బాధ్యతాయుత జీవసం గడిపేవారు. ముస్లింల ఈ సదాచార వైఖరికి ముస్లిమేతరులు ప్రభావితులై వారివైపు మొగ్గు చూపేవారు. వారు చేసిన సత్కార్యాలు, దైవపరాయణత, నిస్వార్ధగుణం మెందలను వాటిని చూసి ముస్లిమేతరులు ఇస్లాం స్వీకరించేవారు. ఇది కాకుండా యుద్ధ మైదానాల్లో నిరాయుధులైన ముస్లింలు హేమా హేమీలను పల్టీ కొట్టించిన తీరుసు చూచి ముస్లింల విజయాల వెనుక అల్లాహ్ హస్తం ఉందని నమ్మి కూడా అనేకులు ఇస్లాం స్వీకరించారు.
ఈ సంగ్రామాలన్నింటిలో హజ్రత్ ఉమర్ (రజి) స్వయంగా పాల్గొనకపోయినా, యుద్ధ సన్నాహాలు అన్నీ ఆయన నేతృత్వంలోనే జరిగాయి. ‘ఖాదసియా’ యుద్ధంలో హజ్రత్ సాద్ బిన్ వఖాస్ (రజి) ముస్లిం సేనాధిపతిగా వ్యవహరించినప్పటికీ హజ్రత్ ఉమర్ (రజి) మధీనాలో కూర్చొనే సంకేతాలు పంపేవారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని బేరీజు వేసేవారు. ఆయన వాయువేగంతో చూసుకువెళ్ళే అశ్వరూఢులు బలగమొకటి తయారు చేసి ఉంచారు. వారి ద్వారా ఆయనకు ఎప్పటికప్పుడు వార్తలందేవి.
హజ్రత్ ఉమర్ (రజి) పరిపాలనా కాలం
హజ్రత్ ఉమర్ (రజి) సహాబాలతో సంప్రదించి రాజ్యపరిపాలన కొనసాగించేవారన్న విషయం ఇదివరకే వివరించబడింది. రాజ్యసంక్షేమం కోసం సలహామండలి తీసుకొనే కీలక నిర్ణయాలకు ‘మస్జిదె నబవీ’ వేదికగా ఉండేది. పరిపాలనా దక్షత గల వివేచనాపరులు మరియు విషయావగాహన గల సహాబాలు ఈ సలహామండలిలో సభ్యులు. సమావేశానికి అప్పుడప్పుడు సైనికాధికారులను కూడా పిలిపించేవారు. అవసరాన్ని బట్టి ఇది వరకు ఇస్లాం స్వీకరించిన ఈరాన్ దేశవాయకుడు ‘హర్ మ్ జాన్ ‘ ను సంప్రదింపుల నిమిత్తం కబురంపేవారు. హజ్రత్ ఉమర్ (రజి)కు స్వయంగా నిర్ణయాలు తీసుకొనే అధికారం లేదు.
హజ్రత్ ఉమర్ (రజి) ఇస్లామీయ ప్రభుత్వాన్ని ఎనిమిది మండలాలుగా విభజించారు. ‘ఆహ్వాజ్’ మరియు ‘బహరైన్’లను కలిపి ఒక మండలము… ఇదే విధంగా సీస్తాన్, మక్రాన్ మరియు కిర్మాన్ లను కలిపి వేరొక మండలముగా చేశారు. ‘ఖిరాసాన్’ మరియు ‘తిబ్రీస్థాన్’లను వేరు- వేరు మండలాలుగా ఉంచారు. దక్షిణ ఈరాన్ ప్రాంతం కూడా వేరొక మండలంగా విభజింపబడింది. ఈజిప్ట్, సిరియా మరియు ఇరాఖ్ లను రెండు భాగాలుగా విభజించారు. మండలానికొక అధ్యక్షుడిని నియమించారు. ఈ మండలాధ్యక్షులు పరిపాలనా వ్యవహారాలతో పాటు ‘జుమా నమాజు’కు సారథ్యం కూడా వహించేవారు. ఇది వరకు మండలాధ్యక్షులే న్యాయనిర్ణేతలుగా వ్యవహరించేవారు. కాని హజ్రత్ ఉమర్ (రజి) పలు చోట్ల న్యాయస్థానాలు నిర్మించి న్యాయమూర్తులను వేరుగా నియమించారు. మండలాధ్యక్షులు సాధారణ జీవితాన్ని గడిపేవారు. అందరి మాదిరిగా వారు కూడా బజారుల్లో తిరిగేవారు. వారికెలాంటి సెక్యూరిటీ ఉండేది కాదు. ప్రతి ఒక్కరూ వారిని సులభంగా కలనుకోగలిగేవారు. అధికారులెవరైనా అవినీతికి, అక్రమాలకు పాల్పడినట్లు ఋజువైతే వారిని అందరి సమక్షంలో శిక్షించేవారు. ప్రతి మండలంలో మండలాధ్యక్షులు వ్యాయమూర్తులతో పాటు ప్రధాన మున్షీ . పోలీసు అధికారి మరియు కోశాధికారి ఉండేవాడు. భూమి శిస్తు వసూలుకై ప్రత్యేక అధికారి నియామకం జరిగేది.
ఇరాఖ్ మండలం రెండు ప్రాంతాలుగా విభజింపబడి ఉండింది. ఒక ప్రాంతానికి ‘కూఫా’ మరొక ప్రాంతానికి ‘బస్రా’ రాజధానులుగా ఉండేవి. ఈ రెండు పట్టణాలు హజ్రత్ ఉమర్ (రణి) కాలంలో ఆవిర్భవించినవే. ‘దజ్లా’ నది పరివాహక ప్రాంత వాతావరణం అరబ్బులకు సానుకూలంగా ఉండేది కాదు. అందువల్ల హజ్రణ్ ఉమర్ (రజి) అరబ్బులకు అనుకూలంగా ఉండే ప్రాంతం కోసం అన్వేషించే వారు. చివరకు ‘ఫరాత్’ నది పరివాహక ప్రాంతపు పశ్చిమంలో ఇసుక ప్రాంతమొకటి లభించింది. దానికి ‘కూఫా’ అను నామకరణం చేశారు. ఈ పట్టణం సముద్ర తీర ప్రాంతంలో రాళ్ళూ, రప్పలతో కూడిన ఇసుకపుడమిపై వెలసినది. ఆ ప్రాంతంలో మంచినీటి సౌకర్యం లేనందున ముస్లింలు ‘దజ్లా’ నది నుండి ఒక కాలువను త్రవ్వారు. ఫలితంగా మంచినీటి సమస్య దూరమైంది.
హజ్రత్ ఉమర్ (రజి) ఖలీఫాగా నియుక్తులైన తరువాత అనేకచోట్ల కాలువలు నిర్మించారు. జలవనరులను సమకూర్చారు. బావులు, సత్రములు, ధర్మశాలలు, వసతి గృహములు నిర్మించారు. భూమిశిస్తు వసూలు చేయబడేది. కాని హజ్రత్ ఉమర్ (రజి) క్రొత్తగా మరొకసారి భూములను సర్వే చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. రెవిన్యూ వ్యవస్థను పునర్నిర్మించారు. ప్రజాధనాన్ని (బైతుల్మాల్) నెలకొల్పారు. విద్యాలయాలు స్థాపించారు. సైనిక కాలనీలు నిర్మించారు. ప్రారంభదశలో సైనికుల జాబితా ఉండేది కాదు. వారికి సక్రమంగా జీతభత్యాలు కూడా లభించేవి కావు. హజ్రత్ ఉమర్ (రజి) సైనికుల జాబితాను రూపొందించి వారికి జీతభత్యాలను ప్రకటించారు. సరిహద్దు ప్రాంతాలలో ఎనిమిది భద్రతాదళాలు ఎల్లప్పుడూ సహారా కాస్తుండేవి. వాటిలో అనేకమంది సైనికులు, నాలుగువేల అశ్వములు ఎల్లప్పుడూ సంగ్రామానికి సిద్ధంగా ఉండేవి. ఏటేటా సైన్యంలో ముప్పైవేలమంది సైనికులు చేరేవారు. యుద్ధ సమయాల్లో సైనిక బృందంతో పాటు వైద్య బృందం కూడా ఉండేది. సైన్యం రెండు భాగాలుగా విభజింపబడి ఉండేది. ఒకటి పాదచారులు బృందం కాగా రెండవది వాహన బృందం.
ఆదాయం:
మూడు ప్రధాన ఆదాయపు శాఖలు ఉండేవి, ఒకటి భూమిశిస్తు, రెండవది జకాత్ (జకాత్ చెల్లించుట ప్రతి ముస్లిం విధి), ముస్లిమేతరుల నుండీ జకాత్ తీసుకోబడేది కాదు, కాని ఇరవై ఏడు సంవత్సరముల నుండి యాభై సంవత్సరములు గల వారికి కొంత మొత్తంలో ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉండేది. దీని పేరు ‘జిజియా‘. వికలాంగులు మరియు వృద్ధుల నుండి జిజియా తీసుకోబడేది కాదు. నిజానికి ముస్లిమేతరుల నుండి ఈ పన్ను సైనిక సహాయార్థం తీసుకోబడేది. ముస్లిం సైన్యంలో సైనికులుగా చేరిన ముస్లిమేతరులకు ఈ పన్ను నుండి మినహాయింపు ఉండేది. ‘యర మూక్’ యుద్ధానికి ముందు ముస్లింలు తాము జయించిన ప్రాంతాలు వదిలి వెళ్ళేటప్పుడు వారు తాము వసూలు చేసిన జిజియా పన్ను పాలితులకు తిరిగి ఇచ్చారు. ‘మీ ధనమానాలను పరిరక్షించే స్థోమత లేనప్పుడు, మీ నుండి పన్ను ఎలా ఎలా తీసుకోగలము? అని వారు అన్నారు.
ముస్లింల చే జయింపబడిన ప్రాంతాల యందు నివసించే ముస్లిమేతర ప్రజా సమూహమును “జిమ్మీ“గా పిలువబడుతుంది. ‘జమ్మీ’లపై అత్యాచారం చేయటానికి ఏ విశ్వాసీ సాహసించ లేకపోయేవాడు. జమ్మీలతో ముస్లింల వ్యవహారసరళి ఒకే విధంగా ఉండేది. జిమ్మీలలో ఎవరైనా వృద్ధాప్యానికి చేరి అసరాలేని అభాగ్యులై జరుగుబాటు కష్టతరమైనప్పుడు వారికి ‘జిజియా’ నుండి పూర్తి మినహాయింపు ఇచ్చి, వారి జరుగుబాటుకై ‘బైతుల్మాల్’ నుండి ఉపకారవేతనములు చెల్లించటం జరిగేది. హజ్రత్ ఉమర్ (రజి) జిమ్మీలతో పాటు బానిసల విషయంలో కూడా చింతాగ్రస్తులై ఉండేవారు.
వ్యవసాయ విధానం :
హజ్రత్ ఉమర్ (రజి) కాలంలో వ్యవసాయరంగం అభివృద్ధిపథంలో పయనించసాగింది. దీనికి కారణం వ్యవసాయరంగంలో శీఘ్రగతిన జరిగిన సంస్కరణలే. ఆయన అనేకచోట్ల కాలువలు త్రవ్వించారు. ‘దజ్లా’ మరియు ‘పరాత్’ నదులకు ఆనకట్టలు నిర్మించారు. ‘నైలు’ ‘భిల్ జిమ్’ నదుల మధ్య కాలువ త్రవ్వించారు. దాని వలన ఈజిప్ట్ నుండి ఆహారధాన్యాలు ఓడలలో అరబ్ దేశానికి చేరేవి. రాత్రి సమయాల్లో సహారా కోసం ప్రత్యేక పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. ఖైదీల నుంచడానికి కారాగారములు కట్టించారు. అరబ్బుల్లో కవిత్వాలు చర్చనీయాంశంగా ఉండేవి. వారిలో నక్షత్ర విద్యనభ్యసించే మోజు కూడా అధికంగా ఉండేది. రోమ్ మరియు ఈరాన్ ఆధిపత్యంలో ఉన్న అరబ్ రాజ్యాలకు చెందిన గాయకులు కవులకు, కవిత్వాలకు విపరీతమైన ఆదరణ ఇచ్చేవారు. వారి ఆదరాభిమానాల కారణంగా కవిత్వం, చరిత్ర మరియు నక్షత్ర విద్యలు ఖ్యాతి గడించాయి. కాని అరబ్బుల్లో విద్యాభ్యాసం తక్కువే. ప్రజలు కవితలను కంఠస్తం చేసుకునేవారు. ఈ పరంపర చాలాకాలం వరకు ఈ విధంగానే నడిచింది. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మించినప్పుడు అరబ్బుల్లో అక్షరాస్యుల శాతం చాలా తక్కువ. బద్ర్ సంగ్రామంలో బందీలు గావింపబడిన ఖురైష్ సైనికులు పరిహారం (ఫిదియా) చెల్లించి బంధ విముక్తులయ్యారు. వారిలో పరిహారం చెల్లించలేని వారు కొందరు ఉన్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిలోని ఒక్కొక్కరు పదేసిమంది ముస్లింలకు విద్యబోధించి ముక్తిని పొందవచ్చని ఆదేశించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమపదించే నాటికి అరబ్బుల్లో అక్షరాస్యుల సంఖ్య పెరిగింది. హజ్రత్ ఉమర్ (రజి) హయాంలో ఈ అక్షరాస్యత తారస్థాయికి చేరింది. హజ్రత్ ఉమర్ (రజి) హయాంలో విద్యాలయాలు వెలిసాయి. ఉపాధ్యాయుల నియామకం జరిగింది. వారికి ప్రజాధనం (బైతుల్మాల్) నుండి జీతాలు లభించేవి.
హజ్రత్ ఉమర్ (రజి) అతి నిరాడంబరంగా జీవించేవారు, కానీ అయన ఖిలాఫత్ సమయంలో రోమ్ ఈరాన్ ప్రభావం వల్ల అరబ్బుల ఆచార ‘వ్యవహారాల్లో అనేక మార్పులు టోటు చేసుకున్నాయి. మొదటవారు అతి సామాన్యమైన ఇళ్లల్లో నివసించేవారు. హజ్రత్ ఉమర్ (రజి) ఖిలాఫత్ సమయంలో రోమ్ మరియు ఈరాన్లు జయింపబడిన పిదప వారు పక్కా ఇళ్లను నిర్మించసాగారు. అందులో రోమ్ మరియు ఈరాన్లో వాస్తుకళ ఉట్టిపడేది. ఒకప్పుడు అరబ్బులు దేహభాగమంతయూ కప్పబడి ఉండునట్లుగా (పాదాల వరకు) అంగి ధరించేవారు. దానిపై ఒక చర్మపు పట్టీ మరియు ఒంటె వెంట్రుకలతో చేయబడిన నగిషీ ఉండేది. కాని యుద్ధ సమయాల్లో మాత్రం వారు బిగుతైన దుస్తులు ధరించేవారు. పట్టణాల్లో అంగీ, లాగులు ధరించే సంప్రదాయం ండేది. ఈరాన్, రోమ్ రాజ్యాల వక్త్రధారణతో ప్రభావితులైన ప్రజలు ‘ఖుబా’ ధరించేవారు. ఇది పొడవైన చేతులు గల కోటు, తలపై తలపాగా ఒకటి ధరించేవారు. భుజాలు, మెడపై ఎండ తాపానికి లోనవకుండా రుమాలు వేసుకునేవారు. స్త్రీలు వివిధ డిజైనులు గల సరళ దుస్తులు ధరించేవారు. తలపై వోణీ కప్పుకునేవారు. బయటికి వెళ్ళేటప్పుడు శరీరమంతా కప్పబడి ఉండేలా తలపై నుండి దుప్పటి వేసుకునేవారు.
హజ్రత్ ఉమర్ (రజి), తన వలెనే ఇతరులు సాధారణ జీవన కూడా శైలినవలంబించాలని కాక్షించేవారు. ఆయన జీవించి ఉన్నంతకాలం ముస్లింలు సంప్రదాయబద్ధంగా వ్యవహరించేవారు. అరబ్బులు సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించేవారు కాదు. కాని మదీనాకు దూరంగా సిరియా, ఈజిప్ట్ దేశాల్లో నివసించేవారు కాలక్రమేణా ఆధునికతకు ప్రభావితులు కాసాగారు. అధికారులెవరైనాసరే అవధుల్ని అతిక్రమిస్తే మాత్రం హజ్రత్ ఉమర్ (రజి) వారిని కఠినంగా శిక్షించే వారు. ఒకప్పుడు ఈజిప్ట్ అధిపతియైన ‘అయాజ్ బిన్ ఘనమ్’ (రజి) పలుచటి వస్త్రాలు ధరిస్తారని, ఇంటి ముందు కాపలా దారుల్ని నియమించారని ఫిర్యాదు వచ్చింది. హజ్రత్ ఉమర్ (రజి) పరిశోధనార్ధం ‘ముహమ్మద్ బిన్ ముసల్లమా (రజి)’ ను ఈజిప్ట్ పంపారు. ఈజిప్ట్ చేరిన ముసల్లమా (రజి) అయాజ్ను పలుచటి వస్త్రాలలో చూశారు. ఇంటిముందు కాపలాదారులు కూడా ఉన్నారు. అదే స్థితిలో ఆయన్ను మదీనా తీసుకెళ్ళారు. హజ్రత ఉమరి (రజి) ఆయన ఒంటిపై నుండి మెత్తని సన్నని వస్త్రాలు తీయించి, వెంట్రుకలతో చేయబడిన గరకు దళసరి వస్త్రాలు తొడిగించి, మేకలు మేపేందుకు అడవికి వెళ్ళమని ఆదేశించారు. ఈ శిక్ష ఫలితంగా ఆయాజ్ జీవితాంతం ఎన్నడూ పలుచని దుస్తులు ధరించలేదు.
హజ్రత్ సాద్ బిన్ వఖాస్ (రజి) ‘కూఫా’లో రాజభవనం ఒకటి నిర్మించారు. అందులో ఒక ‘దివాణం’ కూడా ఉండేది. హజ్రత్ ఉమర్ (రజి), ముహమ్మద్ బిన్ ముసల్లమా (రజి)ను దివాణాన్ని దహించమని ఆదేశించారు. ఖలీషా ఆదేశం పాటించబడింది. సాద్ బిన్ వఖాస్ (రజి) ఈ కార్యమంతటినీ మౌనంగా తిలకిస్తూ కూర్చున్నారు.
హజ్రత్ ఉమర్ (రజి) నిరాడంబర జీవితానికి ఇంతగా ప్రాధాన్యమివ్వటానికి అనేక కారణాలు ఉన్నాయి. విలాసవంతమైన జీవితంలో మునిగి తేలినవారు, ప్రాపంచిక వ్యామోహానికి లోనైపోయి సోమరులుగా మెలుగుతారు. కష్టాలకు ఎదురీదలేరు. ఇలాంటి వారే ఇతర జాతుల సంప్రదాయాలకు బానిసలౌతారు.
హజ్రత్ ఉమర్ (రజి) ప్రజల పట్ల కఠిసంగా వ్యవహరించేవారు. కాని ఆయన తనపై, తన కుటుంబీకుల పట్ల అంతకన్నా ఎక్కువ కఠిన వైఖరి నవలంబించేవారు. ఆయన ఎల్లప్పుడూ దళసరి దుస్తులు ధరించేవారు. పైగా వాటికి అతుకులు ఉండేవి. ఆయన ముస్లింలకు ప్రతిభయే కొలమానంగా భావించి, దాని ప్రకారం ఉపకారవేతనాలు చెల్లించేవారు. ఆయన ప్రజాధనం (బైతుల్మాల్) నుండి రోజుకు కేవలం రెండు దిర్హమ్ లో మాత్రమే పొందేవారు. సిరియా జయింపబడిన తరువాత రోము రాజ్యాధినేతలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవి. ఒకప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) సతీమణి ‘ఉమ్మెకుల్సుమ్ (రజి) రోము రాణికి సుగంధ ద్రవ్యాలతో నిండిన సీసాలు కొన్నింటిని కానుకగా పంపించారు. రోము రాణి ఆ సీసాల నిండా వజ్రాలు నింపి తిరిగి పంపించింది. హజ్రత్ ఉమర్ (రజి)కు ఈ సంగతి తెలియగా ఆయన తన భార్యతో ‘నిస్సందేహంగా, నీవు పంపిన సుగంధ ద్రవ్యాలు నీవె… కాని వాటిని తీసుకెళ్ళినవాడు ప్రభుత్వ రాయబారి అంటూ వజ్రములన్నింటినీ ప్రజాధనములో జమచేయించారు. ఒకసారి ఆయన అస్వస్థతకు గురయ్యారు. తేనె సేవించమని వైద్యులు సలహాఇచ్చారు. హజ్రత్ ఉమర్ (రజి) మస్జిదుకు వచ్చి, ముస్లింలను సమావేశపరచి వారితో “మీరు అనుమతిస్తే ప్రజాధనాగారం నుండి కొంత తేనె తీసుకుంటాను” అని అడిగారు.
తాను చేసిన తప్పును తెలుసుకున్న వెంటనే ఆయన క్షమాపణ కోరుకునేవారు. ఒకప్పుడు ఒకరిని కొట్టడానికి కొరడా ఎత్తారు. కాని తాను మితిమీరానని తెలిసిన వెంటనే క్షమాపణ కోరుకున్నారు. అప్పుడప్పుడు ప్రజలు కూడా ఆయనపై ధ్వజమెత్తేవారు. యుద్ధ రంగంలో పోరాటానికెళ్ళిన సైనికుల ఇండ్లకు వెళ్ళి వారికి కావలసిన సామాన్లు సమకూర్చేవారు. సైనికుల ఉత్తరాలు వస్తే వాళ్ళ ఇంటికి స్వయంగా వెళ్ళి ఇచ్చేవారు. చదివి వినిపించే వారు కూడాను, అవసరమైతే అక్కడే ఇంటి అరుగుపై కూర్చుని ఉత్తరాలు వ్రాసిచ్చేవారు.
పరలోక యాత్ర
హజ్రత్ ఉమర్ (రజి) మరణానికి కొంతకాలం ముందు హజ్ చేశారు. ఆయన ‘జిల్ హజ్జ్’ నెలలో హజ్ ఆచారాలు నెరవేర్చి మదీనా చేరుకున్నారు. శుక్రవారం రోజు మస్జిదులో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో ఆయన దైవ ప్రాతినిధ్యం (ఖలీఫా) పై కొన్ని అంశాలను వివరించారు. ఆయన తన వారసుని విషయంలో చింతాగ్రస్తులై ఉన్నట్లు ఆ ప్రసంగం ద్వారా వ్యక్తమయింది.
మదీనాలో అబూలూలూ ఫేరోజ్ అను ఒక పారసీక బానిస ఉన్నాడు. ఒకరోజు అతడు హజ్రత్ ఉమత్ (రజి)తో నేను పగలంతా శ్రమించి సంపాదించిన కొద్ది మొత్తంలోంచి, నా యజమాని రెండు దిర్హమ్ లు వసూలు చేసుకుంటాడు అని ఫిర్యాదు చేశాడు. అందుకు హజ్రత్ ఉమర్ (రజి), నీ వృత్తి ఏమిటి? అని అడిగారు. అతడు ‘నేను కుమ్మరిని మరియు నగిషి కూడా వేస్తాను అని సమాధానమిచ్చాడు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) “రెండు దిర్హమ్ లు నీ కోసం పెద్ద సొమ్ము కాదే!?” అని అన్నారు. హజ్రత్ ఉమర్ (రజి) సమాధానంతో సంతృప్తిపడని అబూలూలూ ఫేరోజ్ మాటువేసి రెండవరోజు హజ్రత్ ఉమర్ (రజి) నమాజ్ చేస్తూ ఉండగా, ఆయనపై విరుచుకుపడి తీవ్రంగా గాయపరిచాడు. హజ్రత్ ఉమర్ (రజి) ఆ స్థితిలో కూడా అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి)ను తన స్థానంలో నిలబెట్టారు. ఇటు హజ్రత్ ఉమర్ (రజి) గాయాలతో కొట్టుమిట్టాడుతుంటే అటు అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి) నమాజు సారథ్యం వహించారు.
అబూలూలూ ఫేరోజ్ ఇంకొందరిని గాయపరిచాడు. పట్టుబడిన తరువాత అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. నమాజ్ పూర్తయిన తరువాత ప్రజలు హజ్రత్ ఉమర్ (రజి)ను ఇంటికి తీసుకెళ్ళారు. హజ్రత్ ఉమర్ (రజి) ‘తనపై హత్యాయత్నం చేసిన వాడెవడు?’ అని అడిగారు’ ప్రజలు అబూలూలూ ఫెరోజ్ పేరు చెప్పారు. తనపై హత్యాయత్నం చేసినవాడు ముస్లిం కానందుకు ఆయన అల్లాహ్ కు కృతజ్ఞతలు వెలిబుచ్చుకున్నారు. ఆయన తన పుత్రుడైన అబ్దుల్లా (రజి)ను పిలిచి, నేను మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి ప్రక్కన సమాధి గావింపబడాలనుకుంటున్నాను. అందుకు హజ్రత్ అయిషా (రజి) అనుమతి తీసుకోండి’ అని సందేశము పంపారు. అందుకు హజ్రత్ ఆయిషా (రజి) ‘నేను ఈ స్థలాన్ని నా కోసం ప్రత్యేకించుకున్నాను. అయితే హజ్రత్ ఉమర్ (రజి)కు ప్రాధాన్యత ఇస్తున్నాను” అంటూ అనుమతి ఇచ్చారు.
హజ్రత్ ఉమర్ (రజి) తరువాత ఆయన వారసుడు ఎవరు? అన్న ఉత్కంఠభరితమయిన ప్రశ్న తలెత్తింది. ప్రజలందరూ వారసుడి నియామకానికై హజ్రత్ ఉమర్ (రజి)ను సంప్రదించగా, ఆయన హజ్రత్ అలీ(రజ), హజ్రత్ సాది బిన్ వఖాస్ (రజి), హజ్రత్ జుబైర్ (రజి), హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్(రజి), హజ్రత్ ఉస్మాన్ (రజి) మరియు హజ్రత్ తల్హా (రజి)ల పేర్లు ప్రస్తావించి, ‘వీరిలో ఎవరినైనా ఖలీఫాగా నియమించుకోండి’ అని సూచించారు. శరీరమంతా గాయాలతో రక్తసిక్తమై విపరీత బాధ కలుగుతున్నా ఆయన ఆ సమయంలో కూడా జిమ్మీలను మరువలేదు. తన తరువాత రాబోయే ఖలీఫాను ఉద్దేశిస్తూ, “నా తరువాత ఖలీఫాగా ఎన్నికయ్యేవారు మన అధీనంలో ఉన్న ఇతర మతావలంబీకులందరినీ ఆదరించాలి. వారి యెడల సత్ప్రవర్తనతో మెలగాలి” అని శాసించారు.
గాయపడిన మూడవ రోజు హజ్రత్ ఉమర్ (రజి) పరమపదించారు. (జిల్ హిజ్జా 23వ తేదీ హిజ్రి 23వ సంవత్సరం లేదా క్రీ.శ. 644). అప్పటికి ఆయన వయస్సు 63 సంవత్సరములు. ఆయన పదిన్నర సంవత్సరాలు ఖలీఫాగా ఉన్నారు. ఆయన కుటుంబం చాలా పెద్దది. ఆయనకు ప్రజాధనం (బైతుల మాల్) నుండి లభించే జీతభత్యాలు జరుగుబాటుకు సరిపడేవి కావు. మరణం నాటికి ఆయన ఎనభై ఆరువేల దిర్హమ్ లు బాకీ ఉన్నారు. ఈ అప్పును ఆయన ఇల్లు అమ్మి తీర్చడం జరిగింది.
సంతానం
హజ్రత్ ఉమర్ (రజి) సంతానంలో హజ్రత్ హఫ్సా(రజి), హజ్రత్ అబ్దుల్లా (రజి) మరియు హజ్రత్ ఉబైదుల్లా (రజి) మరియు హజ్రత్ ఆసిమ్ (రజి) లు ప్రముఖులు. హజ్రత్ హఫ్సా (రజి) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సతీమణి. హజ్రత్ అబ్దుల్లా (రజి) దైవభీతికలవారు, సదాచార సంపన్నులు, ధర్మజ్ఞాని కూడానూ. ఆయన అగ్రశ్రేణి సహాబీలలో ఒకరుగా పరిగణించ బడేవారు. ఆయన హజ్రత్ ఉమర్(రజి) తోపాటే ఇస్లాం స్వీకరించారు, మహాప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలిసి ఎన్నో ధర్మయుద్ధాల్లో పాల్గొన్నారు. తన తండ్రి మాదిరిగా ఆయన కూడా సత్యవాది, నిరాడంబరజీవి. మక్కానగరాన్నేలి ప్రజలను హింసాకాండకు గురిచేసిన మక్క గవర్నర్ హజ్జాజ్ బిస్ యూసుఫ్ ఒకప్పుడు కాబాలో ప్రసంగిస్తున్నప్పుడు. హజ్రత్ అబ్దుల్లా (రజి) లేచి ‘ఇతడు అల్లాహ్ విరోధి. ఎందుకంటే ఇతడు దైవాభిమానులను హతమార్చాడు’ అని నిర్భయంగా విమర్శించారు. ఆసిమ్, ఉబైదుల్లాలు కూడా సమర్థులు, పేరుమోసిన వారే. హజ్రత్ ఉలైదుల్లా (రజి) పరాక్రమశాలి. ప్రముఖ యుద్ధ వీరుడు. ఆయన మూడవ కుసూరుడు హజ్రత్ ఆసిమ్ (రజి) సౌశీల్యవంతులు, పండితులు.
హజ్రత్ ఆసిమ్ (రజి) ఆజానుబాహులు, మంచికవి కూడా. కవులందరూ కవిత్వాలల్లేటప్పుడు అనవసర పదజాలాన్ని ఉపయోగించేవారు. కాని హజ్రత్ ఆసిమ్ (రజి) కవిత్వం దీనికి వ్యతిరేకం. ప్రపంచ ఖ్యాతి గాంచిన హజ్రత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (రహ్మలై) ఈయన మనుమడే. ఆయన తన రెండున్నరేళ్ళ స్వల్ప పరిపాలనా వ్యవధిలో సాధించిన విజయాలు, చేసిన ఘనకార్యాలు అనితరసాధ్యం. ప్రళయకాలం వరకూ ప్రజలు ఆయన్ని మరువలేరు.
ఖలీఫాగా సాధించిన విజయాలు
హజ్రత్ ఉమర్ (జి) ఖిలాఫత్ కాలంలో ప్రవేశ పెట్టిన సంస్కరణలు మానవజాతికి ఎంతో మేలును చేకూర్చాయి. మేము వీటిని పెద్ద పెద్ద గ్రంధాల నుండి సేకరించి పొందు పరుచుచున్నాము.
పేద క్రైస్తవులు యూదుల కోసం ధర్మసత్రాలను స్థాపించారు.
గ్రంథాలయాలను నిర్మించారు.
ఉపాధ్యాయుల కోసం ఉపకారవేతనాలను నిర్ధారించారు.
క్రమపద్ధతిలో దివ్యఖుర్ఆన్ సేకరణా కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
రమజాన్ నెలలో సామూహిక తరావీహ్ నమాజును స్థాపించారు.
మద్య సేవనం పై ఎనభై కొరడా దెబ్బల శిక్ష విధించారు.
వ్యాపార, వాణిజ్య గుర్రాలపై ‘జకాత్’ నిర్ధారించారు.
వక్ఫ్ విధానాన్ని స్థాపించారు.
మస్జిద్ ఉపన్యాస, ఉపదేశాల రివాజును ప్రారంభించారు.
ఇమామ్, ముఅజ్జిన్ ల కోసం జీతాలను నిర్ధారించారు.
రాత్రి సమయాల్లో మస్జిదులలో దీపాలను పెట్టించారు.
కవితా గేయాల్లో స్త్రీ నామ స్మరణాన్ని నిషేధించారు.
ఆదర్శ రాజ్య ప్రణేతగా హజ్రత్ ఉమర్ (రజి)
పరిపాలకునిగా ఉంటూనే ఒక నౌకరుగా సేవలందించిన అధినేత ప్రపంచంలో ఎవరయినా ఉన్నారా? హజ్రత్ ఉమర్ (రజి) ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు మదీనా వీధుల్లో ఒంటరిగా తిరిగేవారు. చేతిలో కొరడా పట్టుకొని దారిలో శిక్షించదగిన నేరస్తులెవరైనా తారసపడితే వారిని తగిన విధంగా అక్కడికక్కడే శిక్షించేవారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా గస్తీ చేసేవారు. మదీనా మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా “ఆయన కొరడా, ఇతరుల ఖడ్గాలకంటే భయంకరమైనది” అని అనేవారు. హజ్రత్ ఉమర్ (రజి) గస్తీ చేసేటప్పుడు ఎదురయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ సంఘటనలు హజ్రత్ ఉమర్ (రజి) బాధ్యతా భావనకు, సమర్థ పరిపాలనకు అద్దం పడతాయి. వాటిలో కొన్నింటిని పొందుపరచటం జరిగింది.
1) ఒకరోజు వర్తక బృంద మొకటి మదీనాకు వచ్చి పట్టణ పాలిమేరల్లో విడిది చేసింది. హజ్రత్ ఉమర్ (రజి) గస్తీ చేస్తూ అక్కడికి చేరుకున్నారు. విడిది చేసిన యాత్రకులను చూచి హజ్రత్ ఉమర్ (రజి) ‘ఈ వర్తక బృందానికి కాపలాగా ఈ రాత్రి ఇక్కడే ఉందామ’ని హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి)తో అన్నారు. ఆ రాత్రి వారిద్దరూ కాపలా కాశారు. ‘తహజ్జుద్’ నమాజ్ కూడా అక్కడే చేశారు. ఆ రాత్రంతా ఒక పసివాడి ఏడుపు శబ్దం, దానికి ఆ పసివాడి తల్లి నిర్లక్ష్యం హజ్రత్ ఉమర్ (రజి)ను ఎంతో కలవరపరచాయి. కోపోద్రిక్తులైన హజ్రత్ ఉమర్ (రజి) ఆ తల్లిని గట్టిగా మందలించారు. హజ్రత్ ఉమర్ (రజి) మందలింపుతో సహనం కోల్పోయిన ఆ తల్లి ఆయనపై ఇలా శివమెత్తింది. “పసివాడిని పాల నుండి విడిపించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. కానీ వాడు మారాం చేస్తున్నాడు”. ‘పసివాడి వయస్సెంత?’ అని హజ్రత్ ఉమర్ (రజి) ప్రశ్నించారు. ‘కొన్ని నెలలు మాత్రమే! సమాధానమిచ్చింది తల్లి. ‘ఇంత తొందరగా పాలు ఎందుకు విడిపిస్తున్నావు?’ అని హజ్రత్ ఉమర్ (రజి) తిరిగి అడిగారు. అప్పుడు ఆమె ‘హజ్రత్ ఉమర్ (రజి) పాలు విడిచిన పసిపిల్లలకు మాత్రమే జీవనభృతిని నిర్ధారించారు కదా’ అని అంది. పాలువిడిపించటంలో తొందరపడకు అని తల్లితో చెప్పి హజ్రత్ ఉమర్ (రజి) వెళ్ళిపోయారు. తరువాత ఆయన ‘ఫజ్ర్’ నమాజ్ కోసం అరుదెంచారు. నమాజ్ చదివిన తరువాత హజ్రత్ ఉమర్ (రజి) తనను తాను నిందించుకుంటూ ‘ఓ ఉమర్ ! నీకు మూడింది. ముక్కుపచ్చలారని పసికూనలెందరిని ఇప్పటి వరకు నీవు బలొగొన్నావో?!’ అని కన్నీరు మున్నీరై ఏడుస్తూ కూర్చున్నారు. తరువాత ఆయన “తల్లులెవరూ తమ పసిపాపలను పాలు విడిపించుటలో తొందరపడరాదు. ఇకనుండి పిల్లల జీవనభృతి వారి పుట్టుకతోనే ఇవ్వబడుతుంది” అని ప్రకటన జారీ చేశారు. ఈ ప్రకటనను ఆయన రాష్ట్రాధికారులందరి వద్దకూ లిఖితపూర్వకంగా పంపించారు.
2) హజ్రత్ అనస్ (రజి) ఇలా వివరించారు: ఒకరోజు రాత్రి హజ్రత్ ఉమర్ (రజి) గస్తీ చేస్తున్నారు. ఒక జనపదుడి (పల్లెవాసి) గుడారం వద్దకు వెళ్ళారు. అతడు తన గుడారం ముందు ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. హజ్రత్ ఉమర్ (రజి) అతన్ని పలకరించారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అంతలోనే గుడారంలోంచి బాధాకరమైన ఏడుపు శబ్దం వినపడింది. ‘గుడారంలో ఎవరున్నారు? ఆ అరుపులు శబ్దమేంటి?’ అని హజ్రత్ ఉమర్ (రజి)ఆ పల్లెవాసిని అడిగారు. ‘గుడారంలో ఒక స్త్రీ ఉందనీ పురిటి నొప్పులు భరించలేక ఏడుస్తోందని’ ఆ పల్లెవాసి సమాధానమిచ్చాడు. హజ్రత్ ఉమర్ (రజి) వెంటనే తన ఇంటికెళ్ళి తన భార్యయైన ఉమ్మె కుల్సుమ్(ర.అన్హ)ను పిలుచుకువచ్చారు. గుడారంలో మూలుగుతున్న స్త్రీ సహాయార్ధం ఆమెను గుడారంలోకి పంపారు. కొద్దిసేపటికి గుడారం నుండి ఉమ్మెకుల్సుమ్ (ర.అన) ‘ఓ అమీరుల్ మోమినీన్! అబ్బాయి పుట్టాడని మీ మిత్రునికి శుభవార్త అందజేయండి’ అని బిగ్గరగా చెప్పారు. ‘అమీరుల్ మోమినీన్’ అన్న పదం చెవిన పడగానే ఆ పల్లెవాసి భయంతో వణకసాగాడు. చేతులు జోడించి క్షమాపణ కోరసాగాడు. తరువాత హజ్రత్ ఉమర్ (రజి), ఫరవాలేదు. తెల్లవారాక వచ్చి పసిపిల్లవాడికి నిర్ధారించబడిన జీవనభృతిని తీసుకెళ్ళమని అతనితో అన్నారు.
3) ఒకసారి సిరియా నుండి తిరిగి వచ్చిన తరువాత హజ్రత్ ఉమర్(రజి) ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు ఒంటరిగా వెళ్ళారు. మార్గంలో ఆయనకొక ముసలావిడ తారసపడింది. హజ్రత్ ఉమర్ (రజి) ఆమె నుద్దేశ్యించి, ‘మీ పరిపాలకుడు ఎలాంటివాడు?’ అని అడిగారు. అందుకు ఆమె దురుసుగా సమాధానమిస్తూ ‘ఆయన ఖలీఫాగా నియుక్తులైనప్పటి నుండి నాకొక్కపైసా కూడా లభించలేదు’ అని అంది. అప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) ‘బహుశా నీ గురించి హజ్రత్ ఉమర్ (రజి)కు తెలియదేమో…. నీవే ఆయనతో నీ పరిస్థితిని గురించి విన్నవించుకుంటే బాగుంటుందేమో!’ అని పరోక్షంగా అడిగారు. దానికి ఆ ముసలావిడ ‘ఆయన విశ్వాసులందరికీ నాయకుడు. రాజ్యంలో జరిగే ప్రతిసంఘటన పట్ల ఆయనకు అవగాహన ఉండాలి’ అని సూటిగా సమాధానమిచ్చింది. అది వినగానే ఆయన ‘నాకు’ హజ్రత్ ఉమర్ (రజి)పై జాలి కలుగుతుంది’ అని అన్నారు. ‘నీకు జరిగిన అన్యాయానికి, నీవెంత పరిహారం తీసుకుంటావు’? అని హజ్రత్ ఉమర్ (రజి) అడిగారు. అప్పుడు ఆమె ‘నాతో పరిహాసమాడకండి’ అని అంది. ‘అప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) ‘నేను’ పరిహాసమాడట్లేదు’ అని అన్నారు. అంతలోనే హజ్రత్ అలీ (రజి), హజ్రత్ ఇబ్నె మసూద్ (రజి)లు అక్కడికి ఏతెంచి, ‘అస్సలాము అలైకుమ్ అమీరుల్ మోమినీన్’ అని పలికారు. అది విన్న వృద్ధురాలు ఒకేసారి ఆశ్చర్యచకితురాలైంది, మనసుపై పిడుగు పడినట్లయింది. సాక్షాత్తు అమీరుల్ మోమినీన్నే నిందించానన్న ఆవేదన ఆమెను తొలచి వేయసాగింది. హజ్రత్ ఉమర్ (రజి) ఆమె పట్ల జరిగిన అన్యాయానికి ప్రతిగా ఇరవై ఐదు బంగారు నాణెములు చెల్లిస్తున్నానని ఒక చర్మపు ముక్కపై వ్రాయించుకున్నారు. ఈ విషయంలో హజ్రత్ అలీ (రజి), హజ్రతి ఇబ్నె మసీద్ (రజ)లు సాక్షులుగా ఉన్నారు.
4) ఒకరోజు రాత్రి హజ్రత్ ఉమర్ (రజి) గస్తీ చేస్తూ ఒక ఇంటి వద్దకు చేరారు. ఆ ఇంట్లోనుంచి పాటలు వినవస్తున్నాయి. హజ్రత్ ఉమర్ (రజి) వెనకగోడ నుండి దూరి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి తోడుగా మందు ఉంది, మగువ కూడా ఉంది. అది చూచి ఆగ్రహోదగ్రులైన హజ్రత ఉమర్ (రజి), ‘ఓ ధర్మద్రోహి ! నీవు చేసే ఈ దుష్కార్యాన్ని అల్లాహ్ మరుగుపరుస్తాడను కుంటున్నావా?’ అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి హజ్రత్ ఉమర్ (రజి) తో, “ఓ ఖలీఫా! ఆవేశపడకండి. నేను కేవలం ఒక్క నేరాన్ని చేశాను. కాని మీరు మూడు నేరాలు చేశారు. ‘ఒకరి లోపాలను ఎంచకండి’ అని అల్లాహ్ అన్నాడు. కాని మీరు ఈ నియమాన్ని ఉల్లంఘించారు. ఇది మీ మొదటి నేరం. ‘ఇతరుల ఇంట్లో తలుపు ద్వారా లోనికి ప్రవేశించండి అని అల్లాహ్ చెప్పగా మీరు వెనకగోడ నుండి ఇంట్లోకి వచ్చారు. ఇది మీ రెండవ నేరం. ‘అనుమతి లేనిది ఎవరింట్లోనూ ప్రవేశించకండి’ అని అల్లాహుతాలా స్పష్టపరచగా మీరు నా అనుమతి లేనిదే ఇంట్లో ప్రవేశించారు. ఇది మీరు చేసిన మూడో నేరం”. ఇది విన్న హజ్రత్ ఉమర్ (రజి) నేను నిన్ను క్షమిస్తాను. దానికి ప్రతిఫలంగా నీవేమి ఇస్తావు?’ అని అడుగగా అతడు ‘ఇక ముందు ఇలాంటి చెడు పసుల జోలికిపోను’ అని హామీ ఇచ్చాడు.
5) అది రాత్రి సమయం.. ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు హజ్రత్ ఉమర్ (రజి) ఒక ఇంటి వద్దకు చేరారు. ఆ ఇంట్లో ఎవరో సంభాషించుకుంటున్న వైనం ఆయన చెవిన పడింది. ఒక వృద్ద వయస్కురాలైన తల్లి, తన కూతురితో పాలలో నీళ్ళుకలపనుని పట్టుబట్టటం, పాలలో నీళ్ళు కలిపి అమ్మవద్దని ఖలీఫా ప్రకటించారు కదా! అని కూతురు సూటిగా బదులు పలకటం హజ్రత్ ఉమర్ (రజ) విన్నారు. ‘ఖలీఫా మనల్ని చూడవచ్చాడా ఏమిటి?’ త్వరగా నీళ్ళు కలుపు అని తల్లి పురమాయించింది. ‘పైకి విధేయత కనబరుస్తూ.., అంతరంగంలో అవిధేయతా భావంతో మెలగడం ఎంత మాత్రం సమంజసం కాదని కూతురు అంటోంది. ఆ బాలిక నిజాయితీని ఎంతగానో మెచ్చుకున్నారు హజ్రత్ ఉమర్ (రజి). ఆ ఇంటిని సులభంగా తెలుసుకునేందుకు ఆ ఇంటిపై గుర్తువేయమని తనతో ఉన్న సేవకునికి చెప్పారు. మరునాడు హజ్రత్ ఉమర్ (రజి) ఒక వ్యక్తిద్వారా ఆ అమ్మాయిని తన కుమారుడు హజ్రత్ ఆసిమ్ (రజి) కిచ్చి వివాహం జరిపించవలసిందిగా ఆ ఇంటికి సందేశం పంపారు. ఆ విధంగా ఆ అమ్మాయిని తన కోడలుగా చేసుకున్నారు.
6) ఒకరాత్రి గస్తీ చేస్తూ హజ్రత్ ఉమర్ (రజి) ఒక ఇంటివద్దకు చేరారు. అచట ఒక స్త్రీ, ఆమె చుట్టూ కొందరు పిల్లలు కూర్చొని ఏడవటాన్ని ఆయన చూశారు. పొయ్యిపై ఉన్న ఒక పాత్రను కూడా ఆయన గమనించారు. పిల్లల రోదనకు గల కారణాలను హజ్రత్ ఉమర్ (రజి) దర్యాప్తు చేయగా, ‘ఆకలి బాధకు తాళలేక ఏడుస్తున్నారని’ తల్లి సమాధానం చెప్పింది. ‘పాత్రలో ఏముంది?’ అని హజ్రత్ ఉమర్ (రజి) అడుగగా కేవలం నీళ్ళుమాత్రమే ఉన్నాయి. వారిని బుజ్జగించేందుకు ఇలా చేసాను. ఏడుస్తూ… ఏడుస్తూ వారే పడుకుంటారు’ అని తల్లి సమాధానమిచ్చింది. తల్లి నిస్సహాయస్థితిని చూసిన హజ్రత్ ఉమర్(రజి) నయనాలు కన్నీరు మున్నీరై ప్రవహించసాగాయి. ఆయన వెంటనే ప్రజాధనాగారానికి వెళ్ళి పిండి, నెయ్యి, మాంసం, ఖర్జూరపు పండ్లు మరియు దుస్తులను కొన్నింటిని మూటకట్టి తన వీపుపై స్వయంగా మోసుకునివచ్చారు. తాను తెస్తానని ఒక బానిస అద్దుపడగా ‘వద్దూ… వారి గురించి నన్నే అడగటం జరుగుతుంది. నేనే జవాబు దారుణ్ణి’ అని చెప్పారు. ఆ మూటను ఇంటివద్ద చేర్చి, పాత్రల్లో పిండి మాంసం, ఖర్జూరపు పండ్లు మిళితంచేసి పొయ్యిపై పెట్టి, తానే స్వయంగా పొయ్యి రాజేశారు. మంటవల్ల ఏర్పడిన దట్టమైన పొగలు ఆయన గడ్డం నిండా వ్యాపించాయి. వంట అయ్యాక పిల్లలందరికీ తినిపించి అక్కడి నుండి వెళ్ళిపోయారు హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు.
7). ఒకసారి హజ్రత్ ఉమర్ (ర), హజ్రత్ జారూర్ (రజి) మస్జిద్ నుండి బయటకు వచ్చారు. వారికి దారిలో ఒక స్త్రీ తారసపడింది. హజ్రత్ ఉమర్ (రజి) వారికి సలాం చేశారు. ఆమె జవాబిచ్చింది. మరియు ఇలా అంది. “ఓ ఉమర్! ‘ఉక్కాజ్’ బజారులో ప్రజలు నిన్ను ‘ఉమైర్’ అని పిలవడం నాకు గుర్తుంది. తరువాత వారు నిన్ను ‘ఉమర్ ‘గా పిలుస్తున్నారు. ఇప్పుడు నీవు ‘అమీరుల్ మోమినీన్’ (విశ్వాసం నాయకుడు) అయ్యావు. అల్లాహ్ కు భయపడుతూ మెలగు”. ఆ మాటలు వినగానే తాను ఆమెపై మండిపడ్డానని హజ్రత్ జారూర్(రజి) అన్నారు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) నాతో “ఈమెను గుర్తు పట్టావా ‘ఈమె సాధారణ స్త్రీ కాదు. ఈమె విన్నపం సప్తాకాశాలపై ఆమోదించబడింది. ఈమెయే హజ్రత్ ఖౌలా బిన్తె హకీమ్’ కనుక ఆమె హితబోధను నేను వినకతప్పదు” అని అన్నారు.
-సమాప్తం-
హజ్రత్ ఉమర్ (రజి అల్లాహు అన్హ హు) ఎత్తైన మనిషి. పెద్ద జనసమూహంలో ఎక్కడ నిలబడినా తొందరగా కనిపించే వారు. గోధుమ వర్ణంగల శరీరఛాయ, గుబురు మీసాలతో గాంభీర్యం ఉట్టిపడేలా ఉండేవారు. తల వెంట్రుకలు ముందు నుంచి లేచి ఉండేవి. ఆయన ఎదుట నిలబడటానికి అందరూ భయపడేవారు. అయినప్పటికీ ఆయన వినమ్రత, అణకువ గల సత్పురుషులు. నిరాడంబర జీవి, మితంగా భుజించేవారు. జల్లెడవేయని గోధుమ పిండితో చేయబడిన రొట్టెలను తినేవారు. ఒకప్పుడు అరబ్బు దేశంలో కరువు ఏర్పడినప్పుడు గోధుమపిండి లభించకపోవడంతో జొన్నరొట్టెలు తిన్నారు. ముతక దుస్తులు ధరించేవారు. ధరించిన దుస్తులలో అక్కడక్కడా అతుకులు కూడా ఉండేవి. తన పనులు స్వయంగా తానే చేసుకునేవారు. ఆయన ధర్మనిష్ఠతో, ధర్మపరాయణతతో జీవితం గడిపే మహాత్ములు. అయినప్పటికీ పరలోక ధ్యానంలో నిమగ్నులై ఉండేవారు. నమాజ్ చేసేటప్పుడు దైవభీతివలన మనస్సు కరిగి కన్నీరై ప్రవహించేది. అప్పుడప్పుడు ఆయన నమాజ్ భోరున ఏడ్చేవారు. ఆయన పైకి నిర్భయునిగా కనిపించినా, ఆయన రవ్వంత గర్వం కూడా లేని దయామూర్తి. (రజి అల్లాహు అన్హ హు)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రాణస్నేహితులు. ఇస్లాం స్వీకరించక పూర్వం ఆయన పేరు అబ్దుల్ కాబ్. ఇస్లాం స్వీకరించాక మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయనకు అబ్దుల్లాహ్ అని నామకరణం చేశారు. అబూ బకర్ అనేది ఆయన పేరు కాదు. అది ఆయన మారు పేరు. కాని ఆయన తన మారు పేరుతోనే ప్రసిద్ధిగాంచారు.
ఖురైష్ ఓ పెద్ద తెగ. అది మక్కా మరియు దాని చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో శాఖోపశాఖలుగా వ్యాపించి ఉండేది. అందులోని ఓ శాఖ బనీ తమీమ్, హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) బనీ తమీమ్ కు చెందినవారు. ఆయన తండ్రిపేరు ఉస్మాన్, మారు పేరు అబూ ఖహాఫా.
ఆ రోజుల్లో తేదీలను నిర్ధారించే పద్ధతి ఏదీ ఉండేది కాదు. ఖురైషులు ఏదైనా విశిష్టమైన సంఘటన ద్వారా పుట్టిన మరియు మరణించిన తేదీలను లెక్కకట్టేవారు. సంవత్సరాలు కూడా ఇలాగే నిర్ధారించబడేవి. ప్రజలు ప్రముఖమైన సంఘటనల ద్వారా తేదీలను లెక్కించేవారు. ఈ విధంగా సంవత్సరాలు నిర్ధారించబడేవి. ఆ రోజుల్లో ఖురైషులు ‘ఫీల్‘ సంఘటన ద్వారా తేదీలను నిర్ధారించేవారు. అరబీ భాషలో ‘ఫీల్’ అంటే ఏనుగు అని అర్థం. ఓ నీగ్రో రాజు (అబ్రహా) ఏనుగులను తీసుకొని అల్లాహ్ గృహమయిన కాబాను పడగొట్టడానికి మక్కా నగరంపైకి దండెత్తి వచ్చాడు. కాని మక్కా చేరుకోగానే అతని సైన్యం మరియు ఏనుగులపై అల్లాహ్ ఆగ్రహం విరుచుకుపడింది. వారందరూ నాశనమయ్యారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఈ సంఘటన జరిగిన రెండున్నర సంవత్సరాలకు జన్మించారు. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కన్నా వయస్సులో రెండు సంవత్సరాలు చిన్నవారు.
ఇస్లాం స్వీకరించక పూర్వం కూడా హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఓ గౌరవనీయులైన వ్యక్తిగా పరిగణింపబడేవారు. ఖురైష్ మరియు ఇతర అరబ్ తెగలు స్వతంత్రంగా ఉండేవి. వారిని ఎవరూ శాసించే వారు కాదు. కాని వారు తమ ప్రాంతపు అవసరాలకనుగుణంగా వివిధ పనులను వివిధ తెగలకు అప్పగించారు. ఖురైషీయులలో పది పెద్ద పెద్ద శాఖలుండేవి. ప్రతి శాఖకు ఓ పని అప్పగించబడేది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వీరందరూ పరస్పరం సంప్రదించుకునేవారు. బనీ హాషిమ్ అంటే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వంశస్థులు. వారు హజ్ సమయంలో యాత్రీకులకు నీరు త్రాసేవారు. బనూ ఉమయ్యా వారి దగ్గర ఖురేషీ ధ్వజం ఉండేది. ఆ వంశపు నాయకుడు యుద్ధ సమయంలో ధ్వజం ఎత్తుకొని సైన్యానికి ముందుండేవాడు. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) వంశం న్యాయ శాఖను పర్యవేక్షించేది. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) వంశస్థులు సివిల్ మరియు క్రిమినల్ కేసులను విచారించి తీర్పిచ్చేవారు. ఏదైనా వ్యాజ్యంలో తీర్పివ్వడం కష్టమైతే ప్రజలను సమావేశపరచి సంప్రదించేవారు.
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి వృత్తి వ్యాపారం. ఆయన సిరియా మరియు యమన్ నుండి బట్టలుకొని తెచ్చి మక్కాలో అమ్మేవారు. వర్తకం నిమిత్తం మొదటిసారి ప్రయాణం చేసినప్పుడు ఆయన వయస్సు 18 సంవత్సరాలు. తరువాత వర్తకం నిమిత్తం ఆయన ఎన్నోసార్లు ప్రయాణం చేశారు. వర్తకం మూలంగా అరేబియాలోని పలు ప్రాంతాల ప్రజలు ఆయన్ని గుర్తించేవారు. మంచితనం, నిజాయితీ మూలంగా ఆయన్ని ప్రజలు గౌరవించేవారు.
ఆనాడు అరబ్బుల్లో అనేక దుర్గుణాలు ఉండేవి. పబ్లిక్ గా తాగి తందనాలాడేవారు. జూదం, మట్కా వారి హాబీలు. కొన్ని అరబ్బు తెగలైతే దారిన పోయేవారిని దోచుకున్నది గాక తమ ఈ చెడు చేష్టపై గర్వ పడేవి. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) మొదట్నుంచీ ధర్మ పరాయణులు, దైవభీతి గలవారు. ఆయన కష్టపడి, చెమటోడ్చి తన జీవన భృతిని సంపాదించేవారు. బీదవారికి, అగత్యపరులకు సహాయపడేవారు. ఇస్లాం స్వీకరించక పూర్వం కూడా ఆయన ఎన్నడూ మద్యం సేవించలేదు. ఇస్లాం స్వీకరించాక ఆయన జీవితమే పూర్తిగా మారిపోయింది. పూర్వం ఆయన కవితలు చెప్పేవారు. ఆయన్ని మంచి కవుల్లో ఒకరిగా లెక్కించేవారు. ఇస్లాం స్వీకరించాక కవితలు చెప్పడం కూడా మానేశారు.
ఇస్లాం స్వీకరించాక
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు 40 సంవత్సరాల వయస్సులో దైవ దౌత్యం లభించింది. ఆ సమయంలో హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) వయసు 38 సంవత్సరాలు. అప్పట్లో ఆయన వ్యాపారం బావుంది. వ్యాపార నిమిత్తం తరచూ ఆయన సిరియా, యమన్ దేశాలకు వెళ్ళేవారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారితో ఆయనకు చాలా కాలంగా పరిచయమైతే ఉంది గాని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవక్తగా నియుక్తులవడానికి ఒక సంవత్సరం మునుపు నుండి వారిరువురి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు రావడం మొదలెట్టారు. ఓసారి అబూబకర్ (రదియల్లాహు అన్హు) సిరియా నుండి తిరిగి రాగానే అబూతాలిబ్ గారి అనాథ భాతృజుడు తనను ప్రవక్తగా ప్రకటించుకున్నాడని ప్రజలన్నారు.
వెంటనే హజ్రత్ అబూబకర్(రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమక్షంలో హాజరయ్యారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ని ఇస్లాం స్వీకరించమని కోరిన వెంటనే ఆయన ఇస్లాం స్వీకరించారు.
అలా ఇస్లాం స్వీకరించిన పురుషులలో హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) ప్రథములు. స్త్రీలలో ఇస్లాం స్వీకరించిన మొదటి మహిళ హజ్రత్ ఖదీజా (రదియల్లాహు అన్హ), పురుషుల్లో హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు), పిల్లల్లో హజ్రత్ అలీ(రదియల్లాహు అన్హు)మరియు బానిసల్లో హజ్రత్ జైద్ బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు). వీరు నలుగురూ ఒకే కాలంలో ఇస్లాం స్వీకరించారు. వీరిలో అందరికంటే ముందు హజ్రత్ ఖదీజా(రదియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకరించారు. మిగిలిన ముగ్గురిలో ఎవరు ముందు ఇస్లాం స్వీకరించారో ఖచ్చితంగా చెప్పడం కష్టమే. చాలా కాలం వరకు హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) తల్లిదండ్రులు ఇస్లాం స్వీకరించలేదు. ఆయన తండ్రి అబూఖహాఫ కొడుకు ఇస్లాం స్వీకరించిన 21 సంవత్సరాలకు అంటే మక్కా విజయ సందర్భంలో, 90 ఏళ్ళ వయస్సులో ఇస్లాం స్వీకరించారు.
అనేక మంది మక్కా వాసులు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి వెంటవచ్చి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమక్షంలో ఇస్లాం స్వీకరించారు. వారిలో హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ జుబైర్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ తల్హా(రదియల్లాహు అన్హు), హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ సాద్ బిన్ అబీ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) లాంటి వారున్నారు. వీరంతా సత్య ధర్మం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొని, కఠిన పరీక్షల్లో నెగ్గుకువచ్చారు.
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకరించే నాటికి ఆయన వద్ద నలభై వేల దిర్హములు ఉండేవి. అందులో నుంచి కేవలం ఐదు వేల దిర్హములు తన కోసం ఉంచుకుని మిగిలినదంతా ఇస్లాం (దైవధర్మం) కోసం అర్పించారాయన.
ఇస్లాం స్వీకరించిన వారిని అవిశ్వాసులు వేధించేవారు. స్వతంత్రులు మరియు పెద్ద కుటుంబాలకు చెందిన విశ్వాసులపై చెయ్యి చేసుకునే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. కాని విశ్వాస భాగ్యాన్ని పొందిన బానిసలపై కష్టాల కొండలు విరుచుకుపడేవి. అలాంటి బాధితులలో ఓ నీగ్రో బానిస కూడా ఉన్నారు. ఆయన పేరు హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు). ఆయన హృదయాన్ని ఇస్లాం జ్యోతిర్మయం చేసింది. ఆయన యజమాని ఆయన్ని కొడుతూ కొడుతూ అలసిపోతే, మిట్టమధ్యాహ్నం కాలుచున్న ఇసుకపై ఆయన్ని నగ్నంగా పడుకోబెట్టి గుండెపై బండపెట్టేవాడు. కాని ఆయన ఈ పరిస్థితిలో కూడా ‘అహద్ అహద్’ (అల్లాహ్ ఒక్కడే, అల్లాహ్ ఒక్కడే) అని అనేవారు. దీనిపై ఆయన యజమాని ఆగ్రహంతో ఊగిపోతూ ఆయన్ని తుంటరి బాలురకు అప్పగించేవాడు. వారు ఆయన మెడలో త్రాడు వేసి లాక్కెళ్ళేవారు. అప్పుడు మక్కా వీధులు, ‘అల్లాహ్ ఒక్కడే. అల్లాహ్ ఒక్కడే’ అన్న నినాదాలతో ప్రతిధ్వనించేవి. ఈ వేధింపులను చూడలేక హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఆయన్ని కొని స్వాతంత్ర్యం ప్రసాదించారు. ఈ విధంగా ఇస్లాం స్వీకరించిన ఏడుగురు బానిసలకు అబూబకర్ (రదియల్లాహు అన్హు) స్వాతంత్ర్యం ప్రసాదించారు. ఇది చూసి ఆయన తండ్రి అబూ ఖహాఫా “నీకు బానిసలు కొనాలనే అంత ఇదిగా ఉంటే మంచి దేహదారుఢ్యం గల వారిని కొనాల్సింది. వారు నీ అవసరానికి పని కొచ్చేవారు. రెండడుగులు కూడా సరిగా నడవలేని ఈ బలహీనులైన బానిసలను ఎందుకు కొన్నావు?” అని అన్నారు. “ఈ పని నేను ఎలాంటి లాభాన్ని ఆశించి చేయలేదు. ఇది నేను కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే చేశాను.” అని జవాబిచ్చారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు).
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) చేత విముక్తి పొందిన బానిస హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) ఎంత గొప్ప వారంటే హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు)ను ‘ఓ మా సర్దార్!’ అని అనేవారు: ఓ సారి హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) గారి ప్రస్తావన వస్తే హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు. “హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) మా నాయకులు. ఎందుకంటే ఆయన మా నాయకునికి (హజ్రత్ బిలాల్ రదియల్లాహు అన్హుకు) స్వాతంత్ర్యం ప్రసాదించారు.”
మొదటి మూడు సంవత్సరాలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ధర్మప్రచారం బహిరంగంగా చేయలేదు. ఇస్లాం నిశ్శబ్దంగానే విస్తరించ సాగింది. చాలా మంది ఇస్లాం స్వీకరించారు. నాలుగవ ఏట నుండి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ధర్మ ప్రచారం బహిరంగంగా చేయసాగారు. దీనిపై ప్రజలు ఆగ్రహం చెంది విశ్వాసులపై కఠినంగా వ్యవహరించసాగారు. ఆ కాలంలో ఓ రోజు ఖురైష్ పెద్దలందరూ కాబా గృహంలో సమావేశమై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి మాట్లాడసాగారు. అదే సమయంలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అక్కడికి చేరుకున్నారు. ఒకతను లేచి ” మా దేవుళ్లను కించపరచేది నీవేనా?” అని అడిగారు. “నిస్సందేహంగా నేనే” అని జవాబిచ్చారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). ఇది విని అవిశ్వాసులు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) పై విరుచుకుపడ్డారు. అంతలో ఎవరో వచ్చి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారితో మీ స్నేహితుడిని కాపాడండి అని అన్నారు. ఇది విని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) పరుగెత్తుకుంటూ అక్కడికి చేరుకున్నారు. అవిశ్వాసులను తోసుకుంటూ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి చేరుకుని “కడు శోచనీయం! మీరు ఈయన్ని ‘తన ప్రభువు అల్లాహ్’ అని అన్నంత మాత్రానికే కొడుతున్నారా.” అని ఆవేశంతో ప్రశ్నించారు.
ఈ విషయంలో ఆయన జోక్యం చేసుకోవడం అవిశ్వాసులకు నచ్చలేదు. అందరూ ఆయనపై విరుచుకుపడి తల పగిలేలా కొట్టారు. అవిశ్వాసుల అత్యాచారాలు నానాటికీ పెరిగి పోయి ఈ విధంగా బ్రతుకు గగనమై పోగా చాలా మంది విశ్వాసులు అబీసీనియాకు వలస వెళ్ళారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని విడిచి వెళ్లడానికి హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) గారి మనసొప్పలేదు. కాని విధిలేక ఆయన కూడా యమన్ దారిన అబిసీనియాకు వలస వెళ్లారు. దారిలో ఐదు చోట్ల ఇబ్నుల్ రగ్నా అనే వ్యక్తిని కలిశారు. ఎక్కడికి వెళుతున్నారు? అని అతను అడిగాడు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) జవాబిస్తూ “నా దేశస్థులు నన్ను తరిమేశారు. అందువలన నేను వేరే దేశానికెళ్ళి అల్లాహ్ ఆరాధన చేయాలనుకుంటున్నాను” అని అన్నారు.
“మీ లాంటి అతిధి మర్యాద చేసేవారిని, బీదలు – అగత్యపరులను ఆదుకునే వారిని మక్కా నుండి ఎలా తీసివేస్తారు. మీ బాధ్యత తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పదండి, మక్కా వెళదాం. అక్కడే అల్లాహ్ ఆరాధన చేయండి” అని అన్నాడు ఇబ్నుల్ రగ్న. అతను హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)ను తీసుకొని వచ్చి ఖురైష్ నాయకులతో మాట్లాడాడు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) అల్లాహ్ ఆరాధన చేయదలిస్తే ఇంట్లోనే చేసుకోవాలి అనే షరతుపై వారు ఇబ్నుల్ రగ్న మాటను ఒప్పుకున్నారు.
ఇబ్నుల్ రగ్నా హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)తో “వారు ఈ విషయాన్ని ఒప్పుకున్నారు” అని అన్నాడు. కొన్ని రోజుల వరకూ ఆయన ఇంట్లోనే నమాజ్ చేయడం, ఖుర్ఆన్ చదవడం చేయసాగారు. ఆ తరువాత ఆయన తన ఇంటి సరిహద్దులోనే ఓ మస్జిద్ నిర్మించారు. అక్కడే నమాజ్ చేయడం, ఖుర్ఆన్ చదవడం మొదలెట్టారు. ఆయన మృదు స్వభావులు కావడం చేత ఖుర్ఆన్ పారాయణం చేసేటప్పుడు దాని ప్రభావం వల్ల ఏడ్వనారంభించే వారు. ఆయన ఏడుపు శబ్దం విని దారిన పోయే ప్రజలు ఆగి వినసాగారు. వారిలో స్త్రీలు, పిల్లలు కూడా ఉండేవారు. స్త్రీలు మరియు పిల్లలు ఎక్కడ విశ్వాసులయిపోతారో అని ఖురైషులు భయపడసాగారు. ఇబుల్ రగ్నాకు ఫిర్యాదు కూడా చేశారు. అతను హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దగ్గర కొచ్చి జరిగినదంతా వివరించాడు. అప్పుడు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) “ఇక నీవు నా బాధ్యత తీసుకోకు. నన్ను నా అల్లాహ్ పై వదిలిపెట్టు” అని అన్నారు..
హిజ్రత్ (వలస)
మక్కా నుండి 200 మైళ్ళ దూరంలో మదీనా అనే పురము ఉంది. ఆ రోజుల్లో దాన్ని ‘యస్రిబ్‘ అనేవారు. అక్కడి వారు కొందరు మక్కా వచ్చారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను కలిశారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) నోట దివ్య ఖుర్ఆన్ వచనాలు విన్నారు. మదీనా వెళ్ళి ఇతరులతో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి ప్రస్తావించారు. ఇలా మొదటి సంవత్సరం ఆరుగురు, రెండో సంవత్సరం పన్నెండు మంది, మూడో సంవత్సరం డెబ్భై రెండు మంది మదీనా నుండి మక్కాకు వచ్చి ముస్లిములయ్యారు. వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను మదీనాకు రమ్మని ఆహ్వానించసాగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా వెళ్ళలేదు గాని సహచరులు (సహాబా)కు అనుమతినిచ్చారు. వారు (సహాబా) ఒక్కొక్కరూ మదీనా వెళ్ళసాగారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) కూడా మదీనా వెళ్ళడానికి అనుమతి అడిగారు. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)ను ఆపుతూ ఇలా అన్నారు-“నీవు కాస్త ఆగు. బహుశా అల్లాహ్ ఆదేశం ప్రకారం నేను కూడా మదీనా వెళ్ళవచ్చు”. అప్పటి నుండే హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) మదీనా వెళ్ళడానికి సన్నాహాలు చేయసాగారు. తన ఒంటెలకు తుమ్మ ఆకులు తినిపించసాగారు.
ఓ రోజు మధ్యాహ్నం అబూ బకర్ (రదియల్లాహు అన్హు) తమ ఇంట్లో కూర్చుని ఉండగా ఒకతను వచ్చి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వస్తున్నారని తెలియజేశాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ సమయంలో అంతకు ముందెన్నడూ హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఇంటికి రాలేదు. ఏదో అత్యవసర పనిమీదే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ సమయంలో ఇక్కడకు వస్తున్నారని ఊహించారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). అంతలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అక్కడికి చేరుకున్నారు. ఇంట్లో ప్రవేశించగానే “ఇక్కడున్న ఇతరులను బయటకు పంపండి” అని అన్నారు. “ఇక్కడ పరాయి వారెవరూ లేరు. నా ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారు” అని అన్నారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). “నాకు హిజ్రత్ చేసే (వలసవెళ్ళే) అనుమతి లభించింది” అని సెలవిచ్చారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). “నాకు కూడా మీతో పాటు వలస వెళ్ళే అనుమతి ఉందా?” అని ప్రశ్నించారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). “ఔను” అని జవాబిచ్చారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి కుమార్తె అస్మా (రదియల్లాహు అన్హ) ప్రయాణ ఏర్పాట్లు చేశారు. భోజనం కట్టారు, తోలుసంచిలో నీళ్ళు నింపారు. చీకటి పడగానే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)ను వెంట బెట్టుకొని ఎవరికీ తెలీకుండా ఒంటెలపై బయలుదేరి నూర్ గుహ వద్దకు చేరుకున్నారు. వారిద్దరూ మూడు రోజులు ఆ కొండ గుహలోనే గడిపారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎక్కడున్నారో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఇంటి వారికి తప్ప మరెవరికీ తెలియదు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి కుమారులు అబ్దుల్లాహ్ సాయంత్రం కొండ గుహకు చేరుకొని రాత్రి అక్కడే గడిపేవారు. ఉదయం పూట మక్కా చేరుకొని ఖురైషులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి ఏమంటున్నారో వినేవారు. ఈ రహస్యం ఎరిగిన ఇంకో వ్యక్తి పూర్వం ఓ బానిస. అతని పేరు ఆమిర్ బిన్ ఫహీరహ్. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఆయన్ని కొని విముక్తి కలిగించారు. పగలంతా ఆయన హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఒంటెను మేపేవారు. రాత్రి పూట ఎవరికీ కనబడకుండా దాన్ని గుహ ద్వారం వద్ద తీసుకొచ్చి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు)కు దాని పాలు త్రాగించేవారు. తెల్లవారక ముందే దాన్ని బహు దూరంగా తోలుకెళ్ళేవారు.
ఖురైషులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు బద్ద విరోధులైపోయారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మక్కా నుండి సురక్షితంగా బయటపడటం వారు సహించలేకపోయారు. అందువల్ల వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను వెదకడానికి తమ మనుషుల్ని హుటాహుటిన నలువైపులా పంపారు. స్వయంగా అబూ జహల్ మరియు ఇతర ఖురైషీ నాయకులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను వెదుకుతూ అటూ ఇటూ తిరిగారు. ఓ సారి అయితే వీరు నూర్ గుహ వద్దకు రానే వచ్చారు. కాని వారు ఎలాంటి ఏమరుపాటుకు గురయ్యారంటే బయటినుండే వెళ్ళిపోయారు. వారి అడుగుల చప్పుడు విని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఎంతో కలవరం చెందారు. కానీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ధైర్యంతో ఇలా అన్నారు: “భయపడకండి. అల్లాహ్ మనతో ఉన్నాడు.”
నాలుగో రోజు గుహనుండి బయటకు వచ్చి ఒంటెలపై ప్రయాణం సాగించారు. ఇలా మధ్యాహ్నం వరకు ప్రయాణించారు. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నెత్తి మీదికొచ్చాక విశ్రాంతి కొరకు ఆగారు. ఆ ఎడారిలో చెట్టు ఎక్కడుంటుంది? ఓ రాతి కనుమ అంచున నీడ కనిపించింది. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) నీడ ఉన్న చోటును శుభ్రపరిచారు. అక్కడ తోలు దుప్పటి పరచి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో “ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. నేను కాపలా కాస్తాను” అని అభ్యర్థించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిద్రపోయారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) నేలను శుభ్రపరచసాగారు. కాని శత్రుభయం ఆయన్ని వెంటాడసాగింది. ఖురైషులు ఎక్కడ వెంటాడుతున్నారో అని నలువైపులా చూడసాగారు. ఇంతలో ఓ గొర్రెల కాపరి గొర్రెలను తోలుకు వస్తూ కనిపించాడు. అతను దగ్గరి కొచ్చాక పాలున్నాయా అని అడిగారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). అతను ఔనన్నాడు. మేక పొదుగు శుభ్రపరచి ఓ గిన్నెలో పాలు పితికాడు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) తోలు సంచిలోని నీళ్ళు అందులో కాస్త కలిపారు. అంతలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మేల్కొన్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) పాలు త్రాగి ‘ఇక వెళదామా!’ అని అడిగారు, ‘కాస్సేపట్లో బయలుదేరదాం’ అని అన్నారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). సూర్య తాపం తగ్గాక వారిద్దరూ తమ ప్రయాణం కొనసాగించారు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను పట్టిచ్చిన వారికి ఖురైషులు బహుమతి ప్రకటించారు. గుర్రాలపై, ఒంటెలపై వెళ్ళి చాలా మంది దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను వెదక సాగారు. తమ తెగలో అత్యంత పరాక్రమశాలిగా పేరు పొందిన సురఖా అనే వ్యక్తి కొందరు వ్యక్తులు తీరంవెంబడి వెళ్ళడం గమనించాడు. వారే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయన మిత్రులు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)లు అయి ఉంటారని భావించాడు. వెంటనే సాయుధుడై గుర్రంపై స్వారీ అయ్యాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి చేరుకోగానే గుర్రం కాళ్లు రెండూ నేలలోకి దిగబడిపోయాయి. సురాఖా క్రింద పడిపోయాడు. మళ్ళీ గుర్రంపై ఎక్కి ఈటెను గురిపెట్టి వారిని వెంబడించసాగాడు. కాని గుర్రం కాళ్ళు మళ్లీ భూమిలో కూరుకుపోయాయి. ఇలాంటి పుణ్యాత్ములను బంధించే ప్రయత్నం చేస్తున్నందుకే తనకీ శాస్త్రి జరుగుతోందని తలిచాడు. వెంటనే దీనంగా క్షమాపణ వేడుకొని వెనుతిరిగాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని వెదుకుతూ వస్తున్న కొందరు దారిలో అతన్ని కలిస్తే వారితో “మీరు ఇటువైపు ఎందుకు వెళుతున్నారు? నేను ఇప్పటి దాకా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)ను వెదికాను. బహుశా వారు మరో వైపు వెళ్ళి ఉంటారు. మదీనా వైపు మాత్రం పోలేదు” అని అన్నాడు.
ఇటు మదీనాలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వస్తున్నారని అందరికీ తెలిసిపోయింది. పెందలాడే ప్రజలు పట్టణం బయటికొచ్చి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) కోసం ఎదురుచూసి, ఎండ తీవ్రయమ్యాక వెనుతిరిగేవారు. ఓ రోజు ఇలాగే చాలా సేపు ఎదురు చూసి వెనుతిరుగుతున్న సమయంలో ఒకతను దూరం నుంచే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను చూసి “ఎవరికోసం మీరు నిరీక్షిస్తున్నారో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వస్తున్నారు” అని అరిచాడు. ఇది విని అందరూ ఆగిపోయారు. క్షణాల్లో ఈ విషయం అందరికీ తెలిసి పోయింది. తహతహ లాడుతూ ప్రజలందరూ తమ ఇండ్ల నుండి బయటికొచ్చారు.
అప్పటికి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) వయస్సు 49 సంవత్సరాల 6 నెలలు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వయస్సులో ఆయన కన్నా రెండున్నర సంవత్సరాలు పెద్దవారు, అంటే అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వయస్సు 52 సంవత్సరాలు. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి గడ్డం, తలవెంట్రుకలు నల్లగా ఉండేవి. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి గడ్డం, తల వెంట్రుకలు అప్పటికే చాలా వరకు నెరసిపోయాయి. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) వ్యాపార నిమిత్తం మదీనా వస్తూ పోతూ ఉండటం వల్ల ప్రజలు ఆయన్ని సునాయాసంగా గుర్తుపట్టారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటి బయటకు చాలా తక్కువగా వెళ్ళేవారు, అందువల్ల ప్రజలు ఆయన్ని గుర్తు పట్టలేక పోయారు. కాని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారితో రావడం చూసి అందరు ఆయనే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అయి ఉంటారని ఊహించారు. మరికొందరు సందిగ్ధంలో పడిపోయారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముఖారవిందంపై పడుతున్న ఎండకు హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) నీడ పట్టడానికి ప్రయత్నించినప్పుడు అందరి అనుమానాలు దూరమైపోయాయి.
మదీనా నుండి మూడు మైళ్ళ దూరంలో ఖుబా అనే ప్రాంతం ‘ఉంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అక్కడే పధ్నాలుగు రోజులు ఆగారు. అక్కడ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ మస్జిదుకు పునాది వేసి పదిహేనో రోజు అక్కడి నుండి బయలుదేరి మదీనా చేరుకున్నారు. తమ ఇల్లూ వాకిలి వదిలి మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళిన వారిని ‘ముహాజిరీన్‘ అని అంటారు. అలాగే మదీనాలో వారిని ఆదుకొన్న వారిని ‘అన్సార్లు‘ గా వ్యవహరిస్తారు. అన్సార్లు అంటే సహాయపడిన వారు అని అర్థం. ముహాజరుల వద్ద తలదాచుకునేందుకు చోటులేదు, కొందరికైతే అవిశ్వాసులు ఏమీ తెచ్చుకోనివ్వలేదు. మదీనా చేరాక దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముహాజిర్లను, అన్సార్లను సమావేశపరచి వారిలో ఇద్దరిని అనగా ఓ అన్సార్ ను, ఓ ముహాజిర్ ను పిలిచి “ఈ రోజు నుండి మీరిద్దరూ సోదరులు” అని అనసాగారు. అన్సారులు ప్రదర్శించిన సోదర భావాన్ని అనుబంధాన్ని సొంత సోదరులు కూడా చూపలేరు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ ఖారిజా బిన్ జైద్ అన్సారి గారిని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారికి సోదరునిగా చేశారు. ఆయన మదీనాలోని సుఖ్ అనే పేటలో నివసించేవారు. మొదట హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) అక్కడే ఉండసాగారు. భార్యాపిల్లలను పిలుచుకున్నారు. వారు మదీనా వచ్చినప్పుడు వారి దగ్గర ఐదువేల దిర్హమ్ లు ఉండేవి. ఆ డబ్బుతో ఆయన మదీనాలో వ్యాపారం మొదలెట్టారు. అల్లాహ్ ఆయన వర్తకంలో సమృద్ధి నొసగాడు. ఆయన మరియు ఆయన వంశం వారు నిశ్చింతగా జీవితాన్ని గడపసాగారు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనాలో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఇంట్లో ఏడు నెలలు ఉన్నారు. ఆ ఇంటికి దగ్గరలోనే భూమి కొని మస్జిదు నిర్మించారు. వలసపోయి వచ్చిన అనుచరుల (సహాబాల) ఇండ్లు చాలావరకు ఆ మస్జిద్కు చుట్టు ప్రక్కల్లోనే నిర్మించబడ్డాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయాన మస్జిద్కు ఆనుకుని ఉన్న ఏడు కుటీరాలలో ఉండేవారు. పొరుగునే హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి ఇల్లుండేది. కాని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) సుఖ్ లోని నివాసంలోనే ఎక్కువగా ఉండేవారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణం తర్వాత పూర్తిగా ఈ నివాసానికి తరలి వచ్చేశారు.
మస్జిద్ మరియు దాని ఇరు ప్రక్కల గల ఇళ్ళు పచ్చి ఇటుకతో నిర్మితమైనవి. ఖర్జూరపు బొద్దులు, ఆకులతో నిర్మితమైన కప్పు. ఆ కప్పు ఎత్తు చాలా తక్కువ. నిలబడి చేయి చాపితే కప్పు తగిలేది.
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) తల్లిదండ్రులు అప్పటికి ముస్లిములు (విశ్వాసులు) కాలేదు. అందువల్ల వారు మక్కాలోనే ఉండిపోయారు. పెద్ద కుమారుడు అబ్దుర్రహ్మాన్ మరియు ఆయన తల్లి కూడా ఇస్లాం స్వీకరించకపోవడం వల్ల మక్కాలోనే ఉండిపోయారు. కాని రెండవ కుమారులైన అబ్దుల్లాహ్ మరియు ఇద్దరు పుత్రికలు హజ్రత్ అస్మా (రదియల్లాహు అన్హ). హజ్రత్ ఆయిషా(రదియల్లాహు అన్హ) ఇస్లాం స్వీకరించి మదీనా వచ్చేశారు.
వలస (హిజ్రత్) అనంతరం
మదీనాలో స్థిరపడుతుండగానే ఖురైషులతో యుద్ధాలు ప్రారంభమయ్యాయి. ముందు చిన్న చిన్న పోరాటాలు, ఆ తరువాత పెద్ద యుద్ధాలు అనేకం జరిగాయి. ఆ యుద్ధాలలో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) కూడా పాల్గొన్నారు. మొదటి యుద్ధం ఎలా జరిగిందంటే మక్కా సర్దారులలో ఒకడైన అబూ సుఫ్యాన్ సిరియా నుండి వర్తక సామగ్రి తీసుకొని వస్తున్నాడని విశ్వాసులకు సమాచారం అందింది. వారు అతణ్ణి ఆపడానికి ప్రయత్నించారు. సహాయం కోసం అబూ సుఫ్యాన్ తన దూతను మక్కాకు పంపాడు. సమాచారం అందగానే ఖురైషులు వెయ్యిమంది సైనికులను మదీనాపై దండయాత్రకై పంపారు. ఇటు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా మూడు వందల పదమూడు మంది యోధులను వెంటబెట్టుకొని మదీనా నుండి బయలుదేరారు. మదీనా నుండి కాస్త దూరంలో బద్ర్ అనే ఓ చిన్న పల్లెటూరు ఉంది. రెండు సేనలూ అక్కడ ముఖాముఖి అయ్యాయి.
మదీనా నుండి బయలుదేరే ముందు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరులందరినీ సమాలోచన కొరకు ఒకచోట సమావేశపరచారు. అందరి కంటే ముందు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఉద్వేగంతో ఉపన్యసించారు. దాని తరువాత అన్సారులలో నుండి సాద్ బిన్ ముఆజ్ లేచి “అల్లాహ్ సాక్షి! దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశిస్తే మేము సముద్రంలో దూకడానికయినా సిద్ధంగా ఉన్నాం” అని అన్నారు. ముస్లిములు (విశ్వాసులు) బద్ర్ వైపు బయలుదేరారు. పూర్తి సైన్యంలో రెండే రెండు గుర్రాలు. ఎవరి వద్దనూ సరైన ఆయుధాలు లేవు. తుప్పుపట్టిన ఖడ్గాలు, పాతబడిన ఒరలు. ప్రవక్త ప్రియసహచరులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూర్చోడానికి రణభూమిలోని ఓ మూలన పందిరి వేశారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఖడ్గం చేతబూని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు కాపలా కాయసాగారు. యుద్ధం ప్రారంభమయింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా యుద్ధంలో పాల్గొన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు కుడివైపు ఉన్న సైనికుల అధికారిగా హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఉండగా, ఎడమవైపు సైనికులకు హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) అజమాయిషీ చేశారు.
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) కుమారులు అబ్దుర్రహ్మాన్ అప్పటికి ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. దైవ తిరస్కారుల సైన్యంతో పాటు యుద్ధానికి వచ్చారు. అబ్దుర్రహ్మాన్ చాలా కాలం తరువాత ఇస్లాం స్వీకరించారు. వారు ఓ రోజు తమ తండ్రిగారితో “బద్ర్ యుద్ధంలో మీరు ఓ సారి నా ఖడ్గం క్రిందికి వచ్చారు, కాని నేను మీపై ఖడ్గం ఝుళిపించలేదు” అని అన్నారు. దానికి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) – “కాని నీవే గనక నా ఖడ్గం క్రిందికి వచ్చి ఉంటే మటుకు నేను నిన్ను విడిచి పెట్టేవాడ్ని కాను” అని అన్నారు. వాస్తవానికి బద్ర్ యుద్ధం ధర్మానికి- అధర్మానికీ మధ్య జరిగిన కీలకమయిన పోరు. కొడుకు తండ్రి ముందు ఖడ్గం తీసుకొని నిలబడ్డాడు, సోదరులు ఒకరికి విరుద్ధంగా మరొకరు పోరాడసాగారు. అల్లాహ్ కృప వల్ల విశ్వాసులకు విజయం లభించింది. ఇస్లాంకు బద్ద విరోధి అయిన అబూ జహల్ తో సహా అవిశ్వాసుల అనేక మంది నాయకులు ఈ యుద్ధంలో మరణించారు.
బద్ర్ యుద్ధానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఖురైషులు మరుసటి సంవత్సరమే మూడు వేల మంది సైనికులను వెంట బెట్టుకొని మదీనా పై దండెత్తి వచ్చారు. మదీనా దగ్గర ఉహద్ అనే ఓ పర్వతం ఉంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏడు వందల మంది ముస్లిం యోధులను వెంటబెట్టుకొని అవిశ్వాసులను ఆ పర్వతం వద్దనే ప్రతిఘటించారు. ఉహద్ పర్వతం ముస్లిం సైనిక దళానికి వెనుక ఉంది. అవిశ్వాసులు వెనుక నుండి దాడి చేయకుండా ఉండేందుకు యాభై మంది విలుకాండ్రులను పర్వతపు కనుమపై నియమించటం జరిగింది. ఈ యుద్ధం ఆ పర్వతం పేరుతోనే ‘ఉహద్ యుద్ధం’ గా ప్రసిద్ధి చెందింది.
మొదట్లో ఉహద్ యుద్ధంలో కూడా విశ్వాసులదే పై చేయి అయింది. అవిశ్వాసులు పరాజయం పాలవసాగారు. కాని పర్వతపు లోయ వద్ద మొహరించబడిన విలకాండ్రు పెద్ద పొరపాటు చేశారు. ఖురైషులను వెంబడించడానికి వారు తమ స్థానాల్ని వదిలారు. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న శత్రుసైనికుల జట్టు అటు వైపు నుంచి మెరుపు దాడి చేసింది. పరాక్రమశాలి అయిన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి చిన్నాన హజ్రత్ హమ్జా (రదియల్లాహు అన్హు) ఈ పోరాటంలో అబిసీనియా బానిస చేతిలో అమరగతి నొందారు. స్వయంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా గాయపడ్డారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మధ్య కనిపించకపోవడం వల్ల విశ్వాసుల నమ్మకం సడలింది. ఇలాంటి సమయంలో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) అందరికన్నా ముందు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమక్షంలో హాజరయ్యారు. ఆ తరువాత ఇతర అనుచరులు కూడా హాజరయ్యారు. విశ్వాసులు పంక్తులు సరిచేసుకొని యుద్ధానికి మళ్ళీ తయారవసాగారు. కాని అవిశ్వాసులకు మరోసారి విశ్వాసుల్ని ఎదిరించే ధైర్యం లేకపోయింది. వారు ఆ కాస్త విజయానికే తృప్తి చెంది వెనుదిరిగారు.
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) పెద్దకుమారులైన అబ్దుర్రహ్మాన్ విశ్వాసులకు వ్యతిరేకంగా ఈ పోరాటంలో కూడా పాల్గొన్నారు. రణరంగంలో నాకు వ్యతిరేకంగా ఎవరొస్తారని ఆయన అరచినప్పుడు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఖడ్గం చేతబూని బయలుదేరారు. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ని ఆపారు.
ఉహద్ తర్వాత సుప్రసిద్ధ కందక యుద్ధం జరిగింది. ఖురైషులు పదివేల మంది సైనికులతో మదీనాపై యుద్ధానికి వచ్చారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనా చుట్టూ గోతి తవ్వించారు. దీన్నే కందకం లేక అగడ్త అని అంటారు. అందుకే ఈ యుద్ధాన్ని కందక యుద్ధం అంటారు. శత్రువులు నెల రోజులపాటు మదీనాను ముట్టడించి ఉన్నారు. అడపాదడపా దాడులు కూడా చేశారు. కాని ప్రతి సారీ ఓటమి చవిచూశారు. ఈ పోరాటంలో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఓ సైనిక దళాన్ని వెంటబెట్టుకొని కందకాన్ని రక్షించసాగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ సమయంలో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)ను నియమించిన స్థానంలో ఓ మస్జిద్ నిర్మితమైంది. అది మస్జిదె సిద్దీఖ్ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఈ మస్జిదు అక్కడ లేదు.
ఖైబర్ యుద్ధం మరియు హుదైబియా ఒప్పందం సమయంలో కూడా హజ్రత్-అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తోడుగా ఉన్నారు. హుదైబియా ఒప్పందం ఎలా జరిగిందంటే- వలస వెళ్ళిన ఆరో సంవత్సరం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉమ్రా సంకల్పం చేశారు. ఈ ప్రయాణంలో 1400 మంది సహచరులు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఉన్నారు. యుద్ధం చేసే ఆలోచన లేనందువల్ల ఆయుధాలు వెంట బెట్టుకుని వెళ్ల లేదు. ఖురైషులకు ఈ సంగతి తెలియగానే కలవరపడి ప్రతిఘటనకు సిద్ధమవసాగారు. ఇటు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మక్కాకు కొంత దూరాన గల ‘హుదైబియా’ అనే ప్రాంతం వద్ద ఆగిపోయారు. ఖురైషుల తరపు నుంచి మాట్లాడటానికి ఒక దూత వచ్చాడు. అతనెంతో అసభ్యంగా మాట్లాడాడు. ఈ సంభాషణ వల్ల ఎలాంటి ఫలితమూ లేకపోయింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దూతగా హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)ను మక్కా పంపారు. ఖురైషులు ఆయన్ని బంధించారు. అంతలోనే హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) అమరగతి నొందారన్న వార్త దావానలంలా వ్యాపించింది. ఈ వార్త విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తీవ్రంగా కలత చెందారు. ఓ తుమ్మ వృక్షం క్రింద కూర్చొని విశ్వాసుల చేత ‘హజ్రత్ ఉస్మాన్’ (రదియల్లాహు అన్హు) హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి మేము మా ప్రాణాలను అర్పిస్తాం’ అన్న ప్రతిజ్ఞ చేయించారు.
ముస్లింలు దాడికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకొని ఖురైషులు ఈ సంవత్సరం తిరిగి వెళ్ళిపోండి, వచ్చే సంవత్సరం ఉమ్రా చేయండి అన్న సందేశాన్ని పంపించారు. హుదైబియాలో ఇద్దరి మధ్య ఒడంబడిక జరిగింది. ఈ ఒడంబడికలోని షరతులను బట్టి అవిశ్వాసులు తమ పంతంలో నెగ్గారని పైకి స్పష్టమయ్యేది. సంధి షరతులు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ను వ్యాకులతకు లోను చేశాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు బిగ్గరగా మాట్లాడారు. తరువాత హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)ను కలిసి అదే మాట ఆయనతో కూడా అన్నారు.
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాటను ఎట్టి పరిస్థితిలోనూ జవదాటేవారు కాదు. కించిత్ సందేహం కూడా కలిగేదికాదు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మాటలు విని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు. “ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవప్రవక్త. అల్లాహ్ ఆయనకు తోడ్పడతాడు. మీరు ఆయనను వెన్నంటి ఉండండి. ఆయన్నే అనుసరించండి. అల్లాహ్ సాక్షి! ఆయన సత్యం పై ఉన్నారు.”
హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) హృదయం విశ్వాసపు గనిలాంటిది. అల్లాహ్ మార్గంలో ఆయన అడుగు ఎన్నడూ తొట్రు పడలేదు. ఇస్లాం వాస్తవికత గురించి ఆయన మనసులో ఎన్నడూ లేశమయినా అనుమానం రాలేదు. ఈ సుగుణం వల్లనే ఆయనకు ‘సిద్దీఖ్‘ అనే బిరుదు లభించింది. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) హుదైబియా ఒప్పందం సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు హెచ్చుస్వరంతో మాట్లాడారు కాని దాన్ని తలచుకుని జీవితాంతం పశ్చాత్తాపం చెందారు. పరిహారంగా ఉపవాసాలు పాటించారు, దానాలు చేశారు, తరచూ అల్లాహ్ ను దీనంగా ఆ అపరాధానికి గాను క్షమాపణ వేడుకునే వారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మూడు రోజులు హుదైబియాలో ఉన్నారు. నాలుగో రోజు తిరిగి వెళుతున్నప్పుడు దారిలో “మేము నీకు విజయాన్ని ప్రసాదించాము” అన్న ‘వహీ’ అవతరించింది. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) “ఇది విజయమా?” అని ప్రశ్నించారు. “ఔను” అని జవాబిచ్చారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). ఇది విని హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) సంతృప్తి చెందారు. వాస్తవానికి హుదైబియా ఒప్పందం ఖురైషులు విజయం కాదు, విశ్వాసుల విజయం అని తరువాతి సంఘటనలు నిరూపించాయి. ఎందుకంటే ఈ ఒడంబడిక ద్వారా విశ్వాసులకు, అవిశ్వాసులకు మధ్య సత్సంబంధాలు, సదవగాహన పెంపొందాయి. దీని మూలంగా ఇస్లాం స్వీకరించడానికి అప్పటి వరకూ సంకోచిస్తున్న అనేక మంది ఇస్లాం స్వీకరించారు.
హుదైబియా నుండి తిరిగొచ్చాక యూదుల బెడదను వదిలించుకునే నిమిత్తం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖైబర్ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ అనేక యూదుల కోటలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటీ ముస్లింల వశమైనాయి. మరుసటి సంవత్సరం ఖురైషులు హుదైబియా ఒప్పందాన్ని ఉల్లంఘించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పదివేల మంది సైనికులతో మక్కా వైపుకు వచ్చారు. ఖురైషులకు వారిని ఎదుర్కొనే ధైర్యం లేకపోయింది. శరణు కోరగా అందరినీ క్షమించారు కారుణ్యమూర్తి (సల్లల్లాహు అలైహి వసల్లం). హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)తన తండ్రి అబూ ఖుహాఫాను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమక్షంలో తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆయన తండ్రి గారి వయసు 90 సంవత్సరాలు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)తో “పెద్ద మనిషిని ఎందుకు కష్టపెట్టావు? ఆయన్ని ఇంటి వద్దనే ఉంచితే నేనే స్వయంగా వచ్చి కలిసే వాడిని” అని అన్నారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) “ఓ దైవప్రవక్తా! ఆయనే మీ వద్దకు రావాలి” అని అన్నారు. అబూ ఖుహాఫా సద్వచనం (కలిమా) పలికి విశ్వాసులైపోయారు.
మక్కా విజయం తరువాత ఖురైషుల పొగరు అణగిపోయింది. కాని కొన్ని ఇతర తెగలు కయ్యానికి సిద్ధంగా ఉన్నాయి. హునైన్ లోయలో వారితో తలపడడం జరిగింది. విశ్వాసుల సైన్యంలో మక్కా వాసులు కూడా చేరారు. శత్రువుల విలుకాండ్రు వదిలిన బాణాలకు వీరు (మక్కా వాసులు) పరుగెత్తసాగారు. వీరు పరుగెత్తడం చూసి సైన్యంలోని మిగతావారు కలవరం చెందారు. ఆ సమయంలో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) మరియు ఇతర సన్నిహిత సహచరులు (సహాబా) తప్ప అందరూ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను విడిచి పారిపోయారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుడివైపు తిరిగి “ఓ అన్సారులారా!” అని పిలిచారు. “మేము సిద్ధంగా ఉన్నాము” అని జవాబు వచ్చింది. తరువాత ఎడమవైపు తిరిగి పిలిచారు. అటువైపు నుండి కూడా మేమూ సిద్ధమే” అనే జవాబు వచ్చింది. ఇలా విశ్వాసులందరూ శత్రువులపై ఒక్కసారిగా విరుచుకు పడగానే వారు ఓటమి పాలయ్యారు.
ఆ రోజుల్లో ఇతర రాజ్యాలు కూడా ముస్లిములతో కయ్యానికి కాలుదువ్వాయి. క్రైస్తవుల ఆధీనంలో గల సిరియా వాటిల్లో అందరికన్నా ముందు ఉండేది. మక్కా విజయానికి పూర్వం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) క్రైస్తవులను ఎదిరించడానికి సైన్యాన్ని పంపారు. ఈ చిన్న పాటి సైన్యం లక్ష మందితో కూడిన క్రైస్తవుల భారీ సైన్యంతో మువత్తా అనే ప్రదేశంలో తలపడింది. అందరి కన్నా ముందు ఇస్లాం స్వీకరించిన వారిలో ఒకరైన జైద్ బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు), దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చిన్నన కుమారులైన జాఫర్ తయార్ (రదియల్లాహు అన్హు) లాంటి సహచరులు (సహాబా) ఈ పోరాటంలో అమరగతి నొందారు. మక్కా విజయం తరువాత క్రైస్తవులు మదీనాపై మళ్ళీ దాడి చేయజూస్తున్నారని తెలిసింది. వారిని మదీనా దాకా రానీయటం ఉచితంకాదని తలచి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యుద్ధ సన్నాహాలు మొదలెట్టారు. కాని ఆ సంవత్సరం అరేబియాలో దుర్భిక్షం సంభవించింది. విశ్వాసులందరూ తమ తమ స్థోమతకు తగ్గట్టుగా ఒంటెలు, గుర్రాలు, నగదును తెచ్చి ఇచ్చారు. హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ నలభై వేల దిర్హం లు సమర్పించారు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) వంద గుర్రాలు, తొమ్మిది వందల ఒంటెలు, ఒక వెయ్యి దీనార్లు సమర్పించారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) తన వంతు సామగ్రి తీసుకు వచ్చినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయనతో “ఉమర్ ! భార్యా పిల్లల కోసం ఏమి ఉంచావు?” అని అడిగారు. దానికి హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) “ఇంట్లో ఉన్న దాంట్లో నుంచి సగం తీసుకువచ్చాను” అని జవాబిచ్చారు. కాని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఇంట్లో ఉన్నదంతా తీసుకు వచ్చేశారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అబూ బకర్! భార్యా పిల్లల కోసం ఏం వదలిపెట్టావు?” అని అడిగారు. “అల్లాహ్ మరియు దైవప్రవక్తను” అని జవాబిచ్చారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). ఇదీ ఈ ‘సిద్దీఖ్’ విశిష్ఠత!
ఆ సైనిక దళంలో ముఫ్ఫైవేల మంది సైనికులు ఉన్నారు. విశ్వాసులు అంతకు ముందెన్నడూ అంత పెద్ద సైనిక దళాన్ని తయారు చేయలేదు. సైనిక దళం ఏర్పాట్లన్నీ హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారికి అప్పగించడం జరిగింది. ఆ సైన్యానికి సేనాధిపతి స్వయంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). సిరియా పొలిమేరల్లో “తబూక్” అనే పురము ఉంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అక్కడి దాకా వెళ్ళి తిరిగి వచ్చేశారు. క్రైస్తవులు పోరాటానికి రాలేదు. తబూక్ నుండి తిరగొచ్చాక హజ్ సమయం సమీపించింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా హజ్ కు వెళ్ళలేదు కాని మూడు వందల మందితో కూడిన ఓ బృందాన్ని మక్కాకు పంపారు. ఆ హజ్ యాత్రీకుల సమూహానికి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) సారథిగా నియమించ బడ్డారు. మరుసటి సంవత్సరం (అనగా హిజ్రత్ చేసిన 10వ సంవత్సరం) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా హజ్ కొరకు వెళ్ళారు. ఇది “హజ్జతుల్ విదా” (వీడ్కోలు హజ్)గా ప్రసిద్ధి చెందింది. ఇది మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి చివరి హజ్. ఈ ప్రయాణంలో కూడా హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఉన్నారు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణం
అంతిమ హజ్ యాత్ర నుండి తిరిగొచ్చాక అంటే హిజ్రత్ చేసిన పదకొండవ సంవత్సరం సఫర్ మాసంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అస్వస్థతకు లోనయ్యారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి కుమార్తె హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సతీమణి. వ్యాధిగ్రస్తులైన కాలంలో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) గారి కుటీరంలో ఉండేవారు. మొదట్లో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) గారే నమాజ్ చేయించేవారు. కాని జబ్బు పెరిగాక హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)ను నమాజ్ చేయించమని అన్నారు. ఆ రోజు నుంచి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) నమాజ్ చేయించసాగారు. ఓ రోజు జబ్బు కాస్త నయమనిపిస్తే సహచరుల సహాయంతో మస్జిదుకు వచ్చారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) నమాజ్ చేయించసాగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన దగ్గర కూర్చున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను చూసి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) వెనక్కి జరగబోయారు. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జరగవద్దని సైగ చేశారు.
ఓ రోజు ముస్లింలు ఉదయం పూట నమాజు కోసం నిలబడుతుండగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి గది తెర లేవడం కనిపించింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా నమాజు చేయించటానికి వస్తారేమో అని భావించి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) తన స్థానం నుండి జరిగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు)ను, తన స్థానంలో వెళ్ళి నమాజు చేయించమని సైగ చేశారు. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) నమాజు మొదలెట్టగానే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెర దించివేశారు. ఆ రోజు సాయంత్రానికి కాస్త ముందు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అంతిమ శ్వాస వదిలారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారికి సుఖ్ (ఓ ప్రాంతం) లో కూడా ఓ ఇల్లు ఉండేది. కొద్ది సేపటి కోసం ఆ రోజు ఆయన అక్కడి కెళ్ళారు. తిరిగొచ్చాక మస్జిద్ నుండి నేరుగా హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) కుటీరాని కెళ్ళారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) భౌతికకాయంపై దుప్పటి కప్పబడి ఉంది. దాన్ని జరిపి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ముఖాన్ని చుంబించారు. తరువాత దు:ఖిస్తూ “నా తల్లిదండ్రుల్ని మీకు అర్పింతుగాక! మీ జీవితం మరియు మరణం రెండూ పవిత్రమైనవి. మీకు రావలసిన మృత్యువు వచ్చేసింది. ఇక మీకు ఎన్నడూ మరణం అన్నది ఉండదు” అని అన్నారు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణవార్త విని ముస్లిములందరూ దిగ్భ్రాంతి చెందారు. ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. సర్వత్రా కాస్సేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించారంటే సహచరులకు (సహాబా) నమ్మకం కలగలేదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించారని ఎవరయినా అంటే వాడి తల నరికేస్తానని చెబుతూ హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) చేతిలో ఖడ్గం పట్టుకొని ఆవేశంతో సంచరించ సాగారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) కుటీరం నుండి మస్జిదులోకి ప్రవేశించినప్పుడు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ప్రమాణం చేసి ప్రజలతో ఇలా అంటున్నారు: “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించలేదు. తొందర్లోనే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) లేచి కపట విశ్వాసులను శిక్షిస్తారు”. అప్పుడు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) అయన్నుద్దేశించి ‘కూర్చొండి’ అని అన్నారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ను చుట్టుముట్టి ఉన్న ప్రజలందరూ హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) వద్దకు చేరుకున్నారు.
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) వారితో ఇలా అన్నారు: “ప్రజలారా! మీరు దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను పూజించేవారైతే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించారని తెలుసుకోండి (ఇన్నా లిల్లాహివ ఇన్నా ఇలైహి రాజిపూన్). “అల్లాహ్ ను ఆరాధించేవారైతే అల్లాహ్ జీవించి ఉన్నాడని తెలుసుకోండి. అల్లాహ్ ఎన్నడూ మరణించడు.” తరువాత, ‘ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవప్రవక్త మాత్రమే. ఆయన కన్నా ముందు ఎందరో ప్రవక్తలు గతించారు’ అన్న ఖుర్ఆన్ సూక్తిని పఠించారు. ఇది విన్న తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘మరణం పట్ల హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)కు విశ్వాసం కలిగింది. కాని ఈ ఆఘాతానికి తట్టుకోలేక మూర్ఛపోయి క్రిందపడి పోయారు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణం తరువాత అన్సారులందరూ ఓ ప్రదేశంలో గుమికూడి-విశ్వాసులు నాయకునిగా ఎవరిని ఎన్నుకోవాలి? అనే విషయంపై చర్చించుకోవటం మొదలెట్టారు? ఈ విషయం తెలియగానే హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మరియు మరో ప్రముఖులైన సహాబి (ప్రవక్త అనుచరులు) హజ్రత్ ఉబైదా బిన్ జర్రాహ్ (రదియల్లాహు అన్హు)లను వెంటబెట్టుకొని అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో ముస్లిముల్లో నాయకత్వ సమస్యపై చీలిక ఏర్పడే ప్రమాదం కానవచ్చింది. కాని హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) ఈ సమస్యను చాలా తెలివిగా పరిష్కరిస్తూ ‘ఉమర్ ను గానీ, అబూ ఉబైదాను గాని తమ నాయకునిగా ఎన్నుకోండి’ అని సూచించారు. కాని హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ముందుకొచ్చి “మేము మిమ్మల్నే మా నాయకునిగా ఎన్నుకుంటాం” అని ప్రమాణం చేశారు. తరువాత ఇతరులు కూడా ముందుకు వచ్చి ప్రమాణం చేశారు. ఈ విధంగా హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) విశ్వాసుల నాయకునిగా అంటే ఖలీఫాగా ఎన్నుకోబడ్డారు.
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) పరిపాలన
సుమారు 61 సంవత్సరాల వయస్సులో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఖలీఫా (ప్రతినిధి)గా ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఆయన బక్క పలుచగా ఉండేవారు. తెలుపు రంగు, వంగిన నడుము, కళ్లు కాస్త లోపలికిపోయి ఉండేవి. వంకీలు తిరిగిన జుత్తు. తల ముందలి భాగంలో వెంట్రుకలు ఉండేవి కావు. మదీనా వచ్చినప్పుడే హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి గడ్డం పాక్షికంగా నెరసిపోయింది. కాని మదీనా వచ్చాక ఆయన నెరసిన వెంట్రుకలకు రంగు వేయడం మొదలెట్టారు. దాని మూలంగా ఆయన గడ్డం ఎర్రగా మారింది. స్వతహాగా ఆయన మితభాషి. ఏది చెప్పినా చాలా ఆలోచించి చెప్పేవారు. చాలా మృదు స్వభావి. ఇస్లాం స్వీకరించక పూర్వం కూడా ఆయన దానశీలిగా, ఉపకారిగా, దైవ పరాయణులుగా ఖ్యాతి చెందారు.
ఖిలాఫత్ బాధ్యతలకు పూర్వం హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) వ్యాపారం చేసేవారు. దుప్పట్లను భుజాలపై మోసుకెళ్ళి బజారులో అమ్మేవారు. ఖలీఫా అయ్యాక కూడా ఇదే పద్ధతిని పాటించేవారు. కాని పరిపాలనా బాధ్యతల వల్ల వ్యాపారం చేయడం కష్టతరం అవగా సహాబా (అనుచరులు) ఆయన కోసం ఉపకారవేతనాన్ని నిర్ణయించారు. ఆ ఉపకార వేతనం కూడా చాలా కొద్దిగా ఉండేది. తన సంసారం నడపగలిగేటంతటి కొద్ది సొమ్ము మాత్రమే ఆయనకు లభించేది. ఓ సారి ఆయన సతీమణి మిఠాయి తినిపించమని కోరారు. తన వద్ద ఏమీ లేదని అన్నారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). అప్పుడు ఆయన భార్య రోజువారి ఖర్చులో నుంచి కొంత సొమ్ము కూడబెట్టడం మొదలెట్టారు. కాస్త పెద్ద మొత్తం జమ అయ్యాక మిఠాయి తీసుకు రమ్మని ఆయనకిచ్చారు. “నా అవసరానికి మించిన వేతనం నాకు లభిస్తుందని దీని ద్వారా వెల్లడవుతుంది” అని అన్నారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). కూడబెట్టబడిన ఆ ధనాన్ని ప్రభుత్వ నిధిలో జమచేసి తన వేతనాన్ని తగ్గించారు.
ఖలీఫా అవక మునుపు మదీనా సమీపంలో గల సుఖ్ అనే చిన్న ప్రాంతంలో నివసించేవారు. సుఖ్ లోని ఆయన ఇల్లు ఒంటె రోమాలు కంబళ్ళతో నిర్మించబడిన ఓ చిన్న గుడారం ఖలీఫా అయ్యాక కూడా ఆరు నెలల దాకా ఆ ఇంట్లోనే నివసించారు. ఆ తరువాత మస్జిద్ నబవీ (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదు) లోని ఓ గదిలోకి వచ్చేశారు.
మానవత్వం, పరోపకారగుణం ఆయనలో నిండి ఉండేవి. వితంతువుల, అనాథల బాగోగులు చూసేవారు. తన పనుల్ని పక్కనబెట్టి రోగులను పరామర్శించడానికి వెళ్ళేవారు. రేయింబవళ్ళు వారి సేవలో నిమగ్నులయిపోయేవారు. సుఖ్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పిల్లలు ఆయన్ని ‘బాబా బాబా’ అని పిలిచేవారు. బాలికలు మేకల పాలు పితకమంటే పాలు పితికేవారు. అవసరమైతే వారి మేకలను మేపుకొచ్చేవారు.
ఏ మాట అయినా ఖుర్ఆన్ కు కాస్త అటూ ఇటూ ఉండకుండా చూసుకునేవారు. ఏ నిర్ణయమైనా ఖుర్ఆన్ ప్రకారమే చేసే వారు. ఏ విషయం గురించి అయినా ఖుర్ఆన్లో స్పష్టమైన ఆదేశం లేని పక్షంలో ఆ విషయం గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని ఆదేశించారు? అని ప్రజలను అడిగేవారు. ఏదేని విషయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశం కూడా లభించని పక్షంలో సహాబా (రదియల్లాహు అన్హుమ్)ను సమావేశపరచి వారితో సంప్రదించి వారిచ్చిన సలహాపై అమలుచేసేవారు. ఆయన ఆదేశించినదేదీ ఖుర్ఆన్, హదీసులకు విరుద్ధంగా ఉండేది కాదు. సహాబా (రదియల్లాహు అన్హుమ్)ను సంప్రదించకుండా ఆయన ఏనాడూ తన స్వంత నిర్ణయం గైకొనేవారు కాదు.
అంతర్గత కలహాలు
చాలా క్లిష్టమయిన పరిస్థితుల్లో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) పరిపాలనా బాధ్యతల్ని స్వీకరించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత కాలంలోనే సిరియాతో యుద్ధాలు మొదలయ్యాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానికి కొన్ని రోజుల ముందు సిరియాపై దండెత్తడానికి సైన్యాన్ని పంపదలిచారు. ఆ సైనిక దళానికి నవయువకులైన ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) గారిని సేనాపతిగా నియమించారు. ఆ సైనిక దళం మదీనా పాలిమేరలు దాటక ముందే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమపదించారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానికి కొన్నాళ్ళ క్రిందటే ఇస్లాం స్వీకరించిన కొన్ని తెగలు ఇస్లాం పట్ల విముఖులయ్యాయనీ, కొన్ని తెగలు జకాత్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని సమాచారం అందింది. అదే సమయంలో రాజ్యాధికారాన్ని కాంక్షించే కొందరు దుర్మార్గులు తమను ప్రవక్తగా ప్రకటించుకుని అనేక తెగలను మార్గభ్రష్టతకు లోను చేయసాగారు. పరిస్థితులు ఈ స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది సహాబా (ప్రవక్త అనుచరులు) “మదీనాపై దాడి జరిగిన పక్షంలో సులువుగా ఎదుర్కొనేందుకుగాను ఉసామా (రదియల్లాహు అన్హు)ను సిరియాకు పంపించకుండా ఉండటం మంచిద”ని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారికి సలహా ఇచ్చారు. అప్పుడు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సిరియాపై దండెత్తడానికి పంపదలచిన సైన్యాన్ని నేనెలా ఆపగలను?” అని జవాబిచ్చారు.
ఆ సమయంలో హజ్రత్ ఉసామా (రదియల్లాహు అన్హు) గారి వయసు 17 సంవత్సరాలు. అందువల్ల కొందరు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారితో “సరే, సైన్యాన్ని సిరియా పంపదలిస్తే, పంపండి. కాని, ఉసామా (రదియల్లాహు అన్హు)కు బదులు అనుభవజ్ఞులైన వారెవరినైనా సేనాపతిగా నియమించండి” అని అన్నారు. ఇది విని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) మండి పడుతూ “మీరెలాంటి మాట మాట్లాడుతున్నారు? దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సేనాపతిగా నియమించిన వ్యక్తిని ఎవరు తీయగలరు?” అని అన్నారు. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు)లోని విధేయతాభావానికి, రుజువర్తనకు ఇది ఓ ప్రబల తార్కాణం.
ఉసామా (రదియల్లాహు అన్హు) ప్రయాణానికి బయలుదేరినప్పుడు ఆయన్ని వదిలి పెట్టడానికి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) చాలా దూరం వెళ్ళారు. ఉసామా (రదియల్లాహు అన్హు) గుర్రంపై కూర్చుని ఉండగా హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఆయనతో పాటు కాలి నడకన వెళ్ళసాగారు. “మీరైనా గుర్రంపై ఎక్కండి లేదా నన్నయినా మీతో పాటు కాలినడకన రానివ్వండి” అని అన్నారు ఉసామా (రదియల్లాహు అన్హు), ‘నేను గుర్రం ఎక్కనూ, నిన్ను గుర్రం నుండి దిగనివ్వను’ అని అన్నారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). ఇస్లామీయ (విశ్వాసుల) సైన్యానికి వీడ్కోలు పలుకుతూ హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) ఇలా సెలవిచ్చారు:
“ప్రజలారా! కాస్త ఆగండి… నేను మీకు కొన్ని ఉపదేశాలు చేయదలిచాను. వాటిని బాగా అర్థం చేసుకోండి. నమ్మక ద్రోహం చేయకండి. సొమ్మును స్వాహా చేయకండి. విశ్వాస ఘాతుకానికి పాల్పడకండి. యుద్ధంలో శత్రువుల శరీరావయవాలు కోయకండి. వృద్ధులపై, పిల్లలపై, స్త్రీలపై చేయి చేసుకోకండి. ఫలమిచ్చే వృక్షాలను కోయకండి. ప్రపంచాన్ని విడిచి ధ్యానంలో నిమగ్నులయి ఉన్న ఇతర మతస్థుల జోలికి వెళ్ళకండి.”
ఈ సైన్యం సిరియా సరిహద్దుల్లో అనేక దాడులుచేసి విశ్వాసులు పరాక్రమాన్ని క్రైస్తవులను చాటి తిరిగొచ్చింది. కాని ఉసామా (రదియల్లాహు అన్హు) సిరియా సరిహద్దుల్లో పోరాడుతున్న సమయంలోనే మదీనా సమీపంలో గల ఇస్లాంను (విశ్వాసం) తిరస్కరించిన అనేక తెగలు మదీనాపై దాడి చేశాయి. ఈ తెగల ప్రజలు ప్రాపంచిక వ్యామోహంలో మునిగిపోయారు. “మేము నమాజ్ చేస్తాము, రోజా పాటిస్తాము కాని జకాత్ ఇవ్వము” అని మొండికేశారు. ఆ సమయంలో చాలా మంది సహాబా (అనుచరులు) “నజద్ మరియు యమన్ లోని అనేక తెగలు ఇస్లాంను విడిచిపెడుతున్న దృష్ట్యా వారితో కాస్త సడలింపుల వైఖరిని అవలంబించండి” అని హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) గారికి సలహాఇచ్చారు. కాని ఆయన ససేమిరా అన్నారు. “ధర్మంలో హెచ్చుతగ్గులు చేసే అధికారం ఎవరికీ లేదు. వీరు జకాత్ చెల్లించనంత వరకూ నేను వారితో పోరాడుతూనే ఉంటాను. మీరు నాకు తోడ్పడక పోయినా సరే, నేను ఒంటరిగా వీరితో పోరాడుతాను. నాలో ప్రాణం ఉన్నంతవరకూ నేను పోరాడుతూనే ఉంటాను” అని చెప్పి మదీనా నుండి బయలుదేరారు. బదర్ మరియు హునైన్ యుద్ధాలలో పాల్గొన్న ప్రముఖ సహాబా (అనుచరులు) అందరూ ఆయనకు తోడుగా వచ్చారు. రెండు మూడు పెద్ద దాడులు జరిగాయి. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఆ తలబిరుసులను ఓడించి ధర్మాన్ని రక్షించారు. తరువాత మదీనా తిరిగొచ్చి పదకొండు మంది సర్దారులకు సైన్యాలనిచ్చి సంక్షోభం గల ప్రాంతాలకు పంపారు. వాస్తవానికి అది ఇస్లాంకు సంక్లిష్ట సమయం. మదీనాలోని సైన్యాన్ని తీసుకొని ఉసామా (రదియల్లాహు అన్హు) సిరియా సరిహద్దువైపు వెళ్ళగా మదీనాలో మిగిలిపోయిన ఆ కొద్ది మంది ముహాజిరులు మరియు అన్సారులతో శత్రువులను ఎదుర్కోవడం చాలా కష్టం. కాని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి ధైర్యం చూడండి- ఆ కొద్ది సైన్యంతోనే ఆయన యుద్ధానికి సిద్ధమయ్యారు. ఒకవేళ ఆ సమయంలో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) శత్రువుల ఒత్తిడికి తలఒగ్గి వారికి జకాత్ (ఇస్లామీయ ధర్మపు ఓ మూలస్తంభం) నుండి మినహాయింపు ఇస్తే ధర్మంలో ప్రతి రోజు తూట్లు పడుతుండేవి. కొందరు ఉపవాసం పాటించము అని, మరికొందరు తాము నమాజు చేయము అని అనడం ప్రారంభించేవారు. అల్లాహ్ పాటించమని ఆదేశించిన వాటిని నేను ఎలా మినహాయించగలను అని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) సూటిగా అనేవారు. ఆయన గారు కనబరచిన ధైర్యం మరియు పట్టుదల వల్ల తిరుగుబాటు ధోరణులు అణగారిపోయాయి. దీని ద్వారా దైవధర్మంలో ఎలాంటి హెచ్చుతగ్గులకు తావులేదని అందరికీ సుస్పష్టం అయిపోయింది.
అరబ్ తెగలలో బనీ తమీమ్ ఓ సుప్రసిద్ధ తెగ. ఆ తెగ నాయకులు కూడా జకాత్ చెల్లించడానికి నిరాకరించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సైఫుల్లాహ్ (దైవఖడ్గం) అని బిరుదునిచ్చిన హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) వారిపై దాడికెళ్ళారు. బనీ తమీమ్ వారికి ఇది తెలియగానే భయపడి వారు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. పోరాడటానికి సిద్ధపడిన కొందరు యుద్ధంలో తమ ప్రాణాలను కోల్పోయారు.
అరేబియాకు దక్షిణాన గల యమన్ లో ముసైలిమా అనే వ్యక్తి ఉండేవాడు. వాడు ఓ సరికొత్త ఉపద్రవాన్ని సృష్టించాడు. తాను దైవప్రవక్తనని అతను చెప్పేవాడు. ఎక్కడెక్కడినుంచో అరువు తెచ్చుకున్న కొన్ని వాక్యాలను ప్రజలకు వినిపించి ఇది తనపై అవతరించిన ‘దైవవాణి’ అని అనేవాడు. నిజమైన విశ్వాసులు ఇలాంటి దుర్మార్గుల మాటలకు మోసపోయే వారు కాదు. కాని అప్పుడప్పుడే ఇస్లాం స్వీకరించి ఇంకా ఇస్లాం గురించి అంతగా అవగాహన లేని కొన్ని తెగలు మాత్రం అతని వలలో పడ్డాయి.
వాస్తవానికి ఆ సమయంలో తిరుగుబాటు చేసినవారు అనగా ముసైలిమా మరియు ఇతర బూటకపు ప్రవక్తలను విశ్వసించిన వారు లేదా జకాత్ చెల్లించడానికి నిరాకరించినవారు ఇస్లాం స్వీకరించి కొన్నాళ్ళే అయింది. ఇస్లాం బోధనలు వారి మనస్సుల్లో ఇంకా వేళ్లూనుకోలేదు.
ఆ రోజుల్లో సజాహ్ అనే స్త్రీ కూడా తాను ప్రవక్తనని ప్రకటించుకుంది. ఆమె తన తెగ ప్రజలను వెంట బెట్టుకొని మదీనాపై దాడికై బయలుదేరింది. దారిలో ముసైలిమా సైన్యంతో యుద్ధం జరిగింది. ముసైలిమా జిత్తుల మారి. యుద్ధంలో సజాహ్ సైన్యాన్ని ఓడించడం కష్టం అని గ్రహించిన వెంటనే ఆమెపై ప్రేమ వల పన్ని ఆమెను పెండ్లాడాడు. ఈ విధంగా ఆమె సైన్యపు చాలా భాగాన్ని తన వైపుకు లాక్కున్నాడు. దీని వల్ల అతని బలం పెరిగిపోయింది. ముస్లిం సైన్యం ఒకానొక ముట్టడిలో అనుకోని విధంగా ముసైలిమా సైన్యం చేతిలో ఓటమిపాలైంది. దాంతో ముసైలిమా మరింతగా పేట్రేగిపోయాడు. అతని వద్ద నలభైవేల మంది సైనికులు పోగయ్యారు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానికి పూర్వం అస్వద్ అనే ఓ యమన్ సర్దారు తాను ప్రవక్తనని ప్రకటించుకుని మరో వివాదాన్ని సృష్టించాడు. కాని ఓ వ్యక్తి అతణ్ణి హత్య చేశాడు. కొన్నాళ్ళ తర్వాత బనీ అసద్ నాయకుడైన తలైహా పెద్ద ఉపద్రవాన్ని సృష్టించాడు. ఇతను కూడా తాను ప్రవక్తనని ప్రకటించుకున్నాడు. చాలా మంది అతణ్ణి విశ్వసించారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారు హజ్రత్ ఖాలీద్ బిన్ వలీద్(రదియల్లాహు అన్హు)కు సైన్యాన్నిచ్చి తలైహా వద్దకు పంపారు. అతను ఓటమిపాలయ్యాడు. ఏళ్ళ తరబడి అటూ ఇటూ తిరిగాడు. తలదాచుకోవడానికి ఎక్కడా చోటు దొరకకపోవడం చేత చివరికి మదీనా చేరి ఇస్లాం స్వీకరించాడు. ఈ తలైహా బహు పరాక్రమాశాలి. సిరియా మరియు ఈరాన్ యుద్ధాలలో అతను తన పరాక్రమంతో ఇస్లాంకు తోడ్పడ్డాడు.
తలైహాను ఓడించాక హజ్రత్ ఖాలీద్ బిన్ వలీద్ ముసైలిమాతో యుద్ధానికి సంకల్పించారు. యమామా అనే ప్రదేశంలో ఉఖబా అనే గ్రామం ఉంది. రెండు సైన్యాలూ అక్కడ ఎదురయ్యాయి. ముసైలిమా వద్ద నలభై వేల మంది సైనికులున్నారు. స్వయంగా అతను మధ్యలో ఉండి పేరుగాంచిన సైనికులను తనకు ఇరువైపుల మోహరించాడు. ఇస్లామీయ సైన్యాన్ని అతని సైన్యాలతో పోలిస్తే ఏవిధంగానూ సరిపోదు. యుద్ధం ప్రారంభంలో ముసైలిమా సైనికుల దాడికి విశ్వాసులు బెదిరిపోయారు. విశ్వాసులు వెనక్కి జరుగుతూ జరుగుతూ హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) గుడారం దాకా చేరుకున్నారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరులైన హజ్రత్ ఖైస్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు) మరియు జైద్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) విశ్వాసులను “ఓ విశ్వాసులారా! ఎక్కడికెళ్తున్నారు?” అంటూ రోషం తెప్పించారు. వారు స్వయంగా యుద్ధం చేస్తూ వీరమరణం పొందారు. వారి ధైర్యాన్ని చూసి ముస్లిం సైన్యంలో ఉత్తేజం కలిగింది. వారు ఇరువైపుల నుండి శత్రుసైన్యంపై విరుచుకుపడ్డారు. దీంతో ముసైలిమా సైనిక పంక్తుల్లో కలకలం రేగింది.
ముసైలిమా సైన్యానికి వెనుక వైపు ఓ పెద్ద తోట ఉంది. విశ్వాసులు శత్రు సైన్యాన్ని తరుముకుంటూ ఆ తోట దాకా తీసుకెళ్ళారు. చేసేదేమి లేక ముసైలిమా తన సైన్యాన్ని తోటలోకి తీసుకెళ్ళి తోట తలుపులు మూసేసుకున్నాడు. హజ్రత్ బరా బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) గొప్ప పరాక్రమశాలి. ఆయన సోదరులైన హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) జీవితాంతం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు సేవ చేశారు. తత్కారణంగా హజ్రత్ బరా బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) గారికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సేవలో హాజరయ్యే అవకాశం తరచూ లభించేది. అందువల్ల ప్రజలందరూ ఆయన్ని గౌరవించేవారు. ముసైలిమా తోట తలుపుల్ని మూసేసుకోవడంతో హజ్రత్ బరా బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) తనను గోడపైకి ఎక్కించమని తన సహచరులతో అన్నారు. గోడ పైకి చేరుకొని లోపల దూకారు. శత్రుసైన్యం ఓ వైపు బాణాల వర్షం కురిపిస్తున్నా దూసుకుపోయి తలుపులు తెరిచారు. వెంటనే ఇస్లామీయ సైన్యం తోట లోపల ప్రవేశించింది. లోపల భీకర పోరు జరిగింది. ముసైలిమా సైన్యానికి మధ్యలో నిలబడి సైనికులను ఉత్తేజపరచసాగాడు. తన సైన్యం ఓటమి పాలవడం చూసి “ప్రస్తుతం ప్రాణాల్ని రక్షించుకుందాం. తరువాత చూసుకోవచ్చు” అని మనసులో భావించాడు. ఉహద్ యుద్ధంలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చిన్నాన్న హజ్రత్ హమ్జా (రదియల్లాహు అన్హు) ను హతమార్చిన అబిసీనియా బానిస వహ్షీ ముసైలిమాను వెదకసాగాడు. ముసైలిమా పారిపోయే ప్రయత్నంలో ఉండగానే వహ్షీ అతనిపై ఒక్క వేటు వేశాడు. అంతటితో ముసైలిమా కథ కంచికి చేరింది.
అతని సహచరులు పరుగెత్తి దగ్గరలోని కోటలలో దాక్కున్నారు. కాని చివరికి దారిలేక ఆయుధాలను పడవేసి ప్రాణాలను కాపాడుకున్నారు.
తిరుగుబాటుదారుల అహంకారం అణచడానికి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) పదకొండు సైనిక జట్లను పంపారు. జకాత్ ఇవ్వడానికి నిరాకరించిన అనేక తెగలకు ఆ సైన్యం బుద్ధి చెప్పింది. తమ తమ ప్రాంతాలలో తమ రాజ్యాన్ని ఏర్పాటు చేయదలుస్తున్న వేర్పాటు వాదుల ప్రయత్నాలను కూడా విఫలం చేశారు. వారిలో అందరికంటే పెద్ద సమూహం ముసైలిమాది, పెద్ద యుద్ధం యమామా యుద్ధం. తమ జీవితాన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సేవలో గడిపిన, దివ్య ఖుర్ఆన్ను కంఠస్థం చేసిన అనేక మంది ప్రవక్త సహచరులు (సహాబా) ఈ యుద్ధంలో అమరగతినొందారు.
దివ్యఖుర్ఆన్ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితంలోనే వ్రాయబడింది. కాని కొన్ని అధ్యాయాలు కాగితంపై, కొన్ని తోలుపై, కొన్ని ఖర్జూరపు ఆకులపై, కొన్ని రాళ్లపై లిఖించబడ్డాయి. దివ్య ఖుర్ఆన్ ను కంఠస్థం చేసిన అనేక మంది ప్రవక్త సహచరులు (సహాబా) రదియల్లాహు అన్హుమ్ – అమరగతినొందడం చూసి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దివ్యఖుర్ఆన్ ను ఓ చోట వ్రాయించుకున్నారు. ఆ తరువాత పూర్తి ఖుర్ఆన్ కంఠస్థం చేసిన వారిని పిలిపించి వ్రాయించబడిన ఆ ఖుర్ఆన్లోని భాగాలను సరిపోల్చుకుని ఎక్కడా తప్పులు దొర్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
రోము మరియు ఈరాన్ యుద్ధాలు
అరేబియాలో కల్లోలం సృష్టించిన సమూహాలను అణచివేసే పని తొమ్మిది, పది నెలల్లో ముగిసింది. తరువాత హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) రోమ్ మరియు ఈరాన్తో యుద్ధ సంకల్పం చేశారు. ఆ రెండు సామ్రాజ్యాల సరిహద్దులు అరేబియాకు ఆనుకుని ఉండేవి. రోము చాలా పెద్ద సామ్రాజ్యం. అది ఆసియా, ఐరోపా, ఆఫ్రికా లాంటి మూడు ఖండాలలో విస్తరించి ఉండేది. ఆసియాలో సిరియా, పాలస్తీనా, ఆఫ్రికాలో ఈజిప్టుతో పాటు ఉత్తర ఆఫ్రికాలోని పెద్ద ప్రాంతం రోము అధీనంలో ఉండేది. ఈరాన్ కూడా చాలా బలోపేతమైన రాజ్యం. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితంలో ఆ రెండు సామ్రాజ్యాల మధ్య యుద్ధాలు కూడా జరిగాయి. ఓ సారి ఈరానీయులు పెద్దదాడి చేసి సిరియా, పాలస్తీనా ప్రాంతాలను దాటుకుంటూ జెరూసలేం వరకూ చేరుకున్నారు. ప్రతీకారంగా కొన్నేళ్ళ తరువాత రోమనులు ఈరానుపై దాడి చేసి ఇస్ఫహాన్ (జోర్డాన్) ను నాశనం చేసి విజయ దుందుభి మ్రోగిస్తూ వెనుదిరిగారు.
తమ జీవితపు చివరి దశలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చుట్టు ప్రక్కల గల రాజ్యాల రాజులకు ఉత్తరాల ద్వారా ఇస్లాం సందేశాన్ని అందజేశారు. ఈరాన్ రాజు ఖుస్రో పర్వేజ్ రాజ్యాధికారపు అహంకారంలో ఆ ఉత్తరాన్ని చించేసి, మదీనావెళ్ళి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను బంధించి తీసుకు రావలసిందిగా తన గవర్నరును ఆజ్ఞాపించాడు. కాని అల్లాహ్ లీల చూడండి! అటు అతను ఈ అపరాధం చేసిన కొన్నాళ్ళకే ఇటు అతని కొడుకు అధికార దాహంతో తండ్రిని హతమార్చాడు. ఆ తరువాత ఈరానీయులు తమ అంత: కలహాలలో ఇరుక్కుపోయారు. ఇక వారికి అరబ్బులపై దాడి చేసే తీరికే లేకపోయింది. అవకాశం దొరకగానే వారు తప్పకుండా తమపై దాడి చేస్తారని ముస్లిముల మనసులో మెదిలేది. ఇక రోమనులతో యుద్ధం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హయాంలోనే ప్రారంభమయింది. రోమనులు మదీనాపై దండెత్తి వస్తున్నారనే పుకార్లు పదేపదే వినవచ్చేవి. ఆ రోజుల్లో ఈరాన్ రాజు తరఫున హుర్మజ్ అనే వ్యక్తి ఇరాఖ్ ను గవర్నరుగా పాలించేవాడు. ఇతను అరబ్బులకు బద్ద విరోధి. ఇరాఖ్ సరిహద్దుల్లో గల అరబ్బుతెగల పై అతను నిరంతరం దౌర్జన్యం చేసేవాడు. అతనీ గురించి తెలియగానే హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఇరాఖ్ పై దాడికి హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు)ను పంపించాలనుకున్నారు. తక్షణం ఇరాఖైపై దాడి చేయాలన్న హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఆదేశం హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు)కి యమామాలోనే లభించింది. అప్పటికే ఈరానీయులతో ముస్లింలు అనేక యుద్ధాలు చేసి ఉన్నారు. వాటిలో అన్నిటికంటే పెద్దది ‘సలాసిల్ యుద్ధం‘ అంటే ‘సంకెళ్ళ పోరాటం’ అని అర్థం. ఈ యుద్ధంలో హుర్మజ్ పెద్ద పెద్ద యోధులు గల ఓ సైనిక జట్టును యుద్ధభూమి నుండి పారిపోకుండా సంకెళ్ళతో బంధించాడు. ఈ యుద్ధం నజ్మా అనే ప్రాంతం దగ్గర జరిగింది. ఈరానీయులు ముస్లిముల కంటే చాలా అధికంగా ఉన్నారు. యావత్తు ఈరాన్లో తన శౌర్యపు ముద్ర వేసిన హుర్మజ్ స్వయంగా తన సైన్యానికి నాయకత్వం వహించాడు. వాస్తవానికి అతను ఇరాఖ్ గవర్నర్ అయినప్పటికీ రాజులా కిరీటాన్ని ధరించేవాడు. అతని కిరీటం లక్ష రూపాయల వ్యయంతో తయారయింది. అందులో కళ్ళు మిరుమిట్లు గొలిపే రత్నాలు పొదగబడి ఉండేవి.
రెండు సైన్యాలూ పంక్తులు సరిదిద్దుకుని యుద్ధానికి సిద్ధ మయ్యాయి. అంతలో స్వయంగా హుర్మజ్ గుర్రంపై యుద్ధరంగానికి వచ్చి ప్రాణులను చంపితే ఏం లాభం? ముస్లిముల నాయకుడు నాతో స్వయంగా పోరాడితే యుద్ధ నిర్ణయం జరిగిపోతుంది” అని సవాలు విసిరాడు. అటు నుండి హజ్రత్ ఖాలీద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) స్వయంగా అతనితో పోరాడటానికి సిద్ధమయ్యారు. కాని హుర్మజ్ మనసులో దురుద్దేశ్యం ఉంది. విశ్వాసులు నాయకునిది పైచేయి అయిన పక్షంలో అతనిపై విరుచుకు పడటానికి కొందరిని అతడు కనబడకుండా దాచి ఉంచాడు. నాయకులిద్దరూ ముఖాముఖి అవగానే హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) ఖడ్గంతో హుర్మజ్ పై దాడిచేశారు. ఆయన ఖడ్గం హుర్మజ్ ఇనుప కవచం పై పడి వేరయిపోయింది. ఈసారి హుర్మజ్ హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) పై ఖడ్గం ఝళిపించాడు.
హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) ఇనుప కవచం తొడగని పక్షంలో ఆ దాడికి ప్రాణాలు కోల్పోయేవారేమో! హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) ఖడ్గాన్ని విసిరేసి హుర్మాజ్ నడుం పట్టి అతణ్ణి పైకెత్తారు. ఇది చూసి దాగి ఉన్న అతని సైనికులు బయటకొచ్చారు. ఇటు నుండి బనీ తమీమ్ యొక్క ప్రసిద్ధ అశ్వరూఢుడయిన ఖాఖా బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) కు మద్దతుగా రంగ ప్రవేశం చేసి ఈరానీ సైనికులను నిలువరించారు. హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) అదను చూసి హుర్మజ్ ను నేలపై వేసి కొట్టారు. అతని శిరస్సును ఖండించి యుద్ధ రంగంలో విసిరేశారు. ఇది చూసి ఈరానీయులు ధైర్యసాహసాలు నీరుగారిపోయాయి. అయినా వారి నాయకులు మాత్రం వారిని ప్రేరేపిస్తూ నగారాలు వాయించుతూ ముస్లింలపై దాడి చేశారు. కొంతసేపు భీకర యుద్ధం జరిగింది. చివరికి ఈరానీయులు పారిపోయారు.
ఇరాఖ్ సరిహద్దు ప్రాంతంలో కొత్తగా ఇస్లాం స్వీకరించిన ముసన్నా బిన్ హారిస్ పెద్ద ధనికుడు. ఆయన ఈ యుద్ధాల్లో వీరోచితంగా పోరాడాడు. యుద్ధ రంగం నుండి పారిపోతున్న ఈరానీయులను వెంటాడటానికి హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) ముసన్నాను పంపారు. హుర్మజ్ కు కుమ్మక్కుగా వస్తున్న ఈరానీ సైనిక దళం ముసన్నాను అడ్డుకుంది. ఈ సమాచారం అందగానే ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) సైన్యాన్ని తీసుకొని అక్కడికి చేరుకున్నారు. ఇక్కడ కూడా ఈరానీయులు అపజయం పాలయ్యారు. విశ్వాసులకు విజయం లభించింది.
ఈ పరాజయ పరంపర గురించి విని ఇరానీ నాయకులు అరబ్బులతో పోరాడటానికి అరబ్బు సైన్యాన్నే పంపాలని తలచారు. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. క్రైస్తవ మతాన్ని ఆచరించే కొన్ని అరబ్బు తెగలు ఈరానీయుల పాలనలో ఉండేవి. వారిని సమీకరించి ఓ సైన్యం తయారు చేయబడింది. ఓ ఈరానీ నాయకుడు దానికి సేనాపతిగా నియమించబడ్డాడు. ఆ ప్రాంతపు రెండు నదులు దజ్లా మరియు ఫరాత్ -కలిసే చోట రెండు సైన్యాలూ ముఖాముఖీ అయ్యాయి. హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించారు. ఓ భాగాన్ని స్వయంగా తానే తీసుకొని ముందుకెళ్ళారు. మిగతా రెండు భాగాలకు ముసన్నా బిన్ హారిస్ మరియు ఖాఖా బిన్ అమ్ర్ ను నాయకులుగా నియమించి అక్కడే వదిలారు. యుద్ధం భీకరరూపం దాల్చిన సమయంలో ముసన్నా ఉల్లాసభరితమయిన సైనికులను తీసుకొని కుడివైపు నుండి ఈరానీయులపై విరుచుకుపడ్డారు. ఈ దెబ్బతో ఈరానీయులు ఓటమి అంచుకు చేరుకున్నారు. కాని నాయకులు ప్రోత్సహించి వారిని సంభాళించారు. అంతలోనే ఖాఖా బిన్ అమ్ర్ తన సైన్యంతో ఈరానీయులపై ఎడమవైపు నుంచి మెరుపు దాడి చేశారు. దీంతో ఈరానీయుల ఆశలు అడియాసలయ్యాయి. ఇరానీయులు ఎవరిపై అపారమయిన నమ్మకంతో యుద్ధానికి వచ్చారో వారే- క్రైస్తవ అరబ్బులే రణరంగం వదిలి పారిపోయారు.
ఇలాంటి అనేక చిన్న పెద్ద యుద్ధాల అనంతరం హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) ‘హీర’ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ యుద్ధాలలో జోన్ నదీ యుద్ధం అతి పెద్దది. దీంట్లో ఈరానీయులు శక్తి నంతటినీ కూడదీసుకుని పోరాడారు, కాని ఇక్కడా పరాభవమే మిగిలింది. వారి సైనికులు వేల సంఖ్యలో మరణించారు. ‘హీర’ పాత నగరం చాలా అందంగా ఉండేది. వాస్తవానికి అది ఇరానీయుల అధీనంలో గల ఓ అరబ్బు రాజ్యానికి రాజధాని. ‘హీర’ యొక్క ఓ అరబ్బు రాజు ఫరాత్ నదీ తీరాన ఓ బ్రహ్మాండమైన భవనాన్ని నిర్మించాడు. ఈ భవన నిర్మాణంలో రోమ్ మరియు ఈరాన్ కళాకారుల వాస్తు కళానైపుణ్యం ఉట్టి పడ్డుతుంది. దీని నిర్మాణంలో ‘హీర’ రాజు తన సర్వస్వాన్ని వెచ్చించాడు. ప్రస్తుతం అక్కడ ‘కూఫా’ అనే పట్టణం ఉంది. హీర పాత నగరం ఇక్కడ్నుంచి సుమారు మూడు మైళ్ళ దూరంలో ఉండేది. హీర రాజులు వంశపారం పర్యంగా అరబ్బులైనప్పటికీ క్రైస్తవమతాన్ని పాటించేవారు. వీరు అగ్నిపూజారులైన ఈరానీ రాజులకు పన్ను చెల్లించేవారు.
కొన్నాళ్ళ తర్వాత హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఈరాన్ ని జయించే పనిని ముసన్నా బిన్ హారిస్కు వదిలి సిరియా వెళ్ళమని హజ్రత్ ఖాలీద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) గారికి ఆజ్ఞాపించారు. ఎందుకంటే అక్కడ క్రైస్తవులు చాలా బలం కూడగట్టుకున్నారు. దాని తరువాత ఈరాన్లో అనేక పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి. ఆ యుద్దాల్లో అగ్ని పూజారులైన ఈరానీయుల వెన్ను విరిగింది. చివరికి ఈరాన్ ముస్లింల వశమయ్యింది. కాని ఈ సంఘటనలు హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) తర్వాత కాలం- అనగా హజ్రత్ ఉమర్ ఫారూఖ్ (రదియల్లాహు అన్హు) హయాంలో సంభవించాయి. వాటిని ఇక్కడ ప్రస్తావించడం సబబుకాదు.
మరణం
హిజ్రీ పదమూడవ సంవత్సరం జమాది ఉల్ ఆఖిర్ నెల ఏడవ తేదీన హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) అస్వస్థతకు గురయ్యారు. చల్లని గాలులు వీస్తున్న సమయంలో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) చన్నీళ్ల స్నానం చేశారు. చలి వల్ల జ్వరం వచ్చింది. పదిహేను రోజుల దాకా జ్వరం పట్టి పీడించింది. ఆయన స్థానంలో హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మస్జిదులో నమాజ్ చేయించసాగారు. ఆయన పొరుగునే హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఉండేవారు. అందుచేత హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) జబ్బు పడ్డ కాలంలో హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఎల్లప్పుడూ ఆయన సేవలో ఉండేవారు.
జబ్బు తీవ్రతరమైనప్పుడు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారికి తన ఉత్తరాధికారిగా నియమించాలనే ఆలోచన కలిగింది. తన స్థానంలో హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారిని ఖలీఫాగా నియమించాలని ఆయన నిర్ణయించారు. సహాబా (అనుచరుల) ను సంప్రదించారు. మీ ఎంపిక సరైనదని కొందరంటే, హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారికి ఆవేశం ఎక్కువ అని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇది విని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) “ఉత్తరాధికారపు బాధ్యత భుజస్కంధాలపై పడగానే ఆయన మారిపోతారు. నాకు కోపం వచ్చినప్పుడు ఆయన నన్ను శాంతపరుస్తారు. ఏదైనా విషయంలో నేను మెత్తగా వ్యవహరిస్తే ఆయన నన్ను కఠినంగా వ్యవహరించమని సలహా ఇచ్చేవారు. ఇది నా అనుభవం ”అని అన్నారు.
హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) గారి స్థానంలో ఇరాఖ్ సైన్యానికి సేనాధిపతిగా నియుక్తులైన హజ్రత్ ముసన్నా బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు) మదీనా చేరుకున్న రోజు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి జీవితపు ఆఖరి రోజు, ఆయన్ని పిలిపించి ఇరాఖ్ స్థితిగతుల గురించి వాకబు చేశారు. “ఈరాన్ రాజు కొత్త సైన్యాన్ని పంపాడు. నా వద్ద చాలా కొద్ది సైన్యం ఉంది “అని అన్నారు. హజ్రత్ ముసన్నా బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు). వెంటనే హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారిని పిలిపించి “నా ప్రాణం ఉదయం పోతే సాయంత్రానికల్లా, రాత్రి పోతే ఉదయానికల్లా ముసన్నాకు సైనిక సహాయం చెయ్యండి ” అని అన్నారు.
వ్యాధిగ్రస్తులైన కాలంలో ఓ రోజు “బైతుల్ మాల్ (కోశాగారము) నుండి నాకు ఇప్పటి వరకు మొత్తం ఎంత వేతనం లభించింది?” అని అడిగారు. లెక్క గట్టి ఆరు వేల దిర్హములు (పదిహేను వందల రూపాయలు) అని తెలియ జేయబడింది. “నా భూమి అమ్మి ఈ సొమ్మును వాపసు చేయండి” అని అన్నారు. ఆ తరువాత మళ్ళీ ‘నేను ఖలీఫాగా నియుక్తుణ్ణయ్యాక నా సిరిసంపదల్లో ఎంత వృద్ధి జరిగింది?’ అని అడిగారు. “ఏముందీ? ఓ అబిసీనియా బానిస ఉన్నాడు. అతడు విశ్వాసుల ఖడ్గాలకు పట్టిన తుప్పును వదిలిస్తాడు. ఇంట్లో పనులు చేస్తాడు. నీళ్ళు తేవడానికి ఉపయోగించే ఓ ఒంటె ఉంది. రూపాయి పావలా ఖరీదు చేసే ఓ దుప్పటి ఉంది” అని అన్నారు ఇంటివారు. “నా మరణం తర్వాత ఈ మూడింటినీ హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వద్దకు పంపేయండి” అని అన్నారు. మరణానికి ముందు ప్రియపుత్రిక హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) గారి నుద్దేశ్యించి “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి కఫన్ (అంత్యక్రియల వస్త్రము)లో ఎన్ని వస్త్రాలు వాడారు” అని అడిగారు. “మూడు వస్త్రాలు” అని జవాబిచ్చారు హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ). “నా కఫన్ (శవవస్త్రము)లో కూడా మూడు వస్త్రాలే ఉండాలి. నేను ప్రస్తుతం వాడుతున్న ఈ రెండు దుప్పట్లు. వీటిని కాస్త ఉతికించండి. ఒక వస్త్రం కొత్తది తీసుకోండి” అని అన్నారు. ఇది విని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) “నాన్నగారూ! మీ అంత్యక్రియల కోసం కొత్త వస్త్రం కూడా కొనలేనంత దీన స్థితిలో ఉన్నామా మనం?” అని అడిగారు. అది కాదమ్మా! “చనిపోయే వారికన్నా జీవించి ఉన్న వారికి కొత్త బట్టల అవసరం ఎక్కువ”అని అన్నారు. తరువాత మళ్ళీ “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏ రోజు మరణించారు?” అని అడిగారు. “సోమవారం” అని జవాబిచ్చారు హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ). “ఈ రోజు సోమవారం. నేను కూడా ఈ రోజే మరణిస్తానని ఆశిస్తున్నాను. నా సమాధి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి ప్రక్కన ఉండేలా చూడండి” అని అన్నారు.
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) జుమాది ఉల్ ఆఖిర్ నెల 22వ తేదీన మగ్రిబ్ మరియు ఇషా మధ్య సమయంలో మరణించారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) జనాజా నమాజ్ చేయించారు. అదే రోజు రాత్రి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) గారి గదిలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి ప్రక్కన ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన ఖలీఫాగా 2 సంవత్సరాల, 3 నెలల, 11 రోజులు పరిపాలించారు.
మరణించేనాటికి ఆయన వయస్సు 63 సంవత్సరాలు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు గలరు. పెద్ద కొడుకు అబ్దుర్రహ్మాన్. ఆయన చాలా కాలం వరకు ఇస్లాం స్వీకరించక అవిశ్వాసుల పక్షాన విశ్వాసులతో పోరాడారు. రెండో కొడుకు అబ్దుల్లాహ్. ఆయన ఇస్లాంకు ఎంతో సేవ చేశారు. హిజ్రత్ సందర్భంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) నూర్ గుహలో ఉన్నప్పుడు ఆయన ఉదయం పూట మక్కాలో గడిపి ఖురైషులు ఎత్తుగడల గురించి తెలుసుకొని రాత్రి వేళ సూర్ గుహకు చేరుకునేవారు. తాయఫ్ యుద్ధంలో ఆయన కాలికి బాణం తగిలి గాయం అయింది. ఆ బాధతో ఆయన మరణించారు. మూడవ కుమారుడు ముహమ్మద్. ఆయన మదీనాలో జన్మించారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి పెద్ద కుమార్తె పేరు హజ్రత్ అస్మా (రదియల్లాహు అన్హ). ఆమె పెళ్ళి చాలా మర్యాదస్తులైన సహాబి (అనుచరులు) జుబైర్ బిన్ అవామ్ (రదియల్లాహు అన్హు) గారితో జరిగింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సతీమణులలో ఒకరైన హజ్రత్ ఆయిషా సిద్దీఖా (రదియల్లాహు అన్హ) ఆయన గారి రెండవ పుత్రిక. మూడవ కుమార్తె పేరు ఉమ్మెకుల్సుమ్ (రదియల్లాహు అన్హు). అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) గారికి సంతానం కలుగలేదు. అందుచేత హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి వంశపరంపర అబ్దుర్రహ్మాన్ (రదియల్లాహు అన్హు) మరియు ముహమ్మద్ (రదియల్లాహు అన్హు) గారి సంతానం ద్వారా కొనసాగింది.
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో పరిచయం అయిన కాలంలో ఇంకా మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దైవదౌత్యం అందలేదు. “అల్లాహ్ నన్ను తన ప్రవక్తగా ఎన్నుకొని, ప్రజలకు హితబోధచేసే పనిని అప్పగించాడు” అని దైవప్రవక్త హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారితో అనగానే ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా “మీరు దైవప్రవక్తగా ఎన్నుకో బడ్డారనే విషయాన్ని ” నేను విశ్వసిస్తున్నాను” అని అన్నారు. ఆయన వృద్ధాప్యంలో ఖలీఫా అయ్యారు. ఆ సమయంలో ఆయన వయస్సు 61 సంవత్సరాలు. కాని ప్రజలు జకాత్ ఇవ్వడానికి నిరాకరించి, అరబ్బులోని 24 తెగలు యుద్ధానికి సయితం సన్నద్ధమైనప్పుడు ఆయన చూపిన ధైర్యసాహసాలకు అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. సహాబా (ప్రవక్త సహచరులు)లలో కొందరు – ‘ఎవరైతే జకాత్ ఇవ్వడానికి నిరాకరించారో వారిని జకాత్ నుండి మినహాయించండి’ అని సలహా ఇచ్చారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దానికి సుతరామూ ఒప్పుకోలేదు. “ఒకవేళ మీరు వారితో యుద్ధం చేయక పోయినా నేను ఒక్కడినే వారితో పోరాడుతాను” అని తేల్చి చెప్పారు. ఆ తరువాత సహచరులను వెంట బెట్టుకుని మదీనా నుండి బయలుదేరారు. మదీనాపై దాడి చేయడానికి పెద్ద పెద్ద సైన్యాలతో వచ్చిన వారందరినీ వరుసగా ఓడిస్తూ పోయారు.
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి హృదయం విశ్వాస (ఈమాన్) గని లాంటిది. ఆయన మనస్సు అల్లాహ్ ప్రేమతో, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రేమతో నిండి ఉండేది. ఆయన కేవలం రెండు సంవత్సరాల కన్నా కాస్త ఎక్కువ కాలం ఖలీఫాగా ఉన్నారు. అయితేనేం, దశాబ్దాలలో సయితం నెరవేర్చలేని ఘనకార్యాలు ఆ స్వల్ప వ్యవధిలోనే చాలా సమర్ధవంతంగా నిర్వహించారు హజ్రత్ అబూ బకర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు).
కారుణ్య ప్రభువు ఆయనతో ప్రసన్నుడవుగాక!
(సమాప్తం)
హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) అంతిమ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ప్రాణ స్నేహితులు. తాను నమ్మిన ధర్మం కోసం సర్వస్వాన్ని ధారబోసిన త్యాగశీలి. మితభాషి, మృదుస్వభావి, అల్లాహ్ కు భయపడి ప్రజలకు నాయకత్వం వహించిన ప్రప్రథమ మార్గదర్శక ఖలీఫా. మానవత్వం, పరోపకార భావం ఆయనలో మెండుగా ఉండేవి. అనాథల, అగత్యపరుల పట్ల అమితమైన జాలి చూపేవారు. రోగుల పరామర్శ, బాధితుల సేవ అంటే ఆయనకెంతో ఇష్టం. స్వతహాగా మృదుస్వభావి అయినప్పటికీ ధర్మాదేశాలను ప్రవేశపెట్టే విషయంలో చాలా ఖచ్చితంగా వ్యవహరించేవారు. అబూబక్ర్ బ్రతికి ఉండగా ధర్మావలంబనలో హెచ్చుతగ్గులకు ఆస్కారం ఉండబోదని సూటిగా చెప్పారు. ఏ విషయమైనా ఖుర్ఆన్ కు కాస్త అటూ ఇటూగా ఉంటే సహించేవారుకారు. ఏ నిర్ణయం గైకొన్నా దివ్య ఖుర్ఆన్ ప్రకారమే గైకొనేవారు. తన పరిపాలనా కాలంలో “జకాత్”ను ఎగ్గొట్టడానికి ప్రయత్నించిన వారి మెడలు వంచి, ధర్మాన్ని రక్షించిన ధర్మ ఖలీఫా ఆయన. -రదియల్లాహు అన్హు –
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మానవ మహోపకారి, కారుణ్యమూర్తి, హృదయాల విజేత అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాలు, దినచర్యలు, ఆయన వ్యవహార సరళి గురించి తెలిపే పుస్తకాలు తెలుగు భాషలో కొన్ని వచ్చాయి. అలాగే, ఆయా గ్రంధాల్లో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సతీమణులను గురించి వారి గృహస్థ జీవితంలోని ముఖ్య సంఘటనలను గురించి సవివరంగా తెలిపే పుస్తకాలు తెలుగులో దాదాపు లేవనే చెప్పవచ్చు.
ఒక మహాసాధ్వి జీవిత చరిత్రనే గాకుండా భార్యవలన భర్తకు ఏవిధంగా మనశ్శాంతి, ఊరట లభిస్తాయో, లభించాలో ఈ పుస్తకం మనకు వివరిస్తుంది. ఆయా పరిస్థితులలో తనకెదురయిన వివిధ సంఘటనల్ని ఇబ్బందుల్ని, పరీక్షల్ని ఆ మహిళా లోక మార్గదర్శి ఎలా అధిగమించారో కళ్ళకు కట్టినట్లు చూపే ఓ సజీవ దృశ్య కావ్యం ఈ గ్రంధం. ఇంకా ‘ధర్మేచ, అర్థేచ, కామేచ, నాతిచరామి’ అన్నట్లుగా కష్టాలయినా, సుఖాలయినా భర్తతో ఆమె ఎలా కలిసి పంచుకున్నారో మనకు విశదమవుతుంది.
నేటి ముస్లింల పతనావస్థకు గల కారణాలలో సగభాగం ముస్లిం మహిళలే అంటే అతిశయోక్తి అనిపించవచ్చు. కాని రకరకాల భయాలకు భ్రమలకు దాసోహం కావడాలు, సమాధుల పూజలు, అనాగరిక మూఢాచారాలు, వివాహ సందర్భాల లోనయినా, దుఃఖ సందర్భాలలోనయినా జరుగుతున్న మూఢత్వపు తంతులు, దుబారా వ్యయం మన ప్రాంగణాలలో బ్రతికి బట్టకడుతున్నాయంటే అందుకు కారణం ఏమిటీ? నేటి ముస్లిం మహిళల్లో ఇస్లామీయ చైతన్యం మృగ్యమవడం కాదా? అయితే ఒక్క విషయం! ముస్లిం స్త్రీ యొక్క పరిపూర్ణ నమూనా ఏదీ వారికి లభించనప్పుడు వారు మాత్రం ఏం చేస్తారు? ప్రతి పురుషుడి విజయం వెనుకా ఒక స్త్రీ హస్తం ఉండాలి, ఉంది, అంటే ఆ విజయం సాధించిన పురుషుల తోడ్పాటూ, సహకారం, సమన్వయం వారికి లభించడం వల్లనే కదా!
ఇక ఈ పుస్తకం ద్వారా…
దైవదౌత్య ప్రాతినిధ్యంలో సహధర్మచారిణిగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రాంగణంలో దాదాపు 40 ఏళ్ళు బోధనామృత మణిదీపికగా భాసిల్లి, విశ్వాసుల మాతగా ఆచంద్రతారార్కం కీర్తించబడే మహిళా శిరోమణి అపురూప వ్యవహరణా శైలిని మహిళాలోకానికి పరిచయం చేసే భాగ్యం లభించడం మా అదృష్టం!!
స్త్రీ… తరతరాలుగా పీడనకు, పురుషాహంకారానికీ బలవుతూ వచ్చింది. స్త్రీ తన తోటి స్త్రీల వల్ల కూడ చిక్కులకు, వేదనకు, క్షోభకు గురి అయింది. అవుతూ వుంది కూడా. అందుకేనేమో “స్త్రీకి స్త్రీయే శత్రువు” అన్నారు.
‘పితారక్షతి కౌమారే, భర్తా రక్షతి యవ్వనే, సుతా రక్షతి వార్ధక్కే, న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి’ అంటూ కొందరు స్త్రీకి స్వాతంత్య్రమే లేదు పొమ్మన్నారు. మరికొందరు మహానుభావులు స్త్రీని మోక్ష సాధనకు ఆటంకమని ఘోషించారు.
ఇస్లాం ఆవిర్భావానికి పూర్వం అనాగరిక అరబ్బులు స్త్రీని భోగ వస్తువుగా, కోర్కెలు తీర్చుకునే యంత్రంగా చేసుకున్నారు.
ఇస్లాం ఈ విధమయిన రెండు అతివాద భావాలను ఖండిస్తూ ఆమె శారీరక, మానసిక స్వభావానికి అతికినట్లుగా సరిపోయే సమతౌల్యంతో కూడిన కార్యక్షేత్రాన్ని సూచించింది. “తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది” అంటూ స్త్రీకి మహోన్నత స్థానం కల్పించింది. స్వాతంత్ర్యం, ఆస్తిహక్కు, సమాజంలో సమున్నత స్థానం ఇస్లాం ద్వారా మాత్రమే స్త్రీకి లభించాయి. ఇస్లాం స్త్రీకి కల్పించిన స్థానం ఎటువంటిదో పరిశీలిస్తే వాస్తవం వెల్లడవుతుంది. ఆధారాల్లేని విమర్శలతో, పసలేని వాదాలతో వ్యాఖ్యలు చేయడంలో ఔచిత్యం ఏముంటుంది?
హజ్రత్ ఆయిషా జీవితం సుఖ, దుఃఖాల సంభరితం. జీవితంలో ఎన్నో. మార్పుల్ని, కష్టాల్ని, ఎదుర్కొన్నారా మహావనిత. భర్తతో కాపురం, విరహం, ఇల్లు చక్కబెట్టుకోవడం, సవతుల ఈర్ష్యా అసూయల్ని ఆమె చవిచూశారు. వైధవ్యం పొందారు. అనాధ అయ్యారు. ఉత్థాన పతనాల తెరల వెనుక జరిగిన రాజకీయాలను అవలోకనం చేసుకున్నారు. వైముఖ్య ధోరణులను ఎదుర్కొన్నారు. ఒకటేమిటి జీవితంలోని అన్ని పరిస్థితుల్నీ అధిగమించడంలో ఆయా సందర్భాలలో ఆమె వ్యవహరణా సరళి నేటి ముస్లిం స్త్రీకి మార్గదర్శకం. నైతిక, విజ్ఞాన ఆచరణాత్మక ఆణిముత్యాలతో సుసంపన్నమైన ఆమె పవిత్ర జీవితం చదవదగ్గదీ, చదివి తీరవలసినదీను.
ఇందులో మహిళాలోకానికి మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. బాల్యం నుండే విద్యా విజ్ఞాన విషయాలను ఆకళింపు చేసుకోవడం, భర్త ఆశయాలకు అనుగుణంగా తనను తాను మలచుకోవడం, నిస్సంతు అయినప్పటికీ అనాధ పిల్లల్ని పెంచి, వారికి బోధనా శిక్షణలు గరపడంతోపాటు, వారి వివాహాలు చేయడం, భర్త వియోగానంతరం ఆయన నడిపిన ఉద్యమాన్ని కొనసాగించడం, ధార్మిక తీర్పులు ఇవ్వడం, ఇంకా చాలా చాలా విషయాలు ఈనాటికీ ఆదర్శనీయములే. ఒక మహిళ ఇలా బహుముఖ ప్రజ్ఞ కనబర్చడం చూస్తుంటే “ముదితల్ నేర్వగరాని విద్య కలదే!” అనిపిస్తుంది.
పాఠకులకు, ముఖ్యంగా మహిళలకు ఈ పుస్తకం అభిమానపాత్రం కావాలని కాంక్షించడంలో విడ్డూరమేముందీ..!? మజ్లిసె ఇషాఅతె ఇస్లాం తెలుగు ప్రచురణా విభాగం స్థాపకులైన మౌలానా హాఫిజ్ ముహమ్మద్ తఖీయుద్దీన్ గారి ప్రోద్బలం, సోదరులు ముహమ్మద్ అజీజు రహ్మాన్ గారి ప్రోత్సాహం… అన్నింటికీ మించి అల్లాహ్ తోడ్పాటు వల్ల ఇది పుస్తక రూపం దాల్చింది. ఇందలి లోపాలను పాఠకులు దృష్టికి తెస్తే మలిసారి ముద్రణలో సరిదిద్దుకోగలము. ఈ చిరు కృషిని కారుణ్య ప్రభువు స్వీకరించాలని వేడుకుంటూ..
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఉజైర్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – “మరణించిన 100 సంవత్సరాలకు మళ్ళీ బతికిన వ్యక్తి” https://youtu.be/D1oAzBvsApU [32 నిముషాలు] వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో వక్త, బనీ ఇస్రాయీల్ ప్రవక్తలలో ఒకరైన ఉజైర్ (అలైహిస్సలాం) గారి అద్భుతమైన జీవిత చరిత్రను వివరించారు. ముఖ్యంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు మరణం ఇచ్చి 100 సంవత్సరాల తర్వాత తిరిగి ఎలా బ్రతికించారో, ఆ సమయంలో జరిగిన చారిత్రక పరిణామాలు (బాబిలోనియా రాజు నెబుకద్ నెజర్ ద్వారా జెరూసలేం నాశనం, తౌరాత్ గ్రంథం దహనం, యూదుల బానిసత్వం మరియు విడుదల) గురించి చర్చించారు. ఉజైర్ (అలైహిస్సలాం) నాశనమైన నగరాన్ని చూసి ఆశ్చర్యపోవడం, అల్లాహ్ ఆయనను 100 సంవత్సరాలు మృతునిగా ఉంచి తిరిగి లేపడం, ఆయన ఆహారం చెడిపోకుండా ఉండటం మరియు గాడిద ఎముకలు తిరిగి ప్రాణం పోసుకోవడం వంటి దృష్టాంతాలను ఖురాన్ వాక్యాల (సూర బఖరా 2:259) ద్వారా వివరించారు. అలాగే, యూదులు ఉజైర్ (అలైహిస్సలాం) ను దైవ కుమారుడిగా భావించి చేసిన మార్గభ్రష్టత్వాన్ని ఖండిస్తూ (సూర తౌబా 9:30), మరణానంతర జీవితం, పునరుత్థానం, మరియు అల్లాహ్ శక్తిసామర్థ్యాలపై విశ్వాసం ఉంచాలని ఈ ప్రసంగం ద్వారా బోధించారు.
الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ [అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్]
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్.
సోదర సోదరీమణులారా! మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
ప్రవక్త ఉజైర్ (అలైహిస్సలాం) పరిచయం
ఈనాటి ప్రసంగంలో మనము ఒక ప్రవక్త గురించి తెలుసుకోబోతున్నాము. ఆయన ప్రత్యేకత ఏమిటంటే, ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణం ఇచ్చి వంద సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రతికించాడు. ఎవరండీ ఆయన? ఆశ్చర్యకరంగా ఉంది కదా వింటూ ఉంటే. ఆయన మరెవరో కాదు ఆయనే ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం వారు.
ఉజైర్ అలైహిస్సలాం వారి ప్రస్తావన ఖురాన్ గ్రంథంలో రెండు సూరాలలో వచ్చి ఉంది. ఒకటి సూర బఖరా రెండవ సూరా, రెండవది సూర తౌబా తొమ్మిదవ సూరా. ఈ రెండు సూరాలలో ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం వారి ప్రస్తావన వచ్చి ఉంది. ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం బనీ ఇస్రాయీల్ ప్రజల వద్దకు పంపించబడిన ప్రవక్తలలో ఒక ప్రవక్త.
బనీ ఇస్రాయీల్ చారిత్రక నేపథ్యం
ఆయన బనీ ఇస్రాయీల్ ప్రజల వద్దకు పంపించబడే సరికి, బనీ ఇస్రాయీల్ ప్రజల్లోని అధిక శాతం ప్రజలు కనుమరుగైపోయారు లేదా బానిసత్వానికి గురైపోయారు. అల్-ఖుద్స్ నగరంలో, పాలస్తీనా దేశంలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే బనీ ఇస్రాయీల్ వారు మిగిలి ఉన్నారు. అంతే కాదండీ, వారు నివసిస్తున్న పట్టణము కూడా నేలమట్టం అయిపోయింది. వారు ఎంతగానో పవిత్రంగా భావించే బైతుల్ మఖ్దిస్ కూడా నేలమట్టం అయిపోయింది. అలా ఎందుకు జరిగిందంటే, దాన్ని తెలుసుకోవడానికి బనీ ఇస్రాయీల్ వారి క్లుప్తమైన చరిత్ర మనము దృష్టిలో ఉంచుకోవాలి.
సులైమాన్ అలైహిస్సలాం వారి మరణానంతరం పరిస్థితులన్నీ తలకిందులైపోయాయి. సులైమాన్ అలైహిస్సలాం వారి సంతానంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయం కలిగింది. వారు ఎంతో పటిష్టంగా ఉన్న వారి సామ్రాజ్యాన్ని రెండు ముక్కలు చేసుకున్నారు. ఒక తమ్ముడు సగ భాగాన్ని, మరో తమ్ముడు సగ భాగాన్ని పంచుకొని, ఒక భాగానికి ‘ఇస్రాయీల్ రాజ్యం‘ అని పేరు పెట్టుకున్నారు, దానికి సామరియా రాజధాని అయ్యింది. మరో భాగానికి ‘యహూదా రాజ్యం’ అని పేరు పెట్టుకున్నారు, దానికి యెరూషలేము రాజధాని అయ్యింది.
అయితే ఆ తర్వాత ఇస్రాయీల్ లో ఉన్న బనీ ఇస్రాయీల్ ప్రజలు తొందరగా మార్గభ్రష్టత్వానికి గురైపోయారు. విగ్రహారాధనకు పాల్పడ్డారు, ‘బాల్‘ అనే విగ్రహాన్ని ఆరాధించారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడికి ప్రవక్తల్ని పంపించాడు. హిజ్కీల్ అలైహిస్సలాం వారు వచ్చారు, ఇలియాస్ అలైహిస్సలాం వారు వచ్చారు, అల్-యస అలైహిస్సలాం వారు వచ్చారు. ప్రవక్తలు వచ్చి వారికి చక్కదిద్దేటట్టు ప్రయత్నం చేసినా, దైవ వాక్యాలు బోధించినా, అల్లాహ్ వైపు పిలిచినా, వారు మాత్రము పాపాలను వదలలేదు, విగ్రహారాధనను కూడా వదలలేదు, మార్గభ్రష్టులుగానే మిగిలిపోయారు.
చివరికి ఏమైందంటే, పక్కనే ఉంటున్న ఆషూరీయులు వచ్చి ఇస్రాయీల్ సామ్రాజ్యం మీద యుద్ధం ప్రకటించి ఆ రాజ్యాన్ని వశపరుచుకున్నారు. ఆ ప్రకారంగా బనీ ఇస్రాయీల్ ప్రజలు రెండు భాగాలుగా విడిపోయి ఉన్న ఆ రెండు రాజ్యాలలో నుంచి ఒక రాజ్యము ఆషూరీయుల చేతికి వెళ్ళిపోయింది.
బైతుల్ మఖ్దిస్ విధ్వంసం
అయితే ఆశూరీయులు మిగిలిన రెండవ భూభాగాన్ని కూడా ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేసినా వారి పప్పులు ఉడకలేదు. ఎందుకంటే ఇక్కడ దైవభీతి మిగిలి ఉండింది కాబట్టి. కానీ కొద్ది రోజులు గడిచాక ఇక్కడ పరిస్థితులు కూడా మళ్ళీ మారిపోయాయి. ఇక్కడ ప్రజలు కూడా మార్గభ్రష్టత్వానికి గురైపోయారు, పాపాల్లో మునిగిపోయారు. అలాంటప్పుడు ఇరాక్ దేశము నుండి, బాబిలోనియా నుండి నెబుకద్ నెజరు (అరబ్బీలో ‘బుఖ్తె నసర్‘) అనే రాజు సైన్యాన్ని తీసుకొని వచ్చి యహూదా దేశం మీద, రాజ్యం మీద దాడి చేశాడు. యుద్ధం ప్రకటించి బనీ ఇస్రాయీల్ వారిని ఊచకోత కోశాడు. అలాగే బనీ ఇస్రాయీల్ వారి ఆస్తుల్ని ధ్వంసం చేయటంతో పాటు, వారు ఎంతగానో పవిత్రంగా భావించే బైతుల్ మఖ్దిస్ ని కూడా నేలమట్టం చేసేశాడు. వారు ఎంతో గౌరవంగా చదువుకునే, ఆచరించుకునే పవిత్రమైన గ్రంథం తౌరాత్ ని కూడా అతను కాల్చేశాడు.
బనీ ఇస్రాయీల్ ప్రజల్ని అయితే ముందు చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా హతమార్చాడు. తర్వాత ఎవరెవరైతే పనికొస్తారు అని అతను భావించాడో వారిని బానిసలుగా ఇరాక్ దేశానికి, బాబిలోనియా పట్టణానికి తీసుకెళ్లిపోయాడు. ఎవరితో అయితే నాకు అవసరం లేదులే వీళ్ళతో అని అనుకున్నాడో, అలాంటి వారిని మాత్రము అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే మిత్రులారా! ఆ ప్రకారంగా బనీ ఇస్రాయీల్ ప్రజలు, ముందు ఇస్రాయీల్ సామ్రాజ్యాన్ని ఆషూరీయుల చేతికి అప్పగించాల్సి వచ్చింది, యహూదా సామ్రాజ్యాన్ని నెబుకద్ నెజరు రాజుకి అప్పగించాల్సి వచ్చింది
ఆ ప్రకారంగా వారి రెండు రాజ్యాలు కూడా రెండు వేరు వేరు శత్రువులు లాక్కున్నారు. అలాగే జయించి వశపరచుకున్నారు. మళ్ళీ బనీ ఇస్రాయీల్ ప్రజలు పరాభవానికి గురి అయ్యి ఉన్నారు, బానిసలుగా మార్చబడి ఉన్నారు. ఎంతో కొంతమంది మాత్రమే అక్కడ మిగిలిపోయి ఉన్నారు. అలాంటి పరిస్థితిలో, పట్టణము కూల్చబడి ఉంది, పుణ్యక్షేత్రము కూల్చబడి ఉంది, ప్రజలు కూడా చెల్లాచెదురైపోయి ఉన్నారు, బానిసలుగా మార్చబడి ఉన్నారు, ఎంతో కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు. అలాంటి స్థితిలో ఉజైర్ అలైహిస్సలాం వారు వచ్చారు.
వంద సంవత్సరాల మరణం యొక్క సంఘటన
ఆయన మామూలుగా పొలం వద్ద పని కోసము గాడిద మీద కూర్చొని బయలుదేరి వెళ్లారు. వెళ్లి అక్కడ పొలం పనులన్నీ ముగించుకొని కొన్ని ద్రాక్ష పండ్లు, అలాగే అత్తి పండ్లు తీసుకొని మళ్ళీ అదే గాడిద మీద కూర్చొని తిరిగి ఇంటికి పయనమయ్యారు. వస్తూ వస్తూ ఒకచోట లోయలోకి ప్రవేశించి కాసేపు నీడలో సేద తీరుదాము అని ఒక గోడ నీడలో లేదా ఒక చెట్టు నీడలో ఆయన కూర్చోవడానికి ప్రయత్నిస్తూ, ఆయన వద్ద ఉన్న గాడిదను ఒకచోట కట్టేశారు.
తర్వాత నీడలో కూర్చొని ఆయన వద్ద ఉన్న ద్రాక్ష పండ్లను ముందుగా ఒక పాత్రలో పిండారు. ఆ ద్రాక్ష రసంలో కొన్ని రొట్టె ముక్కలు నాన్చడానికి ఉంచారు. ఆ రొట్టెలు నానే వరకు ఆయన గోడను లేదా చెట్టుని అలా వీపుతో ఆనుకొని, కంటి ముందర కనిపిస్తున్న దృశ్యాలను చూడసాగారు. ముందర పాడుబడిపోయిన పట్టణము, కూల్చబడిన పట్టణము, కూల్చబడిన పుణ్యక్షేత్రము అవి దర్శనమిస్తున్నాయి. అవి చూస్తూ ఉంటే, ఊహించని రీతిలో, అనుకోకుండా ఆయన ప్రమేయం లేకుండానే ఆయన నోటి నుండి ఒక మాట వచ్చింది. ఏంటి ఆ మాట అంటే:
أَنَّىٰ يُحْيِي هَٰذِهِ اللَّهُ بَعْدَ مَوْتِهَا [అన్నా యుహ్ యీ హాజిహిల్లాహు బాద మౌతిహా] దీని చావు తర్వాత అల్లాహ్ తిరిగి దీనికి ఎలా ప్రాణం పోస్తాడు? (ఖుర్ఆన్, 2:259)
అంటే ఈ నగరం మొత్తం పాడుబడిపోయింది కదా, మళ్ళీ ప్రజల జీవనంతో ఈ నగరం కళకళలాడాలంటే ఇది సాధ్యమవుతుందా? అని ఆశ్చర్యం వ్యక్తపరిచారు. అనుమానం వ్యక్తపరచలేదు, ఇది ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఉజైర్ అలైహిస్సలాం వారు గొప్ప దైవభీతిపరులు, గ్రంథ జ్ఞానము కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి అల్లాహ్ తో ఇది సాధ్యమేనా అని అనుమానము, సందేహము ఎప్పుడూ వ్యక్తపరచరు. అల్లాహ్ శక్తి మీద ఆయనకు పూర్తి నమ్మకం ఉంది. ఆశ్చర్యం వ్యక్తపరిచారు – ఇది ఎప్పుడు అవుతుంది? ఎలా అవుతుంది? ఇప్పట్లో ఇది అయ్యే పనేనా? అనేటట్టుగా ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే ఆయన ఏ స్థితిలో అయితే నీడలో అలా వీపు ఆంచుకొని కూర్చొని ఉన్నారో, అదే స్థితిలో ఆయనకు మరణం ఇచ్చేశాడు. ఎన్ని సంవత్సరాల వరకు ఆయన అదే స్థితిలో ఉన్నారు అంటే, వంద సంవత్సరాల వరకు ఆయన అదే స్థితిలో ఉన్నారు.
فَأَمَاتَهُ اللَّهُ مِائَةَ عَامٍ [ఫ అమాతహుల్లాహు మిఅత ఆమిన్] “అల్లాహ్ అతన్ని నూరేళ్ళ వరకు మరణ స్థితిలో ఉంచాడు.” (ఖుర్ఆన్, 2:259)
ఖురాన్ లో నూరేళ్ళ వరకు ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అదే స్థితిలో ఉంచాడు అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది.
యూదుల విముక్తి మరియు జెరూసలేం పునర్నిర్మాణం
అయితే 100 సంవత్సరాలు ఆయన అదే స్థితిలో ఉన్నారు కదా, మరి ఈ 100 సంవత్సరాలలో ఏమి జరిగిందంటే చాలా ముఖ్యమైన విషయాలు చోటు చేసుకున్నాయి. ఏమి జరిగిందంటే, నెబుకద్ నెజరు బనీ ఇస్రాయీల్ వారి మీద దాడి చేసి, పుణ్యక్షేత్రం కూల్చేసి, గ్రంథము కాల్చేసి, బనీ ఇస్రాయీల్ వారిని పురుషుల్ని అలాగే మహిళల్ని బానిసలుగా మార్చి ఇరాక్ దేశానికి, బాబిలోనియా పట్టణానికి పట్టుకెళ్లిపోయాడు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే…
పక్కనే ఉన్న పార్షియా దేశం (ఇరాన్ దేశం అని మనం అంటున్నాం కదా), ఆ పార్షియా దేశానికి చెందిన రాజు ఇరాక్ దేశం మీద యుద్ధం ప్రకటించాడు. యుద్ధం చేసి ఇరాక్ దేశాన్ని జయించేశాడు. ఇరాక్ దేశము ఇప్పుడు పార్షియా దేశ రాజు చేతికి వచ్చేసింది. ఆ పార్షియా దేశము (అనగా ఇరాన్ దేశపు రాజు) ఇరాక్ దేశాన్ని కూడా జయించిన తర్వాత, అక్కడ బానిసలుగా నివసిస్తున్న యూదులను స్వతంత్రులుగా చేసేసి, “మీరు మీ సొంతూరికి, అనగా పాలస్తీనా దేశానికి, అల్-ఖుద్స్ నగరానికి తిరిగి వెళ్లిపోండి” అని అనుమతి ఇచ్చేశాడు.
చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము 50-60 సంవత్సరాల తర్వాత ఆ రాజు ద్వారా బనీ ఇస్రాయీల్ ప్రజలకి మళ్ళీ బానిసత్వం నుండి స్వతంత్రం లభించింది. అప్పుడు వారందరూ కూడా స్వతంత్రులై బాబిలోనియా పట్టణాన్ని వదిలేసి, మళ్ళీ పాలస్తీనాలో ఉన్న అల్-ఖుద్స్ నగరానికి పయనమయ్యారు. అయితే ఈ 50-60 సంవత్సరాలలో వారు భాష మర్చిపోయారు, సంప్రదాయాలు మర్చిపోయారు, ధర్మ ఆదేశాలు కూడా చాలా శాతము మర్చిపోయారు. సరే ఏది ఏమైనప్పటికీ వాళ్ళు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. వచ్చి అక్కడ మళ్ళీ నివాసం ఏర్పరచుకున్నారు. ఆ ప్రకారంగా కూల్చివేయబడిన ఆ పట్టణము, నగరము మళ్ళీ ప్రజల నివాసంతో కళకళలాడటం ప్రారంభించింది. ఇలా వంద సంవత్సరాల లోపు జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు చోటు చేసుకున్న తర్వాత, అప్పుడు రెండవసారి మళ్ళీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉజైర్ అలైహిస్సలాం వారికి మళ్ళీ బ్రతికించాడు.
చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము ఆయన మరణించే సమయానికి ఆయన వయస్సు 40 సంవత్సరాలు ఉండింది. 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రతికించబడుతున్నప్పుడు కూడా ఆయన 40 సంవత్సరాల వయసులో ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా, అదే శక్తితో, అదే శరీరంతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనను మళ్ళీ బ్రతికించాడు.
దూత రాక మరియు గాడిద పునరుత్థానం
దూత వచ్చాడు. దూత వచ్చి ఆయనను లేపి:
قَالَ كَمْ لَبِثْتَ [ఖాల కమ్ లబిస్త] “నీవు ఎంత కాలం ఈ స్థితిలో ఉన్నావు?” అని అడిగాడు. (ఖుర్ఆన్, 2:259)
ఉజైర్ అలైహిస్సలాం వారు లేచి ముందు అటూ ఇటూ చూశారు. చూస్తే గాడిద కనిపించట్లేదు. గాడిద బంధించిన చోట పాడుబడిపోయిన ఎముకలు కనిపిస్తున్నాయి. 100 సంవత్సరాలు గడిచిన విషయం ఆయనకు తెలియదు. ఈ 100 సంవత్సరాలలో గాడిద చనిపోయింది, ఎముకలు కూడా పాడుబడిపోయాయి, కొన్ని పాడుబడిన ఎముకలు కనిపిస్తున్నాయి. పక్కనే ఉంచబడిన ద్రాక్ష రసంలో ఉంచబడిన రొట్టె ముక్కలు, అవి మాత్రము తాజాగా అలాగే ఉన్నాయి, ఫ్రెష్ గా ఉన్నాయి. ఆహారాన్ని చూస్తూ ఉంటే, ఇప్పుడే కొద్దిసేపు ఏమో నేను అలా పడుకొని లేచానేమో అనిపిస్తూ ఉంది. గాడిదను చూస్తూ ఉంటే అసలు గాడిద కనిపించట్లేదు. కాబట్టి వెంటనే ఆయన ఏమన్నారంటే:
لَبِثْتُ يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ [లబిస్తు యౌమన్ ఔ బాద యౌమ్] “ఒక రోజు లేదా ఒక రోజులో కొంత భాగం మాత్రమే నేను ఈ స్థితిలో ఉన్నాను” అని చెప్పారు. (ఖుర్ఆన్, 2:259)
ఆహారాన్ని చూసి ఆయన ఆ విధంగా అనుమానించారు. అయితే దూత వచ్చి:
بَل لَّبِثْتَ مِائَةَ عَامٍ [బల్ లబిస్త మిఅత ఆమ్] “కాదు, నీవు ఈ స్థితిలో వంద సంవత్సరాలు ఉన్నావయ్యా” (ఖుర్ఆన్, 2:259)
అని చెప్పి, “చూడండి మీ గాడిద మరణించి ఎముకలు ఎముకలైపోయింది. మీ కళ్ళ ముందరే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దానిని మళ్ళీ బ్రతికిస్తాడు చూడండి” అని చెప్పగానే, అల్లాహ్ నామంతో పిలవగానే ముందు ఎముకలు తయారయ్యాయి. ఎముకలు జోడించబడ్డాయి. ఆ ఎముకల మీద మాంసము జోడించబడింది. ఆ తర్వాత దానికి ప్రాణము వేయడం జరిగింది. ఆ ప్రకారంగా ఉజైర్ అలైహిస్సలాం వారి కళ్ళ ముందరే ఎముకలుగా మారిపోయిన ఆ గాడిద మళ్ళీ జీవించింది. అప్పుడు ఉజైర్ అలైహిస్సలాం వారు అదంతా కళ్ళారా చూసి వెంటనే ఈ విధంగా పలికారు:
قَالَ أَعْلَمُ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ [ఖాల ఆలము అన్నల్లాహ అలా కుల్లి షైఇన్ ఖదీర్] “అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడని నాకు తెలుసు” అని ఉజైర్ అన్నారు. (ఖుర్ఆన్, 2:259)
ఈ ప్రస్తావన మొత్తము ఖురాన్ గ్రంథము రెండవ అధ్యాయము 259వ వాక్యంలో వివరంగా తెలుపబడి ఉంది.
కుటుంబంతో తిరిగి కలయిక
సరే, 100 సంవత్సరాల తర్వాత ఆయన బ్రతికారు, పట్టణం ప్రజలతో కళకళలాడుతూ ఉంది, పట్టణం పూర్తిగా మళ్ళీ నిర్మించబడి ఉంది, పుణ్యక్షేత్రము కూడా మళ్ళీ నిర్మించబడి ఉంది. గాడిద మీద కూర్చొని ఆయన పట్టణానికి వెళ్లారు.
పట్టణానికి వెళ్ళినప్పుడు చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, ఆయన మరణించేటప్పుడు ఆయన ఇంటిలో ఒక సేవకురాలు ఉండేది, అప్పుడు ఆవిడ వయస్సు 20 సంవత్సరాలు. ఇప్పుడు ఈయన 100 సంవత్సరాల తర్వాత వెళ్తున్నారంటే ఆవిడ వయస్సు ఎంత అయి ఉంటుందండి? 20 + 100, కలిపితే 120 సంవత్సరాలకు చేరుకొని ఉంది. ఆవిడ పూర్తిగా ముసలావిడగా మారిపోయి, వృద్ధాప్యానికి గురయ్యి, కంటిచూపు దూరమైపోయింది, కాళ్ళు కూడా పడిపోయి ఉన్నాయి. ఆవిడ ఒక మంచానికే పరిమితమైపోయి ఉంది.
ఆవిడ వద్దకు ముందు ఉజైర్ అలైహిస్సలాం వారు వెళ్ళారు. వెళ్లి “అమ్మా నేను ఉజైర్ ని” అంటే, ‘ఉజైర్’ అన్న పేరు వినగానే ఆవిడ బోరున ఏడ్చేసింది. “ఎన్నో సంవత్సరాల క్రితము మా యజమాని ఉండేవారు” అని ఏడుస్తూ ఉంటే, “అమ్మా నేనే మీ యజమాని ఉజైర్ ని” అని చెప్పారు. అప్పుడు ఆ మహిళ, “అరె! 100 సంవత్సరాల తర్వాత వచ్చి మీరు నా యజమాని అంటున్నారు, ఎలాగండి నేను నమ్మేది? ఉజైర్ గొప్ప భక్తుడు. ఆయన ప్రార్థన చేస్తే, దుఆ చేస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తప్పనిసరిగా ఆమోదించేవాడు. మీరు ఉజైర్ అయితే, నాకు కంటిచూపు మళ్ళీ రావాలని, అలాగే చచ్చుబడిపోయిన నా కాళ్ళు మళ్ళీ ఆరోగ్యంగా మారాలని దుఆ చేయండి” అని కోరారు.
ఉజైర్ అలైహిస్సలాం వారు దుఆ చేశారు. దుఆ చేయగా ఆవిడకు కంటిచూపు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తిరిగి ఇచ్చేశాడు, ఆవిడ కాళ్ళు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ నయం చేసేశాడు. అప్పుడు ఆవిడ లేచి, ఉజైర్ అలైహిస్సలాం వారిని చూసి, చెయ్యి పట్టుకొని, “నేను సాక్ష్యం ఇస్తున్నాను ఈయనే ఉజైర్ అలైహిస్సలాం” అని సాక్ష్యం ఇచ్చారు.
తర్వాత “రండయ్యా మీ ఇంటిని చూపిస్తాను, మీ కుటుంబీకుల్ని చూపిస్తాను” అని ఉజైర్ అలైహిస్సలాం వారిని వెంటబెట్టుకొని ఉజైర్ అలైహిస్సలాం వారి ఇంటికి వెళితే, అప్పుడు కుటుంబ సభ్యులలో ఉజైర్ అలైహిస్సలాం వారి కుమారులు ఉన్నారు. వారి వయస్సు కూడా 100 దాటిపోతూ ఉంది. ఉజైర్ అలైహిస్సలాం వారిని ఇంటి బయట నిలబెట్టి, ఆవిడ ఇంటిలోనికి ప్రవేశించి ఉజైర్ అలైహిస్సలాం వారి కుమారుల వద్దకు వెళ్లి, “మీ నాన్నగారు వచ్చారు” అంటే వారందరూ షాక్ అయ్యారు. అవాక్కయిపోయారు. “అదేమిటి 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో కనుమరుగైపోయిన మా తండ్రి ఇప్పుడు తిరిగి వచ్చారా ఇంటికి?” అని వారు షాక్ అయిపోతూ ఉంటే, “అవునండీ, చూడండి నాకు కంటిచూపు ఉండేది కాదు, నాకు కాళ్ళు కూడా చచ్చుబడిపోయి ఉండేవి. కానీ ఆయన వచ్చి ప్రార్థన చేయగా నాకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కంటిచూపు ఇచ్చాడు, కాళ్ళను నయం చేశాడు. నేను మళ్ళీ ఆరోగ్యంగా తిరగగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను. చూడండి బయట ఉన్నారు” అని చెప్పగానే, వచ్చి ఉజైర్ అలైహిస్సలాం వారిని మళ్ళీ ఇంట్లోకి ఆహ్వానించగా, ముందుగా కుమారులు ఆశ్చర్యపడ్డారు.
సందేహం వ్యక్తపరుస్తూ ఒక కుమారుడు ఏమన్నాడంటే, “చూడండి మా నాన్నగారికి భుజం పక్కన మచ్చ లాంటి ఒక గుర్తు ఉండేది, అది ఉందేమో చూడండి” అన్నారు. ఉజైర్ అలైహిస్సలాం వారు బట్టలు కొంచెం పక్కకు జరిపి చూపియగా, అక్కడ నిజంగానే ఆ మచ్చ లాంటి గుర్తు కనిపించింది. అప్పుడు కుటుంబ సభ్యులు ఉజైర్ అలైహిస్సలాం వారిని “ఈయనే మా తండ్రి” అని గ్రహించారు.
తౌరాత్ గ్రంథం పునరుద్ధరణ
అయితే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము ఉజైర్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 40 సంవత్సరాల వ్యక్తి లాగే సిద్ధం చేశాడు. వారి కుమారులు మాత్రము 100 సంవత్సరాలు చేరుకున్న వృద్ధుల్లా కనిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఇలా సంఘటన జరిగిన తర్వాత ఉజైర్ అలైహిస్సలాం వారు మళ్ళీ నగరంలోకి వచ్చారు, నగర ప్రజల్ని ప్రోగు చేశారు. ప్రోగు చేసి “ఎవరెవరికి తౌరాత్ గ్రంథంలోని వాక్యాలు కంఠస్థమై ఉన్నాయో, ఎన్ని కంఠస్థమై ఉంటే వారు వచ్చి నాకు వినిపించండి” అని పిలుపునిచ్చారు. ఎవరెవరికి ఎన్ని వాక్యాలు కంఠస్థం చేయబడి ఉన్నాయో వారందరూ వచ్చి ఉజైర్ అలైహిస్సలాం వారికి వారు కంఠస్థం చేసిన ఆ తౌరాత్ గ్రంథంలోని దైవ వాక్యాలు వినిపించారు.
అప్పుడు ఉజైర్ అలైహిస్సలాం వారు ఒక చెట్టు నీడలో కూర్చొని, ఇతర వ్యక్తుల నోట విన్న వాక్యాలు, ఆయన స్వయంగా కంఠస్థం చేసిన వాక్యాలు అన్నీ కూడా మళ్ళీ రచించారు. ఆ ప్రకారంగా మళ్ళీ తౌరాత్ గ్రంథం (నెబుకద్ నెజరు రాజు దాన్ని కాల్చేసి వెళ్లిపోయాడని చెప్పాము కదా), ఆ కాలిపోయి కనుమరుగైపోయిన తౌరాత్ గ్రంథంలోని వాక్యాలను, ఎవరెవరు ఎంత కంఠస్థం చేసి ఉన్నారో అన్ని వాక్యాలు మళ్ళీ తిరిగి ఉజైర్ అలైహిస్సలాం వారు రచించారు. రచించి ప్రజలకు గ్రంథము ఇవ్వడంతో పాటు ఆ గ్రంథంలోని వాక్యాలు, వాటి సారాంశము ప్రజలకు బోధించడం ప్రారంభించారు.
యూదుల మార్గభ్రష్టత్వం మరియు దైవ కుమారుని వాదన
ఆ తర్వాత ఉజైర్ అలైహిస్సలాం వారు ఎన్ని సంవత్సరాలు జీవించారు అంటే, చరిత్రలో ప్రామాణికమైన ఆధారాలు మనకు ఎక్కడా దొరకలేదు. ఆయన మాత్రము మరణించారు. ఎప్పుడు మరణించారు? ఎన్ని సంవత్సరాల వయసులో మరణించారు? ఏ విధంగా ఆయన మరణం సంభవించింది? అన్న వివరాలు మాత్రము ప్రామాణికమైన ఆధారాలలో మనకు ఎక్కడా దొరకలేదు. అయితే ఆయన సమాధి మాత్రము ‘డమస్కస్’ నగరంలో నేటికీ ఉంది అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.
ఆయన మరణానంతరం చోటు చేసుకున్న పరిస్థితుల్ని మనం చూసినట్లయితే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం, ఉజైర్ అలైహిస్సలాం వారు జీవించినన్ని రోజులు ప్రజలు ఆయనను ఒక బోధకునిగా గౌరవించారు. ఆయన మరణించిన తర్వాత… ఆయన 100 సంవత్సరాలు మరణించి మళ్ళీ జీవించారన్న ఒక అభిప్రాయం ఉండేది, ఆయన దుఆతో ప్రజల సమస్యలు తీరాయని మరొక అభిప్రాయం ఉండేది, అలాగే ఆయన గ్రంథాన్ని రచించి ప్రజలకు వినిపించారు, ఇచ్చారు అనే మరో అభిప్రాయం ఉండింది. ఇలా అనేక అభిప్రాయాల కారణంగా ఉజైర్ అలైహిస్సలాం వారి గౌరవంలో బనీ ఇస్రాయీల్ ప్రజలు హద్దు మీరిపోయారు. ఆ గౌరవంలో, అభిమానంలో ఏకంగా ఉజైర్ అలైహిస్సలాం వారిని “దైవ కుమారుడు” అని చెప్పటం ప్రారంభించారు. తర్వాత అదే వారి విశ్వాసంగా మారిపోయింది, “ఉజైర్ దైవ కుమారుడు” అని నమ్మటం ప్రారంభించారు. వారి ఈ నమ్మకం సరికాదు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలోని తొమ్మిదవ అధ్యాయం, 30వ వాక్యంలో స్పష్టంగా ఖండించి ఉన్నాడు.
“ఉజైర్ అల్లాహ్ కుమారుడు” అని యూదులు అంటున్నారు. “మసీహ్ (క్రీస్తు) అల్లాహ్ కుమారుడు” అని క్రైస్తవులు అంటున్నారు. ఇవి వారి నోటి మాటలు మాత్రమే. తమ పూర్వీకులలోని అవిశ్వాసులు చెప్పిన మాటలనే వీళ్ళు అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నాశనం చేయుగాక! సత్యం నుండి వారెలా తిరిగిపోతున్నారో చూడండి. (ఖుర్ఆన్, 9:30)
అంటే ఈ వాక్యాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారు నమ్ముతున్న నమ్మకాన్ని ఖండిస్తూ, ఇది నిజము కాదు, వారు కల్పించుకున్న కల్పితాలు మాత్రమే, వారి నోటి మాటలు మాత్రమే అని స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు.
ఉజైర్ (అలైహిస్సలాం) మరియు చీమల సంఘటన (హదీసు ప్రస్తావన)
ఉజైర్ అలైహిస్సలాం వారి గురించి ఒక హదీసులో పరోక్షంగా ప్రస్తావన వచ్చి ఉంది. బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఒక హదీసు ఉందండి. ఆ హదీసు ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:
‘పూర్వము ఒక ప్రవక్త ఉండేవారు. ఆయన వెళుతూ ఉంటే ఒకచోట కూర్చున్నప్పుడు, ఆయనకు ఒక చీమ కరిచింది. చీమ కరిచినప్పుడు ఆయన కోపగించుకొని, కోపంతో చీమ పుట్టను త్రవ్వేసి, ఆ పుట్టలో ఉన్న చీమలన్నింటినీ దహనం చేసేశారు.వెంటనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ ప్రవక్త వద్దకు వహీ (దైవవాణి) పంపించాడు. ‘నీకు హాని కలిగించింది, నీకు కుట్టింది ఒక చీమ కదా. నీకు కోపం ఉంటే ఒక చీమను చంపుకోవాలి. కానీ, పూర్తి పుట్టలో ఉన్న చీమలన్నింటినీ దహనం చేసేయటము, కాల్చేయటం ఏమిటి?’ అని ఒక ఉల్లేఖనంలో ఉంది.
మరో ఉల్లేఖనంలో ఈ విధంగా తెలుపబడి ఉంది: ‘నీకు ఒక్క చీమ కుట్టిందన్న సాకుతో, నీవు ఆ పుట్టలో ఉన్న చీమలన్నింటినీ దహనం చేసేశావు. వాస్తవానికి ఆ సమూహము అల్లాహ్ ను స్మరించేది (తస్బీహ్ చేసేది). అల్లాహ్ ను స్మరించే ఒక సమూహాన్ని ఒక్క చీమ కుట్టిన కారణంగా నీవు దహనం చేశావేమిటి?’ అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆక్షేపించాడు.’
మరి ఎవరి గురించి ఇక్కడ ప్రస్తావన ఉంది అంటే ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు మరియు హసన్ బస్రీ రహిమహుల్లా వారు ఏమంటున్నారు అంటే, ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఆ ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం అని తెలియజేసి ఉన్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.
ఉజైర్ అలైహిస్సలాం ఏ కాలానికి చెందిన వారు అంటే చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, సులైమాన్ అలైహిస్సలాం మరియు ఈసా అలైహిస్సలాం వీరిద్దరి మధ్యలో వచ్చిన ప్రవక్త. అలాగే మరికొంతమంది ధార్మిక పండితులు ఏమంటున్నారు అంటే, ఉజైర్ అలైహిస్సలాం వారు ప్రవక్త కాదు, ఆయన గొప్ప భక్తుడు, గ్రంథ జ్ఞాని అని అంటున్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.
ఇది ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర. ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనము గ్రహించాల్సిన పాఠాలు ఏమిటి అనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకొని మాటను ముగిస్తాను.
పాఠాలు మరియు గుణపాఠాలు
1. అల్లాహ్ మృతులను తిరిగి బ్రతికించగలడు:
ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం గ్రహించాల్సిన మొదటి విషయం ఏమిటంటే, మృతులను మళ్ళీ బ్రతికించేవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అన్న విషయం ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనకు స్పష్టంగా తెలుపబడింది. ఉజైర్ అలైహిస్సలాం వారు 100 సంవత్సరాల కోసము మరణించి, 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ అల్లాహ్ ఆజ్ఞతో జీవించబడ్డారు, మళ్ళీ బ్రతికించబడ్డారు. చూసారా? మొదటిసారి ప్రాణం పోసిన ఆయన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, ఆయనకు 100 సంవత్సరాల కోసం మరణం ఇచ్చి, 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనకు బ్రతికించి ప్రాణం పోసి నిలబెట్టాడు. కాబట్టి మానవులను మళ్ళీ పుట్టించగల శక్తి అల్లాహ్ కు ఉంది అని ఈ ఉజైర్ అలైహిస్సలాం వారి ద్వారా మనకు స్పష్టం చేయబడింది.
ఖురాన్ గ్రంథం 36వ అధ్యాయం, 78-79 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు.
“కుళ్లి కృశించి పోయిన ఎముకలను ఎవడు బ్రతికిస్తాడు?” అని వాడు (మానవుడు) సవాలు విసురుతున్నాడు. వారికి సమాధానం ఇవ్వు, “వాటిని తొలిసారి సృష్టించినవాడే మలిసారి కూడా బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు.” (ఖుర్ఆన్, 36:78-79)
తొలిసారి పుట్టించిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మలిసారి కూడా పుట్టించగలుగుతాడు, ఆయనకు అలా చేయటం చాలా సులభం అని తెలుపబడటం జరిగింది. ఖురాన్ లో ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇబ్రహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ తో, “నీవు మరణించిన వారిని మళ్ళీ ఎలా బ్రతికిస్తావు?” అని అడిగినప్పుడు, పక్షుల్ని తీసుకొని వాటి ఎముకల్ని అటూ ఇటూ పడవేయ్యండి, తర్వాత అల్లాహ్ పేరుతో పిలవండి, అవి మళ్ళీ బ్రతికి వస్తాయి అని చెప్పగా, ఆయన అలాగే చేశారు. అల్లాహ్ పేరుతో పిలవగానే ఎముకలుగా మార్చబడిన ఆ పక్షులు మళ్ళీ పక్షుల్లాగా జీవించి ఎగురుకుంటూ ఆయన వద్దకు వచ్చాయి.
అలాగే హిజ్కీల్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో, ఇంచు మించు 35 వేల మంది లోయలో మరణించారు. ప్రవక్త కళ్ళ ముందరే మళ్ళీ వారు బ్రతికించబడ్డారు. అలాగే మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో, ఇంచు మించు 70 మంది బనీ ఇస్రాయీల్ తెగకు చెందిన నాయకులు పర్వతం మీద మరణించారు. తర్వాత మూసా అలైహిస్సలాం దుఆతో వాళ్ళు మళ్ళీ బ్రతికించబడ్డారు.
ఈ విధంగా ఖురాన్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణించిన వారు, మరణించిన తర్వాత మళ్ళీ లేపబడతారు అన్న కొన్ని ఉదాహరణలు తెలియజేసి ఉన్నాడు. అలాగే గుహవాసులు, ‘అస్ హాబుల్ కహఫ్’ అని మనం అంటూ ఉంటాం. వారిని కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముందు మరణం ప్రసాదించి, తర్వాత మళ్ళీ జీవించేలాగా చేశాడు. ఇలాంటి కొన్ని ఉదాహరణలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో తెలియజేసి ఉన్నాడు.
ఆ ఉదాహరణల ద్వారా మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణించిన వారిని మళ్ళీ లేపగలుగుతాడు అని స్పష్టంగా, ఉదహరించి మరీ నిజమైన ఆధారాలతో తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి విశ్వాసి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణించిన వారిని మళ్ళీ లేపగలుగుతాడు, మళ్ళీ బ్రతికించగలుగుతాడు అని నమ్మాలి, విశ్వసించాలి.
2. సమాజ సంస్కరణ బాధ్యత:
ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం గ్రహించాల్సిన మరొక విషయం, సమాజ సంస్కరణకు కృషి చేయాలి. ఉజైర్ అలైహిస్సలాం వారు రెండవసారి లేపబడినప్పుడు, ప్రజల వద్దకు వెళ్లి దైవ వాక్యాలు రచించి, ప్రజలకు అందజేయడంతో పాటు బోధించారు. సమాజాన్ని సంస్కరించారు, ప్రజలను సంస్కరించారు. కాబట్టి ప్రతి విశ్వాసి సమాజాన్ని సంస్కరించడానికి కృషి చేయాలి. చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సమాజమైన మనకు “ఉత్తమ సమాజం” అని బిరుదు ఇస్తూ, “మీరు మంచిని బోధిస్తారు, చెడును నిర్మూలిస్తారు” అని బాధ్యత ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి సమాజ సంస్కరణ కోసము కృషి చేయాలన్న విషయం ఇక్కడ మనము గుర్తు చేసుకోవాలి.
3. మరణానంతర జీవితం:
మరణానంతరం జీవితం ఉంది అన్న విషయం కూడా ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనకు తెలుపబడింది. ఉజైర్ అలైహిస్సలాం వారు మరణించారు, మళ్ళీ బ్రతికించబడ్డారు. అదే విధంగా పుట్టిన తర్వాత మరణించిన ప్రతి మనిషిని పరలోకంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ బ్రతికిస్తాడు. అక్కడ లెక్కింపు ఉంటుంది, చేసిన కర్మలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడ లెక్క తీసుకొని స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయిస్తాడు. మరణానంతర జీవితం ఉంది అని స్పష్టపరచడానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా ప్రజలకు కొన్ని ఉదాహరణలు ప్రపంచంలోనే చూపించి ఉన్నాడు. మరణించిన వాడు మరణించాడు, ఇక మట్టిలో కలిసిపోయాడు అంతే, ఆ తర్వాత మళ్ళీ జీవితం అనేది లేదు అని భ్రమించే వారికి, చూడండి మరణించిన వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ లేపుతాడు అని ఇక్కడ కొంతమందిని లేపి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చూపించి ఉన్నాడు కాబట్టి, ఆ ప్రకారంగా మరణానంతర మరొక జీవితం ఉంది అన్న విషయం ఇక్కడ తెలియజేయడం జరిగింది. ప్రతి విశ్వాసి ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి.
4. సృష్టి యావత్తు అల్లాహ్ ను స్తుతిస్తుంది:
అల్లాహ్ ను స్తుతిస్తూ ఉండాలి. చీమల గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమన్నారంటే, “అవి అల్లాహ్ ను స్తుతిస్తూ ఉన్నాయి. అల్లాహ్ ను స్తుతించే చీమలని మీరు దహనం చేసేసారు ఏమిటి?” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడ ఆ ప్రవక్తను నిలదీశాడు అంటే, చీమలు సైతం అల్లాహ్ ను స్తుతిస్తూ ఉన్నాయి. ఉత్తమ జీవులైన మానవులు మరీ ఎక్కువగా అల్లాహ్ ను స్తుతిస్తూ ఉండాలి, అల్లాహ్ ను స్మరిస్తూ ఉండాలి.
ఖురాన్ గ్రంథం 62వ అధ్యాయం, 1వ వాక్యంలో అల్లాహ్ ఈ విధంగా తెలియజేశాడు:
భూమి ఆకాశాలలో ఉన్న ప్రతిదీ అల్లాహ్ ను స్తుతిస్తూ ఉంది, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంది, అల్లాహ్ ను స్మరిస్తూ ఉంది. కాబట్టి మానవులు కూడా అల్లాహ్ ను స్తుతిస్తూ, అల్లాహ్ ను స్మరిస్తూ, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉండాలి. ఎవరైతే అల్లాహ్ ను స్తుతిస్తారో వారు ఇహపర సాఫల్యాలు మరియు అనుగ్రహాలు పొందుతారన్న విషయం కూడా తెలియజేయడం జరిగింది.
5. అగ్నితో శిక్షించే అధికారం:
చివర్లో ఒక విషయం ఏమిటంటే, అగ్నితో శిక్షించే అధికారం అల్లాహ్ కు మాత్రమే ఉంది. ఆయన (పూర్వం ఒక ప్రవక్త) చీమ కుట్టింది అని చీమలను కాల్చేశాడు. కాల్చేస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా “ఎందుకు వారిని కాల్చింది? కుట్టింది ఒక చీమే కదా. ఆ ఒక చీమని కావాలంటే మీరు చంపుకోవాలి గాని, మొత్తం చీమలను దహనం చేశారు ఏమిటి?” అని నిలదీశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని తెలియజేశారు అంటే:
“నిశ్చయంగా, అగ్నితో శిక్షించే అధికారం అగ్నిని సృష్టించిన ప్రభువు (అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా) కు మాత్రమే ఉంది” అన్నారు. (అబూ దావూద్). మరొక ఉల్లేఖనంలో, “అగ్నితో శిక్షించే అధికారం ఎవ్వరికీ లేదు అల్లాహ్ కు తప్ప” అన్నారు (బుఖారీ). అంటే అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ అగ్నితో శిక్షించే అధికారం లేదు.
ఇవి ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర నుండి మనకు బోధపడిన కొన్ని విషయాలు. నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మిమ్మల్ని అందరినీ అన్న విన్న విషయాల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
లేదా ఇండ్ల కప్పులు కూలి తలక్రిందులుగా పడివున్న పట్టణం మీదుగా పోయినవాడు; (అతనిని నీవు చూడలేదా?) “దీని చావు తరువాత అల్లాహ్ తిరిగి దీనికి ఎలా ప్రాణం పోస్తాడు?” అని ఆ వ్యక్తి ఆశ్చర్యపోయినప్పుడు అల్లాహ్ అతన్ని చంపి నూరేళ్ళవరకు మరణస్థితిలో ఉంచాడు. తరువాత అతన్ని లేపి, “ఈ స్థితిలో నువ్వు ఎంతకాలం ఉన్నావు?” అని అడిగాడు. “మహా అయితే ఒక రోజు లేక ఒక రోజులో కొంత భాగం” అని అతను బదులిచ్చాడు. “లేదు. నువ్వు నూరేళ్ళు ఈ స్థితిలో పడిఉన్నావు. కాస్త నీ అన్నపానీయాల వైపు చూడు. అవి ఏ మాత్రం చెడిపోలేదు. మరి నీ గాడిదను కూడా చూసుకో. మేము నిన్ను ప్రజల కోసం ఒక నిదర్శనంగా చేయదలిచాము. మేము (గాడిద) ఎముకలను ఏ విధంగా లేపి, వాటిపై మాంసం నింపుతామో చూడు! ఇదంతా ప్రస్ఫుటమయి పోయాక, “అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడని నాకు తెలుసు” అని అన్నాడతను.
ఉజైర్ (అలైహిస్సలాం) తన తోటలోకి ప్రవేశించి అక్కడి ప్రకృతి సౌందర్యానికి మ్రాన్పడి అలాగే కాసేపు నిలబడి పోయారు. పచ్చగా కళకళలాడే చెట్లు, వాటిపై ఒక కొమ్మ మీద నుంచి మరొక కొమ్మపైకి కిలకిలరావాలతో ఎగిరే పక్షులు, విసనకర్రల్లాంటి చెట్ల ఆకుల నుంచి వీస్తున్న స్వచ్ఛమైన పిల్లతెమ్మరలు ఆస్వాదిస్తూ తన చేతిలో ఉన్న బుట్టను క్రింద పెట్టారు. అలా చాలా సేపు నిలబడిపోయారు. చెట్ల కొమ్మలు నోరూరించే పండ్ల భారంతో క్రిందికి వంగిపోయి ఉన్నాయి. ఆయన తన బుట్టను తీసుకుని అందులో రకరకాల పండ్లు కోసుకున్నారు. ఆ బుట్టను తన గాడిద వీపున కట్టారు. దాని పై కూర్చుని వెళ్ళిపోయారు.
దారిలో కూడా ప్రకృతి సౌందర్యం గురించి, ప్రకృతిలోని రమణీయత గురించి ఆలోచించి ఆశ్చర్యపోసాగారు. గాడిద దారితప్పి తనను ఎటో తీసుకు పోవడాన్ని ఆయన గుర్తించలేదు. ఆలోచనల నుంచి బయటపడి చూసేసరికి ఆయన ఒక పాడుపడిన ఊరిలో ఉన్నారు. నేలపై మానవుల కంకాళాలు, జంతువుల అస్థిపంజరాలు చెల్లాచెదరుగా పడఉన్నాయి. వారంతా గతించిన కాలాల ప్రజలని, వారి చిహ్నాలు చిందర వందరగా పడి ఉన్నాయని గ్రహించారు.
ఆయన గాడిదపై నుంచి క్రిందికి దిగారు. గాడిదపై ఉన్న బరువును క్రిందికి దించి, ఒక కూలిపోయిన గోడకు అనుకుని కూర్చున్నారు. ఆ ఊరి ప్రజలకు ఏమయ్యిందో అని ఆలోచించసాగారు. ఆయనకు మరణానంతర జీవితం గురించి ఆలోచన వచ్చింది. మరణించిన వారు మళ్ళీ ఎలా బ్రతికించబడతారు? ఆయన మనసులో ఇలాంటి ఆలోచనలు ముసురుకున్నాయి. ఆలోచనల్లో మునిగి అలాగే కునికిపాట్లు పడుతూ నిద్రలోకి జారిపోయారు.
అలా రోజులు గడచపోయాయి, నెలలు గతించాయి. సంవత్సరాలు కాల గర్భంలో కలసపోయాయి. ఉజైర్ (అలైహిస్సలాం) నిద్రలోనే ఉన్నారు. ఈ సుదీర్ఘకాలంలో ఆయన పిల్లలు, వాళ్ళ పిల్లలు, పిల్లల పిల్లలు ఇలా తరాలు గడచిపోయాయి. జాతులు అంతరించాయి. కొత్త జాతులు ఉనికిలోకి వచ్చాయి.
అల్లాహ్ తన ప్రవక్తలతో వ్యవహరించే తీరు విభిన్నంగా ఉంటుంది. సాధారణ విశ్వాసికి ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిన అనుభూతి లభించక పోయినా అతను తన విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. కాని దేవుని సందేశ హరులైన ప్రవక్తలకు వారి విధుల నిర్వహణలో, దేవుని సందేశం ప్రజలకు అంద జేయడంలో పటిష్టమైన సంకల్పం అవసరం. అందుకుగాను జీవితానికి సంబంధించిన లోతయిన వాస్తవాలను తెలుసుకోవలసిన అవసరం కూడా వారికి ఉంటుంది. అందుకే ప్రవక్తల వద్దకు దైవదూతలు వచ్చేవారు. స్వర్గనరకాలు, భూమ్యాకాశాలు, మరణానంతరం జీవితం వగైరా వాస్తవాలను వారికి చూపించడం జరిగేది.
మెలకువ
ఉజైర్ (అలైహిస్సలాం) తన దీర్ఘనిద్ర నుంచి మేల్కొన్నారు. అల్లాహ్ ఆదేశానుసారం ఆయన నిద్ర పూర్తయ్యింది. ఆయన నిద్ర పోయినప్పుడు ఎలా ఉన్నారో నిద్ర లేచినప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఒక దైవదూత ఆయన ముందు ప్రత్యక్ష మయ్యాడు. ఉజైర్తో దైవదూత, “ఎంతకాలం నిద్రపోయానని భావిస్తున్నావు?” అని ప్రశ్నించాడు. ఉజైర్ (అలైహిస్సలాం) జవాబిస్తూ, “నేను రోజులో చాలా భాగం నిద్ర పోయి ఉంటాను” అన్నారు. దైవదూత ఆయన్ని చూస్తూ, “కాదు, నువ్వు వంద సంవత్సరాలు నిద్రపోయావు. చూడు! నీ పండ్లు అప్పుడు ఎంత తాజాగా ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే తాజాగా ఉన్నాయి. నీ త్రాగునీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంది. కాని నీ గాడిదను చూడు, కేవలం దాని అస్థిపంజరం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు.. అల్లాహ్ మహత్యాన్ని చూడు..మరణించిన వారిని మళ్ళీ ఆయన ఎలా బతికిస్తాడో అర్థం చేసుకో.. దీన్ని నీ ప్రభువు తరపు నుంచి నిదర్శ నంగా భావించు. నీ మనస్సులో ఉన్న అనుమానాలన్నీ తొలగించుకో” అన్నాడు.
ఉజైర్ (అలైహిస్సలాం) చూస్తుండగానే గాడిద అస్థిపంజరంపై మాంసం కండరాలు చోటు చేసుకున్నాయి. గాడిద మళ్ళీ సజీవంగా లేచి నిలబడింది. ఆయన ఆశ్చర్యంగా, “అల్లాహ్ ఏమైనా చేయగల శక్తి కలిగినవాడని నేనిప్పుడు దృఢంగా నమ్ముతున్నాను” అన్నారు.
అంతరించిన గతం
ఉజైరు తెలిసిన ప్రాంతాలన్నీ పూర్తిగా మారిపోయాయి. తన ఇంటిని వెదకడానికి చాలా సమయం పట్టింది. చివరకు ఇంటికి చేరుకుంటే అక్కడ ఆయనకు ఒక వృద్ధ మహిళ కనబడింది. ఆమె కళ్ళు కనబడడం లేదు. కాని ఆమె జ్ఞాపకశక్తి చాలా బలంగా ఉంది. ఉజైర్ (అలైహిస్సలాం) ఆమెను గుర్తించారు. తాను ఇల్లు వదలి వచ్చినప్పుడు ఆమె తన ఇంటిలో పనిచేసే చిన్నపిల్ల. ఆయన ఆమెతో, “ఇది ఉజైర్ ఇల్లేనా” అని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇస్తూ, “అవును” అంది. ఆమె దుఃఖంతో, “ఉజైర్ ఇల్లు వదలి వెళ్ళిపోయారు. చాలా సంవత్సరాలై పోయాయి. ఆ తర్వాత ఎవరికీ ఆయన ఎక్కడికెళ్ళిందీ తెలియరాలేదు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. చాలా కాలంగా ఆయన పేరు ప్రస్తావించిన వాళ్ళు కూడా లేరు” అంది. ఉజైర్ (అలైహిస్సలాం) ఆమెతో, “నేనే ఉజైర్. అల్లాహ్ అభీష్టం వల్ల నేను చాలా కాలం నిద్ర పోయాను. అల్లాహ్ నన్ను వంద సంవత్సరాల తర్వాత నిద్ర లేపాడు” అన్నారు.
ఈ మాటలు విని ఆ వృద్ధమహిళ చాలా ఆశ్చర్యపోయింది. కాస్సేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత, “ఉజైర్ (అలైహిస్సలాం) చాలా ధర్మాత్ముడు. అల్లాహ్ ఆయన ప్రార్థనలను వినేవాడు. ఆయన రోగుల స్వస్థత కోసం ప్రార్థించిన ప్రతిసారీ వారికి ఆరోగ్యం చేకూరేది. కాబట్టి, నువ్వు ఉజైర్అ యితే అయితే నా ఆరోగ్యం కోసం, నా కంటిచూపు కోసం అల్లాహ్ ను ప్రార్థించు” అని అడిగింది.
ఉజైర్ (అలైహిస్సలాం) అల్లాహ్ ను వేడుకున్నారు. అల్లాహ్ ఆయన ప్రార్థనలకు ప్రతిస్పందించాడు. ఆ వృద్ధమహిళకు ఆరోగ్యం చేకూరింది. ఆమె కంటిచూపు మళ్ళీ వచ్చింది. ఆమె ఆయనకు ధన్యవాదాలు చెప్పి ఈ వార్త అందరికీ చెప్పడానికి తక్షణమే బయటకు వెళ్ళింది. ఉజైర్ పిల్లలు, మనుమలు, మనుమల పిల్లలు అందరూ పరుగున వచ్చారు. యువకునిగా కనబడుతున్న ఉజైర్ని చూసి ఆయన తమకు తాతగారని వారు నమ్మలేకపోయారు. “ఇది నిజమా!” అని గుసగుసలాడు కోసాగారు. ప్రస్తుతం ముసలివాడై పోయిన ఉజైర్ కొడుకు ఒకరు “నా తండ్రికి భుజంపై ఒక పుట్టుమచ్చ ఉండేది. మా అందరికీ ఆ పుట్టుమచ్చ గురించి బాగా తెలుసు. మీరు ఆయనే అయితే ఆ పుట్టుమచ్చ చూపించండి” అని ప్రశ్నించాడు. ఉజైర్ తన భుజంపై ఉన్న పుట్టుమచ్చను చూపించారు. అయినా వారికి సంతృప్తి కలగలేదు. మరో కుమారుడు, “జెరుసలేమ్ను బుఖ్స్సర్ ఆక్రమించుకుని తౌరాత్ గ్రంథాలన్నింటినీ ధ్వంసం చేసినప్పటి నుంచి తౌరాత్ కంఠస్థం చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది మిగిలారు. అలా తౌరాత్ కంఠస్థం చేసిన వారిలో మా తండ్రిగారు కూడా ఒకరు. మీరు ఆయనే అయితే తౌరాత్ వినిపించండి” అనడిగాడు. ఉజైర్ తౌరాత్ మొత్తం పఠించి వినిపించారు. ఆయన స్వరానికి వారు మంత్రముగ్ధులై విన్నారు. నిజంగా ఉజైర్ (అలైహిస్సలాం) తిరిగి వచ్చారని వారికి అప్పటికి నమ్మకం కలిగింది. అందరూ ఆయన్ను ప్రేమతో కౌగిలించుకున్నారు. ఆనంద భాష్పాలు రాల్చారు.
ఆ పిదప యూదులు, “అల్లాహ్ ఉజైర్ను మళ్ళీ బ్రతికించాడు. కాబట్టి ఆయన తప్పక అల్లాహ్ కుమారుడై ఉండాలి” అనడం ప్రారంభించారు. (చదవండి దివ్యఖుర్ఆన్: 9:30, 2:259)
“ఉజైర్ అల్లాహ్ కుమారుడు” అని యూదులంటున్నారు. “మసీహ్ (ఏసు క్రీస్తు) అల్లాహ్ కుమారుడు” అని నసారా (క్రైస్తవులు) అంటున్నారు. ఇవి వారి నోటి మాటలు మాత్రమే. తమ పూర్వీకుల్లోని అవిశ్వాసులు చెప్పిన మాటలనే వీళ్ళూ అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నాశనం చేయుగాక! (సత్యం నుండి) వారెలా తిరిగిపోతున్నారు!?
గ్రహించవలసిన పాఠాలు
సాధారణంగా మనిషి కళ్ళకు కనబడే వాటిని పట్టించుకోకుండా తమ స్వంత ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. ఉజైర్ తిరిగి రావడం అల్లాహ్ చూపించిన మహత్యంగా గ్రహించే బదులు యూదులు ఆయన్ను దేవుని కుమారునిగా పిలువడం ప్రారంభించారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.