అబూ హురైరా (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర [వీడియో & టెక్స్ట్]

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర
వక్త: సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/c8YBKq1fepo [30 నిముషాలు]

ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్ప సహాబీ అయిన అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్రను క్లుప్తంగా వివరించబడింది. ఇస్లాం స్వీకరించక ముందు ఆయన పేరు, స్వీకరించిన తర్వాత ప్రవక్త వారు పెట్టిన పేరు, మరియు ఆయనకు “అబూ హురైరా” (పిల్లికి తండ్రి) అనే బిరుదు ఎలా వచ్చిందో వివరించబడింది. ఆయన యెమన్ దేశంలోని దౌస్ తెగలో జన్మించి, తండ్రిని కోల్పోయి తల్లి వద్ద పెరిగిన తీరు, మరియు తుఫైల్ బిన్ అమర్ దౌసీ (రదియల్లాహు అన్హు) ద్వారా ఇస్లాం స్వీకరించిన వృత్తాంతం చెప్పబడింది. మదీనాలో ఆయన అనుభవించిన తీవ్ర పేదరికం, అహ్ల్ అస్-సుఫ్ఫాలో ఒకరిగా జీవించిన విధానం, మరియు ప్రవక్త వారి దుఆ ఫలితంగా ఆయన తల్లి ఇస్లాం స్వీకరించిన అద్భుత సంఘటనను కళ్ళకు కట్టినట్టు వివరించారు. ప్రవక్త వారి తర్వాత, వివిధ ఖలీఫాల కాలంలో ఆయన పాత్ర, బహ్రెయిన్ గవర్నర్‌గా ఆయన సేవలు, మరియు ఆయన మరణ సమయంలో పరలోకం గురించి ఆయనకున్న భయభక్తులను ఈ ప్రసంగం తెలియజేస్తుంది. అత్యధికంగా 5,374 హదీసులను ఉల్లేఖించిన సహాబీగా ఆయన స్థానం, మరియు ఆయన అద్భుతమైన జ్ఞాపకశక్తిని కూడా ఈ ప్రసంగంలో ప్రస్తావించారు.


اَلْحَمْدُ لِلّٰهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللّٰهِ
[అల్-హమ్దు లిల్లాహ్, వస్సలాతు వస్సలాము ‘అలా రసూలిల్లాహ్]
సకల స్తోత్రములు, పొగడ్తలు అల్లాహ్ కే శోభస్తాయి. మరియు అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు ఆయన ప్రవక్తపై వర్షించుగాక.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
[అస్సలాము ‘అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ఈనాటి ప్రసంగంలో మనం ఒక గొప్ప సహాబీ గురించి తెలుసుకోబోతున్నాము. ఆయన గొప్పతనం ఏమిటంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన కోసము, ఆయన తల్లి కోసము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ప్రత్యేకంగా దుఆ చేసి ఉన్నారు. హదీసు గ్రంథము చిన్నది అయినా సరే, పెద్దది అయినా సరే, ఆయన పేరు తప్పనిసరిగా అందులో ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించబడి ఉంటుంది. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద నుండి 5,374 హదీసులు, ఉల్లేఖనాలు ఉమ్మత్ అనుచర సమాజం వరకు చేరవేర్చి ఉన్నారు. ఇలాంటి విశిష్టతలు కలిగిన ఆ సహాబీ ఎవరనుకుంటున్నారా? ఆయనే అబూ హురైరా రజియల్లాహు త’ఆలా అన్హు వారు. రండి, ఇన్ షా అల్లాహ్, ఈ ప్రసంగంలో మనం అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్ర క్లుప్తంగా, ఇన్ షా అల్లాహ్, తెలుసుకుందాం.

ఆయన ఇస్లాం స్వీకరించక ముందు ఆయనకు అబ్దుష్ షమ్స్ అని పేరు ఉండేది. ఇస్లాం స్వీకరించిన తర్వాత, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ పేరు సరికాదు అని మార్చి అబ్దుర్రహ్మాన్ అని పేరు పెట్టారు. అయితే, అబూ హురైరా అని ఆయనకు కున్నియత్, నామాంతరము ఉండేది. అబూ హురైరా అంటే దాని అర్థం ఏమిటి? చిన్న పిల్లికి తండ్రి అని అర్థం. ఆ పేరు ఆయనకు ఎందుకు పెట్టబడింది అంటే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, ఆయన ఒక పిల్లిని పోషిస్తూ ఉండేవారు. ఆ పిల్లి ఆయన మీద అభిమానంతో ఎల్లప్పుడూ ఆయన వెంట వెంట తిరుగుతూ ఉండేది, ఆయన ఒడిలో కూర్చుంటూ ఉండేది. అది చూసిన ప్రజలు ఆయనకు అబూ హురైరా, చిన్న పిల్లికి తండ్రి అని నామాంతరము, కున్నియత్ పెట్టేశారు అని అంటూ ఉన్నారు.

ఇక అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఎక్కడ జన్మించారు అని మనం చూచినట్లయితే, యెమన్ దేశంలోని దౌస్ తెగలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు జన్మించారు. ఆయన జన్మించిన కొద్ది రోజులకే వారి తండ్రి మరణించారు. ఆయన అనాథగా తల్లి వద్ద పెరిగారు. తల్లి పేరు ఉమైమ. ఆమె అబూ హురైరా వారిని ఎంతో ప్రేమ, అనురాగాలతో పోషించారు.

ఇక అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఎలా ఇస్లాం స్వీకరించారన్న విషయాన్ని మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో భాగంగా తుఫైల్ బిన్ అమర్ దౌసీ రజియల్లాహు అన్హు వారి ఇస్లాం స్వీకరణ మనము విని ఉన్నాం. తుఫైల్ బిన్ అమర్, ఈయన కూడా యెమన్ దేశస్థులు, దౌస్ తెగకు చెందినవారు, గొప్ప కవి కూడా. మక్కాకు ఒకసారి వచ్చారు. మక్కా వాసులు ఆయనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడకండి, ఆయన మాటలు వినకండి అని హెచ్చరించారు. ఆయన ప్రారంభంలో ప్రవక్త వారి మాటలు వినకూడదు అనుకున్నారు. తర్వాత లోలోపల ఆలోచించి, “నేను కవిని, మంచి చెడులో వ్యత్యాసాన్ని గ్రహించగలిగే వాడిని, మరి అలాంటప్పుడు ముహమ్మద్ మాటలు వినటానికి నేను ఎందుకు భయపడాలి” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు విన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వతహాగా ఆయన తరపు నుంచి ఏమీ మాట్లాడేవారు కాదు కదా! దైవ వాక్యాలు ప్రజలకు బోధించేవారు కదా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తుఫైల్ బిన్ అమర్ వారికి దైవ వాక్యాలు వినిపించినప్పుడు, ఆయన దైవ వాక్యాలను అర్థం చేసుకొని వెంటనే ఇస్లాం స్వీకరించేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు, “మీ తెగ వారికి కూడా వెళ్లి మీరు ఇస్లాం గురించి బోధించండి” అని ఆదేశించినప్పుడు, ఆయన దౌస్ తెగకు తిరిగి వెళ్లి ఇస్లాం వైపుకి ఆహ్వానించారు. ప్రారంభంలో తెగ వారు ఎవరూ కూడా ఆయన మాటను పట్టించుకోలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు మళ్లీ వెళ్లి ప్రయత్నము చేయమని ఆదేశించినప్పుడు, మళ్లీ వెళ్లి ఆయన ప్రయత్నము చేయగా 80 కుటుంబాలు అల్-హమ్దులిల్లాహ్ ఇస్లాం స్వీకరించాయి. అలా ఇస్లాం స్వీకరించిన వారిలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు.

మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో విన్నాం అండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణము చేసి వెళ్లిపోయారు. మదీనాకు వలస ప్రయాణం చేసి వెళ్లిపోయిన ఆరవ లేదా ఏడవ సంవత్సరంలో తుఫైల్ బిన్ అమర్ వారు 80 కుటుంబాలను తీసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి హాజరయ్యారు. మదీనాకు వచ్చి చూస్తే, అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేరు. ఆ సమయానికి ఆయన సైన్యముతో పాటు ఖైబర్ ప్రదేశానికి వెళ్లి ఉన్నారు, అక్కడ యూదులతో యుద్ధం సంభవిస్తూ ఉంది. దౌస్ తెగకు చెందిన తుఫైల్ బిన్ అమర్ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు, మిగతా ప్రజలు కొంతమంది మదీనా నుండి చక్కగా ఖైబర్‌కు వెళ్లిపోయారు. ఆ ప్రకారంగా, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మొదటిసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఎక్కడ కలిశారు అంటే ఖైబర్ ప్రదేశంలో కలిశారు. ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేసి, అల్-హమ్దులిల్లాహ్ ఆ తర్వాత ఆయన కూడా, దౌస్ తెగ ప్రజలు కూడా యుద్ధంలో పాల్గొని విజేతలుగా మదీనాకు తిరిగి వచ్చేశారు.

మదీనాకు వచ్చేసిన తర్వాత ఏమి జరిగిందంటే, దౌస్ తెగకు చెందిన చాలా మంది ప్రజలు వేరే వేరే ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. కానీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మూడు విషయాల కారణంగా మదీనాలోనే స్థిరపడిపోయారు. మొదటి విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పదే పదే చూడాలనే కోరిక. రెండవ విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేయాలనే కోరిక. మూడవ విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఇస్లాం శిక్షణ మరియు ధార్మిక శిక్షణ పొందాలనే కోరిక. ఈ మూడు విషయాల కారణంగా అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మదీనాలోనే స్థిరపడిపోయారు. అయితే, గమనించాల్సిన విషయం ఏమిటంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు యెమన్ నుండి మదీనాకు వస్తున్నప్పుడు తల్లిని కూడా వెంట తీసుకొని వచ్చారు. తల్లి ఇస్లాం స్వీకరించలేదు, అయినా గానీ ఆవిడను వెంటబెట్టుకొని మదీనాకు వచ్చేసి ఉన్నారు.

ఇక్కడ మదీనాలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వేరే ఏ వృత్తిని కూడా ఆయన ఎంచుకోకుండా, కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద నుండి ఎక్కువగా మాటలు, ఉల్లేఖనాలు, హదీసులు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ పని కోసం ఆయన పూర్తిగా అంకితమైపోయారు. మస్జిద్-ఎ-నబవీలో ఉండిపోతూ ఉండేవారు. ఆయన లాగే మరికొంత మంది సహాబాలు కూడా ఉండేవారు. వారందరినీ కూడా అస్హాబుస్ సుఫ్ఫా అనేవారు. అజియాఫుల్ ఇస్లాం అని, అజియాఫుల్లాహ్ అని, ఖుర్రా అని వారిని పిలిచేవారు. వారందరూ కూడా నిరుపేదలే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారందరి కోసము ఒక ప్రదేశాన్ని కేటాయించి నీడ సౌకర్యము కూడా కల్పించారు. వారందరూ కూడా ఆ ప్రదేశంలో సేద తీరేవారు.

ఇక, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మదీనాలో ఉంటున్నప్పుడు చాలా పేదరికము మరియు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. ఆయన స్వయంగా తెలియజేసిన విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాలలో రెండు రెండు రోజులు, మూడు మూడు రోజులు ఆయనకు తినటానికి ఏమీ దొరకని కారణంగా పూర్తిగా నీరసించిపోయి, ఒక్కొక్కసారి స్పృహ కోల్పోయి పడిపోతే, ప్రజలు ఆయన పడుకుంటూ ఉన్నాడేమోలే అనుకునేవారు. మరికొంత మంది అయితే, ఏమైంది ఈయనకు ఎక్కడంటే అక్కడ పడుకుంటున్నారు, పిచ్చి పట్టిందా అని కూడా కొంతమంది భావిస్తూ ఉండేవారు. కానీ వాస్తవానికి, ఆయన నీరసించిపోయి స్పృహ కోల్పోయి పడిపోయేవారు.

ఒకసారి ఆయన కడుపు మీద రాయి కట్టుకొని కూర్చొని ఉన్నారు. ఎవరైనా కనిపిస్తే వారితో మాట్లాడుదాము, వారు ఏమైనా తినటానికి ఇస్తారేమో అని ఆశిస్తూ ఉన్నారు. అంతలోనే అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అటువైపు వచ్చారు. ఆయనతో మాట్లాడారు, ఆయన కేవలం మాట్లాడి పలకరించి వెళ్లిపోయారు. తర్వాత ఉమర్ రజియల్లాహు అన్హు వారు వచ్చారు, ఆయనను పలకరించారు, ఆయన కూడా కేవలం పలకరించి మాట్లాడి ముందుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడితే, వెంటనే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ముఖ కవళికను గమనించి అర్థం చేసుకొని, “నాతో పాటు రండి” అని ఇంటికి తీసుకుని వెళ్లారు. ప్రవక్త వారి ఇంట్లో ఒక పాత్రలో కొన్ని పాలు ఉన్నాయి. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి ఆదేశిస్తూ, “మీ మిగతా మిత్రులు మస్జిద్ లో ఉన్నారు కదా, అస్హాబుస్ సుఫ్ఫా, వారందరినీ కూడా పిలుచుకొని రండి” అన్నారు. ఆయన మనసులో ఆశ్చర్యపోతూ ఉన్నారు, “ఏమిటండి, ఒక చిన్న పాత్రలో ఉన్న పాలు అంత మంది నా మిత్రులకు సరిపోతాయా?” అని లోలోపల ఆశ్చర్యపోతూ ఉన్నారు, కానీ ప్రవక్త వారి ఆజ్ఞ కదా, పాటించాలి కదా, కాబట్టి వెళ్లి వారందరినీ పిలుచుకొని వచ్చారు. వారందరూ ప్రవక్త వారి ఇంటికి వచ్చినప్పుడు ప్రవక్త వారు తమ స్వహస్తాలతో ఆ పాత్ర ఒక శిష్యునికి అందజేసి, అల్లాహ్ నామాన్ని తలుచుకొని తాగటం ప్రారంభించండి అన్నారు. ఒక శిష్యుడు తాగాడు, వేరే వారికి ఇచ్చాడు. ఆయన తాగాడు, వేరే వారికి ఇచ్చాడు. ఆ ప్రకారంగా అక్కడ ఉన్న వారందరూ కూడా తాగేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి కూడా ఇచ్చారు. ఆయన కూడా ఒకసారి తాగి ఇచ్చేస్తూ ఉంటే, “లేదు మరొకసారి తాగండి, మరొకసారి తాగండి” అని ఇంచుమించు ప్రవక్త వారు మూడు నాలుగు సార్లు ఆయనకు తాగమని చెప్పగా, ఆయన తాగేసి, “ఓ దైవ ప్రవక్త, నా కడుపు నిండిపోయిందండి, ఇక నేను తాగలేను” అని ఇచ్చేయగా, చివరిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ పాలు త్రాగారు. అల్లాహు అక్బర్! ఒక గిన్నెలో ఉన్న పాలు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అందులోనే ఎంత వృద్ధి, బరకత్ ఇచ్చాడంటే, అక్కడ ఉన్న వారందరూ కూడా అల్-హమ్దులిల్లాహ్ తనివి తీరా త్రాగగలిగారు.

అలాగే మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా గౌరవించేవారు, అభిమానించేవారు. ప్రవక్త వారికి సేవలు కూడా చేస్తూ ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు నీటి ఏర్పాటు చేసేవారు, వేరే వేరే పనులు కూడా ప్రవక్త వారి పనులు ఆయన చేసి పెడుతూ ఉండేవారు.

అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి కూడా మదీనాకు వచ్చి ఉన్నారు, ఆవిడ ఇస్లాం స్వీకరించలేదు అని మనం ఇంతవరకే విని ఉన్నాము కదండీ. తల్లిని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా గౌరవించేవారు, అభిమానించేవారు. ఎందుకంటే, పసితనంలోనే తండ్రి మరణించినా ఆవిడ బిడ్డను పోషించుకుంటూ ఉండిపోయారు గానీ మరొక వివాహము చేసుకోలేదు. కాబట్టి, బిడ్డ కోసం అంకితమైన తల్లి కోసము బిడ్డ, అనగా అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా చాలా అభిమానించేవారు, సేవలు చేసేవారు, గౌరవించేవారు. ఆవిడ కూడా ఇస్లాం స్వీకరించాలని పదేపదే వెళ్లి ఇస్లాం గురించి బోధిస్తూ ఉండేవారు.

ఒకసారి ఏమైందంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తల్లి వద్దకు వెళ్లి ఇస్లాం గురించి బోధిస్తూ ఉంటే ఆమె కోపగించుకున్నారు. కోపగించుకుని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి మీద మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక అనరాని మాట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద కూడా మాట్లాడేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి బాధ కలిగింది. ఏడ్చుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్త, ఇలా జరిగింది మా ఇంట్లో. మీరు అల్లాహ్ తో దుఆ చేయండి, నా తల్లికి ఇస్లాం భాగ్యము లభించాలని, అల్లాహ్ ఆమెకు ఇస్లాం స్వీకరించేలాగా చేయాలని అల్లాహ్ తో ప్రార్థన చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సందర్భంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి కోసము ప్రత్యేకంగా అల్లాహ్ తో దుఆ చేయగా, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తిరిగి మళ్లీ ఇంటికి వెళ్లారు. వెళ్లి చూస్తే, తలుపులు మూయబడి ఉన్నాయి, లోపల తల్లి స్నానం చేస్తున్న శబ్దం వస్తూ ఉంది. బిడ్డ వచ్చాడన్న విషయాన్ని గమనించిన తల్లి, “ఓ అబూ హురైరా, ఆగిపో నాయనా కొద్దిసేపు” అని ఆజ్ఞాపించగా, బయటే అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కొద్దిసేపు నిలబడిపోయారు. తర్వాత తల్లి స్నానం ముగించుకొని, బట్టలు ధరించుకొని, తలుపులు తెరిచి, ముందుగా ఆమె పలికిన మాట ఏమిటంటే:

أَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُوْلُ اللهِ
[అష్-హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్-హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్]
అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.

తల్లి సాక్ష్య వచనం పఠించి, కలిమా పఠించి, ఇస్లాం స్వీకరించారన్న విషయాన్ని చూసి, విని, మళ్లీ పట్టరాని సంతోషంలో ఆనంద భాష్పాలు కార్చుకుంటూ, ఏడ్చుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్త, నా తల్లి ఇస్లాం స్వీకరించేశారు” అని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, మళ్లీ దైవ ప్రవక్తతో వేడుకున్నారు, “ఓ దైవ ప్రవక్త, విశ్వాసులందరూ కూడా నన్ను, నా తల్లిని అభిమానించాలని మీరు అల్లాహ్ తో దుఆ చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొకసారి ఆయన కోసము, ఆయన తల్లి కోసము అల్లాహ్ తో దుఆ చేశారు. అల్-హమ్దులిల్లాహ్! నేటికీ కూడా విశ్వాసులందరూ వారు మదరసాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలు చదువుతూ ఉన్నా, లేదా వారు విద్యార్థులు కాకుండా సామాన్యమైన ప్రజలు ధార్మిక పండితుల నోట ప్రసంగాలలో గానీ, మస్జిదులలో గానీ ఎక్కడైనా గానీ ప్రవక్త వారి మాటలు, ఉల్లేఖనాలు, హదీసులు వింటూ ఉన్నారు అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క పేరు ప్రతి చోట ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించబడుతూనే ఉంటుంది. ఆ ప్రకారంగా, ప్రతి విశ్వాసి అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి అభిమానిగా ఆ రోజుల్లో కూడా ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఇన్ షా అల్లాహ్, అలాగే ఉంటూ ఉంటారు ముందు కూడా. అంటే, ప్రవక్త వారి యొక్క దుఆ ఫలితంగా విశ్వాసులందరూ కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు వారిని అభిమానిస్తూ ఉన్నారు మిత్రులారా, ఇది చెప్పాల్సిన విషయం.

అలాగే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తల్లి గురించి ఎంతగా శ్రద్ధ తీసుకుంటారో చూడండి. మరొక ఉదాహరణ చెబుతూ ఉన్నాను. ఒకసారి ఆకలి కారణంగా ఆయన మస్జిద్-ఎ-నబవీ లోకి ప్రవేశించారు. అక్కడ ఎవరైనా ఏమైనా ఇస్తారేమో అని ఆశతో వస్తే, ఎవరూ లేరు. కొంతమంది అక్కడ కూర్చొని ఉంటే వారి దగ్గరకు వెళ్లి, “ఈ సమయానికి మీరు ఇక్కడ ఉన్నారు ఏమిటి?” అని అడిగారు. వారందరూ ఏమన్నారంటే, “మీరు ఏ విధంగా అయితే ఈ సమయానికి ఆకలితో ఇక్కడికి ఏమైనా దొరుకుతుందని వచ్చారో, అలాగే మేము కూడా వచ్చాము” అన్నారు. తర్వాత వారందరూ కూడా కలిసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్దాము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్లారు. వెళ్లి, “ఓ దైవ ప్రవక్త, మాకు తినటానికి ఏమీ దొరకలేదు” అని ఆకలితో ఉన్నాము అని తెలియజేయగా, ప్రవక్త వారు ఖర్జూరపు పళ్ళు తెప్పించి ఒక్కొక్కరికి రెండు రెండు ఖర్జూరపు పండ్లు ఇస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్! సహాబాలు మరియు ప్రవక్త వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారో చూడండి. ఒక్కొక్కరికి రెండు రెండు ఖర్జూరపు పండ్లు వస్తూ ఉన్నాయి. ప్రవక్త వారు అంటున్నారు, “ఈ రెండు ఖర్జూరపు పండ్లు మీరు తినండి. అల్లాహ్ దయతో ఈ పూర్తి రోజుకు ఈ రెండు ఖర్జూరపు పండ్లు మీకు సరిపోతాయి.” అందరూ కూడా రెండు రెండు ఖర్జూరపు పండ్లు తీసుకొని తింటూ ఉన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మాత్రము ఒక ఖర్జూరపు పండు మాత్రమే తిని ఒకటి లోపల పెట్టుకుంటూ ఉంటే, ప్రవక్త వారు చూసి, “ఎందుకండి ఒకటి ఖర్జూరము పెట్టుకుంటూ ఉన్నారు?” అంటే, “నా తల్లి కోసము పెట్టుకుంటున్నాను, ఓ దైవ ప్రవక్త” అన్నారు. అల్లాహు అక్బర్! తల్లి గురించి ఎంత శ్రద్ధ తీసుకునేవారో చూడండి. “నా తల్లి కోసము ఆ ఖర్జూరము నేను పెట్టుకుంటూ ఉన్నాను, ఓ దైవ ప్రవక్త” అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “లేదండి, ఆ ఖర్జూరము మీరు తినేయండి. మీ తల్లి కోసము నేను ప్రత్యేకంగా అదనంగా రెండు ఖర్జూరపు పండ్లు ఇస్తాను” అని దైవ ప్రవక్త వారు రెండు అదనంగా ఖర్జూరపు పండ్లు ఇచ్చి మీ తల్లికి ఇవ్వండి అన్నారు. అల్లాహు అక్బర్! మొత్తానికి, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి ప్రారంభంలో ఇస్లాం స్వీకరించలేదు, తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దుఆ ఫలితంగా ఆవిడ ఇస్లాం స్వీకరించారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా తల్లి గురించి శ్రద్ధ తీసుకునేవారు, సేవలు చేసేవారు, బాగా అభిమానించేవారు కూడానూ.

ఆ తర్వాత మనం చూచినట్లయితే, హిజ్రీ శకం ఏడవ సంవత్సరం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్రా ఆచరించటానికి వెళ్ళినప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ప్రవక్త వారి వెంట వెళ్లి ఆ సంవత్సరము ఉమ్రా ఆచరించి వచ్చారు. ఆ తర్వాత, హిజ్రీ శకం ఎనిమిదవ సంవత్సరం వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బహ్రెయిన్ దేశానికి అలా బిన్ అల్-హదరమీ రజియల్లాహు అన్హు వారిని నాయకునిగా నియమించి పంపిస్తూ అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని కూడా ఆయనకు తోడుగా, జతగా పంపించారు. “మీరు అబూ హురైరా వారిని వెంట తీసుకుని వెళ్ళండి, ఆయనను గౌరవించండి” అని అలా బిన్ అల్-హదరమీ వారికి ప్రవక్త వారు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. ఇద్దరూ కలిసి బహ్రెయిన్‌కు వెళ్లారు. అలా బిన్ అల్-హదరమీ వారు బహ్రెయిన్‌కు వెళ్ళిన తర్వాత ప్రవక్త వారి ఆదేశం ప్రకారం అబూ హురైరా రజియల్లాహు అన్హు వారితో, “ఏమండీ, మీకు నేను గౌరవిస్తున్నాను, మీరు ఏ బాధ్యత తీసుకుంటారో చెప్పండి” అన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆలోచించి, “నాకు అజాన్ పలికే బాధ్యత ఇవ్వండి” అన్నారు. అల్లాహు అక్బర్! అజాన్ పలికే బాధ్యత అది సాధారణమైనది కాదు. అది చాలా విశిష్టత కలిగిన బాధ్యత, ఎంతో గౌరవంతో కూడుకున్న బాధ్యత కాబట్టి, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ బాధ్యత ఇవ్వండి అన్నారు. నేడు చాలామంది అజాన్ పలికే బాధ్యతను చిన్నచూపుతో చూస్తూ ఉంటారు, అది సాధారణమైన విషయంగా భావిస్తూ ఉంటారు. లేదండి, చాలా విశిష్టతలతో కూడిన విషయము అది. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ బాధ్యత తీసుకున్నారు.

కొద్ది నెలలకే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేరే అబాన్ బిన్ సయీద్ అనే ఒక సహాబీని అక్కడికి అనగా బహ్రెయిన్‌కు నాయకునిగా నియమించి పంపించేయగా, అలా బిన్ అల్-హదరమీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఇద్దరూ తిరిగి మళ్లీ మదీనాకు వచ్చేశారు. ఒక సంవత్సరం గడిచింది. హిజ్రీ శకం తొమ్మిదవ సంవత్సరము వచ్చింది. ఆ సంవత్సరము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూబకర్ రజియల్లాహు అన్హు వారిని నాయకునిగా నియమించి, ఆయన సారథ్యంలో ఇంచుమించు 300 మంది సహాబాలను హజ్ ఆచరించడానికి పంపించారు. వారిలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు. అంటే, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి సారథ్యంలో హజ్ ఆచరించబడినప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా వెళ్లి హజ్ ఆచరించుకొని వచ్చేశారు. ఆ సంవత్సరం ప్రవక్త వారు మాత్రము హజ్‌కి వెళ్ళలేదండి. ఆ తర్వాత వచ్చే సంవత్సరం, అనగా హిజ్రీ శకం పదవ సంవత్సరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా మంది సహాబాలను వెంటబెట్టుకొని వెళ్లి హజ్ ఆచరించారు. ఆ హజ్‌ని హజ్జతుల్ వదా అని అంటూ ఉంటారు. ఆ హజ్‌లో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట వెళ్లి హజ్ ఆచరించుకొని వచ్చారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో, ఆయన పరిపాలన యుగంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా యుద్ధాలలో పాల్గొన్నారు, ముఖ్యంగా ముర్తద్దీన్‌లతో జరిగిన యుద్ధాలలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రత్యేకంగా పాల్గొన్నారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారి మరణానంతరం, ఉమర్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఏం చేశారంటే, బహ్రెయిన్ ప్రదేశానికి ప్రవక్త వారి లాగే అలా బిన్ అల్-హదరమీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు, వీరిద్దరినీ నాయకులుగా నియమించి పంపించేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ సందర్భంలో బహ్రెయిన్‌లో ఇంచుమించు ఒక సంవత్సరం నాయకునిగా పరిపాలన కొనసాగించారు. ఆ ఒక సంవత్సరంలో ప్రభుత్వ తనఖా కూడా పొందారు, అటుగా ఆయన స్వయంగా కూడా వ్యాపారము చేశారు. ఆ ప్రకారంగా, ఆ ఒక సంవత్సరంలో ఆయన పెద్ద మొత్తంలో అల్-హమ్దులిల్లాహ్ డబ్బు సంపాదించుకోగలిగారు.

ఒక సంవత్సరం తర్వాత, ఉమర్ రజియల్లాహు అన్హు వారు వేరే సహాబీని అక్కడికి నాయకునిగా నియమించి పంపించేయగా, అలా బిన్ అల్-హదరమీ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వీరిద్దరూ మళ్లీ మదీనాకు తిరిగి వచ్చేశారు. అయితే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఈసారి మదీనాలో వచ్చినప్పుడు ఆయన వద్ద చాలా డబ్బు సొమ్ము ఉంది. ఇప్పుడు ఆయన మునుపటి లాగా నిరుపేద, ఆకలి దప్పుకలతో గడిపేవారు కాదు. చాలా డబ్బు అల్-హమ్దులిల్లాహ్ ఆయన సంపాదించుకోగలిగి ఉన్నారు. అయితే ఆయన ఏం చేశారో తెలుసా? మదీనాకు వచ్చిన తర్వాత ఆ డబ్బు మొత్తము బైతుల్ మాల్ కోసం అంకితం చేసేశారు. బైతుల్ మాల్ అంటే ప్రభుత్వం తరపున వితంతువులకు, అనాథలకు, మరియు నిరుపేదలకు ఆ సహాయము అందించేవారు. ఆ సహాయ నిధి కోసము ఈయన ఆయన వద్ద ఉన్న సంపద, డబ్బు మొత్తము అంకితం చేసేశారు, విరాళంగా ఇచ్చేశారు. అల్లాహు అక్బర్!

ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో, అంటే ఉమర్ రజియల్లాహు అన్హు వారి మరణానంతరం, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి పరిపాలన యుగంలో, సల్మాన్ బిన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారితో పాటు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా యుద్ధాలలో పాల్గొన్నారు. ముఖ్యంగా, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో ఆయన తూర్ పర్వతం ఉంది కదండీ, వాది-ఎ-సైనా, సైనా అనే ఒక లోయ ఉంది. ఆ మైదానములో ఒక పర్వతం ఉంది, కోహె తూర్. అక్కడ మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ఎలాంటి మధ్యవర్తి లేకుండా మాట్లాడారు కదండీ. ఆ పర్వతం వరకు ఆయన ప్రయాణము కొనసాగించారు అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే, ఆ ప్రయాణంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే, కాబ్ అహ్బార్ రజియల్లాహు అన్హు వారు, వాస్తవానికి ఆయన ఒక యూదుడు, తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించారు. ఆయనకు వేరే గ్రంథాల జ్ఞానము ఉంది. ఆయనతో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం వినిపించారు. ఏమని వినిపించారంటే, “జుమా రోజు చాలా విశిష్టత కలిగినది. జుమా రోజున అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదం అలైహిస్సలాం వారిని పుట్టించాడు. జుమా రోజున ఆయనకు స్వర్గంలో ప్రవేశింపజేశాడు. జుమా రోజునే ఆయన స్వర్గం నుంచి బయటికి వచ్చేశారు.” ఆ విధంగా చెబుతూ చెబుతూ చివర్లో, “జుమా రోజులో ఒక ఘడియ ఉంది. ఆ ఘడియలో భక్తుడు చేసే దుఆ తప్పనిసరిగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆమోదిస్తాడు” అని తెలియజేయగా, కాబ్ అహ్బార్, ఆయన ఏమంటున్నారంటే, “ఆ ఘడియ సంవత్సరంలో ఒకసారి వస్తుంది కదా” అన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అన్నారు, “లేదండి, దైవ ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారము ప్రతి శుక్రవారము ఆ ఘడియ ఉంటుంది” అన్నారు. ఆయన ఆశ్చర్యపోయి వారి గ్రంథము, అంటే వేరే మత గ్రంథాలు ఉన్నాయి కదండీ, ఆయన ఇస్లాం స్వీకరించక ముందు యూదుడు కదండీ, ఆ మతానికి చెందిన గ్రంథము చదివి ఆయన, “ప్రవక్త వారు చెప్పిన మాట నిజము” అని అప్పుడు ఆయన ధ్రువీకరించారు కూడా.

సరే, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క వీర మరణం సంభవించినప్పుడు అలీ రజియల్లాహు అన్హు వారు ముస్లింల నాయకులయ్యారు. ఆయన పరిపాలన యుగంలో ముస్లింల రెండు పెద్ద సమూహాల మధ్య పెద్ద యుద్ధము జరిగింది. ఆ యుద్ధ సమయంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వారిద్దరి మధ్య సంధి కుదిర్చటానికి చాలా ప్రయత్నము చేశారు. చివరికి ఆయన ఫలితం దొరకని కారణంగా యుద్ధంలో పాల్గొనకుండా ఆయన ఒంటరితనాన్ని ఎన్నుకున్నారు. ప్రత్యేకంగా దైవ ఆరాధన కోసం ఆయన అంకితమైపోయారు అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు.

సరే, ఏది ఏమైనప్పటికినీ, అలీ రజియల్లాహు అన్హు వారి తర్వాత, హిజ్రీ శకం 59వ సంవత్సరం, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వ్యాధికి గురయ్యారు. ఆ వ్యాధి రాను రాను ముదురుతూనే పోయింది. మరణ సమయం సమీపించింది. అప్పుడు ఆయన పరలోకాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉన్నారు. ప్రజలు ఆయనతో అడిగారు, “ఏమండీ, ఎందుకు ఏడుస్తున్నారు?” అంటే, అప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తెలియజేశారు, “నేను ప్రపంచాన్ని వదిలేసి వెళ్లిపోతున్నానని బాధలో నేను ఏడవట్లేదు. పరలోకాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉన్నాను. ప్రయాణము ముందు ముందు చాలా పెద్దది, నా దగ్గర ఏమో సామాను చాలా తక్కువగా ఉంది. నేను స్వర్గానికి చేరుకుంటానా, నరకానికి చేరుకుంటానా నాకు అర్థం కావట్లేదు. స్వర్గం నా గమ్యస్థానం అవుతుందా, నరకం నా గమ్యస్థానం అవుతుందా తెలియదు కాబట్టి, అది తలుచుకొని నేను ఏడుస్తూ ఉన్నాను” అన్నారు.

అల్లాహు అక్బర్! జీవితాంతం ప్రవక్తకు మరియు సహాబాలకు మరియు ఇస్లాంకు అంకితమైపోయిన అలాంటి సహాబీ పరలోకాన్ని తలుచుకొని, “నా వద్ద సొమ్ము తక్కువ ఉంది,” అంటే పుణ్యాలు తక్కువ ఉన్నాయి, ప్రయాణం చాలా పెద్దదిగా ఉంది, “స్వర్గానికి వెళ్తానో నరకానికి వెళ్తానో తెలియదు” అని ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారంటే, ఆయనలో ఎంత దైవభీతి ఉండేదో ఆలోచించండి. అలాగే, మనము ఎలాంటి ఎక్కువ పుణ్యాలు చేయకపోయినా పరలోకాన్ని తలుచుకొని ఏడవట్లేదు అంటే, ఎలాంటి భ్రమలో మనము జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించండి మిత్రులారా.

సరే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క మరణ సమయము సమీపించింది. ఆయన మదీనాలో ఉంటూ ఉన్నారు. మదీనా యొక్క నాయకుడు ఆ రోజుల్లో మర్వాన్ ఇబ్నుల్ హకం అనే ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన పరామర్శించడానికి వచ్చారు. వచ్చి, “అల్లాహ్ మీకు స్వస్థత ప్రసాదించుగాక” అని ప్రార్థిస్తూ ఉంటే, అప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అల్లాహ్ తో ప్రార్థించారు, “ఓ అల్లాహ్, నేను నీతో కలవటానికి ఇష్టపడుతూ ఉన్నాను, నువ్వు కూడా నన్ను నీ వద్దకు రావటానికి ఇష్టపడు” అని ప్రార్థించారు. అల్లాహు అక్బర్! ఆ తర్వాత, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క మరణము సంభవించింది.

అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మరణించిన తర్వాత వలీద్ బిన్ ఉత్బా బిన్ అబీ సుఫియాన్ రహిమహుల్లాహ్ వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క జనాజా నమాజు ఆచరించారు. తర్వాత అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి దేహాన్ని అల్-బఖీ, జన్నతుల్ బఖీ అంటుంటారు కదండీ, అల్-బఖీ అల్-గర్కద్, అందులో ఆయనకు ఖనన సంస్కారాలు చేయడం జరిగింది. 59వ హిజ్రీలో ఆయన మరణించారు. అప్పటికి ఆయన వయస్సు ఇంచుమించు 80 సంవత్సరాలకు కొద్దిగా తక్కువ లేదంటే కొద్దిగా ఎక్కువ అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన తర్వాత రోజుల్లో వివాహం చేసుకున్న కారణంగా ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. ఆ కుమార్తె యొక్క వివాహము గొప్ప తాబయీ, సయీద్ బిన్ ముసయ్యిబ్ రహిమహుల్లాహ్ వారితో జరిగింది అని కూడా చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు.

అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి 5,374 హదీసులు ఉమ్మత్ అనుచర సమాజం వరకు చేరవేర్చి ఉన్నారు. సహాబీలందరిలో ఎక్కువగా హదీసులు ఉల్లేఖించిన వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అని కూడా చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు.

అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త వారి హదీసుల్ని జీవితాంతం చాలా చక్కగా కంఠస్థం చేసుకొని భద్రంగా గుర్తుంచుకొని ఉన్నారు అని చెప్పటానికి ఒక ఉదాహరణ వినిపిస్తూ ఉన్నాను, చూడండి. ఆయన జీవించి ఉన్నప్పుడు మదీనా నాయకుడు మర్వాన్ ఇబ్నుల్ హకం అని ఇంతవరకు మనం విన్నాము కదా. ఆ మర్వాన్ అనే అతను ఏం చేశాడంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని పిలిపించి ఆ విషయానికి సంబంధించిన ఒక హదీసు వినిపించండి, ఈ విషయానికి సంబంధించిన ఒక హదీసు వినిపించండి అని కొన్ని హదీసులు అడిగారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ హదీసులన్నీ కూడా వినిపించారు. ఈయన ఏం చేశారంటే, ముందే ఒక వ్యక్తిని ఆదేశించి, ఆయన వినిపిస్తున్న హదీసులన్నీ కూడా ఒక పత్రంలో వ్రాసి ఉంచుకోండి అని ఆదేశించగా, తెర వెనుక ఒక వ్యక్తి ఆ హదీసులన్నీ కూడా ఒక పత్రంలో వ్రాసి ఉంచుకున్నాడు. ఒక సంవత్సరం తర్వాత, మళ్ళీ అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని ఆ మర్వాన్ అనే వ్యక్తి పిలిపించి మళ్ళీ ఆ హదీసులు ఫలానా ఫలానా హదీసులు వినిపించండి అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు గత సంవత్సరం ఏ విధంగా వినిపించారో అదే విధంగా చక్కగా ఎలాంటి తప్పు దొర్లకుండా వినిపించేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వెళ్లిపోయిన తర్వాత తెర వెనుక కూర్చుని ఉన్న ఆ పత్రాన్ని గమనిస్తున్న వ్యక్తితో అడిగారు, “అబూ హురైరా కరెక్ట్ గానే వినిపించారా? ఏమైనా హెచ్చుతగ్గులు జరిగాయా?” అంటే, ఆ వ్యక్తి కూడా, “ఉన్నది ఉన్నట్టే ఆయన మొత్తం చెప్పారు, ఎలాంటి హెచ్చుతగ్గులు జరగలేదు” అని ఆ వ్యక్తి కూడా సాక్ష్యం ఇచ్చాడు. అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు జీవితాంతం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్ని చక్కగా గుర్తుంచుకొని వేరే వారి వరకు చేరవేశారు అని మనకు ఈ సంఘటన తెలుపుతుంది.

ఆ ప్రకారంగా, నేను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉల్లేఖనాలు చదివి, నేర్చుకొని, ఇతరుల వద్దకు చేర్చే భాగ్యం ప్రసాదించుగాక. ఇది అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్ర. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ అన్న, విన్న విషయాల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.

وَجَزَاكُمُ اللهُ خَيْرًا
[వ జజాకుముల్లాహు ఖైరన్]
మరియు అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ఇచ్చుగాక.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
[అస్సలాము ‘అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=19741

సలీం జామిఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

సహాబా (రదియల్లాహు అన్హుమ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1KN6AyXdv30x30ykoVkyVt

సీరతే సహాబియ్యాత్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3cUt4NimP4PNSWLjHO3sXM

సీరత్ పాఠాలు 1: శుభ జననం, ఏనుగుల సంఘటన [వీడియో]

బిస్మిల్లాహ్

[16:36 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [16:36 నిముషాలు]

ఈ ప్రసంగం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) శుభ జననానికి ముందు అరబ్ ద్వీపకల్పం యొక్క మత, ఆర్థిక మరియు సామాజిక పరిస్థితులను వివరిస్తుంది. బహుదేవతారాధన, అజ్ఞానం మరియు అన్యాయం ప్రబలంగా ఉన్న ఆ కాలాన్ని ఇది విశ్లేషిస్తుంది. ప్రవక్త గారి తండ్రి అయిన అబ్దుల్లా మరియు ఇస్మాయీల్ (అలైహిస్సలాం) లను ‘ఇబ్నుద్-దబీహైన్’ (బలి ఇవ్వబడిన ఇద్దరి కుమారుడు) అని ఎందుకు అంటారో చారిత్రక సంఘటనలతో వివరిస్తుంది. అబ్దుల్ ముత్తలిబ్ మొక్కుబడి, అబ్దుల్లా వివాహం, ఆయన మరణం, మరియు చివరకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జననం గురించి చర్చిస్తుంది. ప్రవక్త జననానికి కొద్ది కాలం ముందు జరిగిన ‘ఏనుగుల సంఘటన’ (ఆముల్ ఫీల్) గురించి కూడా ఇది వివరంగా తెలియజేస్తుంది, దీనిలో అబ్రహా మరియు అతని సైన్యం కాబాగృహాన్ని కూల్చివేయడానికి వచ్చి అల్లాహ్ యొక్క అద్భుత శక్తి ద్వారా ఎలా నాశనమయ్యారో వివరిస్తుంది.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
(మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు కలుగుగాక)

اَلْحَمْدُ لِلّٰهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللّٰهِ، أَمَّا بَعْدُ
(అల్హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్)
(సర్వ స్తోత్రాలు అల్లాహ్ కొరకే. అల్లాహ్ యొక్క ప్రవక్తపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ఆ తర్వాత…)

సీరత్ పాఠాలు. మొదటి పాఠం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభ జననానికి పూర్వపు అరబ్ స్థితి.

సోదర సోదరీమణులారా! అల్లాహ్ తర్వాత ఈ సర్వ సృష్టిలో అత్యంత శ్రేష్ఠులైన, సర్వ మానవాళి కొరకు కారుణ్య మూర్తిగా, ఆదర్శ మూర్తిగా పంపబడినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభ జీవిత చరిత్ర మనం తెలుసుకోబోతున్నాము. ఇన్ షా అల్లాహ్ (అల్లాహ్ తలిస్తే), చిన్న చిన్న పాఠాలు మనం వింటూ ఉందాము. చివరి వరకు మీరు ప్రతి ఎపిసోడ్ పూర్తి శ్రద్ధాభక్తులతో విని, ఒక ఆదర్శవంతమైన, మంచి జీవితం గడపడానికి ఉత్తమ గుణపాఠాలు పొందుతారని ఆశిస్తున్నాను.

ఈనాటి మొదటి పాఠంలో మనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు అరబ్ యొక్క స్థితిగతులు ఎలా ఉండినవి తెలుసుకుందాము.

అరబ్బులు ఏకదైవారాధనను వదులుకొని బహుదేవతారాధన మీదనే ఆధారపడి జీవిస్తున్నందువల్ల, వారి ఆ కాలాన్ని అజ్ఞాన కాలం అని చెప్పడం జరిగింది. అరబ్బులు ఏ విగ్రహాలనైతే పూజించేవారో, వాటిలో ప్రఖ్యాతి గాంచినవి లాత్ (اللَّات), ఉజ్జా (الْعُزَّى), మనాత్ (مَنَاة) మరియు హుబుల్ (هُبَل). అయితే వారిలో కొంతమంది యూదుల మతాన్ని, క్రైస్తవ మతాన్ని అవలంబించిన వారు కూడా ఉండిరి. అలాగే కొందరు పార్శీలు, అగ్ని పూజారులు కూడా ఉండిరి. బహు తక్కువ మంది బహుదేవతారాధనకు అతీతమైన, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సవ్యమైన, సన్మార్గమైన సత్య ధర్మంపై కూడా ఉండిరి.

ఇక వారి ఆర్థిక జీవితం, ఎడారి వాసుల (అనాగరికుల) పూర్తి ఆధారం పశు సంపద, వాటిని మేపుటయే ఉండింది. నాగరికతలో ఉన్నవారు వ్యవసాయం మరియు వ్యాపారంపై ఆధారపడి ఉండిరి. ఇస్లాం ధర్మజ్యోతి ప్రకాశించేకి కొంచెం ముందు, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు, ఆది మానవుడు ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎంతరు ప్రవక్తలైతే వచ్చారో వారందరూ తీసుకువచ్చిన ధర్మం ఒకే ఒక సత్యమైన ధర్మం ఇస్లాం. కాకపోతే, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు కాలంలో ఆ సత్యమైన ధర్మం ఇస్లాం యొక్క రూపు మాపేశారు. దానిని దాని అసలు రూపంలో తెలుపుతూ సంపూర్ణం చేయడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపడం జరిగింది. అయితే ఇస్లాం ధర్మజ్యోతి ప్రకాశించేకి ముందు, ఈ జ్యోతిని తీసుకువచ్చినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శుభ జననానికి ముందు, మక్కా అరబ్ ద్వీపంలో ఒక గొప్ప వ్యాపార కేంద్రంగా, ఆర్థిక కేంద్రంగా పేరు దాల్చింది. తాయిఫ్ మరియు మదీనా లాంటి కొన్ని నగరాల్లో మంచి నాగరికత ఉండినది.

ఇక వారి సామాజిక వ్యవస్థను చూసుకుంటే, చాలా బాధాకరంగా ఉండినది. అన్యాయం విపరీతంగా వ్యాపించి, బలహీనులకు ఏ హక్కు లేకుండా ఉండింది. ఆడబిడ్డలను కొందరు సజీవ సమాధి చేసేవారు. మానభంగాలకు పాల్పడేవారు. బలహీనుల హక్కులను బలవంతుడు కాజేసేవాడు. హద్దు లేకుండా భార్యలను ఉంచుకోవడం సర్వసామాన్యమైపోయి ఉండినది. వ్యభిచారం కూడా కొన్ని తెగలలో విచ్చలవిడిగా మొదలైపోయింది. తుచ్ఛమైన కారణాలపై సంవత్సరాల తరబడి అంతర్యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఒకప్పుడు ఒకే తెగకు సంబంధించిన సంతానంలో కూడా కొంత కాలం వరకు యుద్ధం జరుగుతూ ఉండేది. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శుభ జననానికి ముందు ఉన్నటువంటి ధార్మిక, ఆర్థిక మరియు సామాజిక వ్యవస్థ యొక్క సంక్షిప్త రూపం.

ఇక రండి మనం తెలుసుకుందాము ఇబ్నుద్-దబీహైన్ (ابْنُ الذَّبِيحَيْنِ) గురించి. అంటే ఏమిటి? ఇబ్న్ (ابْن) అంటే కుమారుడు, దబీహైన్ (الذَّبِيحَيْنِ) అంటే బలి చేయబడటానికి సిద్ధమైనటువంటి ఇద్దరు వ్యక్తులు. ఒకరైతే తెలుసు కదా? ఇస్మాయీల్ దబీహుల్లాహ్ (إِسْمَاعِيلُ ذَبِيحُ اللهِ) అని చాలా ఫేమస్. ఇబ్రాహీం అలైహిస్సలాం వృద్ధాప్యంలో చేరినప్పుడు మొట్టమొదటి సంతానం ఇస్మాయీల్ ప్రసాదించబడ్డారు. అయితే ఎప్పుడైతే ఇస్మాయీల్ తండ్రి వేలు పట్టుకొని, తండ్రితో పాటు పరిగెత్తే అటువంటి వయసుకు చేరుకున్నాడో, “నీ ఏకైక సంతానాన్ని నీవు జిబహ్ (ذِبْح – బలి) చేయమని” అల్లాహు తఆలా స్వప్నంలో చూపాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ ఆదేశం మేరకు సిద్ధమయ్యారు, కానీ అల్లాహు తఆలా ఒక పొట్టేలును పంపించేశాడు. ఇస్మాయీల్ కు బదులుగా దానిని జిబహ్ చేయడం జరిగింది. ఈ సంఘటన చాలా ఫేమస్. మరి రెండవ దబీహ్ (ذَبِيح – బలి ఇవ్వబడినవాడు) ఎవరు? అదే విషయం ఇప్పుడు మనం వినబోతున్నాము.

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తాత అబ్దుల్ ముత్తలిబ్, అధిక ధనం, అధిక సంతానం వల్ల ఖురైషులు అతన్ని చాలా గౌరవించేవారు. ఒకప్పుడు అబ్దుల్ ముత్తలిబ్, “అల్లాహ్ గనక నాకు పది మంది మగ సంతానం ప్రసాదిస్తే వారిలో ఒకరిని నేను జిబహ్ చేస్తాను, బలిదానం ఇస్తాను” అని మొక్కుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. పది మగ సంతానం కలిగారు అతనికి. వారిలోనే ఒకరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తండ్రి అబ్దుల్లా.

అబ్దుల్ ముత్తలిబ్ తన మొక్కుబడిని పూర్తి చేయడానికి తన పది మంది సంతానంలో పాచిక చీటీ వేశారు. వారిలో అబ్దుల్లా యొక్క పేరు వచ్చింది. ఇక అబ్దుల్లాను బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఖురైషులు అడ్డుకున్నారు. “ఇలా జిబహ్ చేయకూడదు, బలిదానం ఇవ్వకూడదు” అని. తర్వాత కాలాల్లో ఇదే ఒక ఆచారంగా మారిపోతే ఎంత ప్రమాదం అన్నటువంటి భయాందోళనకు గురి అయ్యారు. అయితే వారు ఒక నిర్ణయానికి వచ్చారు. అబ్దుల్లాకు బదులుగా పది ఒంటెలను నిర్ణయించి, వారి మధ్యలో చీటీ వెయ్యాలి. మరియు ఒంటెలను అబ్దుల్లాకు బదులుగా జిబహ్ చేయాలి. చీటీ వేశారు, మళ్ళీ అబ్దుల్లా పేరు వచ్చింది. అయితే వారు పది ఒంటెలను ఇంకా పెంచి ఇరవై చేశారు. మళ్ళీ చీటీ వేశారు, మళ్ళీ అబ్దుల్లా పేరు వచ్చింది. ఈ విధంగా ప్రతిసారీ అబ్దుల్లా పేరు వస్తుంది, పది ఒంటెలను పెంచుతూ పోయారు. ఎప్పుడైతే అబ్దుల్లా ఒకవైపు మరియు వంద ఒంటెలు ఒకవైపు పూర్తి అయ్యాయో, అప్పుడు ఒంటెల పేరు మీద చీటీ వెళ్ళింది. అయితే అబ్దుల్లాకు బదులుగా ఆ ఒంటెలను జిబహ్ చేయడం జరిగింది. ఈ విధంగా జిబహ్ నుండి, బలిదానం నుండి అబ్దుల్లాను తప్పించడం జరిగింది. అందుకొరకే ఈ రెండవ వ్యక్తి జిబహ్ కు సిద్ధమైన తర్వాత కూడా తప్పించబడిన వారు. మరియు ఈయనకి బదులుగా జంతువును బలిదానం ఇవ్వడం ఏదైతే జరిగిందో, ఈ రకంగా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇటు అబ్దుల్లా కుమారుడు మరియు వీరి యొక్క వంశంలోనే ఇస్మాయీల్ అలైహిస్సలాం వస్తారు. ముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్… ఈ విధంగా పూర్తి వంశావళి.

అబ్దుల్ ముత్తలిబ్ కు మొదటి నుండే అతని సంతానంలో అబ్దుల్లా తన హృదయానికి అతి చేరువుగా ఉండి, ఎక్కువ ప్రేమగా ఉన్నారు. అయితే ప్రత్యేకంగా ఈ బలిదానం యొక్క సంఘటన తర్వాత మరింత చాలా దగ్గరయ్యారు, ఇంకా అధికంగా అతన్ని ప్రేమించగలిగారు. అబ్దుల్లా యువకుడై, పెళ్ళీడుకు వచ్చిన తర్వాత, పెళ్ళి వయస్సుకు చేరిన తర్వాత, అబ్దుల్ ముత్తలిబ్, జొహ్రా వంశానికి చెందినటువంటి ఒక మంచి అమ్మాయి, ఆమినా బిన్తె వహబ్ ను ఎన్నుకొని అబ్దుల్లాతో వివాహం చేసేశారు.

అబ్దుల్లా తన భార్య ఆమినాతో ఆనందమైన వైవాహిక జీవితం గడుపుతూ ఉన్నాడు. ఆమినా మూడు నెలల గర్భంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మోస్తూ ఉండగా, అబ్దుల్లా ఒక వ్యాపార బృందంతో సిరియా వైపునకు బయలుదేరారు. తిరిగి వస్తుండగా అనారోగ్యానికి గురయ్యారు. అయితే మదీనాలో వారి యొక్క మేనమామలు ఉంటారు. అందుకని బనీ నజ్జార్ లోని వారి మేనమామల దగ్గర అక్కడ ఆగిపోయారు. కొన్ని రోజుల తర్వాత అక్కడే వారు చనిపోయారు. మదీనాలోనే వారిని ఖననం చేయడం, సమాధి చేయడం జరిగింది.

ఇటు ఆమినాకు నెలలు నిండినవి. సోమవారం రోజున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆమినా జన్మనిచ్చింది. అయితే నెల మరియు తారీఖు విషయంలో ఏకాభిప్రాయం కుదరలేకపోయింది. అయినా, తొమ్మిదవ తారీఖు, రబీఉల్ అవ్వల్ (رَبِيع ٱلْأَوَّل) యొక్క మాసం అని పరిశోధనలో తేలింది. ఎందుకంటే సోమవారం అన్న విషయం ఖచ్చితమైనది. అయితే ఈ రోజుల్లో పన్నెండవ రబీఉల్ అవ్వల్ అని కూడా చాలా ప్రఖ్యాతి గాంచింది. మరో ఉల్లేఖనం రమదాన్ ముబారక్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించారని కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా, క్రీస్తు శకం ప్రకారం 571 అన్న విషయం ఖచ్చితం.

అదే సంవత్సరాన్ని ఆముల్ ఫీల్ (عَامُ الْفِيلِ) అని అంటారు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శుభ జననానికి కేవలం 50 రోజుల ముందు ఏనుగుల సంఘటన జరిగింది. అదేమిటి? అదే ఇప్పుడు మనం విందాము.

నజ్జాషీ అను రాజు యొక్క గవర్నర్ యమన్ లో ఉండేవాడు. అతని పేరు అబ్రహా. అతడు అరబ్బులను చూశాడు, వారు హజ్ చేయడానికి మక్కా వస్తున్నారు. అయితే అతడు సన్ఆ (صَنْعَاء) (యమన్ లోని ప్రస్తుత క్యాపిటల్) అక్కడ ఒక పెద్ద చర్చి నిర్మించాడు. అరబ్బులందరూ కూడా హజ్ చేయడానికి ఇక్కడికి రావాలి అన్నటువంటి కోరిక అతనిది. అప్పట్లోనే అక్కడ అరబ్బుకు సంబంధించిన కినానా తెగకు సంబంధించిన ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఈ విషయం తెలిసి ఒక సమయంలో వెళ్లి ఆ చర్చి గోడలను మలినం చేసేసాడు. ఈ విషయం అబ్రహాకు తెలిసి ఆగ్రహోదగ్రుడయ్యాడు. చాలా కోపానికి వచ్చి ఒక పెద్ద సైన్యం సిద్ధపరిచాడు. మక్కాలో ఉన్న కా’బా గృహాన్ని (నవూదుబిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్) ధ్వంసం చేద్దామని, కూలగొడదామన్న యొక్క దురుద్దేశంతో 60,000 సైన్యంతో బయలుదేరాడు. తొమ్మిది ఏనుగులను కూడా వెంట తీసుకున్నాడు. అతి పెద్ద ఏనుగుపై స్వయం తాను ప్రయాణమయ్యాడు.

మక్కాకు సమీపంలో చేరుకొని అక్కడ తన సైన్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. పూర్తి సంసిద్ధతలు, సంసిద్ధతలన్నీ కూడా పూర్తయ్యాక, ఇక తన ఏనుగును కా’బా వైపునకు ముఖం చేసి లేపాడు. కానీ అది ముమ్మాటికీ లేవకుండా కూలబడిపోయింది. ఎప్పుడైతే కా’బా దిశకు కాకుండా వేరే దిశలో దాన్ని లేపుతున్నారో, పరుగెడుతుంది. కానీ అదే ఎప్పుడైతే దాని ముఖం కా’బా వైపునకు చేస్తారో, అక్కడే కూలబడిపోతుంది. వారు ఈ ప్రయత్నాల్లోనే ఉండగా, అల్లాహు తఆలా గుంపులు గుంపులుగా పక్షులను పంపాడు. నరకంలో కాల్చబడినటువంటి శనగ గింజంత పరిమాణంలో మూడు మూడు రాళ్లు ప్రతి పక్షి వెంట. ఒకటి వారి చుంచువులో, రెండు వాళ్ళ పంజాలలో. ఎవరిపై ఆ రాళ్లు పడుతున్నాయో, వాడు అక్కడే ముక్కలు ముక్కలు అయ్యేవాడు. ఈ విధంగా సైన్యం పరుగులు తీసింది. కొందరు అటు, కొందరు ఇటు పరుగెత్తుతూ దారిలో నాశనం అవుతూ పోయారు.

కానీ అల్లాహు తఆలా అబ్రహా పై ఎలాంటి శిక్ష పంపాడంటే, అతని వేళ్లు ఊడిపోతూ ఉండేవి. అతడు కూడా పరుగెత్తాడు, చివరికి సన్ఆ చేరుకునేసరికి అతని రోగం మరీ ముదిరిపోయి, అక్కడ చేరుకున్న వెంటనే అతడు కూడా నాశనమైపోయాడు. ఇక ఇటు ఖురైషులు, ఎప్పుడైతే అబ్రహా తన సైన్యంతో, (నవూదుబిల్లాహ్) కా’బా గృహాన్ని పడగొట్టడానికి వస్తున్నారని తెలిసిందో, వీళ్ళందరూ కూడా పర్వతాల్లో, లోయల్లో తమను తాము రక్షించుకోవడానికి పరుగెత్తారు. ఎప్పుడైతే వారికి తెలిసిందో, అబ్రహా అతని యొక్క సైన్యంపై అల్లాహ్ యొక్క ఈ విపత్తు కురిసింది అని, శాంతిగా, క్షేమంగా తిరిగి తమ ఇండ్లల్లోకి వచ్చారు.

ఈ విధంగా ఇది మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభ జననం కంటే 50 రోజుల ముందు జరిగిన సంఘటన. అందుకొరకే ఆ సంవత్సరాన్ని ఆముల్ ఫీల్ – ఏనుగుల సంవత్సరం అని అనడం జరిగింది. ఈ విధంగా మనం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శుభ జీవిత చరిత్రలోని మొదటి ఘట్టం పూర్తిగా విన్నాము. ఇంకా మిగతా ఎన్నో ఇలాంటి ఎపిసోడ్స్ వినడం మర్చిపోకండి.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ. وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
(మా చివరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు కలుగుగాక.)

ఇతరములు: 

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం]
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ 

మహా ప్రవక్త జీవిత చరిత్ర పాఠాలు [15 వీడియోలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
మొత్తం వీడియోల వ్యవధి: దాదాపు 70 నిముషాలు

“ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అంటే అర్ధం ఏమిటి? [వీడియో]
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్

హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) సిగ్గు, బిడియం [ఆడియో & టెక్స్ట్]

హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) సిగ్గు, బిడియం
https://youtu.be/dZZa0Z0Oh8Y (3 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) వారి యొక్క అత్యుత్తమ గుణమైన సిగ్గు, బిడియం (హయా) గురించి వివరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) వద్ద దేవదూతలు కూడా సిగ్గుపడతారని తెలిపిన ఒక సంఘటనను పేర్కొన్నారు. అబూబక్ర్ (రజియల్లాహు అన్హు), ఉమర్ (రజియల్లాహు అన్హు) వచ్చినప్పుడు సాధారణ స్థితిలో ఉన్న ప్రవక్త, ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) రాకతో తమ వస్త్రాలను సరిచేసుకుని కూర్చోవడం ఆయన పట్ల గల గౌరవాన్ని, ఆయన సిగ్గు యొక్క స్థాయిని తెలియజేస్తుంది. అంతేకాకుండా, ఇస్లాం స్వీకరించిన నాటి నుండి తన కుడి చేతిని మర్మాంగాలకు తాకించలేదని ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) స్వయంగా చెప్పిన విషయం ఆయన పవిత్రతకు నిదర్శనం. ఆయన అధికంగా ఖుర్ఆన్ పారాయణం చేసేవారని, చివరికి హంతకుల చేతిలో హత్యకు గురయ్యే సమయంలో కూడా ఖుర్ఆన్ పారాయణంలోనే నిమగ్నమై ఉన్నారని వివరించబడింది.

సోదర సోదరీమణులారా! ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క ఉత్తమ గుణం, బిడియం, సిగ్గు, లజ్జ దీని గురించి మనం తెలుసుకుంటున్నాము. అందరికంటే ఎక్కువ హయా ఉస్మాన్ రజియల్లాహు అన్హు గలవారని స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాక్ష్యం పలికారు.

ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇంట్లో కూర్చుని ఉన్నారు. ఒక మెత్తకు ఇలా ఆనుకొని, తన ఈ మోకాళ్ళను ఇలా నిలబెట్టి ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ లుంగీ లేదా వస్త్రం అయితే ధరించి ఉన్నారో అది ఇంచుమించు మోకాళ్ళకు దగ్గరగా వచ్చి పిక్క కనబడుతూ ఉన్నది. ఈ స్థితిలో కూర్చుండి ఉన్నారు. కొంతసేపట్లో హజరత్ అబూబకర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు వచ్చారు. లోపలికి రావడానికి అనుమతి కోరారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే స్థితిలో కూర్చుండి ఉన్నారు, అబూబకర్ రావడానికి అనుమతి ఇచ్చారు. అబూబకర్ వచ్చి ఒక పక్కన కూర్చున్నారు.

మరికొంత సేపటికి హజరత్ ఉమర్ వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే స్థితిలో కూర్చుని ఉన్నారు, హజరత్ ఉమర్ అనుమతి కోరారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి ఇచ్చారు. హజరత్ ఉమర్ లోపలికి వచ్చి ఓ పక్కన కూర్చున్నారు, ప్రవక్త అలాగే ఉన్నారు. మరికొంత సమయం గడిచిన తర్వాత హజరత్ ఉస్మాన్ వచ్చారు. లోపలికి రావడానికి అనుమతి కోరారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ వస్త్రాన్ని మరింత కిందికి దించుతూ, ఒక సరియైన రీతిలో కూర్చుండి, ఉస్మాన్ కు రావడానికి అనుమతి ఇచ్చారు.వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు.

ఆ తర్వాత ఇంట్లో ఈ విషయాన్ని గమనించిన భార్య, అబూబకర్ వచ్చినప్పుడు మీరు అలాగే కూర్చుండి ఉన్నారు, ఉమర్ వచ్చినప్పుడు మీరు అలాగే కూర్చుండి ఉన్నారు, కానీ ఉస్మాన్ ఎప్పుడైతే వచ్చి అనుమతి కోరాడో మీరు మీ వస్త్రాన్ని సరిచేసుకుంటూ, మరి కిందికి దించుకుంటూ, మీ కూర్చుండే స్థితిని మార్చి, మరి మీరు అనుమతించారు, ఎందుకు ఇలా అని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “ఏ ఉస్మాన్ తోనైతే దేవదూతలు సిగ్గు పడుతున్నారో ఆ ఉస్మాన్ తో నేను సిగ్గుపడనా?

అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఉస్మాన్ రజియల్లాహు అన్హు సహాబాలలో అందరికంటే ఎక్కువగా సిగ్గు, బిడియం గలవారు. మరియు స్వయంగా ఆయన ఒక సందర్భంలో తెలిపారు, “ఎప్పటి నుండి అయితే నేను నా ఈ కుడి చేతితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతిలో చెయ్యి వేసి శపథం చేశానో, ఇస్లాం స్వీకరించానో, బయఅత్ చేశానో, అప్పటినుండి నేను ఈ కుడి చెయ్యిని నా మర్మాంగానికి తాకనివ్వలేదు”

హజరత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారిలో ఎన్నో రకాల ఉత్తమ గుణాలు ఉండినవి. ఆయన ఖుర్ఆన్ యొక్క పారాయణం చాలా అధికంగా చేసేవారు. చాలా అధికంగా చేసేవారు. మరియు చివరి సమయంలో, ఏ సమయంలోనైతే దుండగులు ఆయన్ని హతమార్చడానికి ప్రయత్నం చేశారో, ఆ సమయంలో కూడా ఆయన ఖుర్ఆన్ పారాయణం చేస్తూ ఉన్నారు, అదే స్థితిలో ఆ దుష్టులు, దుర్మార్గులు వచ్చి ఆయన్ని హతమార్చారు.


ఇతరములు:

అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) ప్రాముఖ్యత [ఆడియో & టెక్స్ట్]

అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) ప్రాముఖ్యత
https://youtu.be/F_XuR9WXUr8 [25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రియ సహచరుడు, ఇస్లాం మొదటి ఖలీఫా అయిన హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి జీవితంలోని ముఖ్య ఘట్టాలు వివరించబడ్డాయి. ఇస్లాంకు ముందు ఆయన స్వచ్ఛమైన, నిజాయితీ గల జీవితం, ప్రవక్త గారి పిలుపును అందుకుని క్షణం కూడా సంకోచించకుండా ఇస్లాం స్వీకరించిన తీరు, ప్రవక్త గారి పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ, విశ్వాసం గురించి చర్చించబడింది. మేరాజ్ సంఘటన తర్వాత ప్రవక్తను సత్యవంతునిగా ధృవీకరించడం ద్వారా “సిద్దీఖ్” అనే బిరుదును ఎలా పొందారో వివరించబడింది. ఇస్లాం కోసం బానిసలను విడిపించడం, హిజ్రత్ (వలస) ప్రయాణంలో ప్రవక్త గారికి తోడుగా నిలవడం, థౌర్ గుహలో ఆయన చేసిన త్యాగం, ప్రవక్త గారి మరణానంతరం ముస్లిం సమాజాన్ని ఎలా ధైర్యంగా నిలబెట్టారో వంటి అనేక స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఇందులో ప్రస్తావించబడ్డాయి.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్ హందులిల్లాహి వహ్ దహ్, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బ’అద అమ్మా బ’అద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచరుల గురించి తెలుసుకొని ఉన్నాము.

ఈరోజు మనం హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి జీవిత విశేషాల గురించి తెలుసుకుందాము.

హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించాక రెండున్నర సంవత్సరాలకు ఇహలోకంలోకి వచ్చారు. ఆయన తన చిన్నతనం నుండే ఎంతో నిజాయితీగా, సత్యవంతునిగా మరియు ఎంతో అందరికీ ఇష్టమయ్యే మృదువైన, ఉత్తమమైన నడవడికను అవలంబించుకొని జీవితం గడుపుకుంటూ వచ్చారు. ఆయన జీవిత చరిత్రను మనం చూస్తే, ఇస్లాం కంటే ముందు అజ్ఞాన కాలంలో ఆయన తన యవ్వనంలో గానీ, ఇస్లాం స్వీకరించక ముందు గానీ ఏ ఒక్క రోజు కూడా మత్తుపానీయాలకు సమీపించలేదు, దగ్గరికి వెళ్ళలేదు. ఏ చెడు అలవాట్లకు, సామాన్యంగా ఏదైతే కొన్ని సమాజాల్లో యువకులు కొన్ని చెడు గుణాల్లో పడిపోతారో, అలాంటి ఏ చెడు గుణానికి దగ్గర కాలేదు.

ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం గురించి ప్రచారం ప్రారంభం చేయక ముందు నుండే అతను ప్రవక్త గారికి ఒక దగ్గరి స్నేహితునిగా, ఒక మంచి స్నేహితునిగా ఉన్నారు. ఆయనకు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే నేను ప్రవక్తను, అల్లాహ్ నన్ను సర్వ మానవాళి వైపునకు సందేశహరునిగా, ప్రవక్తగా చేసి పంపాడో, నా పిలుపు ఏమిటంటే, అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు మరియు నేను ఆయన ప్రవక్తను, నీవు ఈ విషయాన్ని స్వీకరిస్తావా అని అంటే, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు క్షణం పాటు గురించి కూడా సంకోచించక, ఎలాంటి సందేహంలో పడక, ఏ ప్రశ్న ప్రవక్త ముందు చేయక వెంటనే స్వీకరించారు. కొందరు తడబడాయిస్తారు, కొందరు ఆలోచిస్తారు, మరికొందరు ఎదురు ప్రశ్నలు వేస్తారు కానీ హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు అలాంటి ఏ సంకోచంలో పడకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే నమ్ముకున్నారు.

ఇంకా మనం ఆయన జీవితం గురించి తెలుసుకున్నప్పుడు ఎన్నో విషయాలు ముందుకు రానున్నాయి, కానీ ఒక సందర్భంలో ఎప్పుడైతే హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హుతో, ఏమిటి నీవు నీ స్నేహితుడు అంటే వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి, నీ స్నేహితుడు చెప్పిన ప్రతి మాటను ఒప్పుకుంటున్నావు అని హేళనగా కొందరు అవిశ్వాసులు అడిగినప్పుడు, అవును, ఆయన అమీన్ మరియు సాదిఖ్ అని మీరు కూడా నమ్మేవారు కదా! ఆయన ప్రపంచంలో ఎవరితోనీ కూడా తన స్వయ అవసరానికి అయినా ఏ ఒక్క రోజు గానీ ఏ ఒక్కసారి గానీ అబద్ధం పలకలేదు. అలాంటి వ్యక్తి సృష్టికర్త అయిన అల్లాహ్ పై ఎలా అబద్ధాన్ని, ఎలా అబద్ధాన్ని మోపుతారు? ఒక అభాండను అల్లాహ్ వైపునకు ఎలా అంకితం చేస్తారు? చేయలేరు. అందుగురించి ఆయన చెప్పిన ప్రతి మాటను నేను నమ్ముతాను. అల్లాహ్ ఈ విషయం నాకు తెలిపాడు అని ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారో అందులో నేను ఏ మాత్రం సంకోచించను. సోదర మహాశయులారా, సోదరీమణులారా, విశ్వాసం అంటే ఇలా దృఢంగా ఉండాలి. మనం కూడా హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క జీవితం ద్వారా మంచి ఉత్తమమైన గుణపాఠాలు నేర్చుకోవాలి.

హజ్రత్ అబూబకర్, ఈ బిరుదుతోనే ఆయన చాలా ప్రఖ్యాతి గాంచారు. అబ్దుల్ అతీఖ్ అని ఇంకా అబ్దుల్ కాబా అని వేరే ఎన్నో రకాల పేర్ల గురించి మనకు చరిత్రలో తెలుస్తుంది. కానీ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన గురించి అబ్దుల్లాహ్ అన్న పేరును పెట్టారు, అల్లాహ్ యొక్క దాసుడు అని, కానీ అబ్దుల్లాహ్ అన్న పేరుతో ఆయన ఫేమస్ కాలేదు. అబూబకర్ అన్న పేరుతో మరియు మరొక బిరుదు “సిద్దీఖ్”.

దీని గురించి కూడా ఎన్నో ఉల్లేఖనాలు ఉన్నాయి. ఖురాన్ ఒక ఆయతు ద్వారా కూడా ఎందరో ఖురాన్ వ్యాఖ్యానకర్తలు ఈ విషయం తెలిపారు.

وَالَّذِي جَاءَ بِالصِّدْقِ وَصَدَّقَ بِهِ ۙ أُولَٰئِكَ هُمُ الْمُتَّقُونَ
(వల్లజీ జా అబిస్సిద్ఖి వసద్దఖ బిహీ ఉలాఇక హుముల్ ముత్తఖూన్)
సత్యాన్ని తీసుకువచ్చినవాడూ, దాన్ని సత్యమని ధృవీకరించిన వాడూ – అలాంటి వారే దైవభీతి గలవారు. (39:33)

ఇందులో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సత్యపరిచిన వారు, వారే భయభక్తులు కలిగి ఉన్నవారు, వారే ముత్తఖీన్ అని అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఏదైతే తెలుపుతున్నాడో, సద్దఖ నుండి సిద్దీఖ్ వస్తుంది. అయితే మొట్టమొదటిసారిగా ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సత్యపరిచిన వారు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ గనుక ఆయనకు సిద్దీఖ్ అన్న బిరుదు పడింది. అంతేకాదు దీని గురించి ఒక ప్రఖ్యాతిగాంచిన సంఘటన ఏమిటంటే ఎప్పుడైతే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గగన ప్రయాణం మేరాజ్ కు వెళ్లి వచ్చారో ఆ తర్వాత మేరాజ్ యొక్క సంఘటన ప్రజలకు తెలియపరిచారు. అప్పుడు విశ్వాసులు ఆ విషయాన్ని నమ్మారు. కానీ అవిశ్వాసులు హేళన చేశారు. మేము ఇక్కడి నుండి మక్కా నుండి బైతుల్ మఖ్దిస్ వెళ్ళాలంటే నెల పడుతుంది కనీసం, నీవు ఒకే రాత్రి రాత్రిలోని కొంత భాగములో బైతుల్ మఖ్దిస్ వెళ్లి మళ్ళీ అక్కడ నుండి ఏడు ఆకాశాల వరకు వెళ్ళావు, ఏమిటి మమ్మల్ని పిచ్చి వాళ్ళుగా అనుకుంటున్నావా అని ఎగతాళి చేశారు. కానీ ఆ సమయంలో అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు తెలుపుతున్న సందర్భంలో అబూబకర్ లేరు. ఒక అవిశ్వాసి అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వద్దకు వెళ్లి, ఏమిటి ఎవరైనా మక్కా నుండి బైతుల్ మఖ్దిస్ వరకు ఒక రాత్రిలో వెళ్లి వచ్చాను అని అంటే నమ్ముతావా? అంటే అబూబకర్ సిద్దీఖ్ చెప్పారు, లేదు. సామాన్యంగా మనం ప్రయాణం చేస్తూ ఉంటాము. ఎన్ని రోజుల ప్రయాణం పడుతుంది మనకు తెలుసు కదా. ఎవరైనా ఇలా చెప్పేది ఉంటే ఎలా నమ్మాలి? అతడు సంతోషపడి వెంటనే చెప్పాడు, అయితే మరి నీ స్నేహితుడు నీ మిత్రుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెబుతున్నాడు కదా, రాత్రి కొంత భాగంలోనే బైతుల్ మఖ్దిస్ కి వెళ్ళాడంట, అక్కడి నుండి ఏడు ఆకాశాలకు వెళ్లి స్వర్గ నరకాలను కూడా దర్శనం చేసి వచ్చారంట. వెంటనే అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు తెలిపారు, ఒకవేళ ఈ మాట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే అది నూటికి నూరు పాళ్ళు నిజం, అందులో అబద్ధానికి అసత్యానికి ఏ ఆస్కారం లేదు. అల్లాహు అక్బర్! గమనించండి. అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు సరే నేను ముహమ్మద్ ను తెలుసుకుంటాను సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ తర్వాత నిజమో లేదో చెబుతాను ఇవన్నీ ఇలా చెప్పలేదు విషయాలు, ఏమన్నారు? అతని ముంగట అప్పుడే అప్పటికప్పుడే చెప్పారు, ఒకవేళ ఈ మాట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గనుక చెప్పేది ఉంటే ఆ మాట నిజము, అందులో ఎలాంటి అనుమానం లేదు. అందుగురించి ఆయనకు సిద్దీఖ్ అన్నటువంటి బిరుదు పడింది అని కూడా చెప్పడం జరిగింది.

అంతేకాకుండా సహీ బుఖారీలో కూడా ఒక హదీస్ వచ్చి ఉంది. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూబకర్, ఉమర్, ఉస్మాన్ నలుగురు ఉహద్ పర్వతంపై ఉన్నారు. అప్పుడు ఉహద్ పర్వతం అందులో ప్రకంపన వచ్చింది, ఊగ సాగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ కాలుతో ఒకసారి ఇలా కొట్టి, ఉస్బుత్ ఉహుద్ (ఓ ఉహుద్, స్థిరంగా ఉండు), ఉహుద్ కదలకు, నిలకడగా ఉండు, ఇప్పుడు నీపై ఒక నబీ, ఒక సిద్దీఖ్ మరియు ఇద్దరు షహీదులు ఉన్నారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. అంటే ప్రవక్త అంటే స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, సిద్దీఖ్ అంటే హజ్రత్ అబూబకర్ మరియు ఇద్దరు షహీదులు అంటే హజ్రత్ ఉమర్ మరియు ఉస్మాన్.

సోదర సోదరీమణులారా, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఇస్లాం కంటే ముందు తమ జీవితంలో ఏ ఒక్కసారి కూడా షిర్క్ కార్యకలాపాలకు పాల్పడలేదు. ఆయనకు యవ్వనంలో చేరుకున్నప్పటి నుండే వ్యవసాయం ఇంకా పెద్దలతో ఉండడం మరియు హుందాతనంగా జీవించడం ఆరంభించారు. ఆయన యవ్వనంలో చేరిన తర్వాత ప్రజలలో ఒక చాలా మంచి వ్యక్తిగా, ఏదైనా ముఖ్య విషయాల్లో అతనితో సలహా తీసుకోవాలి అని ప్రజలు కోరేవారు. ఇస్లాం స్వీకరించిన తర్వాత అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు మౌనం వహించలేదు. నాకు ఇస్లాం లాంటి ఒక అనుగ్రహం లభించింది కదా ఇక దీనిపై నేను స్థిరంగా ఉంటాను అని తనకు తాను ఆలోచించుకొని కేవలం జీవితం గడపలేదు. ఇస్లాం స్వీకరించిన వెంటనే ఇస్లాం యొక్క ప్రచారం కూడా మొదలు పెట్టారు. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో ఏ పది మంది గురించి ఇహలోకంలోనే స్వర్గం యొక్క శుభవార్త ఇచ్చారో వీరు తప్పకుండా స్వర్గంలో చేరుతారు అని అందులో మొట్టమొదటి వ్యక్తి అబూబకర్, ఆ తర్వాత మిగతా తొమ్మిది మందిలో అధిక శాతం హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు యొక్క బోధనతో, హజ్రత్ అబూబకర్ యొక్క ప్రోత్సాహంతో ఇస్లాం స్వీకరించారు. ఉదాహరణకు హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ తల్హా, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ ఇంకా వేరే కొంతమంది. అంతేకాదు, హజ్రత్ అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు వ్యాపారం చేస్తూ ఉండేవారు. అల్లాహు త’ఆలా ఆ వ్యాపారం ద్వారా అతనికి చాలా శుభం కలుగజేశాడు. ఆయన ఎంతో మంచి విధంగా ధనం సంపాదించారు, హలాల్, ధర్మసమ్మత మార్గం నుండి. కానీ ధనం అంటే ఇష్టపడి దాని ప్రేమలో, వ్యామోహంలో చిక్కుకునే వారు కాదు. సాధ్యమైనంత వరకు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడుతూ ఉండేవారు.

ఇక ఈ ఉత్తమ గుణం అయితే ఇస్లాం తర్వాత ఎలా మారింది? సమాజంలో ఎవరైతే కొందరు బానిసలు, బానిసరాండ్లు, మరికొందరు బలహీనులు ఎవరైతే ఇస్లాం స్వీకరించారో, వారు ఇస్లాం స్వీకరించిన కారణంగా వారి యొక్క యజమానులు వారిని బాధిస్తూ ఉండేవారు. అయితే హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వారిని వారి యొక్క యజమానుల నుండి కొని తన స్వయ డబ్బుతో వారిని అల్లాహ్ మార్గంలో విడుదల చేసేవారు. ఇస్లాంపై ఇక మీరు స్వేచ్ఛగా జీవితం గడపండి అని. హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు స్వయంగా తాను తన డబ్బుతో ఏ ఏ బానిసలను కొని బానిస నుండి విముక్తి కలిగించారో వారిలో ఆమిర్ ఇబ్ను ఫుహైరా, ఉమ్ము ఉబైస్, జున్నైరా, నహదియా మరియు ఆమె కూతురు, హజ్రత్ బిలాల్ రదియల్లాహు త’ఆలా అన్హు చాలా ప్రఖ్యాతిగాంచిన వారు తెలిసిన విషయమే మరియు బనీ మొఅమ్మల్ కు సంబంధించిన ఒక బానిసరాలు.

అంతేకాకుండా, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఇస్లాం స్వీకరించిన తర్వాత ప్రజలకు ఇస్లాం బోధించడంలో స్వయంగా ఒక్కొక్కసారి ఆయనపై ఎన్నో ఆపదలు వచ్చేవి. ఎందుకంటే ప్రవక్త జీవిత చరిత్ర చదివిన వారికి విషయం తెలుసు, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని స్వయంగా మరియు వారిని విశ్వసించిన వారిపై అవిశ్వాసులు హత్యా, దౌర్జన్యాలు చేసేవారు మరియు ఎన్నో రకాలుగా వారిని బాధించేవారు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేస్తూ ఉన్నారు. ఒక దుర్మార్గుడు వచ్చి తన యొక్క దుప్పటిని తీసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మెడలో వేసి ఇంత గట్టిగా లాగాడంటే దాని మూలంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవూదుబిల్లా ఇక ఆయనకు ప్రాణం పోయినట్లు ఏర్పడింది. అప్పుడు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వచ్చి ఆ దుష్టుల నుండి, దుర్మార్గుల నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విడిపించి, “అతఖ్ తులూన రజులన్ అన్ యఖూల రబ్బి యల్లాహ్” (నా ప్రభువు కేవలం అల్లాహ్ అని అన్నందుకు ఒక వ్యక్తిని చంపుతారా?) అని, ఏమిటి నా ప్రభువు కేవలం అల్లాహ్ మాత్రమే అని అన్నంత మాత్రాన మీరు ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి పుణ్యాత్ముని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇంత దుర్మార్గానికి మీరు ఒడిగడుతున్నారు అని వారిని హెచ్చరించారు. అప్పుడు ఆ దుర్మార్గులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను వదిలి అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు వారిని కొట్టడం మొదలు పెట్టారు. చివరికి ఆయన స్పృహ తప్పిపోయారు. అతని యొక్క తల్లి ఉమ్ము ఖుహాఫా వచ్చి తన కొడుకును వెంట తీసుకొని వెళ్ళింది. ఇంట్లోకి తీసుకెళ్లాక కొంత క్షణం, కొంత సమయం గడిచింది. స్పృహ వచ్చింది. స్పృహ వచ్చిన వెంటనే తల్లి తీసుకొచ్చి నీళ్లు ఇస్తుంది, నాన్న ఈ నీళ్లు త్రాగి కొంచెం ఓదార్పు వహించి నీవు విశ్రాంతి తీసుకో. హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు చెబుతారు, లేదు లేదు, ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పరిస్థితి ఏముందో ఒకసారి నాకు తెలపండి. తల్లి అంటుంది, నాన్న నువ్వు కొంచెం మేలుకున్నాక, విశ్రాంతి తీసుకొని నీ శరీరంలోని ఈ అవస్థలు కొంచెం దూరమయ్యాక వెళ్లి నీవు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాచారాన్ని తెలుసుకుంటూ. కానీ అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఒప్పుకోలేదు. ఉమ్మె జమీల్ ను పిలవండి అని తల్లికి చెప్పారు. ఎవరు? హజ్రత్ ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క సోదరి. అప్పటికి ఆమె ఇస్లాం స్వీకరించింది కానీ స్వయంగా ఉమర్ కు తెలియదు. హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి వద్దకు ఉమ్మె జమీల్ వచ్చింది. అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉమ్మె జమీల్ చెవిలో ఒక మాట మాట్లాడారు, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క క్షేమ విషయాలు తెలుసుకున్నారు. ఆయన బాగున్నారు, స్వస్థతగా ఉన్నారు అని తెలిసినప్పుడు అప్పుడు అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు గారికి నెమ్మది, ఎంతో ఆనందం ఏర్పడింది. అయినా శరీరంలో స్వయంగా నడిచి వెళ్లే అటువంటి శక్తి లేదు, కానీ అమ్మ యొక్క సహాయంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్లారు. ప్రవక్తను చూసుకున్న తర్వాత ఆయన శరీరంలోని అవస్థలన్నీ దూరమైనట్లు ఆయనకు ఏర్పడ్డాయి. అల్లాహు అక్బర్. ఇలాంటి ప్రేమ వెలిబుచ్చేవారు. ఇలాంటి విశ్వాసం వారిది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల. అల్లాహ్ ను విశ్వసించిన తర్వాత అల్లాహ్ ఆరాధనపై నిలకడగా ఉండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను విశ్వసించి, ప్రవక్త బాటను తూచా తప్పకుండా అనుసరిస్తూ ఈ విధంగా వారు జీవితం గడిపారు. ఈ రోజుల్లో మన పరిస్థితి ఏముందో ఒకసారి గమనించండి. అబూబకర్ ఎవరు అబూబకర్? అల్లాహు అక్బర్! అబూబకర్, ఆయనను ప్రశంసిస్తూ ఖురాన్లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ పేరు చెప్పకుండా ఆయన ఉత్తమ గుణగణాలను ప్రస్తావిస్తూ ఎన్నో ఆయతులు అవతరింపజేశాడు.

ఏ ఒక్క క్షణం పాటు కూడా ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విడని వారు. అల్లాహ్ ధర్మం కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సైగను చూసి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ధర్మం కొరకు ఏం అవసరం ఉంది అని చెప్పక ముందే గ్రహించి తన ఆస్తిని, తన సంతానాన్ని, తనకు తానును అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త గురించి త్యాగం చేసేవారు.

ఎప్పుడైతే మక్కా నుండి మదీనా వలస పోవడానికి అనుమతి వచ్చిందో, ఎందరో ముస్లింలు మదీనా వైపునకు వలస పో సాగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఎన్నో సార్లు నాకు కూడా అనుమతి ఇస్తున్నారా మదీనా వెళ్ళడానికి అని అంటే, ప్రవక్త చెప్పేవారు, లేదు, ఓపిక వహించు, అల్లాహు త’ఆలా నీకు ఏదైనా మంచి స్నేహితం ప్రసాదించవచ్చు. అంటే నీ ఈ వలస ప్రయాణంలో నీకు ఎవరైనా మంచి తోడు లభించవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ వైపు నుండి వారికి అనుమతి లభించిన తర్వాత అబూబకర్ కు తెలిపారు, మన ఇద్దరము కలిసి వలస ప్రయాణానికి వెళ్తాము. మంచి రెండు వాహనాలను, ఒంటెలను సిద్ధపరిచి ఉంచు. అప్పుడు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు రెండు ఒంటెలను మంచిగా సిద్ధపరిచి ఉంచారు. అబూబకర్ ఉద్దేశం ఈ రెండు ఒంటెలు స్వయంగా తమ ఖర్చుతో ఆయన తయారు చేసి ఉంచారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఒప్పుకోలేదు. ప్రవక్త ఉపయోగించడానికి ఏ ఒంటెను తీసుకోవాలనుకున్నారో దాని యొక్క ఖరీదు అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హుకు చెల్లించారు. అంతే కాదు, ఈ వలస ప్రయాణంలో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, అల్లాహు అక్బర్! ఎన్నో మహిమలు జరుగుతాయి. ప్రతిసారి హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క ఘనత మరియు ఆయన యొక్క విశిష్టత ఇంకా స్పష్టమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇంటి నుండి కదిలి వెళ్లారో, అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వద్దకు వచ్చారు. ఒంటెలపై ప్రయాణం చేస్తూ ఘారె థౌర్ లోకి వెళ్లి అక్కడ శరణు తీసుకున్నారు. ఆ సందర్భంలో ముందు స్వయంగా అబూబకర్ ఆ ఘార్ లోపలికి వెళ్లారు, ఆ గుహ లోపలికి వెళ్లారు. ఘార్ అంటే గుహ, థౌర్ అక్కడ దాని యొక్క పర్వతం పేరు అందులోని ఒక గుహ. ఆ గుహలో ముందు అబూబకర్ వెళ్లారు ఎందుకు? అక్కడ ఏదైనా పురుగు పూసి, ఏదైనా విషకాటు వేసే అటువంటి విషపురుగులు ఉండకూడదు, ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏదైనా అవస్థ కలగకూడదు అని. అక్కడంతా పరిశుభ్ర చేసిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని లోపలికి పిలిచారు. మరియు ఆ సందర్భంలో ఒకచోట రంధ్రాన్ని చూస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిద్రపోతున్నారు. ఆయనకు ఎలాంటి బాధ కలగకూడదు అని, ఏదైనా ఆ రంధ్రంలో నుండి విషపురుగు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని స్వయంగా ఆయనను గానీ కాటు వేయకూడదు అన్న భయంతో తన ఒక కాలును, తన యొక్క పాదాన్ని ఆ రంధ్రానికి ఆనించి ఉంచారు. కొంతసేపటికి ఏదో విషపురుగు కాటేస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చాలా బాధ కలుగుతుంది, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తల అబూబకర్ తోడపై ఉంది. నేను కదిలానంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నిద్ర చెడిపోతుంది, ఆయన మేలుకుంటారేమో అన్న భయంతో కదలకుండా చాలా జాగ్రత్తగా ఉన్నారు. అల్లాహు అక్బర్! ఎంతటి గొప్ప త్యాగం ఒకసారి గ్రహించండి మీరు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ యొక్క లుఆబ్ ముబారక్ అంటే లాలాజలాన్ని ఆ విషకాటు, విషపురుగు కాటేసిన చోట పెడతారు, అప్పటికప్పుడే నయమైపోతుంది. ప్రయాణంలో వెళుతున్నప్పుడు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఒకసారి ప్రవక్తకు ముందు, ఒకసారి ప్రవక్త వెనక, ఒకసారి ప్రవక్త కుడి వైపున, మరొకసారి ప్రవక్త ఎడమ వైపున ఈ విధంగా ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో అడిగారు, అబూబకర్ ఇలా వెనక, ముందు, కుడి, ఎడమ ఈ విధంగా ఎందుకు మీరు మారుస్తున్నారు స్థలం వెళుతూ వెళుతూ? అప్పుడు అబూబకర్ చెప్పారు, నాకు ఎప్పుడైతే భయం ఏర్పడుతుందో, శంకిస్తానో, ఇటు నుంచి ముందు నుండి ఎవరైనా శత్రువులు ఎదురవుతారా ఆ సందర్భంలో మీకు ఏ హాని కలగకుండా, మీపై ఎలాంటి బాణం రాకుండా నేను ముందుకు వెళ్తాను. నాకు ఎప్పుడైతే ఏదైనా వెళుతూ వెళుతూ ప్రాంతంలో ఇటువైపున ఏదైనా రాళ్ల వెనక ఎవరైనా దాగి ఉండవచ్చును, ఎవరైనా ఏదైనా అక్కడ నుండి బాణం విసురుతారా, ఏదైనా శత్రువు అక్కడ నుండి ఏదైనా దాడి చేస్తాడా అని భయం కలిగినప్పుడు నేను కుడి వైపున వస్తాను, ఎడమ వైపున భయం కలిగినప్పుడు ఎడమ వైపు వెళ్తాను, వెనక వైపు భయం కలిగినప్పుడు వెనక వెళ్తాను. ఈ విధంగా హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కాపాడడానికి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏ హాని కలగకుండా ఉండడానికి ఇంతగా జాగ్రత్తలు పాటిస్తూ ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట ఈ వలస ప్రయాణానికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఏ అవసరం పడుతుందో అని తన వద్ద ఉన్న డబ్బు ధనం మొత్తం వెంట తీసుకొని వెళ్లారు. అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విశ్వాసం, వారి యొక్క ప్రేమ వారి ఇంటి వారి గురించి వదిలి వెళ్లారు. అల్లాహు అక్బర్! సోదర సోదరీమణులారా, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు మొట్టమొదటిసారిగా పురుషులలో ఇస్లాం స్వీకరించిన వ్యక్తి యొక్క ఈ అమూల్యమైన గాధను మనం వింటూ ఉన్నాము. అల్లాహ్ యొక్క దయతో ఈయన యొక్క జీవితంలోని మరెన్నో మంచి విషయాలు మనం తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క వివిధ సందర్భాలలో వివిధ రకాల ధైర్య సాహసాలు, ఇస్లాం ప్రాప్తి కొరకు, వ్యాపించడానికి ఆయన చేసినటువంటి కృషి ఇంత అంత కాదు. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వలస వచ్చిన తర్వాత ప్రతిసారి ప్రతి సమయంలో సులభతరమైన స్థితి గానీ, కష్టతరమైన పరిస్థితి గానీ అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో, అన్ని స్థితుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అండదండగా ఉన్నారు. బద్ర్ యుద్ధం సంఘటన, దాని యొక్క వివరాలు ఎవరికీ తెలియవు? తెలియని వారు చదవండి, తెలుసుకోండి. కేవలం 313 వరకు ఇటువైపు నుండి ముస్లింలు మరియు అటువైపు నుండి అల్లాహ్ యొక్క సత్య ధర్మాన్ని వ్యతిరేకిస్తూ, అల్లాహ్ యొక్క సత్య ధర్మాన్ని ఈ భూమి మీద నుండి నశింపజేయాలి అన్నటువంటి ఒక తప్పుడు ఉద్దేశ్యాన్ని తీసుకుని వెయ్యి కంటే ఎక్కువ మంది వస్తారు. ధర్మాధర్మాల మధ్య, సత్యాసత్యాల మధ్య నెలకొన్నటువంటి ఈ యుద్ధంలో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో రెండు చేతులు ఎత్తి అల్లాహ్ తో దుఆ చేస్తున్నారు, దుఆ చేస్తున్నారు. ఓ అల్లాహ్ నీ ధర్మాన్ని కాపాడడానికి, నీ ధర్మంపై స్థిరంగా ఉండడానికి, నీ ధర్మం నలువైపులా వ్యాపించడానికి ఈ కొంతమంది తమ ప్రాణాలు తమ చేతిలో తీసుకుని ఏదైతే వచ్చారో, నీవు వారిని స్వీకరించు, నీ ధర్మాన్ని కాపాడు, నీ ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఎవరైతే వచ్చారో వారి నుండి మమ్మల్ని, నీ ధర్మాన్ని అన్నిటిని కాపాడేవారు నువ్వే. దుఆ చేస్తూ ఉన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. చేతులు ఎత్తి దుఆ ఎక్కువ సేపు చేయడం మూలంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భుజాల మీద ఉన్నటువంటి ఆ దుప్పటి కింద జారిపడిపోతుంది. అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఆ విషయం చూసి, ఆ సంఘటన చూసి వచ్చి ఆ దుప్పటి కింది నుండి తీసి ప్రవక్త భుజాల మీద వేస్తూ, ప్రవక్తా ఇక సరిపుచ్చుకోండి, ఆపేయండి, అల్లాహు త’ఆలా తప్పకుండా మీ విన్నపాన్ని ఆమోదిస్తాడు, మీరు చేస్తున్న ఇంతటి ఈ దుఆలను తప్పకుండా స్వీకరిస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తృప్తి ఇవ్వను సాగారు. ఆ తర్వాత ఉహద్ యుద్ధం గానీ, ఆ తర్వాత కందక యుద్ధం గానీ, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించే వరకు ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో, ప్రతి యుద్ధంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తోడుగా వెంట వెంటనే ఉన్నారు.

చివరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయాక సహాబాల పరిస్థితి ఏమైంది? అలాంటి సందర్భంలో కూడా హజ్రత్ అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు చెక్కుచెదరకుండా, కదలకుండా ఎంతో ఓర్పుతో, సహనంతో, ధైర్యంతో, నిలకడగా ఉన్నారు. ఆ సంఘటన మీరు బహుశా విని ఉండవచ్చును.

ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇహలోకాన్ని వీడిపోయారో, మలకుల్ మౌత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వారి ఆత్మను తీసుకున్నారో, కేవలం ఈ భౌతిక కాయం హజ్రత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా గారి యొక్క ఇంట్లో మంచముపై ఉన్నది. ఈ విషయం వెంటనే మదీనాలో ఉన్నటువంటి ముస్లింలందరికీ తెలిసిపోయింది. అందరూ చాలా బాధతో రోధిస్తూ మస్జిద్-ఎ-నబవీలో సమూహం అవుతారు. కానీ ఎంతో ధైర్యవంతుడు, ఎంతో శూరుడు, యుద్ధ మైదానాలలో ఎందరినో చిత్తు చేసినటువంటి ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఆయన కూడా ప్రవక్త మరణించారు అన్న విషయాన్ని భరించలేకపోతున్నారు. ఏమన్నారు? ప్రవక్త మరణించలేదు. మూసా అలైహిస్సలాం ఎలాగైతే కొద్ది రోజుల గురించి వేటికి వెళ్లారో అల్లాహ్ తోనే కలుసుకోవడానికి, మళ్లీ తిరిగి వచ్చారో అలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్లారు, చనిపోలేదు. ఎవరైనా ముహమ్మద్ చనిపోయారు అని అనేది ఉంటే నేను అతనిని నా ఈ తల్వారితో నరికేస్తాను అన్నటువంటి నినాదం కూడా మొదలు పెట్టారు. ఆ సమయంలో అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు కొంత దూరంలో ఉన్నారు. ఆయనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణ వార్త తెలిసిన వెంటనే వచ్చేస్తారు. ముందు తమ కూతురు ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర భార్య, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి యొక్క శుభ భౌతిక కాయం ఉన్న ఆ గదిలో వస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దుప్పటి కప్పి ఉంటుంది. ముఖము పై నుండి దుప్పటి తీస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నొసటి మీద చుంబిస్తారు, ముద్దు పెట్టుకుంటారు. అప్పుడు అంటారు, కేవలం అల్లాహ్ మాత్రమే ఎలాంటి మరణం లేనివాడు, ఎల్లకాలం శాశ్వతంగా బ్రతికి ఉండేవాడు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు రెండు మరణాలు లేవు, ఒకే ఒక మరణం ఏదైతే ఉండెనో అది వచ్చేసింది, మీరు చనిపోయారు. అప్పటికీ ముస్లింల యొక్క ఈ పరిస్థితి, వారి యొక్క బాధ, మరోవైపున హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క నినాదం, హజ్రత్ అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఇవన్నీ చూస్తారు. వెళ్లి ఉమర్ ను కూర్చోమని చెప్తారు, కానీ ఆ బాధలో అతను అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి మాటను పట్టించుకోలేకపోతారు. అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు అలాంటి క్లిష్ట పరిస్థితిలో సహాబాలను ఎలా ఓదార్చాలి, ఉమర్ ఏదైతే తప్పుడు ఆలోచనలో ఉన్నాడో ప్రవక్త మరణ బాధ కలిగి అతడు ఏ ఆవేశంలో ఉన్నాడో, అతనిని ఎలా ఓదార్చాలి, అతడి యొక్క తప్పు ఆలోచనను ఎలా సరిచేయాలి? అల్లాహు అక్బర్! అల్లాహ్ యొక్క ఎంత గొప్ప దయ అబూబకర్ మీద కలిగింది. అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఎవరితోనూ గొడవపడలేదు, ఉమర్ ఏంటి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు అని ఆ సందర్భంలో ఏమీ చెప్పలేదు. వెంటనే మస్జిద్-ఎ-నబవీలో మెంబర్ పై ఎక్కారు. అల్లాహ్ యొక్క హమ్ద్-ఒ-సనా, ప్రశంసలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ తర్వాత అంటే ఖుత్బ-ఎ-మస్నూనా అని ఏదైతే అంటామో మనం సామాన్యంగా, ఆ తర్వాత

مَنْ كَانَ يَعْبُدُ مُحَمَّدًا فَإِنَّ مُحَمَّدًا قَدْ مَاتَ، وَمَنْ كَانَ يَعْبُدُ اللَّهَ فَإِنَّ اللَّهَ حَىٌّ لاَ يَمُوتُ
ఎవరైతే ముహమ్మద్ ను పూజించేవారో, ముహమ్మద్ చనిపోయారు అన్న విషయం వారు తెలుసుకోవాలి. మరి ఎవరైతే అల్లాహ్ ను పూజిస్తున్నారో, అల్లాహ్ ను ఆరాధిస్తున్నారో అల్లాహ్ శాశ్వతంగా బ్రతికి ఉండేవాడు, ఎన్నటికీ అతనికి మరణం రాదు.

ఆ తర్వాత ఖురాన్ యొక్క ఆయత్ చదివి వినిపిస్తారు, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు.

وَمَا مُحَمَّدٌ اِلَّا رَسُوْلٌۚ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِ الرُّسُلُ ۗ اَفَا۟ىِٕنْ مَّاتَ اَوْ قُتِلَ انْقَلَبْتُمْ عَلٰٓى اَعْقَابِكُمْ ۗ وَمَنْ يَّنْقَلِبْ عَلٰى عَقِبَيْهِ فَلَنْ يَّضُرَّ اللّٰهَ شَيْـًٔا ۗوَسَيَجْزِى اللّٰهُ الشّٰكِرِيْنَ

(వమా ముహమ్మదున్ ఇల్లా రసూలున్ ఖద్ ఖలత్ మిన్ ఖబ్లిహిర్ రుసుల్, అఫఇమ్మాత అవ్ ఖుతిలన్ ఖలబ్తుమ్ అలా అ’అఖాబికుమ్, వమన్ యన్ఖలిబ్ అలా అఖిబైహి ఫలన్ యదుర్రల్లాహ షైఆ, వసయజ్ జిల్లహుష్ షాకిరీన్)
ముహమ్మద్ కేవలం ఒక ప్రవక్త మాత్రమే. ఆయనకు పూర్వం కూడా ఎందరో ప్రవక్తలు గడిచిపోయారు. ఒకవేళ ఆయన మరణించినా, లేదా చంపబడినా మీరు మీ మడమల మీద వెనుతిరిగి పోతారా ఏమిటి? అలా వెనుతిరిగి పోయినవాడు అల్లాహ్ కు ఎలాంటి నష్టాన్నీ కలిగించలేడు. కృతజ్ఞత చూపే వారికి అల్లాహ్ త్వరలోనే ఉత్తమ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. (3:144)

ఈ ఆయత్ వినగానే హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు అంటారు, నా కాళ్లు నా వశంలో లేవు, నేను కింద పడిపోయాను. అవును, నేను ఈ ఆయత్ ఖురాన్ లో చదివి ఉన్నాను కానీ బహుశా అప్పుడు నేను దీని యొక్క అర్ధాన్ని, దీని యొక్క భావాన్ని ఇంత గంభీరంగా తీసుకోలేదు అని అతను ఒప్పుకున్నారు. సహాబాలందరూ ఈ ఆయత్ అప్పుడే విన్నట్లుగా వారందరూ రోధిస్తూ ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయారు అన్న విషయం వారు ధృవీకరించుకున్నారు. హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు యొక్క ఈ సమయస్ఫూర్తి, ఈ ధైర్యం, ఈ సాహసం, అల్లాహ్ యొక్క సహాయం ఆయనతో ఉండడం మూలంగా ముస్లిం ఉమ్మత్ అంతా ఐకమత్యంతో నిలబడగలిగింది.

ఆ తర్వాత ప్రవక్త తర్వాత మొదటి ఖలీఫాగా హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు నియమితులయ్యారు. నియమితులైన తర్వాత ఆయన ముందు ఎన్నో ఫిత్నాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. మక్కా, మదీనా మరియు తాయిఫ్ ఈ మూడు ప్రాంతాలు తప్ప దాదాపు అరేబియా ద్వీపకల్పంలో ఉన్నటువంటి అనేక తెగల వారు ఇస్లాం నుండి మళ్ళీ తిరిగి తమ పాత ధర్మం వైపునకు వెళ్ళిపోయారు. కొందరు జకాత్ ఇవ్వడానికి తిరస్కరించారు. మరికొందరు తమను తాము ప్రవక్తగా ప్రకటించుకున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, ముస్లింల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉన్నటువంటి సమయంలో హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోక ముందు ఉసామా బిన్ జైద్ యొక్క ఆధ్వర్యంలో ఏదైతే ఒక సైన్యాన్ని సిద్ధపరిచారో, ఆ సైన్యాన్ని పంపడానికే తీర్మానం తీసుకుంటారు. ఎందరో సహాబాలు అన్నారు, అబూబకర్, మదీనాలో మన సంఖ్య తక్కువగా ఉంది, ముస్లిం సైన్యాన్ని బయటికి పంపకండి, మనపై ఎవరైనా దాడి చేస్తారేమో. కానీ అబూబకర్ అన్నారు, లేదు, ప్రవక్త ఏదైతే తీర్మానం తీసుకున్నారో, దాన్ని నేను పూర్తి చేసి తీరుతాను. ఆ సైన్యాన్ని పంపారు. ఆ తర్వాత జకాత్ ఇవ్వని వారితో కూడా నేను యుద్ధం చేస్తాను అన్నారు. ప్రవక్తకు జకాత్ రూపంలో ఏది ఇచ్చేవారో, దానిలో ఒక చిన్న మేకపిల్లను కూడా ఎవరైనా ఇవ్వడానికి తిరస్కరిస్తే నేను అతనితో యుద్ధం చేస్తాను అన్నారు. అల్లాహు అక్బర్! ఎంతటి ధైర్యం. రెండు సంవత్సరాలు, కొన్ని నెలల కాలంలోనే హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు అల్లాహ్ యొక్క దయతో, అల్లాహ్ యొక్క సహాయంతో ఇస్లాంను మళ్ళీ తిరిగి అరేబియా ద్వీపకల్పంలో స్థాపించారు. ఎవరైతే ఇస్లాంను వీడి వెళ్లారో వారిని మళ్ళీ ఇస్లాం వైపునకు తీసుకువచ్చారు.

ఆ తర్వాత ఆయన చనిపోయారు. ఆయన చనిపోయాక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమాధి పక్కనే ఆయనకు కూడా చోటు లభించింది. సోదర సోదరీమణులారా, అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు, ఆయన జీవితం నుండి మనం గుణపాఠం నేర్చుకోవాలి. ప్రవక్తపై విశ్వాసం, అల్లాహ్ పై విశ్వాసం ఎలా ఉండాలి, ఇస్లాం ధర్మం కోసం ఎలాంటి త్యాగాలు చేయాలి, ఎలాంటి కష్ట నష్టాలకు ఓర్చుకోవాలి, ఎలాంటి సాహసంతో ఇస్లాం కొరకు మనం సేవ చేయాలి అన్నటువంటి విషయాలు ఆయన జీవితం నుండి నేర్చుకోవాలి. అల్లాహ్ మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల యొక్క జీవిత చరిత్రలను చదివి, విని, వారి యొక్క మార్గాన్ని అవలంబించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహుమ్మ సల్లీ వసల్లిమ్ అలా నబియ్యినా ముహమ్మద్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.