మంచిని పోత్సహించడం – చెడు వైపునకు పురికొల్పడం | కలామే హిక్మత్

ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. “సన్మార్గం వైపునకు ఆహ్వానించే వానికి అతని ద్వారా సన్మార్గం పొందిన వారికి లభించినంత పుణ్యఫలం లభిస్తుంది. (అయితే) వారి ప్రతిఫలంలో మటుకు ఎటువంటి కొరతా రాదు. (ఇకపోతే) మార్గవిహీనత వైపునకు పిలిచే వ్యక్తికి, అతని ద్వారా మార్గభ్రష్టులైన వారికి లభించినంత దుష్ఫలం లభిస్తుంది. కాగా, ఆ మార్గభ్రష్టుల దుష్కర్మలు తగ్గటమూ జరగదు.” (ముస్లిం)

ఈ పవిత్ర హదీసు ద్వారా రూఢీ అయ్యేదేమిటంటే సౌశీల్యం దైవ మార్గదర్శకత్వాల ప్రాతిపదికలపై అల్లాహ్ వైపునకు, సత్కార్యాల వైపునకు సందేశం ఇచ్చేవాడు ఎంతో ఆదరణీయుడు. అతనికి లభించే ప్రతిఫలం అపారం. దాన్ని అతను ఊహించనైనా లేడు. అల్లాహ్ శుభవార్త ఇచ్చాడు :

41:33 وَمَنْ أَحْسَنُ قَوْلًا مِّمَّن دَعَا إِلَى اللَّهِ وَعَمِلَ صَالِحًا وَقَالَ إِنَّنِي مِنَ الْمُسْلِمِينَ

అల్లాహ్‌ వైపు (జనులను) పిలుస్తూ, సత్కార్యాలు చేస్తూ ‘నేను విధేయుల (ముస్లింల)లో ఒకడను’ అని పలికేవాని మాటకంటే మంచిమాట మరెవరిది కాగలదు?(హామీమ్ సజ్దా 41 : 33)

అల్లాహ్ వైపునకు ఆహ్వానించే వాని మాటకు అంతటి ఉన్నత స్థానం ఎందుకివ్వబడిందంటే అతని మాట ద్వారా ఎంతోమంది దైవ మార్గదర్శకత్వం పొందుతారు. వారందరికీ ఆ మహాభాగ్యం లభించటానికి కారకుడైనందుకు గాను వారు సంపాదించినంత పుణ్యం ఇతనికి కూడా ప్రాప్తిస్తుంది. సత్య సందేశానికి ఉన్న ప్రాధాన్యత ఎంతటిదో ఈ ఒక్క హదీసు ద్వారా అంచనా వేయవచ్చు.

పోతే; మార్గ విహీనత, మార్గభ్రష్టతల వైపునకు ప్రజలను పిలవటం మహా పాతకం. అదెంత ఘోరమయిన అపరాధం అంటే అతని ద్వారా ఎంతమంది మార్గభ్రష్టులయ్యారో, అంతమందీ ఎన్ని పాపాలు చేశారో అన్ని పాపాల భారం అతని పై కూడా పడుతుంది. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించినట్లు హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) చెప్పారు : “ఏ ప్రాణీ అన్యాయంగా వధించబడినా దాని రక్తపు భారం ఆదం యొక్క మొదటి కుమారునిపై పడుతుంది. ఎందుకంటే మొదటి హత్య చేసిన వాడు అతనే.” (బుఖారీ, ముస్లిం, తిర్మిజి)

ఆదం కుమారుడైన ఖాబైల్, మరో కుమారుడైన హాబైల్ని హతమార్చాడు. లోకంలో అది మొట్టమొదటి హత్య. ప్రళయదినం వరకు ఎన్ని హత్యలు జరిగినా వాటి పాపం ఖాబైల్ ఖాతాలోకి వెళుతూనే ఉంటుంది. ఎందుకంటే అతనే హత్యల ద్వారం తెరిచాడు. ఈ విధంగానే చెడుల వైపునకు ప్రజలను పురికొల్పేవాడు కూడా ప్రళయం వరకు అతని అనుయాయులు చేసిన పాపభారాన్ని మోస్తూ ఉంటాడు. మరోవైపు ఆ చెడులు చేసే వారి దుష్పలం కూడా ఏమాత్రం తగ్గదు.

“ఎవరయితే సన్మార్గం వైపునకు ఆహ్వానిస్తారో…”

“ఎవరయితే మార్గ విహీనత వైపునకు పిలుస్తారో….”

అన్ని రకాల పిలుపు లేక ఆహ్వానం ఇందులో ఇమిడిఉంది. అది మూజువాణీగా కావచ్చు, సైగ ద్వారా కావచ్చు, ఆచరణ ద్వారా కావచ్చు, వ్రాతపూర్వకంగా కూడా కావచ్చు. ఇక్కడ సన్మార్గం అంటే దైవాదేశాలు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పవిత్ర పలుకులకు సంబంధించిన విషయం. అల్లాహ్ సెలవిచ్చాడు :

2:38 قُلْنَا اهْبِطُوا مِنْهَا جَمِيعًا ۖ فَإِمَّا يَأْتِيَنَّكُم مِّنِّي هُدًى فَمَن تَبِعَ هُدَايَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ

మేము వారితో అన్నాము: “మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి. నా ఉపదేశం ఎప్పుడు మీ వద్దకు వచ్చినా, దాన్ని అనుసరించే వారికి ఎలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.” (అల్ బఖర 2 : 38)

ఇక్కడ ‘నా తరఫు ఉపదేశం’ అంటే ఆకాశ గ్రంథాలు ప్రవక్తల ప్రబోధనలని భావం. అల్లాహ్ తరఫున అవతరించిన ఆదేశాలను పాటించటం, దైవప్రవక్తకు విధేయత చూపటం కూడా సన్మార్గానుసరణగానే భావించబడుతుంది.

దివ్య ఖుర్ఆన్లో మరోచోట ఇలా సెలవీయబడింది :

7:3 اتَّبِعُوا مَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ وَلَا تَتَّبِعُوا مِن دُونِهِ أَوْلِيَاءَ ۗ قَلِيلًا مَّا تَذَكَّرُونَ

(ప్రజలారా!) మీ ప్రభువు తరఫున మీకు వొసగబడిన దానిని మీరు అనుసరించండి. అల్లాహ్‌ను వదలి ఇతర సంరక్షకులను అనుసరించకండి. మీరు బహుకొద్దిగా మాత్రమే హితబోధను గ్రహిస్తారు.(అల్ ఆరాఫ్ : 3)

మరోచోట చెప్పబడింది :

36:20 وَجَاءَ مِنْ أَقْصَى الْمَدِينَةِ رَجُلٌ يَسْعَىٰ قَالَ يَا قَوْمِ اتَّبِعُوا الْمُرْسَلِينَ
36:21 اتَّبِعُوا مَن لَّا يَسْأَلُكُمْ أَجْرًا وَهُم مُّهْتَدُونَ

(అంతలోనే ఆ) నగరం చివరి వైపు నుంచి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు : “ఓ నా జాతివారలారా! మీరు ప్రవక్తలను అనుసరించండి. మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగని వారి, సన్మార్గాన ఉన్న వారి వెనుక నడవండి.”(యాసీన్ : 20, 21)

ఏ గ్రంథమైతే దైవోపదేశాలకు, దైవప్రవక్త సంప్రదాయానికి అనుగుణంగా లేదో అది మార్గ విహీనత వైపునకు గొనిపోయే గ్రంథంగానే పరిగణించబడుతుంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు మా ఈ (ధర్మ) వ్యవహారంలో ఎవరయినా లేనిపోని విషయాన్ని కల్పిస్తే అది రద్దు చేయబడుతుంది (బుఖారి, ముస్లిం). మరో సందర్భంలో ఇలా పలికారు : “మా పద్ధతిలో లేనిదాన్ని ఎవరయినా చేస్తే అది స్వీకారయోగ్యం కానేరదు.” (ముస్లిం)

“వారి పుణ్యఫలంలో ఏ కొరతా రాదు” అంటే సజ్జనుల లెక్కలోని సత్కర్మలను తీసి, వారిని సన్మార్గంలోకి తెచ్చిన వ్యక్తికి ఇవ్వటం జరగదు అని భావం. అల్లాహ్ కారుణ్యం అనంతమైనది. అది ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. విరివిగా లభిస్తుంది. ఈ వాక్యంలో అటు సద్వర్తనులకు, ఇటు సన్మార్గం వైపునకు ఆహ్వానించే వారికి ఇద్దరికీ శుభవర్తమానం ఉంది.

“వారి పాపాల భారంలో ఎటువంటి తగ్గింపూ జరగదు” : చెడులకు నాంది పలికి, అవి వెర్రితలలు వేయటానికి కారకుడైనందున ఆ చెడులను అనుసరించే వారందరికీ లభించేంత పాప భారం ఈ చెడుల పితామహుడికి కూడా లభిస్తుంది. ఈ వాక్యంలో దుర్వర్తనులకు, దుర్వర్తనం వైపునకు పిలిచిన వారికి కూడా గట్టి హెచ్చరిక ఉంది.

ప్రజలకు మార్గ దర్శకత్వం వహించటంలో ఉన్నత సంప్రదాయాలను నెలకొల్పటం, సత్ క్రియలకు పురికొల్పటం కూడా చేరి ఉంది. జరీర్ బిన్ అబ్దుల్లా గారి హదీసు ద్వారా ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. ఆయన ప్రకారం ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి కొంతమంది పల్లెవాసులు వచ్చారు. వారు ఆపదలో ఉన్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి దురవస్థను, అక్కరలను పసిగట్టి దానధర్మాల ద్వారా వారిని ఆదుకోవలసిందిగా ప్రజలకు పురికొల్పారు. అయితే ప్రజలు దానధర్మాలు చేయటంలో నిర్లిప్తత వహించారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ముఖారవిందంపై విచార ఛాయలు ప్రస్ఫుటమయ్యాయి. అంతలో ఒక అన్సారి వెండి నాణాల సంచి తెచ్చారు. మరొకరు కూడా అదే పని చేశారు. ఆపై ఒకరి తరువాత ఒకరు తెచ్చి దానం చేయసాగారు. ప్రవక్త గారి మోము ఆనందంతో విచ్చుకునేవరకూ వారు తెస్తూనే ఉన్నారు. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు: “ఎవరయినా ఇస్లాంలో ఉత్తమ సంప్రదాయాన్ని నెలకొల్పితే తదనంతరం కూడా అది కొనసాగితే, దాన్ని పాటించే వారందరికీ లభించినంత పుణ్యఫలం, దాన్ని నెలకొల్పిన ఒక్క వ్యక్తికీ లభిస్తుంది. (అలా అని) అటు, దాన్ని అనుసరించే వారి ప్రతిఫలంలో కోత విధించటం జరగదు. (అదేవిధంగా) ఇస్లాంలో ఎవరయినా దుస్సంప్రదాయాన్ని ప్రవేశపెడితే, తరువాత వారు దాన్ని పాటిస్తే, ఆ పాటించే వారందరిపై పడే పాపభారం దాని మూల స్థాపకుడి పై కూడా పడుతుంది. అటు ఆ దుర్మార్గగాముల పాపంలో తగ్గింపు కూడా ఉండదు.” (ముస్లిం)

ఉన్నత సంప్రదాయాలను, ఉత్తమ అలవాట్లను నెలకొల్పటమంటే భావం ముస్లిములు షరీఅత్ ఆదేశాలను పాటించడంలో మార్గం సుగమం అయ్యే పనులు చేయడమని. అదేవిధంగా ఖుర్ఆన్, హదీసులను ఆయా ప్రజల మాతృ భాషలోకి అనువదించి, ధర్మావలంబనలో సాయపడటం కూడా ఈ కోవలోకే వస్తుంది.

ఈ హదీసులో పేర్కొనబడిన అన్సారీ సహచరుడు అందరి కంటే ముందు వెండి నాణాల సంచి తెచ్చి సమర్పించుకోవటం వల్ల ఇతర ముస్లిముల్లోని సేవాభావం జాగృత మయ్యింది. వారంతా దాన ధర్మాలకు పూనుకుని ఆ సత్కార్యంలో తలో చేయి వేశారు. దానికి గాను వారందరికీ లభించే సత్ఫలితం ఆ మొదటి అన్సారీకి లభిస్తుంది.

ఎందుచేతనంటే సత్కార్యం కోసం ఆయన వేసిన ముందడుగు ఇతర సహచరులకు ప్రేరణ నిచ్చింది. స్ఫూర్తి నిచ్చింది. ఇదేవిధంగా ఎవరయితే హితకార్యాల కోసం ప్రేరణ, ప్రోత్సాహాల వాతావరణం సృష్టిస్తారో వారి స్థానం గొప్పది. అయితే అటువంటి వారందరి ధ్యేయం అల్లాహ్ యొక్క ప్రసన్నతను చూరగొనడం అయి ఉండాలి. దాంతోపాటు చేసే పని కూడా ఉత్తమ పద్ధతిలోనే చేయాలి.

ఈ హదీసు ద్వారా మంచికై పురికొల్పే పని ఎంత మహత్పూర్వకమో, ఎంత ప్రాధాన్యతతో కూడుకున్నదో విశధమవుతోంది. అలాగే చెడులను సర్వసామాన్యం చేయడం ఎంత ఘోరపాతకమో స్పష్టమవుతోంది.

[డౌన్లోడ్ PDF]

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ

యదార్థానికి మీ కొరకు దైవప్రవక్త (విధానం)లో అత్యుత్తమ ఆదర్శం ఉంది | కలామే హిక్మత్

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ కథనం ప్రకారం ముగ్గురు మనుషులు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ధర్మపత్నుల ఇళ్ళకు వచ్చి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ఆరాధనల గురించి వివరాలు అడిగి తెలుసుకోసాగారు. వారికా వివరాలు తెలుపగా, అవి కొద్దిగేనని వారనుకున్నారు. తరువాత వారిలా అనసాగారు : “మహాప్రవక్త ఎక్కడా? మేమెక్కడ? ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ముందూ వెనుకటి పొరపొచ్చాలన్నీ క్షమించబడ్డాయి.” తరువాత వారిలో ఒకరు – “నేను ఇకనుండి రాత్రంతా నమాజ్లోనే గడుపుతాను” అని అంటే, మరొకరు, “నేను నిత్యం ఉపవాసం పాటిస్తాను, ఏ ఒక్క రోజు కూడా ఉపవాసం మానను” అన్నారు. ఇంకొకరు, “నేను స్త్రీలకు దూరంగా ఉంటాను, అసలెప్పుడూ వివాహమే చేసుకోను” అని ఖండితంగా చెప్పారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఈ విషయం తెలుసుకుని ఇలా ప్రబోధించారు : “మీరీ విధంగా అంటున్నారు. వినండి – దైవసాక్షిగా! నేను మీకన్నా అధికంగా దైవానికి భయపడేవాడిని. అయితే నేను ఉపవాసం పాటిస్తాను, విరమిస్తాను కూడా. నమాజ్ చేస్తాను, నిద్రపోతాను కూడా. ఇంకా స్త్రీలను కూడా వివాహమాడతాను. ఎవరు నా విధానం పట్ల విసుగెత్తాడో అతనితో నాకెట్టి సంబంధం లేదు.” (బుఖారి)

సూరా అల్ కౌసర్ (అత్యధిక శుభాలు) – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]

సూరా అల్ కౌసర్ – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం)
https://youtu.be/q1WOtndCOOY [31 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 3 ఆయతులు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలను ఈ సూరాలో ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. మొదటి ఆయతులో వచ్చిన ‘కౌసర్’ (సమృద్ధి) అన్న పదాన్నే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ప్రసాదించబడిన అసంఖ్యాక అనుగ్రహాలను ప్రస్తావిస్తూ, అల్లాహ్ ను కొనియాడాలని, ఆయనకు కృతజ్ఞత చూపాలని బోధించడం జరిగింది. అవిశ్వాసుల వైరం, వారి గర్వం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఏమాత్రం నష్టపరచలేవని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సూరాను సూరతు’న్నహ్ర్’గా కూడా వ్యవహరిస్తారు.

77. తఫ్సీర్ సూరా ముర్సలాత్ (Tafsir Surah Mursalat) [వీడియో]

77. తఫ్సీర్ సూరా ముర్సలాత్ (Tafsir Surah Mursalat) [4 వీడియోలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ప్లే లిస్ట్: https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2R3mGtZwe7XSQ2iNzLDPT5

నువ్వు అల్లాహ్ ప్రసన్నత కోసం నీ భార్య నోట్లో పెట్టే ముద్దకు కూడా ప్రతిఫలం పొందుతావు [ఆడియో]

నువ్వు అల్లాహ్ ప్రసన్నత కోసం నీ భార్య నోట్లో పెట్టే ముద్దకు కూడా ప్రతిఫలం పొందుతావు
https://youtu.be/H4nt2ZIXdcA [12 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[6] ఇహలోకంలోనే స్వర్గ సుఖాల శుభవార్త పాందిన పదిమందిలో ఒకరైన అబూ ఇస్‌హాఖ్‌ సాద్‌ బిన్‌ అబూ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) కథనం :

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తాను అంతిమ హజ్‌ యాత్ర చేసిన యేట వ్యాధిగ్రస్తుణ్ణయి ఉన్న నన్ను పరామర్శించే నిమిత్తం నా వద్దకు వచ్చారు. అప్పుడు నేను విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. నేను ఆయన్ని “దైవప్రవక్తా! నా నొప్పి ఎంత తీవ్రంగా తయారయిందో తమరు చూస్తూనే ఉన్నారు. నేనా డబ్బు కలవాణ్లి. నాకు ఒక్కగానొక్క కూతురు తప్ప ఇతర వారసులెవరూ లేరు. నేను నా ధనంలోని మూడింట రొండొంతులను ఎవరికైనా దానం చేయవచ్చా?” అని అడిగాను. దానికి ఆయన “కూడదు” అన్నారు. తిరిగి నేను “సగం ధనం దానం చేయనా” అని అడిగాను. దానికి కూడా ఆయన “కూడదు” అనే అన్నారు. మళ్ళీ నేను “మూడింట ఒక వంతైనా దానం చేయలేనా దైవ ప్రవక్తా!” అని విన్నవించుకోగా అందుకు ఆయన “మూడింట ఒక వంతు అయితే చేయగలవు. కాని అది కూడా ఎక్కువే (లేక) పెద్దదే అవుతుంది” (అని అన్నారు). “ఎందుకంటే నువ్వు నీ వారసులను పరుల ముందు చేయి చాపుతూ తిరిగి దరిద్రులుగా వదలి వెళ్ళడంకన్నా స్టితిమంతులుగా వదలి వెళ్ళడమే ఎంతో శ్రేయస్కరం. (గుర్తుంచుకో!) నువ్వు దైవప్రసన్నత కోసం ఏది ఖర్చు పెట్టినా దానికి నువ్వు ప్రతిఫలం పొందుతావు. ఆఖరికి నువ్వు నీ భార్య నోట్లో పెట్టే ముద్దకు కూడా ప్రతిఫలం పొందుతావు” అని ఉపదేశించారు.

అప్పుడు నేను “ఓ దైవప్రవక్తా! నేను నా సహచరుల వెనుక ఉండిపోతానా? (అంటే నా సహచరులు ముందుగానే చనిపోయి నేను ఈ లోకంలో ఒక్కడినే ఉండిపోతానా?)” అని సందేహపడగా దానికి ఆయన “(అయితేనేమి? మంచిదేగా) ఎందుకంటే నీ సహచరుల అనంతరం నువ్వు బ్రతికివుంటే దైవప్రసన్నత కోసం నువ్వు చేసుకునే ప్రతి ఆచరణతో నీ స్థాయి, అంతస్థులు పెరుగుతాయి. బహుశా నీకు ఇంకా జీవితం గడిపే అవకాశం లభిస్తుందేమో! అప్పుడు కొంత మంది (విశ్వాసులకు) నీవల్ల మేలు కలగవచ్చు, ఇంకొంతమంది (దైవ తిరస్కారులకు) నీ వల్ల కీడు కలగవచ్చు. ఓ అల్లాహ్‌! నా సహచరుల హిజ్రత్‌ని (ప్రస్థానాన్ని) పరిపూర్ణం గావించు. వారిని పరాజయం పాలుచేయకు’ అని వేడుకున్నారు. కాని “సాద్‌ బిన్‌ ఖౌలా” దయార్హులు. ఎందుకంటే ఆయన మక్కాలో ఉండగానే కన్నుమూశారు. అందుకని ఆయన కనికరించబడాలని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దుఆ చేసేవారు. (బుఖారీ – ముస్లిం)

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) – సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)
https://teluguislam.net/2019/10/19/ikhlas/

మనిషి సామూహికంగా చేసే నమాజు అతను తన ఇంట్లో లేదా బజారులో చేసే నమాజుకన్నా 20 రెట్లకు పైగా ఘనమైనది, ఎందుకంటే? [ఆడియో]

మనిషి సామూహికంగా చేసే నమాజు అతను తన ఇంట్లో /బజారులో చేసే నమాజుకన్నా 20 రెట్లకు పైగా ఘనమైనది, ఎందుకంటే?
https://youtu.be/sPhvRWKKhMY [19 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

10-దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారని హజ్రత్‌ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలిపారు:

“మనిషి సామూహికంగా చేసే నమాజు అతను తన ఇంట్లో లేక బజారులో చేసే నమాజుకన్నా ఇరవై రెట్లకు పైగా ఘనమైనది. ఎందుకంటే ఒక వ్యక్తి చక్కగా వుజూ చేసుకుంటాడు, తరువాత నమాజు కోసం మస్జిద్ కు వస్తాడు. నమాజు మాత్రమే అతణ్ణి మస్జిద్కు తీసుకువస్తే – అలాంటి వ్యక్తి మస్జిద్ చేరుకునేంత వరకూ అతను వేసే ఒక్కో అడుగుకు బదులుగా అతని ఒక్కో అంతస్తు పెరుగుతూ ఉంటుంది. అతని వల్ల జరిగిన ఒక్కో పాపం తొలగించబడుతూ ఉంటుంది. ఆ తరువాత మస్జిద్లో ప్రవేశించిన పిదప నమాజు అతన్ని ఆపివుంచినంతసేపూ అతను నమాజు చేస్తున్నట్టుగానే పరిగణించ బడతాడు. మీలో ఎవడైనా నమాజు చేసిన స్థానంలో కూర్చొని ఉన్నంత వరకూ దైవదూతలు అతనిపై అల్లాహ్‌ కారుణ్యం కురవాలని వేడుకుంటూనే ఉంటారు. ఆ వ్యక్తి పరులకు హాని కలిగించనంతవరకు, అతని వుజూ భంగం కానంతవరకు దైవదూతలు “ఓ అల్లాహ్‌! ఈ వ్యక్తిని కరుణించు. ఓ అల్లాహ్‌! ఇతన్ని మన్నించు. ఓ అల్లాహ్‌! ఇతన్ని కనిపెట్టుకుని ఉండు ‘ అని విన్నవించుకుంటూ ఉంటారు”

(బుఖారీ – ముస్లిం). హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి. హదీసులో వచ్చిన పదం “యన్‌హజుహూ” అంటే అతన్ని బయటికి తీసుకువస్తుంది లేక అతన్ని లేపుతుందని అర్థం.

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) – సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)
https://teluguislam.net/2019/10/19/ikhlas/

అల్లాహ్‌ మీ శరీరాలను, మీ ముఖాలను చూడడు. ఆయన మీ అంతరంగాలను, ఆచరణలను మాత్రమే చూస్తాడు [ఆడియో]

అల్లాహ్‌ మీ శరీరాలను, మీ ముఖాలను చూడడు. ఆయన మీ అంతరంగాలను, ఆచరణలను మాత్రమే చూస్తాడు
https://youtu.be/5AZinozb7W8 [18 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

హజ్రత్‌ అబూ హురైరా అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ సఖర్‌ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు: “అల్లాహ్‌ మీ శరీరాలను, మీ ముఖాలను చూడడు. ఆయన మీ అంతరంగాలను, ఆచరణలను మాత్రమే చూస్తాడు.” (ముస్లిం)

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) – సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)
https://teluguislam.net/2019/10/19/ikhlas/

ఇద్దరు ముస్లింలు తమ తమ ఖడ్గాలతో పరస్పరం దాడికి దిగితే, హంతకుడు, హతుడు – ఇద్దరూ నరకానికి వెళతారు | హదీసు కిరణాలు [ఆడియో]

ఇద్దరు ముస్లింలు తమ తమ ఖడ్గాలతో పరస్పరం దాడికి దిగితే, హంతకుడు, హతుడు – ఇద్దరూ నరకానికి వెళతారు
https://youtu.be/hVPv5X3woKA [10 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

9. హజ్రత్‌ అబూబక్రహ్‌ నుఫైబిన్‌ హారిస్‌ సఖఫీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) :

“ఇద్దరు ముస్లింలు తమ తమ ఖడ్గాలతో పరస్పరం దాడికి దిగితే, హంతకుడు, హతుడు – ఇద్దరూ నరకానికి వెళతారు” అని చెప్పారు. నేను “దైవప్రవక్తా! హంతకుని మాట సరేగాని హతుడేం పాపం చేశాడని నరకానికి వెళతాడు? అని సందేహపడ్డాను. అందుకాయన “అతనూ తన ప్రత్యర్థిని చంపాలన్న కసితోనే ఉన్నాడు కదా!” అని బదులిచ్చారు. (బుఖారీ -ముస్లిం)

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) [వీడియో పాఠాలు]

సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్) – (హదీసు కిరణాలు) [ఆడియో సీరీస్]
https://teluguislam.net/2019/10/19/ikhlas/

అల్లాహ్ సత్కార్యాలను, దుష్కార్యాలను రాసి, పిదప వాటిని గురించి వివరించాడు – హదీసు కిరణాలు [ఆడియో]

అల్లాహ్ సత్కార్యాలను, దుష్కార్యాలను రాసి, పిదప వాటిని గురించి వివరించాడు – రియాదుస్ సాలిహీన్
https://youtu.be/LEj9zcBqzMI [16 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్) – హదీసు 11

[11] దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ప్రభువు ద్వారా ఉల్లేఖించిన విషయాన్ని హజ్రత్‌ అబుల్‌ అబ్బాస్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ బిన్‌ అబ్దుల్‌ ముత్తలిబ్‌ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా ఉటంకించారు :

“అల్లాహ్ సత్కార్యాలను, దుష్కార్యాలను రాసి, పిదప వాటిని గురించి వివరించాడు; ఎవరైనా ఏదైనా మంచి పని చేయాలని సంకల్పించుకొని, (ఏదయినా కారణంచేత) దానిని అమలుపరచలేక పోయినప్పటికీ అల్లాహ్‌ తన వద్ద అతను ఒక సత్కార్యం పూర్తి చేసినట్టు రాసుకుంటాడు. మరి ఆవ్యక్తి ఆ మంచి పని చేయాలని ఉద్దేశించుకొన్న పిదప దాన్ని నెరవేరిస్తే దానికి అల్లాహ్‌ పది నుండి ఏడు వందల రెట్లు – ఇంకా దానికంటే ఎన్నో రెట్లు అధికంగానే సత్కర్మలు చేసినట్లు అతని ఖాతాలో రాస్తాడు. (దీనికి భిన్నంగా) ఎవడైనా ఒక చెడుపని చేయాలనుకుని ఏదయినా కారణంచేత చేయకుండా ఉంటే అప్పటికీ అల్లాహ్‌ తన వద్ద, ఆ వ్యక్తి పూర్తిగా ఒక మంచి పని చేసినట్టు రాసుకుంటాడు. అయితే అతను ఆ చెడ్డపని చేయాలని సంకల్పించుకున్న పిదప దాన్ని చేసేస్తే మాత్రం ఒక్క చెడ్డపని చేశాడని పొందుపరుస్తాడు” (బుఖ్లూరీ -ముస్లిం)

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) [వీడియో పాఠాలు]

సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్) – (హదీసు కిరణాలు) [ఆడియో సీరీస్]
https://teluguislam.net/2019/10/19/ikhlas/

92. సూరా అల్ లైల్ (రాత్రి) – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]

92. సూరా అల్ లైల్ (రాత్రి) – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం)
https://youtu.be/n1d3UzeEsAQ (పార్ట్ 1) [50 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[అహ్సనుల్ బయాన్ – తెలుగు అనువాదం & వ్యాఖ్యానం నుండి]

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 21 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా అల్లాహ్ మార్గంలో కృషిచేయడం గురించి, ఇహ లోకంలో మన సంఘర్షణ గురించి తెలియజేసింది. మొదటి ఆయతులో వచ్చిన ‘లైల్’ (రాత్రి) అన్న ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. ఇహలోక జీవితం ఒక సంఘర్షణ అని, ఇహపరలోకాల్లో సాఫల్యం లేదా వైఫల్యం అన్నది ఈ సంఘర్షణపై ఆధారపడి ఉందని, మనం అల్లాహ్ ను విశ్వసించి మంచి పనులు చేస్తే, అల్లాహ్ పట్ల భయభీతులు కలిగి ఉండి, దానధర్మాలు చేస్తే, సత్యాన్ని విశ్వసిస్తే సాఫల్యం పొందగలమనీ, అల్లాహ్ మనకు శాశ్వత స్వర్గవనాలు ప్రసాదిస్తాడని తెలిపింది. కాని మనిషి దుర్మార్గానికి కట్టుబడి, అల్లాహు దూరమైతే, స్వార్ధంతో, దురాశతో వ్యవహరిస్తే, సత్యాన్ని తిరస్కరిస్తే దారుణంగా విఫలమవుతాడు. అల్లాహ్ఆ దేశాలను తిరస్కరించిన వారికి భగభగమండే అగ్నిశిక్ష సిద్ధంగా ఉందని హెచ్చరించడం జరిగింది.