మరణాంతర జీవితం – పార్ట్ 08: ప్రళయదినం రోజు ఉండే ఆందోళనకర పరిస్థితి -2 [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 08 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 08. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 20:41 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్.అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ఈనాటి శీర్షికలో ప్రళయ దినాన ఎలాంటి గాంభీర్యం ఉండును?, ప్రజల పరిస్థితి ఆరోజు ఎలా ఉండును? అనే విషయాలు మనం గత భాగంలో నుండి తెలుసుకుంటూ వస్తున్నాము దాని తరువాయి భాగం ఇది.

మహాశయులారా! ఆ ప్రళయ దినాన అక్కడి ఒక్కరోజు ఇహలోకంలోని యాబై వేల సంవత్సరాల పరిమాణం. యాభై వేల సంవత్సరాలు ఇహలోకంలో గడిస్తే అక్కడి ఒక్కరోజు గడిచినట్టు. గమనించండి! అంత దీర్ఘకాలం ఇది ఎప్పుడు, ఎప్పుడైతే మనం సమాధుల నుండి లేపబడి అల్లాహ్ ఎదుట సమీకరింపబడతామో ఆ సమయాన. అల్లాహ్ (తఆలా) ఆ విషయాన్ని సూరతుల్ మఆరిజ్ లో (70:4) ఇలా తెలియపరిచాడు –

تَعْرُجُ الْمَلَائِكَةُ وَالرُّوحُ إِلَيْهِ فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِينَ أَلْفَ سَنَةٍ – 70:4
యాభై వేల సంవత్సరాల పరిమాణం గల రోజున దైవదూతలు మరియు ఆత్మ (జిబ్రయీల్) ఆయన వైపునకు అధిరోహిస్తారు.

యాబై వేల సంవత్సరాల పరిమాణం గల ఆ రోజున దైవదూతలు మరియు రూహ్ (ఆత్మ), అంటే జిబ్రిల్ అమీన్ ఆయన వైపునకు అధిరోహిస్తారు. అందుకే అక్కడికి చేరుకున్న తర్వాత అవిశ్వాసులు, పాపాత్ములు ఇహదినాన్ని గుర్తు చేసుకుంటూ మేము ఒకపొద్దు మాత్రము లేదా ఒక సాయంకాలం మాత్రమే ఇహలోకం లో ఉన్నాము అని భావిస్తారు.

ఈ రోజుల్లో ముప్పై, నలబై, యాబై సంవత్సరాలు జీవిస్తున్నాము. రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి వస్తూ ఉంది. పగలుశ్రమిస్తున్నాము. రాత్రి పడుకుంటున్నాము. ఈ విధంగా జీవితం ఇహలోక వ్యామోహంలో గడిచిపోతూ ఉంది.. పరలోకం గురించి రవ్వంత కూడా మనం ఆలోచించడం లేదు. ఆలోచించండి!, దాని గురించి సిద్ధపడండి! లేదా అంటే ఆ రోజు ఎలాంటి పరిస్థితి అవుతుంది?. ఈ ఆయతులను శ్రద్ధగా విని అర్ధం చేసుకొనే ప్రయత్నం చేయండి. సూరయే యూనుస్ ఆయత్ నెంబర్ నలబై ఐదు లో అల్లాహ్ (తఆలా) ఇలా తెలిపాడు –

وَيَوْمَ يَحْشُرُهُمْ كَأَن لَّمْ يَلْبَثُوا إِلَّا سَاعَةً مِّنَ النَّهَارِ – 10:45
అల్లాహ్‌ వారిని సమీకరించే ఆ రోజు గురించి జ్ఞాపకం చెయ్యి. అప్పుడు వారికి తాము (ప్రపంచ జీవితంలో) దినములో ఒక గడియకాలం ఆగి ఉన్నామేమో!? అనిపిస్తుంది.

“ఎప్పుడు ఏ రోజున అయితే వారిని సమీకరిస్తామో, పోగు చేస్తామో ఆ రోజున వారు ఏమంటారు? పగలు యొక్క కొంత భాగం మాత్రమే మేము ఇహలోకంలో ఉన్నాము”. ఆ అంటే పరలోక దినాన్ని ఎప్పుడైతే వారు తమ కన్నులారా చూస్తారో అప్పుడు ఇహలోకం చాలా సంక్షిప్తమైన జీవితం, పరలోకానికి ఎదుట దీని యొక్క లెక్క ఏ మాత్రం లేకుండా ఉంది అన్నట్లుగా అప్పుడు వారికి అర్థమవుతుంది. అందుగురించి క్షణం పాటు ఈజీవితంలో మన కోరికల్ని తీర్చుకుంటూ, పాపంలో జీవితం గడుపుతూ ఆ శాశ్వత జీవితాన్ని ఎప్పుడూ పాడు చేసుకోవద్దు. అక్కడ ఆ పరిస్థితిని తట్టుకోలేక, ఆ దీర్ఘ కాలాన్ని భరించలేక మనిషి స్వయంగా తనకు అతి ప్రియమైన వారిని, తన బంధువులలో అతి దగ్గరగా ఉన్న వారిని కూడా ఆనాటి శిక్షకు బదులుగా, పరిహారంగా చెల్లించి తాను శిక్ష నుండి తప్పించుకోవాలి అని కోరుతాడు.

సూరయే మఆరిజ్ పదకొండు నుండి పద్నాలుగు వరకు ఆయతులు ఒకసారి మీరు చదవండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

يَوَدُّ الْمُجْرِمُ لَوْ يَفْتَدِي مِنْ عَذَابِ يَوْمِئِذٍ بِبَنِيهِ – 70:11
నేరస్థుడు ఆ రోజు (తనకు పడే) శిక్ష నుంచి తప్పించుకోవటానికి పరిహారంగా తన కుమారులను,

وَصَاحِبَتِهِ وَأَخِيهِ – 70:12
తన ఇల్లాలినీ, తన సోదరుణ్ణి,

وَفَصِيلَتِهِ الَّتِي تُؤْوِيهِ – 70:13
తనకు ఆశ్రయమిచ్చిన తన కుటుంబాన్నీ,

وَمَن فِي الْأَرْضِ جَمِيعًا ثُمَّ يُنجِيهِ – 70:14
భూమండలంలోని సమస్త జనులనూ ఇచ్చేసి, తాను మాత్రం బయటపడాలని కోరుకుంటాడు.

كَلَّا ۖ إِنَّهَا لَظَىٰ – 70:15
(కాని ఇది) అసంభవం. నిశ్చయంగా అది జ్వలించే అగ్ని.

అపరాధి ఆ రోజు ఇలా కోరుతాడు – ఆనాటి శిక్షకు బదులుగా, పరిహారంగా చెల్లించాలి ఎవరిని సంతానాన్ని, తన సహవాసిని, ఏ వంశం, ఏ కుటుంబం అతనికి రక్షణ ఇచ్చిందో, శరణ ఇచ్చిందో స్వయంగా వారిని కూడా నరకంలో తోసేయ్యాలి. ప్రపంచంలో ఉన్న వారందరినీ కూడా అతనికి బదులుగా నరకంలో పడ వేయాలి. ఆ తర్వాత అతన్ని అతనికి మోక్షం కలిగించాలి, అతనికి దాని నుండి రక్షణ కలిగించాలి – అని అపరాధి ఆ రోజు కోరుతాడు. సమాధానం ఏమి వస్తుంది అల్లాహ్ వైపు నుండి? “ముమ్మాటికి అలా జరగదు”. అందుగురించి ఆ రోజు రాకముందే మనం సిద్దపడాలి. దానికి సిద్ధమై ఆ రోజు మనపై అంత కష్టంగా గడవకుండా మనం అతి త్వరగా ఆ సమయం మనకు దాటే విధంగా మనం చూసుకోవాలి.

ఇదే సూరయే మఆరిజ్ లో అల్లాహ్ (తఆలా) తెలిపాడు.

إِنَّهُمْ يَرَوْنَهُ بَعِيدًا – 70:6
అది (ఆ శిక్ష) చాలా దూరాన ఉందని వారు భావిస్తున్నారు.

وَنَرَاهُ قَرِيبًا – 70:7
కాని అది మాకు చాలా దగ్గరే కనిపిస్తున్నది.

అవిశ్వాసులకు, సత్యతిరస్కారులకు, అపరాధాలు చేసినవారికి ఆ రోజు అంత దీర్ఘంగా ఏర్పడుతుంది. కానీ, మాకు, విశ్వాసం అవలంభించిన వారికి, సత్కార్యాలు చేస్తున్న వారికి, అల్లాహ్ ఇష్టప్రకారం తమ జీవితం గడుపుతున్న వారికి, అది చాలా తక్కువ సమయంగా, కొన్ని హదీతు లలో చెప్పడం జరిగింది, ఒక ఫర్ద్ నమాజ్ (విధి నమాజ్) చేయడంలో ఎంత సమయం అవుతుందో అంతే వారికి ఏర్పడుతుంది.

ఈ విధంగా మహాశయులారా! ఎన్ని పాపాలు పెరుగుతాయో, ఎన్ని కష్టాలు పెరుగుతాయో, ఎంత మనం అవిశ్వాసానికి ఒడికడతామో, దైవ ధిక్కారానికి, అల్లాహ్ ఏకత్వ ఆరాధనకు దూరంగా ఉంటామో, ఆ రోజు మనకు అంతే దూరంగా, దీర్ఘంగా, పొడుగ్గా ఏర్పడుతుంది. ఎంత మనం అల్లాహ్ కు చేరువుగా ఉంటామో, ఆయనకు విధేయత పాటిస్తూ ఉంటామో, కేవలం ఆయన యొక్క ఆయన ఆరాధనలోనే మన జీవితం గడుపుతామో అది మనకు చాలా తక్కువ సమయంగా ఏర్పడుతూ ఉంటుంది.

ఆ రోజు ప్రజలు మూడు స్థితులుగా ముందుకు వస్తారు. ఒకరు అవిశ్వాసానికి ఒడిగట్టిన వారు. మరొకరు విశ్వాసమార్గాన్ని అవలంబించారు కానీ దానిపై స్థిరంగా నడవలేదు. పాపాలలో కూరుకుపోయి పేరుకు మాత్రమే ఇస్లాంను అవలంబించినట్లుగా జీవితం గడిపేవారు. మూడోవారు పుణ్యాత్ములు, సదాచారణ చేసేవారు, విశ్వాసులు, అల్లాహ్ యొక్క భక్తులు. ఈ ముగ్గురు స్థితులు ఎలా ఉంటాయో, వాటి గురించి ఖురాన్లో ఏ ప్రస్తావన తెలపడం జరిగిందో, ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి గురించి ఏ విషయాలు తెలిపారో అది ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకో బోతున్నాము.

ఎవరైతే అవిశ్వాసానికి ఒడికడతారో, సత్య తిరస్కారానికి పాల్పడతారో వారి యొక్క పరిస్థితి ఏముంటుంది? ఎవరు ఏ స్థితిలో చనిపోయినా, ఎవరు ఎక్కడ దేనికి గురి అయినా, క్రూర జంతువులకు ఆహారంగా అయిపోయినా, నీళ్ళల్లో కొట్టుకుపోయినా, కాల్చబడి బూడిద అయిపోయినా, ఏ స్థితిలో ఎవరు ఉన్నాగాని అల్లాహ్ వారందరినీ వెలికి తీస్తాడు. ఎప్పుడైతే వారు బయటకి వస్తారో, ఆ మహా మైదానంలో సమీకరింపబడతారో అప్పుడు ఆ సందర్భంలో అవిశ్వాసులు –

مُّهْطِعِينَ إِلَى الدَّاعِ ۖ يَقُولُ الْكَافِرُونَ هَٰذَا يَوْمٌ عَسِرٌ – 54:8
తమను పిలిచేవాని వైపు పరుగెత్తుకుంటూ వస్తారు. అప్పుడు అవిశ్వాసులు “ఇది చాలా గడ్డు రోజు” అనంటారు.

అవిశ్వాసులు, సత్య తిరస్కారాలు అంటారు – “ఈ రోజు చాలా కఠినమైనరోజు, చాలా కష్టతరమైన రోజు.” అంతే కాదు ఆనాటి గాంభీర్యాన్ని చూసి తమకుతాము శాపం కురిపించు కుంటూ అయ్యో నా పాడుగాను అనుకుంటూ అరుస్తారు.

సూరయే యాసీన్, ఏ సూరాలోనైతే ప్రళయ దినానికి సంబంధించిన ఎన్నో సత్య విషయాల్ని, ఎన్నో వివరాలను అల్లాహ్ (తఆలా) స్పష్ట పరిచాడో ఆ సూరయే యాసీన్ ను ఈరోజుల్లో బ్రతికి ఉన్న వారు చదివి గుణపాఠం నేర్చుకునే కి బదులుగా దానిని మృత్తులపై చదువుతూ ఉంటారు. ఈ సూరయే యాసీన్ ఈ ఖురాన్ లో అవతరింప చేయటానికి ముఖ్య కారణం బ్రతికి ఉన్నవారికి ఒక హెచ్చరిక, వారు దాని నుండి గుణపాఠం నేర్చుకోవాలి. అయితే అదే సూరాలో ఖురాన్ లో అల్లాహ్ అంటున్నాడు:

وَنُفِخَ فِي الصُّورِ فَإِذَا هُم مِّنَ الْأَجْدَاثِ إِلَىٰ رَبِّهِمْ يَنسِلُونَ – 36:51
మరి శంఖం పూరించబడగానే అందరూ తమ తమ గోరీల నుంచి లేచి, తమ ప్రభువు వైపునకు వడివడిగా వస్తారు

قَالُوا يَا وَيْلَنَا مَن بَعَثَنَا مِن مَّرْقَدِنَا ۜ ۗ هَٰذَا مَا وَعَدَ الرَّحْمَٰنُ وَصَدَقَ الْمُرْسَلُونَ – 36:52
“అయ్యో మా దౌర్భాగ్యం! మమ్మల్ని మా శయనాగారాల నుంచి లేపినదెవరు?” అని వారు వాపోతారు. “కరుణామయుడు (అయిన అల్లాహ్‌) చేసిన వాగ్దానమిదే. ప్రవక్తలు చెప్పింది నిజం” (అని వారితో అనబడుతుంది).

శంఖము ఉదబడినప్పుడు వారు తమ సమాధుల నుండి లేచి పరుగెడుతూ వస్తారు. అయ్యో! మా పాడుగాను అని తమకు తాము శపించుకుంటారు. మా ఈ పడక గదుల నుండి మమ్మల్ని ఎవరు లేపారు? అని అంటారు. అప్పుడు వారితో చెప్పడం జరుగుతుంది. రహ్మాన్ కరుణామయుడైన అల్లాహ్ చేసిన వాగ్దానం ఇది. ఈ రోజు తప్పకుండా మీరు ఆయన ఎదుట సమీకరింపబడతారు. ప్రవక్తలు కూడా ఈనాటి దినం గురించి మీకు ఏదైతే చెప్పారో అది సత్యం జరిగితీరింది. ఇప్పుడు మీరుకు మీరు శపించి కున్నా, మీకు మీరు బాధ పడ్డా అయ్యో! మమ్మల్ని ఎవరు లేపారు? ఎందుకు లేపారు? అని ఎంత మీరు కేకలు పెట్టినా ఏమి లాభం లేదు.

ఎవరైతే ఈ లోకంలో అల్లాహ్ ఆరాధనను ధిక్కరించారో, పుణ్య మార్గంలో నడవడానికి ఇది మాపని కాదు అంటూ పుణ్యాన్ని గురించి, సత్కార్యాల్ని గురించి, మంచిని గురించి బోధించే వారిని అడ్డుకునే వారు. అలాంటి వారి పరిస్థితి ఏమి జరుగుతుంది? సూరయే ఇబ్రాహీం నలబై ఎనిమిది నుంచి యాబై వరకు చదివి చూడండి –

يَوْمَ تُبَدَّلُ الْأَرْضُ غَيْرَ الْأَرْضِ وَالسَّمَاوَاتُ ۖ وَبَرَزُوا لِلَّهِ الْوَاحِدِ الْقَهَّارِ – 14:48
ఏ రోజున ఈ భూమి మరో భూమిగా మార్చివేయబడుతుందో, ఆకాశం సయితం (మారిపోతుందో), అప్పుడు అందరూ సర్వశక్తిమంతుడు, ఒకే ఒక్కడైన అల్లాహ్‌ ముందుకు వస్తారు

وَتَرَى الْمُجْرِمِينَ يَوْمَئِذٍ مُّقَرَّنِينَ فِي الْأَصْفَادِ – 14:49
ఆ రోజు అపరాధులంతా ఒకచోట సంకెళ్ళతో బంధించబడి ఉండటం నువ్వు చూస్తావు.

سَرَابِيلُهُم مِّن قَطِرَانٍ وَتَغْشَىٰ وُجُوهَهُمُ النَّارُ – 14:50
వారి దుస్తులు గంధకంతో చేయబడిన దుస్తులై ఉంటాయి. అగ్నిజ్వాలలు వారి ముఖాలను సయితం ఆవరించి ఉంటాయి.

“ఏ రోజు అయితే భూమి మార్చివేయడం జరుగుతుంది, ఈ భూమి ఉండదు మరియు ఆకాశాలు కూడా అవన్నీ మార్చివేయడం జరుగుతుంది. అందరూ ఆ ఏకైక, మరియు ఎంతో శక్తిశాలి అయినా అందరి పై గెలుపొందినటువంటి ఆ సృష్టికర్త ఎదుటకు హాజరవుతారు, వెలికి వస్తారు. అపరాధులను, అల్లాహ్ ఆరాధనలు దిక్కరించిన వారిని నువ్వు చూస్తావు. వారిని సంకెళ్లలో బంధించబడి తీసుకురావడం జరుగుతుంది. వారి యొక్క దుస్తులు, గంధకం తో చేయబడిన దుస్తులు గా ఉంటాయి మరియు వారిని అగ్ని కమ్ముకొని ఉంటుంది”. అల్లాహ్ ఇలాంటి అన్ని శిక్షల నుండి ఇలాంటి భయంకరమైన ఆ పరిస్థితి నుండి మనందరినీ కూడా కాపాడుగాక!

మరొక బాధకరమైన మరియు ఆశ్చర్యకరమైన, గాంభీర్యం అయిన విషయం మరొకటి ఏమిటంటే, ఆ రోజు సూర్యుడు కేవలం ఒక మీల్ (మైల్) అంత దూరంలోనే ఉంటారు. అల్లాహు అక్బర్! గమనించండి ఈరోజు సూర్యుడు మన నుండి ఎంత దూరంలో ఉన్నాడో దానికంటే కొంచెం దగ్గరయ్యాడంటే మనం కాలి మసి బొగ్గుల్లా మారుతాము. కానీ ఆరోజు వేడి యొక్క, ఆనాటి శిక్ష యొక్క రుచి చూపించడానికి ఈ శరీరాలు భరించేటువంటి అల్లాహ్ (తఆలా) అటువంటి శరీరాలను పుట్టిస్తాడు. మరియు సూర్యుడు ఇంత దగ్గరగా ఉండి, దాని యొక్క తాపం, దాని యొక్క వేడి వల్ల మనిషి పరిస్థితి ఏమవుతుంది? ఆ వేడి వల్ల మరియు ఇహలోకంలో వారి యొక్క కర్మలు ఎలా ఉండెనో దాని ప్రకారంగా వారి నుండి చెమట వెళ్తూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. చివరికి కొందరి పరిస్థితి ఏముంటుంది?

సహీ ముస్లింలో హదీత్ ఉంది – ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు చెప్పారు: సూర్యుడు ఒక మైల్ దూరంలో ఉంటాడు. ఆ రోజు సూర్యుడు సమీపిస్తాడు అది కేవలం పరిమాణం అనేది కేవలం ఒక మైల్ అంత దూరం లో ఉంటుంది“. ఒక ఉల్లేఖనంలో ఉంది – “ఆ రోజు ప్రజలు వారి కర్మల ప్రకారంగా చెమటలో మునిగి ఉంటారు. కొందరు తమ చెమటలో చీలమండలాల వరకు మునిగి ఉంటారు. మరి కొందరు తమ చెమటలో మోకాళ్ళ వరకు మునిగి ఉంటారు. మరికొందరు తమ చెమటలో నడుము వరకు మునిగి ఉంటారు. మరికొందరు తమ చెమటలో పూర్తిగా మునిగి ఉంటారు“.

సూరయే ముతఫ్ఫిఫీన్ ఆయత్ يَوْمَ يَقُومُ النَّاسُ لِرَبِّ الْعَالَمِينَ – 83:6 (ఆ రోజు జనులంతా సర్వలోకాల ప్రభువు ముందు నిలబడతారు) యొక్క వ్యాఖ్యానంలో ఒక సందర్భంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు చెప్పారు. “ప్రజలు ఆ రోజు తమ కర్మల ప్రకారంగా తమ చెమట లో మునిగి ఉంటారు. కొందరు అయితే ఈ చెవుల మధ్యలో వరకు మునిగి ఉంటారు“.

సహీ బుఖారి మరియు సహీ ముస్లిం లోని హదీత్ లో ఉంది. “ప్రళయ దినాన ప్రజలకు చెమటలు కారుతూ ఉంటాయి. కారుతూ ఉంటాయి. చివరికి వారి చెమట వారి వెనక డెబ్బై గజాల దూరం వరకు కూడా పారుతూ ఉంటుంది“. అల్లాహు అక్బర్! గమనించండి ఇది స్వయంగా మన చెమట. ఆరోజు ఆ పరిస్థితి ఉంటుంది.

ప్రళయ దినాల ప్రజలందరూ కూడా లేచి వచ్చినప్పుడు అల్లాహ్ యొక్క మాటలు ధిక్కరించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క బాటను అవలంబించని వారు, ప్రవక్త బాటకు వ్యతిరేకంగా వారి యొక్క మిత్రులు, వారి యొక్క స్నేహితులు, వారి యొక్క ఫ్రెండ్ వారి మాటలకు ప్రాధాన్యతను ఇచ్చువారు ఎలా వాపోతారో, బాధపడతారో ఈ ఆయతులను విని గమనించండి.

وَيَوْمَ يَعَضُّ الظَّالِمُ عَلَىٰ يَدَيْهِ يَقُولُ يَا لَيْتَنِي اتَّخَذْتُ مَعَ الرَّسُولِ سَبِيلًا – 25:27
ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు: “అయ్యో! నేను దైవప్రవక్త (సఅసం) మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బావుందేది!”

يَا وَيْلَتَىٰ لَيْتَنِي لَمْ أَتَّخِذْ فُلَانًا خَلِيلًا – 25:28
“అయ్యో! నా పాడుగాను. నేను ఫలానా వ్యక్తిని స్నేహితునిగా చేసుకోకుండా ఉంటే ఎంత బావుండేది!

لَّقَدْ أَضَلَّنِي عَنِ الذِّكْرِ بَعْدَ إِذْ جَاءَنِي ۗ وَكَانَ الشَّيْطَانُ لِلْإِنسَانِ خَذُولًا – 25:29
“నా వద్దకు ఉపదేశం వచ్చిన తరువాత కూడా వాడు నన్ను అపమార్గం పట్టించాడే! ఎంతయినా షైతాను మనిషికి (అదను చూసి) ద్రోహం చేసేవాడే!”

“ఆ రోజు అపరాధి, దౌర్జన్య పరుడు స్వయంగా తన చేతులను కొరుకుతాడు. మరి అంటాడు – అయ్యో! నా పాడుగాను. నేను ప్రవక్త బాటను అనుసరించి ఉంటే ఎంత బాగుండిపోను, ఓ నా పాడుగాను ఫలానా వ్యక్తిని నేను స్నేహితుడిగా చేసుకోకుంటే బాగుండును. నా దోస్తు, నా ఫ్రెండ్, నా యొక్క మిత్రుడు బోధ నా వద్దకు వచ్చిన తరువాత నన్ను మార్గభ్రష్టత్వం లోకి పడవేశాడు. ఈవిధంగా తీరా సమయం వచ్చినప్పుడు షైతాను మానవుణ్ణి అవమానం పాలు చేస్తాడు”.

అల్లాహ్ (తఆలా) మనందరి సృష్టికర్త ఆ రోజు సంభవించే విషయాల్ని విశదీకరిస్తూ మన గురించి ఇంత గొప్ప మేలు చేసాడో గమనించండి. ఇకనైనా సత్యాన్ని, ధర్మాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవితం గడిపే ప్రయత్నం మనం చేద్దాం. ఈ పరిస్థితి అంతా చూసి అప్పుడు వారికి అర్థమవుతుంది – “ఈ రోజు మనకు ఎవరు సిఫారసు చేసేవాడు లేడు. ఎవరి సహాయం మనకు అందదు. ఈరోజు మనం అల్లాహ్ యొక్క మన్నింపును, అల్లాహ్ యొక్క క్షమాపణను నోచుకోలేము” అన్నటువంటి నిరాశ వారికి అప్పుడు కలుగుతుంది.

సూరయే రూమ్ ఆయత్ నెంబర్ పన్నెండులో అల్లాహ్ చెప్పాడు –

وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يُبْلِسُ الْمُجْرِمُونَ – 30:12
ప్రళయం నెలకొన్ననాడు అపరాధులు దిగ్భ్రాంతి చెందుతారు.

ప్రళయం సంభవించిన రోజున అపరాధములు పూర్తిగా నిరాశ చెంది పోతారు – ఇక వారి యొక్క మన్నింపు జరగదు అని, వారు ఇహ లోకంలో చేసుకున్న పుణ్యాలు ఏ మాత్రం పనికి రావు అని. విశ్వాసం లేనిది ఏ పుణ్యము అంగీకరించబడదు. అందుకే ఆ రోజు అవిశ్వాసులు ఇదే కోరుతారు – “నా వద్దనైతే విశ్వాసం లేదు, నా వద్దనైతే సత్కార్యాలు లేవు. నేను అల్లాహ్ కు ఏమని సమాధానం పలకాలి? అయ్యో! ఈరోజు నేను మట్టిని అయిపోయి ఎలాంటి లెక్క ఇవ్వకుండా, ఎలాంటి అల్లాహ్ వద్ద నిలబడేటువంటి పరిస్థితి రాకుండా ఉంటె బాగుండును” అని. కానీ అలాంటి కోరికలు పూర్తి కావు.

ఇలా సూరయే నబాలో ఇలా తెలియపరిచారు.

وَيَقُولُ الْكَافِرُ يَا لَيْتَنِي كُنتُ تُرَابًا – 78:40
అప్పుడు అవిశ్వాసి, “అయ్యో! నేను మట్టినైపోయినా బావుండేదే!” అనంటాడు.

ఆ రోజు అవిశ్వాసుడు అంటాడు – అయ్యో! నేను మట్టిగా మారిపోతే ఎంత బాగుండేది! అని వాపోతాడు. కానీ అతనికి ఏ ప్రయోజనం చేకూర్చదు దానివల్ల. అందుగురించి మహాశయులారా! ఇలాంటి పరిస్థితులు మనకు జరగకూడదు. ఇలాంటి పరిస్థితి మనది కాకూడదు అంటే విశ్వాసమార్గాన్ని అవలంబించి సత్కార్యాలు చేస్తూ ఉండాలి. అల్లాహ్ (తఆలా) మనందరికీ అలాంటి సౌభాగ్యం ప్రసాదించుగాక!

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

%d bloggers like this: