స్వార్థపరులైన సోదరులు (తోట వారి గాథ)  – ఖురాన్ కథామాలిక

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

“ఆ సోదరులు నిద్ర పోతుండగానే నీ ప్రభువు తరఫున ఒక ఆపద వారి తోటను చుట్టుముట్టి పోయింది. అంతే! తెల్లవారే సరికల్లా ఆ తోట కోత కోసిన చేను మాదిరిగా అయిపోయింది.(ఖుర్ఆన్ 68 : 19 – 20)

ఒ క రోజు ప్రాతఃకాలం, నలు దిశలా ప్రశాంత వాతావరణం అలుముకుని ఉంది. రాతి నేలపై చేతికర్రతో కొడుతూ ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తోంది. మధ్యమధ్యలో ఆ వ్యక్తి ఆయాసంతో దీర్ఘశ్వాస విడువడం కూడా చెవులకు సోకుతోంది. ఆ వ్యక్తి ఒక ముసలివాడు.ఆయన తన తోట వద్దకు వెళుతున్నాడు.ఆ తోటలో అనేక పండ్ల చెట్లు ఉన్నాయి. చెట్లన్నీ విరగకాసాయి. తోట మధ్యలో ఒక సెలయేరు ప్రవహిస్తోంది. అనేక పూల వాసనతో అక్కడ గాలి మధురంగా గుబాళిస్తోంది. ప్రాతఃకాలం మసకమసక వెలుతురు నెమ్మదిగా ప్రకాశ మానం అవుతోంది. పక్షులు ప్రపంచాన్ని నిద్రలేపడానికి కిలకిలరావాలు ప్రారంభించాయి. కాని ఈ ప్రకృతి సౌందర్యం ఆ ముసలి వ్యక్తి ధ్యాసను మరల్చలేదు. విశ్వప్రభువు అనుగ్రహాలను అన్వేషించే విషయంలో ఆయన ఏమాత్రం నిర్లక్ష్యంచేయదలచుకోలేదు. ఆయన సమయం కాగానే అల్లాహ్ ను స్మరిస్తూ నమాజు చేసి అల్లాహ్ అనుగ్రహాలకు కృతజ్ఞతలు చెల్లించాడు.

తన తోటలోకి ఆయన అందరినీ అనుమతించేవాడు. అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే అవకాశం కల్పించేవాడు. అయితే ఎవరూ తన తోటను నాశనం చేయకుండా జాగ్రత్తగా ఉండేవాడు. తోటలో పండ్లను దించేటప్పుడు బీదలను పిలిచి వారికి ఉదారంగా తన ఫలసాయం నుంచి పంచి పెట్టేవాడు. అంతేకాదు, తోటలో దించకుండా మిగిలిపోయిన పండ్లను దించుకునే అనుమతి బీదలకు ఇచ్చేవాడు.

ఆ ముసలి వ్యక్తికి ముగ్గురు కుమారులు. అందులో ఇద్దరు తమ తండ్రికి పూర్తి విరుద్ధమైన స్వభావం కలిగిన వారు. తమ తండ్రి ఉదారంగా చేసే దానధర్మాలు వారికి సహించేవి కావు. వారిలో ఒకడు తండ్రితో, “మీరు బీదలకు అంతా పంచి పెట్టి మాకు రావలసిన వాటా తగ్గిపోయేలా చేస్తున్నారు” అని కూడా అన్నాడు. రెండవ కుమారుడు మరింత ముందుకు పోయి, ”మీ దానధర్మాలు చివరకు మనల్ని కూడా బిచ్చగాళ్ళయ్యేలా చేస్తాయి” అన్నాడు. ఇది విన్న మూడవ కుమారుడు జవాబు చెప్పబోయాడు. కాని తండ్రి అతడిని వారించాడు. ఆ ముసలి వ్యక్తి తన కుమారులను విచారంగా చూస్తూ, “పిల్లల్లారా! నేను దానధర్మాలు చేయడం వల్ల మనం బీదవాళ్ళమై పోతామని మీరనుకోవడం చాలా పొరపాటు. ఇది స్వార్థపూరితమైన ఆలోచన. మీరు కోరుతున్న ఈ సంపద నిజానికి మీది కాదు, నాది కాదు. ఈ సంపద అల్లాహ్ ది. నేను కేవలం ఈ సంపదకు పర్యవేక్షకుడిని మాత్రమే. ఈ సంపదను కేవలం నా స్వంతానికి మాత్రమే ఖర్చు చేసుకునే అనుమతి నాకు లేదు. అల్లాహ్ సృష్టించిన మిగిలిన వారికి కూడా దీనిలో భాగం ఉంది. ముఖ్యంగా బీదలకు, బాటసారులకు, అవసరార్థులకు ఇందులో భాగం ఉంది. పక్షులు, క్రిమి కీటకాలకు కూడా ఇందులో భాగం ఉంది. ఎందుకంటే, అవి కూడా అల్లాహ్ సృష్టిలోనివే. ఆ తర్వాత మిగిలినదే మనది. ఆ విధం గానే మనిషి తన సంపదను పరిశుద్ధం చేసుకోగలడు. సౌభాగ్యాన్ని, సంపదలో వృద్ధిని పొందగలడు. నేను ఈ విధానాన్ని నా యవ్వనం నుంచి అనుసరిస్తూ వస్తున్నాను. మరణించే వరకు ఈ పద్ధతికే కట్టుబడి ఉంటాను.

ఇప్పుడు నేను ముసలివాడినై పోయాను. నా శరీరం వ్యాధులతో క్రుంగిపోయింది. నా చావు ఇక ఎంతో దూరంలో లేదు. కాబట్టి ఇదంతా మీరు స్వంతంచేసుకునే రోజు పెద్ద దూరంలో లేదు. అప్పుడు మీ ముందు రెండు దారులుంటాయి. మీరు కూడా నా మాదిరిగా మీ సంపదను అల్లాహ్ మార్గంలో ఖర్చుచేస్తే అల్లాహ్ మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. కాని మీరు స్వార్థపరులై సంపదనుఅల్లాహ్ మార్గంలో ఖర్చు చేయకపోతే మీరు ఆయన అనుగ్రహాలను కోల్పోవడమేకాదు, చివరకు ఉత్త చేతులతో మిగులుతారు. కాబట్టి కుమారులారా! అల్లాహ్మనల్ని ఇలా ఉండాలని ఆదేశిస్తున్నాడు” అని చెప్పాడు.

ఈ సంభాషణ జరిగిన కొంత కాలానికే ఆ ముసలి వ్యక్తి మరణించాడు.తర్వాత తోటలో పండ్లు దించే సమయం వచ్చినప్పుడు బీదలు ఎప్పటి మాదిరిగా అక్కడకు వచ్చి తమకు కూడా ఇవ్వడం జరుగుతుందని ఎదురు చూడసాగారు.కాని ఇప్పుడు ఆ తోటకు యజమానులు కుమారులు. వాళ్ళు బీదలకు తోటలోలభించే పండ్లలో ఏదీ ఇవ్వరాదని, బాటసారులు తోటలో ప్రవేశించే అనుమతి ఇవ్వరాదని నిర్ణయించుకున్నారు. కాని మూడవ కుమారుడు తండ్రిని పోలినవాడు. అతను తన సోదరులతో, “మీరు చెప్పే మాటలు దుర్మార్గంతో కూడుకున్నవి. దుర్మార్గం చెడును కొనితెస్తుంది. బీదలను కాదనడం ద్వారా మనం ప్రయోజనాలు పొందలేం. పైగా మనం స్వయంగా ఇబ్బందులకు గురికావచ్చు. కాబట్టి అల్లాహ్ ప్రసాదించిన ఈ సంపద మన తండ్రి వద్ద ఉన్నప్పుడు ఆయన ఎలా ఇచ్చేవారో అలాగే ఇవ్వడం మంచిది” అన్నాడు. కాని సోదరులు ఈమాటలకు ఆగ్రహించి, “నీకు సంబంధంలేని వ్యవహారాల్లో మాకు సలహాలు ఇవ్వవద్దు. నాన్న బ్రతికి ఉన్నప్పుడు చాలా సలహాలు తీసుకున్నాం” అన్నారు.కాని మూడవ కుమారుడు తన పట్టు వదల్లేదు. ”మనం అల్లాహ్ ను ప్రార్థించి అల్లాహ్ మార్గదర్శనాన్ని కోరుకుందాం.. ప్రార్థన మనిషిని చెడు నుంచి కాపాడుతుంది” అన్నాడు. కాని సోదరులు అతని మాటలను ఏమాత్రం లక్ష్యపెట్టలేదు.

మరుసటి రోజు తెల్లవారుజామున లేచి తోటలోని పండ్లను దించి తామేపంచుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. అలాగే మరుసటి రోజు తెల్లవారుజామున తోటకు వెళ్ళారు. కాని అక్కడ కనబడిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు. వారి తోట పరిస్థితే మారిపోయింది. అంతా నాశనమై పోయింది.అసలు గుర్తుపట్టడానికి కూడా వీల్లేకుండా మారిపోయింది.

ఈ వార్త మూడవ కుమారునికి తెలిసి, “మీ దుర్మార్గపు ఆలోచనల వల్లఏమయ్యిందో చూడండి” అని వ్యాఖ్యానించాడు. ఇద్దరు సోదరులు తమ తప్పు తెలుసుకుని అల్లాహ్ ను క్షమాభిక్ష కోరారు. “మా ప్రభువు పరిశుద్ధుడు.. నిజంగానే మేము పాపాత్ములం… మన ప్రభువు దీనికి బదులు దీనికన్నా మెరుగైన తోటను మనకు ప్రసాదించడం అసంభవమేమీ కాదు” అన్నారు.(చదవండి దివ్యఖుర్ఆన్ : 68:17-33)

అల్లాహ్ మనకు సంపదను ఒక బాధ్యతగా అప్పగిస్తాడు. దానితో మనం ఏం చేస్తామో పరీక్షిస్తాడు. ఆ సంపదలో బీదలకు, అవసరార్థులకు, బాటసారులకు ఇవ్వడానికి నిరాకరిస్తే అల్లాహ్ సంపదను తీసుకుని అనేక విధాలుగా శిక్షిస్తాడు. మనం చేసిన తప్పుకు చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడితే, అల్లాహ్ తాను తీసుకున్న దానికన్నా మెరుగైనది ప్రసాదిస్తాడు.

ఖురాన్ కథామాలిక – మూలం: షేఖ్ అబూబకర్ నజార్
Qur’an Katha Maalika – Selected Stories from Qur’an (Telugu)
తెలుగు అనువాదం: అబ్దుల్ వాహెద్ & ఎస్. ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్,హైదరాబాద్
https://teluguislam.net/2022/11/12/stories-from-the-quran/

పిసినారితనం నుండి మిమ్మల్ని కాపాడుకోండి [వీడియో | టెక్స్ట్]

పిసినారితనం నుండి మిమ్మల్ని కాపాడుకోండి | బులూగుల్ మరాం | హదీసు 1280
https://youtu.be/K3wcOKsHcp8 [ 9 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1280. హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రభోదించారు:

“అన్యాయానికి దూరంగా ఉండండి ఎందుకంటే అన్యాయం ప్రళయదినాన తమస్సుకు, చిమ్మచీకట్లకు కారణభూత మవుతుంది. ఇంకా పిసినారితనం నుండి నుండి మిమ్మల్ని కాపాడుకోండి. మీకు పూర్వం గతించినవారు దీని (పిసినిగొట్టు తనం) మూలంగానే నాశనమయ్యారు.”

సారాంశం:

ఈ హదీసులో అన్యాయంతో పాటు, పీనాసితనం పట్ల అప్రమత్తంగా ఉండాలని తాకీదు చేయబడింది. ‘అన్యాయం’ తీర్పుదినాన అన్యాయం చేసిన మనిషి పాలిట అంధకారబంధురంగా పరిణమిస్తుంది. అతనికి వెలుతురు , కాంతి కావలసిన తరుణంలో దట్టమైన చీకట్లు అతన్ని అలుముకుంటాయి పిసినారితనం కూడా ఒక దుర్గుణమే. పేరాశకు లోనైనవాడు, పిసినిగొట్టుగా తయారైన వాడు సమాజానికి మేలు చేకూర్చకపోగా, సమాజంలో అత్యంత హీనుడుగా భావించబడతాడు. పిసినారితనం నిత్యం మనస్పర్థలకు, కాఠిన్యానికి కారణభూతమవుతుంది, దుష్పరిణామాలకు దారితీస్తుంది.

ఈ ప్రసంగంలో, హదీథ్ నంబర్ 1280 ఆధారంగా ‘జుల్మ్’ (అణచివేత) మరియు ‘షుహ్’ (తీవ్రమైన పిసినారితనం లేదా దురాశ) అనే రెండు వినాశకరమైన పాపాల గురించి వివరించబడింది. ప్రళయదినాన అణచివేత చీకట్లుగా మారుతుందని, మరియు ‘షుహ్’ పూర్వపు జాతులను నాశనం చేసిందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. సాధారణ పిసినారితనం ‘బుఖుల్’ కు మరియు తీవ్రమైన దురాశ ‘షుహ్’ కు మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టం చేయబడింది. ‘షుహ్’ అనేది కేవలం తన వద్ద ఉన్నదాన్ని ఖర్చు చేయకపోవడమే కాక, ఇతరుల సంపదను అక్రమంగా పొందాలనే కోరికను కూడా కలిగి ఉంటుందని, ఇది హత్యలు, పాపాలు మరియు బంధుత్వాలను తెంచడం వంటి ఘోరాలకు దారితీస్తుందని వివరించబడింది. చివరగా, సూరత్ అల్-హష్ర్ లోని ఒక ఆయత్ ను ఉటంకిస్తూ, ఎవరైతే తమ ఆత్మల పిసినారితనం నుండి కాపాడబడతారో వారే నిజమైన సాఫల్యం పొందుతారని నొక్కి చెప్పబడింది.

బులూగుల్ మరాం – హదీథ్ నంబర్ 1280.

وَعَنْ جَابِرٍ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ اتَّقُوا الظُّلْمَ فَإِنَّ الظُّلْمَ ظُلُمَاتٌ يَوْمَ الْقِيَامَةِ، وَاتَّقُوا الشُّحَّ فَإِنَّهُ أَهْلَكَ مَنْ كَانَ قَبْلَكُمْ
[ఇత్తఖు జుల్మ ఫఇన్న జుల్మ జులుమాతున్ యౌమల్ ఖియామ, వత్తఖుష్షుహా ఫఇన్నహు అహలక మన్ కాన ఖబ్లకుమ్]

హజ్రత్ జాబిర్ రజియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు, జుల్మ్ కీ దూరంగా ఉండండి. ఎందుకంటే జుల్మ్ ప్రళయ దినాన తమస్సుకు, చిమ్మ చీకట్లకు కారణభూతమవుతుంది. ఇంకా షుహ్, పిసినారితనం నుండి మిమ్మల్ని కాపాడుకోండి. మీకు పూర్వం గతించిన వారు దీనిని, అంటే పిసినిగొట్టుతనం మూలంగానే నాశనమయ్యారు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఏ విషయంలో వినాశనం ఉన్నదో దాని నుండి మనం దూరం కాకపోతే మనమే చాలా ఘోరమైన నష్టంలో పడిపోతాము.

ఈ హదీథ్ లో జుల్మ్ గురించి వచ్చింది. ఇంతకుముందే మనం హదీథ్ నంబర్ 1279 లో దాని వివరాలు తెలుసుకున్నాం. అయితే ఇందులో మరొక విషయం ఏముంది? వత్తఖుష్షుహ్. షుహ్.

షుహ్, ఒక ఒత్తి ఉన్నది ఈ పదం, మరొకటి ఉన్నది బుఖుల్. బుఖుల్ అంటే కంజూసీతనం, పిసినారితనం. చేతిలో డబ్బులు ఉన్నాయి, అల్లాహ్ మార్గంలో, అవసరం ఉన్నవారికి, పేదవారికి దానం చేయకుండా, ఇవ్వకుండా స్వయం తన భార్యాపిల్లలపై, తల్లిదండ్రులపై ఏ మధ్య రకంలో ఖర్చు పెట్టాలో పెట్టకుండా పిసినారితనం వహించడం. ఇదేమిటి? బుఖుల్.

ఇక్కడ హదీథ్ లో వచ్చిన పదం ఏంటి? షుహ్. ధర్మవేత్తలు ఏమంటున్నారంటే, ఈ బుఖుల్ అనేది ఎప్పుడైతే మనిషిలో మితిమీరిపోతుందో, చివరికి అతడు ఖర్చు పెట్టే విషయంలోనే కాదు, డబ్బు, ధనం యొక్క పిశాచి ఎంతగా అయ్యాడంటే ఉన్నదానిని ఖర్చు పెట్టకుండా ఆపుకొని ఉంచుకుంటున్నాడు, అంతే కాదు, ఇంకా కావాలి, కావాలి, కావాలి అన్నటువంటి ఈ పెరాశ అనేది అక్రమంగా సంపాదించడంలో కూడా అతన్ని పడవేస్తుంది. ఇంతటి ఘోర స్థితికి ఎదిగిన వారిని అతడు షుహ్ లో పడ్డాడు అని అంటారు.

అర్థమైంది కదా? అయితే బుఖుల్ అనేది ఏదైతే ఉందో పిసినారితనం, అందులో మరింత ఓ నాలుగు అడుగులు ముందుగా ఉండడం దీనిని షుహ్ అంటారు.

మరొక భావం దీని గురించి కొందరు ధర్మవేత్తలు ఏం చెప్పారంటే, షుహ్ అన్నది మనసుతో. అటు లేనిదాన్ని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు, అందులో అడ్డమార్గాలు తొక్కవలసి వచ్చినా, పాపం చేయవలసి వచ్చినా ఏ భయం లేకుండా చేసి సంపాదించడం మరియు ఖర్చు చేసే విషయంలో అంటే ప్రాక్టికల్ గా ఖర్చు చేసే విషయంలో బఖీల్, ఆపుకొని ఉంచడం, దీన్ని బుఖుల్, ముందు దాన్ని షుహ్ అని అంటారు.

కానీ ఇక్కడ గమనించండి, ప్రవక్త వారు ఏమంటున్నారు? ఇలాంటి ఈ పిసినారితనాన్ని మీరు వదులుకోండి. ఇలాంటి ఈ పిసినారితనం మీలో రాకుండా జాగ్రత్తపడండి. ఎందుకు? ఇంతకుముందు జాతి వారి వినాశనానికి ఇది కారణమైంది. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్.

ఎలా అండి ఇది? ఎలా అంటే, గమనించండి. ఈ రోజుల్లో కూడా మనం కుబేరులను చూస్తున్నాము. మిలియనీర్, బిలియనీర్, కోట్లాధిపతులను కూడా చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే మనిషిలో ఈ పిసినారితనం చోటు చేసుకుంటుందో, ఏం చేస్తాడు? బంధుత్వాలను లెక్క కట్టడు. ఈ విధంగా మాట్లాడతాడు.

ఇస్లాం ధర్మం పేరుతో ఎందరికీ ఎలర్జీగా ఉంది. ఏ మానవత్వం ముందండి అని అంటారు. కానీ ఇలాంటి పిసినారులు మన సమాజంలో ఎంతోమంది కనబడతారు. మానవత్వత్వం ముందు అన్న వాళ్ళు డబ్బు విషయం వచ్చేసరికి బంధుత్వాలను, స్వయం మానవులను మరిచిపోయి దానికే ఎంత ప్రాధాన్యతను ఇస్తారంటే, చివరికి హత్యలు, ఘోరమైన పాపాలు, నేరాలు చేయవలసి వచ్చినా నాలుగు పైసల కొరకు అవన్నీ చేయడానికి కూడా సిద్ధమవుతారు. ఈ విధంగా ఇంతకుముందు జాతి వారిని వినాశనానికి గురిచేసింది.

ఈ ఇంతకుముందు జాతి వారిని వినాశనానికి గురిచేసింది అంటే ఇహలోకంలో ఇప్పుడు చెప్పిన రీతిలో. ఇది పరలోకంలో కూడా వినాశనం. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే డబ్బును, ధనాన్ని, ప్రజలకు అవసరమున్న విషయాలను, వస్తువులను ఆపుకొని స్వయం లాభం పొందుతూ, కొన్ని సందర్భాలలోనైతే పిసినారితనం ఎంతగా ఉంటుందంటే స్వయం కూడా లాభం పొందడు. స్వయం కూడా లాభం పొందకుండా డబ్బు సంపాదించడంలో ఎంత ముందుకు వెళుగుతారంటే వారి వద్ద దొంగతనం, అక్రమ సంపాదన, హత్య చేయడం మరియు మోసంతో డబ్బు కాజేసుకోవడం ఇవన్నీ ఎలాంటి పాపంగా భావించరు. ఇంకా దానిపై బంధుత్వాలను తెంచడం, ఇవన్నీ పాపాలకు గురి అవుతారు. చివరికి ఏమవుతుంది? ఈ పాపాలన్నీ కూడా పరలోకంలో అతన్ని నష్టంలో పడవేస్తాయి.

ఒకసారి అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు త’ఆలా అన్హు తన శిష్యులతో, తన దగ్గర కూర్చున్న వారితో అడిగారు, “అయ్యుహుమా అషద్ద్, అల్-బుఖుల్ అవిష్-షుహ్?” (ఈ రెండిటిలో ఏది తీవ్రమైనది, బుఖుల్ ఆ లేక షుహ్ ఆ?). నేను ఇంతకుముందే చెప్పాను కదా రెండు పదాలు ఉన్నాయని. అల్-బుఖుల్, దీని యొక్క అసలైన భావం పిసినారితనం. దానిపై మరొకటి షుహ్. ఈ రెండిటిలో చాలా చెడ్డది ఏమిటి? అని అడిగారు.

అయితే అక్కడ ఉన్నవారు విభేదాల్లో పడ్డారు. కొందరు ఇలా అంటుంటే, కొందరు అది అంటున్నారు. అప్పుడు అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ అన్నారు, “అష్-షుహ్హు అషద్దు మినల్-బుఖుల్” (షుహ్ అనేది బుఖుల్ కంటే తీవ్రమైనది). షుహ్ అన్నది బుఖుల్ కంటే చాలా చెడ్డది. “లిఅన్నష్-షహీహ యషుహ్హు అలా మా ఫీ యదైహి ఫయహ్బిసుహూ, వ యషుహ్హు అలా మా ఫీ ఐదిన్-నాసి హత్తా య’ఖుజహూ. వ అమ్మల్-బఖీలు ఫహువ యబ్ఖలు అలా మా ఫీ యదైహి” (ఎందుకంటే ‘షహీహ్’ (షుహ్ గుణం ఉన్నవాడు) తన చేతిలో ఉన్న దానిపై పిసినారితనం చూపి దాన్ని బంధిస్తాడు, మరియు ప్రజల చేతుల్లో ఉన్న దానిపై కూడా దురాశ పడతాడు, దాన్ని తీసుకునేంత వరకు. అయితే ‘బఖీల్’ (బుఖుల్ గుణం ఉన్నవాడు) కేవలం తన చేతిలో ఉన్న దానిపై మాత్రమే పిసినారితనం చూపిస్తాడు).

షుహ్ ఉన్న వ్యక్తి తన చేతిలో ఉన్నదానిని ఆపేస్తాడు, ఇతరులకు ఇవ్వకుండా. అంతేకాదు, ప్రజల చేతుల్లో ఉన్నదాన్ని కూడా మంచి మనసుతో చూడడు, ఎప్పుడు నా చేతిలోకి వచ్చి పడుతుందో, ఎప్పుడు నా దగ్గరికి వచ్చేస్తుందో అని. కానీ బఖీల్ కేవలం తన వద్ద ఉన్నదానిని ఇతరులకు ఖర్చు చేయకుండా ఆపుకునేవాడు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు త’ఆలా అన్హు ఈ విధంగా దీనిని, ఈ రెండు పదాలను వివరించారు.

అయితే ఖురాన్ సూరతుల్-హష్ర్, 28వ ఖండంలో ఉంది, ఆయత్ నంబర్ తొమ్మిదిని గనక మనం చూస్తే, షుహ్ అన్నది ఎన్నో ఇతర పాపాలకు కారణమవుతుంది అని కూడా తెలుస్తుంది. అందుకొరకే దాని నుండి దూరం ఉన్నవాడే సాఫల్యం పొందుతాడని అల్లాహ్ అక్కడ మనకు తెలియజేస్తున్నాడు.

وَمَن يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
ఎవరైతే తమ ఆత్మల పిసినారితనం నుండి కాపాడబడ్డారో, అట్టివారే సాఫల్యం పొందేవారు.

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1