రమదాన్ స్వాగతం ఎందుకు, ఎలా? – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

రమదాన్ స్వాగతం ఎందుకు, ఎలా ?
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/QDDLcOpp8bc [28 నిముషాలు]

రమజాన్ మాసం రాకముందే దాని కోసం సన్నద్ధం అవ్వడం, రమజాన్‌ను స్వాగతించడం యొక్క ప్రాముఖ్యతను ఈ ప్రసంగం వివరిస్తుంది. రైతు వర్షాకాలానికి ముందే పొలాన్ని సిద్ధం చేయడం, ముఖ్యమైన అతిథి కోసం ఇంటిని శుభ్రపరచడం వంటి ఉదాహరణలతో ఈ విషయం స్పష్టం చేయబడింది. రమజాన్‌ను స్వాగతించడానికి, దుఆ చేయడం, అల్లాహ్‌కు కృతజ్ఞతలు చెప్పడం, సంతోషాన్ని వ్యక్తపరచడం, దృఢ సంకల్పం చేసుకోవడం, పశ్చాత్తాపం చెందడం, ఇస్లామీయ జ్ఞానాన్ని నేర్చుకోవడం, సంకల్ప శుద్ధి చేసుకోవడం, మరియు ఇతరుల పట్ల హృదయాలను శుభ్రంగా ఉంచుకోవడం వంటి పద్ధతులను పండితులు సూచించారు. ఖురాన్ పారాయణం, ఇఫ్తార్ చేయించడం, దానధర్మాలు చేయడం, ఉమ్రా చేయడం, మరియు దైవ సందేశాన్ని ప్రచారం చేయడం కోసం ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కూడా నొక్కి చెప్పబడింది. ఈ రమజాన్ మన చివరిది కావచ్చుననే భావనతో, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రసంగం ముగుస్తుంది.

అల్ హమ్దులిల్లాహి వహ్ దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాదహ్.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనం రమజాన్ స్వాగతం ఎందుకు, ఎలా? అనే అంశం గురించి తెలుసుకోబోతున్నాం. మనం షాబాన్ నెల చివరి దశకంలో ఉన్నాం, కొద్ది రోజుల్లోనే ఇన్ షా అల్లాహ్ రమజాన్ మాసము రాబోవుచున్నది కాబట్టి, రమజాన్ రాకముందే మనం రమజాన్ నెల కోసం సన్నద్ధం అవ్వాలి, రమజాన్ నెలను స్వాగతం పలకాలి. ఏ విధంగా మనము స్వాగతం పలకాలి? ఎందుకు మనము రమజాన్ నెల కోసం ఎదురు చూసి దాని కోసము సన్నాహాలు చేసుకోవాలి? అనే కొన్ని విషయాలు ఇప్పుడు మనము ఉదాహరణలతో మరియు ఆధారాలతో తెలుసుకుందాం.

ముందుగా, రమజాన్ మాసానికి మనం ఎందుకు స్వాగతించాలి అనే విషయాన్ని ఉదాహరణలతో తెలుసుకుందాం.

చూడండి, ఒక రైతు తన పొలాన్ని వర్షాకాలము రాకముందే దున్ని చదును చేసి సిద్ధంగా ఉంచుకుంటాడు. ఎందుకంటే వర్షాలు రాగానే వర్షాల నుండి పూర్తిగా లబ్ది పొంది మంచి పంట పండించుకోవాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తాడు. సరిగ్గా అదే విధంగా ఒక విశ్వాసి రమజాన్ మాసం రాకముందే రమజాన్ మాసం కోసము పూర్తిగా సన్నాహాలు చేసుకొని సిద్ధంగా ఉంటాడు. రమజాన్ వచ్చిన తర్వాత రమజాన్ నుండి పూర్తిగా లబ్ధి పొందుతాడు.

అలాగే, ఒక అతిథి మన ఇంటికి వస్తూ ఉన్నాడు, అతను పెద్ద పెద్ద బహుమతులు కూడా మన కోసము వెంట తీసుకొని వస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసినప్పుడు, మనం ఆ అతిథి రాక కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తాం. అతని రాక కోసము మన ఇంటిని, పరిసరాలను శుభ్రంగా చేసి సిద్ధంగా ఉంచుతాం. ఒక రాజకీయ నాయకుడు వస్తూ ఉన్నాడు అంటే, ఏ ప్రదేశానికి అతను వస్తూ ఉన్నాడో ఆ ప్రదేశంలో ఉన్న వీధులు, ఆ ప్రదేశంలో ఉన్న రోడ్లు అన్నీ మారిపోతాయి. సరిగ్గా ఒక విశ్వాసి కూడా అదే విధంగా రమజాన్ మాసము ఎన్నో విశిష్టతలు, వరాలు మన కోసము తీసుకొని వస్తూ ఉందన్న విషయాన్ని తెలుసుకొని, రమజాన్ రాకముందే తనను, తన ఇంటిని, తన పరిసరాలను పూర్తిగా సిద్ధం చేసుకొని రమజాన్ మాసం కోసం ఎదురు చూస్తాడు.

ఈ ఉదాహరణల ద్వారా మనము ఒక విషయాన్ని మాత్రము తెలుసుకున్నాం, అదేమిటంటే రమజాన్ రాకముందే రమజాన్ నుండి పూర్తిగా లబ్ధి పొందటానికి, రమజాన్ వరాలు మనకు దక్కించుకోవటానికి మనము ముందస్తు చర్యలు చేపట్టాలి మరియు రమజాన్ కోసము సన్నద్ధం అవ్వాలి, రమజాన్ నెలను ఆ విధంగా స్వాగతించాలి.

అయితే, రమజాన్ నెలను స్వాగతించటానికి ఏమైనా నియమాలు ఉన్నాయా, విధానాలు ఉన్నాయా అంటే ధార్మిక పండితులు కొన్ని సలహాలు మనకు ఇచ్చి ఉన్నారు. ఏ విధంగా రమజాన్ మాసాన్ని స్వాగతించాలి? మరియు ఏ విధంగా రమజాన్ కోసం మనం సన్నద్ధం అవ్వాలి? అంటే కొన్ని సలహాలు ఉన్నాయండి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇన్ షా అల్లాహ్ ఇప్పుడు మనము విని తెలుసుకుందాం.

మొదటి సలహా ఏమిటంటే రమజాన్ మాసము దక్కాలి అని అల్లాహ్‌తో దుఆ చేస్తూ ఉండాలి. ధార్మిక పండితులు తెలియజేసిన విషయం ఏమిటంటే, మన సజ్జన పూర్వీకులు, సలఫ్ సాలిహీన్, రమజాన్ మాసం ఇంకా ఆరు నెలల తర్వాత వస్తుంది అన్నప్పటి నుండే, “ఓ అల్లాహ్, నాకు రమజాన్ మాసము దక్కించు” అని వేడుకుంటూ ఉండేవారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో. అలాగే మనము కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో రమజాన్ మాసము దక్కాలి అని, రమజాన్ మాసము మనము పొందాలి అని అల్లాహ్‌ను వేడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక్క రమజాన్ దక్కినా మనము ఎన్నో పుణ్యాలు పొందగలము.

దీనికి ఉదాహరణగా ఇబ్నె మాజా గ్రంథంలోని ఒక ఉల్లేఖనము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఇద్దరు స్నేహితులు ఒకేసారి ఇస్లాం స్వీకరించారు. ఆ ఇద్దరిలో నుండి ఒక మిత్రుడు ఇస్లాం కోసము, ఇస్లాం సేవ కోసము బాగా కష్టపడేవాడు, తపించేవాడు. ఆయన ఇస్లాంకు సేవలు అందిస్తూ అందిస్తూ చివరికి ఇస్లాం కోసము ప్రాణత్యాగం చేసేశారు, షహీద్ అయిపోయారు. ఒక మిత్రుడు షహీద్ అయిపోయి మరణించి వెళ్ళిపోయారు. ఇక రెండవ మిత్రుడు మిగిలి ఉన్నాడు కదా, ఆయన ఒక సంవత్సరము తర్వాత సాధారణ మరణం పొందారు.

తల్హా రజియల్లాహు తాలా అన్హు వారు ఒక సహాబీ. ఈ ఇద్దరు మిత్రులు మరణించిన తర్వాత ఒక కల చూశారు. ఆ కలలో ఆయన స్వర్గపు ద్వారాల వద్ద నిలబడి ఉంటే, దైవదూతలు ఏ మిత్రుడు అయితే సాధారణంగా మరణించాడో ఆయనను ముందు స్వర్గంలోకి తీసుకెళ్లారు. ఏ మిత్రుడు అయితే షహీద్ అయ్యాడో, వీర మరణం పొందాడో ఆయనను తర్వాత స్వర్గంలోకి తీసుకెళ్లారు. ఈయన మార్గం వద్ద నిలబడి ఉన్నారు కదా, ఈయనతో దైవదూతలు ఏమంటున్నారంటే “మీ సమయం ఇంకా కాలేదు, మీరు వెళ్ళండి” అని ఇంటికి పంపించేశారు, తిరిగి పంపించేశారు. ఉదయం అయ్యాక ఆయన చూసిన కల ఇతరులకు తెలియజేశారు. ఆ నోటా ఈ నోటా అది అందరికీ తెలిసిపోయింది. ప్రతి ఒక్కరూ ఆ కల గురించి విని ఆశ్చర్యపోతూ ఉన్నారు. షహీద్ అయిపోయిన మిత్రుడు ఆలస్యంగా స్వర్గంలోకి వెళ్లటం ఏమిటి? సాధారణంగా మరణించిన మిత్రుడు ముందుగా స్వర్గానికి చేరుకోవటం ఏమిటి? అని వారు మాట్లాడుకుంటూ ఉన్నారు, విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు చేరిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజల ముందరికి వచ్చి ఏమన్నారంటే, “చూడండి, ఏ మిత్రుడు అయితే ఆలస్యంగా, సాధారణంగా మరణించాడో, అతనికి ఒక సంవత్సరము ఎక్కువ ఆయుష్షు దక్కింది. అతను ఒక రమజాన్ నెల ఎక్కువగా పొందాడు. ఆ రమజాన్ నెలలో, అతను పొందిన ఆ పూర్తి సంవత్సరంలో ఎన్ని సత్కార్యాలు అతను చేసుకున్నాడు అంటే, పుణ్యాలలో ఇద్దరి మధ్య భూమి ఆకాశాల మధ్య ఎంత తేడా వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం వచ్చేసింది” అని చెప్పారు. అల్లాహు అక్బర్. చూశారా?

కాబట్టి ఒక్క రమజాన్ మాసము దక్కించుకున్నా, మనము సత్కార్యాలలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోగలము కాబట్టి, రమజాన్ మాసము దక్కాలి అని అల్లాహ్‌ను వేడుకుంటూ ఉండాలి. ఇది మొదటి సలహా.

రెండవ సలహా ఏమిటంటే, రమజాన్ మాసము దక్కిన తర్వాత అల్లాహ్‌కు కృతజ్ఞతలు చెల్లించాలి. అల్లాహ్ ఆదేశం ఖురాన్‌లో ఈ విధంగా ఉంది, రెండవ అధ్యాయము, 172 వ వాక్యం:

وَاشْكُرُوا لِلَّهِ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ
[వష్కురూ లిల్లాహి ఇన్ కున్తుమ్ ఇయ్యాహు త’అబుదూన్]
ఒకవేళ మీరు అల్లాహ్ యే ఆరాధించే వారైతే ఆయనకు కృతజ్ఞులై ఉండండి. (2:172)

అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలపాలని ఇక్కడ ఆదేశించబడి ఉంది. రమజాన్ మాసం దక్కటం అల్లాహ్ తరఫున పెద్ద అనుగ్రహము కాబట్టి, ఆ అనుగ్రహం పొందిన వారు అల్లాహ్‌కు ముందుగా కృతజ్ఞతలు చెల్లించాలి.

చూడండి, గుండె మీద ఒక్కసారి చెయ్యి పెట్టుకొని ఆత్మ విమర్శ చేసి చూడండి, ఆలోచించి చూడండి. మనతో పాటు గత సంవత్సరం రమజాన్ మాసంలో ఉపవాసాలు ఉన్నవారు, ఇఫ్తారీ ప్రోగ్రాంలలో పాల్గొన్న వారు, తరావీహ్‌లలో పాల్గొన్న వారు ఈ సంవత్సరము రమజాన్ వచ్చేసరికి మన మధ్య లేరు. వారు మరణించారు, అల్లాహ్ వద్దకు చేరుకున్నారు. మనకు మాత్రం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయుష్షు ఇచ్చాడు, మరొక రమజాన్ మన జీవితంలోకి తీసుకొని వస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు అల్లాహ్ ఇచ్చిన ఈ అనుగ్రహాన్ని మనము గుర్తించి, అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలపాలి, ఇది రెండవ సలహా.

మూడవ సలహా ఏమిటంటే, రమజాన్ మాసం వచ్చింది కాబట్టి మనము సంతోషపడాలి. రమజాన్ మాసం వచ్చిందన్న విషయం మనకు సంతోషం కలిగించాలి.

అయితే సమాజంలో రెండు రకాల ప్రజలను మనము చూస్తూ ఉన్నాం. కొందరికి రమజాన్ మాసం వచ్చిందంటే అస్సలు సంతోషం లేదు, వారు బాధపడుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే కొంతమందికి సంతోషం లేదు, వారికి బాధ కలుగుతూ ఉంది. మన విశ్వాసులకే ఎవరైతే ముస్లింలని చెప్పుకుంటున్నారో వారిలోనే కొంతమందికి అలాంటి బాధ కలుగుతూ ఉంది. కారణం ఏంటంటే, వారు ఇన్ని రోజులు బాగా తాగుతూ, తింటూ, తిరుగుతూ తందనాలు ఆడుతూ ఉండేవారు. రమజాన్ వచ్చేసింది కాబట్టి ఇక ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఇన్ని రోజులు తాగినట్టు వాళ్ళు తాగలేరు; సిగరెట్లు తాగటం కానీ, గుట్కాలు నమలటం కానీ, సారాయి మధ్యము సేవించటం కానీ, ఇవన్నీ వాళ్ళు చేస్తూ తందనాలు ఆడుతూ ఉండేవారు కాబట్టి, రమజాన్ వచ్చేసిందంటే ఇదంతా ఇక ఆగిపోతుంది. రమజాన్ మాసంలో కూడా వాళ్ళు తాగినా, తిన్నా, తిరిగినా, చూసిన వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉపవాసం ఉంటున్నారు, మీకేమైంది మీరు ఉపవాసం ఉండకుండా ఇలా తిరుగుతూ ఉన్నారు అని ప్రతి ఒక్కరూ నిందిస్తారు, వేలెత్తి చూపుతారు. కాబట్టి ఇన్ని రోజులు వారు ఏ జల్సాలైతే చేస్తూ వస్తూ ఉన్నారో అవన్నీ ఆగిపోతాయి అన్న విషయాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు కొంతమంది. ఇది విశ్వాసానికి విరుద్ధమైన విషయం. ఇలాంటి వారు తోబా చేసుకోవలసిన అవసరం ఉంది.

అయితే సమాజంలో మరికొంతమంది విశ్వాసులు ఉన్నారు. రమజాన్ మాసం వస్తూ ఉంది అంటే వారికి ఆత్మ లోపల నుంచి సంతోషం కలుగుతుంది. వారు లోపల నుంచి సంతోషపడుతూ ఉంటారు, నోటితో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అలాంటి విశ్వాసులలో అల్లాహ్ మమ్మల్ని అందరిని చేర్చు గాక.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనం చూచినట్లయితే, నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనంలో అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలపబడింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమజాన్ మాసం వచ్చిందన్న విషయాన్ని సంతోషంగా ప్రజల ముందర ప్రకటించేవారు.

أتاكم رمضان شهر مبارك
[అతాకుమ్ రమదాన్ షహ్రున్ ముబారక్]
మీ వద్దకు రమజాన్ వచ్చేసింది, ఇది పవిత్రమైన మాసము, శుభాలతో కూడిన మాసము అని సహాబాల ముందర సంతోషాన్ని వ్యక్తపరిచేవారు. కాబట్టి రమజాన్ మాసం వచ్చినప్పుడు మనం సంతోషాన్ని వ్యక్తపరచాలి. ఇది మూడవ సలహా.

నాలుగవ సలహా ఏమిటంటే, రమజాన్ మాసాన్ని పొందిన తర్వాత రమజాన్ మాసాన్ని సద్వినియోగం చేసుకోవటం కోసము మనం ముందుగానే దృఢమైన సంకల్పం చేసుకోవాలి. ఒక్క రోజు కూడా, ఒక్క ఉపవాసము కూడా చేజారకూడదు. ఒక్క ఆరాధన కూడా చేజారకూడదు. అన్ని ఆరాధనలు చేసుకొని, అన్ని ఉపవాసాలు ఉండి, అన్ని రకాల సత్కార్యాలు చేసుకొని రమజాన్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ముందుగానే మనము సంకల్పం చేసుకోవాలి. సంకల్పం నిజమైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి సంకల్పాన్ని నెరవేరుస్తాడు. ఖురాన్ గ్రంథం 47వ అధ్యాయం, 21వ వాక్యాన్ని చూడండి, అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తూ ఉన్నాడు:

فَلَوْ صَدَقُوا اللَّهَ لَكَانَ خَيْرًا لَّهُمْ
[ఫలవ్ సదఖుల్లాహ లకాన ఖైరల్ లహుమ్]
“వారు అల్లాహ్‌ పక్షాన సత్యవంతులుగా నిలబడి ఉంటే అది వారి కొరకు శ్రేయోదాయకమై ఉండేది.” (47:21)

అంటే వారి సంకల్పం సరైనదై ఉంటే అది వారికే మంచిది అని అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పేర్కొంటూ ఉన్నాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఒక పల్లెటూరి వాసి ఇస్లాం స్వీకరించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో వచ్చి జత కలిశాడు. ఆ తర్వాత అతను వలస ప్రయాణము కూడా చేశాడు. వలస ప్రయాణము చేసి మదీనాకు చేరుకున్నప్పుడు యుద్ధాలు జరిగాయి, ఆ యుద్ధాలలో ఒక యుద్ధంలో యుద్ధ ప్రాప్తి మాలె గనీమత్ దక్కింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మాలె గనీమత్‌ను ప్రజలకు పంచారు. అతనికి కూడా కొద్ది భాగము ఇచ్చారు. ఆ పల్లెటూరి వాసి ఎంత మంచి సంకల్పం కలిగిన వ్యక్తితో చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఏమంటున్నాడంటే,

“ఓ దైవ ప్రవక్త, నేను ఇస్లాం స్వీకరించి, వలస ప్రయాణము చేసుకొని ఇక్కడికి వచ్చింది ఈ ప్రాపంచిక సొమ్ము కోసము కాదు. ఈ ప్రాపంచిక సొమ్ము పొందాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా చేయలేదు. నా సంకల్పం ఏమిటంటే, నేను అల్లాహ్ ధర్మం కోసము శ్రమించాలి, వీలైతే అల్లాహ్ ధర్మం కోసము అన్ని రకాల త్యాగాలు, చివరికి నా ప్రాణము కూడా త్యాగము చేసేయాలి. ఆ ఉద్దేశంతో నేను ఇస్లాం స్వీకరించాను, మీతో జత కలిశాను, వలస ప్రయాణం చేశాను ఓ దైవ ప్రవక్త” అన్నాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు:

إن تصدق الله يصدقك
[ఇన్ తస్దుఖిల్లాహ యస్దుఖ్-క]
“నీవు నిజంగానే ఆ విధంగా సంకల్పం చేసుకొని ఉంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నీ సంకల్పాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తాడు” అని సమాధానం ఇచ్చారు. (నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనం).

ప్రజలు చూశారు, అలాగే జరిగింది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఇస్లాం కోసము శ్రమించాడు, శ్రమించాడు, ఎంతగా శ్రమించాడు అంటే ఒక యుద్ధంలో ఇస్లాం కోసము అతను తన ప్రాణాలను కూడా అర్పించేశాడు, షహీద్ అయిపోయాడు. చూశారా?

కాబట్టి సంకల్పంలో చిత్తశుద్ధి ఉంటే, మన సంకల్పం నిజమైనదై ఉంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దానిని నెరవేరుస్తాడు కాబట్టి, రమజాన్‌ను సద్వినియోగం చేసుకోవాలని మనము చిత్తశుద్ధితో సంకల్పం చేసుకుంటే, మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రమజాన్ నుండి లబ్ధి పొందిన వారు లాగా తీర్చిదిద్దేస్తాడు. ఇది నాలుగవ సలహా.

ఇక ఐదవ సలహా ఏమిటంటే, రమజాన్ రాకముందే పశ్చాత్తాపం పొంది పాపాలకు దూరంగా ఉండుటకు గట్టి నిర్ణయం తీసుకోవాలి.

చూడండి, రమజాన్ మాసంలో కూడా పశ్చాత్తాపం పొందాలి, రమజాన్ మాసం రాకముందే మనము పశ్చాత్తాపము ప్రారంభించేయాలి, పశ్చాత్తాపం చెందటం ప్రారంభించేయాలి. పశ్చాత్తాపం గురించి ప్రత్యేకంగా ఒక ప్రసంగం మనం విని ఉన్నాం. ఖురాన్ గ్రంథంలోని 24వ అధ్యాయం, 31వ వాక్యాన్ని ఒకసారి మనం మళ్ళీ ఒకసారి చదివి విందాం. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పశ్చాత్తాపం గురించి ఆదేశిస్తూ ఇలా అంటూ ఉన్నాడు:

وَتُوبُوا إِلَى اللَّهِ جَمِيعًا أَيُّهَ الْمُؤْمِنُونَ لَعَلَّكُمْ تُفْلِحُونَ
[వతూబూ ఇలల్లాహి జమీ’అన్ అయ్యుహల్ ముఅమినూన ల’అల్లకుమ్ తుఫ్లిహూన్]
“ఓ విశ్వాసులారా! మీరంతా కలసి అల్లాహ్ సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.” (24:31)

పవిత్రమైన మాసం, అది రాబోవుచున్నది కాబట్టి, మనం కూడా ఆ పవిత్రమైన మాసంలో ప్రవేశించేటటానికి మనము కూడా పాపాల నుండి పశ్చాత్తాపం పొంది పవిత్రులమైపోయి ఆ మాసంలో ప్రవేశించటం ఎంతో అవసరమైన విషయం కాబట్టి రమజాన్‌కు ముందే పశ్చాత్తాపం పొందండి, ఇదే అలవాటు రమజాన్‌లో కూడా కొనసాగించండి అని ధార్మిక పండితులు సలహా ఇచ్చి ఉన్నారు. ఇది ఐదవ సలహా.

ఆరవ సలహా ఏమిటంటే రమజాన్ మాసంలో అన్ని రకాల పుణ్యాలు మనం పొందాలి అంటే, రమజాన్ మరియు రమజాన్‌లో ఉన్న ఆరాధనల నియమాలు ముందుగానే తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి.

చూడండి, రమజాన్‌లో ఉన్న ఆరాధనలు, ముఖ్యంగా ఉపవాసాలు, అలాగే నమాజులు, ఖియాముల్ లైల్, అలాగే ఖురాన్ పారాయణం, దానధర్మాలు, జకాత్ చెల్లించటాలు ఇక అనేక సత్కార్యాలు ఉన్నాయి కదండీ, వాటి గురించి నియమాలు, నిబంధనలు ముందుగానే మనము తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకుంటే తప్పులు లేకుండా మనము ప్రతి ఆరాధన, ప్రతి సత్కార్యము చక్కగా చేయగలము, అన్ని పుణ్యాలు పొందగలము. అవగాహన చేసుకోకుండానే అలాగే ప్రారంభిస్తే తప్పులు దొర్లి పుణ్యాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అడిగి తెలుసుకోవాలి, చదివి తెలుసుకోవాలి. చూడండి అల్లాహ్ ఏమంటున్నాడు, ఖురాన్ గ్రంథం 21వ అధ్యాయం, ఏడవ వాక్యం:

فَاسْأَلُوا أَهْلَ الذِّكْرِ إِن كُنتُمْ لَا تَعْلَمُونَ
[ఫస్అలూ అహలద్-ధిక్ రి ఇన్ కున్తుమ్ లా త’అలమూన్]
“మీకు తెలియకపోతే జ్ఞానులను అడిగి తెలుసుకోండి.” (21:7)

కాబట్టి రమజాన్‌లో ఉన్న ఆరాధనలు, సత్కార్యాలు అవి ఎలా చేయాలి, వాటి నియమాలు నిబంధనలు ఏమిటి అని ముందుగానే మనము తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఇది మరొక సలహా, ఆరవది.

ఏడవ సలహా ఏమిటంటే, సంకల్ప శుద్ధి చేసుకోవాలి. సంకల్పం చేసుకోండని చెప్పాం, కానీ ఆ సంకల్పంలో కూడా శుద్ధి చేసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రదర్శనా బుద్ధికి లోనయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి. షైతాన్ ప్రతి ఒక్కరితో పాటు ఉన్నాడు, అతను ప్రజల హృదయాలలో ప్రదర్శనా బుద్ధి పుట్టించగలడు. కాబట్టి ప్రదర్శనా బుద్ధి రాకుండా ఉండుటకు సంకల్ప శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ప్రదర్శనా బుద్ధితో ఏ సత్కార్యము చేసినా అది వృధా అయిపోతుంది కాబట్టి, అది అల్లాహ్ వద్ద ఆమోదించబడదు కాబట్టి, మనము రమజాన్‌లో ప్రదర్శనా బుద్ధితో సత్కార్యాలు చేస్తే, ఆరాధనలు చేస్తే రమజాన్ మాసం వృధా అయిపోతుంది. చూడండి ఖురాన్ గ్రంథం 18వ అధ్యాయం, 110వ వాక్యంలో అల్లాహ్ తెలియజేస్తూ ఉన్నాడు:

فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا
[ఫమన్ కాన యర్జూ లిఖ్యా’అ రబ్బిహీ ఫల్-య’అమల్ ‘అమలన్ సాలిహన్ వలా యుష్రిక్ బి’ఇబాదతి రబ్బిహీ అహదా]

“తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవారు సత్కార్యాలు చేయాలి, తన ప్రభువు ఆరాధనలో వేరొకరికి భాగస్వామ్యం కల్పించకూడదు.” (18:110)

అంటే, చిత్తశుద్ధితో సత్కార్యాలు చేయాలి, ప్రదర్శనా బుద్ధికి దూరంగా ఉంటూ కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే సత్కార్యాలు చేయాలి కాబట్టి మన హృదయాలలో ప్రదర్శనా బుద్ధి రాకుండా సంకల్ప శుద్ధి చేసుకోవాలి.

ఇక ఎనిమిదవ సలహా ఏమిటంటే, ముస్లింల పట్ల మన హృదయాలను సాఫీగా ఉంచుకోవాలి. ఇతరుల పట్ల కల్మషం గానీ, కీడు గానీ హృదయాలలో ఉండనియ్యరాదు. ఎందుకంటే ఇంతకు ముందు షాబాన్ నెలలో ముఖ్యంగా షాబాన్ 15వ తేదీన ఒక హదీసు మనం పదేపదే వింటూ వస్తూ ఉన్నాం. ఏముంది అక్కడ?

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా షాబాన్ నెల 15వ తేదీ రాత్రిన ప్రజల వైపు దృష్టి సారించి అందరి పాపాలను మన్నించేస్తాడు, ఇద్దరి పాపాలను మాత్రము మన్నించకుండా వదిలేస్తాడు. ఎవరు ఆ ఇద్దరు అంటే, ఒకరు ముష్రిక్, మరొకరు తమ మిత్రుల పట్ల హృదయంలో కీడు ఉంచుకున్నవాడు.” (ఇది సహీ అత్-తర్ఘీబ్ వత్-తర్హీబ్ గ్రంథంలోని ఉల్లేఖనం.)

ఆ ఉల్లేఖనం ప్రకారంగా ఎవరైతే బహుదైవారాధన, షిర్క్ చేస్తూ ఉన్నారో వారికి పాప క్షమాపణ ఉండదు. అలాగే ఎవరైతే ఇతరుల పట్ల హృదయంలో కీడు ఉంచుకున్నారో, వాడికి, వారికి క్షమాపణ దొరకదు. కాబట్టి హృదయాలలో ఇతరుల పట్ల కీడు లేకుండా మన హృదయాన్ని కూడా మనము శుద్ధపరచుకోవాలి. ఎవరి గురించి కూడా మన హృదయంలో కీడు ఉండకూడదు.

ఇక మరొక సలహా ఏమిటంటే, ఖురాన్ పారాయణం కొరకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు లేదంటే ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. వారికి తీరిక ఎప్పుడు ఉంటుంది? ఏ సమయం వారికి దక్కుతుంది? ఆ సమయంలో వారు ఖురాన్ పారాయణం కోసము ముందుగానే టైం టేబుల్, జద్వల్ మరియు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. నాకు ఫలానా సమయంలో ఇంత సమయం దొరుకుతుంది, ఫలానా నమాజ్ తర్వాత ఇంత సమయం దొరుకుతుంది, లేదంటే ఉదయం ఇంత సమయం దొరుకుతుంది, మధ్యాహ్నం ఇంత సమయం దొరుకుతుంది, సాయంత్రం ఇంత సమయం దొరుకుతుంది, ఆ సమయాన్ని ఖురాన్ పారాయణంతో మనము నింపుకోవాలి. ఆ విధంగా ఖురాన్ పారాయణము కోసము మనము ప్రణాళిక చేసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా జిబ్రీల్ అలైహిస్సలాం వారికి రమజాన్ మాసంలో ఖురాన్ వినిపించేవారు. సహాబాలు కూడా రమజాన్ మాసంలో ఎక్కువగా ఖురాన్ పారాయణము చేసేవారు. మనము కూడా అధికసార్లు ఖురాన్ పారాయణము పూర్తి చేయుటకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, సమయాన్ని కేటాయించుకోవాలి, ఆ సమయం ప్రకారము తర్వాత ఖురాన్ పారాయణము చేసుకుంటూ రమజాన్ మాసాన్ని గడపాలి.

మరొక ఉదాహరణ ఏమిటంటే, రమజాన్‌లో ముఖ్యంగా ఇఫ్తారీ, ఉపవాస విరమణ చేయించుటకు ముందుగానే మనము ప్రణాళిక చేసుకోవాలి. మనం ఇంతకుముందు అనేక సార్లు విని ఉన్నాం, ఉపవాసానికి అపరిమితమైన పుణ్యం ఇవ్వబడుతుంది. అలాగే ఒక ఉపవాసికి ఇఫ్తారీ చేయిస్తే, ఉపవాస విరమణ చేయిస్తే, ఉపవాసికి దక్కినంత పుణ్యము ఉపవాస విరమణ చేయించిన వ్యక్తికి కూడా అందజేయబడుతుంది. అలాగే ఎంత మందికి మనము ఇఫ్తారీ చేయిస్తామో అన్ని ఉపవాసాల పుణ్యము పొందగలము కాబట్టి, రమజాన్ మాసం రాకముందే ఎంతమందికి మనము ఇఫ్తారీ చేయించాలి, మన స్తోమత ఏమిటి అనేది ముందుగానే మనము చూసుకొని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి మిత్రులారా.

అలాగే దానధర్మాలు చెల్లించుటకు కూడా ప్లాన్ చేసుకోవాలి. మన వీధిలో, మన ఇరుగుపొరుగులో, మనం నివసిస్తున్న ఊరులో, పల్లెలో, మన పరిసరాలలో అనేకమంది వితంతువులు ఉంటారు, అనాథలు ఉంటారు, వికలాంగులు ఉంటారు, అలాగే నిరుపేదలు ఉంటారు. అలాంటి వారికి మనము దానధర్మాలు చేయాలి. రమజాన్ మాసంలో చేసిన ప్రతి సత్కార్యానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పెంచి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి, రమజాన్ మాసంలో నిరుపేదలకు, వితంతువులకు, వికలాంగులకు, అభాగ్యులకు సహాయం చేయాలి, దానధర్మాలు చేయాలి. చూడండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చూసిన సహాబాలు ఏమంటారంటే:

كان رسول الله أجود بالخير من الريح المرسلة
[కాన రసూలుల్లాహి అజ్వద బిల్-ఖైరి మినర్-రీహిల్ ముర్సల]
“వేగంగా వీస్తున్న గాలి కంటే వేగంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమజాన్‌లో దానధర్మాలు చేసేవారు.”

అంటే అంత ఎక్కువగా ఆయన దానధర్మాలు రమజాన్ మాసంలో చేసేవారు కాబట్టి మనము కూడా విశాలమైన హృదయంతో రమజాన్ మాసంలో ఎక్కువగా దానధర్మాలు చేయాలి, దాని కోసం ముందుగానే మనము ప్రణాళిక చేసుకోవాలి మిత్రులారా. అల్లాహ్ మనందరికీ ఆ భాగ్యం ప్రసాదించు గాక.

అలాగే మరొక సలహా ఏమిటంటే, స్తోమత ఉన్నవారు రమజాన్ మాసంలో ఉమ్రా చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విషయం, రమజాన్‌లో ఆచరించిన ఉమ్రాకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా హజ్జ్ లాంటి పుణ్యం ప్రసాదిస్తాడు.

فإن عمرة في رمضان تقضي حجة أو حجة معي
[ఫఇన్న ఉమరతన్ ఫీ రమదాన తఖ్దీ హజ్జతన్ అవ్ హజ్జతన్ మ’ఈ]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు కలిసి హజ్జ్ చేసినంత పుణ్యము రమజాన్‌లో ఉమ్రా చేసిన వారికి ఇవ్వబడుతుంది.” అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. (బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం).

కాబట్టి మిత్రులారా, రమజాన్ మాసంలో సౌకర్యము మరియు స్తోమత ఉన్నవారు రమజాన్‌లో ఉమ్రా చేయటానికి ప్రణాళిక చేసుకోవాలి, ముందస్తు చర్యలు చేపట్టాలి.

అలాగే మరొక సలహా ఏమిటంటే, ఈ రమజాన్ మాసంలో దైవ సందేశం ప్రజల వద్దకు చేర్చటానికి ముందుగానే మనము సిద్ధమవ్వాలి. ఎందుకంటే రమజాన్ మాసంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా షైతాన్‌లకు బేడీలు వేసేస్తాడు కాబట్టి అల్లాహ్ మాట ప్రజల హృదయంలో ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది కాబట్టి, మనకు వీలైతే మనం స్వయంగా అల్లాహ్ నియమాలు, అల్లాహ్ వాక్యాలు ప్రజల వరకు చేరవేయించాలి. అంత శక్తి మాకు లేదు, ఆ అర్హత మాకు లేదు అంటే కనీసం ఎవరైతే ఆ పని చేస్తూ ఉన్నారో, దైవ వాక్యాలు ప్రజలకు వినిపించే పని చేస్తూ ఉన్నారో, వారి వద్దకు ప్రజలను తీసుకొని వెళ్లి అక్కడ వారికి అల్లాహ్ వాక్యాలు వినిపించేలాగా చూడాలి. స్వయంగా అందజేయండి. ఆ అర్హత లేదు, స్తోమత లేదు, అలాంటి సౌకర్యము లేదు అంటే, కనీసం ఎవరైతే దైవ వాక్యాలు వినిపిస్తున్నారో అలాంటి చోటికి మిత్రులను తీసుకొని వెళ్లి దైవ వాక్యాలు వినిపించండి. ఇన్ షా అల్లాహ్, అల్లాహ్ వారికి హిదాయత్ ప్రసాదిస్తే వారి హిదాయత్ కొరకు మీరు కారకులు అవుతారు, మీకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పుణ్యం ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ రమజాన్ మాసంలో అలాంటి ప్రణాళిక కూడా సిద్ధం చేసుకోండి అని పండితులు తెలియజేసి ఉన్నారు.

ఇక చివర్లో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మిత్రులారా, రమజాన్ మాసం, ఇది సంవత్సరం మొత్తం ఉండేది కాదు, కేవలం ఒక నెల మాత్రమే. అల్లాహ్ ఏమంటాడంటే:

أَيَّامًا مَّعْدُودَاتٍ
[అయ్యామన్ మ’అదూదాత్]
“ఇవి లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే.” (2:184)

30 రోజులు లేదంటే 29 రోజులు. ఈ లెక్కించదగిన ఈ కొన్ని రోజుల్ని మనము వృధా చేయనియ్యకూడదు. వృధా చేయకుండా పూర్తిగా కష్టపడి, శ్రమించి, ఎక్కువగా సత్కార్యాలు చేసుకొని పాప క్షమాపణ అల్లాహ్‌తో అడుక్కొని పాపాల నుండి విముక్తి పొందాలి, నరకం నుండి విముక్తి పొందాలి, స్వర్గవాసులైపోవాలి, అధిక పుణ్యాలు సంపాదించుకున్న వారైపోవాలి.

అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సంవత్సరం అల్లాహ్ మనకు రమజాన్ ప్రసాదించు గాక. ఈ సంవత్సరం మనం బ్రతికి ఉన్నాము, ఇక వచ్చే సంవత్సరం వరకు, వచ్చే సంవత్సరం రమజాన్ వరకు బ్రతికి ఉంటామో ఉండమో తెలియదు, ఎవరికీ గ్యారెంటీ లేదు. కాబట్టి ఇదే మన చివరి రమజాన్ ఏమో అని భావించి ఎక్కువగా శ్రమించుకోవాలి మిత్రులారా.

నేను అల్లాహ్‌తో దుఆ చేస్తూ ఉన్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ రమజాన్ నెల ప్రసాదించు గాక. రమజాన్ నెల కంటే ముందే రమజాన్ కోసము ప్రణాళికలు సిద్ధము చేసుకొని సన్నద్ధమయ్యే భాగ్యం ప్రసాదించు గాక. రమజాన్ శుభాలు, వరాలు మనందరి జీవితాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వర్షింపజేయు గాక, ఆమీన్.

వ జజాకుముల్లాహు ఖైరన్, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44142


ఓ అబూ అబ్దుల్లాహ్! మీరు మూలుగుతున్నారా?

మానవులు చేసే పనులను (కర్మలను) వ్రాసిపెట్టే కొందరు దేవదూతలు కూడా ఉన్నారు.

وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ كِرَامًا كَاتِبِينَ يَعْلَمُونَ مَا تَفْعَلُونَ

నిశ్చయంగా మీ పైన పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు. (వారు మీ కర్మలను నమోదు చేసే) గౌరవనీయులైన లేఖకులు.మీరు చేసేదంతా వారికి తెలుసు సుమా! (అల్-ఇన్ఫితార్ 82:10-12)

مَّا يَلْفِظُ مِن قَوْلٍ إِلَّا لَدَيْهِ رَقِيبٌ عَتِيدٌ

(మనిషి) నోట ఒక మాట వెలువడటమే ఆలస్యం, అతని దగ్గర ఒక పర్యవేక్షకుడు (దాన్ని నమోదు చేయడానికి) సిద్ధంగా ఉంటాడు. (ఖాఫ్ 50:18)

ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇమామ్ అహ్మద్ గారి శిష్యులలో ఒకరు అతన్నిపరామర్శించడానికి వెళ్ళారు. అనారోగ్యం కారణంగా ఇమామ్ అహ్మద్ బాధతో మూలుగుతుండటాన్ని ఆయన గమనించారు. అప్పుడు ఆ శిష్యుడు ఇలా అన్నారు:

“ఓ అబూ అబ్దుల్లాహ్! మీరు మూలుగుతున్నారా? తావూస్ (Tawus) ఇలా అన్నారు: ‘నిశ్చయంగా దేవదూతలు ప్రతి ఒక్కదానిని వ్రాస్తారు, చివరకు రోగి చేసే మూలుగును కూడా. ఎందుకంటే అల్లాహ్ ఇలా అంటున్నాడు: “(మనిషి) నోట ఒక మాట వెలువడటమే ఆలస్యం, అతని దగ్గర ఒక పర్యవేక్షకుడు (దాన్ని నమోదు చేయడానికి) సిద్ధంగా ఉంటాడు. (ఖాఫ్ 50:18)’”

అందువల్ల, అబూ అబ్దుల్లాహ్ (ఇమామ్ అహ్మద్) మరింత ఓపిక వహించడం మొదలుపెట్టారు మరియు ఆయన మూలగడం మానేశారు [1], ఎందుకంటే ప్రతిదీ వ్రాయబడుతోంది. “అతడు ఏ మాట పలికినా” – అంటే మీరు మాట్లాడే ఏ మాట అయినా వ్రాయబడుతుంది. అయితే, దానికి మీకు పుణ్యం లభించవచ్చు లేదా శిక్ష పడవచ్చు. ఇది పైన చెప్పబడిన విషయంపై ఆధారపడి ఉంటుంది.


[1] సాలిహ్ బిన్ అల్-ఇమామ్ అహ్మద్ ద్వారా నివేదించబడినది, ఆయన ఇలా అన్నారు: “మా నాన్నగారు మరణించడానికి ముందు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇలా అన్నారు: ‘అబ్దుల్లా బిన్ ఇద్రీస్ పుస్తకాన్ని బయటకు తీయి.’ తరువాత ఇలా అన్నారు: ‘అనారోగ్య సమయంలో మూలగడం తావూస్ కు ఇష్టం ఉండేది కాదు అనే లైత్ (Laith) గారి ఉల్లేఖనను నాకు చదివి వినిపించు.’ ఆ తర్వాత ఆయన మరణించే వరకు మా నాన్నగారి నుండి నేను ఎటువంటి మూలుగు వినలేదు.” – సియర్ ఆలామ్ అన్-నుబలా (11:215).

మూలం: అల్-అఖీదా అల్-వాసితియ్య (2 వాల్యూమ్ సెట్) – రచయిత: ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్-ఉతైమీన్ – ప్రచురణకర్త: దారుస్సలాం పబ్లిషర్స్ & డిస్ట్రిబ్యూటర్స్.

Source: క్రింది ఇంగ్లీష్ ఆర్టికల్ నుండి తెలుగులోకి అనువదించబడింది 
O Abu ‘Abdullah! Are you groaning?
https://abdurrahman.org/2014/11/23/o-abu-abdullah-are-you-groaning/

దైవ దూతలు (ملائِكة‎) – Main page:
https://teluguislam.net/angels/

సూరతు ఖురైష్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) – నసీరుద్దీన్ జామిఈ

ఈ తఫ్సీర్ తయారు చేయడంలో మద్ధతు లభించినది:

1. షేఖ్ మఖ్సూదుల్ హసన్ ఫైజీ హఫిజహుల్లాహ్ వీడియో ద్వారా.
2. షేఖ్ అబ్దుస్ సలాం భుట్వీ రహిమహుల్లాహ్ వారి తఫ్సీర్ ద్వారా.
3. ప్రఖ్యాతిగాంచిన [ఇబ్ను కసీర్] ద్వారా.

الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الله، أما بعد!

لِإِيلَافِ قُرَيْشٍ ۝ إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ ۝ فَلْيَعْبُدُوا رَبَّ هَذَا الْبَيْتِ ۝ الَّذِي أَطْعَمَهُم مِّن جُوعٍ وَآَمَنَهُم مِّنْ خَوْفٍ

ఖురైషులను అలవాటు చేసిన కారణంగా, (అంటే) చలికాలపు, ఎండాకాలపు ప్రయాణాలకు వారిని అలవాటు చేసిన కారణంగా, వారు ఈ (కాబా) గృహం యెక్క ప్రభువునే ఆరాధించాలి. ఆయనే వారికి ఆకలిగొన్నప్పుడు అన్నం పెట్టాడు. భయాందోళనల స్థితిలో భద్రత కల్పించాడు.

ఇది ‘సూరా ఖురైష్’ పేరుతో పిలువబడుతుంది. ఈ సూరా మొదటి ఆయత్ లోనే ‘ఖురైష్’ అనే పదం వచ్చింది. మరియు ప్రత్యేకంగా ఈ సూరా ‘ఖురైష్’ (మక్కాలోని తెగ) వారి గురించి అవతరించింది. అల్లాహ్ ఈ సూరాలో, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై విశ్వాసం తీసుకురావాలని మరియు వారు కాబా గృహం పట్ల గౌరవం చూపాలని ఖురైష్ లకు ఆదేశించాడు.

నిజానికి, ఈ పూర్తి సూరా ఖురైష్ గురించే అవతరించింది. ఇమామ్ బైహకీ (రహిమహుల్లాహ్) తన పుస్తకం ‘అల్-ఖిలాఫియాత్’ లో మరియు అల్లామా అల్బానీ (రహిమహుల్లాహ్) తన ‘అస్-సహీహా’ లో ఉల్లేఖించిన హదీసు ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

فَضَّلَ اللَّهُ قُرَيْشًا بِسَبْعِ خِلَالٍ: أَنِّي فِيهِمْ، وَأَنَّ النُّبُوَّةَ فِيهِمْ، وَالْحِجَابَةَ، وَالسِّقَايَةَ فِيهِمْ، وَأَنَّ اللَّهَ نَصَرَهُمْ عَلَى الْفِيلِ، وَأَنَّهُمْ عَبَدُوا اللَّهَ عَشْرَ سِنِينَ لَا يَعْبُدُهُ غَيْرُهُمْ، وَأَنَّ اللَّهَ أَنْزَلَ فِيهِمْ سُورَةً مِنَ الْقُرْآنِ

“అల్లాహ్ ఖురైష్ కు ఏడు ప్రత్యేకతలను ఇచ్చాడు, అవి మరే తెగకు ఇవ్వలేదు: నేను (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం) ఖురైష్ వంశానికి చెందినవాడిని. వారిలో నుండే అల్లాహ్ ప్రవక్తలను ఎన్నుకున్నాడు. అల్లాహ్ తన పవిత్ర గృహం (బైతుల్లాహ్ – కాబా) సేవ కోసం, హాజీలకు నీరు త్రాగించడం కోసం వీరినే ఎంపిక చేశాడు. అల్లాహ్ ఏనుగుల సైన్యం (అసహబె ఫీల్) పై, అంటే అబ్రహా మరియు అతని సైన్యం పై, ఖురైష్ లకు అద్భుతమైన రీతిలో సహాయం చేశాడు (వారిని కాపాడాడు).ప్రవక్త పదవికి ముందు, పది సంవత్సరాల పాటు వీరు మాత్రమే అల్లాహ్ ను ఆరాధించేవారు, వీరితో పాటు వేరెవరూ లేరు. అల్లాహ్ వారి గౌరవార్థం ఒక పూర్తి సూరాను అవతరింపజేశాడు, అదే ‘సూరా ఖురైష్’. (అల్ ఖిలాఫియాత్: బైహఖీ 1517, సహీహా 1944).

ఈ సూరాలో అల్లాహ్ మక్కా వాసులకు, ప్రత్యేకంగా ఖురైష్ కు తన అనుగ్రహాలను గుర్తు చేశాడు. ఆ అనుగ్రహాలను అర్థం చేసుకోవడానికి, ఖురైష్ ల పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి చూడాలి. హజ్రత్ ఇబ్రహీం (అలైహిస్సలాం) తన కుమారుడు ఇస్మాయిల్ (అలైహిస్సలాం) ను మక్కాలో వదిలినప్పుడు, అక్కడ బనూ జుర్హుమ్ అనే తెగ యెమెన్ నుండి వచ్చి వారితో పాటు స్థిరపడింది. హజ్రత్ ఇస్మాయిల్ (అలైహిస్సలాం) వారిలోనే వివాహం చేసుకున్నారు, అలా వారంతా కలిసిపోయారు.

కాలం గడిచేకొద్దీ, హజ్రత్ ఇస్మాయిల్ (అలైహిస్సలాం) మరియు హజ్రత్ ఇబ్రహీం (అలైహిస్సలాం) బోధనలు మరుగున పడిపోయాయి. వారిలో కుఫ్ర్ (అవిశ్వాసం) మరియు షిర్క్ (బహుదైవారాధన) తో పాటు అన్యాయం కూడా పెరిగిపోయింది. అల్లాహ్ కు అన్యాయం నచ్చదు. అల్లాహ్ [సూరా అల్-హజ్: 25]లో ఇలా తెలిపాడడు:

وَمَن يُرِدْ فِيهِ بِإِلْحَادٍ بِظُلْمٍ نُذِقْهُ مِنْ عَذَابٍ أَلِيمٍ

{మరియు ఎవరైతే ఇందులో (మక్కాలో) అన్యాయంతో కూడిన చెడును తలపెడతారో, వారికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపిస్తాము.}

వారిలో ఈ చెడులు పెరగడంతో, బనూ ఖుజా అనే మరో తెగ వచ్చి వారిపై దాడి చేసి, వారిని ఓడించి మక్కా నుండి తరిమికొట్టింది. జుర్హుమ్ తెగ వారు పారిపోతూ జమ్ జమ్ బావిని పూడ్చివేశారు. అలా మక్కా బనూ ఖుజా చేతిలోకి వెళ్ళింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముత్తాత ఖుసయ్ ఇబ్న్ కిలాబ్ వచ్చే వరకు పరిస్థితి ఇలాగే ఉంది. ఖుసయ్ తన బలాన్ని కూడగట్టుకుని, బనూ ఖుజాను ఓడించి, మక్కాపై తిరిగి ఆధిపత్యం సాధించాడు. ఖురైష్ తెగ చెల్లాచెదురుగా ఉన్నప్పుడు, వారిని ఏకం చేసి మక్కాలో మళ్ళీ స్థిరపరిచాడు. అందుకే ఈ కలయికను ‘ఈలాఫ్‘ (ఐక్యమత్యం/అలవాటు చేయడం) అన్నారు. ‘ఈలాఫ్’ అంటే ఉల్ఫత్ (ప్రేమ/కలయిక) నుండి వచ్చింది. అంటే ఒకే ఆలోచన కలిగిన వారిని ఒక చోట చేర్చడం. అందుకే పుస్తకం వ్రాయడాన్ని ‘తాలీఫ్‘ అంటారు (విషయాలను ఒక చోట చేర్చడం).

ఖురైష్ వారు ఒకే తెగ, ఒకే కుటుంబం కాబట్టి అల్లాహ్ వారిని మళ్ళీ ఏకం చేయడాన్ని ‘ఈలాఫ్’ అన్నాడు. ఇది అల్లాహ్ వారిపై చూపిన గొప్ప దయ. వారు మక్కా నుండి దూరమై, పరాయివారైపోయిన తర్వాత, అల్లాహ్ వారిని మళ్ళీ ఇక్కడ చేర్చాడు.

అల్లాహ్ ఈ సూరాలో ఇలా అంటున్నాడు:

ఇక్కడ ‘లి’ (لِ) అనే అక్షరానికి రెండు అర్థాలు ఉన్నాయి.

ఒక అర్థం: ఇది మునుపటి సూరా ‘అలమ్ తర కైఫ’ (సూరా ఫీల్) కు కొనసాగింపు. అందుకే కొంతమంది పారాయణంలో ‘బిస్మిల్లాహ్’ లేకుండా దీనిని చదువుతారు (అంటే రెండు సూరాలను కలిపి). అంటే అల్లాహ్ ఏనుగుల సైన్యాన్ని ఎందుకు నాశనం చేశాడంటే – ఖురైష్ లకు రక్షణ కల్పించి, వారిని ఏకం చేయడానికి.

రెండవ అర్థం: ‘ఆశ్చర్యం’ (తఅజ్జుబ్) వ్యక్తం చేయడం. అంటే ఖురైష్ ల పరిస్థితి చూసి ఆశ్చర్యం కలగాలి. అల్లాహ్ వారిని ఇంతగా కరుణించి, వారికి రక్షణ కల్పిస్తే, వారు అల్లాహ్ ను వదిలి విగ్రహాలను ఆరాధిస్తున్నారు.

ఇక్కడ మరొక విషయం ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తాత హాషిమ్, ఖుసయ్ యొక్క మనవడు. ఇతను చాలా తెలివైనవాడు. అప్పట్లో మక్కా వాసులకు వ్యాపారం తప్ప వేరే ఆధారం లేదు. హాషిమ్ ఆలోచించి, వాణిజ్య యాత్రలను (Trade Journeys) ప్రారంభించాడు. అతను యెమెన్, ఇరాక్, సిరియా (షామ్), మరియు హబషా (ఇథియోపియా) రాజులతో మాట్లాడి ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. దీని వల్ల మక్కా వాసులు సురక్షితంగా వ్యాపారం చేసుకోగలిగారు.

సంవత్సరంలో రెండు ప్రధాన ప్రయాణాలు ఉండేవి:

(1) శీతాకాలం (Winter): యెమెన్ వైపు వెళ్ళేవారు (ఎందుకంటే అక్కడ ఆ సమయంలో వాతావరణం వెచ్చగా ఉండేది).
(2) వేసవికాలం (Summer): సిరియా (షామ్) వైపు వెళ్ళేవారు (అక్కడ చల్లగా ఉండేది).

ఈ ప్రయాణాల ద్వారా మక్కా వాసులు ధనవంతులయ్యారు, వారి ఆకలి తీరింది. అల్లాహ్ వారిపై చేసిన ఈ ఉపకారాన్ని గుర్తు చేస్తున్నాడు.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అబ్రహా (ఏనుగుల సైన్యం) మక్కాపై దాడి చేయడానికి వచ్చినప్పుడు, అల్లాహ్ అద్భుతమైన రీతిలో పక్షులతో వారిని నాశనం చేశాడు. దీంతో అరబ్బులందరిలో ఖురైష్ ల పట్ల గౌరవం పెరిగింది. “వీరు అల్లాహ్ ఇంటి రక్షకులు, అల్లాహ్ వీరికి సహాయం చేశాడు” అని అందరూ వీరిని గౌరవించేవారు. ఎంతగా అంటే, వీరి వాణిజ్య బిడారులు (Caravans) ఎక్కడికి వెళ్ళినా ఎవరూ వీరిని దోచుకునేవారు కాదు. మిగతా వారిని దారి దోపిడి దొంగలు దోచుకునేవారు, కానీ ఖురైష్ లను మాత్రం ఎవరూ ముట్టుకునేవారు కాదు. పైగా వీరి రక్షణ కోసం ఒప్పందాలు కూడా ఉండేవి.

అందుకే అల్లాహ్ అంటున్నాడు:

لِإِيلَافِ قُرَيْشٍ ۝ إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ
ఖురైష్ లకు శీతాకాల మరియు వేసవికాల ప్రయాణాలు సులభం చేసి, వాటిని అలవాటు చేసినందుకు (వారు కృతజ్ఞత చూపాలి)

వారు ఈ ప్రయాణాలను ఎంత ధైర్యంగా, నిశ్చింతగా చేసేవారంటే, వారికి దారిలో ఎలాంటి భయం ఉండేది కాదు. అల్లాహ్ వారికి ఇచ్చిన ఈ భద్రత, ఈ ఐక్యత చూసి ఆశ్చర్యం కలుగుతుంది, అయినప్పటికీ వారు అల్లాహ్ ను ఆరాధించడం లేదు.

వారికి ఈ భద్రత రావడానికి కారణం ఈ ఇల్లు (కాబా). అల్లాహ్ మరో చోట [సూర అన్ కబూత్ 29:67]లో ఇలా తెలిపాడు:

أَوَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا حَرَمًا آمِنًا وَيُتَخَطَّفُ النَّاسُ مِنْ حَوْلِهِمْ

ఏమిటీ, మేము హరమ్‌ను (మక్కా పుణ్యక్షేత్రాన్ని) సురక్షితమైన క్షేత్రంగా చేయటాన్ని వారు చూడటం లేదా? మరి (చూడబోతే) వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఎగరేసుకుపోబడుతున్నారు (దోచుకోబడుతున్నారు).

చుట్టూ ఉన్నవారిని దోచుకుంటున్నారు, చంపుతున్నారు, కానీ మక్కాలో ఉన్నవారికి మాత్రం పూర్తి రక్షణ ఉంది. అయినా వారు అసత్య దైవాలను నమ్ముతారా? అల్లాహ్ అనుగ్రహాన్ని కాదంటారా?

అల్లాహ్ ను వదలి ఇతరులను ఆరాధిస్తారా. చదవండి అల్లాహ్ ఆదేశం:

إِنَّمَا أُمِرْتُ أَنْ أَعْبُدَ رَبَّ هَٰذِهِ الْبَلْدَةِ الَّذِي حَرَّمَهَا وَلَهُ كُلُّ شَيْءٍ ۖ وَأُمِرْتُ أَنْ أَكُونَ مِنَ الْمُسْلِمِينَ

నేను ఈ నగరం (మక్కా) ప్రభువును మాత్రమే ఆరాధిస్తూ ఉండాలని నాకు ఆదేశించబడింది. ఆయన దీన్ని పవిత్రమైనదిగా (హరమ్) చేశాడు. అన్నింటికీ ఆయనే యజమాని. నేను విధేయులలో ఒకడిగా ఉండాలని కూడా నాకు ఆజ్ఞాపించబడింది. (నమ్ల్ 27:91) [ఇబ్ను కసీర్].

మక్కాలో ఏ పంటలు పండవు, ఏ పండ్ల తోటలు లేవు. అది రాళ్ళతో నిండిన లోయ (వాది గైరి జీ జరా). అయినా అక్కడ ప్రపంచంలోని అన్ని రకాల పండ్లు, ఆహార పదార్థాలు వస్తున్నాయి. అల్లాహ్ వారికి ఆకలి తీరుస్తున్నాడు.

చుట్టుపక్కల అందరూ భయంతో బ్రతుకుతుంటే, ఖురైష్ లకు మాత్రం అల్లాహ్ ఏ భయం లేకుండా చేశాడు. మక్కాలో ఉన్నప్పుడు భయం లేదు, బయట ప్రయాణాల్లో ఉన్నప్పుడు కూడా భయం లేదు.

ముగింపు: దీని సారాంశం ఏమిటంటే, అల్లాహు తఆలా ఖురైష్ కు, మరియు మనందరికీ ఒక పాఠం నేర్పుతున్నాడు. అల్లాహ్ మనకు ఇచ్చిన రెండు గొప్ప వరాలు: 1. ఆకలి నుండి విముక్తి (ఆహారం), 2. భయం నుండి విముక్తి (శాంతి/భద్రత). ఎవరికైతే ఈ రెండు ఉన్నాయో, వారు అల్లాహ్ కు కృతజ్ఞతగా ఆయనను మాత్రమే ఆరాధించాలి.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక హదీసులో ఇలా అన్నారు:

مَنْ أَصْبَحَ مِنْكُمْ آمِنًا فِي سِرْبِهِ، مُعَافًى فِي جَسَدِهِ، عِنْدَهُ قُوتُ يَوْمِهِ، فَكَأَنَّمَا حِيزَتْ لَهُ الدُّنْيَا

మీలో ఎవరైతే ఉదయం లేచేసరికి తన కుటుంబంలో (లేదా తన గూటిలో) సురక్షితంగా ఉంటారో, శరీర ఆరోగ్యంతో ఉంటారో, మరియు ఆ రోజుకు సరిపడా ఆహారం వారి దగ్గర ఉంటుందో – వారికి ప్రపంచం మొత్తం ఇవ్వబడినట్లే. [సునన్ తిర్మిదీ: 2346. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ హసన్ అన్నారు].

కాబట్టి, మనకు ఆరోగ్యం, భద్రత, మరియు ఆహారం ఉన్నప్పుడు, మనం మన సమయాన్ని అల్లాహ్ ఆరాధనలో గడపాలి. కేవలం ప్రపంచం వెనుక పరుగెత్తకూడదు. ఎవరైతే అల్లాహ్ ను ఆరాధిస్తారో, అల్లాహ్ వారికి ఇహలోకంలోనూ, పరలోకంలోనూ భద్రతను మరియు ఆహారాన్ని ప్రసాదిస్తాడు.

అల్లాహ్ మనందరికీ తన అనుగ్రహాలను గుర్తించి, ఆయనకు కృతజ్ఞతలు తెలిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనకు ఆకలి మరియు భయం నుండి రక్షణ కల్పించుగాక. ఆమీన్.

వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

* మౌలానా అబ్దుస్ సలాం భుట్వీ రహిమహుల్లాహ్ వారి తఫ్సీర్ లోని కొన్ని విషయాలు చదవండి:

మొదటి ఉపకారం ఏమిటంటే, వారి హృదయాలలో ప్రయాణం పట్ల ప్రేమను కలిగించాడు. వారికి చలికాలం ప్రయాణంలో గానీ, వేసవికాలం ప్రయాణంలో గానీ ఎలాంటి కష్టం అనిపించేది కాదు. మరియు ప్రపంచంలో ప్రయాణమే విజయానికి మార్గం. ఒకవేళ అల్లాహు తఆలా వారి హృదయాలను ప్రయాణానికి అలవాటు చేసి ఉండకపోతే, వారు కూడా తమ ఇళ్లలోనే కూర్చుని ఉండేవారు. ప్రయాణం వల్ల లభించే సిరిసంపదలు, అనుభవం, జ్ఞానం మరియు ప్రపంచంలోని ప్రజలతో, ప్రాంతాలతో ఏర్పడే పరిచయం వారికి ఎప్పటికీ లభించేవి కావు.

ప్రయాణానికి అలవాటు పడటమనే ఈ వరమే ఖురైషీలకు ఆ తర్వాత హిజ్రత్ (వలస) ప్రయాణంలో ఉపయోగపడింది. ఆ తర్వాత అవిశ్వాసులతో యుద్ధంలోనూ, దాని తర్వాత రోమ్ మరియు షామ్, ఇరాక్ మరియు పర్షియా, హింద్ మరియు సింధ్, ఈజిప్ట్ మరియు ఆఫ్రికా, ఇంకా తూర్పు పడమరల విజయాలలో కూడా ఉపయోగపడింది. వాస్తవం ఏమిటంటే, ముస్లిం జాతి ప్రపంచంపై ఆధిపత్యం సాధించడానికి మరియు గెలిచి నిలబడటానికి మొదటి అడుగు ఏమిటంటే, వారు ప్రయాణాలంటే భయపడకూడదు మరియు బయలుదేరే అవకాశం వచ్చినప్పుడు భూమిని పట్టుకుని (ఇక్కడే) ఉండిపోకూడదు. ఇప్పుడు మనం చూస్తున్నాము, అవిశ్వాస జాతులే నేల, నీరు మరియు ఆకాశ మార్గ ప్రయాణాలపై గుత్తాధిపత్యం కలిగి ఉన్నాయి. ముస్లింలు చాలా వరకు ఈ పాఠాన్ని మర్చిపోయారు.

రెండవ ఉపకారం ఏమిటంటే, ఆ సమయంలో అరేబియా అంతటా తీవ్రమైన అశాంతి ఉండేది. ఎవరిపై ఎప్పుడు దాడి జరుగుతుందో, ఎవరిని చంపేస్తారో, లేదా ఎత్తుకెళ్తారో, లేదా ఆస్తిని దోచుకుంటారో మరియు స్త్రీలను, పిల్లలను బానిసలుగా చేసుకుంటారో ఎవరికీ తెలిసేది కాదు. ఇలాంటి పరిస్థితులలో కేవలం మక్కా వాసులకు మాత్రమే ఈ శాంతి (భద్రత) లభించింది, వారి వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అల్లాహ్ సెలవిచ్చినట్లుగా:

أَوَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا حَرَمًا آمِنًا وَيُتَخَطَّفُ النَّاسُ مِنْ حَوْلِهِمْ

ఏమిటీ, మేము హరమ్‌ను (మక్కా పుణ్యక్షేత్రాన్ని) సురక్షితమైన క్షేత్రంగా చేయటాన్ని వారు చూడటం లేదా? మరి (చూడబోతే) వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఎగరేసుకుపోబడుతున్నారు (దోచుకోబడుతున్నారు). [అన్ కబూత్ 29:67]

మూడవ ఉపకారం ఏమిటంటే, హరమ్ (మక్కా) వాసులైనందున వ్యాపార ప్రయాణాలలో ఎవరూ వారి బిడారు (కాఫిలా)ను దోచుకునేవారు కాదు. ప్రతి తెగ మరియు ప్రతి జాతి తమ ప్రాంతం గుండా వెళ్ళే వారి నుండి తీసుకునే పన్నులు వీరి నుండి తీసుకునేవారు కాదు. మరియు వీరిని ఎక్కడికి వెళ్ళకుండా ఆపేవారు కాదు.

నాలుగవది ఏమిటంటే, ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు హజ్ మరియు ఉమ్రా కోసం మక్కాకు వచ్చేవారు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సరుకులు ఇక్కడికి చేరేవి. ఇవే కాకుండా, ఇబ్రహీం (అలైహిస్సలాం) ప్రార్థన ఫలితంగా అన్ని రకాల పండ్లు ఇక్కడికి చేరేవి. అల్లాహ్ సెలవిచ్చాడు:

أَوَلَمْ نُمَكِّن لَّهُمْ حَرَمًا آمِنًا يُجْبَىٰ إِلَيْهِ ثَمَرَاتُ كُلِّ شَيْءٍ رِّزْقًا مِّن لَّدُنَّا وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ

ఏమిటి? మేము వారికి సురక్షితమైన, పవిత్రమైన చోట స్థిరనివాసం కల్పించలేదా? అక్కడ వారికి అన్ని రకాల పండ్లు ఫలాలు ఉపాధి రూపంలో మావద్ద నుంచి సరఫరా చేయబడలేదా? కాని వారిలోని చాలా మంది (ఈ యదార్థాన్ని) తెలుసుకోరు. (ఖసస్ 28:57).

ఇబ్రాహీం అలైహిస్సలాం చేసిన దుఆ ప్రస్తావన సూర బఖర (2:126), సూర ఇబ్రాహీం (14:37)లో చూడవచ్చును. [mnj],

ఈ వ్యాపార ప్రయాణాలు మరియు మక్కా వ్యాపారానికి యజమానులైనందున ఖురైషీలు అత్యంత ధనవంతులుగా ఉండేవారు. మరియు హరమ్ యొక్క శుభం (బర్కత్) వల్ల శాంతి భద్రతలను కూడా పొంది ఉండేవారు. స్పష్టంగా ఈ వరాలన్నీ అల్లాహ్ ఇంటి బర్కత్ వల్లనే లభించాయి మరియు కేవలం ప్రభువు ప్రసాదించినవి మాత్రమే. అలాంటప్పుడు, ఈ వరాలన్నీ ఈ ఇంటి యజమాని ఇచ్చినప్పుడు, మీరు ఆ ఒక్కడినే ఎందుకు ఆరాధించరు? మరియు ఇతరులను ఆయనకు సాటిగా కల్పించి వారి ముందు ఎందుకు సాష్టాంగ (సజ్దా) పడుతున్నారు? వారి ఆస్థానాల వద్ద ఎందుకు మొక్కుబడులు చెల్లిస్తున్నారు మరియు కానుకలు సమర్పిస్తున్నారు?

* “లి ఈలాఫి ఖురైష్” (ఖురైషీల హృదయంలో ప్రేమను కలిగించినందువల్ల) ఒకవేళ ఈ ఇతర అసంఖ్యాకమైన వరాల కారణంగా వీరు ఒక్క అల్లాహు తఆలాను ఆరాధించకపోయినా, కనీసం ఈ ఇంటి ప్రభువు అయినందువల్లనైనా ఆయనను ఆరాధించాలి. ఏ ఇంటి బర్కత్ వల్లనైతే వారికి చలి మరియు వేసవిలో ప్రయాణించే అవకాశం, శాశ్వత శాంతి భద్రతలు మరియు సమృద్ధిగా ఉపాధి వరాలు లభిస్తున్నాయో.

ఏ ప్రదేశంలోనైనా శాంతి ఉండటం అల్లాహు తఆలా యొక్క చాలా గొప్ప వరం. మనం కూడా ఉపాధిలో విశాలత మరియు శాంతి లాంటి వరంపై అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి మరియు ఆయననే ఆరాధించాలి. అల్లాహ్ కాని వారి ఆరాధన మరియు షిర్క్ (బహుదైవారాధన) నుండి దూరంగా ఉండాలి. షిర్క్ కేంద్రాలను నిర్మించడం మరియు అభివృద్ధి చేయడానికి బదులుగా, తౌహీద్ (ఏక దైవారాధన) కేంద్రాలను నిర్మించి, అభివృద్ధి చేయాలి. ఒకవేళ మనం అలా చేయకపోతే, ఉపాధిలో సంకుచితత్వం మరియు అశాంతి, కల్లోలాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, ప్రస్తుతం ఎదుర్కొంటున్నట్లుగా.

దీనికి ఆధారం చూడండి సూరతున్ నహ్ల్ (16:112)లో:

وَضَرَبَ اللَّهُ مَثَلا قَرْيَةً كَانَتْ آمِنَةً مُطْمَئِنَّةً يَأْتِيهَا رِزْقُهَا رَغَدًا مِنْ كُلِّ مَكَانٍ فَكَفَرَتْ بِأَنْعُمِ اللَّهِ فَأَذَاقَهَا اللَّهُ لِبَاسَ الْجُوعِ وَالْخَوْفِ بِمَا كَانُوا يَصْنَعُونَ

అల్లాహ్‌ ఒక పట్నం ఉదాహరణను ఇస్తున్నాడు. ఆ పట్నం ఎంతో ప్రశాంతంగా, తృప్తిగా ఉండేది. దానికి అన్ని వైపుల నుంచీ పుష్కలంగా జీవనోపాధి లభించేది. మరి ఆ పట్నవాసులు అల్లాహ్‌ అనుగ్రహాలపై కృతఘ్నత చూపగా, అల్లాహ్‌ వారి స్వయంకృతాలకు బదులుగా వారికి ఆకలి, భయాందోళనల రుచి చూపించాడు. [ఇబ్ను కసీర్].

దైవ దూతల పట్ల విశ్వాసం – సలీమ్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

దైవ దూతల పట్ల విశ్వాసం
ముహమ్మద్ సలీమ్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/MiDl95p280k [15 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లామీయ విశ్వాస మూలస్తంభాలలో రెండవది అయిన దైవదూతల పట్ల విశ్వాసం గురించి వివరించబడింది. దైవదూతలు ఎవరనేది, వారి లక్షణాలు, వారి పుట్టుక, వారి సంఖ్య, మరియు వారి శక్తి సామర్థ్యాల గురించి చర్చించబడింది. దైవదూతలు కాంతితో సృష్టించబడినవారని, వారు పాపాలు చేయరని, ఎల్లప్పుడూ అల్లాహ్‌ను ఆరాధిస్తారని చెప్పబడింది. వారి సంఖ్య అపారమని, ప్రతిరోజు 70,000 మంది దైవదూతలు ‘బైతే మామూర్’లో ఆరాధన చేస్తారని హదీసు ద్వారా వివరించబడింది. చివరగా, జిబ్రీల్, మీకాయీల్, ఇస్రాఫీల్, మల‌కుల్ మౌత్ వంటి కొంతమంది ముఖ్యమైన దైవదూతల పేర్లు, వారి బాధ్యతల గురించి కూడా తెలియజేయబడింది.

అల్ హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్. అన్ని రకాల ప్రశంసలు, పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ
[అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలలోని రెండవ ముఖ్యాంశం, దైవదూతల పట్ల విశ్వాసం గురించి ఇన్ షా అల్లాహ్ ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం.

ఇంతకు ముందు కూడా మనము హదీసు విని ఉన్నాం, జిబ్రీల్ అలైహిస్సలాం, దైవదూత, మానవ రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్తా, ఈమాన్ అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏమిటి?” అని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈమాన్ గురించి, విశ్వాసం గురించి తెలియజేస్తూ, “అల్లాహ్‌ను విశ్వసించటం, దైవదూతలను విశ్వసించటం, దైవ గ్రంథాలను విశ్వసించటం, దైవ ప్రవక్తలను విశ్వసించటం, పరలోక దినాన్ని విశ్వసించటం, మంచి-చెడు విధివ్రాతను విశ్వసించటం,” ఈ ఆరు విషయాలను విశ్వసించటాన్ని ఈమాన్, విశ్వాసం అంటారు అని సమాధానం ఇచ్చినప్పుడు, దైవదూత, “మీరు చెప్పింది నిజమే” అని ధ్రువీకరించారు.

అయితే, ప్రవక్త వారు తెలియజేసిన ఆరు విషయాలలో నుంచి రెండవ విషయం దైవదూతల పట్ల విశ్వాసం గురించి ఇన్ షా అల్లాహ్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

దైవదూతలు ఎవరు? దైవదూతల లక్షణాలు ఏమిటి? దైవదూతల పుట్టుక ఎలా జరిగింది? దైవదూతల సంఖ్య ఎంత? దైవదూతల శక్తి సామర్థ్యాలు ఏమిటి? కొంతమంది దైవదూతల పేర్లు మరియు బాధ్యతలు, ఇవన్నీ విషయాలు ఇన్ షా అల్లాహ్ ఈ ప్రసంగంలో మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

ముందుగా, దైవదూతలు ఎవరు అనేది తెలుసుకుందాం. దైవదూతలు అల్లాహ్ సృష్టించిన ఒక ప్రాణి. మానవులు అల్లాహ్ సృష్టించిన ఒక ప్రాణి, జంతువులు అల్లాహ్ సృష్టించిన ఒక ప్రాణి, పక్షులు ఒక ప్రాణి, జలచరాలు ఒక ప్రాణి. అలాగే, దైవదూతలు కూడా అల్లాహ్ సృష్టించిన ఒక ప్రాణి. దైవదూతలు మానవుల కంటికి కనిపించరు. అయితే, దైవదూతలు ఉన్నారు అనేది వాస్తవము కాబట్టి, ఆ వాస్తవాన్ని మనము నమ్మాలి, విశ్వసించాలి.

దైవదూతల లక్షణాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దైవదూతలు పుణ్యాత్ములు, ఎల్లప్పుడూ అల్లాహ్‌ను స్మరిస్తూ, ఆరాధిస్తూ ఉంటారు. అల్లాహ్ ఆదేశాలను అతిక్రమించటం, పాపాలకు పాల్పడటం దైవదూతలకు రాదు. ఖురాన్ గ్రంథం, ఆరవ అధ్యాయం 66వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశారు:

لَّا يَعْصُونَ ٱللَّهَ مَآ أَمَرَهُمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ
[లా య’సూనల్లాహ మా అమరహుమ్ వ యఫ్’అలూన మా యు’మరూన్]
అల్లాహ్ ఆజ్ఞలను పాలించటంలో వారు ఏ మాత్రం అలక్ష్యం చేయరు. పైగా వారికి జారీ చేయబడిన ఆజ్ఞలను వారు ఖచ్చితంగా పాటిస్తారు, పాలిస్తారు.

చూశారా? అల్లాహ్ వారికి ఇచ్చిన బాధ్యత వారు ఖచ్చితంగా నెరవేరుస్తారు. అల్లాహ్ ఆజ్ఞలను అతిక్రమించటం వారికి రాదు. పాపాలు చేయటం, అల్లాహ్ ఆజ్ఞలను ఉల్లంఘించటం వారికి రానే రాదు.

దైవదూతలకు మానవుల లాంటి లక్షణాలు ఉండవు. ఉదాహరణకు, కామం, ఆకలి, దప్పిక, అలసట, నిద్ర మొదలైన అవసరాలు దైవదూతలకు ఉండవు. ఇవన్నీ మానవులకు ఉంటాయి, కానీ దైవదూతలకు అలాంటి అవసరాలు, లక్షణాలు లేవు అని తెలుపబడింది.

మరి దైవదూతల పుట్టుక ఎలా జరిగింది అని మనం చూచినట్లయితే, దైవదూతలను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కాంతితో సృష్టించాడు. మానవులను దేనితో సృష్టించాడు? మట్టితో మానవులను సృష్టించాడు. ఇది మనం తెలుసుకొని ఉన్నాం ముందు ప్రసంగాలలో. దైవదూతలను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కాంతితో పుట్టించాడు, నూర్, కాంతితో పుట్టించాడు. మనం చూచినట్లయితే, ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

خُلِقَتِ الْمَلَائِكَةُ مِنْ نُورٍ
[ఖులిఖతిల్ మలాయికతు మిన్ నూర్]
దైవదూతలు నూర్ అనగా కాంతితో పుట్టించబడ్డారు, సృష్టించబడ్డారు.

దైవదూతలలో ఆడ-మగ అనే లింగభేదము లేదు. కావున, దైవదూతల మధ్య వివాహాలు జరగవు. వివాహాలు జరగవు కాబట్టి, వారిలో వంశపరంపర కూడా లేదు. ఇది దైవదూతల గురించి మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం.

ఇక, దైవదూతల సంఖ్య ఎంత ఉంది? మానవులను ఫలానా దేశంలో ఇంతమంది ఉన్నారు, ఫలానా దేశంలో అంతమంది జనాభా ఉన్నారు మానవులు అని లెక్కింపు అనేది మనం చూస్తూ ఉంటాం. మరి, దైవదూతల లెక్కింపు ఎవరైనా చేశారా? దైవదూతలు ఎంతమంది ఉన్నారు? అంటే, మనం చూచినట్లయితే, దైవదూతల సంఖ్య చాలా ఎక్కువ. అది ఎలాగంటే, ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక రెండు హదీసులు మీ ముందర నేను ఉంచుతున్నాను చూడండి.

మేరాజ్ యాత్రలో భాగంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆకాశాల పైకి వెళ్ళినప్పుడు, అక్కడ ఆకాశాల పైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ‘బైతే మామూర్’ ఒక పుణ్యక్షేత్రము ఆకాశాల పైన ఉంది, అది చూపించడం జరిగింది. జిబ్రీల్ అలైహిస్సలాం దైవదూత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడుతూ, “ఓ దైవ ప్రవక్తా, ఈ బైతే మామూర్‌లో ప్రతి రోజూ 70,000 మంది దైవదూతలు ఆరాధనలో పాల్గొంటారు. ఒక్కసారి ఆ బైతే మామూర్ పుణ్యక్షేత్రంలో ఆరాధన ముగించుకొని ఆ 70,000 మంది దైవదూతలు బయటికి వచ్చేస్తే, మళ్ళీ వారికి అక్కడ వెళ్లి ఆరాధన చేసుకోవడానికి వంతు రాదు. అంటే ప్రళయం వచ్చేస్తుంది గానీ, ఒక్కసారి అక్కడ ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత, ఆ దైవదూతలకు మరొకసారి అక్కడ అవకాశం దొరకదు, వారి వంతు రాదు,” అన్నారు. ఆ ప్రకారంగా ఎంతమంది దైవదూతలు ఉన్నారో మనము ఇట్టే ఆలోచించవచ్చు.

మరొక ఉల్లేఖనంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

مَا فِيهَا مَوْضِعُ أَرْبَعِ أَصَابِعَ إِلَّا وَمَلَكٌ قَائِمٌ أَوْ رَاكِعٌ أَوْ سَاجِدٌ
[మా ఫీహా మౌదివు అర్‌బయి అసాబిఇన్ ఇల్లా వ మలకున్ ఖాయిమున్ అవ్ రాకివున్ అవ్ సాజిదున్]
దీని అర్థం ఏమిటంటే, ఆకాశం దైవదూతలతో నిండి కిటకిటలాడుతున్నది. ప్రతి నాలుగు వ్రేళ్లంతటి స్థానంలో ఒక దైవదూత ఖియాంలో, రుకూలో, సజ్దాలో నిమగ్నమై ఉన్నాడు.

అంటే, ప్రతి బెత్తెడు, నాలుగు వేళ్ళంతటి స్థానంలో ఒక్కొక్క దూత నిలబడి ఉన్నాడు ఆకాశం మీద అంటే, ఆకాశం ఎంత పెద్దది? అంత పెద్ద ఆకాశంలో ప్రతి నాలుగు వేళ్ళంతటి స్థానంలో ఒక దైవదూత నిలబడి ఉన్నారంటే, మరి వారి సంఖ్య ఎంత? మనం లెక్క చేయలేము. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను మనం లెక్క చేయలేము. నక్షత్రాల కంటే బహుశా దైవదూతలు ఎక్కువ ఉన్నారేమో. కాబట్టి, దైవదూతల సరైన లెక్కింపు ఎవరికీ తెలియజేయబడలేదు. వారి లెక్కింపు అల్లాహ్‌కు మాత్రమే తెలుసు. ఈ విషయం కూడా మనము గట్టిగా విశ్వసించాలి, నమ్మాలి.

ఇక, దైవదూతల శక్తి సామర్థ్యాల గురించి మనము చూచినట్లయితే, దైవదూతలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గొప్ప గొప్ప శక్తులు ప్రసాదించాడు. దైవదూతలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెక్కలు ఇచ్చాడు. కొంతమంది దైవదూతలకు రెండు రెక్కలు ఉంటాయి, మరికొంత మందికి నాలుగు, ఆ తర్వాత అలాగే ఎంత పెద్ద దైవదూత ఉంటే అన్ని ఎక్కువ రెక్కలు వారికి ఉంటాయి అని తెలుపబడింది. మనం చూచినట్లయితే, ఖురాన్ గ్రంథం 35వ అధ్యాయం, ఒకటవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

جَاعِلِ ٱلْمَلَٰٓئِكَةِ رُسُلًا أُو۟لِىٓ أَجْنِحَةٍ مَّثْنَىٰ وَثُلَٰثَ وَرُبَٰعَ ۚ يَزِيدُ فِى ٱلْخَلْقِ مَا يَشَآءُ
[జాయిలిల్ మలాయికతి రుసులన్ ఉలీ అజ్నిహతిమ్ మస్నా వ సులాస వ రుబాఅ. యజీదు ఫిల్ ఖల్కి మా యషా]
ఆయన రెండేసి, మూడేసి, నాలుగేసి రెక్కలు గల దూతలను తన సందేశ వాహకులుగా చేసుకుంటాడు. సృష్టిలో తాను కోరిన దాన్ని పెంచుతాడు.

అంటే దైవదూతలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెక్కలు ఇచ్చాడు. వారి రెక్కలు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పెంచుతూ పోయాడు అన్న విషయము ఇక్కడ తెలుపబడింది. మనము బుఖారీ, ముస్లింలో ఉన్న ఉల్లేఖనాన్ని చూసినట్లయితే, అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “మేరాజ్ యాత్రలో భాగంగా నేను ఆకాశాల పైకి వెళ్ళినప్పుడు, అక్కడ జిబ్రీల్ అలైహిస్సలాం వారిని ఆకాశాల మీద వారి నిజ స్వరూపంలో నేను ఆయనను చూశాను.” జిబ్రీల్ అలైహిస్సలాం వారిని ప్రవక్త వారు ఆకాశాల మీద వారి నిజ స్వరూపంలో చూశారు. నిజ స్వరూపంలో చూసినప్పుడు వారు ఎలా ఉన్నారంటే, జిబ్రీల్ అలైహిస్సలాం వారికి ఆరు వందల రెక్కలు ఉన్నాయి. అల్లాహు అక్బర్! ఆరు వందల రెక్కలు ఆయన ఒక్కరికే ఉన్నాయంటే, ఆయన ఎంత గొప్ప, పెద్ద దైవదూతనో మనము అర్థం చేసుకోవచ్చు.

అలాగే, దైవదూతలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రూపాలు ధరించే శక్తి కూడా ఇచ్చి ఉన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు జిబ్రీల్ అలైహిస్సలాం వారు మానవ రూపము ధరించి వచ్చి దైవ వాక్యాలు వినిపించి వెళ్ళేవారు. కొన్ని సందర్భాలలో ఆయన మానవ రూపంలో వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు శిష్యులు, సహాబాలు కూడా జిబ్రీల్ అలైహిస్సలాం వారిని మానవ రూపంలో చూశారు. అలాంటి ఉదాహరణలు మనము ప్రసంగాలలో విని ఉన్నాం.

అలాగే, దైవదూతలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వేగంగా కదిలే, ప్రయాణించే శక్తి ఇచ్చాడు. దైవదూతలు భూమి ఆకాశాల మధ్య రాకపోకలు జరుపుతూ ఉంటారు. భూమి ఆకాశాల మధ్య ఎంతో, భూమి ఆకాశాల మధ్య ఎంతో దూరము ఉంది. అంత దూరాన్ని వారు క్షణాలలో ఛేదించేస్తూ ఉంటారు. వారు అంత స్పీడుగా, వేగంగా వస్తూ వెళుతూ ఉంటారు. అంత వేగంగా కదిలే శక్తి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతలకు ఇచ్చి ఉన్నాడు. ఇవి దైవదూతల యొక్క లక్షణాలు, దైవదూతల యొక్క శక్తి సామర్థ్యాలు.

ఇక, కొంతమంది దైవదూతల పేర్లు మరియు వారి బాధ్యతల ప్రస్తావన కూడా గ్రంథాలలో వచ్చి ఉంది. అవి తెలుసుకొని ఇన్ షా అల్లాహ్ మాటను ముగిద్దాం.

దైవదూతలలో జిబ్రీల్ అలైహిస్సలాం వారు దైవదూతలందరిలో గొప్పవారు మరియు దైవదూతలందరికీ ఆయన నాయకుడు అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు. మరి జిబ్రీల్ అలైహిస్సలాం వారి యొక్క బాధ్యత ఏమిటంటే, అల్లాహ్ వద్ద నుండి వాక్యాలు తీసుకొని వచ్చి దైవ ప్రవక్తలకు దైవ వాక్యాలు వినిపించి వెళ్ళేవారు. అలాగే, ఇతర బాధ్యతలు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఇచ్చినప్పుడు, ఆ బాధ్యతలు కూడా ఆయన నెరవేర్చేవారు. ముఖ్యంగా, దైవ వాక్యాలు అల్లాహ్ నుండి తీసుకొని వచ్చి దైవ ప్రవక్తలకు వినిపించటము ఆయన నిర్వహించిన గొప్ప బాధ్యత.

మీకాయీల్ అలైహిస్సలాం అనే ఒక దైవదూత. మీకాయీల్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వర్షం కురిపించే బాధ్యత ఇచ్చాడు. మీకాయీల్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ ఎక్కడ, ఎంత వర్షం కురిపించమని ఆదేశిస్తాడో, ఆయన ఆ ప్రదేశంలో అంత వర్షం కురిపిస్తూ ఉంటారు.

ఇస్రాఫీల్ అలైహిస్సలాం అని ఒక దైవదూత ఉన్నారు. ఆయన ప్రళయ దినాన అల్లాహ్ ఆదేశంతో శంఖంలో ఊదుతారు. ఆ శంఖం ఊదబడిన తర్వాత ప్రళయం సంభవిస్తుంది.

మల‌కుల్ మౌత్ అనే ఒక దైవదూత ఉన్నారు. మల‌కుల్ మౌత్ దైవదూత ప్రాణాలు హరిస్తూ ఉంటారు.

‘ముఅఖ్ఖిబాత్’ అని దైవదూతలు ఉన్నారు. వారు మానవుల రక్షణ కొరకు నియమించబడి ఉన్నారు. మానవులు నిద్రపోతున్నప్పుడు, నిద్ర లేచి నడుస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, స్థానికంగా ఉంటున్నప్పుడు, ఎల్లవేళలా ఆ దైవదూతలు వారి రక్షణలలో, రక్షణలో నియమించబడి ఉన్నారు. అలాంటి దైవదూతలను ‘ముఅఖ్ఖిబాత్’ అంటారు.

అలాగే, ‘ఖజనతుల్ జన్నహ్’, స్వర్గంలో కొంతమంది దైవదూతలు ఉన్నారు. వారికి ‘ఖజనతుల్ జన్నహ్’ అంటారు. స్వర్గవాసులు ఎప్పుడైతే స్వర్గంలోకి ప్రవేశిస్తారో, ఆ ‘ఖజనతుల్ జన్నహ్’ అనే దైవదూతలు స్వర్గవాసులని స్వర్గంలో వచ్చేటప్పుడు సాదరంగా ఆహ్వానిస్తారు.

అలాగే, ‘ఖజనతున్ నార్’ అని కొంతమంది దైవదూతలు ఉన్నారు. వారు నరకంలో నియమించబడి ఉన్నారు. నరకవాసులు నరకంలో వెళ్ళిపోయిన తర్వాత, ఆ బాధలు భరించక, ఆ నరకంలో ఉన్న దూతలను, “మాకు చావు ఇచ్చేయమని అల్లాహ్‌తో కోరమని” వేడుకుంటారు. ఆ ప్రకారంగా ‘ఖజనతున్ నార్’ అనే కొంతమంది దైవదూతలు నరకంలో నియమించబడి ఉన్నారు.

అలాగే, ‘సయ్యాహీన్’ అని కొంతమంది దైవదూతలు ఉన్నారు. వారు భూమండలం మొత్తము తిరుగుతూ ఉంటారు, సంచరిస్తూ ఉంటారు. ప్రజలు ఎవరైనా, ఎక్కడైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దైవ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూద్ పఠిస్తూ ఉంటే గనక, ఆ దరూద్ వారు సేకరించి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వెళ్ళి వినిపిస్తారు.

అలాగే, ‘కిరామన్ కాతిబీన్’ అని దైవదూతలు ఉన్నారు. వారు మానవులు చేసే కర్మలన్నీ లిఖిస్తూ ఉంటారు. మంచి కార్యము, చెడు కార్యము, వారు చేసే పని, వారు మాట్లాడే ప్రతి మాట, వారు నమోదు చేస్తూ ఉంటారు. వారిని ‘కిరామన్ కాతిబీన్’ దైవదూతలు అంటారు.

ఇవి దైవదూతల గురించి మనము తెలుసుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలు. నేను అల్లాహ్‌తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనమందరికీ సంపూర్ణ విశ్వాసులుగా, ధర్మం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం ప్రసాదించుగాక, ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30622

దేవదూతలు (ملائِكة‎) – మెయిన్ పేజీ
https://teluguislam.net/angels/