నమాజుకు త్వరగా వెళ్ళుట (التبكير إلى الصلاة) [వీడియో | టెక్స్ట్]

అజాన్ కు ముందు లేదా కనీసం అజాన్ అయిన వెంటనే నమాజు కోసం  మస్జిద్ కు వెళ్ళే అలవాటు వేసుకోవడంలో ఎంత గొప్ప పుణ్యం ఉందో తెలుపుతుందీ మీకు ఈ వీడియో

నమాజుకు త్వరగా వెళ్ళుట (التبكير إلى الصلاة)
https://www.youtube.com/watch?v=UAVJmKoyW7A [2 నిమిషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మాబాద్.

నమాజులో ఎల్లప్పుడూ ముందడుగు వేయుట, నమాజు కొరకు శీఘ్రపడుట, తొందరపడుట, నమాజ్ చేయటానికై మస్జిద్ కు వెళ్లడంలో అందరికంటే ముందు ఉండే ప్రయత్నం చేయుట ఇది ఎంతో శుభకరమైన, ఎంతో గొప్ప పుణ్యం గల ఒక సత్కార్యం. ఈ రోజుల్లో చాలామంది ఈ సత్కార్యాన్ని ఎంతో మర్చిపోతున్నారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ వినండి. ప్రవక్త గారు చెప్పారు:

لَوْ يَعْلَمُ النَّاسُ مَا فِي النِّدَاءِ وَالصَّفِّ الْأَوَّلِ 
లవ్ యాలమున్నాసు మాఫిన్నిదాయి వస్సఫ్ఫిల్ అవ్వల్.
ఒకవేళ ప్రజలకు అదాన్ ఇవ్వడంలో, మొదటి పంక్తిలో నిలబడడంలో ఎంత పుణ్యం ఉన్నదో తెలిసి ఉండేది ఉంటే,

ثُمَّ لَمْ يَجِدُوا إِلَّا أَنْ يَسْتَهِمُوا عَلَيْهِ لَاسْتَهَمُوا 
సుమ్మలమ్ యజిదూ ఇల్లా అయస్తహిమూ అలైహి లస్తహమూ.
ఈ సదవకాశాన్ని పొందడానికి, అంటే అదాన్ ఇవ్వడానికి మరియు మొదటి పంక్తిలో నిలబడడానికి వారికి కురా వేసుకోవడం, చీటీ వేయడం లాంటి అవసరం పడినా వారు వేసుకొని ఆ అవకాశాన్ని పొందే ప్రయత్నం చేసేవారు.

అలాగే,

وَلَوْ يَعْلَمُونَ مَا فِي التَّهْجِيرِ لَاسْتَبَقُوا إِلَيْهِ 
వలవ్ యాలమూన మాఫిత్తహ్జీర్ లస్తబఖూ ఇలైహ్.
ముందు ముందు వెళ్లడం, అందరికంటే ముందు ఉండే ప్రయత్నం చేయడంలో ఎంత పుణ్యం ఉన్నదో వారికి తెలిసి ఉండేది ఉంటే దానికి త్వరపడేవారు, తొందరగా వెళ్లేవారు.

అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మరొక హదీస్ కూడా వినండి. ఇప్పుడు విన్న హదీసులో ఘనత తెలిసింది. చాలా గొప్ప పుణ్యం ఉన్నది అని చెప్పారు. ఆ పుణ్యం ఎంతో అనేది వివరణ ఇవ్వడం లేదు. కానీ మరో హదీస్ చాలా భయంకరంగా ఉంది. ఎవరైతే వెనకనే ఉండిపోతా ఉంటారో వారి గురించి హెచ్చరిస్తూ చెప్పారు:

لَا يَزَالُ قَوْمٌ يَتَأَخَّرُونَ حَتَّى يُؤَخِّرَهُمُ اللَّهُ
లా యజాలు కౌమున్ యతఅఖ్ఖరూన్ హత్తా యుఅఖ్ఖిరహుముల్లాహ్.
కొందరు నమాజుల్లో మస్జిద్ కు వెళ్లడంలో మాటిమాటికీ వెనక ఉండే ప్రయత్నం చేస్తారు, చాలా దీర్ఘంగా వస్తూ ఉంటారు. చివరికి అల్లాహుతాలా వారిని వెనకనే ఉంచేస్తాడు. అన్ని రకాల శుభాలకు, అన్ని రకాల మేళ్లకు, అన్ని రకాల మంచితనాలకు వారు వెనకే ఉండిపోతారు.

అల్లాహుతాలా ప్రతీ సత్కార్యంలో మస్జిద్ కు వెళ్లడంలో ముందడుగు వేసే భాగ్యం ప్రసాదించుగాక. మరియు వెనక ఉండే వారిలో ఎవరైతే కలుస్తారో అలాంటి వారి నుండి అల్లాహ్ మనల్ని కాపాడుగాక.

జజాకుముల్లాహు ఖైరా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్.

“నమాజు సరిగా నెరవేర్చని వ్యక్తి” హదీసు

బిస్మిల్లాహ్

పారిభాషిక పదంగా “నమాజు సరిగా నెరవేర్చని వ్యక్తి”

అల్లామా అల్‌బానీ, బహుశా పాఠకుల సౌకర్యార్థం, పుస్తక అంశాలలో కేవలం “నమాజు సరిగా నెరవేర్చని వ్యక్తి” అన్న ఒక్క పదం తప్ప మరే పారిభాషిక పదాన్ని ఉపయోగించలేదు. వాస్తవానికి ఈ పదం, యావత్తు ముస్లిం సమాజం దృష్టిలో, ఎంతో ఖ్యాతిగాంచిన మరియు జ్ఞాన తూకంలో ఎంతో విలువ పొందిన ఒక ముఖ్యమైన హదీసును గూర్చి సూచిస్తుంది.

ఈ హదీసును ధార్మిక పండితులు “నమాజు సరిగా నెరవేర్చని వ్యక్తి (ముసయీ సలాత్‌) హదీసు” గా  పిలుస్తారు.

ఈ హదీసు, దీని సంపూర్ణ రూపంలో ఏ ఒక్క ఉల్లేఖనంలో కూడా లభించనందున, పాఠకుల ప్రయోజనార్థం, దీని సంపూర్ణ రూపాన్ని అవసరమైన పదజాలంతో సమర్పిస్తున్నాం. తద్వారా పండితులు మరియు సామాన్య ప్రజానీకం – వీరిలో ప్రతి ఒక్కరూ దీని ద్వారా ప్రయోజనం పొందగలరని ఆశించవచ్చు.

నమాజు సరిగా నెరవేర్చని  వ్యక్తికి సంబంధించిన సంపూర్ణ హదీసు

రఫా బిన్‌ రాఫే (రజిఅల్లాహు అన్హు) కథనం:

ఒకరోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మస్జిదె నబవీలో కూర్చొని వున్నారు. మేము కూడా ఆయన దగ్గర కూర్చొని వున్నాం. ఇంతలో, పల్లెవాసిలా కనబడే ఒక వ్యక్తి మస్జిద్‌లోకి ప్రవేశించి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు దగ్గరలోనే ఖిబ్లా వైపునకు తిరిగి అసంపూర్ణ రుకూ, సజ్దాలతో (రుకూ, సజ్దాలు ప్రశాంతంగా  చేయకుండా) రెండు తేలికపాటి రకాతులు పూర్తి చేశాడు. తదుపరి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు మరియు అక్కడున్న వారికి సలాం చేశాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “వ అలైకుం సలాం” అని జవాబిచ్చి, “వెళ్ళు, వెళ్లి తిరిగి నమాజు చేయి, ఎందుకంటే నువ్వు అసలు నమాజే చేయలేదు” – అని ఆజ్ఞాపిం చారు.

ఆ వ్యక్తి తిరిగి వెళ్ళి మునపటి లాగే మళ్ళీ నమాజు చేశాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతన్ని గమనించసాగారు. కానీ ఆ వ్యక్తి మాత్రం, నమాజులో తను చేస్తున్న పొరపాట్లను గూర్చి తెలుసుకోలేక పోయాడు. నమాజు పూర్తి చేసి మళ్ళీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు మరియు అక్కడున్న వారికి సలాం చేశాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “వ అలైకుం సలాం” అని జవాబిచ్చి “వెళ్ళు, వెళ్ళి మళ్ళీ నమాజు చేయి, నీ నమాజు అసలు నెరవేరలేదు” అని పురమాయించారు. ఇలా, ఆ వ్యక్తి మూడుసార్లు తన నమాజును పూర్తిచేశాడు. (బుఖారీ,ముస్లిం)

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రతిసారీ అతనికి “వ అలైకుం సలాం” అని జవాబిచ్చి “వెళ్ళు, వెళ్ళి మళ్ళీ నమాజు చేయి, ఎందుకంటే నీ నమాజు అసలు నెరవేరలేదు” అని పురమాయించారు.

దైవప్రవక్త (సల్లల్తాహు అలైహి వ సల్లం) మాటలు విని అక్కడున్నవారు — “బహుశా, ఎవరయితే తేలికపాటి నమాజు చేస్తారో వారి నమాజు అసలు నెరవేరదు కాబోలు” అని భావించారు. ఆ వ్యక్తి – “నా నమాజులో అయ్యే పొరపాట్లను గూర్చి నేను తెలుసుకోలేక పోతున్నాను. మీపై ఖుర్‌ఆన్‌ గ్రంథాన్ని అవతరింపజేసిన వాని సాక్షిగా! నాకింతకన్నా మంచిగా నమాజు చేయడం రాదు. నేను నా ప్రయత్న మంతా చేశాను. మీరే నాకు చెప్పండి మరియు నేర్పించండి. ఎందుకంటే – నేను మానవ మాత్రుణ్ణి, నా ద్వారా తప్పొప్పులు రెండూ జరిగే ఆస్కారముంది” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విన్నవించు కున్నాడు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతనికి ఇలా హితబోధ చేశారు:

“బాగా విను! నువ్వెప్పుడైనా నమాజు చేయాలని సంకల్పించుకున్నప్పుడు, మంచిగా వుజూ చేయి. ఎందు కంటే – అల్లాహ్‌ ఆదేశించిన దాని ప్రకారం – వుజూ సరిగా చేయనంత వరకు ఎవరి నమాజ్‌ కూడా నెరవేరదు. అంటే – వుజూ సరిగా చేయ నంతవరకు ఎవరి నమాజ్‌ కూడా నెరవేరదు. అంటే – అతను తన ముఖాన్ని రెండు చేతులను, మోచేతి క్రీళ్ల వరకు కడిగి, తలను రెండు చేతులతో స్పర్శించి (మసహ్‌ చేసి) తదుపరి రెండు కాళ్ళను చీలమండ వరకు శుభ్రం చేసుకోవాలి.

తదుపరి, అజాన్‌ యిచ్చి ఇఖామత్‌ పలుకు, ఖిబ్లా వైవునకు తిరిగి నిలబడిన తర్వాత, అల్లాహు అక్బర్‌ అని పలికి, అల్లాహ్‌ స్తోత్రాన్ని గొప్పతనాన్ని స్మరించు, తదుపరి ఫాతిహా సూరా మరియు దానితో పాటు మరేదైనా పఠించు.

అబూదావూద్‌ లోని మరో ఉల్లేఖనంలో   యిలా ఉంది: (ఫాతిహా సూరా పఠించిన అనంతరం) దివ్యఖుర్‌ఆన్‌లో నుండి నీకు అనుమతి యివ్వబడిన దానిని, సులభమైన దానిని పఠించు. ఒకవేళ ఖుర్‌ఆన్‌ జ్ఞప్తి యందు లేకపోతే, అప్పుడు ‘అల్‌హందులిల్లాహ్‌, అల్లాహు అక్బర్ , లా ఇలాహ ఇల్లల్లాహ్‌ ‘ అని పలుకు.

తదుపరి ‘అల్లాహు అక్బర్‌’ అంటూ ప్రశాంతంగా కీళ్లన్నీ కుదుటపడి ప్రశాంతత పొందేలా రుకూ చేయి. రుకూ చేసేటప్పుడు నీ అరచేతులను మోకాళ్ళపై పెట్టు మరియు వీపును తిన్నగా వుంచు.

తదుపరి ‘సమిఅల్లాహు లిమన్‌ హమిద’  అంటూ ఎముకలన్నీ తమ తమ స్థానాలకు వచ్ఛే విధంగా నిటారుగా నిలబడు. తిరిగి అల్లాహు అక్బర్‌ అని సజ్దాలోకి వెళ్ళు మరియు నీ ముఖాన్ని నుదుటిని – శరీర కీళ్ళు కుదుటపడి ప్రశాంతత పొందేలా నేలపై గట్టిగా వుంచు. తదుపరి అల్లాహు అక్బర్‌ అంటూ తలను సజ్దా నుండి పైకెత్తి నీ పిరుదులపై చక్కగా కూర్చో.

(అబూదావూద్‌ లోని వేరొక ఉల్లేఖనం లో యిలా ఉంది): సజ్దా నుండి నీవు తల పైకెత్తినప్పుడు, నీ ఎడమ తొడపై కూర్చో. తదుపరి “అల్లాహు అక్బర్‌” అని పలికి సజ్దాలోకి వెళ్ళి నీ ముఖాన్ని ప్రతి కీలూ కుదుట పడి ప్రశాంతత పొందేలా నేలపై వుంచు. తదుపరి తల పైకెత్తి అల్లాహు అక్బర్‌” అని అను.

(అబూదావూద్‌లోని ఇంకొక ఉల్లేఖనం లో యిలా ఉంది):“నమాజు మధ్యలో నీవు కూర్చున్నప్పుడు ప్రశాంతంగా నీ ఎడమ తొడపై కూర్చొని తషహ్హుద్ చేస్తూ ఉండు.”

(అబూదావూద్‌ లోని మరొక ఉల్లేఖనం లో యిలా ఉంది):తదుపరి నీవు నిలబడినప్పుడు, మునపటిలాగే చేస్తూ నీ నమాజును పూర్తి చెయ్యి.”

ఇలా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నాలుగు రకాతులు నమాజ్‌ చదివే పద్ధతిని తెలియజేశారు. తదుపరి ఇలా పలికారు: ఇక ఎవరైతే ఇలా చేయరో (అంటే ఖియ్యాం, రుకూ, సజ్దాలు మరియు తషహ్హుద్ లలో పూర్తి ప్రశాంతతను ప్రదర్శించకుండా నమాజ్‌ చేయరో) వారి నమాజ్‌ సంపూర్ణం కానేరదు. ఒకవేళ యిలా చేస్తే, అప్పుడు వారి నమాజ్‌ సంపూర్ణం అవుతుంది. ఒకవేళ వీటిలో ఏ విషయంలోనైనా తొందరపాటును ప్రదర్శిస్తే దానికి తగ్గట్టుగానే మీ నమాజులో తగ్గుదల వస్తుంది.


ఇది దైవ ప్రవక్త నమాజు స్వరూపం – షేఖ్ అల్ అల్బానీ (రహిమహుల్లా) (పుస్తకం) నుండి తీసుకో బడింది. (16-21పేజీలు)

ఇతర లింకులు: 

ప్రశాంతంగా రుకూ చేయటం తప్పనిసరి (వాజిబ్‌)

బిస్మిల్లాహ్

రుకూ

ఖుర్‌ఆన్‌ పఠనం పూర్తయిన తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాసేపు అలాగే మౌనంగా [303] నిలబడి ఉండేవారు. ఆ తర్వాత ఇంతకు ముందు ‘తక్బీరే తహ్రీమా’ అంశం క్రింద వివరించినట్టుగా చేతులు పైకెత్తేవారు (రఫయదైన్‌ చేసేవారు).[304] తదుపరి “అల్లాహు అక్బర్” [305] అంటూ రుకూలోకి వెళ్ళిపోయేవారు. [306]

నమాజ్‌ను సరిగా నెరవేర్చని వ్యక్తి“కి ఈ రెండు విషయాల గురించి ఆజ్ఞాపిస్తూ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు:

“నమాజ్‌ చేసే వ్యక్తి ఎవరయినా ముందుగా అల్లాహ్‌ ఆదేశించినదాని ప్రకారం చక్కగా వుజూ చేసుకోవాలి. తర్వాత “అల్లాహు అక్బర్” అని చెబుతూ అల్లాహ్‌ను స్తుతించాలి, ఆయన పవిత్రతను కొనియాడాలి. ఆ తర్వాత ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ తనకు నేర్పించిన దానిలో, తనకు అనుమతి ప్రసాదించిన దానిలో తనకు వీలు కలిగినంత పఠనం చేయాలి. ఆ తర్వాత “అల్లాహు అక్బర్‌” అంటూ రుకూ చేయాలి. దేహంలోని కీళ్ళన్నీ వాటి వాటి స్థానాల్లో కుదుటపడి, ప్రశాంతతను పొందే విధంగా రుకూలో రెండు చెతుల్ని మోకాళ్ల చిప్పలపై ఉంచాలి. ….(సశేషం) ఈ విధంగా చేయని వారెవరైనా, వారి నమాజు సంపూర్ణమైనదిగా భావించబడజాలదు.”” [307]

రుకూ చేసే పద్దతి

“రుకూ స్థితిలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన అరచేతుల్నిమోకాళ్ల మీద ఉంచేవారు”,[308] “అలా చేయమని ఆయన ప్రజలకు సయితం ఆదేశించేవారు”.[309] ఈ విధంగా చేయమని ఆయన “నమాజ్‌ సరిగా నెరవేర్చని వ్యక్తి“కి కూడా ఆజ్ఞాపించి ఉన్నారు. కొన్ని వాక్యాల క్రితమే ఈ విషయం గడిచింది.

“రుకూలో ఆయన తన రెండు చేతులతో మోకాళ్లను పట్టుకొని ఉన్నట్లుగా వాటిని గట్టిగా అదిమి ఉంచేవారు”[310] “ఆ సమయంలో చేతివేళ్లను విశాలంగా ఉంచుతారు”. [311] “నమాజ్‌ను సరిగా నెరవేర్చని వ్యక్తి”కి ఇలా చేయమని ఆజ్ఞాపిస్తూ ఆయన “రుకూ చేసినప్పుడు నీ అరిచేతుల్ని మోకాళ్ల మీద పెట్టుకో. చేతివ్రేళ్లను వదులుగానూ, విశాలంగానూ ఉంచు. ప్రతి అవయవం తన స్థానంలోకి వెళ్ళిపోయే వరకు అదే స్థితిలో ఉండు” అని పురమాయించారు.[312] రుకూ స్థితిలో ఆయన తన మోచేతుల్ని ప్రక్కలకు ఎడంగా ఉంచేవారు.[313] రుకూలో వీపును విశాలంగా,[314] నీళ్లు పోసినా అటూ ఇటూ జారిపోనంత తిన్నగా ఉంచేవారు.[315]

“రుకూ స్థితిలో నీ అరచేతుల్ని మోకాళ్ళ మీద పెట్టుకో. వీపును పొడుగ్గా ఉంచు. రుకూ స్థితికి బలాన్నివ్వు” అని ఆయన “నమాజును సరిగా నెరవేర్చని వ్యక్తి“కి సూచించారు.[316] రుకూలో తలను ఆయన వంచిగాని, పైకెత్తిగాని ఉంచేవారు కాదు.[317] పైగా ఆయన (రుకూ స్థితిలో) తన తలను వీపుకు సమాంతరంగా ఉంచేవారు. [318]

ప్రశాంతంగా రుకూ చేయటం తప్పనిసరి (వాజిబ్‌)

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో ప్రశాంతంగా రుకూ చేసేవారు. అలా చేయమని ఆయన “నమాజును సరిగా నెరవేర్చని వ్యక్తి“కి కూడా ఆదేశించి ఉన్నారు. గత అంశం ప్రారంభంలో దీని ప్రస్తావన వచ్చింది.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అంటుండేవారు: “మీరు రుకూ మరియు సజ్దాలు బాగా చేయండి. ఎవరి చేతిలో నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. మీరు రుకూ చేసినప్పుడు, సజ్దా చేసినప్పుడు నేను మిమ్మల్ని నా వెనుక వైపు నుంచి చూస్తూ ఉంటాను.” [319]

ఒకతను నమాజు చేస్తున్నాడు. కాని అతను రుకూ సరిగా చేయటం లేదు. సజ్దా కూడా చాలా తొందరతొందరగా చేస్తున్నాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతన్ని చూసి, “ఒకవేళ ఇతనికి ఇదే స్థితిలో మరణం గనక వస్తే ఇతను ముహమ్మద్‌ ప్రవక్త ధర్మంపై మరణించినట్లు కాదు. (కాకి నెత్తురులో ముక్కు పొడిచినట్లు ఇతను చాలా వేగంగా నమాజ్‌ చేస్తున్నాడు). రుకూ సరిగ్గా నెరవేర్చకుండా సజ్దాలు కూడా సుడిగాలిలా చేసే వ్యక్తి బాగా ఆకలితో ఉండి, ఒకటి రెండు ఖర్జూర పండ్లు తిన్నప్పటికీ ఆకలి చల్లారని మనిషిలాంటివాడు” అని చెప్పారు. [320]

తన ముక్కును నేలకేసి పొడిచే కోడి లాగా నమాజులో తొందర చేయవద్దని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనకు ఉపదేశించారనీ, నమాజులో నక్క లాగా కుడి ఎడమలు దిక్కులు చూడవద్దని తనను ఆదేశించారని, కోతి లాగా పిరుదుల్ని చేతులను నేలకు ఆనించి పెట్టి, పిక్కలను, తొడలను నిలబెట్టి కూర్చో రాదని కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తనకు ఆదేశించారని అబూ హురైరా (రజిఅల్లాహు అన్హు)  తెలియజేశారు. [321]

“నమాజు నుండి దొంగిలించేవాడు అందరిలోకెల్లా చెడ్డ దొంగ” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అన్నారు. ఈ మాట విని ఆయన సహచరులు (ఆశ్చర్య పోయారు). “దైవవక్తా! అసలు ఎవరైనా నమాజులో నుండి ఎలా దొంగిలిస్తారు?” అని అడిగారు. దాని కాయన “అంటే అతను రుకూ, సజ్దాలు పూర్తిగా నెరవేర్చడు” అంటూ తన మాటకు అర్ధం చెప్పారు. [322]

ఒకతను నమాజు చేస్తూ రుకూ, సజ్దాల్లో వీపుని తిన్నగా ఉంచటం లేదు (దగ్గర్లో) నమాజు చేస్తున్న దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన క్రీగంట చూపులతో అతన్ని గమనించారు. నమాజు పూర్తయిన తర్వాత ఆయన అందర్ని ఉద్దేశించి “ముస్లింలారా! రుకూ, సజ్దాల్లో తమ వీపుల్ని తిన్నగా ఉంచని వారి నమాజు నెరవేరదు” అని హెచ్చరించారు. [323]

మరో హదీసు ప్రకారం ఆయన “రుకూ, సజ్దాల్లో వీపుని తిన్నగా ఉంచి చేయబడని నమాజు సరిపోదు” అని అన్నారు. [324]

 

హదీసు రెఫరెన్సులు:

[303]. అబూదావూద్‌, హాకిమ్‌ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ దీనితో ఏకీభవించారు. ఈ మౌనం కేవలం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రశాంతంగా శ్వాస తీసుకోగలిగినంత పరిమాణంలో వుండేదని ఇబ్నె ఖయ్యూం (రహిమహుల్లాహ్‌) అభిప్రాయ పడ్డారు.

[304,305,306]. బుఖారీ, ముస్లిం.

ఈ రఫయదైన్‌ మరియు దీనితోపాటు రుకూ నుండి లేచేటప్పుడు చేసే రఫయదైన్‌ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా ఎన్నో పరంపరలతో నిరూపించబడి ఉంది. ముగ్గురు ఇమాములు, ఎంతో మంది హదీసువేత్తలు. ధార్మికజ్ఞానుల అభిమతం కూడా ఇదే. తారీఖ్‌ ఇబ్నె అసాకిర్‌ (15/78/2) నందు ఇమామ్‌ మాలిక్‌ జీవితాంతం దీనిపై ఆచరించారని వుంది. కొందరు హనఫీ ఉలమాలు కూడా దీనిని యిష్టపడ్డారు. వీరిలో ఇమామ్‌ అబూ యూసుఫ్‌ శిష్యులు ఇసామ్‌ బిన్‌ యూసుఫ్‌ ఖల్‌బీ (మరణం 210 హి.) కూడా ఒకరు. ఆయన గురించి యిది వరకే వివరించబడింది.

అబ్బుల్లా ఇబ్నె అహ్మద్‌ తన ‘మసాయల్’  – 60వ పేజీలో తన తండ్రి ద్వారా యిలా ఉల్లేఖించారు: ఉఖ్బా బిన్‌ ఆమిర్‌ (రజి అల్లాహు అన్హు) ద్వారా నమాజులో రఫయదైన్‌ గురించి యిలా ఉల్లేఖించబడింది: ఒక్కో రఫయదైన్‌కు బదులుగా పదిపుణ్యాలు దొరుకుతాయి.

నేను చెప్పేదేమిటంటే – ఉఖ్బా బీన్‌ ఆమిర్‌ మాట – బుఖారీ, ముస్లింలోని ఎవరైనా ఏదైనా సత్మార్యం చేయాలని సంకల్పించుకొని, తదుపరి దానిని పూర్తి చేస్తే దానికి బదులుగా అతనికి 10 నుంది 700 పుణ్యాలు దొరుకుతాయి అన్న హదీసుకు అనుగుణంగా వుంది. మరిన్ని వివరాల కోసం ‘సహీ అత్తర్‌గీబ్‌- 16వ పేజీ చూడగలరు.

[307]. అబూదావూద్‌,నసాయి. హాకిమ్‌ దీనిని సహీగా ఖరారు చేశారు మరియు జహబీ దీనితో ఏకీభవించారు.

[308]. బుఖారీ, అబూదావూద్‌.

[309]. బుఖారీ, ముస్లిం.

[310]. బుఖారీ, అబూ దావూద్‌.

[311]. హాకిమ్‌ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ కూడా దీనితో ఏకీభవించారు. అబూదావూద్‌, తయాలిసీ కూడా దీనిని ఉల్లేఖించారు. దీని తఖ్రీజ్‌ – సహీ అబూదావూద్‌: 809 నందు చేయబడింది.

[312]. సహీ ఇబ్నె ఖుజైమా, సహీ ఇబ్నె హిబ్బాన్‌.

[313]. తిర్మిజి, ఇబ్నె ఖుజైమా దీనిని సహీగా ఖరారు చేశారు.

[314]. బైహఖీ – సహీ బుఖారీ పరంపరతో.

[315]. తబ్రానీ – మోజమిల్‌ కబీర్‌ వ సగీర్‌, జవాయెద్‌ ముస్నద్‌ అబ్దుల్లా  బిన్‌ అహ్మద్‌,ఇబ్నెమాజా.

[316]. అహ్మద్‌, అబూదావూద్‌ – సహీ పరంపరతో.

[317]. అబూదావూద్‌, బుఖారీ – జుజ్‌ అల్‌ ఖీరా ఖలఫుల్‌ ఇమామ్‌ – సహీ పరంపరతో

[318]. ముస్లిం, అబూ ఆవాన

[319]. బుఖారీ, ముస్లిం. నేను చెప్పదేమిటంటే – ఇలా చూడగలగడం ఒక వాస్తవం. యిది ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అద్భుతాలలో ఒకటి. అయితే ఇది నమాజు కొరకే ప్రత్యేకం. ఇతర సందర్భాలలో దీనికి సంబంధించిన ఆధారమేదీ లేదు.

[320]. మున్నద్‌ అబూ యాలా (340, 349/1), ఆజూరీ- అర్బయీన్‌, బైహఖీ,  తబ్రానీ (1/192/1), జియా – అల్‌ మున్తఖా (276/1), ఇబ్నె అసాకిర్‌ (2/226/2, 414/1, 8/14/1,76/2) – హసన్‌ పరంపరతో. ఇబ్నె ఖుజైమా దీనిని సహీగా ఖరారు చేశారు (1/82/1). ఇబ్నె బత్తా, మొదటి భాగంలోని అదనపు పదజాలం లేకుందా దీనిని బలపర్చే ఒక ముర్సల్‌ హదీసును “అల్‌ ఇబానా” (5/43/1) నందు ఉల్లేఖించారు.

[321]. తయాలిసీ, అహ్మద్‌, ఇబ్నె అబీషైబా. ఇది హసన్‌ హదీసు. ఈ విషయం నేను హాఫిజ్‌ అబ్దుల్  హఖ్‌ ఇష్‌బిలీ – అల్‌ అహ్‌కామ్‌ – హదీసు నెం. 1348 పాద సూచికలో వివరించాను.

[322]. ఇబ్నె అబీ షైబా (1/89/2), తబ్రానీ, హాకిమ్‌ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ కూడా దీనితో ఏకీభవించారు.


ఇది దైవ ప్రవక్త నమాజు స్వరూపం – షేఖ్ అల్ అల్బానీ (రహిమహుల్లా) (పుస్తకం) నుండి తీసుకో బడింది. (150-154 పేజీలు)

ఇతర లింకులు: 

మీరు సుత్రా (తెర/అడ్డు) లేకుండా నమాజ్‌ చేయకండి

బిస్మిల్లాహ్

సుత్రా మరియు, దాన్ని పాటించటం విధి అన్న విషయం గురించి

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సుత్రాకు ఎంత దగ్గరగా నిలబడే వారంటే ఆయనకు-గోడ (సుత్రా)కు మధ్య మూడు చేతుల దూరం మాత్రమే ఉందేది.[38] ఆయన సజ్దా చేసే చోటికి – గోడ (సుత్రా)కు మధ్య ఒక మేక దూరి పోయేంత స్థలం మాత్రం ఉందేది. [39]

ఆయన ఇలా ప్రబోధించేవారు: “మీరు సుత్రా లేకుండా నమాజ్‌ చేయకండి.”

“మీ ముందు నుంచి ఎవర్నీ నడచి వెళ్ళనివ్వకండి. ఒకవేళ అతను అందుకు ఒప్పుకోక పోతే అతనితో తలపడండి. ఎందుకంటే అతనితోపాటు షైతాన్‌ ఉంటాడు.” [40]

ఆయన ఇంకా ఇలా అంటుండేవారు: “మీలో ఎవరైనా (ఎదుట) సుత్రా పెట్టుకుని నమాజ్‌ చేస్తున్నట్లయితే అతను దానికి దగ్గరగా ఉండాలి. షైతాన్‌ తన నమాజును చెడగొట్టకుండా ఉండాలంటే అతను అలా చెయ్యాలి మరి!”[41]

కొన్ని సార్లు ఆయన తన మస్జిద్ లోని  స్తంభం దగ్గర నమాజ్‌ చేయటానికి ప్రయత్నించేవారు. [42]

అడ్డు (సుత్రా)గా ఏ వస్తువూ లేనటవంటి విశాల మైదానంలో నమాజ్‌ చేయాలనుకున్నప్పుడల్లా ఆయన తన ఎదుట ఒక బరిసెను పాతుకునేవారు. దాని వైపు తిరిగి నమాజ్‌ చేసేవారు. ఆయన వెనుక జనం బారులు తీరేవారు. [43] అప్పుడప్పుడూ తన ఆడ ఒంటెను ఎదుట అడ్డంగా నిలబెట్టి దాని వైపు తిరిగి నమాజ్‌ చేసేవారు.[44] ఈ విధంగా నమాజ్‌ చేయటం అనేది ఒంటెల కొట్టంలో నమాజ్‌ చేయటం వంటిది కాదు. ఎందుకంటే ఆయన అసలు “ఆ ప్రదేశంలో నమాజ్‌ చేయటాన్నే వారించారు.”[45] కొన్నిసార్లు ఆయన ఒంటె అంబారీ నిటారుగా నిలబెట్టి దాని వెనుక భాగాన్ని అడ్డంగా ఉంచి నమాజ్‌ చేసేవారు [46] మరియు ఇలా అంటుండేవారు;

“మీలో ఎవరైనా తన ఎదుట ఒంటె అంబారీ వెనుక భాగపు కర్ర వంటిది ఏదయినా పెట్టుకొని నమాజ్‌ చేస్తున్నట్లయితే ఆ కర్రకు ఆవల నుంచి ఏ వస్తువు నడిచి వెళ్ళనా ఇక దాన్ని అతను పట్టించుకోవాల్సిన అవసరం లేదు” [48]

ఒకసారి ఆయన ఒక చెట్టు వైపు తిరిగి నమాజ్‌ చేశారు. (అంటే ఆ చెట్టుని సుత్రాగా పెట్టుకొని నమాజ్‌ చేశారు). [49] కొన్నిసార్లు ఆయన మంచానికి ఎదురుగా నిలబడి నమాజ్‌ చేసేవారు. ఆ సమయంలో ఆయేషా (రజిఅల్లాహు అన్హ) మంచం మీద తన దుప్పట్లో పడుకొని ఉండేవారు. [50]

తనకూ – తన సుత్రాకు మధ్య నుంచి ఏ వస్తువునీ వెళ్ళనిచ్ఛేవారు కాదు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). ఒకసారి ఏమయిందంటే, ఆయన నమాజ్‌ చేస్తున్నారు. అప్పుడే ఒక మేక పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు నుంచి వెళ్ళబోయింది. కాని ఆయన కూడా తొందరగా ముందుకుపోయి [51] ఉదరభాగంతో గోడకు ఆనుకున్నారు. దాంతో ఆ మేక పిల్ల ఆయన వెనుక నుంచి దాటి వెళ్ళిపోయింది. [52]

ఒకసారి ఆయన ఫర్జ్ నమాజ్‌ చేస్తున్నారు. (నమాజ్‌లోనే) పిడికిలి బిగించారు. నమాజ్‌ ముగిసిన తర్వాత ప్రజలు “దైవప్రవక్తా! నమాజులో ఏదైనా కొత్త విషయం జరిగిందా?” అని అడిగారు. అందుకాయన “కొత్త విషయం ఏమీ లేదుగాని షైతాన్‌ నా ముందు నుంచి దాటి వెళ్ళబోయాడు. దాంతో నేను వాడి గొంతు పిసికాను. అప్పుడు నా చేతికి వాడి నాలుక చల్లదనం కూడా తగిలింది. దైవంసాక్షి నా సోదరుడు సులైమాన్‌ నా కంటే ముందు ప్రార్ధన చేసి ఉండకపోతే ఆ పైతాను మస్జిద్ లోని ఏదో ఒక స్తంభానికి కట్టబడి ఉండేవాడు. మదీనా నగర పిల్లలు సయితం వాణ్ని చూసుండేవారు. (కనుక నేను చెప్పేది ఏమంటే) తనకూ-ఖిబ్లాకు మధ్య నుంచి ఎవర్నీ వెళ్ళకుండా ఆపగలిగే వీలున్నవాడు తప్పకుండా అలా చేయాలి. ” [53]

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెబుతుండేవారు: “మీలో ఎవరైనా ఏదైనా వస్తువును అడ్డుగా పెట్టుకొని నమాజ్‌ చేస్తున్నప్పటికీ ఇంకెవరైనా అతని ముందు నుంచి వెళ్ళగోరితే వాణ్ణి గొంతుపట్టుకొని వెనక్కి నెట్టాలి. వీలైనంత వరకు వాణ్ణి ఆపటానికి ప్రయత్నం చేయాలి. (మరో ఉల్లేఖనంలో రెండోసారి కూడా వాణ్ణి ఆపాలి అని ఉంది. ) అప్పటికి వాడు వినకపోతే ఇక వాడితో తలపడాలి. ఎందుకంటే వాడు షైతాను” [54]

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంకా ఇలా అంటుండేవారు: “నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్ళటం ఎంత పాపమో తెలిస్తే ఆ వ్యక్తి నమాజ్‌ చేస్తున్న వాని ముందు నుంచి వెళ్లటం కంటే నలభై వరకు అక్కడే ఎదురుచూస్తూ ఉండిపోవటం తన కొరకు శ్రేయస్కరం అనుకుంటాడు.” (హదీసు ఉల్లేఖకులు అబూ నద్ర్‌ కథనం: నలభై అంటే దైవప్రవక్త రోజులు, నెలలు, సంవత్సరాలలో దేనిని సెలవిచ్చారో నాకు గుర్తులేదు. – అనువాదకులు) [55]

హదీసు రిఫరెన్సులు & అల్బానీ వ్యాఖ్యలు :

[38] బుఖారీ, అహ్మద్‌

[39] బుఖారీ, ముస్లిం

[40] సహీ ఇబ్నె ఖుజైమా (1/93/1) – మంచి పరంపరతో.

[41] అబూదావూద్‌, జవాయెద్‌ బజ్జార్‌ – 54 పేజీ, హాకిమ్‌ – తను దీనిని సహీగా ఖరారు చేశారు. జహబీ, నవవీ దీనితో ఏకీభవించారు.

[42] నేను చెప్పేదేమిటంటే – ఇమామ్‌ అయినా, ఒంటరిగా నమాజ్‌ చేసే వ్యక్తి అయినా, ఒకవేళ మస్జిద్ పరిమాణం పెద్దదైనప్పటికీ, అందరికోసం ‘సుత్రా’ తప్పనిసరి. ఇబ్నె హానీ తన గ్రంథం ‘మసాయల్‌ ఇమామ్‌ అహ్నద్‌”-1/66 నందు యిలా పేర్కొన్నారు: అబూ అబ్దుల్లా అంటే ఇమామ్‌ అహ్మద్‌ ఓ రోజు నన్ను, సుత్రా లేకుండా నమాజు చేయడం చూసి ‘దేనినయినా సుత్రాగా ఉపయోగించుకో‘ అని ఉపదేశించారు. తదుపరి నేను ఒక వ్యక్తిని సుత్రాగా ఉపయోగించుకున్నాను.

నేను చెప్పేదేమిటంటే – ఇమామ్‌ అహ్మద్‌ తన మాటల ద్వారా – మస్జిద్ పరిమాణం పెద్దదైనా, చిన్నదైనా – సుత్రా ఉపయోగించడంలో వ్యత్యాసం చూపకూడదు అన్న విషయం సూచించారు. ఇదే సత్యం కూడాను.

నేను సందర్శించిన దేశాలలో గమనించిందేమిటంటే – సాధారణంగా నమాజీలు – వారు ఇమాములైనా లేదా సాధారణ వ్యక్తులైనా, సుత్రా విషయంలో తగిన శ్రద్ధ వహించడం లేదు. ఈ దేశాల్లో సౌది అరేబియా కూడా చేరి ఉంది. అక్కడికి నేను 1410 హి. రజబ్‌ మాసంలో వెళ్లాను.

అందుకే, ఉలమాలపై వున్న బాధ్యత ఏమిటంటే – వారు ఈ విషయం గురించి ప్రజలకు హెచ్చరించాలి మరియు సుత్రాకు సంబంధించిన అన్ని వివరాలను వారికి తెలియజేయాలి. సుత్రా ఆజ్ఞల విషయంలో మస్జిదె హరాం మరియు మస్జిదె నబవి కూడా చేరి వున్నాయన్న విషయం వారికి బోధపరచాలి.

[43] బుఖారీ, ముస్లిం, ఇబ్నె మాజా

[44][45] బుఖారీ, అహ్మద్‌

[46] ముస్లిం, ఇబ్నె ఖుజైమా – 2/92, అహ్మద్‌

[47] అంబారీ వెనుకభాగంలో వుండే కర్రను ‘మోఖిరా’ అంటారు.

[48] ముస్లిం, అబూదావూద్‌

[49] నసాయి, అహ్మద్‌ – సహీ పరంపరతో

[50] బుఖారీ,ముస్లిం, అబూ యాలా – 3/107 – తఫ్సీర్ అల్‌ మక్తబతుల్‌ ఇస్లామీ 

[51] హదీసులో ‘సా ఆహా’ అన్న పదం వచ్చింది. అంటే “ఇతరులను మించిపోవడం” అన్నమాట.

[52] సహీ ఇబ్నె ఖుజైమా (1/95/1), తటబ్రానీ (3/140/3), హాకిమ్‌ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ దీనితో ఏకీభవించారు.

[53] అహ్మద్‌, దారెఖు,త్నీ  తబ్రానీ – సహీ పరంపరతో.

ఈ అర్ధాన్ని స్ఫురించే ఉల్లేఖనాలు బుఖారీ, ముస్లింలలో వున్నాయి. అంతేకాక, సహాబాల ఒక సమూహం ద్వారా కూడా ఈ అర్ధంతో కూడుకున్న ఉల్లేఖనాలు ఇతర గ్రంథాల్లో వచ్చాయి.

ఖాదియానీలు తిరస్కరించే హదీసులలో ఇదొకటి. ఎందుకంటే ఖురాను, హదిసులలో వివరించబడ్డ జిన్నుల లోకాన్ని వారు విశ్వసించరు. షరీయత్తులోని స్పష్టమైన ఆధారాలను వారు తిరస్కరించడం అనేది ఎవరికీ తెలియని విషయం కాదు. ఒకవేళ ఆధారం ఖుర్‌ఆన్‌లో వుంటే – వారు దాని అర్ధాన్నే మార్చిస్తారు. ఉదాహరణకు : “ఓ ప్రవక్తా! జిన్నాతుల సమూహం ఒకటి (శ్రద్ధగా విని, ఆ తర్వాత …… (జిన్న్‌: 1) ఆయత్‌లో ‘జిన్నును మానవ జిన్న్‌గా తలపోన్తారు మరియు ‘జిన్న్’ పదాన్ని మానవమాత్రులుగా ఖరారు చేస్తారు.

యిలా, ఈ విషయంలో వారు నిఘంటువు మరియు షరియత్తుల నుండి దూరం వెళ్ళి పోయారు. ఒకవేళ ఆధారాలు గనక హదీసుల్లో ఉంటే-వీలయితే వాటి అసలు అర్ధాన్నే మార్చేస్తారు లేదా అతి తేలికగా వాటిని అసత్యమని ఖరారు చేశారు. ఇలా, హదీసువేత్తలు, వారి వెనుక మొత్తం అనుచర సమాజం వాటి ప్రామాణికతపై ఏకాభిప్రాయం కలిగి వున్నప్పటికీ వీరు వాటిని తిరస్కరిస్తారు. అల్లాహ్‌ వారికి సన్మార్గం ప్రసాదించుగాక!

54, బుఖారీ, ముస్లిం.

55. బుఖారీ, ముస్లిం. ఈ ఉల్లేఖనం ఇబ్నె ఖుజైమా (1/94/1)లో వుంది.


ఇది “దైవ ప్రవక్త నమాజు స్వరూపం – షేఖ్ అల్ అల్బానీ (రహిమహుల్లా)”  అనే పుస్తకం నుండి తీసుకోబడింది (పేజీలు: 100-104)

ఇతరములు: అజాన్ , నమాజు

సూర్య చంద్ర గ్రహణాలు – ఆచారాలు, దురాచారాలు – صلاة الخسوف [వీడియో]

బిస్మిల్లాహ్

సలాతుల్ కుసూఫ్-ఖుసూఫ్ (సూర్య-చంద్ర గ్రహణాల నమాజు)
సూర్య చంద్ర గ్రహణాలు – ఆచారాలు, దురాచారాలు

పెద్ద వీడియో [37 నిముషాలు]

సూర్య చంద్ర గ్రహణాలు – ఆచారాలు, దురాచారాలుపెద్ద వీడియో [37 నిముషాలు]
https://youtu.be/pGV_H8ASjFQ
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

చిన్న వీడియో [15నిముషాలు]
https://www.youtube.com/watch?v=Kv6ev0EqBTo

సూర్య గ్రహణము చంద్ర గ్రహణముల గురించి సైన్స్ మరియు  ఇస్లాం ఏం చెబుతుంది!

ముందుగా సూర్య చంద్రగ్రహణాల పేరిట జరిగే మూఢనమ్మకాలు తెలుసుకుందాం!

మన ప్రాంతాల్లో దురాచారాలు, మూడనమ్మకాలు గ్రహణ సమయ్యాల్లో ఎక్కవ పాటిస్తారు. మన దేశ ఎలక్ట్రానిక్ మిడియా పనికట్టుకొని ప్రత్యేకంగా పండితులను పిలిపించి దాని ప్రత్యేక సమయాన్ని వేచిస్తారు. ప్రజల అమాయకత్వమే తమ బలంగా సొమ్ము చేసుకోవటానికి ప్రయత్నిస్తుంటారు.

మన ప్రాంతాల్లో పాటించే కొన్ని మూఢనమ్మకాలు ఇలా వుంటాయి:

1) గర్భవతులు గ్రహణం చూడరాదనటం.
2)గ్రహణం పట్టే సమయంలో సూర్య చంద్రకాంతి పడేచోట కూర్చోకూడదనడం.
3) కూరగాయాలు తరగడం, పండ్లు కోయడం వంటివి చేయకూడదనడం. అలా చేస్తే పదార్థాలు విషం చేస్తాయని భావించటం.
4) గర్భిణులను గ్రహణ సమయాల్లో ఇంటికే పరిమితం చేయటం.
5) తమ నివాస స్థలాల్లో సూర్యకాంతులు పడకుండా చూడటం
6) గర్భవతి గ్రహణ సమయాల్లో చూస్తే పిల్లలు అంగవైకల్యాలుగా పుడతారని భావించడం.
7)ఫలానా రాశివారికి లాభం, ఫలాన రాశి వారికి కీడని నమ్మటం.
8)గ్రహణ సమయం అయిపోగానే ఇంటిని శుభ్రంగా కడగడం.
9)ఇంకా మూఢన్మకాలు, బహుదైవ కార్యకలపాలకు పాల్పడటం వంటివి చేయటం.

 నా సహోద సహోదరిమణులారా మూఢనమ్మకాలు పాటించకూడదు. లాభం నష్టం అనేది భూమ్యకాశాల సృష్టకర్త అయిన అల్లాహ్(దేవుడు) అధీనంలోనే ఉన్నాయి. అలాగే బహుధైవరాధనను అన్ని మత గ్రంధాలు ఖండిస్తున్నాయి. బహుధైవరాధన అనేది క్షమించరాని నేరం!!

సైన్స్ సూర్య చంద్రగ్రహణాల గురించి ఏం చెబుతుంది:

చంద్రగ్రణాల ద్వారా గర్బణిలకు ఎటువంటి ప్రమాదం లేదని, అలాగే తిను పదార్దాలు చెడిపోవటం అధిక ఉష్ణోగ్రతలు 35 – 40 వరకు ఉండటమేనని తేల్చింది. అలాగే గ్రహణాల ఏర్పాటు అనేది ఆకాశంలో భూమి, చంద్రుల నీడలాటే అని కూడా చెప్పింది. సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయి. అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం చంద్రుడు. ఇలా ఇవి ఒకదాని చుట్టూ ఒకటి పరిభ్రమించేటప్పుడు సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే.. చంద్రుని నీడ భూమిమీద పడుతుంది. సూర్యుడికి, చంద్రునికి మధ్యలో భూమి వస్తే భూమి నీడ చంద్రుని మీద పడుతుంది. ఈ నీడలు ఇలా పడడం వల్లనే గ్రహణాలు ఏర్పడుతాయి.

ఇలా మనకు గ్రహణాల సబబు తెలిసిందని నిర్భయంగా ఉండలేము. చీకట్లు క్రమ్ముకొని ఉన్న ప్రపంచాన్ని కాంతితో నింపే అంతటి శక్తి సూర్యునిలో అల్లాహ్ యే ఇచ్చాడు, తాను కోరినప్పుడు ఏదో సబబు కలుగజేసి ఆ కాంతిని తీసేసుకుంటున్నాడు, పగటి వేల చీకటిగా చేస్తున్నాడు, అలాగే చంద్రుణ్ణి కూడా అందుకే ఆ అల్లాహ్ తో భయపడాలి. ఈ గ్రహణాల సందర్భంలో ఏమి చేయాలని ఆదేశించాడో అవి చేయాలి. అప్పుడే మనం ఇహపరాల మోక్షం పొందుతాము.

ఇస్లాం సమాచారం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ


527. హజ్రత్‌ అబూ మస్‌వూద్‌ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-

“సూర్యచంద్రగ్రహణాలు ఏ ఒక్కరి మరణం, పుట్టుకలకు కారణభూతం కాజాలవు. సూర్యచంద్రులు అల్లాహ్ నిదర్శనాలలో రెండు నిదర్శనాలు. అందువల్ల మీరు సూర్యగ్రహణం గాని, చంద్రగ్రహణం గాని పట్టడం చూస్తే లేచి నమాజు చేయండి.”

[సహీహ్‌ బుఖారీ : 16వ ప్రకరణం – కుసూఫ్‌, 1వ అధ్యాయం – అస్సలాతి ఫీ కుసూఫిష్నమ్స్‌]

528. హజ్రత్‌ అబూమూసా (రది అల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్ష(సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో ఓసారి సూర్యగ్రహణం పట్టితే “ప్రళయం రాదు కదా’ అని ఆయన ఆందోళన చెందుతూ, మస్జిదుకు వెళ్ళి (కుసూఫ్‌) నమాజు చేశారు. అందులో ఖుర్‌ఆన్‌ పఠనం, రుకూ, సజ్దాలు నేనిదివరకెన్నడూ చూడనంత సుదీర్హంగా జరిగాయి. (తర్వాత) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రసంగించారు.

“ఇవి (సూర్యచంద్రగ్రహణాలు) అల్లాహ్ పంపుతున్న నిదర్శనాలు. అంతేగాని ఏ ఒక్కరి చావు పుట్టుకలకు కారణభూతం కాజాలవు. ఈ నిదర్శనాల ద్వారా అల్లాహ్ తన దాసులను భయపెడుతున్నాడు. అందువల్ల మీరు ఇలాంటి నిదర్శనాలేమైనా చూస్తే వెంటనే అల్లాహ్  స్మరణ (నమాజు) వైపుకు పరుగెత్తండి, ఆయన్ని వేడుకోండి, పాప మన్నింపు కోరండి.”

[సహీహ్‌ బుఖారీ : 16వ ప్రకరణం – కుసూఫ్‌, 14వ అధ్యాయం – అజ్జిక్రి ఫిల్‌కుసూఫ్‌]

సలాతుల్ కుసూఫ్ ప్రకరణం : హదీసులు :
అల్-లూలు-వల్-మర్జాన్ (మహా ప్రవక్త మహితోక్తులు)


గ్రహణ సమయాలలో నమాజ్ (సలాతుల్ కుసూఫ్) : హదీసులు 
[హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) (Bulugh-al-Maraam)]

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి
https://teluguislam.net/whatsapp/

నమాజ్ ప్రాముఖ్యత, సామూహిక నమాజ్ ఘనత [వీడియో]

బిస్మిల్లాహ్

నమాజు యొక్క ప్రాముఖ్యత మరియు సామూహికంగా నమాజు చేసే ఘనత ఎంత గొప్పగా ఉందో చాలా సోదర సోదరీమనులకు తెలియకనే మస్జిదులకు దూరంగా ఉన్నారు, అయితే మీరు స్వయంగా ఈ వీడియో చూడండి, ఇతరులకు చూపించండి, నరక శిక్షల నుండి తమను, ఇతరులను కాపాడండి.

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/hS6r]
[33 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/

ఇతరములు: [నమాజు]

మస్జిదులో చేసే సామూహిక ఫజ్ర్ నమాజు ఘనత [వీడియో]

బిస్మిల్లాహ్

ఫజ్ర్ నమాజు సామూహికంగా చేయడంలోని ఘనత హదీసుల ఆధారంగా తెలుపబడింది.

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/Dytr]
[9 నిమిషాల వీడియో]
فضل صلاة الفجر مع الجماعة

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/

ఇతరములు: [నమాజు]

నమాజు కొరకు మస్జిదుకు నడచి వెళ్ళే ఘనత (فضل المشي إلى الصلاة) [వీడియో]

బిస్మిల్లాహ్

మనలో ఎంతో మందికి నమాజు కొరకు నడచి వెళ్ళడంలో ఉన్న ఘనత తెలియదు గనక సామూహిక నమాజులో వెనక ఉండిపోతారు, అయితే ఈ వీడియో చూసి లాభాలు తెలుసుకొని మీరు స్వయంగా మస్జిద్ కు వెళ్తూ ఉండండి ఇతరులను తీసుకెళ్ళండి.

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/6utr]
[3 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/

ఇతరములు:

నమాజ్ చేయవలసిన మరియు చేయరాని సమయాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/gbir]
[ 30 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

ఏ నమాజు యొక్క ఏ సమయం ఉంది, మరియు నమాజు చేయరాని సమయాలు ఏమిటి తెలుసుకోండి, ఇతరులకు తెలుపండి

నమాజు సమయాలు

عَنِ ابْنِ عَبَّاسٍ t قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: أَمَّنِي جِبْرِيلُ عَلَيْهِ السَّلَام عِنْدَ الْبَيْتِ مَرَّتَيْنِ، فَصَلَّى بِيَ الظُّهْرَ حِينَ زَالَتِ الشَّمْسُ وَكَانَتْ قَدْرَ الشِّرَاكِ، وَصَلَّى بِيَ الْعَصْرَ حِينَ كَانَ ظِلُّهُ مِثْلَهُ، وَصَلَّى بِيَ يَعْنِي الْمَغْرِبَ حِينَ أَفْطَرَ الصَّائِمُ، وَصَلَّى بِيَ الْعِشَاءَ حِينَ غَابَ الشَّفَقُ، وَصَلَّى بِيَ الْفَجْرَ حِينَ حَرُمَ الطَّعَامُ وَالشَّرَابُ عَلَى الصَّائِمِ، فَلَمَّا كَانَ الْغَدُ صَلَّى بِيَ الظُّهْرَ حِينَ كَانَ ظِلُّهُ مِثْلَهُ، وَصَلَّى بِي الْعَصْرَ حِينَ كَانَ ظِلُّهُ مِثْلَيْهِ، وَصَلَّى بِيَ الْمَغْرِبَ حِينَ أَفْطَرَ الصَّائِمُ، {وفي رواية أبي موسى: وَصَلَّى الْمَغْرِبَ قَبْلَ أَنْ يَغِيبَ الشَّفَقُ} وَصَلَّى بِيَ الْعِشَاءَ إِلَى ثُلُثِ اللَّيْلِ، وَصَلَّى بِيَ الْفَجْرَ فَأَسْفَرَ»

ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారుః జిబ్రీల్ అలైహిస్సలాం కాబా వద్ద రెండు సార్లు నాకు నమాజు చేయించారు;

  • పొద్దు వాలి, నీడ చెప్పు గూడంత ఉన్నప్పుడు నాకు జొహ్ర్ నమాజు చేయించారు,
  • ప్రతి వస్తువు నీడ దానంత అయినప్పుడు నాకు అస్ర్ నమాజు చేయించారు,
  • ఉపవాసమున్న వ్యక్తి ఉపవాసం విరమించే- టప్పుడు మగ్రిబ్ నమాజ్ చేయించారు,
  • ఎర్రని కాంతులు మరుగైన తర్వాత ఇషా నమాజ్ చేయించారు,
  • ఉపవాసముండే వ్యక్తిపై తినత్రాగడం నిషిద్ధం అయినప్పడు నాకు ఫజ్ర్ నమాజు చేయించారు.

మరుసటి రోజు;

  • ప్రతి వస్తువు నీడ దానంత అయినప్పుడు జొహ్ర్ నమాజ్ చేయించారు,
  • ప్రతి వస్తువు నీడ దాని రెండింతలు అయినప్పుడు అస్ర్ నమాజ్ చేయించారు,
  • ఉపవాసమున్న వ్యక్తి ఉపవాసం విరమించే- టప్పుడు మగ్రిబ్ నమాజ్ చేయించారు, [అబూ మూసా ఉల్లేఖనంలో ఉందిః ఎర్రని కాంతి మరుగుపడే ముందు మగ్రిబ్ నమాజ్ చేయించారు]
  • రాత్రి మూడవ భాగం గడిశాక ఇషా నమాజ్ చేయించారు,
  • తెలుపుగా ఉన్నప్పుడు ఫజ్ర్ నమాజు చేయించారు.  (అబూ దావూద్ 393, 395).

ప్రతి నమాజు తొలి సమయంలో చేయడం ఉత్తమం

عنْ أُمِّ فَرْوَةَ، قَالَتْ: سُئِلَ رَسُولُ اللهِ ﷺ أَيُّ الْأَعْمَالِ أَفْضَلُ؟ قَالَ: «الصَّلَاةُ فِي أَوَّلِ وَقْتِهَا»

ఉమ్మె ఫర్వా ఉల్లేఖనం ప్రకారం, కార్యాల్లో ఏదీ అతిఉత్తమమైనదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించబడినప్పుడు, నమాజు దాని తొలి సమయంలో చేయడం అని సమాధానం ఇచ్చారు. (అబూ దావూద్ 426).

తెలిసీ సమయం దాటనివ్వకూడదు

عَنْ أَبِي ذَرٍّ، قَالَ: قَالَ لِي رَسُولُ اللهِ ﷺ: «كَيْفَ أَنْتَ إِذَا كَانَتْ عَلَيْكَ أُمَرَاءُ يُؤَخِّرُونَ الصَّلَاةَ عَنْ وَقْتِهَا؟ – أَوْ – يُمِيتُونَ الصَّلَاةَ عَنْ وَقْتِهَا؟» قَالَ: قُلْتُ: فَمَا تَأْمُرُنِي؟ قَالَ: «صَلِّ الصَّلَاةَ لِوَقْتِهَا، فَإِنْ أَدْرَكْتَهَا مَعَهُمْ، فَصَلِّ، فَإِنَّهَا لَكَ نَافِلَةٌ»

హజ్రత్ అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: మీ నాయకులు నమాజులను ఆలస్యంగా చేసినప్పుడు నీ పరిస్థితి ఏముంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, అలాంటప్పుడు నేనేమి చేయాలో మీరే ఆదేశించండి అని విన్నవించుకున్నాను, అప్పుడు ఆయన చెప్పారు: నీవు నమాజు దాని సమయంలో చేసుకో, వారితో కూడా నీకు అదే నమాజు మరోసారి చేయవలసి వచ్చినప్పుడు, వారితో కూడా చేయి, అది నీకు నఫిల్ అవుతుంది. (ముస్లిం 648).

ఇషా నమాజు ఆలస్యం చేయవచ్చును

عَنْ أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ النَّبِيُّ ﷺ: «لَوْلَا أَنْ أَشُقَّ عَلَى أُمَّتِي لَأَمَرْتُهُمْ أَنْ يُؤَخِّرُوا العِشَاءَ إِلَى ثُلُثِ اللَّيْلِ أَوْ نِصْفِهِ»

ప్రవక్త సల్లల్ల్లాహు అలైహి వసల్లం చెప్పారని హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః నా అనుచర సంఘానికి కష్టతరంగా ఉంటుందన్న భయం నాకు లేకుంటే రాత్రి మూడవ భాగం లేదా అర్థ రాత్రి వరకు ఇషా నమాజును ఆలస్యంగా చేయండని ఆదేశించేవాడిని. (తిర్మిజి 167).

అయితే జమాఅతు (సామూహిక) నమాజు వదలి ఆలస్యం చేయకూడదు. ఏదైనా మస్జిదు వారందరూ ఏకమై ఆలస్యం చేస్తే అభ్యంతరం లేదు.

పడుకున్న లేదా మరచిపోయిన వ్యక్తి ఎప్పుడు నమాజు చేయాలి?

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ t، قَالَ: قَالَ نَبِيُّ اللهِ ﷺ: «مَنْ نَسِيَ صَلَاةً، أَوْ نَامَ عَنْهَا، فَكَفَّارَتُهَا أَنْ يُصَلِّيَهَا إِذَا ذَكَرَهَا»

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారని హజ్రత్ అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఎవరైనా ఏదైనా నమాజు మరచిపోతే లేదా ఆ నమాజు సమయంలో నిద్రిస్తూ ఉంటే దాని పరిహారం ఏమిటంటే గుర్తు వచ్చిన (లేదా మేల్కొన్న) వెంటనే ఆ నమాజు చేసుకోవాలి. (ముస్లిం 684).

నమాజు చేయరాని సమయాలు

عن عُقْبَةَ بْنِ عَامِرٍ الْجُهَنِيَّ t يَقُولُ: ثَلَاثُ سَاعَاتٍ كَانَ رَسُولُ اللهِ ﷺ يَنْهَانَا أَنْ نُصَلِّيَ فِيهِنَّ، أَوْ أَنْ نَقْبُرَ فِيهِنَّ مَوْتَانَا: «حِينَ تَطْلُعُ الشَّمْسُ بَازِغَةً حَتَّى تَرْتَفِعَ، وَحِينَ يَقُومُ قَائِمُ الظَّهِيرَةِ حَتَّى تَمِيلَ الشَّمْسُ، وَحِينَ تَضَيَّفُ الشَّمْسُ لِلْغُرُوبِ حَتَّى تَغْرُبَ» {مسلم 831}

హజ్రత్ ఉక్బా బిన్ ఆమిర్ అల్ జుహనీ రజియల్లాహు అన్హు కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మేము మూడు వేళల్లో నమాజు చేయడం మరియు శవాలను ఖననం చేయడం నుండి వారించేవారుః

  • సూర్యోదయం అయ్యే వేళ అది పైకెక్కే వరకూ,
  • నడి నెత్తిన మీది కొచ్చిన సూర్యుడు వాలే వరకూ,
  • సూర్యాస్తమయం అయ్యే వేళ పూర్తిగా ఆస్తమించే వరకు. (ముస్లిం 831).

عن أَبي سَعِيدٍ الخُدْرِيّ t يَقُولُ: سَمِعْتُ رَسُولَ اللهِ ﷺ يَقُولُ: «لاَ صَلاَةَ بَعْدَ الصُّبْحِ حَتَّى تَرْتَفِعَ الشَّمْسُ، وَلاَ صَلاَةَ بَعْدَ العَصْرِ حَتَّى تَغِيبَ الشَّمْسُ»

నేను ప్రవక్త ﷺ ఉద్బోధించగా విన్నాను అని హజ్రత్ అబూ సఈద్ ఖుద్రీ t ఉల్లేఖించారుః ఉదయం నమాజు నెరవేర్చిన తర్వాత సూర్యోదయం వరకూ మరే నమాజు లేదు. అలాగే అస్ర్ నమాజ్ నెరవేర్చిన తర్వాత సూర్యాస్తమయం వరకూ ఏ నమాజూ లేదు. (బుఖారి 586, ముస్లిం 827).

*  ఫజ్ర్ కు ముందు గల సున్నతులు ముందే చేయ లేక పోతే ఫజ్ర్ తర్వాత చేయవచ్చును (తిర్మిజి 422).

కూర్పు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ

ఇతరములు:

ప్రళయ దినాన దాసునితో మొట్టమొదట ప్రశ్నించబడే ఆరాధన నమాజు

బిస్మిల్లాహ్

“(ఓ ప్రవక్తా!) నీ వైపునకు పంపబడిన (వహీ చేయబడిన) గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉండు. నమాజును నెలకొల్చు. నిశ్చయంగా నమాజ్‌ సిగ్గమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్‌ స్మరణ చాలా గొప్ప విషయం (అన్నసంగతిని మరువరాదు). మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు.” (29, సూరతుల్‌ అన్‌కబూత్‌:45)

హజ్రత్ అబ్దుల్లాహ్‌ బిన్‌ జాబిర్‌ (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఐదు పూటల నమాజు చేయటం మీలో ఒకరి ఇంటి ముందు నిండుగా ప్రవహిస్తున్న సెలయేటిలో (పతి రోజు ఐదుపూటల స్నానం చేయటం లాంటిది” (ముస్లిం).

ఒక వ్యక్తి జీవితమంతా ముస్లింగా ఉండాలంటే అతను ప్రతి రోజు ఐదు సమయాల నమాజు విధిగా ఆచరించాలి. నమాజును ఆచరించేవారి కొరకు ప్రళయ దినాన అది జ్యోతిగాను ధృవ పత్రముగాను ఉంటుంది. తద్వారా వారు ప్రళయ దినాన నరకం నుండి విముక్తి పొందుతారు. కనుక అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు: “వారి తరువాత కొందరు అయోగ్యులు వారి స్థానంలో వచ్చారు. వారు నమాజును త్యజించారు. మనో వాంఛలను అనుసరించారు. కనుక వారు త్వరలోనే (ప్రళయ దినాన) గయ్ (అనే నరకం)లో పడవేయబడుతారు” (19, సూరతుల్‌ మర్యం:59).

నమాజు ఆచరించేవారి కొరకు స్వర్గం ప్రాప్తమవుతుందని అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు: “తమ నమాజులను కాపాడుకునేవారు. ఇలాంటి వారు సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు” (70, మఆరిజ్‌:34-35).

ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “ప్రళయ దినాన దాసునితో మొట్టమొదట ప్రశ్నించబడే ఆరాధన నమాజు. ఆ నమాజును సరిగ్గా పాటించినట్లయితే సాఫల్యం పొందుతాడు. అదే గనుక సరిగ్గాలేదంటే అతను నష్టపోతాడు, విఫలుడవుతాడు” (తిర్మిజీ, సహీహ్‌ అల్‌ జామీ :2020).

నరకవాసుల పాపాల గురించి స్వర్గవాసులు ప్రశ్నించే విషయాన్ని అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు: మీరు ఎందువల్ల నరకంలో పడ్డారు? (అప్పుడు వారు ఇలా సమాధానమిస్తారు). “మేము నమాజును స్థాపించలేదు. మేము పేదలకు అన్నదానం చేసేవారము కాము. మరియు మేము సత్యాన్ని తిరస్కరించే వారితో కలిసి సత్యాన్ని తిరస్కరిస్తూ ఉండేవారము. ప్రళయ దినాన్ని అబద్దంగా భావించాము, చివరికి మాకు మృత్యువు వచ్చేసింది” (74, సూరతుల్‌ ముద్దసిర్‌:42-47).

నమాజును ఉద్దేశ్యపూర్వకంగా వదిలినవారు ముస్లిములు కానేకారని ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు: “విశ్వాసిగల దాసునికి కుఫ్ర్ కు (తిరస్కారికి) మధ్య వ్యత్యాసం నమాజును పాటించకపోవడమే”” (ముస్లిం). ప్రవక్త ముహమ్మద్‌ మరొకచోట ఇలా ప్రవచించారు: “మన (విశ్వాసుల) మధ్య మరియు వారి (అవిశ్వాసుల) మధ్య ఉన్న ఒడంబడిక నమాజును పాటించడము. ఎవరైయితే దాన్ని (నమాజును) పాటించరో, వారు అవిశ్వాసానికి గురికాబడ్డారు” (అహ్మద్‌, తిర్మిజీ, ఇబ్నుమాజా). మరొక చోట ఇలా తెలియజేసారు: “ఇస్లామే అసలైన ధర్మం. నమాజు దీని స్తంభం, దీని అత్యుత్తమ విలువైన స్థానం “అల్‌ జిహాద్‌ ఫీ సబీలిల్లాహ్‌”’ (ముస్లిం).

ప్రియమైన సోదరులారా! నమాజును జీవితంలో ఒక భాగంగా భావించి తప్పక నెరవేర్చండి. అప్పుడే ఇహపరాల సాఫల్యం పొందగలరు. ఎవరయితే ఆత్మ పరిశీలన చేసుకుంటారో, మరణానంతర జీవితం కొరకు సదాచరణా చేసుకుంటారో వారే వివేకవంతులు. మరెవరయితే తన మనసును దాని కోరికల అనుసరణకై వదిలేస్తారో, తరువాత అల్లాహ్‌ అనుగ్రహంపట్ల ఆశలు పెంచుకుంటారో వారే అవివేకులు.


ఇది “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు విధానము” అనే పుస్తకం నుండి తీసుకోబడింది. కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజ హుల్లాహ్)