అబూ హురైరా (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర
వక్త: సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/c8YBKq1fepo [30 నిముషాలు]
ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్ప సహాబీ అయిన అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్రను క్లుప్తంగా వివరించబడింది. ఇస్లాం స్వీకరించక ముందు ఆయన పేరు, స్వీకరించిన తర్వాత ప్రవక్త వారు పెట్టిన పేరు, మరియు ఆయనకు “అబూ హురైరా” (పిల్లికి తండ్రి) అనే బిరుదు ఎలా వచ్చిందో వివరించబడింది. ఆయన యెమన్ దేశంలోని దౌస్ తెగలో జన్మించి, తండ్రిని కోల్పోయి తల్లి వద్ద పెరిగిన తీరు, మరియు తుఫైల్ బిన్ అమర్ దౌసీ (రదియల్లాహు అన్హు) ద్వారా ఇస్లాం స్వీకరించిన వృత్తాంతం చెప్పబడింది. మదీనాలో ఆయన అనుభవించిన తీవ్ర పేదరికం, అహ్ల్ అస్-సుఫ్ఫాలో ఒకరిగా జీవించిన విధానం, మరియు ప్రవక్త వారి దుఆ ఫలితంగా ఆయన తల్లి ఇస్లాం స్వీకరించిన అద్భుత సంఘటనను కళ్ళకు కట్టినట్టు వివరించారు. ప్రవక్త వారి తర్వాత, వివిధ ఖలీఫాల కాలంలో ఆయన పాత్ర, బహ్రెయిన్ గవర్నర్గా ఆయన సేవలు, మరియు ఆయన మరణ సమయంలో పరలోకం గురించి ఆయనకున్న భయభక్తులను ఈ ప్రసంగం తెలియజేస్తుంది. అత్యధికంగా 5,374 హదీసులను ఉల్లేఖించిన సహాబీగా ఆయన స్థానం, మరియు ఆయన అద్భుతమైన జ్ఞాపకశక్తిని కూడా ఈ ప్రసంగంలో ప్రస్తావించారు.
اَلْحَمْدُ لِلّٰهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللّٰهِ
[అల్-హమ్దు లిల్లాహ్, వస్సలాతు వస్సలాము ‘అలా రసూలిల్లాహ్]
సకల స్తోత్రములు, పొగడ్తలు అల్లాహ్ కే శోభస్తాయి. మరియు అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు ఆయన ప్రవక్తపై వర్షించుగాక.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
[అస్సలాము ‘అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
ఈనాటి ప్రసంగంలో మనం ఒక గొప్ప సహాబీ గురించి తెలుసుకోబోతున్నాము. ఆయన గొప్పతనం ఏమిటంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన కోసము, ఆయన తల్లి కోసము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ప్రత్యేకంగా దుఆ చేసి ఉన్నారు. హదీసు గ్రంథము చిన్నది అయినా సరే, పెద్దది అయినా సరే, ఆయన పేరు తప్పనిసరిగా అందులో ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించబడి ఉంటుంది. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద నుండి 5,374 హదీసులు, ఉల్లేఖనాలు ఉమ్మత్ అనుచర సమాజం వరకు చేరవేర్చి ఉన్నారు. ఇలాంటి విశిష్టతలు కలిగిన ఆ సహాబీ ఎవరనుకుంటున్నారా? ఆయనే అబూ హురైరా రజియల్లాహు త’ఆలా అన్హు వారు. రండి, ఇన్ షా అల్లాహ్, ఈ ప్రసంగంలో మనం అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్ర క్లుప్తంగా, ఇన్ షా అల్లాహ్, తెలుసుకుందాం.
పేరు & కున్నియత్
ఆయన ఇస్లాం స్వీకరించక ముందు ఆయనకు అబ్దుష్ షమ్స్ అని పేరు ఉండేది. ఇస్లాం స్వీకరించిన తర్వాత, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ పేరు సరికాదు అని మార్చి అబ్దుర్రహ్మాన్ అని పేరు పెట్టారు. అయితే, అబూ హురైరా అని ఆయనకు కున్నియత్, నామాంతరము ఉండేది. అబూ హురైరా అంటే దాని అర్థం ఏమిటి? చిన్న పిల్లికి తండ్రి అని అర్థం. ఆ పేరు ఆయనకు ఎందుకు పెట్టబడింది అంటే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, ఆయన ఒక పిల్లిని పోషిస్తూ ఉండేవారు. ఆ పిల్లి ఆయన మీద అభిమానంతో ఎల్లప్పుడూ ఆయన వెంట వెంట తిరుగుతూ ఉండేది, ఆయన ఒడిలో కూర్చుంటూ ఉండేది. అది చూసిన ప్రజలు ఆయనకు అబూ హురైరా, చిన్న పిల్లికి తండ్రి అని నామాంతరము, కున్నియత్ పెట్టేశారు అని అంటూ ఉన్నారు.
జననం మరియు బాల్యం
ఇక అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఎక్కడ జన్మించారు అని మనం చూచినట్లయితే, యెమన్ దేశంలోని దౌస్ తెగలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు జన్మించారు. ఆయన జన్మించిన కొద్ది రోజులకే వారి తండ్రి మరణించారు. ఆయన అనాథగా తల్లి వద్ద పెరిగారు. తల్లి పేరు ఉమైమ. ఆమె అబూ హురైరా వారిని ఎంతో ప్రేమ, అనురాగాలతో పోషించారు.
ఇక అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఎలా ఇస్లాం స్వీకరించారన్న విషయాన్ని మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో భాగంగా తుఫైల్ బిన్ అమర్ దౌసీ రజియల్లాహు అన్హు వారి ఇస్లాం స్వీకరణ మనము విని ఉన్నాం. తుఫైల్ బిన్ అమర్, ఈయన కూడా యెమన్ దేశస్థులు, దౌస్ తెగకు చెందినవారు, గొప్ప కవి కూడా. మక్కాకు ఒకసారి వచ్చారు. మక్కా వాసులు ఆయనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడకండి, ఆయన మాటలు వినకండి అని హెచ్చరించారు. ఆయన ప్రారంభంలో ప్రవక్త వారి మాటలు వినకూడదు అనుకున్నారు. తర్వాత లోలోపల ఆలోచించి, “నేను కవిని, మంచి చెడులో వ్యత్యాసాన్ని గ్రహించగలిగే వాడిని, మరి అలాంటప్పుడు ముహమ్మద్ మాటలు వినటానికి నేను ఎందుకు భయపడాలి” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు విన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వతహాగా ఆయన తరపు నుంచి ఏమీ మాట్లాడేవారు కాదు కదా! దైవ వాక్యాలు ప్రజలకు బోధించేవారు కదా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తుఫైల్ బిన్ అమర్ వారికి దైవ వాక్యాలు వినిపించినప్పుడు, ఆయన దైవ వాక్యాలను అర్థం చేసుకొని వెంటనే ఇస్లాం స్వీకరించేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు, “మీ తెగ వారికి కూడా వెళ్లి మీరు ఇస్లాం గురించి బోధించండి” అని ఆదేశించినప్పుడు, ఆయన దౌస్ తెగకు తిరిగి వెళ్లి ఇస్లాం వైపుకి ఆహ్వానించారు. ప్రారంభంలో తెగ వారు ఎవరూ కూడా ఆయన మాటను పట్టించుకోలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు మళ్లీ వెళ్లి ప్రయత్నము చేయమని ఆదేశించినప్పుడు, మళ్లీ వెళ్లి ఆయన ప్రయత్నము చేయగా 80 కుటుంబాలు అల్-హమ్దులిల్లాహ్ ఇస్లాం స్వీకరించాయి. అలా ఇస్లాం స్వీకరించిన వారిలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు.
మదీనా వలస మరియు ఖైబర్ యుద్ధం
మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో విన్నాం అండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణము చేసి వెళ్లిపోయారు. మదీనాకు వలస ప్రయాణం చేసి వెళ్లిపోయిన ఆరవ లేదా ఏడవ సంవత్సరంలో తుఫైల్ బిన్ అమర్ వారు 80 కుటుంబాలను తీసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి హాజరయ్యారు. మదీనాకు వచ్చి చూస్తే, అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేరు. ఆ సమయానికి ఆయన సైన్యముతో పాటు ఖైబర్ ప్రదేశానికి వెళ్లి ఉన్నారు, అక్కడ యూదులతో యుద్ధం సంభవిస్తూ ఉంది. దౌస్ తెగకు చెందిన తుఫైల్ బిన్ అమర్ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు, మిగతా ప్రజలు కొంతమంది మదీనా నుండి చక్కగా ఖైబర్కు వెళ్లిపోయారు. ఆ ప్రకారంగా, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మొదటిసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఎక్కడ కలిశారు అంటే ఖైబర్ ప్రదేశంలో కలిశారు. ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేసి, అల్-హమ్దులిల్లాహ్ ఆ తర్వాత ఆయన కూడా, దౌస్ తెగ ప్రజలు కూడా యుద్ధంలో పాల్గొని విజేతలుగా మదీనాకు తిరిగి వచ్చేశారు.
మదీనాలో జీవనం మరియు పేదరికం
మదీనాకు వచ్చేసిన తర్వాత ఏమి జరిగిందంటే, దౌస్ తెగకు చెందిన చాలా మంది ప్రజలు వేరే వేరే ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. కానీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మూడు విషయాల కారణంగా మదీనాలోనే స్థిరపడిపోయారు. మొదటి విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పదే పదే చూడాలనే కోరిక. రెండవ విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేయాలనే కోరిక. మూడవ విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఇస్లాం శిక్షణ మరియు ధార్మిక శిక్షణ పొందాలనే కోరిక. ఈ మూడు విషయాల కారణంగా అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మదీనాలోనే స్థిరపడిపోయారు. అయితే, గమనించాల్సిన విషయం ఏమిటంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు యెమన్ నుండి మదీనాకు వస్తున్నప్పుడు తల్లిని కూడా వెంట తీసుకొని వచ్చారు. తల్లి ఇస్లాం స్వీకరించలేదు, అయినా గానీ ఆవిడను వెంటబెట్టుకొని మదీనాకు వచ్చేసి ఉన్నారు.
ఇక్కడ మదీనాలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వేరే ఏ వృత్తిని కూడా ఆయన ఎంచుకోకుండా, కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద నుండి ఎక్కువగా మాటలు, ఉల్లేఖనాలు, హదీసులు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ పని కోసం ఆయన పూర్తిగా అంకితమైపోయారు. మస్జిద్-ఎ-నబవీలో ఉండిపోతూ ఉండేవారు. ఆయన లాగే మరికొంత మంది సహాబాలు కూడా ఉండేవారు. వారందరినీ కూడా అస్హాబుస్ సుఫ్ఫా అనేవారు. అజియాఫుల్ ఇస్లాం అని, అజియాఫుల్లాహ్ అని, ఖుర్రా అని వారిని పిలిచేవారు. వారందరూ కూడా నిరుపేదలే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారందరి కోసము ఒక ప్రదేశాన్ని కేటాయించి నీడ సౌకర్యము కూడా కల్పించారు. వారందరూ కూడా ఆ ప్రదేశంలో సేద తీరేవారు.
ఇక, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మదీనాలో ఉంటున్నప్పుడు చాలా పేదరికము మరియు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. ఆయన స్వయంగా తెలియజేసిన విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాలలో రెండు రెండు రోజులు, మూడు మూడు రోజులు ఆయనకు తినటానికి ఏమీ దొరకని కారణంగా పూర్తిగా నీరసించిపోయి, ఒక్కొక్కసారి స్పృహ కోల్పోయి పడిపోతే, ప్రజలు ఆయన పడుకుంటూ ఉన్నాడేమోలే అనుకునేవారు. మరికొంత మంది అయితే, ఏమైంది ఈయనకు ఎక్కడంటే అక్కడ పడుకుంటున్నారు, పిచ్చి పట్టిందా అని కూడా కొంతమంది భావిస్తూ ఉండేవారు. కానీ వాస్తవానికి, ఆయన నీరసించిపోయి స్పృహ కోల్పోయి పడిపోయేవారు.
ఒకసారి ఆయన కడుపు మీద రాయి కట్టుకొని కూర్చొని ఉన్నారు. ఎవరైనా కనిపిస్తే వారితో మాట్లాడుదాము, వారు ఏమైనా తినటానికి ఇస్తారేమో అని ఆశిస్తూ ఉన్నారు. అంతలోనే అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అటువైపు వచ్చారు. ఆయనతో మాట్లాడారు, ఆయన కేవలం మాట్లాడి పలకరించి వెళ్లిపోయారు. తర్వాత ఉమర్ రజియల్లాహు అన్హు వారు వచ్చారు, ఆయనను పలకరించారు, ఆయన కూడా కేవలం పలకరించి మాట్లాడి ముందుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడితే, వెంటనే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ముఖ కవళికను గమనించి అర్థం చేసుకొని, “నాతో పాటు రండి” అని ఇంటికి తీసుకుని వెళ్లారు. ప్రవక్త వారి ఇంట్లో ఒక పాత్రలో కొన్ని పాలు ఉన్నాయి. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి ఆదేశిస్తూ, “మీ మిగతా మిత్రులు మస్జిద్ లో ఉన్నారు కదా, అస్హాబుస్ సుఫ్ఫా, వారందరినీ కూడా పిలుచుకొని రండి” అన్నారు. ఆయన మనసులో ఆశ్చర్యపోతూ ఉన్నారు, “ఏమిటండి, ఒక చిన్న పాత్రలో ఉన్న పాలు అంత మంది నా మిత్రులకు సరిపోతాయా?” అని లోలోపల ఆశ్చర్యపోతూ ఉన్నారు, కానీ ప్రవక్త వారి ఆజ్ఞ కదా, పాటించాలి కదా, కాబట్టి వెళ్లి వారందరినీ పిలుచుకొని వచ్చారు. వారందరూ ప్రవక్త వారి ఇంటికి వచ్చినప్పుడు ప్రవక్త వారు తమ స్వహస్తాలతో ఆ పాత్ర ఒక శిష్యునికి అందజేసి, అల్లాహ్ నామాన్ని తలుచుకొని తాగటం ప్రారంభించండి అన్నారు. ఒక శిష్యుడు తాగాడు, వేరే వారికి ఇచ్చాడు. ఆయన తాగాడు, వేరే వారికి ఇచ్చాడు. ఆ ప్రకారంగా అక్కడ ఉన్న వారందరూ కూడా తాగేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి కూడా ఇచ్చారు. ఆయన కూడా ఒకసారి తాగి ఇచ్చేస్తూ ఉంటే, “లేదు మరొకసారి తాగండి, మరొకసారి తాగండి” అని ఇంచుమించు ప్రవక్త వారు మూడు నాలుగు సార్లు ఆయనకు తాగమని చెప్పగా, ఆయన తాగేసి, “ఓ దైవ ప్రవక్త, నా కడుపు నిండిపోయిందండి, ఇక నేను తాగలేను” అని ఇచ్చేయగా, చివరిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ పాలు త్రాగారు. అల్లాహు అక్బర్! ఒక గిన్నెలో ఉన్న పాలు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అందులోనే ఎంత వృద్ధి, బరకత్ ఇచ్చాడంటే, అక్కడ ఉన్న వారందరూ కూడా అల్-హమ్దులిల్లాహ్ తనివి తీరా త్రాగగలిగారు.
అలాగే మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా గౌరవించేవారు, అభిమానించేవారు. ప్రవక్త వారికి సేవలు కూడా చేస్తూ ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు నీటి ఏర్పాటు చేసేవారు, వేరే వేరే పనులు కూడా ప్రవక్త వారి పనులు ఆయన చేసి పెడుతూ ఉండేవారు.
తల్లి ఇస్లాం స్వీకరణ
అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి కూడా మదీనాకు వచ్చి ఉన్నారు, ఆవిడ ఇస్లాం స్వీకరించలేదు అని మనం ఇంతవరకే విని ఉన్నాము కదండీ. తల్లిని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా గౌరవించేవారు, అభిమానించేవారు. ఎందుకంటే, పసితనంలోనే తండ్రి మరణించినా ఆవిడ బిడ్డను పోషించుకుంటూ ఉండిపోయారు గానీ మరొక వివాహము చేసుకోలేదు. కాబట్టి, బిడ్డ కోసం అంకితమైన తల్లి కోసము బిడ్డ, అనగా అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా చాలా అభిమానించేవారు, సేవలు చేసేవారు, గౌరవించేవారు. ఆవిడ కూడా ఇస్లాం స్వీకరించాలని పదేపదే వెళ్లి ఇస్లాం గురించి బోధిస్తూ ఉండేవారు.
ఒకసారి ఏమైందంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తల్లి వద్దకు వెళ్లి ఇస్లాం గురించి బోధిస్తూ ఉంటే ఆమె కోపగించుకున్నారు. కోపగించుకుని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి మీద మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక అనరాని మాట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద కూడా మాట్లాడేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి బాధ కలిగింది. ఏడ్చుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్త, ఇలా జరిగింది మా ఇంట్లో. మీరు అల్లాహ్ తో దుఆ చేయండి, నా తల్లికి ఇస్లాం భాగ్యము లభించాలని, అల్లాహ్ ఆమెకు ఇస్లాం స్వీకరించేలాగా చేయాలని అల్లాహ్ తో ప్రార్థన చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సందర్భంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి కోసము ప్రత్యేకంగా అల్లాహ్ తో దుఆ చేయగా, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తిరిగి మళ్లీ ఇంటికి వెళ్లారు. వెళ్లి చూస్తే, తలుపులు మూయబడి ఉన్నాయి, లోపల తల్లి స్నానం చేస్తున్న శబ్దం వస్తూ ఉంది. బిడ్డ వచ్చాడన్న విషయాన్ని గమనించిన తల్లి, “ఓ అబూ హురైరా, ఆగిపో నాయనా కొద్దిసేపు” అని ఆజ్ఞాపించగా, బయటే అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కొద్దిసేపు నిలబడిపోయారు. తర్వాత తల్లి స్నానం ముగించుకొని, బట్టలు ధరించుకొని, తలుపులు తెరిచి, ముందుగా ఆమె పలికిన మాట ఏమిటంటే:
أَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُوْلُ اللهِ
[అష్-హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్-హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్]
అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.
తల్లి సాక్ష్య వచనం పఠించి, కలిమా పఠించి, ఇస్లాం స్వీకరించారన్న విషయాన్ని చూసి, విని, మళ్లీ పట్టరాని సంతోషంలో ఆనంద భాష్పాలు కార్చుకుంటూ, ఏడ్చుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్త, నా తల్లి ఇస్లాం స్వీకరించేశారు” అని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, మళ్లీ దైవ ప్రవక్తతో వేడుకున్నారు, “ఓ దైవ ప్రవక్త, విశ్వాసులందరూ కూడా నన్ను, నా తల్లిని అభిమానించాలని మీరు అల్లాహ్ తో దుఆ చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొకసారి ఆయన కోసము, ఆయన తల్లి కోసము అల్లాహ్ తో దుఆ చేశారు. అల్-హమ్దులిల్లాహ్! నేటికీ కూడా విశ్వాసులందరూ వారు మదరసాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలు చదువుతూ ఉన్నా, లేదా వారు విద్యార్థులు కాకుండా సామాన్యమైన ప్రజలు ధార్మిక పండితుల నోట ప్రసంగాలలో గానీ, మస్జిదులలో గానీ ఎక్కడైనా గానీ ప్రవక్త వారి మాటలు, ఉల్లేఖనాలు, హదీసులు వింటూ ఉన్నారు అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క పేరు ప్రతి చోట ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించబడుతూనే ఉంటుంది. ఆ ప్రకారంగా, ప్రతి విశ్వాసి అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి అభిమానిగా ఆ రోజుల్లో కూడా ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఇన్ షా అల్లాహ్, అలాగే ఉంటూ ఉంటారు ముందు కూడా. అంటే, ప్రవక్త వారి యొక్క దుఆ ఫలితంగా విశ్వాసులందరూ కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు వారిని అభిమానిస్తూ ఉన్నారు మిత్రులారా, ఇది చెప్పాల్సిన విషయం.
అలాగే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తల్లి గురించి ఎంతగా శ్రద్ధ తీసుకుంటారో చూడండి. మరొక ఉదాహరణ చెబుతూ ఉన్నాను. ఒకసారి ఆకలి కారణంగా ఆయన మస్జిద్-ఎ-నబవీ లోకి ప్రవేశించారు. అక్కడ ఎవరైనా ఏమైనా ఇస్తారేమో అని ఆశతో వస్తే, ఎవరూ లేరు. కొంతమంది అక్కడ కూర్చొని ఉంటే వారి దగ్గరకు వెళ్లి, “ఈ సమయానికి మీరు ఇక్కడ ఉన్నారు ఏమిటి?” అని అడిగారు. వారందరూ ఏమన్నారంటే, “మీరు ఏ విధంగా అయితే ఈ సమయానికి ఆకలితో ఇక్కడికి ఏమైనా దొరుకుతుందని వచ్చారో, అలాగే మేము కూడా వచ్చాము” అన్నారు. తర్వాత వారందరూ కూడా కలిసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్దాము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్లారు. వెళ్లి, “ఓ దైవ ప్రవక్త, మాకు తినటానికి ఏమీ దొరకలేదు” అని ఆకలితో ఉన్నాము అని తెలియజేయగా, ప్రవక్త వారు ఖర్జూరపు పళ్ళు తెప్పించి ఒక్కొక్కరికి రెండు రెండు ఖర్జూరపు పండ్లు ఇస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్! సహాబాలు మరియు ప్రవక్త వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారో చూడండి. ఒక్కొక్కరికి రెండు రెండు ఖర్జూరపు పండ్లు వస్తూ ఉన్నాయి. ప్రవక్త వారు అంటున్నారు, “ఈ రెండు ఖర్జూరపు పండ్లు మీరు తినండి. అల్లాహ్ దయతో ఈ పూర్తి రోజుకు ఈ రెండు ఖర్జూరపు పండ్లు మీకు సరిపోతాయి.” అందరూ కూడా రెండు రెండు ఖర్జూరపు పండ్లు తీసుకొని తింటూ ఉన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మాత్రము ఒక ఖర్జూరపు పండు మాత్రమే తిని ఒకటి లోపల పెట్టుకుంటూ ఉంటే, ప్రవక్త వారు చూసి, “ఎందుకండి ఒకటి ఖర్జూరము పెట్టుకుంటూ ఉన్నారు?” అంటే, “నా తల్లి కోసము పెట్టుకుంటున్నాను, ఓ దైవ ప్రవక్త” అన్నారు. అల్లాహు అక్బర్! తల్లి గురించి ఎంత శ్రద్ధ తీసుకునేవారో చూడండి. “నా తల్లి కోసము ఆ ఖర్జూరము నేను పెట్టుకుంటూ ఉన్నాను, ఓ దైవ ప్రవక్త” అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “లేదండి, ఆ ఖర్జూరము మీరు తినేయండి. మీ తల్లి కోసము నేను ప్రత్యేకంగా అదనంగా రెండు ఖర్జూరపు పండ్లు ఇస్తాను” అని దైవ ప్రవక్త వారు రెండు అదనంగా ఖర్జూరపు పండ్లు ఇచ్చి మీ తల్లికి ఇవ్వండి అన్నారు. అల్లాహు అక్బర్! మొత్తానికి, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి ప్రారంభంలో ఇస్లాం స్వీకరించలేదు, తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దుఆ ఫలితంగా ఆవిడ ఇస్లాం స్వీకరించారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా తల్లి గురించి శ్రద్ధ తీసుకునేవారు, సేవలు చేసేవారు, బాగా అభిమానించేవారు కూడానూ.
ఆ తర్వాత మనం చూచినట్లయితే, హిజ్రీ శకం ఏడవ సంవత్సరం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్రా ఆచరించటానికి వెళ్ళినప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ప్రవక్త వారి వెంట వెళ్లి ఆ సంవత్సరము ఉమ్రా ఆచరించి వచ్చారు. ఆ తర్వాత, హిజ్రీ శకం ఎనిమిదవ సంవత్సరం వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బహ్రెయిన్ దేశానికి అలా బిన్ అల్-హదరమీ రజియల్లాహు అన్హు వారిని నాయకునిగా నియమించి పంపిస్తూ అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని కూడా ఆయనకు తోడుగా, జతగా పంపించారు. “మీరు అబూ హురైరా వారిని వెంట తీసుకుని వెళ్ళండి, ఆయనను గౌరవించండి” అని అలా బిన్ అల్-హదరమీ వారికి ప్రవక్త వారు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. ఇద్దరూ కలిసి బహ్రెయిన్కు వెళ్లారు. అలా బిన్ అల్-హదరమీ వారు బహ్రెయిన్కు వెళ్ళిన తర్వాత ప్రవక్త వారి ఆదేశం ప్రకారం అబూ హురైరా రజియల్లాహు అన్హు వారితో, “ఏమండీ, మీకు నేను గౌరవిస్తున్నాను, మీరు ఏ బాధ్యత తీసుకుంటారో చెప్పండి” అన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆలోచించి, “నాకు అజాన్ పలికే బాధ్యత ఇవ్వండి” అన్నారు. అల్లాహు అక్బర్! అజాన్ పలికే బాధ్యత అది సాధారణమైనది కాదు. అది చాలా విశిష్టత కలిగిన బాధ్యత, ఎంతో గౌరవంతో కూడుకున్న బాధ్యత కాబట్టి, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ బాధ్యత ఇవ్వండి అన్నారు. నేడు చాలామంది అజాన్ పలికే బాధ్యతను చిన్నచూపుతో చూస్తూ ఉంటారు, అది సాధారణమైన విషయంగా భావిస్తూ ఉంటారు. లేదండి, చాలా విశిష్టతలతో కూడిన విషయము అది. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ బాధ్యత తీసుకున్నారు.
కొద్ది నెలలకే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేరే అబాన్ బిన్ సయీద్ అనే ఒక సహాబీని అక్కడికి అనగా బహ్రెయిన్కు నాయకునిగా నియమించి పంపించేయగా, అలా బిన్ అల్-హదరమీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఇద్దరూ తిరిగి మళ్లీ మదీనాకు వచ్చేశారు. ఒక సంవత్సరం గడిచింది. హిజ్రీ శకం తొమ్మిదవ సంవత్సరము వచ్చింది. ఆ సంవత్సరము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూబకర్ రజియల్లాహు అన్హు వారిని నాయకునిగా నియమించి, ఆయన సారథ్యంలో ఇంచుమించు 300 మంది సహాబాలను హజ్ ఆచరించడానికి పంపించారు. వారిలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు. అంటే, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి సారథ్యంలో హజ్ ఆచరించబడినప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా వెళ్లి హజ్ ఆచరించుకొని వచ్చేశారు. ఆ సంవత్సరం ప్రవక్త వారు మాత్రము హజ్కి వెళ్ళలేదండి. ఆ తర్వాత వచ్చే సంవత్సరం, అనగా హిజ్రీ శకం పదవ సంవత్సరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా మంది సహాబాలను వెంటబెట్టుకొని వెళ్లి హజ్ ఆచరించారు. ఆ హజ్ని హజ్జతుల్ వదా అని అంటూ ఉంటారు. ఆ హజ్లో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట వెళ్లి హజ్ ఆచరించుకొని వచ్చారు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనంతర జీవితం
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో, ఆయన పరిపాలన యుగంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా యుద్ధాలలో పాల్గొన్నారు, ముఖ్యంగా ముర్తద్దీన్లతో జరిగిన యుద్ధాలలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రత్యేకంగా పాల్గొన్నారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారి మరణానంతరం, ఉమర్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఏం చేశారంటే, బహ్రెయిన్ ప్రదేశానికి ప్రవక్త వారి లాగే అలా బిన్ అల్-హదరమీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు, వీరిద్దరినీ నాయకులుగా నియమించి పంపించేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ సందర్భంలో బహ్రెయిన్లో ఇంచుమించు ఒక సంవత్సరం నాయకునిగా పరిపాలన కొనసాగించారు. ఆ ఒక సంవత్సరంలో ప్రభుత్వ తనఖా కూడా పొందారు, అటుగా ఆయన స్వయంగా కూడా వ్యాపారము చేశారు. ఆ ప్రకారంగా, ఆ ఒక సంవత్సరంలో ఆయన పెద్ద మొత్తంలో అల్-హమ్దులిల్లాహ్ డబ్బు సంపాదించుకోగలిగారు.
ఒక సంవత్సరం తర్వాత, ఉమర్ రజియల్లాహు అన్హు వారు వేరే సహాబీని అక్కడికి నాయకునిగా నియమించి పంపించేయగా, అలా బిన్ అల్-హదరమీ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వీరిద్దరూ మళ్లీ మదీనాకు తిరిగి వచ్చేశారు. అయితే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఈసారి మదీనాలో వచ్చినప్పుడు ఆయన వద్ద చాలా డబ్బు సొమ్ము ఉంది. ఇప్పుడు ఆయన మునుపటి లాగా నిరుపేద, ఆకలి దప్పుకలతో గడిపేవారు కాదు. చాలా డబ్బు అల్-హమ్దులిల్లాహ్ ఆయన సంపాదించుకోగలిగి ఉన్నారు. అయితే ఆయన ఏం చేశారో తెలుసా? మదీనాకు వచ్చిన తర్వాత ఆ డబ్బు మొత్తము బైతుల్ మాల్ కోసం అంకితం చేసేశారు. బైతుల్ మాల్ అంటే ప్రభుత్వం తరపున వితంతువులకు, అనాథలకు, మరియు నిరుపేదలకు ఆ సహాయము అందించేవారు. ఆ సహాయ నిధి కోసము ఈయన ఆయన వద్ద ఉన్న సంపద, డబ్బు మొత్తము అంకితం చేసేశారు, విరాళంగా ఇచ్చేశారు. అల్లాహు అక్బర్!
ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో, అంటే ఉమర్ రజియల్లాహు అన్హు వారి మరణానంతరం, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి పరిపాలన యుగంలో, సల్మాన్ బిన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారితో పాటు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా యుద్ధాలలో పాల్గొన్నారు. ముఖ్యంగా, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో ఆయన తూర్ పర్వతం ఉంది కదండీ, వాది-ఎ-సైనా, సైనా అనే ఒక లోయ ఉంది. ఆ మైదానములో ఒక పర్వతం ఉంది, కోహె తూర్. అక్కడ మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ఎలాంటి మధ్యవర్తి లేకుండా మాట్లాడారు కదండీ. ఆ పర్వతం వరకు ఆయన ప్రయాణము కొనసాగించారు అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే, ఆ ప్రయాణంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే, కాబ్ అహ్బార్ రజియల్లాహు అన్హు వారు, వాస్తవానికి ఆయన ఒక యూదుడు, తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించారు. ఆయనకు వేరే గ్రంథాల జ్ఞానము ఉంది. ఆయనతో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం వినిపించారు. ఏమని వినిపించారంటే, “జుమా రోజు చాలా విశిష్టత కలిగినది. జుమా రోజున అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదం అలైహిస్సలాం వారిని పుట్టించాడు. జుమా రోజున ఆయనకు స్వర్గంలో ప్రవేశింపజేశాడు. జుమా రోజునే ఆయన స్వర్గం నుంచి బయటికి వచ్చేశారు.” ఆ విధంగా చెబుతూ చెబుతూ చివర్లో, “జుమా రోజులో ఒక ఘడియ ఉంది. ఆ ఘడియలో భక్తుడు చేసే దుఆ తప్పనిసరిగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆమోదిస్తాడు” అని తెలియజేయగా, కాబ్ అహ్బార్, ఆయన ఏమంటున్నారంటే, “ఆ ఘడియ సంవత్సరంలో ఒకసారి వస్తుంది కదా” అన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అన్నారు, “లేదండి, దైవ ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారము ప్రతి శుక్రవారము ఆ ఘడియ ఉంటుంది” అన్నారు. ఆయన ఆశ్చర్యపోయి వారి గ్రంథము, అంటే వేరే మత గ్రంథాలు ఉన్నాయి కదండీ, ఆయన ఇస్లాం స్వీకరించక ముందు యూదుడు కదండీ, ఆ మతానికి చెందిన గ్రంథము చదివి ఆయన, “ప్రవక్త వారు చెప్పిన మాట నిజము” అని అప్పుడు ఆయన ధ్రువీకరించారు కూడా.
చివరి రోజులు మరియు మరణం
సరే, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క వీర మరణం సంభవించినప్పుడు అలీ రజియల్లాహు అన్హు వారు ముస్లింల నాయకులయ్యారు. ఆయన పరిపాలన యుగంలో ముస్లింల రెండు పెద్ద సమూహాల మధ్య పెద్ద యుద్ధము జరిగింది. ఆ యుద్ధ సమయంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వారిద్దరి మధ్య సంధి కుదిర్చటానికి చాలా ప్రయత్నము చేశారు. చివరికి ఆయన ఫలితం దొరకని కారణంగా యుద్ధంలో పాల్గొనకుండా ఆయన ఒంటరితనాన్ని ఎన్నుకున్నారు. ప్రత్యేకంగా దైవ ఆరాధన కోసం ఆయన అంకితమైపోయారు అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు.
సరే, ఏది ఏమైనప్పటికినీ, అలీ రజియల్లాహు అన్హు వారి తర్వాత, హిజ్రీ శకం 59వ సంవత్సరం, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వ్యాధికి గురయ్యారు. ఆ వ్యాధి రాను రాను ముదురుతూనే పోయింది. మరణ సమయం సమీపించింది. అప్పుడు ఆయన పరలోకాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉన్నారు. ప్రజలు ఆయనతో అడిగారు, “ఏమండీ, ఎందుకు ఏడుస్తున్నారు?” అంటే, అప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తెలియజేశారు, “నేను ప్రపంచాన్ని వదిలేసి వెళ్లిపోతున్నానని బాధలో నేను ఏడవట్లేదు. పరలోకాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉన్నాను. ప్రయాణము ముందు ముందు చాలా పెద్దది, నా దగ్గర ఏమో సామాను చాలా తక్కువగా ఉంది. నేను స్వర్గానికి చేరుకుంటానా, నరకానికి చేరుకుంటానా నాకు అర్థం కావట్లేదు. స్వర్గం నా గమ్యస్థానం అవుతుందా, నరకం నా గమ్యస్థానం అవుతుందా తెలియదు కాబట్టి, అది తలుచుకొని నేను ఏడుస్తూ ఉన్నాను” అన్నారు.
అల్లాహు అక్బర్! జీవితాంతం ప్రవక్తకు మరియు సహాబాలకు మరియు ఇస్లాంకు అంకితమైపోయిన అలాంటి సహాబీ పరలోకాన్ని తలుచుకొని, “నా వద్ద సొమ్ము తక్కువ ఉంది,” అంటే పుణ్యాలు తక్కువ ఉన్నాయి, ప్రయాణం చాలా పెద్దదిగా ఉంది, “స్వర్గానికి వెళ్తానో నరకానికి వెళ్తానో తెలియదు” అని ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారంటే, ఆయనలో ఎంత దైవభీతి ఉండేదో ఆలోచించండి. అలాగే, మనము ఎలాంటి ఎక్కువ పుణ్యాలు చేయకపోయినా పరలోకాన్ని తలుచుకొని ఏడవట్లేదు అంటే, ఎలాంటి భ్రమలో మనము జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించండి మిత్రులారా.
సరే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క మరణ సమయము సమీపించింది. ఆయన మదీనాలో ఉంటూ ఉన్నారు. మదీనా యొక్క నాయకుడు ఆ రోజుల్లో మర్వాన్ ఇబ్నుల్ హకం అనే ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన పరామర్శించడానికి వచ్చారు. వచ్చి, “అల్లాహ్ మీకు స్వస్థత ప్రసాదించుగాక” అని ప్రార్థిస్తూ ఉంటే, అప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అల్లాహ్ తో ప్రార్థించారు, “ఓ అల్లాహ్, నేను నీతో కలవటానికి ఇష్టపడుతూ ఉన్నాను, నువ్వు కూడా నన్ను నీ వద్దకు రావటానికి ఇష్టపడు” అని ప్రార్థించారు. అల్లాహు అక్బర్! ఆ తర్వాత, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క మరణము సంభవించింది.
అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మరణించిన తర్వాత వలీద్ బిన్ ఉత్బా బిన్ అబీ సుఫియాన్ రహిమహుల్లాహ్ వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క జనాజా నమాజు ఆచరించారు. తర్వాత అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి దేహాన్ని అల్-బఖీ, జన్నతుల్ బఖీ అంటుంటారు కదండీ, అల్-బఖీ అల్-గర్కద్, అందులో ఆయనకు ఖనన సంస్కారాలు చేయడం జరిగింది. 59వ హిజ్రీలో ఆయన మరణించారు. అప్పటికి ఆయన వయస్సు ఇంచుమించు 80 సంవత్సరాలకు కొద్దిగా తక్కువ లేదంటే కొద్దిగా ఎక్కువ అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన తర్వాత రోజుల్లో వివాహం చేసుకున్న కారణంగా ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. ఆ కుమార్తె యొక్క వివాహము గొప్ప తాబయీ, సయీద్ బిన్ ముసయ్యిబ్ రహిమహుల్లాహ్ వారితో జరిగింది అని కూడా చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు.
జ్ఞాపకశక్తి మరియు హదీసుల ఉల్లేఖన
అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి 5,374 హదీసులు ఉమ్మత్ అనుచర సమాజం వరకు చేరవేర్చి ఉన్నారు. సహాబీలందరిలో ఎక్కువగా హదీసులు ఉల్లేఖించిన వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అని కూడా చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు.
అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త వారి హదీసుల్ని జీవితాంతం చాలా చక్కగా కంఠస్థం చేసుకొని భద్రంగా గుర్తుంచుకొని ఉన్నారు అని చెప్పటానికి ఒక ఉదాహరణ వినిపిస్తూ ఉన్నాను, చూడండి. ఆయన జీవించి ఉన్నప్పుడు మదీనా నాయకుడు మర్వాన్ ఇబ్నుల్ హకం అని ఇంతవరకు మనం విన్నాము కదా. ఆ మర్వాన్ అనే అతను ఏం చేశాడంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని పిలిపించి ఆ విషయానికి సంబంధించిన ఒక హదీసు వినిపించండి, ఈ విషయానికి సంబంధించిన ఒక హదీసు వినిపించండి అని కొన్ని హదీసులు అడిగారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ హదీసులన్నీ కూడా వినిపించారు. ఈయన ఏం చేశారంటే, ముందే ఒక వ్యక్తిని ఆదేశించి, ఆయన వినిపిస్తున్న హదీసులన్నీ కూడా ఒక పత్రంలో వ్రాసి ఉంచుకోండి అని ఆదేశించగా, తెర వెనుక ఒక వ్యక్తి ఆ హదీసులన్నీ కూడా ఒక పత్రంలో వ్రాసి ఉంచుకున్నాడు. ఒక సంవత్సరం తర్వాత, మళ్ళీ అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని ఆ మర్వాన్ అనే వ్యక్తి పిలిపించి మళ్ళీ ఆ హదీసులు ఫలానా ఫలానా హదీసులు వినిపించండి అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు గత సంవత్సరం ఏ విధంగా వినిపించారో అదే విధంగా చక్కగా ఎలాంటి తప్పు దొర్లకుండా వినిపించేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వెళ్లిపోయిన తర్వాత తెర వెనుక కూర్చుని ఉన్న ఆ పత్రాన్ని గమనిస్తున్న వ్యక్తితో అడిగారు, “అబూ హురైరా కరెక్ట్ గానే వినిపించారా? ఏమైనా హెచ్చుతగ్గులు జరిగాయా?” అంటే, ఆ వ్యక్తి కూడా, “ఉన్నది ఉన్నట్టే ఆయన మొత్తం చెప్పారు, ఎలాంటి హెచ్చుతగ్గులు జరగలేదు” అని ఆ వ్యక్తి కూడా సాక్ష్యం ఇచ్చాడు. అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు జీవితాంతం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్ని చక్కగా గుర్తుంచుకొని వేరే వారి వరకు చేరవేశారు అని మనకు ఈ సంఘటన తెలుపుతుంది.
ఆ ప్రకారంగా, నేను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉల్లేఖనాలు చదివి, నేర్చుకొని, ఇతరుల వద్దకు చేర్చే భాగ్యం ప్రసాదించుగాక. ఇది అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్ర. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ అన్న, విన్న విషయాల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.
وَجَزَاكُمُ اللهُ خَيْرًا
[వ జజాకుముల్లాహు ఖైరన్]
మరియు అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ఇచ్చుగాక.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
[అస్సలాము ‘అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
—
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=19741
సలీం జామిఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7
సహాబా (రదియల్లాహు అన్హుమ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1KN6AyXdv30x30ykoVkyVt
సీరతే సహాబియ్యాత్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3cUt4NimP4PNSWLjHO3sXM