దైవదూతల పై విశ్వాసం – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖుత్బా అంశము:  దైవదూతల పై విశ్వాసం

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا. يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.     

ఓ ముస్లింలారా! నేను మీకు మరియు స్వయాన నాకు అల్లాహ్ యొక్క దైవ భీతి కలిగి ఉండాలని ఉపదేశిస్తున్నాను. అల్లాహ్ తఆలా మన ముందు తరాల వారి కొరకు మరియు మన తర్వాత తరాల వారి కొరకు కూడా ఇదే ఉపదేశం చేయడం జరిగింది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.

 [وَلَقَدۡ وَصَّيۡنَا ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ مِن قَبۡلِكُمۡ وَإِيَّاكُمۡ أَنِ ٱتَّقُواْ ٱللَّهَۚ]
(వాస్తవానికి మేము అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండమని, పూర్వం గ్రంథం ఇచ్చిన వారికీ మరియు మీకూ ఆజ్ఞాపించాము.)

కనుక అల్లాహ్ తో భయపడండి. ఆయనకు విధేయత చూపండి. అవిధేయత నుండి దూరంగాఉండండి.

తెలుసుకోండి! ఇస్లాంలో దైవదూతలపై విశ్వాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ఇస్లాం యొక్క విశ్వాస మూల స్తంభాలలో రెండవది. అల్లాహ్ కు మరియు ఆయన సృష్టికి, ఆయన ప్రవక్తలకు మధ్యవర్తులు వీరే. ఈ దైవదూతలు అదృశ్య సృష్టి, ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క ఆరాధనలో ఉంటారు. వారు  ఎటువంటి దైవత్వ లక్షణాలను కలిగిలేరు, అల్లాహ్ వారిని నూర్ (కాంతి)తో సృష్టించాడు

వారు అల్లాహ్ యొక్క ఆజ్ఞలకు పూర్తిగా విధేయత చూపుతారు, ఆజ్ఞలను   శిరసావహించే శక్తిని అల్లాహ్ వారికి ప్రసాదించాడు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.

[لَّا يَعۡصُونَ ٱللَّهَ مَآ أَمَرَهُمۡ وَيَفۡعَلُونَ مَا يُؤۡمَرُونَ]
(వారు అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించరు మరియు వారికిచ్చిన ఆజ్ఞలనే నెరవేరుస్తూ ఉంటారు)

మరొక చోట ఇలా సెలవిస్తున్నాడు:

[وَمَنۡ عِندَهُۥ لَا يَسۡتَكۡبِرُونَ عَنۡ عِبَادَتِهِۦ وَلَا يَسۡتَحۡسِرُونَ]
(మరియు ఆయనకు దగ్గరగా ఉన్నవారు, ఆయనను ఆరాధిస్తూ ఉన్నామని గర్వించరు మరియు (ఆయన ఆరాధనలో) అలసట కూడా చూపరు.)

అదేవిధంగా దైవ దూతలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి సంఖ్య కేవలం అల్లాహ్ కు మాత్రమే తెలుసు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.  

[وَمَا يَعۡلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَۚ وَمَا هِيَ إِلَّا ذِكۡرَىٰ لِلۡبَشَرِ]
(మరియు నీ ప్రభూవు సైన్యాలను ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు ఇదంతా మానవునికి ఒక జ్ఞాపిక మాత్రమే.)

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) మేరాజ్ లో జరిగిన సంఘటన గురించి ఇలా తెలియచేస్తున్నారు: మహాప్రవక్త (సల్లల్లాహు అలైహివసల్లం) వారిని బైతె మామూర్ వద్దకు తీసుకు వెళ్ళడం జరిగింది. ప్రవక్త గారు దాని గురించి జిబ్రాయిల్ (అలైహిస్సలాం) వారిని ప్రశ్నించగా ఆయన ఇలా తెలియ చేశారు – “దీనిని బైతె మామూర్ అంటారు. ఇందులో ప్రతిరోజూ డెబ్బై వేల మంది దైవ దూతలు నమాజ్ చదువుతారు. ఒక సారి చదివిన వారికి మళ్ళీ అవకాశం లభించదు. అదే వారి చివరి ప్రవేశం అవుతుంది“. (బుఖారి:3207- ముస్లిం:164)

[1] వారి ఉనికి పై విశ్వాసం

[2] వారిని ప్రేమించాలి, వారిని ద్వేషించే వారు మరియు వారితో శతృత్వం ఉంచేవారు ఆవిశ్వాసులు (కాఫిర్) అవుతారు.

అల్లాహ్ ఇలా అంటున్నాడు:

[لِلۡمُؤۡمِنِينَ٩٧ مَن كَانَ عَدُوّٗا لِّلَّهِ وَمَلَٰٓئِكَتِهِۦ وَرُسُلِهِۦ وَجِبۡرِيلَ وَمِيكَىٰلَ فَإِنَّ ٱللَّهَ عَدُوّٞ لِّلۡكَٰفِرِينَ]

(అల్లాహ్ కు ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీల్ కు మరియు మీకాయీల్ కు ఎవరు శత్రువులో, నిశ్చయంగా అలాంటి సత్యతిరస్కారులకు అల్లాహ్ శత్రువు.)

[3] మనకు తెలిసిన దైవదూతలను విశ్వాసించడం. ఉదా: జిబ్రాయిల్ అలైహిస్సలాం. అదేవిధంగా మనకు తెలియని దైవదూతలను కూడా సంపూర్ణంగా విశ్వసించడం.

[4] దైవదూతలు కలిగి ఉన్న సహజసిద్ద లక్షణాలపై (వారు కలిగిఉన్న పోలికపై) విశ్వాసం తేవడం. ఉదా: జిబ్రాయిల్ దైవదూత ఆయన సహజసిద్ద లక్షణాలలో ఒకదాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం తెలియచేశారు. నేను జిబ్రాయిల్ దూతను అతని అసలు రూపంలో చూశాను ఆయన ఆరు వందల రెక్కలు కలిగిఉన్నాడు. అవి ఆకాశపు అంచులను సైతం కప్పి ఉన్నాయి. (బుఖారి: 3233,3232 – ముస్లిం: 174,177 )

దైవదూతలు అల్లాహ్ ఆజ్ఞతో మానవ రూపంలోకి కూడా మారవచ్చు. ఉదా: అల్లాహ్ తఆలా జిబ్రాయిల్ అలైహిస్సలాం వారిని మర్యమ్ (అలైహస్సలాం) దగ్గరికి పంపినప్పుడు ఆయన మానవరూపం లోనే వచ్చాడు. అదేవిధంగా జిబ్రాయిల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చినప్పుడు. ప్రవక్త గారు సహాబాల సమావేశంలో కూర్చొనిఉండగా ఇంతలో ఒక వ్యక్తి సమావేశంలోకి వచ్చాడు. అతని వస్త్రాలు తెల్లవిగాను, తలవెంట్రుకలు దట్టంగా ఉండి మిక్కిలి నల్లవిగాను ఉన్నాయి. అతనిపై ప్రయాణపు అలసట, ఆనవాళ్ళు కనబడట్లేదు. పైగా మాలో ఎవరు అతన్ని ఎరుగరూ కూడ. అతనికి తెలిసిన వారు లేరు కూడ. అతను నేరుగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ఆయన మోకాళ్ళకు తన మోకాళ్ళు ఆనించి, చేతులు తొడలపై పెట్టుకుని సవినయంగా (మర్యాదస్థితిలో కూర్చున్నాడు. ఇస్లాం, ఇహ్సాన్, ఖియామత్ మరియు దాని సూచనల గురించి ప్రశ్నించాడు. ప్రవక్త గారు వాటన్నిటికీ సమాధానం ఇచ్చారు. ఆ తరువాత అతను వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి గురించి సహాబాలు ప్రశ్నించగా  అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం “ఆయన ‘జిబ్రయీల్’ (దైవదూత). ఆయన మీ వద్దకు ధార్మిక విద్యను నేర్పటానికి వచ్చారు” అని వివరించారు. (ముస్లిం-9).

మరియు అదేవిధంగా ఇబ్రహీం మరియు లూత్ ప్రవక్తల వద్దకు వచ్చిన దైవదూతలు కూడా మానవ రూపంలోనే వచ్చారు. (షరహ్ సలాసతు ఉసూల్)

దైవదూతల నాయకుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం దైవదూతల్లో కెల్లా గొప్పవాడు  అల్లాహ్ తఆలా ఆయన గుణాలను తెలియచేస్తూ ఇలా అంటున్నాడు .

[إِنَّهُۥ لَقَوۡلُ رَسُولٖ كَرِيمٖ١٩ ذِي قُوَّةٍ عِندَ ذِي ٱلۡعَرۡشِ مَكِينٖ]
(నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన వాక్కు! అతను (జిబ్రీల్) మహా బలశాలి, సింహాసన (అర్ష్) అధిపతి సన్నిధిలో ఉన్నత స్థానం గలవాడు!)

మరొక చోట అల్లాహ్ ఇలా అంటున్నాడు.

[مُّطَاعٖ ثَمَّ أَمِينٖ]
(అతని ఆజ్ఞలు పాటింపబడతాయి మరియు (అతను) విశ్వసనీయుడు)  

మరోకచోట ప్రవక్త గారి ప్రస్తావనతో జిబ్రాయీల్ దూత ప్రస్థావనను చేస్తూ ఆయన ఎంత గొప్పవాడో తెలియ చేయడం జరిగినది.

[ عَلَّمَهُۥ شَدِيدُ ٱلۡقُوَىٰ٥ ذُو مِرَّةٖ فَٱسۡتَوَىٰ]

(అసాధారణ శక్తిగల దైవదూత (జిబ్రాయీల్) అతనికి ఖుర్ఆన్ నేర్పాడు. అతడు గొప్ప శక్తి సంపన్నుడు. మరి అతను తిన్నగా నిలబడ్డాడు)

అంటే ప్రవక్త వారికి వహీ నేర్పించినది జిబ్రయీల్ అలైహిస్సలాం వారు. ఆయన అల్లాహ్ యొక్క ఆజ్ఞా పాలన చేస్తారు. ప్రవక్తలకు వహీ అందచేస్తారు. ఆ వహీ గురించి షైతానులకు తెలియకుండా కాపాడుతాడు. ఇది అల్లాహ్ వైపునుంచే ఆ వహీ ని శక్తి సంపన్నుడు అయిన దూత ద్వారా పంపాడు.

అల్లాహ్ అంటున్నాడు [ذُو مِرَّةٖ] అంటే అంతర్గతంగా, బహిర్గతంగా  ఏర్పడే ఆపద నుండి రక్షించే శక్తి ఆయనకు ప్రసాదించబడింది. అనగా ఆయన అంత గొప్పగా సృష్టించబడ్డాడు.     

[5] దైవదూతల యొక్క ఏ సుగుణాల గురిచి మనకు తెలుసో వాటిపై విశ్వాసముంచాలి. ఉదా: సిగ్గు , బిడియం దీనికి ఆధారంగా ప్రవక్త గారి హదీస్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) గారి గురించి అనడం జరిగినది “ఏమిటి నేను దైవ దూతలు సైతం సిగ్గు పడేటు వంటి వ్యక్తి తో నేను సిగ్గు పడకూడదా” (ముస్లిం 2401)   

అల్లాహ్ వేటినైతే ద్వేషిస్తాడో దైవ దూతలు కూడా వాటిని ద్వేషిస్తారు. అందకే వారు కుక్క మరియు చిత్ర పటాలు ఉన్న గృహం లోకి ప్రవేశించరు. ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం వారు ఇలా తెలియ చేస్తున్నారు : “దైవ దూతలు ఆ ఇంట్లోకి ప్రవేశించరు, ఏ ఇంట్లోనైతే కుక్క ఉంటుందో మరియు అందులోకి ప్రవేశించరు మరియు ఎందులోనైతే ప్రాణ జీవుల పటాలు ఉంటాయో“. (బుఖారి 3235- ముస్లిం 2106)

ఏ విషయాల నుండి అయితే మనిషికి ఇబ్బంది కలుగుతుందో ఆ విషయాల నుండి దైవదూతలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉల్లి మరియు వెల్లుల్లి లాంటి దుర్వాసన వచ్చే పదార్థాలు తిన్న వ్యక్తిని మస్జిద్ కి రావడం నుండి వారించారు. మరియు దుర్వాసన కలిగినటువంటి ప్రతి వస్తువు కూడా ఈ ఆజ్ఞ పరిధిలోకి వస్తుంది ఉదా: సిగరెట్

మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు – “ఎవరైతే ఉల్లి మరియు వెల్లుల్లి తిన్నారో వారు మా మస్జిద్ దగ్గరకు రావద్దు. ఎందుకంటే దైవదూతలకు ఆ విషయాల నుండి ఇబ్బంది కలుగుతుంది, ఏ విషయాల నుండి అయితే ఆదం సంతతికి ఇబ్బంది అవుతుందో“. (ముస్లిం 564)

[6] సర్వ శక్తిమంతుడైన అల్లాహ్ ఆజ్ఞకు అనుగుణంగా వారు ప్రతి సాధారణమైన పనిని మరియు ప్రత్యేకమైన పనిని చేస్తారు. సాధారణమైన పని అనగా ఉదాహరణకు అల్లాహ్ యొక్క పరిశుద్ధతను కొనియాడటం మరియు ఎటువంటి అలసట లేకుండా ఉదయం సాయంత్రం ఆయనను ఆరాధించుటం. అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు.

[فَٱلتَّٰلِيَٰتِ ذِكۡرًا ]
(మరి అల్లాహ్ ఉపదేశాన్ని పఠించే వారితోడు)

అందులో కొంతమంది దైవదూతలకు కొన్ని ప్రత్యేక పనులు అప్పగించబడ్డాయి. ఉదాహరణకి జిబ్రయీల్ దూత వహీ ని ప్రవక్తల వరకు చేరవేస్తారు. మరియు ఇతర దైవదూతలు కూడా ఈ వహీని అందజేసే పని కూడా చేసి ఉండవచ్చు.  అల్లాహ్ఈ విధంగా అంటున్నాడు.

[فَٱلۡمُلۡقِيَٰتِ ذِكۡرًا٥ عُذۡرًا أَوۡ نُذۡرًا٦ ]
(జ్ఞాపికను తీసుకువచ్చే దూతల సాక్షిగా ! సాకులు లేకుండా చేయడానికి హెచ్చరించడానికి )

ఆ దైవదూతలు ప్రవక్తల పై అల్లాహ్ యొక్క వహీని తీసుకొస్తారు.

ఒక ఉదాహరణ: మీకాయిల్ అలైహిస్సలాం వారికి వర్షం కురిపించే బాధ్యత అప్పగించడం జరిగింది. మరియు అదే విధంగా శంఖం పూరించే దైవ దూత కూడా నియమించబడి ఉన్నాడు ఆయన పేరు ఇస్రాఫీల్. శంఖం పూరించడం అనగా హదీసులో వస్తుంది – శంఖం ఎప్పుడైతే పూరించబడుతుందో ఆరోజున ప్రళయం సంభవిస్తుంది మరియు ప్రజలందరూ సమాధుల నుండి లేచి నిల్చుంటారు

ఈ ముగ్గురు దైవదూతలు గొప్పవారు మరియు వారికి ప్రసాదించబడిన కార్యాలు కూడా గొప్పవే. జీవితానికి సంబంధించినవి  జిబ్రాయిల్ దూతకు వహీ అందజేసే బాధ్యత, అది హృదయ జీవితానికి సంబంధించింది. మీకాయిల్ దూతకు వర్షం కురిపించే బాధ్యత, అది భూజీవితానికి సంబంధించినది. మరియు ఇస్రాఫీల్ దూతకు శంఖం పూరించే బాధ్యత అనగా అప్పుడు మృతదేహాలకు మళ్లీ తిరిగి జీవితం ప్రసాదించబడుతుంది

మరొక దైవదూత పేరు మలకుల్ మౌత్. ఆయనకు ప్రాణం తీసే బాధ్యత అప్పగించడం జరిగింది. అల్లాహ్  ఈ విధంగా అంటున్నాడు.

 [۞قُلۡ يَتَوَفَّىٰكُم مَّلَكُ ٱلۡمَوۡتِ ٱلَّذِي وُكِّلَ بِكُمۡ ثُمَّ إِلَىٰ رَبِّكُمۡ تُرۡجَعُونَ]
(వారితో ఇలా అను: “మీపై నియమించబడిన మృత్యుదూత మీ ప్రాణం తీస్తాడు. ఆ తరువాత మీరు మీ ప్రభువు వద్దకు మరలింపబడతారు.”)

ఈ మలకుల్ మౌత్ దూతను ఇజ్రాయిల్ అని అందరూ పిలుస్తారు. కానీ ఖుర్ఆన్ మరియు హదీసుల ద్వారా మనకు ఆధారం లభించదు. కనుక మనం కేవలం ఖుర్ఆన్ లో ఉన్నట్లుగా మలకుల్ మౌత్ అని మాత్రమే పిలవాలి. మరియు ఈ మలకుల్ మౌత్ దూతకు సహాయపడే దైవదూతలు కూడా ఉన్నారు. అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు.  

[وَهُوَ ٱلۡقَاهِرُ فَوۡقَ عِبَادِهِۦۖ وَيُرۡسِلُ عَلَيۡكُمۡ حَفَظَةً حَتَّىٰٓ إِذَا جَآءَ أَحَدَكُمُ ٱلۡمَوۡتُ تَوَفَّتۡهُ رُسُلُنَا وَهُمۡ لَا يُفَرِّطُونَ ]

(ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు. మరియు ఆయన మీపై కనిపెట్టుకొని ఉండే వారిని పంపుతాడు. చివరకు మీలో ఒకరికి చావు సమయం వచ్చినపుడు, మేము పంపిన దూతలు అతనిని మరణింపజేస్తారు మరియు వారెప్పుడూ అశ్రద్ధ చూపరు)

ఈ వాక్యంలో ఉన్న (رُسُلُنَا) అనే పదానికి అర్థం దైవదూతలు అని. మరియు ఈ దైవదూతలే మలకులు మౌత్ దూతకు సహాయపడతారు. అల్లాహ్  యొక్క ఆజ్ఞలో (لَا يُفَرِّطُونَ) ఈ పదం యొక్క అర్థం ఏమిటంటే వారికి ప్రసాదించబడినటువంటి బాధ్యతలో వారు ఎలాంటి అశ్రద్ద వహించరు .

అదేవిధంగా కొంతమంది దైవదూతలు ఈ భూమిపై సంచరిస్తూ ఉంటారు. వారు అల్లాహ్ స్మరణ చేసేటువంటి సభలను మరియు జ్ఞానం నేర్చుకునేటువంటి సభలను వెతుకుతూ ఉంటారు. వాటిలో నుండి ఏదైనా సభ వారికి కనపడితే వారు ఒకరినొకరు పిలుచుకొని ఆ సభలలో కూర్చుని ఆ సభను ఈ ప్రపంచ ఆకాశం వరకు తమ రెక్కలతో కప్పి ఉంచుతారు.

అదేవిధంగా దైవదూతలలో మరికొంతమంది మానవుల కర్మలను భద్రపరచడానికి, వాటిని లిఖించి ఉంచడానికి నియమించబడి ఉన్నారు. ప్రతి వ్యక్తితో పాటు ఇద్దరు దైవదూతలు ఉంటారు, ఒకరు అతని కుడివైపున మరొకరు అతని ఎడమవైపున ఉంటారు. అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు .

[إِذۡ يَتَلَقَّى ٱلۡمُتَلَقِّيَانِ عَنِ ٱلۡيَمِينِ وَعَنِ ٱلشِّمَالِ قَعِيدٞ١٧ مَّا يَلۡفِظُ مِن قَوۡلٍ إِلَّا لَدَيۡهِ رَقِيبٌ عَتِيدٞ]

((జ్ఞాపకముంచుకోండి) అతని కుడి మరియు ఎడమ ప్రక్కలలో కూర్చుండి (ప్రతి విషయాన్ని వ్రాసే) ఇద్దరు పర్యవేక్షకులు (దేవదూతలు) అతనిని కలుసుకొన్న తరువాత నుంచి – అతనితో బాటు ఒక పర్యవేక్షకుడైనా సిద్ధంగా లేనిదే – అతడు ఏ మాటనూ పలకలేడు.)

మరొకచోట ఇలా తెలియజేస్తున్నాడు .

[وَإِنَّ عَلَيۡكُمۡ لَحَٰفِظِينَ١٠ كِرَامٗا كَٰتِبِينَ١١ يَعۡلَمُونَ مَا تَفۡعَلُون]
(నిశ్చయంగా మీపై పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు (వారు మీ ఖర్మలను నమోదు చేసే ) గౌరవ నీయులైన లేఖకులు మీరు చేసేదంతా వారికి తెలుసు సుమా !)

అదేవిధంగా సమాధిలో మనిషిని ప్రశ్నించడానికి కొంతమంది దైవదూతలు నియమించబడి ఉన్నారు. ఎప్పుడైతే మనిషిని సమాధిలో పెట్టడం జరుగుతుందో అప్పుడు వారు వచ్చి మీ ప్రభువు ఎవరు మీ ప్రవక్త ఎవరు మీ ధర్మం ఏది అని ప్రశ్నిస్తారు. (బుఖారి 1374)

మరి కొంతమంది దైవదూతలు స్వర్గవాసుల సేవ కొరకు నియమించబడి ఉన్నారు. అల్లాహ్  స్వర్గవాసుల గురించి తెలియజేస్తూ ఈ విధంగా అన్నాడు

[وَٱلۡمَلَٰٓئِكَةُ يَدۡخُلُونَ عَلَيۡهِم مِّن كُلِّ بَابٖ٢٣ سَلَٰمٌ عَلَيۡكُم بِمَا صَبَرۡتُمۡۚ فَنِعۡمَ عُقۡبَى ٱلدَّارِ٢٤]
(మరియు ప్రతి ద్వారం నుండి దేవదూతలు వారి (స్వాగతం) కొరకు వస్తారు. (దేవదూతలు అంటారు): “మీ సహనానికి, ఫలితంగా ఇప్పుడు మీకు శాంతి కలుగు గాక(సలాం)! ఇక ఈ అంతిమ (పరలోక) గృహం ఎంతో సౌఖ్యదాయకమైనది!”)

మరికొందరు దైవదూతలు నరకం పై నియమించబడి ఉన్నారు. వారి యొక్క నాయకుడి పేరు మాలిక్. అతను నరక పాలకుడు. అల్లాహ్ నరకవాసుల ప్రాధేయతను గురించి ప్రస్తావిస్తున్నాడు.

[وَنَادَوۡاْ يَٰمَٰلِكُ لِيَقۡضِ عَلَيۡنَا رَبُّكَۖ قَالَ إِنَّكُم مَّٰكِثُونَ٧٧ وَنَادَوۡاْ يَٰمَٰلِكُ لِيَقۡضِ عَلَيۡنَا رَبُّكَۖ قَالَ إِنَّكُم مَّٰكِثُونَ٧٧ ]
(మరియు వారిలా మొరపెట్టుకుంటారు: “ఓ నరక పాలకుడా (మాలిక్)! నీ ప్రభువును మమ్మల్ని అంతం చేయమను.” అతను అంటాడు: “నిశ్చయంగా మీరిక్కడే (ఇదే విధంగా) పడి ఉంటారు.”)

మరికొందరు దైవదూతలు పర్వతాలపై నియమితులై ఉన్నారు. తాయిఫ్ వారు మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని బాధించినప్పుడు దేవదూత వచ్చి ప్రవక్తతో ఇలా అన్నారు. “ఒకవేళ మీరే గనుక కోరుకుంటే మేము ఈ మక్కా నగరానికి ఇరువైపులా ఉన్న పర్వతాలను కలిపివేస్తాము”. అప్పుడు మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: “వద్దు నాకు నమ్మకం ఉంది అల్లాహ్ వీరి సంతతి నుండి తప్పకుండా ఆయన్ని మాత్రమే ఆరాధించి ఆయనకు ఎవరిని సాటి కల్పించనటువంటి వారిని పుట్టిస్తాడు“.(బుఖారి 3231 – ముస్లిం 1795)

మరి కొంతమంది దైవదూతలు మేఘాల కొరకు నియమితులై ఉన్నారు. వారు అల్లాహ్ యొక్క ఆజ్ఞ మేరకు మేఘాలను ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి నడిపిస్తారు. అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు

[فَٱلزَّٰجِرَٰتِ زَجۡرٗا٢]
(మేఘాలను నడిపించే వారి (దైవదూతల) సాక్షిగా!)

దైవదూతలు విశ్వాసులను ప్రేమిస్తారు. వారి కొరకు దువా చేస్తారు మరియు ఇస్తగ్ ఫార్ చేస్తారు. అల్లాహ్ ఆర్ష్ వద్ద నియమితులైన దైవదూతల గురించి తెలియజేస్తూ ఇలా అంటున్నాడు.

 [ٱلَّذِينَ يَحۡمِلُونَ ٱلۡعَرۡشَ وَمَنۡ حَوۡلَهُۥ يُسَبِّحُونَ بِحَمۡدِ رَبِّهِمۡ وَيُؤۡمِنُونَ بِهِۦ وَيَسۡتَغۡفِرُونَ لِلَّذِينَ ءَامَنُواْۖ رَبَّنَا وَسِعۡتَ كُلَّ شَيۡءٖ رَّحۡمَةٗ وَعِلۡمٗا فَٱغۡفِرۡ لِلَّذِينَ تَابُواْ وَٱتَّبَعُواْ سَبِيلَكَ وَقِهِمۡ عَذَابَ ٱلۡجَحِيمِ٧ رَبَّنَا وَأَدۡخِلۡهُمۡ جَنَّٰتِ عَدۡنٍ ٱلَّتِي وَعَدتَّهُمۡ وَمَن صَلَحَ مِنۡ ءَابَآئِهِمۡ وَأَزۡوَٰجِهِمۡ وَذُرِّيَّٰتِهِمۡۚ إِنَّكَ أَنتَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ٨ وَقِهِمُ ٱلسَّيِّ‍َٔاتِۚ وَمَن تَقِ ٱلسَّيِّ‍َٔاتِ يَوۡمَئِذٖ فَقَدۡ رَحِمۡتَهُۥۚ وَذَٰلِكَ هُوَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ]

(సింహాసనాన్ని (అర్ష్ ను) మోసేవారు మరియు దాని చుట్టూ ఉండేవారు (దైవదూతలు), తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ ఉంటారు. మరియు ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటారు. మరియు విశ్వసించిన వారి కొరకు క్షమాభిక్ష కోరుతూ: “ఓ మా ప్రభూ! నీవు నీ కారుణ్యం మరియు నీ జ్ఞానంతో ప్రతి దానిని ఆవరించి ఉన్నావు. కావున పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలి, నీ మార్గాన్ని అనుసరించే వారిని క్షమించు; మరియు వారిని భగభగమండే నరకాగ్ని శిక్ష నుండి కాపాడు!” ఓ మా ప్రభూ! ఇంకా వారిని, నీవు వాగ్దానం చేసిన, కలకాలముండే స్వర్గవనాలలో ప్రవేశింపజేయి మరియు వారి తండ్రులలో వారి సహవాసులలో (అజ్వాజ్ లలో) మరియు వారి సంతానంలో, సద్వర్తనులైన వారిని కూడా! నిశ్చయంగా నీవే సర్వశక్తిమంతుడవు, మహా వివేకవంతుడవు. మరియు వారిని దుష్కార్యాల నుండి కాపాడు. మరియు ఆ రోజు నీవు ఎవడినైతే దుష్కార్యాల నుండి కాపాడుతావో! వాస్తవంగా వాడిని నీవు కరుణించినట్లే! మరియు అదే ఆ గొప్ప సాఫల్యం (విజయం).)

మరియు దైవదూతలు ఆ వ్యక్తి పాప క్షమాపణ గురించి దువా చేస్తారు, ఏ వ్యక్తి అయితే మస్జిద్ లో ఒక నమాజ్ ముగించుకొని మరో నమాజ్ కొరకు వేచి చూస్తాడో. దైవ దూతలు ఇలా అంటారు – “ఓ అల్లాహ్ అతనిని క్షమించు. ఓ అల్లాహ్ అతనిని కరుణించు“. (అబూ దావూద్ 469- తిర్మీజీ 330 – నసాయి 733)

మరియు దైవదూతలు ఆ వ్యక్తి గురించి కూడా క్షమాపణ మరియు కారుణ్యం గురించి దుఆ చేస్తారు, ఏ వ్యక్తి అయితే మస్జిద్  లో మొదటి సఫ్ (పంక్తి ) లో నమాజ్ ఆచరిస్తాడో. (అబూ దావూద్ 674- నసాయి 646-ఇబ్నె మాజ 997 )

మరియు దైవదూతలు వారి గురించి కూడా దుఆ చేస్తారు ఎవరైతే ప్రజలకు మంచి గురించి ఆదేశిస్తారో. అబూ ఉమామ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఇలా తెలియజేశారు – “అల్లాహ్ మరియు ఆయన దైవదూతలు ఆకాశంలోని వారు భూమిపై వారు చివరికి పుట్టలలో ఉండే  చీమలు సైతం నీటిలో ఉండే చేపల సైతం ఆ వ్యక్తి శుభాల మేళ్ల గురించి దుఆ చేస్తారు, ఏ వ్యక్తి అయితే మంచిని బోధిస్తాడో” .(తిర్మీజీ 2685)

మరియు దైవదూతలు ఆ వ్యక్తిపై శాపాన్ని పంపుతారు, ఏ వ్యక్తి అయితే తన తోటి ముస్లిం సోదరులకు ఏదైనా ఇనుప వస్తువును లేక ఏదైనా పదునైన  ఆయుధం చూపిస్తాడో.. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం వారు ఇలా తెలియజేశారు: “ఎవరైతే తనతోటి సోదరులకు ఆయుధం లేక ఏదైనా పదునైన వస్తువును సూచించి చూపిస్తాడో, అతను ఒకే తల్లి తండ్రి పుట్టిన సోదరుడైన సరే, దైవదూతలు ఆ వస్తువుని విడిచి పెట్టే వరకు అతనిపై  శాపాన్ని పంపుతారు“. (ముస్లిం 2616)

దైవదూతలు ఫజ్ర్ నమాజులో విశ్వాసులతోపాటు హాజరవుతారు.

[وَقُرۡءَانَ ٱلۡفَجۡرِۖ إِنَّ قُرۡءَانَ ٱلۡفَجۡرِ كَانَ مَشۡهُودٗا٧٨]
(మరియు ప్రాతఃకాలంలో (నమాజ్ లో) ఖుర్ఆన్ పఠించు. నిశ్చయంగా ప్రాతఃకాల ఖుర్ఆన్ పఠనం (దేవదూతల ద్వారా) వీక్షింప బడుతుంది)

ఫజ్ర్ లో ఖురాన్ చదవడం అనగా ఫజ్ర్ నమాజులో ఇతర నమాజుల కంటే ఎక్కువగా ఖురాన్ పారాయణం జరుగుతుంది. ఈ నమాజులో చేసేటువంటి ఖురాన్ పారాయణకు ప్రాధాన్యత కూడా ఉంది, ఎందుకంటే ఆ సమయంలో రాత్రి మరియు పగటికి సంబంధించిన దేవదూతలు హాజరవుతారు.( తఫ్సీర్ సాది)

వీటి ద్వారా అర్థమయ్యే విషయం ఏమిటంటే దైవ దూతలు అల్లాహ్ తఆలా ఏ  ఆదేశాలనైతే వారికి ఇచ్చాడో వారు ఆ ఆదేశాల ప్రకారం తప్పక వారి యొక్క బాధ్యతను నెరవేరుస్తూ ఉంటారు. అందుకే అల్లాహ్  దేవదూతలను సందేశం అందజేసే వారిగా పేర్కొన్నాడు. అల్లాహ్ తఆల  సెలవిస్తున్నాడు.

[ٱلۡحَمۡدُ لِلَّهِ فَاطِرِ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ جَاعِلِ ٱلۡمَلَٰٓئِكَةِ رُسُلًا أُوْلِيٓ أَجۡنِحَةٖ]

(సర్వ స్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆకాశాలు ,మరియు భూమి యొక్క సృష్టికి మూలాధారి. ఆయనే దైవదూతలను సందేశాన్ని అందచేసే వారిగా నియమించాడు. )

అనగా దైవదూతలను వహీ కొరకు మరియు ప్రాణం తీయడం కొరకు, మేఘాలను చేరవేయడం కొరకు మరియు ఆదం సంతతి యొక్క కర్మలు లిఖించడం కొరకు నియమించడం జరిగింది.

ఇబ్నె తైమియా (రహిమహుల్లాహ్) ఈ విధంగా తెలియజేస్తున్నారు: దైవదూతల విషయం చాలాగొప్పది. వారు అల్లాహ్ యొక్క ఆదేశాలను, వ్యవహారాలను  నిర్వర్తించడానికి  పంపించబడినటువంటివారు. అల్లాహ్  ఇలా అంటున్నాడు.  

[فَٱلۡمُدَبِّرَٰتِ أَمۡرٗا]
(మరియు తన ప్రభువు అజ్ఞానుసారం వ్యవహారాలు నిర్వహించే దేవదూతల సాక్షిగా)

మరోచోట ఇలా ఉంది

[فَٱلۡمُقَسِّمَٰتِ أَمۡرًا]
(మరియు అల్లాహ్ ఆజ్ఞ తో (అనుగ్రహాలను)పంచి పెట్టె దేవదూతల సాక్షిగా)

అల్లాహ్ తఆలా తన గ్రంథాలలో దైవదూతల యొక్క ప్రస్తావన అనేకమార్లు చేశాడు. వారి గురించి అనేక విషయాలు తెలియజేశారు అంటే దీని ద్వారా వారి యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది.

మరియు దైవదూతల యొక్క మరో గొప్పదనం ఏమిటంటే అల్లాహ్ తఆలా వారి యొక్క సాక్ష్యం ఇస్తున్నాడు

[فَٱلۡمُدَبِّرَٰتِ أَمۡرٗا]
(మరియు తన ప్రభువు అజ్ఞానుసారం వ్యవహారాలు నిర్వహించే దేవదూతల సాక్షిగా )

దైవదూతలలో కొంతమంది ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క ఆరాధనలో నిమగ్నమై ఉంటారు. మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు: “నిశ్చయంగా ఆకాశం నిండిపోయి ఉంది. అందులో నాలుగు వేళ్ళు పట్టే స్థలం కూడా ఖాళీ లేదు. అయినప్పటికీ సాష్టాంగ పడే దైవదూతలు సాష్టాంగ పడుతూనే ఉన్నారు. ఆకాశం అంత విశాలంగా ఉన్నప్పటికీ దైవదూతల ఆరాధన కొరకు ఇరుకైపోయింది. అల్లాహ్ పరిశుద్దుడు, చాలా గొప్పవాడు“. (తిర్మీజీ 2312 – అహ్మద్ 173/5 – ఇబ్నె మాజా 4190.)

దైవదూతలపై విశ్వాసం యొక్క ప్రాథమిక విషయాలను మీ ముందు ఉంచడం జరిగింది. అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షీంప చేయుగాక ,ఆయన వివేకం తో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక ,అల్లాహ్ మనందరిని క్షమించుగాక,మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి నిశ్చయంగా ఆయన (తౌబా) పాశ్చయాత్తాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.   

స్తోత్రం మరియు దరూద్ తరువాత

తెలుసుకోండి, అల్లాహ్ మీపై కరుణించు గాక! దైవదూతలపై విశ్వాసం ఉంచడం వలన గొప్ప లాభాలు ఉన్నాయి.

1. అల్లాహ్ యొక్క గొప్పదనం, మహిమ మరియు ఆయన యొక్క ఆధిపత్యం గురించి తెలుస్తుంది. ఆయన సృష్టించినటువంటి సృష్టి ఇంత గొప్పగా ఉంటే మరి ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఎంత గొప్పవాడో  అన్నది మనకు అర్థమవుతుంది.

2. ఆదం సంతానం పట్ల అల్లాహ్ చూపినటువంటి అనుగ్రహం మరియు దయ మూలంగా అల్లాహ్ కు కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన దైవదూతలలో కొందరిని వారి రక్షణ కొరకు, వారి కర్మలను లిఖించడానికి మరియు వారి ఇతర ప్రయోజనాల కొరకు నియమించి ఉంచాడు.

3. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు వారు చేసినటువంటి ఆరాధన కొరకు వారిని ప్రేమించుట.

కనుక మీరు తెలుసుకోండి, అల్లాహ్ మీపై కరుణించుగాక! పుణ్యాత్ములైనటువంటి ఆదం సంతానము దైవదూతల కంటే గొప్పవారు. ఇది అహ్లుస్సున్నహ్ వల్ జమాఅ వారి వాక్యం. ఎందుకంటే ఆదం సంతతిలో సహజ సిద్ధమైన కామ క్రోధములు పెట్టడం జరిగింది. అందువలన అతనిలో ప్రతిఘటించేటువంటి శక్తి, అణచివేసే శక్తి ఉంటుంది. అతని యొక్క మనసు చెడు వైపునకు ప్రేరేపిస్తుంది. అతని రక్తంలో షైతాన్ ప్రవహిస్తుంటాడు, అయినప్పటికీ అతను నిగ్రహంగా ఉంటూ అల్లాహ్ ఆరాధన చేస్తాడు. దీనికి వ్యతిరేకంగా దైవదూతలకు ఇవేమీ ఉండవు మరియు షైతాన్ వారిని తప్పుదారి కూడా పట్టించలేడు. అందుకే ఆదం సంతానానికి  దైవదూతలు కంటే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

తెలుసుకోండి, షాబాన్ మాసం లో ఉపవాసాలు ఉండటం అభిలషణీయమైన ఆచరణ. ఆయేషా (రదియల్లాహు అన్హా) తెలియచేస్తున్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు షాబాన్ మాసంలో నఫీల్ ఉపవాసాలు ఎంత ఎక్కువగా పాటించేవారు అంటే ఇక ప్రవక్త ఉపవాసం వదిలిపెట్టరేమో అన్నంత భయం ఉండేది. మరియు నేను మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూశాను రమజాన్ పూర్తి ఉపవాసాల తర్వాత షాబాన్ మాసం లో ఉపవాసాలు పాఠించినంత మరే మాసంలో పాటించలేదు” (అహ్మద్ 201/5)

ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి, అల్లాహ్ మీపై కరుణించుగాక! అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కారానికై  అజ్ఞాపించి ఉన్నాడాని మీరు గుర్తుపెట్టుకోండి, అల్లాహ్ ఇలా అన్నాడు:

 [إِنَّ ٱللَّهَ وَمَلَٰٓئِكَتَهُۥ يُصَلُّونَ عَلَى ٱلنَّبِىِّۚ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ صَلُّوا۟ عَلَيْهِ وَسَلِّمُوا۟ تَسْلِيمًا] 
(నిశ్చయంగా అల్లాహ్‌, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.)

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై నీ కారుణ్యాన్ని అవతరింప చేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు.

ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లిం లకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు. ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రత ను ప్రసాదించు. మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారీగా చేయి ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని, పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు. నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు . ఆమీన్

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

దేవదూతలు (మెయిన్ పేజీ):
https://teluguislam.net/angels/

మరణం మరియు సమాధి శిక్షల వివరాలు, సందేహ సమాధానాలు [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణం మరియు సమాధి శిక్షల వివరాలు, సందేహ సమాధానాలు
https://www.youtube.com/watch?v=_HrW7uu-pc4 [14 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం మరణం మరియు సమాధి జీవితం (బర్ జఖ్) గురించిన వివిధ ప్రశ్నలకు సమాధానమిస్తుంది. మరణ దూత (మలకుల్ మౌత్) అందరికీ ఒకరేనని, వేర్వేరు మతాల వారికి వేర్వేరు దూతలు ఉండరని స్పష్టం చేస్తుంది. విశ్వాసులు మరియు అవిశ్వాసుల మరణ అనుభవాలలో తేడా ఉంటుందని సహీ హదీసుల ఆధారంగా వివరిస్తుంది. విశ్వాసి ఆత్మ శాంతియుతంగా తీయబడి, స్వర్గపు సువాసనలతో స్వీకరించబడి, ఆకాశాలలో గౌరవించబడుతుంది. దీనికి విరుద్ధంగా, అవిశ్వాసి ఆత్మ కఠినంగా తీయబడి, నరకపు దుర్వాసనలతో అవమానించబడుతుంది. సమాధిలో పెట్టడం అనేది సాధారణ పద్ధతి అయినప్పటికీ, దహనం చేయబడిన లేదా ఏ విధంగానైనా శరీరం నాశనమైనప్పటికీ, ఆత్మకు శిక్ష లేదా బహుమానం తప్పదని ఖురాన్ మరియు హదీసుల ద్వారా వివరిస్తుంది. ఈ మధ్య కాలాన్ని “బర్ జఖ్” అని అంటారు. చివరగా, సమాధిలో జరిగే ముగ్గురు దేవదూతల ప్రశ్నలు (నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? నీ ప్రవక్త ఎవరు?) మరియు వాటికి విశ్వాసులు, అవిశ్వాసులు ఇచ్చే సమాధానాలను చర్చిస్తుంది.

أَسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ
(అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బ’అద్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు. మరియు ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారి కుటుంబ సభ్యులు మరియు సహచరులందరిపై శాంతి మరియు శుభాలు కురియుగాక. ఇక ఆ తర్వాత.

చావు మరియు సమాధి శిక్షణ గురించి ఒక ప్రశ్న వచ్చింది. వాస్తవానికి ఆ ప్రశ్నలో ఎన్నో ఇంకా లింక్ ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానంగా ఈ ఆడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. శ్రద్ధగా వింటారని, విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.

మొదటి విషయం ఏమిటంటే, సామాన్యంగా చావు దూత అని, మలకుల్ మౌత్ అని, మౌత్ కా ఫరిష్తా అని, లేదా యమదూత అని ఏదైతే అంటారో, హిందువులకు వేరు, ముస్లింలకు వేరు, క్రైస్తవులకు వేరు, వేరే ఇంకా మతాలు అవలంబించే వారికి వేరు, అలాగా ఏమీ లేరు. ఇలాంటి భ్రమలో నుండి మనం బయటికి రావాలి. వాస్తవానికి, ప్రాణం తీసే దూత మరియు ఆయనకు తోడుగా వచ్చే అటువంటి దూతలు, ఆ తోడుగా వచ్చే దూతల యొక్క సంఖ్య అల్లాహ్ కు మాత్రమే తెలుసు. అయితే, ఇక్కడ మనకు ఖురాన్ హదీస్ ద్వారా తెలుస్తున్న విషయం ఏంటంటే, విశ్వాసులు, పుణ్యాత్ములు వీరికి వీరి యొక్క ప్రాణం ఒక రకంగా తీయడం జరుగుతుంది మరియు ఎవరైతే అవిశ్వాసులు లేదా విశ్వాసులుగా ఉండి కలిమా చదివి కూడా మహా పాపాత్ములు ఉంటారో వారి యొక్క ప్రాణం మరో రకంగా తీయడం జరుగుతుంది అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఖురాన్ యొక్క ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఏదైనా వేరే సందర్భంలో ఆ ఆయతులు, ఆ వాటి యొక్క అర్థం భావం అనేది ఇన్ షా అల్లాహ్ రికార్డ్ చేసి పంపుదాము. కానీ సంక్షిప్తంగా ప్రస్తుతం ఏంటంటే, సహీ హదీస్లో వచ్చిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు.

విశ్వాసుడు, పుణ్యాత్ముడు అతని ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు, ప్రాణం తీసే దూత, ఆయన కూడా దైవదూతనే, ప్రాణం తీసే దూత వస్తాడు మరియు స్వర్గం నుండి కరుణ దూతలు కూడా హాజరవుతారు. స్వర్గం నుండి వారు సువాసనతో కూడి ఉన్నటువంటి వస్త్రాలు తీసుకొని వస్తారు. ఆ తర్వాత అతని దగ్గర కూర్చుండి, ప్రభువు యొక్క కారుణ్యం వైపునకు, అల్లాహ్ యొక్క సంతృష్టి వైపునకు వచ్చేసెయ్ ఓ పవిత్ర ఆత్మా, ఈ రోజు నీపై నీ ప్రభువు ఏమీ కోపగించుకోకుండా నీ పట్ల సంతృప్తి కలిగి ఉన్నాడు అన్నటువంటి శుభవార్తలు వినిపిస్తూ ఉంటారు. దీని సంక్షిప్త విషయం ఖురాన్ సూరే హామీమ్ అస్సజ్దాలో కూడా వచ్చి ఉంది.

وَأَبْشِرُوا بِالْجَنَّةِ الَّتِي كُنتُمْ تُوعَدُونَ
(వ అబ్షిరూ బిల్ జన్నతిల్లతీ కున్తుం తూ’అదూన్)
“మీకు వాగ్దానం చేయబడిన స్వర్గం ఇదేనని సంతోషించండి.” (41:30)

ఇక ప్రాణం తీసే దూత ఎంతో సునాయాసంగా, నిదానంగా మంచి విధంగా అతని యొక్క ప్రాణం తీస్తాడు. ఆ మనిషి యొక్క ఆత్మ కూడా మంచి విధంగా ఆ ప్రాణం తీసే దూత యొక్క చేతుల్లోకి వచ్చేస్తుంది. దానికి కూడా హదీసుల్లో కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ దైవదూతలు వెంటనే ఆ సువాసనలతో కూడి ఉన్నటువంటి స్వర్గపు వస్త్రాలలో ఆ ఆత్మను చుట్టుకొని ఆకాశం పైకి వెళ్తారు. మొదటి ఆకాశం ద్వారాలు మూయబడి ఉంటాయి. అయితే అక్కడ తీసుకుపోయే దూతలు పర్మిషన్ కోరుతారు. ఆకాశపు యొక్క ఆ దూతలు అడుగుతారు, ఈ మంచి ఆత్మ ఎవరిది మీరు తీసుకొని వస్తున్నారు? అయితే అతని యొక్క మంచి పేరు, మంచి గుణాలు ఈ దైవదూతలు తెలియజేస్తారు. ఆకాశపు ద్వారాలు తెరవబడతాయి. ఆ మొదటి ఆకాశపు దైవదూతలు ఘనంగా ఇతన్ని స్వాగతిస్తూ ఆ దూతలతో కలిసి ఇంకా పైకి వెళ్తారు. ఈ విధంగా రెండో ఆకాశం పైకి చేరుతారు. అలాగే అక్కడ కూడా స్వాగతం జరుగుతుంది, ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. చివరికి ప్రతి ఆకాశంలో కూడా అలాగే జరుగుతుంది. ఏడో ఆకాశం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అలాగే జరుగుతుంది. అప్పుడు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆదేశం వస్తుంది. నా యొక్క ఈ దాసుని యొక్క ఆ నామము عِلِّيِّينَ (ఇల్లియీన్) ఉన్నతమైన స్థానం లో రాయండి. మరో ఉల్లేఖన ప్రకారం, ఇతని యొక్క ఆత్మ అనేది ఏదైతే ఉందో, దీని ఇతడు స్వర్గపు యొక్క రుచులు, స్వర్గపు యొక్క మంచి అనుభవాలు పొందుతూ ఉంటాడు. కానీ, మళ్ళీ అతన్ని ప్రశ్నించడానికి తిరిగి ఆ మనిషిని ఏదైతే సమాధిలో ఖననం చేయడం జరుగుతుందో, ఆ అతని శరీరంలో పంపడం జరుగుతుంది. ఇది విశ్వాసుడు, పుణ్యాత్ముని యొక్క ఆత్మ ఏదైతే తీయడం జరుగుతుందో దాని యొక్క సంక్షిప్త విషయం.

ఇక మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కాఫిర్ (అవిశ్వాసుడు), ఫాసిఖ్ వ ఫాజిర్ (పాపాత్ములు) వారి యొక్క ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు ప్రాణం తీసే దూత వస్తాడు మరియు నరకం నుండి శిక్ష దూతలు దుర్వాసనతో కూడి ఉన్న చెడ్డ వస్త్రాలను తీసుకొని వస్తారు. ప్రాణం తీసే దూత ఓ చెడు ఆత్మా, వచ్చేసెయ్ అల్లాహ్ యొక్క కోపం, ఆగ్రహం వైపునకు అని అంటారు. అతని యొక్క ఆత్మ శరీరంలో తిరుగుతుంది. ఆ ప్రాణం తీసే దైవదూత చేతిలోకి రావడానికి రెడీగా ఉండదు. కానీ బలవంతంగా తీయడం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే ఆ దూతలు ఆ వస్త్రాల్లో చుట్టుకొని పైకి వెళ్తారు. కానీ ఆకాశపు ద్వారాలు తెరవబడవు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ లోని ఈ ఆయత్ కూడా చదివారు:

لَا تُفَتَّحُ لَهُمْ أَبْوَابُ السَّمَاءِ
(లా తుఫత్తహు లహుమ్ అబ్వాబుస్ సమా’)
వారి కొరకు ఆకాశ ద్వారాలు తెరవబడవు. (7:40)

మళ్ళీ అక్కడి నుండే అతని యొక్క ఆత్మను క్రిందికి విసిరివేయడం జరుగుతుంది. మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరే హజ్ లోని ఆయత్ చదివారు:

وَمَن يُشْرِكْ بِاللَّهِ فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ فَتَخْطَفُهُ الطَّيْرُ أَوْ تَهْوِي بِهِ الرِّيحُ فِي مَكَانٍ سَحِيقٍ
(వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫక అన్నమా ఖర్ర మినస్ సమా’ఇ ఫతఖ్తఫుహుత్ తైరు అవ్ తహ్వీ బిహిర్ రీహు ఫీ మకానిన్ సహీఖ్)
అల్లాహ్ కు భాగస్వాముల్ని కల్పించేవాడు ఆకాశం నుండి క్రింద పడిపోయిన వాని వంటివాడు. పక్షులు అతన్ని తన్నుకుపోతాయి, లేదా గాలి అతన్ని దూరప్రాంతానికి విసిరివేస్తుంది. (22:31)

అంటే అల్లాహ్ తో పాటు షిర్క్ చేసేవారు, ఇలా పాపాలలో తమ జీవితం పూర్తిగా గడిపేవారు, పాపాలలో విలీనమైన వారు, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వారి యొక్క ఉపమానం ఎలా తెలుపుతున్నాడంటే,

فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ
(ఫక అన్నమా ఖర్ర మినస్ సమా)
ఆకాశం నుండి పడిపోయిన వాని వలె.
ఆకాశం నుండి పడిపోయిన వారు, ఇక అతనిని పక్షులు తమ యొక్క చుంచులతో వేటాడుతాయి, లాక్కుంటాయి, లేదా గాలి అనేది అటు ఇటు ఎక్కడైనా విసిరి పారేస్తుంది. అక్కడి నుండి పారేయడం జరుగుతుంది. అయితే ఏడు భూముల కింద سِجِّين (సిజ్జీన్) ఖైదీల చిట్టా అనే ఏదైతే దఫ్తర్ (రిజిస్టర్), ప్రాంతం ఏదైతే ఉందో అందులో అతని నామం రాయడం జరుగుతుంది. ఇక అతన్ని, ఆ శరీరం, భౌతికాయాన్ని అతని బంధువులు ఖననం చేశారంటే, అక్కడ ప్రశ్నోత్తరాల గురించి అందులో పంపడం జరుగుతుంది.

ఇక ఆ తర్వాత, సమాధిలో ఏదైతే పెట్టడం జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుంది సంక్షిప్తంగా వినండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరంగా ఆ విషయాలు తెలిపారు. కానీ ఆ విషయాల యొక్క వివరణలో వెళ్ళేకి ముందు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోండి. అదేమిటంటే, సామాన్యంగా సమాధి యొక్క శిక్ష లేదా సమాధి యొక్క వరాలు అని ఏదైతే అనడం జరుగుతుందో, ఇక్కడ ఇలా ఎందుకు అనడం జరుగుతుంది అంటే, వాస్తవానికి మానవ చరిత్రలో మానవునికి ఇవ్వబడిన ఆదేశ ప్రకారం అతన్ని సమాధిలో పెట్టడమే. ఇక ఎవరైతే సమాధిలో పెట్టకుండా వేరే పద్ధతులు అవలంబిస్తున్నారో, వారు స్వభావానికి, ప్రకృతికి విరుద్ధమైన పని చేస్తున్నారు. ఇదొక మాట అయితే, రెండో మాట ఏమిటంటే, అధిక శాతం చనిపోయే వారిని సమాధిలో పెట్టడం జరుగుతుంది. అందుకొరకే ఈ పదాలు ఉపయోగించబడ్డాయి.

కానీ ఇక ఎవరైనా, ఎవరిదైనా కాల్చివేయడం జరిగితే, లేదా ఎవరైనా అగ్నికి ఆహుతి అయి పూర్తిగా బూడిదైపోతే, లేదా ఏదైనా మృగ జంతువు యొక్క ఆహారంగా మారిపోతే, ఇంకా సంక్షిప్తంగా చెప్పాలంటే, మనిషిని బొందలో పెట్టకుండా, సమాధిలో పెట్టకుండా ఏ విధంగా ఏది జరిగినా గానీ, ఈ శరీరం ఏదైతే ఉందో, భౌతికాయం అని ఏదైతే అంటామో అది నాశనమైపోతుంది. కానీ ఆత్మ అయితే ఉంటుంది. అల్లాహ్ త’ఆలా తలుచుకుంటే ఆత్మకైనా శిక్ష ఇవ్వవచ్చు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలై దీనికి సంబంధించిన ఎన్నో వివరాలు తెలిపి ఉన్నారు. అల్లాహ్ తలుచుకుంటే ఆ కుళ్ళిపోయిన, కాలిపోయిన, ఆహారంగా మారిపోయిన ఆ శరీరాన్ని మరోసారి ఉనికిలోకి తీసుకురావచ్చు. లేదా అల్లాహ్ త’ఆలా తలుచుకుంటే కొత్త శరీరం ప్రసాదించవచ్చు. అల్లాహ్ తలుచుకుంటే, సమాధి యొక్క శిక్షలు మరియు వరాలు ఏవైతే ఉన్నాయో, శిక్షలు అంటే అవిశ్వాసులకు పాపాత్ములకు, వరాలు అంటే, అనుగ్రహాలు అంటే విశ్వాసులకు మరియు పుణ్యాత్ములకు, ఈ సమాధి శిక్షలు లేదా అనుగ్రహాలు, వరాలు ఇవి ప్రతి ఒక్కరికీ జరిగి ఉంటాయి.

وَمِن وَرَائِهِم بَرْزَخٌ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
(వ మిన్ వరా’ఇహిమ్ బర్ జ ఖున్ ఇలా యౌమి యుబ్ ‘అసూన్)
వారి వెనుక పునరుత్థాన దినం వరకు ఒక అడ్డుతెర (బర్ జఖ్) ఉంటుంది. (23:100)

దీన్నే కొందరు మధ్య కాలం, ఇటు ఇహలోకం అటు పరలోకం, దాని మధ్య లోకం ఇది. మధ్య లోకంలో ఇవి తప్పకుండా జరిగి ఉంటాయి. తప్పకుండా జరిగి ఉంటాయి. ఈ విశ్వాసం మనం తప్పకుండా మనసులో నిశ్చయించాలి. ఈ విషయాలను నమ్మాలి.

ఇక సమాధిలో… సమాధి అంటే ఇక్కడ గుర్తు ఉంది కదా, ఒకవేళ ఎవరినైనా సమాధిలో పెట్టడం జరగకపోయినా గానీ వారిని ప్రశ్నించడం జరుగుతుంది. వచ్చి దైవదూత అడుగుతాడు, నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? మరియు నీ ప్రవక్త ఎవరు? అప్పుడు విశ్వాసుడు అయితే, నా ప్రభువు అల్లాహ్, నా యొక్క ధర్మం ఇస్లాం మరియు నా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని సమాధానం ఇస్తాడు. తర్వాత నాలుగో ప్రశ్న అడగడం జరుగుతుంది, ఈ విషయాలు నీవు ఎలా తెలుసుకున్నావు అని? అతడు చెబుతాడు, నేను ఖురాన్ ను చదివాను, ధర్మం నేర్చుకున్నాను అని.

ఇక ఎవరైతే అవిశ్వాసి లేదా పాపాత్ముడై ఉంటాడో, మహా ఘోరమైన పాపాత్ముడు, అలాంటి వారు ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వరు. అయ్యో, మాకు తెలియదు, ప్రజలు అన్నట్లుగా మేమన్నాము అని అంటారు. నువ్వు ఎందుకు తెలుసుకోలేదు, ఎందుకు చదువుకోలేదు, ఎందుకు చదువుకున్న వారిని అనుసరించి ఖురాన్ పారాయణం చేయలేదు అని చెప్పుకుంటూ వారిని కొట్టడం, శిక్షించడం జరుగుతుంది.

ఇక సమాధిలో, ఈ మధ్య లోకంలో జరిగే అటువంటి మరికొన్ని వివరాలు కూడా ఉన్నాయి. కానీ సమయం ఇప్పటికే ఎక్కువైనందుకు నేను ఇంతటితో ముగిస్తున్నాను. కానీ మీ యొక్క ప్రశ్నకు సమాధానం లభించింది అని ఆశిస్తున్నాను. సంక్షిప్తంగా మీ ప్రశ్న ఏముండే? ఎవరి చావు ఎట్లా వస్తుంది? హిందువులకు వేరే రకంగా యమదూత వస్తాడా, ప్రాణం తీసే దూత వస్తాడా? ఇంకా ముస్లింలకు వేరే దూతనా? మనలాంటి, మనకు జరిగే విధంగానే వారికి జరుగుతాయా? మరి వారినైతే సమాధిలో పెట్టడం జరగదు కదా, కాల్చేస్తారు కదా, మరి వారికి ఎలా జరుగుతుంది? ఇలాంటి ప్రశ్నలు ఏవైతే వచ్చాయో వాటన్నిటినీ కలుపుకొని ఈ సంక్షిప్త విషయం తెలపడం జరిగింది.

చనిపోయిన తర్వాత నుండి మొదలుకొని, మళ్ళీ అల్లాహ్ యొక్క మైదానే మహ్షర్ లో నిలబడే వరకు ఏ ఏ సంఘటనలు జరుగుతాయని ఖురాన్ మరియు సహీ హదీసులలో తెలపబడ్డాయో, వాటన్నిటినీ మనం విశ్వసించి ఆ ప్రకారంగా మన విశ్వాసాన్ని బలపరుచుకొని ఉంచేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా ఆఖరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు.

أَسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక