సూరతు ఖురైష్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) – నసీరుద్దీన్ జామిఈ

ఈ తఫ్సీర్ తయారు చేయడంలో మద్ధతు లభించినది:

1. షేఖ్ మఖ్సూదుల్ హసన్ ఫైజీ హఫిజహుల్లాహ్ వీడియో ద్వారా.
2. షేఖ్ అబ్దుస్ సలాం భుట్వీ రహిమహుల్లాహ్ వారి తఫ్సీర్ ద్వారా.
3. ప్రఖ్యాతిగాంచిన [ఇబ్ను కసీర్] ద్వారా.

الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الله، أما بعد!

لِإِيلَافِ قُرَيْشٍ ۝ إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ ۝ فَلْيَعْبُدُوا رَبَّ هَذَا الْبَيْتِ ۝ الَّذِي أَطْعَمَهُم مِّن جُوعٍ وَآَمَنَهُم مِّنْ خَوْفٍ

ఖురైషులను అలవాటు చేసిన కారణంగా, (అంటే) చలికాలపు, ఎండాకాలపు ప్రయాణాలకు వారిని అలవాటు చేసిన కారణంగా, వారు ఈ (కాబా) గృహం యెక్క ప్రభువునే ఆరాధించాలి. ఆయనే వారికి ఆకలిగొన్నప్పుడు అన్నం పెట్టాడు. భయాందోళనల స్థితిలో భద్రత కల్పించాడు.

ఇది ‘సూరా ఖురైష్’ పేరుతో పిలువబడుతుంది. ఈ సూరా మొదటి ఆయత్ లోనే ‘ఖురైష్’ అనే పదం వచ్చింది. మరియు ప్రత్యేకంగా ఈ సూరా ‘ఖురైష్’ (మక్కాలోని తెగ) వారి గురించి అవతరించింది. అల్లాహ్ ఈ సూరాలో, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై విశ్వాసం తీసుకురావాలని మరియు వారు కాబా గృహం పట్ల గౌరవం చూపాలని ఖురైష్ లకు ఆదేశించాడు.

నిజానికి, ఈ పూర్తి సూరా ఖురైష్ గురించే అవతరించింది. ఇమామ్ బైహకీ (రహిమహుల్లాహ్) తన పుస్తకం ‘అల్-ఖిలాఫియాత్’ లో మరియు అల్లామా అల్బానీ (రహిమహుల్లాహ్) తన ‘అస్-సహీహా’ లో ఉల్లేఖించిన హదీసు ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

فَضَّلَ اللَّهُ قُرَيْشًا بِسَبْعِ خِلَالٍ: أَنِّي فِيهِمْ، وَأَنَّ النُّبُوَّةَ فِيهِمْ، وَالْحِجَابَةَ، وَالسِّقَايَةَ فِيهِمْ، وَأَنَّ اللَّهَ نَصَرَهُمْ عَلَى الْفِيلِ، وَأَنَّهُمْ عَبَدُوا اللَّهَ عَشْرَ سِنِينَ لَا يَعْبُدُهُ غَيْرُهُمْ، وَأَنَّ اللَّهَ أَنْزَلَ فِيهِمْ سُورَةً مِنَ الْقُرْآنِ

“అల్లాహ్ ఖురైష్ కు ఏడు ప్రత్యేకతలను ఇచ్చాడు, అవి మరే తెగకు ఇవ్వలేదు: నేను (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం) ఖురైష్ వంశానికి చెందినవాడిని. వారిలో నుండే అల్లాహ్ ప్రవక్తలను ఎన్నుకున్నాడు. అల్లాహ్ తన పవిత్ర గృహం (బైతుల్లాహ్ – కాబా) సేవ కోసం, హాజీలకు నీరు త్రాగించడం కోసం వీరినే ఎంపిక చేశాడు. అల్లాహ్ ఏనుగుల సైన్యం (అసహబె ఫీల్) పై, అంటే అబ్రహా మరియు అతని సైన్యం పై, ఖురైష్ లకు అద్భుతమైన రీతిలో సహాయం చేశాడు (వారిని కాపాడాడు).ప్రవక్త పదవికి ముందు, పది సంవత్సరాల పాటు వీరు మాత్రమే అల్లాహ్ ను ఆరాధించేవారు, వీరితో పాటు వేరెవరూ లేరు. అల్లాహ్ వారి గౌరవార్థం ఒక పూర్తి సూరాను అవతరింపజేశాడు, అదే ‘సూరా ఖురైష్’. (అల్ ఖిలాఫియాత్: బైహఖీ 1517, సహీహా 1944).

ఈ సూరాలో అల్లాహ్ మక్కా వాసులకు, ప్రత్యేకంగా ఖురైష్ కు తన అనుగ్రహాలను గుర్తు చేశాడు. ఆ అనుగ్రహాలను అర్థం చేసుకోవడానికి, ఖురైష్ ల పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి చూడాలి. హజ్రత్ ఇబ్రహీం (అలైహిస్సలాం) తన కుమారుడు ఇస్మాయిల్ (అలైహిస్సలాం) ను మక్కాలో వదిలినప్పుడు, అక్కడ బనూ జుర్హుమ్ అనే తెగ యెమెన్ నుండి వచ్చి వారితో పాటు స్థిరపడింది. హజ్రత్ ఇస్మాయిల్ (అలైహిస్సలాం) వారిలోనే వివాహం చేసుకున్నారు, అలా వారంతా కలిసిపోయారు.

కాలం గడిచేకొద్దీ, హజ్రత్ ఇస్మాయిల్ (అలైహిస్సలాం) మరియు హజ్రత్ ఇబ్రహీం (అలైహిస్సలాం) బోధనలు మరుగున పడిపోయాయి. వారిలో కుఫ్ర్ (అవిశ్వాసం) మరియు షిర్క్ (బహుదైవారాధన) తో పాటు అన్యాయం కూడా పెరిగిపోయింది. అల్లాహ్ కు అన్యాయం నచ్చదు. అల్లాహ్ [సూరా అల్-హజ్: 25]లో ఇలా తెలిపాడడు:

وَمَن يُرِدْ فِيهِ بِإِلْحَادٍ بِظُلْمٍ نُذِقْهُ مِنْ عَذَابٍ أَلِيمٍ

{మరియు ఎవరైతే ఇందులో (మక్కాలో) అన్యాయంతో కూడిన చెడును తలపెడతారో, వారికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపిస్తాము.}

వారిలో ఈ చెడులు పెరగడంతో, బనూ ఖుజా అనే మరో తెగ వచ్చి వారిపై దాడి చేసి, వారిని ఓడించి మక్కా నుండి తరిమికొట్టింది. జుర్హుమ్ తెగ వారు పారిపోతూ జమ్ జమ్ బావిని పూడ్చివేశారు. అలా మక్కా బనూ ఖుజా చేతిలోకి వెళ్ళింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముత్తాత ఖుసయ్ ఇబ్న్ కిలాబ్ వచ్చే వరకు పరిస్థితి ఇలాగే ఉంది. ఖుసయ్ తన బలాన్ని కూడగట్టుకుని, బనూ ఖుజాను ఓడించి, మక్కాపై తిరిగి ఆధిపత్యం సాధించాడు. ఖురైష్ తెగ చెల్లాచెదురుగా ఉన్నప్పుడు, వారిని ఏకం చేసి మక్కాలో మళ్ళీ స్థిరపరిచాడు. అందుకే ఈ కలయికను ‘ఈలాఫ్‘ (ఐక్యమత్యం/అలవాటు చేయడం) అన్నారు. ‘ఈలాఫ్’ అంటే ఉల్ఫత్ (ప్రేమ/కలయిక) నుండి వచ్చింది. అంటే ఒకే ఆలోచన కలిగిన వారిని ఒక చోట చేర్చడం. అందుకే పుస్తకం వ్రాయడాన్ని ‘తాలీఫ్‘ అంటారు (విషయాలను ఒక చోట చేర్చడం).

ఖురైష్ వారు ఒకే తెగ, ఒకే కుటుంబం కాబట్టి అల్లాహ్ వారిని మళ్ళీ ఏకం చేయడాన్ని ‘ఈలాఫ్’ అన్నాడు. ఇది అల్లాహ్ వారిపై చూపిన గొప్ప దయ. వారు మక్కా నుండి దూరమై, పరాయివారైపోయిన తర్వాత, అల్లాహ్ వారిని మళ్ళీ ఇక్కడ చేర్చాడు.

అల్లాహ్ ఈ సూరాలో ఇలా అంటున్నాడు:

ఇక్కడ ‘లి’ (لِ) అనే అక్షరానికి రెండు అర్థాలు ఉన్నాయి.

ఒక అర్థం: ఇది మునుపటి సూరా ‘అలమ్ తర కైఫ’ (సూరా ఫీల్) కు కొనసాగింపు. అందుకే కొంతమంది పారాయణంలో ‘బిస్మిల్లాహ్’ లేకుండా దీనిని చదువుతారు (అంటే రెండు సూరాలను కలిపి). అంటే అల్లాహ్ ఏనుగుల సైన్యాన్ని ఎందుకు నాశనం చేశాడంటే – ఖురైష్ లకు రక్షణ కల్పించి, వారిని ఏకం చేయడానికి.

రెండవ అర్థం: ‘ఆశ్చర్యం’ (తఅజ్జుబ్) వ్యక్తం చేయడం. అంటే ఖురైష్ ల పరిస్థితి చూసి ఆశ్చర్యం కలగాలి. అల్లాహ్ వారిని ఇంతగా కరుణించి, వారికి రక్షణ కల్పిస్తే, వారు అల్లాహ్ ను వదిలి విగ్రహాలను ఆరాధిస్తున్నారు.

ఇక్కడ మరొక విషయం ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తాత హాషిమ్, ఖుసయ్ యొక్క మనవడు. ఇతను చాలా తెలివైనవాడు. అప్పట్లో మక్కా వాసులకు వ్యాపారం తప్ప వేరే ఆధారం లేదు. హాషిమ్ ఆలోచించి, వాణిజ్య యాత్రలను (Trade Journeys) ప్రారంభించాడు. అతను యెమెన్, ఇరాక్, సిరియా (షామ్), మరియు హబషా (ఇథియోపియా) రాజులతో మాట్లాడి ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. దీని వల్ల మక్కా వాసులు సురక్షితంగా వ్యాపారం చేసుకోగలిగారు.

సంవత్సరంలో రెండు ప్రధాన ప్రయాణాలు ఉండేవి:

(1) శీతాకాలం (Winter): యెమెన్ వైపు వెళ్ళేవారు (ఎందుకంటే అక్కడ ఆ సమయంలో వాతావరణం వెచ్చగా ఉండేది).
(2) వేసవికాలం (Summer): సిరియా (షామ్) వైపు వెళ్ళేవారు (అక్కడ చల్లగా ఉండేది).

ఈ ప్రయాణాల ద్వారా మక్కా వాసులు ధనవంతులయ్యారు, వారి ఆకలి తీరింది. అల్లాహ్ వారిపై చేసిన ఈ ఉపకారాన్ని గుర్తు చేస్తున్నాడు.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అబ్రహా (ఏనుగుల సైన్యం) మక్కాపై దాడి చేయడానికి వచ్చినప్పుడు, అల్లాహ్ అద్భుతమైన రీతిలో పక్షులతో వారిని నాశనం చేశాడు. దీంతో అరబ్బులందరిలో ఖురైష్ ల పట్ల గౌరవం పెరిగింది. “వీరు అల్లాహ్ ఇంటి రక్షకులు, అల్లాహ్ వీరికి సహాయం చేశాడు” అని అందరూ వీరిని గౌరవించేవారు. ఎంతగా అంటే, వీరి వాణిజ్య బిడారులు (Caravans) ఎక్కడికి వెళ్ళినా ఎవరూ వీరిని దోచుకునేవారు కాదు. మిగతా వారిని దారి దోపిడి దొంగలు దోచుకునేవారు, కానీ ఖురైష్ లను మాత్రం ఎవరూ ముట్టుకునేవారు కాదు. పైగా వీరి రక్షణ కోసం ఒప్పందాలు కూడా ఉండేవి.

అందుకే అల్లాహ్ అంటున్నాడు:

لِإِيلَافِ قُرَيْشٍ ۝ إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ
ఖురైష్ లకు శీతాకాల మరియు వేసవికాల ప్రయాణాలు సులభం చేసి, వాటిని అలవాటు చేసినందుకు (వారు కృతజ్ఞత చూపాలి)

వారు ఈ ప్రయాణాలను ఎంత ధైర్యంగా, నిశ్చింతగా చేసేవారంటే, వారికి దారిలో ఎలాంటి భయం ఉండేది కాదు. అల్లాహ్ వారికి ఇచ్చిన ఈ భద్రత, ఈ ఐక్యత చూసి ఆశ్చర్యం కలుగుతుంది, అయినప్పటికీ వారు అల్లాహ్ ను ఆరాధించడం లేదు.

వారికి ఈ భద్రత రావడానికి కారణం ఈ ఇల్లు (కాబా). అల్లాహ్ మరో చోట [సూర అన్ కబూత్ 29:67]లో ఇలా తెలిపాడు:

أَوَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا حَرَمًا آمِنًا وَيُتَخَطَّفُ النَّاسُ مِنْ حَوْلِهِمْ

ఏమిటీ, మేము హరమ్‌ను (మక్కా పుణ్యక్షేత్రాన్ని) సురక్షితమైన క్షేత్రంగా చేయటాన్ని వారు చూడటం లేదా? మరి (చూడబోతే) వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఎగరేసుకుపోబడుతున్నారు (దోచుకోబడుతున్నారు).

చుట్టూ ఉన్నవారిని దోచుకుంటున్నారు, చంపుతున్నారు, కానీ మక్కాలో ఉన్నవారికి మాత్రం పూర్తి రక్షణ ఉంది. అయినా వారు అసత్య దైవాలను నమ్ముతారా? అల్లాహ్ అనుగ్రహాన్ని కాదంటారా?

అల్లాహ్ ను వదలి ఇతరులను ఆరాధిస్తారా. చదవండి అల్లాహ్ ఆదేశం:

إِنَّمَا أُمِرْتُ أَنْ أَعْبُدَ رَبَّ هَٰذِهِ الْبَلْدَةِ الَّذِي حَرَّمَهَا وَلَهُ كُلُّ شَيْءٍ ۖ وَأُمِرْتُ أَنْ أَكُونَ مِنَ الْمُسْلِمِينَ

నేను ఈ నగరం (మక్కా) ప్రభువును మాత్రమే ఆరాధిస్తూ ఉండాలని నాకు ఆదేశించబడింది. ఆయన దీన్ని పవిత్రమైనదిగా (హరమ్) చేశాడు. అన్నింటికీ ఆయనే యజమాని. నేను విధేయులలో ఒకడిగా ఉండాలని కూడా నాకు ఆజ్ఞాపించబడింది. (నమ్ల్ 27:91) [ఇబ్ను కసీర్].

మక్కాలో ఏ పంటలు పండవు, ఏ పండ్ల తోటలు లేవు. అది రాళ్ళతో నిండిన లోయ (వాది గైరి జీ జరా). అయినా అక్కడ ప్రపంచంలోని అన్ని రకాల పండ్లు, ఆహార పదార్థాలు వస్తున్నాయి. అల్లాహ్ వారికి ఆకలి తీరుస్తున్నాడు.

చుట్టుపక్కల అందరూ భయంతో బ్రతుకుతుంటే, ఖురైష్ లకు మాత్రం అల్లాహ్ ఏ భయం లేకుండా చేశాడు. మక్కాలో ఉన్నప్పుడు భయం లేదు, బయట ప్రయాణాల్లో ఉన్నప్పుడు కూడా భయం లేదు.

ముగింపు: దీని సారాంశం ఏమిటంటే, అల్లాహు తఆలా ఖురైష్ కు, మరియు మనందరికీ ఒక పాఠం నేర్పుతున్నాడు. అల్లాహ్ మనకు ఇచ్చిన రెండు గొప్ప వరాలు: 1. ఆకలి నుండి విముక్తి (ఆహారం), 2. భయం నుండి విముక్తి (శాంతి/భద్రత). ఎవరికైతే ఈ రెండు ఉన్నాయో, వారు అల్లాహ్ కు కృతజ్ఞతగా ఆయనను మాత్రమే ఆరాధించాలి.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక హదీసులో ఇలా అన్నారు:

مَنْ أَصْبَحَ مِنْكُمْ آمِنًا فِي سِرْبِهِ، مُعَافًى فِي جَسَدِهِ، عِنْدَهُ قُوتُ يَوْمِهِ، فَكَأَنَّمَا حِيزَتْ لَهُ الدُّنْيَا

మీలో ఎవరైతే ఉదయం లేచేసరికి తన కుటుంబంలో (లేదా తన గూటిలో) సురక్షితంగా ఉంటారో, శరీర ఆరోగ్యంతో ఉంటారో, మరియు ఆ రోజుకు సరిపడా ఆహారం వారి దగ్గర ఉంటుందో – వారికి ప్రపంచం మొత్తం ఇవ్వబడినట్లే. [సునన్ తిర్మిదీ: 2346. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ హసన్ అన్నారు].

కాబట్టి, మనకు ఆరోగ్యం, భద్రత, మరియు ఆహారం ఉన్నప్పుడు, మనం మన సమయాన్ని అల్లాహ్ ఆరాధనలో గడపాలి. కేవలం ప్రపంచం వెనుక పరుగెత్తకూడదు. ఎవరైతే అల్లాహ్ ను ఆరాధిస్తారో, అల్లాహ్ వారికి ఇహలోకంలోనూ, పరలోకంలోనూ భద్రతను మరియు ఆహారాన్ని ప్రసాదిస్తాడు.

అల్లాహ్ మనందరికీ తన అనుగ్రహాలను గుర్తించి, ఆయనకు కృతజ్ఞతలు తెలిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనకు ఆకలి మరియు భయం నుండి రక్షణ కల్పించుగాక. ఆమీన్.

వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

* మౌలానా అబ్దుస్ సలాం భుట్వీ రహిమహుల్లాహ్ వారి తఫ్సీర్ లోని కొన్ని విషయాలు చదవండి:

మొదటి ఉపకారం ఏమిటంటే, వారి హృదయాలలో ప్రయాణం పట్ల ప్రేమను కలిగించాడు. వారికి చలికాలం ప్రయాణంలో గానీ, వేసవికాలం ప్రయాణంలో గానీ ఎలాంటి కష్టం అనిపించేది కాదు. మరియు ప్రపంచంలో ప్రయాణమే విజయానికి మార్గం. ఒకవేళ అల్లాహు తఆలా వారి హృదయాలను ప్రయాణానికి అలవాటు చేసి ఉండకపోతే, వారు కూడా తమ ఇళ్లలోనే కూర్చుని ఉండేవారు. ప్రయాణం వల్ల లభించే సిరిసంపదలు, అనుభవం, జ్ఞానం మరియు ప్రపంచంలోని ప్రజలతో, ప్రాంతాలతో ఏర్పడే పరిచయం వారికి ఎప్పటికీ లభించేవి కావు.

ప్రయాణానికి అలవాటు పడటమనే ఈ వరమే ఖురైషీలకు ఆ తర్వాత హిజ్రత్ (వలస) ప్రయాణంలో ఉపయోగపడింది. ఆ తర్వాత అవిశ్వాసులతో యుద్ధంలోనూ, దాని తర్వాత రోమ్ మరియు షామ్, ఇరాక్ మరియు పర్షియా, హింద్ మరియు సింధ్, ఈజిప్ట్ మరియు ఆఫ్రికా, ఇంకా తూర్పు పడమరల విజయాలలో కూడా ఉపయోగపడింది. వాస్తవం ఏమిటంటే, ముస్లిం జాతి ప్రపంచంపై ఆధిపత్యం సాధించడానికి మరియు గెలిచి నిలబడటానికి మొదటి అడుగు ఏమిటంటే, వారు ప్రయాణాలంటే భయపడకూడదు మరియు బయలుదేరే అవకాశం వచ్చినప్పుడు భూమిని పట్టుకుని (ఇక్కడే) ఉండిపోకూడదు. ఇప్పుడు మనం చూస్తున్నాము, అవిశ్వాస జాతులే నేల, నీరు మరియు ఆకాశ మార్గ ప్రయాణాలపై గుత్తాధిపత్యం కలిగి ఉన్నాయి. ముస్లింలు చాలా వరకు ఈ పాఠాన్ని మర్చిపోయారు.

రెండవ ఉపకారం ఏమిటంటే, ఆ సమయంలో అరేబియా అంతటా తీవ్రమైన అశాంతి ఉండేది. ఎవరిపై ఎప్పుడు దాడి జరుగుతుందో, ఎవరిని చంపేస్తారో, లేదా ఎత్తుకెళ్తారో, లేదా ఆస్తిని దోచుకుంటారో మరియు స్త్రీలను, పిల్లలను బానిసలుగా చేసుకుంటారో ఎవరికీ తెలిసేది కాదు. ఇలాంటి పరిస్థితులలో కేవలం మక్కా వాసులకు మాత్రమే ఈ శాంతి (భద్రత) లభించింది, వారి వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అల్లాహ్ సెలవిచ్చినట్లుగా:

أَوَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا حَرَمًا آمِنًا وَيُتَخَطَّفُ النَّاسُ مِنْ حَوْلِهِمْ

ఏమిటీ, మేము హరమ్‌ను (మక్కా పుణ్యక్షేత్రాన్ని) సురక్షితమైన క్షేత్రంగా చేయటాన్ని వారు చూడటం లేదా? మరి (చూడబోతే) వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఎగరేసుకుపోబడుతున్నారు (దోచుకోబడుతున్నారు). [అన్ కబూత్ 29:67]

మూడవ ఉపకారం ఏమిటంటే, హరమ్ (మక్కా) వాసులైనందున వ్యాపార ప్రయాణాలలో ఎవరూ వారి బిడారు (కాఫిలా)ను దోచుకునేవారు కాదు. ప్రతి తెగ మరియు ప్రతి జాతి తమ ప్రాంతం గుండా వెళ్ళే వారి నుండి తీసుకునే పన్నులు వీరి నుండి తీసుకునేవారు కాదు. మరియు వీరిని ఎక్కడికి వెళ్ళకుండా ఆపేవారు కాదు.

నాలుగవది ఏమిటంటే, ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు హజ్ మరియు ఉమ్రా కోసం మక్కాకు వచ్చేవారు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సరుకులు ఇక్కడికి చేరేవి. ఇవే కాకుండా, ఇబ్రహీం (అలైహిస్సలాం) ప్రార్థన ఫలితంగా అన్ని రకాల పండ్లు ఇక్కడికి చేరేవి. అల్లాహ్ సెలవిచ్చాడు:

أَوَلَمْ نُمَكِّن لَّهُمْ حَرَمًا آمِنًا يُجْبَىٰ إِلَيْهِ ثَمَرَاتُ كُلِّ شَيْءٍ رِّزْقًا مِّن لَّدُنَّا وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ

ఏమిటి? మేము వారికి సురక్షితమైన, పవిత్రమైన చోట స్థిరనివాసం కల్పించలేదా? అక్కడ వారికి అన్ని రకాల పండ్లు ఫలాలు ఉపాధి రూపంలో మావద్ద నుంచి సరఫరా చేయబడలేదా? కాని వారిలోని చాలా మంది (ఈ యదార్థాన్ని) తెలుసుకోరు. (ఖసస్ 28:57).

ఇబ్రాహీం అలైహిస్సలాం చేసిన దుఆ ప్రస్తావన సూర బఖర (2:126), సూర ఇబ్రాహీం (14:37)లో చూడవచ్చును. [mnj],

ఈ వ్యాపార ప్రయాణాలు మరియు మక్కా వ్యాపారానికి యజమానులైనందున ఖురైషీలు అత్యంత ధనవంతులుగా ఉండేవారు. మరియు హరమ్ యొక్క శుభం (బర్కత్) వల్ల శాంతి భద్రతలను కూడా పొంది ఉండేవారు. స్పష్టంగా ఈ వరాలన్నీ అల్లాహ్ ఇంటి బర్కత్ వల్లనే లభించాయి మరియు కేవలం ప్రభువు ప్రసాదించినవి మాత్రమే. అలాంటప్పుడు, ఈ వరాలన్నీ ఈ ఇంటి యజమాని ఇచ్చినప్పుడు, మీరు ఆ ఒక్కడినే ఎందుకు ఆరాధించరు? మరియు ఇతరులను ఆయనకు సాటిగా కల్పించి వారి ముందు ఎందుకు సాష్టాంగ (సజ్దా) పడుతున్నారు? వారి ఆస్థానాల వద్ద ఎందుకు మొక్కుబడులు చెల్లిస్తున్నారు మరియు కానుకలు సమర్పిస్తున్నారు?

* “లి ఈలాఫి ఖురైష్” (ఖురైషీల హృదయంలో ప్రేమను కలిగించినందువల్ల) ఒకవేళ ఈ ఇతర అసంఖ్యాకమైన వరాల కారణంగా వీరు ఒక్క అల్లాహు తఆలాను ఆరాధించకపోయినా, కనీసం ఈ ఇంటి ప్రభువు అయినందువల్లనైనా ఆయనను ఆరాధించాలి. ఏ ఇంటి బర్కత్ వల్లనైతే వారికి చలి మరియు వేసవిలో ప్రయాణించే అవకాశం, శాశ్వత శాంతి భద్రతలు మరియు సమృద్ధిగా ఉపాధి వరాలు లభిస్తున్నాయో.

ఏ ప్రదేశంలోనైనా శాంతి ఉండటం అల్లాహు తఆలా యొక్క చాలా గొప్ప వరం. మనం కూడా ఉపాధిలో విశాలత మరియు శాంతి లాంటి వరంపై అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి మరియు ఆయననే ఆరాధించాలి. అల్లాహ్ కాని వారి ఆరాధన మరియు షిర్క్ (బహుదైవారాధన) నుండి దూరంగా ఉండాలి. షిర్క్ కేంద్రాలను నిర్మించడం మరియు అభివృద్ధి చేయడానికి బదులుగా, తౌహీద్ (ఏక దైవారాధన) కేంద్రాలను నిర్మించి, అభివృద్ధి చేయాలి. ఒకవేళ మనం అలా చేయకపోతే, ఉపాధిలో సంకుచితత్వం మరియు అశాంతి, కల్లోలాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, ప్రస్తుతం ఎదుర్కొంటున్నట్లుగా.

దీనికి ఆధారం చూడండి సూరతున్ నహ్ల్ (16:112)లో:

وَضَرَبَ اللَّهُ مَثَلا قَرْيَةً كَانَتْ آمِنَةً مُطْمَئِنَّةً يَأْتِيهَا رِزْقُهَا رَغَدًا مِنْ كُلِّ مَكَانٍ فَكَفَرَتْ بِأَنْعُمِ اللَّهِ فَأَذَاقَهَا اللَّهُ لِبَاسَ الْجُوعِ وَالْخَوْفِ بِمَا كَانُوا يَصْنَعُونَ

అల్లాహ్‌ ఒక పట్నం ఉదాహరణను ఇస్తున్నాడు. ఆ పట్నం ఎంతో ప్రశాంతంగా, తృప్తిగా ఉండేది. దానికి అన్ని వైపుల నుంచీ పుష్కలంగా జీవనోపాధి లభించేది. మరి ఆ పట్నవాసులు అల్లాహ్‌ అనుగ్రహాలపై కృతఘ్నత చూపగా, అల్లాహ్‌ వారి స్వయంకృతాలకు బదులుగా వారికి ఆకలి, భయాందోళనల రుచి చూపించాడు. [ఇబ్ను కసీర్].