స్వార్థపరులైన సోదరులు (తోట వారి గాథ)  – ఖురాన్ కథామాలిక

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

“ఆ సోదరులు నిద్ర పోతుండగానే నీ ప్రభువు తరఫున ఒక ఆపద వారి తోటను చుట్టుముట్టి పోయింది. అంతే! తెల్లవారే సరికల్లా ఆ తోట కోత కోసిన చేను మాదిరిగా అయిపోయింది.(ఖుర్ఆన్ 68 : 19 – 20)

ఒ క రోజు ప్రాతఃకాలం, నలు దిశలా ప్రశాంత వాతావరణం అలుముకుని ఉంది. రాతి నేలపై చేతికర్రతో కొడుతూ ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తోంది. మధ్యమధ్యలో ఆ వ్యక్తి ఆయాసంతో దీర్ఘశ్వాస విడువడం కూడా చెవులకు సోకుతోంది. ఆ వ్యక్తి ఒక ముసలివాడు.ఆయన తన తోట వద్దకు వెళుతున్నాడు.ఆ తోటలో అనేక పండ్ల చెట్లు ఉన్నాయి. చెట్లన్నీ విరగకాసాయి. తోట మధ్యలో ఒక సెలయేరు ప్రవహిస్తోంది. అనేక పూల వాసనతో అక్కడ గాలి మధురంగా గుబాళిస్తోంది. ప్రాతఃకాలం మసకమసక వెలుతురు నెమ్మదిగా ప్రకాశ మానం అవుతోంది. పక్షులు ప్రపంచాన్ని నిద్రలేపడానికి కిలకిలరావాలు ప్రారంభించాయి. కాని ఈ ప్రకృతి సౌందర్యం ఆ ముసలి వ్యక్తి ధ్యాసను మరల్చలేదు. విశ్వప్రభువు అనుగ్రహాలను అన్వేషించే విషయంలో ఆయన ఏమాత్రం నిర్లక్ష్యంచేయదలచుకోలేదు. ఆయన సమయం కాగానే అల్లాహ్ ను స్మరిస్తూ నమాజు చేసి అల్లాహ్ అనుగ్రహాలకు కృతజ్ఞతలు చెల్లించాడు.

తన తోటలోకి ఆయన అందరినీ అనుమతించేవాడు. అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే అవకాశం కల్పించేవాడు. అయితే ఎవరూ తన తోటను నాశనం చేయకుండా జాగ్రత్తగా ఉండేవాడు. తోటలో పండ్లను దించేటప్పుడు బీదలను పిలిచి వారికి ఉదారంగా తన ఫలసాయం నుంచి పంచి పెట్టేవాడు. అంతేకాదు, తోటలో దించకుండా మిగిలిపోయిన పండ్లను దించుకునే అనుమతి బీదలకు ఇచ్చేవాడు.

ఆ ముసలి వ్యక్తికి ముగ్గురు కుమారులు. అందులో ఇద్దరు తమ తండ్రికి పూర్తి విరుద్ధమైన స్వభావం కలిగిన వారు. తమ తండ్రి ఉదారంగా చేసే దానధర్మాలు వారికి సహించేవి కావు. వారిలో ఒకడు తండ్రితో, “మీరు బీదలకు అంతా పంచి పెట్టి మాకు రావలసిన వాటా తగ్గిపోయేలా చేస్తున్నారు” అని కూడా అన్నాడు. రెండవ కుమారుడు మరింత ముందుకు పోయి, ”మీ దానధర్మాలు చివరకు మనల్ని కూడా బిచ్చగాళ్ళయ్యేలా చేస్తాయి” అన్నాడు. ఇది విన్న మూడవ కుమారుడు జవాబు చెప్పబోయాడు. కాని తండ్రి అతడిని వారించాడు. ఆ ముసలి వ్యక్తి తన కుమారులను విచారంగా చూస్తూ, “పిల్లల్లారా! నేను దానధర్మాలు చేయడం వల్ల మనం బీదవాళ్ళమై పోతామని మీరనుకోవడం చాలా పొరపాటు. ఇది స్వార్థపూరితమైన ఆలోచన. మీరు కోరుతున్న ఈ సంపద నిజానికి మీది కాదు, నాది కాదు. ఈ సంపద అల్లాహ్ ది. నేను కేవలం ఈ సంపదకు పర్యవేక్షకుడిని మాత్రమే. ఈ సంపదను కేవలం నా స్వంతానికి మాత్రమే ఖర్చు చేసుకునే అనుమతి నాకు లేదు. అల్లాహ్ సృష్టించిన మిగిలిన వారికి కూడా దీనిలో భాగం ఉంది. ముఖ్యంగా బీదలకు, బాటసారులకు, అవసరార్థులకు ఇందులో భాగం ఉంది. పక్షులు, క్రిమి కీటకాలకు కూడా ఇందులో భాగం ఉంది. ఎందుకంటే, అవి కూడా అల్లాహ్ సృష్టిలోనివే. ఆ తర్వాత మిగిలినదే మనది. ఆ విధం గానే మనిషి తన సంపదను పరిశుద్ధం చేసుకోగలడు. సౌభాగ్యాన్ని, సంపదలో వృద్ధిని పొందగలడు. నేను ఈ విధానాన్ని నా యవ్వనం నుంచి అనుసరిస్తూ వస్తున్నాను. మరణించే వరకు ఈ పద్ధతికే కట్టుబడి ఉంటాను.

ఇప్పుడు నేను ముసలివాడినై పోయాను. నా శరీరం వ్యాధులతో క్రుంగిపోయింది. నా చావు ఇక ఎంతో దూరంలో లేదు. కాబట్టి ఇదంతా మీరు స్వంతంచేసుకునే రోజు పెద్ద దూరంలో లేదు. అప్పుడు మీ ముందు రెండు దారులుంటాయి. మీరు కూడా నా మాదిరిగా మీ సంపదను అల్లాహ్ మార్గంలో ఖర్చుచేస్తే అల్లాహ్ మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. కాని మీరు స్వార్థపరులై సంపదనుఅల్లాహ్ మార్గంలో ఖర్చు చేయకపోతే మీరు ఆయన అనుగ్రహాలను కోల్పోవడమేకాదు, చివరకు ఉత్త చేతులతో మిగులుతారు. కాబట్టి కుమారులారా! అల్లాహ్మనల్ని ఇలా ఉండాలని ఆదేశిస్తున్నాడు” అని చెప్పాడు.

ఈ సంభాషణ జరిగిన కొంత కాలానికే ఆ ముసలి వ్యక్తి మరణించాడు.తర్వాత తోటలో పండ్లు దించే సమయం వచ్చినప్పుడు బీదలు ఎప్పటి మాదిరిగా అక్కడకు వచ్చి తమకు కూడా ఇవ్వడం జరుగుతుందని ఎదురు చూడసాగారు.కాని ఇప్పుడు ఆ తోటకు యజమానులు కుమారులు. వాళ్ళు బీదలకు తోటలోలభించే పండ్లలో ఏదీ ఇవ్వరాదని, బాటసారులు తోటలో ప్రవేశించే అనుమతి ఇవ్వరాదని నిర్ణయించుకున్నారు. కాని మూడవ కుమారుడు తండ్రిని పోలినవాడు. అతను తన సోదరులతో, “మీరు చెప్పే మాటలు దుర్మార్గంతో కూడుకున్నవి. దుర్మార్గం చెడును కొనితెస్తుంది. బీదలను కాదనడం ద్వారా మనం ప్రయోజనాలు పొందలేం. పైగా మనం స్వయంగా ఇబ్బందులకు గురికావచ్చు. కాబట్టి అల్లాహ్ ప్రసాదించిన ఈ సంపద మన తండ్రి వద్ద ఉన్నప్పుడు ఆయన ఎలా ఇచ్చేవారో అలాగే ఇవ్వడం మంచిది” అన్నాడు. కాని సోదరులు ఈమాటలకు ఆగ్రహించి, “నీకు సంబంధంలేని వ్యవహారాల్లో మాకు సలహాలు ఇవ్వవద్దు. నాన్న బ్రతికి ఉన్నప్పుడు చాలా సలహాలు తీసుకున్నాం” అన్నారు.కాని మూడవ కుమారుడు తన పట్టు వదల్లేదు. ”మనం అల్లాహ్ ను ప్రార్థించి అల్లాహ్ మార్గదర్శనాన్ని కోరుకుందాం.. ప్రార్థన మనిషిని చెడు నుంచి కాపాడుతుంది” అన్నాడు. కాని సోదరులు అతని మాటలను ఏమాత్రం లక్ష్యపెట్టలేదు.

మరుసటి రోజు తెల్లవారుజామున లేచి తోటలోని పండ్లను దించి తామేపంచుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. అలాగే మరుసటి రోజు తెల్లవారుజామున తోటకు వెళ్ళారు. కాని అక్కడ కనబడిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు. వారి తోట పరిస్థితే మారిపోయింది. అంతా నాశనమై పోయింది.అసలు గుర్తుపట్టడానికి కూడా వీల్లేకుండా మారిపోయింది.

ఈ వార్త మూడవ కుమారునికి తెలిసి, “మీ దుర్మార్గపు ఆలోచనల వల్లఏమయ్యిందో చూడండి” అని వ్యాఖ్యానించాడు. ఇద్దరు సోదరులు తమ తప్పు తెలుసుకుని అల్లాహ్ ను క్షమాభిక్ష కోరారు. “మా ప్రభువు పరిశుద్ధుడు.. నిజంగానే మేము పాపాత్ములం… మన ప్రభువు దీనికి బదులు దీనికన్నా మెరుగైన తోటను మనకు ప్రసాదించడం అసంభవమేమీ కాదు” అన్నారు.(చదవండి దివ్యఖుర్ఆన్ : 68:17-33)

అల్లాహ్ మనకు సంపదను ఒక బాధ్యతగా అప్పగిస్తాడు. దానితో మనం ఏం చేస్తామో పరీక్షిస్తాడు. ఆ సంపదలో బీదలకు, అవసరార్థులకు, బాటసారులకు ఇవ్వడానికి నిరాకరిస్తే అల్లాహ్ సంపదను తీసుకుని అనేక విధాలుగా శిక్షిస్తాడు. మనం చేసిన తప్పుకు చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడితే, అల్లాహ్ తాను తీసుకున్న దానికన్నా మెరుగైనది ప్రసాదిస్తాడు.

ఖురాన్ కథామాలిక – మూలం: షేఖ్ అబూబకర్ నజార్
Qur’an Katha Maalika – Selected Stories from Qur’an (Telugu)
తెలుగు అనువాదం: అబ్దుల్ వాహెద్ & ఎస్. ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్,హైదరాబాద్
https://teluguislam.net/2022/11/12/stories-from-the-quran/

మహా సంపన్నుడు ఖారూన్ – ఖురాన్ కథామాలిక

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

(పూర్వకాలంలో కథకులు, గొప్ప సంపద అని చెప్పడానికి ‘ఖారూన్ సంపద’ అని పోల్చి చెప్పేవారు. అంటే సాటిలేని మహా సంపద అన్న భావంతో వాడేవారు.)

فَخَسَفْنَا بِهِ وَبِدَارِهِ الْأَرْضَ فَمَا كَانَ لَهُ مِن فِئَةٍ يَنصُرُونَهُ مِن دُونِ اللَّهِ وَمَا كَانَ مِنَ الْمُنتَصِرِينَ

“చివరికి మేము ఖారూన్ ను, అతని నివాసాన్ని నేలలో కూర్చివేశాము. అప్పుడు అల్లాహ్ బారి నుంచి అతన్ని ఆదుకోవటానికి ఏ సమూహమూ లేకపోయింది. మరి వాడు సయితం తనకు ఏ సాయమూ చేసుకోలేకపోయాడు.” ( సూరా అల్ ఖసస్ 28: 81)

ఖారూన్, ప్రవక్త మూసా (అలైహిస్సలాం) వంశానికి చెందినవాడు. చాలా సంపన్నుడు. ఒక మహా ప్రాసాదంలో భోగభాగ్యాలతో జీవించేవాడు. అత్యంత ఖరీదైన దుస్తులు ధరించేవాడు. అసంఖ్యాక బానిసలు ఎల్లప్పుడూ అతని సేవకు సిద్ధంగా ఉండేవారు. అన్ని రకాల సుఖవిలాసాలతో ఆడంబరంగా జీవితం గడిపేవాడు. అపారమైన ధన సంపత్తులు అతనిలో గర్వాన్ని పెంచాయి. అహంకారంతో విర్రవీగేవాడు.

ఖారూన్ బీదలను చూసి అసహ్యించుకునేవాడు. తెలివితేటలు లేకపోవడం వల్లనే వారు బీదరికంలో మగ్గుతున్నారని ఈసడించుకునేవాడు. తన తెలివితేటలు, వ్యాపార నైపుణ్యం వల్లనే తనకు అపార సంపద లభించిం దాని మిడిసిపడేవాడు.

జకాత్* చెల్లించవలసిందిగా ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అతడికి చెప్పారు. జకాత్ అన్నది బీదలకు ఒక హక్కుగా సంపన్నులు చెల్లించవలసిన నిర్ధారిత వాటా. విశ్వాసులందరూ తప్పనిసరిగా జకాత్ చెల్లించాలని అల్లాహ్ ఆదేశించాడు. కాని ఈ సలహా విన్న ఖారూన్ కోపంతో మండిపడ్డాడు. తనపై అల్లాహ్ అనుగ్రహం వర్షిస్తుందని, తన ధన సంపదలే అందుకు నిదర్శనమని ప్రవక్త మూసా (అలైహిస్సలాం)తో చెప్పాడు. తన జీవిత విధానాన్నిఆమోదించినందు వల్లనే అల్లాహ్ తన సంపదను అనునిత్యం పెంచుతున్నాడని వాదించాడు. ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అతడికి నచ్చ జెప్పారు. దుర్మార్గపు ఆలోచనల పరిణామాలు నష్టదాయకంగా ఉంటాయని హెచ్చరించారు.

చివరకు ఖారూన్ తన సంపదపై జకాత్ లెక్కించాడు. జకాత్ను లెక్కిస్తే తాను చెల్లించవలసిన మొత్తం అతడికి చాలా ఎక్కువగా కనబడింది. అంత మొత్తం చెల్లించాలంటే ప్రాణాలు పోయినట్లనిపించింది. జకాత్ చెల్లించేది లేదని తిరస్కరించడమే కాదు, ప్రవక్త మూసా (అలైహిస్సలాం) తన స్వార్థప్రయోజనాల కోసం జకాత్ చట్టం తీసుకొచ్చారని ప్రచారం మొదలుపెట్టాడు. ప్రవక్త మూసా (అస)కు వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టడానికి కొంతమందికి లంచాలు కూడా ఇచ్చాడు. ప్రవక్త మూసా (అలైహిస్సలాం) గురించి నానావిధాల పుకార్లు వ్యాపించేలా చేశాడు.

ఖారూన్ కుట్రల గురించి అల్లాహ్, ప్రవక్త మూసా (అలైహిస్సలాం)ను హెచ్చరించాడు. ఖారూన్ పిసినారితనానికి, అల్లాహ్ చట్టాల పట్ల అతని తిరస్కారానికిగాను అతడిని శిక్షించాలని ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ ను ప్రార్దించారు. అల్లాహ్ ఆగ్రహం ఖారూన్ పై విరుచుకుపడింది. భూమి ఒక్కసారిగా పగులుబారి ఖారూన్ సహా అతడి భవనాన్ని, యావత్తు సంపదను తనలో కలిపేసుకుంది. ఖారూన్ అనేవాడు ఒకప్పుడు ఉండేవాడన్న చిహ్నాలు కూడా లేకుండా అతడు తుడిచిపెట్టుకు పోయాడు. ఖారూన్ సంఘటన మూసా (అలైహిస్సలాం) జాతి ప్రజలకు ఒక గుణపాఠంగా మిగిలి పోయింది.

ఈ విషయమై దివ్య ఖుర్ఆన్లో ఇంకా ఏముందంటే, ఖారూన్ సంపదను చూసి ఈర్ష్యపడిన వారు, అప్పటి వరకు ఖారూనను కీర్తించడమే ఘనకార్యంగా భావించిన వారు ఈ సంఘటన తర్వాత, “అల్లాహ్ ఎవరికి తలచుకుంటే వారికి సంపద ఇస్తాడు. ఎవరికి తలచుకుంటే వారికి నిరాకరిస్తాడు. మనపై అల్లాహ్ అనుగ్రహం లేనట్లయితే మనల్ని కూడా భూమి మ్రింగేసి ఉండేది. అల్లాహ్ ను తిరస్కరించేవారు పురోభివృద్ధి సాధించలేరు. ఈ ప్రపంచంలో ఔన్నత్యాన్ని కోరుకోని వారికి, దుర్మార్గానికి పాల్పడని వారికి మాత్రమే పరలోక స్వర్గవనాలు లభిస్తాయి” అనడం ప్రారంభించారు.

ఖారూన్ వంటి వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కొంతమంది నడమంత్రపు సిరి పొంది తమ పాత రోజులను, అప్పటి కష్టాలను మరచి పోతారు. తాము కష్టపడి, శ్రమించి తమ తెలివితేటలతో సంపాదించిందే అంతా అనుకుంటారు. అందులో అల్లాహ్ కారుణ్యం లేదని భావిస్తారు. అల్లాహ్ పట్ల ఏలాంటి కృతజ్ఞత చూపించరు. అల్లాహ్ ఆదేశాలను విస్మరిస్తారు. బీదసాదలకు ఏలాంటి సహాయం అందించడం వారికి ఇష్టం ఉండదు. పైగా తమ సంపదను పెద్ద భవనాలు కట్టడం ద్వారా సంపన్నులకు గొప్ప విందులు ఇవ్వడం ద్వారా, అనవసరమైన ఆడంబరాల ద్వారా, ఖరీదైన దుస్తులు, వాహనాల ద్వారా ప్రదర్శిస్తూ విర్రవీగు తుంటారు. మరికొందరు ఇందుకు విరుద్ధంగా అత్యంత పిసినారులుగా మారిపోతారు. పిల్లికి బిచ్చమెత్తని ధోరణి ప్రదర్శిస్తారు. స్వంతం కోసం, తమ కుటుంబం కోసం ఖర్చుపెట్టడానికి కూడా వెనుకాడుతారు. సంపద పోగుచేయడంలోనే మునిగిపోతారు. కాని ఇలాంటి వారు తాము ఈ ప్రపంచంలో కేవలం కొంత సమయం గడిపి వెళ్ళడానికి వచ్చామన్న వాస్తవాన్ని మరచిపోతుంటారు.

అల్లాహ్ నిర్దేశించిన వాటాను బీదలకు చెల్లించడం ద్వారా మనిషి తన సంపదను పరిశుద్ధం చేసుకుంటాడు. లేనట్లయితే సంపద కలుషితమై పోతుంది. సంపద ఒక శాపంగా మారిపోతుంది. తన మార్గంలో ఖర్చు చేసిన సంపదను అనేక రెట్లు పెంచి ఇస్తానని అల్లాహ్ వాగ్దానం చేస్తున్నాడు. దాన ధర్మాలకు ఖర్చు చేసినది తనకు ఇచ్చిన ఉత్తమమైన రుణంగా అల్లాహ్ అభివర్ణిస్తున్నాడు. అల్లాహ్ కు రుణం ఇచ్చి ఆయన నుంచి తిరిగి పొందడం అన్నది మనిషికి ఎంత గౌరవప్రదం! ఎంత శుభప్రదం!!

అల్లాహ్ మనిషికి ధనసంపదలను ఒక పరీక్షగా అప్పగిస్తాడు (అమానత్-అంటే ఏదన్నా వస్తువును జాగ్రత్తగా ఉంచమని ఎవరికైనా అప్పగించడం), ధనసంపదలు కూడా అల్లాహ్ మనిషికి అప్పగించిన అమానత్ (అప్పగింత). తాను ఇచ్చిన ధనసంపదలతో ఎవరు ఏం చేస్తారన్నది చూడడానికి అల్లాహ్ వాటిని ప్రసాదిస్తాడు.

ఖురాన్ కథామాలిక – మూలం: షేఖ్ అబూబకర్ నజార్
Qur’an Katha Maalika – Selected Stories from Qur’an (Telugu)
తెలుగు అనువాదం: అబ్దుల్ వాహెద్ & హాఫిజ్ ఎస్. ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్,హైదరాబాద్
https://teluguislam.net/2022/11/12/stories-from-the-quran/