
అల్లాహ్ ఏకత్వం (అఖీదా ఏ తౌహీద్) పుస్తకం
Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan
డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్
ప్రవక్త సహచరుల మధ్య విభేదాల, అంతఃకలహాల విషయంలో అహ్లె సున్నత్ వల్ జమాఅత్ వైఖరి :
ఉపద్రవానికి మూలం: ప్రవక్త ప్రియ సహచరుల మధ్య చీలిక రావటానికి ప్రధాన కారకులు యూదులు. వారు ఇస్లాంకు, ముస్లిములకు వ్యతిరేకంగా కుట్రపన్నారు. వారు వంచనా శిల్పనిష్ణాతుడైన, యమన్ దేశస్థుడైన అబ్దుల్లాహ్ బిన్ సబా అనే యూద వ్యక్తిని దీని కొరకు సిద్ధం చేశారు. వాడు ఇస్లాం స్వీకరిస్తున్నట్లు నాటకమాడి తన చుట్టూ ఓ సుందర వలయాన్ని అల్లుకున్నాడు. తరువాత అతను తృతీయ ఖలీఫా అయిన హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)కు వ్యతిరేకంగా దుర్విమర్శలు చేయటం మొదలెట్టాడు. చివరకు ఆయనపై విషం కక్కాడు. ఆయనపై అపనిందలు కూడా మోపాడు. తత్ఫలితంగా సంకుచిత స్వభావులు, బలహీన విశ్వాసం గలవారు కొందరు అతని మాటల్లో పడి, అసమ్మతి వాదులుగా అతని చుట్టూ చేరారు. వారి కుట్ర మూలంగా హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) నిర్దాక్షిణ్యంగా హత్యచేయబడ్డారు. ఆయన (రదియల్లాహు అన్హు) అమరగతినొందిన తరువాత ముస్లిములలో విభేదాలు పొడసూపాయి. దానికి తోడు యూదులు చాపకింద నీరులా ప్రవహించి ప్రజలను రెచ్చగొట్టడంతో ప్రవక్త సహచరుల మధ్య విభేదాలు మరింత తీవ్రరూపం దాల్చాయి. వారు తమ తమ ఇత్తెహాద్ ప్రకారం (అంటే వారిలో ప్రతి ఒక్కరూ తాము ఎన్నుకునే విధానమే సరైనదని భావించటం వల్ల) కలహాలకు, యుద్ధాలకు తెరలేచింది.
‘అఖీదయే తహావీయ’ వ్యాఖ్యాత ఇలా అంటున్నారు:
“రఫ్ద్ (షియాతత్వం) అనే ఉపద్రవాన్ని ఓ కపట విశ్వాసి సృష్టించాడు. ఇస్లాం ధర్మాన్ని రూపుమాపి, ఇస్లాం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వ్యక్తిత్వాన్ని కళంకితం చేయాలన్నది వాడి ఉద్దేశ్యం. అందుకే అబ్దుల్లాహ్ బిన్ సబా ఇస్లాం స్వీకరించినట్లు ప్రకటించగానే తన వంచనాపూరిత, మోసపూరిత చేష్టల ద్వారా ఇస్లాం ధర్మానికి తూట్లు పొడవటం మొదలెట్టాడు. క్రైస్తవ మతం పట్ల పౌల్ వ్యవహరించినట్లే ఇతనూ వ్యవహరించాడు. అంటే తనను ఒక మహా సాత్వికునిగా, దుష్ట శిక్షకు శిష్టరక్షణకు నడుం బిగించిన వానిగా చాటుకుని తనచుట్టూ ఓ సుందరవలయాన్ని అల్లుకున్నాడు. ఆ తరువాత హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)కు వ్యతిరేకంగా అసంతృప్త వాదాన్ని వ్యాపింపజేసి, ఆయన్ని హతమార్చే ప్రయత్నం చేశాడు. దరిమిలా ‘కూఫా’ వచ్చి, హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు)కి వీరాభిమానిగా ప్రకటించుకుని, ఆయనను పొగడటంలో అతిశయిల్లి రాగానపడ్డాడు. ఆ విధంగా ఆయన (రదియల్లాహు అన్హు)అభిమానం చూరగొని, తన తుచ్ఛమయిన ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకుందామనుకున్నాడు. అతని కుత్సితబుద్ధి గురించి తెలియగానే హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు), అతన్ని హతమార్చమని ఆదేశించారు. దాంతో వాడు ‘ఖర్ ఖైస్’కు పలాయనం చిత్తగించాడు. అతని పూర్తి వృత్తాంతం చరిత్రపుటల్లో ఉంది.”
షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు :
హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) అమరగతి నొందిన తరువాత ప్రజల గుండెలు శోకంతో అవిసిపోయాయి. వారి హృదయాలు భగ్న హృదయాలైపోయాయి. ముస్లింలపై దుఃఖ పర్వతం విరుచుకుపడింది. దుష్టశక్తులు చెలరేగిపోయాయి. సజ్జనుల ఆత్మ విశ్వాసం సన్నిగిల్లిపోయింది. అప్పటి వరకూ అణగిమణగి ఉండేవారు ఉపద్రవాన్ని వ్యాపింపజేయటంలో కృతకృత్యులైపోయారు. సంస్కరణా సరణిని అవలంబించదలచిన వారు అశక్తులైపోయారు. అందువల్ల వారంతా ఖిలాఫతకు అందరికన్నా ఎక్కువ అర్హులైన హజ్రత్ అలీ బిన్ అబితాలిబ్ (రదియల్లాహు అన్హు) చేతులపై ప్రతిజ్ఞ (బైఅత్) చేశారు. కాని అప్పటికే ఉపద్రవాగ్ని రాజుకుని ఉండటం వల్ల, ప్రజల హృదయాలు భగ్నమై ఉండటం వల్ల సమాజంలో సమైక్యత, సంఘఠితత్వం సాధ్యం కాలేకపోయింది. ముస్లింలలో సామూహికత వేళ్లూను కోలేక పోయింది. ఆనాటి ఖలీఫాగానీ, సమాజంలో మానవనవనీతంగా పరిగణించబడే మంచివారుగాని ఎంతగా అభిలషించినప్పటికీ అనుకున్న మంచిని సాధించలేకపోయారు. విచ్చిన్నకరమైన ఆ వాతావరణంలో మరికొందరు స్వార్ధపరులు కూడా జొరబడ్డారు. ఆ తరువాత జరగవలసినదంతా జరిగిపోయింది.”
(మజ్మూఅ అల్ ఫతావా : 25/304, 305)
ఇకపోతే హజ్రత్ అలీ, ముఆవియా (రదియల్లాహు అన్హుమ్)ల యుద్ధంలో పాల్గొన్న ప్రవక్త ప్రియ సహచరుల సంజాయిషీ (కారణం)ని వివరిస్తూ షేఖుల్ ఇస్లాం ఇలా అభిప్రాయపడ్డారు:
ముఆవియా (రదియల్లాహు అన్హు) అలీ (రదియల్లాహు అన్హు)తో యుద్దానికి సంసిద్ధమైనపుడు ఖిలాఫత్ తనకే చెందాలని ఆయన కోరలేదు. ఆయనకు ఖిలాఫత్ కట్టబెట్టే విషయమై బైఅత్ (ప్రతిజ్ఞ) కూడా చేయించలేదు. తానొక ఖలీఫా అనే భావనతో ఆయన యుద్ధానికి రాలేదు. ఈ విషయం గురించి ముఆవియా (రదియల్లాహు అన్హు)ను ఎవరు ప్రశ్నించినా వారి ముందు ఆయన ఇదంతా చెప్పేవారు. ఆయన అనుయాయులు కూడా అంతే. వారు అలీ (రదియల్లాహు అన్హు)తోనూ, అలీ సహచరులతోనూ యుద్ధానికి ముందంజ వేయలేదు. అదే సమయంలో హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు), మరియు ఆయన సహచరుల ఆలోచనలు మరోవిధంగా ఉన్నాయి – తానొక ఖలీఫా కావటం చేత ముఆవియ మరియు ముఆవియా సహచరులు వచ్చి తన చేతుల మీద ప్రమాణ స్వీకారం చేయాలన్నది అలీ (రదియల్లాహు అన్హు) అభిలాష. ఎందుకంటే ముస్లింలకు ఖలీఫాగా ఒకే వ్యక్తి ఉండాలి. కాని వారు తనకు విధేయత చూపటం లేదు. తన చేతిపై ‘ప్రమాణం’ చేయటం లేదు సరికదా, తమను స్వతంత్రులుగా ఊహించుకుంటున్నారు. తమ వద్ద శక్తి ఉంది. అధికార బలం ఉంది. అయినప్పటికీ వారు మాట వినటం లేదు. కాబట్టి వారితో యుద్ధం చేసి, వారిని దారికి రప్పించాలి. తద్వారా వారు ఖలీఫాకు విధేయులవుతారు. ఆ విధంగా ముస్లింల సామూహిక వ్యవస్థ పటిష్టంగా ఉండగలుగుతుంది – ఇదీ హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) మరియు ఆయన సహచరుల ఆలోచన. కాగా; హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) మరియు ఆయన సహచరుల ఆలోచనా తీరు తద్భిన్నంగా ఉంది : తాము అలీ (రదియల్లాహు అన్హు)చేతులపై ‘ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. ఈ కారణంగా ఒకవేళ తమతో యుద్ధం చేయబడినా తాము బాధిత ప్రజల కోవకే చెందుతాము. ఎందుకంటే తృతీయ ఖలీఫా హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)దారుణంగా హత్య చేయబడ్డారు. ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)ను హత్య చేయటంలో కీలకపాత్ర పోషించినవారు ప్రస్తుతం హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) సైన్యంలో ఉన్నారు. సైనిక విభాగంలో వారి ప్రాబల్యం కూడా ఎక్కువగానే ఉంది. మనం గనక ఈ సమయంలో నిర్లిప్తంగా ఉండిపోతే వారు మరింతగా విజృంభించి మనపై జులుంకు ఒడిగట్టవచ్చు. అదే గనక జరిగితే ఖలీఫా హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) వారిని నిలువరించలేరు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)ను ముట్టడించినపుడు అలీ (రదియల్లాహు అన్హు) ఎలా నిస్సహాయులుగా ఉండిపోయారో అలాగే ఉండిపోవచ్చు. కాబట్టి మనకు న్యాయం చేసే ప్రతిభావంతుడైన ఖలీఫా చేతుల మీద మాత్రమే మనం బైఅత్ (ప్రతిజ్ఞ) చేయాలి.”
సహాబా (రదియల్లాహు అన్హుమ్)మధ్య పొడసూపిన విభేదాలు, అంతఃకలహాల ఫలితంగా జరిగిన యుద్ధాలు – ఈ విషయంలో అహ్లె సున్నత్ వల్ జమాఅత్ వైఖరి రెండు విషయాలపై ఆధారపడి ఉంది.
ఒకటి : ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రియసహచరుల (రదియల్లాహు అన్హుమ్) మధ్య తలెత్తిన వివాదాలపై, అవాంఛనీయ ఘటనలపై అహ్లె సున్నత్ వల్ జమాఅత్ కి చెందిన వారు నోరెత్తకుండా మౌనం వహించటమే శ్రేయస్కరమని భావిస్తారు. ఈ రగడపై వారు తర్జనభర్జన చేయటంగానీ, తమవైన అభిప్రాయాలు వ్యక్తపరచటం గానీ చేయరు. పైగా వారిలా వేడుకుంటూ ఉంటారు:
“మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయా లలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదుస్వభావుడవు. కనికరించేవాడవు.” (అల్ హష్ర్ :10)
రెండు: సహాబా (ప్రవక్త సహచరులు రదియల్లాహు అన్హుమ్) గురించి ప్రాచుర్యంలో ఉన్న కథనాలకు సమాధానాలివ్వటం. దీనికి సంబంధించిన కొన్ని పద్ధతులు ఇవి :
మొదటి పద్దతి:
అలాంటి కథనాల (ఆసార్)లో కొన్ని పచ్చి అబద్దాలు. ప్రవక్త సహచరులకు అపఖ్యాతి అంటగట్టడానికి ఇస్లాం విరోధులచే సృష్టించబడిన కట్టుకథలవి.
రెండవ పద్ధతి:
సహాబాకు సంబంధించిన మరికొన్ని కథనాలున్నాయి. వాటిలో హెచ్చుతగ్గులు, మార్పులు చేర్పులుచేయబడ్డాయి. ఆ విధంగా వాటి రూపురేఖలనే మార్చివేయటం జరిగింది. అందులో అబద్దం పాళ్ళు అధికం. కాబట్టి అలాంటి వాటిని కూడా పట్టించుకోకుండా ఉండటమే శ్రేయస్కరం.
మూడవ పద్ధతి:
ఆ కథనాలలో ప్రామాణికం అనదగినవి, అలాంటివి చాలా తక్కువే. ఈ విషయంలో మటుకు ప్రవక్త సహచరులు అశక్తులు, క్షంతవ్యులు. ఎందుకంటే వారు ఆ విషయాలలో తమ ‘ఇత్తెహాద్’ ప్రకారం పనిచేశారు. అందులో వారు సత్యం వరకూ చేరుకున్నారు లేదా వారివల్ల పొరపాటు కూడా జరిగి ఉండవచ్చు. ఎందుకంటే వారు ‘ముజ్తహిద్’ లు (సమకాలీన సవాళ్ళను షరీఅత్ బద్దంగా అన్వయించటానికి శాయశక్తులా కృషిచేసిన విజ్ఞులు). ఈ అన్వయింపు ప్రయత్నంలో వారు సరైన ఆజ్ఞ వరకూ చేరగలిగితే వారికి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. ఒకవేళ వారు సరైన నిర్ణయానికి చేరుకోలేకపోయినప్పటికీ – వారివల్ల పొరపాటు జరిగినప్పటికీ – చిత్తశుద్దితో కూడిన వారి కృషికి గాను ఒకింత పుణ్యఫలం లభిస్తుంది. మరోవైపు వారి తప్పు కూడా మన్నించబడుతుంది. ఎందుకంటే హదీసులో ఇలా అనబడింది
“న్యాయ నిర్ణయం గైకొనే వ్యక్తి ‘ఇజ్తిహాద్’ చేసినపుడు అతను సరైన నిర్ణయానికి చేరుకోగలిగితే అతనికి రెండింతల ప్రతిఫలం ప్రాప్తమవుతుంది. ఒకవేళ అతని వల్ల పొరపాటు జరిగినట్లయితే అతనికి ఒకింత ప్రతిఫలం లభిస్తుంది.” (బుఖారీ, ముస్లిం)
నాల్గవ పద్ధతి:
ప్రవక్త సహచరులు (సహాబా రదియల్లాహు అన్హుమ్) కూడా మానవమాత్రులే. వారివల్ల కూడా తప్పులు జరగటం సహజం. వ్యక్తిగతంగా చూస్తే వారు దోషరహితులు కారు. అయితే వారివల్ల జరిగే పొరపాట్లను పరిహరించే మరెన్నో పనులు, అంశాలున్నాయి. అవి వారి పాపాలకు పరిహారంగా ఉపయోగపడతాయి. అలాంటి వాటిలో కొన్ని ఇవి
1. బహుశా వారు పశ్చాత్తాపపడ్డారేమో! తప్పులు ఎన్ని జరిగి ఉన్నాసరే, పశ్చాత్తాపం (తౌబా) వాటిని రూపుమాపుతుంది.
2. ఒకవేళ వారివల్ల అలాంటిదేదైనా జరిగి ఉన్నా, మరెన్నో విషయాలలో వారు ముందంజవేసి ఉన్నారు. వారివల్ల జరిగిన తప్పుల మన్నింపునకు అవి సాధనం కావచ్చు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
“నిశ్చయంగా పుణ్యకార్యాలు పాపకార్యాలను దూరం చేస్తాయి.” (హూద్ : 114)
3. వారి పుణ్యకార్యాలు వేరితరుల కంటే ఎన్నో రెట్లు పెంచబడవచ్చు. గొప్పతనం విషయంలో ఇతర వ్యక్తులు వారితో సరితూగలేరు. వారు మంచి కాలానికి చెందినవారని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి ప్రవచనం ద్వారానే రూఢీ అయింది. వారిలో ఎవరయినా ఒక ‘ముద్’కు సమానంగా దానం చేస్తే అది ఇతరులు ఉహుద్ పర్వతానికి సమానంగా దానం చేసిన బంగారం కన్నా గొప్పది. అల్లాహ్ వారితో ప్రసన్నుడవుగాక! వారిని సంతోషంగా ఉంచుగాక!
షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు :
“మొత్తం అహ్లె సున్నత్ వల్ జమాఅత్, ధర్మవేత్తల నమ్మకం (అఖీదా) ఏమిటంటే సహాబాలలో ఏ ఒక్కరూ దోష రహితులు, పవిత్రులు కారు. అలాగే ప్రవక్త బంధువులుగానీ, సహాబాలలో తొలికాలానికి చెందినవారు గానీ, ఇతరులు గానీ – వారెవరయినా వారివల్ల తప్పు జరగటం సహజం, సంభవం కూడా. అయితే అల్లాహ్ పశ్చాత్తాపం (తౌబా) ద్వారా వారి పాపాలను క్షమిస్తాడు. వారి అంతస్తులను ఉన్నతం చేస్తాడు. అలాగే పాపాలను రూపుమాపే సత్కార్యాల ద్వారా లేదా ఇతరత్రా కారణాల దృష్ట్యా వారిని క్షమిస్తాడు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
ఎవరయితే సత్యధర్మాన్ని తీసుకువచ్చారో, మరెవరయితే దానిని సత్యమని ధ్రువీకరించారో అటువంటివారే భయభక్తులు గలవారు. వారికోసం వారి ప్రభువు దగ్గర వారు కోరినదల్లా ఉంది. సదాచార సంపన్నులకు లభించే ప్రతిఫలం ఇదే. అల్లాహ్ వారి దురాచరణలను వారి నుండి దూరం చేయటానికి, వారు చేసిన సదాచరణలకు గాను ఉత్తమ పుణ్యఫలం ఇవ్వటానికి (ఈ వ్యవస్థను నెలకొల్పుతాడు). (అజ్ జుమర్ : 33-35)
ఇంకా ఈ విధంగా సెలవీయబడింది :
తుదకు అతను పూర్తి పరిపక్వతకు, అంటే నలభై ఏళ్ళ ప్రాయానికి చేరుకున్నప్పుడు ఇలా విన్నవించుకున్నాడు : “నా ప్రభూ! నీవు నా తల్లిదండ్రులపై కురిపించిన అనుగ్రహ భాగ్యాలకు గాను కృతజ్ఞతలు తెలుపుకునే, నీ ప్రసన్నతను చూరగొనే విధంగా సత్కార్యాలు చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించు. ఇంకా నా సంతానాన్ని కూడా సజ్జనులుగా తీర్చిదిద్దు. నేను నీ వైపునకే మరలుతున్నాను. నేను నీ విధేయులలో ఒకణ్ణి.” ఇలాంటి వారి సత్కార్యాలనే మేము స్వీకరిస్తాము. వారి తప్పులను క్షమిస్తాము. వారికి చేయబడిన సత్య వాగ్దానం ప్రకారం వారు స్వర్గవాసులలో ఉంటారు. (అల్ అహ్ ఖాఫ్ : 15,16)
(మజ్మూల ఫతావా : 35/69)
ప్రవక్త సహచరుల మధ్య తలెత్తిన విభేదాలను, పోరాటాలను ఇస్లాం శత్రువులు తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ సహాబా వ్యక్తిత్వాలపై బురదజల్లేందుకు ప్రయత్నించారు. వారి గౌరవ మర్యాదలను మంట గలిపేందుకు అవకాశంగా తీసుకున్నారు. అదే రకమయిన నీచ స్వభావంతో ఈనాటి కొందరు రచయితలు, సోకాల్డ్ మేధావులు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. వీరు అనాలోచితంగా సహాబాపై విమర్శలు గుప్పిస్తుంటారు. ఆ విధంగా వారు తమను తాము సహాబా వైఖరిపై తీర్పు చెప్పే న్యాయమూర్తులుగా ఊహించుకుంటున్నారు. తగు ఆధారాలు, నిదర్శనాలు లేకుండానే – కేవలం తమ మనోవాంఛలకు లోబడి – స్వార్థపరుల, కపట విమర్శకుల వ్యాఖ్యలను ఉదాహరిస్తూ కొంతమంది సహాబీలను సత్యవాదులుగా, మరికొంతమంది సహాబీలను దోషులుగా నిర్ధారిస్తున్నారు. అంతేకాదు, ఇస్లామీయ సంస్కృతీ నాగరికతల పట్ల తగు అవగాహన లేని కొంతమంది ముస్లిం యువకులలో – ఇస్లాం యొక్క గొప్ప చరిత్రపట్ల, తొలికాలపు మహనీయుల పట్ల లేనిపోని దురనుమానాలను నూరిపోస్తున్నారు. ఆ విధంగా వారిలో ఇస్లాం పట్ల ఏవగింపును కలిగించి, ముస్లిం సముదాయంలో చీలికను తీసుకురావాలని, తొలికాలపు సజ్జనుల పట్ల చివరి కాలపు ప్రజలలో ద్వేషాన్ని, వైషమ్యాన్ని రగుల్గొల్పాలని చూస్తున్నారు. దీనికి బదులు వారు తొలికాలపు సత్పురుషుల అడుగుజాడలలో నడచి, వారి కొరకు దుఆ చేసినట్లయితే ఎంత బాగుండేది! అలాంటి సద్భావన కలిగి ఉండే వారిని అల్లాహ్ సయితం శ్లాఘిస్తాడు. ఉదాహరణకు –
వారి తరువాత వచ్చిన వారు (తమ పూర్వీకులను గురించి) ఇలా వేడుకుంటారు : “మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదుస్వభావం కలిగినవాడవు. కనికరించేవాడవు.” (అల్ హష్ర్ : 10)
నుండి: అల్లాహ్ ఏకత్వం (అఖీదా ఏ తౌహీద్) పుస్తకం
Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan
డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్
You must be logged in to post a comment.