హజ్, ఉమ్రహ్ & జియారహ్ – ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో
షేఖ్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్ ).
ఈ వ్యాసం షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ రచించిన హజ్, ఉమ్రహ్ మరియు జియారహ్ అనే పుస్తకం నుండి తీసుకోబడింది. ఈ సంక్షిప్త మరియు సింపుల్ పుస్తకంలో రచయిత, హజ్ మరియు ఉమ్రహ్ యొక్క ఆరాధనా ఆచరణలన్నీ చాలా స్పష్టంగా వివరించారు.
అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్
రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్
- 1వ అధ్యాయం:
- హజ్ మరియు ఉమ్రహ్ తక్షణం పూర్తిచేయవలసిన విధులనటానికి ఋజువు
- హజ్ పూర్తిచేయటంలో త్వరపడవలెను
- జీవితంలో కనీసం ఒకసారైనా హజ్ మరియు ఉమ్రహ్ పూర్తిచేయవలసిన కర్తవ్యం, బాధ్యత
- తమ పాపాల మరియు తప్పుల మన్నింపు కొరకు క్షమాభిక్ష వేడుకోవటం
- హజ్ ఖర్చుల కొరకు వెచ్చించే ధనం న్యాయంగా సంపాదించినదై ఉండాలి
- హజ్ యొక్క ఉద్దేశం – అల్లాహ్ యొక్క ఇష్టము, ప్రీతి, సంతృప్తి, సంతుష్టి కొరకు ప్రయత్నించుట
- 2వ అధ్యాయం:
- మీఖాత్ చేరగానే హజ్ యాత్రికుడు ఏమి చేయాలి?
- బహిష్టు, ఇతర రక్తస్రావపు స్థితిలోని మహిళల కొరకు హజ్ నియమాలు
- గెడ్డం గీయడం అనుమతించబడలేదు
- మహిళలు ఏ దుస్తులలోనైనా ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించవచ్చును
- ఇహ్రాం నియ్యత్ కాకుండా వేరే నియ్యత్ ఉచ్ఛరించటమనేది ధర్మంలో లేని ఒక నూతన కల్పితాచారం
- మీఖాతుల గురించి
- ఇహ్రాం స్థితిలో ప్రవేశించకుండా మీఖాతు ప్రాంతాన్ని దాటడం హజ్ / ఉమ్రహ్ యాత్రికుని కొరకు నిషేధించబడింది
- హజ్ పూర్తి చేసిన తరువాత అనేకసార్లు ఉమ్రహ్ చేయటాన్ని షరిఅతు ప్రోత్సహించటం లేదు:
- హజ్ కాలంలో గాకుండా వేరే సమయంలో మీఖాతు ప్రాంతానికి చేరుకోవటం
- హజ్ నెలలో ఖుర్బానీ పశువు వెంట ఉన్న హజ్ యాత్రికుడు ఖిరాన్ (ఖుర్బానీ సమేతం) పద్ధతిలో హజ్ చేసే సంకల్పం చేసుకోవలెను మరియు ఖుర్బానీ పశువు వెంటలేని వ్యక్తి తమత్తు (సుఖసౌఖ్యాలు అనుభవించే) పద్ధతిలో హజ్ చేసే సంకల్పం చేసుకోవలెను
- షరతులతో కూడిన ఇహ్రాం
- చిన్నపిల్లల హజ్
- ఇహ్రాం స్థితిలో అనుమతింపబడిన మరియు నిషేధింపబడిన విషయాలు
- అల్లాహ్ ఆదేశాలను అనుసరించి ఇహ్రాం స్థితిలో ఉన్నవారు అనవరమైన వ్యర్థ సంభాషణలలో పాల్గొనరాదు, పాపాకార్యాలు చేయరాదు, పోరాడరాదు / ఘర్షణ పడరాదు.
- 3వ అధ్యాయం:
- మక్కా చేరుకున్నపుడు యాత్రికుడు ఏమి చేయాలి?
- మస్జిద్ అల్ హరమ్ లో ప్రవేశించటం మరియు తవాఫ్ (కాబా గృహ ప్రదక్షిణ)
- స్త్రీలు ముసుగులో ఉండటం మరియు తమ అందచందాలను ప్రదర్శించే విధంగా అలంకరించుకోకుండా ఉండటం తప్పనిసరి
- తవాఫ్ మరియు సయీల కొరకు ప్రత్యేకమైన దుఆలు ఏమీ లేవు
- సయీ మరియు దాని నియమాలు
- 4వ అధ్యాయం:
- దిల్ హజ్ 8వ తేదీన మీనాకు పయనమవటం
- అరఫహ్ మైదానానికి వెళ్ళడం
- అరఫహ్ మైదానంలో నిలబడుట మరియు అక్కడి ఇతర ఆరాధనలు
- ముజ్దలిఫహ్ లో రాత్రి గడపటం
- స్త్రీలను, పిల్లలను రాత్రి సమయంలోనే మీనా వైపు పంపివేయటానికి అనుమతి ఉంది
- ఉదయం మీనా వైపు వెళ్ళటం మరియు జమరతుల్ అఖబహ్ పై కంకర రాళ్ళు విసరటం
- ఖుర్బానీ అనుమతించబడిన దినాల గురించి
- హజ్జె తమత్తు పద్ధతిలో హజ్ చేసేవారికి ఒక సయీ చాలదు.
- ఐదవ అధ్యాయం:
- ఖుర్బానీ దినమున రమీ, నహర్, హలఖ్ మరియు తవాఫ్ ఆచరణలు ఒకదాని తర్వాత మరొకటి చేయాలి:
- మీనాకు మరలి రావటం మరియు మూడు దినాలు అక్కడ నివాసం ఉండుట:
- జమరాతులపై కంకర రాళ్ళు విసిరటం (రమీ చేయుట) గురించిన నియమాలు:
- మీనాలో కేవలం రెండు రోజులు మాత్రమే గడపడానికి అనుమతి ఉంది, అయితే మూడో రోజు వరకు దానిని పొడిగించడం ఉత్తమం:
- చిన్నపిల్లల, వ్యాధిగ్రస్తుల, వయసు మళ్ళిన వారి మరియు గర్భిణీ స్త్రీల తరుఫున మీరే స్వయంగా కంకర రాళ్ళు విసరటానికి అనుమతి ఉంది:
- హజ్జె తమత్తు & హజ్జె ఖిరన్ పద్ధతిలో హజ్ చేసే వారి కొరకు నిర్దేశించబడిన హదీ (ఖుర్బానీ పశువు)
- ధర్మబద్ధమైన సంపాదనతోనే హదీ (ఖుర్బానీ పశువు) కొనాలి
- తమ వద్ద హదీ లేనివారు హజ్ దినాలలో మూడు రోజులు మరియు హజ్ నుండి మరలి వచ్చిన తర్వాత ఏడు రోజులు ఉపవాసం ఉండాలి:
- ఆరవ అధ్యాయం
- మంచిని ఆజ్ఞాపించడం మరియు జమాతుతో నమాజులు చేయడం హజ్ యాత్రికునిపై తప్పని సరి
- హజ్ యాత్రికుడు పాపకార్యాలకు మరియు తప్పుడు పనులకు దూరంగా ఉండటం తప్పని సరి:
- వీడ్కోలు తవాఫ్ అందరిపై తప్పనిసరి – బహిష్టులో ఉన్న లేదా పురుటి రక్తస్రావంతో ఉన్న స్త్రీలపై తప్ప:
- ఏడవ అధ్యాయం:
- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మస్జిదు సందర్శనం
- మస్జిదె నబవీని సందర్శించడమనేది తప్పనిసరి హజ్ ఆచరణ క్రిందికి రాదు
- ఖుబాఅ మస్జిదును మరియు జన్నతుల్ బఖీని దర్శించడం ఉత్తమం:
1వ అధ్యాయం:
హజ్ మరియు ఉమ్రహ్ తక్షణం పూర్తిచేయవలసిన విధులనటానికి ఋజువులు
సత్యాన్ని గ్రహించటానికి మరియు దానిని అనుసరించటానికి మీకూ మరియు మాకూ, అల్లాహ్ తగిన శక్తిసామర్థ్యాలను ప్రసాదించుగాక! తగిన స్తోమత కలిగిన తన దాసులు తక్షణం తన పవిత్ర కాబా గృహానికి హజ్ యాత్ర చేయటాన్ని అల్లాహ్ విధిగా చేసినాడు. తరచుగా హజ్ యాత్ర చేయటం ఉత్తమం. ఆయన దీనిని ఇస్లాం యొక్క ఐదు మూలస్థంభాలలోని ఒక మూలస్థంభంగా ఆజ్ఞాపించినాడు.
అల్లాహ్ ప్రకటన:
“అల్లాహ్ కు ప్రజలపై ఉన్న హక్కు ఏమిటంటే – ఎవరైతే దాని వైపు ప్రయాణించే శక్తీ, స్థోమత కలిగియుంటారో, వారు ఆ గృహయాత్ర (హజ్) తప్పక చేయాలి. ఎవరైతే దీనిని తిరస్కరిస్తారో, నిశ్చయంగా అల్లాహ్ సకల లోకవాసుల అవసరం ఏమాత్రమూ లేని నిరపేక్షాపరుడు (అని తెలుసుకోవాలి)” (ఖుర్ఆన్ 3:97)
సహీహ్ అల్ బుఖారీ మరియు సహీహ్ అల్ ముస్లిం హదీథు సంకలనములలోని ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన : ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:
“ఇస్లాం యొక్క పునాది ఈ ఐదింటిపై ఆధారపడి ఉన్నది. అవి:
- ‘లాఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మదుర్రసూలుల్లాహ్’ అని సాక్ష్యమివ్వటం (అనగా అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు అని అర్థం).
- నమాజును స్థాపించుట.
- జకాతును చెల్లించుట.
- రమదాను నెల ఉపవాసాలు పాటించుట.
- అల్లాహ్ యొక్క పవిత్ర కాబాగృహానికి హజ్జ్ యాత్ర చేయుట.”
ఉమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ఆధారంగా తన సునన్ లో సయీద్ ఇలా పేర్కొన్నారు:
“వాస్తవంగా, ఈ ప్రాంతాలకు నేను నా మనుషులను పంపి, తగిన స్తోమత కలిగి ఉన్నా ఇంత వరకు హజ్ చేయని ప్రజలను గుర్తించి, వారిపై జిజియా పన్ను (ముస్లింల రక్షణకు బదులుగా ముస్లిమేతరులు చెల్లించవలసిన పన్ను) విధించాలని అనుకున్నాను. అలాంటి వ్యక్తులు ముస్లింలు కారు; వారు ముస్లింలు కాజాలరు.”
అలీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
తగిన స్తోమత కలిగి ఉండీ, ఎవరైతే హజ్ యాత్ర పూర్తి చేయరో, అలాంటి వ్యక్తి యూదుడిగా చనిపోయినా లేదా క్రైస్తవునిగా చనిపోయినా చింతించవలసిన అవసరం లేదు.
హజ్ పూర్తిచేయటంలో త్వరపడవలెను:
గడువు అయిపోయినా, ఇంత వరకు హజ్ యాత్ర పూర్తి చేయక పోతే, వెంటనే దానిని పూర్తి చేయటానికి త్వరపడవలెను. ఎందుకంటే (దానిని పూర్తి చేయటంలో) ఏది ఆటంకంగా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు.
అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు,
“హజ్ యాత్ర పూర్తి చేయటంలో త్వరపడండి. ఎందుకంటే (దానిని పూర్తి చేయటంలో) ఏది ఆటంకంగా మారుతుందో ఎవ్వరికీ తెలియదు.” అహ్మద్ హదీథ్ గ్రంథం.
ఈ ఖుర్ఆన్ ఆదేశం ప్రకారం, స్తోమత కలిగిన వారెవరైనా సరే, గడువు కాగానే తక్షణం హజ్ యాత్రను పూర్తి చేయాలి.
“అల్లాహ్ కు ప్రజలపై ఉన్న హక్కు ఏమిటంటే – ఎవరైతే దాని వైపు ప్రయాణించే శక్తీ, స్థోమత కలిగియుంటారో, వారు ఆ గృహయాత్ర (హజ్) తప్పక చేయాలి. ఎవరైతే దీనిని తిరస్కరిస్తారో, నిశ్చయంగా అల్లాహ్ సకల లోకవాసుల అవసరం ఏమాత్రమూ లేని నిరపేక్షాపరుడు (అని తెలుసుకోవాలి)” (ఖుర్ఆన్ 3:97)
తన అంతిమ హజ్ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించారు:
“ఓ ప్రజలారా! హజ్ యాత్రను అల్లాహ్ మీపై విధిగా చేసినాడు. కాబట్టి మీరు దానిని తప్పకుండా పూర్తి చేయవలెను” ముస్లిం హదీథ్ గ్రంథం
ఉమ్రహ్ తప్పని సరి విధి అని తెలిపే అనేక హదీథులు ఉన్నాయి. వాటిలోని ఒక హదీథు ఏదంటే ఇస్లాం గురించి తెలుపమని జిబ్రయీలు అలైహిస్సలాం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అడుగగా, దానికి ఆయన ఇలా జవాబిచ్చారు –
“ఇస్లాం అనగా: ‘లాఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మదుర్రసూలుల్లాహ్ (అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు)’ అని సాక్ష్యమిచ్చుట, నమాజులు స్థాపించుట, జకాతు చెల్లించుట, హజ్ మరియు ఉమ్రహ్ చేయుట, (భార్యాభర్తల) సంభోగం తర్వాత గుసుల్ చేయుట (ఇస్లామీయ పద్ధతిలో స్నానం చేయుట), సంపూర్ణంగా వుదూ చేయుట మరియు రమదాన్ మాసంలో పూర్తిగా ఉపవాసాలు పాటించుట.” ఇబ్నె ఖుజైమహ్ మరియు అద్దర్ఖుత్నీలు పేర్కొన్న ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన. (అద్దర్ఖుత్నీ దీనిని ప్రామాణిక హదీథుగా వర్గీకరించారు)
అలాగే, మరో హదీథులో ఆయెషా రదియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించారు, ఆమె “ఓ రసూలుల్లాహ్! అల్లాహ్ మార్గంలో పోరాడవలసిన కర్తవ్యం మహిళలపై కూడా ఉందా?” అని ప్రశ్నించగా, ఆయన ఇలా జవాబిచ్చారు, “వారిపై ఎలాంటి పోరాటం లేని జిహాద్ కర్తవ్యం ఉంది – అదే హజ్ మరియు ఉమ్రహ్”. (అహ్మద్ మరియు ఇబ్నె మాజహ్ హదీథు గ్రంథాలు)
జీవితంలో కనీసం ఒకసారైనా హజ్ మరియు ఉమ్రహ్ పూర్తిచేయవలసిన కర్తవ్యం, బాధ్యత:
ఈ హదీథు సూచించిన విధంగా, హజ్ మరియు ఉమ్రహ్ లు జీవితంలో కనీసం ఒక్కసారైనా తప్పకుండా పూర్తి చేయవలసి ఉన్న విధులు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు,
“(జీవిత కాలంలో) కనీసం ఒక్కసారైనా హజ్ చేయటం తప్పని సరి విధి మరియు ఒకవేళ ఎవరైనా దీనిని ఒకసారి కంటే అధికంగా చేసినట్లయితే, అది అతని కొరకు నఫిల్ (ఐచ్ఛిక) హజ్ అవుతుంది.”
అయితే, అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఈ హదీథు ప్రకారం తరచు హజ్ మరియు ఉమ్రహ్ లు చేయటం ఉత్తమం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు,
“ఉమ్రహ్ తరువాత ఉమ్రహ్ చేయటమనేది వాటి మధ్య చేసిన పాపాలకు ప్రాయశ్చితంగా ఉపయోగపడుతుంది. మరియు హజ్ మబ్రూర్ (స్వీకరించబడిన హజ్) కు లభించే ప్రతిఫలం స్వర్గం తప్ప మరేదీ కాదు.”
తమ పాపాల మరియు తప్పుల మన్నింపు కొరకు క్షమాభిక్ష వేడుకోవటం:
హజ్ లేదా ఉమ్రహ్ కొరకు ఒక ముస్లిం బయలుదేరుతున్నపుడు, అతను తన కుటుంబ సభ్యులను మరియు స్నేహితులను అల్లాహ్ కు భయపడమని బోధించవలెను.
అల్లాహ్ యొక్క దివ్యాజ్ఞలకు కట్టుబడి జీవించాలని మరియు నిషేధించబడిన వాటన్నింటికీ దూరంగా ఉండాలని ప్రోత్సహించవలెను.
తను అప్పు ఇచ్చిన లేదా అప్పు పుచ్చుకున్న ధనం మరియు వ్యక్తుల వివరాలు స్పష్టంగా వ్రాసి, దానికి కొందరిని సాక్షులుగా చేసుకోవలెను.
చేసిన పాపాలకు తప్పకుండా పశ్చాత్తాప పడుతూ, ప్రాయశ్చితం కొరకు వేడుకోవటం అతనికి అనివార్యం. దీని గురించిన ఖుర్ఆన్ ప్రకటన:
“ముస్లింలారా! మీరంతా కలసి అల్లాహ్ సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు” ఖుర్ఆన్ 24:31
పాపకార్యాలకు దూరమవుతూ, వాటిని పూర్తిగా వదిలివేయటం, చేసిన పాపాలకు చింతించటం, భవిష్యత్తులో అలాంటి వాటిని మరల చేయకూడదని దృఢంగా నిశ్చయించుకోవటం మొదలైనవి పశ్చాత్తాపం చెందటంలోని చిత్తశుద్ధిని ప్రదర్శిస్తాయి.
ఇతరుల ఆస్తిపాస్తులు, పశుపక్ష్యాదులు మొదలైనవి ఏవైనా ఒకవేళ అతని దగ్గర ఉంటే, వాటిని అతను తన హజ్ ప్రయాణం ప్రారంభించటానికి ముందే వారికి వాపసు చేసివేయవలెను లేదా వారిని మన్నించమని అడిగి, అనుమతి తీసుకోవలెను.
దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు,
“ఎవరైతే తన సోదరుడికి ధనసంపదలు, ఆస్తిపాస్తులు లేదా మానమర్యాదలు బాకీ ఉంటే, దిర్హం లేక దీనార్ లు ఏవిధంగానూ ఉపయోగపడని రోజు రాక ముందే, అంటే ఈరోజే అతను వాటిని తిరిగి చెల్లించివేయవలెను. ఒకవేళ అతని వద్ద పుణ్యాలేమైనా ఉంటే, వాటిలో నుండి అతను హక్కు లాక్కున్న వారి (అతని దౌర్జన్యానికి గురైనవారికి) హక్కుకు సమానమైన పుణ్యాలు వారి లెక్కలోనికి బదిలీ చేయబడతాయి. ఒకవేళ అతని వద్ద పుణ్యాలేమీ లేకపోతే, వారి పాపాలు అతని లెక్కలోనికి బదిలీ చేయబడతాయి.”
హజ్ ఖర్చుల కొరకు వెచ్చించే ధనం న్యాయంగా సంపాదించినదై ఉండాలి:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ ఆదేశాన్ని అనుసరిస్తూ, న్యాయంగా సంపాదించిన ధనంలో నుండి మాత్రమే హజ్ మరియు ఉమ్రహ్ ల కొరకు ఖర్చు చేయాలి.
“అల్లాహ్ పరిశుద్ధుడు మరియు ఆయన కేవలం పరిశుద్ధమైన వాటినే స్వీకరిస్తాడు”
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలుకులను అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ఆధారంగా అత్రబరానీ ఇలా పేర్కొన్నారు:
“ఎప్పుడైతే ఒక వ్యక్తి న్యాయబద్ధమైన సంపాదనతో హజ్ కొరకు బయలు దేరి, ‘లబ్బైక్ (హాజరయ్యాను, ఓ నా ప్రభూ! హాజరయ్యాను) ’ అని ఉచ్ఛరిస్తూ, తన వాహనంపై ఎక్కటానికి అడుగు ముందుకు వేస్తాడో, అపుడు స్వర్గంలో నుండి పలికేవారు ఇలా అంటారు ‘నీ పిలుపుకు సమాధానం ఇవ్వబడుగాక మరియు ప్రతిఫలంగా నీకు సంతోషము ప్రసాదించబడుగాక! నీ ప్రయాణ సామగ్రి మరియు వాహనం న్యాయబద్ధమైనవి మరియు నీ హజ్ స్వీకరించబడుతుంది మరియు పాపాల నుండి నీవు విముక్తడవుతావు. దీనికి విరుద్ధంగా, ఎప్పుడైతే ఒక వ్యక్తి అన్యాయంగా సంపాదించిన ధనంతో హజ్ కొరకు బయలుదేరి, ‘లబ్బైక్ (హాజరయ్యాను, ఓ నా ప్రభూ! హాజరయ్యాను) ’ అని ఉచ్ఛరిస్తూ, తన వాహనంపై ఎక్కటానికి అడుగు ముందుకు వేస్తాడో, అపుడు స్వర్గంలో నుండి పలికేవారు ఇలా పలుకుతారు ‘నీ పిలుపుకు సమాధానం ఇవ్వబడకుండా ఉండుగాక మరియు ప్రతిఫలంగా నీకు సంతోషము ప్రసాదించబడకుండా ఉండుగాక! నీ ప్రయాణ సామగ్రి మరియు వాహనం న్యాయబద్ధమైనవి కావు మరియు నీ హజ్ స్వీకరించబడదు.”
హజ్ యాత్రికుడు ఇతరుల సంపాదన వాడకూడదు మరియు ఇతరుల నుండి ఆర్థిక సహాయం కోరకూడదు:
దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు,-
“(ఇతరులను యాచించటం నుండి) ఎవరైతే తనను తాను కాపాడుకుంటాడో, అల్లాహ్ అతనిని (అలా యాచించే పరిస్థితి నుండి) కాపాడుతాడు. మరియు ఎవరైతే ఇతరుల బాధ్యతలలో పాలుపంచుకుంటాడో, అల్లాహ్ అతనిని ధనవంతుడిని చేస్తాడు.”
మరో హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పేర్కొన్నారు,
“ఎవరైతే ఎల్లప్పుడూ ఇతరులను యాచిస్తూ ఉంటాడో, అంతిమ దినం నాడు అతను తన ముఖంపై ఒక్క మాంసపు కండ కూడా లేకుండా కనబడతాడు.”
హజ్ యొక్క ఉద్దేశం – అల్లాహ్ యొక్క ఇష్టము, ప్రీతి, సంతృప్తి, సంతుష్టి కొరకు ప్రయత్నించుట:
హజ్ యాత్రికుడు తన హజ్ మరియు ఉమ్రహ్ ద్వారా అల్లాహ్ యొక్క సంతృప్తి, పరలోక సాఫల్యం మరియు సుఖం పొందటానికి పూర్తిగా శ్రమించవలెను. ఈ పవిత్ర ప్రాంతాల్లో ఉన్నప్పుడు, అల్లాహ్ ఇష్టపడే పలుకుల మరియు ఆచరణల ద్వారా అతడు అల్లాహ్ కు చేరువ కావటానికి ప్రయత్నించవలెను.
హజ్ యాత్ర నుండి ఎలాంటి ప్రాపంచిక ప్రయోజనాల్నీ ఆశించకుండా ఉండటానికి తన శాయశక్తులా ప్రయత్నించవలెను. అలాగే హజ్ యాత్రికునిలో కపటత్వపు దురుద్దేశం, పేరుప్రఖ్యాతులు మరియు కీర్తిప్రతిష్ఠలు సంపాదించాలనే దురాశ ఉండకూడదు – ఎందుకంటే ఇలాంటి లక్షణాలు దుష్ట లక్షణాలు. ఇవి అతని హజ్ ఆచరణలను వ్యర్థం చేస్తాయి. తత్ఫలితంగా అతని హజ్ మరియు మంచి ఆచరణలు తిరస్కరించబడతాయి. అల్లాహ్ ఇలా ప్రకటించినాడు,
“ఎవరయితే ప్రాపంచిక జీవితం పట్ల, దాని అందచందాల పట్ల వ్యామోహితులవుతున్నారో అలాంటి వారికి వారి కర్మలను (వాటి ఫలితాన్ని) మేము ఇక్కడే పూర్తిగా ఇచ్చేస్తాము. ఇక్కడ (ప్రపంచంలో) వారికి ఏ లోటూ జరగదు. అయితే అలాంటి వారికి పరలోకంలో అగ్ని తప్ప మరేమీ లభించదు. ప్రపంచంలో వారు చేసుకున్నదంతా వృథా అయిపోతుంది. వారు చేసే పనులన్నీ మిథ్యగా మారిపోతాయి.” ఖుర్ఆన్ 11:15-16
అలాగే ఖుర్ఆన్ లో మరోచోట అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు,
“ఎవడు తొందరగా లభించే ప్రాపంచిక లాభాలను కోరుకుంటాడో అతనికి మేము ఇహంలో తొందరగానే – మేము తలచిన వానికి తలచినంతగా – ఇస్తాము. ఎట్టకేలకు అతని కోసం మేము నరకాన్ని నియమిస్తాము. అందులోకి వాడు అత్యంత నికృష్ట స్థితిలో, కారుణ్యానికి దూరమైన వాడై ప్రవేశిస్తాడు. మరెవరయితే పరలోకాన్ని కోరుకుని, దానికోసం కృషి చేయవలసిన విధంగా కృషి చేస్తాడో, విశ్వాసి అయి ఉంటాడో అలాంటి వాని కృషి అల్లాహ్ వద్ద ఆదరణ పొందుతుంది.” ఖుర్ఆన్ 17 :18-19
ఒక ప్రామాణిక హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించారు,
“అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు, ‘నాకు సాటి కల్పించబడిన భాగస్వాములను వారి స్థానాల నుండి తొలగించటానికి నేనే చాలును. ఎవరైతే ఏదైనా ఆచరణలో ఇతరులను నాకు భాగస్వాములుగా చేస్తారో, నేను అతనిని మరియు అతడు జతచేసిన భాగస్వామ్యాన్ని నేను స్వీకరించను’ ”
హజ్ యాత్రికుడు దృఢమైన, స్థిరమైన జ్ఞానం మరియు ఈమాన్ (విశ్వాసం) కలిగి ఉన్న సజ్జనులు మరియు అల్లాహ్ అంటే భయభక్తులు గలవారి సాహచర్యంలో ఉండటానికి ప్రయత్నించవలెను. అజ్ఞానుల మరియు పాపిష్టుల సాహచర్యం నుండి దూరంగా ఉండవలెను.
అంతేగాక యాత్రికుడు హజ్ మరియు ఉమ్రహ్ ల గురించిన నియమ నిబంధనలన్నింటినీ నేర్చుకోవలెను మరియు ముఖ్యాంశాలన్నింటినీ జ్ఞాపకం ఉంచుకోవలెను. ఎప్పుడైనా సందేహం కలిగితే, అసలు విషయాన్ని తెలుసు కొనుట కొరకు తనకు తెలియని దాన్ని అందుబాటులోని జ్ఞానవంతులను అడిగి తెలుసుకోవలెను.
అతడు కారు, విమానం, వాహనం మొదలైన ప్రయాణ మాధ్యమాలపై అడుగు పెట్టినప్పుడు, బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం (అనంత కరుణామయుడైన, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో) అని పలికి, అల్లాహ్ ఘనతను కొనియాడుతూ మరియు స్తుతిస్తూ, ‘అల్లాహు అక్బర్ (అల్లాహ్ అందరికన్నా గొప్పవాడు)’ అని మూడు సార్లు పలకవలెను.
ఆ తరువాత క్రింది దుఆ చదవ వలెను,
సుబ్ హానల్లదీ సఖ్ఖర లనా హాదా వమా కున్నా లహూ ముఖ్రినీన్. వ ఇన్నా ఇలా రబ్బినా లమున్ ఖలిబూన్. అల్లాహుమ్మ ఇన్నా నస్ అలుక ఫీ సఫరినా హాదల్ బిర్ర వత్తఖ్వా. వ మినల్ అమలి మా తర్దా. అల్లాహుమ్మ హవ్విన్ అలైనా సఫరనా హాదా వత్వి అన్నా బుఅదహ్. అల్లాహుమ్మ అన్తస్ సాహిబు ఫిస్సఫరి, వల్ ఖలీఫతు ఫిల్ అహ్లి. అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మిన్ వాసాయిస్సఫరి, వకఆబతిల్ మన్ దరి వసూయిల్ మున్ ఖలబి, ఫిల్ మాలి వల్ అహ్లి.
పరమ పరిశుద్ధుడైన అల్లాహ్ ఈ వాహనాన్ని మాకు స్వాధీన పరిచాడు, లేకుంటే మేము దీనిని లొంగదీసుకోలేము, నిశ్చయముగా మేము మా ప్రభువు వైపునకే మరలి పోవలసి ఉన్నది. ఓ అల్లాహ్! ఈ ప్రయాణంలో మంచినీ, దైవభీతిని, మరియు నీవు ఇష్టపడే పనులు చేసే సద్బుద్ధినీ మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము, ఓ అల్లాహ్! ఈ ప్రయాణాన్ని మాకై సులభతరం చేయి మరియు ఈ ప్రయాణపు దూరాన్ని త్వరగా ఛేదించు. ఓ అల్లాహ్! ఈ ప్రయాణంలో నీవే నాకు తోడు. నా కుటుంబానికి నీవే సంరక్షకుడివి, ప్రయాణపు శ్రమా ఇబ్బందుల నుండీ, చెడూ బాధాకర దృశ్యాల నుండీ అలాగే నా ఇంటివారిలోనూ, నా సంపదలోనూ నష్టం వాటిల్లే స్థితిలో నుండి తిరిగి రావటం నుండి ఓ అల్లాహ్! నీ శరణు వేడుకుంటున్నాను.
ప్రామాణిక వ్రాతలలో మరియు ముస్లిం గ్రంథంలోని అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనలో పేర్కొనబడిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతుల నుండిఈ దుఆ వేడుకునే విధానం గ్రహించబడింది. మొత్తం ప్రయాణ సమయంలో అల్లాహ్ యొక్క దికర్ (ధ్యానం) చేయవలెను, ఆయన క్షమాభిక్షను వేడుకోవలెను, ఆయన భయంతో ఏడవవలెను, ఖుర్ఆన్ పఠించవలెను, దాని ఆయతులను వీలయినంత వరకు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించ వలెను. నిరంతరంగా తప్పని సరి నమాజులను సామూహికంగా చేయవలెను. దీనిలో ఎలాంటి కొరతా చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవలెను. అనవసరమైన సంభాషణల, వాదోపవాదాల జోలికి పోకూడదు. హాస్యం మరియు పరిహాసం మితిమీరకూడదు. అబద్దాలాడటం, చాడీలు చెప్పటం, నిందలు మోపటం, స్నేహితులను మరియు తోటి ముస్లింలను ఎగతాళి చేయటం నుండి దూరంగా ఉండవలెను. వీటికి బదులు, తన సహచరుల పట్ల మంచిగా, ఉత్తమంగా ప్రవర్తించవలెను. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించటంలో వారికి సహాయపడవలెను. వివేకంతో మరియు చిత్తశుద్ధితో వారికి మంచిని బోధించవలెను మరియు చెడు నుండి నివారించవలెను.
2వ అధ్యాయం:
మీఖాత్ చేరగానే హజ్ యాత్రికుడు ఏమి చేయాలి?
మీఖాత్[1] చేరగానే హజ్ యాత్రికుడు గుసుల్ చేసి (ఇస్లామీయ పద్ధతిలో స్నానం చేసి), అత్తరు పూసుకోవలెను. ఇహ్రాం దుస్తులు ధరించే ముందు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మామూలుగా తొడిగే దుస్తులు విడిచి, గుసుల్ చేసి, అత్తరు పూసుకునే వారని ఉల్లేఖించబడింది. ‘ఇహ్రాం దుస్తులు ధరించే ముందు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శరీరం పై అత్తరు పూసేదానిని’ అని పలికిన ఆయెషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన సహీహ్ అల్ బుఖారీ మరియు సహీహ్ అల్ ముస్లిం హదీథు గ్రంథాలలో నమోదు చేయబడి ఉన్నది. కాబాగృహం యొక్క తవాఫ్ ప్రారంభించక ముందు ఆయన తన కుడిభుజంపై నుండి ఇహ్రాం దుస్తుల్ని తొలగించినపుడు కూడా ఆమె అలాగే చేసేది.
బహిష్టు, ఇతర రక్తస్రావపు స్థితిలోని మహిళల కొరకు హజ్ నియమాలు:
ఆయెషా రదియల్లాహు అన్హా ఉమ్రహ్ కొరకు ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించిన తరువాత, ఆమెకు బహిష్టు రక్తస్రావం మొదలైంది. గుసుల్ చేసి, హజ్ కొరకు ఇహ్రాం దుస్తులు ధరించమని ఆమెకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞాపించారు.
హజ్ యాత్రకు బయలుదేరిన అస్మా బిన్తె ఉమైస్ రదియల్లాహు అన్హా దుల్ హలైఫహ్ అనే మీఖాత్ ప్రాంతంలో ప్రసవించినపుడు, ఆమెను గుసుల్ చేసి, బహిష్టు సమయంలో మహిళలు వాడే దూది మెత్త (ప్యాడ్) పెట్టుకుని, ఇహ్రాం దుస్తులు ధరించమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు.
పై ఉల్లేఖనల నుండి గ్రహించేదేమిటంటే, బహిష్టు మరియు పురుడు పోసుకున్న మహిళలు హజ్ కొరకు మీఖాత్ ప్రాంతం చేరిన తరువాత గుసుల్ చేసి, ఇహ్రాం దుస్తులు ధరించవలెను. ఆమె కాబాగృహ తవాఫ్ తప్ప, హజ్ ఆచరణలన్నింటినీ పూర్తి చేయాలి. ఆయెషా రదియల్లాహు అన్హా మరియు అస్మా బిన్తె ఉమైస్ రదియల్లాహు అన్హాలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన పై ఆదేశాల నుండి ఈ నియమం గ్రహించబడింది.
ఇహ్రాం దుస్తులు ధరించటానికి ముందు, తమ మీసాలను కత్తిరించుకొనుట, గోళ్ళను కత్తిరించుట, చంకలలోని మరియు బొడ్డు క్రింది వెంట్రుకలు తొలగించుట ఉత్తమం. ఇహ్రాం స్థితిలో ఈ పనులు చేయకూడదనే విషయాన్ని అతను తెలుసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించిన ఆవశ్యకమైన సున్నతు ఇది. కాబట్టి వీటి గురించి అన్ని సమయాలలోనూ అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవలెను.
సహీహ్ అల్ బుఖారీ మరియు సహీహ్ అల్ ముస్లింలోని అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు,
“మానవుడి సహజసిద్ధమైన పరిశుభ్రత ఆచారములు ఐదు: సుంతి, బొడ్డు క్రింది వెంట్రుకలు తొలగించుట, మీసాలు కత్తిరించుట, గోళ్ళు కత్తిరించుట, మరియు చంకలలోని వెంట్రుకలు తొలగించుట.”
సహీహ్ అల్ ముస్లింలో అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీథులో, మీసాలు మరియు గోళ్ళు కత్తిరించుట కొరకు, చంకలలోని మరియు బొడ్డు క్రింది వెంట్రుకలు తొలగించుట కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక నిర్ణీత కాలాన్ని నిశ్చయించారని తెలుపబడింది. వాటిని 40 దినాల కంటే అధికంగా వదిలివేయకూడదని ఆయన మనల్ని ఆదేశించారు. అన్నసాయి హదీథు గ్రంథంలో పేర్కొనబడిన దాని ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వీటి కొరకు ఒక నిర్ణీత సమయాన్ని నిశ్చయించారు. అలాంటి ఉల్లేఖన అహ్మద్, అబూ దావూద్, అత్తిర్మిథీ హదీథు గ్రంథాలలో కూడా పేర్కొనబడింది.
అయితే, ఇహ్రాం స్థతిలోనికి ప్రవేశించక ముందు తలవెంట్రుకలు తగ్గించుకోవటమనేది షరియతులో ఎక్కడా నిర్దేశించబడలేదు.
గెడ్డం గీయడం అనుమతించబడలేదు:
అన్ని వేళల్లో గెడ్డం గీయడం లేదా చిన్నది చేయటం నిషేధించబడింది. దీనికి విరుద్ధంగా, సహీహ్ అల్ బుఖారీ మరియు సహీహ్ అల్ ముస్లిం గ్రంథాలలో నమోదు చేయబడిన అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా యొక్క ఈ ఉల్లేఖన ఆధారంగా, తమ గెడ్డాన్ని పెరగనీయడం పురుషులపై తప్పనిసరి విధి:
దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, “బహుదైవారాధకులకు భిన్నంగా ఉండండి – మీ గెడ్డాన్ని పెరగటానికి వదిలివేయండి మరియు మీ మీసాలను కత్తిరించండి.”
ముస్లిం హదీథు గ్రంథంలో నమోదు చేయబడిన అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, “మీసాలు కత్తిరించండి మరియు గెడ్డాన్ని పెరగనివ్వండి. అగ్ని ఆరాధకులకు భిన్నంగా ఉండండి.”
ఈనాడు విచారించవలసిన విషయం ఏమిటంటే గెడ్డానికి సంబంధించిన సున్నతును వ్యతిరేకించటం మరియు తమను తాము సత్యతిరస్కారులను, స్త్రీలను పోలి ఉండటానికి తమ శాయశక్తులా కృషి చేయటమనేది చాలా మంది కొరకు సామాన్యమైన గర్హణీయ అలవాటుగా మారిపోయింది. సున్నతులను అనుసరించేలా, వాటిని దృఢంగా పట్టుకునేలా మరియు అధిక శాతం ప్రజలు ఇష్టం లేకపోయినా సరే, వాటిని ఇతరుల వరకు చేర్చేలా మాకూ మరియు ముస్లింలందరికీ అల్లాహ్ దారి చూపుగాక! మా కొరకు అల్లాహ్ యే చాలును మరియు ఆయన అత్యుత్తమమైన సంరక్షుడు. సర్వ శక్తిమంతుడైన అల్లాహ్ కాకుండా మరే ఇతర శక్తీ లేదు, మరే ఇతర అధికారమూ లేదు.
ఆ తరువాత యాత్రికుడు, కుట్టబడని రెండు వస్త్రాలను – ఒకటి నడుము చుట్టూ (ఇజార్), రెండోది శరీరం పైభాగం పై (రిదా) ధరించవలెను. ఆ రెండు వస్త్రాలు తెలుపు రంగులో ఉండి, పరిశుద్ధంగా ఉండటం మంచిది. ఇంకా ఇహ్రాం దుస్తులు ధరించటంతో పాటు. అతను రబ్బరు చెప్పులు, పాదుకలు/పావుకోళ్లు ధరించటం మంచిది. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు,
“ప్రతి ఒక్కరూ ఇజార్ (నడుము చుట్టూ చుట్టుకునే లుంగీ వంటి వస్త్రం) మరియు రిదా (శరీర పై భాగాన్ని కప్పటానికి వాడే వస్త్రం) అనే రెండు వస్త్రాలను ఇహ్రాంగా ధరించవలెను మరియు చెప్పులను (ధరించవలెను).” అహ్మద్ హదీథ్ గ్రంథం
మహిళలు ఏ దుస్తులలోనైనా ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించవచ్చును:
ఇహ్రాం స్థితిలో నలుపు, ఆకుపచ్చ, గోధుమ రంగు వంటి ఏ రంగు దుస్తులనైనా సరే ధరించటానికి మహిళలకు అనుమతి ఉంది. అయితే తమ దుస్తులు పురుషుల దుస్తులతో పోలి ఉండకుండా జాగ్రత్త పడవలెను. మహిళల ఇహ్రాం నలుపు లేదా ఆకుపచ్చు రంగులోనే ఉండవలెనని పట్టుపట్టే మహిళల వాదనలకు షరిఅత్ లో ఎలాంటి ఆధారమూ లేదు.
గుసుల్ (ఇస్లామీయ పద్ధతిలో స్నానం) చేసి, పరిశుభ్రమై, ఇహ్రాం దుస్తులు ధరించిన తరువాత తాము చేయాలనుకుంటున్న హజ్ లేదా ఉమ్రహ్ కొరకు హృదయంలో నియ్యత్ (సంకల్పం) చేసుకోవలెను. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు:
“ఆచరణలు సంకల్పంపై ఆధారపడి ఉంటాయి మరియు ఎవరైనా ఏదైతే సంకల్పించుకుంటాడో, అతడు దానినే పొందుతాడు.”
షరిఅత్ ప్రకారం హజ్ లేదా ఉమ్రహ్ నియ్యత్ (సంకల్పాన్ని) పలుకులను బహిరంగంగా ఉచ్ఛరించవలెను. ఎవరైనా ఉమ్రహ్ చేయాలని సంకల్పిస్తే “లబ్బైక్ ఉమ్రహ్ లేదా అల్లాహుమ్మ, లబ్బైక్ ఉమ్రహ్ (ఉమ్రహ్ కొరకు హాజరయ్యాను లేదా ఓ అల్లాహ్, ఉమ్రహ్ కొరకు హాజరయ్యాను)” అని ఉచ్ఛరించవలెను. అలాగే ఎవరైనా హజ్ కొరకు నియ్యత్ చేయాలనుకుంటే, “లబ్బైక్ హజ్ లేదా అల్లాహుమ్మ లబ్బైక్ హజ్ (హజ్ కొరకు హాజరయ్యాను లేదా ఓ అల్లాహ్, హజ్ కొరకు హాజరయ్యాను)” అని ఉచ్ఛరించవలెను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరించిన విధానం ఇదే. తమ వాహనంపై ఎక్కిన తరువాత ఈ నియ్యత్ ఉచ్ఛరించటం మంచిది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సవారీపై ఎక్కిన తరువాత ‘లబ్బైక్’ అని పలికినారు. అది అప్పటికే మీఖాత్ ప్రాంతం దాటి మక్కా వైపు సాగిపోయింది. పండితులు సమ్మతించిన ఉత్తమ పద్ధతి ఇదే.
ఇహ్రాం నియ్యత్ కాకుండా వేరే నియ్యత్ ఉచ్ఛరించటమనేది ధర్మంలో లేని ఒక నూతన కల్పితాచారం:
కేవలం ఇహ్రాం కొరకు మాత్రమే బహిరంగంగా నియ్యత్ ఉచ్ఛరించటాన్ని షరిఅత్ ఆమోదించినది. ఎందుకంటే ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రామాణిక హదీథు పై ఆధారపడి ఉన్నది. అయితే, నమాజు కొరకు, తవాఫ్ కొరకు లేదా ఇతర ఆరాధనలు ఆచరించుట కొరకు బహిరంగంగా నియ్యత్ చేయుట అనుమతించబడినదనే ఆదేశం షరిఅత్ లో లేదు. ఉదాహరణకు, ‘ఈ నమాజు చేయుట కొరకు నేను నియ్యత్ చేస్తున్నాను’ లేదా ‘నేను తవాఫ్ చేయుట కొరకు నియ్యత్ చేస్తున్నాను’ అని ఉచ్ఛరించకూడదు. ఆ విధంగా ఉచ్ఛరించటమనేది ధర్మంలో లేని ఒక కల్పితాచారం. మరో మాటలో చెప్పాలంటే హజ్ లేదా ఉమ్రహ్ కొరకు తప్ప మరే ఇతర ఆరాధన కొరకైనా బహిరంగంగా నియ్యతు ఉచ్ఛరించటమనేది ఒక పాపిష్టి పని. ఒకవేళ అలా బహిరంగంగా ఉచ్ఛరించటమనేది షరిఅత్ లో అనుమతించబడిన విషయమైనతే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాని గురించి ఆదేశించేవారు. లేదా తన పలుకుల ద్వారా లేదా ఆచరణల ద్వారా ప్రదర్శించి చూపేవారు. అలాగే సజ్జనులైన ముందుతరం ముస్లింలు దానిని ఆచరించేవారు. ఏదేమైనా ఇలాంటి బహిరంగ ఉచ్ఛరణలకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నుతలో లేదా సజ్జనులైన సహాబాల సున్నతులలో ఎలాంటి ఆధారమూ లేదు. ఇదొక గర్హనీయమైన కల్పితాచారం మాత్రమే.
ఇలాంటి కల్పితాచరణలను గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు:
“ఆచరణలన్నింటిలో అత్యంత చెడ్డవి – కల్పితాచరణలు. మరియు ప్రతి నూతన కల్పితాచరణ ఒక పెడదారి (మాత్రమే).” ముస్లిం హదీథు గ్రంథం
మీఖాతుల గురించి:
ఇహ్రాం స్థితిలో ప్రవేశించే మక్కా పవిత్ర సరిహద్దులు. మొత్తం ఐదు మీఖాతులు ఉన్నాయి.
- మదీనా వైపు నుండి వచ్చే ప్రజల కొరకు మీఖాతు – దుల్ హలైఫహ్. దీని మరో పేరు అబ్యార్ అలీ.
- సిరియా వైపు నుండి వచ్చే ప్రజల కొరకు మీఖాతు – జుహ్ఫహ్. ఇది రాబిగ్ అనే నిర్మానుష్య పల్లె వద్ద ఉంది. ప్రస్తుతం ప్రజలు రాబిగ్ నుండి ఇహ్రాం దుస్తులు ధరిస్తున్నారు. ఏదేమైనా రాబిగ్ నుండి ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించిన ప్రజలు సరైన మీఖాతు ప్రాంతం నుండే ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించినట్లే. ఎందుకంటే ఈ దారిలో మక్కా వెళ్ళే ప్రజల కొరకు రాబిగ్ ప్రాంతం, జుహ్ఫహ్ కంటే కొంచెం ముందుగా వస్తుంది.
- నజ్ద్ వైపు నుండి వచ్చే ప్రజల కొరకు మీఖాతు – ఖర్న్ అల్ మంజిల్. దీని మరో పేరు అస్సైల్.
- యమన్ వైపు నుండి వచ్చే ప్రజల కొరకు మీఖాతు – యలంలం.
- ఇరాక్ వైపు నుండి వచ్చే ప్రజల కొరకు మీఖాతు – ధాత్ ఇర్ఖ్.
ఈ మీఖాతులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చే నిర్ణయించబడినవి. హజ్ లేదా ఉమ్రహ్ కొరకు అటువైపు నుండి వచ్చే ప్రజల కొరకు ఆ యా మీఖాతు ప్రాంతాలు తప్పని సరి అయి ఉన్నాయి.
ఇహ్రాం స్థితిలో ప్రవేశించకుండా మీఖాతు ప్రాంతాన్ని దాటడం హజ్ / ఉమ్రహ్ యాత్రికుని కొరకు నిషేధించబడింది:
ఆ యా ప్రాంతాల ప్రజల కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై నిర్ణీత మీఖాతులను నిర్ణయించినారు. హజ్ లేదా ఉమ్రహ్ నియ్యత్ తో ఈ మీఖాతు ప్రాంతాలను దాటే ప్రతి ఒక్కరి కొరకు అవి నిర్దేశించబడినాయి. హజ్ లేదా ఉమ్రహ్ చేసే నియ్యత్ తో మక్కా వైపు ప్రయాణించే ప్రతి ఒక్కరి కొరకు, ఈ మీఖాతు ప్రాంతంలో ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించడం తప్పనిసరి. రోడ్డు పై ప్రయాణిస్తున్నా లేదా విమానం పై ప్రయాణిస్తున్నా సరే, ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించకుండా ఇక్కడి నుండి ముందుకు పోరాదు. ఎందుకంటే ఈ మీఖాతు ప్రాంతాలను నిర్ణయించినపుడు,
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మూల నియమాన్ని ఉపదేశించినారు.
“ఈ మీఖాతు ప్రాంతాలు ఆ యా ప్రాంతవాసులపై తప్పనిసరి అయి ఉన్నాయి. మరియు ఎవరైతే హజ్ లేదా ఉమ్రహ్ చేసే నియ్యత్ తో ఈ (మీఖాతు) ప్రాంతాలను దాటుకుంటూ ముందుకు సాగుతారో, అలాంటి వాళ్ళపైన కూడా.”
ఎవరైనా హజ్ లేదా ఉమ్రహ్ చేసే సంకల్పంతో విమానంలో మక్కా వైపు ప్రయాణించ దలిస్తే, విమానంలోనికి ఎక్కే ముందే వారు గుసుల్ (ఇస్లామీయ పద్ధతిలో పూర్తి స్నానం) చేయవలెను. విమానం మీఖాత్ ప్రాంతాన్ని సమీపిస్తున్నపుడు, ఇహ్రాం దుస్తులు ధరించి, సమయం ఉంటే తమ సంకల్పాన్ని అనుసరించి, “లబ్బైక్ ఉమ్రహ్” అని ఉచ్ఛరించవలెను. ఒకవేళ అంత సమయం లేకపోతే, హజ్ యాత్రికులు కేవలం “లబ్బైక్” అని ఉచ్ఛరించవలెను. ఒకవేళ ఎవరైనా విమానం ఎక్కక ముందు లేదా మీఖాత్ సమీపించక ముందు ఇహ్రాం దుస్తులు ధరిస్తే, అందులో ఎలాంటి దోషమూ లేదు. అయితే అతను మీఖాతు ప్రాంతం చేరకుండా లేదా మీఖాతు ప్రాంతం సమీపించకుండా ఉమ్రహ్ లేదా హజ్ నియ్యత్ చేసుకోరాదు మరియు లబ్బైక్ అని ఉచ్ఛరించరాదు. కాబట్టి, ధర్మానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించుట ప్రతి ముస్లింపై తప్పని సరి విధి అయి ఉంది.
దీని గురించి అల్లాహ్ ఆదేశం ఇలా ఉన్నది:
“నిశ్చయంగా అల్లాహ్ యొక్క ప్రవక్తలో మీ కొరకు మంచి ఉపమానం ఉన్నది” ఖుర్ఆన్ 33:21
తన అంతిమ వీడ్కోలు హజ్ ప్రసంగంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు:
“మీ హజ్ ఆచరణలు నా నుండి నేర్చుకోండి”
అయితే, హజ్ లేదా ఉమ్రహ్ చేసే సంకల్పం లేని వ్యక్తులు అంటే ఉద్యోగరీత్యా వివిధ పనుల కొరకు లేదా వ్యాపారం కొరకు మక్కా వెళ్ళే ప్రజలు ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించవలసిన ఆవశ్యకత లేదు. ఒకవేళ అతను హజ్ లేదా ఉమ్రహ్ చేయాలని సంకల్పించి, మీఖాతు వద్ద ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశిస్తే, అందులో ఎలాంటి దోషమూ లేదు. ఎందుకంటే మీఖాతు విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు:
“ఈ మీఖాతు ప్రాంతాలు ఆ యా ప్రాంతవాసులపై తప్పనిసరి అయి ఉన్నాయి. మరియు ఎవరైతే హజ్ లేదా ఉమ్రహ్ చేసే నియ్యత్ తో ఈ (మీఖాతు) ప్రాంతాలను దాటుకుంటూ ముందుకు సాగుతారో, అలాంటి వాళ్ళపైన కూడా.”
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పై ఆదేశానికి అర్థం ఏమిటంటే, ఎవరైతే ఈ మీఖాతు ప్రాంతాలను హజ్ లేదా ఉమ్రహ్ చేసే సంకల్పంతో కాకుండా దాటుతారో, అలాంటి వారు ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించవలసిన ఆవశ్యకత లేదు. నిశ్చయంగా అల్లాహ్ యొక్క దాసుల కొరకు ఇదొక గొప్ప అనుగ్రహం మరియు సౌలభ్యం. అల్హందులిల్లాహ్ – సకల స్తోత్రములు, కృతజ్ఞతలు అల్లాహ్ కొరకే.
పై విషయం మరో వాస్తవ సంఘటన ద్వారా కూడా సమర్ధించబడింది – మక్కా దండయాత్ర సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ప్రవేశించినపుడు ఇహ్రాం స్థితిలో లేరు. అంతేకాక అపుడు ఆయన తలపై శిరస్త్రాణం ధరించి ఉన్నారు. ఎందుకంటే ఆయన అపుడు హజ్ లేదా ఉమ్రహ్ చేసే సంకల్పంతో మక్కాలో ప్రవేశించలేదు. మక్కా నగరాన్ని జయించే మరియు అక్కడి విగ్రహారాధనను సమూలంగా తుడిచిపెట్టే ఉద్ధేశంతో ఆయన మక్కాలో ప్రవేశించారు.
ఎవరైతే మీఖాతు సరిహద్దుల లోపల (ఉదాహరణకు జిద్దా పట్టణంలో, ఉమ్ సలమహ్, బహ్రా, షరాఇ, బదర్, మస్తూరహ్ మొదలైన ప్రాంతాలలో) నివసిస్తున్నారో, అలాంటి వారు ఏదో ఒక మీఖాతు వద్దకు వెళ్ళి ఇహ్రాం దుస్తులు ధరించి, హజ్ లేదా ఉమ్రహ్ నియ్యత్ చేసుకోవలసిన అవసరం లేదు, వారి కొరకు వారు ఉంటున్న నివాసమే మీఖాత్. హజ్ లేదా ఉమ్రహ్ చేయాలని అనుకున్నపుడు, వారు ఇహ్రాం దుస్తులు ధరించి, నియ్యత్ చేసుకుని, తమ ఇంటి నుండే ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించాలి.
అయితే, ఎవరికైనా మీఖాతు సరిహద్దు వెలుపల మరో ఇల్లు ఉన్నట్లయితే, వారు మీఖాతు ప్రాంతానికి చేరుకుని ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించ వచ్చును లేదా మక్కా వైపు మీఖాతు ప్రాంతానికి దగ్గరున్న తమ ఇంటిలో ఇహ్రాం ధరించవచ్చు. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన విషయాన్ని అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఇలా ఉల్లేఖించారు:
“ఎవరైతే మీఖాత్ లోపల నివసిస్తున్నారో, అలాంటి వారి కొరకు వారి ఇల్లే వారి ఇహ్రాం (లో ప్రవేశించే) స్థానం. మక్కావాసులు మక్కాలోపలే ఇహ్రాం ధరించవచ్చు.” (బుఖారీ మరియు ముస్లిం)
అయితే ఎవరైతే కాబా పవిత్ర సరిహద్దుల లోపల (హరమ్ లోపల) ఉండి, ఉమ్రహ్ చేయాలని సంకల్పించుకున్నారో, వారు ఆ సరిహద్దుల బయటకు వెళ్ళి, ఉమ్రహ్ కొరకు ఇహ్రాం ధరించి మరలి రావలెను. ఉమ్రహ్ చేయదలచిన తన కోరికను ఆయెషా రదియల్లాహు అన్హా తెలిపినపుడు, ఆమెను కాబా పవిత్ర సరిహద్దుల బయటకు తీసుకు వెళ్ళి, ఇహ్రాంలో ప్రవేశింప జేయమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె సోదరుడు అబ్దుర్రహ్మాన్ ను ఆదేశించారు. దీని నుండి తెలిసినదేమిటంటే, ఎవరైనా ఉమ్రహ్ చేయాలని సంకల్పించినవారు, పవిత్ర కాబా సరిహద్దుల లోపల ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించలేరు. కాబట్టి వారు కాబా పవిత్ర సరిహద్దుల బయటకు వెళ్ళి ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించవలెను. ఈ హదీథు ,ఇంతకు ముందు తెలిపిన అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా హదీథు విషయాన్ని మరింతగా స్పష్టం చేస్తున్నది. అంతేగాక మక్కావాసులు, మక్కాలోపలే ఇహ్రాం ధరించవచ్చనే ఆదేశం హజ్ కొరకు మాత్రమే ప్రత్యేకమనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నది. కాబట్టి అది ఉమ్రహ్ కొరకు వర్తించదు. ఒకవేళ ఉమ్రహ్ కొరకు కాబా సరిహద్దుల లోపలే ఇహ్రాం ధరించే అవకాశం ఉంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన భార్య ఆయేషా రదియల్లాహు అన్హాకు అలా చేయటానికి అనుమతి ఇచ్చి, కాబా పవిత్ర సరిహద్దుల బయటకు వెళ్ళి ఇహ్రాం ధరించమని చెప్పి ఉండేవారు కాదు కదా! ఇది వివాదరహితమైన ఋజువు. కాబట్టి ఇస్లామీయ ఉలేమాలందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అంతేగాక పై రెండు హదీథులతో ఈ అభిప్రాయం ఏకీభవించటం వలన దీనిని అనుసరించడమే ముస్లింల కొరకు సరైనది.
హజ్ పూర్తి చేసిన తరువాత అనేకసార్లు ఉమ్రహ్ చేయటాన్ని షరిఅతు ప్రోత్సహించటం లేదు:
హజ్ యాత్ర ఆరంభంలో ఉమ్రహ్ చేసి ఉండి, హజ్ పూర్తయిన తరువాత తనీమ్ లేదా జిరానహ్ ప్రాంతానికి వెళ్ళి, ఇహ్రాం ధరించి, మరల మరల ఉమ్రహ్ లు చేసే కొందరు ప్రజల పద్ధతికి షరిఅతులో ఎలాంటి ఆధారమూ లేదు. అలాంటి విధానం నిరాధారమైనది. అంతేగాక అది అంగీకరించబడలేదు కూడా. ఇలా హజ్ తరువాత చేసే ఉమ్రహ్ సముచితమైనది కాదని ప్రామాణిక నివేదనలలో పేర్కొనబడింది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులు హజ్ పూర్తి చేసిన తరువాత మరల ఉమ్రహ్ చేయలేదు. తనీమ్ నుండి ఆయేషా రదియల్లాహు అన్హా చేసిన ఉమ్రహ్ గురించి అయితే, మక్కా చేరిన వెంటనే ఆవిడ బహిష్టు ప్రారంభమవటం వలన ఆవిడ అపుడు ఉమ్రహ్ చేయలేక పోయారు. దానికి బదులుగా అంటే మీఖాత్ లో ఇహ్రాం ధరించి, బహిష్టు ప్రారంభమైన కారణంగా పూర్తిచేయలేక పోయిన ఉమ్రహ్ కు బదులుగా మరో ఉమ్రహ్ చేయటం కొరకు అనుమతించమని ఆవిడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగారు. మరియు దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతించినారు. దీని కారణంగా ఆవిడ రెండు ఉమ్రహ్ లు చేసినట్లయింది – ఒకటి హజ్ తో పాటు మరియు రెండోది తనీమ్ నుండి. కాబట్టి, ఆయేషా రదియల్లాహు అన్హా స్థితిలాంటి స్థితిని ఎదుర్కొంటే, వారు హజ్ తరువాత ఉమ్రహ్ చేయవచ్చు. అయితే మాటిమాటికీ ఉమ్రహ్ చేస్తూ, రద్దీ పెంచి, తోటి ముస్లింలకు అసౌకర్యాన్ని కలిగించకుండా ప్రజలు ప్రవర్తించవలెను.
నిస్సందేహంగా యాత్రికులు మరల ఉమ్రహ్ చేయటమనేది అక్కడి ప్రజలను అసౌకర్యానికి గురిచేస్తుంది. ఫలితంగా, రద్దీ పెరిగి పోతుంది మరియు ట్రాఫిక్ యాక్సిడెంట్లు పెరిగి పోతాయి. అంతేగాక, ఈ విధానం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్ల్ సున్నతుకు విరుద్ధమైనది కూడా.
హజ్ కాలంలో గాకుండా వేరే సమయంలో మీఖాతు ప్రాంతానికి చేరుకోవటం:
మీఖాతు ప్రాంతానికి చేరుకునేవారు – క్రింద పేర్కొన్న రెండింటిలో ఒక వర్గానికి చెందిన వారనేది తెలుకోవలెను.
- మొదటి వర్గం ప్రజలు: హజ్ కాలంలో గాకుండా, వేరే సమయంలో అంటే రమదాన్, షఆబాన్ మొదలైన నెలలలో ఉమ్రహ్ కొరకు అక్కడికి చేరుకునేవారు. అలాంటి వారు ఉమ్రహ్ చేసే సంకల్పంతో ‘లబ్బైక్ ఉమ్రహ్’ అని లేదా ‘అల్లాహుమ్మ లబ్బైక్ ఉమ్రహ్’ అని పలుకుతూ ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించవలెను. ఆ తరువాత వారు ఈ క్రింది లబ్బైక్ పలుకులను, ప్రవక్త సల్లల్లాహు అలైహి యొక్క సున్నతును అనుసరిస్తూ తల్బియా పలకవలెను.
లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక్ లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ ద, వ న్నేమత, లకవల్ ముల్క్ – లా షరీక లక్
నేను హాజరయ్యాను, ఓ అల్లాహ్! నేను హాజరయ్యాను, నేను హాజరయ్యాను, నీకు భాగస్వాములెవరూ లేరు, నేను హాజరయ్యాను, నిశ్చయంగా సకల స్తోత్రములు, ప్రశంసలు మరియు కృతజ్ఞతలు, సకల అనుగ్రహాలు మరియు సకల లోకాలు నీవే – నీకెవరూ భాగస్వాములు లేరు.
అల్లాహ్ యొక్క పవిత్ర కాబాగృహం చేరే వరకు, పై తల్బియా పలుకులు పలుకుతూ ఉండవలెను మరియు అల్లాహ్ యొక్క ధ్యానం చేస్తూ ఉండవలెను. అక్కడికి చేరిన తరువాత తల్బియా పలుకులు పలకటం ఆపి, కాబా గృహం చుట్టూ ఏడు సార్లు తవాఫ్ (ప్రదక్షిణం) చేసి, మఖామె ఇబ్రాహీం వెనుక రెండు రకాతుల నమాజు చేసి, అస్సఫా వైపు సాగిపోవలెను. అస్సఫా మరియు అల్ మర్వాల మధ్య ఏడు సార్లు నడిచి, తల వెంట్రుకలు పూర్తిగా తీసివేయ వలెను లేదా అతి చిన్నవిగా క్షవరం చేయించుకోవలెను. దీనితో ఉమ్రహ్ యాత్ర పూర్తవుతుంది. ఇహ్రాం స్థితిలో ఉండిన నిషేధాలన్నీ ఇపుడు పూర్తిగా తొలిగిపోతాయి మరియు ఆ పనులన్నీ ఇపుడు అంతకు ముందు వలే మరల ధర్మసమ్మతమవుతాయి.
- రెండో వర్గం ప్రజలు: హజ్ కాలంలో అంటే షవ్వాల్, దుల్ ఖాయిదహ్ మరియు దుల్ హజ్ నెల మొదటి పది దినాలలో మీఖాత్ ప్రాంతానికి చేరుకునే ప్రజలు. అలాంటి వారు ఈ క్రింది వాటిలో ఒక పద్ధతిని ఎంచుకోవచ్చును – కేవలం హజ్ చేయటం, కేవలం ఉమ్రహ్ చేయటం లేదా రెండూ కలిపి చేయటం. తన అంతిమ హజ్ యాత్ర కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుల్ ఖాయిదహ్ నెలలో మీఖాత్ ప్రాంతం వద్దకు చేరినపుడు, ఆయన తన సహచరులకు పై మూండింటిలో ఏదో ఒక దానిని ఎంచుకోమని చెప్పినారు.
హజ్ నెలలో ఖుర్బానీ పశువు వెంట ఉన్న హజ్ యాత్రికుడు ఖిరాన్ (ఖుర్బానీ సమేతం) పద్ధతిలో హజ్ చేసే సంకల్పం చేసుకోవలెను మరియు ఖుర్బానీ పశువు వెంటలేని వ్యక్తి తమత్తు (సుఖసౌఖ్యాలు అనుభవించే) పద్ధతిలో హజ్ చేసే సంకల్పం చేసుకోవలెను:
సున్నతు ప్రకారం, ఒకవేళ హజ్ యాత్రికునితో పాటు ఖుర్బానీ పశువు లేకపోతే, అతను కేవలం ఉమ్రహ్ కొరకు మాత్రమే సంకల్పం చేసుకుని, హజ్ కాలంలో గాక వేరే సమయంలో ఉమ్రహ్ చేసే విధంగా అతను మొత్తం ఉమ్రహ్ ఆచరణలను పూర్తి చేయవలెను. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఖుర్బానీ పశువు వెంట ఉన్న సహచరులను ‘కేవలం ఉమ్రహ్ కొరకు మాత్రమే ఇహ్రాం ధరించమని’ ఆదేశించినారు. మక్కా చేరిన తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరల ఇదే విధంగా ఆదేశించినారు. దీనిని అనుసరిస్తూ, సహచరులు తవాఫ్ (కాబా గృహ ప్రదక్షిణ) మరియు సయీ (సఫా మరియు మర్వాల మధ్య నడక) పూర్తి చేసి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశానుసారం తల వెంట్రుకలు గొరిగించుకున్నారు. అలా వారిపై ఇహ్రాం నిషేధాలన్నీ తొలిగిపోయినాయి. అలాగే ఎవరితో పాటైతే ఖుర్బానీ పశువు వెంట ఉండినదో, వారిని ఖుర్బానీ రోజు వరకు ఇహ్రాం స్థతిలోనే ఉండమని ఆదేశించినారు. ఖుర్బానీ పశువు తమతో పాటు ఉన్నవారు సున్నతును అనుసరిస్తూ, ఏకకాలంలో ఉమ్రహ్ మరియు హజ్ కొరకు ఇహ్రాం ధరించవలెను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనతో పాటు ఖుర్బానీ పశువును వెంట తీసుకు రావటం వలన, పై విధంగా చేసినారు. అంతేగాక తమతో పాటు ఖుర్బానీ పశువు వెంట తీసుకు వచ్చిన ఇతర సహాబాలను కూడా పై విధంగానే చేయమని ఆదేశించినారు. ఇహ్రాం ధరించేటపుడు, ఆయన ఉమ్రహ్ మరియు హజ్ కొరకు లబ్బైక్ అని పలికినారు. దుల్ హజ్ 10వ తేదీన ఖుర్బానీ చేసిన తరువాత ఇహ్రాం స్థితి నుండి బయట పడినారు.
ఎవరైతే తమతో పాటు ఖుర్బానీ పశువు వెంట పెట్టుకుని, కేవలం హజ్ కొరకు మాత్రమే సంకల్పం చేసుకుంటారో, వారు ఖారిన్ ల (ఖిరాన్ పద్ధతిలో హజ్ చేసేవారి) వలే దుల్ హజ్ నెల 10వ తేదీన ఖుర్బానీ చేసే వరకు ఇహ్రాం స్థితిలో కొనసాగవలెను.
పై వివరాల నుండి మనకు తెలిసేదేమిటంటే, ఎవరైతే కేవలం హజ్ కొరకు లేదా హజ్ మరియు ఉమ్రహ్ కొరకు ఇహ్రాం ధరిస్తారో, ఒకవేళ వారితో పాటు ఖుర్బానీ పశువు లేకపోతే, అలాంటి వారు ఉమ్రహ్ తరువాత ఇహ్రాం స్థితిలో కొనసాగటం సరైన పద్ధతి కాదు. సున్నతు ప్రకారం వారు కేవలం ఉమ్రహ్ కొరకు మాత్రమే ఇహ్రాం ధరించి, తవాఫ్ మరియు సయీ పూర్తి చేసి, వెంట్రుకలు చిన్నగా కత్తిరింపజేసుకుని ఇహ్రాం నిబంధనల నుండి బయట పడాలి. తమతో పాటు ఖుర్బానీ పశువు తీసుకురాని వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలానే చేయమని ఆదేశించి యున్నారు. కానీ, ఎవరైనా చాలా ఆలస్యంగా చేరుకోవటం వలన హజ్ సమయం కోల్పోయేటట్లుంటే, అలాంటి వారి కొరకు ఒకే ఇహ్రాంలో హజ్ మరియు ఉమ్రహ్ చేసే అనుమతి ఉంది (ఖుర్బానీ పశువు వెంట లేకపోయినా సరే).
షరతులతో కూడిన ఇహ్రాం:
ఒకవేళ ఎవరైనా ఆరోగ్యం కారణంగా లేక శత్రువు భయం వలన ఉమ్రహ్/హజ్ పూర్తి చేయలేక పోతామేమోననే భయంతో ఉంటే, వారు ఇహ్రాం ధరించేటపుడు చేసే సంకల్పానికి ఈ షరతును జత చేయవలెను – “ఒకవేళ ఏదైనా ఆటంకం కారణంగా (దారిలో) నిరోధించబడితే, నీవు నన్ను ఆపిన ఆ స్థానమే నా ఈ స్థితి నుండి స్వేచ్ఛను పొందే స్థానమవుతుంది”. దీనిని జుబైర్ కుమార్తె అయిన దుబహ్ ఉల్లేఖించారు. ఆవిడ ఇలా అన్నారు, “ఓ రసూలుల్లాహ్! నేను హజ్ చేయాలని సంకల్పం చేసుకున్నాను. కానీ, నా ఆరోగ్యం సరిగా లేదు”. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెను ‘ఎక్కడైతే ఆటంకం ఎదురవుతుందో, ఆ స్థానంలో ఇహ్రాం నుండి స్వేచ్ఛను పొందే’ షరతును జత చేసి హజ్ సంకల్పం చేయమని సూచించారు. దీని నుండి మనకు తెలిసేదేమిటంటే, ఒకవేళ ఎవరైనా ఇహ్రాం స్థితిలోని వ్యక్తికి అనారోగ్యం లేదా శత్రువు వలన ఆటంకం ఎదురైతే, పైన పేర్కొన్న విధంగా అక్కడే ఇహ్రాం స్థితిలో నుండి స్వేచ్ఛ పొందటం కొరకు అతనికి అనుమతి ఉంది మరియు దీనికి బదులుగా అతను ఎలాంటి ప్రాయశ్చిత పరిహారం చెల్లించవలసిన అవసరం లేదు.
చిన్నపిల్లల హజ్:
సహీహ్ ముస్లింలో పేర్కొనబడిన అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ఆధారంగా చిన్నపిల్లల హజ్ పూర్తిగా సరైనదే. తన బిడ్డను పైకెత్తి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చూపుతూ, ఆవిడ ఇలా అడిగినది “ఓ రసూలుల్లాహ్! ఇతని (ఈ బిడ్డ) కొరకు హజ్ ఉన్నదా?”. దానికి ఆయన “ఉంది. మరియు నీకు ప్రతిఫలం లభిస్తుంది.” అని జవాబిచ్చినారు.
తను ఏడు సంవత్సరాల వయస్సులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు హజ్ చేసానని తెలిపిన సయీబ్ బిన్ యజీద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన సహీహ్ బుఖారీలో ఉంది. అయితే అలాంటి హజ్ నఫిల్ హజ్ గా మాత్రమే పరిగణింపబడును. విధిగా చేయవలసి ఉన్న తప్పని సరి హజ్ బాధ్యతను అది పూర్తి చేయదు. బానిస వ్యక్తి మరియు బానిస స్త్రీకి కూడా ఇదే నియమం వర్తిస్తుంది, వారి హజ్ నఫిల్ హజ్ గా పరిగణింపబడునే గాని విధిగా చేయవలసి ఉన్న తప్పనిసరి హజ్ గా కాదు. అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన క్రింది హదీథులో ఈ విషయం స్పష్టంగా తెలుపబడింది:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు,
“ఒకవేళ ఏ బిడ్డ అయినా హజ్ చేస్తే, అతను యువకుడైన తరువాత మరల హజ్ చేయవలసి ఉంది. మరియు ఒకవేళ ఎవరైనా బానిస హజ్ చేస్తే, అతను స్వేచ్ఛను పొందిన తరువాత మరల హజ్ చేయవలసి ఉంది”.
ఒకవేళ ఆ బాలుడికి సరైన అవగాహన ఇంకా రాకపోతే, అతని సంరక్షకుడు ఆ బాలుని కొరకు ఇహ్రాం సంకల్పాన్ని వ్యక్తం చేయాలి. అతను ఆ బాలుడి దుస్తులు మార్చి, ఇహ్రాం దుస్తులు తొడిగించి, అతని తరుఫున లబ్బైక్ ఉచ్ఛరించాలి. దుస్తులను తొలగించి, ఇహ్రాం దుస్తులు ధరింపజేసిన తరువాత ఆ బాలుడు ఇహ్రాం స్థితిలో ఉన్నట్లుగా పరిగణించబడతాడు. ఇహ్రాం స్థితిలో పెద్దలకు ఏ నిషేధాజ్ఞలైతే వర్తిస్తాయో, అవే నిషేధాజ్ఞలు ఆ బాలుడి కొరకు కూడా వర్తింపబడును. అలాగే ఒకవేళ ఆ బాలికకు సరైన అవగాహన ఇంకా రాకపోతే, ఆమె సంరక్షకురాలు ఆ బాలిక తరుఫున ఇహ్రాం సంకల్పాన్ని వ్యక్తం చేయాలి మరియు లబ్బైక్ పలకాలి. అలా ఆ బాలిక ఇహ్రాం స్థితిలో ఉన్నట్లుగా పరిగణింపబడుతుంది. ఇహ్రాం స్థితిలో పెద్దలకు ఏ నిషేధాజ్ఞలైతే వర్తిస్తాయో, అవే నిషేధాజ్ఞలు ఆ బాలిక కొరకు కూడా వర్తిస్తాయి. తవాఫ్ చేసేటపుడు, వారి శరీరం మరియు దుస్తులు పరిశుభ్రంగా ఉండాలి. తవాఫ్ కూడా నమాజు వంటిదే. కాబట్టి పవిత్ర స్థితిలోనే తవాఫ్ చేయవలెను.
ఒకవేళ బాలుడు లేదా బాలిక విషయాలను అర్థం చేసుకునే స్థితిలో ఉంటే, తమ సంరక్షకుల అనుమతితో వారు స్నానం చేసి, దేహానికి అత్తరు పూసుకుని, ఇహ్రాం ధరించవచ్చు. పెద్దలు ఇహ్రాం ధరించే విధంగానే పిల్లలు కూడా ఇహ్రాం ధరించవలెను. వారి సంరక్షకులు వారి ఆచరణలను పర్యవేక్షిస్తూ, వారి అవసరాలను తీర్చవలెను. ఆ సంరక్షకులు – తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు లేదా వేరే ఇతరులెవరైనా కావచ్చు. పిల్లలు స్వతహాగా చేయలేని ఆచరణల విషయంలో, ఆ ఆచరణలను వారి సంరక్షకులు పూర్తి చేయవలెను. ఉదాహరణకు – జమరహ్ లో రాళ్ళు విసరటం (రమ్మీ చేయటం). కానీ అరఫాత్ మైదానంలో నిలుచోవటం, ముజ్దలిఫా మరియు మీనాలలో రాత్రి గడపటం, తవాఫ్ మరియు సయీ చేయటం మొదలైన ఇతర ఆచరణలన్నింటినీ వారు పూర్తి చేయవలెను. అవసరమైతే పిల్లల సంరక్షకులు పిల్లలను తమ చేతులలో ఎత్తుకుని, భుజాల మీద కూర్చో పెట్టుకుని ఆ ఆచరణలు పూర్తిచేయటంలో తోడ్పడవచ్చు. అయితే పిల్లలను ఎత్తుకున్న వ్యక్తి, ఏకకాలంలో తన కోసం మరియు ఆ పిల్లవాని కోసం తవాఫ్ చేయలేడు. అంటే అతను తన కోసం తవాఫ్ పూర్తి చేసుకుని, ఆ తరువాత పిల్లవాని కోసం మరో తవాఫ్ చేయవలసి ఉంది. అలాగే సయీ కూడా. పిల్లల తరుఫున అతను తవాఫ్ మరియు సయీ కొరకు సంకల్పం చేసుకోవచ్చు. క్రింద తెలిపిన హదీథును అనుసరిస్తూ, ఇలా తగిన జాగ్రతలు తీసుకోవటం మంచిది.
“ఖచ్చితమైన దానిని అనుసరించండి మరియు సందేహాస్పదమైన దానిని వదిలి పెట్టండి”
అయితే, ప్రామాణిక అభిప్రాయం ప్రకారం, ఒకవేళ బిడ్డను ఎత్తుకున్న వ్యక్తి, తనకోసం మరియు తన బిడ్డ కోసం ఒకేసారి తవాఫ్ మరియు సయీ సంకల్పం చేసుకుంటే, అది కూడా సరిపోతుంది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన బిడ్డ కొరకు వేరే తవాఫ్ చేయమని తన బిడ్డ హజ్ గురించి అడిగిన ఆ మహిళను ఆదేశించలేదు. ఒకవేళ అలా వేరుగా తవాఫ్, సయీ చేయటం తప్పని సరై ఉంటే, ఆయన తప్పకుండా దాని గురించి ఆమెను ఆదేశించి ఉండేవారు. విషయాలను అర్థం చేసుకోగలిగే బాలికలకు మరియు బాలురకు పవిత్రత, పరిశుభ్రత, అపరిశుభ్రత గురించి తవాఫ్ ప్రారంభించక ముందే బోధించవలెను. అలాగే, ఇహ్రాంలో ఉన్న పెద్దలకు కూడా. పిల్లల తరుఫున, వారి సంరక్షకులుగా ఆచరణలు చేస్తున్న పెద్దవారు ఇహ్రాం ధరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నఫిల్ ఆచరణ క్రిందికి వస్తుంది. ఒకవేళ ఆ సంరక్షకులు ఇహ్రాం ధరిస్తే, వారికి ప్రతిఫలం లభిస్తుంది. ఒకవేళ అలా ధరించక పోతే, దానిలో ఎలాంటి పాపమూ లేదు.
ఇహ్రాం స్థితిలో అనుమతింపబడిన మరియు నిషేధింపబడిన విషయాలు:
ఇహ్రాం సంకల్పం చేసుకున్న తరువాత స్త్రీపురుషులు వెంట్రుకలు లేదా గోళ్ళు గొరగటం లేదా కత్తిరించటం, అత్తరు పూసుకోవటం మొదలైనవి చేయరాదు. ఇహ్రాం స్థితిలో ప్రవేశించిన తరువాత అలాంటి పనులకు అనుమతి లేదు. ముఖ్యంగా మగవారికి షర్టు, ప్యాంటు, కుర్తా, పైజామా, మేజోళ్ళు మొదలైన కుట్టబడిన దుస్తులు ధరించే అనుమతి లేదు. ఒకవేళ తన నడుము చుట్టూ కట్టుకోవటానికి ఏదైనా దుప్పటి లాంటి వస్త్రం లభించనపుడు, అతను సుర్వాల్ (పైజామా వంటిది) వంటిది తొడుక్కోవచ్చు. అలాగే, రబ్బరు చెప్పులు లేదా మామూలు చెప్పులు లేకపోతే, అతడు కత్తిరించని చర్మపు మేజోళ్ళు (కుఫ్) తొడుక్కోవచ్చు. బుఖారీ మరియు ముస్లింలలో నమోదు చేయబడిన అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా యొక్క ఈ ఉల్లేఖనలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు,
“ఎవరి వద్దనైతే స్లిప్పర్లు లేదా చెప్పులు లేవో, అలాంటివారు చర్మపు మోజోళ్ళు (కుఫ్) తొడుక్కోవచ్చు. మరియు ఎవరి వద్దనైతే ఇజార్ (నడుము చుట్టూ కట్టుకునే దుప్పటి వంటి వస్త్రం) లేదో, అలాంటి వారు పైజామా (సుర్వాల్) తొడుక్కోవచ్చు. ”
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన ప్రకారం, ఒకవేళ అవసరమైతే ‘కత్తిరించబడిన చర్మపు మేజోళ్ళ’ తొడుక్కోవచ్చు అనే విషయంలో ‘కత్తిరించబడటమనేది’ రద్దు చేయబడినది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో అడగబడిన ‘ఇహ్రాంలోని వ్యక్తి ఎలాంటి దుస్తులు ధరించవచ్చనే’ ప్రశ్నకు బదులుగా ఇబ్నె అబ్బాస్ ఉల్లేఖనలో తెలిపినట్లుగా జవాబిచ్చినారు. అయితే ఒకవేళ చెప్పులు లేకపోతే, చర్మపు చెప్పులు (కుఫ్ లు) తొడుక్కోవచ్చని ఆయన అరఫాత్ ఉపన్యాసంలో పలికినారు. అంతేగాని ఆ చర్మపు చెప్పులు కత్తిరించబడాలని అనలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో పై పలుకులు పలికినపుడు చుట్టు ఉన్నవారిలో కొందరు మదీనా పై పలుకులు పలికినపుడు ఆయన సమీపంలో లేరు. ఆవశ్యక విషయాన్ని ఆలస్యం చేయడం తగదనే విషయం మనకు తెలుసు. కాబట్టి, చర్మపు చెప్పులు కత్తిరించబడాలనే విషయం రద్దు చేయబడినదనే విషయం ఋజువైనది. ఒకవేళ అది అవసరమైన విషయమై ఉంటే, ఆయన దానినితప్పకుండా పలికి ఉండేవారు.
చెప్పుల వలే కాలి చీలమండలం కంటే క్రింద ఉండే చర్మపు మేజోళ్ళు (కుఫ్ లు) తొడుక్కోవటానికి ఇహ్రాంలోని వారికి అనుమతి ఉంది. నడుము చుట్టూ కట్టుకునే ఇజార్ వస్త్రానికి ముడి వేసి, దారంతో (త్రాడుతో) కట్టడానికి అనుమతి ఉంది. ఎందుకంటే అలా చేయకూడదని ఎక్కడా చెప్పబడలేదు. అలాగే ఇహ్రాంలోని వ్యక్తి స్నానం చేయవచ్చు, తన తల కడుక్కోవచ్చు, మృదువుగా తల గోక్కోవచ్చు. అలా గోక్కోవటం వలన ఒకవేళ వెంట్రుకలేవైనా రాలితే, అందులో ఎలాంటి దోషం లేదు.
ఇహ్రాంలోని స్త్రీల కొరకు ముసుగు వంటి వేరే వస్త్రంతో ముఖం కప్పుకోవటం, చేతులకు చేతిమేజోళ్ళు తొడుక్కోవటం నిషేధించబడింది. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు,
“ఇహ్రాంలోని స్త్రీ ముఖంపై ముసుగు వేసుకోకూడదు, చేతులకు చేతి మేజోళ్ళు (ఖుఫ్ఫాజ్) తొడుక్కోకూడదు” బుఖారీ
ఖుఫ్ఫాజ్ అంటే ఉన్ని లేదా కాటన్ నేయబడిన చేతి మేజోళ్ళు. అయితే స్త్రీల కొరకు ఇహ్రాం స్థితిలో కూడా షర్టులు, ప్యాంట్లు,షల్వార్ ఖమీజులు మేజోళ్ళు మొదలైన ఇతర కుట్టబడిన దుస్తులు తొడుక్కునే అనుమతి ఉంది. అలాగే, పరాయి మగవాళ్ళు ఎదురైనపుడు, ఆమె తన ముఖాన్ని చేతిరుమాలుతో కప్పుకోవచ్చు. తలపై కప్పుకునే తలగుడ్డలో (head scarf) ముఖం దాచుకుంటే తప్పులేదు. ఆయెషా రదియల్లాహు అన్హా ఇలా పలికినారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు చేసిన హజ్ లో, పురుష యాత్రికుల సమూహం తమను దాటుతూ, ఎదురు బదురు అయినపుడు, స్త్రీలు తమ తలగుడ్డను క్రిందికి జార్చి, ముఖం కనబడకుండా జాగ్రత్త పడేవారు. ఆ పురుషులు తమను దాటిన తరువాత, వారు తమ ముఖాలపై జార్చుకున్న తలగుడ్డను తొలగించుకునేవారు. (అబూ దావూద్, ఇబ్నె మాజా, అద్దర్ ఖుత్ని)
అలాగే, పరాయి మగవారు తమ పరిసరాలలో ఉన్నపుడు, దేనితోనైనా తన చేతులను కప్పుకోవటానికి వారికి అనుమతి ఉంది. అలాంటి పరిస్థితులలో తమ ముఖాలను మరియు చేతులను కప్పుకోవటం వారి బాధ్యత. అల్లాహ్ యొక్క ఆదేశానుసారం, ఈ శరీర భాగాలు కప్పుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
“మరియు తమ అలంకారాలను తమ భర్తలకు తప్ప ఇతరులకు చూపరాదు” 24:31
చేతులు మరియు ముఖం – రెండూను మగువల ఆకర్షణలను ప్రతిబింబిస్తాయి. మరియు ముఖాలు చేతుల కంటే మరింత ఆకర్షణీయమైనవి. ఈ విషయం ఖుర్ఆన్ వచనంలో స్పష్టంగా తెలుపబడింది:
“మీరు ఏదైనా అడగవలసి వచ్చినపుడు తెర వెనుక నుంచి అడగండి. మీ అంతర్యాల, వారి హృదయాల పరిశుద్ధత కోసం ఇదే మంచిది.” ఖుర్ఆన్ వచన భావానువాదం 33:53
అనేక మంది స్త్రీలు (హజ్ /ఉమ్రహ్ లలో) తలపై కప్పుకునే తలగుడ్డలకు జత చేసే అదనపు వస్త్రానికి ఎలాంటి ఆధారమూ లేదు. తలగుడ్డ ముఖానికి తగలకుండా వారలా చేస్తుంటారు. ఒకవేళ అదే అలా చేయటం అవసరమైతే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సమాజానికి ఆ విధంగా చేయమని బోధించి ఉండేవారు. అంతేగాని ఆయన ఈ విషయం గురించి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండేవారు కాదు. పురుషులు మరియు స్త్రీలు తమ ఇహ్రాం దుస్తులను కడుక్కోవచ్చు మరియు ఇహ్రాం జతను మార్చుకోవచ్చు – ఇది అనుమతించబడింది. కాషాయరంగు అద్దకం వేయబడిన దుస్తులు మాత్రం వాడకూడదు. ఎందుకంటే అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన ఆధారంగా, దీనిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించారనే విషయం స్పష్టమవుతున్నది.
అల్లాహ్ ఆదేశాలను అనుసరించి ఇహ్రాం స్థితిలో ఉన్నవారు అనవరమైన వ్యర్థ సంభాషణలలో పాల్గొనరాదు, పాపాకార్యాలు చేయరాదు, పోరాడరాదు / ఘర్షణ పడరాదు.
“హజ్జ్ నెలలు అందరికీ తెలిసినవే. వాటిలో ఎవరైతే హజ్జ్ చేయుటకు తలపెడతారో, వారు హజ్జ్ సమయంలో (భార్యలతో) లైంగిక కలాపాలకు, పాపపు పనులకు, జగడాలకు దూరంగా ఉండండి. మీరు ఏ సత్కార్యం చేసినా, అది అల్లాహ్ కు తెలియును. ప్రయాణసామాగ్రిని వెంట తీసుకుని వెళ్ళండి. నిశ్చయంగా, అత్యుత్తమ సామగ్రి దైవభీతి మాత్రమే. మరియు ఓ వివేకవంతులారా! కేవలం నాకు మాత్రమే భయపడండి”. 2:197
ఇదే విషయం ఒక హదీథులో కూడా చెప్పబడింది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, “ఎవరైతే హజ్ చేస్తారో, మరియు అశ్లీల, అసభ్య కార్యాలకు (రఫత్) మరియు దౌర్జన్యానికి (ఫుసుఖ్) పాల్బడరో, అలాంటి వారు అప్పుడే పుట్టిన శిశువు వలే (పాపరహితంగా) మరలి వస్తారు”
రఫత్ అంటే లైంగిక కార్యకలాపాలు, శృంగార వ్యవహారాలు మరియు వ్యర్థ సంభాషణలు, పనికిమాలిన వ్యర్థాచరణలు. ఫుసుఖ్ అంటే మామూలుగా పాపకార్యాలని అర్థం. జిదాల్ అంటే అర్థం పర్థం లేని విషయంపై పోట్లాడటం. అయితే, సముచితమైన పద్ధతిలో సత్యాన్ని సమర్ధించే మరియు అసత్యాన్ని ఖండించే సంభాషణలు అనుమతించబడటమే గాక ప్రోత్సహించబడినాయి కూడా. దీని గురించి అల్లాహ్ యొక్క ఆదేశం ఇలా ఉన్నది:
“నీ ప్రభువు మార్గం వైపు జనులను వివేకంతోనూ, చక్కని ఉపదేశంతోనూ పిలువు. అత్యుత్తమ రీతిలో వారితో సంభాషణ జరుపు. ” 16:125
టోపీ, తలపాగా వంటి తలకు అంటుకుని ఉండే వేటితోనైనా తమ తలను లేదా ముఖాన్ని కప్పుకోవటం పురుషుల కొరకు నిషేధించబడింది. ఒంటె తన్నటం వలన ఒక సహచరుడు అరఫాత్ దినమున చనిపోయినాడు. అతని అంత్యక్రియలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు,
“అతని శరీరాన్ని నీటితో మరియు సిద్ర్ తో కడగండి. అతని రెండు ఇహ్రాం వస్త్రాలను కఫన్ వాడి వాటిలో అతనిని చుట్టండి. మరియు అతని తలను మరియు ముఖాన్ని కప్పవద్దు – ఎందుకంటే అంతిమదినాన అతను లబ్బైక్ పలుకుతూ లేస్తాడు.” ముత్తఫిఖ్ అలైహ్.
అయితే, ఎవరైనా కారు పైకప్పు క్రింద గానీ, గొడుగు క్రింద గానీ తలదాచుకుంటే ఏమీ దోషం లేదు. అలాగే గుడారం లోపల లేదా చెట్టు క్రింద తలదాచుకున్నా ఏ తప్పూ లేదు. జమరతుల్ అఖ్బా పై రాళ్ళు విసురుతున్నపుడు, ఆయన సహచరులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఒక వస్త్రంతో నీడ కల్పించారు. మరో హదీథులో అరఫహ్ దినమున నమిరహ్ వద్ద ఆయన కొరకు ఒక గుడారం వేయబడిందని, ఆయన దానిలో సూర్యాస్తమయం వరకు ఉన్నారని పేర్కొనబడింది.
ఇహ్రాం స్థితిలో ఉన్న స్త్రీ, పురుషుల కొరకు – భూమిపై జంతువులను వేటాడటం, వేటలో పాల్గొనటం లేదా సహాయపడటం, వేటాడుతూ జంతువుల వెనుకబడటం, పెళ్ళాడటం, దాంపత్య సుఖం అనుభవించటం, పెళ్ళి రాయబారం పంపడం, ఎవరైనా స్త్రీని కామంతో స్పర్శించడం మొదలైనవన్నీ నిషేధించబడినాయి. ఉథ్మాన్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన క్రింది హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాన్ని ఇలా స్పష్టం చేసారు,
“ఒక ముహ్రిం స్వయంగా తను పెళ్ళాడరాదు, తన తరఫు పెళ్ళి జరిపించుకోవటమూ చేయరాదు, పెళ్ళి రాయబారమూ పంపరాదు.” ముస్లిం హదీథు గ్రంథం.
అజ్ఞానం వలన (నిషేధాజ్ఞలు తెలియకపోవటం వలన) ఎవరైనా ఇహ్రాం స్థితిలో తలపై ఏదైనా వస్త్రం వేసుకోవటం, టోపీ పెట్టుకోవటం, తలపాగా పెట్టుకోవటం, అత్తరు పూసుకోవటం వంటివి చేస్తే, అతనిపై ఎలాంటి ప్రాయశ్చిత పరిహారమూ (దమ్) లేదు. తనకు వాటి గురించిన నిషేధాజ్ఞలు తెలియగానే లేదా ఎవరైనా అతని తప్పును అతనికి తెలియజేయగానే, అతను తన తప్పును సరిదిద్దుకోవలెను – అంటే తలపై నుండి టోపి వంటి వాటిని, తలగుడ్డను తొలగించవలెను. అలాగే ప్రామాణిక ఉల్లేఖనల ఆధారంగా, మతిమరుపు వలన లేదా అనాలోచితంగా లేదా తెలియక ఎవరైనా వెంట్రుకలు లేదా గోళ్ళు గొరిగించుకున్నా, కత్తిరించుకున్నా అతనిపై ఎలాంటి ప్రాయశ్చిత పరిహారమూ లేదు.
ఏ ముస్లిమైనా – ఇహ్రాం స్థితిలో ఉన్నా లేదా ఇహ్రాం స్థితిలో లేకపోయినా; స్త్రీ అయినా, పురుషుడైనా; జంతువులను వేటాడటం, సంజ్ఞలతో లేదా ఆయుధాలతో లేదా జంతువులను ఒక చోటకు తోలటం మొదలైన వేట పనులలో సహాయపడటం వంటివి కాబాగృహ పవిత్ర హద్దులలో నిషేధించబడింది. ఆ ప్రాంతంలోని చెట్లను నరకటం, పచ్చికను కోయడం మొదలైనవి కూడా నిషేధించబడినాయి. అంతేగాక ఆ పరిధి లోపల పడి ఉన్న ఇతరుల ఏ వస్తువునైనా ఎత్తుకోవటం కూడా నిషేధించబడింది – దాని గురించి చాటింపు వేయటానికైతే తప్ప. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు,
“అల్లాహ్ ఆదేశాలనుసారం అంతిమ దినం వరకు ఈ నగరం (మక్కా) పావనమైనది. దీని చెట్లు నరకరాదు. దీని జంతువులను వేటాడరాదు. దీని పచ్చికను కోయరాదు. క్రింద పడి ఉన్న వస్తువులను ఎత్తుకోరాదు – వాటి గురించి అందరికీ తెలిసేలా ప్రకటించే ఉద్దేశ్యంతో ఎత్తుకునే వారు తప్ప.”
ఇక్కడ పచ్చిక అంటే తాజా మొక్కలు, వృక్షసంపద. మీనా మరియు ముజ్దలిఫాలు కూడా కాబా గృహ పవిత్ర సరిహద్దుల లోపలే వస్తాయి. అయితే అరఫాత్ ఈ పవిత్ర కాబా గృహ సరిహద్దులోనికి రాదు.
[1]. హజ్ యాత్రికుడు నిర్దేశించబడిన దుస్తులు ధరించి, హజ్ లేదా ఉమ్రహ్ సంకల్పం చేసుకుని ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించే స్థలం.
3వ అధ్యాయం:
మక్కా చేరుకున్నపుడు యాత్రికుడు ఏమి చేయాలి?
మక్కా సరిహద్దులకు చేరుకున్న తరువాత, మక్కాలో ప్రవేశించక ముందు యాత్రికుడు స్నానం చేయటం మంచిది. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయం. అల్ మస్జిద్ అల్ హరమ్ చేరుకున్న తరువాత, సున్నతు ప్రకారం, ముందుగా కుడికాలు లోపలకు పెట్టి క్రింది దుఆ చదువుతూ లోపలికి ప్రవేశించవలెను.
బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి, అఊదు బిల్లాహిల్ అజీమ్, వ బివజ్ హిల్ కరీమ్, వ సుల్తానిహిల్ ఖదీమ్, మినష్ షైతానిర్రజీమ్, అల్లాహుమ్మఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక
“అల్లాహ్ పేరుతో, రసూలుల్లాహ్ పై శాంతి మరియు దీవెనలు కురియుగాక, బహిష్కరింపబడిన షైతాను బారి నుండి; ఆయన యొక్క పవిత్ర ముఖము ద్వారా మరియు ఆయన యొక్క అత్యంత ప్రాచీన పరిపాలన మరియు అధికారం ద్వారా సర్వలోక శక్తిమంతుడైన ఆ అల్లాహ్ యొక్క శరణు కోరుతున్నాను. ఓ అల్లాహ్! నీ కారుణ్య ద్వారాలను నా కొరకు తెరుచు”
ఇతర మస్జిదులలో ప్రవేశించేటపుడు కూడా ఇదే దుఆ పఠించవలెను. నాకు తెలిసినంత వరకు, మస్జిద్ అల్ హరమ్ లో ప్రవేశించేటపుడు పఠించమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూచించిన ప్రత్యేక దుఆ ఏదీలేదు.
మస్జిద్ అల్ హరమ్ లో ప్రవేశించటం మరియు తవాఫ్ (కాబా గృహ ప్రదక్షిణ)
కాబా గృహాన్ని సమీపించిన తరువాత, ఒకవేళ అతను హజ్జె తమత్తు లేదా ఉమ్రహ్ కొరకు సంకల్పం చేసుకుని ఉన్నట్లయితే, తవాఫ్ ఆరంభించక ముందు లబ్బైక్ పలకటం ఆపివేయవలెను. హజ్రె అస్వద్ (నల్లరాయి) దిశ వైపు నిలబడి, తన కుడి చేతితో దానిని స్పర్శించవలెను, వీలయితే దానిని ముద్దు పెట్టుకోవలెను. అలా చేయటంలో అతను ఇతరులను త్రోయటం గానీ, అసౌకర్యం కలిగించటం గానీ చేయరాదు. అతను దానిని స్పర్శించేటపుడు, ఇలా పలకవలెను – بسم الله، الله اكبر – బిస్మిల్లాహ్, అల్లాహు అక్బర్ – అల్లాహ్ పేరుతో, అల్లాహ్ మహోన్నతుడు. ఒకవేళ దానిని ముద్దాడటం కష్టమైతే, తన చేతితో లేదా తన చేతికర్రతో దానిని స్పర్శించి, ఆ చేతిని లేదా చేతికర్రను ముద్దాడవలెను. ఒకవేళ అలా చేయడం కూడా కష్టమైతే, హజ్రె అస్వద్ వైపు చేయితో సైగ చేసి, الله اكبر – అల్లాహు అక్బర్ – అల్లాహ్ మహోన్నతుడు అని పలుకవలెను. అయితే దూరం నుండి హజ్రె అస్వద్ వైపు ఊపిన చేతిని లేదా చేతికర్రను లేదా ఇతర వస్తువును ముద్దాడరాదు. తవాఫ్ ఆరంభించినపుడు కాబాగృహం అతని ఎడమ వైపు ఉండవలెను. తవాఫ్ ఆరంభించేటపుడు ఇలా పలకటం మంచిది,
అల్లాహుమ్మ ఈమానంబిక, వ తస్తదీకమ్ బి కితాబిక, వ వఫాఅమ్ బి అహ్దిక, వత్తిబాఅల్ లిసున్నతి నబియ్యిక ముహమ్మద్
“ఓ అల్లాహ్! నీపై విశ్వాసంతో, నీ గ్రంథంపై విశ్వాసంతో, నీకు చేసిన వాగ్దానాన్ని నేరవేరుస్తూ మరియు నీ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) విధానాన్ని అనుసరిస్తూ నేను దీనిని చేస్తున్నాను.”
పై పద్ధతి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వారసత్వంగా సంక్రమించింది. తవాఫ్ లో ఏడు ప్రదక్షిణలు ఉంటాయి. మొదటి మూడు ప్రదక్షిణలలో రమల్ చేయవలెను. మక్కాలో ప్రవేశించిన తరువాత చేసే మొదటి తవాఫ్ లో ఇలా రమల్ చేయవలెను – ఆ తవాఫ్ ఉమ్రహ్ కోసమైనా, హజ్జె తమత్తు ఉమ్రహ్ కోసమైనా లేదా హజ్జె ఖిరాన్ ఉమ్రహ్ కోసమైనా సరే. మిగిలిన నాలుగు ప్రదక్షిణలను మామూలుగా నడుస్తూ పూర్తి చేయ వలెను. ప్రతి ప్రదక్షిణ హజ్రె అస్వద్ నుండి ఆరంభమవుతుంది మరియు హజ్రె అస్వద్ వద్దనే పూర్తవుతుంది. రమల్ అంటే వడివడిగా నడవడం. మొత్తం తవాఫ్ లో ఇద్తిబా చేయవలెను. ఉమ్రహ్ లేదా హజ్ కోసం చేసే తవాఫ్ లను తప్పించి, ఇతర తవాఫ్ లలో ఇద్తిబా చేయరాదు. ఇద్తిబా అంటే పై వస్త్రాన్ని తమ కుడి భుజం అందరికీ కనబడేలా కుడిచేయి చంక క్రింది నుండి తీసుకువచ్చి, ఎడమభుజం పై వాటి రెండు చివరలు ఉంచటం.
ఒకవేళ ఎవరికైనా తాము ఎన్ని ప్రదక్షిణలు చేసామో గుర్తులేక, వాటి సంఖ్య గురించి అనుమానం వస్తే, తాము అనుమానిస్తున్న రెండింటిలో తక్కువ సంఖ్యను తీసుకోవలెను. ఉదాహరణకు, ఒకవేళ ఎవరికైనా తాము మూడు ప్రదక్షిణలు చేసామా లేక నాలుగు ప్రదక్షిణలు చేసామా అనేది గుర్తు లేకపోతే, తాము మూడు ప్రదక్షిణలే చేసామని లెక్కించుకోవాలి. సయీలో కూడా ఇదే విధంగా చేయాలి. తవాఫ్ పూర్తి చేసిన తరువాత, తమ కుడిభుజాన్ని పైవస్త్రంతో కప్పివేయాలి. అంటే తవాఫ్ తరువాత, మఖామె ఇబ్రాహీం వద్ద చేసే రెండు రకాతుల నమాజు కంటే ముందు, తమ రెండు భుజాలను పై వస్త్రంతో నిండుగా కప్పుకోవాలి.
స్త్రీలు ముసుగులో ఉండటం మరియు తమ అందచందాలను ప్రదర్శించే విధంగా అలంకరించుకోకుండా ఉండటం తప్పనిసరి.
తవాఫ్ చేసేటపుడు స్త్రీలు అత్తరు లేదా పెర్ఫ్యూమ్ పూసుకోవటం, తమ అందచందాలను ప్రదర్శించటం వంటి వాటికి దూరంగా ఉండటం అనివార్యం. ఇహ్రాం స్థితిలో ఉండి తవాఫ్ చేస్తున్నపుడు కూడా వారు పరాయి పురుషులకు తమ ముఖం కనబడకుండా మరియు తమ సౌందర్యం ప్రదర్శించకుండా జాగ్రత్త వహించవలెను. వారు పురుషులకు దగ్గరగా ఉన్నపుడు, స్త్రీపురుషులు ఒకేచోట కలిసిమెలిసి ఉండే చోట ఇలా జాగ్రత్ర పడటం మరీ ముఖ్యం. ఎందుకంటే స్త్రీల ఆకర్షణ పురుషులను ఉశికొలుపే ఒక ప్రధాన కారణం కావటం వలన స్త్రీలు ముఖంపై ముసుగు వేసుకోవటం ఆవశ్యకం. ఎందుకంటే స్త్రీల అందాన్ని ప్రధానంగా వారి ముఖం ప్రదర్శించటం వలన, పరాయి పురుషుల ముందు వారు తమ ముఖాన్ని ప్రదర్శించటం అనుమతించబడలేదు.
“… మరియు తమ భర్తల ముందు తప్ప తమ అందచందాలను వారు ప్రదర్శించరాదు” 24:31
ఒకవేళ హజ్రె అస్వద్ ను ముద్దాడే సమయంలో పురుషుల చూపు వారిపై ఉంటే, వారు తమ ముఖంపై ముసుగును తొలగించరాదు. ఒకవేళ హజ్రె అస్వద్ ను ముద్దాడే లేదా స్పర్శించే అవకాశం లేనంతగా అక్కడ జనం గుమిగూడి ఉండిన పరిస్థితిలో స్త్రీలు హజ్రె అస్వద్ ను ముద్దాడటానికి పురుషులతో పోటీపడకూడదు. స్త్రీలు తమ పురుషుల వెనుక నడుస్తూ, తవాఫ్ పూర్తి చేయవలెను. కాబా గృహానికి అతి దగ్గరలో నుండి తవాఫ్ చేసే వారిలో చొచ్చుకుని పోయి, రద్దీలో ఇబ్బంది పడే కంటే, కాబా గృహానికి కొంచెం దూరంలో నుండి ప్రశాంతంగా తవాఫ్ చేయటం మంచిది. పైగా దూరంలో నుండి తవాఫ్ చేయటంలో అడుగులు పెరగటం వలన ఎక్కువ పుణ్యాలు కూడా లభించే అవకాశం ఉంది. రమల్ మరియు ఇద్తిబాలను తవాఫ్ లో మాత్రమే పాటించాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా చేరుకున్న తర్వాత చేసిన తన మొదటి తవాఫ్ లోనే రమల్ మరియు ఇద్తిబాలు చేసారు. అయితే స్త్రీలు రమల్ మరియు ఇద్తిబాలను చేయవలసిన అవసరం లేదు.
తవాఫ్ మరియు సయీల కొరకు ప్రత్యేకమైన దుఆలు ఏమీ లేవు:
మొదటిసారైనా, తర్వాతైనా చేసే తవాఫ్ మరియు సయీలలో ప్రత్యేకమైన దుఆలు పఠించాలనే నియమం ఏదీ లేదు. ప్రతి తవాఫ్ ప్రదక్షిణలో ఒక ప్రత్యేకమైన దుఆ పఠించే పద్ధతిని కనిపెట్టిన కొందరి అలవాటుకు షరిఅహ్ లో ఎలాంటి ఆధారమూ లేదు. మీకు జ్ఞాపకం ఉన్న దుఆలలో నుండి ఏది పఠించినా సరిపోతుంది. రుకునె యమానీ (యమనీ మూల) వద్దకు చేరుకున్న తరువాత “బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరుతో), అల్లాహు అక్బర్(అల్లాహ్ మహోన్నతుడు)” అని పలికి, దానిని కుడి చేత్తో తాకవలెను. అయితే దానిని ముద్దాడకూడదు మరియు దానిని స్పర్శించిన కుడి చేతిని కూడా ముద్దాడకూడదు. ఒకవేళ రద్దీ వలన రుకునె యమానీని తాకటానికి అవకాశం లభించకపోతే, దాని వైపు చేయి ఊపుతూ సైగ చేయకుండా, అలానే తవాఫ్ కొనసాగించవలెను. అంతేగాక దానివైపు తిరిగి అల్లాహు అక్బర్ అని కూడా పలక కూడదు. అలా దూరం నుండి రుకునె యమానీ వైపు తిరిగి అల్లాహు అక్బర్ అని పలకటం నాకు తెలిసినంత వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులో లేదు. రుకునె యమానీ మరియు హజ్రె అస్వద్ ల మధ్య నడిచేటప్పుడు ఈ క్రింది దుఆ పఠించటం వాంఛనీయం.
రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతవ్ వ ఫిల్ ఆఖిరతి హసనతవ్ వ ఖినా అదాబన్నార్ సూరహ్ అల్ బఖరహ్ 2:201
“ఓ మా ప్రభూ! ఈ ప్రాపంచిక జీవితంలో మాకు మంచిని ప్రసాదించు మరియు పరలోక జీవితంలో మాకు మంచిని ప్రసాదించు మరియు మమ్ముల్ని నరకాగ్ని నుండి రక్షించు.”
హజ్రె అస్వద్ కు ఎదురుగా ఉన్నపుడు, దానిని తాకడానికి, ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ, “అల్లాహు అక్బర్ – అల్లాహ్ మహోన్నతుడు” అని పలుకవలెను. ఒకవేళ రద్దీ వలన అలా తాకడం లేదా ముద్దుపెట్టుకోవడం కష్టమైతే, హజ్రె అస్వద్ కు ఎదురుగా వచ్చినపుడల్లా, దాని వైపు సంజ్ఞ చేస్తూ, అల్లాహు అక్బర్ అని పలుకవలెను. మఖామె ఇబ్రాహీం లేదా జమ్ జమ్ బావి వెనుక నుండి తవాఫ్ చేయటంలో ఎలాంటి దోషమూ లేదు ముఖ్యంగా బాగా రద్దీగా ఉన్నపుడు. తప్పనిసరిగా కాబాగృహానికీ మరియు మఖామె ఇబ్రాహీం లేదా జమ్ జమ్ బావిల మధ్య నుండే తవాఫ్ చేయాలనే నియమం ఏదీ లేదు. మస్జిదె హరమ్ మొత్తంలో ఎక్కడి నుండైనా తవాఫ్ చేయవచ్చు. రద్దీ బాగా ఎక్కువగా ఉన్నపుడు, కాబా గృహం చుట్టూ ఉన్న మస్జిదు భవనం కప్పు పై నుండి తవాఫ్ చేయటంలో కూడా ఎలాంటి దోషమూ లేదు. అయితే, అవకాశం ఉంటే కాబా గృహం దగ్గరలో నుండి తవాఫ్ చేయటం ఉత్తమం.
అలాగే, అవకాశం లభిస్తే, తవాఫ్ పూర్తి చేసిన తరువాత మఖామె ఇబ్రాహీం వద్ద రెండు రకాతుల నమాజు చేయటం ఉత్తమం. రద్దీగా ఉండటం వలన ఒకవేళ అలా చేయలేక పోతే, తవాఫ్ పూర్తి చేసిన తరువాత కాబా మస్జిదులో మీకు వీలయిన చోట రెండు రకాతుల నమాజు చేసుకోవలెను.
ఈ రెండు రకాతుల నమాజులో సూరతుల్ ఫాతిహా తరువాత మొదటి రకాతులో సూరతుల్ కాఫిరూన్ మరియు రెండో రకాతులో సూరతుల్ ఇఖ్లాల్ పఠించవలెను. ఇలా పఠించటం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులో ఉన్నది.
తవాఫ్ పూర్తి చేసి, (మఖామె ఇబ్రాహీం వద్ద రెండు రకాతుల నమాజు పూర్తి చేసి, జమ్ జమ్ నీరు త్రాగి) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతును అనుసరిస్తూ, హజ్రె అస్వద్ వైపు తిరిగి, వీలయితే దానిని కుడిచేతితో తాకి, సఫా కొండ వైపు సాగిపోవలెను.
సయీ (సఫా మరియు మర్వా కొండల మధ్య నడక) ప్రారంభించటానికి, సపా కొండపై ఎక్కి నిలబడ వలెను.
సయీ మరియు దాని నియమాలు
ఒకవేళ అవకాశం లభిస్తే, అక్కడ అల్లాహ్ ను ధ్యానించేటప్పుడు మరియు ఈ క్రింది దుఆ పఠించేటప్పుడు, సఫా కొండ పైకి ఎక్కవలెను, కాబా గృహం వైపు తిరిగి నిలబడవలెను.
లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు, యుహ్ఈ వ యుమీతు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు, అంజజ వఆదహు, వ నసర అబ్దుహు, వ హజమ అహ్ జాబ వహదహు – ఆరాధింపబడే అర్హత కలిగిన వాడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప. అల్లాహ్ యే మహోన్నతుడు. ఆరాధింపబడే అర్హత కలిగిన వాడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప. ఆయన ఏకైకుడు. ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. విశ్వమంతా ఆయనకే చెందింది మరియు సకల ప్రశంసలు ఆయనకే చెందుతాయి. చావు బ్రతుకులు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ప్రతి దానిపై ఆయనకు ఆధిపత్యం ఉన్నది. ఆరాధింపబడే అర్హత కలిగిన వాడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప. ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చినాడు, తన దాసునికి సహాయం చేసినాడు, కేవలం ఆయనే ఒంటరిగా అహ్ జాబ్ (అవిశ్వాస తెగల మొత్తం) సమూహాన్ని ఓడించినాడు.
ఇలా పఠించిన తరువాత, రెండు చేతులూ పైకెత్తి, వీలయినన్ని ఎక్కువ దుఆలు చేసుకోవలెను. ఒక్కో దుఆ మూడు సార్లు పఠించవచ్చు. సఫా కొండ పైనుండి క్రిందికి దిగిన తరువాత, మర్వా కొండ వైపు నడక సాగించవలెను. ఆకుపచ్చ రంగు లైటు నుండి మరో ఆకుపచ్చ రంగు లైటు వరకు పురుషులు వడివడిగా (పరుగు పరుగున) నడవ వలెను. అయితే స్త్రీలు అలా చేయవలసిన అవసరం లేదు, సయీ మొత్తాన్ని వారు మామూలు నడకతో పూర్తి చేయవలెను. మర్వా కొండ వద్దకు చేరుకున్న తరువాత, దాని పైకి ఎక్క వలెను, ఒకవేళ అవకాశం లభించక పోతే, కొండ ప్రక్కన నిలుచో వలెను. కొండ పైకి ఎక్కటం ఉత్తమం. సఫా వద్ద పఠించిన విధంగా ఇక్కడ కూడా పఠించవలెను. ఈ విధంగా ఒక సయీ నడక పూర్తవుతుంది.
మర్వా కొండ దిగిన తరువాత, సపా వైపు నడక సాగిస్తూ, వేగంగా నడవ వలసిన ఆకు పచ్చ లైట్లు వచ్చినపుడు వడి వడిగా నడిచి, సఫా కొండ వద్దకు చేరుకోవలెను. ఈ విధంగా రెండో సయీ నడక పూర్తవుతుంది. ఇలా ఏడు సార్లు సఫా మరియు మర్వాల మధ్య నడవ వలెను. సఫా నుండి మర్వా వద్దకు చేరుకోవటం ఒక సయీ నడకగా పరిగణింపబడుతుంది. అలాగే మర్వా నుండి సఫా వద్దకు మరల చేరుకోవటం రెండో సయీ నడకగా పరిగణింప బడుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే విధంగా చేసినారు మరియు ఆయన ఇలా పలికినారు: “ హజ్ నియమాలను నా నుండి నేర్చుకోండి.”
సయీ నడకలో వీలయినంత వరకు అల్లాహ్ ను ధ్యానిస్తూ, దుఆలు చేసుకోవలెను. అన్ని రకాల అపరిశుద్ధతల నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించవలెను. వుదూ లేక పోయినా సయీ నడక సాగించడానికి అనుమతి ఇవ్వబడింది. తవాఫ్ పూర్తి చేసిన తరువాత ఒకవేళ ఎవరైనా స్త్రీకి, నెలసరి బహిష్టు వచ్చినా, పురుటి రక్తస్రావం మొదలైనా, ఆమె ఆ స్థితిలోనే సయీ నడక కొనసాగించవచ్చును. ముందు తెలిపినట్లుగా, సయీ నడక కొరకు తప్పనిసరిగా వుదూలోనే ఉండవలసిన అవసరం లేదు. సయీ నడక పూర్తయిన తరువాత, పురుషులు తమ తల వెంట్రుకలు పూర్తిగా గొరిగించు కోవలెను లేదా చిన్నవిగా కత్తిరింపబడేలా క్షవరం చేయించుకోవలెను. పురుషులు తమ తల వెంట్రుకలు పూర్తిగా గొరిగించుకోవటం మంచిది. అయితే, ఉమ్రహ్ లో తల వెంట్రుకలు చిన్నవిగా కత్తిరింపజేసుకుని, హజ్ లో పూర్తిగా గొరిగించుకోవటం ఉత్తమం. అలాగే ఎవరైనా హజ్ సమయానికి దగ్గరలో ఉమ్రహ్ చేస్తే, అతను తమ వెంట్రుకలు చిన్నవిగా కత్తరింపజేసుకుని, హజ్ తరువాత పూర్తిగా తల వెంట్రుకలు గొరిగించుకోవటం మంచిది. హజ్ కొరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులు దిల్ హజ్ 4వ తేదీన మక్కా చేరుకున్నారు. ఎవరైతే తమతో పాటు ఖుర్బానీ పశువులను వెంట తీసుకురాలేదో, వారిని తమ తల వెంట్రుకలు చిన్నవిగా కత్తిరింపజేసుకుని ఇహ్రాం స్థితి నుండి బయట పడమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించినారు. పూర్తిగా తమ తల వెంట్రుకలు గొరిగించుకోమని ఆయన వారిని ఆదేశించలేదు. అయితే హజ్ తరువాత పూర్తిగా తమ తల వెంట్రుకలు గొరిగించుకోవాలని ఆదేశించారు. అంతేగాని, చిన్నగా కత్తిరించుకోవచ్చని లేదా కొంత వరకే తొలగించుకోవచ్చని చెప్పలేదు. స్త్రీల కొరకు షరిఅహ్ ఆదేశం ఏమిటంటే, ఆమె కొన్ని వెంట్రుకలు మాత్రమే కత్తిరించుకోవాలి. కొద్దిగా మాత్రమే మాత్రమే కత్తిరించుకోవాలి. అంతకంటే ఎక్కువగా, అంటే పురుషులు కత్తిరించుకునేటంత ఎక్కువగా కత్తిరించుకోకూడదు. ఈ ఆచరణలు పూర్తి చేయటం ద్వారా మీ ఉమ్రాహ్ పూర్తవుతుంది. అలాగే ఇహ్రాం స్థితిలో మీపై ఉండిన నిషేధాలన్నీ ఇపుడు తొలగిపోతాయి. అయితే తమ వెంట ఖుర్బానీ పశువు తీసుకు వచ్చినవారు (ఖిరాన్ పద్ధతిలో హజ్ చేస్తున్నవారు) తమ ఇహ్రాం స్థితిని విడిచి పెట్టక, ఇంకా కొనసాగించవలసి ఉంటుంది. ఉమ్రాహ్ మరియు హజ్, రెండూ పూర్తి చేసిన తరువాతనే అతను ఇహ్రాం స్థితి నుండి బయటపడతాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతును అనుసరించి ఎవరైతే హజ్ చేయాలనే సంకల్పంతో లేదా ఉమ్రహ్ మరియు హజ్ చేయాలనే సంకల్పంతో ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించారో, అలాంటి వారు ఉమ్రహ్ పూర్తయిన తరువాత ఇహ్రాం స్థితిని విడిచి పెట్టవలెను. హజ్జె తమత్తు కొరకు నిర్దేశించబడిన విధానాన్నే అతను కూడా అనుసరించవలెను. కానీ, ఎవరైతే తమ వెంట ఖుర్బానీ పశువును తీసుకు వస్తారో, అలాంటి వారు దీనిని పాటించకూడదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు ఇలా ఆదేశించినారు:
“నేను ఒకవేళ నా వెంట ఖుర్బానీ పశువును తీసుకు వచ్చి ఉండక పోయినట్లయితే, ఇహ్రాం స్థితిని విడిచి పెట్టడంలో నేనూ మీతో చేరిపోయేవాడిని.”
ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించిన తరువాత, ఒకవేళ ఎవరైనా స్త్రీకి బహిష్టు రక్తస్రావం లేదా పురుటి రక్తస్రావం మొదలైతే, ఆమె మరల పవిత్రురాలయ్యే వరకు తవాఫ్ మరియు సయీ చేయకుండా ఆగిపోయి, అవి పూర్తి చేసిన తరువాత తల వెంట్రుకలు కత్తిరింపజేయటం చేయలెను. ఈ విధంగా ఆవిడ ఉమ్రహ్ పూర్తవుతుంది. అయితే, 8వ దిల్ హజ్ లోపల ఆమె రక్తస్రావం నుండి పవిత్రురాలు కాలేకపోతే, మక్కాలో ఎక్కడైతే బస చేసినదో, అక్కడే ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించి, మిగిలిన వారందరూ వెళ్ళుచున్నట్లుగా మీనాకు బయలుదేర వలెను. ఈ అపవిత్ర స్థితి ఆమె హజ్ పద్ధతిని ఖిరాన్ పద్ధతికి మార్చుతుంది. మిగిలిన హజ్ యాత్రికుల వలే ఆమె కూడా అరాఫాత్ మైదానంలో నిలబడవలెను, ముజ్దలిఫాలో రాత్రి గడపవలెను, జమరాత్ పై రాళ్ళు విసిరి, రమీలో పాల్గొనవలెను. ఖుర్బానీ పశువును ఖుర్బానీ చేయవలెను. కొద్దిగా తల వెంట్రుకల చివరలు కత్తిరింపజేసుకోవలెను. పవిత్ర స్థితి పొందిన తరువాత, ఆమె కేవలం ఒకసారి మాత్రమే తవాఫ్ మరియు సయీ పూర్తి చేయవలెను. ఇది ఆమె యొక్క ఉమ్రహ్ మరియు హజ్, రెండింటికీ సరిపోతుంది. ఆయెషా రదియల్లాహు అన్హా ఉల్లేఖించిన హదీథు ప్రకారం, ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించిన తరువాత ఆమెకు బహిష్టు రక్తస్రావం మొదలైంది. అపుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకు ఇలా చేయమని ఆదేశించారు,
“కాబా గృహం యొక్క తవాఫ్ తప్ప, మిగిలిన ఆచరణలన్నీ ఇతర హజ్ యాత్రికులు చేస్తున్నట్లుగానే నీవు కూడా ఆచరించు. అయితే పవిత్రత పొందిన తరువాత దానిని (తవాఫ్) పూర్తి చేయి.”
జమరాత్ పై కంకర రాళ్ళు విసిరిన తరువాత మరియు తల వెంట్రుకల చివరలు కత్తిరింపజేసుకున్న తరువాత బహిష్టు లేదా పురుటి రక్తస్రావం స్థితిలో ఉన్న స్త్రీలపై ఉండిన అత్తరు పూసుకోవటం వంటి ఇహ్రాం స్థితి నిబంధనలు తొలగి పోతాయి – తన భర్తతో శారీరకంగా కలిసే నిషేధం తప్ప. పవిత్రురాలైన తరువాత ఆమె తవాఫ్ మరియు సయీ చేసినపుడు మాత్రమే ఈ నిబంధన తొలగిపోతుంది. ఇతర స్త్రీలు చేసినట్లుగా ఆమె కూడా హజ్ పూర్తి చేసి, పవిత్ర స్థితిలో తవాఫ్ మరియు సయీ పూర్తి చేసిన తరువాత తన భర్తతో శారీరకంగా కలిసే నిబంధనతో పాటు ఆమెపై ఉన్న ఇహ్రాం నిబంధనలన్నీ తొలిగిపోతాయి.
దిల్ హజ్ నెల 8వ తేదీన హజ్ చేయాలని సంకల్పించుకున్న మక్కావాసులు మరియు ఇతర తమత్తు హజ్ యాత్రికులు తమ నివాస స్థలం నుండే ఇహ్రాం దుస్తులు ధరించి, ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించవలెను. తన హజ్జతుల్ విదాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులు మక్కాలోని అబ్తహ్ అనే ప్రాంతంలో బస చేసినారు. దిల్ హజ్ 8వ తేదీన తాము బస చేసిన ఇంటి నుండే ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు ఆదేశించారు. అంతేగాని కాబా గృహం వద్దకు వెళ్ళి లేదా మిజాబ్ వద్దకు వెళ్ళి ఇహ్రాం దుస్తులు ధరించమని, ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించమని ఆయన వారిని ఆదేశించలేదు. అలాగే మీనాకు బయలుదేరే ముందు వీడ్కోలు తవాఫ్ చేయమని కూడా ఆయన వారిని ఆదేశించలేదు. ఒకవేళ అలా చేయటమనేది షరిఅహ్ లో భాగమై ఉంటే, ఆయన వారిని అలా చేయమని తప్పకుండా ఆదేశించి ఉండేవారు. కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల పద్ధతిని మాత్రమే అనుసరించడంలో అన్ని రకాల శుభాలు మరియు సాఫల్యాలు ఇమిడి ఉన్నాయి. ఎలాగైతే మీఖాత్ వద్ద ఇహ్రాం దుస్తులు ధరించేటపుడు వీలయితే స్నానం చేసి అత్తరు పూసుకుంటారో, అలాగే హజ్ కొరకు ఇహ్రాం ధరించేటపుడు కూడా చేయవలెను.
నాలుగవ అధ్యాయం:
దిల్ హజ్ 8వ తేదీన మీనాకు పయనమవటం:
దిల్ హజ్ నెల 8వ తేదీన ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించిన తరువాత మధ్యాహ్నం కంటే ముందు లేదా మధ్యాహ్నం తరువాత మీనాకు చేరుకోవటం సున్నతు. జమరతుల్ అఖబహ్ పై కంకర రాళ్ళు విసిరే వరకు, తరచుగా తల్బియహ్ (లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ …. ) పలుకుతూ ఉండవలెను. హజ్ యాత్రికుడు దొహర్, అస్ర్, మగ్రిబ్, ఇషా మరియు మరుసటి దినపు ఫజ్ర్ నమాజులను మీనాలో చేయవలెను. సున్నతు ప్రకారం మీనాలో ప్రతి నమాజు దాని నిర్ణీత సమయంలోనే ఖస్ర్ (నాలుగు రకాతులకు బదులు రెండు రకాతులు) చేసి పూర్తి చేయవలెను. ఇతర సమయాలలో వలే దొహర్ మరియు అస్ర్ నమాజులు కలిపి జత చేయడం, మగ్రిబ్ మరియు ఇషా నమాజులు కలిపి జత చేయడం తగదు. మగ్రిబ్ మరియు ఫజ్ర్ నమాజులు మూడు మరియు రెండు రకాతులే కావడం వలన, ఎలాగూ ఖస్ర్ చేసే అవకాశం లేదు. ఈ విషయంలో మక్కహ్ నివాసులకు మరియు ఇతరులకు ఎలాంటి తేడా లేదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీనాలో, అరఫహ్ లో మరియు ముజ్దలిఫహ్ లలో తనతో ఉన్న ప్రజలకు ఖస్ర్ నమాజులు చదవించారు. ఆ ప్రజలలో మక్కహ్ నివాసులూ ఉన్నారు మరియు ఇతర ప్రాంతాల నివాసులూ ఉన్నారు. ఆయన మక్కహ్ నివాసులను నమాజులను ఖస్ర్ చేయకుండా, పూర్తిగా ఆచరించమని ఆదేశించి ఉండలేదు. అలా ఖస్ర్ చేయకుండా, ఒకవేళ నమాజులను పూర్తిగా ఆచరించవలసిన ఆవసరం ఉంటే ఆయన మక్కహ్ నివాసులను తప్పకుండా ఆదేశించి ఉండేవారే కదా!
అరఫహ్ మైదానానికి వెళ్ళడం:
అరఫహ్ దినమున హజ్ యాత్రికులు సూర్యోదయం అయిన తరువాత మీనా నుండి బయలుదేరి అరఫహ్ మైదానానికి చేరుకోవలెను. సున్నతు ప్రకారం ఒకవేళ అవకాశం లభిస్తే వారు మిట్టమధ్యాహ్నం వరకు నమీరహ్ వద్ద నిలబడవలెను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుజాడలను పూర్తిగా అనుసరించాలనే ప్రయత్నంలో ఇది ఒక భాగం. మిట్టమధ్యాహ్నం తరువాత ఇమాం లేదా అతని సహాయకుడు హజ్ యాత్రికులకు అరఫహ్ దినం మరియు మరుసటి దినం గురించిన షరిఅహ్ ఆదేశాలను అనుసరించేలా సముచితమైన ప్రసంగం చేయవలెను. అల్లాహ్ యొక్క ఏకత్వం (తౌహీద్) పై పటిష్టమైన విశ్వాసం గురించి, చిత్తశుద్ధి గురించి, తఖ్వా పాటించడం గురించి ప్రజలను ప్రోత్సహించవలెను. చెడు పనుల నుండి దూరంగా ఉంటూ, ఖుర్ఆన్ మరియు సున్నతులను అనుసరించి జీవించమని బోధించవలెను. ఖుర్ఆన్ మరియు సున్నతుల బోధనలను అనుసరించి తమ సమస్యలను పరిష్కరించుకోమని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత విధానాన్ని మాత్రమే అనుసరించమని సూచించవలెను. ఇమాం ప్రసంగం తరువాత, ప్రజలు దొహర్ మరియు అస్ర్ నమాజులను కలిపి, ఒకే అదాన్ మరియు రెండు అఖామహ్ లతో ఖస్ర్ చేసి పూర్తి చేయవలెను.
అరఫహ్ మైదానంలో నిలబడుట మరియు అక్కడి ఇతర ఆరాధనలు:
ఆ తరువాత ప్రజలు అరఫహ్ మైదానంలో నిలబడవలెను. బత్నె ఉర్నా అనే స్థలం తప్ప, మొత్తం అరఫహ్ మైదానంలో ఎక్కడైనా నిలబడవచ్చు. ఒకవేళ వీలయితే ఖిబ్లహ్ మరియు జబలె రహ్మహ్ ల వైపు తిరిగి నిలబడవలెను. అంటే ఖిబ్లహ్ దిశల తమ ముందు జబలె రహ్మహ్ ఉండేటట్లు నిలబడ వలెను. ఒకవేళ రెండింటికి అభిముఖంగా నిలబడ లేకపోతే, కేవలం ఖిబ్లహ్ వైపు మాత్రమే తిరిగి నిలబడవలెను. అలా నిలబడినపుడు, హజ్ యాత్రికుడు అల్లాహ్ ను ధ్యానించడంలో, అల్లాహ్ ను వేడుకోవడంలో, ప్రార్థించడంలో మనస్పూర్తిగా నిమగ్నమై పోవలెను.
దుఆ చేసేటపుడు, రెండు చేతులు పైకెత్తి దుఆ చేయవలెను. లబ్బైక్ అనే తల్బియహ్ పలుకులు మరియు ఖుర్ఆన్ పఠనం కొనసాగించవలెను.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలను అనుసరించి ఈ క్రింది దుఆ చేయడం ఉత్తమం:
خَيْرُ الدُّعَاءِ دُعَآءُ يَوْمَ عَرَفَةَ، وَأَفْضَلُ مَا قُلْتُ أَنَا وَالنَّبِيُّونَ مِنْ قَبْليِ
ఖైరుద్దు ఆయి దుఆఉ యౌమ అరఫహ్ వఅఫ్దలు మాఖుల్తు అనా వ నబియ్యూన మిన్ ఖబ్లి
అరఫహ్ దినం నాటి దుఆ అన్నింటి కంటే ఉత్తమమైన దుఆ మరియు ఉత్తమమైన దుఆ – నేనూ మరియు నా కంటే పూర్వం వచ్చిన ప్రవక్తలు చేసిన ఈ దుఆ –
لاَ إِلهَ إِلاَّ اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ ، لَهُ المْـُلْكُ وَلَهُ الْـحَمْدُ ،
يـُحْيِي وَ يُمِيْتُ ، وَ هُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيْرٌ
లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్దహు, లా షరీక లహు, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు, యుహ్ఈ వ యుమీతు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్.
ఆరాధింపబడే అర్హత కలిగిన ఆరాధ్యుడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప. అల్లాహ్ యే మహోన్నతుడు. ఆరాధింపబడే అర్హత కలిగిన వాడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప. ఆయన ఏకైకుడు. ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. విశ్వమంతా ఆయనకే చెందింది మరియు సకల ప్రశంసలు ఆయనకే చెందుతాయి. చావు బ్రతుకులు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ప్రతి దానిపై ఆయనకు ఆధిపత్యం ఉన్నది.
ఈ క్రింది నాలుగు ధ్యానాలను అల్లాహ్ ఎక్కువగా ఇష్టపడతాడని కొన్ని ప్రామాణిక ఉల్లేఖనలు తెలుపుతున్నాయి –
سُبْحَانَ الله
సుబ్హానల్లాహ్
అల్లాహ్ అన్ని రకాల లోపాలకు అతీతుడు, పరమ పవిత్రుడు
وَ الْـحَـمْدُ لله
వల్ హమ్దులిల్లాహ్
సకల ప్రశంసలు మరియు కృతజ్ఞతలు అల్లాహ్ కే
وَ لاَ إِلَـهَ إِلاَّ الله
వలా ఇలాహ ఇల్లల్లాహ్
ఆరాధింపబడే అర్హతలు గల ఆరాధ్యుడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప.
وَ اللهُ أَكْبـَرْ
వల్లాహు అక్బర్
అల్లాహ్ అందరి కంటే (అన్నింటి కంటే) మహోన్నతుడు.
ఈ పలుకులను మనస్సు లోపలి పొరలలో నుండి దృఢంగా విశ్వసిస్తూ, తరచుగా పలుకుతూ ఉండవలెను. అలాగే షరిఅహ్ ఆమోదించిన ఇతర పలుకులు కూడా పలుకవలెను. ప్రత్యేకంగా వీటిని అరఫహ్ మైదానంలో ఈ అత్యుత్తమమైన దినం నాడు మనస్పూర్తిగా తరచుగా పలుకుతూ వలెను. ప్రత్యేకంగా హజ్ యాత్రికులు అల్లాహ్ యొక్క ఘనతను ప్రశంసించే కొన్ని సమగ్రమైన, విశేషమైన దుఆలను ఎంచుకొని, ఈ దినం నాడు వాటిని హృదయ పూర్వకంగా వేడుకోవలెను. వాటిలో కొన్ని క్రింద ఇవ్వబడినాయి:
سُبْحَانَ اللهِ وِبِحَمْدِهِ، سُبْحَانَ اللهِ الْعَظِيمَ
సుబహానల్లాహి వ బిహమ్దిహి – సుబహానల్లాహిల్ అజీమ్.
ఆయన అన్ని లోపాలకూ అతీతుడు, పరమ పవిత్రుడు మరియు సకల ప్రశంసలు మరియు కృతజ్ఞతలు ఆయనకే చెందును – ఆయన అన్ని లోపాలకూ అతీతుడు, పరమ పవిత్రుడు, అత్యంత ఘనమైన వాడు.
لاَ إِلَهَ إِلاَ أَنْتَ سُبْحَانَكَ إِنِّي كُنْتُ مِنَ الظَّالِـمِـيْنَ
లా ఇలాహ ఇల్లా అంత, సుబహానక, ఇన్నీ కుంతు మినజ్జాలిమీన్
ఆరాధింపబడే అర్హతలు గల ఆరాధ్యుడెవ్వడూ లేడు – నీవు తప్ప. అన్ని లోపాలకూ అతీతుడివీ, పరమ పవిత్రుడివి. నిశ్చయంగా నేను హద్దుమీరిన వారిలోని వాడినే (కేవలం నీ దయ కారణంగానే నేను హద్దుమీరక నీ దాసుడిగా మారగలిగాను).
لاَ إِلَهَ إِلاَّ الله وَلاَ نَعْبُدُ إِلاَّ إِيَّاهُ، لَهُ النَّعْمَةُ وَلَهُ الْفَضْلُ وَلَهُ الثَّنَاءُ الـْحُسْنُ، لاَ إِلَهَ إِلاَّ الله مـُخْلِصِيْنَ لَهُ الدِّيْنَ وَلَوْ كَرِهِ الْكَافِرُونَ
లా ఇలాహ ఇల్లల్లాహ్, వ లా నఆబుదు ఇల్లా ఇయ్యాహు, లహున్నఅమతు, వ లహుల్ ఫద్లు, వ లహుథ్థానాఉల్ హుస్ను, లా ఇలాహ ఇల్లల్లాహు, ముఖ్లిసీన లహుద్దీన, వలవ్ కరిహల్ కాఫిరూన్
ఆరాధింపబడే అర్హత గలవాడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప. మేమందరమూ కేవలం నిన్నే ఆరాధిస్తాము. అన్ని రకాల శుభాలు మరియు అనుగ్రహాలు ఆయనవే. అత్యంత ఘనమైన ప్రశంసలు కేవలం ఆయన కొరకే. ఆరాధింపబడే అర్హత గలవాడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప. మా యొక్క చిత్తశుద్ధితో కూడిన విశ్వాసం ఆయన కొరకే – సత్యతిరస్కారులకిది అయిష్టమైనా సరే.
لاَ حَوْلَ وَلاَ قُوَّةَ إِلاَّ بِالله
లా హౌల వ లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్
ఆయన వద్ద నున్న శక్తీ, సామర్థ్యం తప్ప మరింకేదీ లేదు.
رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الْآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ
రబ్బనా ఆతినా పిద్దున్యా, హసనతవౌ, వ ఫిల్ ఆఖిరతి హసనతవౌ, వ ఖినా అదాబన్నార్
ఓ మా ప్రభూ! ఈ ప్రపంచంలో మాకు శుభాలను ప్రసాదించు మరియు పరలోకంలో కూడా శుభాలను ప్రసాదించు మరియు నరకాగ్ని శిక్ష నుండి మమ్ముల్ని కాపాడు.
أَللَّهُمَّ أَصْلِحْ لِي دِيْنِي الَّذِي هُوَ عِصْمَةُ أَمْرِي، وَأَصْلِحْ لِي دُنْيَاي الَّتِي فِيْهَا مَعَاشِي، وَأَصْلِحْ لِي آخِرَتِي الَّتِي فِيْهَا مَعَادِي، وَاجْعَلِ الـْحَيَاةِ زِيَادَةً لِي فِي كُلِّ خَيْرٍ، وَالـْمَوْتَ رَاحَةً لِي مِنْ كُلِّ شَرٍ
అల్లాహుమ్మ అస్లిహ్ లి దీనీ – అల్లదీ హువ ఇస్మతు అమ్రీ, వ అస్లిహ్ లీ దున్యాయ – అల్లతీ ఫీహా మఆషీ, వ అస్లిహ్ లీ ఆఖిరతీ – అల్లతీ ఫీహా మఆదీ, వజ్అలిల్ హయాత జియాదతన్ లీ ఫీ కుల్లి ఖైరిన్, వల్ మౌత రాహతన్ లీ మిన్ కుల్లి షర్రిన్.
ఓ అల్లాహ్! నా ఆచరణలను (చెడు నుండి) కాపాడే విధంగా నా ధర్మాన్ని సరిదిద్దు. నా జీవనోపాధి ఉన్న నా ఈ ప్రపంచాన్ని సరిదిద్దు. నేను మరల వలసి ఉన్న నా పరలోకాన్ని సరిదిద్దు. నా కొరకు ప్రతి ఒక్క శుభంలోనూ నా ఈ జీవితాన్ని పొడిగించు. మరియు ప్రతి దుష్టత్వం నుండి నా మరణాన్ని కాపాడు.
أَعُوذُ بِالله مِنْ جَهْدِ الْبَلَاءِ، وَدَرَكِ الشِّقَاءِ، وَسُوْءِ الْقَضَاءِ، وَشَمَاتَةِ الأَعْدَاءِ
అఊదు బిల్లాహి మిన్ జహ్దిల్ బలాఇ, వ దరకిష్షఖాఇ, వ సూఇల్ ఖదాఇ, వ షమాతతిల్ ఆదాఇ.
కఠిన పరీక్షల నుండి, దురదృష్టాల నుండి, నాకు వ్యతిరేకమైన తీర్పుల నుండి మరియు విరోధుల అపహాస్యాల నుండి నేను అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను.
أَللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الـْهَمِّ وَالـْحَزَنِ، وَمِنَ الْعَجْزِ وَالْكَسَلِ، وَمِنَ الـْجُبْنِ وَالْبُخْلِ، وَمِنَ الـْمَأْثَمِ وَالـْمَغْرَمِ، وَمِنْ غَلَبَةِ الدِّيْنِ وَقَهْرِ الرِّجَالِ
అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మినల్ హమ్మ వల్ హజని, వ మినల్ అజ్ జి వల్ కసలి, వ మినల్ జుబ్ని వల్ బుఖ్లి, వ మినల్ మఅథమి వల్ మగ్రమి, వ మిన్ గలబతిద్దీని వ ఖహ్రిర్రిజాలి.
ఓ అల్లాహ్! బాధలకు, కష్టాలకు, కలతలకు, విచారానికి, దు:ఖానికి, పీడనలకు, నిస్సహాయానికి, బద్దకానికి, సోమరితనానికి, పిరికితనానికి, పాపాలకు మరియు అప్పులకు, అప్పుల భారముకు మరియు ఇతరులు నాపై ఆధిక్యం చలాయింటానికి వ్యతిరేకంగా నేను నీ శరణు వేడుకుంటున్నాను.
أَعُوذُ بِكَ اللَّهُمَّ مِنَ الْبَرْصِ وَالـْجُنـُوْنِ وَالـْجُذَامِ وَمِنْ سَـيِّءِ الْأَسْقَامِ
అఊదు బిక అల్లాహుమ్మ మినల్ బర్సి, వల్ జునూని, వల్ జుదామి, వ మిన్ సయ్యిఇల్ అస్ఖామి
ఓ అల్లాహ్! కుష్టురోగం నుండి, నల్ల కుష్టురోగం నుండి, పిచ్చితనం నుండి మరియు ఇతర అసహ్యమైన వ్యాధుల నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను.
أَللَّهُمَّ إِنـِّي أَسْأَلُكَ الْعَفْـوَ وَالْعَافِيَـةَ فـِي الدُّنِيَـا وَالْآخِرَةِ،
అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్వ వల్ ఆఫియత ఫిద్దున్యా వల్ ఆఖిరహ్
ఓ అల్లాహ్! ఇహపరలోకాలలో నీ మన్నింపు మరియు రక్షణ కొరకు నేను నిన్ను వేడుకుంటున్నాను.
أَللَّهُمَّ إِنـِّي أَسْأَلُكَ الْعَفْـوَ وَالْعَافِيـَةَ فـِي دِيـْنِي وَدُنْيَايَ وَأَهْـلِي وَمَالِي
అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్వ వల్ ఆఫియత ఫీ దీనీ వ దున్యాయ వ అహ్లీ వ మాలీ
ఓ అల్లాహ్! నా ధర్మం, నా ప్రపంచం, నా కుటుంబం మరియు నా సంపద యొక్క క్షేమం గురించి మరియు నా మన్నింపు గురించి నేను నిన్ను వేడుకుంటున్నాను.
أَللَّهُمَّ اسْتُرْ عَوْرَاتِي وَآمِنْ رَوْعَاتِي، وَاحْفَظْنِي مِنْ بَيْنَ يَدَيَّ وَمِنْ خَلْفِي وَعَنْ يَمِيْنِي وَعَنْ شِمَالِي، وَمِنْ فَوْقِي وَأَعُوْذُ بِعَظَمَتِكَ أَنْ أُغْتَالَ مِنْ تـَحْتِي
అల్లాహుమ్మస్తుర్ ఔరాతీ, వ ఆమిన్ రౌఆతీ, వహ్ఫజ్నీ మిన్ బైని యదయ్య వ మిన్ ఖల్ఫీ, వఅన్ యమీనీ వఅన్ షిమాలీ, వమిన్ ఫౌఖీ, వఅఊదు బి అజమతిక అన్ ఉగ్తాల మిన్ తహ్తీ
ఓ అల్లాహ్! నా తప్పులను దాచివేయి మరియు భయం నుండి నన్ను కాపాడు, నా కుడివైపు నుండి మరియు నా ఎడమ వైపు నుండి మరియు నా పై వైపు నుండి, నా ముందు నుండి మరియు నా వెనుక నుండి నన్ను రక్షించు. నా క్రింద నుండి నేను హత్య చేయబడతానేమో అనే భయంతో నేను నీ ఘనత ఆధారంగా నీ శరణు వేడుకుంటున్నాను.
أَللَّهُمَّ اغْـفِرْ لـِي خَطِيْـئَتـِي وَجَهْلـِي وَإِسْرَافِي فِي أَمْرِي وَمَا أَنْتَ أَعْلَمُ بِهِ مِنـِّي
అల్లాహుమ్మ గ్ఫర్లీ ఖతీఅతీ వ జహ్లీ వ ఇస్రాఫీ, ఫీ అమ్రీ వ మా అంత ఆలము బిహీ మిన్నీ
ఓ అల్లాహ్! నాకంటే అధికంగా నీకు తెలిసిన నా లోపాలను, అజ్ఞానాన్ని మరియు హద్దుమీరటాన్ని క్షమించు.
أَللَّهُمَّ اغْـفِرْ لـِي جَدِّي وَهَزْلـِي وَخَطَـئِي وَعَـمْدِي وَكُلِّ ذَلِكَ عِنْدِي
అల్లాహుమ్మ గ్ఫర్లీ జిద్దీ వ హజ్లీ, వ ఖతాఇయీ, వ అమ్దీ వ కుల్లు దాలిక ఇందీ
ఓ అల్లాహ్! గంభీరంగా మరియు పరిహాసంగా నేను చేసిన పాపాలను మరియు నా చెడు ఆలోచనలను, నాలోని కొరతలను మరియు నాలోని లోపాలన్నింటినీ క్షమించు.
أَللَّهُمَّ اغْـفِرْ لِـي مَا قَدَّمْتُ وَمَا أَخَّرْتُ وَمَا أَسْرَرْتُ وَمَا أَعْلَنْـتُ وَمَا أَنْـتَ أَعْلَمُ بِهِ مِنِّي، أَنْتَ الـْمُقَدَّمُ وَأَنْتَ الـْمُؤَخِّرُ وَأَنْتَ عَلَى كُلِّ شَـيْءٍ قَدِيْـرٌ
అల్లాహుమ్మగ్ఫర్లీ మా ఖద్దమ్తు, వ మా అఖ్ఖర్తు, వ మా అస్రర్తు, వ మా ఆలంతు, వ మా అంత ఆలము బిహీ మిన్నీ, అంతల్ ముఖద్దిము వ అంతల్ ముఅఖ్ఖిరు వ అంత అలా కుల్లి షైఇన్ ఖదీర్.
ఓ అల్లాహ్! నా ద్వారా పూర్వం జరిగిపోయిన వాటినీ మరియు జరుగబోయే వాటినీ క్షమించు, మరియు రహస్యంగానూ, బహిరంగంగానూ నా ద్వారా జరిగిపోయిన వాటినీ క్షమించు – అవి నా కంటే ఎక్కువగా నీకే తెలుసు. కేవలం నీవు మాత్రమే ఎవరినైనా ముందుకు పంపగలవు లేదా వెనక్కి తీసుకురాగలవు. కేవలం నీవు మాత్రమే అన్నింటిపై ఆధిపత్యం కలిగి ఉన్నావు.
أَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الثَّبَاتَ فِي الْأَمْرِ وَالْعَزِيْمَةَ عَلَى الرُّشْدِ، وَأَسْأَلُكَ شُكْرَ نِعْمَتِكَ وَحُسْنَ عِبَادَتِكَ، وَأَسْأَلُكَ قَلْباً سَلِيْمـًا وِلِسَاناً صَادِقاً، وَأَسْأَلُكَ مِنْ خَيْرِ مَا تَعْلَمُ، وَأَعُوْذُ بِكَ مِنْ شَرِّ مَا تَعْلَمُ، وَأَسْتَغْـفِرُكَ لـِمَا تَعْلَمُ إِنَّكَ عَلاَّمُ الْغُـيُوْبِ
అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక థ్థబాత ఫిల్ అమ్రి, వల్ అజీమత అలర్రుష్ది, వ అస్అలుక షుక్ర నేమతిక వ హుస్న ఇబాదతిక, వ అస్అలుక ఖల్బన్ సలీమా, వ లిసానన్ సాదిఖా, వ అస్అలుక మిన్ ఖైరి మా తాలము, వ అఊదుబిక మిన్ షర్రి మా తాలము, వ అస్తగ్ఫిరుక లిమా తాలము, ఇన్నక అల్లాముల్ గుయూబ్.
ఓ అల్లాహ్! నేను నీ నుండి అన్ని విషయాలలో స్థిరత్వాన్ని మరియు సన్మార్గాన్ని అనుసరించటంలో నిలకడను వేడుకుంటున్నాను. నీ అనుగ్రహాలకు బదులుగా నీకు కృతజ్ఞతలు తెలిపుకునే శక్తినీ మరియు నిన్ను సరిగ్గా ఆరాధించే శక్తినీ ప్రసాదించు. సన్మార్గం పై నడిపించే హృదయాన్ని మరియు సత్యాన్ని పలికే నాలుకను నేను నీ నుండి వేడుకుంటున్నాను. నీకు తెలిసిన మంచిని నేను నీ నుండి కోరుకుంటున్నాను. నీకు తెలిసిన ప్రతి చెడు నుండి నేను నీ వద్ద శరణు కోరుకుంటున్నాను. నీకు తెలిసిన పాపాల నుండి నేను నీ మన్నింపును కోరుకుంటున్నాను. నిశ్చయంగా అన్ని గుప్త విషయాలు నీకే తెలుసు.
أَللَّهُمَّ رَبَّ النَّبِيِّ مـُحَمَّدٍ عَلَيْهِ الصَّلاَةُ وَالسَّلاَمُ اغْـفِرْ لـِي ذَنْبِي، وَأَذْهِبْ غَيْظَ قَلْبِي، وَأَعِذْنِي مِنْ مُّضِلاَّتَ الْفِـتْـنِ مَا أَبْـقَيْتَـنـِي
అల్లాహుమ్మ రబ్బన్నబియ్యి ముహమ్మదిన్ అలైహిస్సలాతు వస్సలామ్ – ఇగ్ఫర్లీ దంబీ వ అద్హిబ్ గైజ ఖల్బీ, వ అయిద్నీ మిమ్ ముదిల్లాతల్ ఫిత్ని మా అబ్ ఖైతనీ.
ఓ అల్లాహ్! ముహమ్మద్ యొక్క ప్రభువా! నా తప్పులను మన్నింపుము. క్రోధం నుండి నా హదయాన్ని శుభ్రం చేయుము. నేను సజీవంగా ఉండాలని నీవు తలిచినంత కాలం వరకు, నన్ను దారి తప్పించే ఫిత్నాల (దుష్టత్వం) నుండి కాపాడుము.
أَللَّهُمَّ رَبَّ السَّماَوَاتِ وَرَبَّ الْأَرْضِ وَرَبَّ الْعَرْشِ الْعَظِيْمِ، رَبُّناَ وَرَبُّ كُلِّ شـَيْءٍ، فَالِقُ الـْحَبِّ وَالنَّوَى، مُنْزِلُ التَّوْرَاةِ وَالْإِنْجِيْلِ وَالْقُرْآنِ، أَعُوْذُ بِكَ مِنْ شَرِّ كُلِّ شـَيْءٍ أَنْتَ آخِذٌ بِنَاصِيِتـِهِ، أَنْتَ الْأَوَّلُ فَلَيْسَ قَبْلَكَ شَـيْءٌ، وَأَنْتَ الْآخِرُ فَلَيْسَ بَعْدُكَ شَـيْءٌ، وَأَنْتَ الْظَاهِرُ فَلَيْسَ فَوْقُكَ شَـيْءٌ، وَأَنْتَ الْبَاطِنُ فَلَيْسَ دُوْنَكَ شَـيْءٌ، إِقْضِ عَنِّي الدَّيْنَ وَأَغْنِـنِي مِنْ الْفَقْرِ
అల్లాహుమ్మ రబ్బస్సమావాతి వ రబ్బల్ అర్ది వ రబ్బల్ అర్షిల్ అజీమ్, రబ్బునా వ రబ్బు కుల్లి షైఇన్, ఫాలిఖుల్ హబ్బి వన్నవా, ముంజిలుత్తౌరాతి వల్ ఇంజీలి వల్ ఖుర్ఆన్, అఊదు బిక మింషర్రి కుల్లి షైఇన్ అంత ఆఖిదుంబి నాశియతిహి, అంతల్ అవ్వలు ఫలైస ఖబ్లక షైఉన్, వ అంతల్ ఆఖిరు ఫలైస బఆదక షైఉన్, వ అంతజ్జాహిరు ఫలైస ఫౌఖక షైఉన్, వ అంతల్ బాతిను ఫలైస దూనక షైఉన్, ఇఖ్ది అన్నీ అద్దీన వ అగ్నినీ మినల్ ఫఖ్రి.
ఓ అల్లాహ్! భూమ్యాకాశాల ప్రభువా మరియు మహోన్నతమైన అర్ష్ సింహాసనం యొక్క ప్రభువా! ఓ మా అందరి యొక్క మరియు అన్నింటి యొక్క ప్రభువా! మొలకెత్తుట కొరకు విత్తనాల్ని మరియు గింజలన్ని చీల్చేవాడా మరియు మొక్కలు మొలకెత్తించేవాడా! నీవే తౌరాతును, గోస్పెలును మరియు ఖుర్ఆన్ ను అవతరింపజేసావు. నీ చేతిలో తన నుదురు చిక్కించుకుని ఉన్న ప్రతిదాని దుష్టత్వం నుండి నేను నీ శరణు కోరుతున్నాను. నీవే ప్రథముడివి – నీకు పూర్వం ఉనికిలో ఏదీ లేదు. నీవే కడపటి వాడివి – నీ తర్వాత ఉనికిలో ఏదీ ఉండదు. నీవే మహోన్నతుడివి – నీ పై ఏదీ లేదు. రహస్యాలన్నీ తెలిసిన వాడివి నీవే. గుప్తంగా దాచబడిన వాటిని నీ కంటే బాగా ఎరిగినవారు ఎవ్వరూ లేరు. నా తరుఫున నా ఋణాలు తీర్చు మరియు లేమీ, పేదరికం, దారిద్ర్యం, శూన్యత్వం మొదలైనవి నా దరిదాపులకు కూడా చేరనంత పటిష్టంగా, అభేద్యంగా నన్ను చేయి.
أَللَّهُمَّ أَعْطِ نَفْسـِي تَقْوَاهَا وَزَكِّـهَا أَنْتَ خَيْرُ مَنْ زَكَّاهَا، أَنْتَ وَلِـيُّهَا وَمَوْلاَهاَ
అల్లాహుమ్మ ఆతీ నఫ్సీ తఖ్వాహా వ జక్కిహా, అంత ఖైరు మిన్ జక్కాహా, అంత వలియ్యుహా వ మౌలాహా
ఓ అల్లాహ్! నాకు తఖ్వా (ధర్మనిష్ఠ) ను ప్రసాదించు మరియు నా ఆత్మను పవిత్రం చేయి. ఉత్తమంగా పవిత్రత చేకూర్చేవాడివి నీవే. ఉత్తముడివి నీవే, నా రక్షకుడివి నీవే మరియు నా పాలకుడివి నీవే.
أَللَّهُمَّ إِنِّي أَعُوْذُ بِكَ مِنَ الْعَـجَزِ وَالْكَسَلِ، وَأَعُوْذُ بِكَ مِنْ عَذَابِ الْـقَبْرِ
అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మినల్అజజి, వల్ కసలీ, వఅఊదు బిక మిన్ అదాబిల్ ఖబర్
ఓ అల్లాహ్! నిస్సహాయ స్థితి నుండి మరియు సోమరితనం నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను. మరియు సమాధి శిక్షల నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను.
أَللَّهُمَّ لَكَ أَسْلَمْتُ وَبِكَ آمَنْتُ وَعَلَيْكَ تَوَكَّلْتُ وَإِلَيْكَ أَنَبـْتُ وَبِكَ خَاصَمْتُ، أَعُوْذُ بِعِزَّتِكَ أَنْ تُضِلَّنِـي لاَ إِلَهَ إِلاَّ أَنْتَ، أَنْتَ الـْحَيُّ الَّذِي لاَ يَمُوْتُ وَالـْجِنُّ وَالْإِنْسُ يَمُوْتُوْنَ
అల్లాహుమ్మ లక అస్లమ్ తు, వ బిక ఆమన్ తు, వ అలైక తవక్కల్ తు, వ ఇలైక అనబ్ తు, వ బిక ఖాసమ్ తు, అఊదు బి ఇజ్జతిక అన్ తుదిల్లనీ, లా ఇలాహ ఇల్లా అంత, అంతల్ హయ్యుల్లదీ లా యమూతు వల్ జిన్ను, వల్ ఇన్సు యమూతూన్.
ఓ అల్లాహ్! నేను నీకు విధేయుడైనాను మరియు నిన్నే విశ్వసించాను, నిన్నే నమ్ముకున్నాను, నీవైపుకే మరలాను, నీ కొరకు పోరాడాను. మార్గభ్రష్టత్వం నుండి నన్ను కాపాడమని నీ ఘనత ద్వారా నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను. ఆరాధింపబడే అర్హత గలవారెవ్వరూ లేరు – ఒక్క నీవు తప్ప. నీవే శాశ్వతమైనవాడివి. నీకు చావు లేదు – కానీ, జిన్నాతులు మరియు మానవులకు చావు ఉంది.
أَللَّهُمَّ إِنِّي أَعُوْذُ بِكَ مِنْ عِلْمٍ لاَ يَـنْـفَعُ وَمِنْ قَلْبٍ لاَ يـَخْشَعُ وَمِنْ نَـفْسٍ لاَ تَشْبَعُ، وَمِنْ دَعْوُةٍ لاَ يُـسْتَجَابُ لَـهَا
అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ ఇల్మిన్ లా యంఫవు, వ మిన్ ఖల్బిన్ లా యఖ్షవు, వ మిన్ నఫ్సిన్ లా తష్బవు, వ మిన్ దావతిన్ లా యుస్తజాబు లహా
ఓ అల్లాహ్! ప్రయోజనం కలిగించని జ్ఞానం నుండి, భయపడని హృదయం నుండి, ఎన్నడూ తనివి తీరని / తృప్తి పొందని ఆత్మ నుండి మరియు స్వీకరించబడని ప్రార్థనల నుండి నేను నీ వద్ద శరణు వేడుకుంటున్నాను.
أَللَّهُمَّ جَنـِّبْـنِي مُنْكَرَاتِ الْأَخْلاَقِ وَالْأَعْمَالِ وَالْأَهْوَاءِ وَالْأَدْوَاءِ
అల్లాహుమ్మ జన్నిబ్ నీ ముంకరాతిల్ అఖ్లాఖి, వల్ ఆమాలి, వల్ అహ్వాయి, వల్ అద్వాయి.
ఓ అల్లాహ్! ప్రతి చెడు ప్రవర్తన నుండి, చెడు పనుల నుండి, చెడు ఆలోచనల నుండి మరియు రోగాల నుండి నేను నీ రక్షణ వేడుకుంటున్నాను.
أّللَّهُمَّ أَلـْهِمْنِي رُشْدِيْ وَأَعِذْنِي مِنْ شَرِّ نَـفْسِي
అల్లాహుమ్మ అల్ హిమ్ నీ రుష్దీ, వ అయిద్ నీ మిన్ షర్రి నఫ్సీ
ఓ అల్లాహ్! నేను మార్గదర్శకత్వం ప్రసాదించు మరియు నాలోని చెడు నుండి నన్ను రక్షించు.
أَللَّهُمَّ اَكْفِنِـي بِحَلاَلِكِ عَنْ حَرَامِكَ وَأَغْنِـنِـي بِـفَضْلِكَ عَمَّنْ سِوَاكَ
అల్లాహుమ్మఅక్ఫీనీ బి హలాలిక అన్ హరామిక, వ అగ్ నినీ బి ఫద్ లిక అమ్మన్ సివాక
ఓ అల్లాహ్! నా ఆవసరాలకు చాలినంతగా నాకు ధర్మసమ్మతమైన జీవనోపాధినే ప్రసాదించు గానీ, అధర్మమైంది కాదు. ఇతరుల నుండి అడుక్కునే గత్యంతరం రానీయకుండా, నీ ఆనుగ్రహాల ద్వారా నన్ను సంతృప్తి పరుచు,
أَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْـهُدَى وَالتُّـقَـى وَالْعَفَافَ وَالْغِـنَـى
అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ హుదా వ త్తుఖా, వల్ అఫాఫ వల్ గినా
ఓ అల్లాహ్! నేను నీ నుండి మార్గదర్శకత్వాన్ని, తఖ్వాను (ధర్మనిష్ఠను), సచ్ఛీలతను మరియు సమృద్ధిని కోరుకుంటున్నాను.
أَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْـهُدَى وَالسَّدَادَ
అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ హుదా వస్సదాద
ఓ అల్లాహ్! నేను నీ నుండి మార్గదర్శకత్వాన్ని మరియు క్షేమాన్ని కోరుకుంటున్నాను.
أَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْـجَنَّةَ وَمَا قَرَّبَ إِلَيْهَا مِنْ قَوْلٍ أَوْ عَمَلٍ، وَأَعُوْذُ بِكَ مِنْ النَّارِ وَمَا قَرَّبَ إِلَيْهَا مِنْ قَوْلٍ أَوْ عَمَلٍ، وَأَسْأَلُكَ أَنْ تَـجْعَلَ كُلَّ قَضَاءٍ قَضَيْتَهُ لِـي خَيْراً
అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ జన్నత, వ మా ఖర్రబ ఇలైహా మిన్ ఖౌలిన్ ఔవ్ అమలిన్, వ అఊదుబిక మినన్నారి వ మా ఖర్రబ ఇలైహా మిన్ ఖౌలిన్ ఔవ్ అమలిన్, వ అస్అలుక అన్ తజ్అల కుల్ల ఖదాయిన్ ఖదైతహు లీ ఖైరా
ఓ అల్లాహ్! నేను నీ నుండి స్వర్గాన్ని మరియు స్వర్గం సమీపానికి చేర్చే పలుకు మరియు పని కోరుకుంటున్నాను. నేను నరకాగ్ని నుండి మరియు నరకం సమీపానికి చేర్చే పలుకు మరియు పని నుండి నీ శరణు వేడుకుంటున్నాను. మరియు నీవు నా కోసం వ్రాసిపెట్టిన ప్రతిదానినీ శుభంగా మార్చమని నేను నిన్ను వేడుకుంటున్నాను.
لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيْكَ لَهُ، لَهُ الْـمُلْكُ وَلَهُ الْـحَمْدُ يُـحْيِي وَيُـمِيْتُ بِـيـَدِهِ الْـخَيْـرُ وَهُوَ عَلَى كُلِّ شـَيْءٍ قَـدِيْـرٌ
లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహు, లహుల్ ముల్కు వ లహుల్ హమ్ దు, యుహ్యీ వ యుమీతు, బి యదిహిల్ ఖైరు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్
అల్లాహ్ తప్ప ఆరాధింపబడే అర్హతలు గల వారెవ్వరూ లేరు. ఆయన ఏకైకుడు. ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. సకల లోకాలు మరియు సమస్త ప్రశంసలు ఆయనకే చెందుతాయి. చావుబ్రతుకులు ఆయన ఆదేశంతోనే సంభవిస్తాయి. శుభమంతా ఆయన చేతుల్లోనే ఉంది. మరియు ప్రతి దానినీ శాసించే శక్తిసామర్ధ్యాలు గలవాడు ఆయనే.
سُبْحَانَ اللهِ وَالْـحَمْدُ للهِ وَلاَ إِلَهَ إِلاَّ الله وَاللهُ أَكْبَرُ، وَلاَ حَوْلَ وَلاَ قُوَّةَ إِلاَّ بِاللهِ الْعَـلِيِّ الْعَظِـيْمِ
సుబహానల్లాహి, వల్ హమ్ దులిల్లాహి, వ లా ఇలాహ ఇల్లల్లాహ్, వల్లాహు అక్బర్, వ లా హౌల వ లా ఖువ్వత ఇల్లా బిల్లాహిల్ అలియ్యిల్ అజీమ్
అల్లాహ్ యే పరమ పవిత్రుడు, సకల ప్రశంసలు మరియు కృతజ్ఞతలు అల్లాహ్ కే, అల్లాహ్ తప్ప ఆరాధింపబడే అర్హతలు గలవారెవ్వరూ లేరు, అల్లాహ్ యే మహోన్నతుడు. అల్లాహ్ తప్ప – అంతటి శక్తిసామర్ధ్యాలు గలవారెవ్వరూ లేరు. ఆయనే మహోన్నతుడు, ఘనత గల వాడూను.
أَللَّهُمَّ صَلِّ عَلَى مُـحَمَّدٍ وَعَلَى آلِ مُـحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيْمَ وَعَلَى آلِ إِبْرَاهِيْمَ إِنَّكَ حَـمِيْدٌ مَـجِيْدٌ،
وَبَارِكْ عَلَى مُـحَمَّدٍ وَعَلَى آلِ مُـحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلَى إِبْـرَاهِـيْمَ وَعَلَى آلِ إِبْـرَاهِـيْمَ إِنَّكَ حَـمِيْدٌ مَـجِـيْدٌ
అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్.
అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్.
ఓ అల్లాహ్! ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) పై మరియు ఆయన కుటుంబంపై నీవు కారుణ్యం కురిపించినట్లుగా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై మరియు ఆయన కుటుంబం పై కారుణ్యం కురిపించు. నిశ్చయంగా కేవలం నీవు మాత్రమే స్తుతింపదగిన వాడవు మరియు గొప్ప ఘనత గల వాడవూను.
ఓ అల్లాహ్! ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) పై మరియు ఆయన కుటుంబం పై శుభాలు కురిపించినట్లుగా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై మరియు ఆయన కుటుంబం పై శుభాలు కురిపించు. నిశ్చయంగా కేవలం నీవు మాత్రమే స్తుతింపదగిన వాడవు మరియు గొప్ప ఘనత గలవాడవూను.
رَبَّـنَا آتِنـَا فِي الدُّنْيَا حَسَنَـةً وَفِي الْآخِرَةِ حَسَنَـةً وَقِـنَـا عَذَابَ النَّارِ
రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతవ్ వ ఫిల్ ఆఖిరతి హసనవ్ వ ఖినా అదాబన్నార్
ఓ నా ప్రభూ! ఈ లోకంలో మాకు శుభాన్ని ప్రసాదించు మరియు పరలోకంలో మాకు శుభాన్ని ప్రసాదించు మరియు మమ్ముల్ని నరకాగ్ని నుండి కాపాడు.
పై వాటితో పాటు హజ్ యాత్రికులు ఈ పవిత్ర స్థలంలో పూర్తిగా అల్లాహ్ యొక్క స్మరణలతో నిండిన ఇతర దుఆలు కూడా చేస్తూ, వీలయినంత ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పంపాలి. ఈ దుఆలు చేసేటప్పుడు హృదయ పూర్వకంగా ఏడుస్తూ, ఇహపరలోకాలలో శుభాలు ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకోవాలి. దుఆ చేసేటపుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరచుగా దానిని మూడు సార్లు రిపీట్ చేసేవారు. కాబట్టి మనం కూడా ఆయన సంప్రదాయాన్ని అనుసరించడానికి ప్రయత్నించాలి. అరఫహ్ మైదానంలో ముస్లింలు వినయం, నమ్రత, నిగర్వం, అణుకువలను ప్రదర్శిస్తూ, ఆయన దయాదాక్షిణ్యాలను మరియు మన్నింపును ఆశిస్తూ పూర్తిగా అల్లాహ్ వైపు మరలాలి, ఆయన సహాయాన్ని అర్థించాలి, ఆయనకు పూర్తిగా సమర్పించుకోవాలి, ఆయన వైపుకు వంగాలి. ఆయన యొక్క శిక్షలకు మరియు ఆగ్రహానికి వారు భయపడాలి. వారు తాము చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకుని, చిత్తశుద్ధితో తౌబా చేసుకుంటూ, వాటిని క్షమించమని పెద్ద ఎత్తున ప్రజలు ఒకే చోట చేరిన ఆ మహోన్నతమైన పర్వదినాన అల్లాహ్ ను వేడుకోవాలి. ప్రత్యేకంగా ఈ రోజున అల్లాహ్ తన దాసులపై ఎక్కువ అనుగ్రహం చూపుతాడు మరియు సగర్వంగా తన దైవదూతల ముందు వారి గురించి కొనియాడతాడు. అల్లాహ్ ప్రత్యేకంగా ఈ రోజున అనేక మందిని నరకంలో నుండి తప్పిస్తాడు. అరఫహ్ రోజున షైతాను ఎన్నడూ లేనంతగా చిన్నబుచ్చుకున్నట్లు మరియు ఘోరమైన పరాభవానికి గురైనట్లు కనబడతాడు – బదర్ యుద్ధం రోజును గాకుండా. తన దాసులపై అల్లాహ్ చూపే అపరిమితమైన అనుగ్రహాలను, అనేక మంది ప్రజలు విడుదల చేయబడటాన్ని మరియు క్షమింపబడటాన్ని షైతాను ఈరోజున చూస్తాడు. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన హదీథు ఆయెషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన ఆధారంగా సహీహ్ బుఖారీలో ఇలా నమోదు చేయబడింది:
مَا مِنْ يَوْمٍ أَكْـثَـرُ مِنْ أَنْ يُـعْـتِـقَ اللهُ فِيْـهِ عَبْداً مِنَ النَّـارِ مِنْ يَوْمِ عَرَفَةَ، وَإِنَّـهُ لَـيَدْنُوْ ثُمَّ يُـبَاهِي بِـهِمُ الْـمَلاَئِكَـةَ فَـيَـقُولُ مَا أَرَادَ هَؤُلاَءِ
మామిన్ యౌమిన్ అక్థరు మిన్ అన్ యుతిఖల్లాహు ఫీహి అబ్దన్ మినన్నారి మిన్ యౌమి అరఫహ్ వ ఇన్నహు లయద్నూ థుమ్మ యుబాహీ బిహిముల్ మలాయికత ఫయఖూలు మా అరాద హఉలాయి
అల్లాహ్ అంత ఎక్కువగా తన దాసులను నరకాగ్ని నుండి విడుదల చేయడు – అరఫాత్ రోజున తప్ప. ఆయన మానవుడికి సమీపంగా వస్తాడు మరియు తన దైవదూతలతో వారి గురించి సగర్వంగా కొనియాడతాడు. ఆయనిలా అంటాడు: “ఈ నా దాసులు ఏమి కావాలని వేడుకుంటున్నారు?”
కాబట్టి ముస్లింలు మంచి నడవడికను ప్రదర్శిస్తూ, తమ బద్ధశత్రువైన షైతానును అవమానం పాలు చేయవలెను. ఎంత ఎక్కువగా వారు మనస్ఫూర్తిగా అల్లాహ్ స్మరిస్తూ, వేడుకుంటూ, తాము చేసిన పాపాలన్నింటికీ పశ్చాత్తాప పడుతూ మరియు అల్లాహ్ యొక్క మన్నింపును అర్థిస్తూ ఉంటే, షైతాను అంత ఎక్కువగా నిరాశా, నిస్పృహలకు గురవుతూ, బాధ పడతాడు. సూర్యాస్తమయం వరకు యాత్రికుడు అల్లాహ్ యొక్క స్మరణలో మరియు దుఆలలో మనస్పూర్తిగా ఏడుస్తూ గడప వలెను.
సూర్యాస్తమయం తర్వాత, ప్రజలు ప్రశాంతంగా ముజ్దలిఫహ్ వైపుకు మరలాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయాన్ని అనుసరిస్తూ, వారు తరుచుగా తల్బియహ్పలుకుతూ ఉండాలి మరియు ముజ్దలిఫహ్ ప్రాంతంలో వ్యాపించాలి. సూర్యాస్తమయం కంటే ముందే అరఫాత్ మైదానం వదిలిపెట్టడం అనుమతించబడలేదు.
సూర్యాస్తమయం పూర్తయ్యే వరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అరఫహ్ మైదానంలో గడిపారు. అంతిమ హజ్ లో ఆయన ఇలా బోధించారు:
خُـذُوْا عَنِّي مَـنَاسِكَـكُمْ
ఖుదూ అన్నీ మనాసికకుమ్
“నా నుండి మీరు మీ హజ్ ఆచరణలు నేర్చుకోండి”
ముజ్దలిఫహ్ లో రాత్రి గడపటం:
అల్ ముజ్దలిఫహ్ చేరుకోగానే ప్రజలు తమ మగ్రిబ్ మరియు ఇషా నమాజులను, ఒక అదాన్ మరియు రెండు అఖామహ్ లతో పూర్తి చేయాలి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఇలాగే చేసినారు గనుక. ప్రజలు మగ్రిబ్ సమయంలో అక్కడికి చేరినా లేదా ఇషా సమయంలో అక్కడికి చేరినా ఇదే క్రమంలో వాటిని పూర్తి చేయవలసి ఉంటుంది. ఎవరైతే ముజ్దలిఫహ్ చేరుకోగానే నమాజులు పూర్తి చేయకుండా, షరిఅహ్ లో ఆదేశించబడిందని నమ్ముతూ ముందుగా కంకర రాళ్ళు ఏరుకోవటం మొదలు పెడతారో, వారు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఇది ఎలాంటి షరిఅహ్ ఆధారం లేని ఒక తప్పుడు అభిప్రాయం మాత్రమే. అల్ మష్అరల్ హరమ్ అనే ప్రాంతం చేరిన తర్వాతనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను కంకర రాళ్ళు ఏరుకోమని ఆదేశించారు. కాబట్టి ఆ ప్రాంతంలో ఎక్కడి నుండైనా సరే కంకర రాళ్ళు ఏరుకోవచ్చు. కంకర రాళ్ళు ఏరు కోవటానికి కేవలం అల్ ముజ్దలిఫహ్ ప్రాంతం మాత్రమే ప్రత్యేకించబడలేదు. కాబట్టి కంకర రాళ్ళు ఏరు కునేందుకు మీనా ప్రాంతం కూడా ముజ్దలిఫహ్ ప్రాంతం వలెనే ధర్మసమ్మతమైనది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయం ప్రకారం మొదటి రోజు కేవలం ఏడు కంకర రాళ్ళు మాత్రమే జమరతుల్ అఖబహ్ పై విసర వలసి ఉంది. మిగిలిన మూడు దినాలలో ప్రతి రోజూ మీనాలో నుండే 21 కంకర రాళ్ళు సేకరించి, మూడు జమరాతులపై విసర వలసి ఉంది.
కంకర రాళ్ళను నీటితో కడగవలసిన అవసరం లేదు. వాటిని కడగకుండా అలానే జమరాతులపై విసరాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేదా ఆయన సహచరుల సంప్రదాయంలో అలా కంకర రాళ్ళను కడగ వలసిన ప్రస్తావన లేదు. ఒకసారి వాడిన కంకర రాళ్ళను మరలా వాడకూడదు.
స్త్రీలను, పిల్లలను రాత్రి సమయంలోనే మీనా వైపు పంపివేయటానికి అనుమతి ఉంది:
హజ్ యాత్రికులు అల్ ముజ్దలిఫహ్ లో రాత్రి గడప వలసి ఉంది. అయితే ఆయెషా రదియల్లాహు అన్హా మరియు ఉమ్మె సలమాహ్ రదియల్లాహు అన్హాలు ఉల్లేఖించిన హదీథు ఆధారంగా అర్థరాత్రి దాటిన తరువాత బలహీనులు, స్త్రీలు మరియు పిల్లలను మీనా వైపు పంపివేయవచ్చు. మిగిలిన యాత్రికులు ఫజర్ సమయం వరకు అల్ ముజ్దలిఫహ్ లోనే గడప వలసి ఉంది. ఫజర్ నమాజు తరువాత ఉదయపు వెలుగు పూర్తిగా వ్యాపించే వరకు, వారుఅల్ మష్అరల్ హరమ్ ఎదురుగా ఖిబ్లహ్ వైపు తిరిగి నిలబడి, వీలయినంత ఎక్కువగా అల్లాహ్ ను స్మరించాలి, దుఆలు చేసుకోవాలి, అల్లాహ్ ను ప్రశంసించాలి. దుఆ చేసేటప్పుడు తమ చేతులను పైకెత్తి దుఆ చేయటం ఉత్తమం. అల్ మష్అరల్ హరమ్ ప్రక్కనే నిలబడ వలసిన అవసరం లేదు. ఎక్కడ స్థలం దొరికితే అక్కడ నిలబడ వచ్చు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:
وَقَمْتُ هَهُنَا – وَجَـمْـعٌ كُلُّـهَا مَوْقِفْ
వ ఖంతు హహునా వ జమ్ ఉన్ కుల్లహా మౌఖిఫ్
“నేను అల్ మష్అరల్ హరమ్ వద్ద నిలబడినాను. అయితే, ముజ్దలిఫహ్ మొత్తం నిలబడటానికి తగినదే.” ముస్లిం హదీథు గ్రంథం.
ఉదయం మీనా వైపు వెళ్ళటం మరియు జమరతుల్ అఖబహ్ పై కంకర రాళ్ళు విసరటం:
బాగా తెల్లవారిన తరువాత సూర్యోదయం కాక మునుపే యాత్రికులు మీనా వైపు బయలు దేరాలి. మార్గంలో అల్లాహ్ ను ప్రార్థిస్తూ వారు ప్రయాణం సాగించాలి. ముహస్సర్ లోయను దాటేటప్పుడు వారు త్వరత్వరగా దాటాలి. ఎందుకంటే పూర్వం అక్కడ ఏనుగుల సైన్యం పై అల్లాహ్ యొక్క ఉపద్రవము అవతరించింది. మీనా చేరుకున్న తరువాత వారు తల్బియహ్ పలకటం ఆపివేయాలి. ఎందుకంటే వారు జమరాతు దగ్గరకు చేరుకుంటారు గనుక. అక్కడకు చేరుకున్న వెంటనే వారు ఏడు కంకర రాళ్ళను ఒక్కొక్కటిగా జమరతుల్ అఖబహ్ పై విసరాలి. కంకర రాళ్ళు విసరటానికి తమ చేతులు పైకెత్తిన ప్రతిసారీ వారిలా పలకాలి,
وَ اللهُ أَكْـبـْرُ అల్లాహు అక్బర్ – అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు –
కంకర రాళ్ళు విసిరేటప్పుడు, కాబా గృహం మీ ఎడమ వైపున మరియు మీనా ప్రాంతం మీ కుడి వైపున ఉండి, మీరు లోయలో నుండి కంకర రాళ్ళు విసరాలి. ఎందుకంటే ఇలా చేయడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతు. అయితే, ఒకవేళ ఎవరైనా దీనికి వ్యతిరేక దిశలో నుండి రాళ్ళు విసిరినా పర్వాలేదు – కానీ అవి జమరాతు స్థంభానికి తగలాలి. ఒకవేళ అది దూరంగా పడినా దోషమేమీ లేదు. ఇది పండితుల అభిప్రాయం. దీనిని షర అల్ ముహద్దబ్ అనే పుస్తకంగా ఇమాం నవవీ గారు స్పష్టంగా చర్చించారు. వేరు శెనగ గింజ సైజులోని కంకర రాళ్ళను ఏరుకుంటే చాలు. అలాగాక, పెద్ద పెద్ద రాళ్ళు ఏరుకోవద్దు.
జమరహ్ తు అఖబహ్ పై కంకర రాళ్ళు విసిరిన తర్వాత, హజ్ యాత్రికుడు తన బలిపశువును ఖుర్బానీ చేయవలెను. ఖుర్బానీ చేసేటపుడు, ఇలా ఉచ్ఛరించాలి:
بِسْمِ اللهِ وَاللهُ أَكْبَـرُ، أَللَّهُمَّ هَذَا مِنْكَ وَ لَكَ
బిస్మిల్లాహి వల్లాహు అక్బర్, అల్లాహుమ్మ హాదా మింక వ లక
అల్లాహ్ పేరుతో, అల్లాహ్ అందరికంటే మహోన్నతుడు, ఓ అల్లాహ్! ఇది నీ నుండే (నాకు లభించింది) మరియు ఇది నీ కొరకే (నేను ఖుర్బానీ చేస్తున్నాను)
ఖిబ్లహ్ వైపు ముఖం ఉండేటట్లు, పశువును నేలపై పడవేయవలెను. అయితే, ఒంటెను ఖుర్బానీ చేసేటపుడు, దానిని నిలుచోబెట్టి, ఎడమవైపు కాళ్ళను కట్టివేయాలి. మేక, గొర్రె లేదా ఆవును ఖుర్బానీ చేసేటపుడు, వాటి ఎడమవైపు పడవేయాలి. ఒకవేళ ఎవరైనా బలిపశువును ఖిబ్లహ్ దిశ వైపు గాకుండా వేరే దిశ వైపు పడవేసి ఖుర్బానీ చేస్తే, వారికి ఒక సున్నతు ఆచరణను వదిలి వేసినవారవుతారు. అయితే అది వారి ఖుర్బానీ స్వీకరణలో ఆటంకంగా మారదు. బలిపశువును ఖుర్బానీ చేసేటపుడు, దానిని ఖిబ్లహ్ దిశవైపు పరుండ పెట్టడం ఒక సున్నతు ఆచరణ. అయితే, అలా చేయటం తప్పని సరిగా చేయవలసిన ఫర్ద్ ఆచరణ కాదు. తన బలి పశువు మాంసంలో నుండి కొంత తిని, మిగిలిన దానిని పేదలలో పంచి పెట్టాలి. ఎందుకంటే, దీని గురించి ఖుర్ఆన్ లోని అల్లాహ్ ఆదేశం ఇలా ఉంది …
فَكُلُوا مِنْهَا وَأَطْعِمُوا الْبَائِسَ الْفَقِيرَ 22:28
…. ఫకులూ మిన్హా వ అత్ఇముల్ బాఇసల్ ఫఖీర్ 22:28
తర్వాత, దానిని భుజించండి మరియు దానిని పేదలకు భోజనం పెట్టండి 22:28
ఖుర్బానీ అనుమతించబడిన దినాల గురించి:
పండితుల అభిప్రాయం ప్రకారం, పండుగ రోజు (దిల్ హజ్ 10వ తేదీ) నుండి నాలుగో రోజు (దిల్ హజ్ 13వ తేదీ) సూర్యాస్తమయం వరకు ఖుర్బానీ చేయవచ్చు. ఖుర్బానీ చేసిన తర్వాత, హజ్ యాత్రికుడు తల వెంట్రుకలు పూర్తిగా గొరిగించుకోవాలి లేదా చిన్నగా కత్తిరించుకోవాలి. పూర్తిగా గొరిగించుకోవటం మంచిది ఎందుకంటే పూర్తిగా తల గొరిగించుకున్నవారి మన్నింపు మరియు క్షమాభిక్ష కొరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లు దుఆ చేసారు మరియు చిన్నగా కత్తిరించుకున్నవారి కొరకు కేవలం ఒక్కసారి మాత్రమే దుఆ చేసారు.
ఒకవేళ ఎవరైనా తల వెంట్రుకలు చిన్నగా కత్తిరించుకోవాలనుకుంటే, తల వెంట్రుకలు అక్కడక్కడ కత్తిరించుకోవటం కాదు, తలపై నున్న మొత్తం వెంట్రుకలన్నీ సమానంగా కత్తిరించుకోవాలి. అయితే మహిళలు మాత్రం తల వెంట్రుకలలో నుండి దాదాపు అంగుళం మేర కత్తిరింపజేసుకుంటే చాలు. జమరహ్ తు అఖబహ్ పై కంకర రాళ్ళు విసరటం మరియు తల వెంట్రుకలు గొరిగించుకోవటం/ కత్తిరింపజేసుకోవటం పూర్తయిన తర్వాత, హజ్ యాత్రికుడి పైనుండి భార్యాభర్తల సంభోగం తప్ప, ఇహ్రాం స్థితిలోని మిగతా నిబంధనలన్నీ తొలిగిపోతాయి. ఇహ్రాం నిబంధనలు తొలిగిపోయే మొదటి దశ ఇది.
తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతు ప్రకారం అత్తరు పూసుకుని, మామూలు దుస్తులలో కఅబహ్ గృహం యొక్క తవాఫ్ చేయటానికి వెళ్ళవచ్చు. దీని గురించిన ఆయేషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన:
كُـنْتُ أَطَـيِّبُ رَسُوْلُ اللِه صَلَّى اللُه عَلَيْهِ وَسَلَّمْ لِإِحْرَامِهِ قَـبْـلَ أَنْ يُـحْرِمَ، وَلِـحِلِّهِ قَـبْـلَ أَنْ يَـطُوْفَ بِالْـبَـيْـتِ
కుంతు అతయ్యిబు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వ సల్లం లి ఇహ్రామిహి ఖబ్ల అన్ యుహ్రిమ వలిహిల్లిహి ఖబ్ల అన్ యతూఫ బిల్ బైతి
కఅబహ్ గృహ తవాఫ్ చేయటానికి ఇహ్రాం ధరించక ముందు మరియు ఇహ్రాం విడిచిన తర్వాత నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు అత్తరు పూసేదాన్ని.
ఈ తవాఫ్ ను తవాఫె ఇఫాదహ్ లేదా తవాఫె జియారహ్ అంటారు. ఇది హజ్ ఆచరణలలోని ఒక తప్పని సరి ఆచరణ. ఎవరైతే ఈ తవాఫ్ చేయలేదో, అతని హజ్ పూర్తికాదు.
ఈ విషయాన్ని ఖుర్ఆన్ స్పష్టంగా ఇలా తెలుపుతున్నది:
ثُمَّ لْيَقْضُوا تَفَثَهُمْ وَلْيُوفُوا نُذُورَهُمْ وَلْيَطَّوَّفُوا بِالْبَيْتِ الْعَتِيقِ 22:29
థుమ్మల్ యఖ్దూ తఫథహుమ్ వల్ యూఫూ నుదూరహుమ్ వల్ యత్తవ్వఫూ బిల్ బైతిల్ అతీఖ్
తర్వాత వారు తమకు నిర్దేశించబడిన బాధ్యతలు (హజ్ ఆచరణలు) పూర్తిచేయాలి, తమ వాగ్దానాలు పూర్తి చేయాలి మరియు ప్రాచీన గృహ (కాబాగృహ) తవాఫ్ పూర్తిచేయాలి. 22:29
తవాఫ్ పూర్తి చేసిన తర్వాత మఖామె ఇబ్రాహీం వద్ద రెండు రకాతుల నమాజు చేయాలి. ఒకవేళ హజ్జె తమత్తు పద్ధతిలో అతను హజ్ చేస్తున్నట్లయితే, సఫా మరియు మర్వహ్ ల మధ్య అతను సయీ కూడా పూర్తి చేయాలి. ఈ సయీ అతని హజ్ సయీ గా పరిగణించబడుతుంది. మక్కహ్ చేరుకున్నపుడు చేసిన ఉమ్రహ్ తోపాటు అతను అంతకు ముందు చేసిన సయీ, ఉమ్రహ్ కు చెందిన సయీగా పరిగణించబడుతుంది.
హజ్జె తమత్తు పద్ధతిలో హజ్ చేసేవారికి ఒక సయీ చాలదు.
ఆయేషా రదియల్లాహు అన్హా ఉల్లేఖించిన హదీథు ఆధారంగా, హజ్జె తమత్తు పద్ధతిలో హజ్ చేసేవారు ఒక సయీ మాత్రమే చేయకూడదని పండితులందరి అభిప్రాయం. హజ్ కొరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు తాము కూడా వెళ్ళామని ఆయెషా రదియల్లాహు అన్హా తెలిపారు. హజ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారని ఆవిడ ఉల్లేఖించారు:
مَنْ كَانَ مَعَهُ هَدْيٌ فَلْيُـهِلَّ بِالْـحَجِّ مَعَ الْعُمْرَةِ، ثُمَّ لاَ يَـحِلَّ حَتَّى يَـحِلَّ مِنْـهُـمَا جَـمـِيْعاً
మన్ కాన మఅహు హద్యున్ ఫల్ యుహిల్ల బిల్ హజ్జి మఅల్ ఉమ్రతి థుమ్మ లా యహిల్ల హత్తా యహిల్ల మిన్హుమా జమీఅన్
ఎవరి వద్దనైతే ఖుర్బానీ పశువు వెంట ఉందో, వారు ఉమ్రహ్ మరియు హజ్ కొరకు ఇహ్రాం ధరించాలి మరియు అతను ఉమ్రహ్ మరియు హజ్ పూర్తి చేసిన తర్వాతనే ఇహ్రాం నిబంధనల నుండి బయటపడతారు.
ఇంకా ఆవిడ ఇలా జతచేసారు:
فَطَافَ الَّذِيْنَ أَهَلُّوْا بِالْعُمْرَةِ بِالْبَيْتِ وَبِالْصَّفَا وَالْـمَرْوَةِ ثُمَّ حَلُّوْا ثُمَّ طَافُوْا طَوَافاً آخَرَ بَعْدَ أَنْ رَجَعُوْا مِنْ مِنِّى لِـحَجِّهِمْ
ఫ తాఫల్లదీనఅహల్లూ బిల్ ఉమ్రతి బిల్బైతి వబిస్సఫా వల్ మర్వతి థుమ్మహల్లూ థుమ్మతాఫూ తవాఫన్ ఆఖర బఅద అన్ రజఊ మిన్ మిన్నీ లిహజ్జిహిమ్
ఎవరైతే ఉమ్రహ్ కొరకు ఇహ్రాం ధరించారో, వారు కఅబహ్ గృహ తవాఫ్, సఫా మరియు మర్వహ్ ల మధ్య సయీ పూర్తి చేసిన తర్వాత ఇహ్రాం నిబంధనల నుండి బయటపడతారు. హజ్ పూర్తి చేసి, మీనా నుండి మరలి వచ్చిన తర్వాత వారు మరో తవాఫ్ పూర్తి చేయాలి.
ఆయెషా రదియల్లాహు అన్హా ఉల్లేఖనలోని “ఉమ్రహ్ కొరకు ఇహ్రాం ధరించిన వారు, హజ్ పూర్తి చేసి మీనా నుండి మరలి వచ్చిన తర్వాత మరో తవాఫ్ పూర్తి చేయాలి” అనే పలుకులలోని తవాఫ్ పదం సఫా మరియు మర్వాల మధ్య సయీ ని సూచిస్తుంది. పై హదీథు యొక్క ఉత్తమమైన వివరణ ఇదే (ఇక్కడ తవాఫ్ పదం సయీను సూచిస్తుంది). ఆయేషా రదియల్లాహు అన్హా హదీథులోని తవాఫ్ పదం, తవాఫె ఇఫాదహ్ ను సూచిస్తుందని అభిప్రాయపడేవారి అభిప్రాయం సరైన అభిప్రాయం కాదు. ఎందుకంటే, తవాఫె ఇఫాదహ్ ప్రతి హజ్ యాత్రికుడు చేయవలసిన తప్పని సరి హజ్ ఆచరణ – ఏ పద్ధతిలో హజ్ చేస్తున్న వారైనా సరే. పై సూచనలోని తవాఫ్ ప్రత్యేకంగా హజ్ పూర్తి చేసి మీనా నుండి మరలి వచ్చిన హజ్జె తమత్తు చేసేవారి కొరకు నిర్దేశించబడిన సఫా మరియు మర్వాల మధ్య చేయవలసిన తవాఫ్ (సయీ) మాత్రమే. అల్లాహ్ యొక్క అనుగ్రహం వలన ఈ విషయం తేటతెల్లంగా, స్పష్టంగా ఉన్నది మరియు మెజారిటీ పండితుల అభిప్రాయం కూడా ఇదే. సహీహ్ బుఖారీలో నమోదు చేయబడిన అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా యొక్క క్రింది ఉల్లేఖన దీనిని మరింత స్పష్టంగా వివరిస్తున్నది:
హజ్జె తమత్తు గురించి అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ను అడుగగా, ఆయన ఇలా వివరించారు:“ముహాజిరీనులు, అన్సారులు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భార్యలు అంతిమ హజ్ కొరకు ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించారు మరియు మేము కూడా అలాగే ఇహ్రాం ధరించాము. మేము మక్కా చేరుకున్న తర్వాత, తమతో పాటు ఖుర్బానీ పశువులు తీసుకు వచ్చిన వారు తప్ప, మిగిలిన వారు తమ హజ్ ఇహ్రాంను ఉమ్రహ్ ఇహ్రాంగా మార్చుకోమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మమ్మల్ని ఆదేశించారు. అందువలన మేము కఅబహ్ గృహ తవాఫ్, సఫా మరియు మర్వహ్ ల మధ్య సయీ పూర్తి చేసాము. ఆ తర్వాత మేము మా భార్యల దరి చేరాము (ఇహ్రాం స్థితి నుండి విడుదల కావటం వలన, దాంపత్య సుఖం అనుభవించాము) మరియు మామూలు దుస్తులు ధరించాము. ఖుర్బానీ పశువులు తమతో పాటు ఉన్న వారిని అలా చేయవద్దని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. ఎందుకంటే ఖుర్బానీ పశువులు వాటి గమ్యం అంటే మీనా చేరుకోనంత వరకు వారు విడుదల కాలేరు. దిల్ హజ్ 8వ తేదీన హజ్ కొరకు ఇహ్రాం ధరించమని ఆయన మమ్ముల్ని ఆదేశించారు. ఆ తర్వాత మేము హజ్ ఆచరణలన్నీ పూర్తి చేసిన తర్వాత మేము తిరిగి మక్కహ్ చేరుకుని, మరలా కఅబహ్ గృహ తవాఫ్ చేసి, సఫా మరియు మర్వహ్ ల మధ్య సయీ చేసాను.”
హజ్జె తమత్తు పద్ధతిలో హజ్ చేసేవారు తప్పకుండా రెండు సార్లు సయీ చేయాలని మేము తెలిపిన విషయాన్నే పై విరణాత్మకమైన ఉల్లేఖన సుస్పష్టంగా ధృవీకరిస్తున్నది. ముస్లిం హదీథులో నమోదు చేయబడిన జాబిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనలోని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులు కేవలం ఒక్కసారే సఫా మరియు మర్వహ్ ల మధ్య తవాఫ్ (సయీ) చేసారనే విషయంలో కేవలం అలాంటి సహచరుల గురించే ఉద్దేశించబడింది ఎవరైతే తమతో పాటు ఖుర్బానీ పశువు వెంటబెట్టుకు వచ్చారో. ఎందుకంటే వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు తమ ఇహ్రాం స్థితిని కొనసాగించారు. హజ్ మరియు ఉమ్రహ్ రెండూ పూర్తి చేసిన తర్వాతే వారు ఇహ్రాం స్థితి నుండి విడుదల అవుతారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఏకంగా హజ్ మరియు ఉమ్రహ్ రెండింటి కొరకు ఇహ్రాం ధరించారు (హజ్జె ఖిరాన్ పద్ధతి). ఎవరైతే తమతో పాటు ఖుర్బానీ పశువును వెంటబెట్టుకుని వచ్చారో, వారు ఏకంగా హజ్ మరియు ఉమ్రహ్ రెండింటి కొరకు ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించాలని, అంతేగాక హజ్ మరియు ఉమ్రహ్ పూర్తయ్యే వరకు వారు ఇహ్రాం నిబంధనలన్నింటినీ పాటించాలని ఆయన ఆదేశించారు. ఎందుకంటే ఇది హజ్ ఖిరాన్ పద్ధతి. కాబట్టి, పైన పేర్కొనబడిన జాబిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన మరియు ఇతర ప్రామాణిక ఉల్లేఖనల ఆధారంగా, ఎవరైతే ఏకంగా హజ్ మరియు ఉమ్రహ్ చేయబోతున్నారో, వారు ఒక సయీ మాత్రమే చేయాలి.
ఎవరైతే కేవలం హజ్ మాత్రమే చేయాలని ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశిస్తారో మరియు బలిపశువులు ఖుర్బానీ చేసే దినం వరకు ఇహ్రాం స్థితిలోనే ఉంటారో, వారు కూడా కేవలం ఒక సయీ మాత్రమే చేయాలి. కాబట్టి ఖారిన్ (హజ్జె ఖిరాన్ పద్ధతిలో హజ్ చేసేవారు) మరియు ముఫ్రిద్ (హజ్జె ఇఫ్రాద్ పద్ధతిలో హజ్ చేసేవారు) తవాఫె ఖుదూమ్ తర్వాత సయీ చేస్తే, తవాఫె ఇఫాద తర్వాత మరలా సయీ చేయవలసిన అవసరం లేకుండా అదే వారి కొరకు సరిపోతుంది. ఈ సరైన అభిప్రాయం ఆయేషా రదియల్లాహు అన్హా, అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా మరియు జాబిర్ రదియల్లాహు అన్హుల ఉల్లేఖనల కారణంగా తలెత్తిన విభేదాలను పరిష్కరించి వేస్తున్నది.
అంతేగాక, మరో అడుగు ముందుకు వేసి ఆయేషా రదియల్లాహు అన్హా మరియు అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమాల ప్రామాణిక ఉల్లేఖనలు హజ్జె తమత్తు పద్ధతిలో హజ్ చేసేవారి రెండో సయీని సమర్ధిస్తుండగా, జాబిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ఈ అభిప్రాయానికి భిన్నంగా దానిని ఖండిస్తున్నది. హదీథు శాస్త్ర నియమాలను అనుసరించి, ఏదైనా విషయం గురించి భిన్నమైన ఉల్లేఖనలలోని సమర్ధించే ఉల్లేఖనకు ఖండించే ఉల్లేఖనపై ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
సుబ్ హానల్లాహ్ – అల్లాహ్ లోపాలకు అతీతుడు.
ఓ అల్లాహ్! సరైన మార్గాన్నే మేము అనుసరించేలా చేయి.
అల్లాహ్ కు తప్ప – ఇంకెవ్వరికీ ఆ శక్తీ, ఆధిపత్యమూ లేదు.
ఐదవ అధ్యాయం:
ఖుర్బానీ దినమున రమీ, నహర్, హలఖ్ మరియు తవాఫ్ ఆచరణలు ఒకదాని తర్వాత మరొకటి చేయాలి:
పై ఆచరణలన్నింటినీ ఖుర్బానీ దినమున హజ్ యాత్రికుడు అదే క్రమంలో ఒకదాని తర్వాత మరొకటి చేయటం ఉత్తమం. ఇంకో మాటలో చెప్పాలంటే, హజ్ యాత్రికుడు మొట్టమొదట రమీ (జమరాతులపై కంకర రాళ్ళు విసురుట) చేయాలి. తర్వాత ఖుర్బానీ, తర్వాత క్షవరం అంటే తల వెంట్రుకలు పూర్తిగా గొరిగించటం లేదా చిన్నవిగా కత్తిరింప జేయటం, ఆ తర్వాత కఅబహ్ గృహం యొక్క తవాఫ్ (తవాఫె ఇఫాదహ్) చేయాలి మరియు హజ్జె తమత్తు చేసేవారు తవాఫె ఇఫాదహ్ తర్వాత సఫా మరియు మర్వహ్ ల మధ్య సయీ కూడా చేయాలి. ఒకవేళ ముఫ్రిద్ లేదా ఖారిన్ హజ్ యాత్రికులు తవాఫె ఖుదూమ్ తర్వాత సఫా మరియు మర్వహ్ ల మధ్య సయీ చేయకపోతే, వారు తవాఫె ఇఫాదహ్ తర్వాత దానిని తప్పక పూర్తి చేయవలసి ఉంది. ఒకవేళ పైన పేర్కొనబడిన వరుస క్రమంలో వాటిని చేయలేకపోతే, దానిలో ఎలాంటి దోషమూ లేదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలా చేయటాన్ని అనుమతించి ఉన్నారు.
ఒకవేళ తవాఫ్ లేదా ఇతర హజ్ ఆచరణలకు (హలఖ్, రమీ …) ముందు సయీ చేసినా, దానిలో ఎలాంటి దోషమూ లేదు. ఎందుకంటే అబూ దావూద్ హదీథు గ్రంథంలో నమోదు చేయబడిన ఒక హదీథులో ఒక సహచరుడు ఈ వరుస క్రమం గురించి ప్రశ్నించగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్ల్లం ఇలా జవాబిచ్చినారు: “తమకు ఇష్టమైన క్రమంలో వారు చేయవచ్చు.” సమాజానికి తేలికగా ఉండేందుకు ఈ వరుస క్రమం తెలుపబడింది. ఈ హదీథు ప్రామాణికమైనదని ఉసామహ్ బిన్ షురైక్ ధృవీకరించారు.
రమీ, హలఖ్ మరియు తవాఫ్ తర్వాత హజ్ యాత్రికుడు ఇహ్రాం నిబంధనలన్నింటి నుండి పూర్తిగా విడుదలై పోతాడు. ఒకవేళ పై వాటిలో ఏ రెండు పూర్తి చేసినా, అతను పాక్షికంగా మాత్రమే ఇహ్రాం నిబంధనల నుండి విడుదల అవుతాడు.
క్రింది మూడు ఆచరణలు హజ్ నియమ నిబంధనల నుండి పూర్తిగా విడుదల చేస్తాయి:
జమరతు అఖబహ్ పై రాళ్ళు విసరటం (రమీ చేయుట), క్షవరం (తల వెంట్రుకలు పూర్తిగా గొరిగించుకొనుట లేదా చిన్నవిగా చేసుకొనుట) చేసుకొనుట మరియు తవాఫె ఇఫాదహ్ చేయుట. తప్పని సరిగా చేయవలసి ఉన్నవారు సఫా మరియు మర్వహ్ ల మధ్య సయీ కూడా పూర్తి చేయాలి. ఎపుడైతే ఈ మూడు ఆచరణలు పూర్తిచేస్తారో, హజ్ యాత్రికునిపై ఉన్న ఇహ్రాం నిబంధనలన్నీ ఉదాహరణకు భార్యాభర్తల శారీరక కలయిక, అత్తరు పూసుకోవటం … మొదలైన నిబంధనలన్నీ తొలిగి పోతాయి. ఈ మూడింటిలో ఏవైనా రెండు పూర్తి చేసిన వారిపై నుండి భార్యాభర్తల సంభోగ నిషేధం తప్ప, మిగిలిన ఇహ్రాం నిబంధనలన్నీ తొలిగిపోతాయి. ఇది పాక్షిక స్వేచ్ఛ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది.
హజ్ యాత్రికుడు జమ్ జమ్ పవిత్ర జలం సేవించడం మరియు దానిని కడుపు నిండా త్రాగడం అభిలషణీయం. జమ్ జమ్ నీరు త్రాగేటపుడు, వీలయినన్ని ఎక్కువ దుఆలు చేసుకోవటం మంచిది. సహీహ్ ముస్లింలో నమోదు చేయబడిన అబూ ధర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఈ హదీథులో జమ్ జమ్ నీరు త్రాగేటపుడు చేసే దుఆల స్వీకరణకు ఎక్కువ అవకాశం ఉన్నదనే విషయం స్పష్టం చేయబడింది:
إِنَّـهُ طَـعَـامُ طُعْمٍ
ఇన్నహు తఆము తుఅమిన్
ఇది ఆరోగ్యవంతమైన పానీయం
అబూ దావూద్ లో నమోదు చేయబడిన మరో హదీథులో ఇలా పేర్కొనబడింది:
وَشِـفَآءُ سُـقْـمٍ
వ షిఫాఉ సుఖ్మిన్
జమ్ జమ్ నీటిలో వ్యాధి నిరోధక శక్తి ఉంది.
మీనాకు మరలి రావటం మరియు మూడు దినాలు అక్కడ నివాసం ఉండుట:
తవాఫ్ అల్ ఇఫాదహ్ మరియు తప్పని సరిగా సయీ చేయవలసి ఉన్నవారు తమ సయీని పూర్తి చేసిన తర్వాత, మీనాకు మరలి వచ్చి, అక్కడ మూడు పగళ్ళు మరియు మూడు రాత్రులు గడపాలి. ప్రతి రోజు మిట్ట మధ్యాహ్నం తర్వాత, వారు జమరాతులపై కంకర రాళ్ళు విసరాలి. రద్దీ నుండి కాపాడుకోవటానికి, ముసలివారు, బలహీనులు, స్త్రీలు రాత్రి వేళల్లో జమరాతులపై కంకర రాళ్ళు విసర వచ్చు.
జమరాతులపై కంకర రాళ్ళు విసిరటం (రమీ చేయుట) గురించిన నియమాలు:
రమీ చేసేటపుడు క్రింది వరుస క్రమాన్ని అనుసరించాలి.
ఖైఫ్ మస్జిదుకు దగ్గరలో ఉన్న మొదటి జమరహ్ పై కంకర రాళ్ళు విసరటం ద్వారా రమీ ప్రారంభించాలి. ఏడు కంకర రాళ్ళను, ఒకదాని తర్వాత ఒకటి విసరాలి. అంతే గాని ఏడింటినీ ఒకేసారి విసరి వేయకూడదు. సున్నతు ప్రకారం, జమరాతును తమ ఎడమ వైపు ఉండేట్టు ఖిబ్లహ్ కు అభిముఖంగా నిలబడి, రెండు చేతులు పైకెత్తి, అల్లాహు అక్బర్ అని పలికి, దుఆ చేసుకోవాలి. అదే విధంగా రెండో జమరహ్ పై కంకర రాళ్ళు విసరాలి. సున్నతు ప్రకారం రెండో జమరహ్ పై ఒక్కొక్కటిగా కంకర రాళ్ళు విసిరిన తర్వాత, కొంచెం ముందుకు పోయి, ఖిబ్లహ్ కు అభిముఖంగా నిలబడి, రెండు చేతులు పైకెత్తి అల్లాహు అక్బర్ అని పలికి, వీలయినన్ని ఎక్కువ దుఆలు చేసుకోవాలి. ఆ తర్వాత మూడో జమరహ్ పై కంకర రాళ్ళు విసరాలి. అయితే, ఇక్కడ ఆగకూడదు మరియు దుఆలు చేయకూడదు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతును అనుసరిస్తూ, మొదటి రోజున అంటే దిల్ హజ్ 11వ తేదీన విసిరినట్లుగానే, దాని తర్వాత రోజున (12వ తేదీన) కూడా మూడు జమరాతులపై కంకర రాళ్ళు విసరాలి. తష్రీక్ దినాలలోని మొదటి రెండు దినాలలో (దిల్ హజ్ 11 మరియు 12వ తేదీలు) రమీ చేయటమనేది తప్పని సరిగా చేయవలసిన హజ్ ఆచరణల భాగంగా పేర్కొనబడింది. అలాగే మీనాలో మొదటి రాత్రి (దిల్ హజ్ 10వ తేదీ రాత్రి) మరియు రెండవ రాత్రి (దిల్ హజ్ 11వ తేదీ రాత్రి) గడపటం కూడా హజ్ ఆచరణలలో తప్పనిసరిగా చేయవలసిన ఆచరణయే. అయితే నీటి వసతి కలిగించే పనులలో ఉన్న హజ్ యాత్రికులకు మరియు హజ్ చేస్తున్న పశువుల కాపర్లకు దీని నుండి మినహాయింపు ఉంది.
మీనాలో కేవలం రెండు రోజులు మాత్రమే గడపడానికి అనుమతి ఉంది, అయితే మూడో రోజు వరకు దానిని పొడిగించడం ఉత్తమం:
మొదటి రెండు రోజులు మూడు జమరాతులపై రమీ చేసిన తర్వాత అంటే దిల్ హజ్ 11 మరియు 12వ తేదీల తర్వాత, ఎవరైనా మీనా వదిలి వెళ్ళదలిస్తే, అలా చేయడం అనుమతించబడింది. అయితే వారు దిల్ హజ్ 12వ తేదీన సూర్యాస్తమయానికి ముందే మీనా వదిలి వేయాలి. ఒకవేళ ఎవరైనా రెండో రోజు అంటే దిల్ హజ్ 12వ తేదీ సూర్యాస్తమయం తర్వాత కూడా మీనాలోనే ఉండి పోతే, ఆ రాత్రి వారు మీనాలోనే గడపాలి. మరుసటి దినం అంటే దిల్ హజ్ 13వ తేదీన మరలా మూడు జమరాతులపై కంకర రాళ్ళు విసరగలిగితే వారికి ఎక్కువ పుణ్యాలు లభిస్తాయి. ఈ విషయాన్ని ఖుర్ఆన్ ఇలా స్పష్టం చేసింది:
وَٱذۡكُرُواْ ٱللَّهَ فِيٓ أَيَّامٖ مَّعۡدُودَٰتٖۚ فَمَن تَعَجَّلَ فِييَوۡمَيۡنِ فَلَآ إِثۡمَ عَلَيۡهِ وَمَن تَأَخَّرَ فَلَآ إِثۡمَ عَلَيۡهِۖ لِمَنِ ٱتَّقَىٰۗ وَٱتَّقُواْ ٱللَّهَ وَٱعۡلَمُوٓاْ أَنَّكُمۡ إِلَيۡهِ تُحۡشَرُونَ٢٠٣
వద్కురూల్లాహ ఫీ అయ్యామిమ్మఅదూదాతిన్ ఫమన్ తఅజ్జల ఫీ యౌమైని ఫలా ఇథ్మ అలైహి వ మన్ తఅఖ్ఖర ఫలా ఇథ్మ అలైహి లిమనిత్తఖా వత్తఖుల్లాహ వ అలమూ అన్నకుమ్ ఇలైహి తుహ్ షరూన
మరియు నిర్ణీత దినాలలో అల్లాహ్ ను స్మరించండి. కానీ ఎవరైతే రెండు రోజులలో (మీనాను) వదిలి వేయాలని త్వర పడతారో, అతని పై ఎలాంటి దోషమూ లేదు. మరియు ఎవరైతే అక్కడే ఆగిపోయారో, అతనిపై ఎలాంటి దోషమూ లేదు – ఒకవేళ అతనిది మంచి చేయలనే ఉద్దేశమే అయితే. 2:203
మీనాలో ఆగే దినాల్ని పొడిగించటం మంచిది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను మీనా వదలటంలో త్వరబడమని చెప్పినా, స్వయంగా ఆయన మీనా వదలటంలో త్వరబడలేదు. ఆయన మీనాలో ఆగి, దిల్ హజ్ 13వ తేదీ మిట్టమధ్యాహ్నం తర్వాత జమరాతులపై కంకర రాళ్ళు విసిరి, దొహర్ నమాజు చేయక ముందే మీనా వదిలినారు. అంటే ఆయన మూడు దినాలు మీనాలో గడిపారు.
చిన్నపిల్లల, వ్యాధిగ్రస్తుల, వయసు మళ్ళిన వారి మరియు గర్భిణీ స్త్రీల తరుఫున మీరే స్వయంగా కంకర రాళ్ళు విసరటానికి అనుమతి ఉంది:
చిన్న పిల్లల సంరక్షుడు, వారి తరుఫున కంకర రాళ్ళు విసరటమనేది ధర్మబద్ధమైనదే. ఎందుకంటే చిన్న వయస్సులో వారు ఆ పని చేయలేరు గనుక. ముందుగా అతను తప్పని సరిగా తను విసర వలసి ఉన్న కంకర రాళ్ళను విసిరి, ఆ తర్వాత వారి తరుఫున కంకర రాళ్ళు విసరాలి. చిన్న వయస్సులోని బాలికల విషయంలో కూడా ఇదే వెసులుబాటు ఇవ్వబడింది.
జాబిర్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు:
మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు హజ్ యాత్ర చేసాము. మాతో పాటు స్త్రీలు మరియు పిల్లలు కూడా ఉండినారు. మేము లబ్బైక్ అని పలుకుతూ, మా పిల్లల తరుఫున కంకర రాళ్ళు విసిరాము. (ఇబ్నె మాజహ్)
అనారోగ్యం వలన లేదా ముసలితనం వలన లేదా గర్భం వలన ఎవరైనా స్వయంగా కంకర రాళ్ళు విసరలేకపోతే, తమ తరుఫున ఎవరినైనా నియమించవచ్చు. ఖుర్ఆన్ లో అల్లాహ్ ప్రకటన ఇలా ఉంది:
فَٱتَّقُواْ ٱللَّهَ مَا ٱسۡتَطَعۡتُمۡ
ఫత్తఖుల్లాహ్ మాస్ తతఅతుమ్
కాబట్టి వీలయినంత ఎక్కువగా అల్లాహ్ పై భయభక్తులతో ఉండండి. 64:16
ఎందుకంటే రద్దీలో వారు ముందుకు కదలలేకపోవటం మరియు జమరాతులపై కంకర రాళ్ళు విసిరే సమయం దాటిపోయే పరిస్థితి ఎదరుయ్యే అవకాశం ఉండటం మరియు అలా దాటిపోతే షరిఅహ్ ఏ విధమైన ప్రాయశ్చితం లేకపోవటం వలన, జమరాతులపై కంకర రాళ్ళు విసిరేందుకు వారు తమ తరుఫున ఎవరినైనా నియమించుకోవచ్చు. ఇతర హజ్ ఆచరణలకు మరియు దీనికి మధ్య వ్యత్యాసం ఇదే, నఫిల్ హజ్ అయినా సరే – రమీ తప్ప ఇతర ఆచరణలన్నీ హజ్ యాత్రికుడు స్వయంగా చేయవలసి ఉంటుంది. ఎవరైతే హజ్ కొరకు లేదా ఉమ్రహ్ కొరకు ఇహ్రాం ధరించారో, వారు స్వయంగా హజ్ లేదా ఉమ్రహ్ ఆచరణలన్నీ స్వయంగా పూర్తి చేయాలి – అది నఫిల్ హజ్/ఉమ్రహ్ అయినా లేదా తప్పనిసరి హజ్/ఉమ్రహ్ అయినా సరే.
ఎందుకంటే ఖుర్ఆన్ లోని అల్లాహ్ ప్రకటన ఇలా ఉంది:
وَأَتِمُّواْ ٱلۡحَجَّ وَٱلۡعُمۡرَةَ لِلَّهِۚ
వ అతిమ్మూల్ హజ్జ వల్ ఉమ్రత లిల్లాహి
హజ్ మరియు ఉమ్రాలను అల్లాహ్ కొరకు పూర్తిచేయండి. 2:196
తవాఫ్ మరియు సయీ కొరకు ప్రత్యేకంగా నిర్ణీత సమయం ఏదీ లేదు. అయితే రమీ కొరకు నిర్ణీత సమయం విధించబడి ఉంది. అందు వలన దానిని సమయం మించిపోక ముందే పూర్తిచేయాలి. అలాగే అరఫాహ్ మైదానంలో నిలబడటం మరియు ముజ్దలిఫహ్ లో రాత్రి గడపడం కూడా నిర్ణీత సమయంలో చేయవలసిన ఆచరణలే. వికలాంగులైన హజ్ యాత్రికులు కూడా ఏదో విధంగా మిగిలిన ఆచరణలు స్వయంగా పూర్తి చేయవలసిందే – ఒక్క రమీ తప్ప. వికలాంగులు, బలహీనులు రమీ కొరకు స్వయంగా వెళ్ళక, ఇతరులను నియమించే ఆచారం చాలా పాతది మరియు అనుమతించబడినది. ఇతర హజ్ లేదా ఉమ్రహ్ ఆచరణల విషయంలో స్వయంగా తమకు బదులుగా ఇతరులను నియమించే అలాంటి ఆచారం ఎక్కడా పేర్కొనబడలేదు. అల్లాహ్ ప్రసాదించిన జ్ఞానం ఆధారంగా మాత్రమే అన్ని ఆరాధనలకు సంబంధించిన ఆచరణలు తటస్థంగా చేయాలి. కాబట్టి, సరైన సాక్ష్యాధారాలు లేని ఆచరణలను ఏదో విధంగా ధర్మబద్ధమైనవిగా చేసుకోవడం తగదు. ఇతరుల తరుఫున రమీ చేసేవారు, ముందుగా తమ రమీ పూర్తి చేయాలి. ఆ తర్వాత అక్కడే నిలబడి ఇతరుల తరుఫున రమీ చేయాలి. అంటే జమరాతుల పై రాళ్ళు విసిరే టపుడు, ముందుగా తన రాళ్ళు విసిరి, అదే జమరాతు వద్ద నిలబడి ఇతరుల తరుఫున రాళ్ళు కూడా విసరాలి. అంతేగాని, మొత్తం మూడు జమరాతులపై తన రాళ్ళు విసరటం పూర్తి చేసి, ఆ తర్వాత మూడు జమరాతులపై ఇతరుల తరుఫున రాళ్ళు విసరటమని కాదు. దీనికి పూర్వ దృష్టాంతం ఏదీ లేకపోయినా, పండితుల అభిప్రాయం ఇదే. దీనికి భిన్నంగా చేయటమనేది చాలా కష్టమైన పని.
దీని గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ ప్రకటన ఇలా ఉంది –
وَمَا جَعَلَ عَلَيۡكُمۡ فِي ٱلدِّينِ مِنۡ حَرَجٖ
వమా జఅల అలైకుమ్ ఫిద్దీని మిన్ హరజిన్
కష్టమైన పని ఏదీ ధర్మంలో మీపై ఆదేశించబడలేదు 22:78
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీథు:
يَـسِّـرُوْا وَلاَ تُـعَسِّـرُوْا
యస్సిరూ వలా తుఅస్సిరూ
పనిని సులభతరం చేయండి, అంతేగాని కష్టతరం చేయవద్దు.
తన రమీ పూర్తి చేసిన తర్వాత, చిన్నపిల్లల లేదా బలహీనుల కొరకు తిరిగి వెళ్ళి, మరలా రమీ చేసినట్లుగా ఏ సహాబా నుండి కూడా నమోదు చేయబడలేదు. ఒకవేళ వారు అలా చేసి ఉండినట్లయితే, అది నమోదు చేయబడి ఉండేది మరియు అన్ని విధాలా అవి అందుబాటులో ఉండేవి. ఉత్తమమైన విషయం అల్లాహ్ కే తెలుసు.
హజ్జె తమత్తు & హజ్జె ఖిరన్ పద్ధతిలో హజ్ చేసే వారి కొరకు నిర్దేశించబడిన హదీ (ఖుర్బానీ పశువు):
ఒకవేళ హజ్జె తమత్తు (ముతమత్తి) లేక హజ్జె ఖిరన్ (ఖారిన్) పద్ధతిలో హజ్ చేస్తున్న హాజీ, పవిత్ర మక్కహ్ సరిహద్దులలో నివసించని వాడైతే, అతను అల్లాహ్ కొరకు ఒక హదీ (ఖుర్బానీ పశువు) సమర్పించుకోవలసి ఉంది – అది ఒక మేక లేక గొర్రె లేక ఒక ఒంటె లేదా ఒక ఆవులో 7వ వంతు వాటా.
ధర్మబద్ధమైన సంపాదనతోనే హదీ (ఖుర్బానీ పశువు) కొనాలి:
తప్పకుండా హజ్ యాత్రికుడు పూర్తిగా తన ఆదాయంతోనే మరియు ధర్మబద్ధమైన పవిత్ర సంపాదనతోనే ఖుర్బానీ పశువు కొనాలి. ఎందుకంటే అల్లాహ్ పవిత్రుడు మరియు పవిత్రమైన వాటినే స్వీకరిస్తాడు. ఖుర్బానీ పశువు కొనటం కొరకు ఎవరైనా ధనవంతులను లేదా ఇతరులను యాచించటమనేది ఒక ముస్లిం చేయవలసిన పని కాదు. ఎందుకంటే అల్లాహ్ అతనికి తగినంత ఆదాయం సమకూర్చినపుడు మరియు ఖుర్బానీ పశువు కొనగలిగే శక్తి ఇచ్చినపుడు మాత్రమే అతనిపై హజ్ విధి అవుతుంది. దీని వలన అతడు ఇతరుల సంపద మీద మరియు ఆదాయం మీద ఆధార పడవలసిన అవసరం లేదు. ఇతరులను యాచించటాన్ని అనేక హదీథులు ఖండిస్తున్నాయి మరియు అలా చేయటం చెడు పనిగా ప్రకటిస్తున్నాయి. అంతేగాక, ఇతరులను యాచించని వారిని అవి ప్రశంసిస్తున్నాయి కూడా.
తమ వద్ద హదీ లేనివారు హజ్ దినాలలో మూడు రోజులు మరియు హజ్ నుండి మరలి వచ్చిన తర్వాత ఏడు రోజులు ఉపవాసం ఉండాలి:
ఒకవేళ హజ్జె తమత్తు లేదా హజ్జె ఖిరన్ పద్ధతిలో హజ్ చేస్తున్న హజ్ యాత్రికులు హదీ పశువు ఖుర్బానీ చేయలేకపోతే, అతను మొత్తం ఏడు రోజులు ఉపవాసం ఉండాలి – వాటిలో మూడు రోజులు హజ్ దినాలలో మరియు ఏడు రోజులు హజ్ నుండి మరలి వచ్చిన తర్వాత. అయితే యౌమున్నహర్ అంటే దిల్ హజ్ 10వ తేదీ కంటే ముందు దినాలలో లేదా దిల్ హజ్ 10వ తేదీ తర్వాత దినాలలో అంటే తష్రీఖ్ దినాలలో అతను హజ్ దినాలలో పాటించవలసిన మూడు ఉపవాసాలను పూర్తి చేయవచ్చు.
దీని గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ యొక్క ప్రకటన ఇలా ఉంది:
وَأَتِمُّواْ ٱلۡحَجَّ وَٱلۡعُمۡرَةَ لِلَّهِۚ فَإِنۡ أُحۡصِرۡتُمۡ فَمَا ٱسۡتَيۡسَرَ مِنَ ٱلۡهَدۡيِۖ وَلَا تَحۡلِقُواْ رُءُوسَكُمۡ حَتَّىٰ يَبۡلُغَ ٱلۡهَدۡيُ مَحِلَّهُۥۚ فَمَن كَانَ مِنكُم مَّرِيضًا أَوۡ بِهِۦٓ أَذٗى مِّن رَّأۡسِهِۦ فَفِدۡيَةٞ مِّن صِيَامٍ أَوۡ صَدَقَةٍ أَوۡ نُسُكٖۚ فَإِذَآ أَمِنتُمۡ فَمَن تَمَتَّعَ بِٱلۡعُمۡرَةِ إِلَى ٱلۡحَجِّ فَمَا ٱسۡتَيۡسَرَ مِنَ ٱلۡهَدۡيِۚ فَمَن لَّمۡ يَجِدۡ فَصِيَامُ ثَلَٰثَةِ أَيَّامٖ فِي ٱلۡحَجِّ وَسَبۡعَةٍ إِذَا رَجَعۡتُمۡۗ تِلۡكَ عَشَرَةٞ كَامِلَةٞۗ ذَٰلِكَ لِمَن لَّمۡ يَكُنۡ أَهۡلُهُۥ حَاضِرِي ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِۚ وَٱتَّقُواْ ٱللَّهَ وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ شَدِيدُ ٱلۡعِقَابِ ١٩٦
వ అతిమ్మూల్ హజ్జ వల్ ఉమ్రత లిల్లాహి ఫ ఇన్ ఉహ్సిర్ తుమ్ ఫమాస్ తైసర మినల్ హదీ వలా తహ్లిఖూ రుఊసకుమ్ హత్తా యబ్లుగల్ హద్యు మహిల్లహు ఫమన్ కాన మింకుమ్ మరీదన్ అవ్ బిహీ అదన్ మినర్రాఅసిహీ ఫఫిద్యతున్ మినస్సియామిన్ అవ్ సదఖతిన్ అవ్ నుసుకిన్ ఫఇదా అమిన్తుమ్ ఫమన్ తమత్తాఅ బిల్ ఉమ్రతి ఇలల్ హజ్జి ఫమాస్ తైసర మినల్ హదీ ఫమన్ లమ్ యజిద్ ఫ సియాము థలాథతి అయ్యామిన్ ఫిల్ హజ్జి వ సబ్ అతిన్ ఇదా రజఅతుమ్ తిల్కఅషరతున్ కామిలతున్ దాలిక లిమన్ లమ్ యకున్ అహ్ లుహు హాదిరిల్ మస్జిదిల్ హరామి వత్తఖుల్లాహ్ వఅలమూ అన్నల్లాహ షదీదుల్ ఇఖాబి.
మీరు శాంతి-సురక్షల పరిస్థితులలో ఉన్నప్పుడు, ఎవరైనా ఉమ్రా నుండి హజ్జ్ వరకు ఉన్న సౌలభ్యాన్ని వినియోగించుకున్నట్లయితే, వారు ఖుర్బానీ జంతువులలో నుండి సులభంగా సమకూర్చుకోగలిగే దానిని అర్పించాలి. కానీ, అలా చేయలేక పోయినవారు, మూడు రోజులు హజ్జ్ దినములలో మరియు ఏడు రోజులు వాపసు వెళ్ళిన తరువాత ఉపవాసం పాటించాలి. ఈ ఉపవాసం మొత్తం పది దినములు – ఇది ఎవరి గృహస్థులు (నివాసం) మస్జిదె హరామ్ దగ్గర లేరో వారికి మాత్రమే వర్తిస్తుంది. 2:196
సహీహ్ బుఖారీలో నమోదు చేయబడిన ఆయెషా రదియల్లాహు అన్హా మరియు అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమాల ఉల్లేఖనలలో ‘తష్రీఖ్ దినాలలో ఉపవాసం పాటించే అనుమతి కేవలం హదీ సమర్పించే స్థోమత లేని హజ్ యాత్రికులకు మాత్రమే వర్తిస్తుందని’ తెలుపబడింది. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారనటానికి తగినన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. అయితే ఈ మూడు దినాల ఉపవాసాలు అరఫహ్ దినానికి ముందే పాటించడం మంచిది. అలా చేయడం ద్వారా అతను అరఫహ్ దినాన ఉపవాసం ఉండవలసిన అవసరం కలుగదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అరఫాత్ లో ఉండినారు మరియు ఆ దినమున ఆయన ఉపవాసం పాటించలేదు. అంతేగాక ఆ దినాన ఉపవాసం పాటించవద్దని ఆయన తన సహచరులను కూడా ఆదేశించారు. అన్నపానీయాలు సేవించడం ద్వారా లభించే అధిక శక్తితో మనం ఆ రోజున వీలయినంత ఎక్కువగా అల్లాహ్ ను స్మరించవచ్చు మరియు అల్లాహ్ ను వేడుకోవచ్చు. ఈ మూడు రోజుల ఉపవాసాలు నిరంతరంగా అంటే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా మూడు రోజులు పాటించవచ్చు లేదా ఒక్కొక్కటి విడివిడిగా ఉండవచ్చు. అలాగే హజ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత పూర్తి చేయవలసి ఉన్న ఏడు రోజుల ఉపవాసాలు కూడా నిరంతరంగా ఒక దాని తర్వాత ఒకటి ఉండ వచ్చు లేదా అపుడపుడు విడివిడిగా ఉండవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండింటిలో ఏదో ఒకదానికి ప్రత్యేకత ఇవ్వలేదు. ఇంటికి మరలి వచ్చిన తర్వాత, అల్లాహ్ ఆదేశించిన విధంగా మిగిలిన ఏడు దినాల ఉపవాసాలు పూర్తి చేయాలి
وَ سَبْعَـةٍ إِذَا رَجَعْـتُمْ
వ సబ్అతిన్ ఇదా రజఅతుమ్
ఏడు రోజులు వాపసు వెళ్ళిన తరువాత ఉపవాసం పాటించాలి.
ఎవరి వద్దనైతే ఖుర్బానీ పశువు కొనే స్థోమత లేదో, అలాంటి వారు రాజులను మరియు ధనవంతులను ఖుర్బానీ పశువు కొరకు యాచించే బదులు, ఉపవాసం ఉండటం మంచిది. అయితే, ఎవరైనా నిస్వార్థంగా ఇతరులకు ఖుర్బానీ పశువును బహూకరించినా లేదా ఏదైనా ఇతర వస్తువును బహూకరించినా, అతను ఇతరుల తరుఫున హజ్ చేస్తున్నా సరే, అందులో ఎలాంటి దోషమూ లేదు – అలాంటివి స్వీకరించబడవు అనే షరతు ఉంటే తప్ప. ఖుర్బానీ పశువుల కొరకు ప్రభుత్వాన్ని లేదా ఇతరులను యాచించటమనేది నిస్సందేహంగా ధర్మబద్ధమైన పని కాదు మరియు అది మోసగించటం క్రిందికి రావచ్చు.
అల్లాహ్ మమ్ముల్ని మరియు ఇతర ముస్లింలను ఇలాంటి తప్పుల నుండి కాపాడు గాక!
ఆరవ అధ్యాయం
మంచిని ఆజ్ఞాపించడం మరియు జమాతుతో నమాజులు చేయడం హజ్ యాత్రికునిపై తప్పని సరి:
హజ్ యాత్రికుడు మక్కహ్ లో ఉన్నపుడు మంచిని ఆదేశించడం మరియు నిర్ణీత సమయాలలో ఐదు పూటలా ఫర్ద్ నమాజులు జమాతుతో కలిసి చేయటం అతని యొక్క తప్పనిసరి కర్తవ్యం. అలా చేయమని అల్లాహ్ ఖుర్ఆన్ ద్వారా మరియు తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతుల ద్వారా ఆదేశించి ఉన్నాడు. జమాతుతో కలిసి ఫర్ద్ నమాజులు చేయకుండా మస్జిదులను నిర్లక్ష్యం చేసి, ఇంట్లోనే ఫర్ద్ నమాజులు చేయటమనేది మక్కహ్ వాసులో చాలా మంది చేస్తున్న ఘోరమైన తప్పు. ఇది షరిఅహ్ కు వ్యతిరేకం. ఇలాంటి చెడు పద్ధతిని వారు మార్చుకోవాలి.
మస్జిదులో జమాతుతో కలిసి నమాజు చేయమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. దీనికి ఆధారం ఇబ్నె మఖ్తూమ్ రదియల్లాహు అన్హును ఆజ్ఞాపించిన ఆయన హదీథు పలుకులు. అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, అంధత్వం కారణంగా మరియు మస్జిదు నుండి తన ఇల్లు దూరంగా ఉన్న కారణంగా జమాతుతో కలిసి నమాజు చేయటం నుండి తనకు మినహాయింపు ఇవ్వమని కోరినాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని ఇలా అడిగినారు,
( هَلْ تَسْمَعُ النِّدَاء بِالصَّلَاةِ ؟ فَقَالَ : نَعَمْ . قَالَ : فَأَجِبْ مَا أَجِدُ لَكَ رُخْصَةً )
హల్ తస్మఉన్నిదాఇ బిస్సలాతి ఖాల నఅమ్ ఖాల ఫఅజిబ్ మా అజిదు లక రుఖ్సతన్
“నమాజు కొరకు రమ్మని పిలిచే అదాను పలుకులు నీకు వినబడతాయా?”. అవునని అతను జవాబివ్వగా, మస్జిదులో జమాతుతో నమాజు చేయటం అతని కొరకు తప్పని సరి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో అన్నారు.
మరో ఉల్లేఖన ప్రకారం ఆయన ఇలా అన్నారు,
( مَا أَجِدُ لَكَ رُخْصَةً )
మా అజిదు లక రుఖ్సతన్ – “నీ మినహాయింపు కొరకు నాకేమీ తగిన కారణం కనబడటం లేదు.”
ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు,
( لَـقَدْ هَـمَـمْتُ أَنْ آمُرَ بِاصَّلَاةِ فَـتُـقَامَ ، ثُمَّ آمُرَ رَجُلًا فَيـَؤُمٌ النَّاسَ ، ثُمَّ أَنْـطَلِـقَ إِلَى رِجَالٍ لَا يَـشْهَدُونَ الصَّلَاةَ ، فَأُحَرَّقَ عَلَيْهِمْ بُـيُـوتَـهُمْ بِالنَّارِ )
లఖద్ హమమ్తు అన్ ఆమర బిస్సలాతి ఫతుఖామ,థుమ్మ ఆమర రజులన్ ఫయఉమ్మన్నాస థుమ్మ అన్ తలిఖ ఇలా రిజాలిన్ లాయష్హదూనస్సలాత ఫ ఉహర్రిఖ అలైహిమ్ బుయూతహుమ్ బిన్నారి
“నమాజు కొరకు లేవమని ప్రజలను ఆదేశించి, వారు పంక్తులలో చేరిన తర్వాత, నమాజుకు నాయకత్వం వహించమని ఎవరినైనా ఆదేశించి, నమాజుకు రాని వారి వద్దకు వెళ్ళి, వారి ఇళ్ళకు నిప్పు అంటించాలని నేను అనుకుంటున్నాను.”
ప్రామాణిక సనద్ పరంపరతో సునన్ ఇబ్నె మాజాలో నమోదు చేయబడిన హదీథును అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఇలా ఉల్లేఖించారు:
( مَنْ سَمِعَ النِّداآءَ فَلَمْ يَأْتِ ، فَلَا صَلَاةَ لَـهُ إِلاَّ مِنْ عُـذْرِ )
మన్ సమిఅన్నిదాఅ ఫలమ్ యాతి, ఫలా సలాతలహు ఇల్లా మిన్ ఉద్ రిన్
ఎవరైతే అదాన్ పిలుపు విని కూడా నమాజు కొరకు (మస్జిదుకు) రారో, సముచితమైన కారణం లేకుండా అతని నమాజు స్వీకరించబడదు.
సహీహ్ ముస్లింలో నమోదు చేయబడిన హదీథులో ‘ముస్లింగా అల్లాహ్ ను కలవాలని కోరుకునే వారు అదాన్ పిలుపు ఇవ్వబడినపుడల్లా తమ ఐదు పూటల నమాజులను కాపాడుకోవాలని’ అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. మార్గదర్శకత్వ మార్గాలను అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా నిర్దేశించినాడు మరియు ఆ మార్గదర్శకత్వ మార్గాలలో నమాజు కూడా ఒకటి. అయితే మీరు మస్జిదుకు వెళ్ళక, తమ ఇళ్ళలో ఫర్ద్ నమాజులు చేస్తున్నట్లయితే, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతును నిర్లక్ష్యం చేసినవారవుతారు. మరియు అలా నిర్లక్ష్యం చేయడం ద్వారా వెనుక బడి పోయిన వారి వలే మీరు కూడా ఘోరమైన అపాయంలో పడిపోతారు.
ఎవరైతే సరిగ్గా వుదూ చేసి, ఫర్ద్ నమాజు కొరకు ఏదైనా మస్జిదు వైపుకు వెళతారో, అతని ప్రతి అడుగుకు బదులుగా అల్లాహ్ (అతని ఖాతాలో) ఒక పుణ్యాన్ని వ్రాస్తాడు, అతని స్థాయిని ఒక మెట్టు పెంచుతాడు మరియు ఒక పాపాన్ని / తప్పును మన్నిస్తాడు. ఎవరైతే ఫర్ద్ నమాజులను మస్జిదులలో జమాతుతో చేయరో, అలాంటి వారిలో కపటత్వం ప్రవేశిస్తుంది. అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న సరే, ఒకరిద్దరు వ్యక్తుల సహాయంతో మస్జిదుకు వచ్చి, పంక్తులలో నిలబడి నమాజు చేసే కొందరిని మీరు చూసే ఉంటారు.
హజ్ యాత్రికుడు పాపకార్యాలకు మరియు తప్పుడు పనులకు దూరంగా ఉండటం తప్పని సరి:
అల్లాహ్ నిషేధించిన పనులన్నింటి నుండి తనను తాను కాపాడుకోవడం ప్రతి హజ్ యాత్రికునిపై తప్పనిసరి విధి అయి ఉంది. వ్యభిచారం, స్వలింగ సంపర్కం, దొంగతనం, వడ్డీ లావాదేవీలు, అనాథల సంపదను వాడుకొనుట, వ్యవహారాలలో మోసగించుట, నమ్మక ద్రోహానికి తలబడుట, సిగరెట్టులు త్రాగుట, మాదక ద్రవ్యాలు మరియు మద్యపానం మొదలైన మత్తుపదార్థాలు సేవించుట, కాలి చీలమండలాల క్రిందుగా బట్టలు ధరించుట మొదలైన తప్పుడు పనులు, పాపపు కార్యాలకు దూరంగా ఉండాలి. గర్వం, అసూయ, ద్వేషం, కపటత్వం, చాడీలు చెప్పుట, ఇతర ముస్లింలను హేళన చేయుట, మ్యూజిక్ పరికరాలను వాడుట లేదా వినుట, రేడియో – టివీ – ప్లేయర్ల వంటి వినోద సాధనాల ద్వారా మ్యూజిక్ / పాటలు వినుట, చదరంగం ఆడుట, జూదం ఆడుట, లాటరీలలో పాల్గొనుట, అనవసరమైన ఫోటోగ్రఫీలో / పెయింటింగులలో కాలక్షేపం చేయుట మొదలైనవి ఏ సమయంలోనైనా మరియు ఏ ప్రాంతంలోనైనా ముస్లింలు చేయకూడదు. ఇవి అల్లాహ్ నిషేధించిన పాపకార్యాలు మరియు తప్పుడు పనులు. అందుకని హజ్ యాత్రికులు మరియు మక్కహ్ వాసులు కూడా వీటిని చేయకూడదు. పవిత్ర స్థలంలో పాపకార్యాలు / తప్పుడు పనులు చేయడమనేది తీవ్రంగా గర్హించదగిన చెడు పనవుతుంది మరియు వాటికి మరింత తీవ్రమైన శిక్ష పడుతుంది.
ఖుర్ఆన్ లో అల్లాహ్ ప్రకటన ఇలా ఉంది:
وَمَن يُرِدۡ فِيهِ بِإِلۡحَادِۢ بِظُلۡمٖ نُّذِقۡهُ مِنۡ عَذَابٍ أَلِيمٖ ٢٥
వ మన్ యురిద్ ఫీహి బి ఇల్హాదిమ్ బి జుల్ మిన్నుదిఖ్ హు మిన్ అదాబిన్ అలీమ్
మరియు ఎవరైతే పాపకార్యాల వైపు మరలుతారో మరియు చెడు పనులు చేస్తారో, అలాంటి వారికి తీవ్రమైన శిక్షను రుచి చూపుతాము. 22:25
పవిత్ర మక్కహ్ సరిహద్దులలో పాపకార్యాలు, తప్పుడు చేసేవారిని తీవ్రంగా శిక్షిస్తాననే అల్లాహ్ హెచ్చరికలోని ఆ శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో ఎవరైనా ఊహించగలరా ? నిస్సందేహంగా అది చాలా కఠినంగా ఉంటుంది మరియు తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పుల నుండి, పాపకార్యాల నుండి దూరంగా ఉండాలి. నిషేధించబడిన వాటన్నింటికీ దూరంగా ఉండనంత వరకు హజ్ యాత్రికుని హజ్ మరియు దుఆలు స్వీకరించబడవు మరియు అతనికి క్షమాభిక్ష ప్రసాదించబడదు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు:
( مَنْ حَجَّ فَلَمْ يَرْفُثْ ، وَ لَمْ يَفْسُقْ ، رَجَعَ كَيَوْمَ وَلَدَتْهُ أُمُّهُ )
మన్ హజ్జ ఫలమ్ యర్ఫుథ్, వలమ్ యఫ్సుఖ్ , రజఅ కయౌమ వలదత్హు ఉమ్ముహు
ఎవరైతే హజ్ చేసారో మరియు ఎలాంటి అశ్లీల కార్యాలలో పాల్గొనలేదో, హద్దు మీరలేదో (దౌర్జన్యం చేయలేదో) అలాంటి వారు పాపరహితంగా మరలి వస్తారు – ఎలా తల్లి గర్భం నుండి జన్మించినపుడు పాపరహితంగా ఉంటారో, అంత పవిత్రంగా.
పాపాలన్నింటిలో హీనమైన, ఘోరమైన మరియు తీవ్రమైన పాపం ఏదంటే, అల్లాహ్ వద్ద తమ గురించి సిఫారసు చేస్తారని లేదా తమ వ్యాధిని నయం చేస్తారని లేదా తప్పిపోయిన వ్యక్తిని తిరిగి ఇంటికి వచ్చేటట్లు చేస్తారని మృతులను వేడుకోవటం. ఈ సంకల్పంతో కానుకలు, ముడుపులు చెల్లించుకోవటం లేదా వారి కొరకు బలిపశువులను ఖుర్బానీ చేయటం మొదలైనవి స్పష్టంగా అల్లాహ్ నిషేధించిన ఘోర బహుదైవారాధన క్రిందికి వస్తాయి. ఇలాంటి చెడు అలవాట్లు అజ్ఞాన కాలంలోని (జాహిలియ్యహ్) అరబ్బులలో ఉండేవి. వాటిని ఆపటానికి, నిర్మూలించడానికి అల్లాహ్ తన సందేశహరులను పంపాడు మరియు తన దివ్యసందేశాలను అవతరింపజేసాడు. కాబట్టి హజ్ యాత్రలో పాల్గొంటున్న ప్రతి ముస్లింపై మరియు ప్రతి ఇతర ముస్లింలపై అలాంటి బహుదైరాధనలను సమాజం నుండి దూరంగా ఉంచే బాధ్యత ఉంది. ఇంతకు ముందు అలాంటి పాపకార్యాలలో మునిగి ఉంటే, అల్లాహ్ వద్ద తౌబా చేసుకుని, మన్నించమని వేడుకోవాలి. హజ్ కొరకు పవిత్రస్థితిలో తయారవాలి. ఎందుకంటే బహుదైవారాధన ప్రతి మంచి పనినీ పనికి రాకుండా నిర్వీర్యం చేసివేస్తుంది.
ఖుర్ఆన్ లో అల్లాహ్ ప్రకటన ఇలా ఉంది:
وَلَوۡ أَشۡرَكُواْ لَـحَبِطَ عَنۡهُم مَّا كَانُـواْ يَعۡمَلُونَ ٨٨
వలవ్ అష్రకూ లహబిత అన్హుమ్మా కానూ యఅమలూన్
మరియు ఒకవేళ వారు గనుక ఎవరినైనా అల్లాహ్ కు సమానులుగా చేసి ఉంటే, నిశ్చయంగా వారు చేసినదంతా (ఏ మంచి పని అయినా) వారి కొరకు వ్యర్థమై పోయి ఉండేది. 6:88
బహుదైవారాధనలో అల్పమైన షిర్క్ ఏమిటంటే, అల్లాహ్ పేరుపై ప్రమాణం చేయకుండా, ప్రవక్త పేరు, కాబా పేరు, స్వంత నిజాయితీ మొదలైన వేరే వాటిపై ప్రమాణం చేయుట. కపటత్వంతో ప్రవర్తించకూడదు లేదా కీర్తిప్రతిష్టలు పొందాలనే ఆశతో ఉండకూడదు. ఇంకా ఇలా కూడా పలక కూడదు: “అల్లాహ్ ఏది తలిచినా మరియు మీరు ఏది తలిచినా …” లేదా “ఒకవేళ అల్లాహ్ మరియు మీరు అక్కడ లేకపోతే, నేను నష్టపోయేవాడిని, ప్రమాదాన్ని ఎదుర్కొనే వాడిని …” వంటి షిర్క్ మాటలు అస్సలు పలక కూడదు. అంతేగాక ఇలాంటి షిర్క్ మాటలు పలకవద్దని ఇతరులకు కూడా చెప్పవలెను.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం ఇలా బోధించారు:
( مَنْ حَـلَـفَ بِغَـيْـرِ اللهِ فَـقَـدْ كَـفَـرَ أَوْ أَشْـرَكَ )
మన్ హలఫ బిగైరిల్లాహి ఫఖద్ కఫర అవ్ అష్రక
“అల్లాహ్ పేరు పై గాకుండా ఇతరుల పేర్లపై ప్రమాణం చేసేవారు అవిశ్వాసం చేస్తున్నారు (కుఫ్ర్) లేదా షిర్క్ (బహుదైవారాధన) చేస్తున్నారు.” (అహ్మద్, అబూ దావూద్, అత్తిర్మిథీ)
ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక ప్రామాణిక హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
( مَنْ كَانَ حَالِـفاً فَلْـيَـحْلِفْ بِاللهِ أَوْ لَـيَـصْمُتْ )
మన్ కాన హాలిఫన్ ఫల్ యహ్ఫలిఫ్ బిల్లాహి అవ్ లయస్ముత్
“ఎవరైతే ప్రమాణం చేయాలనుకుంటారో, వారు అల్లాహ్ పేరు పై ప్రమాణం చేయాలి లేదా నిశ్శబ్దంగా ఉండాలి.”
తర్వాత ఆయన ఇలా పలికారు:
( مَنْ حَـلَـفَ بِالأَمانَـةِ فَـلَيْسَ مِـنَّا )
మన్ హలఫ బిఅమానతి ఫలైస మిన్నా
“ఎవరైతే నమ్మకం పేరుపై ప్రమాణం చేస్తారో, అలాంటి వారు మాలోని వారు కారు”. అబూ దావూద్.
ఇంకా ఆయన ఇలా పలికారు:
( أَخْـوَفُ مَا أَخَافُ عَلَـيْـكُمُ الشِّـرْكُ الْأَصْـغَرُ )
అఖ్వఫు మా అఖాఫు అలైకుముష్షిర్కుల్ అస్గరు
“మీ గురించి నేను ఎక్కువగా భయపడేది అల్పమైన షిర్కు గురించే”
అపుడు అల్పమైన షిర్కు గురించి అడుగగా, ఆయనిలా జవాబిచ్చారు:
“అర్రియా (నలుగురికి చూపించే ప్రదర్శనాబుద్ధి)”
ఇంకా ఆయన ఇలా పలికారు,
( لَا تَـقُولُوْا : مَا شآءَ الله وَ شآءَ فُلاَنٌ، وَ لَكِنْ قُـوْلُوْا مَا شآءَ اللهُ ، ثُمَّ شآءَ فُلَانٌ )
లాతఖూలూ మాషాఅ అల్లాహు వ షాఅ ఫలానున్ వ లాకిన్ ఖూలూ మాషాఅ అల్లాహు థుమ్మ షాఅ ఫులానున్
అల్లాహ్ తలిచినా మరియు ఫలానా ఫలానా తలిచినా అని పలకవద్దు. అయితే అల్లాహ్ తలిచినా అని పలికి, ఆ తర్వాత ఫలానా ఫలానా తలిచినా అని పలకండి.
నసాయి హదీథు గ్రంథంలో నమోదు చేయబడిన అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన హదీథులో ఒకతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నారు, “అల్లాహ్ తలిచినా మరియు మీరు తలిచినా … ” అది వింటూనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రంగా ఇలా పలికారు,
( أَجَـعَـلْـتَـنِي للهِ نِدَّا ، بَلْ مَا شآءَ اللهُ وَحْدَهُ )
అజఅల్తనీ లిల్లాహి నిద్దా బల్ మాషాఅ అల్లహు వహ్దహు
“నన్ను అల్లాహ్ కు సాటివానిగా చేసావా? ‘అల్లాహ్ ఏది తలిచినా’ అని మాత్రమే నీవు పలికి ఉండవలసింది.”
పై హదీథులన్నీ స్పష్టం చేస్తున్న విషయం ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ఏకత్వం పైనే నిలబడినారు మరియు తన సమాజాన్ని మేజర్ మరియు మైనరు షిర్కులు చేయవద్దని నివారించారు. తన సమాజం పరలోక కఠిన శిక్షల నుండి మరియు నరకయాతనల నుండి కాపాడుకోవటానికి ఆయన సంరక్షణ పొందాలని మరియు పటిష్టమైన ఈమాన్ (విశ్వాసం) కలిగి ఉండాలని ఆయన ఆకాంక్షించేవారు. ఆయనకు అల్లాహ్ మఖామె మహ్మూద్ స్థానం ప్రసాదించుగాక. ఆయన అల్లాహ్ సందేశాన్ని ప్రజలకు అందజేసారు, అల్లాహ్ యొక్క భయభక్తులతో జీవించే దారిని తన సమాజానికి చూపారు మరియు అల్లాహ్ దాసులతో చిత్తశుద్ధితో వ్యవహరించారు. అంతిమ దినం వరకు అల్లాహ్ ఆయనపై తన దీవెనలు కురిపించుగాక. ఇస్లామీయ జ్ఞానం కలిగి ఉన్న హజ్ యాత్రికులు, మక్కహ్ – మదీనహ్ పవిత్ర సరిహద్దులలో నివసించేవారు ఇతరులకు షరిఅహ్ జ్ఞానాన్ని అందజేయాలి మరియు ఇతరులను షిర్క్ నుండి, ఘోరమైన పాపాల నుండి, అల్లాహ్ నిషేధించిన వాటి నుండి ఆపాలి. ప్రజలను అంధవిశ్వాసాల నుండి వెలుగులోనికి తీసుకు రావటానికి, అలాంటి వాటిని వారు బహిరంగంగా తెలియజేయాలి మరియు సుస్పష్టంగా వివరించాలి. ఆ విధంగా వారు ఇతరులకు ఇస్లాం గురించి బోధించే మరియు ఈమాన్ గురించి వివరించే తమ కర్తవ్యాన్ని పూర్తి చేసుకోగలుగుతారు. దీని గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ యొక్క ప్రకటన ఇలా ఉంది:
وَإِذۡ أَخَذَ ٱللَّهُ مِيثَٰقَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ لَتُبَيِّنُنَّهُۥ لِلنَّاسِ وَلَا تَكۡتُمُونَهُۥ
వ ఇద్ అఖదల్లాహు మీథాఖల్లదీన ఊతూల్ కితాబ లతుబయ్యినున్నహు లిన్నాసి వలా తక్తుమూనహు
మరియు (గుర్తుచేసుకోండి!) ఎవరికైతే గ్రంథం ప్రసాదించబడినదో, వారితో అల్లాహ్ “దీనిని ప్రజలకు తప్పనిసరిగా బోధించాలి మరియు దీనిని దాచరాదు”అని ప్రమాణం తీసుకున్నాడు. అయితే వారు దానిని తమ వీపుల వెనుకకు విసిరివేసారు మరియు దానికి బదులుగా స్వల్ప మూల్యాన్ని పొందారు. వారి ఏమి ఖరీదు చేస్తున్నారో, అది ఎంత చెడ్డదో కదా! 3:187
పరలోకంలోని సుఖసంతోషాలకు బదులు ఈ ప్రపంచంలోనే ఎంజాయ్ చేయాలనే సంకల్పంతో నిజాన్ని దాచటం ద్వారా హద్దుమీరిపోయిన పూర్వ గ్రంథ ప్రజల మార్గాన్ని అనుసరించకుండా మన సమాజ పండితులను హెచ్చరించడమే పై ఆయతు యొక్క ఉద్దేశ్యం.
దీని గురించి ఖుర్ఆన్ అల్లాహ్ ప్రకటన ఇలా ఉంది:
إِنَّ ٱلَّذِينَ يَكۡتُمُونَ مَآ أَنزَلۡنَا مِنَ ٱلۡبَيِّنَٰتِ وَٱلۡهُدَىٰ مِنۢ بَعۡدِ مَا بَيَّنَّٰهُ لِلنَّاسِ فِي ٱلۡكِتَٰبِ أُوْلَٰٓئِكَ يَلۡعَنُهُمُ ٱللَّهُ وَيَلۡعَنُهُمُ ٱللَّٰعِنُونَ ١٥٩ إِلَّا ٱلَّذِينَ تَابُواْ وَأَصۡلَحُواْ وَبَيَّنُواْ فَأُوْلَٰٓئِكَ أَتُوبُ عَلَيۡهِمۡ وَأَنَا ٱلتَّوَّابُ ٱلرَّحِيمُ ١٦٠
ఇన్నల్లదీన యక్తుమూన మా అంజల్నా మినల్ బయ్యినాతి వల్హుదా మింబఅది మా బయ్యన్నాహు లిన్నాసి ఫిల్కితాబి ఉలాయిక యల్ అనుహుముల్లాహు వ యల్ అనుహుముల్లాయినూన్ , ఇల్లల్లదీన తాబూ వ అస్లహూ వ బయ్యనూ ఫ ఉలాయిక అతూబు అలైహిమ్ వ అనాత్తవ్వాబుర్రహీం
నిశ్చయంగా, ఎవరైతే మేము అవతరింపజేసిన స్పష్టమైన సూచనలను మరియు హితబోధలను – ప్రజల కొరకు దివ్యగ్రంథంలో విశదపరచిన తర్వాత కూడా – మరుగు పరుస్తారో, అలాంటి వారిని అల్లాహ్ శపిస్తాడు మరియు శపించేవారూ శపిస్తారు. కానీ, ఎవరైతే పశ్చాత్తాపపడి, తమను తాము సంస్కరించుకుని, (దాచిన సత్యాన్ని)బహిరంగపరుస్తారో, అలాంటి వారి పశ్చాత్తాపాన్ని నేను స్వీకరిస్తాను. మరియు నేను మాత్రమే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడను, అపార కృపాశీలుడను 2:159-160
అనేక హదీథులు మరియు ఖుర్ఆన్ ఆయతులు ప్రజలను అల్లాహ్ మార్గం వైపు ఆహ్వానిస్తున్నాయి. అల్లాహ్ మార్గం వైపు వారిని పిలవటమనేది చాలా మంచి గుణం మరియు అతి ముఖ్యమైన బాధ్యత. అంతిమ దినం వరకు ప్రవక్తలందరి మరియు వారి అనుచరులందరి మార్గం ఇదే.
దీని గురించి అల్లాహ్ యొక్క ప్రకటన ఇలా ఉంది:
وَ مَنۡ أَحۡسَنُ قَوۡلٗا مِّمَّن دَعَآ إِلَى ٱللَّهِ وَعَمِلَ صَٰلِحٗا وَ قَالَ إِنَّنِي مِنَ ٱلۡمُسۡلِمِينَ ٣٣
వ మన్ అహ్సను ఖౌలమ్మిమ్మన్ దఆ ఇలల్లాహి వ అమిల సాలిహన్ వఖాల ఇన్ననీ మినల్ ముస్లిమీన్
అల్లాహ్ వైపు పిలుస్తూ, సత్కార్యాలు చేస్తూ, ‘నేను ముస్లింని’ అనే పలికేవాని మాట కంటే మంచి మాట మరెవరిది కాగలదు? 41:33
అల్లాహ్ యొక్క మరో ప్రకటన:
قُلۡ هَٰذِهِۦ سَبِيلِيٓ أَدۡعُوٓاْ إِلَى ٱللَّهِۚ عَلَىٰ بَصِيرَةٍ أَنَا۠ وَمَنِ ٱتَّبَعَنِيۖ وَسُبۡحَٰنَ ٱللَّهِ وَمَآ أَنَا۠ مِنَ ٱلۡمُشۡرِكِينَ ١٠٨
ఖుల్ హాఅదిహీ సబీలీ అద్ఊ ఇలల్లాహి అలా బసీరతిన్ అనా వ మనిత్తబఅని వ సుబ్హానల్లాహి వ మా అన మినల్ ముష్రికీన్
(ఓ ప్రవక్తా) నువ్వు వాళ్ళకు చెప్పు: “నా మార్గమైతే ఇదే. నేనూ, నా అనుయాయులు పూర్తి అవగాహనతో, దృఢనమ్మకంతో అల్లాహ్ వైపు పిలుస్తున్నాము. అల్లాహ్ పరమ పవిత్రుడు. నేను అల్లాహ్ కు సాటి కల్పించేవారిలోని (షిర్క్ చేసే) వాడిని కాను” 12:108
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
(مَـنْ دَلَّ عَـلَى خَيْـرٍ فَـلَـهُ مِـثْـلُ أَجْـرٍ فَاعِـلِـهِ )
మన్ దల్ల అలా ఖైరిన్ ఫలహు మిథ్లు అజ్రిన్ ఫాయిలిహి
ఎవరైతే మంచి వైపు దారి చూపుతారో, వారి మాటను అనుసరించి ఆ మంచి పని చేసిన వారికి లభించేటంతటి ప్రతిఫలం వారికి కూడా లభిస్తుంది.
ఇంకా అలీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
( لأَنْ يَـهـْدَيَ اللهُ بِكَ رَجُلاً وَاحِداً خَيْـرٌ لَكَ مِنْ حُـمْرِ النَّـعَـمِ )
అన్ యహ్దయల్లాహు బిక రజులన్ వాహిదన్ ఖైరుల్లక మిన్ హుమ్రిన్నఅమి
ఒకవేళ మీ ద్వారా అల్లాహ్ ఏ ఒక్క వ్యక్తికైనా సన్మార్గం చూపితే, (అతి విలువైన) ఎర్రటి ఆడ ఒంటెల కంటే అది చాలా ఉత్తమమైనది.
అనేక ఖుర్ఆన ఆయతులు మరియు హదీథులు ఈ విషయాన్ని మాటిమాటికీ పునరుద్ఘాటిస్తున్నాయి. పండితులు మరియు అల్లాహ్ అంటే భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తులు ప్రజలను అల్లాహ్ వైపు ఆహ్వానించటంలో ఎక్కువగా శ్రమించవలెను మరియు అల్లాహ్ దాసులకు మోక్షం పొందే మార్గాన్ని చూపటంలో మరియు విధ్వంసం నుండి వారిని కాపాడుకోవటంలో మీక వీలైన ప్రతి ప్రయత్నమూ చేయవలెను. ఈ గురుతర బాధ్యతకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది – ముఖ్యంగా ఈ కాలంలో. ఎందుకంటే ఈనాడు ప్రాపంచిక కోరికల గురించే ప్రజలు ఎక్కువగా పట్టించుకుంటున్నారు, దారి తప్పించే అనేక ఆకర్షణలు మరియు దుర్వ్యసనాలు సుడిగాలి వలే ప్రజలను తమవైపు లాక్కంటున్నాయి. సత్యం వైపు ఆహ్వానించేవారి సంఖ్య రాను రానూ తగ్గిపోతుండగా, నాస్తికత్వం మరియు మతాతీతం (సెక్యులరిజం) వంటి తప్పుడు దార్ల వైపు పిలిచే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగి పోతున్నది. అల్లాహ్ యే సంరక్షకుడు. అల్లాహ్ ను మించిన అధికారం మరియు శక్తి ఇంకెవ్వరి దగ్గరా లేదు. ఆయన మహోన్నతుడు, అత్యంత శక్తిమంతుడు.
హజ్ యాత్రికుడు మక్కహ్ లో ఉన్నంత కాలం స్థిరంగా అల్లాహ్ ను స్మరించుకుంటూ, ఆయనకు విధేయత చూపుతూ, మంచి పనులు చేస్తూ కాలం గడపవలెను.
నిర్ణీత సమయాలలో మస్జిదె హరాంలో జమాతుతో నమాజులు చేయవలెను. వీలయినన్ని ఎక్కువ సార్లు కఅబహ్ గృహ తవాఫ్ చేయవలెను. పవిత్ర సరిహద్దులలో చేసే ప్రతి మంచి పనీ అనేక రెట్ల పుణ్యాలను సంపాదించి పెడ్తుంది. అలాగే పవిత్ర సరిహద్దులలో చేసే ప్రతి పాపకార్యం, చెడు పనీ అనేక రెట్ల కఠిన శిక్షకు గురి చేస్తుంది. హజ్ యాత్రికుడు వీలయినంత ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పంపుతూ ఉండవలెను.
వీడ్కోలు తవాఫ్ అందరిపై తప్పనిసరి – బహిష్టులో ఉన్న లేదా పురుటి రక్తస్రావంతో ఉన్న స్త్రీలపై తప్ప:
మక్కహ్ వదిలి వెళ్ళాలని నిశ్చయించుకున్న తర్వాత, హజ్ యాత్రికులు విధిగా వీడ్కోలు తవాఫ్ చేయాలి. దీని వలన వారు తమ చివరి ఘడియలను కఅబహ్ గృహం వద్ద గడపవచ్చు. అయితే బహిష్టులో ఉన్న స్త్రీలు మరియు పురుటి రక్తస్రావంతో ఉన్న స్త్రీలకు ఈ వీడ్కోలు తవాఫ్ నుండి మినహాయింపు ఉంది. అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన ఈ హదీథును బట్టి, వారి కొరకు ఈ తవాఫ్ తప్పని సరి కాదు: “తమ చివరి ఘడియలను కఅబహ్ గృహం వద్ద గడపమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను ఆదేశించారు. అయితే రక్తస్రావంతో ఉన్న మహిళలకు ఆయన దీని నుండి మినహాయింపు ఇచ్చారు. మస్జిదె హరాంను వదులుతూ, కఅబహ్ గృహానికి వీడ్కోలు చెప్పిన తర్వాత, అతను తిన్నగా మక్కహ్ నుండి బయటికి వెళ్ళిపోవలెను. మరలా వెనక్కు వెళ్ళరాదు. అలా చేయటం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులో మరియు సహాబాల పద్ధతిలో లేదు. అది ఒక మతభ్రష్టత మాత్రమే.
దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు,
( مَنْ عَـمِـلَ عَمَلاً لَـيْـسَ عَـلَـيْـهِ أَمْرُنَا فَـهُـوَ رَدٌّ )
మన్ అమిల అమలన్ లైస అలైహి అమ్రునా ఫహువ రద్దున్
ఎవరైనా మా విధానానికి (షరిఅహ్ కు) బయట ఏదైనా చేస్తే, అది తిరస్కరించబడుతుంది.”
ఆయనింకా ఇలా అన్నారు,
( إِيَّاكُمْ وَ مُـحْدَثَاتِ الْأُمُـوْرِ، فَـإِنَّ كُـلَّ مُـحْدَثَـةٍ بِـدْعَـةٍ ، وَ كُـلَّ بِدْعَـةٍ ضَلاَلَـةٌ )
ఇయ్యాకుం వ ముహ్దథాతిల్ ఉమూరి ఫఇన్న కుల్ల ముహ్దథతిన్ బిద్అతిన్ వ కుల్ల బిద్అతిన్ దలాలతున్
ధర్మంలో నూతన కల్పితాలు కల్పించడం మానుకోవలెను. ప్రతి నూతన కల్పితమొక మతభ్రష్టత్వం మరియు ప్రతి మతభ్రష్టత్వం తప్పుడు దారి వైపు తీసుకువెళ్తుంది.
నిలకడగా ఆయన ధర్మాన్ని అనుసరించేలా అల్లాహ్ మనకు సహాయపడుగాక. ఆయనను వ్యతిరేకించడం నుండి మమ్ముల్ని కాపాడుగాక. నిశ్చయంగా ఆయన చాలా ఉదారవంతుడు మరియు మహోన్నతుడూను.
ఏడవ అధ్యాయం:
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మస్జిదు సందర్శనం
హజ్ ప్రారంభం గాకముందు లేదా హజ్ పూర్తయిన తర్వాత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మస్జిదును సందర్శించడం సున్నతు. బుఖారీ మరియు ముస్లిం హదీథు గ్రంథాలలో నమోదు చేయబడిన అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు:
صَلاَةٌ فـِي مَسْجِـدِي هَذَا خَيْـرٌ مِنْ أَلـْفِ صَلاَةٍ فِـيْمـاَ سِـوَاهُ إِلاَّ الـْمَسْجِـدَ الْـحَرَامَ
సలాతున్ ఫీ మస్జిదీ హదా ఖైరున్ మిన్ అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు ఇల్లల్ మస్జిదల్ హరామ
మస్జిదె హరమ్ (కఅబహ్) లో తప్ప, ఇతర మస్జిదులలో చేసే ఒక నమాజు కంటే నా మస్జిదులో చేసే ఒక నమాజు వెయ్యి రెట్లు ఉత్తమమైనది.
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు:
صَلاَةٌ فِـي مَسْجِدِي هَذَا أَفْضَلُ مِنْ أَلْفِ صَلاَةٍ فِـيْمـاَ سِوَاهُ إِلاَّ الْـمَسْجِدَ الْـحَرَامَ
సలాతున్ ఫీ మస్జిదీ హదా అఫ్జలు మిన్ అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు ఇల్లల్ మస్జిదిల్ హరామ
నా ఈ మస్జిదులో నమాజు చేయడమనేది, మస్జిదె హరమ్ లో తప్ప, ఇతర మస్జిదులలో నమాజు చేయడం కంటే వెయ్యి రెట్లు ఉత్తమమైనది. (ముస్లిం హదీథు గ్రంథం)
అబ్దుల్లాహు బిన్ జుబైర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:
صَلاَةٌ فِـي مَسْجِـدِي هَذَا أَفْـضَلُ مِنْ أَلْـفِ صَلاَةٍ فِـيْمـاَ سِوَاهُ إِلاَّ الْـمَسْجِـدِ الْـحَـرَامَ، وَصَلاَةٌ فِـي الْـمَسْجِـدِ الْـحَـرَامِ أَفْـضَلُ مِنْ مِائَـةٍ صَلاَةٍ فِـي مَسْجِـدِي هَـذَا
సలాతున్ ఫీ మస్జిదీ హదా అఫ్జలు మిన్ అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు ఇల్లల్ మస్జిదిల్ హరామ వ సలాతున్ ఫిల్ మస్జిదిల్ హరామి అఫ్జలు మిన్ మిఅతిన్ సలాతిన్ ఫీ మస్జిదీహదా
నా మస్జిదులో నమాజు చేయడమనేది, మస్జిదె హరమ్ లో తప్ప ఇతర మస్జిదులలో చేసే నమాజు కంటే వెయ్యి రెట్లు ఉత్తమమైనది. మరియు మస్జిదె హరమ్ చేసే నమాజు నా మస్జిదులో చేసే నమాజు కంటే వంద రెట్లు ఉత్తమమైనది.
జాబిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:
صَلاَةٌ فِـي مَسْجِدِي هَذَا أَفْضَلُ مِنْ أَلْفِ صَلاَةٍ فِـيْمـاَ سِوَاهُ إِلاَّ الْـمَسْجِدَ الْـحَرَامَ، وَصَلاَةٌ فِـي الْـمَسْجِدِ الْـحَرَامِ أَفْضَلُ مِنْ مِائَةِ أَلْفِ صَلاَةٍ فِـيْمـاَ سِوَاهُ
సలాతున్ ఫీ మస్జిదీ హదా అఫ్జలు మిన్ అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు ఇల్లల్ మస్జిదల్ హరామ వ సలాతున్ ఫిల్ మస్జిదిల్ హరామి అఫ్జలు మిన్ మిఅతి అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు
నా మస్జిదులో నమాజు చేయడమనేది, మస్జిదె హరమ్ లో తప్ప ఇతర మస్జిదులలో చేసే నమాజు కంటే వెయ్యి రెట్లు ఉత్తమమైనది. మరియు మస్జిదె హరమ్ చేసే నమాజు ఇతర మస్జిదులలో చేసే నమాజు కంటే లక్ష రెట్లు ఉత్తమమైనది. (అహ్మద్ &ఇబ్నె మాజహ్)
దీని గురించి అనేక హదీథులు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదును సందర్శించే యాత్రికులు ముందుగా తమ కుడికాలు మస్జిదుల లోపల పెట్టి, ఈ దుఆ చేసుకుంటూ మస్జిదులోనికి ప్రవేశించాలి:
بِسْمِ اللهِ وَالصَّلاَةُ وَالسَّلاَمُ عَلَى رَسُولِ اللهِ، أَعُوْذُ بِاللهِ الْعَظِيْمِ وَبِوَجْهِهِ الْكَرِيْمِ وَسُلْطَانِهِ الْقَدِيْمِ مِنْ الشَّيْطاَنِ الرَّجِيْمِ، اَللَّهُمَّ افْتَحْ لـِي أَبْوَابَ رَحْمَتِكَ
బిస్మిల్లాహి, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి, అఊదు బిల్లాహిల్ అజీమి వబి వజ్హిహిల్ కరీమి, వ సుల్తానిహిల్ ఖదీమి, మినష్షయితా నిర్రజీమి, అల్లాహుమ్మఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక.
అల్లాహ్ పేరుతో, అల్లాహ్ యొక్క ప్రవక్త పై శాంతి మరియు దీవెనలు కురుయుగాక. నన్ను షైతాను బారి నుండి కాపాడమని, అత్యంత పవిత్రమైన ముఖం, అత్యంత పురాతనమైన పరిపాలన మరియు అధికారం కలిగి ఉన్న అల్లాహ్ యొక్క శరణు కోరుకుంటున్నాను. ఓ అల్లాహ్! నీ కరుణాకటాక్షాల ద్వారాలు నా కొరకు తెరుచు.
ఇతర మస్జిదులలో ప్రవేశించేటపుడు దుఆ చేసే విధంగానే ఇక్కడ కూడా దుఆ చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహ అలైహి వసల్లం మస్జిదులో ప్రవేశించేటపుడు చేయవలసిన ప్రత్యేక దుఆ ఏమీ లేదు. మస్జిదులో ప్రవేశించిన తర్వాత, రెండు రకాతుల తహయ్యతుల్ మస్జిదు నమాజు చేయాలి. ఇహపరలోకాలలో మేలైన విషయాలు ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకోవలెను. ఒకవేళ ఈ రెండు రకాతుల నమాజును మస్జిదులోని రౌధతుల్ జన్నహ్ (స్వర్గవనం) అనే ప్రాంతంలో చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం ఇలా తెలిపారు:
مَا بَـيـْنَ بَـيـْتِـي وَمِـنْـبَـرِي رَوْضَـةٌ مِـنْ رِيَـاضِ الْـجَـنَّـةِ
మా బైన బైతీ వ మిన్బరీ రౌదతున్ మిన్ రియాదిల్ జన్నతి
నా ఇంటికీ మరియు నా ప్రసంగ స్థానానికీ మధ్య స్వర్గంలోని ఒక ఉద్యానవనం ఉంది.
నమాజు చేసిన తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహ వసల్లం కు మరియు ఆయన యొక్క ఇద్దరు సహచరులు అబూ బకర్ రదియల్లాహు అన్హు మరియు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హులకు సలాము చేయవలెను. గౌరవ పూర్వకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి వైపు తిరిగి నిలబడి, తక్కువ స్వరంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇలా అభివాదం చేయవలెను.
أَلسَّلاَمُ عَلَيـْكَ يَا رَسُولُ اللهِ وَرَحْـمَـةُ اللهِ وَبَـرَكَاتَـهُ
అస్సలము అలైక యా రసూలుల్లాహ్, వ రహ్మతుల్లాహి వ బరకాతహు
ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! మీ పై శాంతి కురుయుగాక, మరియు అల్లాహ్ యొక్క దయాదాక్షిణ్యాలు మరియు శుభాశీస్సులూను.
అబూ దావూద్ హదీథు గ్రంథంలో నమోదు చేయబడిన ఒక హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలుకులను అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు:
مَا مِنْ أَحَدٍ يُسَلِّمُ عَلَـيَّ إِلاَّ رَدَّ اللهُ عَلَـَّي رُوْحِـي حَـتَّـى أَرُدَّ عَـلَيْـهِ السَّلاَمَ
మామిన్ అహదిన్ యుసల్లిము అలయ్య ఇల్లా రద్దల్లాహు అలయ్య రూహీ హత్త అరుద్ద అలైహి స్సలామ
ఎవరైనా నా పై సలాములు పంపినపుడు, అతని సలాముకు జవాబిచ్చేవరకు అల్లాహ్ నా ఆత్మను నా శరీరంలోనికి పంపుతాడు.
తన సలాములో ఎవరైనా క్రింది పదాలను పలికితే ఎలాంటి దోషమూ లేదు:
أَلسَّلاَمُ عَلَيْكَ يَا نَبِيَ الله، أَلسَّلاَمُ عَلَيْكَ يَا خِيْـرَةَ اللهِ مِنْ خَلْـقِـهِ، أَلسَّلاَمُ عَلَيـْكَ يَا سَيِّـدَ الْـمُرْسَلِيْـنْ وَإِمَامَ الْـمُتَّـقِيْنْ، أَشْهَدُ أَنَّـكَ قَدْ بَلَّغْتِ الرَّسَالَـةَ وَأَدَّيْتَ الْأَمَانَـةَ، وَنَـصَحَتَ الْأُمَّـةَ، وَجَاهَدْتَ فِي اللهِ حَقَّ جِهَادِهِ
అస్సలాము అలైక యా నబీయల్లాహ్, అస్సలాము అలైక యా ఖీరతల్లాహి మిన్ ఖల్ఖిహి , అస్సలాము అలైక యా సయ్యదల్ ముర్సలీన్ వ ఇమామల్ ముత్తఖీన్, అష్హదు అన్నక ఖద్ బలగతిర్రసాలత, వ అద్దయితల్ అమానత, వ నసహతల్ ఉమ్మత, వ జాహదత ఫీ అల్లాహి హఖ్ఖ జిహాదిహి.
మీ పై శాంతి కురుయుగాక, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! మీ పై శాంతి కురుయుగాక,
ఓ అల్లాహ్ యొక్క సృష్టిలోని ఉత్తముడా! నీపై శాంతి కురుయుగాక,
ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తల మరియు సజ్జనుల నాయకుడా! మీరు మీ సందేశాన్ని అందజేసారని, మీకు అప్పజెప్పబడిన బాధ్యతను పూర్తిగా నెరవేర్చారని, సమాజానికి మార్గదర్శకత్వం వహించారని, అల్లాహ్ మార్గంలో పూర్తిగా ప్రయాస పడినారని మరియు శ్రమించారని నేను సాక్ష్యమిస్తున్నాను.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవర్తనలో, నడతలో ఈ ఉత్తమ గుణగణాలన్నీ ఉండినాయి. ప్రతి ఒక్కరూ ఆయనపై దీవెనలు పంపటాన్ని, ఆయన కొరకు దుఆ చేయటాన్ని షరిఅహ్ పూర్తిగా సమర్ధించింది. అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఇలా ఉంది:
يَا أَ يُّـهَا الَّذِيـْنَ آمَـنـُوا صَلُّوا عَلَيْـهِ وَسَلِّـمُـوا تَـسْلِـيـمـًا
యా అయ్యుహలాదీన ఆమనూ సల్లూ అలైహి వసల్లిమూ తస్లీమన్
ఓ విశ్వాసులారా! ఆయనపై దీవెనలు పంపండి మరియు ఆయనపై ఇస్లామీయ పద్ధతిలో సలాములు పంపండి. 33:56
ఆ తర్వాత అబూ బకర్ రదియల్లాహు అన్హు మరియు ఉమర్ రదియల్లాహు అన్హులపై సలాములు పంపి, అక్కడి నుండి ముందుకు కదల వలెను.
لَعَـنَ رَسُولُ اللهِ صَلَّى الله عَلَيْـهِ وَ سَلَّمَ زُوَّارَاتِ الْـقُـبُـوْرِ مِنَ النِّساَءِ، وَالْـمُـتَّـخِـذِيْـنَ عَلَيْـهاَ الْـمسَاجِدَ وَالسُّرُجَ
లఅన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వ సల్లమ జువ్వరాతిల్ ఖుబూరి మిన్నన్నిసాయి వల్ ముత్తఖిదీన అలైహాల్ మసాజిద వస్సురుజ
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని సందర్శించే అనుమతిని షరిఅహ్ పురుషులకు మాత్రమే ఇచ్చింది. సమాధుల సందర్శించే అనుమతి మహిళలకు ఇవ్వబడలేదు. అలా షరిఅహ్ కు వ్యతిరేకంగా తమ ఇష్టానుసారం సమాధులను సందర్శించే మహిళలను, సమాధులపై మస్జిదులు నిర్మించేవారిని మరియు అక్కడ దీపాలు వెలిగించేవారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శపించి ఉన్నారు.
ఒకవేళ ఎవరైనా మస్జిదె నబవీ లోపల నమాజు చేయాలని, దుఆలు చేయాలనే సంకల్పంతో మదీనా సందర్శిస్తే, షరిఅహ్ సమర్ధించి ఉండటం వలన అలా చేయడం పూర్తిగా సరైనదే. పై హదీథులో కూడా మేము దీనిని గుర్తించాము. సందర్శకుడు ఐదు పూటలా మస్జిదె నబవీలోనే నమాజులు చేయవలెను మరియు వీలయినంత ఎక్కువగా అల్లాహ్ ను స్మరించవలెను, దుఆలు చేయవలెను మరియు నఫిల్ నమాజులు చేయవలెను. ఈ క్రింది హదీథును మేము ఇంతకు ముందు ఉదహరించి ఉన్నాము,
مَا بَـيـْنَ بَـيـْتِـي وَمِـنْـبَـرِي رَوْضَـةٌ مِـنْ رِيَـاضِ الْـجَـنَّـةِ
మా బైన బైతీ వ మిన్బరీ రౌదతున్ మిన్ రియాదిల్ జన్నతి
నా ఇంటికీ మరియు నా ప్రసంగ స్థానానికీ మధ్య స్వర్గంలోని ఒక ఉద్యానవనం ఉంది.
తప్పనిసరి ఐదు ఫర్ద్ చేసేటపుడు, మీరు వీలయినంత వరకు ముందు వరుసలో నిలబడటానికి ప్రయత్నించవలెను, ముందు పంక్తిని పొడిగింపులో మీకు చోటు దొరికినా దానిని వదలకూడదు. ముందు వరుసలో నమాజు చేయటం గురించి క్రింది ప్రామాణిక హదీథు సూచిస్తున్నది.
لَوْ يَعْلَمُ النَّاسَ مَا فِـي النِّدَاءِ وَالصَّفِّ الْأَوَّلِ ثُمَّ لَـمْ يَـجِدُوْا إِلاَّ أَنْ يَسْتَـهِمُـوْا عَلَيْهِ لاَسْتَهَمُوْا عَلَيْـهِ
లౌ యఅలమున్నాస మాఫీ న్నిదాయి వ సఫ్ఫిల్ అవ్వలి థుమ్మ లమ్ యజిదూ ఇల్లా అన్ యస్తహిమూ అలైహి అస్తహమూ అలైహి
ఒకవేళ అదాన్ పిలుపునివ్వడంలో మరియు ముందు వరుసలో నిలబడి నమాజు చేయడంలో ఉన్న పుణ్యాల గురించి తెలిసి ఉండి, వారికి గనక వాటిలో స్థానం లభించకపోతే, వాటిని పొందుట కొరకు ప్రజలు లాటరీ వేయవలసి వచ్చినా, తప్పకుండా వారు లాటరీ వేస్తారు.
మరో హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు:
تَـقَـدِّمُـوْا فَأْتَـمُّـوا بـِي وَلْـيَـأْتَـمَّ بِكـُمْ مَنْ بَعْدَكُمْ، وَلاَ يَزَالُ الرَّجُلَ يَـتَـأَخَّـرُّ عَنِ الصَّلاَةِ حَتَّى يُـؤَخِّـرَهُ الله
తఖద్దిమూ ఫఅతమ్మూబీ వల్ యఅతమ్మ బికుమ్ మన్ బఅదకుమ్ వలా యజాలుర్రజుల యతఅఖ్ఖర్రు అనిస్సలాతి హత్త యుఅఖ్ఖిరహుల్లాహ్
ముందుకు కదలండి మరియు నన్ను అనుసరించండి. మరియు ఎవరైతే మీ వెనుక ఉన్నారో, వారు మిమ్ముల్ని అనుసరించాలి. అల్లాహ్ అతనిని వెనుక వదిలి వేయునంత వరకు ఆ వ్యక్తి నమాజును అందుకోవటంలో వెనుకబడి ఉంటాడు. ముస్లిం హదీథు గ్రంథం.
అబూ దావూద్ హదీథు గ్రంథంలో నమోదు చేయబడిన ఆయెషా రదియల్లాహు అన్హా ఉల్లేఖనలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:
لاَ يَزَالُ الرَّجُلُ يَتَأَخَّرْ عَنِ الصَّفِّ الْـمُقَدِّمِ حَتـَّى يُؤَخِّرَهُ اللهََ فِي النَّارِ
లా యజాలుర్రజులు యతఅఖ్ఖర్ అనిస్సఫ్ఫిల్ ముఖద్దమి హత్త యుఅఖ్ఖిరహుల్లాహ ఫిన్నారి
అల్లాహ్ ఆ వ్యక్తిని నరకానికి పంపే వరకు, (ఫర్ద్ నమాజులో) ముందు వరుస అందుకోవటంలో అతను వెనుకబడే ఉంటాడు.
ఒక ప్రామాణిక హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు ఇలా బోధించారు:
أَلاَ تَصُفُّوْنَ كَمـَا تَـصُفُّ الْـمَلَائِكَـةُ عِـنْدَ رَبِّـهَا قَالُوْا يَا رَسُولُ الله وَكَـيْفَ تَـصُفُّ الْـمَلاَئِكَـةُ عِـنْـدَ رَبِّـهاَ؟ قَالَ يُـتِـمُّوْنَ الصُّفُوْفَ الْأَوَّلَ وَيَـتَـرَاصُّوْنَ فِـي الصَّفِّ
అలా తసుఫ్ఫూన కమా తసుఫ్ఫుల్ మలాయికతు ఇంద రబ్బిహా ఖాలూ యా రసూలుల్లాహ్ వ కైఫ తసుఫ్ఫుల్ మలాయికతు ఇంద రబ్బిహా ఖాల యుతిమ్మూనస్సుఫూఫల్ అవ్వల వ యతరస్సూన ఫీస్సఫ్ఫి
తమ ప్రభువు ఎదురుగా దైవదూతలు పంక్తులలో నిలబడినట్లు, మీరు ఎందుకని పంక్తులలో నిలబడరు. దైవదూతలు ఎలాంటి పంక్తులను ఏర్పరుచుకున్నారని సహచరులు ప్రశ్నించగా, ఆయనిలా జవాబిచ్చారు: వారు ముందుగా మొదటి పంక్తిని పూర్తి చేసారు మరియు పంక్తులలో వారు ఒకరిని ఆనుకొను మరొకరు నిలబడినారు. ముస్లిం హదీథు గ్రంథం.
మస్జిదె నబవీ మరియు ఇతర మస్జిదులకు వెళ్ళడం గురించి మామూలుగా అనేక హదీథులు ఉన్నాయి. కుడివైపు పంక్తిలో నిలబడిమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి ఒక్కరికీ చెప్పేవారు. అప్పటి మస్జిదె నబవీలోని కుడి వైపు పంక్తి, రౌధతుల్ జన్నహ్ ప్రాంతానికి బయట ఉండేదనే విషయం అందరికీ తెలిసినదే. కాబట్టి సామూహిక నమాజును ముందు వరుసలో, పంక్తి యొక్క కుడివైపున నిలబడి చేయటమనేది రౌధతుల్ జన్నహ్ ప్రాంతంలో నిలబడి నమాజు చేయడం కంటే ఉత్తమమైనదనే ఇక్కడ ముఖ్యంగా గ్రహించదగినది. ఎవరైనా ఇలాంటి ఇతర హదీథులను కూడా పరిశీలిస్తే, పై విషయాన్ని సులభంగా తెలుసుకుంటారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి యొక్క గ్రిల్ ను స్పర్శించడం లేదా ముద్దాడటం లేదా దాని చుట్టూ తవాఫ్ చేయడం లాంటివి అనుమతించబడలేదు. ఇలాంటి ఆచారం గురించి ముందు తరం సజ్జనులలో నుండి ఎవ్వరూ తెలుపలేదు. ఇలా చేయడమనేది ఒక హీనమైన కల్పితాచారం. తమ అవసరాలు పూర్తి చేయమని లేదా తమ కష్టాలు తొలగించమని లేదా తమ అనారోగ్యాన్ని నయం చేయమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఎవరైనా వేడుకోవడమనేది ధర్మబద్ధం కాదు. అయితే వీటన్నింటి కోసం తప్పనిసరిగా వారు కేవలం అల్లాహ్ ను మాత్రమే వేడుకోవలసి ఉంది. మృతులను వేడుకోవడమనేది అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించడం మరియు ఇతరులను ఆరాధించడమే అవుతుంది. ఈ క్రింది రెండు ముఖ్య అంశాలపై ఇస్లాం ఆధారపడి ఉంది:
- అల్లాహ్ ఏకైకుడు, ఆయనకెవ్వరూ భాగస్వాములు లేరు మరియు ఆయనకెవ్వరూ సాటి లేరు. కేవలం ఆయన మాత్రమే ఆరాధింపబడాలి.
- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతిని అనుసరించి ఆరాధనలు జరగాలి.
ఇస్లామీయ ధర్మం యొక్క క్రింది మూలవచనపు అసలు అర్థం ఇదే.
شَهَادَةً أَنْ لاَّ إِلَهَ إِلاَّ اللهِ وَأَنَّ مُـحَمَّداً رَسُوْلُ الله
షహాతన్ అల్లా ఇలాహ ఇల్లల్లాహి వ అన్న ముహమ్మదన్ రసూలుల్లాహ్
ఆరాధింపబడే వారెవ్వరూ లేరు – ఒక్క అల్లాహ్ తప్ప అని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్, అల్లాహ్ యొక్క సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను.
అలాగే, అల్లాహ్ వద్ద సిఫారసు చేయమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంనే నేరుగా వేడుకోవడమనేది ఇస్లాంలో అనుమతింపబడలేదు. ఎందుకంటే ప్రార్థింపబడే హక్కు కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందుతుంది. ఖుర్ఆన్ లో అల్లాహ్ ప్రకటన ఇలా ఉంది.
قُـلْ ِلِله الشَّـفَـاعَـةُ جَـمِـيـعًا
ఖుల్ లిల్లాహిష్షఫాఅతు జమీఅన్
(ఓ ప్రవక్తా) చెప్పు, సిఫారసులన్నీ అల్లాహ్ కే చెందుతాయి. 39:44
అయితే, క్రింది విధంగా వేడుకోవచ్చు.
أَللَّهُمَّ شَفَّعِ فِـي نَـبِـيُّكَ، أَللَّهُمَّ شَفَّعِ فِـي مَلاَئِكَـتِـكَ وَعِبَادِكَ الْـمُؤمِـنِـيْـنَ، أَللَّهُمَّ شَفَّعِ فِـي أَفَرَاطِـي
అల్లాహుమ్మ షఫ్ఫఇ ఫీ నబియ్యుక, అల్లాహుమ్మ షఫ్ఫఇ ఫీ మలాయికతిక, వ ఇబాదతికల్ మోమినీన. అల్లాహుమ్మ షఫ్ఫఇ ఫీ అఫరాతీ.
ఓ అల్లాహ్! నీ ప్రవక్త నా కొరకు సిఫారసు చేసేలా చేయి. ఓ అల్లాహ్! నీ దైవదూతలు మరియు నిన్ను విశ్వసించినవారు నా కొరకు సిఫారసు చేసేలా చేయి. ఓ అల్లాహ్! చనిపోయిన నా సంతానం నా కొరకు సిఫారసు చేసేలా చేయి.
అయితే, మృతులను సిఫారసు చేయుట కొరకు లేదా వారినే నేరుగా వేడుకోకూడదు – వారు అల్లాహ్ యొక్క సందేశహరులైనా, ప్రవక్తలైనా లేదా పుణ్యపురుషులైన అవులియాలైనా సరే. ఇలా చేయటానికి షరిఅహ్ అనుమతి లేదు. మృతుని గురించిన వాస్తవం ఏమిటంటే, షరిఅహ్ లో మినహాయించబడిన ఆచరణులు తప్ప, అతని ఇతర ఆచరణలన్నీ సమాప్తమై పోతాయి. సహీహ్ ముస్లింలో నమోదు చేయబడిన అబూ హురైరహ్ రదియల్లాహు ఉల్లేఖన:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు,
إِذَا مَاتَ ابْنَ آدَمَ أَنْقَطَعَ عَمَلَهُ إِلاَّ مِنْ ثَلاَثٍ: صَدْقَةٍ جَارِيَـةٍ، أَوْ عِلْمٍ يُـنـْتَـفَـعُ بِـهِ، أَوْ وَلَـدٍ صَالِـحٍ يَـدْعُـوْ لَـهُ
ఇదా మాతబ్న ఆదమ అంఖతఅ అమలహు ఇల్లా మిన్ థలాతిన్ సదఖతిన్ జారియతిన్ అవ్ ఇల్మిన్ యుంతఫఉ బిహి అవ్ వలదిన్ సాలిహిన్ యద్ఊ లహు
ఎపుడైతే ఆదం సంతానంలో ఎవరైనా చనిపోతారో, ఈ మూడు తప్ప అతని ఇతర ఆచరణలు సమాప్తమైపోతాయి: నిరంతరాయంగా కొనసాగుతున్న అతని దానం, ఇతరులకు ప్రయోజనం కలిగిస్తున్న అతని జ్ఞానం, దైవభీతిపరులైన సంతానం చేసే అతని కొరకు చేసే దుఆలు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత కాలంలో తన కొరకు అల్లాహ్ ను ప్రార్థించమని ఆయనను వేడుకోవడం అన్ని విధాలా సరైన మంచి పనే. అలాగే అంతిమ దినాన కూడా ఆయనను నేరుగా వేడుకోవడం సరైన పనే, ఎందుకంటే ఆనాడు సిఫారసు చేయడానికి ఆయనకు అనుమతి ఇవ్వబడుతుంది. ఆనాడు తనను సిఫారసు చేయమని అడిగిన వారి కొరకు ఆయన అల్లాహ్ ను ప్రార్థించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రపంచంలో మరణించిన తర్వాత ఆయనకు ఆ శక్తి లేదు. ఇది కేవలం ఆయన కొరకు మాత్రమే ప్రత్యేకం కాదు. మీతో పాటు సర్వసామాన్యంగా ప్రతి ఒక్కరికిది వర్తిస్తుంది. ప్రాణంతో ఉన్న తన తోటి సోదరులతో తన కొరకు అల్లాహ్ వద్ద సిఫారసు చేయమని అంటే అల్లాహ్ ను ప్రార్థించమని అడగటం ధర్మసమ్మతమైనదే. తీర్పుదినం నాడు ఎవ్వరూ అల్లాహ్ అనుమతి లేకుండా సిఫారసు చేయలేరు. దీని గురించి అల్లాహ్ యొక్క స్పష్టమైన ప్రకటన ఇలా ఉంది.
مَـنْ ذَا الَّـذِي يَـشْـفَـعُ عِـنْـدَهُ إِلاَّ بِـإِذْنِـهِ
మందల్లదీ యష్ఫఉ ఇందహు ఇల్లా బిఇద్నిహి
ఆయన అనుమతి లేకుండా ఆయన వద్ద సిఫారసు చేయగలిగేది ఎవరు?
ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్థితి గురించి మనం ఒక వాస్తవాన్ని గుర్తించాలి. ఆయన యొక్క ప్రస్తుత స్థితి ఒక ప్రత్యేకమైన స్థితి. అది ఈ ప్రపంచంలో ఆయన సజీవంగా ఉన్నప్పటి స్థితికి మరియు అంతిమ దినం నాటి స్థితికి భిన్నమైనది. చనిపోయిన వ్యక్తి ఏ పనీ చేయలేడు. ఈ ప్రపంచంలో జీవించి ఉన్నపుడు అతను చేసిన పనులే అతనికి ప్రతిఫలాన్ని అందజేస్తాయి – షరిఅహ్ లో మినహాయించబడిన ప్రత్యేక పనులు తప్ప. మృతులను వేడుకోవడమనేది షరిఅహ్ మినహాయించిన పనులలో లేదు. కాబట్టి దానిని ఈ ప్రత్యేక తరగతికి చెందిన పనిగా పరిగణించలేము. నిస్సందేహంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన బరజఖ్ జీవితంలో సజీవంగా ఉన్నారు. ఆయన ఉన్న స్థితి ఒక షహీద్ యొక్క మరణానంతర స్థితి కంటే ఎంతో ఘనమైనది. అయితే ఇది చనిపోయే ముందు జీవించే ఈ ప్రాపంచిక జీవితం కంటే మరియు తీర్పుదినం తర్వాత రాబోయే జీవితం కంటే భిన్నమైనది. బరజఖ్ అంటే సమాధి జీవితం యొక్క స్వభావం అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ తెలియదు. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు,
مَا مِنْ أَحَدٍ يُسَلِّمُ عَلَـيَّ إِلاَّ رَدَّ اللهُ عَلَـَّي رُوْحِـي حَـتَّـى أَرُدَّ عَـلَيْـهِ السَّلاَمَ
మా మిన్ అహదిన్ యుసల్లిమూ అలయ్య ఇల్లా రద్దల్లాహు అలయ్య రూహీ హత్త అరుద్దఅలైహిస్సల్లామ
ఎవరైనా నా పై సలాములు పంపినపుడు, అతని సలాముకు బదులిచ్చే వరకు అల్లాహ్ నా శరీరంలోనికి నా ఆత్మను పునః ప్రవేశింపజేస్తాడు.
పై హదీథు ఆధారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయారని, ఆయన ఆత్మ ఆయన శరీరం నుండి విడిగా ఉంటుంది మరియు సలాము చేయబడినపుడు మాత్రమే అది ఆయన శరీరంలోనికి ప్రవేశింపజేయబడుతుందనేది స్పష్టమవుతున్నది. ఆయన మరణం గురించి ఖుర్ఆన్ మరియు సున్నతులలో తెలుపబడిన వాదనలు అందరికీ తెలిసినవే. ఉలేమాల వద్ద ఇది ఎలాంటి అనుమానాలు లేని విషయం. అయితే ఆయన యొక్క బరజఖ్ జీవితానికి మరణమనేది ఆటంకం కాదు. షహీదుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఖుర్ఆన్ లో దీని గురించి ఇలా స్పష్టం చేయబడింది:
وَلا تَـحْسَـبَنَّ الَّـذِيـنَ قُـتِـلُوا فِي سَبِـيـلِ اللهِ أَمْـوَاتًا بَلْ أَحْيَاءٌ عِـنْـدَ رَبِّـهِمْ يُـرْزَقُـونَ
వలా తహ్సబన్నల్లదీన ఖుతిలూ ఫీ సబీలిల్లాహి అంవాతన్ బల్ అహ్యాఉన్ ఇంద రబ్బిహిం యుర్జఖూన
మరియు ఎవరైతే అల్లాహ్ మార్గంలో చంపబడినారో, వారిని ఎప్పుడూ మృతులుగా భావించకండి. వాస్తవానికి వారు సజీవులే. వారికి తమ ప్రభువు వద్ద ఆహారం ఇవ్వబడుతున్నది. 3:169
ఇది షిర్క్ (అల్లాహ్ కు సాటి కల్పించడం) వైపు పిలిచే వారు, అల్లాహ్ ను వదిలి మృతులను ఆరాధించేవారు తికమకపెట్టే ఒక ముఖ్యమైన విషయం కావటం వలన దీనిని మేము వివరంగా చర్చించినాము. షరిఅహ్ కు వ్యతిరేకమైన వాటన్నింటి నుండి అల్లాహ్ మనల్ని కాపాడుగాక.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి వద్ద తమ స్వరం పెంచే వారి చర్యలు మరియు చాలా ఎక్కువ సేపు వరకు అక్కడే నిలిచిపోయే వారి చర్యలు షరిఅహ్ కు విరుద్ధమైనవి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఆయన కంటే హెచ్చు స్వరంతో మాట్లాడవద్దని అల్లాహ్ ప్రజలకు ఆదేశించినాడు. అలాగే తమలో తాము మాట్లాడుకునే విధంగా ఆయనతో హెచ్చు స్వరంలో మాట్లాడకూడదని కూడా అల్లాహ్ ఆజ్ఞాపించినాడు. అంతేగాక, ఆయనతో ప్రజలు తక్కువ స్వరంలో మాట్లాడాలని ఆదేశించబడింది. ఖుర్ఆన్ లోని అల్లాహ్ ఆదేశం ఇలా ఉంది:
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ أَنْ تَحْبَطَ أَعْمَالُكُمْ وَأَنْتُمْ لا تَشْعُرُونَ * إِنَّ الَّذِينَ يَغُضُّونَ أَصْوَاتَهُمْ عِنْدَ رَسُولِ اللَّهِ أُولَئِكَ الَّذِينَ امْتَحَنَ اللَّهُ قُلُوبَهُمْ لِلتَّقْوَى لَهُمْ مَغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ
యాఅయ్యుహల్లదీన్ ఆమనూ లా తర్ఫఊ అస్వాతకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి వలా తజ్ హరూ లహు బిల్ఖౌలి కజహ్రి బఅదికుమ్ లిబఅదిన్ అన్ తహ్బత అమాలుకుమ్ వ అంతుమ్ లా తష్ఉరూన ఇన్నల్లదీన యగుద్దూన అస్వాతహుమ్ ఇంద రసూలిల్లాహి ఉలాయికల్లదీన అంతహనల్లాహ ఖులూబహుమ్ లిత్తఖ్వా లహుమ్మగ్ఫిరతున్ వ అజ్రున్ అజీమున్
ఓ విశ్వసించిన ప్రజలారా! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వరం కంటే ఎక్కువగా మీ స్వరాన్ని పెంచి గానీ, మీలో మీరు బిగ్గరగా మాట్లాడుకునేటట్లుగా ఆయనతో బిగ్గరగా గానీ మాట్లాడవద్దు. అలా చేస్తే మీరు గ్రహించకుండానే, మీ ఆచరణలకు ప్రతిఫలం ఏమీ లేకుండా పోతుంది. నిశ్చయంగా, అల్లాహ్ యొక్క ప్రవక్త సమక్షంలో తక్కువ స్వరంతో మాట్లాడే వారి హృదయాలు, అల్లాహ్ యొక్క ధర్మనిష్ఠ పరీక్షలో నిగ్గుతేలుతాయి. అలాంటి వారి కొరకే మన్నింపు మరియు ఘనమైన ప్రతిఫలం ఉంది. 49:2,3.
అంతేగాక, ఆయన సమాధి వద్ద ఎక్కువ సేపు నిలబడటం వలన, రద్దీ మరియు సందడి బాగా పెరిగి పోతుంది. పైగా ఇలా చేయడం పై ఖుర్ఆన్ వచనాలకు విరుద్ధంగా చేసినట్లవుతుంది కూడా. ఒక ముస్లిం కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అత్యంత ఆదరణీయులు. ఆయన సన్నిధిలో షరిఅహ్ కు వ్యతిరేకమైన అలాంటి చర్యలు చేయడమనేది గర్హణీయమైన విషయం. అలాగే, ఆయన సమాధి వద్ద నిలబడినపుడు లేదా సమాధికి ఎదురుగా నిలబడినపుడు రెండు చేతులు పైకెత్తి దుఆలు చేయడమనేది కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల, తాబయీన్ ల మరియు పూర్వం గతించిన పుణ్యపురుషుల ఆచారానికి వ్యతిరేకం. అలా చేయడం ఒక కల్పితాచారం మాత్రమే. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు,
عَلَيْكُمْ بِسُنَّـتِـي وَسُنَّـةِ الْـخُلَفاَءِ الرَّاشِدِيْنَ الْـمَهْدِيِيِّنَ مِنْ بَعَدِي، تَـمَسَّكُوْا بِـهَا وَعَضُّوْا عَلَيْهَا بِالنَّوَاجِذِ، وَإِيَّاكُمْ وَمُـحْدَثَاتِ الْأُمُوْرِ، فَإِنَّ كُلَّ مُـحْدَثَـةٍ بِدْعَـةٌ وَكُلَّ بِدْعَـةٌ ضَلاَلَـةٌ
అలైకుమ్ బిసున్నతీ వ సున్నతిల్ ఖుల్ఫాఇర్రాషిదీనల్మహ్దియ్యిన మిన్ బఅదీ తమస్సకూ బిహా వ అద్దూ అలైహా బిన్నవాజిది వ ఇయ్యాకుమ్ వ ముహ్దథాతిల్ ఉమూరి ఫ ఇన్న కుల్లి ముహ్దథతిన్ బిద్అతున్ వ కుల్ల బిద్అతున్ దలాలతున్
నా మార్గాన్ని గట్టిగా పట్టుకోండి. నా తర్వాత సన్మార్గంలో నడిచే ఖలీఫాల మార్గాన్ని గట్టిగా పట్టుకోండి. దానినే అంటిపెట్టుకుని ఉండండి మరియు మీ దవడ పళ్ళతో గట్టిగా కరిచి పట్టుకోండి. నూతన కల్పితాలకు దూరంగా ఉండండి. కొత్తగా కనిపెట్టబడిన ఏ విషయమైనా నూతన కల్పితమే అవుతుంది మరియు అది మార్గభ్రష్టత్వానికి దారి తీస్తుంది.
ఇంకా ఆయనిలా అన్నారు,
مَنْ أَحْدَثَ فِـي أَمْرِنَا هَذَا مَا لَـيْـسَ مِـنْـهُ فَـهُـوَ رَدٌّ
మన్ అహ్దథ ఫీ అమ్రినా హదా మాలైస మిన్హు ఫహువ రద్దున్
మా విషయంలో లేని విషయాన్ని ఎవరైనా కొత్తగా కల్పిస్తే, అది తిరస్కరించబడుతుంది.
ఒకసారి అలీ బిన్ హుసైన్ జైనుల్ ఆబిదీన్ ఎవరో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి వద్ద నిలబడి ప్రార్థించడాన్ని చూసారు. వెంటనే ఆయన అతడిని ఆపి, దానిని ఆయన తన తండ్రి నుండి నేర్చుకున్నానని, మరియు ఆయన తండ్రి దానిని తాత అయిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా నేర్చుకున్నారని పలికారు,
لاَ تَـتَّـخِذُوْا قَبَرِي عِيْداً وَلاَ بُـيُـوتَـكُمْ قُـبُـوْرًا، وَصَلُّوْا عَلَـيَّ فَإِنَّ تَسْلِيْمَكُمْ يَـبْلُغُـنِـيْ أَيْـنَمـَا كُنْـتُـمْ
లాతత్తఖిదూ ఖబరీ ఇయ్ దన్ వలా బుయూతకుమ్ ఖుబూరన్ వ సల్లూ అలయ్య ఫఇన్న తస్లీమకుమ్ యబ్లుగునీ అయ్ నమా కుంతుమ్
నా సమాధిని సందర్శనా స్థలంగా చేయవద్దు. మీ ఇళ్ళను స్మశాన స్థలంగా మార్చవద్దు (ఇళ్ళలో నమాజు చేయకుండా ఉండవద్దు). మరియు నాపై దరూద్ పంపుతూ ఉండండి. ఎందుకంటే మీరెక్కడ నుండి పంపినా, మీ సలాము నాకు చేరుతుంది.
అలాగే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పంపేటపుడు కొందరు కుడి చేతిని తమ గుండెకు ఎడమవైపు ఉంచుతారు. ఆయనపై సలాము పంపేటపుడు లేదా ఎవరైనా రాజు, నాయకుడికి సలాము చేసేటపుడు ఈ భంగిమలో నిలబడటం ధర్మబద్ధం కాదు. ఎందుకంటే, ఇలా చేయడంలో చూపే వినయం, అణుకువ, నమ్రత మరియు సమర్పణలు కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందుతాయి.
ఈ విషయాన్ని గొప్ప ఉలేమాల ప్రామాణిక అభిప్రాయాల ఆధారంగా హాఫిజ్ ఇబ్నె హజర్ చర్చించారు. దీనిపై దృష్టి కేంద్రీకరించినా వారెవరికైనా ఇది స్పష్టమవుతుంది. అయితే అతను అల్లాహ్ కు అంగీకారమైన ముందుతరం పుణ్యపురుషుల మార్గాన్ని అనుసరించాలనే సంకల్పం ఉన్నవాడై ఉండాలి. పక్షపాతంలో, స్వార్థంతో కూడిన కోరికలలో మరియు గుడ్డిగా అనుకరించడంలో, సజ్జనుల మార్గానికి విరుద్ధంగా పోవడంలో మునిగిపోయిన వారి దుర్గతిని అల్లాహ్ త్వరలోనే నిర్ణయిస్తాడు. అల్లాహ్, మాకూ మరియు వారికీ సన్మార్గం చూపు గాక. ప్రతి దానిపై సత్యానికే ప్రాధాన్యత నిచ్చేటట్లు చేయుగాక. అలాగే దూరంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపు తిరిగి నిలబడి, సలాము కొరకు లేదా దుఆ కొరకు తమ పెదాలను కదిపే వారు కూడా మతభ్రష్ఠుల కోవలోనికే వస్తారు. ధర్మంలో ఇలాంటి నూతన పోకడలు కల్పించడం ఒక విశ్వాసికి తగదు. ఎందుకంటే అలా చేయడానికి అల్లాహ్ అనుమతి నివ్వలేదు. అలా చేయడమనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ప్రేమ చూపడం క్రిందికైతే రాదు గానీ, అల్లాహ్ ఆజ్ఞలను దాటి హద్దు మీరిపోవడం క్రిందికి మాత్రం తప్పక వస్తుంది. ఇలాంటి వాటిని ఖండిస్తూ, తర్వాతి తరాల సంస్కరణ కూడా ముందు తరాల సంస్కరణ మాదిరిగానే జరగాలని ఇమాం మలిక్ అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గాన్ని మరియు సన్మార్గంలో నడిచిన ఖలీఫాల మార్గాన్ని, సహాబాల మార్గాన్ని మరియు తాబయీనుల మార్గాన్ని అనుసరించే ముందు తరాల ప్రజలు తమను తాము సంస్కరించుకున్నారు. తర్వాత తరం ప్రజలకు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతిని అనుసరించటంలోనే ఋజుమార్గం కనబడుతుంది. ఇలా చేయడం ద్వారా మాత్రమే వారి సంస్కరణ సరిగ్గా జరుగుతుంది. తమ సంక్షేమాన్ని పదిలం చేసుకునేందుకు మరియు ఇహపర లోకాలలో సాఫల్యం సాధించేందుకు, అలా చేసే శక్తిని అల్లాహ్ ముస్లింలకు ప్రసాదించుగాక.
మస్జిదె నబవీని సందర్శించడమనేది తప్పనిసరి హజ్ ఆచరణ క్రిందికి రాదు:
హెచ్చరిక: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని సందర్శించడమనేది ఫర్ద్ (తప్పనిసరి) కాదు మరియు హజ్ నియమాలలోనికీ రాదు. ఇది కొందరి ప్రజల అపోహ మాత్రమే. అయితే ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి సమీపానికి లేదా దాని పరిసర ప్రాంతాలకు చేరుకున్నవారు, మస్జిదె నబవీని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని సందర్శించడం ఉత్తమం. అయితే, మదీనహ్ నగరానికి దూరంగా నివసించే ప్రజలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని సందర్శించే సంకల్పంతో ప్రయాణించడం ధర్మబద్ధం కాదు. కానీ, మస్జిదె నబవీని సందర్శించే సంకల్పంతో అలా ప్రయాణించ వచ్చు. మదీనహ్ నగరంలోనికి చేరుకున్న తర్వాత వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని మరియు సహాబాల సమాధులను సందర్శించాలి. సహీహ్ బుఖారీ మరీయు ముస్లిం హదీథు గ్రంథాలు రెండింటిలోనూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినట్లుగా నమోదు చేయబడింది:
لاَ تُـشَـدُّ الرِّحَالُ إِلاَّ إِلَى ثَـلاَ ثَـةِ مَسَاجِـدَ: أَلْـمَسْجِدِ الْـحَـرَامِ، وَمَسْجِـدِي هَـذَا، وَالْـمَسْجِـدِ الْأَ قْـصَى
లాతుషద్దుర్రిహాల ఇల్లా ఇలా థలాథతి మసాజిద అల్ మస్జిదిల్ హరామి వ మస్జిదీ హదా వల్ మస్జిదిల్ అఖ్సా
ఈ మూడు మస్జిదులను సందర్శించడం కొరకు మాత్రమే ఎవరైనా ధార్మిక ప్రయాణం చేయవచ్చు: మస్జిద్ అల్ హరామ్ (కఅబహ్ మస్జిద్), నా మస్జిద్ (మస్జిదె నబవీ) మరియు మస్జిద్ అల్ అఖ్సా.
ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని లేదా ఎవరైనా ఇతరుల సమాధిని సందర్శించుట ధర్మసమ్మతమైనదైతే, తప్పకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సమాజాన్ని అలా చేయమని ఆదేశించి ఉండేవారు. ఎందుకంటే వారి గురించి ఆయన చాలా సద్భావంతో ఉండేవారు, అల్లాహ్ కు ఎక్కువగా భయపడేవారు మరియు అల్లాహ్ గురించి బాగా ఎరిగిన ఉండినారు. తనకివ్వబడిన ప్రవక్త బాధ్యతను ఆయన పూర్తిగా నిర్వహించినారు. సమాజాన్ని ప్రతి మంచితనం వైపు దారి చూపినారు మరియు ప్రతి చెడు నుండి హెచ్చరించినారు. పై మూడింటిని సందర్శించడానికి చేసే ప్రయాణం తప్ప ఇతర మస్జిదులను సందర్శించడానికి చేసే ప్రయాణాన్ని ఆయన నిషేధించినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు,
لاَ تَـتَّـخِذُوا قَبَرِي عِيْداً، وَلاَ بُـيُـوتَـكُمْ قُبُـوراً، وَصَلُّوا عَلَـيَّ فَإِنَّ صَلاَتِـكُمْ تَبْلُغُـنِـي حَيْثُ كُـنْـتُمْ
లాతత్తఖిదూ ఖబరీ ఇయ్ దన్ వలా బుయూతకుమ్ ఖుబూరన్ వ సల్లూ అలయ్య ఫఇన్న సలాతికుమ్ యబ్లుగునీ హైథు కుంతుమ్
నా సమాధిని తిరునాళ్ళ ప్రాంతంగా మార్చవద్దు. మీ ఇళ్ళను స్మశాన స్థలంగా మార్చవద్దు. నా పై దరూద్ పంపండి. మీరెక్కడ నుండి దరూద్ పంపినా, అది నాకు చేర్చబడుతుంది.
ఆయన సమాధిని దర్శించడమనేది షరిఅహ్ ఆచరణయే అని సమర్ధించుకోవడానికి, దానిని యాత్రా స్థలంగా మార్చడం మరియు హద్దు మీరి ఆదరించడం జరగవచ్చని ఆయన భయపడి ఉండవచ్చు. ప్రస్తుత కాలంలో ఆయన భయపడినట్లుగానే అనేక మంది ప్రజలు ఆయన సమాధిని దర్శించడమనేది షరిఅహ్ లోని భాగమేనని నమ్ముతూ, దారి తప్పిపోతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని దర్శించుట షరిఅహ్ లోని భాగమనే తమ అభిప్రాయానికి సమర్ధనగా వారు పేర్కొనే హదీథులు ఉల్లేఖకుల పరంపర విషయంలో బలహీనమైనవే గాక, అవన్నీ కల్పితమైనవి కూడా. ప్రఖ్యాత హదీథు పండితులు దర్ఖుత్నీ, బైహఖీ మరియు హాఫిద్ ఇబ్నె హజర్ మొదలైన వారు ఆ హదీథుల బలహీనత గురించి హెచ్చరించారు. కాబట్టి అలాంటి బలహీనమైన హదీథులను మూడు మస్జిదులను సందర్శించడానికి తప్ప, ఏ సంకల్పంతోనైనా సరే చేసే ఇతర సందర్శన ప్రయాణాలు నిషేధించబడినాయనే ప్రామాణిక హదీథుకు వ్యతిరేకంగా పేర్కొనడమనేది అస్సలు చేయకూడదు. అలాంటి అసత్య హదీథులను గుర్తించి, దారి తప్పిపోకుండా తమను తాము కాపాడుకొనుట కొరకు పాఠకులు వాటిని తెలుసుకొనుట అవసరమని భావిస్తూ, అలాంటి కొన్నింటిని క్రింద పేర్కొంటున్నాము.
ఎవరైతే హజ్ చేస్తారో మరియు నన్ను సందర్శించరో, అలాంటి వారు నా విషయంలో తప్పు చేసారు – అసత్య హదీథు.
నా మరణం తర్వాత ఎవరైతే నన్ను దర్శిస్తారో, వారు నా జీవితంలో నన్ను దర్శించినట్లే – అసత్య హదీథు.
ఎవరైతే నన్ను మరియు నా పూర్వీకులైన ఇబ్రాహీంను ఒకే సంవత్సరంలో దర్శిస్తారో, అల్లాహ్ ప్రమాణంగా వారికి స్వర్గం లభిస్తుందని గ్యారంటీ ఇస్తున్నాను – అసత్య హదీథు
ఎవరైతే నా సమాధిని దర్శిస్తారో, వారి పై నా సిఫారసు తప్పని సరై పోతుంది – అసత్య హదీథు.
అలాంటి హదీథులకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వరకు చేర్చే సరైన జాడ ఉండదు. హాఫిద్ ఇబ్నె హజర్ పరిశోధన ప్రకారం అలాంటి వాటి ఉల్లేఖకుల పరంపర కల్పితమైనది. హాఫిద్ ఉఖైలీ ఇలా పలికారు, “అలాంటి ఏ హదీథు ప్రామాణిక మైనది కాదు”. ఇబ్నె తైమియా అభిప్రాయం ప్రకారం అలాంటి హదీథులు అక్రమంగా కల్పించబడినవే. మీ జ్ఞానం కోసం మరియు సంరక్షణ కోసం కల్పిత హదీథుల గురించి ఇక్కడి వరకు ఇవ్వబడిన సమాచారం సరిపోతుందని భావిస్తున్నాము. ఒకవేళ పై వాటిలో ఏ హదీథైనా ప్రామాణికమైనదై ఉండినట్లయితే, మన కంటే ముందు సహాబాలు దానిని ఆచరించి ఉండేవారే మరియు అలా చేయమని సమాజానికి కూడా దారి చూపి ఉండేవారే. ఎందుకంటే ప్రవక్తల తర్వాత అంతటి ఉత్తములైన ప్రజలు సహాబాలే కదా. మరియు అల్లాహ్ విధించిన హద్దుల గురించి వారు బాగా ఎరిగినవారు. అల్లాహ్ తన దాసులకు ఆదేశించిన షరిఅహ్ గురించి వారికి చాలా బాగా తెలుసు. అల్లాహ్ గురించి మరియు అల్లాహ్ దాసుల గురించి వారు చాలా ఎక్కువ చిత్తశుద్ధి కలిగి ఉండినారు. పై వాటి గురించి వారి నుండి ఎలాంటి వ్యాఖ్యానం లేదు కాబట్టి, ఇవన్నీ అసత్యమైన హదీథులని మనం గ్రహించవచ్చు. ఒకవేళ ఏదైనా హదీథు ప్రామాణికమైనదైతే, దానికి సంబంధించిన షరిఅహ్ నియమం ఆచరణలో ఉండేది. పై హదీథులు అసత్యమైనవి లేదా కల్పితమైనవనే తుది నిర్ణయాన్ని ఇది ధృవీకరిస్తున్నది. అన్నీ ఎరిగిన అల్లాహ్ యే మహోన్నతుడు, లోపాలకు అతీతుడు, ఘనమైన వాడు.
ఖుబాఅ మస్జిదును మరియు జన్నతుల్ బఖీని దర్శించడం ఉత్తమం:
మదీనహ్ దర్శించే ప్రజలు ఖుబా మస్జిదును దర్శించడం మరియు దానిలో నమాజు చేయడం ఉత్తమం. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కోసారి కాలి నడకన, ఒక్కోసారి సవారీపై ఈ మస్జిదును దర్శించేవారు మరియు అందులో రెండు రకాతుల నమాజు చేసేవారు. బుఖారీ మరియు ముస్లిం హదీథు గ్రంథాలు
సహల్ బిన్ హనీఫ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖ: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు,
مَنْ تَـطَهَّـرَ فِـي بَـيْـتِـهِ ثُـمَّ أَتَـى مَسْجِـدَ قُـبَاءَ فَصَلَّى فِـيْـهِ صَلاَةً كَانَ لَـهُ كَـأَجْـرِ عُـمْـرَةٍ
మన్ తతహ్హర ఫీ బైతిహి థుమ్మ ఆతా మస్జిద ఖుబాఅ ఫసల్ల ఫీహి సలాతన్ కాన లహు కఅజ్రి ఉమ్రతిన్
ఎవరైతే ఇంటిలో వుదూ చేసి, తర్వాత ఖుబాఅ మస్జిదుకు వెళ్ళి, అందులో నమాజు చేస్తారో, అలాంటి వారికి ఉమ్రహ్ చేసినంత పుణ్యం లభిస్తుంది. (అహ్మద్, నసాయి, ఇబ్నె మాజా మరియు హాకిమ్)
అలాగే, జన్నతుల్ బఖీ (స్మశానం) దర్శించడం, షహీదుల సమాధులను దర్శించడం మరియు హంజా రదియల్లాహు అన్హు సమాధిని దర్శించడం కూడా సున్నతులోనివే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని దర్శించేవారు మరియు వారి కొరకు ప్రార్థించేవారు. దీని గురించిన హదీథు ఇలా ఉంది:
زُوْرُوْا الْـقُـبُـورَ فَـإِ نَّـهَا تُـذَكِّـرُكُمْ اَلْآخِـرَةَ
జూరుల్ ఖుబూర ఫఇన్నహా తుదక్కిరుకుమ్ అల్ ఆఖిరత
స్మశానాల్ని దర్శించండి. ఎందుకంటే అవి మీకు పరలోకం గురించి జ్ఞాపకం చేస్తాయి. ముస్లిం హదీథు.
సమాధులను దర్శించేటపుడు, క్రింది విధంగా పలుకమని ఆయన తన సహచరులకు బోధించారు,
أَلسَّلاَمُ عَلَيْكُمْ أَهْلٌ الدِّيَارْ مِنَ الْـمُؤمِـنِـيْـنَ وَالْـمُسْلِـمِيْنْ وَإِنَّا إِنْ شَاءَ الله بِكُمْ لاَحِقُوْنَ، نَسْأَلُ اللهَ لَنَا وَلَكُمْ الْـعَافِـيَـةٌ
అస్సలాము అలైకుమ్ అహలుద్దియార్ మినల్ మోమినీన్ వల్ ముస్లిమీన్. వ అనా ఇన్ షాఅ అల్లాహ్ బికుమ్ లాహిఖూన్. నస్అలుల్లాహ లనా వ లకుమ్ అల్ ఆఫియహ్.
మోమినుల మరియు ముస్లిముల ప్రాంతంలో ఉన్న నివాసితులారా, అస్సలాము అలైకుమ్. అల్లాహ్ తలిచినపుడు, నేను కూడా మీతో చేరబోతున్నాను. నా కొరకు మరియు మీకొరకు మేలు ప్రసాదించమని నేను అల్లాహ్ ను వేడుకుంటున్నాను. (ముస్లిం హదీథు గ్రంథం)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనహ్ లోని స్మశానం దగ్గర నుండి వెళ్తున్నపుడు, దాని వైపు తిరిగి ఇలా పలికారని అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన హదీథు అత్తిర్మిథీ హదీథు గ్రంథంలో ఇలా నమోదు చేయబడింది:
أَلسَّلاَمُ عَلَـيْكُمْ يَا أَهْلُ الْـقُـبُـورْ يَـغْـفِـرَ اللهُ لَـنَـا وَلَـكُـمْ أَنْـتُـمْ سَلَـفَـنَا وَنَـحْنُ بِالْأَ ثَـرْ
అస్సలాము అలైకుమ్ యా అహలుల్ ఖుబూర్, యగ్ఫిరల్లాహు లనా వ లకుమ్, అంతుమ్ సలఫనా వ నహ్ను బిల్అథర్
సమాధులలో ఉన్న వారలారా! అస్సలాము అలైకుమ్. మమ్ముల్ని మరియు మిమ్ముల్ని అల్లాహ్ క్షమించు గాక. మీరు మా కంటే ముందు వెళ్ళిపోయారు మరియు మేము మీ వెనుక వస్తున్నాము.
ఈ హదీథుల ద్వారా మనం నేర్చుకునేదేమిటంటే సమాధులను సందర్శించమనే షరిఅహ్ ఆదేశం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే దాని ద్వారా మనం మరణానంతర జీవితం గురించి గుర్తు చేసుకోవాలని.
మృతులతో ఉత్తమంగా వ్యవహరించే, వారిపై అల్లాహ్ యొక్క కారుణ్యం కురిపించమని వేడుకునే మరియు వారి కొరకు మరిన్ని దుఆలు చేసే అవకాశాల్ని ఈ సమాధి సందర్శనం కల్పిస్తున్నది.
అయితే, మృతులను వేడుకోవడానికి సమాధులను సందర్శించడం, అక్కడ కూర్చోవడం, తమ అవసరాలు తీర్చమని మృతులను అర్థించడం, రోగుల స్వస్థత కొరకు వారి సహాయాన్ని కోరటం, వారి ద్వారా లేదా వారి స్థాయి ద్వారా అల్లాహ్ ను వేడుకోవడం మొదలైనవి నిషేధించబడినాయి. ఎందుకంటే అలా చేయడం షిర్క్ క్రిందకి వస్తుంది. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అలా చేయడానికి అనుమతించ లేదు. అంతేగాక ముందుతరం సజ్జనులు కూడా అలా చేయలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించిన ఘోరమైన చెడు పనులలో అదొకటి. ఆయన పలుకులు:
زُوْرُوْا الْـقُـبُـورَ وَلاَ تَـقُـوْلُـوْا هُـجْـراً
జూరుల్ ఖుబూర వలా తఖూలు హుజ్ రన్
సమాధులను దర్శించండం, కానీ చెడు పలుకులు పలుకవద్దు.
ఈ పనులన్నింటిలోనూ కామన్ గా ఉన్న విషయం ఏమిటంటే ఇవి కొత్తగా కనిపెట్టబడిన నూతన కల్పితాలు. అయితే అవి వేర్వేరు స్థాయిలో ఉన్నాయి. వాటిలో కొన్ని పూర్తిగా దారి తప్పిన నూతన కల్పితాలే అయినా ఇంకా షిర్క్ స్థాయికి చేరుకోలేదు. ఉదాహరణకు, సమాధుల వద్ద నిలబడి అల్లాహ్ ను ప్రార్థించడం, మృతుల అంతస్తును పేర్కొంటూ ప్రార్థించడం మొదలైనవి. వాటిలో కొన్ని షిర్క్ అక్బర్ క్రిందికి వస్తాయి, ఉదాహరణకు – మృతులను వేడుకోవడం మరియు వారి సహాయాన్ని అర్థించడం.
ఈ విషయాల గురించి మేము ఇంతకు ముందు వివరంగా చర్చించాము. కాబట్టి వీటి గురించి మనం అప్రమత్తంగా ఉండాలి. సత్యాన్ని మాత్రమే అనుసరించే శక్తిని ప్రసాదించమని మరియు సరైన దారి చూపమని మనం అల్లాహ్ ను ప్రార్థించాలి. కేవలం అల్లాహ్ మాత్రమే మనకు సన్మార్గాన్ని అనుసరించే శక్తిని ప్రసాదించగలడు. అల్లాహ్ తప్ప, నిజమైన వేరే ఆరాధ్యుడు, ప్రభువు ఎవ్వరూ లేరు.
ఇది ఈ చిరు పుస్తకం యొక్క అంతిమ చివరి విషయం.
وَالْـحَمْـدُ للهِ أَ وَّلاً وَآخِراً، وَصَلَّى اللهُ وَسَلَّمَ عَلَى عَبْـدُهُ وَرَسُـولُـهُ وَخَـيْـرَتِـهُ مِنْ خَـلَـقَـهُ مُـحَـمَّـدٍ وَعَلَى آلِـهِ وَأَصْحَابِـهِ وَمَـنْ تَـبَـعَـهُمْ بِـإِحْـسَانِ إِلَى يَـوْمُ الـدِّيْـنَ
వల్ హందులిల్లాహి అవ్వలన్ వ ఆఖిరన్. సల్లల్లాహు అలైహి వసల్లం అలా అబ్దుహు, వ రసూలుహు, వ ఖైరతిహు మిన్ ఖలఖహు ముహమ్మదిన్ వ ఆలా ఆలిహి, వ అస్హాబిహి, వ మన్ తబఅహుమ్ బిఇహ్సాని ఇలా యౌముద్దీన్.
ఆరంభంలో మరియు అంతంలో సకల స్తోత్రములు అల్లాహ్ కే. అల్లాహ్ దాసుడు, ప్రవక్త మరియు సృష్టితాలలో అత్యుత్తములూ అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబంపై, ఆయన సహచరులపై, అంతిమ దినం వరకు మంచితనంలో వారిని అనుసరించేవారిపై అల్లాహ్ యొక్క కరుణ కురియుగాక.
నిలకడగా ఆయన ధర్మాన్ని అనుసరించేలా అల్లాహ్ మనకు సహాయపడుగాక. ఆయనను వ్యతిరేకించడం నుండి మమ్ముల్ని కాపాడుగాక. నిశ్చయంగా ఆయన చాలా ఉదారవంతుడు మరియు మహోన్నతుడూను.
You must be logged in to post a comment.