387. హజ్రత్ అబూహురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-
మనిషి తన ఇంట్లోనైనా వీధిలోనైనా ఒంటరిగా చేసే నమాజు కన్నా సామూహికంగా చేసే నమాజు పుణ్యం రీత్యా పాతికరెట్లు శ్రేష్ఠమైనది. మనిషి శుభ్రంగా సముచిత రీతిలో వుజూ చేసి కేవలం నమాజు చేసే ఉద్దేశంతో మస్జిద్ కు వెళుతుంటే, మస్జిద్ లో ప్రవేశించే వరకు అతను వేసే ప్రతీ అడుగుకు అల్లాహ్ ఒక్కొక్కటి చొప్పున అతనికి (పరలోకపు) అంతస్తులు పెంచుతాడు. అదీగాక అతని వల్ల జరిగిన ఒక్కొక్క పాపాన్ని తుడిచి వేస్తాడు. ఇక మస్జిద్ లో ప్రవేశించిన తరువాత సామూహిక నమాజు కోసం అతను ఎంతసేపు నిరీక్షిస్తాడో అంతసేపు అతనికి నమాజు చేసినంత పుణ్యం ప్రాప్తమవుతుంది. అతను తన నమాజు స్థానంలో కూర్చుని ఉన్నంతవరకు దైవదూతలు అతని శ్రేయస్సు కోసం ప్రార్ధిస్తూ “దేవా! ఇతని వుజూ భంగం కానంతవరకు ఇతడ్ని క్షమించు, ఇతడ్ని కనికరించు”అని అంటారు.