https://youtu.be/lQwtCpQfvi4 [29 నిముషాలు]
వక్త: సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
ప్రవక్త ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఈజిప్టును వదలి తన సోదరుని కుమారునితో సహా పలస్తీనా వచ్చి అక్కడ స్థిరపడ్డారు. ఆ సోదర కుమారుడే లూత్ (అలైహిస్సలాం). ఆ పిదప లూత్(అలైహిస్సలాం) సదూమ్ పట్టణానికి వెళ్ళి పోయారు. ఈ పట్టణం మృత సముద్రానికి పశ్చిమ తీరాన ఉంది. ఈ పట్టణంలో అనేక చెడులు వ్యాపించి ఉండేవి. అక్కడి ప్రజలు ప్రయాణీకులను దోచుకునేవారు. బాటసారులను దోచుకుని హతమార్చే వారు. మరో పెద్ద చెడు స్వలింగ సంపర్కం. పురుషులు తమ భార్యలతో కాక పురుషులతోనే కామ వాంఛలు తీర్చుకునే వారు. ఈ అసహజ లైంగిక క్రియకు తర్వాత ‘సోడోమి‘ అనే పేరుపడింది. (సదూమ్ పట్టణం పేరు వల్ల). అక్కడ స్వలింగ సంపర్కం నిర్లజ్జగా బాహాటంగా జరిగేది.
ఈ చెడులు పెట్రేగిపోయినప్పుడు అల్లాహ్ వారి వద్దకు లూత్ (అలైహిస్సలాం)ను పంపాడు. ఈ చెడులను వదలుకోవలసినదిగా ఆయన వారికి బోధించారు. కాని వారు తమ చెడులలో పూర్తిగా కూరుకు పోయారు. లూత్ (అలైహిస్సలాం) బోధనల పట్ల వారు ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. అల్లాహ్ శిక్ష గురించి లూత్ (అలైహిస్సలాం) వారిని హెచ్చరించినప్పటికీ వారు తమ చెడుల్లో మునిగిపోయి ఆయన మాటల్ని ఏ మాత్రం లక్ష్యపెట్టలేదు. ఇలాంటి బోధనలు కొనసాగిస్తే పట్టణం నుంచి తరిమేస్తామని ఆయన్ను బెదిరించారు. వారి చెడులు ఇతర పట్టణాలకు కూడా వ్యాపిస్తాయని లూత్ (అలైహిస్సలాం) భయపడ్డారు. వారిపై చర్య తీసుకోవాలని అల్లాహ్ ను వేడుకున్నారు.
Read More “ప్రవక్త లూత్ (అలైహిస్సలాం) – ప్రవక్తల జీవిత చరిత్ర [వీడియో]”