1.11 ఈద్ (పండుగ) నమాజ్ ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

505 – حديث ابْنِ عَبَّاسٍ قَالَ: شَهِدْتُ الْفِطْرَ مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَأَبِي بَكْرٍ وَعُمَرَ وَعُثْمَانَ يُصَلُّونَهَا قَبْلَ الْخُطْبَةِ، ثَمَّ يُخْطَبُ بَعْد

خَرَجَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَأَنِّي أَنْظُرُ إِلَيْهِ حينَ يُجْلِسُ بِيَدِهِ، ثُمَّ أَقْبَلَ يَشُقُّهُمْ، حَتَّى جَاءَ النِّسَاءَ، مَعَهُ بِلاَلٌ فَقَالَ: (يَأَيُّهَا النَّبيُّ إِذَا جَاءَكَ الْمُؤمِنَاتُ يُبَايِعْنَكَ) الآيَةَ ثُمَّ قَالَ حينَ فَرَغَ مِنْهَا: آنْتُنَّ عَلَى ذلِكِ فَقَالَتِ امْرَأَةٌ وَاحِدَةٌ مِنْهُنَّ، لَمْ يُجِبْهُ غَيْرُهَا: نَعَمْ قَالَ: فَتَصَدَّقْنَ فَبَسَطَ بِلاَلٌ ثَوْبَهُ، ثُمَّ قَالَ: هَلُمَّ لَكُنَّ فِدَاءً أَبِي وَأُمِّي فَيُلْقِينَ الْفَتَخَ وَالْخَوَاتِيمَ فِي ثَوْبِ بِلاَلٍ
__________
أخرجه البخاري في: 13 كتاب العيدين: 19 باب موعظة الإمام النساء يوم العيد

505. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:-

నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి ఈదుల్ ఫిత్ర్ నమాజు చేశాను. అలాగే శ్రేష్ఠ ఖలీఫాలయిన అబూబక్ర్ (రదియల్లాహు అన్హు), ఉమర్ (రదియల్లాహు అన్హు), ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) గార్లతో కలసి కూడా ఈదుల్ ఫిత్ర్ నమాజు చేశాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), శ్రేష్ఠ ఖలీఫాలు కూడా మొదట నమాజు చేసి ఆ తరువాత ఖుత్బా (ఉపన్యాసం) ఇచ్చేవారు. ఆనాడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (ఉపన్యాస వేదిక నుంచి) క్రిందికి దిగి, ప్రజలను కూర్చోమని చేత్తో సైగ చేస్తూ (పురుషుల) పంక్తులను చీల్చుకుంటూ స్త్రీల పంక్తుల సమీపానికి చేరుకున్న దృశ్యం ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదలుతోంది. ఆ సమయంలో హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఉన్నారు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “యా హయ్యుహన్నబియ్యు ఇజా జా అకల్ మూమినాతు యుబాయీనక అలా అల్లా యుష్రిక్ న” (ప్రవక్తా! విశ్వసించిన స్త్రీలు నీ దగ్గరికి వచ్చి తాము అల్లాహ్ కు (ఆయన దైవత్వంలో) మరెవరినీ సాటి కల్పించబోమని, దొంగతనం చేయబోమని, వ్యభిచారానికి పాల్పడబోమని, తమ సంతనాన్ని హతమార్చము అనీ, అక్రమ సంబంధాలను గురించిన అపనిందలు సృష్టించమని, మంచి విషయాల్లో నీకు అవిధేయత చూపమని ప్రమాణం చేస్తే, వారి చేత ప్రమాణం చేయించు. వారి పాప మన్నింపు కోసం అల్లాహ్ ను ప్రార్థించు. అల్లాహ్ తప్పకుండా క్షమించేవాడు, కరుణించేవాడు.) ( ఖుర్ఆన్ : 60-12) అనే సూక్తి పఠించారు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ సూక్తి పఠించిన తరువాత “మీరీ విషయాలను గురించి నా ముందు ప్రమాణం చేస్తారా?” అని మహిళల్ని ప్రశ్నించారు. అప్పుడు వారిలో ఒక స్త్రీ మాత్రమే చేస్తానని సమాధానమిచ్చింది. మిగిలిన వారంతా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఉండిపోయారు. “సరే మీరు సదఖా (విరాళాలు) ఇవ్వండి” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) తన కండువా తీసి క్రింద పరుస్తూ “నా తల్లిదండ్రుల్ని మీ కోసం సమర్పింతు” అని అన్నారు. అప్పుడు స్త్రీలు తమ ఉంగరాలు, మెట్టెలు తీసి ఆ వస్త్రంలో వేయనారంభించారు.

సహీహ్ బుఖారీ: 13వ ప్రకరణం – ఈదైన్, 19వ అధ్యాయం – మౌయిజతిల్ ఇమామిన్నిసా (యౌముల్ ఈద్)