యదార్థానికి మీ కొరకు దైవప్రవక్త (విధానం)లో అత్యుత్తమ ఆదర్శం ఉంది | కలామే హిక్మత్

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ కథనం ప్రకారం ముగ్గురు మనుషులు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ధర్మపత్నుల ఇళ్ళకు వచ్చి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ఆరాధనల గురించి వివరాలు అడిగి తెలుసుకోసాగారు. వారికా వివరాలు తెలుపగా, అవి కొద్దిగేనని వారనుకున్నారు. తరువాత వారిలా అనసాగారు : “మహాప్రవక్త ఎక్కడా? మేమెక్కడ? ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ముందూ వెనుకటి పొరపొచ్చాలన్నీ క్షమించబడ్డాయి.” తరువాత వారిలో ఒకరు – “నేను ఇకనుండి రాత్రంతా నమాజ్లోనే గడుపుతాను” అని అంటే, మరొకరు, “నేను నిత్యం ఉపవాసం పాటిస్తాను, ఏ ఒక్క రోజు కూడా ఉపవాసం మానను” అన్నారు. ఇంకొకరు, “నేను స్త్రీలకు దూరంగా ఉంటాను, అసలెప్పుడూ వివాహమే చేసుకోను” అని ఖండితంగా చెప్పారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఈ విషయం తెలుసుకుని ఇలా ప్రబోధించారు : “మీరీ విధంగా అంటున్నారు. వినండి – దైవసాక్షిగా! నేను మీకన్నా అధికంగా దైవానికి భయపడేవాడిని. అయితే నేను ఉపవాసం పాటిస్తాను, విరమిస్తాను కూడా. నమాజ్ చేస్తాను, నిద్రపోతాను కూడా. ఇంకా స్త్రీలను కూడా వివాహమాడతాను. ఎవరు నా విధానం పట్ల విసుగెత్తాడో అతనితో నాకెట్టి సంబంధం లేదు.” (బుఖారి)