ఖుర్ఆన్ ఘనత – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

ఖుర్ఆన్ ఘనత – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/hvciJxQhK5Y [35 నిముషాలు]

ఈ ప్రసంగంలో వక్త పవిత్ర ఖురాన్ యొక్క ఘనత, విశిష్టత మరియు ప్రాముఖ్యతను వివరించారు. ఖురాన్ అల్లాహ్ చేత పంపబడిన చివరి ఆకాశ గ్రంథమని, ఇది మానవాళికి రుజుమార్గం చూపే మార్గదర్శకమని తెలిపారు. పూర్వపు గ్రంథాలైన తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్ కాలగర్భంలో కలిసిపోయినా లేదా మార్పులకు లోనైనా, ఖురాన్ మాత్రం అల్లాహ్ సంరక్షణలో సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. ఖురాన్ పఠనం ద్వారా కలిగే పుణ్యాలు, అది కఠినమైన హృదయాలను కూడా ఎలా మెత్తబరుస్తుందో ఉమర్ (రజిyయల్లాహు అన్హు), తుఫైల్ బిన్ అమర్ దౌసీ వంటి వారి జీవిత ఉదాహరణల ద్వారా వివరించారు. ఖురాన్ ను కంఠస్థం చేయడం (హిఫ్జ్) వల్ల కలిగే గొప్పతనం, ఇహపర లోకాలలో లభించే గౌరవం, మరియు ఇది ఆత్మకు, శరీరానికి ఔషధంగా ఎలా పనిచేస్తుందో తెలియజేశారు. చివరగా, ఖురాన్ ను చదవడం, అర్థం చేసుకోవడం మరియు ఆచరించడం ద్వారా ముస్లింలు పొందే సాఫల్యాన్ని గుర్తుచేశారు.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త పాలకుడు, పోషకుడైన అల్లాహ్ యే కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.

సోదర సోదరీమణులారా! మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనం ఖురాన్ ఘనతల గురించి తెలుసుకోబోతున్నాం.

ఖురాన్ చివరి ఆకాశ గ్రంథము, ఇది మనందరికీ తెలిసిన విషయము. అయితే ఆకాశ గ్రంథము అని దేనిని అంటారు అన్న విషయాన్ని తెలుసుకొని మనం మాటను ఇన్షా అల్లాహ్ ముందుకు కొనసాగిద్దాం.

ఆకాశ గ్రంథము అంటే, భూమండలం మీద మానవులు ఎప్పుడెప్పుడైతే దారి తప్పిపోయి మార్గభ్రష్టులు అయిపోయారో, అలా దారి తప్పిపోయిన మానవులను మళ్లీ రుజుమార్గం పైకి తీసుకొని రావడానికి సుబ్ హాన వ త’ఆలా మానవుల్లోనే కొంతమంది ప్రవక్తలను ఎన్నుకున్నాడు. ఆ ప్రవక్తల వద్దకు దైవదూత ద్వారా వాక్యాలు పంపించాడు. దైవదూత తీసుకొని వచ్చిన వాక్యాలు ప్రవక్త మానవులకు తెలియజేసి శిష్యుల ద్వారా రాయించారు, ఒకచోట భద్రపరిచారు. అలా భద్రపరచబడిన దైవ వాక్యాల సమూహాన్ని ఆకాశ గ్రంథము అంటారు, దైవ గ్రంథము అని అంటారు.

ఇలాంటి గ్రంథాల ప్రస్తావన మనకు ఖురాన్ లో అనేక చోట్ల అనేక గ్రంథాల ప్రస్తావన కనిపిస్తుంది. సుహుఫ్ ఇబ్రాహీమ్ అని, అలాగే తౌరాత్ అని, ఇంజీల్ అని, జబూర్ అని, ఖురాన్ అని ఇలా కొన్ని ఆకాశ గ్రంథాల దైవ గ్రంథాల ప్రస్తావన మనకు ఖురాన్ లో కనబడుతుంది.

సుహుఫ్ ఇబ్రాహీమ్, ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఇవ్వబడ్డాయి. తౌరాత్ గ్రంథము మూసా అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. జబూర్ గ్రంథము దావూద్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. ఇంజీల్ గ్రంథము ఈసా అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. ఖురాన్ గ్రంథము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వబడింది.

అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఖురాన్ కు పూర్వం వచ్చిన దైవ గ్రంథాలు, అది ఇంజీల్ కావచ్చు, జబూర్ కావచ్చు, తౌరాత్ కావచ్చు, సుహుఫ్ ఇబ్రాహీమ్ కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు, అవి ఏవీ కూడా నేడు ప్రపంచంలో అసలు రూపంలో భద్రంగా లేవు. కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి, మరికొన్ని మానవుల కల్పితాలకు గురి అయిపోయాయి. కానీ, ఖురాన్ లో మాత్రం అలా జరగలేదు. ఖురాన్ సురక్షితంగా ఉంది. ఇన్షా అల్లాహ్ ఈ ప్రసంగంలో ఖురాన్ ని సుబ్ హాన వ త’ఆలా ఎలా సురక్షితంగా ఉంచాడో వివరంగా నేను కొన్ని విషయాలు మీకు తెలుపుతాను.

మొత్తానికి ఆకాశ గ్రంథం అంటే ఏమిటో అన్నది మనం తెలుసుకున్నాం. ఖురాన్ చివరి ఆకాశ గ్రంథము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వబడింది. ఆయన ద్వారా మనందరి వరకు సుబ్ హాన వ త’ఆలా ఆ గ్రంథాన్ని, ఆ గ్రంథంలో ఉన్న వాక్యాలని చేరవేర్చాడు.

అయితే ఈ ఖురాన్ గ్రంథానికి అనేక ఘనతలు ఉన్నాయండి. మొదటి ఘనత ఏమిటంటే, ఈ ఖురాన్ లోని ప్రతి అక్షరానికి బదులుగా పారాయణము చేస్తున్న భక్తునికి పది పుణ్యాల చొప్పున ఇవ్వబడతాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిర్మిజీ గ్రంథంలోని ఉల్లేఖనంలో ఉదాహరించి మరి తెలియజేసి ఉన్నారు. ఒక వ్యక్తి ‘అలిఫ్ లామ్ మీమ్’ అని పఠిస్తే, అతనికి ‘అలిఫ్’ కి బదులుగా పది పుణ్యాలు, ‘లామ్’ కి బదులుగా పది పుణ్యాలు, ‘మీమ్’ కి బదులుగా పది పుణ్యాలు, మొత్తం ముప్పై పుణ్యాలు అతనికి దక్కుతాయి అని ప్రవక్త వారు ఉదాహరించి మరి తెలియజేశారు.

ఆ ప్రకారంగా ఒక భక్తుడు ఖురాన్ లోని ఒక సూరా ఒక అధ్యాయం పఠిస్తే ఎన్ని పుణ్యాలు పొందుతాడు? ఒక్క పేజీ చదివితే ఎన్ని పుణ్యాలు దక్కించుకుంటాడు? ఒక్క పారా చదివితే ఎన్ని పుణ్యాలు అతనికి దక్కుతాయి? పూర్తి ఖురాన్ పారాయణము పూర్తి చేస్తే, అతను ఎన్ని లక్షల కోట్ల పుణ్యాలు సంపాదించుకుంటాడో ఆలోచించండి మిత్రులారా! ఇంతటి పుణ్యాలు మనిషికి దక్కేలా చేస్తున్న గ్రంథం ఒక ఖురాన్ మాత్రమే. ఇతర గ్రంథాలకు ప్రతి అక్షరానికి బదులుగా పదేసి పుణ్యాలు దక్కుతాయి అన్న ఘనత, విశిష్టత లేదు. ఒక్క ఖురాన్ కు మాత్రమే ఉంది కాబట్టి, ఇది ఖురాన్ యొక్క ఘనత, ప్రత్యేకత మిత్రులారా.

అలాగే ఖురాన్ మానవులకు రుజుమార్గం వైపుకు మార్గదర్శకత్వం చేస్తుంది. దీనికి ఆధారంగా మనం చూస్తే, ఖురాన్ గ్రంథము రెండవ అధ్యాయము, నూట ఎనభై ఐదవ వాక్యంలో సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు.

شَهْرُ رَمَضَانَ الَّذِي أُنزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِّلنَّاسِ وَبَيِّنَاتٍ مِّنَ الْهُدَىٰ وَالْفُرْقَانِ
[హుదల్ లిన్నాసి వబయ్యినాతిమ్ మినల్ హుదా వల్ ఫుర్ ఖాన్]
అది మానవులందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతోపాటు, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి.” (2:185)

స్వయంగా అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఈ ఖురాన్ మానవులకు రుజుమార్గం వైపు దారి చూపిస్తుంది. ఏది సత్యం, ఏది అసత్యం అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖురాన్ లో స్పష్టం చేసేసి ఉన్నాడు అని అల్లాహ్ తెలియజేశాడు. కాబట్టి ఈ ఖురాన్ మానవులందరికీ రుజుమార్గం వైపు దారి చూపిస్తుంది, మార్గదర్శకత్వం చేస్తుంది. దీనికి ప్రవక్త వారి కాలం నాటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. నేటికీ కూడా అనేక ఉదాహరణలు మనము చూస్తూనే ఉన్నాం.

ఇప్పుడు మనం ప్రవక్త వారి జీవిత కాలంలోని ఒక రెండు ఉదాహరణలు మనం తెలుసుకుంటున్నాం ఇన్షా అల్లాహ్.

మొదటి ఉదాహరణ తుఫైల్ బిన్ అమర్ దౌసీ రజియల్లాహు అన్హు వారిది. ఈయన దౌస్ తెగకు చెందిన వ్యక్తి, మక్కాకు ఒకసారి వచ్చారు. చదువుకున్న వ్యక్తి, జ్ఞానం ఉన్న వ్యక్తి. అయితే మక్కా పెద్దలు ఆ రోజుల్లో ప్రవక్త వారికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్న రోజులవి. మక్కా పెద్దలు ఈయన దగ్గరికి కూడా వెళ్లి, “ముహమ్మద్ వారి మాట వినకండి, ముహమ్మద్ వారి మాట వింటే మీరు దారి తప్పిపోతారు, భార్య బిడ్డలకు దూరమైపోతారు, తల్లిదండ్రులకు దూరమైపోతారు” అని రకరకాలుగా ఆయనకు చెప్పి భయపెట్టేశారు. ఆయన ఆ మాటలన్నీ నిజమేమో అని నమ్మేసి, ప్రవక్త వారి మాటలు వినకూడదు అని నిర్ణయించుకున్నారు. కానీ, అల్లాహ్ తలిచిందే జరుగుతుంది అన్నట్టుగా, ఒకరోజు కాబా పుణ్యక్షేత్రం వద్ద ఆయన ప్రదర్శనలు చేస్తూ ఉంటే, సమీపంలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాన్ పారాయణము చేస్తూ ఉన్నారు. ఆ శబ్దం ఆయన చెవిలో పడింది.

ఆ శబ్దాన్ని ఎప్పుడైతే ఆయన వినేశారో, ఆయన మనసులో ఒక ఆలోచన కలిగింది. “నేను చదువుకున్న వ్యక్తిని, ఏది మంచి ఏది చెడు అని నేను నిర్ణయించుకోగలను. అలాంటప్పుడు ముహమ్మద్ వారి మాట నేను వినడానికి ఎందుకు భయపడాలి? ఎందుకు దూరంగా ఉండాలి? ఆయన మాట విని చూస్తాను, మంచిదా కాదా అని నిర్ణయించుకుంటాను. అంతమాత్రాన నేను కంగారు పడటం ఎందుకు, దూరంగా ఉండే ప్రయత్నం చేయడం ఎందుకు?” అని ఆ శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో అక్కడికి వెళ్లారు. చూస్తే ప్రవక్త వారు ఉన్నారు.

ప్రవక్త వారి వద్దకు వెళ్లి, “ఏమండీ! మీరు ప్రజలకు ఏమి చెబుతున్నారు? మీరు చెబుతున్న ఏ మాటలను బట్టి ప్రజలు మీ గురించి ఈ విధంగా చెబుతున్నారు? ఆ మాటలు నాకు కూడా చెప్పండి” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనను కూర్చోబెట్టుకొని, అటు ఇటు ఏమీ మాట్లాడకుండా ఖురాన్ లోని దైవ వాక్యాలు పఠించి వినిపించారు. ఖురాన్ పారాయణము చేస్తూ ఉంటే, ఖురాన్ లోని దైవ వాక్యాలు ఆయన విన్న తర్వాత ఏమన్నారంటే: “నేను సాక్ష్యం ఇస్తున్నాను, మీరు చెబుతున్నది ఇది కవిత్వము కాదు, మీరు చెబుతున్నది ఇది మంత్రతంత్రము కాదు. నేను కవిత్వము విని ఉన్నాను, నేను మంత్రతంత్రాలు ఎలా ఉంటాయో తెలిసినవాడిని. కానీ మీరు పలుకుతున్నది మాత్రం అది కవిత్వము కాదు, మంత్రతంత్రము కాదు, ముమ్మాటికీ ఇది దేవుని వాక్యము” అని అప్పటికప్పుడే ఆయన కలిమా చదివి ఇస్లాం స్వీకరించారు, ముస్లిం అయిపోయారు అల్హందులిల్లాహ్.

చూసారా! ఖురాన్ ద్వారా దారి తప్పిపోయిన వాళ్లు మళ్లీ దారి పైకి వచ్చేస్తారు. ఈ ఖురాన్ రుజుమార్గం వైపుకి దారి చూపిస్తుంది.

మరొక ఉదాహరణ విందాం. జిమాద్ అజ్దీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు. ఈయన అజ్ద్ తెగకు చెందిన వాళ్లు. ఈయన కూడా మక్కాకు వచ్చారు. కాకపోతే ప్రవక్త వారితో ఆయనకు పరిచయం ఉంది. మక్కా పెద్దలు ఈయన దగ్గరికి కూడా వెళ్లారు. ఈయన దగ్గరికి వెళ్లి ఏమన్నారంటే, “ఏమండీ! మీకు మంత్రించడం వచ్చు కాబట్టి, మీ మిత్రునికి పిచ్చి పట్టినట్లు ఉంది, ఏదేదో వాగుతూ ఉన్నాడు, కొంచెం మంత్రించి వైద్యము చేయొచ్చు కదా” అని చెప్పారు. ఆయన నిజమేమో అని నమ్మి, ప్రవక్త వారితో పరిచయం ఉండింది కాబట్టి చక్కగా ప్రవక్త వారి దగ్గరికి వెళ్లి, “ప్రజలు ఈ విధంగా మీ గురించి చెబుతున్నారు, అలాంటిది ఏమైనా మీకు సమస్య ఉంటే చెప్పండి, నేను మంత్రించి మీకు వైద్యం చేస్తాను” అన్నారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు కూడా కూర్చోబెట్టుకొని, నేను ఏమి చెబుతున్నానో నువ్వు విను అని సూరా ఇఖ్లాస్, సూరా ఫలఖ్, చిన్న చిన్న సూరాలు – ‘ఖుల్ హువల్లాహు అహద్’ అని ఒక సూరా ఉంది కదా, అలాగే ‘ఖుల్ అరూజు బి రబ్బిల్ ఫలఖ్’ అని సూరా ఉంది కదా – ఈ చిన్న చిన్న సూరాలు పఠించి వినిపించగానే, వెంటనే ఆయన కూడా ప్రవక్త వారి సమక్షంలో సాక్ష్యం పలికారు. “అయ్యా! మంత్రతంత్రాలు ఎలా ఉంటాయో నేను మంత్రాలు నేర్చుకొని ఉన్న వాడిని కాబట్టి, విని ఉన్న వాడిని కాబట్టి నాకు తెలుసు. మీరు చెబుతున్నది ఇది మంత్రతంత్రము ఎప్పటికీ కానే కాదు. అలాగే మీరు చెబుతున్నది ఇది కవిత్వము కూడా కాదు. ఇది స్పష్టమైన దేవుని వాక్యమే” అని ఆయన కూడా సాక్ష్యం ఇచ్చి, కలిమా చదివి, అప్పటికప్పుడే ఆయన కూడా ముస్లిం అయిపోయారు, ఇస్లాం స్వీకరించారు అల్లాహు అక్బర్.

రెండు ఉదాహరణలు ప్రవక్త వారి జీవిత కాలం నుండి నేను వినిపించానండి. నేటికీ కూడా అనేకమంది వివిధ భాషలలో అనువాదం చేయబడి ఉన్న దైవ గ్రంథం ఖురాన్ ని చదువుతూ ఉన్నారు. చదివి అల్హందులిల్లాహ్ రుజుమార్గాన్ని పొందుతూ ఉన్నారు. అల్హందులిల్లాహ్ ఇస్లాం స్వీకరించి ముస్లింలు అయిపోయాము, ఖురాన్ ను చదివి తెలుసుకున్నాము అని సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. అనేక ఉదాహరణలు మీరు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో చూడవచ్చు మిత్రులారా.

మొత్తానికి ఖురాన్ కి ఉన్న ఘనత ఏమిటంటే, ఖురాన్ ద్వారా ప్రజలు రుజుమార్గం పైకి వస్తారు.

అలాగే ఖురాన్ ఎలాంటి తప్పులు లేని సురక్షితమైన గ్రంథము. ఖురాన్ గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ
[జాలికల్ కితాబు లా రైబ ఫీహ్]
ఈ గ్రంథం (అల్లాహ్‌ గ్రంథం అన్న విషయం) లో ఎంతమాత్రం సందేహం లేదు.” (2:2)

అంటే ఇవి దైవ వాక్యాలు అన్న విషయంలో అనుమానానికి తావే లేదు అన్నారు. మరి అనుమానానికే తావు లేనప్పుడు తప్పులు దాంట్లో ఎక్కడి నుంచి వస్తాయి? అసలు తప్పులు లేని గ్రంథము ఈ ఖురాన్ గ్రంథం.

గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఖురాన్ లో తప్పులు ఉన్నాయి అని ప్రవక్త వారి కాలంలో కూడా ఎవరూ నిరూపించలేకపోయారు. ఆయన తర్వాత నుండి ఇప్పటివరకు కూడా ఎవరూ ఖురాన్ లో తప్పులు ఉన్నాయి అని నిరూపించలేకపోయారు. ఇన్షా అల్లాహ్ ప్రళయం వరకు కూడా ఇందులో తప్పులు ఉన్నాయి అని ఎవరూ నిరూపించలేరు.

కానీ ఆశ్చర్యకరమైన ఒక విషయం చెబుతాను. అదేమిటంటే, ఖురాన్ లో తప్పులు ఉన్నాయి అని ప్రపంచానికి నిరూపించడానికి కొంతమంది ముస్లిమేతరులు, పండితులు ఖురాన్ ని పఠించారు. తప్పులు వెతకడానికి పఠించారు. పఠిస్తూ ఉన్నారు, తప్పులు వెతుకుతూ ఉన్నారు, చదువుతూ పోతూ ఉన్నారు. చివరికి ప్రభావితులైపోయి సురక్షితమైన గ్రంథం ఖురాన్, దైవ వాక్యాలతో నిండిన గ్రంథం ఖురాన్, సత్యమైన దేవుని గ్రంథం ఖురాన్ అని వారు కూడా అల్హందులిల్లాహ్ కలిమా చదివి ఇస్లాం స్వీకరించేశారు. ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. చాలామంది పండితులు తప్పులు వెతకడానికి మాత్రమే ఖురాన్ చదివారు. కానీ అల్హందులిల్లాహ్ దారి పైకి వచ్చేశారు, ఇస్లాం స్వీకరించేశారు. ఇది ఖురాన్ యొక్క ఘనత మిత్రులారా.

అలాగే ఖురాన్ ద్వారా హృదయాలు మెత్తబడతాయి. కొంతమంది యొక్క మనస్తత్వం మరియు వారి గుండె చాలా గట్టిది. కానీ ఖురాన్ చదివితే ప్రజల గుండెలు, ప్రజల హృదయాలు మెత్తబడతాయి. దీనికి ఉదాహరణగా మనం చూసినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలోని ఉమర్ రజియల్లాహు త’ఆలా అన్హు వారు. గొప్ప బలవంతుడు, ధైర్యవంతుడు మరియు కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తి, గట్టి మనుస్కుడు.

ఒకరోజు అనుకోకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట దైవ వాక్యాలు వినేశారు. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పఠిస్తూ ఉన్నారు. అల్లాహ్ తెలియజేసిన సూరా హాక్కా లోని వాక్యాలు.

وَمَا هُوَ بِقَوْلِ شَاعِرٍ ۚ قَلِيلًا مَّا تُؤْمِنُونَ – وَلَا بِقَوْلِ كَاهِنٍ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ – تَنزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ
ఏ కవి పుంగవుడో పలికిన మాట కానే కాదు. మీరు విశ్వసించేది చాలా తక్కువ. ఇది ఏ జ్యోతిష్యుని పలుకో అంతకన్నా కాదు. మీరు హితబోధను గ్రహించేది బహుస్వల్పం. నిజానికి సకల లోకాల ప్రభువు తరఫున అవతరించింది.” (69:41-43)

అవి విన్న తర్వాత కొంచెం ఇస్లాం వైపుకి, ప్రవక్త వారి వైపుకి మొగ్గు చూపించారు. కానీ మళ్లీ ఉదయాన్ని చూస్తే, మక్కా పెద్దలు రకరకాలుగా ప్రవక్త వారి గురించి చెబుతూ ఉంటే అయోమయంలో పడిపోయారు. మక్కా పెద్దలు చెబుతున్నది నమ్మాలా? లేదా ప్రవక్త ముహమ్మద్ వారు చెబుతున్నది నమ్మాలా? తేల్చుకోలేకపోతున్నారు, అయోమయమైన పరిస్థితిలో ఉన్నారు, చిరాకు వచ్చేసింది. దీనికి పరిష్కారం ఏమిటంటే ముహమ్మద్ వారిని చంపేస్తే సరిపోతుంది అని కత్తి పట్టుకొని బయలుదేరిపోయారు.

దారిలో నుఐమ్ అనే ఒక వ్యక్తి చూసుకున్నారు. చూసుకొని “ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు?” అని అడిగారు. “ముహమ్మద్ వారిని చంపడానికి” అని చెప్పేశారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, “అయ్యా, ముహమ్మద్ వారి విషయం తర్వాత, ముందు మీ చెల్లెలు ఫాతిమా, మీ బావ సయీద్, వాళ్లిద్దరూ కూడా ఇస్లాం స్వీకరించేశారు, నీకు తెలుసా?” అని చెప్పారు. ముందే కోపంలో ఉన్నారు. కుటుంబ సభ్యుల్లో చెల్లెలు, బావ ఇద్దరు కూడా ఆయనకు తెలియకుండానే ఇస్లాం స్వీకరించేశారు అన్న మాట వినగానే, కోపం రెట్టింపు అయిపోయింది. మరింత కోపంలో ఆయన అక్కడి నుంచి చక్కగా చెల్లెలి ఇంటికి వెళ్లిపోయారు.

ఆ సమయానికి ఖబ్బాబ్ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ఉమర్ వారి చెల్లెలకు, బావకు ఖురాన్ నేర్పిస్తూ ఉన్నారు. శబ్దం విని ఆయన, ఖబ్బాబ్ రజియల్లాహు అన్హు వారు వెళ్లి ఇంట్లో దాక్కున్నారు. చెల్లెలు బావ ఇద్దరూ కూడా ఆ ఖురాన్ పత్రాలు దాచిపెట్టేసి తర్వాత తలుపు తెరిచారు.

ఉమర్ రజియల్లాహు అన్హు వారు కోపంలో ఉన్నారు, ఆ పారాయణము చేసే శబ్దం కూడా వినేసి ఉన్నారు. “నేను శబ్దం విన్నాను, అలాగే మీ గురించి కూడా నేను తెలుసుకున్నాను. మీరు తాతముత్తాతల ధర్మాన్ని వదిలేశారంట, ముహమ్మద్ తీసుకొని వచ్చిన కొత్త ధర్మాన్ని మీరు అంగీకరించేశారంట. ఏదో మీరు చదువుతూ ఉన్నారు, నేను శబ్దం బయటి నుంచి విన్నాను” అని అలా ఎందుకు చేశారు అని కొట్టడం ప్రారంభించేశారు. బావను చితకబాదేశారు, చెల్లెలను చితకబాదేశారు. చివరికి చెల్లె తలకు గాయమయింది. ఆమె తిరగబడి ఉమర్ రజియల్లాహు అన్హు వారికి సమాధానం ఇస్తూ, “ఓ ఉమర్! నువ్వు వినింది నిజమే. మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటను విన్నాము, నమ్మాము, విశ్వసించాము. ఇక నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో. ఇక మేము మాత్రము ఆ మార్గాన్ని వదిలేది లేదు, ఆ ధర్మాన్ని వదిలేది లేదు” అని చెప్పేశారు.

చెల్లెలు తిరగబడి మాట్లాడుతూ ఉంటే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు కొంచెం వెనక్కి తగ్గి, ఆశ్చర్యపోయి, “ఏంటమ్మా! మీలో ఇంత మార్పు తీసుకొని వచ్చిన ఆ మాటలు ఏమిటి? నాకు కూడా వినిపించండి” అన్నారు. “చెల్లెలు ముందు మీరు వెళ్లి స్నానం చేసుకొని రండి” అంటే, వెళ్లి స్నానం చేసుకొని వచ్చారు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఖురాన్ పత్రాలలో సూరా తాహా కు చెందిన కొన్ని వాక్యాలు ఉన్నాయి, అవి ఆయన చేతికి ఇచ్చారు. ఆయన ఆ వాక్యాలు చదివారు. ఆ వాక్యాలు చదివి ఎంత ప్రభావితులైపోయారంటే, “ముహమ్మద్ వారు ఎక్కడున్నారో చెప్పండి, నేను కూడా వెళ్లి ఆయన మాటను అంగీకరించాలనుకుంటున్నాను” అని చెప్పారు.

ఆ మాట వినగానే అక్కడ దాక్కొని ఉన్న ఖబ్బాబ్ రజియల్లాహు అన్హు వారు బయటికి వచ్చి ఉమర్ రజియల్లాహు అన్హు వారికి శుభవార్త తెలియజేశారు. “ఓ ఉమర్! మీకు శుభవార్త ఏమిటంటే, కొద్ది రోజుల క్రితమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో దుఆ చేసి ఉన్నారు. ‘ఓ అల్లాహ్! ముస్లింలకు, ఇస్లాంకు ఉమర్ లేదా అబూ జహల్ వీరిద్దరిలో ఎవరికో ఒకరికి హిదాయత్ ప్రసాదించి బలం ఇవ్వు’ అని కోరి ఉన్నారు. అల్లాహ్ మీ అదృష్టంలో, మీ విధిరాతలో ఇస్లాం యొక్క భాగ్యం రాసాడని నాకు తెలుస్తూ ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దారే అరఖమ్ లో ఫలానా చోట సహాబాలతో సమావేశమై ఉన్నారు, మీరు అక్కడికి వెళ్లండి” అనగానే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు అక్కడికి వెళ్లారు.

అక్కడ సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద శిక్షణ పొందుతూ ఉన్నారు, విద్య నేర్చుకుంటూ ఉన్నారు, ఇస్లామీయ విద్యలు నేర్చుకుంటూ ఉన్నారు. ఉమర్ వచ్చేసాడు అని తెలియగానే కంగారు పడిపోయారు. ఎందుకంటే ఆయన కోపిష్టుడు, ఇస్లాం స్వీకరించలేదు. ఏం ఉద్దేశంతో వచ్చారో, ఏం చేస్తారో ఏమో అని కంగారు పడిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, “ఆయన్ని నా దగ్గరికి రానియ్యండి” అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఆయన వెళ్లారు. వెళ్లిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో కలిమా చదివి ఇస్లాం స్వీకరించేశారు.

ఆయన కలిమా చదివి ఇస్లాం స్వీకరిస్తున్న దృశ్యాన్ని, అక్కడ కూర్చొని భయపడుతూ ఉన్న ఆ శిష్యులందరూ, సహాబాలు చూసి ఒక్కసారిగా ఎంత సంతోషపడిపోయారంటే, బిగ్గరగా “అల్లాహు అక్బర్” అని పలికారు. వారందరూ పలికిన ఆ శబ్దము మక్కా వీధుల వరకు కూడా వెళ్లింది.

అంటే అర్థం ఏమిటండీ? ఖురాన్ చదివి, అప్పటికే చంపాలి అనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి ఎంత మారుమనసు పొందారంటే, ఆయన హృదయం ఎంతగా మెత్తబడిపోయింది అంటే, వచ్చి ప్రవక్త వారి శిష్యుడిగా మారిపోయారు. ప్రవక్త వారిని హతమార్చడానికి వచ్చిన వ్యక్తి, దారిలో ఖురాన్ వాక్యాలు చదివారు, ప్రవక్త వారి వద్దకు వచ్చి శిష్యుడిగా మారిపోయారు. చూసారా! కాబట్టి ఖురాన్ పారాయణము ద్వారా హృదయాలు మెత్తబడతాయి అనటానికి ఇది గొప్ప ఉదాహరణ మిత్రులారా.

అలాగే ఖురాన్ కి చాలా ఘనతలు ఉన్నాయండి. చాలా విషయాలు ఇంకా తెలుసుకోవలసి ఉంది కాబట్టి, క్లుప్తంగా ఇన్షా అల్లాహ్ మీ ముందర ఉంచే ప్రయత్నం చేస్తాను. ఖురాన్ సురక్షితమైన గ్రంథం. ఇంతవరకే మనం విని ఉన్నాం, ఇతర గ్రంథాలన్నీ కూడా కల్పితాలకు గురైపోయాయి, లేదా కాలగర్భంలో కలిసిపోయాయి అని. కానీ ఖురాన్ అలా కాదు. ఖురాన్ గ్రంథం సురక్షితంగా ఉంది. ఖురాన్ గ్రంథంలోని పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ
[ఇన్నా నహ్ను నజ్జల్ నజ్జిక్ర వ ఇన్నా లహూ లహాఫిజూన్]
మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము.” (15:9)

మేమే ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాము మరియు మేమే దీనిని సురక్షితంగా ఉంచుతూ ఉన్నాము అన్నారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖురాన్ గ్రంథాన్ని ఎలా సురక్షితంగా ఉంచుతూ వస్తూ ఉన్నాడు అన్నది రెండు ఉదాహరణలు మీ ముందర ఉంచుతున్నాను చూడండి ఇన్షా అల్లాహ్.

మొదటి ఉదాహరణ ఏమిటంటే, మీరు ఇండియాలో ఖురాన్ చూడండి, అరేబియా దేశాలలోని ఖురాన్ చూడండి, యూరప్ దేశాలలో ఖురాన్ చూడండి, ఇతర ఖండాలలో, ప్రపంచంలో ఏ మూలన ఏ దేశంలో ఖురాన్ ఉన్నా మీరు చూడండి, ప్రతి చోట మీకు ఒకే రకమైన ఖురాన్ కనిపిస్తుంది.

ఒక దేశంలో వంద సూరాల ఖురాన్, మరొక దేశంలో యాభై సూరాల ఖురాన్, మరొక దేశంలో నూట పద్నాలుగు సూరాల ఖురాన్ – కనిపించదు. పూర్తి ప్రపంచంలో నూట పద్నాలుగు సూరాలు, నూట పద్నాలుగు అధ్యాయాలు కలిగిన ఖురాన్ మాత్రమే మీకు కనిపిస్తుంది. అదే మీరు వేరే గ్రంథాలని చూడండి. వేరే గ్రంథాలు మీరు చూస్తే, ఒక దేశంలో కొన్ని పుస్తకాలతో నిండిన గ్రంథము కనిపిస్తే, మరొక దేశంలో అంతకు మించిన పుస్తకాలతో నిండిన గ్రంథము కనిపిస్తుంది. ఒకచోట ఎక్కువ పుస్తకాలు ఉన్న గ్రంథము, మరొక చోట తక్కువ పుస్తకాలు ఉన్న గ్రంథము. వీళ్లేమంటారంటే అందులో ఎక్కువైపోయింది అంటారు. వాళ్లేమంటారంటే అందులో కొన్ని తీసేశారు అంటారు. మొత్తానికి తీయటమో లేదా జొప్పించటమో జరిగింది స్పష్టంగా.

కానీ ఖురాన్ లో అలా జరగలేదు. పూర్తి ప్రపంచంలో అల్హందులిల్లాహ్ ఒకే రకమైన ఖురాన్ కనిపిస్తుంది. ఇది ఖురాన్ సురక్షితంగా ఉంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ.

మరొక ఉదాహరణ, అదేంటంటే: నేడు భూమండలం మీద మస్జిద్ లలో గాని, మదరసాలలో గాని, లైబ్రరీలలో గాని, ఇంకా ఎక్కడైనా గాని ఖురాన్ ఉంది అంటే, ఆ ఖురాన్ గ్రంథాలన్నీ తీసుకొని వెళ్లి ఒక సముద్రంలో పడవేసేస్తే, ఖురాన్ గ్రంథము ప్రపంచంలో నుంచి తొలగిపోదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే కాగితాలలోనే ఈ ఖురాన్ భద్రంగా లేదు, మానవుల గుండెల్లో కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ గ్రంథాన్ని భద్రంగా ఉంచి ఉన్నాడు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఏడు సంవత్సరాల కుర్రాడు, తొమ్మిది సంవత్సరాల అమ్మాయి, పూర్తి ఖురాన్ గ్రంథం “అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్” నుంచి మొదలెట్టి “ఖుల్ అరూజు బి రబ్బిన్ నాస్” అనే సూరా వరకు పూర్తి ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసేసి ఉన్నారు. ఇలా ఖురాన్ కంఠస్థం చేసిన వాళ్లను ‘హుఫ్ఫాజ్‘ అని అంటారు. ఇలాంటి హుఫ్ఫాజ్ లు ప్రతి దేశంలో అల్హందులిల్లాహ్ వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో ఉన్నారు పూర్తి ప్రపంచంలో అల్హందులిల్లాహ్.

పూర్తి కాగితాలలో ఉన్న ఖురాన్ గ్రంథాలన్నీ తీసుకొని పోయి సముద్రంలో పడవేసినా, ఈ ఖురాన్ ని కంఠస్థం చేసిన ఈ హుఫ్ఫాజ్ లు ప్రతి దేశంలో ఉన్నారు, వాళ్లు మళ్లీ మరుసటి రోజే ఖురాన్ ని మళ్లీ రాయగలరు, ముద్రించగలరు, సిద్ధం చేసుకోగలరు. కాబట్టి ఖురాన్ ప్రపంచంలో నుంచి తొలగిపోదు, అది కాగితాలలోనే కాదు, హృదయాలలో కూడా భద్రంగా ఉంది. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ ఖురాన్ ని సురక్షితంగా ఉంచుతూ వస్తూ ఉన్నాడు.

ఒక ప్రశ్న, అదేమిటంటే: ఖురాన్ గురించి ఇంత గొప్పగా చెప్పాను కదా, ఒక్కసారి ఆలోచించి చూడండి. ఖురాన్ కాకుండా వేరే గ్రంథాలు ఇవి కూడా దేవుని గ్రంథమే అని పలుకుతున్నారు కదా, అందులోని సగం గ్రంథం ప్రపంచం లోనుంచి తీసుకొని వెళ్లి సముద్రంలో పడవేస్తే, ఆ సగం గ్రంథాన్ని కంఠస్థం చేసిన వాళ్లు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారా? లేదా పావు గ్రంథాన్ని కూడా చూడకుండా కంఠస్థం చేసిన వాళ్లు ప్రపంచంలో ఉన్నారా? అంటే లేరు అనే సమాధానం వస్తుంది. కాబట్టి ఖురాన్ ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎంత భద్రంగా ఏ విధంగా ఉంచాడో చూడండి, ఇది ఖురాన్ యొక్క ఘనత మరియు ప్రత్యేకత.

అలాగే ఖురాన్ ద్వారా ప్రపంచంలో కూడా గౌరవం, పరలోకంలో కూడా గౌరవం దక్కించుకుంటాడు భక్తుడు, విశ్వాసుడు. ఎలాగంటే చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క విధానాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

إِنَّ اللَّهَ يَرْفَعُ بِهَذَا الْكِتَابِ أَقْوَامًا
[ఇన్నల్లాహ యర్ ఫఉ బిహాజల్ కితాబి అఖ్వామన్]
“నిశ్చయంగా అల్లాహ్ ఈ గ్రంథం ద్వారా ఎన్నో జాతులకు (లేదా సముదాయాలకు) సాఫల్యం ప్రసాదిస్తాడు (గౌరవం ప్రసాదిస్తాడు).”

మరొక ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేశారు:

خَيْرُكُمْ مَنْ تَعَلَّمَ الْقُرْآنَ وَعَلَّمَهُ
[ఖైరుకుమ్ మన్ తఅల్లమల్ ఖుర్ఆన వ అల్లమహు]
“మీలో ఎవరైతే ఖురాన్ ను నేర్చుకుంటారో మరియు ఇతరులకు నేర్పిస్తారో, వారు సమాజంలోని ఉత్తమమైన వాళ్లు” అని చెప్పేశారు.

ఉత్తమమైన వారు అన్న యొక్క ఘనత, గౌరవం వారికి ప్రపంచంలో దక్కింది. దీనికి ప్రాక్టికల్ గా ఒక మాట చెబుతాను చూడండి. మనం ప్రతిరోజు మస్జిద్ కి వెళ్తాం. నమాజు ఐదు పూటలా ఆచరిస్తాం. ఇమాం గారు ఫర్జ్ నమాజు ఆచరిస్తున్నప్పుడు ఒక్క విషయాన్ని గమనించండి. వెనకాల నిలబడిన వాళ్లలో ఇంజనీర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, టీచర్లు ఉంటారు, ప్రిన్సిపల్ లు ఉంటారు, పండితులు ఉంటారు, కోటీశ్వరులు ఉంటారు, ఇంకా ఏదేదో నేర్చుకొని ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు. కానీ వాళ్లందరూ వెనుక ఉంటే, వారి ముందర ఒక వ్యక్తి ఇమాం గా నిలబడి అందరికీ నమాజు చేయిస్తారు. ఆయన దగ్గర ఇంజనీరింగ్ పట్టా ఉండదు, అలాగే డాక్టర్ పట్టా ఉండదు, ఆయన గొప్ప కోటీశ్వరుడు కూడా కాడు. కానీ అందరి ముందర నిలబడి అందరికీ నమాజు చేయించే గౌరవం ఆయనకు దక్కుతా ఉంది అంటే ఆయన దగ్గర ఏముందో తెలుసా? ఆయన హృదయంలో ఖురాన్ వాక్యాలు ఉన్నాయి. ఖురాన్ వాక్యాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో ఆయనకు ఆ గౌరవం ఇచ్చాడు. ఆయన గురువుగా అందరికీ నమాజు చేయిస్తారు, అందరూ ఆయనను గౌరవిస్తూ ఆయన వెనకాల నమాజు చేసుకొని వస్తారు. అల్హందులిల్లాహ్, ప్రపంచంలో ఇది అల్లాహ్ ఇచ్చిన గౌరవం.

పరలోకంలో కూడా గౌరవం దక్కుతుంది. అదేంటో కూడా ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు: ఎప్పుడైతే లెక్కంపు రోజు వస్తుందో, ఆ లెక్కంపు రోజున ఖురాన్ గ్రంథము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో సిఫారసు చేస్తుంది. “ఓ అల్లాహ్! ఫలానా భక్తుడు ప్రపంచంలో ఖురాన్ గ్రంథాన్ని నేర్చుకున్నాడు, పఠించాడు, అందులో ఉన్న విషయాల ప్రకారం అమలు పరిచాడు కాబట్టి ప్రజలందరి ముందర ఆయనకు గౌరవం వచ్చేలాగా చేయండి”.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలందరి ముందర ఆయనకు గౌరవం వచ్చేలాగా గౌరవ కిరీటము ధరింపజేస్తాడు. అల్లాహు అక్బర్! ఒక రాజు పిలిచి ఒక వ్యక్తికి అవార్డు ఇచ్చేస్తే దాన్ని ఎంత గౌరవంగా భావిస్తాడు మనిషి? పేపర్లలో, న్యూస్ ఛానల్ లలో ప్రతి చోట అదే సంచలనమైన వార్తగా మారిపోతుంది. ఆయన ఫలానా అవార్డు దక్కించుకున్నాడు, ఫలానా ప్రధాని చేతి మీద లేదా రాజు చేతి మీద ఆ అవార్డు ఆయన తీసుకున్నాడు చూడండి, చూడండి అని ప్రతి వీడియోలో ఆయనదే వీడియో, ప్రతి పేపర్లలో ఆయనదే ఫోటో కనిపిస్తుంది. కానీ పూర్తి ప్రపంచానికి రారాజు, విశ్వానికి మొత్తానికి రారాజు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, ఆ రోజు మానవులందరి ముందర ఆ భక్తుని తల మీద కిరీటం ధరింపజేస్తాడు.

అంతేకాదండి, మళ్లీ ఖురాన్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో అంటుంది: “ఓ అల్లాహ్! మరింత గౌరవం వచ్చేలాగా ఆయనకి గౌరవించండి” అంటే, అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఖరీదైన బట్టలు ధరింపజేస్తాడు.

అంతేకాదండి, మళ్లీ ఖురాన్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో అడుగుతుంది: “ఓ అల్లాహ్! ఇతని తల్లిదండ్రులకు కూడా గౌరవం వచ్చేలాగా చేయండి” అంటే, అప్పుడు ఆ భక్తుని యొక్క తల్లిదండ్రులకు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులందరి ముందర కిరీటము ధరింపజేస్తాడు. అల్లాహు అక్బర్! ఏ తల్లిదండ్రులైతే వారి బిడ్డలకు ప్రపంచంలో ఖురాన్ నేర్పిస్తారో, ఖురాన్ ప్రకారంగా జీవించుకోవడానికి మార్గదర్శకత్వం చేస్తారో, అలాంటి తల్లిదండ్రులు కూడా పరలోకంలో లెక్కంపు రోజున గౌరవం పొందుతారు మిత్రులారా.

ఒక్కసారి ఆలోచించండి. ఒక్క ఖురాన్ ద్వారా ప్రపంచంలో కూడా గౌరవము ఉంది, పరలోకంలో కూడా గౌరవము ఉంది. ఖురాన్ ను కాకుండా వేరే గ్రంథాల వలన ఇలాంటి గౌరవం కలుగుతుంది అన్న విశిష్టత ఉందా? లేదు. ఒక ఖురాన్ కు మాత్రమే ఉంది, ఇది ఖురాన్ యొక్క ఘనత మిత్రులారా.

అంతేకాదండి, ఖురాన్ కి ఉన్న మరో ఘనత ఏమిటంటే, ఖురాన్ ద్వారా మానవుడు స్వర్గంలోని ఉన్నతమైన స్థానాలకు చేరుకుంటాడు. ఎలాగా? ఎలాగంటే తిర్మిజీ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు: స్వర్గవాసులు స్వర్గానికి చేరినప్పుడు, ఖురాన్ గ్రంథాన్ని నేర్చుకొని, కంఠస్థం చేసి, పఠించి, దాని ప్రకారంగా అమలు పరిచిన భక్తులతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంటాడు: “ఓ భక్తుడా! ఎలాగైతే నీవు ప్రపంచంలో ప్రశాంతంగా ఖురాన్ పారాయణము చేసేవాడివో, ఈరోజు స్వర్గంలో కూడా ఖురాన్ పారాయణము చేస్తూ పో మరియు స్వర్గం యొక్క స్థానాలు ఎక్కుతా పో” అని చెప్పేస్తాడు. అతను ఖురాన్ పారాయణము మొదలెట్టి, స్వర్గపు యొక్క స్థాయులు ఎక్కుతా పోతాడు. ఎక్కడైతే ఆయన ఖురాన్ పారాయణము పూర్తి అయిపోతుందో, అప్పటివరకు ఎంత పైకి వెళ్ళిపోతాడో, అంత పైకి వెళ్లిపోయి అక్కడ స్థిరపడిపోతాడు. అల్లాహు అక్బర్! ఇది ఖురాన్ యొక్క ఘనత మిత్రులారా.

అంతే కాదండి, ఖుర్ఆను ద్వారా సమాధి శిక్షల నుండి రక్షణ లభిస్తుంది అని కూడా తెలియజేయడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే ప్రపంచంలో ఖుర్ఆన్ పారాయణం చేస్తారో, ముఖ్యంగా ప్రతిరోజు పడుకునే ముందు సూరా ముల్క్ 67వ అధ్యాయాన్ని పఠిస్తారో అలాంటి భక్తులకు సమాధి శిక్షల నుండి రక్షణ లభిస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

చూశారా? ప్రపంచంలో గౌరవం, సమాధి శిక్షల నుండి రక్షణ, మరియు పరలోకంలో గౌరవం, స్వర్గంలోని ఉన్నత స్థానాలు, ఎన్ని ఘనతలు దక్కుతున్నాయో చూడండి మిత్రులారా ఈ ఖుర్ఆన్ ద్వారా. మరి,

ఖుర్ఆను ద్వారా మనుషులు స్వస్థత కూడా పొందగలరు. పదిహేడవ అధ్యాయం 82వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

وَنُنَزِّلُ مِنَ الْقُرْآنِ مَا هُوَ شِفَاءٌ وَرَحْمَةٌ لِلْمُؤْمِنِينَ
మేము అవతరింపజేసే ఈ ఖుర్‌ఆన్‌ విశ్వాసుల కొరకు ఆసాంతం స్వస్థత, కారుణ్య ప్రదాయిని.” (17:82)

అంటే, ఇది స్వస్థత ఇస్తుంది అని అన్నారు. మనిషికి శారీరక వ్యాధులు ఉంటాయి, మానసిక వ్యాధులు కూడా ఉంటాయి. హృదయాలలో మనిషికి అసూయ, అహంకారం, ఇలాంటి కుళ్ళు బుద్దులు, కొన్ని దురలక్షణాలు ఉంటాయి, అవి హృదయాలలో ఉంటాయి. ఖుర్ఆన్ పఠిస్తే, ఖుర్ఆన్ ప్రకారంగా నడుచుకుంటే ఆ రోగాలన్నీ దూరమైపోతాయి, మనిషి స్వస్థత పొందుతాడు, మంచి స్వభావము కలిగిన వ్యక్తిగా మారిపోతాడు. అలాగే శారీరక వ్యాధులకు కూడా ఖుర్ఆన్ పారాయణము ద్వారా స్వస్థత లభిస్తుంది అని తెలియజేయడం జరిగి ఉంది.

అంతే కాదండి, మనిషికి మేలు చేసే అన్ని విషయాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ లో తెలియజేసి ఉన్నాడు. కాకపోతే దాని బాగా లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ఖుర్ఆన్ చదివి చూడండి. ప్రపంచం ఎలా మొదలైందో కూడా తెలియజేయడం జరిగింది. ప్రపంచం మొదలైన తర్వాత నేటి వరకు ఏ విధంగా నడుచుకుంటూ వస్తూ ఉంది అనేది కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ప్రళయం వరకు ఏమేమి సంభవిస్తాయో అది కూడా చెప్పడం జరిగింది. ప్రళయం తర్వాత మరణానంతరం ఏమేమి జరుగుతుందో అవి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనిషికి అవసరమైన అన్ని విషయాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇందులో తెలియజేశేశాడు. ఇప్పుడు ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఏమంటారంటే, ఏమండీ, సైన్స్ గురించి కూడా ఉందా ఖుర్ఆన్ లో అంటారు. సైన్స్ గురించి కూడా ఉంది. ఖుర్ఆన్ మరియు సైన్స్ అనే ఒక పుస్తకం ఉంది, అది చదవండి ఇన్ షా అల్లాహ్ తెలుస్తుంది. మరిన్ని విషయాలు కూడా ఉన్నాయి. అవి పరిశీలించి ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది మిత్రులారా.

ఇక చివరిగా మనం చూసినట్లయితే, ఖుర్ఆన్ లాంటి మరొక గ్రంథము ఎవ్వరూ సృష్టించలేరు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పదిహేడవ అధ్యాయము 88వ వాక్యంలో తెలియజేశాడు, మానవులందరూ కలిసిపోయినా, మానవులతో పాటు జిన్నాతులు, షైతానులు కూడా కలిసిపోయినా, అందరూ కలిసి ప్రయత్నించినా ఖుర్ఆన్ లాంటి మరొక గ్రంథము తయారు చేయలేరు.

అలాగే, ఖుర్ఆన్ సులభమైన గ్రంథము. యాభై నాలుగవ అధ్యాయము 22వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు, వలఖద్ యస్సర్నల్ ఖుర్ఆన. మేము ఖుర్ఆన్ గ్రంథాన్ని సులభతరం చేసేశాము అని అన్నారు. కాబట్టి ఖుర్ఆను గ్రంథాన్ని పిల్లలు కూడా నేర్చుకోవచ్చు, పెద్దలు కూడా నేర్చుకోవచ్చు, పురుషులు, మహిళలు, అందరూ కూడా ఖుర్ఆను గ్రంథాన్ని నేర్చుకోవచ్చు, చదవవచ్చు, కంఠస్థం చేయవచ్చు, అర్థం చేసుకోవచ్చు, అల్ హందులిల్లాహ్.

మిత్రులారా, నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను, ఇలాంటి మహిమలు, ఘనతలు, ప్రత్యేకతలు కలిగిన ఖుర్ఆను గ్రంథాన్ని చదువుకొని, కంఠస్థం చేసుకొని, అర్థం చేసుకొని, దాని ప్రకారంగా నడుచుకునే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఖుర్ఆను ద్వారా ప్రపంచంలోనూ, పరలోకంలోనూ గౌరవమైన స్థానాల వద్దకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ చేర్చుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30451

ఖురాన్ మెయిన్ పేజీ:
https://teluguislam.net/quran/

ఉజైర్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – “మరణించిన 100 సంవత్సరాలకు మళ్ళీ బతికిన వ్యక్తి” – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

ఉజైర్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – “మరణించిన 100 సంవత్సరాలకు మళ్ళీ బతికిన వ్యక్తి”
https://youtu.be/D1oAzBvsApU [32 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో వక్త, బనీ ఇస్రాయీల్ ప్రవక్తలలో ఒకరైన ఉజైర్ (అలైహిస్సలాం) గారి అద్భుతమైన జీవిత చరిత్రను వివరించారు. ముఖ్యంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు మరణం ఇచ్చి 100 సంవత్సరాల తర్వాత తిరిగి ఎలా బ్రతికించారో, ఆ సమయంలో జరిగిన చారిత్రక పరిణామాలు (బాబిలోనియా రాజు నెబుకద్ నెజర్ ద్వారా జెరూసలేం నాశనం, తౌరాత్ గ్రంథం దహనం, యూదుల బానిసత్వం మరియు విడుదల) గురించి చర్చించారు. ఉజైర్ (అలైహిస్సలాం) నాశనమైన నగరాన్ని చూసి ఆశ్చర్యపోవడం, అల్లాహ్ ఆయనను 100 సంవత్సరాలు మృతునిగా ఉంచి తిరిగి లేపడం, ఆయన ఆహారం చెడిపోకుండా ఉండటం మరియు గాడిద ఎముకలు తిరిగి ప్రాణం పోసుకోవడం వంటి దృష్టాంతాలను ఖురాన్ వాక్యాల (సూర బఖరా 2:259) ద్వారా వివరించారు. అలాగే, యూదులు ఉజైర్ (అలైహిస్సలాం) ను దైవ కుమారుడిగా భావించి చేసిన మార్గభ్రష్టత్వాన్ని ఖండిస్తూ (సూర తౌబా 9:30), మరణానంతర జీవితం, పునరుత్థానం, మరియు అల్లాహ్ శక్తిసామర్థ్యాలపై విశ్వాసం ఉంచాలని ఈ ప్రసంగం ద్వారా బోధించారు.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ
[అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్]

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా! మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనము ఒక ప్రవక్త గురించి తెలుసుకోబోతున్నాము. ఆయన ప్రత్యేకత ఏమిటంటే, ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణం ఇచ్చి వంద సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రతికించాడు. ఎవరండీ ఆయన? ఆశ్చర్యకరంగా ఉంది కదా వింటూ ఉంటే. ఆయన మరెవరో కాదు ఆయనే ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం వారు.

ఉజైర్ అలైహిస్సలాం వారి ప్రస్తావన ఖురాన్ గ్రంథంలో రెండు సూరాలలో వచ్చి ఉంది. ఒకటి సూర బఖరా రెండవ సూరా, రెండవది సూర తౌబా తొమ్మిదవ సూరా. ఈ రెండు సూరాలలో ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం వారి ప్రస్తావన వచ్చి ఉంది. ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం బనీ ఇస్రాయీల్ ప్రజల వద్దకు పంపించబడిన ప్రవక్తలలో ఒక ప్రవక్త.

ఆయన బనీ ఇస్రాయీల్ ప్రజల వద్దకు పంపించబడే సరికి, బనీ ఇస్రాయీల్ ప్రజల్లోని అధిక శాతం ప్రజలు కనుమరుగైపోయారు లేదా బానిసత్వానికి గురైపోయారు. అల్-ఖుద్స్ నగరంలో, పాలస్తీనా దేశంలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే బనీ ఇస్రాయీల్ వారు మిగిలి ఉన్నారు. అంతే కాదండీ, వారు నివసిస్తున్న పట్టణము కూడా నేలమట్టం అయిపోయింది. వారు ఎంతగానో పవిత్రంగా భావించే బైతుల్ మఖ్దిస్ కూడా నేలమట్టం అయిపోయింది. అలా ఎందుకు జరిగిందంటే, దాన్ని తెలుసుకోవడానికి బనీ ఇస్రాయీల్ వారి క్లుప్తమైన చరిత్ర మనము దృష్టిలో ఉంచుకోవాలి.

సులైమాన్ అలైహిస్సలాం వారి మరణానంతరం పరిస్థితులన్నీ తలకిందులైపోయాయి. సులైమాన్ అలైహిస్సలాం వారి సంతానంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయం కలిగింది. వారు ఎంతో పటిష్టంగా ఉన్న వారి సామ్రాజ్యాన్ని రెండు ముక్కలు చేసుకున్నారు. ఒక తమ్ముడు సగ భాగాన్ని, మరో తమ్ముడు సగ భాగాన్ని పంచుకొని, ఒక భాగానికి ‘ఇస్రాయీల్ రాజ్యం‘ అని పేరు పెట్టుకున్నారు, దానికి సామరియా రాజధాని అయ్యింది. మరో భాగానికి ‘యహూదా రాజ్యం’ అని పేరు పెట్టుకున్నారు, దానికి యెరూషలేము రాజధాని అయ్యింది.

అయితే ఆ తర్వాత ఇస్రాయీల్ లో ఉన్న బనీ ఇస్రాయీల్ ప్రజలు తొందరగా మార్గభ్రష్టత్వానికి గురైపోయారు. విగ్రహారాధనకు పాల్పడ్డారు, ‘బాల్‘ అనే విగ్రహాన్ని ఆరాధించారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడికి ప్రవక్తల్ని పంపించాడు. హిజ్కీల్ అలైహిస్సలాం వారు వచ్చారు, ఇలియాస్ అలైహిస్సలాం వారు వచ్చారు, అల్-యస అలైహిస్సలాం వారు వచ్చారు. ప్రవక్తలు వచ్చి వారికి చక్కదిద్దేటట్టు ప్రయత్నం చేసినా, దైవ వాక్యాలు బోధించినా, అల్లాహ్ వైపు పిలిచినా, వారు మాత్రము పాపాలను వదలలేదు, విగ్రహారాధనను కూడా వదలలేదు, మార్గభ్రష్టులుగానే మిగిలిపోయారు.

చివరికి ఏమైందంటే, పక్కనే ఉంటున్న ఆషూరీయులు వచ్చి ఇస్రాయీల్ సామ్రాజ్యం మీద యుద్ధం ప్రకటించి ఆ రాజ్యాన్ని వశపరుచుకున్నారు. ఆ ప్రకారంగా బనీ ఇస్రాయీల్ ప్రజలు రెండు భాగాలుగా విడిపోయి ఉన్న ఆ రెండు రాజ్యాలలో నుంచి ఒక రాజ్యము ఆషూరీయుల చేతికి వెళ్ళిపోయింది.

అయితే ఆశూరీయులు మిగిలిన రెండవ భూభాగాన్ని కూడా ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేసినా వారి పప్పులు ఉడకలేదు. ఎందుకంటే ఇక్కడ దైవభీతి మిగిలి ఉండింది కాబట్టి. కానీ కొద్ది రోజులు గడిచాక ఇక్కడ పరిస్థితులు కూడా మళ్ళీ మారిపోయాయి. ఇక్కడ ప్రజలు కూడా మార్గభ్రష్టత్వానికి గురైపోయారు, పాపాల్లో మునిగిపోయారు. అలాంటప్పుడు ఇరాక్ దేశము నుండి, బాబిలోనియా నుండి నెబుకద్ నెజరు (అరబ్బీలో ‘బుఖ్తె నసర్‘) అనే రాజు సైన్యాన్ని తీసుకొని వచ్చి యహూదా దేశం మీద, రాజ్యం మీద దాడి చేశాడు. యుద్ధం ప్రకటించి బనీ ఇస్రాయీల్ వారిని ఊచకోత కోశాడు. అలాగే బనీ ఇస్రాయీల్ వారి ఆస్తుల్ని ధ్వంసం చేయటంతో పాటు, వారు ఎంతగానో పవిత్రంగా భావించే బైతుల్ మఖ్దిస్ ని కూడా నేలమట్టం చేసేశాడు. వారు ఎంతో గౌరవంగా చదువుకునే, ఆచరించుకునే పవిత్రమైన గ్రంథం తౌరాత్ ని కూడా అతను కాల్చేశాడు.

బనీ ఇస్రాయీల్ ప్రజల్ని అయితే ముందు చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా హతమార్చాడు. తర్వాత ఎవరెవరైతే పనికొస్తారు అని అతను భావించాడో వారిని బానిసలుగా ఇరాక్ దేశానికి, బాబిలోనియా పట్టణానికి తీసుకెళ్లిపోయాడు. ఎవరితో అయితే నాకు అవసరం లేదులే వీళ్ళతో అని అనుకున్నాడో, అలాంటి వారిని మాత్రము అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే మిత్రులారా! ఆ ప్రకారంగా బనీ ఇస్రాయీల్ ప్రజలు, ముందు ఇస్రాయీల్ సామ్రాజ్యాన్ని ఆషూరీయుల చేతికి అప్పగించాల్సి వచ్చింది, యహూదా సామ్రాజ్యాన్ని నెబుకద్ నెజరు రాజుకి అప్పగించాల్సి వచ్చింది

ఆ ప్రకారంగా వారి రెండు రాజ్యాలు కూడా రెండు వేరు వేరు శత్రువులు లాక్కున్నారు. అలాగే జయించి వశపరచుకున్నారు. మళ్ళీ బనీ ఇస్రాయీల్ ప్రజలు పరాభవానికి గురి అయ్యి ఉన్నారు, బానిసలుగా మార్చబడి ఉన్నారు. ఎంతో కొంతమంది మాత్రమే అక్కడ మిగిలిపోయి ఉన్నారు. అలాంటి పరిస్థితిలో, పట్టణము కూల్చబడి ఉంది, పుణ్యక్షేత్రము కూల్చబడి ఉంది, ప్రజలు కూడా చెల్లాచెదురైపోయి ఉన్నారు, బానిసలుగా మార్చబడి ఉన్నారు, ఎంతో కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు. అలాంటి స్థితిలో ఉజైర్ అలైహిస్సలాం వారు వచ్చారు.

ఆయన మామూలుగా పొలం వద్ద పని కోసము గాడిద మీద కూర్చొని బయలుదేరి వెళ్లారు. వెళ్లి అక్కడ పొలం పనులన్నీ ముగించుకొని కొన్ని ద్రాక్ష పండ్లు, అలాగే అత్తి పండ్లు తీసుకొని మళ్ళీ అదే గాడిద మీద కూర్చొని తిరిగి ఇంటికి పయనమయ్యారు. వస్తూ వస్తూ ఒకచోట లోయలోకి ప్రవేశించి కాసేపు నీడలో సేద తీరుదాము అని ఒక గోడ నీడలో లేదా ఒక చెట్టు నీడలో ఆయన కూర్చోవడానికి ప్రయత్నిస్తూ, ఆయన వద్ద ఉన్న గాడిదను ఒకచోట కట్టేశారు.

తర్వాత నీడలో కూర్చొని ఆయన వద్ద ఉన్న ద్రాక్ష పండ్లను ముందుగా ఒక పాత్రలో పిండారు. ఆ ద్రాక్ష రసంలో కొన్ని రొట్టె ముక్కలు నాన్చడానికి ఉంచారు. ఆ రొట్టెలు నానే వరకు ఆయన గోడను లేదా చెట్టుని అలా వీపుతో ఆనుకొని, కంటి ముందర కనిపిస్తున్న దృశ్యాలను చూడసాగారు. ముందర పాడుబడిపోయిన పట్టణము, కూల్చబడిన పట్టణము, కూల్చబడిన పుణ్యక్షేత్రము అవి దర్శనమిస్తున్నాయి. అవి చూస్తూ ఉంటే, ఊహించని రీతిలో, అనుకోకుండా ఆయన ప్రమేయం లేకుండానే ఆయన నోటి నుండి ఒక మాట వచ్చింది. ఏంటి ఆ మాట అంటే:

أَنَّىٰ يُحْيِي هَٰذِهِ اللَّهُ بَعْدَ مَوْتِهَا
[అన్నా యుహ్ యీ హాజిహిల్లాహు బాద మౌతిహా]
దీని చావు తర్వాత అల్లాహ్ తిరిగి దీనికి ఎలా ప్రాణం పోస్తాడు? (ఖుర్ఆన్, 2:259)

అంటే ఈ నగరం మొత్తం పాడుబడిపోయింది కదా, మళ్ళీ ప్రజల జీవనంతో ఈ నగరం కళకళలాడాలంటే ఇది సాధ్యమవుతుందా? అని ఆశ్చర్యం వ్యక్తపరిచారు. అనుమానం వ్యక్తపరచలేదు, ఇది ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఉజైర్ అలైహిస్సలాం వారు గొప్ప దైవభీతిపరులు, గ్రంథ జ్ఞానము కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి అల్లాహ్ తో ఇది సాధ్యమేనా అని అనుమానము, సందేహము ఎప్పుడూ వ్యక్తపరచరు. అల్లాహ్ శక్తి మీద ఆయనకు పూర్తి నమ్మకం ఉంది. ఆశ్చర్యం వ్యక్తపరిచారు – ఇది ఎప్పుడు అవుతుంది? ఎలా అవుతుంది? ఇప్పట్లో ఇది అయ్యే పనేనా? అనేటట్టుగా ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే ఆయన ఏ స్థితిలో అయితే నీడలో అలా వీపు ఆంచుకొని కూర్చొని ఉన్నారో, అదే స్థితిలో ఆయనకు మరణం ఇచ్చేశాడు. ఎన్ని సంవత్సరాల వరకు ఆయన అదే స్థితిలో ఉన్నారు అంటే, వంద సంవత్సరాల వరకు ఆయన అదే స్థితిలో ఉన్నారు.

فَأَمَاتَهُ اللَّهُ مِائَةَ عَامٍ
[ఫ అమాతహుల్లాహు మిఅత ఆమిన్]
“అల్లాహ్ అతన్ని నూరేళ్ళ వరకు మరణ స్థితిలో ఉంచాడు.” (ఖుర్ఆన్, 2:259)

ఖురాన్ లో నూరేళ్ళ వరకు ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అదే స్థితిలో ఉంచాడు అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది.

అయితే 100 సంవత్సరాలు ఆయన అదే స్థితిలో ఉన్నారు కదా, మరి ఈ 100 సంవత్సరాలలో ఏమి జరిగిందంటే చాలా ముఖ్యమైన విషయాలు చోటు చేసుకున్నాయి. ఏమి జరిగిందంటే, నెబుకద్ నెజరు బనీ ఇస్రాయీల్ వారి మీద దాడి చేసి, పుణ్యక్షేత్రం కూల్చేసి, గ్రంథము కాల్చేసి, బనీ ఇస్రాయీల్ వారిని పురుషుల్ని అలాగే మహిళల్ని బానిసలుగా మార్చి ఇరాక్ దేశానికి, బాబిలోనియా పట్టణానికి పట్టుకెళ్లిపోయాడు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే…

పక్కనే ఉన్న పార్షియా దేశం (ఇరాన్ దేశం అని మనం అంటున్నాం కదా), ఆ పార్షియా దేశానికి చెందిన రాజు ఇరాక్ దేశం మీద యుద్ధం ప్రకటించాడు. యుద్ధం చేసి ఇరాక్ దేశాన్ని జయించేశాడు. ఇరాక్ దేశము ఇప్పుడు పార్షియా దేశ రాజు చేతికి వచ్చేసింది. ఆ పార్షియా దేశము (అనగా ఇరాన్ దేశపు రాజు) ఇరాక్ దేశాన్ని కూడా జయించిన తర్వాత, అక్కడ బానిసలుగా నివసిస్తున్న యూదులను స్వతంత్రులుగా చేసేసి, “మీరు మీ సొంతూరికి, అనగా పాలస్తీనా దేశానికి, అల్-ఖుద్స్ నగరానికి తిరిగి వెళ్లిపోండి” అని అనుమతి ఇచ్చేశాడు.

చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము 50-60 సంవత్సరాల తర్వాత ఆ రాజు ద్వారా బనీ ఇస్రాయీల్ ప్రజలకి మళ్ళీ బానిసత్వం నుండి స్వతంత్రం లభించింది. అప్పుడు వారందరూ కూడా స్వతంత్రులై బాబిలోనియా పట్టణాన్ని వదిలేసి, మళ్ళీ పాలస్తీనాలో ఉన్న అల్-ఖుద్స్ నగరానికి పయనమయ్యారు. అయితే ఈ 50-60 సంవత్సరాలలో వారు భాష మర్చిపోయారు, సంప్రదాయాలు మర్చిపోయారు, ధర్మ ఆదేశాలు కూడా చాలా శాతము మర్చిపోయారు. సరే ఏది ఏమైనప్పటికీ వాళ్ళు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. వచ్చి అక్కడ మళ్ళీ నివాసం ఏర్పరచుకున్నారు. ఆ ప్రకారంగా కూల్చివేయబడిన ఆ పట్టణము, నగరము మళ్ళీ ప్రజల నివాసంతో కళకళలాడటం ప్రారంభించింది. ఇలా వంద సంవత్సరాల లోపు జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు చోటు చేసుకున్న తర్వాత, అప్పుడు రెండవసారి మళ్ళీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉజైర్ అలైహిస్సలాం వారికి మళ్ళీ బ్రతికించాడు.

చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము ఆయన మరణించే సమయానికి ఆయన వయస్సు 40 సంవత్సరాలు ఉండింది. 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రతికించబడుతున్నప్పుడు కూడా ఆయన 40 సంవత్సరాల వయసులో ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా, అదే శక్తితో, అదే శరీరంతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనను మళ్ళీ బ్రతికించాడు.

దూత వచ్చాడు. దూత వచ్చి ఆయనను లేపి:

قَالَ كَمْ لَبِثْتَ
[ఖాల కమ్ లబిస్త]
“నీవు ఎంత కాలం ఈ స్థితిలో ఉన్నావు?” అని అడిగాడు. (ఖుర్ఆన్, 2:259)

ఉజైర్ అలైహిస్సలాం వారు లేచి ముందు అటూ ఇటూ చూశారు. చూస్తే గాడిద కనిపించట్లేదు. గాడిద బంధించిన చోట పాడుబడిపోయిన ఎముకలు కనిపిస్తున్నాయి. 100 సంవత్సరాలు గడిచిన విషయం ఆయనకు తెలియదు. ఈ 100 సంవత్సరాలలో గాడిద చనిపోయింది, ఎముకలు కూడా పాడుబడిపోయాయి, కొన్ని పాడుబడిన ఎముకలు కనిపిస్తున్నాయి. పక్కనే ఉంచబడిన ద్రాక్ష రసంలో ఉంచబడిన రొట్టె ముక్కలు, అవి మాత్రము తాజాగా అలాగే ఉన్నాయి, ఫ్రెష్ గా ఉన్నాయి. ఆహారాన్ని చూస్తూ ఉంటే, ఇప్పుడే కొద్దిసేపు ఏమో నేను అలా పడుకొని లేచానేమో అనిపిస్తూ ఉంది. గాడిదను చూస్తూ ఉంటే అసలు గాడిద కనిపించట్లేదు. కాబట్టి వెంటనే ఆయన ఏమన్నారంటే:

لَبِثْتُ يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ
[లబిస్తు యౌమన్ ఔ బాద యౌమ్]
“ఒక రోజు లేదా ఒక రోజులో కొంత భాగం మాత్రమే నేను ఈ స్థితిలో ఉన్నాను” అని చెప్పారు. (ఖుర్ఆన్, 2:259)

ఆహారాన్ని చూసి ఆయన ఆ విధంగా అనుమానించారు. అయితే దూత వచ్చి:

بَل لَّبِثْتَ مِائَةَ عَامٍ
[బల్ లబిస్త మిఅత ఆమ్]
“కాదు, నీవు ఈ స్థితిలో వంద సంవత్సరాలు ఉన్నావయ్యా” (ఖుర్ఆన్, 2:259)

అని చెప్పి, “చూడండి మీ గాడిద మరణించి ఎముకలు ఎముకలైపోయింది. మీ కళ్ళ ముందరే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దానిని మళ్ళీ బ్రతికిస్తాడు చూడండి” అని చెప్పగానే, అల్లాహ్ నామంతో పిలవగానే ముందు ఎముకలు తయారయ్యాయి. ఎముకలు జోడించబడ్డాయి. ఆ ఎముకల మీద మాంసము జోడించబడింది. ఆ తర్వాత దానికి ప్రాణము వేయడం జరిగింది. ఆ ప్రకారంగా ఉజైర్ అలైహిస్సలాం వారి కళ్ళ ముందరే ఎముకలుగా మారిపోయిన ఆ గాడిద మళ్ళీ జీవించింది. అప్పుడు ఉజైర్ అలైహిస్సలాం వారు అదంతా కళ్ళారా చూసి వెంటనే ఈ విధంగా పలికారు:

قَالَ أَعْلَمُ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
[ఖాల ఆలము అన్నల్లాహ అలా కుల్లి షైఇన్ ఖదీర్]
“అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడని నాకు తెలుసు” అని ఉజైర్ అన్నారు. (ఖుర్ఆన్, 2:259)

ఈ ప్రస్తావన మొత్తము ఖురాన్ గ్రంథము రెండవ అధ్యాయము 259వ వాక్యంలో వివరంగా తెలుపబడి ఉంది.

సరే, 100 సంవత్సరాల తర్వాత ఆయన బ్రతికారు, పట్టణం ప్రజలతో కళకళలాడుతూ ఉంది, పట్టణం పూర్తిగా మళ్ళీ నిర్మించబడి ఉంది, పుణ్యక్షేత్రము కూడా మళ్ళీ నిర్మించబడి ఉంది. గాడిద మీద కూర్చొని ఆయన పట్టణానికి వెళ్లారు.

పట్టణానికి వెళ్ళినప్పుడు చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, ఆయన మరణించేటప్పుడు ఆయన ఇంటిలో ఒక సేవకురాలు ఉండేది, అప్పుడు ఆవిడ వయస్సు 20 సంవత్సరాలు. ఇప్పుడు ఈయన 100 సంవత్సరాల తర్వాత వెళ్తున్నారంటే ఆవిడ వయస్సు ఎంత అయి ఉంటుందండి? 20 + 100, కలిపితే 120 సంవత్సరాలకు చేరుకొని ఉంది. ఆవిడ పూర్తిగా ముసలావిడగా మారిపోయి, వృద్ధాప్యానికి గురయ్యి, కంటిచూపు దూరమైపోయింది, కాళ్ళు కూడా పడిపోయి ఉన్నాయి. ఆవిడ ఒక మంచానికే పరిమితమైపోయి ఉంది.

ఆవిడ వద్దకు ముందు ఉజైర్ అలైహిస్సలాం వారు వెళ్ళారు. వెళ్లి “అమ్మా నేను ఉజైర్ ని” అంటే, ‘ఉజైర్’ అన్న పేరు వినగానే ఆవిడ బోరున ఏడ్చేసింది. “ఎన్నో సంవత్సరాల క్రితము మా యజమాని ఉండేవారు” అని ఏడుస్తూ ఉంటే, “అమ్మా నేనే మీ యజమాని ఉజైర్ ని” అని చెప్పారు. అప్పుడు ఆ మహిళ, “అరె! 100 సంవత్సరాల తర్వాత వచ్చి మీరు నా యజమాని అంటున్నారు, ఎలాగండి నేను నమ్మేది? ఉజైర్ గొప్ప భక్తుడు. ఆయన ప్రార్థన చేస్తే, దుఆ చేస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తప్పనిసరిగా ఆమోదించేవాడు. మీరు ఉజైర్ అయితే, నాకు కంటిచూపు మళ్ళీ రావాలని, అలాగే చచ్చుబడిపోయిన నా కాళ్ళు మళ్ళీ ఆరోగ్యంగా మారాలని దుఆ చేయండి” అని కోరారు.

ఉజైర్ అలైహిస్సలాం వారు దుఆ చేశారు. దుఆ చేయగా ఆవిడకు కంటిచూపు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తిరిగి ఇచ్చేశాడు, ఆవిడ కాళ్ళు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ నయం చేసేశాడు. అప్పుడు ఆవిడ లేచి, ఉజైర్ అలైహిస్సలాం వారిని చూసి, చెయ్యి పట్టుకొని, “నేను సాక్ష్యం ఇస్తున్నాను ఈయనే ఉజైర్ అలైహిస్సలాం” అని సాక్ష్యం ఇచ్చారు.

తర్వాత “రండయ్యా మీ ఇంటిని చూపిస్తాను, మీ కుటుంబీకుల్ని చూపిస్తాను” అని ఉజైర్ అలైహిస్సలాం వారిని వెంటబెట్టుకొని ఉజైర్ అలైహిస్సలాం వారి ఇంటికి వెళితే, అప్పుడు కుటుంబ సభ్యులలో ఉజైర్ అలైహిస్సలాం వారి కుమారులు ఉన్నారు. వారి వయస్సు కూడా 100 దాటిపోతూ ఉంది. ఉజైర్ అలైహిస్సలాం వారిని ఇంటి బయట నిలబెట్టి, ఆవిడ ఇంటిలోనికి ప్రవేశించి ఉజైర్ అలైహిస్సలాం వారి కుమారుల వద్దకు వెళ్లి, “మీ నాన్నగారు వచ్చారు” అంటే వారందరూ షాక్ అయ్యారు. అవాక్కయిపోయారు. “అదేమిటి 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో కనుమరుగైపోయిన మా తండ్రి ఇప్పుడు తిరిగి వచ్చారా ఇంటికి?” అని వారు షాక్ అయిపోతూ ఉంటే, “అవునండీ, చూడండి నాకు కంటిచూపు ఉండేది కాదు, నాకు కాళ్ళు కూడా చచ్చుబడిపోయి ఉండేవి. కానీ ఆయన వచ్చి ప్రార్థన చేయగా నాకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కంటిచూపు ఇచ్చాడు, కాళ్ళను నయం చేశాడు. నేను మళ్ళీ ఆరోగ్యంగా తిరగగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను. చూడండి బయట ఉన్నారు” అని చెప్పగానే, వచ్చి ఉజైర్ అలైహిస్సలాం వారిని మళ్ళీ ఇంట్లోకి ఆహ్వానించగా, ముందుగా కుమారులు ఆశ్చర్యపడ్డారు.

సందేహం వ్యక్తపరుస్తూ ఒక కుమారుడు ఏమన్నాడంటే, “చూడండి మా నాన్నగారికి భుజం పక్కన మచ్చ లాంటి ఒక గుర్తు ఉండేది, అది ఉందేమో చూడండి” అన్నారు. ఉజైర్ అలైహిస్సలాం వారు బట్టలు కొంచెం పక్కకు జరిపి చూపియగా, అక్కడ నిజంగానే ఆ మచ్చ లాంటి గుర్తు కనిపించింది. అప్పుడు కుటుంబ సభ్యులు ఉజైర్ అలైహిస్సలాం వారిని “ఈయనే మా తండ్రి” అని గ్రహించారు.

అయితే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము ఉజైర్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 40 సంవత్సరాల వ్యక్తి లాగే సిద్ధం చేశాడు. వారి కుమారులు మాత్రము 100 సంవత్సరాలు చేరుకున్న వృద్ధుల్లా కనిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఇలా సంఘటన జరిగిన తర్వాత ఉజైర్ అలైహిస్సలాం వారు మళ్ళీ నగరంలోకి వచ్చారు, నగర ప్రజల్ని ప్రోగు చేశారు. ప్రోగు చేసి “ఎవరెవరికి తౌరాత్ గ్రంథంలోని వాక్యాలు కంఠస్థమై ఉన్నాయో, ఎన్ని కంఠస్థమై ఉంటే వారు వచ్చి నాకు వినిపించండి” అని పిలుపునిచ్చారు. ఎవరెవరికి ఎన్ని వాక్యాలు కంఠస్థం చేయబడి ఉన్నాయో వారందరూ వచ్చి ఉజైర్ అలైహిస్సలాం వారికి వారు కంఠస్థం చేసిన ఆ తౌరాత్ గ్రంథంలోని దైవ వాక్యాలు వినిపించారు.

అప్పుడు ఉజైర్ అలైహిస్సలాం వారు ఒక చెట్టు నీడలో కూర్చొని, ఇతర వ్యక్తుల నోట విన్న వాక్యాలు, ఆయన స్వయంగా కంఠస్థం చేసిన వాక్యాలు అన్నీ కూడా మళ్ళీ రచించారు. ఆ ప్రకారంగా మళ్ళీ తౌరాత్ గ్రంథం (నెబుకద్ నెజరు రాజు దాన్ని కాల్చేసి వెళ్లిపోయాడని చెప్పాము కదా), ఆ కాలిపోయి కనుమరుగైపోయిన తౌరాత్ గ్రంథంలోని వాక్యాలను, ఎవరెవరు ఎంత కంఠస్థం చేసి ఉన్నారో అన్ని వాక్యాలు మళ్ళీ తిరిగి ఉజైర్ అలైహిస్సలాం వారు రచించారు. రచించి ప్రజలకు గ్రంథము ఇవ్వడంతో పాటు ఆ గ్రంథంలోని వాక్యాలు, వాటి సారాంశము ప్రజలకు బోధించడం ప్రారంభించారు.

ఆ తర్వాత ఉజైర్ అలైహిస్సలాం వారు ఎన్ని సంవత్సరాలు జీవించారు అంటే, చరిత్రలో ప్రామాణికమైన ఆధారాలు మనకు ఎక్కడా దొరకలేదు. ఆయన మాత్రము మరణించారు. ఎప్పుడు మరణించారు? ఎన్ని సంవత్సరాల వయసులో మరణించారు? ఏ విధంగా ఆయన మరణం సంభవించింది? అన్న వివరాలు మాత్రము ప్రామాణికమైన ఆధారాలలో మనకు ఎక్కడా దొరకలేదు. అయితే ఆయన సమాధి మాత్రము ‘డమస్కస్’ నగరంలో నేటికీ ఉంది అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.

ఆయన మరణానంతరం చోటు చేసుకున్న పరిస్థితుల్ని మనం చూసినట్లయితే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం, ఉజైర్ అలైహిస్సలాం వారు జీవించినన్ని రోజులు ప్రజలు ఆయనను ఒక బోధకునిగా గౌరవించారు. ఆయన మరణించిన తర్వాత… ఆయన 100 సంవత్సరాలు మరణించి మళ్ళీ జీవించారన్న ఒక అభిప్రాయం ఉండేది, ఆయన దుఆతో ప్రజల సమస్యలు తీరాయని మరొక అభిప్రాయం ఉండేది, అలాగే ఆయన గ్రంథాన్ని రచించి ప్రజలకు వినిపించారు, ఇచ్చారు అనే మరో అభిప్రాయం ఉండింది. ఇలా అనేక అభిప్రాయాల కారణంగా ఉజైర్ అలైహిస్సలాం వారి గౌరవంలో బనీ ఇస్రాయీల్ ప్రజలు హద్దు మీరిపోయారు. ఆ గౌరవంలో, అభిమానంలో ఏకంగా ఉజైర్ అలైహిస్సలాం వారిని “దైవ కుమారుడు” అని చెప్పటం ప్రారంభించారు. తర్వాత అదే వారి విశ్వాసంగా మారిపోయింది, “ఉజైర్ దైవ కుమారుడు” అని నమ్మటం ప్రారంభించారు. వారి ఈ నమ్మకం సరికాదు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలోని తొమ్మిదవ అధ్యాయం, 30వ వాక్యంలో స్పష్టంగా ఖండించి ఉన్నాడు.

وَقَالَتِ الْيَهُودُ عُزَيْرٌ ابْنُ اللَّهِ وَقَالَتِ النَّصَارَى الْمَسِيحُ ابْنُ اللَّهِ ۖ ذَٰلِكَ قَوْلُهُم بِأَفْوَاهِهِمْ ۖ يُضَاهِئُونَ قَوْلَ الَّذِينَ كَفَرُوا مِن قَبْلُ ۚ قَاتَلَهُمُ اللَّهُ ۚ أَنَّىٰ يُؤْفَكُونَ

“ఉజైర్ అల్లాహ్ కుమారుడు” అని యూదులు అంటున్నారు. “మసీహ్ (క్రీస్తు) అల్లాహ్ కుమారుడు” అని క్రైస్తవులు అంటున్నారు. ఇవి వారి నోటి మాటలు మాత్రమే. తమ పూర్వీకులలోని అవిశ్వాసులు చెప్పిన మాటలనే వీళ్ళు అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నాశనం చేయుగాక! సత్యం నుండి వారెలా తిరిగిపోతున్నారో చూడండి. (ఖుర్ఆన్, 9:30)

అంటే ఈ వాక్యాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారు నమ్ముతున్న నమ్మకాన్ని ఖండిస్తూ, ఇది నిజము కాదు, వారు కల్పించుకున్న కల్పితాలు మాత్రమే, వారి నోటి మాటలు మాత్రమే అని స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు.

ఉజైర్ అలైహిస్సలాం వారి గురించి ఒక హదీసులో పరోక్షంగా ప్రస్తావన వచ్చి ఉంది. బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఒక హదీసు ఉందండి. ఆ హదీసు ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

‘పూర్వము ఒక ప్రవక్త ఉండేవారు. ఆయన వెళుతూ ఉంటే ఒకచోట కూర్చున్నప్పుడు, ఆయనకు ఒక చీమ కరిచింది. చీమ కరిచినప్పుడు ఆయన కోపగించుకొని, కోపంతో చీమ పుట్టను త్రవ్వేసి, ఆ పుట్టలో ఉన్న చీమలన్నింటినీ దహనం చేసేశారు.వెంటనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ ప్రవక్త వద్దకు వహీ (దైవవాణి) పంపించాడు. ‘నీకు హాని కలిగించింది, నీకు కుట్టింది ఒక చీమ కదా. నీకు కోపం ఉంటే ఒక చీమను చంపుకోవాలి. కానీ, పూర్తి పుట్టలో ఉన్న చీమలన్నింటినీ దహనం చేసేయటము, కాల్చేయటం ఏమిటి?’ అని ఒక ఉల్లేఖనంలో ఉంది.

మరో ఉల్లేఖనంలో ఈ విధంగా తెలుపబడి ఉంది: ‘నీకు ఒక్క చీమ కుట్టిందన్న సాకుతో, నీవు ఆ పుట్టలో ఉన్న చీమలన్నింటినీ దహనం చేసేశావు. వాస్తవానికి ఆ సమూహము అల్లాహ్ ను స్మరించేది (తస్బీహ్ చేసేది). అల్లాహ్ ను స్మరించే ఒక సమూహాన్ని ఒక్క చీమ కుట్టిన కారణంగా నీవు దహనం చేశావేమిటి?’ అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆక్షేపించాడు.’

మరి ఎవరి గురించి ఇక్కడ ప్రస్తావన ఉంది అంటే ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు మరియు హసన్ బస్రీ రహిమహుల్లా వారు ఏమంటున్నారు అంటే, ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఆ ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం అని తెలియజేసి ఉన్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.

ఉజైర్ అలైహిస్సలాం ఏ కాలానికి చెందిన వారు అంటే చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, సులైమాన్ అలైహిస్సలాం మరియు ఈసా అలైహిస్సలాం వీరిద్దరి మధ్యలో వచ్చిన ప్రవక్త. అలాగే మరికొంతమంది ధార్మిక పండితులు ఏమంటున్నారు అంటే, ఉజైర్ అలైహిస్సలాం వారు ప్రవక్త కాదు, ఆయన గొప్ప భక్తుడు, గ్రంథ జ్ఞాని అని అంటున్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.

ఇది ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర. ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనము గ్రహించాల్సిన పాఠాలు ఏమిటి అనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకొని మాటను ముగిస్తాను.

1. అల్లాహ్ మృతులను తిరిగి బ్రతికించగలడు:

ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం గ్రహించాల్సిన మొదటి విషయం ఏమిటంటే, మృతులను మళ్ళీ బ్రతికించేవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అన్న విషయం ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనకు స్పష్టంగా తెలుపబడింది. ఉజైర్ అలైహిస్సలాం వారు 100 సంవత్సరాల కోసము మరణించి, 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ అల్లాహ్ ఆజ్ఞతో జీవించబడ్డారు, మళ్ళీ బ్రతికించబడ్డారు. చూసారా? మొదటిసారి ప్రాణం పోసిన ఆయన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, ఆయనకు 100 సంవత్సరాల కోసం మరణం ఇచ్చి, 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనకు బ్రతికించి ప్రాణం పోసి నిలబెట్టాడు. కాబట్టి మానవులను మళ్ళీ పుట్టించగల శక్తి అల్లాహ్ కు ఉంది అని ఈ ఉజైర్ అలైహిస్సలాం వారి ద్వారా మనకు స్పష్టం చేయబడింది.

ఖురాన్ గ్రంథం 36వ అధ్యాయం, 78-79 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు.

قَالَ مَن يُحْيِي الْعِظَامَ وَهِيَ رَمِيمٌ * قُلْ يُحْيِيهَا الَّذِي أَنشَأَهَا أَوَّلَ مَرَّةٍ ۖ وَهُوَ بِكُلِّ خَلْقٍ عَلِيمٌ

“కుళ్లి కృశించి పోయిన ఎముకలను ఎవడు బ్రతికిస్తాడు?” అని వాడు (మానవుడు) సవాలు విసురుతున్నాడు. వారికి సమాధానం ఇవ్వు, “వాటిని తొలిసారి సృష్టించినవాడే మలిసారి కూడా బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు.” (ఖుర్ఆన్, 36:78-79)

తొలిసారి పుట్టించిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మలిసారి కూడా పుట్టించగలుగుతాడు, ఆయనకు అలా చేయటం చాలా సులభం అని తెలుపబడటం జరిగింది. ఖురాన్ లో ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇబ్రహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ తో, “నీవు మరణించిన వారిని మళ్ళీ ఎలా బ్రతికిస్తావు?” అని అడిగినప్పుడు, పక్షుల్ని తీసుకొని వాటి ఎముకల్ని అటూ ఇటూ పడవేయ్యండి, తర్వాత అల్లాహ్ పేరుతో పిలవండి, అవి మళ్ళీ బ్రతికి వస్తాయి అని చెప్పగా, ఆయన అలాగే చేశారు. అల్లాహ్ పేరుతో పిలవగానే ఎముకలుగా మార్చబడిన ఆ పక్షులు మళ్ళీ పక్షుల్లాగా జీవించి ఎగురుకుంటూ ఆయన వద్దకు వచ్చాయి.

అలాగే హిజ్కీల్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో, ఇంచు మించు 35 వేల మంది లోయలో మరణించారు. ప్రవక్త కళ్ళ ముందరే మళ్ళీ వారు బ్రతికించబడ్డారు. అలాగే మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో, ఇంచు మించు 70 మంది బనీ ఇస్రాయీల్ తెగకు చెందిన నాయకులు పర్వతం మీద మరణించారు. తర్వాత మూసా అలైహిస్సలాం దుఆతో వాళ్ళు మళ్ళీ బ్రతికించబడ్డారు.

ఈ విధంగా ఖురాన్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణించిన వారు, మరణించిన తర్వాత మళ్ళీ లేపబడతారు అన్న కొన్ని ఉదాహరణలు తెలియజేసి ఉన్నాడు. అలాగే గుహవాసులు, ‘అస్ హాబుల్ కహఫ్’ అని మనం అంటూ ఉంటాం. వారిని కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముందు మరణం ప్రసాదించి, తర్వాత మళ్ళీ జీవించేలాగా చేశాడు. ఇలాంటి కొన్ని ఉదాహరణలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో తెలియజేసి ఉన్నాడు.

ఆ ఉదాహరణల ద్వారా మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణించిన వారిని మళ్ళీ లేపగలుగుతాడు అని స్పష్టంగా, ఉదహరించి మరీ నిజమైన ఆధారాలతో తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి విశ్వాసి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణించిన వారిని మళ్ళీ లేపగలుగుతాడు, మళ్ళీ బ్రతికించగలుగుతాడు అని నమ్మాలి, విశ్వసించాలి.

2. సమాజ సంస్కరణ బాధ్యత:

ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం గ్రహించాల్సిన మరొక విషయం, సమాజ సంస్కరణకు కృషి చేయాలి. ఉజైర్ అలైహిస్సలాం వారు రెండవసారి లేపబడినప్పుడు, ప్రజల వద్దకు వెళ్లి దైవ వాక్యాలు రచించి, ప్రజలకు అందజేయడంతో పాటు బోధించారు. సమాజాన్ని సంస్కరించారు, ప్రజలను సంస్కరించారు. కాబట్టి ప్రతి విశ్వాసి సమాజాన్ని సంస్కరించడానికి కృషి చేయాలి. చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సమాజమైన మనకు “ఉత్తమ సమాజం” అని బిరుదు ఇస్తూ, “మీరు మంచిని బోధిస్తారు, చెడును నిర్మూలిస్తారు” అని బాధ్యత ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి సమాజ సంస్కరణ కోసము కృషి చేయాలన్న విషయం ఇక్కడ మనము గుర్తు చేసుకోవాలి.

3. మరణానంతర జీవితం:

మరణానంతరం జీవితం ఉంది అన్న విషయం కూడా ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనకు తెలుపబడింది. ఉజైర్ అలైహిస్సలాం వారు మరణించారు, మళ్ళీ బ్రతికించబడ్డారు. అదే విధంగా పుట్టిన తర్వాత మరణించిన ప్రతి మనిషిని పరలోకంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ బ్రతికిస్తాడు. అక్కడ లెక్కింపు ఉంటుంది, చేసిన కర్మలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడ లెక్క తీసుకొని స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయిస్తాడు. మరణానంతర జీవితం ఉంది అని స్పష్టపరచడానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా ప్రజలకు కొన్ని ఉదాహరణలు ప్రపంచంలోనే చూపించి ఉన్నాడు. మరణించిన వాడు మరణించాడు, ఇక మట్టిలో కలిసిపోయాడు అంతే, ఆ తర్వాత మళ్ళీ జీవితం అనేది లేదు అని భ్రమించే వారికి, చూడండి మరణించిన వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ లేపుతాడు అని ఇక్కడ కొంతమందిని లేపి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చూపించి ఉన్నాడు కాబట్టి, ఆ ప్రకారంగా మరణానంతర మరొక జీవితం ఉంది అన్న విషయం ఇక్కడ తెలియజేయడం జరిగింది. ప్రతి విశ్వాసి ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి.

4. సృష్టి యావత్తు అల్లాహ్ ను స్తుతిస్తుంది:

అల్లాహ్ ను స్తుతిస్తూ ఉండాలి. చీమల గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమన్నారంటే, “అవి అల్లాహ్ ను స్తుతిస్తూ ఉన్నాయి. అల్లాహ్ ను స్తుతించే చీమలని మీరు దహనం చేసేసారు ఏమిటి?” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడ ఆ ప్రవక్తను నిలదీశాడు అంటే, చీమలు సైతం అల్లాహ్ ను స్తుతిస్తూ ఉన్నాయి. ఉత్తమ జీవులైన మానవులు మరీ ఎక్కువగా అల్లాహ్ ను స్తుతిస్తూ ఉండాలి, అల్లాహ్ ను స్మరిస్తూ ఉండాలి.

ఖురాన్ గ్రంథం 62వ అధ్యాయం, 1వ వాక్యంలో అల్లాహ్ ఈ విధంగా తెలియజేశాడు:

يُسَبِّحُ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ
[యుసబ్బిహు లిల్లాహి మాఫిస్ సమావాతి వమా ఫిల్ అర్జ్]
“భూమ్యాకాశాలలో ఉన్న వస్తువులన్నీ అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి.” (ఖుర్ఆన్, 62:1)

భూమి ఆకాశాలలో ఉన్న ప్రతిదీ అల్లాహ్ ను స్తుతిస్తూ ఉంది, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంది, అల్లాహ్ ను స్మరిస్తూ ఉంది. కాబట్టి మానవులు కూడా అల్లాహ్ ను స్తుతిస్తూ, అల్లాహ్ ను స్మరిస్తూ, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉండాలి. ఎవరైతే అల్లాహ్ ను స్తుతిస్తారో వారు ఇహపర సాఫల్యాలు మరియు అనుగ్రహాలు పొందుతారన్న విషయం కూడా తెలియజేయడం జరిగింది.

5. అగ్నితో శిక్షించే అధికారం:

చివర్లో ఒక విషయం ఏమిటంటే, అగ్నితో శిక్షించే అధికారం అల్లాహ్ కు మాత్రమే ఉంది. ఆయన (పూర్వం ఒక ప్రవక్త) చీమ కుట్టింది అని చీమలను కాల్చేశాడు. కాల్చేస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా “ఎందుకు వారిని కాల్చింది? కుట్టింది ఒక చీమే కదా. ఆ ఒక చీమని కావాలంటే మీరు చంపుకోవాలి గాని, మొత్తం చీమలను దహనం చేశారు ఏమిటి?” అని నిలదీశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని తెలియజేశారు అంటే:

“నిశ్చయంగా, అగ్నితో శిక్షించే అధికారం అగ్నిని సృష్టించిన ప్రభువు (అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా) కు మాత్రమే ఉంది” అన్నారు. (అబూ దావూద్). మరొక ఉల్లేఖనంలో, “అగ్నితో శిక్షించే అధికారం ఎవ్వరికీ లేదు అల్లాహ్ కు తప్ప” అన్నారు (బుఖారీ). అంటే అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ అగ్నితో శిక్షించే అధికారం లేదు.

ఇవి ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర నుండి మనకు బోధపడిన కొన్ని విషయాలు. నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మిమ్మల్ని అందరినీ అన్న విన్న విషయాల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

2:259 أَوْ كَالَّذِي مَرَّ عَلَىٰ قَرْيَةٍ وَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا قَالَ أَنَّىٰ يُحْيِي هَٰذِهِ اللَّهُ بَعْدَ مَوْتِهَا ۖ فَأَمَاتَهُ اللَّهُ مِائَةَ عَامٍ ثُمَّ بَعَثَهُ ۖ قَالَ كَمْ لَبِثْتَ ۖ قَالَ لَبِثْتُ يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ ۖ قَالَ بَل لَّبِثْتَ مِائَةَ عَامٍ فَانظُرْ إِلَىٰ طَعَامِكَ وَشَرَابِكَ لَمْ يَتَسَنَّهْ ۖ وَانظُرْ إِلَىٰ حِمَارِكَ وَلِنَجْعَلَكَ آيَةً لِّلنَّاسِ ۖ وَانظُرْ إِلَى الْعِظَامِ كَيْفَ نُنشِزُهَا ثُمَّ نَكْسُوهَا لَحْمًا ۚ فَلَمَّا تَبَيَّنَ لَهُ قَالَ أَعْلَمُ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

ఉజైర్ (అలైహిస్సలాం)
(వందేళ్ళు నిద్రపోయిన మనిషి)
(500-400 క్రీ.పూ.)

ఉజైర్ (అలైహిస్సలాం) తన తోటలోకి ప్రవేశించి అక్కడి ప్రకృతి సౌందర్యానికి మ్రాన్పడి అలాగే కాసేపు నిలబడి పోయారు. పచ్చగా కళకళలాడే చెట్లు, వాటిపై ఒక కొమ్మ మీద నుంచి మరొక కొమ్మపైకి కిలకిలరావాలతో ఎగిరే పక్షులు, విసనకర్రల్లాంటి చెట్ల ఆకుల నుంచి వీస్తున్న స్వచ్ఛమైన పిల్లతెమ్మరలు ఆస్వాదిస్తూ తన చేతిలో ఉన్న బుట్టను క్రింద పెట్టారు. అలా చాలా సేపు నిలబడిపోయారు. చెట్ల కొమ్మలు నోరూరించే పండ్ల భారంతో క్రిందికి వంగిపోయి ఉన్నాయి. ఆయన తన బుట్టను తీసుకుని అందులో రకరకాల పండ్లు కోసుకున్నారు. ఆ బుట్టను తన గాడిద వీపున కట్టారు. దాని పై కూర్చుని వెళ్ళిపోయారు.

దారిలో కూడా ప్రకృతి సౌందర్యం గురించి, ప్రకృతిలోని రమణీయత గురించి ఆలోచించి ఆశ్చర్యపోసాగారు. గాడిద దారితప్పి తనను ఎటో తీసుకు పోవడాన్ని ఆయన గుర్తించలేదు. ఆలోచనల నుంచి బయటపడి చూసేసరికి ఆయన ఒక పాడుపడిన ఊరిలో ఉన్నారు. నేలపై మానవుల కంకాళాలు, జంతువుల అస్థిపంజరాలు చెల్లాచెదరుగా పడఉన్నాయి. వారంతా గతించిన కాలాల ప్రజలని, వారి చిహ్నాలు చిందర వందరగా పడి ఉన్నాయని గ్రహించారు.

ఆయన గాడిదపై నుంచి క్రిందికి దిగారు. గాడిదపై ఉన్న బరువును క్రిందికి దించి, ఒక కూలిపోయిన గోడకు అనుకుని కూర్చున్నారు. ఆ ఊరి ప్రజలకు ఏమయ్యిందో అని ఆలోచించసాగారు. ఆయనకు మరణానంతర జీవితం గురించి ఆలోచన వచ్చింది. మరణించిన వారు మళ్ళీ ఎలా బ్రతికించబడతారు? ఆయన మనసులో ఇలాంటి ఆలోచనలు ముసురుకున్నాయి. ఆలోచనల్లో మునిగి అలాగే కునికిపాట్లు పడుతూ నిద్రలోకి జారిపోయారు.

అలా రోజులు గడచపోయాయి, నెలలు గతించాయి. సంవత్సరాలు కాల గర్భంలో కలసపోయాయి. ఉజైర్ (అలైహిస్సలాం) నిద్రలోనే ఉన్నారు. ఈ సుదీర్ఘకాలంలో ఆయన పిల్లలు, వాళ్ళ పిల్లలు, పిల్లల పిల్లలు ఇలా తరాలు గడచిపోయాయి. జాతులు అంతరించాయి. కొత్త జాతులు ఉనికిలోకి వచ్చాయి.

అల్లాహ్ తన ప్రవక్తలతో వ్యవహరించే తీరు విభిన్నంగా ఉంటుంది. సాధారణ విశ్వాసికి ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిన అనుభూతి లభించక పోయినా అతను తన విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. కాని దేవుని సందేశ హరులైన ప్రవక్తలకు వారి విధుల నిర్వహణలో, దేవుని సందేశం ప్రజలకు అంద జేయడంలో పటిష్టమైన సంకల్పం అవసరం. అందుకుగాను జీవితానికి సంబంధించిన లోతయిన వాస్తవాలను తెలుసుకోవలసిన అవసరం కూడా వారికి ఉంటుంది. అందుకే ప్రవక్తల వద్దకు దైవదూతలు వచ్చేవారు. స్వర్గనరకాలు, భూమ్యాకాశాలు, మరణానంతరం జీవితం వగైరా వాస్తవాలను వారికి చూపించడం జరిగేది.

ఉజైర్ (అలైహిస్సలాం) తన దీర్ఘనిద్ర నుంచి మేల్కొన్నారు. అల్లాహ్ ఆదేశానుసారం ఆయన నిద్ర పూర్తయ్యింది. ఆయన నిద్ర పోయినప్పుడు ఎలా ఉన్నారో నిద్ర లేచినప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఒక దైవదూత ఆయన ముందు ప్రత్యక్ష మయ్యాడు. ఉజైర్తో దైవదూత, “ఎంతకాలం నిద్రపోయానని భావిస్తున్నావు?” అని ప్రశ్నించాడు. ఉజైర్ (అలైహిస్సలాం) జవాబిస్తూ, “నేను రోజులో చాలా భాగం నిద్ర పోయి ఉంటాను” అన్నారు. దైవదూత ఆయన్ని చూస్తూ, “కాదు, నువ్వు వంద సంవత్సరాలు నిద్రపోయావు. చూడు! నీ పండ్లు అప్పుడు ఎంత తాజాగా ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే తాజాగా ఉన్నాయి. నీ త్రాగునీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంది. కాని నీ గాడిదను చూడు, కేవలం దాని అస్థిపంజరం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు.. అల్లాహ్ మహత్యాన్ని చూడు..మరణించిన వారిని మళ్ళీ ఆయన ఎలా బతికిస్తాడో అర్థం చేసుకో.. దీన్ని నీ ప్రభువు తరపు నుంచి నిదర్శ నంగా భావించు. నీ మనస్సులో ఉన్న అనుమానాలన్నీ తొలగించుకో” అన్నాడు.

ఉజైర్ (అలైహిస్సలాం) చూస్తుండగానే గాడిద అస్థిపంజరంపై మాంసం కండరాలు చోటు చేసుకున్నాయి. గాడిద మళ్ళీ సజీవంగా లేచి నిలబడింది. ఆయన ఆశ్చర్యంగా, “అల్లాహ్ ఏమైనా చేయగల శక్తి కలిగినవాడని నేనిప్పుడు దృఢంగా నమ్ముతున్నాను” అన్నారు.

ఉజైరు తెలిసిన ప్రాంతాలన్నీ పూర్తిగా మారిపోయాయి. తన ఇంటిని వెదకడానికి చాలా సమయం పట్టింది. చివరకు ఇంటికి చేరుకుంటే అక్కడ ఆయనకు ఒక వృద్ధ మహిళ కనబడింది. ఆమె కళ్ళు కనబడడం లేదు. కాని ఆమె జ్ఞాపకశక్తి చాలా బలంగా ఉంది. ఉజైర్ (అలైహిస్సలాం) ఆమెను గుర్తించారు. తాను ఇల్లు వదలి వచ్చినప్పుడు ఆమె తన ఇంటిలో పనిచేసే చిన్నపిల్ల. ఆయన ఆమెతో, “ఇది ఉజైర్ ఇల్లేనా” అని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇస్తూ, “అవును” అంది. ఆమె దుఃఖంతో, “ఉజైర్ ఇల్లు వదలి వెళ్ళిపోయారు. చాలా సంవత్సరాలై పోయాయి. ఆ తర్వాత ఎవరికీ ఆయన ఎక్కడికెళ్ళిందీ తెలియరాలేదు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. చాలా కాలంగా ఆయన పేరు ప్రస్తావించిన వాళ్ళు కూడా లేరు” అంది. ఉజైర్ (అలైహిస్సలాం) ఆమెతో, “నేనే ఉజైర్. అల్లాహ్ అభీష్టం వల్ల నేను చాలా కాలం నిద్ర పోయాను. అల్లాహ్ నన్ను వంద సంవత్సరాల తర్వాత నిద్ర లేపాడు” అన్నారు.

ఈ మాటలు విని ఆ వృద్ధమహిళ చాలా ఆశ్చర్యపోయింది. కాస్సేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత, “ఉజైర్ (అలైహిస్సలాం) చాలా ధర్మాత్ముడు. అల్లాహ్ ఆయన ప్రార్థనలను వినేవాడు. ఆయన రోగుల స్వస్థత కోసం ప్రార్థించిన ప్రతిసారీ వారికి ఆరోగ్యం చేకూరేది. కాబట్టి, నువ్వు ఉజైర్అ యితే అయితే నా ఆరోగ్యం కోసం, నా కంటిచూపు కోసం అల్లాహ్ ను ప్రార్థించు” అని అడిగింది.

ఉజైర్ (అలైహిస్సలాం) అల్లాహ్ ను వేడుకున్నారు. అల్లాహ్ ఆయన ప్రార్థనలకు ప్రతిస్పందించాడు. ఆ వృద్ధమహిళకు ఆరోగ్యం చేకూరింది. ఆమె కంటిచూపు మళ్ళీ వచ్చింది. ఆమె ఆయనకు ధన్యవాదాలు చెప్పి ఈ వార్త అందరికీ చెప్పడానికి తక్షణమే బయటకు వెళ్ళింది. ఉజైర్ పిల్లలు, మనుమలు, మనుమల పిల్లలు అందరూ పరుగున వచ్చారు. యువకునిగా కనబడుతున్న ఉజైర్ని చూసి ఆయన తమకు తాతగారని వారు నమ్మలేకపోయారు. “ఇది నిజమా!” అని గుసగుసలాడు కోసాగారు. ప్రస్తుతం ముసలివాడై పోయిన ఉజైర్ కొడుకు ఒకరు “నా తండ్రికి భుజంపై ఒక పుట్టుమచ్చ ఉండేది. మా అందరికీ ఆ పుట్టుమచ్చ గురించి బాగా తెలుసు. మీరు ఆయనే అయితే ఆ పుట్టుమచ్చ చూపించండి” అని ప్రశ్నించాడు. ఉజైర్ తన భుజంపై ఉన్న పుట్టుమచ్చను చూపించారు. అయినా వారికి సంతృప్తి కలగలేదు. మరో కుమారుడు, “జెరుసలేమ్ను బుఖ్స్సర్ ఆక్రమించుకుని తౌరాత్ గ్రంథాలన్నింటినీ ధ్వంసం చేసినప్పటి నుంచి తౌరాత్ కంఠస్థం చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది మిగిలారు. అలా తౌరాత్ కంఠస్థం చేసిన వారిలో మా తండ్రిగారు కూడా ఒకరు. మీరు ఆయనే అయితే తౌరాత్ వినిపించండి” అనడిగాడు. ఉజైర్ తౌరాత్ మొత్తం పఠించి వినిపించారు. ఆయన స్వరానికి వారు మంత్రముగ్ధులై విన్నారు. నిజంగా ఉజైర్ (అలైహిస్సలాం) తిరిగి వచ్చారని వారికి అప్పటికి నమ్మకం కలిగింది. అందరూ ఆయన్ను ప్రేమతో కౌగిలించుకున్నారు. ఆనంద భాష్పాలు రాల్చారు.

ఆ పిదప యూదులు, “అల్లాహ్ ఉజైర్ను మళ్ళీ బ్రతికించాడు. కాబట్టి ఆయన తప్పక అల్లాహ్ కుమారుడై ఉండాలి” అనడం ప్రారంభించారు. (చదవండి దివ్యఖుర్ఆన్: 9:30, 2:259)

9:30 وَقَالَتِ الْيَهُودُ عُزَيْرٌ ابْنُ اللَّهِ وَقَالَتِ النَّصَارَى الْمَسِيحُ ابْنُ اللَّهِ ۖ ذَٰلِكَ قَوْلُهُم بِأَفْوَاهِهِمْ ۖ يُضَاهِئُونَ قَوْلَ الَّذِينَ كَفَرُوا مِن قَبْلُ ۚ قَاتَلَهُمُ اللَّهُ ۚ أَنَّىٰ يُؤْفَكُونَ

“ఉజైర్‌ అల్లాహ్‌ కుమారుడు” అని యూదులంటున్నారు. “మసీహ్‌ (ఏసు క్రీస్తు) అల్లాహ్‌ కుమారుడు” అని నసారా (క్రైస్తవులు) అంటున్నారు. ఇవి వారి నోటి మాటలు మాత్రమే. తమ పూర్వీకుల్లోని అవిశ్వాసులు చెప్పిన మాటలనే వీళ్ళూ అనుకరిస్తున్నారు. అల్లాహ్‌ వారిని నాశనం చేయుగాక! (సత్యం నుండి) వారెలా తిరిగిపోతున్నారు!?

సాధారణంగా మనిషి కళ్ళకు కనబడే వాటిని పట్టించుకోకుండా తమ స్వంత ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. ఉజైర్ తిరిగి రావడం అల్లాహ్ చూపించిన మహత్యంగా గ్రహించే బదులు యూదులు ఆయన్ను దేవుని కుమారునిగా పిలువడం ప్రారంభించారు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=17430

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7