పెండ్లి ప్రాముఖ్యత  – కలామే హిక్మత్

అల్ ఖమ ఇలా అన్నారు –

“నేను మినాలో అబ్దుల్లాహ్ వెంట నడుస్తూ ఉండగా ఆయన్ని ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) కలుసుకున్నారు. వారు ఆయనతో మాట్లాడసాగారు. ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఆయనతో అన్నారు : “ఓ అబూ అబ్దుర్రహ్మాన్! మీ వివాహం ఒక యుక్త వయస్కురాలైన అమ్మాయితో ఎందుకు జరిపించకూడదు? తద్వారా మీకు పూర్వకాలం (యౌవనం) ఎందుకు జ్ఞాపకం చేయకూడదు?” అబ్దుల్లాహ్ బదులిచ్చారు – “మీరు కూడా అదే మాటంటున్నారా? దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు “ఓ యువకుల్లారా! మీలో నికాహ్ చేసుకోగల శక్తి ఉన్నవారు నికాహ్ చేసుకోవాలి. ఎందుకంటే చూపులను వాల్చడానికి, మర్మాంగాలను పరిరక్షించుకోవటానికి అలా చేయటం మంచిది. ఎవరికయితే నికాహ్ చేసుకునే స్థోమత లేదో వారు తప్పకుండా ఉపవాసం ఉంటుండాలి. అది అతని కొరకు డాలు వంటిది అని ప్రబోధించారు” అని అన్నారు. (ముస్లిం)

అల్ ఖమ గారు, మహాప్రవక్త ప్రియ సహచరుల శిష్యగణంలోని వారు. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) యొక్క ముఖ్య శిష్యులు. ఈయన హిజ్రీ శకం 60 తరువాత మరణించారు.

‘మినా’ మక్కా సమీపంలోని ఒక ప్రదేశం. అక్కడ హజ్ యాత్రీకులు జిల్ హిజ్జా 8 నుండి 12వ తేదీ వరకు విడిదిచేస్తారు. ఉస్మాన్ మరియు అబ్దుల్లాహ్ మధ్య ఆ సంభాషణ బహుశా హజ్ దినాలలోనే జరిగి ఉంటుంది.

అబ్దుల్లాహ్ అంటే ఇక్కడ హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) అన్నమాట. హదీసువేత్తల పరిభాష ప్రకారం – హదీసులో ఎప్పుడు అబ్దుల్లాహ్ ప్రస్తావన వచ్చినా అది అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కే వర్తించటం పరిపాటి.

తొలి తొలి రోజుల్లో ఇస్లాంను స్వీకరించిన వారిలో హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఒకరు. మహాప్రవక్త ముహమ్మద్ ప్రత్యేక సాన్నిహిత్యం ఉన్నవారిలో ఆయన ఆరవవారు. యుద్ధాలన్నింటిలో ఆయన ఇస్లాం తరపున పాల్గొన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమపదించిన తరువాత ఆయన ఇస్లామీయ రాజ్యంలో పలు ముఖ్యమయిన బాధ్యతలను నిర్వర్తిస్తుండేవారు. హిజ్రీ శకం 32వ ఏట హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ మరణించారు. అప్పటికి ఆయన వయస్సు 60 ఏండ్లకు పైబడింది.

అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల ప్రేమ & సద్వర్తనుల సహచర్యం – కలామే హిక్మత్

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : ఒక వ్యక్తి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ప్రళయ దినం గురించి దర్యాప్తుచేశాడు. “ఆ (ప్రళయ) ఘడియ ఎప్పుడొస్తుంది?” అని అతను ప్రశ్నించాడు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) బదులిచ్చారు : ”నువ్వు దానిని ఏర్పాటు చేసుకున్నావా?” దానికి ఆ వ్యక్తి, “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల ప్రేమ కలిగి ఉండటం తప్ప మరే తయారీ చేసుకోలేదు” అని అన్నాడు. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం), ”నువ్వు ప్రేమించేవారితో పాటు ఉంటావు” అని ప్రబోధించారు. (బుఖారి)

అనస్ (రదియల్లాహు అన్హు) ఏమంటున్నారో చూడండి: “నేనయితే మహాప్రవక్త మరియు అబూబకర్ (రదియల్లాహు అన్హు)ల పట్ల ప్రేమ కలిగి ఉండేవాడిని. ఒకవేళ నేను ఆ మహనీయులు చేసినన్ని మహత్కార్యాలు చేయలేకపోయినప్పటికీ ఈ ప్రేమ మూలంగా తీర్పుదినాన వారి సహచర్యంలోనే ఉండగలనన్న ఆశ నాకుంది.”

బుఖారిలోని మరో ఉల్లేఖనం ఇలా ఉంది : ఒకతను మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో, ”ఓ దైవప్రవక్తా! ఆ ఘడియ ఎప్పుడు వస్తుంది?” అని అడిగాడు. “నువ్వు దాని కొరకు చేసిన తయారీ ఏమిటీ?” అని మహాప్రవక్త ఎదురు ప్రశ్న వేశారు. అప్పుడు ఆ వ్యక్తి ”దానిగ్గాను నా వద్ద ఎక్కువ నమాజులు లేవు. ఎక్కువ ఉపవాసాలూ లేవు. ఎక్కువ దానధర్మాలు కూడా లేవు. అయితే నేను అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను ప్రేమిస్తున్నాను” అని విన్నవించుకున్నాడు. ఇది విని, “నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వారి వెంట ఉంటావు” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు.

దైవప్రవక్తను ఈ విధంగా ప్రశ్నించిన వ్యక్తి ఒక పల్లెటూరి వాడని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తోంది. పల్లెటూరి మనుషులు విషయాన్ని దర్యాప్తు చేసే తీరే వేరు. వారిలో మొహమాటంగాని, ఊగిసలాటగాని సాధారణంగా ఉండదు. కాగా, మహాప్రవక్త ప్రియ సహచరుల ధోరణి దీనికి కొంత భిన్నంగా ఉండేది. ఏ విషయాన్ని ప్రవక్తకు అడగాలన్నా కించిత్ భయం, జంకు వారికి ఉండేది. పల్లెటూరి నుండి ఏ పామరుడయినా వచ్చి ప్రవక్తను ధర్మసందేహాలు అడిగితే బావుండేదని వారు తలపోస్తూ ఉండేవారు. ఆ విధంగా తమకు మరిన్ని ధార్మిక విషయాలు తెలుస్తాయన్నది వారి ఉద్దేశం.

1. ‘ఆ ఘడియ ఎప్పుడొస్తుంది?’ అనేది హదీసులోని ఒక వాక్యం. అరబీలో ”అ సాఅత్” అని ఉంది. దీనికి తెలుగులో “నిర్ధారిత సమయం” అని అర్థం వస్తుంది. నిర్ధారిత సమయం అంటే మనిషి మరణించగానే అతని కర్మల లెక్కను తీసుకునే సమయమైనా కావాలి లేదా సమస్త జనులను నిలబెట్టి లెక్కతీసుకునే ప్రళయదినమైనా కావాలి.

2. “నువ్వు దాన్ని ఏర్పాటు చేసుకున్నావా?” అనేది హదీసులోని మరో వాక్యం. ప్రళయదిన ప్రతిఫలం గురించి అంత తొందరపడుతున్నావు. సరే, మరి అక్కడ నీకు గౌరవ స్థానం లభించేందుకు కావలసిన సత్కార్యాలు చేసుకున్నావా? అన్న భావం ఆ ప్రశ్నలో ఇమిడి ఉంది. ఇది ఎంతో వివేకవంతమయిన, ఆలోచనాత్మకమయిన ప్రశ్న. ప్రళయదినం సంభవించటమైతే తథ్యం. అది తన నిర్ణీత సమయంలో రానే వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? అన్న ఆదుర్దా కన్నా దానికోసం తను సన్నద్ధమై ఉన్నానా? లేదా? అన్న చింత మనిషికి ఎక్కువగా ఉండాలి.

3. ”నేనే తయారీ చేసుకోలేదు” అని ఆ పల్లెటూరి వ్యక్తి అనటంలోని ఉద్దేశ్యం తాను బొత్తిగా నమాజ్ చేయటం లేదని, దానధర్మాలు చేయటం లేదని కాదు. ఆ విధ్యుక్తధర్మాలను తను నెరవేరుస్తున్నాడు. అయితే అవి అతని దృష్టిలో బహుస్వల్పం అన్నమాట. మరో ఉల్లేఖనంలో ఆ విషయమే ఉంది (నా దగ్గర నమాజులు, ఉపవాసాలు, దానధర్మాలు ఎక్కువగా లేదని ఆ వ్యక్తి చెప్పాడు).

విధ్యుక్త ధర్మాలను (ఫరాయజ్) నెరవేర్చనిదే ఏ వ్యక్తి తాను అల్లాహ్ మరియు ఆయన అంతిమ ప్రవక్త అభిమానినని చెప్పుకోలేడు. సహాబాల హయాంలో ఇలా ఆలోచించే వారే కాదు. విశ్వసించి, ముస్లింనని ప్రకటించుకుని ఇస్లాంలోని ప్రధాన విధులపట్ల అలసత్వం వహించటం ఆనాడు ఎక్కడా లేదు.

4. “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పట్ల ప్రేమ తప్ప”

అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల ఎవరి హృదయంలోనయినా ప్రేమ ఉంటే అది అది అతనిలోని విశ్వాసానికి (ఈమాన్ కు) ప్రబల తార్కాణం అన్నమాట. విశ్వాసం లేనిదే ప్రేమ ప్రసక్తే రాదు. అంటే తన మనసులో విశ్వాసం ఉంది గనకనే అల్లాహ్ ను, దైవప్రవక్తను తాను ప్రేమిస్తున్నానని, అందుకనే తనకు పరలోకం గురించిన చింత అధికంగా ఉందని ఆ పల్లెటూరి వ్యక్తి ఉద్దేశ్యం. అతని ఆలోచన ఎంతో అర్థవంతమైంది కూడా.

5. ”నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వారి వెంట ఉంటావు.”

అంటే నీ విశ్వాసం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల నీకు గల ప్రేమ నీకు ఉపయోగపడతాయి. తీర్పుదినాన నీ చేత ప్రేమించబడిన వారి సహచర్యం నీకు ప్రాప్తమవుతుంది. ఇంకా నువ్వు వారి శ్రేణిలోని వ్యక్తిగానే పరిగణించబడతావు. అల్లాహ్ ను ప్రేమించినవాడు ప్రళయదినాన అల్లాహ్ ఆగ్రహానికి గురికాకుండా ఉంటాడు. మహాప్రవక్తను ప్రేమించినవాడు, ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) చెంత స్వర్గంలో ఉంటాడు. విశ్వాసుల పలు అంతస్థులు ఉంటాయి. ఒకరు ఎగువ స్థాయిలో ఉంటే మరొకరు దిగువస్థాయిలో ఉంటారు. ఎగువ స్థాయిలో నున్న వారు దిగువ స్థాయిలో ఉన్నవారిని చూచి అల్పులని భావించరు. అలాగే దిగువ స్థాయిలో నున్నవారు ఎగువస్థాయిలో నున్నవారిని చూసి అసూయ చెందరు. ప్రతి ఒక్కరూ అల్లాహ్ అనుగ్రహాలను ఆస్వాదిస్తూ ఆనందంలో మునిగి ఉంటాడు.

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పల్లెటూరి వ్యక్తికి చేసిన ఉపదేశం విని సహచరులు ఎంతో సంతోషించారు. అది వారిలోని విశ్వాస భాగ్యానికి ప్రతీక. వారు అన్నిటికన్నా ఎక్కువగా పరలోకం గురించి ఆలోచిస్తుండేవారు. తాము ప్రేమించిన వారి వెంటే ఉంటామన్న సంగతి తెలియగానే వారి సాఫల్యం వారి కళ్ళముందు కదలాడింది. ఎందుకంటే మహాప్రవక్త యెడల వారికి గల ప్రేమ నిజమైనది, అపారమైనది, నిష్కల్మషమైనది.

కేవలం నోటితో ప్రకటించినంత మాత్రాన నిజమైన ప్రేమ వెల్లడి కాదు. ఆచరణకు, త్యాగానికి అది మారు పేరు. తాము ప్రేమించేవారి అభీష్టానుసారం మసలుకున్నప్పుడే, వారు సమ్మతించిన మార్గాన్ని అనుసరించినప్పుడే అది సార్థకమవుతుంది.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) గారు మహాప్రవక్త మరియు అబూబకర్ (రదియల్లాహు అన్హు) లను ఎంతగానో ప్రేమించేవారు. ఆ కారణంగా తనకు వారి సహచర్యం లభిస్తుందని ఆయన ఆశిస్తుండేవారు. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అత్యంత ప్రియమైన సహచరులు. ఇహలోకంలో వారు ఎప్పుడూ ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేవారు. ఒకేచోట వారి అంత్యక్రియలు జరిగాయి. స్వర్గంలో కూడా వారు ఒకేచోట ఉంటారు. దైవప్రవక్తల తరువాత – సామాన్య మానవులలో శ్రేష్టులైన వారు అబూబకర్ గారే. ఆ తరువాత స్థానం హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారిది.

6. ఆ మహనీయులు చేసినన్ని సత్కార్యాలు నేను చేయలేకపోయినా వారిని ప్రేమిస్తున్నందున పరలోకంలో వారి సహచర్యం నాకు లభిస్తుందని ఆశిస్తున్నానని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) అన్నారు.

అంటే, నా సత్కార్యాలు వారి సత్కార్యాలు, త్యాగాల ముందు బహు స్వల్పమైనవి. అయితే నేను వారిని ప్రేమ అనే తీగతో అల్లుకుపోయాను. అందుచేత ఎలాగోలా స్వర్గంలోకి ప్రవేశిస్తాను.

అబూ మూసా అష్అరి ఉల్లేఖనం ఒకటి ఇలా ఉంది : “ఒక మనిషి కొందరిపట్ల ప్రేమ కలిగి ఉంటాడు. కాని వారి స్థాయిలో మహత్కార్యాలు చేయలేడు. మరి అప్పుడతని పరిస్థితి ఏమిటి? అని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అడగగా, ”మనిషి ఎవరిని ప్రేమిస్తాడో వారి వెంట ఉంటాడు” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) బదులిచ్చారు.

ఈ అధ్యాయంలోని హదీసు ద్వారా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను ప్రేమించటం వల్ల ప్రాప్తమయ్యే మహాభాగ్యం ఎటువంటిదో విదితమవుతోంది. అదేవిధంగా దైవదాసుల్లోని సద్వర్తనుల సావాసంలో ఉండటం శుభసూచకమని కూడా బోధపడుతోంది. ఇకపోతే, అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను ప్రేమించటమంటే ఏ విధంగా ప్రేమించటం అన్న ప్రశ్న జనిస్తుంది. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోరిన విధంగా జీవితం గడపటం, వారు వద్దన్న విషయాల జోలికి పోకుండా ఉండటం, వారి ప్రసన్నతను చూరగొనగలిగే పనులను చేయటమే ఆ ప్రేమకు ప్రతిరూపం.

ఇక, సద్వర్తనులయిన మానవులను ప్రేమించటం అంటే వారి దాస్యం చేయమని భావం ఎంతమాత్రం కాదు. వారి మాదిరిగా మంచి పనులు చేస్తూ, వారి స్థాయికి ఎదగటానికి ప్రయత్నించాలి.

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ, అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్

మంచిని పోత్సహించడం – చెడు వైపునకు పురికొల్పడం | కలామే హిక్మత్

ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. “సన్మార్గం వైపునకు ఆహ్వానించే వానికి అతని ద్వారా సన్మార్గం పొందిన వారికి లభించినంత పుణ్యఫలం లభిస్తుంది. (అయితే) వారి ప్రతిఫలంలో మటుకు ఎటువంటి కొరతా రాదు. (ఇకపోతే) మార్గవిహీనత వైపునకు పిలిచే వ్యక్తికి, అతని ద్వారా మార్గభ్రష్టులైన వారికి లభించినంత దుష్ఫలం లభిస్తుంది. కాగా, ఆ మార్గభ్రష్టుల దుష్కర్మలు తగ్గటమూ జరగదు.” (ముస్లిం)

ఈ పవిత్ర హదీసు ద్వారా రూఢీ అయ్యేదేమిటంటే సౌశీల్యం దైవ మార్గదర్శకత్వాల ప్రాతిపదికలపై అల్లాహ్ వైపునకు, సత్కార్యాల వైపునకు సందేశం ఇచ్చేవాడు ఎంతో ఆదరణీయుడు. అతనికి లభించే ప్రతిఫలం అపారం. దాన్ని అతను ఊహించనైనా లేడు. అల్లాహ్ శుభవార్త ఇచ్చాడు :

41:33 وَمَنْ أَحْسَنُ قَوْلًا مِّمَّن دَعَا إِلَى اللَّهِ وَعَمِلَ صَالِحًا وَقَالَ إِنَّنِي مِنَ الْمُسْلِمِينَ

అల్లాహ్‌ వైపు (జనులను) పిలుస్తూ, సత్కార్యాలు చేస్తూ ‘నేను విధేయుల (ముస్లింల)లో ఒకడను’ అని పలికేవాని మాటకంటే మంచిమాట మరెవరిది కాగలదు?(హామీమ్ సజ్దా 41 : 33)

అల్లాహ్ వైపునకు ఆహ్వానించే వాని మాటకు అంతటి ఉన్నత స్థానం ఎందుకివ్వబడిందంటే అతని మాట ద్వారా ఎంతోమంది దైవ మార్గదర్శకత్వం పొందుతారు. వారందరికీ ఆ మహాభాగ్యం లభించటానికి కారకుడైనందుకు గాను వారు సంపాదించినంత పుణ్యం ఇతనికి కూడా ప్రాప్తిస్తుంది. సత్య సందేశానికి ఉన్న ప్రాధాన్యత ఎంతటిదో ఈ ఒక్క హదీసు ద్వారా అంచనా వేయవచ్చు.

పోతే; మార్గ విహీనత, మార్గభ్రష్టతల వైపునకు ప్రజలను పిలవటం మహా పాతకం. అదెంత ఘోరమయిన అపరాధం అంటే అతని ద్వారా ఎంతమంది మార్గభ్రష్టులయ్యారో, అంతమందీ ఎన్ని పాపాలు చేశారో అన్ని పాపాల భారం అతని పై కూడా పడుతుంది. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించినట్లు హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) చెప్పారు : “ఏ ప్రాణీ అన్యాయంగా వధించబడినా దాని రక్తపు భారం ఆదం యొక్క మొదటి కుమారునిపై పడుతుంది. ఎందుకంటే మొదటి హత్య చేసిన వాడు అతనే.” (బుఖారీ, ముస్లిం, తిర్మిజి)

ఆదం కుమారుడైన ఖాబైల్, మరో కుమారుడైన హాబైల్ని హతమార్చాడు. లోకంలో అది మొట్టమొదటి హత్య. ప్రళయదినం వరకు ఎన్ని హత్యలు జరిగినా వాటి పాపం ఖాబైల్ ఖాతాలోకి వెళుతూనే ఉంటుంది. ఎందుకంటే అతనే హత్యల ద్వారం తెరిచాడు. ఈ విధంగానే చెడుల వైపునకు ప్రజలను పురికొల్పేవాడు కూడా ప్రళయం వరకు అతని అనుయాయులు చేసిన పాపభారాన్ని మోస్తూ ఉంటాడు. మరోవైపు ఆ చెడులు చేసే వారి దుష్పలం కూడా ఏమాత్రం తగ్గదు.

“ఎవరయితే సన్మార్గం వైపునకు ఆహ్వానిస్తారో…”

“ఎవరయితే మార్గ విహీనత వైపునకు పిలుస్తారో….”

అన్ని రకాల పిలుపు లేక ఆహ్వానం ఇందులో ఇమిడిఉంది. అది మూజువాణీగా కావచ్చు, సైగ ద్వారా కావచ్చు, ఆచరణ ద్వారా కావచ్చు, వ్రాతపూర్వకంగా కూడా కావచ్చు. ఇక్కడ సన్మార్గం అంటే దైవాదేశాలు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పవిత్ర పలుకులకు సంబంధించిన విషయం. అల్లాహ్ సెలవిచ్చాడు :

2:38 قُلْنَا اهْبِطُوا مِنْهَا جَمِيعًا ۖ فَإِمَّا يَأْتِيَنَّكُم مِّنِّي هُدًى فَمَن تَبِعَ هُدَايَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ

మేము వారితో అన్నాము: “మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి. నా ఉపదేశం ఎప్పుడు మీ వద్దకు వచ్చినా, దాన్ని అనుసరించే వారికి ఎలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.” (అల్ బఖర 2 : 38)

ఇక్కడ ‘నా తరఫు ఉపదేశం’ అంటే ఆకాశ గ్రంథాలు ప్రవక్తల ప్రబోధనలని భావం. అల్లాహ్ తరఫున అవతరించిన ఆదేశాలను పాటించటం, దైవప్రవక్తకు విధేయత చూపటం కూడా సన్మార్గానుసరణగానే భావించబడుతుంది.

దివ్య ఖుర్ఆన్లో మరోచోట ఇలా సెలవీయబడింది :

7:3 اتَّبِعُوا مَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ وَلَا تَتَّبِعُوا مِن دُونِهِ أَوْلِيَاءَ ۗ قَلِيلًا مَّا تَذَكَّرُونَ

(ప్రజలారా!) మీ ప్రభువు తరఫున మీకు వొసగబడిన దానిని మీరు అనుసరించండి. అల్లాహ్‌ను వదలి ఇతర సంరక్షకులను అనుసరించకండి. మీరు బహుకొద్దిగా మాత్రమే హితబోధను గ్రహిస్తారు.(అల్ ఆరాఫ్ : 3)

మరోచోట చెప్పబడింది :

36:20 وَجَاءَ مِنْ أَقْصَى الْمَدِينَةِ رَجُلٌ يَسْعَىٰ قَالَ يَا قَوْمِ اتَّبِعُوا الْمُرْسَلِينَ
36:21 اتَّبِعُوا مَن لَّا يَسْأَلُكُمْ أَجْرًا وَهُم مُّهْتَدُونَ

(అంతలోనే ఆ) నగరం చివరి వైపు నుంచి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు : “ఓ నా జాతివారలారా! మీరు ప్రవక్తలను అనుసరించండి. మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగని వారి, సన్మార్గాన ఉన్న వారి వెనుక నడవండి.”(యాసీన్ : 20, 21)

ఏ గ్రంథమైతే దైవోపదేశాలకు, దైవప్రవక్త సంప్రదాయానికి అనుగుణంగా లేదో అది మార్గ విహీనత వైపునకు గొనిపోయే గ్రంథంగానే పరిగణించబడుతుంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు మా ఈ (ధర్మ) వ్యవహారంలో ఎవరయినా లేనిపోని విషయాన్ని కల్పిస్తే అది రద్దు చేయబడుతుంది (బుఖారి, ముస్లిం). మరో సందర్భంలో ఇలా పలికారు : “మా పద్ధతిలో లేనిదాన్ని ఎవరయినా చేస్తే అది స్వీకారయోగ్యం కానేరదు.” (ముస్లిం)

“వారి పుణ్యఫలంలో ఏ కొరతా రాదు” అంటే సజ్జనుల లెక్కలోని సత్కర్మలను తీసి, వారిని సన్మార్గంలోకి తెచ్చిన వ్యక్తికి ఇవ్వటం జరగదు అని భావం. అల్లాహ్ కారుణ్యం అనంతమైనది. అది ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. విరివిగా లభిస్తుంది. ఈ వాక్యంలో అటు సద్వర్తనులకు, ఇటు సన్మార్గం వైపునకు ఆహ్వానించే వారికి ఇద్దరికీ శుభవర్తమానం ఉంది.

“వారి పాపాల భారంలో ఎటువంటి తగ్గింపూ జరగదు” : చెడులకు నాంది పలికి, అవి వెర్రితలలు వేయటానికి కారకుడైనందున ఆ చెడులను అనుసరించే వారందరికీ లభించేంత పాప భారం ఈ చెడుల పితామహుడికి కూడా లభిస్తుంది. ఈ వాక్యంలో దుర్వర్తనులకు, దుర్వర్తనం వైపునకు పిలిచిన వారికి కూడా గట్టి హెచ్చరిక ఉంది.

ప్రజలకు మార్గ దర్శకత్వం వహించటంలో ఉన్నత సంప్రదాయాలను నెలకొల్పటం, సత్ క్రియలకు పురికొల్పటం కూడా చేరి ఉంది. జరీర్ బిన్ అబ్దుల్లా గారి హదీసు ద్వారా ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. ఆయన ప్రకారం ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి కొంతమంది పల్లెవాసులు వచ్చారు. వారు ఆపదలో ఉన్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి దురవస్థను, అక్కరలను పసిగట్టి దానధర్మాల ద్వారా వారిని ఆదుకోవలసిందిగా ప్రజలకు పురికొల్పారు. అయితే ప్రజలు దానధర్మాలు చేయటంలో నిర్లిప్తత వహించారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ముఖారవిందంపై విచార ఛాయలు ప్రస్ఫుటమయ్యాయి. అంతలో ఒక అన్సారి వెండి నాణాల సంచి తెచ్చారు. మరొకరు కూడా అదే పని చేశారు. ఆపై ఒకరి తరువాత ఒకరు తెచ్చి దానం చేయసాగారు. ప్రవక్త గారి మోము ఆనందంతో విచ్చుకునేవరకూ వారు తెస్తూనే ఉన్నారు. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు: “ఎవరయినా ఇస్లాంలో ఉత్తమ సంప్రదాయాన్ని నెలకొల్పితే తదనంతరం కూడా అది కొనసాగితే, దాన్ని పాటించే వారందరికీ లభించినంత పుణ్యఫలం, దాన్ని నెలకొల్పిన ఒక్క వ్యక్తికీ లభిస్తుంది. (అలా అని) అటు, దాన్ని అనుసరించే వారి ప్రతిఫలంలో కోత విధించటం జరగదు. (అదేవిధంగా) ఇస్లాంలో ఎవరయినా దుస్సంప్రదాయాన్ని ప్రవేశపెడితే, తరువాత వారు దాన్ని పాటిస్తే, ఆ పాటించే వారందరిపై పడే పాపభారం దాని మూల స్థాపకుడి పై కూడా పడుతుంది. అటు ఆ దుర్మార్గగాముల పాపంలో తగ్గింపు కూడా ఉండదు.” (ముస్లిం)

ఉన్నత సంప్రదాయాలను, ఉత్తమ అలవాట్లను నెలకొల్పటమంటే భావం ముస్లిములు షరీఅత్ ఆదేశాలను పాటించడంలో మార్గం సుగమం అయ్యే పనులు చేయడమని. అదేవిధంగా ఖుర్ఆన్, హదీసులను ఆయా ప్రజల మాతృ భాషలోకి అనువదించి, ధర్మావలంబనలో సాయపడటం కూడా ఈ కోవలోకే వస్తుంది.

ఈ హదీసులో పేర్కొనబడిన అన్సారీ సహచరుడు అందరి కంటే ముందు వెండి నాణాల సంచి తెచ్చి సమర్పించుకోవటం వల్ల ఇతర ముస్లిముల్లోని సేవాభావం జాగృత మయ్యింది. వారంతా దాన ధర్మాలకు పూనుకుని ఆ సత్కార్యంలో తలో చేయి వేశారు. దానికి గాను వారందరికీ లభించే సత్ఫలితం ఆ మొదటి అన్సారీకి లభిస్తుంది.

ఎందుచేతనంటే సత్కార్యం కోసం ఆయన వేసిన ముందడుగు ఇతర సహచరులకు ప్రేరణ నిచ్చింది. స్ఫూర్తి నిచ్చింది. ఇదేవిధంగా ఎవరయితే హితకార్యాల కోసం ప్రేరణ, ప్రోత్సాహాల వాతావరణం సృష్టిస్తారో వారి స్థానం గొప్పది. అయితే అటువంటి వారందరి ధ్యేయం అల్లాహ్ యొక్క ప్రసన్నతను చూరగొనడం అయి ఉండాలి. దాంతోపాటు చేసే పని కూడా ఉత్తమ పద్ధతిలోనే చేయాలి.

ఈ హదీసు ద్వారా మంచికై పురికొల్పే పని ఎంత మహత్పూర్వకమో, ఎంత ప్రాధాన్యతతో కూడుకున్నదో విశధమవుతోంది. అలాగే చెడులను సర్వసామాన్యం చేయడం ఎంత ఘోరపాతకమో స్పష్టమవుతోంది.

[డౌన్లోడ్ PDF]

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ