ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) – పార్ట్ 12: సామూహిక నమాజ్, పంక్తుల విషయం, ఖస్ర్, జమ్అ [వీడియో]

బిస్మిల్లాహ్

[68 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

సామూహిక నమాజ్:

ఫర్జ్ నమాజ్ యొక్క జమాఅతు నిలబడిన తరువాత మస్జిదులో ప్రవేశించినవారు నఫిల్ లేక సున్నతులు చేయుట ధర్మ సమ్మతం కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః

إِذَا أُقِيمَتْ الصَّلَاةُ فَلَا صَلَاةَ إِلَّا الْمَكْتُوبَةُ. (مسلم ).

“ఏ నమాజ్ యొక్క ఇఖామత్ అయ్యిందో ఆ ఫర్జ్ నమాజ్ తప్ప మరో నమాజ్ చేయరాదు”. (ముస్లిం 710).

జహరీ([1]) నమాజులో ముఖ్తదీ([2]) నిశబ్దంగా

 ఇమాం ఖిరాత్ ను వినాలి. కాని సూరె ఫాతిహ మాత్రం తప్పక పఠించాలి. ఎందుకనగా సూరె ఫాతిహ పఠించని వ్యక్తి నమాజ్ కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:

(لَا صَلَاةَ لِمَنْ لَمْ يَقْرَأْ بِفَاتِحَةِ الْكِتَابِ).

“సూరె ఫాతిహ చదవనివారి నమాజ్ కాదు”. (బుఖారి 756, ముస్లిం 394)

పంక్తుల విషయం:

ముఖ్తదీ పంక్తిలో స్థలము పొందనిచో పంక్తుల వెనక ఒంటరిగా నమాజ్ చేయుట ఎట్టి పరిస్థితిలో కూడా యోగ్యం కాదు. అతనితో ఏ ఒకరైనా పంక్తిలో ఉండి నమాజ్ చేయుటకు ఒక వ్యక్తిని చూడాలి లేక ఒక వ్యక్తి

వచ్చే వరకు వేచి ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః        لاَ صَلاَةَ  لِفَردٍ خَلفَ الصَّف

“పంక్తుల వెనక ఒంటరిగా చేయు వ్యక్తి నమాజ్ కాదు”. (సహీ ఇబ్ను ఖుజైమ 3/30. సహీ ఇబ్ను హిబ్బాన్ 5/579 ).

వేచి ఉన్నప్పటికీ ఏ ఒక్కరినీ పొందనిచో వీలుంటే ఇమాం కుడి వైపున నిలబడాలి. లేదా ఇమాం సలాం తిప్పే వరకు వేచించాలి. అప్పటి వరకూ ఎవరు రాని యడల ఇమాం సలాం తింపిన తరువాత ఒంటరిగా నమాజ్ చేసుకోవాలి. (కాని షేఖ్ ఇబ్ను ఉసైమీన్ ఫత్వా చాలా బాగుంది: ముందు పంక్తిలో ఏ కొంచం స్థలం దొరికే అవకాశం లేకుంటే అతను ఒంటరిగా నిలబడాలి. ఈ సందర్భంలో హదీసు వ్యతిరేకం అనబడదు, గత్యంతరం లేని పరిస్థితి అనబడుతుంది).

మొదటి పంక్తిలో ఉండి నమాజ్ చేయుట పుణ్యకార్యం. దాని కాంక్ష ఎక్కువగా ఉండాలి. ఎందుకనగా పురుషుల కొరకు మేలయిన పంక్తి మొదటిది. అదే విధంగా ఇమాంకు కుడి ప్రక్కన ఉండుటకు ప్రయత్నించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః

(خَيْرُ صُفُوفِ الرِّجَالِ أَوَّلُهَا وَشَرُّهَا آخِرُهَا وَخَيْرُ صُفُوفِ النِّسَاءِ آخِرُهَا وَشَرُّهَا أَوَّلُهَا)

“పురుషుల మేలయిన పంక్తి మొదటిది. చెడ్డది చివరిది. స్త్రీలకు మేలయిన పంక్తి చివరిది. చెడ్డది మొదటిది”. (ముస్లిం 440).

మరో ఉల్లేఖనంలో ఇలా ఉందిః

(إِنَّ اللهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى مَيَامِنِ الصُّفُوفِ).

“కుడి పంక్తుల్లో ఉండి నమాజ్ చేసేవారిని అల్లాహ్ కరుణిస్తాడు, అల్లాహ్ దూతలు వారి కొరకు దుఆ చేస్తారు”. (అబూ దావూద్ 676).

పంక్తులను సరి చేసుకొని, నమాజీలు దగ్గరదగ్గరగా నిలబడుట తప్పనిసరి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

(سَوُّوا صُفُوفَكُمْ فَإِنَّ تَسْوِيَةَ الصَّفِّ مِنْ تَمَامِ الصَّلَاة)

“మీరు మీ పంక్తులను సరి చేసుకోండి. పంక్తులను సరిచేసుకొనుట నమాజ్ పరిపూర్ణతలో ఒక భాగం”. (ముస్లిం 433).

ఖస్ర్:

ఖస్ర్ అనగా నాలుగు రకాతుల నమాజ్ రెండు రకాతులు చేయుట. ప్రతి రకాతులో సూరె ఫాతిహ చదవాలి. దానితో పాటు మరో సూర లేదా ఖుర్ఆనులోని సులభంగా జ్ఞాపకమున్న కొన్ని ఆయతులు చదవాలి. మగ్రిబ్ మరియు ఫజ్ర్ మాత్రం ఖస్ర్ చేయరాదు.

ప్రయాణంలో ఉన్న వారు నమాజ్ ఖస్ర్ చేయుటయే ధర్మం. అంతే కాదు; ప్రయాణికుడు నమాజును ఖస్ర్ చేయుటయే ఉత్తమం. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణం చేసినప్పుడల్లా ఖస్ర్ చేశారు. 80 కిలోమీటర్లకు పైగా ఎవరైనా ప్రయాణము చేస్తే దానినే ప్రయాణమనబడును. అల్లాహ్ అవిధేయతకు గాకుండా విధేయత కొరకు ప్రయాణం చేసినప్పుడు ఖస్ర్ చేయుట ధర్మం.

స్వనగర గృహాలను దాటిన తరువాత ఖస్ర్ ప్రారంభించి, తమ నగరానికి తిరిగి వచ్చేంత వరకు ఖస్ర్ చేయవచ్చును. ఇలా ప్రయాణం ఎన్ని రోజులయినా సరే. కాని ఒక వేళ ప్రయాణం చేసిన ఊరిలో నాలుగు లేక అంతకంటే ఎక్కువ రోజులు నిలవాలని ముందే నిశ్చయించుకుంటే ఖస్ర్ చేయకూడదు. పూర్తి నమాజ్ చేయాలి.

ప్రయాణంలో సున్నత్, నఫిల్ నమాజులు చేయనవసరం లేదు. కాని ఫజ్ర్ సున్నత్ లు మరియు విత్ర్ తప్పకుండా చేయాలి. వాటిని విడనాడకూడదు.

జమ్అ:

జొహ్ర్ మరియు అస్ర్ నమాజులు రెండిట్లో ఏదైనా ఒక సమయంలో, అలాగే మగ్రిబ్ మరియు ఇషా నమాజులు రెండిట్లో ఏదైనా ఒక సమయంలో చేయుటనే జమఅ అంటారు. అయితే జొహ్ర్, అస్ర్ జొహ్ర్ సమయంలో మరియు మగ్రిబ్, ఇషా మగ్రిబ్ సమయంలో చేస్తే జమఅతఖ్ దీమ్ అంటారు. ఒకవేళ జొహ్ర్, అస్ర్ అస్ర్ సమయంలో మరియు మగ్రిబ్, ఇషా ఇషా సమయంలో చేస్తే జమఅ తాఖీర్ అంటారు. ప్రయాణికుడు జమఅతఖ్ దీమ్ లేక జమఅతాఖీర్ చేయుట ధర్మమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తబూక్ నగరానికి ప్రయాణించినప్పుడు ఇలా చేశారని రుజువయినది. (బుఖారి, ముస్లిం).

ప్రయాణికుడు ఖస్ర్ చేయవచ్చనే విషయం పైన చదివారు, అయితే ఖస్ర్ తో పాటు జమఅ కూడా చేయవచ్చును. జమఅ తఖ్ దీమ్ చేయాలనుకున్నప్పుడు ఇఖామత్ చెప్పి జొహ్ర్ సమయంలో జొహ్ర్ యొక్క రెండు రకాతులు చేసి సలాం తింపిన తరువాత మళ్ళీ ఇఖామత్ చెప్పి అస్ర్ యొక్క రెండు రకాతులు చేయాలి. మగ్రిబ్ సమయంలో ఇఖామత్ చెప్పి మగ్రిబ్ యొక్క మూడు రకాతులు చేసి సలాం తింపిన తరువాత మళ్ళీ ఇఖామత్ చెప్పి ఇషా యొక్క రెండు రకాతులు చేయాలి.

అదే విధంగా స్థానికులు కూడా జమఅచేయవచ్చును. కాని ఖస్ర్ చేయరాదు. జమఅ చేయు సందర్భాలుః వర్షం కురిసినప్పుడు, లేదా చలి ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా తూఫాను గాలి ఉండి నమాజీలకు మస్జిద్ వెళ్ళడం కష్టంగా ఉన్నప్పుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి వర్షం కురిసిన రాత్రి మగ్రిబ్ మరియు ఇషా నమాజులు కలిపి చేశారు.

అదే విధంగా వ్యాదిగ్రస్తుడు ప్రతి నమాజ్ దాని సమయాన పాటించుట కష్టంగా ఉన్నప్పుడు రెండు నమాజులు కలిపి చేయవచ్చును.


[1]) జహరీ నమాజు అంటే శబ్దంగా ఖుర్ఆను పారాయణం జరిగే ఫజ్ర్, మగ్రిబ్, ఇషా నమాజులు.

[2]) ముఖ్తదీ అంటే సామూహిక నమాజులో ఇమాం వెనక నమాజు చేయువారు.  


ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు

%d bloggers like this: