ముహర్రం నెల విశిష్టత:
అరబీలో పదోవ తేదిని ‘ఆషూరా’ అని అంటారు. ముహర్రం నెలలో పదవ తేదిన పాటించే ఉపవాసాన్ని ఆషూరా ఉపవాసం అని అంటారు.
అల్లాహ్ ఖుర్ఆన్ గ్రంథంలో ఇలా తెలియజేశాడు:
إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ
“నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజు నుంచీ (ఈ లెక్క ఇలాగే సాగుతున్నది) వాటిలో నాలుగు మాసాలు నిషిద్దమైనవి (గౌరవప్రదమైనవి) ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి.” (సూరతు తౌబా:336).
నాలుగు మాసాల గురించి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు;
“కాలం తరిగి తిరిగి యధాస్థితికి – అల్లాహ్ భూమ్యాకాశాలను సృష్టించిన నాటి స్థితికి – వచ్చేసింది. ఏడాదిలో పన్నెండు మాసాలుంటాయి. వాటిలో నాలుగు మాసాలు విశిష్టమైనవి (పవిత్రమైనవి) వాటిలో మూడు మాసాలు ఒక దాని తరువాత ఒకటి వస్తాయి. అవే జుల్ ఖాదా, జుల్ హజ్, ముహర్రం. నాల్లవ మాసం రజబ్. ఇది జమాదివుల్ ఆఖిర్ నెలకీ – షాాబాన్ నెలకీ మధ్యన ఉంటుంది.” (బుఖారి:2958, ముస్లిం:3179)
హజ్రత్ అబూ హురైరా (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు;
“రమజాన్ తరువాత అల్లాహ్ మాసమయిన ముహర్రం నెలలో పాటించబడే ఉపవాసాలు అత్యంత శ్రేష్టమైనవి. అలాగే ఫర్జ్ నమాజుల తరువాత పాటించబడే (నఫిల్) నమాజుల్లో తహజ్జుద్ నమాజు అత్యంత శేష్టమైనది.” (ముస్లిం :1982)
ముహర్రం మాసపు ఘనతను తెలియజేయటానికి దానిని “అల్లాహ్ మాసం” అని అనటం జరిగింది. ఉదాహరణకు అల్లాహ్ గృహం, అల్లాహ్ ఒంటె అని ఖుర్ఆన్లో పేర్కొనడం జరిగింది. అల్లాహ్ అలా పేర్కొనంత మాత్రన అవి అల్లాహ్కు అవసరమైన వస్తువులు అని అర్ధం కాదు. కాని అల్లాహ్ వాటి విశిష్టతను వివరించటము దాని ఉద్దేశం.
ముహర్రం నెలలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సాంప్రదాయం
హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హా) కథనం ప్రకారం ఖురైష్ జాతి ప్రజలు ఇస్లాం రాక మునుపు అజ్ఞాన కాలంలో ముహర్రం నెలలో ఆషూరా నాటి ఉపవాసం పాటించేవారు. మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు కూడా ఆ ఉపవాసాన్ని పాటించేవారు. తరువాత ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మదినాకు వచ్చినప్పుడు కూడా ఆ ఉపవాసాన్ని పాటించేవారు, సహాబాలను కూడా ఆ ఉపవాసాన్ని పాటించమని ఆదేశించేవారు. ఆ తరువాత రమాజాన్ ఉపవాసాలు విధి గావించబడ్డాయి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆషూరా ఉపవాసం గురించి:
“ఇది ఆషూరా రోజు అల్లాహ్ మీపై ఈ ఉపవాసాన్ని విధిగావించలేదు. అయినా నేను ఉపవాసం ఉంటున్నాను. కనుక మీలో ఎవరైనా ఆ ఉపవాసాన్ని పాటించాలనుకున్న వారు పాటించండి, లేదంటే మానుకోండి” అని అన్నారు. (బుఖారి:1864, ముస్లిం: 1909)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మక్కా నుండి మదినాకు వలస వచ్చినప్పుడు మదినాలోని యూదులు ముహర్రం మాసపు పదొవ తేదీన ఉపవాసం పాటించటాన్ని గమనించారు. వారిని ఉద్దిశించి, “మీరు ఈ రోజు ఉపవాసం ఎందుకు పాటిస్తున్నారు?” అని అడిగారు. దానికి యూదులు, అల్లాహ్ ఈ రోజు మూసా ప్రవక్తకు ఫిరౌన్ ఆగడాల నుండి విముక్తి ప్రసాదించాడు. ఆ సంతోష ఘడియల్ని పురస్కరించుకొని మేము ఈ రోజు ఉపవాసం పాటిస్తాం” అని చెప్పారు. అది విని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) “మూసా ప్రవక్త సంతోషంలో పాలుపంచుకోవటానికి మీకంటే మేము ఎక్కువ హక్కుదారులం” అంటూ ఆయన కూడా ఆ రోజు ఉపవాసం పాటించారు. మరియు సహాబాలను కూడా ఉపవాసం పాటించమని ఆదేశించారు. (బుఖారి:1865,ముస్లిం:1911)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“ఒక వేళ నేను వచ్చే సంవత్సరం వరకు బతికుంటే ముహర్రం మాసపు తొమ్మిదో తేదిన కూడా ఉపవాసం పాటిస్తాను.” (ముస్లిం:1917)
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం: “ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆషూరా రోజు (ముహర్రం నెల పదో తేదీన స్వయంగా ఉపవాసం ఉన్నారు. మరియు ఆ రోజు ఉపవాసం పాటించమని ఆదేశించారు” (బుఖారి:1865, ముస్లిం: 1911)
హజ్రత్ అబూ ఖతాదా (రజియల్లాహు అన్హుు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని ఆషూరా నాటి ఉపవాసం (ఘనతను) గురించి అడగటం జరిగింది. అందుకాయన సమాధానమిస్తూ, “అది గత సంవత్సరపు పాపాలన్నిటినీ తుడిచిపెట్టేస్తుంది” అని చెప్పారు. (ముస్లిం :1977)
అహ్లె బైత్ (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటివారి) విశిష్టత:
అల్లాహ్ ఖుర్ఆన్ గ్రంథంలో ఇలా తెలియజేశాడు:
إِنَّمَا يُرِيدُ اللَّهُ لِيُذْهِبَ عَنكُمُ الرِّجْسَ أَهْلَ الْبَيْتِ وَيُطَهِّرَكُمْ تَطْهِيرًا
“ఓ ప్రవక్త ఇంటివారలారా! మీ నుండి (అన్నిరకాల) మాలిన్యాన్ని దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలన్నది అల్లాహ్ అభిలాష.”(సూరతుల్ అహజాబ్ :33)
ఈ ఆయతు ద్వారా మరియు ఖుర్అన్లో ఉన్న అనేక ఆయతుల ద్వారా కూడా తెలిసేదేమంటే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సతీమణులందరూ ‘అహ్లెబైత్’ విశిష్ట స్థానానికి చెందినవారు. మరియు హజ్రత్ అలీ, ఫాతిమా, హసన్, మరియు హుసైన్ వారందరు కూడా ‘అహ్లెబైత్’ కి చెందినవారే.
హజ్రత్ ఉమ్మె సల్మా (రజియల్లాహు అన్హు ఉల్లేఖనం): ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నా ఇంట్లో ఉండగా:
“ఓ ప్రవక్త ఇంటివారలారా! మీ నుండి (అన్ని రకాల) మాలిన్యాన్ని దూరం చేయాలన్నది,…..”
అనే ఖుర్ఆన్ ఆయతు అవతరించింది. తరువాత ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు, ఒక వ్యక్తిని “అలీ, ఫాతిమా, హసన్ మరియు హుసైన్ (రజిఅల్లాహు అన్హుం) వైపు పంపిస్తూ ఇలా అన్నారు: “ఓ అల్లాహ్! వారందరూ ‘అహ్లెబైత్’ చెందినవారు. అంతలో హజ్రత్ ఉమ్మే సల్మా (రజియల్లాహు అన్హ) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని; నేను ‘అహ్లెబైత్’ చెందిన దానిని కానా? అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త గారు: “నీవు నాకు మంచి భార్యవి, వారు నా ‘అహ్లెబైత్’ చెందినవారు. ఓఅల్లాహ్! నా ‘ఇంటివారలు’ ఎక్కువ హక్కుదారులు, అని అన్నారు.
(అల్ ముస్తద్రక్ అలస్ సహీ హైన్ లిల్ హాకిమ్,తఫ్సీర్ సూరతుల్ అహ్జాబ్:3517)
ఎందుకంటే? ఒక రోజున ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉదాయాన్నే బయలుదేరారు, అప్పుడు ఆయన వద్ద ఒక నల్లటి దుప్పటి యున్నది. అంతలో ఆయన వద్దకు హసన్(రజియల్లాహు అన్హు) వచ్చారు, ఆయనను దుప్పటిలోపలికి తీసుకున్నారు, తరువాత హుసైన్ (రజియల్లాహు అన్హు) వచ్చారు, ఆయననూ లోపలికి తీసుకున్నారు, తరువాత ఫాతిమా (రజియల్లాహు అన్హ) వచ్చారు, ఆమెను లోపలికి తీసుకున్నారు, తరువాత హజ్రత్ అలి (రజియల్లాహు అన్హు) వచ్చారు ఆయనను కూడా ఆ దుప్పటి లోపలికి తీసుకున్నారు. ఆ తరువాత ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం): “ఇంటివారలారా! మీ నుండి (అన్ని రకాల) మాలిన్యాన్ని దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలన్నది అల్లాహ్ అభిలాష” అని పఠించారు. (ముస్లిం)
హజ్రత్ హసన్ మరియు హుసైన్ (రజియల్లాహు అన్హుమా) విశిష్టత :
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, వారు వీరిద్దరి (హసన్,హుసైన్)ని తప్పక ప్రేమించాలి.” (నసాయీ,ఇబ్ను ఖుజైమా, హాకిమ్, సిల్ సిల తుస్సహీహా :312)
హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “వీరిద్దరు నా పుత్రులు, నా కూతురు పుత్రులు, ఓ అల్లాహ్ నేను వీరిని ప్రేమిస్తున్నాను, ఓ అల్లాహ్ నీవు కూడా వీరిని ప్రేమించు, వీరిని ప్రేమించే వారిని కూడా నీవు ప్రేమించు.” (తిర్మిజీ:3 769)
హజ్రత్ హసన్ మరియు హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హుమా) స్వర్గంలో యువకులకు నాయకులుగా ఉంటారు. (తిర్మిజి:3 768, ఇబ్ను మాజా:118)
కర్బలా సంఘటన:
ముహర్రం నెలలో హజ్రత్ అలీ (రజియల్లాహు అన్హు) నలభై హిజ్రీ శకం, రమాజన్ నెలలో 21వ తేదిన షహీద్ చేయబడ్డారు. ఆ తరువాత ముఆవియా (రజియల్లాహు అన్హు) గారు హజ్రత్ హసన్ (రజియల్తాహు అన్హు) అంగీకారంతో ఏకగ్రీవంగా ఖలీఫాగా ఎన్నుకోబడ్డారు. ఆ తరువాత హజ్రత్ హసన్ (రజియల్లాహు అన్హు) గారు ద్రోహాల కుట్రలో భాగంగా విషంతో కూడిన భోజనం తిని షహాదత్ మరణాన్ని పొందారు. ఆ తరువాత హజ్రత్ ముఆవియా (రజియల్లాహు అన్హు) గారు అరవై హిజ్రీ శకంలో మరణించారు. ఆయన మరణించే ముందు తమ కుమారుడైన యజీద్ ను ఖలీఫాగా నియమించారు. యజీద్ గుణహీనుడైన ఒక రాజు అని చరిత్ర చెబుతుంది. అందుచేత కూఫా ప్రజలు యజీద్కు బదులుగా హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) గారిని ఖలీఫాగా నియమించడానికి ప్రయత్నాలు చేసారు. మరియు కూఫాలో ఉన్న కొంత మంది ప్రజలు హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) ను ఖలిఫాగా ఎన్నుకుంటామనీ అనేక విధాలుగా ఆహ్వానించారు. అందువలన హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) మరియు ఆయన కుటుంబీకులు, మరియు అనుచరులతో కలిసి కూఫాకు చేరుకున్నారు. ఆయన కూఫాకు చేరుకున్న తరువాత హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) గారికి కూఫా ప్రజలు ద్రోహం చేసారు. ఆయనకు ఎలాంటి సహాయం చేయలేదు. మరియు యజీద్ తన ఖిలాఫత్ పదవిని వదులుకోవడం ఇష్టంలేని కారంణంగా, హజ్రత్ హుసైన్ మరియు వారితో వచ్చినవారిని బందీలుగా తమ వద్దకు తీసుకొరావలసిందిగా తన సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. తరువాత యజీద్ సైన్యం హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) మరియు వారి కుటుంబీకులను సులభంగా బందీలుగా చేసుకున్నారు. యజీద్ ఆజ్ఞ మేరకు హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) గారిని యజీద్కు అప్పగించకుండా ఆ సైన్యం వారందరిని ఘోరాతి ఘోరంగా చంపివేసారు.
61వ హిజ్రి శకం ముహర్రం నెలలో 10వ తేదిన (ఆషూరా) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్ల౦) మనుమడు హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) మరియు వారి అక్కచెల్లెళ్ళను అన్నదమ్ముళ్ళను, అన్న హసన్ గారి బార్యబిడ్డలను, జాఫర్ మరియు అఖీల్ భార్యబిడ్డలను మరియు అనేక కూఫా ప్రజలను చంపడం జరిగింది.
హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) గారు ఫురాత్ అనే సముద్రం ఒడ్డున కర్బలా మైదానంలో చంపబడ్డారు. వారి భౌతికకాయాన్ని కర్బలా మైదానంలోనే ఖననం చేసారు. ఆయన మొండాన్ని అబ్దుల్లాహ్ బిన్ జియాద్ వద్దకు తీసుకువచ్చారు. అలా జరగకూడని ఒక దురదృష్టకరమైన సంఘటన కర్బలాలో జరిగింది. మరియు హజ్రత్ హుసైన్(రజియల్లాహు అన్హు) షహాదత్ అనే పుణ్యపరమైన మరణాన్ని పొందారు.
హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) గారిని చంపినవారు లేక వారిని చంపుటకై ప్రోత్సహించినవారు సంతోషించారు. కాని అలాంటి వారిని అల్లాహ్ హీనమైన స్థితికి నెట్టివేసాడు, వారు కూడా భయంకరమైన మరణాన్ని పొందారు.
కర్బలా సంఘటన అనంతరం:
హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) మరణానంతరం ముస్లిం సమాజం విభేదాలకు గురికాబడి అనక వర్గాలుగా చీలిపోయి, స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడిపోయి, ఇస్లామీయ రుజుమార్గాన్ని తప్పిపోయారు.
1- కొంత మంది మూర్ఖులు హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) గారి మరణాన్ని కోరుకున్నారు. చివరికి వారు హజ్రత్ హుసైన్ మరియు వారి కుటింబీకులను షహీద్ చేసారు. వారి నాయకుడు ఉబైదుల్లాహ్ బిన్ జియాద్. హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) షహీద్ చేయబడిన తరువాత ప్రతి ఏట సంతోష కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మరియు వారు అసత్యమైన హదీసులను రచించారు. ఉదాహారణకు: ఎవరైతే ఆషూరా రోజు తమ కుటుంబీకుల పట్ల ఎక్కువగా ఖర్చు చేస్తారో, వారికి ఆ సంవత్సరమంతా అల్లాహ్ అధికంగా ప్రసాదిస్తాడు. మరియు ఎవరైతే ఆ రోజున తమ కళ్ళలో సుర్మా రాసుకుంటాడొో అతనికి జీవితంలో ఎన్నడు కళ్ళవ్యాధి రాదు. మరియు ఎవరైతే ఆ రోజున స్నానం చేస్తాడో అతను ఆ సంవత్సరమంతా అస్వస్థకు గురికాడు. అలా అనేక తప్పుడు విషయాలను ప్రజల్లో వ్యాపింపజేశారు. వారినే నాసిబీయా ముస్లింలు అంటారు. ప్రస్తుత కాలంలో వారు లేనట్టుగానే భావించాలి. కాని వారి అసత్యమైన ప్రవచనాలు ఇప్పటికీ ప్రజల్లో ఉన్నాయి.
2- కొంతమంది ప్రజలు అహ్లె బైత్ అభిమానులంటూ అతిగా వ్యవహరించారు. వారి నాయకుడు ముఖ్తార్ బిన్ ఉబైద్ అల్ కజ్జాబ్. అతని వర్గానికి చెందినవారు. కర్బలా షహీదుల పట్ల శోకాన్ని, దుఃఖాన్ని వెలిబుచ్చడానికి విలపించడం, మాతం చేయడం వంటి ఆచారాలను పుణ్యమైన ఆచారాలుగా భావించి ప్రతి ఏట “మాతం” పేరుతో ధర్మానికి విరుద్ధమైన కార్యాలను నిర్వహించి ఆరాధనలుగా భావిస్తున్నారు.
హజ్రత్ హుసైన్ మరియు వారి కుటింబీకుల షహాదత్ (మరణాంతరం) తరువాత అధర్మ పద్దతిలో శోకాన్ని, దుఃఖాన్ని వెలబుచ్చడానికి సభలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏట వారి షహాదత్ రోజును శోకదినంగా భావించారు, ఆ శోకాన్ని బహిరంగంగా వెలబుచ్చుట కొరకై అనేక విధాలుగా చేస్తున్నారు. చివరికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సతీమణులను, హజ్రత్ అబూబకర్ (రజియల్లాహు అన్హు), హజ్రత్ ఉమర్ (రజియల్తాహు అన్హు), హజ్రత్ ఉస్మాన్ (రజియల్లాహు అన్హు), మరియు అనేక ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ప్రాయమైన సహాబాలను, వారి కుటుంబీకులను అసభ్యకరమైన పదజాలాలతో కించపరుస్తున్నారు. మరియు వారి గౌరవోన్నతలు భంగమయ్యేటట్టు కట్టుకథలు రచించారు. ముహర్రం నెల రాగానే ఆ కట్టుకథలను తమ సమావేశాలలో ప్రసంగిస్తుంటారు. మరియు అహ్లె బైత్ అభిమానులంమంటూ ముసలి కన్నీళ్ళు కురిపిస్తారు. వారంతా “కర్బలా” బాధితుల పట్ల తమ గోడును ఇలా తెలిపే ప్రయత్నాలు చేస్తారు: “ముహర్రం నెలలో నల్ల దుస్తులు ధరిస్తారు, యా హసన్, యా హుసైన్ అంటూ తమ ఛాతీలపై బాదుకుంటుంటారు. కత్తులతో ఖడ్లాలతో కోసుకుంటారు. రక్తం కారేలా బ్లేడ్లతో గాయం చేసుకుంటారు. అగ్ని గుండం తయారు చేసి దానిలో పరుగులు పెడతారు. సామూహికంగా విలపించి మహా సభలను నిర్వహించి కేకలు పెడుతుంటారు. ముహర్రం నెల పవిత్రమైనప్పటికి అపవిత్రంగా, శుభప్రదమైనప్పటికి అశుభమైనదిగా భావిస్తున్నారు. అందుచేత వారు ఆ నెలంతా ఎలాంటి సంతోషమైన కార్యాన్ని నిర్వహించరు, వివాహాలు చేసుకోరు. మరియు పంజాలను (పీర్లను) స్థాపిస్తారు. వాటిని అనేక విధాలుగా ఆరాధిస్తారు” వారినే షియా ముస్లింలు అంటారు.
భారత దేశంలో లక్నో, హైదరాబాద్, ఢిల్లీ, మరియు ముంబై వంటి మహా నగరాలలో ‘షియా’ జాతులు ఉన్నారు. మరియు వారు ఇరాన్లో అతి ఎక్కువగా ఉన్నారు. వారీ ఇరాన్ దేశాన్ని పరిపాలిస్తున్నారు. మరియు అమెరికా యుధ్ధం తరువాత ఇరాఖ్లో కూడా షియా ముస్లింలు పరిపాలన చేస్తున్నారు. అలాగే వారు లెబనాన్ మరియు సిరియా, బహ్రైన్ దేశాలలో కూడా ఉన్నారు.
మరణానంతరం భాధను తెలిపే ధర్మ విధానం:
హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) గారి మరణం మనందరికీ దుఃఖింపబడే మరియు బాధపడే సంఘటన. అయినా మనం సమంజసమైన రీతిలో, ధర్మ విధానంలో శోకాన్ని తెలుపడం ధర్మం. కనుక అల్లాహ్ ఖుర్ఆన్ గ్రంథంలో ఇలా తెలియజేసాడు:
الَّذِينَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ أُولَٰئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُهْتَدُونَ
“వారికెప్పుడు ఏ ఆపదవచ్చిపడినా, నిశ్చయంగా “మేము స్వతహాగా అల్లాహ్కు చెందినవారము, మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకేకదా!” అని అంటారు. వారిపై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందినవారు కూడా వీరే.” (సూరతుల్ బఖరా:156-15 7)
మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
ఎవరికైనా కష్టం వాటిల్లినపుడు “ఇన్నాలిల్లాహి వఇన్నా ఇలైెహి రాజివూన్” మరియు “అల్లాహుమ్మ అజుర్ని ఫీ ముసీబతీ వఖ్లిఫ్ లీ ఖైరమ్ మిన్హా‘ పఠించడం ఎంతో మహత్ పూర్వకమైనది . (ముస్లిం:1525)
అలాగే మనకు ఎప్పుడైతే దుఃఖమైన సంఘటనలు గుర్తుకు వస్తాయో అప్పుడల్లా మనం “ఇన్నాలిల్లాహి వఇన్నా ఇలైహి రాజివూన్” అని చదువుకుంటే ఆ దుఃఖానికి బదులు మనకు పుణ్యం లభిస్తుంది” అని హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) తెలియజేసారు.
హజ్రత్ జైనబ్ బిన్తె జహష్ (రజి యల్లాహు అన్హు) గారి సోదరుడు మరణించారు. మూడు రోజుల తరువాత ఆమె పరిమళాన్ని తెప్పించి పూసుకున్నారు. తరువాత ఇలా ప్రవచించారు: “నాకు పరిమళం అవసరమేమీ లేదు కాని నేను ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించగా ఇలా విన్నాను: “ఏ మహిళ అయితే అల్లాహ్ను, పరలోక దినాన్ని విశ్వసిస్తుందో! ఆమె మూడు రోజులకంటే ఎక్కువగా శోకం చెయ్యడం నిషిద్ధం. కాని తన భర్త శోకం గడవు నాలుగు నెలల పది రోజుల వరకు ఉంది” (బుఖారి:1202, ముస్లిం: 2731).
అతిశయిల్లటం (హద్దు మీరటం):
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అతిశయిల్లటం నుండి ఇలా హెచ్చరించారు: “జాగ్రత్త! మీరు ధర్మం విషయంలో అతిశయిల్ల (హద్దు మీరి ప్రవర్తించ) కండి. నిశ్చయంగా మీకంటే ముందు జాతులు ధర్మం విషయంలో అతిశయిల్లటం వల్లనే నాశనమయ్యారు.” (అహ్మద్, ఇబ్ను మాజా:3029)..
మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఇలా హెచ్చరించారు: “మీరు నన్ను పొగడటంలో హద్దు మీరకండి, ఎలాగైతే క్రైస్తవులు మర్యమ్ కుమారుడగు ఈసా (అలైహిస్సలాం) గారి పట్ల హద్దు మీరి పొగడ్తల్లో ముంచారో! నిశ్చయంగా నేను అల్లాహ్ దాసుడను మాత్రమే. కనుక మీరు నన్ను అల్లాహ్ దాసుడు మరియు ఆయన ప్రవక్త అని మాత్రమే అనండి.” (బుఖారి: 3189)
హజ్రత్ అబూ హురైరా(రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“మీ ఇండ్లను స్మశానవాటిక చేయకండి, నా సమాధిని మీరు (ప్రజలు) ఉత్సవ కేంద్రంగా చేయకండి. అయితే నా కొరకు దరూద్ దుఆ చేయండి, మీరు ఎక్కడ ఉన్నా మీ ప్రార్ధన నాకు చేరుతుంది.” (అబూదావూద్: 2042)
హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణ సమయాన ఇలా ప్రవచించారు:
“అల్లాహ్ యూదుల్ని, క్రైస్తవుల్ని శపించాడు. వారు తమ ప్రవక్తల సమాధుల్ని సజ్దా (ఆరాధ్య) నిలయాలుగా చేసుకున్నారు.” (బుఖారి:1301, ముస్లిం:823)
కాని విచారకరమైన విషయం ఏమంటే, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంత హెచ్చరించినప్పటికి ముస్లిం సమాజం ఈ “అతి“కి దూరంగా ఉండలేకపోయింది. హజ్రత్ హుసైన్ మరియు వారి కుటింబీకుల షహాదత్ (మరణం) తరువాత అధర్మ పద్దతిలో శోకాన్ని, దుఃఖాన్ని వెలబుచ్చడానికి సభలు నిర్వహిస్తున్నారు. మరియు అహ్లెబైత్ అభిమానులంమంటూ అధర్మరీతిలో అతిశయిస్తున్నారు.
ముహర్రం నెలలో అధర్మ ఆచారాలు:
౩- “అహ్లుస్ సున్నత్ వల్ జమాఅత్” కు చెందిన కొంత మంది ప్రజలు అజ్ఞానంతో ముహర్రం పండుగ పేరుతో అనేక కార్యాకలాపాలు నిర్వహిస్తున్నారు. వారు తమను తాము సున్నీలుగా పేర్కొంటారు. అయినా రుజు మార్గాన్ని తప్పిన వర్గాల (షియా ముస్లింలు మరియు నాసిబియా ముస్లింలు)కు అనుగుణంగా మన పట్టణాలలో, పల్లెలలో ప్రతి ఏట అవే కార్యాలను పుణ్యంగా భావించి ముహర్రం ఉత్సవాలను నిర్వవాస్తుంటారు.
1- మొదటి ముహర్రం రోజున పంజాలను “మకాన్” అనే ప్రత్యేకమైన స్థలంలో నిలబెట్టటం జరుగుతుంది.
2-కొంత మంది ప్రజలు క్రొత్తగా పంజాను నిలబెడ్తానని మొక్కుబడులు చేసుకుంటారు.
౩-పది రోజుల వరకు పంజాలను పూల హారాలతో అలంకరిస్తారు మరియు ఆ పదిరోజులు ఫాతిహాలు (అర్పణాలు) చేస్తుంటారు.
4-ఏడవ రోజు నుండి ప్రతి రాత్రి స్నానం చేసి అగ్ని గుండంలో నడుస్తుంటారు. పీర్లకు ఫాతిహాలు కూడా సమర్పిస్తారు.
5-ఏడవ రోజునుండి బెల్లం లేక ఇతర షర్బత్ కడవలు కడవలుగా తయారు చేస్తారు. స్వయంగా త్రాగుతారు, ఇతరులకు కూడా తాపిస్తారు.
6-ముహర్రం బతాసాలు, మరియు చోంగాలు (తీపు అప్పట్లు) ఆచారంగా చేసి తింటారు, ఇతరులకు కూడా పంచుతారు.
7-పంజాల (పీర్లను)ను నిలబెట్టిన కొంతమంది పుణ్యాత్ముల ఆత్మలు తమ శరీరంలో వచ్చిందంటూ ఊగుతుంటారు. మరియు తమ పంజాను ఎత్తుకొని అగ్ని గుండంలో నడుస్తారు.
8-పంజాలు ఎత్తుకొని వీధులంతా ఊరేగిస్తూ, అనేక కనికట్టు నాటకాలు చేస్తూ, ఇంటింటా నిలబడి ఫాతిహాలు చేస్తూ, విరాళములు సేకరిస్తారు.
9-పంజాలను పట్టణము పొలిమేరకు తీసుకుపోయి, వాటిపై ఉన్న పూలహారాలను తీసి చెరువులలో లేక బావులలో పడేస్తారు.
10-చివరిగా “అల్విదా యా షుహదావు హుసైన్” అంటూ “మర్సియా” గీతాలు పాడుకుంటూ తిరిగి అదే ‘మకాన్’కు వస్తారు. తరువాత ఆ పంజాలను ఆ ‘మకాన్‘ లోనే భద్రపరుచుకుంటారు.
11-కొంత మంది సున్నీ ముస్లింలు కూడా ముహర్రం నెలను అపశకునంగా భావిస్తారు. ఈ నెలంతా పెళ్ళిళ్ళు చేయరు, కొత్త పనులను ప్రారంభించరు.
ముస్లిం ప్రజలారా! మనం “అహ్లుస్ సున్నత్ వల్ జమాఅత్”కు చెందినవారము. మనం అల్లాహ్ను మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) విధానానికి అనుగుణంగా అనుసరించేవారము. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించిన 50 సంవత్సరాల తరువాత అధర్మ వ్యక్తుల చేత జొప్పించబడిన తప్పుడు ఆచారాలను ఎలా ధర్మంగా మనం భావించాలి? వాటిని మనం ఎలా ఆచరించాలి? ఒక వేళ మనం వాటిని ఆచరించినా పుణ్యం మాత్రం లభించదు, పైగా మహా పాపాలకు గురికాబడుతాము సుమా.
ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 52-66). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
You must be logged in to post a comment.