111. హజ్రత్ మస్రూఖ్ (రధి అల్లాహు అన్హు) కధనం :-
నేను విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషాను (రధి అల్లాహు అన్హ) –
“అమ్మా! దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ ప్రభువును (ప్రత్యక్షంగా) చూశారా?” అని అడిగాను. దానికి ఆమె ఇలా అన్నారు : “నీ మాటలు విని నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి. నీకు తెలుసా? ఈ మూడు విషయాలను గురించి మీలో ఎవరైనా తన వైపు నుంచి ఏదైనా అంటే అతను అబద్ధాలకోరుగా పరిగణించబడతాడు :
(1) “ఎవరి చూపులూ ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులనూ అందుకోగలడు.” [దివ్యఖుర్ఆన్ – 6 : 103]
“అల్లాహ్ ఏ మానవునితోనూ ప్రత్యక్షంగా సంభాషించడు. మానవ మాత్రుడికి అది సాధ్యమయ్యే పనికాదు. అల్లాహ్ తన మాటను వహీ ద్వారానో లేక తెరవెనుక నుంచో మాత్రమే మానవునికి చేరవేస్తాడు.” [దివ్యఖుర్ఆన్ – 42 :51](2) అలాగే రేపు జరగబోయే విషయాలేవో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు తెలుసనేవాడు కూడా అబద్దాల కోరే. ఈ సందర్భంలో హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) ఈ సూక్తిని ఉదహరించారు – “రేపు తాను ఏం చేయనున్నాడో ఏ మానవునికీ తెలియదు.” [దివ్యఖుర్ఆన్ – 31 : 34 ]
(3) అదే విధంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (ధర్మానికి సంబంధించిన) ఏదైనా విషయం రహస్యంగా ఉంచారని అనేవాడు కూడా అబద్దాలరాయుడే. దీన్ని గురించి హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) ఈ సూక్తిని ఉదహరించారు – “ప్రవక్తా! నీ ప్రభువు నుండి నీపై అవతరించే బోధనలను ప్రజలకు అందజేస్తూ ఉండు. ఒకవేళ నీవలా చేయకపోతే దౌత్య బాధ్యతను నెరవేర్చని వాడవుతావు.” [దివ్యఖుర్ఆన్ – 5 : 67]
కనుక అసలు విషయం ఏమిటంటే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జిబ్రయీల్ (అలైహిస్సలాం) ను అతని నిజ స్వరూపంలో రెండుసార్లు చూశారు.”