దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సులైమాన్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[క్రింది విషయం ఖురాన్ కథామాలికఅనే పుస్తకం నుండి తీసుకోబడింది]
ప్రవక్త సులైమాన్ (అలైహిస్సలాం) (970-931 క్రీ.పూ.)
“చివరకు సులైమాన్ సైన్యమంతా ఒక చీమల లోయకు చేరుకున్నప్పుడు ఒక చీమ ఇలా ప్రకటించింది: “ఓ చీమల్లారా! సులైమాను, అతని సైన్యాలు తెలీకుండా మిమ్మల్ని నలిపివేసే స్థితి ఏర్పడకుండా ఉండేందుకు, మీరు మీ మీ పుట్టలలోనికి దూరిపోండి.” ” (ఖుర్ఆన్ 27: 18)
ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) వివేకం మూర్తీభవించిన పాలకులు. ఆయన కుమారుడు సులైమాన్ మరింత తెలివి, వివేకసంపద కలిగినవారు. ఆయన చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడే తెలివితేటలు, వివేక విచక్షణలు ప్రదర్శించారు. రాజ దర్బారులో వివాదాల, ఫిర్యాదుల తీర్పులు జరుగుతున్నప్పుడు ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) తన కుమారుణ్ణి కూడా దర్బారులో పిలిచి కూర్చుండబెట్టేవారు.
ఒకసారి ఒక రైతు ఓ ఫిర్యాదు తీసుకుని వచ్చాడు. ఆ రైతు తన పొలంలో గోధుమ, మొక్కజొన్న పండించే వాడు. పొలంలో ఫలవృక్షాలు కూడా ఉండేవి. ఈ రైతుకు పొరుగున మరో వ్యక్తి ఉన్నాడు. ఈ పొరుగు వ్యక్తి గొర్రెలు పెంచేవాడు. రైతు పొలంలో పంట బాగా ఏపుగా పెరిగినప్పుడు పొరుగువాని గొర్రెలు పొలంలో పడి పంట మొత్తం ఆగం చేసి వెళ్ళేవి. ఈ వివాదం దర్బారుకు వచ్చింది. పొరుగువాడు రైతు చేసిన ఫిర్యాదు నిజమేనని ఒప్పుకున్నాడు. ఇద్దరి వాంగ్మూలాలు విన్న తర్వాత ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) తన తీర్పు చెబుతూ, రైతుకు జరిగిన నష్టానికిగాను పొరుగు వ్యక్తి తన గొర్రెలను రైతుకు ఇచ్చి నష్ట పరిహారం చెల్లించాలని అన్నారు. తన గొర్రెలు విచ్చలవిడిగా తిరగడానికి వదలి వేసిన పొరుగువాడు ఈ విధంగా గుణపాఠం కూడా నేర్చుకుంటాడని దావూద్ (అలైహిస్సలాం) అన్నారు. అప్పటికి సులైమాన్ వయసు కేవలం పదకొండు సంవత్సరాలు మాత్రమే. ఆయన ఈ తీర్పు విని లేచి నిలబడి మాట్లాడడానికి తండ్రి అనుమతి కోరారు. తండ్రి ఆయనకు అనుమతి ఇచ్చారు. సులైమాన్ మాట్లాడుతూ తాను ఈ తీర్పుతో ఏకీభవించడం లేదని, ఈ శిక్ష చాలా తీవ్రంగా ఉందని అన్నారు. బాల సులైమాన్ ధైర్యంగా చెప్పిన ఈ మాటలు విని పూర్తి దర్బారు నిర్ఘాంతపోయింది. దర్బారులో గుసగుసలు వ్యాపించాయి. దావూద్ ప్రవక్త చిరునవ్వుతో తన కుమారుడిని చూస్తూ ఈ వివాదానికి నీ తీర్పు ఏమిటో చెప్పు అన్నారు. అప్పుడు సులైమాన్ మాట్లాడుతూ, గొర్రెలను కొంతకాలం వరకు రైతుకు అధీనం చేయాలని, ఆ విధంగా రైతు వాటి ఉత్పత్తుల ద్వారా అంటే పాలు, ఉన్ని, వగైరాలతో లాభం పొంది తన నష్టాన్ని పూడ్చుకుంటాడని, ఈ లోగా గొర్రెల యజమాని ఒక సంవత్సరం పాటు రైతు పొలాన్ని సాగుచేసి పంట పండించి పంట కోయకుండా రైతుకు అప్పగించాలని, రైతు తన అధీనంలో ఉన్న గొర్రెలను, ఎన్ని గొర్రెలయితే పొరుగువాడు తన అధీనం చేశాడో అన్ని గొర్రెలను తిరిగి అతనికి అప్పగించాలని, వాటికి పుట్టిన గొర్రెపిల్లలను ఇవ్వనవసరం లేదని అన్నారు. ఈ విధంగా గొర్రెల యజమాని నిర్లక్ష్యానికి తగిన శిక్ష కూడా పడుతుందని, అతను ఒక సంవత్సరం పాటు ఎలాంటి ప్రతిఫలం లేకుండా పొలంలో పని చేసి పంట పండించి రైతుకు అప్ప గించవలసి ఉంటుందని, అలాగే అతను పూర్తిగా తన గొర్రెలను కోల్పోయే పరిస్థితి కూడా ఉండదని చెప్పారు. పంట సిద్ధంగా ఉన్న పొలాన్ని అతను అప్పగించిన తర్వాత రైతు దానిని కోసుకోవచ్చు. ఈ తీర్పును రాజదర్బారు నిశ్శబ్దంగా వింటూ ఉండిపోయింది.
రాజు దావూద్ (అలైహిస్సలాం) తన తీర్పును ఉపసంహరించుకుంటున్నానని, తన కుమారుని తీర్పును అమలు చేయాలని ఆదేశించారు. కుమారుని తీర్పు నిష్పక్ష పాతంగా, న్యాయసమ్మతంగా, వివేకవంతంగా, తన తీర్పు కన్నా ఉత్తమంగా ఉందని ప్రకటించారు. రైతు, గొర్రెల యజమాని ఇద్దరూ కూడా తీర్పు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. (చదవండి దివ్యఖుర్ఆన్ : 21:78-82)
కుమారుని ద్రోహం
ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) తన తర్వాత తన కుమారుడు సులైమాన్ ను రాజుగా చేయాలని నిర్ణయించారు. కాని దావూద్ (అలైహిస్సలాం) గారి మరో కుమారుడు అబ్సాలోమ్ పెద్దవాడు. పెద్దవాడయినప్పటికీ రాజబాధ్యతలు నిర్వర్తించే యోగ్యతలు అతనికి లేవు. తన తండ్రి సులైమాన్ ను రాజుగా చేయాలని నిర్ణయించడం అబ్సాలోమ్ కు నచ్చలేదు. అతనిలో ఈర్ష్యాద్వేషాలు బుసలు కొట్టాయి. ఎలాగైనా రాజ సింహాసనాన్ని హస్తగతం చేసుకోవాలని అతను కుట్రపన్నాడు.
ముందుగా అతడు ప్రజలను మభ్యపుచ్చి తన పక్షానికి వచ్చేలా చేయాలనుకున్నాడు. ప్రజలను తన వైపు త్రిప్పుకోవడానికి ఒక పథకం వేశాడు. ప్రజలు తమ వివాదాల పరిష్కారానికి సులైమాన్ దర్బారుకు వస్తున్నప్పుడు వారిని అక్కడకు వెళ్ళకుండా అడ్డుకుని తన వద్దకు వచ్చేలా చేశాడు. ఆ విధంగా తాను చాలా వివేకవంతుడినన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి ప్రయత్నించాడు. ఆ పిదప తన కుట్రకు పనికివచ్చే కొంతమంది దుర్మార్గులను తన అనుచరులుగా చేర్చుకున్నాడు. ఒక రోజు అతను తన తండ్రితో గిబియన్ పట్టణానికి వెళ్తాను అనుమతించమని కోరాడు. గిబియన్ పట్టణంలో తాను చేయవలసిన పని ఉందని సాకులు చెప్పాడు. తనతో పాటు తన అనుచరులను తీసుకుని వెళ్ళాడు. గిబియన్ పట్టణానికి వెళ్ళిన వెంటనే బనీ ఇస్రాయీల్లోని వివిధ తెగలకు రహస్య సందేశాలు పంపాడు. నగారా శబ్దం వినగానే తనను రాజుగా ప్రకటించాలని వారందరికీ సూచనలు పంపించాడు. కాని దావూద్ (అలైహిస్సలాం) పట్ల విశ్వాసం కలిగిన ప్రజలు ఈ ఆదేశాన్ని లక్ష్యపెట్టలేదు. అబ్సాలోమ్ అనుచరులకు, వివిధ తెగలకు మధ్య తీవ్రమైన పోరాటం జరిగింది. జెరుసలేమ్ పట్టణం దాదాపుగా నాశనం అయ్యింది.
తన కుమారుని ద్రోహం గురించి దావూద్ ప్రవక్తకు తెలిసింది. తన స్వంత కుమారుడు ఇలా వ్యవహరించాడని తెలిసి ఆయన చాలా బాధకు గురయ్యారు. అయినా ఆయన సంయమనాన్ని కోల్పోలేదు. తన రాజ్యంలో రక్తపాతాన్ని ఆయన ఇష్టపడలేదు. అబ్సాలోమ్ పట్టణాన్ని బలవంతంగా వశపరచుకోవచ్చని ఆయన భయపడ్డారు. అందువల్ల ఆయన తన వారికి వెంటనే పట్టణాన్ని వదిలి వేయాలని సందేశం పంపించారు. హాని కలుగకముందే అక్కడి నుంచి తప్పించుకొమ్మని చెప్పారు. చాలా మంది పట్టణాన్ని వదలి జోర్డాన్ నదిని దాటి వచ్చేశారు. దావూద్ (అలైహిస్సలాం) ఆలివ్ కొండను ఎక్కి అల్లాహ్ ను ప్రార్థించారు. ప్రజలను ఈ ప్రమాదం నుంచి కాపాడమని వేడుకున్నారు. కొంతమంది ప్రజలు తమ దుస్థితికి రాజుగారే కారణమని విమర్శించారు. కాని చాలా మంది దావూద్ పక్షాన విశ్వాసంగా నిలబడ్డారు. ఆయన వారితో, “నా స్వంత కుమారుడు నాకు ద్రోహం చేసినప్పుడు పరులు నాకు వ్యతిరేకమయ్యారని నేను ఎలా చెప్పగలను” అన్నారు.
దావూద్ (అలైహిస్సలాం) కొందరు అధికారులను అక్కడికి పంపి పరిస్థితి చక్క దిద్దమన్నారు. అబ్సాలోమ్కు ఎలాంటి హాని చేయవద్దని వారిని ఆదేశించారు. దావూద్ (అలైహిస్సలాం) పంపిన అధికారులు కఠినంగా అక్కడి తిరుగుబాటును అణచి వేశారు ఈ పోరాటంలో అబ్సాలోమ్ హతమయ్యాడు. జెరుసలేమ్ మళ్ళీ శాంతిభద్రతలు పునరుద్ధరించబడ్డాయి. దావూద్ (అలైహిస్సలాం) రాజుగా పరిపాలించడం కొనసాగింది.
సులైమాన్ రాజరికం
తన తండ్రి మరణానంతరం సులైమాన్ (అలైహిస్సలాం) రాజుగా పాలనాపగ్గాలు చేపట్టారు. తన రాజ్యం వంటి మరో రాజ్యం లేనంత చక్కగా పాలించే అనుగ్రహం ప్రసాదించాలని ఆయన అల్లాహ్ ను ప్రార్థించారు. అల్లాహ్ ఆయన కోరికను మన్నించాడు. సులైమాన్ (అలైహిస్సలాం) మహావివేకవంతుడు మాత్రమే కాదు, అల్లాహ్ ఆయనకు అనేక వరాలు ప్రసాదించాడు. ఆయన గాలులను తన అదుపులో ఉంచుకోగలిగేవారు. పశుపక్ష్యాదులతో మాట్లాడగలిగేవారు. భూగర్భంలో ఉన్న ఖనిజాలను త్రవ్వి బయటకు తీసి వాటితో ఉపకరణాలు, ఆయుధాలు తయారు చేసే విద్యను మనుష్యులకు, జిన్నాతులకు (అగ్నితో సృష్టించబడిన బుద్ధిజీవులైన ప్రాణులకు) నేర్పాలని అల్లాహ్ ఆయనకు ఆదేశించాడు. అల్లాహ్ ఆయనకు ఒక రాగి గనిని కూడా ప్రసాదించాడు. ఆ కాలంలో రాగి అరుదైన లోహంగా ఉండేది.
ఒక రోజు సులైమాన్ (అలైహిస్సలాం) తన సైన్యాన్ని సమావేశపరచారు. అదొక విచిత్రమైన సైన్యం. అందులో మనుష్యులు, పశుపక్ష్యాదులు, జిన్నాతులు ఉన్నారు. సైన్యాన్ని తీసుకుని ఆయన అష్కెలాన్ రాజ్యానికి బయలుదేరారు.
వారు ఒక లోయ నుంచి వెళుతున్నప్పుడు ఒక చీమ ఈ సైన్యం రావడాన్ని చూసింది. మిగిలిన చీమలను హెచ్చరిస్తూ, ”పారిపోండి. పుట్టల్లో తలదాచు కోండి. లేకపోతే మనల్ని చూడకుండా సులైమాన్ సైన్యం మనల్ని తొక్కేస్తుంది” అని అరిచింది. ఈ అరుపు సులైమాన్ చెవులకు సోకింది. ఆయన నవ్వుకున్నారు. ఒక ప్రవక్తగా తాను కావాలని అల్లాహ్ సృష్టి దేనికీ హాని తలపెట్టనన్న విషయాన్ని ఆ చీమ గుర్తించినందుకు సంతోషించారు. చీమలను కాపాడినందుకు ఆయన అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
రాతి గుమ్మటం
జెరుసలేమ్ ఒక పెద్ద శిలపై సులైమాన్ (అలైహిస్సలాం) ఒక అందమైన ఆరాధనాలయాన్ని నిర్మించారు. ప్రజలు అల్లాహ్ ను ఆరాధించడానికి వచ్చేలా ఈ ఆరాధనాలయాన్ని కట్టారు. నేడు దీనిని “మస్జిదుల్ అక్సా” లేదా “మస్జిదుల్ ఖుద్స్” లేదా ”డోమ్ ఆఫ్ రాక్” అని పిలుస్తున్నారు. ఇక్కడి నుంచి సులైమాన్ (అలైహిస్సలాం) వెంట పెద్ద సంఖ్యలో అనుచరులు మక్కాలోని పవిత్ర గృహానికి యాత్రకు బయలు దేరారు. వారు తమ హజ్ యాత్ర పూర్తి చేసుకుని అక్కడి నుంచి యమన్ చేరుకుని సనా పట్టణానికి వచ్చారు. ఇక్కడ తెలివిగా పట్టణాల్లో నీటిపారుదల సదుపాయాన్ని ఏర్పాటు చేసిన పద్ధతి చూసి ఆయన చాలా ప్రభావితులయ్యారు. తన రాజ్యంలో కూడా అలాంటి నీటిపారుదల సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని భావించారు. కాని తన రాజ్యంలో అందుకు అవసరమైన నీటివనరులు లేవు. ఆయన వెంటనే హూపో పక్షి కోసం కబురంపారు. ఆ పక్షి భూగర్భంలో జనవనరులను పసిగట్టగలదు. ఆయన హూపో పక్షి కోసం నాలుగు చెరగులా సందేశాలు పంపారు. కాని ఆ పక్షి ఎక్కడా లేదు. ఆయన కోపంగా ఆ పక్షి కనుక సరియైన కారణం లేకుండా గైర్హాజరైతే దానిని కఠినంగా శిక్షిస్తానని అన్నారు.
షీబా రాణి బిల్కిస్
చివరకు హూపో పక్షి సులైమాన్ వద్దకు వచ్చింది. తన ఆలస్యానికి కారణాన్ని వివరించింది. “మీకు తెలియని ఒక విషయాన్ని నేను కని పెట్టి వచ్చాను. నేను సబా (షీబా) నుంచి ఒక శుభవార్త తీసుకుని వచ్చాను” అంది. ఈ మాటలు విన్న సులైమాన్ ఆగ్రహం మాయమై ఆయనలో కుతూహలం చోటుచేసుకుంది. ”సబా రాజ్యాన్ని బిల్కిస్ అనే రాణి పాలిస్తోంది. ఆమెకు అన్ని సౌభాగ్యాలు పుష్కలంగా ఉన్నాయి. ఆమె సింహాసనం చాలా అద్భుతంగా ఉంది. కాని ఇంత సంపద ఉన్నప్పటికీ, ఆమె హృదయంలో, ఆ రాజ్య ప్రజల హృదయాల్లో షైతాన్ తిష్ఠవేసుకుని ఉన్నాడు. ప్రజలు ఆమె పట్ల చాలా విశ్వాసంగా ఉన్నారు. వారంతా విశ్వప్రభువైన అల్లాహ్ కు బదులు సూర్యుణ్ణి పూజించడం చూసి నేను నిర్ఘాంతపోయాను” అని ఆ పక్షి వివరించింది.
హూపో పక్షి చెప్పిన మాటలు నిర్ధారించుకోవడానికి సులైమాన్ (అలైహిస్సలాం) ఆ పక్షితో సబా రాణికి ఒక లేఖ పంపారు. రాణికి లేఖ చేరవేసి అక్కడే రహస్యంగా ఉండి రాణి ఏం చేస్తుందో చూడమని పక్షికి సూచనలిచ్చారు.
హూపో పక్షి ఆ లేఖను సబా రాణి ముందు పడవేసి ఎగిరిపోయింది. వెళ్ళి ఓ మూలన దాక్కుని చూడసాగింది. సబా రాణి ఆ లేఖను ఆశ్చర్యంగా తీసుకుని చదివింది. “ఈ లేఖ సులైమాన్ నుంచి పంపబడింది. అనంత కరుణా మయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభం. నాకు వ్యతిరేకంగా బలప్రదర్శనకు దిగవద్దు. లొంగిపోయిన మనిషి మాదిరిగా నా వద్దకు రావాలి…..” ఈ లేఖ చూసి రాణి చాలా ఆందోళనకు గురయ్యింది. వెంటనే తన సలహాదారులను పిలిపించింది. వారు ఆమెతో తాము కేవలం సలహా మాత్రమే ఇవ్వగలమని, ఆదేశాలిచ్చి చర్యలు తీసుకోవలసినది రాణిగారేనని విన్నవించు కున్నారు. వారి ఉద్దేశ్యాన్ని ఆమె గ్రహించింది. వారంతా సులైమాన్తో యుద్ధరంగంలో ఢీకోవాలని భావిస్తున్నారు. కాని ఆమె వారితో, ”స్నేహం, శాంతి యుద్ధం కన్నా మంచివి. వివేక వంతమైనవి. యుద్ధం వల్ల పరాభవాలు వాటిల్లుతాయి. ప్రజలు బానిసలవుతారు. సంపద నాశనం అవుతుంది. నేను సులైమాన్కు కానుకలు పంపాలని భావిస్తున్నాను. మన ఖజానాలోని విలువైన వస్తువుల్ని పంపుదాం. ఈ కానుకలు తీసుకుని వెళ్ళే రాజప్రతినిధులు సులైమాన్ గురించి కూడా తెలుసుకోవచ్చు, అతని సైనిక బలాన్ని కూడా అంచనా వేయవచ్చు” అని చెప్పింది.
కాని ఆమెకు తన మాటలన్నింటినీ హూపో పక్షి వింటుందన్న విషయం తెలియదు. హూపో వెంటనే సులైమాన్ వద్దకు వెళ్ళి ఈ విషయాలు చేరవేసింది.
కానుకలా? లంచాలా?
సులైమాన్ (అలైహిస్సలాం) వెంటనే తన అధీనంలో ఉన్న ఒక జిన్నుతో ఒక మహా ప్రాసాదాన్ని నిర్మించమని ఆదేశించారు. ఆ మహాసౌధంలో రాబోయే అతిథులను స్వాగతిస్తానని చెప్పారు. సబా రాణి వద్ద నుంచి వచ్చిన రాజప్రతినిధులను ఆయన చాలా ఆదరంగా స్వాగతించారు. అద్భుతమైన ఆ భవనాలను చూసి వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. వారు తమ రాణి పంపిన విలువైన కానుకలను సులైమాన్ (అలైహిస్సలాం)కు అందజేశారు. స్నేహానికి గుర్తులుగా వాటిని తమ రాణి పంపిందని, వాటిని స్వీకరించాలని కోరారు. కాని సులైమాన్ ఆ కానుకలను విప్పి చూడకుండానే వారిని ఉద్దేశించి, “అల్లాహ్ నాకు పుష్కలంగా ప్రసాదించాడు. ఒక పెద్ద రాజ్యాన్ని ఇచ్చాడు. ప్రవక్త పదవిని ఇచ్చాడు. కాబట్టి నేను లంచాలకు లొంగే అవకాశం లేదు. నా లక్ష్యం ఒక్కటే, తౌహీద్ (ఏకదైవారాధన)ను వ్యాపింప జేయడం” అన్నారు. అంతేకాదు, ఆ కానుకలను తిరిగి తీసుకువెళ్ళాలని ఆదేశించారు. మీ రాణి తన ఆరాధనా పద్ధతిని మార్చుకోనట్లయితే రాజ్యాన్ని వశపరచు కుంటానని, ప్రజల్ని అక్కడి నుంచి వెళ్ళగొడతానని కఠినంగా చెప్పారు.
రాణి ప్రతినిధులు ఆ కానుకలు తీసుకుని ఆమె వద్దకు చేరుకుని సులైమాన్ (అలైహిస్సలాం) చెప్పిన మాటలు చెప్పారు. అంతేకాదు, సులైమాన్ రాజ్యంలో తాము చూసిన అద్భుతాలను కూడా వివరించారు. సులైమాన్ సందేశం పట్ల ఆమె ఆగ్రహం ప్రదర్శించే బదులు సులైమాన్ రాజ్యాన్ని సందర్శించాలని నిర్ణయించుకుంది. తనకు విశ్వాసపాత్రులైన నౌకర్లతో ఆమె సబా రాజ్యాన్ని వదలి బయలుదేరింది. ఒక సందేశహరుడితో సులైమాన్ (అలైహిస్సలాం) వద్దకు తాను వస్తున్న వర్తమానం ముందుగానే పంపించింది.
సులైమాన్ ఆదేశపాలన కోసం జిన్నుల పోటీ
సులైమాన్ (అలైహిస్సలాం) తన అధీనంలో ఉన్న జిన్నులను పిలిచి సబా రాణి రాక ముందే ఆమె సింహాసనాన్ని తన వద్దకు ఎవరు తీసుకువస్తారని అడిగారు. ఒక జిన్ను, ”ఈ సమావేశం ముగిసేలోపే ఆ సింహాసనాన్ని మీ ముందు ఉంచుతాను. నేను నిస్సందేహంగా బలం కలవాడిని. ఇలాంటి పనులు చేయడానికి నమ్మక స్తుడిని” అన్నాడు. కాని ఈ పని చేయడానికి జిన్నులు పోటీపడ్డారు. ఇంతలో ప్రత్యేక జ్ఞానం కలిగిన ఒక జిన్ను, “నేను రెప్పపాటులో ఆ సింహాననాన్ని మీ ముందు ఉంచుతాను” అంటూ మాట పూర్తయ్యేలోపే సింహాసనాన్ని ముందు ఉంచాడు. సులైమాన్ (అలైహిస్సలాం) ఆశ్చర్యంగా, ”ఇదంతా అల్లాహ్ అనుగ్రహం నేను కృతజ్ఞత చూపుతానో లేదో అని ఆయన పరీక్షిస్తున్నాడు” అన్నారు. ఆ తర్వాత ఆయన ఆ జిన్నుతో ఆ సింహాసనం ఆకారాన్ని మార్చమన్నారు.
సబా రాణి ఆగమనం
బిల్కీస్ సులైమాన్ రాజప్రాసాదంలోకి వచ్చినప్పుడు ఆమెను ఘనంగా స్వాగతించడం జరిగింది. ఆ తర్వాత సులైమాన్ (అలైహిస్సలాం) తన వద్ద ఆకారం మార్చి ఉన్న సింహాసనాన్ని ఆమెకు చూపించి ఆమె సింహాసనం కూడా అలాంటిదేనా అని ప్రశ్నించారు. ఆమె ఆ సింహాసనాన్ని పదే పదే చూసింది. తాను చూస్తున్న సింహాసనం తన సింహాసనం అయ్యే అవకాశం లేదని భావించింది. ఎందుకంటే, తన సింహాసనం తన రాజభవనంలో ఉంది. కాని తన సింహాసనానికి ఈ సింహాసనానికి పోలికలు చాలా ఉండడం చూసి ఆమె ఆశ్చర్యంగా, “ఈ సింహాసనం నా సింహాసనాన్ని చాలా విధాలుగా పోలి ఉంది” అంటూ జవాబిచ్చింది. ఆమె చాలా తెలివైన, దౌత్యపరమైన నైపుణ్యం ఉన్న మహిళగా సులైమాన్ (అలైహిస్సలాం) గుర్తించారు.
ఆ తర్వాత ఆయన అమెను ఒక పెద్ద హాలులోకి ఆహ్వానించారు. ఆ గది లో నేల అంతా గాజుతో పరచబడి ఉంది. ఆమె గాజు నేలను చూసి అదంతా నీరుగా భ్రమపడింది. ఆమె అక్కడ అడుగుపెట్టేటప్పుడు తన దుస్తులు తడవకుండా కొద్దిగా కాలిమడమల పైకి లాక్కుంది. సులైమాన్ (అలైహిస్సలాం) ఆమెను చూస్తూ ఇక్కడ నీరు లేదు, గాజుతో చేసిన నేల అని చెప్పారు. ఆమె ఆశ్చర్య పోయింది. అలాంటి నిర్మాణాన్ని ఆమె అంతకుముందు ఎన్నడూ చూడలేదు. తన ముందు ఉన్నది విజ్ఞానవివేకాలు మూర్తీభవించిన అసాధారణ వ్యక్తి అని ఆమె గుర్తించింది. ఆయన కేవలం ఒక రాజ్యానికి పాలకుడు మాత్రమే కాదని, అల్లాహ్ ప్రవక్త కూడా అని తెలుసుకుంది. ఆమె తన ఆరాధనా పద్ధతులలోని తప్పులకు పశ్చాత్తాపపడింది. సూర్యుణ్ణి పూజించే అలవాటు మానుకుంది. అల్లాహ్ ను ఒకే ఒక్క దేవునిగా విశ్వసించింది. తన రాజ్యంలోని ప్రజలను కూడా అదే విధంగా చేయాలని కోరింది. (చదవండి దివ్యఖుర్ఆన్ : 6:84, 21:81-82, 34:12-14, 27:15-44, 2-103, 38:32-40)
అశ్వప్రేమికుడు సులైమాన్ (అలైహిస్సలాం)
సులైమాన్ (అలైహిస్సలాం) కాలంలో ప్రజలు గుర్రాలపై ప్రయాణాలు చేసేవారు. యుద్ధరంగంలో సైనికులకు యుద్ధ సామగ్రిని, ఆయుధాలను చేరవేయడానికి గుర్రాలనే ఉపయోగించేవారు. వస్తురవాణాకు, వాహనాలు లాగడానికి కూడా గుర్రాలనే వాడేవారు. గుర్రాల పట్ల చాలా శ్రద్ధ చూపేవారు. వాటికి చక్కని శిక్షణ ఇచ్చేవారు. సులైమాన్ (అలైహిస్సలాం) గుర్రపుశాలలో చాలా గుర్రాలు ఉండేవి. గుర్రాలంటే ఆయనకు చాలా శ్రద్ధ ఉండేది. ఒకసారి ఆయన తన గుర్రపుశాలలో గుర్రాలను చూస్తూ వాటిని ప్రేమగా నిమురుతూ చాలాసేపు గడిపారు. సూర్యుడు అస్తమించే సమయం అయిపోయింది. అస్ర్ నమాజు సమయం దాటిపోతోంది. ఆయన తాను చేస్తున్న ఆలస్యాన్ని గుర్తించి వెంటనే, “నేను ఈ సంపదను నా ప్రభువు సంస్మరణార్థం ప్రేమించాను.”…..”వాటిని నా వద్దకు తిరిగి తీసుకు రండి” అన్నారు. (చదవండి దివ్యఖుర్ఆన్: 38:32-33)
సులైమాన్ (అలైహిస్సలాం) విచిత్ర మృతి
సులైమాన్ (అలైహిస్సలాం) పాలనలో అనేక పనులను జిన్నులే చేస్తుండేవి. జిన్నులు చేసిన పాపాలకు శిక్షగా వాటితో ఈ పనులు చేయించడం జరిగేది. అగ్నితో సృష్టించబడిన జిన్నులు తమకు సమస్త శక్తులున్నాయని, తాము అగోచరాలను కూడా చూడగలమని, భవిష్యత్తును తెలుసుకోగలమని ప్రజలను నమ్మించడం వంటి పాపాలకు పాల్పడేవారు. తన అనుచరుల్లో ఇలాంటి తప్పుడు విశ్వాసాలు చోటుచేసుకోకుండా చూడవలసిన బాధ్యత ఒక ప్రవక్తగా సులైమాన్ (అలైహిస్సలాం) పై ఉంది. భవిష్యత్తు తెలుసుకునే శక్తి జిన్నులకు గాని, ప్రవక్తలకు గాని ఎవరికీ లేదని, కేవలం అల్లాహ్ కు తప్ప అలాంటి శక్తి మరెవ్వరికీ లేదని ప్రజలు తెలుసుకునేలా చేయడం ఆయన బాధ్యత. ఈ దిశగా ఆయన చేసిన ప్రయత్నాలు ఆయన మరణానంతరం కూడా కొనసాగడం చెప్పుకోదగిన విశేషం.
ఒక గనిలో జిన్నుల పనిని పర్యవేక్షిస్తూ ఆయన తన చేతికర్రకు ఆనుకుని కూర్చుని ఉన్నారు. ఆ విధంగా కూర్చున్న స్థితిలోనే ఆయన తుదిశ్వాసను విడిచారు. చాలా సమయం వరకు ఆయన (అలైహిస్సలాం) మరణం గురించి ఎవరికీ తెలియదు. ఆయన (అలైహిస్సలాం) అక్కడ కూర్చున్నట్లే చాలా మందికి కనబడ్డారు. సులైమాన్ (అలైహిస్సలాం) చూస్తున్నారన్న భయంతో జిన్నులు విరామం లేకుండా పని కొనసాగిస్తూ పోయారు. ఈ సంఘటనను దివ్యఖుర్ఆన్ ఇలా వివరించింది. “ఆ తరువాత సులైమాన్ పై మేము మరణ నిర్ణయాన్ని అమలు జరిపినప్పుడు, జిన్నాతులకు అతని మరణం గురించి తెలియజేసిన వస్తువు అతని చేతి కర్రను తింటూ ఉన్న చెదపురుగు తప్ప మరొకటేదీ కాదు, ఈ విధంగా సులైమాన్ పడిపోగా, తమకు అగోచర విషయాలు తెలిసి ఉంటే అవమానకరమైన ఈ బాధకు గురి అయి ఉండేవారము కాము అని జిన్నాతులకు స్పష్టంగా తెలిసి పోయింది.”
ఆ విధంగా ఆయన మరణం కూడా ఆయన అనుచరులకు ఒక పాఠంగా మిగిలింది. జిన్నులేకాదు, ఎవరూ కూడా భవిష్యత్తును గురించి తెలుసుకునే అవకాశం లేదన్నది అందరికీ తెలిసివచ్చింది. (చదవండి దివ్యఖుర్ఆన్ : 34:14)
గ్రహించవలసిన పాఠాలు
సరియైన విధంగా న్యాయం చేయాలంటే, తీర్పు చెప్పేముందు ఇరు పక్షాల వాదనను పూర్తిగా వినాలి. న్యాయం జరిగిందని ప్రజలు తెలుసుకునేలా ఉండాలి.
వయసులో చిన్నవాడైన తన కుమారుడి వివేకాన్ని గుర్తించి తండ్రి తన స్వంత నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు.
ప్రార్థనలతో సహా వివిధ పనులకు తగిన విధంగా సమయాన్ని విభజించు కోవాలి. ప్రవక్తలు, చాలామంది పాలకులు ఇహపరలోకాల విధులు నిర్వర్తించడానికి తగిన విధంగా సమయాన్ని విభజించుకునేవారు.
మనిషి ఆధ్యాత్మిక శక్తి అతని ధార్మిక విశ్వాసంలో ఉంది.
మంచి పనులు జాతిని పతనానికి గురికాకుండా కాపాడుతాయి. అయితే విదేశీ దాడుల నుంచి కాపాడుకోవడానికి సైనిక ఏర్పాట్లు అవసరం.
ఆత్మసమీక్ష : మనిషి తన ఆచరణల విషయంలో ఏమాత్రం అనుమానం వచ్చినా తక్షణం అల్లాహ్ వైపునకు మరలి మార్గదర్శనం కోసం ప్రార్థించాలి.
అల్లాహ్ సృష్టి పట్ల సులైమాన్ (అలైహిస్సలాం) చాలా శ్రద్ధ తీసుకునేవారు, చివరకు ఒక చీమకు కూడా హాని కలుగడాన్ని ఇష్టపడలేదు.
వివేకజ్ఞానాలు ఉన్న సులైమాన్ (అలైహిస్సలాం) కూడా ఒక పక్షి నుంచి నేర్చుకు న్నారు. ఆ పక్షి సలహా తీసుకుని ఆ ప్రకారం వ్యవహరించారు.
పరస్పర సంప్రదింపులు: బిల్కిస్ ఒక స్త్రీ, ఆమె ఒక పాలకురాలు కూడా. అయినప్పటికీ అల్లాహ్ ఆమె పాలనాశైలిని గుర్తించాడు. ఆమె ఇతరులతో సంప్రదింపులు జరిపింది, కాని వారిచ్చిన తప్పుడు సలహాలను పాటించ లేదు.
శాంతి అన్నది సంతోషాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. యుద్ధాలు, పోరాటాలు వినాశానికి కారణమవుతాయి.
లంచాలకు, అవినీతికి ఎన్నడూ లొంగరాదు.
సులైమాన్ (అలైహిస్సలాం) మరణం కూడా మానవాళికి గుణపాఠం వంటిది. మనిషి జిన్నులను కూడా పాలించగలడు. అవి మనిషిపై ఆధిపత్యాన్ని సాధించలేవు. వాటికి భవిష్యత్తును తెలుసుకునే శక్తి కాని, అగోచరాలను గ్రహించే శక్తి కాని లేవు.
బైబిలులో కింగ్స్.. చాప్టర్ 2లో సులైమాన్ (అలైహిస్సలాం) దేవుని ఆదేశాలకు విరుద్ధంగా 700 మంది మహిళలను వివాహం చేసుకున్నారని, 300 మంది మహిళలను ఉంచుకున్నారని, ఆ మహిళలు ఆయన్ను విగ్రహారాధన చేసేలా ప్రలోభపెట్టారని, ఆయన అనేక విగ్రహారాధనాలయాలు కట్టించాడని, తన భార్యల కోసం బలిపీఠాలు కట్టించాడని ఇలాంటి అనేక అసత్య ఆరోపణలు ఉన్నాయి. కాని దివ్యఖుర్ఆన్ ఈ అసత్య ఆరోపణలను, అలాగే బ్లాక్ మ్యాజిక్కు పాల్పడ్డాడన్న ఆరోపణలన్నింటినీ ఖండిస్తోంది. (చదవండి దివ్యఖుర్ఆన్ 2-102)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.